14వ అంతర్జాతీయ తెలుగు సాహితీ సదస్సు ,అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన సభలో సమర్పించిన ప్రసంగపాఠం
జీవనరేఖ
తెలంగాణ తొలి తరం రచయిత్రి నందగిరి ఇందిరాదేవి 22.09.1919 సంవత్సరంలో శ్రీ వడ్లకొండ నరసింహారావు శ్రీమతి వెంకటమ్మ దంపతులకు హనుమకొండలో జన్మించారు..అదేసంవత్సరం నవంబర్ మాసంలో ఏకైక మహిళా భారత ప్రధాని ఇందిర కూడా జన్మిచడం విశేషం వీరి పేరు కూడా ఇందిరఅని పెట్టడం కాకతాళీయం. వీరి స్వగ్రామం హనుమకొండ దగ్గర వంగపహాడ్ గ్రామం. వీరి తండ్రి శ్రీ వడ్లకొండ నరసింహారావు గారు వరంగల్ లోని రంగశాయి పేటలో ఒక హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడుగాగా పనిచేస్తూ ఉండగా వారిక ఆంగ్ల భాషలో ఉన్న పట్టు కారణంగా నిజాం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగం దొరకడం వలన వారు హనుమకొండ నుండి హైదరాబాద్ సుల్తాన్ బజార్ కు మకాం మార్చారు. దాదాపుగా ఇందిరా దేవి బాల్యం అంతా ఇక్కడే గడిచింది.
శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గ్రంథాలయానికి కార్యదర్శిగా వుండి తన విధినిర్వహణలో భాగంగా రజతోత్సవాలు,స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపించారు. గ్రంథాలయానికి తండ్రితో కలిసి తరుచుగా వెళ్లేవారు చిన్నారి ఇందిర. తండ్రి ప్రభావమే ఇందిరపై గాఢంగా పడిందని చెప్పొచ్చు.
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 15 ఏటనే హైదరాబాద్ నారాయణగూడ లోని రెడ్డి హాస్టల్ వార్షికోత్సవంలో అష్టావధానం చేసి అందరిని అబ్బురపరిచారు.
ఆనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాహితీ ప్రియురాలు గద్వాల మహారాణి శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ గారు 15 సంవత్సరాల చిన్నారి ఇందిరాదేవిని ఘనంగా సత్కరించారు.
నైజాం కాలంలో ఉర్దూ మాధ్యమికంగా కొనసాగుతున్న రోజులు.ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకొనే స్థితి లేదు.ఆసమయంలో తెలుగు మాధ్యమికంగా ఆడపిల్లలకు చదువు ఆవశ్యకతను,అవసరాన్ని గుర్తించిన వడ్లకొండ నరసింహారావు గారు ఆంధ్ర బాలికల పాఠశాలను నెలకొల్పడం పెద్ద సాహసకార్యమే. నందగిరి ఇందిరా దేవి నారాయణగూడ ఆంధ్రా బాలికల పాఠశాలలో (అంటే ఇప్పటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.

నైజాం రాజ్యం పోయి భారత దేశంలో కలిసాక బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వలన మాడపాటి హనుమంతరావు గారితో కలిసి నెలకొల్పిన పాఠశాలకు మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలగా నామకరణం చేయబడింది.
వ్యవస్థాపకులలో వీరి తండ్రి వడ్లకొండ నరసింహారావు గారు ఒకరు. వీరు తాను అద్దెకుండే ఇంట్లోనే రెండుగదులను పాఠశాలకుపయోగించడం ,అమ్మాయిలను స్వంత డబ్బు ఖర్చుపెట్టి రిక్షాలో బడికి తీసుకొని రావడం ఆయనకు విద్యపట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. ప్రజాసేవ చేయడం,సంఘసంస్కరణ అనే లక్షణాలు తండ్రి గారినుండే వారసత్వంగా కూతురైన ఇందిరాదేవి పుణికి పుచ్చుకున్నారు.
ఇందిరాదేవి ఎస్.ఎం.డి.టి. మహిళా విశ్వవిద్యాలయం పూణే నుంచి 1937 వ సంవత్సరంలో జి.ఏ., లో పట్టభద్రురాలయ్యారు. G.A. అంటే (గృహ ఆగమ.)
ఈమె ఆ రోజులలో అంటే 1940 ప్రాంతంలో తొలి తెలంగాణ మహిళా పట్టభద్రురాలు.
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 14వ ఏట నుండే అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపక సభ్యులలో ఆమె ఒకరు. సంఘ సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ఒకటి బాల్యవివాహాల పట్ల నిరసన.
తాను స్వయంగా యుక్త వయస్కురాలు అయ్యాకనే వివాహం చేసుకుని నలుగురికి మార్గదర్శకురాలు అయ్యారు. ఆ రోజులలో తండ్రి నరసింహారావు కూతురు ఇందిరకు పెళ్లి చేయట్లేదని బంధువులు ఎన్నో సూటిపోటి మాటలు అంటున్నా బంధుత్వాలు సడలిపోయే స్థితి ఎన్నో అవాంతరాలు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తన కూతురిని బాల్య వివాహం నుండి తప్పించారు. ఆమె పట్టభద్రురాలు అయిన తర్వాతనే వివాహం జరిపించారు.
ఆ తర్వాతి కాలంలో ఇందిరాదేవి బాల్య వివాహాలను తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా తీవ్రంగా ఖండించారు. 1937 సంవత్సరంలో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ అనుబంధంగా జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు.
ఆ నిజాం కాలంలో “నషర్” గా పిలువబడే కార్యక్రమం ద్వారా దక్కన్ రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి తెలంగాణ మహిళ ఇందిరాదేవి.1937 సంవత్సరంలో తన 18 ఏటనే నిజాం ప్రభుత్వం వారు ప్రసారం చేయదలచుకున్న సందేశం తెలుగులో ఇందిరాదేవి తమ వాణిగా మొట్టమొదటిసారిగా వినిపించారు. కథారచయుతలకు కథలు ఎట్లా రాయాలో సూచనలు చేసేవారు.
కుటుంబ వ్యవస్థలోని వైరుధ్యాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను,సామాజిక సమస్యలు, సంసారంలో వయసు మళ్ళిన వారి సమస్యలు,
సాంఘిక దురాచారాలు మొదలగు విషయాలను ఏడు దశాబ్దాల కిందటే చిత్రించిన కథా రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. తెలంగాణ
సాహిత్యంలో ఆమెది చెరగని ముద్ర. ఒక ప్రత్యేక స్థానం.
కథలు, నాటకాలు, వ్యాసాలు,ఎన్నో వ్రాశారు. రేడియో కోసం కూడా ఎన్నో కథలు రాశారు.
ఆకాశవాణి బాలనందం కార్యక్రమాల ద్వారా మంచి స్నేహం విలువ, కష్టాలలో ఉన్న వారికి సాయపడాలని, సోమరిపోతుగా ఉండకూడదని, అనేక నీతి కథలు “అమ్మమ్మ కథలుగా” ఆమె విభజించారు.
ఈ అమ్మమ్మ కథలు అనే బాలల కథల పుస్తకం కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ వారు 2019 సంవత్సరంలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకత్వంలో ప్రచురించారు.
ఇందిరా దేవి గారికి శ్రీ నందగిరి వెంకట్రావు గారితో వివాహం జరిగింది. ఆమెకు శౌరి,అరుణ్,వీర అనే ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.ఆ తర్వాత కూడా ఆవిడ రచనా వ్యాసంగాలు మానుకోలేదు.
నిజాం కాలంలో,
ఆ తర్వాత కూడా ఆమె రేడియో ప్రసంగాలు చాలా చేశారు. దాదాపు 50 ఏళ్ల పాటు రచించిన రేడియో ప్రసంగాలను ఆమె “మసకమాటున మంచు ముత్యాలు” అను పేరుతో 1995 సంవత్సరంలో వెలువరించారు..జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి,మా గురువు గారు ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని.
ఆవిడ రాసిన కథలు,వ్యాసాలు,నాటకాలు ఆ కాలం లోని పత్రికలు భారతి,యువ,
వినోదిని, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి ,మాతృభూమి,చిత్రగుప్త,ఆంధ్రకేసరి, శోభ,ప్రజాహిత,వనితా జ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
ఈమె భర్త శ్రీ నందగిరి వెంకట్రావు గారు,సమాజ సేవకుడు ప్రముఖ న్యాయవాది,న్యాయమూర్తి ఉద్యమకారుడే కాక ఆంగ్ల, తెలుగు,ఉర్దూ భాషలలో ప్రసిద్ధ కథా రచయిత 1926 – 1935 మధ్యకాలంలో 50 కి పైగా కథలు రాశారు. గిరి అనే కలం పేరుతో వారు రాసిన కథలు భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికలలో
అచ్చు అయ్యాయి.
ఇందిరా దేవి రచనలలో హాస్య రసం పాలు ఎక్కువ. సాహిత్యంలో వారికి హాస్యం అంటే చాలా ఇష్టం.
“నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్న జంధ్యాల వారి
హాస్యోక్తికి నిలువెత్తు నిదర్శనం ఇందిరాదేవి.
అందుకేనేమో
2006లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు వీరి హాస్య రచనలకు “ధర్మనిధి” పురస్కారాన్ని అందజేశారు.
వడ్లకొండ కుటుంబంతో మా అనుబంధం
శ్రీమతి నందగిరి ఇందిరా దేవి 1940 దశకం నుండి తెలంగాణా సాహితీ చరిత్ర లో తొలితరం తెలంగాణ రచయిత్రిగా,సమాజోద్ధరణ కర్తగా తన భుజాన వేసుకుని ఉన్నతమైన పాత్రను పోషించినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆమెకు పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు.
ఆమె ఎన్నో కథలు, వ్యాసాలు, వార, పక్ష మాసపత్రికలలో వచ్చినప్పటికీ
ముద్రణ రూపంలో ఒక సంకలనంగా చేసే ప్రయత్నం నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మా వారు పరిమి వెంకట సత్యమూర్తి తోనే మొదలైంది.
నందగిరి ఇందిరా దేవి గారి తమ్ముడు, వడ్లకొండ నరసింహారావు గారి కుమారుడు డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు
కాలక్రమంలో మాకు మంచి ఆప్త మిత్రులయ్యారు.
వారు రాష్ట్ర
భూగర్భ జలశాఖలో డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. వారి ధర్మపత్ని ఆచార్య
వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి గారు ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. నారాయణ గూడా చౌరస్తా లోని వారి ఇంటికి మేము తరచుగా వెళ్తుండేవాళ్ళం.
డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు మేము ఎప్పుడు వారి ఇంటికి వెళ్లినా
ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చిందని చాలా సంతోషపడి ఎంతో సేపు వదలకుండా కూర్చుని సంతోషంగా మాట్లాడుతూ గత విషయాలు ఎన్నెన్నో చెబుతూ వాళ్ళ నాన్న గురించి అక్కయ్య ఇందిరాదేవి గురించి వివరించేవారు.
ఈ సందర్భంలోనే
అక్కయ్య నందగిరి ఇందిరాదేవి రాసిన రచనలను ముద్రించాలనే తాపత్రయంతో మీరే చేయాలమ్మా ఆ పని అని వారు మేము చేస్తామన్న ధృడ విశ్వాసంతో మాకు ఇందిరాదేవి గారు రాసిన శుద్ధ
వ్రాత ప్రతులను మాకు
చూపించారు.అలా
నందగిరి ఇందిరాదేవి గారి రచనలను వింగడించి, ముద్రించి
ప్రజలకు చేరువ చేసే బాధ్యతను మాకు అప్పగించారు.
ఈలోపే రవీంద్రగారి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా వ్యధకు గురిచేసింది. తర్వాత కొంతకాలానికి ఆయన భార్య ఆచార్య స్వరాజ్య లక్ష్మి గారు ఇందిరాదేవి గారు స్వయంగా రాసిన వ్రాతప్రతితో పాటు మొత్తం మెటీరియల్ మా చేతిలో పెట్టారు.
2018 సంవత్సరంలో అప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ మెటీరియల్ అంతా చూపించాము. వారు చాలా సహృదయతతో నందగిరి ఇందిరాదేవి తెలంగాణ తొలి తరం గొప్ప రచయిత్రి అని మన అకాడమీ తరఫున తప్పక ముద్రిస్తామని చెప్పగా చాలా సంతోషించాము .
వారి ఆనతి మేరకు మెటీరియల్ ను మొత్తం విడదీసి మొదటి దశలో ఇందిరాదేవి రాసిన 13 కథలను “నందగిరి ఇందిరాదేవి కథలు” గా నామకరణం చేసి అకాడమీ ద్వారా నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మరియు మా శ్రీవారు పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకులు గా వెలువరించడం జరిగింది. ఈ పుస్తకం
నందగిరి ఇందిరాదేవి శత జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సిద్ధారెడ్డి గారిచే 8 అక్టోబర్ 2018 సంవత్సరంలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద సభ నిర్వహించి ఆవిష్కరించడం జరిగింది.
తరువాత రెండవ దశలో ఆమె రాసిన 13 కథలను సేకరించి “నందగిరి ఇందిరాదేవి అమ్మమ్మ కథలు”అని
పేరు పెట్టి తెలంగాణ సాహిత్య అకాడమీ 2019 సంవత్సరంలో శతాబ్ది వేడుకల సందర్భంగా మా సంపాదకత్వంలో ముద్రించడం జరిగింది.
అలా మా ఇద్దరి సంపాదకత్వంలో నందగిరి ఇందిరాదేవి రెండు గ్రంథాలు వెలువడడం మాకెంతో గర్వకారణం.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి గారికి తొలి కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి,వడ్లకొండ వారి కుటుంబానికి ఇక్కడే ఉన్న నందగిరి పుత్రుడు శౌరి గారికి ధన్యవాదములు.ఇంత చక్కని అవకాశం కల్పించిన అమెరికా వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెంరాజు గారికి నమస్కారం ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి గారు ఇలా తన జీవితాంతం వరకు సాహిత్య సేవ చేస్తూ తన అవసాన దశలో 1998 సంవత్సరం నుండి అమెరికాలోని హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ లో తన కుమారుని వద్ద ఉంటూ22 జనవరి 2007 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు.
తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అయితే, ఆ తరం లోనే వచ్చిన తెలంగాణ తొలి కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవి గారని చెప్పవచ్చు.
