Home సంపాదకీయం కవులూ, రచయితలూ మీకో సవాల్ !

కవులూ, రచయితలూ మీకో సవాల్ !

by Kondapally Neeharini

– డాక్టర్ కొండపల్లి నీహారిణి,

మయూఖ ఎడిటర్ ( జూలై మయూఖ పత్రిక సంపాదకీయం) _____________

కవిత్వం రాస్తున్నారా? వ్యాసరచన చేస్తున్నారా? పుస్తకాలు ముద్రించుకుంటున్నారా? వేసుకోండి. వేసుకోవాలి. లేకుంటే ఎలా? లేకుంటే మనవైన భావనలు అక్షరాలలో తొంగి చూస్తూ వెక్కిరించవూ! పుస్తక రూపంలో కి తెచ్చుకోకుంటె, నన్ను అలా వదేలేస్తావా … పట్టించుకోవూ అని సాహిత్యం దిగాలుగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది కదూ! ఈ భావనలు, ఈ ఎదురుచూపులు,ఈ ఆవేదనలు భవిష్యత్తులో కోకొల్లలు గా చరిత్ర రికార్డు చేసి పెట్టే రోజులు రానున్నవి. తస్మాత్ జాగ్రత్త! మాతృభాష తెలుగు కోసం పరితపిస్తున్న వాళ్ళ ఆరాటం వెనక ఏముంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

భాష నా భవ బంధనం
భాష నా భావ బంధురం
యాసా బాసా నా రెండు కన్నులు
నా రెండు  చేతులు రెండు కాళ్ళు!
ఒక్క గుండె కు పద గుంఫన ఫలాలు
ఒక్కో అడుగుకు నవ చేతన బలగాలు!!
ఇది కవులందరి హృదయ శ్వాస హృదయ ఘోష.  కాదంటారా?  మరెలా రాబోయే కాలంలో ” తెలుగు చచ్చిపోతుంది” అంటే వింటూ ఊరుకుందామా?
ప్రాచీన సాహిత్య చరిత్ర అంతా బాగా వంట పట్టించుకున్న పండితుల కాలం నుండి, భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం అలవాటైన ఆధునిక కాలం వరకు తెలుగు భాషకు ప్రమాదం ఉంచుకొస్తుంది అన్న ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు . బహుశా ఆ నాటి క్షీణ యుగంలో ఏ ఆదరణలేక బీరిపోయి పండిత కవులు భావించి ఉంటారు, ఊహించే ఉంటారు. కానీ, కవిత్వం వచన కవిత్వంగా ఉదృతంగా ప్రవహించినప్పుడు, కథలు వ్యాసాలు పరిశోధనలు పుస్తకాలుగా గ్రంథాలుగా వెల్లివిరిసినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు.  పూర్వకవుల కవిత్వ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విశ్లేషించిన కవులు ఉండేవాళ్లు. తర్వాత కాలంలో ఆధునిక సాహిత్య వికాసానికి తోడ్పడిన సాహిత్య విమర్శకులు ఉండేవారు. వాళ్లు కవిత పండితులు. వాళ్ళు చెప్పిన వాక్య సొబగులను తలకెత్తుకొని పుస్తకాలుగా విరిసిన సాహిత్యాభిలాషులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి.  ఈ యజ్ఞం లో మనమందరము ఉన్నాము కాబట్టి, మనమందరము చదివాము, మనమందరము రాసాము కాబట్టి. మరి ఇప్పుడు ? గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేరుకొని పోతాయి కానీ  రేపటి రోజు ల్లో చదివే వారు ఉండరు అనే బాధ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరనింద ఆత్మ స్తుతి  పొంగిపొర్లుతూ పక్క వాళ్ళ కవిత్వాన్ని పట్టించుకోని దుస్థితి వస్తుందని ఎవ్వరంటే ఎవ్వరు ఊహించి ఉండరు.
అరచేతిలో భూతల స్వర్గం ఇమిడిన వింతపోకడల కాలంలో కవిత్వం పలుచబడి , పోటీ తత్వం, భజన పరత్వం అలవడి, అభినందనల కోసం అవార్డుల కోసం అర్రులు చాస్తూ మేధావులను ఆలోచనలో పడేస్తున్నదీ చూస్తున్నాం. సరే ఏదో ఒకటి అక్షరాలనయితే కుమ్మరిస్తున్నారు కదా అని సరిపెట్టుకోవాలా అక్షరాలలో సత్తువ తగ్గిందని బాధపడాలా అర్థంగాని స్థితి.
కవిత్వ సంపద కొరవడితే కొరవడింది గాని భావాలయితే బాగానే ఉన్నాయి. ఏదో విధంగా తెలుగు వెలుగుతున్నదని మిన్నకుంటున్న దుస్థితి.
విరసి తెలుగు భాషకు ఏదో తెగులు పుట్టుకొస్తున్నది అని మాత్రం సమస్త జనావళికి అర్థం అయిపోతున్నది.
ఇక అర్థం కావలసిన సమస్య ఏంటంటే, ఇంతమంది కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, సినీ జగత్తులో విహరిస్తున్న పాటల తేజోవిలాసమూ, పది రోజులకో పత్రిక పుట్టుకొస్తున్న పత్రికా రంగమూ తెలుసుకోవాల్సిన విషయం సావధానంగా చర్చించుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కాలం మన్నికగా నిలవాలంటే తెలుగు భాష అనేది బ్రతికి ఉండాలి కదా!
రేపు మన సాహిత్యాన్ని తలకెత్తుకునే వాళ్ళు ఎవరు? తలకెత్తుకోకుండా సరే బతికించే వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఇంగ్లీషులో చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగాల్లో డబ్బులు గడించొద్దని ఎవ్వరు
అనడం లేదు, కోరుకోవడం లేదు. తప్పదు కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానం వెల్లి విరుస్తున్న ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఇంగ్లీష్ లో చదవాలి, పట్టాలు పొందాలి, పరుగులు పెట్టాలి. ఏమి వద్దనడం లేదు కానీ ఇంత కష్టమైనటువంటి చదువును చదవగల విద్యార్థులకు తనదైన మాతృభాషలో ఒక తరగతి కి ఒక తెలుగు పీరియడ్ ఉంటే చదవలేరు అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అబ్బో కష్టం తెలుగు చదివి మార్కులు తెచ్చుకోవడం అని ఎందుకు అంటున్నారు? పిల్లలు అవలీలగా చదవగలరు చిన్నప్పటినుంచి ఒక క్లాసులో ఒక సబ్జెక్టు గా తెలుగును నేర్చుకుంటే! 

ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన సాగుతూ, కేజీ నుండి పీజీ వరకు ఒక విషయం(సబ్జెక్టు) తెలుగు భాష వాళ్ళ వాళ్ళ తరగతి స్థాయిని అనుసరిస్తూ పెంచుతూ పోతుంటే తెలుగు భాష నేర్చుకుంటారు. కనుమరుగు కాదు. ఇలా భాష నేర్చుకునే వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ ప్రక్రియపై ఆసక్తి ఉంటే వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని చదివి భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా, సాహిత్య విమర్శకులుగా, పాటల రచయితలుగా ఎదుగుతారు. తెలుగు భాష బోధన లో ఉన్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగాలు పోవు. రాబోయే కాలంలో కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు వస్తాయి. అసలు భాష నే కనుమరుగైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
జానపద సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన తర్వాత కదా వెలుగులోకి వచ్చింది. వాళ్లదైన సొంత తెలుగు తీయదనమంతా జనపదుల పాటల్లో కథల్లో దాగి ఉన్నది మొత్తం గుత్తంగా గ్రంథరూపంలో తెచ్చారు కాబట్టే పట్టణంలో మనకు చేరింది.ఆధునిక మాధ్యమాలైన టి.వి., సినిమా, యూట్యూబ్ లలోకి వచ్చిన తర్వాతే ప్రపంచానికి అందింది. అందుతున్నది. ఇందుకోసమైనా తెలుగు రావాలి కదా!
ఇప్పుడు అసలే అత్యంత ఆధునికమైన ఏ.  ఐ. వచ్చింది. ఈ కృత్రిమ విజ్ఞానం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల తెలుగు బ్రతుకుతున్నది అని అనుకుందామా తెలుగును సమూలంగా నాశనం చేయడానికి ఇది ఒక కారకం అవ్వబోతుంది అని అనుకుందామా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చిన తెలుగు నైనా చదవగలిగే శక్తి మునుముందు మన పిల్లలకు ఉంటుందా  అనేదే ఒక పెద్ద ప్రశ్న!
    ఆ రోజుల్లో మనము మన తర్వాతి రెండు మూడు తరం వాళ్లమంతా ఇప్పటివరకు తెలుగు భాషలో ఇంతో అంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇప్పుడు రచనలు చేయగలుగుతున్నాం. ఇది ఎన్నటికీ మరవద్దు!
 తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ కి పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే, ఇంగ్లీష్ అర్థం అయ్యే వాళ్లే వస్తారా? చదివిన శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే ఉండవచ్చు, మెడిసిన్స్ ఇవ్వవచ్చు, ఆపరేషన్స్ చేయవచ్చు కానీ రోగి బంధుమిత్రులతో , అయిన వాళ్లతో దగ్గర వాళ్లతో అనునయించి మాట్లాడడానికి వాళ్లదైన భాష తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అనునయిస్తే ఆ భయం పోతుంది ,  కొంత ఊరట చెందుతారు. ఒక లాయర్ వాదోపవాదనలు అయిపోయిన తర్వాత గెలుపు ఓటముల సందర్భంలో  తెలుగు వాళ్లతో తెలుగులో మాట్లాడితే తొందరగా అర్థం అవుతుంది,  బాగుంటుంది కదా!  ఒక పోలీసు, ఒక బ్యాంకు ఎంప్లాయ్, వ్యాపారస్తులు, విద్యావేత్తలు అందరూ ఎవ్వరైనా తెలుగు ప్రాంతంలో ఉన్నంతవరకు తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రజలు  ఆనందిస్తారు. ఈ సాన్నిహిత్యానికి వారధి తెలుగు వాళ్ళకి తెలుగు భాష నే!  ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇది సత్య దూరం కాదు!!
“విద్య యశస్సు ,భోగ కరి, విద్య గురుండు విదేశీ బంధుడు…” కదా! “చదవని వాడజ్ఞుండు..” కదా! మరి…”తేనె జుంటియల తెలుగు …” మన పిల్లలకు రావద్దా? రావాలి! ఎట్లా? మనోవికాసానికి చైతన్యానికి మనదైన మాతృ భాష వచ్చుండాలి కదా! మరి ఏం చేద్దాం ఎట్లా??
     ఇప్పుడు కవులకు రచయితలకు ఇది ఒక పెద్ద సవాల్ గా పరిణమించింది. మరి ఏం చేద్దాం? ఏదో కొంత కృషి చేయవలసిందే! ఏవో కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే!! ఇళ్లల్లో కొడుకు లు కూతుళ్లు తెలుగు పుస్తకాన్ని పట్టుకోవడం లేదు మనం రాసిన మన కవితల పుస్తకాలు మన రచనలు ఒక్క పేజీ కూడా చదవలేరు. ఈ దుస్థితి దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉన్నది. ఈ సమస్యని ఎదుర్కోవాలంటే కొంత సమయం మనంది కావాలి కొంత సహనాన్ని  వెచ్చించాలి.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఓపిక తెచ్చుకుని తెలుగును చదివే లాగా నచ్చ చెప్పాలి.  బ్రతిమిలాడి తెలుగును వినేలాగా తెలుగు చూసేలాగా ప్రయత్నించాలి.
అయితే ఇలా ఎంత చేసినా బడిలోంచి వచ్చే తెలివితేటలు వేరు! ఒక్క కొడుకునో ఒక్క కూతురునో కూర్చోపెట్టి  పాఠం చెప్పుకోలేని, తెలుగు ను నేర్పించలేని చదువును 50 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ అవలీలగా నేర్పగలరు. ఈ క్రమశిక్షణ, ఈ భయమూ బడి వాతావరణం లో ఉంటుంది. కాబట్టి, ఈ నిజాన్ని అందరూ ఒప్పుకొని పాఠశాల చదువులో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పకుండా ఉండేలా  ఉద్యమం చేయాలని కంకణం కట్టుకొని కవులందరూ బయలుదేరాలి. పోరాటాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రక్తం మనలో ప్రవహిస్తున్నది. మన తాత ముత్తాతల పౌరుషం మనకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. ఇది నిజం కాదంటారా?

You may also like

3 comments

Xavier2380 July 29, 2025 - 8:49 am Reply
Aaliyah3063 July 29, 2025 - 10:41 am Reply
Albert1240 July 30, 2025 - 1:31 pm Reply

Leave a Reply to Aaliyah3063 Cancel Reply