Home కథలు మనకు మనమే……

మనకు మనమే……

by Madhavapeddi Usha

“అమ్మా అమ్మా” అంటూ రుసరుసలాడుతూ వచ్చింది రుక్కమ్మ.

“అదేంటి, ఈ రోజు హాట్ హాట్‌గా ఉన్నావు. ఏమైందేమిటి?” అన్నది కనకదుర్గ.

“అది కాదమ్మా, రోజురోజుకీ ఎండలు ముదురుతున్నాయి కదా. ఆ వసంతమ్మ పొద్దున్నుంచీ చాకిరీ చేస్తున్నాననైనా లేకుండా, పోనీ అన్నం పెట్టకపోతే మానే, ఇంత మజ్జిగ నీళ్లైనా పోయవచ్చు కదా… అదీ లేదమ్మా. మీ పెద్దోళ్లు హాయిగా నీడపట్టున కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటారు కదా. ఎండలో పడి నాలుగిళ్లల్లో కష్టం చేసుకు బ్రతికేటోళ్లం మా మీద కాసింత జాలి చూపించకపోతే ఎట్టాగమ్మా, నాకు తెలవక అడుగుతున్నా…!” అన్నది.

దాని ముఖంలో నిజంగానే ఉదయం నుంచి గొడ్డు చాకిరీ చేసిన అలసట ఉట్టిపడుతోంది. ఉన్న మాట చెప్పొద్దూ, దుర్గ కడుపు తరుక్కుపోయింది జాలితో!

వెంటనే “పోనీలే రుక్కమ్మా, మజ్జిగకేం భాగ్యం చెప్పు. నేనిస్తా” అంటూ అప్పటికప్పుడు పెరుగు కవ్వంతో చిలికి అందులో చిటికెడు ఉప్పు వేసి కలిపి ఇచ్చింది కనకదుర్గ. మజ్జిగ తాగిన రుక్కమ్మ కళ్లల్లో ఎనలేని ఆనందం, కృతజ్ఞత కనిపించాయి.

అప్పుడు ఆమె అన్నది కదా, “అమ్మా, ఇయ్యాలయితే నువ్వు ఇచ్చినావు. ఈ ఎండాకాలం ఇంకా రెండు నెలలుంటది, రోజూ ఎవురిస్తారమ్మా గిట్ల…!” అన్నది.

ఆ మాటలకు దాని మీద ప్రేమాభిమానాలు పొంగుకురాగా, “ఫరవాలేదు, ఈ రెండు నెలలూ నేను పోస్తాగా మజ్జిగ. నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నది భరోసా ఇస్తూ.

అది కూడా “నీ కడుపు చల్లగుండ, చాలా థాంక్స్ అమ్మా” అని సంతోషంగా వెళ్లిపోయింది.

ఆ తరువాత కనకదుర్గ కూడా భోజనం చేసి పడుకుంది రోజూలానే. పిల్లలు స్కూల్ నుంచి రావటానికి ఇంకా టైం ఉంది అనుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేసింది. కానీ ఆలోచనలు రుక్కమ్మ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి.

ఈ బడుగు వర్గాలు ఎంత అల్ప సంతోషులో కదా… పిచ్చిది, నేను రోజూ మజ్జిగ పోస్తాననే టప్పటికీ ఎంత సంతోషించింది…! ఒక్క మనిషికి మజ్జిగ పోయంగానే అయిపోయిందా? ఇలా ఎండలో పడి కాయకష్టం చేసుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు… వారందరికీ కూడా చేయగలిగితేనే మానవ జన్మకి సార్థకత! అందుకేగా ఎండాకాలంలో దారిన పోయే బాటసారుల కోసం చలివేంద్రాలూ అవీ వెలిసింది అనుకుంటుండగానే దుర్గకి మెరుపు లాంటి ఆలోచన తట్టింది.

అంతెందుకు, మన సొసైటీలోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండనక వాననక కాలనీ అంతా ఎప్పటికప్పుడు ఊడుస్తూ పరిసరాలను శుభ్రంగా స్పిక్ అండ్ స్పాన్‌గా ఉంచే ఊడ్చే ఆడవాళ్లు, సెక్యూరిటీ సిబ్బంది… వీళ్లందరికీ రోజూ 12 గంటలకు మజ్జిగ పోస్తేనో అన్న ఐడియా వచ్చింది.

వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. పాలవాడికి రేపటి నుంచి ఓ రెండు లీటర్ల పాలు ఎక్స్ట్రా పోయమని చెప్పింది. అంతే కాదు, సొసైటీలో ఊడ్చేవాళ్లకీ, సెక్యూరిటీ సిబ్బందికీ ఫోన్ చేసి చెప్పింది, రేపట్నుంచి 12 గంటలకు వచ్చి మజ్జిగ తీసుకుని వెళ్లమని.

ఇలా ఆ మజ్జిగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండగా ఆదివారం వచ్చింది.

ఆ రోజు కనకదుర్గ, కాలనీ పనివాళ్లకి మజ్జిగ ఇవ్వడం పిల్లలు ప్రశాంత్, ప్రత్యూష చూశారు. వాళ్ల లేత మనసులో ఓ చిన్న డౌట్… పదేళ్ల బాబు ప్రశాంత్ అడిగాడు తల్లిని.

“అమ్మా, పనివాళ్లకి రోజూ మజ్జిగ ఎందుకిస్తున్నావమ్మా?” అని అడిగాడు.

“ఎందుకంటే వాళ్లు కష్టపడి ఎండల్లో పనిచేస్తున్నారు కదా నాన్నా, అందుకని మనలాంటి వాళ్లం సహాయం చేయాలి నాన్నా” అన్నది.

“మరైతే వాళ్లు ఏమైనా మనకు పని చేస్తారా? మనం వాళ్లకి ఊరికే ఎందుకు చేయాలి… మనకీ డబ్బవుతుంది కదా” అని ఈ సారి ఏడేళ్ల పాప ప్రత్యూష అందుకుంది.

వాళ్లిద్దరి సునిశిత పరిశీలనా దృష్టికి అబ్బురపడి వాళ్లని అక్కున చేర్చుకుంటూ ఇలా అన్నది. “ఛ, తప్పు నాన్నా అలా అనకూడదు. మనం చేతనైనంత సాయం, అదే హెల్ప్, ఇతరులకి చేయాలి. మనకన్నా బీదవాళ్లకీ, పూర్ పీపుల్‌కి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు మనకి కూడా హెల్ప్ చేస్తాడు దేవుడు. తరువాత, మనం చేసే మంచి పనులకి ప్రతిఫలం అంటే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ మనకి ఒక శ్లోకం ద్వారా చెప్పారు” అన్నది.

“అదేం శ్లోకం అమ్మా, నాకు కూడా చెప్పవూ…?” అడిగాడు ప్రశాంత్.

ఆ శ్లోకం ఇదే నాన్నా –
*“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి.”_

అంటే, కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది, ఫలం మీద కాదు అని చెప్పారు. కాబట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం కర్మలు చేయాలి అని శ్రీ కృష్ణుడు మనకు బోధించాడు” అని చెప్పింది దుర్గ.

అప్పుడు బాబు అన్న మాటలు విన్న దుర్గ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంతకీ ప్రశాంత్ ఏమన్నాడంటే, “అయితే అమ్మా, బీదవాళ్లకు అన్నం పెట్టడం కూడా మంచిపనే కదమ్మా?”

“ఓ యస్, తప్పకుండా నాన్నా” అన్నది.

“అయితే మనం ఈ పనివాళ్లకి రోజూ అన్నం కూడా పెడదామా?” అన్నాడు సందేహిస్తూ.

దానికి బాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని ఇలా అంది, “శభాష్ నాన్నా, ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు… ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! అలాగే తప్పకుండా పెడదాం నాన్నా. కాకపోతే, రోజూ అందరికీ అన్నం పెట్టాలంటే ఖర్చు, సమయం రెండూ ఎక్కువ కావాలి కదా. అందుకే ఆదివారం ఆదివారం పెడదాం ఏం…!” అనంగానే పిల్లలిద్దరూ ‘యే’ అంటూ చప్పట్లు కొట్టారు ఆనందంగా!!!

You may also like

1 comment

Carrie333 May 26, 2026 - 12:51 pm Reply

Leave a Comment