Home వ్యాసాలు కంచికి చేరని కథ

కంచికి చేరని కథ

by Padmasri Chennojwala

చారిత్రక నవలాచక్రవర్తి , చారిత్రక నవలాసమ్రాట్, అభినవ పాల్కుర్కి బిరుదులు పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి కలం లోంచి వెలువడి ఆగస్టు – సెప్టెంబర్,1977 వ. సంవత్సరములో  విజయబాపినీడు వారి ‘ విజయ ‘ పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన ‘ఆవాహన ‘ అనే చారిత్రక నవలకు నేను వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం.

ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల తల్లి ఐతే, ఆ తల్లి గర్భంలోంచి పురుడు పోసుకున్న శిశువే నా ఈ రచన.

  ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ రచించిన శివప్రసాద్ గారికి ముందుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారే గనుక ఈ రచన చేయకపోయి ఉంటే, ఈ చారిత్రక కథ ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు.

ఈ నవలపై నేను వ్యాసం వ్రాయడానికి గల కారణాలు తెలియాలంటే, నా జీవితంలో విచిత్రంగా జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాల్సి ఉంటుంది.

నాకు దాదాపు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఈ నవలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఇంతకంటే ఆసక్తికరమైన మరో విషయమే మిటంటే, ఇది చదివే సమయంలో మా అక్క (అందరిలో పెద్ద) కు మొదటిసారిగా ప్రసవం జరిగిన రోజులవి.ఇంట్లో పసిబిడ్డ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారు, ముఖ్యంగా ఆమె(బాలింత) తల్లి ఎంతగా పనుల ఒత్తిడిలో ఉంటారో నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మా అక్క, ఊపిరి సలుపని పనుల్లో ఉండి కూడా ఏ కాస్త సమయం చిక్కినా మా అమ్మ, ఇంటికి వచ్చీ రావడంతోనే మా నాన్న ఇలా అందరూ ఆసక్తిగా చదివేవారు.చదవడమేగాకుండా దాని గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆడుకోవడానికి పక్కింటికీ, ఎదురింటికీ వెళ్లినా,అక్కడ కూడా ఇవే చర్చలు సాగుతూ ఉండేవి. వాళ్ళ చర్చల్లో ఎక్కువగా కామసాని, ఆవాహన, నర్తకి , శిల్పి వంటి పదాలు దొర్లుతూ ఉండేవి. ఆ మాటలు అర్థం చేసుకునే వయసు గానీ, కథను గురించి ఆలోచించే శక్తి గానీ నాకు లేకపోయినప్పటికీ, ఎందుకో రెప్ప వెయ్యకుండా వాళ్ళనే చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ ఉండేదాన్ని.

అంతమందిని కదిలించిన ఆ కథ ఏమై ఉంటుందా!? అన్న ఆలోచన  నా వయసు తో పాటే పెరుగ సాగింది. కాస్త సమయం గడిచాక ఆలోచిస్తే నాకు అర్థమైన విషయ మేమిటంటే, స్థానికత వాళ్ల ఆసక్తికి ఒక బలమైన కారణమని. మేమ ప్పుడు వరంగల్ జిల్లాలోని ములుగు లో నివాసం ఉండే వాళ్ళం.

పుస్తక పఠనం అనేది నాకు ఒక అభిరుచిగా మారడం, క్రమక్రమంగా కాస్తో,కూస్తో కలాన్ని కదిలించే శక్తి నాకు దైవదత్తంగా అబ్బడంవల్ల ఎందుకో నాకు ఈ కథను తప్పనిసరిగా చదవాలి, విషయమేమిటో తెలుసుకోవాలి, వీలైతే దానిపై వ్యాసం వ్రాయాలి అన్న కోరిక క్షణక్షణానికీ పెరుగసాగింది. విషయం తెలుసుకున్న మావారు పలు పుస్తక విక్రయదారులను సంప్రదించి 30-08-2022 నాడు పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను అదే క్షణంలో మొదలుపెట్టి ఏకబిగిన పూర్తి చేయడం, కథలో లీనమై కళ్ళారా  దర్శించిన అనుభూతికిలోనై వర్తమానానికి రావడం జరిగింది. నవల చదివాకగానీ నాకు అర్థం కాలేదు, అది వరంగల్లోని వేయి స్తంభాల గుడికి సంబంధించిన కథ అని.అప్పటి వరకు నేను అది రామప్ప గుడికి సంబంధించినద నుకున్నాను. ఇక చదవడం పూర్తయ్యాక నా మదిలో మెదిలిన భావాలను వ్యక్తపరచాలంటే బహుశా నా రచనాపటిమ సరిపోదేమో అనిపించింది. ఆసక్తీ, ఆశ్చర్యం, ఉద్విగ్నత అన్నీ మిళితమైన అనిర్వచనీయమైన భావన. గతానికీ,వర్తమానానికీ; ఆనందానికీ,విషాదానికీ నడుమ అంతు చిక్కని  అవ్యక్తానుభూతి.

మనం ఎన్నో ప్రేమ కథల్ని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందులో కొన్ని ఫలించి ఆనందాల హరివిల్లులైతే మరికొన్ని ఎండమావులకు ప్రతీకలుగా మిగిలిపోతాయి. మనిషి యొక్క ఆత్మ దేహత్యాగం చేసిన మరుక్షణం అందులో ఒదగబడిన ఈ ప్రేమ అనే సుగంధ కుసుమం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. అది సర్వసాధారణం, కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన, గుండెల్ని మెలిబెట్టే అంశమే నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.

 కాకతీయ సామ్రాజ్య ఆస్థాన శిల్పి   భళ్లాల సోమేశ్వరునికీ, ఆస్థాన నర్తకి కామసానికీ నడుమ విరిసిన ప్రణయ కథ.

వరంగల్ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించిన సోమేశ్వరుడు శైశవ దశలో ఉండగానే తల్లిదండ్రులు కాలం చేయడంతో మల్యాల గుండయ్య, కుప్పమ్మ దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆస్థాన నర్తకి చామకాంబ కూతురైన కామసాని తల్లి వద్ద నాట్యాన్ని అభ్యసించి, తన నాట్యకౌశలంతో సామ్రాజ్య విస్తరణ గావించినందుకుగాను ప్రభువుల మన్ననలందుకొని ఆస్థాన నర్తకి పదవినలంకరిస్తుంది.

ఐతే ఫలించని ఈ ప్రేమ కథకు కారణాలేమిటి ? వేయి స్తంభాల గుడికీ,ఈ కథకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ‘ఆవాహన’ అనే ఈ నవలా వారధిపై 12వ శతాబ్దంలోకి మన ప్రయాణం సాగాల్సిందే.

కళాశాల అధ్యాపకుడైన రామచంద్రరావు, బ్యాంకు ఉద్యోగై న మాధవరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగరీత్యా వరంగల్ బదిలీ ఐన మాధవ్ అంతకుముందే వరంగల్లో నివాసముంటున్న  రామచంద్రకు తాము వరంగల్ వస్తున్నామనీ, తమకొక మంచి ఇల్లు అద్దెకు చూసి పెట్టమనీ ఉత్తరం వ్రాయడంతో కథ మొదలవుతుంది.

భార్యను, కూతుర్ని వెంటబెట్టుకొని మాధవ్ కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగడం, రామచంద్ర దంపతులు ఆతిథ్య మివ్వడం మామూలే అయినప్పటికీ, రెండు జంటలూ మొదటి కలయికలోనే స్థానిక దర్శనీయ స్థలాలపై పోటాపోటీగా చర్చించుకోవడం, ఎప్పుడెప్పుడు చూడాలా ?! అని అందరికందరూ  ఉబలాటపడటం, అప్పటికప్పుడు పట్టిక రూపొందించుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది.

ఐతే కథనెక్కువగా సాగదీయకుండా, పని వేళలు ముగిసి బ్యాంకు నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో వేయి స్తంభాలగుడి చూడాలన్న ఉత్సు కతతో మాధవ్ లోపలికి అడుగుపెట్టడంతో, గజ్జెకట్టిన కట్టిన కాలికీ,ఉలి పట్టిన చేతికీ నడుమ విరిసిన ప్రణయానికి తెరతీశారు రచయిత.

ఆలయంలోని అణువణువూ నిశితంగా పరిశీలిస్తూ వెళుతున్న మాధవ్ కు పుష్కరిణి, దాని పక్కనే శిలాశాసనం, అక్కడి నుండి పడమరకు మళ్లగా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఉన్న నంది కనిపిస్తాయి. నందిపై చెక్కి ఉన్న శిల్ప సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఎదురుగా ఉన్న శివాలయంలోకి అడుగుపెట్టి, ఆలయ నిర్మాణాన్నీ , ఆలయ స్తంభాల మీద చెక్కబడి ఉన్న డిజైన్లనూ,సన్నటి లతలనూ గమనిస్తూ,పరమేశ్వరుని దర్శించుకొని ఇవతలికి వచ్చి నందీశ్వరుని వెనుక ఉన్న మరో ఆలయంలోకి అడుగు పెడతాడు.

కొంత భాగం శిథిలమై, మరికొంత అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని చూసి , “ఏ కారణం చేతనో కాకతీయులు ఈ మంటపాన్ని పూర్తి చేసినట్లు లేదు, ఆ రోజుల్లోనే ” అని తనలో తాను అనుకుంటూ ఇంకాస్త ముందుకెళతాడు.

వైశాఖ పూర్ణిమనాటి ఆ వెన్నెల మంటపంలోని శిలలు, శిల్పాలు, లతలపై కురుస్తూ ఆ పర్యాటకుని లోని కళాతృష్ణను రెట్టింపు చేస్తోంది.నెమ్మదిగా మరో అడుగు ముందుకేసిన అతనికి ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకో ఆ బొమ్మను చూడగానే అతని శరీరం  గగుర్పొడిచి, కాళ్ళు అంగుళం కూడా కదలకుండా, కళ్ళనుండి నీరు కారిపోతూ ఉంటే, ఆ శిల్పాన్నీ,దానిలోని రామణీయక సజీవ చిత్రణను చూస్తూ, ముగ్ధుడై  ఆ బొమ్మ ముందు తానూ ఒక రాతి బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోతాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో? ఎందుకు నిలబడ్డాడో తెలియదు (శిల్ప శాస్త్రానికి సంబంధించిన ఏ విధమైన పరిజ్ఞానంలేని, ఉలి మలుపుల్లో ఇమిడిన రసాత్మకతపై ఏ విధమైన అవగాహనలేని వ్యక్తి నీళ్లు నిండిన కళ్ళతో, తన్మయత్వంతో చూస్తూ, దాని ముందు స్థాణువులా నిలబడి పోవడానికిగల కారణమేమై ఉంటుందన్న ఆలోచన పాఠకుల మదిలో మెదులుతుంది). ఇతను మాత్రమే కాకుండా, ఈ కథను చదివే పాఠకులందరిలోనూ ఇదే గగుర్పాటు కలగడానికి కారణం కంచికి చేరని ఈ కథేనా?! లేక రచనా  వైదుష్యమా?! అనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరికి వారే శోధించాలి.

ఆ పారవశ్యంలో అతను ఇంకెంతసేపు ఉండిపోయేవాడో గానీ,” ఏమిటి చూస్తున్నావు?” అనే పలకరింపుతో ఉలిక్కిపడి వెనుదిరిగిన అతనికి, కాళ్లు చాపుకొని,మోకాళ్ళపై రెండు చేతులు ఆనించుకొని, రాశిపోసిన సౌందర్యంతో వెలిగిపోతూ స్వర్గలోకం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా కిలకిల నవ్వుల జవరాలు శిథిల మంటపంలో ఓ వారగా కూర్చుని దర్శనమిచ్చింది.

“మీరు ఎవరు ?”అని యాంత్రికంగా అతనడిగిన ప్రశ్నకు “నేను మీ అమ్మగారి సేవకురాలిని” అని వ్యంగ్యంగా సమాధానమి వ్వడం, ఆజ్ఞాపించినట్లున్న కంఠస్వరంతో “కూర్చో” అంటూ ఏకవచన సంబోధన చేయడం, “సోమూ!” అంటూ తనను ఆత్మీయంగా, చనువుగా సంబోధించడం, అప్పుడే కిలకిలా నవ్వుతూ, మరుసటి క్షణంలోనే వలవలా ఏడుస్తూ, తానెన్నడూ  చూడని ఆ స్త్రీ , తానెప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాటలను అర్థం చేసుకోలేకా ,ఆమె భావోద్వేగాలను అంచనా వేయలేకా , తికమకపడుతూ ఏం మాట్లాడితే ఎక్కడ తననొదిలి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఆమె కోపాన్ని, వ్యంగ్యాన్ని, బాధను, దుఃఖాన్ని, ఆమెలోని అనుకూల – ప్రతికూల భావాలకు  సానుకూలంగా స్పందిస్తూ, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఉండగానే, ఆమె ఏడుస్తూ శిల్పాల చాటుకు వెళ్లి కనుమరుగ వుతుంది. ఎంత వెతికినా ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో, మౌనంగా ఇంటిదారి పట్టి,మరుసటి రోజు సాయంకాలం మళ్లీ అదే చోటుకి వచ్చి ఆమె జాడ కోసం వేచి చూస్తూ ఉంటాడు.

జాబిలి కిరణాల జల్లుల్లో తడుస్తున్నది అతని శరీరం మాత్రమే. నిన్న జరిగిన సంఘటన నిజమా?! కలా?! అన్న సందిగ్ధంలో మనసు అల్లకల్లోలమవుతోంది. మూడోనాటి వరకు సాగిన ప్రయత్నం వృధా ప్రయాసే  కావడంతో నిస్పృహకు లోనైన అతని అంతరంగంలో రామచంద్రను చూడగానే కొత్త ఆశ చిగురిస్తుంది. ఆదివారంనాటి ఆ విహారయాత్రలో రెండు కుటుంబాలు కోట చుట్టూ హుషారుగా కలియదిరుగుతూ ఉంటే,గుండెలో రేగుతున్న అలజడి అతడిని మాత్రం ఓ పట్టాన నిలువనియ్యడం లేదు. ఒక్కొక్క రాతినీ తాకుతుంటే , అంతుపట్టని అలజడేదో తరంగాలై అతని నాడీ మండలానికి అజ్ఞాత సందేశాలు అందిస్తూనే ఉంది.

ఇక ఏమాత్రం తమాయించుకునే శక్తిలేని మాధవ్, తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లుగా రామచంద్రకు తెలుపడం, తిరుగు ప్రయాణంలో భద్రకాళి అమ్మవారి గుడిలో మాధవ్ స్పృహ కోల్పోవడంతో సాలోచనలో పడిన రామచంద్ర ఒకనాడు ఒంటరిగా ఆలయానికి వెళ్లి, ఆ పరిసరాల న్నిటినీ జాగ్రత్తగా గమనించి, అక్కడ కనిపించిన భక్తులను మాటల్లోకి దింపి ఏదైనా సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నించి, ఏ విధమైన ప్రయోజనంలేక ఇంటికి తిరిగివచ్చి, ఆమె మాధవ్ తో పలికిన పలుకులను మననం చేసుకుంటూ తన స్టడీ రూమ్ లోనికి వెళ్లి, వరంగల్ కు సంబంధించిన చరిత్ర పుస్తకాలను శోధిస్తూ ఉంటాడు.

స్నేహానికి ప్రాణమిచ్చే రామచంద్ర చరిత్ర పరిశోధకుడు కావడం యాదృచ్ఛికమే అయినా, అదే బలమైన కారణమై ఈ కథను ప్రపంచానికి అందించింది.

తనువు, మనసు అదుపు తప్పిన మాధవ్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తి నందిస్తూ ,ఆమె నోటి నుండి వెలువడిన (చిన్నమ్మ, పెద్దమ్మ, మల్యాల గుండయ్య, త్రిసరాలు, తాటంకాలు) మాటలను ఎప్పటికప్పుడు మాధవ్ నుండి తెలుసుకుంటూ, వాటిని గ్రంథాలయంలో రూఢి పరుచుకుంటూ, శిధిల మంటపం లో భూస్థాపితమైన ప్రణయ ప్రబంధాన్ని వెలికి తీసి, జాతికి అందించిన సాహసి, ప్రేమ పిపాసి(రామచంద్ర).

మొత్తం 10 పున్నములు ఆమె ప్రత్యక్షమవగా, చతుర్దశి నాటి సాయంత్రం అలికిడి ప్రారంభమై, పౌర్ణమి నాడు కనిపిస్తుందంటూ రెండవ కలయికలోనే చెప్పగలిగిన అతని (రామచంద్ర) తెలివితేటలు, గ్రహణశక్తి పాఠకులను ఆశ్చర్యంలో ముంచేస్తాయి.భార్యాబిడ్డలతో మొదటిసారి కాజీపేటలో రైలు దిగిన మాధవ్ తో ” మా చెల్లెలికేం సమస్యలేరా ? నేను లేనా శ్రీకృష్ణుడి లాంటి అన్నయ్యను, ఏదైనా కష్టం వస్తే చక్రం అడ్డువేయనూ ” అనీ,
నీవేం భయపడకమ్మా ! ఊళ్ళో నల్లాలు బందైతే నీకోసం హుస్సేన్ సాగర్ నుంచి తెప్పిస్తాం” అనీ
మంచితనం, మాటకారితనం కలగలిసిన పరిహాసంతో అన్న మాటలే అయినప్పటికీ, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన భర్తను చూసి ఆ ఇల్లాలు(మాధవ్ భార్య) పడే వేదనకు శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేసి వారి అనురాగ బంధాన్ని పువ్వుల్లో పెట్టి వారికప్పగించిన రామచంద్ర ఈ కథకు గుండెకాయ వంటివాడు. ఊళ్లో నా అన్న వారెవరూలేని ఆ ఇల్లాలికి అన్నీ తానై బాసటగా నిలిచిన కాత్యాయిని (రామచంద్ర భార్య) మహిళాలోకానికి ఆదర్శ ప్రాయురాలు. రామచంద్ర కు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన ఆనందరావు గారు ఆవాహన అనే ఈ క్రతువులో శ్రీగంధం వంటి వారు.
కోయిల గానాలు, వీణానాదాలు, సెలయేటి గలగలలు, వలిమిన్న జల్లుల అందాలన్నీ కలబోసిన వెన్నెల బొమ్మ ప్రతి పున్నమి రేయిలో అతడిని కరుణిస్తూనే ఉంది. కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.

మూడవ కలయికైన ఆషాఢ పున్నమినాటి రాత్రి  ఆమె మాటలను బట్టి ఆమె పేరు కామసాని అనీ, అతని పేరు సోమేశ్వరుడనీ, కాకతీయ సామ్రాజ్య మల్లెపందిరిపై వాలిన ఈ ప్రేమపక్షులు సామ్రాజ్యకాంక్ష అనే శ రాఘాతానికి నేలరాలిన జంట గువ్వలనే విషయం పాఠకులకు అర్థమవుతుంది.
తమ పూర్వీకుల నిర్మాణకాంక్ష ఐ న సహస్రమంటపం శిల్ప రూపంలో సజీవంగా ఉండాలన్న సంకల్పంతో రుయ్యమ్మ (తన తల్లి, కాకతీయ సామ్రాజ్ఞి ఐన రుద్రమదేవి పేరుమీద ఆజ్ఞాపత్రం రూపొందించి) గోళకీ మఠ నిర్మాణానికై సోమేశ్వరుని మందడ పంపించేస్తుంది.

సోమేశ్వరుని అమరశిల్పిగా మలచాలనీ,కాకతీయ శిల్పం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలనీ, కామసానీ సోమేశ్వరులు వివాహ చట్రంలో ఇమిడితే, వారిరువురి నడుమ ఏర్పడే బంధం అతనిలోని కళాభిని వేషానికి ప్రతిబంధకంగా మారుతుందనీ,అందుకే అతడిని మందడ పంపించడం అనివార్యమైందనేది ఆమె వాదన.

పుత్ర సంతానం లేని గణపతి దేవులవారు తమ కుమార్తె అయిన రుద్రమదేవిని తమ రాజకీయ వారసురాలిగా ప్రకటించడం, వారి నిర్ణయానుసారం ఆమె పురుష వేషాన్ని ధరించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటాన్ని కళ్లారా చూస్తూ ఉండి కూడా, రుయ్యమ్మ వివాహం వీరిద్దరిలోని కళను దూరం చేస్తుందని ఆలోచించడంలో ఏ విధమైన బలం లేదు. ఇకపోతే రుద్రమదేవిగారికి కూడా పుత్ర సంతానం లేదు. వారి కుమార్తెలైన ముమ్మడమ్మగానీ, రుయ్యమ్మగానీ వారి తదనంతరం ఏ క్షణంలోనైనా పాలనా బాధ్యతలు చేబూనడానికి సర్వసన్నద్ధులై ఉండాలి, కానీ ఈ ఇద్దరు సోదరీమణుల్లో ఏ ఒక్కరు కూడా అవివాహితులుగా మిగిలిపోలేదు సరికదా, చక్కని గృహస్థ జీవితంలో ఇమిడిపోయారు.రాజ్యపాలనకు ప్రతిబంధకంకాని వివాహం కళా సాధనకు ఎందుకు ఈమెకు కారణంగా కనిపించిందన్న ఆలోచనకు సమాధానం దొరకడం లేదు.

తనకు అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న రుయ్యమ్మ పరామర్శ అనే మిషతో ఒకనాటి సాయంత్రం తమ ఇంటికి వచ్చి, తనకు(కామసానికి) తీరని అన్యాయం చేశానన్న మాట నిజమేననీ(పేజీ-116), ఒక జంటను తీరని బాధకు గురి చేశానని తనకు తెలుసనీ (పేజీ-118), ఒక స్త్రీ  మరొక స్త్రీని  కోరకూడనిదే – అయినా కోరుతున్నాను (పేజీ-119) అని అన్నదనీ, ఐనప్పటికీ తామిద్దరూ విడిపోవడానికి, తాను(రుయ్యమ్మ) పూర్తి కారకురాలిని కాననీ,అందులో తన పాత్ర కొంత వరకే పరిమితమై ఉందనీ మిగిలినదంతా దివ్య సంకల్పాలలో భాగమనీ, ఐతే అదంతా తన కోసం కాదనీ,కాకతీయ సామ్రాజ్య క్షేమం కోసం, సోమేశ్వరుని అమరత్వం కోసం ఈ త్యాగం చేయక తప్పదని (పేజీ- 119)తనతో అన్నదని అతనితో చెబుతుంది. దివ్య సంకల్పాల సంగతి దేవుడెరుగు,దివ్య సంకల్పాలలో భాగమే అయితే తాము విడిపోవడం కూడా యాదృచ్ఛికంగా జరగాలేతప్ప ఏ రాజకుమార్తె  పనిగట్టుకుని చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది పగిలిన గుండెలోంచి ఎగిసిపడే విస్ఫోటనం, తట్టుకోలేని బాధలు, తీరని వేదనల నుండి పెల్లుబికే కఠిన శిలాద్రవం. అక్కడ తడికి ఆనవాలుగానీ, చెమ్మకు చోటుగానీ ఉండదు. అది బద్దలైన అగ్నిపర్వతం లోంచి వెలువడే లావా, భూమి(గుండె) పొరల్ని చీల్చుకొచ్చే మాగ్మా. ఏ వ్యక్తి అయినా తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, సంతలో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎవ్వరిని అడగడానికైనా, ఎవ్వరికి ఇవ్వడానికైనా. తెర వెనుక సూత్రధారై,తెరమీద పా త్రధారై,చేదు గుళికలకు చక్కెర పూతలద్దినట్లు, మాటలతో మంచు తెరలు కట్టి, ఆమె ఎంత శాంతంగా చెప్పినప్పటికీ, తన గుండెల్లో కుంపటి రాజు కుంటున్నట్టుగానే ఉందనీ చెప్పిన తీరు”పేదల కోపం పెదవికి చేటన్నట్లు……….  ప్రకటించారు (పేజీ – 115) అనే మాట ద్వారా పాఠకులకు స్పష్టమవుతుంది.

“నాకు మిగిలింది అదే రాజకుమారి గారూ!” (పేజీ- 114)అనీ,”నన్ను చూడటం కోసం ఏ రాజకుమార్తె రానవసరం లేదు”(పేజీ – 115) అనీ,”ఒక రాజకుకుమార్తెగా కాక ఒక స్త్రీగా ఆలోచించు” (పేజీ-116) అని అనడం వంటివి ఆమె అనుభవించే వేదనను తెలుపడమే గాక, ఆమెలోని ముక్కు సూటితనం, నిక్కచ్చిత్వం, తన సమస్యను ఎదుర్కోవడానికి ఎంత ఘాటుగా నైనా (కోపం, ఆవేశం, దుఃఖం, వ్యంగ్యం, ధిక్కారం అన్నీ కలగలిసిన ప్రవర్తన) స్పందించే  మనస్తత్వాన్ని వీరిద్దరి నడుమ జరిగిన ఆనాటి వాగ్వాదం పాఠకులకు అద్దంలో చూపెడుతుంది.

వెంజావళి రవిక, హూని పట్టు చీరలో ముస్తాబై వచ్చిన కొత్త పెళ్ళికూతురు సాటి ఆడపిల్లతో ప్రేమను త్యాగం చేయమనీ, పెళ్లిని విరమించుకోమనీ శాసిస్తోంది.  ఆమె  ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెలోని రాజనీతికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

రుయ్యమ్మ చేసిన ధర్మోపన్యాసం(పేజీ -122) ఎంత గొప్పదైనా,ఆదర్శప్రాయమైనదైనా మానసికంగా తాను ఆ స్థాయికి ఎదగలేదనీ,తన స్థానంలో ఆమె ఉంటే ఇలాగే ఆలోచించి ఉండేదా? అనీ అతనితో అంటుంది. కాంచీపురంపై కాకతీయ బావుటా నెగరేసిన అసాధారణ ప్రతిభాశాలి ఐన కామసాని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు.

కాకతీయ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణిగా రుయమ్మనూ, రాజకీయ దురంధరనిగా అన్నయా మాత్యుల వారిని చరిత్రలో సుస్థిర పరచాలని మరెవరైనా పథకం రచించి, అమలు పరిస్తే అప్పుడు గానీ అర్థమయ్యేది కాదు రుయ్యమ్మకు తన ఆదర్శ స్వప్నం సంగతి అన్న ఉక్రోషం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. సామ్రాజ్య క్షేమం కోసం సాంసారిక జీవితంలో పాక్షిక త్యాగాన్ని తాను కూడా చేయగలననీ, కానీ నృత్యానికి అంకితమైన ఒక దేవదాసి లాగా(పేజీ-124), జీవితాంతం ఒక బౌద్ధ సన్యాసినిగా జీవించేందుకు తన మనసు సిద్ధంగా లేదనీ

సోమేశ్వరునితో చెప్పి బాధపడుతుంది (పేజీ – 122).

ఇద్దరూ కాకతీయ సామ్రాజ్య కళాకారులే అయినప్పటికీ, శిథిల మంటపంలోని వారి మొదటి కలయికలో  “నేను మీ అమ్మగారి సేవకురాలిని”(పేజీ- 13)అని ఆమె జీవాత్మ మాధవ్ తో వ్యంగ్యంగా అంటుంది.

కాంచీపుర విజయానంతరం వీరిద్దరికీ ఏకాంతం దొరకనివ్వకూడదని తన రాజకుమార్తె స్థాయిని కూడా పక్కనపెట్టి నిరంతరం శిల్పాల వద్ద కూర్చుని సోమేశ్వరునితో శాస్త్రం గురించి చర్చలు జరపడం, గోళకీమఠ నిర్మాణానికై అతడిని మందడ పంపించేయడం, ప్రతాపరుద్రుని నామకరణ మహోత్సవానికి అతడిని రానివ్వకపోవడం వంటి విషయాలతో పథకం ప్రకారమే రుయ్యమ్మ తామిద్దరినీ విడదీస్తుందని తెలిసి కూడా, సామ్రాజ్య విస్తరణలో ప్రజల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేయా లే తప్ప, సామ్రాజ్య కాంక్షకు వాళ్లను సమిధలుగా మార్చకూడదన్న విషయాన్ని ఒక రాజ్యాధినేతగా, ఒక మాతృమూర్తిగా రుద్రమదేవి రుయ్యమ్మకు హితవును బోధించకుండా మౌనంగా ఉండటమే ఆమె గొంతులోని వ్యంగ్యానికి కారణమన్న విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమ వుతుంది.

వారి అసమాన శౌర్య ప్రతాపాలు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దృష్టిని ఏకశిలా నగరం వైపు ఆకర్షించి, చరిత్రలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక ధీరవనిత పేగు తెంచుకు పుట్టిన కుమార్తెను విమర్శించే స్థాయి నాకు లేకపోయినా, బద్దలైన ప్రేమభాండమే నా ఈ స్పందనకు కారణమని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ స్పందన నాకు మాత్రమే పరిమితమైంది కాదనీ, నా  వంటి ఎంతో మందిలో ఇవే ఆలోచనలు రేకెత్తాయనడానికి ఈ నవల (ఆవాహన) ప్రచురితమైన తొలినాళ్లలో ఇంటింటా జరిగిన చర్చలే బలమైన నిదర్శనాలు.

కేవలం కళ అజరామరం కావాలనీ, కళాకారులైన కామసానీ, సోమేశ్వరులను కళాతపస్వులుగా మలిచి, అమరత్వం ప్రసాదించాలని రుయ్యమ్మ రాజకీయంగా ఇలా పావులు కదిపి ఉండవచ్చా?, ఆదర్శాలనేవి మనకు మాత్రమే పరిమితమైనవనీ, మరొకరిపై బలవంతంగా వేసేవీ, శాసించేవి ఆదర్శాలనిపించుకోవనే సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగి ఉంటే బహుశా కథ ఈ మలుపు తిరిగి ఉండకపోవచ్చు? ఈ హఠాత్పరిణామాన్ని (ఒకరి కోసం ఒకరు అమరులవడం) ఆమె ఊహించకపోయి ఉండవచ్చా?, ఊహించని ఆ మలుపు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చా?,అంతులేని పశ్చాత్తాపంతో ఆమె హృదయం కలత చెంది ఉండవచ్చా ? కామసాని చాళుక్య పరంపరకు చెందిన వ్యక్తి అయి ఉంటుందా

?, గుండయ్య,కుప్పమ్మల బిడ్డగా పెరిగిన సోమేశ్వరుడు వారికి సమీప బంధువై ఉంటాడా?లీనమై చదివిన పాఠకుల్లో తోడిన కొద్దీ ఊటలై ఊరే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఏ చరిత్రకారుడో కంకణం కట్టుకోవాలే తప్ప, నావంటి సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు.

కార్తీక సోమవారం నాటి ప్రదోషకాలంలో స్వయంభూ దేవాలయం నుండి బయటకు వచ్చి, వెనుక ఉన్న కొత్త నిర్మాణాన్ని చూడాలనిపించి వెళ్లిన కామసాని, పద్మకార శిల్పం మీద తలానించి, ఆకాశం వంక చూస్తూ, ధ్యాన నిమగ్నుడై మునిపుంగవుని ప్రతీకగా ఉన్న సోమేశ్వరుని మొదటిసారిగా చూస్తుంది.

శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి, ముంగర, కమ్మలు భవిరెల అలంకరణలో రత్నదీప కాంతుల నడుమ మెరిసిపోయే కళాభినేత్రి అతనికి తపోభంగం కలిగించ లేకపోయినా, అతని అందమైన ముఖం,కలలుగనే ఆ కళ్ళు మొదటి చూపులోనే ఆమెలో అతని యెడ అనురక్తిని కలిగిస్తాయి. ఆరోజు వారిరువురి నడుమ జరిగిన సంభాషణ,  అతనితో ఆమె ప్రవర్తన ఆమెపై గడుసైన సొగసరి అనే భావనను పాఠకుల్లో కలిగిస్తుంది.

     శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి ఉన్నానని(అప్పటి రోజులను గురించి) శిథిల మంటపంలో కామసాని మాధవ్ తో రెండు, మూడుసార్లు చెబుతుంది. అది ఆమెకు బాగా నచ్చిన వస్త్ర విశేషమై (ఆ రంగుల కలయిక) ఉండవచ్చు. ఆమె నర్తకి కావడం వల్ల సహజంగానే అలంకరణపై ఆసక్తీ,పట్టు ఉంటుంది.

    సోమేశ్వరుని నోటి వెంట ‘గిరిజ ‘ అన్న పేరు విన్నప్పుడు ఆమెలో స్త్రీ సహజమైన ఈర్ష్యను, మాహూరయ్యతో జరిపిన సంభాషణలో చిలిపిదనంతో కూడిన పరిణతిని పాఠకులు గమనిస్తారు. కాంచీపుర యాత్ర గురించి చెబుతూ అతను కూడా వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేస్తుందేతప్ప పులిబోనులో తలదూర్చబోతున్నాననే భయం ఏమాత్రం కనిపించకపోవడం ఆ ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెబుతుంది.

శ్రీదేవి చొక్కనాధుల ముసుగులో కాంచీపురంవైపు సాగింది వారి రాజకీయ యాత్ర మాత్రమే. ఆ ముసుగు మాటున దాగిన కామసానీ సోమేశ్వరులకు మాత్రం అది ప్రేమయాత్ర. దారి పొడవునా పలు క్షేత్రాలు దర్శిస్తూ , నదీ స్నానాలు చేస్తూ అదొక ప్రేమయాత్రగా వెళతారేతప్ప అత్యంత సాహసోపేతమైన ప్రయాణమనీ,ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఎదురయ్యే పరిణామాలను గురించిన ఆదుర్దా గానీ మచ్చుకు కూడా కనిపించక పోవడం మనసున్న వారిని కలిచి వెయ్యకుండా ఉండగలదంటారా?

కాంచీపురంలో తాను నెరప బోయే గూఢచర్యం గురించి సోమేశ్వరునికి వివరిస్తూ,

” అభినయం దాని ముసుగు. విజయ గండనికీ,శ్రీధర స్వామికీ మధ్య విభేదాలు కల్పించడం అంకురార్పణ.

విజయ గండ పతనం ఫలప్రాప్తి – ఇదీ నా కార్యక్రమం ” అని చెప్పడం,

“నా కళ్ళూ, కాళ్ళూ నీ చేతులతో కలిసి కాంచీపురాన్ని పతనం చేశాయి”  అనీ,

“శాస్త్రం – శస్త్రం ఒకే చోట దర్శనమిచ్చింది ఆ రాత్రి” అని చెప్పిన తీరు సింధువును బిందువులో ఇమిడ్చగలిగే, బ్రహ్మాండాన్ని పరమాణువులో బంధించగలిగే ఆమెలోని ప్రతిభాపాటవాలను అంచనా వేయడానికి ఇంతకన్నా బలమైన పదాలుంటాయా?

(కళ అనేది కేవలం హృదయాన్ని రంజింపజేసేది మాత్రమే కాదనీ, సామ్రాజ్య విస్తరణలోను కీలకమైన పాత్ర పోషిస్తుందన్న కొత్త విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నానన్న విషయాన్ని పాఠకులతో పంచుకోవాలనిపించి….)

రుయ్యమ్మ,అన్నయల పెళ్లి జరిగిన కళ్యాణ మంటపం (ఈ మంటపాన్ని సోమేశ్వరుడే చెక్కుతాడు) లోనే తమ పెళ్లి కూడా జరగాలని ఉందని సోమేశ్వరునితో అనడం, అదే పెళ్లిలో విశ్వంభర శివాచార్యుల వారికి నమస్కరించి “మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీ” అనడం పద్మాక్షమ్మ కొండపై నుండి నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా మెట్లు దిగి వెళ్ళిపోవడం వంటి విషయాలు తడి ఉన్న గుండెల్ని  వడి వెట్టకుండా ఉండగలవంటారా?

  కూతురి స్థానంలో ఆస్థాన నర్త కిగా తిరిగి తనను నియమించదలచినట్లు  రాజప్రాసాదం నుండి వచ్చిన శ్రీముఖాన్ని చామకాంబ సున్నితంగా తిరస్కరిస్తుంది. కళ్ళ ముందే కృంగికృషించి పోతున్న కూతురిని చూస్తూ ఆ తల్లి మనసు ఎలా అంగీకరించగలుగుతుంది?

 “ఆస్థాన నర్తకి ప్రథమాభినయమా” అన్న సోమేశ్వరుని మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం, తనను పరామర్శించడానికి వచ్చిన రుయ్యమ్మతో జరిపిన వాగ్వాదం,

 “నీ ముందు నాకీ  సామ్రాజ్యమెంత ?” అని సోమేశ్వరునితో అనడం వంటివన్నీ అతని ప్రేమ కంటే విలువైనదేదీ  ఆమెకీ ప్రపంచంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది.

తామిద్దరినీ రుయ్యమ్మే  విడదీసిందన్న విషయం రుయ్యమ్మ నోటి వెంటే విన్న కామసాని

‘ నాకీ ఆస్థాన నర్తకి పదవీ వద్దు. ఈ సామ్రాజ్యమూ వద్దు’ అనుకుని అక్కడ అరక్షణం కూడా నిలబడకుండా గిర్రున వెనక్కి తిరిగి రావడం, అంతఃపురం నుండి పరిచారికలతో కబురు మీద కబురంపినా, “రుద్రమగారి తర్వాత ఇతనే రాజవుతాడా? ఈ ప్రతాపరుద్రునితోనే ఈ సామ్రాజ్యం ఏమైనా అయిపోతుందా? నా నృత్య ప్రదర్శన లేకపోతే?” అంటూ పరిచారికలను తరిమేయడం,  రాజాజ్ఞని కూడా ధిక్కరించిన వైఖరి ప్రేమ పట్ల ఆమెకున్న నిబద్ధతను, అది గెలిపించుకోవడానికి సర్వశక్తులొడ్డి  పోరాడిన తీరును తెలుపుతుంది.

కామసాని అతడినెంత గాఢంగా ప్రేమిస్తుందో, అతను కూడా అంతే గాఢంగా, నిజాయితీగా ఆమెను ప్రేమిస్తాడు. కాంచీపుర యాత్రలో భాగంగా సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ, ” కొంగులు ముడి వేసుకొని చేద్దామా ?” అనడం, తిరుగు ప్రయాణంలో “బాలాజీ దర్శనంతో మన వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది” అనడం వంటి మరికొన్ని మాటలను బట్టి ఆ విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తాడేగానీ దానిని పండించుకునే ధైర్యం, స్థైర్యం (ఆమెలో నూటికి నూరుపాళ్ళు ఉంటే) ఇతనిలో మచ్చుకు కూడా కనిపించవు. అవే గనుక ఉండి ఉంటే ఈ కథ విషాదాంతం అయి ఉండేదే కాదు. ఆమెతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మందడ వెళ్లిపోవడం, తిరిగి ఏకశిలకు వచ్చాక కూడా ఆమెకు ఏ విధమైన సమాచారం ఆమెకు అందించకపోవడం, వారి ఆఖరి కలయికైన పద్మాక్షమ్మ కొండపైన ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా(బీద పలుకులు పలుకుతాడేతప్ప) ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం ఇతనిలోని పలాయన వాదానికి నిదర్శనాలు.
కామసానికి ప్రతీకగా యశోదర విగ్రహాన్ని వేయి స్తంభాల గుడిలో చెక్కుతానని అంటాడు. వీరశైవం అధికార మతంగా ఉన్న రాజ్యంలో బౌద్ధ మతపరమైన శిల్పం చెక్కడ మేమిటన్న ఆమె మాటలకు మానవత మతానికి అతీతమైందనీ, అది అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందనీ, సర్వసంగ పరిత్యాగి ఐన బుద్ధుడు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పటికీ , తాను చేసిన త్యాగానికి లక్ష రెట్ల కీర్తిప్రతిష్టల్ని పొంది, లోకానికి ఆదర్శ పురుషుడైనాడనీ, కానీ యశోదర మానసిక సంఘర్షణను ప్రపంచం గుర్తించలేదనీ, అందుకే ఆమెపై తనకున్న అపారమైన గౌరవానికి సూచనగా చెక్కుతానని అంటాడు.
సిద్ధార్థుడు యశోదరను వదిలి వెళ్ళిన విధంగానే తాను కూడా కామసానిని వదిలి వెళుతున్నానని అతని అంతరంగ భావన అయి ఉండవచ్చు. తనలోని కళా నైపుణ్యం శిల్ప రూపంలో కొన్ని యుగాల పాటు నిలిచి ఉంటుందనీ, కానీ కామసాని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన కొద్ది కాలానికి ఆమెలోని మానసిక సంఘర్షణను, ఆమె అందెల రవళులను ప్రపంచం మరిచిపోతుందని కూడా అతడి భావన అయి ఉండవచ్చు.

పైకి యశోదరను ఉదాహరణగా చూపిస్తూ, మాట్లాడుతున్నాడే గానీ అతను చెప్పేదంతా తన గురించేనని క్షణంలో పసిగట్టిన కామసాని అదే మాట అతనితో అంటుంది కూడా. ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా, అతను ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో, నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా కొండ దిగి వెళ్ళిపోతుంది.

శిల్పం కోసం ప్రేమను త్యాగం చేస్తానన్నవాడు మరి ఆ శిల్పానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. గోళకీ మఠ నిర్మాణానికై వెళ్ళినప్పటికీ, శిల్పం పై దృష్టి నిలపలేకపోతున్నాడనీ, ఇటు తాను రోగిష్టినయ్యాననీ, ఇద్దరినీ కళాతపస్వులుగా చేయాలన్న రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదనీ,తన తల్లి ఐ న చామకాంబ తనతో చెప్పిందనీ, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆ విషయం తెలిసి పూర్తిగా కుదేలయ్యాననీ, ఆ తదుపరి సంఘటనలు కలలో జరిగినట్లుగా జ్ఞాపకం ఉన్నాయనీ, ఎందుకో శివాచార్యులవారు వచ్చినట్లు,తనను అభిమంత్రిస్తున్నట్లు ఏదో లీలాగా స్ఫురించిందనీ,ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని చూస్తున్నాననీ చెబుతుంది.

మొత్తం 10 పున్నములుగా జరిగిన ఈ కథలో (శిథిల మంటపంలో) ఇక్కడి వరకే ఆమె మాధవ్ తో చెబుతుంది.

మాధవ్ మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఆయుర్వేద వైద్యులైన వేణుగోపాలాచార్యులవారి సలహా మేరకు వరంగల్ వాస్తవ్యులైన మహామంత్రవేత్త, ఉపాసకులైన ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారిని కలిసి శిథిల మంటపంలో మొదటి నుండి మాధవ్ కె దురవుతున్న అనుభవాలను, అతని ప్రస్తుత పరిస్థితిని వివరించి ఎలాగైనా అతడినీ, అతడి కుటుంబాన్నీ ఈ కష్టం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడతాడు రామచంద్ర.

తన ఆధ్యాత్మిక శక్తి అంత దృఢమైనది కాదనీ, ఇదివరకెన్నడూ ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు లేదనీ మొదట అన్నప్పటికీ, చివరకు అంగీకరిస్తారు జ్వాలాపతిగారు.

రామచంద్ర చెబుతున్న విషయాలన్నిటిని కళ్ళు మూసుకొని పారవశ్యంతో విన్న ఆ మహనీయుడు ఊహాలోకం నుండి వాస్తవానికి వచ్చి, ఈ మాధవరావే ఆనాటి భళ్ళాల సోమేశ్వరుడనీ, కామసాని అతడి ప్రేయసి అనీ, శిథిల మంటపంలో ప్రతి పౌర్ణమికి అతడికి కనిపించి, మాట్లాడుతూ న్నది ఆమె జీవాత్మ అనీ చెబుతాడు.

మరుసటి రోజైన త్రయోదశీ,సోమవారం మాస శివరాత్రి నాడు అఖండం వెలిగించి పూజ ప్రారంభిస్తాననీ, ధ్యానంలో తనకేవైనా కొత్త ఊహలు రావచ్చనీ, ఎల్లుండి వచ్చి కనిపించమని చెప్పి పంపిస్తారు.

వారి మాట ప్రకారం మరుసటి రోజు వెళ్లిన రామచంద్రకు నవ్వుతూ ఎదురొచ్చిన జ్వాలాపతి గారు తమకు ధ్యానంలోస్ఫురించిన విషయాలను రామచంద్రకు చెబుతూ….

మందడ నిర్మాణం పూర్తి చేసి, ఏకశిలకు వచ్చిన సోమేశ్వరుడు మనసు అల్లకల్లోలమవుతుండగా సహస్రమంటపాన్ని చెక్కుతూ ఉంటే, ఒకనాడు చామకాంబ వచ్చి కామసాని ఆఖరి ఘడియల్లో ఉందని తెలుపడంతో వెళ్లి చూస్తాడు. పరిస్థితి ఇలా చేయి దాటి పోతుందని ఊహించని అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తూ,మహామంత్రవేత్త, రాజ గురువైన విశ్వంభర శివాచార్యుల వారినాశ్రయించి, తన గుండెలోని వేదనను, ఆమె కళ్ళలోని ఆవేదనను తన ఉలి మలుపుల్లో బిగించి, ఆమెకు ప్రతీకగా తాను చెక్కిన శిల్పం శిథిల మంటపంలో యశోదర విగ్రహమై ఉందనీ, తిరుపతిలో బాలాత్రిపుర సుందరి సమక్షంలో మానసికంగా తమకు వివాహం జరిగిందనీ,ఆమె ఆత్మను అందులో ఆవాహన చేయమని ప్రాధేయపడతాడు.

“స్వామీ! కామసాని నన్ను అమరుణ్ణి చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణ ప్రతిష్ట చేయండి” అని అర్థిస్తాడు.

(జ్వాలాపతిగారు రామచంద్రకు తెలిపిన ఈ విషయంపై నా స్పందనను పాఠకులతో పంచుకోవాలనిపించి……

కామసాని – సోమేశ్వరులకు సంబంధించిన ఈ కథను నేను ఈ ఒక్క పుస్తకంలోనే చదివాను. ‘క్రీడాభిరామం’ అనే నవలలో కూడా కామసాని ప్రస్తావన ఉందన్న విషయం ఎక్కడో విన్నాను గానీ,ఆ పుస్తకాన్ని మాత్రం నేను చదవలేదు.

అతని ఉన్నతిని అతనికంటే ఎక్కువగా ఆమె కోరుకుందే తప్ప, తన ప్రేమను త్యాగం చేయడానికి గానీ,అతడితో బంధాన్ని వదులుకోవడానికి గానీ ఆమె ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. నవల మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా ఈ విషయం పాఠకులకు కనిపించదు, స్ఫురించదు.మరి సోమేశ్వరుడు శివాచార్యుల వారితో  ‘ అమరుణ్ణి ‘ అనే పదం ఎందుకు వాడారో నాకు ఎంత ఆలోచించినా బోధపడలేదు).

మొదట అంగీకరించని శివాచార్యులవారు ఒకనాటి పూర్ణిమనాడు భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మను యశోదర విగ్రహంలో ఆవాహన చేశారనీ, ప్రతిష్ట కాలంలో దుఃఖిస్తూ ఉన్న సోమేశ్వరుడు పూజాదికాలు సక్రమంగా నిర్వహించ లేకపోయాడనీ, ఆ కారణంగా ఆకర్షణ సమయంలో పూజలోనో, మంత్రంలోనో ఏదో లోపం జరిగిందనీ,ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదనీ, ప్రతి పౌర్ణమినాటి చంద్రోదయ కాలంలో కేవలం 15 నిమిషాలపాటు సోమేశ్వరునితో మాట్లాడుతుందనీ, ఆ పదిహేను నిమిషాల కాలమే జీవప్రతిష్ట జరిపిన ముహూర్తమై ఉండవచ్చనీ, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇదేవిధంగా బయటకు వస్తూ, అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి ఉండవచ్చనీ ,ఇంత కాలానికిగానీ ఆమె నిరీక్షణ ఫలించ లేదనీ, ఆనాటి సోమేశ్వర రూపానికీ ,ఈ మాధవరావు రూపానికీ సంపూర్ణ సాన్నిహిత్యం ఉండటమే ఆమె అతడిని గుర్తుపట్టడానికి కారణమై ఉండవచ్చనీ,అతనే సోమేశ్వరుడ వ్వడంవల్ల అతడికి మాత్రమే కనిపిస్తూ, అతనితోనే మాట్లాడుతూ ఉందనీ, ఆమె భౌతికంగా మరణించిన అనంతరం కళాభినివేషాన్ని పూర్తిగా కోల్పోయిన సోమేశ్వరుడు ” దేవీ! దేవీ!” అంటూ కామసాని నామస్మరణలో పిచ్చివాడై, నిరంతరం సహస్ర స్తంభ  మంటపంలో తిరుగుతూ, తనువు చాలించి ఉంటాడనీ కామసాని సశేషంగా మిగిల్చిన కథను తన ఉపాసనా బలంతో సంపూర్ణం గావించారు . 

ఆ తర్వాత మాధవ్ నూ,అతని కుటుంబాన్ని కాపాడమంటూ అర్థించిన స్నేహశీలి (రామచంద్ర) ఆవేదనకు స్పందించి శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తారు జ్వాలాపతి గారు.

( ఇక్కడ నా మనసులో మెదిలిన మరో విషయాన్ని కూడా పాఠకులతో  పంచుకోవాలనిపించి…..

ఎంత గొప్ప శిల్పి ఐనప్పటికీ, అతి సామాన్య మానవుడైన సోమేశ్వరుడు ఆమె తనను వదిలి వెళుతుందనే ఊహను తట్టుకునే శక్తిలేకా,ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయగలిగే పరిజ్ఞానంలేకా ఆవాహన చేయమని అభ్యర్థించి ఉండవచ్చు. కానీ మహా మంత్రవేత్త, తపఃసంపన్నులైన శివాచార్యులవారు ఎలా అంగీకరించగలిగారు? అన్న ప్రశ్న మాత్రం నాలో తలెత్తింది. మరుసటి క్షణంలోనే సాధుసత్పురుషుల ఆలోచనల వెనుక ఏదో అర్థం, వారు వాటిని అమలుపరిచే విధానాల వెనుక మరేదో పరమార్ధం దాగుంటుందని మళ్లీ ఆ (నా) మనసే నాకు హితవును బోధించింది.

రాబోయే కాలంలో ఈ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని వారు భావించి ఉండవచ్చనీ, అందుకే శిల్పంలో ఆవాహన చేసి ఉండవచ్చనీ నాకనిపించింది.

నవల చదవక ముందు అది చదవాలనీ,దానికిపై వ్యాసం వ్రాయాలని మాత్రమే ఉండేది, కానీ ఎప్పుడైతే నేనా నవల చదివానో,ఆ క్షణం నుండే నాలో ఆ శిల్పాన్ని చూడాలన్న కోరిక  పెరుగసాగింది. వ్యాసం వ్రాయాలన్న ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడంతో, ఇక ఉండబట్ట లేక 02/07/ 2024 నాడు నేను, మావారు వరంగల్ కు బయలుదేరాం. నేను శిల్పశాస్త్రం, పురాతత్వశాస్త్రం, చరిత్ర వంటి వాటిలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ, ఆ శిల్పం చూసి రావాలనుకోవడానికి కారణం, ప్రత్యక్షంగా చూసి వ్రాస్తే నా రచన ఒకింత బలాన్ని పుంజుకుంటుందనీ, మరికాస్త జీవం పోసుకుని కొంతమందినైనా కదిలించగలుగుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రయాణం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా గమనించాను.

విశాలమైన ఆవరణలో అడుగుపెట్టగానే 3 శివలింగాలు, వాటికి కాస్త దూరంలో పుష్కరిణి, పద్మాకారంలో ఉన్న వేదిక, దానిపై ఆలయ నిర్మాణం (ఈ ఆలయ నిర్మాణమే నాకు వినూత్నంగా కనిపించింది. ఇటువంటి నిర్మాణశైలి నేను ఇది వరకెక్కడా చూడలేదు. బహుశా ఉండి ఉండవచ్చు, కానీ పర్యాటక ప్రదేశాలను చూడటంలో నేను అంత చురుకుగా ఎప్పుడూ లేను, అందుకే నాకలా అనిపించి ఉండవచ్చు) మరోవైపు హనుమంతుడు, నాగదేవతల ప్రతిష్ట కనిపించింది. గుడిలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుని, కాకతీయ సామ్రాజ్యపు ఆలోచనలు తలలో చక్రభ్రమణం చేస్తూ ఉంటే,  గోడలను చేతులతో స్పృశిస్తూ, ఆ విషాదగాథను నెమరేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ, నందీశ్వరుని చెంతకు చేరుకొని, ఆవాహన నవలను చేతిలో పట్టుకొని,గుండె దడదడలాడుతూ ఉండగా, నెమ్మదిగా శిథిలమంటపం లోనికి అడుగు పెట్టాను.

800 సంవత్సరాల విషాదాన్ని మోసిన ఆ విగ్రహాన్ని చూడాలన్న తపన నన్ను రోమాంచితం చేస్తూ ఉంది. అంగుళం కూడా వదలకుండా మంటపమంతా కలియజూస్తూ, మధ్య మధ్యలో  పుస్తకాన్ని తిరగేస్తూ, ఒక్కొక్క సంఘటనను సరిచూసుకుంటూ, ఒక్కొక్క అడుగే వేస్తూ, అప్పుడప్పుడు దాని గురించి మా వారితో చర్చిస్తూ, అవసరమైన చోట అతని సలహాలు తీసుకుంటూ, అంగుళం అంగుళం గాలించాను.

ఆ మంటప నిర్మాణమే నాకు సరికొత్తగా అనిపించింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. నవలలో పద్మాకార శిల్పాలు అనే మాట కామసాని నోటి వెంట చాలాసార్లు వస్తుంది. ఈ పద్మాకార శిల్పాలు ఏమిటనే విషయంపై చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రధాన ఆలయంలో, శిథిలమంటపంలో  రెండు చోట్లా నాకు పద్మకార చెక్కడాలు కనిపించాయి. ప్రధాన ఆలయంలో కప్పు పైభాగంలో అన్ని పద్మాకారంలో చెక్కిన చక్రాలు కనిపించాయి (బహుశా అవి ఇవే అయి ఉండవచ్చు అనుకున్నాను). శిథిలమంటపంలో 4 వరుసల్లో వరుసకు 6 చొప్పున మొత్తం 24 స్తంభాలు కనిపించాయి. ప్రధాన మంటపానికి నాలుగు వైపులా 4 ఉపమంటపాలు కనిపించాయి. ప్రతి ఉపమంటపానికి నాలుగు వైపులా 11 చొప్పున మొత్తం 44 చిన్న,చిన్న స్తంభాలు కనిపించాయి. కానీ ఎంత వెతికినా నాకు యశోదర శిల్పం జాడ కనిపించలేదు. అప్పుడు నాలో కలిగిన ఆలోచనలనుగానీ,నా గుండెలో రేగిన అలజడినిగానీ కాగితంపై పెట్టాలంటే, నా రచనా శక్తి సరిపోదేమో అనిపించింది. కామసాని మాధవ్ తో మాట్లాడుతూ శిల్పాల చాటుకు  వెళుతుందనీ ,అలా వెళుతూ, వెళుతూ అదృశ్యమవుతుందనీ ఉ టంకించారు. యశోదర శిల్పం మాత్రమే కాదు, ఆ మంటపంలో నాకు ఏ ఒక్క శిల్పమూ కనిపించలేదు. రాతి స్తంభాలపై సన్నటి లతలు, చిన్న, చిన్న దేవతా రూపాలు కనిపించిన మాట వాస్తవమేగానీ, స్తంభాలపైగానీ, స్తంభాల చెంతగానీ నాకు ఎటువంటి విగ్రహాల జాడ కనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్లను కొందరిని గైడ్స్ గురించి అడిగితే, గైడ్స్ ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పారు.నలుగురైదుగురు భక్తులను అడిగినప్పటికీ , ఏ విధమైన సమాచారం లభించలేదు. ఆలయ అర్చకులను సంప్రదించమని ఒకరిద్దరు సలహా ఇచ్చారుగానీ నాకెందుకో సమాచారం దొరుకుతుందన్న నమ్మకం కలుగక మౌనంగా ఉండిపోయాను. చివరి ప్రయత్నం గా గోడకు చేరగిలబడి  సెల్ ఫోన్ చూసుకుంటున్న ఒక యువకుడి దగ్గరకు వెళ్లి,విషయం తెలియజేశాను. నా చేతిలో ఉన్న నవలను చూపించి కాస్త వివరించమని అభ్యర్థించాను. దానికతడు తాను చరిత్ర తెలిసిన వ్యక్తిని గానని , ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా తనకేమీ తెలియవని, కాకపోతే ఇక్కడ తానొక డాన్సర్ విగ్రహాన్ని చూశానని, దాన్ని (ఆ శిల్పాన్ని) పగులగొట్టి అటువైపుగా పడేశారని మంటపానికి కుడివైపున చేతితో చూపిస్తూ , వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఆ మాత్రం సమాచారమిచ్చిన ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపి, నవలను చేతిలో పట్టుకొని పరుగు లాంటి నడకతో ఇద్దరం ఆశగా వెళ్ళాం. అక్కడ పగిలిపోయిన శిలా ప్రతిమలు కుప్పగా పడవేసి ఉన్నాయి. అందులో ఆత్రుతగా వెతుకుతూనే, అక్కడ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సఫాయి కార్మికులను అడిగితే ఆ విషయాలేవీ తమకు తెలియవని చెప్పారు. కాకపోతే వారిలో ఒక తను నా చేతిలోని నవల ముఖచిత్రాన్ని చూసి , దాన్ని చేతిలోకి తీసుకొని ఇవి రామప్ప దేవాలయంపై చెక్కిన రాగిణి, నాగిని విగ్రహాలనీ, మేమడిగే సమాచారం అక్కడ దొరుకుతుందనీ, చెప్పడంతో ఇక అంతకంటే ఎక్కువ అతనిని అడగడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మౌనం వహించి, మళ్లీ వెదకడం మొదలు పెట్టగా, అందులో ఒక స్త్రీ విగ్రహం నా కంట పడనే పడింది.

దాన్ని నాకున్న అతి స్వల్ప పరిజ్ఞానంతో నఖశిఖ పర్యంతం పరీక్షించాను. ఇది నర్తకి శిల్పమే అయి ఉంటుందా ? అని కళ్లింతలు  చేసుకుని చూశాను. అత్యంత బాధాకరమైన విషయమేమంటే ఆ శిల్పం రెండు ముక్కలుగా పగిలి, మోకాళ్ళ కింది నుండి వేరు చేయబడి ఉంది. కాళ్లకు   నర్తకీమణులు  ధరించే  అందెలు ఉన్నాయా ?లేదా? అని గమనించాను. అందెలు ధరించిన నాజూకైన కాళ్లతో అది ఆ శిల్పమేనన్న నిర్ణయానికి వచ్చాను. కింది భాగానికి సరిపోలే మరో శిల్ప శకలానికై మళ్లీ వెదుకులాట ప్రారంభించాను. చక్కని అవయవ సౌష్టవంతో నృత్య భంగిమలో ఉన్న మరో శకలం కనిపించింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తలభాగం మొండెం నుండి వేరైతే పడలేదుగానీ, ఒక వర్తులాకార ఫలకంపై చెక్కిన ముఖ భాగం (తల భాగానికి చెందిన వర్తులాకార ఫలకమేదైతే ఉందో అది మొండానికి అతుక్కునే ఉంది కానీ దానిపై చెక్కిన ముఖభాగం లేదు. పాఠకులకు విషయం స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇంత  వివరంగా వ్రాస్తున్నాను) మాత్రం కనిపించలేదు.

ఆ శిల్పం లోని ముద్రనూ, నిలుచున్న భంగిమనూ (ఇంటికి వచ్చాక కాస్త నాట్యశాస్త్రంతో పరిచయం ఉన్న వారిని అన్ని వివరిస్తూ అడిగితే అది ‘ కపిథ’ ముద్ర అని చెప్పడంతో నా ప్రయత్నం మరింత బలపడిందనిపించింది) జాగ్రత్తగా గమనించాను. మోకాళ్ళపై వరకు  ధరింపజేసిన ఆ వస్త్రాలను(ఆ మరుసటి రోజు గూగుల్లో నర్తకీమణులు  ధరించే వస్త్రాలు అని వెదికితే దానిని ‘ చల్లడం ‘ లేదా  ‘చల్లాడం  ‘ అని అంటారని తెలిసింది), ఆభరణాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండు భాగాలు ఆ శిల్పానికి సంబంధించినవే అయి ఉండవచ్చని నా మనసు చెబుతూనే ఉంది. ఆ  శిల్ప శకలాలను చూడగానే నా గుండె విలవిల్లాడిపోయింది. కామసాని కాళ్ళను ఎవరైనా నరికితే సోమేశ్వరుడు ఎంతగా విలవిల్లాడుతాడో నా మనసు కూడా అంతగా  విలవిల్లాడింది. చేతిలోని  కామసాని – సోమేశ్వరుల ప్రణయ కావ్యం (ఆవాహన నవల) పుటలన్నీ తెగిపోయి గాల్లో ఎగురుతూ వేయి స్తంభాల గుడి నిండా చెల్లాచెదురై పడిపోతున్నట్టు, వాటిని పట్టుకోవడానికి నేను ఆలయమంతా పరుగులు తీస్తున్నట్టు ఏవేవో భావ చిత్రాలు.

మనసు అల్లకల్లోలమవుతుండగా భారంగా పుష్కరిణి వైపు  అడుగులు వేసిన నాకు దాన్నిండా తాబేళ్లు  కనిపించాయి. తాబేలు జీవితకాలం సుదీర్ఘమైంది కదా , వీరి ప్రణయానికివి ప్రత్యక్ష సాక్షులై ఉంటాయన్న నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. ఆ శిల్ప శకలాలను చూసి మొదలు నరికిన చెట్టులా చతికిలబడిన నన్ను చూసి మావారు  “పర్వతాలే కాలగర్భంలో కలిసిపోగా లేనిది ఒక శిల్పం కోసం అంతగా బాధపడటం అవసరమా ? ” అన్నారు. వారన్నది నిజమే, నేను కాదనడం లేదు, కానీ అది మామూలు శిల్పమా?! కొన్ని శతాబ్దాల గుండె బరువును మోసిన శిల్పం. కొన్ని శతాబ్దాల నిరీక్షణకు వేదికైన శిల్పం. పగిలిన గుండెను తనలో పొదువుకున్న శిల్పం. పగిలిన మరో గుండె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మౌనసాక్షిగా మిగిలిన శిల్పం. స్పందించే విధానంలో గుండె గుండెకూ తేడా ఉంటుంది. పైగా అది నా పసితనంలో (అప్పటి) నాలో నాటుకున్న విత్తనం. మొక్కై, మానై ,శాఖోపశాఖలుగా  నా హృదయక్షేత్రంలో విస్తరించిన వటవృక్షం. దాన్ని నేనెలా తేలిగా తీసుకోగలను ? అది నాకెలా సాధ్యం? అంత తేలిగ్గా తీసుకొని ఉంటే నాలోంచి ఈ రచన వెలువడేది కాదు సరికదా, ఒక్క అక్షరం కూడా నా కలం లోంచి వచ్చి ఉండేదే కాదు. మనసు స్పందించిన చోటే భావాల ఊట. ఎద కరిగిన చోటే కన్నీటి పాట. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని నా రచనను నిర్విఘ్నంగా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించి వెనక్కి మళ్ళాం.

తిరుగు ప్రయాణంలో పగిలిపోయిన ఆ శిలామూర్తి ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉలితో పగిలిన శిలలా అయింది నా మనసు. ఆ పగుళ్లలోంచి కామసానీ, సోమేశ్వరుల ప్రణయ కథ ఒక్కొక్క అంకం నా మనోఫలకంపై కదలాడుతూ ఉంది. సన్నటి నీటి తెర నా కళ్ళలో చిప్పిలుతూనే ఉంది.

ఎన్ని ప్రేమ కథలు విఫలం కావు? మరీ ఇంతగా స్పందించడం అవసరమా? అన్న ఆలోచన కొందరిలో తలెత్తవచ్చు, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తులను చూసి అంతగా బాధ పడటం ఏమిటి ? అన్న ఆలోచన కూడా మరి కొందరిలో రావచ్చు. ఇక్కడ స్థాయి, సుఖాంతం, విషాదాంతం అని కాదు.నా బాధకు నాకు 3 కారణాలు కనిపించాయి 1. జాలి 2. జాలి 3. జాలి  800 సంవత్సరాలు ఆ జీవాత్మ అనుభవించిన గుండెల్ని పీల్చి పిప్పి చేసే దుర్భరమైన వేదన. నా వంటి ఎంతోమందిని కదిలించిన యాతన. అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మా నాన్న కళ్ళలోని తడి, మా అమ్మ కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తే.తడి ఉన్న ప్రతి గుండెను ఈ కథ కన్నీరు పెట్టించింది. దానికి నా కళ్ళతో నేను చూసిన ఎంతోమంది నాకు సాక్ష్యం. దానికి నేను ప్రత్యేకమూ కాదు, మినహాయింపూ కాదు.

ప్రేమ కథలు కొన్ని సుఖాంతమౌ వుతాయి, కొన్ని విషాదాంత మౌతాయి. కానీ మనిషి బ్రతికి ఉన్నంతవరకే ఆ మనుషులను అవి స్పందింపజేస్తాయి. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలిపెడితే గనుక అవి (ఆ భావాలు) పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ ఈ కథ వాటన్నిటికీ అతీతమైనది.

ఒక ఆత్మను శిలలో నిక్షిప్తం చేయడం, ఆ దేహం నిస్తేజమై, కట్టె కాలిపోవడం, ఆత్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఆ ఎదురుచూపు ఎంతకూ ఫలించక, ఆ మనసు నలిగిపోవడం, అటు ఆత్మకు మోక్షంలేకా,ఇటు ఎదురుచూపుకు అంతంలేకా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ఆ యాతనే నా ఈ స్పందనకు కారణం.

నా దృష్టిలో అది శిథిల మంటపం  కాదు. కామసానీ, సోమేశ్వరుల ప్రేమసామ్రాజ్యం. మోహానికీ, ప్రేమకూ  హస్తిమశకాంతరం ఉంది. భూమికీ,ఆకాశానికీ మధ్య ఉన్నంత భేదం ఉంది. అది మోహమే ఐతే నా గుండె లోతుల్లోంచి ఈ భావాల వెల్లువ ఉప్పొంగే కాదు. ఆది కాంక్షే ఐతే నా కలం లోంచి ఒక్క సిరాచుక్క కూడా అక్షర రూపు దాల్చి ఉండేదే కాదు. అది రెండు మధుధారలతో నిండిన అమృతభాండం. రెండు హృదయాల నిర్మల ప్రేమను ఆవాహన చేసిన ప్రణయకలశం. సోమేశ్వరుడు మాధవ్ గా పునర్జన్మ నెత్తి వచ్చినట్లుగానే, కామసానీ, సోమేశ్వరులు పునర్జన్మనెత్తాలి. ఆమె కాలి మువ్వల ఘల్లుఘల్లుల్లో  ఆలయ ప్రాంగణం (వేయి స్తంభాల గుడి) సందడించాలి. వారిద్దరూ జంట పావురాలై జావళీలు పాడాలి. మూడు పువ్వులు ఆరు కాయలుగా పిల్లాపాపలతో వర్ధిల్లాలి. వారి నవ్వులన్నీ పువ్వులై ఆ రుద్రేశ్వరునికి పుష్పయాగం చేయాలి.

ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు

పుత్రపౌత్రాభివృద్దిరస్తు

సమస్త సన్మంగళాని భవంతు

            స్వస్తి

(విజ్ఞప్తి:   ఆ శిల్ప శకలాలు యశోదర విగ్రహానికి సంబంధించినవే అని నేను ఇప్పుడు కూడా అనటం లేదు, బహుశా అయి ఉండవచ్చు అని మాత్రమే అంటున్నాను. విషయ పరిజ్ఞానం లేనప్పుడు  నొక్కి చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు.  ఒకవేళ ఆ శిల్పానివే అయితే, మన చారిత్రక సంపదైన, కాకతీయుల కళావైభవ చిహ్నమైన ఆ శిల్పాన్ని ఏ కాస్త అవకాశం ఉన్నా, పునర్నిర్మించి, యథాస్థానంలో ప్రతిష్టించి,ముందు తరాలకు అపురూపమైన కానుకగా అందించాలని నేను అన్ని రంగాల ప్రముఖులకు పేరుపేరునా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను).

You may also like

41 comments

Matthew3806 July 30, 2025 - 10:44 pm Reply
Bruce1089 July 31, 2025 - 4:39 pm Reply
Jack2526 July 31, 2025 - 5:13 pm Reply
Harold2040 July 31, 2025 - 5:41 pm Reply
Eliza601 July 31, 2025 - 7:20 pm Reply
Freddie1864 July 31, 2025 - 10:45 pm Reply
Hallie1856 August 1, 2025 - 6:08 am Reply
Briana256 August 1, 2025 - 7:12 am Reply
Monica1446 August 1, 2025 - 10:15 am Reply
Aniya4695 August 1, 2025 - 1:09 pm Reply
Teresa335 August 1, 2025 - 2:49 pm Reply
Daria3279 August 1, 2025 - 11:59 pm Reply
Francesco2417 August 2, 2025 - 1:36 pm Reply
Roman3838 August 3, 2025 - 6:10 am Reply
Diana3501 August 3, 2025 - 9:55 am Reply
Phyllis4390 August 3, 2025 - 1:23 pm Reply
Amalia4015 August 4, 2025 - 3:31 am Reply
Julius4118 August 4, 2025 - 7:58 am Reply
Alvin33 August 6, 2025 - 9:27 am Reply
Carson1534 August 7, 2025 - 8:32 am Reply
Manuel933 August 8, 2025 - 6:51 pm Reply
Angelica810 August 12, 2025 - 12:34 am Reply
Carl4245 August 12, 2025 - 6:22 am Reply
Alana3074 August 14, 2025 - 4:58 am Reply
Brooks1100 August 14, 2025 - 8:16 am Reply
Simon1228 August 18, 2025 - 7:48 pm Reply
Bernard3766 August 21, 2025 - 12:39 am Reply
Elsie3714 August 22, 2025 - 11:03 am Reply
Ada2164 August 24, 2025 - 2:07 am Reply
Miriam1143 August 27, 2025 - 1:20 am Reply
Max578 August 28, 2025 - 11:10 pm Reply
Alex3615 August 30, 2025 - 4:05 am Reply
Lachlan3301 August 31, 2025 - 9:27 am Reply
Dominic1542 August 31, 2025 - 1:40 pm Reply
Roger951 September 2, 2025 - 4:58 am Reply
Daisy3748 September 4, 2025 - 6:48 am Reply
Gianna3965 September 6, 2025 - 6:35 am Reply
Dustin3654 September 8, 2025 - 6:03 pm Reply
Collin1955 September 11, 2025 - 7:26 pm Reply
Madelyn2445 September 12, 2025 - 12:15 pm Reply
Ivy480 September 13, 2025 - 8:46 pm Reply

Leave a Reply to Monica1446 Cancel Reply