Home వ్యాసాలు కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం.అరణ్య రోదన అంటే అరణ్యం యొక్క ఏడుపు లేదా ప్రకృతి విలాపం. అరణ్య రోదన అంటే – అడవిలో నిర్మానుష్యమైన చోట ఏడిస్తే ఆ ఏడుపును ఎవరు వినలేరు. ఇతరులెవరూ కూడా సహాయం చేయలేరు.ఈ నికృష్టమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,వాటి బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నదని కవి భావించడం జరిగింది.ప్రకృతిలోని ఆర్తనాదం. పచ్చని చెట్లను నరికి వేయడం, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడం వంటివి అరణ్యానికి నొప్పిని కలిగించి అది విలపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.అరణ్య రోదన అనేది మనుషుల నిర్లక్ష్యం,దోపిడీకి ప్రకృతి వ్యక్తం చేసే మౌన విలాపం. చెట్లను నరికి వేయడం వల్ల పక్షులు గూళ్లు కోల్పోతాయి.అడవులు నాశనం కావడం వల్ల జంతువులు ఆవాసం లేక వలస వెళ్లాలి.నదులు ఎండిపోవడం,వర్షపాతం తగ్గిపోవడం,భూక్షీణత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఈ కవితలో ప్రకృతి నాశనం పట్ల ఒక హెచ్చరికను అందించారు. అరణ్యంలో ఏడిస్తే వినే వారు ఎవ్వరూ లేని పరిస్థితి.కవి సామాజిక సమస్యలపై తన వేదనను వ్యక్తం చేసినా సమాజం వినకపోతే అది అరణ్య రోదనగా మిగిలిపోతుంది.అరణ్య రోదన ప్రకృతి రోదన కూడా.ప్రకృతి పట్ల మనిషి నిర్లక్ష్యం,సమాజం యొక్క నిర్లిప్తత,మనిషిలోని మౌనవేదన అన్నీ అరణ్య రోదన అనే పదబంధం చేత వ్యక్తం అవుతున్నాయి.అడవులు దయనీయమైన స్థితికి చేరినాయి.అటవీ శాఖ వారు చేష్టలుడిగిపోయి చూస్తున్నారు.అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.మానవుల మనుగడకు చెట్లు ప్రధానం.ప్రతి ఒక్కరు విరివిగా చెట్లను నాటాలి.అట్టి నాటిన చెట్లను పరిరక్షించాలి అని పర్యావరణవేత్తలు గొంతు చించుకొని చెప్పుచున్నారు.మరో ప్రక్క అక్రమార్కుల ఇష్టా రాజ్యం కొనసాగుతోంది. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరుకుతూనే ఉన్నారు.అటవీ శాఖ వారు సరైన చర్యలు తీసుకోవడం లేదు.అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.అందు వల్ల అడవుల దుస్థితి చక్కబడడం లేదు.ఈ దారుణమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నది అని కవి భావించడం జరిగింది.అరణ్యాలు నశించడం,అడవి జంతువులు జనుల నివాసాలలోకి రావడం,నీళ్ళ ట్యాంకులో పడి కోతులు దుర్మరణం పాలైన వార్తల చేత అశేష ప్రజానీకం తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది.ఇట్లాంటి దారుణ సంఘటనలను లోకంలో ఎవ్వరు ఇష్టపడరు.అందరి మనస్సులలో తీవ్రమైన ఆవేదన నెలకొన్నది.కొందరి దుర్మార్గపు చేష్టల వల్ల అడవులు తగ్గిపోయి కోతులు జనుల ఇండ్లలోకి వచ్చి నీళ్ల ట్యాంకులో పడి చనిపోవడం కవి నారాయణ రెడ్డి (మానారె)హృదయాన్ని ద్రవింపజేసింది. వేదనలో నుండి కవిత్వం పుడుతుంది అంటారు.ఆ వేదనలో నుండి కవిత పురుడు పోసుకుంది.ఈ కవితలో ప్రకృతి సంపద, అటవీ జీవ వైవిధ్యం,మనిషి లోభం,వాని ఫలితంగా పర్యావరణానికి కలిగే హాని హృదయానికి హత్తుకునేలా చెప్పబడింది.
“చీమలు దూరని చిట్టడవులూ/కాకులు దూరని కారడవులూ/కథల పుస్తకాలలోనే కాదు/ పృథులమైన పృథ్వి అంతటా ఉండేవి/ అంటున్నారు.చీమలు కూడా ప్రవేశించ లేని చిట్టడవులు పూర్వం ఉండేవి.కాకులు కూడా చేర లేని మిక్కిలి దట్టమైన అడవులు ఉండేవి.ఇవి కేవలం కథల్లో ఉండే కల్పితాలు కాదు.నిజంగా అలాంటి అడవులు భూమి మీద ఉండేవి అని మనకు గుర్తు చేస్తున్నారు.విస్తృతమైన ఈ భూమి విస్తారమైన అడవులకు నెలవు. ఈ కవి ప్రకృతి యొక్క స్వర్ణ యుగం నాటి అడవుల పూర్వ రూపాన్ని ఈ కవితా పంక్తులలో అద్భుతంగా చిత్రించారు. పుస్తకాల్లో రాయబడిన కల్పన కంటే ప్రకృతి సహజ సౌందర్యం మిన్న అని కవిత ద్వారా తెలుపుతున్నారు.

“సింహాల రాచరికపు కొలువులూ/జంతు సమూహాల నెలవులూ/అడవుల నిండా ఉండేవి/అంటున్నారు. ఆనాటి అడవులు అనేక రకాల జంతు సమూహలతో కళకళలాడుతూ ఉండేవి.వన్య జీవులు ఒకప్పుడు తమ సహజ పరిసరాల్లో అధికంగా ఉండేవి.సింహాలు,పులులు,కోతులు, పక్షులు,అడవులలో స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించేవి.కవి ఆ కాలపు జీవులు కలిసి జీవించే తీరును కవితలో చూపించారు.ఆనాడు జీవజాల సమృద్ధితో సింహాలు,పులులు,ఎలుగుబంట్లు, కోతులు,పక్షులు స్వేచ్ఛగా కలిసి జీవించే వాతావరణం నెలకొని ఉండేది.
“పక్షుల కిలకిలా రావాలు/చెవులకు విందు చేసేవి/ సెలయేరుల సరిగమలు/సరసంగా వినిపించేవి/ అంటున్నారు.పక్షుల కిలకిలమనే ధ్వనులు,పరుగెత్తే వాగుల నీటి శబ్దం,ప్రకృతిలోని సంగీతం మనస్సును పులకింపజేస్తుంది.ప్రకృతి కేవలం ఆహ్లాదాన్ని ఇచ్చేది మాత్రమే కాదు.ప్రకృతి మనస్సును రంజింప చేస్తుంది.పక్షుల స్వరాలు – చెవులకు విందుగాను, వాగుల శబ్దం – సంగీతంగాను చూపించారు.
“మిసిమి చివురుల కొమ్మలతో/గుసగుస లాడే గాలి తెమ్మెరలు/పచ్చదనపు పసిమి సొబగులతో/ అడవులు నందనవనంలా మురిపించేవి/ అంటున్నారు.అడవుల్లో ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు చేమలతో ప్రకృతి కాంత పరవశిస్తున్నది. అడవిలో గుబురుగా పెరిగిన చెట్లు గాలికి అటు ఇటు ఊగే కొమ్మల సయ్యాటల సౌందర్యంతో అలరారేవి.ప్రకృతి చూడ చక్కగా నందనవనంలా దర్శనమిస్తుంది. మనసును కట్టి పడేసే అందాలు,అడవులలో చిందులు వేస్తున్నాయి.ఇందులో కవి చిత్రణ అద్భుతంగా ఉంది.గుసగుసలాడే గాలిని సజీవంగా చూపించిన తీరు బాగుంది.
“పరికి పండ్లు,పాల పండ్లు,తునికి పండ్లు/వెలగ పండ్లు,మొర్రి పండ్లు,మారేడు పండ్లు/రేగుపండ్లు,గొట్టి పండ్లు,ఊడుగ పండ్లు/పరెం పండ్లు,రాగి పండ్లు, బలుసు పండ్లు/సీతాఫలం,కొండ మామిడి,కొండ నేరేడు/మొదలైన పండ్లకు కొదువే లేదు/ అంటున్నారు.అడవులలో అనేకమైన పండ్లు మెండుగా లభించేవి.పూర్వం అడవులు ఆహారానికి నిల్వ గదుల్లా ఉండేవి.కవి సమృద్ధితో కూడిన ప్రకృతిని,వివిధ రకాల పండ్లతో నిండిన అటవీ సంపదను అద్భుతంగా చిత్రించారు.అడవిలో లభించే పండ్ల జాబితాను చక్కగా వివరించారు
“అడవులలో దుంపలు ఎన్నో దొరికేవి/నార దుంపలు,అడవి ఏలేరి దుంపలు/నాగేల్ మాటి దుంపలు/నోస్కో మాటి దుంపలు/తీగ దుంపలు, నెమలి గడ్డలు/ఇలాంటివి ఇంకా ఎన్నో దొరికేవి/ అంటున్నారు.పండ్లతో పాటు పిండి పదార్థాలు గల అనేక విధములైన దుంపలు సమృద్ధిగా లభించేవి. ఆ కాలంలో జంతువులకు,ఆదివాసులకు ఆకలి సమస్య దాదాపుగా ఉండేది కాదు. అక్కడ నివసించే ఆదివాసుల జీవితం ఏ లోటు లేకుండా గడిచి పోయేది.ప్రకృతి తల్లి అన్ని విధాల తన బిడ్డలకు ఆహారాన్ని అందించి పోషించేది.
“ఇప్పపువ్వుకు కొరతే లేదు/తెల్లారేసరికి పచ్చని పసిమిలా/చెట్ల కింద పరుచుకొని రాలిపడేవి/ అంటున్నారు.ఇప్పపూలను, పాల పండ్లను,తునికి పండ్లను బాగా ఎండబెట్టి గుమ్ములలో భద్రపరుచుకునే వారు.ఇప్ప పువ్వులతో కుడుములు చేసుకుని తినేవారు.ఇప్ప పూలతో సారాను తయారు చేసుకొని ఇష్టంగా త్రాగే వారు.
ప్రకృతి మాత పలు రకాల విరిసిన పుష్పాల సుగంధాలను వెదజల్లుతూ కనువిందు చేసేది.అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వులను పచ్చని పసిమితో పోల్చడం మనోహరంగా ఉంది.
“కల్తీ లేని జుంటి తేనెకు/అడవులే పుట్టినిండ్లు/ అంటున్నారు.అడవుల్లో సహజమైన తేనె లభించేది.ఇది ప్రకృతి మాత ఆటవికులకు ప్రసాదించిన అమృతం.ఆనాడు ప్రకృతిలో లభించే పండ్లు,తేనె,అటవీ ఉత్పత్తులు కల్తీ రహితంగా ఉండేవి.ఆ అడవి ప్రదేశం పచ్చని చెట్లతో,పారే వాగులతో కూడిన మనోహర దృశ్యాలతో కళకళలాడుతూ ఉండేది.వివిధ రకాలైన పండ్లు, దుంపలు,పూలు,తేనె మొదలైనవి సమృద్ధిగా లభించేవి.
“అడవులు క్షుధార్థుల ఆకలి తీర్చేవి/ సెలయేరులు దాహార్తుల దాహం తీర్చేవి/అంటున్నారు.అక్కడ అడవుల్లో నివసించే జంతువులతో పాటు మనుషులు ఆహారం,నీటి కోసం ప్రకృతి పైనే ఆధార పడి ఉండే వారు.అడవిలో లభించే పండ్లు,దుంపలు ఆకలిని తీర్చేవి.సెలయేరులలోని నీరు దప్పికను తీర్చేది.ప్రకృతి సౌభాగ్యం సమస్త ప్రాణికోటి జీవనానికి సహకరించేది.
“పులులు,సింహాలు,ఎలుగుబంట్లను/ కోతులు, కొండముచ్చులు,కుందేళ్ళను/దుప్పులు,మెకాలు, మహిష జాతులను/ నెమళ్ళు,చిలుకలు, పావురాలను/గువ్వలు,గోరువంకలు,గ్రద్దలను/ మృగజాతులను పక్షుల సంతతిని/అన్నింటిని అడవులు ఆదరించి/ఆహారాన్నిచ్చి దప్పిక తీర్చేవి/ అంటున్నారు.కవి ఇక్కడ వన్య జీవులు ప్రకృతిలో సమూహాలుగా జీవితాన్ని గడపడాన్ని చక్కగా చూపించారు.అడవి కేవలం మనుషులకే కాదు. అడవి తల్లి అన్ని జీవజాతులను తన ఒడిలో పెట్టుకుని పోషించడంతో పాటు రక్షణ కల్పించేది అని గుర్తు చేస్తున్నారు.
“అడవి బిడ్డలకు ఆ వనమాత/అవని తల్లి అన్నింటిని ఇచ్చేది/అంటున్నారు.కవి అడవిని తల్లిలాగా వర్ణిస్తున్నారు.అది తన బిడ్డలైన జంతువులు,పక్షులు,మనుషుల అవసరాలన్నిటిని తీర్చేది అని చెబుతున్నారు.ప్రకృతి పోషించే తల్లి. ఇందులో సందేహానికి తావు లేదు.అది అన్ని జీవజాతులను పోషిస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు.
“అడవి తల్లికి పులులు,సింహాలు/చెంచులు, గోండులు రక్షణ కవచాలు/ అంటున్నారు.అడవి తల్లిని పులులు,సింహాలు,చెంచులు, గోండులు, ఆదివాసులు రక్షణ కవచంగా ఉండి చక్కగా కాపాడుకునే వారు‌.ప్రకృతిని రక్షించేది కేవలం ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాలు మాత్రమే కాదు.ప్రకృతి ఒడిలో మమేకమైన పులులు,సింహాలు మరియు ఆటవికులు అడవులను రక్షిస్తున్నారు అని కవి ఘంటాపథంగా తెలియ జేస్తున్నారు.
“ఆటవికులు అడవులను కన్నతల్లిలా/కళ్ళలో పెట్టుకుని కాపాడుకునే వారు/గుడిసెలు కట్టు కోవడానికో/గొడ్డలి కామకో నాగటి దుంపకో/వంట చెరుకుకో నెగళ్ళ కొరకో/ఎండి మోడు వారిన చెట్లను తప్ప/ఏ పచ్చని చెట్టునూ నరకని/ప్రకృతి ప్రియులు ఆటవికులు/అంటున్నారు.ఆదివాసులు వీలైనంత వరకు తమ అవసరం కొరకు ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే ఉపయోగించే వారు.తమ అవసరాలైన గుడిసెలు కట్టుకోవడానికి,నాగటి దుంపలకు, గొడ్డలి కామలకు,వంట కట్టెలకు,ఇంటి ముందు చలి మంటలకు,ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే వాడుకునే వారు. అంతే గాని ఏ ఒక్క పచ్చని చెట్టును నరికే వారు కాదు.పచ్చని అడవులను ఆటవికులు కంటికి రెప్పలా కాపాడుకునే వారు.ఆదివాసులు పచ్చని చెట్లను నరక వద్దు అనే నియమాన్ని ఆచరించిన వారు. ఆదివాసుల సుస్థిరమైన జీవన విధానం అందరికీ ఆదర్శంగా నిలవాలనే సందేశం ఈ కవితలో స్పష్టం చేయబడింది.
“స్వార్ధపరులైన నాగరికుల ప్రవేశంతో/అటవీ సంపదకు ఆపద వాటిల్లింది/అంటున్నారు. ఆటవికులు ప్రకృతిని అమితంగా ప్రేమించే వారు. మధ్యలో లోభులైన నాగరికులు అడుగు పెట్టడం వల్ల అడవుల వినాశనం మొదలైంది.నాగరికులైన స్వార్థపరులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు అనే వాస్తవాన్ని కవి భావాలలో వ్యక్తం అవుతున్నది.
“అమాయకులైన గోండు గూడాలల్లో/కోయ గూడాలల్లో,చెంచు గూడాలల్లో/అమ్మకాలు కొనుగోళ్ళు మొదలైనాయి/అంటున్నారు.ఏ పటాటోపం హంగులు ఆటవికులకు తెలియదు. సాదా సీదాగా జీవించే ఆదివాసుల గ్రామాల్లోకి వాణిజ్యం ప్రవేశించడంతో వారి జీవితాల్లో పెను మార్పు వచ్చింది.వాణిజ్యం ప్రవేశించడం చేత, వర్తకుల దోపిడీ విధానం వల్ల ఆదివాసులు బానిసత్వం చెరలోకి నెట్టబడ్డారు.దానితో ప్రకృతి సంరక్షణకు ముప్పు ఏర్పడింది.
“అటవీ సంపద కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధమైనాయి/అడవి జంతువులను వేటాడడం/ మాంసాన్ని అమ్ముకోవడం మొదలైంది/పులి చర్మం, జింక,దుప్పి చర్మాలకు/చీకటి అంగళ్ళలో గిరాకీ పెరిగింది/అంటున్నారు.అడవిలోని జీవ రాశిని, విలువైన కలపను కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధం అయినాయి. విశృంఖలంగా వన్య జీవుల వేట కొనసాగింది.జంతువులను చంపి మాంసాన్ని అమ్ముకోవడం,జంతువుల చర్మాలను అమ్మడం మొదలైంది. విపరీతమైన స్వార్థం మనుషులలో పెరిగింది.స్వార్థపరుల దుందుడుకు చేష్టలతో మూగ జీవులైన జీవజాతులు నాశనం చేయబడ్డాయి.ఇది అత్యంత క్రూరత్వం అని కవి తెలియజేస్తున్నారు.
“కలప రవాణా నగరాలకు మొదలైంది/ కర్కశ మనస్కులైన మనుషులు/క్రూర మృగాల అవతారమెత్తారు/అంటున్నారు.పెరుగుతున్న జనాభా కారణంగా అతి వేగంగా నగరాలు విస్తరించాయి.అట్టి నగరాల నిర్మాణం కోసం కలప దోపిడీ విచ్చలవిడిగా పెరిగింది.మనుషుల హృదయాల్లో క్రూరత్వం చోటు చేసుకున్నది అని తెలియజేస్తున్నారు.ఇందులో మనిషి లోభత్వం – క్రూర మృగాల కంటే ప్రమాదకరమైనది అని చూపించబడినది.
“దిన దినం అడవి మాయమై పోయింది/మృగ పక్షుల సంతతి సన్నగిల్లింది/అంటున్నారు.అడవిలో చెట్లను నరకడం,జంతువులను వేటాడి చంపడం నేరం.చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళ అలసత్వం, నిర్లిప్తత వల్ల అటవీ వినాశనం పెరిగింది.వాస్తవంగా వన్య జీవుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది. జంతువుల సహజ జీవనానికి ముప్పు ఏర్పడడం, పర్యావరణం దెబ్బ తినడం సరియైనది కాదు అని కవి తెలియ జేస్తున్నారు.ఆటవికులైన గోండు,చెంచు, కోయ గూడాలలోని ప్రజలు ప్రకృతిని తల్లిలాగా భావించి అవసరానికి మించి ఏ వనరును వినియోగించని తత్వం కల వారు.ఇది సహజ వనరుల సమతుల్యతకు చక్కటి తార్కాణం.మనిషి లోభం,నాగరికత అడవుల నాశనానికి దారి తీసింది. కవి మానవులలో స్వార్థం పెరిగి అడవులపై ఎలా విరుచుకు పడ్డారో చక్కగా వివరించారు. జంతువులను వేటాడి మాంసం,చర్మాలను అమ్మడం,చెట్లను నరకడంతో కూడిన కలప వ్యాపారం,అటవీ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలకు మూలమైంది.కవి ఇక్కడ మనిషి నాగరికత అనే ముసుగులో ప్రకటితమైన క్రూరత్వాన్ని వ్యక్తం చేశారు.కర్కశ మనస్కులు క్రూర మృగాల కంటే ప్రమాదకరం అని సూచించారు.
“తరగని ఆహార భాండాగారం/ఆదివాసుల పెరటి కల్పకము/వట్టి పోయి ఉసూరుమంటున్నది/ అంటున్నారు. ఒకప్పుడు అడవి ఆహార సంపదలతో కళకళలాడుతూ ఉండేది.అట్లాంటి అడవి రూపురేఖలు మారిపోయాయి.అడవిని పెరటి కల్పకము అని అన్నీ ఇచ్చే కల్పవృక్షంగా పోల్చి చెప్పినారు.
“తన నాశ్రయించిన జనాన్ని మృగాదులను/ పోషించలేని అడవి తల్లి/తన చేతకానితనానికి/ విలవిలలాడిపోతున్నది/ఏక ధాటిగా ఏడుస్తున్నది/ అంటున్నారు.అడవి తల్లి తనపై ఆధారపడి జీవించే జంతువులకు,మానవులకు, ఆహారం,నీరు,ఆశ్రయం కల్పిస్తుంది.మనుషుల అహంకారం,అతి దోపిడి,వన నాశనం వల్ల అడవి తల్లి తన బిడ్డలకు కనీస అవసరాలైన ఆహారాన్ని అందించ లేని స్థితికి చేరింది.తల్లి తన బలహీనత,అసమర్థత వల్ల తన పిల్లలకు అన్నం పెట్టలేక విలవిలలాడుతుంది. అలాగే అడవి తల్లి కూడా తన వనరులు నాశనం అయిన తర్వాత ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అడవి తల్లి ఏకధాటిగా ఏడుస్తున్నది.ఇది కేవలం భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు కాదు.ఒక హెచ్చరికను తెలుపుతున్నది.వర్షాలు,తుఫానులు, వరదలు,కరువులు వివిధ రూపాలలో అడవి తల్లి తన వేదనను మనకు అందిస్తోంది. ప్రకృతి యొక్క నిరంతర రోదన మనిషి వినిపించుకోకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుంది. కన్నతల్లి తన పిల్లలను కాపాడలేని ఘోరమైన స్థితి‌ కొనసాగుతున్నది.నిజానికి పిల్లలే తల్లిని హింసకు గురి చేయుచున్నారు.తల్లి దుస్థితికి తన పిల్లల పెంపకంలో లోపం,పిల్లలలో నెలకొన్న కాఠిన్యం కారణం అని తెలియ చేయడం జరిగింది.అడవి నాశనం అయిన తర్వాత మానవుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తల ఎత్తుతుంది.వరదలు,కరువులు, వాతావరణ మార్పులు అన్ని ఒక నిరంతర రోదన రూపాలు.ప్రకృతిని రక్షించకపోతే మన జీవనం కూడా రోదనలతో నిండిపోతుంది. పాలకులు, సమాజం తల్లి వలె తమను ఆశ్రయించిన ప్రజలను రక్షించలేని స్థితికి వస్తే ఆ సమాజం శిథిలం అవుతుంది‌.వరదల రూపంలో ప్రకృతి విలవిల లాడుతుంది.కరువుల రూపంలో ఏడుస్తుంది. తుఫానుల రూపంలో తన వేదనను వ్యక్తం చేస్తుంది. అడవితల్లి జంతువులను,మనుషులను పోషించలేని స్థితికి చేరింది,ప్రకృతి రోదన వినకపోతే మనిషి ఉనికి ప్రమాదంలో పడుతుంది. సమాజ రోదన పట్టించుకోకపోతే దేశం శిథిలావస్థకు చేరుతుంది. నేడు తనని ఆశ్రయించిన జనాన్ని పోషించ లేని అడవి తల్లి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఒక వైపు ప్రకృతి పరిరక్షణ విఫలం.మరో వైపు సామాజిక న్యాయం లోపం కనిపిస్తున్నాయి.అడవి తల్లి బాధతో విలవిలలాడుతున్నది,ఎంతగానో ఏడుస్తున్నది అని కవి భావోద్వేగంతో ప్రకృతి యొక్క నిస్సహాయ స్థితిని తెలియ జేస్తున్నారు.
“అడవి తల్లి కడుపు రగిలిపోతున్నది/దావానల జ్వాలల చేత/ఆత్మాహుతి చేసుకుంటున్నది/ అంటున్నారు.స్వార్థపరుల దుందుడుకు చేష్టల వల్ల జ్వాలలు ఎగసిపడి అడవి తల్లి తగలబడింది.కవి అడవిని దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిలా చిత్రించడం అద్భుతమైన పోలికగా భావించవచ్చు.
“ఆహారం దొరకని పులులు/జనావాసాల పైన పడుతున్నవి/కోతులు పల్లెలకు,పట్టణాలకు,బ్రతుకు కోసం వలస పోతున్నాయి/తిండి వెదుక్కుంటూ తిరుగుతున్నాయి/ అంటున్నారు.అడవిలో ఆహారం లేక పోవడం వలన వన్య జీవులు మనుషుల నివాసాలకు వస్తున్నాయి.వాటి రాక వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఇందులో ప్రకృతి వినాశనం నేరుగా మనుషులకే ముప్పు తెచ్చి పెట్టింది అనే సందేశం ఉంది.
“ఇండ్లలో దూరి రచ్చ రచ్చ చేస్తున్నాయి/వాటిపై కోపమెందుకు,ద్వేషమెందుకు/ఇందులో వానరాల తప్పేముంది/వాటి ఆవాసాలను మనం ఆక్రమిస్తే/ మన నివాసాలకు అవి చేరాయి/అంటున్నారు. అడవులు క్షీణించడం వల్ల జంతువుల ఆహార వనరులు తగ్గిపోయాయి.పులులు గ్రామాలపై దాడి చేయడం మొదలు పెట్టాయి.కోతులు పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి,ఆహారం కోసం రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టాయి.కోతుల విపరీత ప్రవర్తనపై కోపం వద్దు.ద్వేషం వద్దు. అన్యాయంగా అడవులను నాశనం చేసినాం,కోతుల నివాసాలను మనం ఆక్రమించుకున్నాం.కాబట్టి అవి పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి.అట్టి ఘోరమైన కార్యానికి మనమే బాధ్యులుగా భావించాలి అని కవి సున్నితంగా తెలియజేస్తున్నారు.
“కోతులను ఆంజనేయులనుగా/పూజించే గొప్ప సంస్కృతి మనది/చచ్చిన కోతికి గుడిని కట్టి పూజిస్తున్న పుణ్యభూమి మనది/అంటున్నారు. కోతులను దేవుని రూపంలో పూజించే గొప్ప సంప్రదాయం మనది.చనిపోయిన కోతికి గుడిని కట్టి పూజించే పుణ్యభూమి మనది.ఇందులో మనం మానవత్వం మరియు దయను కలిగి ఉన్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అనే సందేశం ఉంది.
“అట్టి సంస్కృతి కేమైందిప్పుడు/మానవత్వాన్ని గట్టున బెట్టి దయా దాక్షిణ్యాలకు తిలోదకాలిచ్చి/ వందల కొద్ది వానరాలకి/విషం పెట్టి చంపిన పాపం/ అంటున్నారు.మనలోని మానవత్వాన్ని దయా గుణాన్ని మరిచిపోయినాం.కోతుల వల్ల విసుగు చెందినాం.కోతులకు విషం పెట్టి వాటిని చంపడం హేయమైన చర్య.ఇప్పుడు కోతులకి విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి దాపరించింది.ఇది దిగజారిన మానవతకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. మానవులు తరతరాల విశిష్టమైన సంస్కృతిని మరిచిపోయినారు,తమలోని మానవత్వాన్ని కోల్పోయినారు అని ఈ కవిత తెలియజేస్తున్నది.
“నీళ్ల ట్యాంకులో పడి మరణించిన/కోతుల ఉసురు ఊరికే పోదు/వాటిని ఆకలితో నకనకలాడించిన/మానవజాతికి నిష్కృతి లేదు/ అంటున్నారు.నీళ్లు దొరకని స్థితిలో నీళ్ల ట్యాంకులోని నీటిని త్రాగబోయి అందులో కోతులు పడి మరణించినాయి.ఇటు వంటి ఘోరమైన క్రూర ఘటనలకు మూలమైన మానవ జాతికి ఎన్నటికిని నిష్కృతి లేదు.ప్రకృతి వినాశనాన్ని ఘోరమైన పాపంగా భావించాలి.ఈ కవితలో ప్రకృతికి చేసిన ద్రోహం నుండి మానవులు తప్పించుకోలేరు అనే గొప్ప సందేశం ఉంది.
“ప్రకృతిని పోషించి కాపాడుకుంటేనే/ మానవుల మనుగడకు రక్షణ/ప్రకృతి ప్రేమికులారా/ కారుణ్యమూర్తులారా/మానవులారా తస్మాత్ జాగ్రత్త/అంటున్నారు.ఇందులోని సందేశం ప్రకృతిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.అప్పుడు మాత్రమే మానవులు,జంతుజాలం మనుగడకు ఆధారం దొరుకుతుంది. ప్రకృతిని కాపాడకపోతే మనమే నశిస్తాం.ప్రకృతి ప్రేమికులారా, కారుణ్యమూర్తులారా,మానవులారా,ప్రకృతిని దీక్ష,పట్టుదలతో రక్షించుకోవాలి అని కవి హెచ్చరిస్తున్నాడు.ఈ కవితలో ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్వ కాలపు అడవుల సౌందర్యం,నాగరికత ప్రవేశంతో కలిగిన నష్టం,మన సంస్కృతి క్షీణత,పర్యావరణ హెచ్చరికలను గమనించవచ్చు.ఇందులో ప్రకృతిని తల్లిగా తలంచిన భావం ఉంది.ఈ కవితలో అడవి – తల్లి అనే ప్రతీక ప్రధానంగా కనిపిస్తుంది.తల్లి తన పిల్లలకు ఆహారం,నీరు,ఆశ్రయం,భద్రత ఇస్తుంది. ప్రకృతితల్లి పండ్లు,దుంపలు,నీటి వనరులు, జీవనానికి అవసరమైన అన్నింటిని ఇచ్చింది.కానీ, మనిషి తాను లోభం వల్ల కన్నతల్లి వంటి అడవులనే నాశనం చేసినాడు.మనిషి ప్రకృతి నుండి వేరుపడిన ప్రాణి కాదు.మనిషి ప్రకృతిలో ఒక భాగం.మనిషి ప్రకృతి తల్లిని హింసకు గురి చేయడం తప్పు.మనిషి ఇట్టి ఘోరమైన చర్యలకు పాల్పడడం తనను తాను శిక్షించుకోవడంగా భావించవచ్చు.ప్రకృతి సహజ సమతుల్యతకు దర్పణం లాంటిది.పూర్వం వన్య జీవులు, మనుషులు,చెట్లు,నీరు అన్ని పరస్పర ఆధారంగా జీవించేవి.సింహాలు,పులులు అడవులను నరికే వారిని నియంత్రించేవి. పక్షులు విత్తనాలు వ్యాప్తి చేసేవి.చెట్లు వర్షాలను ఆకర్షించేవి.ప్రకృతిలోని సహజ సమతుల్యతను కోల్పోయినప్పుడు పులులు గ్రామాలపై దాడి చేస్తున్నాయి. కోతులు పట్టణాలకు వలస వస్తున్నాయి. కరువు కాటకాలు పెరిగాయి. మున్నెన్నడు లేనంతగా వరదలు ముంచెత్తుతున్నాయి.అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కవి నవీన నాగరికత – వరమా? శాపమా?అనే దానిని కవితలో స్పష్టంగా వివరించారు.ప్రకృతిని సంరక్షించుకోవడంలో నిజమైన నాగరికత ఉంది.కానీ,మనం వాణిజ్యం పేరిట వ్యాపారం చేస్తూ కలప రవాణా,జంతువుల వేట వంటి క్రియలతో ప్రకృతిని దోచుకున్నాం. కాగితాల మీద అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు పెరిగినాయి.భూమి మీద ప్రకృతి సంపద తగ్గి పోయింది.ఈ కవితలో కోతులను ఆంజనేయులనుగా పూజించే గొప్ప సంస్కృతిని ప్రస్తావించారు.పూర్వం జీవులపై అపారమైన కరుణ తొణికిసలాడేది. మనుషుల హృదయాలలో పేరుకుపోయిన కాఠిన్యం వల్ల ఇప్పుడు జీవులకు విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి వచ్చింది.మనలో దయాభావం లేకపోతే తరతరాల విశిష్టమైన సంస్కృతికి అర్థం లేదు.అట్టి సంస్కృతి కేవలం ఒక ముసుగుగా నిలుస్తుంది.మానవులారా తస్మాత్ జాగ్రత్త అనే కవితా పంక్తిలో అద్భుతమైన లోతైన అర్థం దాగి ఉంది.ప్రకృతిని మనం సంరక్షించక పోతే మనమే నశిస్తాం.ఇది కేవలం భావోద్వేగపు మాట కాదు.శాస్త్రీయ సత్యం.ఈ కవిత మనకు మూడు స్థాయిల్లో హెచ్చరిక చేస్తున్నది.దయ,కరుణ కోల్పోతే మానవత్వం కొనసాగదు,ఇది నైతిక స్థితి.ప్రకృతి సమతుల్యత లేకపోతే జీవనం దుర్లభం అవుతుంది, ఇది పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుపుతుంది.మనం మారక పోతే,భూమిపై మన బ్రతుకు దుర్భరం అవుతుంది,ఇది భవిష్యత్తుకు చెందిన హెచ్చరిక.అరణ్య రోదన అనే చక్కటి కవితను రాసిన కవి మాదాడి నారాయణ రెడ్డి (మానారె) పాఠకులకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.వారిని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

4 comments

Kira579 September 17, 2025 - 7:11 am Reply
Bennett1466 September 18, 2025 - 3:35 am Reply
Paisley888 September 19, 2025 - 9:50 am Reply
Ayden4995 September 20, 2025 - 11:43 am Reply

Leave a Reply to Ayden4995 Cancel Reply