Home బాల‌సాహిత్యం బాలసాహిత్యం- వర్తమానం, భవిషత్తు

బాలసాహిత్యం- వర్తమానం, భవిషత్తు

by Bandi Usha

            పెద్దల సాహిత్యం కన్నా బాల సాహిత్యం ఎన్నో రెట్లు ముఖ్యం.  పిల్లల అవగాహన, ఆలోచన, భాష, పెద్దల అవగాహన, ఆలోచన, భాష వేరుగా ఉంటాయి. పిల్లల మెదడు వికసించే దశలో విలువలు, భాష, సాధించాýన్న తపన ఒకసారి ముద్ర పడితే జీవితాంతం ఉంటుంది. 

            ఉత్తమ సాహిత్యం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ మార్చే శక్తి బాల సాహిత్యానికి ఉంది. ప్రశ్నించడం సాహిత్యం ద్వారా అలవడుతుంది.

            మనం ఇల్లు కట్టేటప్పుడు పునాదిపై ఎంత శ్రద్ధ పెడతామో బాల సాహిత్యంపై అంతే శ్రద్ధ పెట్టాలి.  పిల్లల కోసం రాయడం అంటే భవిష్యత్తు కోసం రాయటమే.

            బాల సాహత్యం పిల్లల వయసుకు తగినట్లు ఉండాలి.  మరీ చిన్న పిల్లలకు అమ్మ పాడే జోలపాట నుండి బొమ్మలతో కూడిన పదాలు, శబ్దాలు, ఒకటి రెండు వాక్యాలు ఉండాలి –

            ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు తమాషాగా, సాహసంగా, స్నేహితులతో కూడిన బాల సాహిత్యం ఉండాలి.

            పది నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు సమస్యలు పరిష్కారం ఉంటే ఇష్టపడతారు. ఇవి ఏ ప్రక్రియలోనైనా ఈ లక్షణాలతో ఉండాలి.

            చిన్న పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వారికి అర్ధమయ్యే భాషలో రాసిన రచనలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించడం, సంస్కృతిని నేర్పడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి.

            కథలు, గేయాలు,  నీతి కథలు, పిట్ట కథలు, పద్యాలు, చిన్నచిన్న వాటికలు, నవలలు బాల సాహత్యంలో భాగమే.

            పిల్లల మానసిక స్థాయి, వయసుకు తగినట్లుగా కథలు, గేయాలు, పద్యాలు మొదలగు వాటిలో సరళత, వాక్యాలు చిన్నవిగా, కుతూహలం, ఊహాశక్తి పెంచే విధంగా, ఆనందంగా, భయపడకుండా, దృశ్యాత్మకంగా, పెద్ద అక్షరాలతో స్ఫూర్తిదాయకంగా, కల్పనాశక్తిని పెంపొందించేవిధంగా, నీతివంతంగా ఉన్నప్పుడే వారిలో నైతిక విలువలు, భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి.

            బాల సాహత్యం కొత్తగా ప్రారంభమైనది ఏమీ కాదు. 17వ శతాబ్దంలో మొట్టమొదటి బాలల పుస్తకం లాటిన్ భాషలో వచ్చింది.

            తెలుగులో బాల సాహత్యం మౌఖికంగా వేల సంవత్సరాల నుండే అమ్మమ్మ కథలు, జానపద గేయాలు, పంచతంత్ర కథలు చెప్పేవారు. అవి రాతలలో లేవు.

            ప్రత్యేకముగా బాల సాహిత్యము అని లేకపోయినప్పటికీ బసవ పురాణములో బాల్యము వర్ణనను బాల సాహిత్యముగా చెప్పవచ్చును. నాచన సోమనాధుడు, శ్రీనాధుడు తమ రచనలలో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు.

            సుమతీ, వేమన శతకాలలో కూడా బాల్యపు ఛాయలు కనిపిస్తాయి. మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలలో బాల సాహిత్యం కనిపిస్తుంది.

            19వ శతాబ్దం నుండి తెలుగులో పిల్లల కోసం నీతి కథలు, వర్ణమాల, బాలశిక్ష లాంటివి ముద్రించారు.

            ఆధునిక బాలసాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు ఈ కోవకు చెందినవే.  బాల సాహత్య పురోగతి ప్రారంభమైంది. బాల సాహిత్యంలో ఎన్నెన్నో  మార్పులు సంతరించుకున్నాయి.  గేయ, పద్య, గద్య, కథల, నాటికల, నవలల రూపంలో బాల సాహత్యం కనిపిస్తుంది.

            చిన్నయసూరి నీతిచంద్రికలో కథలుగా, కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం, పార్వతీశ కవులు బాల సాహిత్యాన్ని రచించారు.  ఆధునిక కాలంలో మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలగు కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.

            అన్నమయ్య రచించిన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘చందమామ రావే’ వంటి లాలి పాటలు ఇప్పటికీ పిల్లలను ఆనంద పారవశ్యంలో ముంచుతూనే ఉన్నాయి.

            పెద్దల కోసం పరుగెత్తిన కలం పిల్లలకూ జోల పాట పాడింది.  ఆ కలం, గళం తెలంగాణ బాలగేయాల చక్రవర్తి  దాశరధి కృష్ణమాచార్య గారిది. తెలంగాణా మాండలికంలో పాపాయి పాటలు తేలికైన పదాలతో, లయతో ఊయల పాటలుగా మారాయి.

            దాశరథి గేయాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

            19వ శతాబ్దం నుంచి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న బాలసాహత్యం మరిన్ని ప్రక్రియలతో ముందుకు వచ్చింది.  ఒకప్పుడు ఒకప్పుడు ‘అనగనగా…’ అంటూ కథలు వచ్చేవి. పంచతంత్ర కథలు, నీతి కథలు ఉండేవి.  ప్రస్తుతం స్కూలు, స్నేహాలు, పర్యావరణం, గ్రహాలు, మొబైల్ గురించిన కథలు వస్తున్నాయి.  వాడుక భాషలో తేలికగా పిల్లలకు అర్ధమయ్యే విధంగా,  ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా, నవ్వించే విధంగా ఉంటున్నాయి.

             ప్రపంచమే కుగ్రామంగా మారటంతో సాహిత్యం బాగుంటే క్షణాల్లో  వైరల్ అవుతుంది.  అనువాద సాహిత్యం విస్తరిస్తోంది.  ఏఐ ద్వారా సాహిత్యం అందుతోంది.  బాల సాహిత్యం మరింత పెరిగింది. కానీ ఫోనుకు అప్‌డేట్ అయ్యింది.

            బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం నుండి, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, బోయ జంగయ్య, వాసాల నరసయ్య వంటి ప్రముఖుల వరకూ పిల్లలకోసం ఎన్నో నీతిదాయకమైన కథలు, గేయాలు అందించారు. పిల్లలు వాటిని ఇప్పటికీ ఇష్టపడుతున్నారు.

            నాటి నుండి నేటివరకు ఎందరో బాల సాహితీవేత్తలు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోను పిల్లలకోసం తెలుగులో రాశారు. రాస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం రేఖామాత్రంగా కొందరు తెలంగాణ బాల సాహితీవేత్తల గురించి తెలుసుకుందాం.

            ఉభయ తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తల దిక్సూచి, తెలంగాణ సారస్వత పరిషత్‌లో బాల సాహిత్యం కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్న కవి, నిగర్వి, నిరాడంబరుడు గరిపల్లి అశోక్ గారు.  చదువుతున్న కాలం నుండే సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తెచ్చి, తదుపరి కాలంలో బాల సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు రాయటమే కాదు, విద్యార్థులతో రాయించారు.  ‘కీర్తి’ పురస్కారంతో సహా ఎన్నో అవార్డులు పొందారు.  బాల సాహిత్యం కోసం ఎన్నో కార్యశాలల నిర్వహించారు.  వీరి కథలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. వీరి సేవలను గుర్తించి తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులుగా నియమించారు.

            సంగనభట్ల చిన్న కృష్ణయ్య, పుప్పాల కృష్ణమూర్తి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వడ్డేపల్లి వెంకటేష్, డాక్టర్ అమరవాది నీరజ,   ముక్కామల జనకీరామ్, ఉండ్రాళ్ళ రాజేశం, బైతి దుర్గయ్య, బూర్ల  నటేశ్వరరావు, డాక్టర్ వి.ఆర్. శర్మ, డాక్టర్ సమ్మెట విజయ,  సమ్మెట ఉమాదేవి, సిద్ధాంతం ప్రభాకరాచార్యులు, కన్నెగంటి వెంకటయ్య, యడవల్లి శైలజ,  వురిమళ్ల సునంద, ఎస్‌కె షఫీ,    పోతగాని సత్యనారాయణ, డాక్టర్ సిరి, కందుకూరి భాస్కర్,  దేశముఖ్ ప్రవీణ్ శర్మ, డాక్టర్ కాసర్ల స్వర్ణ మమత, అమ్మిన శ్రీనివాస రాజు, మీసాల సుధాకర్, డాక్టర్ యు. పద్మ, కొమ్మవరపు కృష్ణయ్య, డాక్టర్ సాగర్ల సత్తయ్య, అంజన్‌రెడ్డి, కాల్వ రాజయ్య, నిర్మల, ఈ వ్యాస రచయిత్రి బండి ఉష వీరంతా పిల్లల కోసం సాహిత్యాన్ని అద్భుతంగా సృజిస్తున్నవారే. కొందరు పిల్లలను కాదుకాదు దాదాపుగా పిల్లలను ప్రోత్సహిస్తూ అనేక సంకలనాలు తీసుకొచ్చినవారే. 

            తెలంగాణలో ఇంకా ఎందరో బాల సాహితీవేత్తలు ఉన్నారు,  ముందు ముందు నా విస్తృత వ్యాసంలో బాల సాహితీ వేత్తలు ఎక్కడ ఉన్నా అందరి గురించి రాసే ప్రయత్నం చేస్తాను.  చివరగా డాక్టర్  పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత.  బాలల తాతా బాపూజీ గేయ కథకు ఈ అవార్డు పొందారు.

            ఆయన పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు.  ఇతర భాషల కథలను, పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగంలో సంపాదకులుగా పనిచేశారు.  ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన చేసిన అనువాద పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అవిష్కరించారు.  నేషనల్ బుక్ ట్రస్ట్ భారత ప్రభుత్వంలో దక్షిణ భారత ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

            వాసాల నరసయ్యగారు, డాక్టర్ భూపాల్ గారు, డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు తెలంగాణ బాల సాహితీవేత్తలు. వీరు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు అందుకున్నారు.

             పైడిమర్రి రామకృష్ణ, ముక్కామల జానకీరామ్, వాసరవేణి పర్శరాములు, భీంపలి శ్రీకాంత, సబ్బని సుమిత్రా దేవి ఇలా బాలసాహిత్యంలో ఎందరో ఆరితేలినవారు ఉన్నారు.

            రాబోయే నా విస్తృత వ్యాసంలో అందరినీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

            మొదటి బాలల పత్రిక 1923లో న్యాయపతి రాఘవరావు ప్రారంభించారు. 1947లో చందమామ వచ్చింది. తరువాత కాలంలో విస్తరించి బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నారి, బాలబాట వంటి పుస్తకాలతోపాటు వేదకుమార్ గారి బాల చెలిమి, వేదాంతం సూరి గారి మొలక, వివిధ పత్రికలలో, పేపర్లలో చిన్నారి సాహిత్యానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు.

            దాశరథి, సినారె గారు బాలల కోసం రాసిన గేయాలు ఇప్పటికీ నవనవోన్మేషంగానే ఉన్నాయి.  ఈ మధ్య కాలంలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ‘కొమ్మా ఉయ్యాల” పాట ప్రతి ఒక్కరి హృదయంలో చోటు చేసుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

            డిజిటల్ బూమ్ వచ్చింది.  కథ చెప్పవా అమ్మమ్మ లాంటివి పిల్లలు చూస్తున్నారు.  రేడియో, దూరదర్శన్‌లో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

బాలసాహిత్యం కోసం వివిధ కార్యక్రమాలు – పురస్కారాలు

            తెలంగాణ సాహిత్య అకాడెమీ 33 జిల్లాలలో 33 పుస్తకాలను ప్రచురించింది.

            తెలంగాణ సారస్వత పరిషత్ 11 పుస్తకాలను, వేదకుమార్ గారు 48 పుస్తకాలను ప్రచురించారు.

            2022 మార్చి 4న ఒకే సమయం, ఒకే అంశంపై ఐదు లక్షల మంది విద్యార్థులు రాశారు.

            2026 సంవత్సరంలో విద్యార్థులు 36 పుస్తకాలను రాశారు.

            పురస్కారాలు : బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే దిశగా అనేక మంది పురస్కారాలను అందిస్తున్నారు. చింతోజు బ్రహ్మయ్య డాక్టరు అమరవాది నీరజ గారు  సాహిత్య అకాడెమీ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి తండ్రి గారి పేరు మీదుగా పురస్కారం, వురిమళ్ల ఫౌండేషన్, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడెమీ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారాలు, డెందోట బాల సాహిత్య పీఠం వారి పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ ` తెలంగాణ శాఖ పురస్కారం అందిస్తున్నారు. సేవా దృక్పథంతో ఇంకా అనేక ప్రైవేట్, సాహిత్య సంస్థలు పురస్కారాలను అందజేస్తున్నాయి.

            ఎఐ బాగా విస్తరిస్తోంది. ఛాట్ జిపిటి, జెమిని అడిగినవన్నీ ఇస్తోంది. పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గుతుంది.  ప్రతి విద్యార్థి సాహిత్యాన్ని రాస్తాడు.  కానీ స్వయంగా కాదు. టెక్నాలజీని ఉపయోగించి.  ఆస్వాదించటం తగ్గిపోతుంది.

            చందమామ నుండి చంద్రయాన్ వరకు వచ్చాము కానీ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. దీనికి కారణం ఆంగ్ల మాధ్యమంలో బోధన.

            ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నాము.  ప్రణాళికల వద్దే ఆగిపోతుంది.  విద్యార్థులలో మానసిక వికాసము కలగాలంటే కొంత వరకు మాతృ భాషలో బోధన జరగాలి.  సాహిత్య సృజన పాఠ్యాంశంలో భాగము కావాలి.  పోటీలు నిర్వహించి వాటి ఆధారంగా ఉన్నత చదువులలో ప్రత్యేక అవకాశం కల్పించాలి.

            పిల్లలు పడుకొనే ముందు కథ వినేలా చేయాలి.  పిల్లల అభిరుచుల మేరకు సాహిత్య సృజన జరగాలి. అప్పుడే భాష బతుకుతుంది.  విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. రచయితలకు ప్రభుత్వ  ప్రోత్సాహం ఉండాలి.  అప్పుడే బాల సాహత్యం శాఖోపశాఖలుగా మరింత విస్తరిస్తుంది.

You may also like

Leave a Comment