Home ఇంద్రధనుస్సు జవసత్వాలు కోరుతున్న చెరియాల్ (చేర్యాల ) చిత్రలేఖనం

జవసత్వాలు కోరుతున్న చెరియాల్ (చేర్యాల ) చిత్రలేఖనం

by Radhika Suri

తెలంగాణకు చెందిన జానపద కళారూపాయల్లో ఒకటి ఈ చెరియాల్ చిత్రలేఖనం.వరంగల్ జిల్లాలోని ‘చేర్యాల’ ప్రాంతంలో పురుడు పోసుకుందీకళ . దీనినే ‘నకాశి ‘కళ అని కూడా పిలుస్తారు.

పురానేతిహాసాలను కథాంశాలుగా తీసుకొని అల్లిక రూపంలో జానపద సాంప్రదాయ రీతుల్లో రూపొందిస్తారు. గతంలో ఆసియా ఖండపు సాంప్రదాయకళా రూపాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొంది భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ’ ఇప్పుడు చేర్యాల’ ప్రాంతంలో మాత్రమే కొంత మనుగడలో ఉంది. .

గతంలో ఫిల్మ్ లేదా కామిక్ స్ట్రిప్స్ లలా ఉండేవి .పురానేతిహాసాలు, స్థానిక అంశాలే ప్రధాన కథా వస్తువులుగా చేసుకొని కథలు అల్లుతారు. ఈ కళారూపానికి శాసనాధారాలు కూడా ఉన్నట్లు దాఖలాలు కనిపిస్తాయి. కొందరు కళాకారులు ఇప్పటికీ ఈ వృత్తినే కొనసాగిస్తున్నారు.

ఈచిత్రాలలో బ్యాక్ గ్ర్రౌండ్ గా ఎరుపు రంగును వాడుతారు . గతంలో ఈ సాంప్రదాయ చిత్రపటాల తయారీలో సహజ రంగుల కోసం తెలుపు రంగును సముద్రపు గవ్వల నుండి , దీపపు మసి నుండి నలుపును, స్వచ్ఛమైన పసుపు నుండి పసుపు రంగును సేకరించి ఇలా సహజ రంగులనే వాడేవారు. నేడు ఆ రంగుల వాడకం తగ్గించి సింథటిక్ కాన్వాస్ పై కృత్రిమ రంగుల మేళవింపులతో చిత్రిస్తున్నారు. ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశం మాత్రం స్థానిక కథలు , వీర గాథలు వారివారి సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ప్రదర్శింపబడేవే.

ఈ కళ స్థానిక కథాంశాల్ని ప్రభావితం చేసేదిగా ప్రసిద్ధిగాంచింది .ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భిన్నమైన శైలుల్ని ప్రతిబింబించేలా పట చిత్రాలు ప్రదర్శిస్తారు .ఆధునిక సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా, కంప్యూటర్, సినిమా రంగాలు ముందంజలో ఉండడంతో ఈ
నకాశి కళ దాదాపుగా అంతరించిపోయిందనే చెప్పాలి. భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతానికే పరిమితమైపోయింది దాంతో ‘చేర్యాల (స్క్రో ల్స్ ) చిత్రపటాలు ‘అనే పేరుతో మాత్రమే మనుగడలో ఉంది.
స్థానిక వృత్తుల నేపథ్యంతోనే ప్రదర్శించేవారు. ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా చేసుకుని పూలు తీగలతో చిత్రిస్తారు. ఈ కళారూపానికి 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, హిందూ, జైన, బౌద్ధ గ్రంథాలలో సైతం ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయి.

ఈ నకాశి కళాకారులు సంచార జీవనం సాగిస్తూ ప్రదర్శించేవారు. ఈమధ్య కాలంలో పురాణాలలోని పొడవైన కథల్ని కుదించి చిత్రిస్తున్నారు. ( పోషకులు లేకపోవడమే ప్రధాన కారణం) చిన్నగా నిడివి తగ్గించి చిత్రించడంవల్ల వీటిని ఫ్రేములలో
భద్రపర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
ఈ నకాశి కళ చిత్రీకరణకోసం ఖాదీ కాన్వాసుకు ఆకృతినిచ్చి ప్రదర్శనకు సమాయత్తం చేయాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తుంది .పత్తి (దూది), బియ్యపు పిండి ,సుద్దమట్టి మిశ్రమాన్ని కలిపి, ఉడికించి చింతగింజల పేస్టు, జిగురు (బంక) కలిపిన మిశ్రమాన్ని మూడుసార్లు వరుసగా ఆరబెడుతూ అప్లై చేసిన పిదప కాన్వాస్ తయారవుతుంది. వీటికోసం వాడే బ్రష్ లకు’ ఉడుత’ల వెంట్రుకలను వాడుతారు బొమ్మలను కొబ్బరి చిప్పలు ,రంపకు చెక్క పొడి, చింతపండు పేస్టుతో తయారు చేస్తారు .కళాకారులు తమతమ నైపుణ్యాల్ని జోడించి చక్కని రూపాన్నిస్తారు. ఈ కళాకారులు రూపొందించిన పెయింటింగ్స్ లోని అంశాలు స్థానిక కథాంశాలు కాబట్టి గ్రామీణ జీవన విధానం ,పండుగలు, పంటచేలు, శ్రామిక జీవన సౌందర్యానికి నృత్య, గీతాలు జోడించి హృద్యంగా చిత్రిస్తారు. చాలా సులభంగా అర్థమౌతాయి కూడా.

మూడు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో బొమ్మలు గీస్తారు. స్ట్రోల్స్ లో నలభై నుండి యాభై ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ప్యానెల్లో ఒక కథాంశంతో కొంత భాగపు వర్ణన ఉంటుంది .ఆర్యుల రాకకు పూర్వం నుండి ఉన్న తొలి చిత్రలేఖన కళారూపాలలో ఒకటి ఈ ‘నకాశి ‘కళారూపం అంటూ స్మితా గుప్తా తన ‘ఇండియన్ ఫోక్ అండ్ ట్రైబల్ పెయింట్స్ ‘ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

కీ. శే. డా. కొండపల్లి శేషగిరిరావు గారు1954 లోనే ఈ కళారూపాన్ని వెలుగులోనికి తెచ్చారు. స్థానిక కళాకారులను హైదరాబాదుకు తీసుకుని వచ్చి పరిచయం చేసారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ( శ్రీ పొట్టిశ్రీరాములు) తెలుగు విశ్వవిద్యాలయం లో ఈ నకాశి కళపై పత్ర సమర్పణ
కూడా చేసారు.

‘ Heart For Art’ అనే యన్. జి. ఓ. సంస్థ సహకారంతో గోవాలో చెరియాల్ చిత్రలేఖన కళపై నిర్వహించిన వర్క్ షాప్ లో , రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలైన డి నాగేశ్వర్ పద్మ దంపతుల కుమారుడు డి .సాయి కిరణ్ వర్మ మాట్లాడుతూ తాను తల్లిదండ్రుల వద్ద కులవిద్యను అభ్యసించానని , మేము కేవలం చిత్రకారులం మాత్రమే కానీ స్ట్రోల్ అంటే పాట చిత్రించేటప్పుడు ఇతరుల మార్గ నిర్దేశకత్వంలో పనిచేస్తామంటూ వివరించారు.

1976లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరియాల్ పెయింటింగ్ ను హస్తకళగా గుర్తించగా, 2008లో మేధాసంపత్తి హక్కుల రక్షణ హోదా కల్పించింది.
2016లో లండన్ లోని యస్. ఓ. ఏ. యస్. విశ్వవిద్యాలయం నుండి చెరియాల్ కళపై డాక్టరేట్ చేసిన అనాయిస్ ‘డాక్టర్ ఫోన్సెకా’ మాట్లాడుతూ ఈ కళారూపం అంతరించిపోకుండా ఉండాలంటే ‘సాంస్కృతిక వారసత్వం’ అవసరమంటూ పేర్కొన్నారు.

దాదాపుగా అంతరించిపోయిన ఈ నకాశి కళారూపానికి జవసత్వాలు నింపాలనే తాపత్రయంతో ఇంకా కొన్ని నకాశి కుటుంబాలు (ముఖ్యంగా వనజ, గణేష్ దంపతులు)శ్రమిస్తున్నాయి. వివిధ వర్క్ షాప్ లలో పాల్గొంటూ ఈ కళపై అవగాహన కల్పించే పనిలో ఉన్నాయి.
ఆధునిక యుగంలో కంప్యూటర్, మీడియా కారణంగా ఆదరణ కరువైంది . అంతరించిపోతున్నఈ కళారూపాన్ని ఆదరించాల్సింది ప్రభుత్వాలే .వివిధ ప్రదర్శనలు నిర్వహించడం, కళారూపాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రోత్సహిస్తే ఈ తెలంగాణ వారసత్వ కళాసంపద మరింత మెరుగై, ప్రపంచానికి చేరువై పది కాలాలపాటు మనగలుగుతుందని ఆశిద్దాం.

You may also like

7 comments

Logan1109 November 25, 2025 - 10:29 am Reply
Dina510 November 25, 2025 - 11:42 pm Reply
Morgan1201 November 26, 2025 - 5:53 am Reply
Horace1623 November 26, 2025 - 4:51 pm Reply
Patricia4187 November 26, 2025 - 7:03 pm Reply
Raymond4091 November 27, 2025 - 1:55 am Reply
Christine4181 November 27, 2025 - 6:52 am Reply

Leave a Reply to Patricia4187 Cancel Reply