Home వ్యాసాలు పత్రిక పాతదైనా- సంపాదకీయం కొత్తది

పత్రిక పాతదైనా- సంపాదకీయం కొత్తది

మహిళా పత్రిక సంపాదకులు 100 సంవత్సరాల క్రితమే వారి పత్రిక లో ఏంచెప్పాలనుకుంటున్నారో ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా వారు లేవనెత్త బోయే సమస్య గురించిన చక్కని అవగాహన ఉందనడానికి నిదర్శనము అప్పటి సావిత్రి పత్రిక.
1904 లో స్థాపించిన ఈ పత్రిక విదుషీమణి శ్రీమతి పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు, సంపాదకురాలు.
స్వాతంత్ర్యం రాక మునుపు మహిళల పరిస్థితి చాలా దుర్భరంగాను, అధ్వాన్నంగా ఉండేది. అయితే వారికి తమ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చాలామందికి తెలియకపోయేది.చదువులేకపోవడం ఒకటైతే, ఇంట్లోనూ- దేశంలోనూ స్వతంత్రత లేకపోవడం మరో కారణం. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే ఆయా కష్టాలు ఆ బాధలు తమకు వచ్చిన సమస్యలుగా గుర్తించక, నిశ్శబ్దంగా జీవితంలో ఒక అవీ భాగం అనుకొని, అవన్నీ భరించాలి కాబోలు అనుకునే అమాయకులే ఆనాడు ఎక్కువ!
అటువంటి ఆడవారి బాధలు చూడలేక, వారిలో ధైర్యాన్ని పెంచాలని, చైతన్యం తీసుకురావాలని, భాషా -సాహిత్యాల పట్ల వారికి అభిరుచి ఏర్పరిచి, వాటి ద్వారా జీవితమంటే ఇది కాదు! మరోలా ఉంటుందనీ, ఉండేలా ప్రయత్నించాలని ఎరుక కలిగిస్తూ, వారి అస్తిత్వ ఆత్మ గౌరవం నిలుపుకొనే దిశగా ఈ పత్రిక నిర్వహించబడింది.
ఎందుకంటే మహమ్మదీయుల పాలనలో ఉర్దూ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. తెలుగులో ఏ రచనా ప్రక్రియనైనా వస్తే పాలకుల( నైజాము) ఆక్షేపణలకు గురయ్యేవి.
తెలంగాణ నడిబొడ్డులో ప్రజల భాషను ఆక్షేపించడం,మగవారిని కూడా ఆఫీసులకు వారు కట్టుకునే పద్ధతిలోనే వస్త్రధారణ ఉండాలని షరతు పెట్టడం ఇవన్నీ భరించలేక,మహిళలుగా తమకంటూ ఒక పత్రిక ఉండాలని, దాని ద్వారా తమ మనోభావాలు సమాజానికి ఎరుక చేయాలని,
సావిత్రి పత్రిక యజమానురాలు, సంపాదకురాలు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారు మహిళల కంటూ ఒక పత్రిక ఉండాలని భావించారు.
మగవారు స్వేచ్ఛగా పత్రికలకు ఉత్తరాలు రాసుకుంటారు. అదే వారికి చెందిన మహిళలు మాత్రం వారి మనోభావాలు ఎందుకు తెలుపుకోకూడదు? అని గృహిణులుగా ఉన్న ఉద్యోగస్తులైన వారిని రచించమని ప్రోత్సహించేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభవించే కొందరికే తెలుస్తాయి! మరికొన్ని విషయాలు మరికొందరికి తెలుసు… ఇలా వారు- వీరు; వారికి తెలిసిన విషయాలను తెలిపినా మహిళలకు అన్ని విషయాలు తెలుసే అవకాశముంటుంది అనేది ఆమె ఆంతర్యం. అదే ఆమె పత్రికను స్థాపించడానికి కారణం అని కూడా చెప్పారు.
ఆమె ఎందరో రచయిత్రుల రచనలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. 1904లో తాను స్వయంగా ఎన్నో రచించి, తమ పత్రికలో ప్రచురించారు. అలా అని కేవలం మహిళల రచనలే కాదు! మగవారి రచనలు కూడా తమ పత్రికలో అచ్చు వేశారు. కాకపోతే ఈ పత్రికలో ఎక్కువ పాతివ్రత్యం గురించే ఎక్కువ రచనలు వచ్చాయి. ఈ పాతివ్రత్య ప్రబోధాలు పద్య రూపకంగా ఉండేవి.
నీతి పదములు –ఏప్రిల్ 1904;
సత్య ధర్మములు ఫిబ్రవరి ఏప్రిల్ 1904 ;
స్త్రీ నీతి దీపిక 1904 ఆగస్టు;
స్త్రీ నీతి గీతముల ఫిబ్రవరి 1904;
నీతి పదములు ఫిబ్రవరి ,మార్చి, ఏప్రిల్ 1912. ఇలా ఎన్నో రచనలు చేయగా వాటిని తమ పత్రిక లో ముద్రించారు.
ఈ రచనలు స్త్రీలకు సత్యధర్మం చాటు చెప్పాయి.
సంపాదకూరాలి దృష్టిలో స్త్రీ విద్యావంతురాలైతే ఆకుటుంబం అందరూ నీతినియమాలతో ఒక కట్టుబాటులో నడుస్తారని అనుకుని, ఆమె మంచి సంపాదకీయాలు రాసేవారు.
అలాగే ఇంటి పనులు కూడా తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారని, అలానే పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలంటే మహిళలు చదువుకోవాలని,తెలుపుతూ… కాలాన్ని వృధా చేసుకోవద్దని, ఉబుసుకుపోక మాటలు, ఇల్లామల్లి ముచ్చట్లు మాట్లాడవద్దని రాసేవారు.
ఈ పత్రికలో స్త్రీ విద్యా పంచరత్నాలు 1910లో ఉప్పల నరసమాంబ, ర్యాలీ జానకీరామాయమ్మ,ఆత్మూరి అన్నపూర్ణమ్మ,మొదలైన రచయిత్రులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ…. వనితలు చదువుకోవాలని తమకు తెలిసినవి రాసి పత్రికలకు పంపాలని కోరుతూ సంపాదకీయం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయము.
అంతేకాదు స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన కూడా బాగుండాలని అప్పుడే స్త్రీ తన విద్యతో వచ్చిన ఆలోచనలతో చక్కని ప్రణాళికలతో ఆ కుటుంబాలు రాణిస్తాయని, అలా పురుషులు సకల సద్గుణాలు ఆచరిస్తూ, వారింటి మహిళలు ఆచరించాలని విన్నపము అనే శీర్షికతో సెప్టంబర్ (1910) లో రాసారు.
ఆ కాలంలోనే ఆడవారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని దామెర్ల సీతమ్మ అన్నారు.
బొంబాయిలో ఇలా చదివి ఉద్యోగం చేస్తున్న వారెందరో ఉన్నారని, రఖమాబాయి, డాక్టర్ కృష్ణాబాయి,డాక్టర్ కమలాకర్ బాయి, మొదలైన ఎందరో మహిళలు బాగా చదువుకొని ఇటు ఉద్యమం చేస్తూనే, అటు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని రాసారు.
ముఖ్యంగా వితంతువులు చదువుకుంటే వారు ఎలా జీవించాలో తెలుసుకొని,తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే, సమాజానికి కూడా అసరాగా నిలబడతారని రాసారు.
కొందరుకుని అపవాదులేసినట్టు చదువుకున్న మహిళలు వారి ఇష్టా రాజ్యంగా ప్రవర్తించి చెడునడ త అలవర్చుకుంటున్నారనేది అబద్ధమని చెప్పింది. అలా అన్నప్పుడు మగవారు మాత్రం చదువుకొని ఉద్యోగం చేయడం లేదా? వాళ్ళు దుర్మార్గులు అయినారా? అని సమాజాన్ని ప్రశ్నించింది.
ప్రవర్తన అనేది వారి గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కానీ, చదువుకోవడం వల్ల చెడిపోయారని అనడం మూర్ఖత్వం అని రాసింది. ఇంకా చదువుకుంటే సంస్కారం అబ్బి సూఖశాంతులు నెలకొంటాయని రాసారు.
అలా అంటే మనం విదుషీమణులుగా చెప్పుకుంటున్న వారు గానీ, పురాణ స్త్రీలు కానీ పాతివ్రత్యాన్ని పాటించింది బాగా చదువుకోవడం వల్లనే కానీ… మరో విధంగా కాదు!
మైత్రేయి, సులభ మొదలైన వారంతా చదువుకోవడం వల్ల బ్రహ్మజ్ఞానం పొందగలిగారని, వాళ్ల కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని, కాబట్టి మంచి విద్య వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, శ్రీమతి పులిగుర్తి లక్ష్మీ నరసమాంబగారు తన సంపాదకీయంలో వివరించారు. ఆమె దార్శనికత కలిగిన మహిళ.ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఆలోచించి పరిస్థితులను ముటదే పసికట్టి, ముందే హెచ్చరికలు చేసేవారు.
ఎన్నో అభ్యుదయ భావాలతో నిర్వహించిన ఈ పత్రిక మీద కొన్ని అపవాదులొచ్చాయి. బాల్యవివాహాలను వ్యతిరేకించిందీ పత్రిక. అంతే కాదు ఎన్నో సమావేశాలలో ఆ బాల్య విహాలు చేస్తే వచ్చే సమస్యల మీద ప్రసంగించింది.
స్త్రీల కోసం గ్రంథాలయాలు ఏర్పరచి, వితంతువులకు ఆసరాగా నిలిచింది. ఇలా తన పత్రిక ద్వారా మహిళలకు సహాయ సహకారాలు అందించమని 1911 లోనే కోరిందంటే ఎంత ముందు చూపు ఉన్న పత్రికాధిపతో కదా?
1910 స్త్రీల సనాతన మండలి గుంటూరులో మొదటి మహిళా సభ రాష్ట్రస్థాయిలో జరిగింది. విద్యార్థిని సమాజం ఆధ్వర్యంలో రెండవ సభ జరిగింది. ఈ సందర్భాన్ని గురించి తన పత్రికలో పులుగుర్తి నరసమాంబ
ఆంధ్ర మహిళ కార్యదర్శిని పేరుతోఎనిమిది పేజీలలో సంపాదకీయం వివరించింది.
చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా వారందరినీ ఆ సభకు ఆహ్వానించింది. ఇందులో విద్య గురించి చర్చించడానికి ఒక సభ, సమాజంలోని లోటుపాట్లు గురించి మాట్లాడడానికి ఒక సభ, ఇంటికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి మరోసభలు ఉపశీర్షికలు పెట్టి ఇరవైరెండు రకాలైన సమస్యలను చర్చించారు.
చర్చలలో ఒకరి మధ్య మరొకరికి బేధాభిప్రాయాలు వచ్చి కొంతకాలం పత్రిక నిలిచిపోయినా మహిళల గురించి మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది మాత్రం 1904 లోనే… ఆ నాటి నుండే మొదలైంది ఈ పరంపర.
పందిటి వీర రాఘవమ్మ గారు ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించి, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారి అధ్యక్షతన అత్యద్భుతంగా తన ప్రతిభా పాటవాలతో మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేసింది.
అలా చైతన్య వంతులైన మహిళలు, స్వాతంత్య్రం కోసం ప్రజలను మేలుకొలిపారు.
ఇవాళ మనం రాజకీయ,ఆర్థిక, సాంకేతిక,నిర్వహణలలో ఇలా నిలదొక్కుకొని రాణించడానికి ఆనాటి నరసమాంబ వంటి మహిళల ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతోఉంది.
ఎందుకంటే గృహహింస ఎంత ఉన్నా ఇదిలానే ఉంటుందని, దాన్ని భరించాలకునే మనస్తత్త్వం నుండి ఎదురించి, ఆత్మాభిమానంతో బతకాలని నేర్పిన ఆనాటి పత్రికలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండానే నడిపారు.
మరో కారణం రవాణా సౌకర్యాల వసతి అంతగా లేక ఒక విషయం సామాన్యులకు చేరడం వ్యక్తిగతంగా సభలు ఏర్పాటు చేసి, ప్రసంగాల వల్ల కష్టమైయ్యేది. ఆర్థిక వనరులు అడ్డు తగిలేవి. తమకంటూ ఆదాయంలేని మహిళలకు సభా నిర్వహణ తలకు మించిన భారమయ్యేది.
పత్రికలైతే ఇంటింటా చేరి, విషయం అందరికీ చేరుతుందని ఆలోచన చేయడం మరో కోణం.
ఏదేతైనేమి ? సామాజిక స్పృహ ఉండి, అణచబడిన మహిళలలు తలెత్తుకుని జీవించాలన్న వారి ధ్యేయానికి, పత్రిక ప్రజలకూ – ప్రభుత్వానికి నడుమ వంతెనవలె పనిచేయాలనే ఆశయంతో… శాంతి సుస్థిర సమాజాన్ని కాంక్షించే పత్రికలకెప్పటికైనా ఋణపడే ఉంటాం! ఆ నారీ మణులందరికీ
నమోవాకములర్పిస్తూ…

You may also like

4 comments

Kane2176 May 29, 2025 - 9:37 am Reply
Ricky3533 May 29, 2025 - 7:38 pm Reply
Ronald3165 May 30, 2025 - 11:44 am Reply
Gracie1943 May 30, 2025 - 7:24 pm Reply

Leave a Comment