Home వ్యాసాలు శ్రీరామనవమి సందర్భంగా రామ తత్వం

శ్రీరామనవమి సందర్భంగా రామ తత్వం

by V. Kameshwari

రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. ఈ రామాయణాన్ని మనకు పరిచయం చేసిన కవిపుంగవుడు వాల్మీకి . రామ నామ మహిమ వల్లనే అటవీకుడగు వాల్మీకి రామాయణ గ్రంధాన్ని జగతికి అందించాడు. మనం నిత్య జీవితంలో కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం, చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధుమిత్రు సమేతంగా హతమార్చి విభీషణుకు పట్టం కట్టి సీతా సమేతముగా అయోధ్యగా చేరుకున్నాడు. భారతదేశంలో భాషలు వేరైనా రామాయణము తెలియని మనిషి ఉండడు.
మన దేశంలో పిల్లలకు చిన్నతనము నుండి రామాయణం గురించి కథలుగా చెబుతారు పెద్దలు. రాముడు సర్వ లక్షణ సంపన్నుడని ఆయన గుణ గ ణాలను వర్ణిస్తూ ఆయనలా నడుచుకోమని చెబుతారు. ఆఖరికి నిద్రపుచ్చేటప్పుడు కూడా ” రామాలాలి మేఘశ్యామా లాలీ ” అనే జోల పాట పాడి నిద్ర పుచ్చుతారు . వయసు మళ్ళినవారు రామకోటి రాయడం, నిత్యం రామ నామ స్మరణ చేయడం వలన మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. అంతలా రాముడు మన జీవితాలతో ముడివేసుకుపోయాడు. ఎంతో కష్టపడి అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడం మన హిందువుల రామ భక్తికి నిదర్శనం. సీతమ్మ నడవడిక కూడా ఎంతో ఆదర్శ దాయకం మహిళలకు. రామ, లక్ష్మణ భరత,శత్రుఘ్నుల సోదర భావము ఎంతో ఆదర్శనీయమైనది. ఇద్దరు అన్నదమ్ములు కలివిడిగా ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు రా అంటారు. రాముడు ఎంత గొప్పవాడైనా’ సీతాపతి “అని పిలవబడటం ఆ రోజుల్లోనే ఆడవారికి ఎంత గౌరవం ఇచ్చారో తెలుస్తుంది
అందుకే రామాయణం ఆపాల గోపాలానికి ఆదర్శం.

You may also like

1 comment

Leave a Reply to Ivy2261 Cancel Reply