Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

సంకేపల్లి నాగేంద్ర శర్మ మిడ్ మానేర్ కవిత చారిత్రక కవిత ఓ విశ్లేషణ.
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు,సంకేపల్లి నాగేంద్ర శర్మ కలం నుండి జాలువారిన మిడ్ మానేర్ కవితా సంపుటిలోని మిడ్ మానేర్ కవితపై విశ్లేషణా వ్యాసం.మిడ్ మానేర్ ప్రాజెక్ట్ తెలంగాణా రాష్ట్రంలోని మాన్వాడ గ్రామం,బోయినపల్లి మండలం,మానేరు నదిపై నిర్మించబడింది.ఇది సాగు నీటికి,త్రాగు నీటికి మరియు మత్స్య పరిశ్రమకు ఇతోధిక ప్రయోజనాలను అందిస్తున్నది.1991 సంవత్సరంలో మాజీ ప్రధాని పి.వీ.నరసింహరావు చేత శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండవ దశలో జలాశయం ప్రారంభించబడింది.మానేరు నది నుండి కాకుండా శ్రీరాం సాగర్ వరద కాలువ ద్వారా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి మిగులు నీరు ప్రవహిస్తుంది.ఆనకట్ట పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కరీంనగర్ నగరంలోని దిగువ మానేరులోకి నీరు విడుదల చేయబడుతుంది.2004 – 2005 జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఆనకట్ట నిర్మాణం అనేక కారణాల వల్ల ఆగి పోయింది.2005 లో ప్రారంభమైన మిడ్ మానేరు ప్రాజెక్ట్ పనులను పదేళ్లలో యాబై శాతం మాత్రమే పూర్తి చేసినారు. మిగతా యాభై శాతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పనులు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.మిడ్ మానేరు జలాశయం యొక్క స్థూల సామర్థ్యం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు టీఎంసీలు. ఇరవై ఒక్క కిలోమీటర్లు పొడవు ఉన్న ఎడమ కాలువ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది.అరవై నాలుగు కిలోమీటర్లు పొడవు ఉన్న కుడి కాలువ తొంబై వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.ఇక మిడ్ మానేర్ కవితలోని విశేషాలను పరిశీలిద్దాం.
“కరువు సీమకు కళ్యాణమాల!/ఈ కవితా పంక్తి పాఠకుని మదిలో భక్తి భావాన్ని కలిగిస్తుంది.మిడ్ మానేర్ ప్రాంతం పంటలు ఎండిపోయి,జల సాధన లేని నిర్జల భూమి.అది కరువు సీమకు ప్రతిరూపం. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ రాకతో కరువు సీమ పులకరించింది.కవి నీటి సిరులను తెచ్చిన మానేరును వధూవరుల కంఠంలో వేసే వరమాలగా ఊహించడం అద్భుతంగా ఉంది.ఇది మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లోని భూమికి అందిన జలసిరి.ఇది మనసు విప్పి చెప్పలేని మధురమైన గాధ.ఇది పునరుజ్జీవనానికి ప్రేరణగా నిలుస్తుంది.

“నెర్రెలు బారిన మెట్ట ప్రాంతపు/నేలలో ఉప్పొంగిన జలగంగ!/నీటిపారుదల సౌకర్యం అంతగా లేని, ఎత్తుగా ఉండే భూమిని మెట్ట భూమి అంటారు. సరైన వాతావరణం లేక,వర్షాలు కురవక,పంటలు ఎండి భూమి నెర్రెలు బారుతుంది.అలాంటి నిర్జీవ నేల ఇప్పుడు జలగంగతో అలరారుతున్నది.ఇది కేవలం నీటి ప్రవాహం కాదు,జీవన ప్రవాహం,ఆనంద గంగ అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“గోదావరీ తల్లి పైకెగసిన మధురాంతరంగ!/
కవి స్వభావ సిద్ధంగా గోదావరిని తల్లిగా భావించాడు.ఇది ప్రకృతికి మాతృరూపం ఇచ్చే ఆధ్యాత్మిక దృష్టి కోణంగా భావించవచ్చు.
“పైకెగసిన మధురాంతరంగ అనేది ఆ తల్లి గోదావరి కరుణా తరంగాల ప్రవాహం ఎగసి మానేరులో కలిసినట్లుగా చిత్రించారు.కరువు సీమకు వరమై, ఎండిన నేలకు ఆశను,ఉల్లాసం నింపిన తల్లి గోదావరి దయగా ఈ జలాశయం కనిపిస్తుంది.కవి దృష్టిలో ఇది కేవలం ఇంజనీరింగ్ నిపుణులు చేసిన అద్భుతం కాదు.భూమి,నీరు,మనుషుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.
“పదమూడు సంవత్సరాల పాటు/కునికి పాట్లు పడి కష్టాల పాలైన/ప్రాజెక్టుకి అయిదేళ్ళ కిందట మోక్షం లభించింది/కవి కునికి పాట్లు పడింది అనేది అత్యంత దృశ్యాత్మకమైనది.ఇక్కడ ప్రాజెక్ట్ ఒక జీవ రూపం పొందిన వ్యక్తిగా కనిపిస్తుంది.ఇది సాధారణ నిర్మాణ కష్టాలు,మానవ సంకల్పానికి ఎదురైన ఎన్నో అడ్డంకులు,సాంకేతిక ప్రతిబంధకాలను సూచిస్తుంది. ఇందులో సంపూర్ణ మానవ యత్నాలు అయిన శారీరక ఇబ్బందులు,ఆత్మ నిబద్ధత,తపస్సు అన్నీ మిళితమై ఉన్నాయి.
కష్టాల పాలైన ప్రాజెక్ట్ అనేది పరిణామ మార్గంలో ఎదురైన విఘ్నాల చరిత్రను గుర్తు చేస్తుంది.ఇది మానేరును ఒక తపస్వినిగా చూపిస్తుంది.తపస్సు చేసిన సత్యసాధకురాలు చివరికి విజయాన్ని పొందిన దివ్య రూపం.సాధారణంగా మోక్షం వలన పునర్జన్మల నుండి విముక్తి లభిస్తుంది అనేది ఆధ్యాత్మిక పరమావధిని తెలియజేస్తుంది. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ సాధన,కష్ట సాధ్యమైన మార్గం.చివరకు మానేరు ప్రాజెక్టు మోక్షం పొందింది.ఇది మానవ ప్రయత్నానికి దివ్య ఫలితాన్ని సూచించే ఆధ్యాత్మిక రూపక కథనం.
“ఓ మారు కరకట్ట కొట్టుకుని పోయినా కోలుకున్నదీ జలాశయం!/ఈ కవితా పంక్తులలో ఇది కీలక మలుపు – విఫలతను అధిగమించి విజయాన్ని సాధించింది.ఇది కేవలం ఒక జలాశయం నిర్మాణం కాదు.తపన,నిబద్ధత,పునరుజ్జీవం అనే మానవ విలువలు ఉన్నాయి.నదికి ఇరువైపులా నిర్మించిన కరకట్టలు వరద నీటిని నిలువరించడం, జనావాసాలను రక్షించడం జరుగుతుంది.నదుల ప్రవాహాన్ని అదుపులో ఉంచడం,లోతట్టు ప్రాంతాలు వరదల్లో మునిగిపోకుండా కరకట్టలు కాపాడుతాయి.ఒక దశలో మిడ్ మానేర్ ప్రాజెక్టు కొట్టుకుని పోవడంతో ఆశలు విఫలమై పోయాయి. కవి ఇక్కడ జల విపత్తును,ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యాన్ని కేవలం సంఘటనగా కాదు,జీవిత సత్యంగా చూపించాడు.ప్రతి మహత్తర సాధన వెనుక తప్పకుండా ఒక విఫలత ఉంటుంది.ఆ విఫలతే భవిష్యత్తు విజయానికి బలమైన పునాది అవుతుంది.
మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో కష్టాలు వచ్చినా లక్ష్యం మాత్రం ఆగిపోకుండా సాధన వైపుకు సాగింది.ఆ దృఢ సంకల్పానికి రూపం మానేర్ జలాశయం.ఈ కవితా పంక్తిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుసంధానం ఉంది. ప్రజల తపస్సుల ఫలితంగా మానేర్ జలాశయం ఆవిర్భవించింది.మానేరుపై ఒక మారు విధి విపత్తు రూపంలో దాడి చేసినా,ప్రజల ఆకాంక్షలు,నాయకుల నిబద్దతలు నిలిచాయి.చివరికి ఆ తపస్సు జల రూపం దాల్చింది.కోరుకున్న మానేరు జలాశయం కల సాకారమైంది.
“తెలంగాణా పాలకుల పట్టింపులతో/దురస్తై ఆదర్శ రిజర్వాయరై ఉప్పొంగిన/నిర్మల జల సాగరం/ఈ కవితా పంక్తులలో రాజకీయ పునర్జన్మ లభించిన క్షణాన్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది.ఇది ప్రాజెక్ట్ భౌతిక నిర్మాణం కాదు.ఇది పాలనా సంకల్పం, ప్రజాసేవా ధర్మం అనే అంతర్భావాలను ప్రతిబింబిస్తుంది.
ఇందులో తెలంగాణా పాలకుల శ్రద్ధ,బాధ్యత,దృఢ సంకల్పం ఉంది.కవి తెలంగాణా పాలకులు అందించిన మానవతా స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నాడు.
మానేర్ ప్రాజెక్టులోని పాత లోపాలు సరి చేయడం అనేది కేవలం భౌతిక మరమ్మత్తు కాదు.వారు ప్రాజెక్టుకి నూతన ప్రాణం పోశారు.ఆదర్శ రిజర్వాయర్ అనేది కవి మానేరును తెలంగాణ జల వ్యవస్థలో ఆదర్శ ప్రణాళికగా నిలిపాడు.మానేరుని ఇతర ప్రాజెక్టులకు ఆదర్శంగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు.
ఉప్పొంగిన అనేది ఆనందం,ఉత్సాహం,సంపూర్ణత అనే భావాల మేళవింపు.నిర్మల జలసాగరం పవిత్రమైన జలరాశి.ఇక్కడ కవి మానేరు జలాశయంను ఒక పవిత్రమైన తల్లి గర్భంగా చూశాడు.ఇక్కడ జల సంపద సంతానంగా నిలిచిపోయింది.ఇది భౌతిక సమృద్ధికి ఆధ్యాత్మిక రూప కల్పన.ఈ కవితా పంక్తులు మానేరును తెలంగాణా ప్రభుత్వ కృషితో పునర్జన్మ పొందిన జీవరాశిగా వర్ణిస్తున్నాయి.ఇది భౌతికంగా ఒక రిజర్వాయర్ అయినప్పటికీ కవికి అది ఒక తల్లి లాంటి జలసాగరం.పునర్జన్మ పొందిన మిడ్ మానేర్ ఆదర్శ రిజర్వాయర్ నిర్మల జలసాగరంగా మారింది. తెలంగాణ పాలకుల అంకితభావంతో సాంకేతికంగా పునరుద్ధరించబడింది.

“శ్రీపాద సాగరం నుండి బాహుబలి మోటార్లు తోడై/కడలియై కదలి వచ్చిన కాళేశ్వరుడి కరుణాంతరంగ/ఈ కవితా పంక్తులు ఒక దైవత్వ స్పురణలో నిండిన శిఖరాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ కవి జల శక్తి,యాంత్రిక శక్తి,దైవ కరుణ వల్ల ఒక దివ్య రూపాన్ని సృష్టించాడు.
శ్రీపాద సాగరం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ లోని ఒక ప్రధాన జలాశయం.ఈ జలాలు సాధారణ నీరు కాదు.పుణ్య జలం,పవిత్ర ప్రవాహం.
“బాహుబలి మోటార్లు తోడై/ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని భారీ మోటార్లు,గోదావరి నీటిని పైభాగాలకు ఎత్తి పంపే మహాశక్తిని సూచిస్తున్నాయి.ఇది ప్రకృతి శక్తి,మానవ శ్రమ, సాంకేతికత సాధించిన అద్భుతం.కవి సాంకేతికతకు జీవరూపం ఇచ్చి దానిని బాహుబలి మహావీరుడి ప్రతీకగా చిత్రీకరించారు.
ఇది సముద్రమై ఉప్పొంగిన ఆవేశభరిత ప్రవాహం. కవి జల ప్రవాహాన్ని ఉత్సాహం,గర్జన,ప్రళయ స్వరూపంతో వర్ణించాడు.ఈ నీటి ప్రవాహం దైవ కరుణా ప్రవాహం.
ప్రసిద్ధ శైవ క్షేత్రంలోని కాళేశ్వరుడు.గోదావరి తీరంలోని జ్యోతిర్లింగ స్వరూపం.కవి జల ప్రవాహాన్ని,దేవుని కరుణగా,అనుగ్రహ తరంగంగా వర్ణించడంతో పాటు కాళేశ్వరుడిని జల ప్రవాహ రూపంలో దర్శించాడు.ఆ నీరు కాళేశ్వరుడి కరుణగా భూమిపై ప్రవహిస్తోంది.ఈ కవితా పంక్తులలో మొత్తం భౌతిక జల ప్రవాహం మరియు ఆధ్యాత్మిక దయా ప్రవాహాల మధ్య ఉన్న ఏకత్వాన్ని సూచిస్తుంది.ప్రాజెక్టు భౌతిక నిర్మాణానికి,దేవుని కరుణ తోడైంది అని కవితాత్మకంగా చిత్రిస్తోంది. శ్రీపాద సాగరం నుంచి బాహుబలి మోటార్ల బలంతో నీరు సముద్రంలా ఉప్పొంగి కాళేశ్వరుడి దయామృతంలా మానేరులో ప్రవహించింది అనే కవి వర్ణణ అద్భుతంగా ఉంది.ఇది జల ప్రవాహం కాదు, కరుణా ప్రవాహం అని చెప్పిన తీరు బాగుంది.
“దక్షిణ కాశీయైన ఎములాడ రాజేశున్ని అభిషేకించడానికి/బిరబిరా జలపాతమై పై ఎదల నుండి/ఎల్లమ్మ తల్లి (ఎల్లంపల్లి ప్రాజెక్టు)రూపంలో జాలువారిన గంగాతరంగం!/కవి ఇక్కడ జల ప్రవాహాన్ని దేవతాభిషేకంగా,వేములవాడ దక్షిణ కాశీని పవిత్ర తీర్థంగా చిత్రించాడు.కవి గోదావరి జలాలను మానేరులో ప్రవహించే నీటిని దైవాభిషేక జలాలుగా ఊహించాడు.దేవుడిని అభిషేకించడం అనేది భక్తి,పవిత్రతను సూచిస్తుంది.జల ప్రవాహం భౌతిక ప్రవాహం కాదు.దైవ సేవలో నిమగ్నమైన పవిత్ర కర్మ.ఇక్కడ జల యజ్ఞం ఆధ్యాత్మిక యజ్ఞంగా రూపాంతరం చెందింది.
బిరబిరా అనే ధ్వన్మాత్మక పదం,జలపాతం పడుతున్న శబ్దాన్ని సజీవంగా వినిపిస్తుంది.ఇది ఎత్తయిన ప్రాంతాల నుండి దూకిన జలపాతం.ఇది జల ఉత్సాహం,దైవ ఉల్లాసం,ప్రకృతి వైభవంను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తి ఒక దృశ్య చిత్రం లాంటిది.మన కళ్ళ ముందు ఆ జలపాతం నిజంగా కదులుతున్నట్టే కనిపిస్తుంది.ఎల్లమ్మ తల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపంలో అవతరించింది.కవి ప్రకృతిని తల్లిగా,ప్రాజెక్టుని దైవరూపంగా ప్రతిష్టించాడు. ఎల్లమ్మ తల్లి భూమాత,జలదేవత,పోషక శక్తి వంటి పలు రూపాల సంగమం.ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇంజనీరింగ్ నిపుణులు సాధించిన అద్భుతంగా కాకుండా దైవ అవతారంగా చూపించడం అనేది ఆధునిక శాస్త్రం,సాంప్రదాయ భక్తి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. కవి గోదావరి జలాలను,గంగాతరంగంగా పేర్కొనడం,భారతీయ జల సంస్కృతికి అద్దం పడుతుంది.ఇది కరుణతో,మమకారంతో కురుస్తున్న దయా ప్రవాహాన్ని సూచిస్తుంది.కవి జలాన్ని,భక్తి, జీవనాధారం, కరుణా ప్రసాదంగా భావించాడు.ఈ కవితా పంక్తులలో మానేరు కేవలం జలాశయం కాదు.గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపంలో దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని అభిషేకించడానికి బిరబిరా జలపాతాలుగా జాలువారుతున్నాయి.ఇది దైవ కరుణా ప్రవాహం, భక్తి జలగీతం,ప్రకృతి యజ్ఞం అని కవి వ్యక్తం చేసిన భావం గొప్పగా ఉంది.
“నాంపల్లి గుట్టల లక్ష్మీ నరసింహుడి/కాళీయ నాగఫణి జల తరంగిణివి/ఈ కవితా పంక్తులలో కవి జలాశయ సౌందర్యాన్ని దైవ చైతన్యంతో మిళితం చేస్తూ సాక్షాత్తు భక్తితో ప్రకృతి సమన్వయాన్ని చిత్రించాడు.కవి ఇక్కడ జల ప్రవాహాన్ని పౌరాణిక, చారిత్రక ఘట్టంగా చూపించి,దానికి దివ్య వైభవాన్ని కల్పించాడు.
వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్టలలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంతీయ భక్తిని సూచిస్తుంది.మిడ్ మానేర్ జలాశయం అక్కడి నాంపల్లి గుట్టలను తాకుతూ ప్రవహించి దైవ సన్నిధికి చేరింది.కవి ఈ కవితా పంక్తి ద్వారా మానేరులో ప్రవహించే జలాన్ని నరసింహుడి దివ్య శక్తిగా చూశాడు.ఇక్కడ కాళీయ నాగఫణి అనే భావన ద్వారా అత్యంత సృజనాత్మకతను జోడించాడు.ఇది శ్రీకృష్ణుడు కాళీయ నాగుని ఫణంపై నృత్యం చేసిన పౌరాణిక ఘట్టం గుర్తుకు తెస్తుంది.మిడ్ మానేర్ కాళీయ నాగుని ఫణములపై నర్తించినట్లుగా ఆవిర్భవిస్తోంది. కవి నీటి ప్రవాహాన్ని కేవలం భౌతిక దృశ్యంగా కాకుండా పౌరాణిక – భక్తి,శక్తిగా ఆవిష్కరించాడు. నాంపల్లి లక్ష్మీనరసింహుడి స్పర్శతో మానేర్ నీరు పవిత్రమై భక్తుల హృదయాలను తాకినట్లుగా, కాళీయ నాగఫణి అనే రూపకం ద్వారా కవి నీటి అలజడిని పౌరాణిక రూపంలో చూపించాడు.ఈ కవితా పంక్తులలో మిడ్ మానేర్ జలాశయం కేవలం నీటి నిల్వగా కాకుండా ప్రాణ శక్తిగా రూపొందింది. నాంపల్లి నరసింహుడి పాదాల వద్ద ప్రవాహించే ఆ జలతరంగాలు,కాళీయ నాగఫణాలపై ఆడే దైవ శక్తియై,తెలంగాణాకు జీవనాధారంగా మారింది.ఇది భక్తి,ప్రకృతి పౌరాణిక సమ్మిళిత కవితా దృశ్యం. ఇందులో కవి మిడ్ మానేర్ జలాశయాన్ని దైవ జలధారగా ఆవిష్కరించి,తెలంగాణ భూమికి, పవిత్రతను ప్రసాదించాడు.
“జల యజ్ఞంలో భాగమై కిసాన్ కీ నేత, శాసనసభ్యుడు/స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర్ రాయుడి చిరకాల స్వప్నమై/పివీ శ్రీరామ సాగర వరద కాలువ పునాది రాయై/డా.వైయస్ రాజశేఖరుడి మహిమల్లో/ఆరితేరి ప్రత్యేక తెలగాణ/తొలి సీఎం కేసీఆర్ చేత ఆవిష్కృతమైన/ భవ్య జలరాసుల భాండాగార నిధి/జలయజ్ఞం అనేది సమాజ సేవలో భాగంగా నిలిచిన ఒక పవిత్ర యజ్ఞం.నీటి సేకరణ,సాగు భూముల పునరుజ్జీవనం వలన రైతుల జీవితాలు మార్పు చెందాయి.కవి ప్రాజెక్టును భౌతిక నిర్మాణంగా కాకుండా ఆధ్యాత్మిక కార్యంగా ప్రతిష్టించాడు.చెన్నమనేని రాజేశ్వరరావు రైతుల మనసులో నిలిచినారు.అందుకే అతనిని కిసాన్ కీ నేతగా పిలుస్తారు.రైతుల కోసం అహరహం తపించే ఆయన త్యాగాన్ని,ఆశయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.మానేరులోని నీరు ప్రవహించి రైతుల జీవితాలను సుసంపన్నం చేయాలి అనేది ఆ నాయకుడి స్వప్నం.అతనిని రాజనీతి కోవిదునిగా కాకుండా జలతపస్విగా చిత్రించాడు.చిరకాల స్వప్నం అనేది ఆయన అంకిత భావాన్ని వ్యక్తం చేస్తుంది.పీవీ శ్రీరామ సాగర ప్రాజెక్టు అనేది గోదావరి ఆధారంగా నిర్మితమైన జలసంధానం.ఈ ప్రాజెక్టుకు దాని పునాది ఆలోచనాత్మక మూలంగా నిలిచింది. మానేరు ప్రాజెక్ట్ ప్రారంభమైన జల పరంపరలో ఒక అనుబంధ రత్నం.కవి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని మహిమ అనే పదంతో స్మరించాడు.కవి ఆయనను ప్రేరకుడు,ప్రజాహితకారుడుగా అభివర్ణిస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేత మానేర్ ప్రాజెక్టు ఆవిష్కరణను కవి ఒక చారిత్రక ఘట్టంగా, నీటి సంపదల రత్న నిధిగా చిత్రించాడు.
చెన్నమనేని రాజేశ్వరరావు యొక్క స్వప్నం,వైయస్ రాజశేఖర్ రెడ్డి దయతో పునర్జన్మ పొందిన మిడ్ మానేర్ ప్రాజెక్టు,చివరికి కేసీఆర్ నాయకత్వంలో ఆవిష్కృతమైన తెలంగాణ జల చరిత్రలో ఒక అమరమైన నీటినిధిగా నిలిచింది అని కవి గర్వంగా చెబుతున్నాడు.మానేర్ మన తెలంగాణ గంగగా రూపు దాల్చింది.ఇది మన జల కావ్యపు ఆధ్యాత్మిక మణిహారం అని చెప్పిన తీరు బాగుంది.
“రాజన్న సిరిసిల్లా జిల్లాకి నెమలిఫించమై/అప్రహిత జలఖడ్గమై అలరారుతు/ప్రగతి పథాన మమ్ములను వేలిచ్చి నడిపించడానికి/కంకణం కట్టుకొన్న నీ రూప లావణ్యాలను/ఏమని వర్ణింతును తల్లీ!/కవి రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పల్లె ప్రాంతం – జలం మధ్య అనుబంధాన్ని,దివ్య గౌరవంతో కలిపిన ప్రేమభరిత వర్ణన ఇది.తల్లి మానేరును పూజ్యంగా పిలుస్తూ గౌరవాన్ని ఇనుమడింప జేస్తుంది.ఇక్కడ మానేరు జలాశయం అందాలు ఆ ప్రాంతానికి ఒక వరంగా, మణిగా నిలబడటం చూపిస్తాడు.ఈ విధంగా దేశభక్తిని,ప్రాదేశిక గౌరవాన్ని కొనసాగించడం జరిగింది.నెమలిఫింఛమై అనేది అమోఘంగా, కవితాత్మకంగా ఆవిర్భావమైనట్లు భావిస్తాం. జలఖడ్గంతో నీటి శక్తి తేజస్సుతో పటుత్వాన్ని పెంచింది.అప్రహిత అంటే నిరోధించలేనిది.ఆ నీటి శక్తి ప్రగతికి అడుకట్టలేనిదిగా ఉన్నది.అలరారుతూ అనే ధ్వన్యాత్మక పదం భావానికి సరిపోతుంది.ఇది ఉల్లాసంగా అలరించినట్లుగా ఉత్సాహపూర్వకంగా ప్రవహించటాన్ని తెలుపుతుంది.జలం ఇప్పుడు కేవలం సాగునీటి రూపంలో కాకుండా ప్రజలని జీవనపథంలో నడిపిస్తూ ప్రగతికి దారి చూపించే మార్గదర్శిగా మారింది.మానేర్ జలం సమాజానికి స్ఫూర్తిని,మార్గదర్శకత్వాన్ని అందించింది.
కంకణం కట్టుకోవడం అనేది బంధం,సంస్కృతి, ఆత్మీయతను తెలుపుతుంది.మానేరు రూపం లావణ్యమై ఈ బంధాన్ని ఏర్పరుస్తుంది అని,ఆమె అందం వర్ణించలేనిదిగా ప్రశ్నార్థకంగా కవితా పంక్తిని ముగిస్తాడు.తల్లీ అని సంబోధనలో జలేశ్వరికి పూజ్య భావం ఉంది.నీ రూప లావణ్యాలు అని పిలవటం ద్వారా నీటి అందాలను వ్యక్తికరించారు. అలరారుతూ వంటి పదాలు దృశ్య,శ్రవ్య అనుభూతిని ఇచ్చినాయి.చివర్లో ఏమని వర్ణింతును తల్లీ?అనేది పాఠకుని హృదయానికి హత్తుకునేలా ఉంది.మానేర్ నీరుతో పంటలు పండించిన రైతులు ఆర్థిక పరిపుష్టిని పొందారు.వారి ప్రగతికి పునాది పడింది.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నీటి వరం,ప్రాంతీయ ఐక్యతను పెంచింది,వారి గర్వానికి కారణంగా నిలిచింది.
జలేశ్వరి తల్లి రూపంలో పునరుజ్జీవనం పొందింది. ఈ కవితా పంక్తులు ఒక చిన్న తీరు కథనంలా కాకుండా సాంస్కృతిక,సామాజిక ఉత్సవానికి సోపానంగా నిలుస్తున్నాయి.మానేర్ అందాన్ని, ప్రజలను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని వర్ణిస్తూ కవి ఒక గొప్ప స్తుతి గానం చేస్తున్నాడు.
“అప్పుడే ఆరేళ్లు పూర్తి చేసుకున్న నీవు/మా పాలిట అపర భాగీరథివి/జ్ఞానపీఠి మా హన్మాజీపేట సినారే వర్ణించిన సిరులొలుకు/సిరిసిల్లా చేనేత చీరలో మెరుస్తున్న మరో కృష్ణవేణివి!/ఇక్కడ ప్రధానంగా మానేరు యొక్క వయస్సు సూచన ఉంది.చిన్న వయసులోనే ఘనమైన విజయాలు సాధించబడ్డాయి అనేది తల్లి మానేరుపై భక్తిని మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది.
భాగీరథి ఒక పుణ్య పరిపూర్ణ సమాజానికి నీరు అందించే గొప్ప తల్లి.ఇక్కడ మానేరు జీవనదాతగా వర్ణించబడింది.మన ప్రాంత ప్రజలకు మానేరు జీవనాధారంగా నిలిచింది.జ్ఞానపీఠం అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య గుర్తింపు.ఇక్కడ హన్మాజీపేట గ్రామానికి చెందిన సినారె ని సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందినాడు అని గొప్పగా వర్ణించబడింది.సిరులొలుకు అనేది మానేరులో జలాన్ని సౌభాగ్యంగా వర్ణిస్తున్న ప్రకృతి రూపం.ఇది ప్రకృతి ప్రేమను,భౌతిక,సాంస్కృతిక విలువలను చూపిస్తుంది.
సిరిసిల్లా చేనేత చీర సాంప్రదాయ సంపద, ప్రాంతీయ కళ,సౌభాగ్యం.కృష్ణవేణి భారతీయ సాహిత్యంలో శాంతి,ప్రేమ,సౌందర్యంతో అలరారుతుంది.కవి మానేరు ప్రవాహాన్ని కవిత్వపు దృశ్యాత్మక,భౌతిక పారంపర్య రూపకంగా చూపించాడు.మానేరులో పరిమళించిన అందమైన సంపద గల జీవ రూపాన్ని మరొక కృష్ణవేణిగా ఊహించాడు.మానేరు ఇప్పుడు కేవలం నీటి ప్రాజెక్టు కాకుండా భారతీయ సాంస్కృతిక సంపదకు నెలవైన జీవనాధారంగా మారింది.కవి ప్రతి పంక్తిలో జలశక్తి తల్లి సాహిత్య,సాంస్కృతిక దివ్య రూపం అన్న ధారావాహికను చూపించాడు.చిన్న వయసులోనే సాధించిన ఘనత, భాగీరథి లాంటి సేవ,సిరిసిల్లా చీరలో మెరిసే దివ్యత్వం మానేరు జలాశయానికి ఒక పూర్ణ స్తుతి గానం.ఆరేళ్లలోనే ప్రతిఫలించిన మానేరు భాగీరథి లాంటి జీవనదాత.సిరులొలుకు ప్రకృతి,సాంప్రదాయ చేనేతలో మెరుస్తున్న కృష్ణవేణిగా మానేరులోని జల రూపాన్ని, సృజనాత్మకంగా,దివ్యంగా వర్ణించిన కవిత్వరూపం ఇది.
“మానువాడలో మానేటిలో చిలికిస్తున్న/నీ మేని హోయల సుందర దృశ్యాలు/మాకు అపరిమిత ఆనందాలే/మానువాడలో మానేటిలో చిలికిస్తున్న అనేది భౌగోళికంగా ప్రాంతీయ స్థలాన్ని సూచిస్తుంది. మానువాడ గ్రామ ప్రజలకు మానేరు నీటి ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.చిలికిస్తున్న స్వేచ్ఛ, ప్రాణవంతమైన జీవం,ప్రకృతి సంగీతం,చిన్న జలచరాల కదలికను సూచించే పదం.కవి ఇక్కడ ప్రవాహం,జీవనశక్తి,ప్రకృతి సౌందర్యం అనే భావాలను ఒకే దృశ్యంగా చూపించాడు.
నీ మేని హోయల సుందర దృశ్యాలు.మేని అనగా నీటి ప్రవాహమే శరీరంగా,నీటి చల్లని తీయదనంతో అంద చందాలను ఒలకబోస్తుందని వర్ణణ. చెరువులలోని నీటి కదలికలు,చిన్నచిన్న అలల సుందర దృశ్యాలు,దృశ్యకళను మాత్రమే కాకుండా ప్రకృతి సౌందర్యాలను,జీవన ప్రవాహాల అందాలను కూడా సూచిస్తుంది.
మాకు అపరిమిత ఆనందాలే ఈ కవితా పంక్తి లోతైన భావాన్ని ఇస్తుంది.మానేరు నీటి ప్రవాహం ప్రజలకు,రైతులకు,పల్లె సమాజానికి ఆనందం,జీవన సౌభాగ్యం,ఆత్మీయ సంతృప్తిని,ఆర్థిక పరిపుష్టిని ఇస్తుంది.పరిమితి లేని ఆనందాలు,అంతులేని సుఖాలు మానేరు నీటి వల్లనే సమకూరినాయి.జల ప్రవాహం ఇక్కడ తల్లి,జీవనదాత.మానేరు నీటి హోయలు మానువాడలో చిలుకుతూ ప్రకృతి సౌందర్యంతో ప్రజలకు అపరిమితమైన ఆనందం అందిస్తాయి.ఈ కవితా పంక్తి ద్వారా కవి జలాశయాన్ని జీవన,సౌందర్య,ఆధ్యాత్మిక రూపాల్లో ప్రతిబింబించాడు.
“మానేరు,మూలవాగుల సంగమ ధారల్లో నీవు పునీతురాలవై/ఇక్కడి ఆకలి దప్పులకు, పాడిపంటలకు శాశ్వత ఆధార భూతమై/ బోయినిపల్లి మండలం క్రాంతి తరంగమై/ఉమ్మడి జిల్లా భాగ్యదాతవై వెలసిన నీకు/అనంత కోటి దండాలు తల్లీ!/ఇక్కడ మానేరు జలాశయానికి ప్రధానమైన వాగు.దానిలోమూల వాగు సంగమించి అమితమైన జల సంపద మానేరుకు సంక్రమించింది. మానేరు ప్రజలకు పవిత్ర జల ప్రవాహమైంది.కవి నీటిని తల్లిగా,పునీత రూపంలో దర్శించాడు.
ఇక్కడ మానేరు జలాశయం వ్యవసాయ,ఆహార, జీవనాధారానికి మూలం అని చెప్పబడింది.ప్రజల ఆహార సంబంధ సమస్యలను,రైతుల నీటి సమస్యలను,సమాజంలోని అన్ని సమస్యలకు జలం శాశ్వత ఆధార భూతంగా నిలిచి పరిష్కార మార్గాలను చూపిస్తుంది.
బోయినిపల్లి మండలానికి మానేరు జలాశయం క్రాంతి తరంగమై నిలవడం అనేది అనేకమైన మార్పులకు,ప్రజల ప్రగతికి సంబంధించిన మరపురాని దృశ్యం.మానేరు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
మానేరు ఇప్పుడు జలదాతగా,అదృష్టకారిణిగా ప్రసిద్ధి పొందింది.కవి ఇక్కడ మానేరు జలాశయాన్ని ప్రజల సౌభాగ్యాన్ని పెంచేదిగా,సమాజం కోసం పనిచేసే దేవతా రూపంగా చూపించాడు.
ఉమ్మడి జిల్లా భాగ్యదాత అయిన మానేరు జలాశయాన్ని తల్లిగా భావించి అనంత కోటి దండాలను సమర్పించడం వల్ల మానేరు జలాశయానికి ఎనలేని గౌరవం దక్కింది.మానేరు జలాశయాన్ని తల్లిగా జీవన దాతగా పిలవడం మిక్కిలి గొప్పగా ఉంది.మానేరు కేవలం నీరు అందించే ప్రాజెక్టు కాదు.అది వ్యవసాయం మూలంగా ప్రజలను భాగ్యవంతులను చేస్తూ పునీతురాలై,క్రాంతి తరంగమై,ఆధ్యాత్మిక, సామాజిక,భౌతిక ప్రయోజనాలకు మూలమైంది. మానేరు జలాశయం,మానేరు మూలవాగుతో కలిసి పవిత్రమై ప్రవహించి,ప్రజల ఆకలి దప్పులు,పాడి పంటల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించింది.బోయినిపల్లి మండలంలో క్రాంతి తరంగాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలకు భాగ్యదాతగా వెలసిన నీకు అనంత కోటి దండాలు తల్లీ అని కవి వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“అనంత సాగరం,రంగనాయక సాగరం/
కొండ పోచమ్మ,కొమిరెళ్ళి మల్లన్న/సాగరాలకు ప్రాణదాయినివై,చేదోడువాదోడువై/దిగువ జిల్లాలకు జల నిధుల కేంద్రమై/కరీంనగర్ దిగువ మానేరుకు మహాశక్తి దాయినివై/ప్రగతి చక్రాల్లో ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తివై/ఎలగందుల కోటకు మహారాణివై వర్ధిల్లు తల్లీ!/ఈ కవితా పంక్తులు తెలంగాణలోని నీటి ప్రాజెక్టుల మహిమను ప్రతిబింబిస్తుంది.ఉత్తర తెలంగాణ ప్రజల జీవనాధారమైన నీటి ప్రాజెక్టులకు సమర్పితమైన కృతజ్ఞతా గీతంగా ఒప్పుతుంది.
“అనంత సాగరం,రంగనాయక సాగరం వంటి జల కేంద్రాలు,కొండ పోచమ్మ,కొమురెళ్ళి మల్లన్న సాగరాలకు ప్రాణదాయినివై అనే కవితా పంక్తుల ద్వారా కవి ఈ సాగరాలను ప్రస్తావిస్తూ వాటికి జీవ దానం చేసిన తల్లి మిడ్ మానేరును ఆరాధనీయమైన రీతిగా చిత్రించాడు.ఈ సాగరాలు వ్యవసాయానికి ప్రజల నీటి అవసరాలకు మూలాధారమై ఉన్నాయి.నీటిని కేవలం భౌతిక వనరుగా కాకుండా ప్రాణాధార శక్తిగా కవి చూపించాడు.చేదోడు వాదోడువై అనే కవితా పంక్తి సాంఘిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.ఇక్కడ చేదోడువాదోడు అనేది కష్ట సమయంలో తోడుగా, విజయంలో సహకరించే స్నేహితుని వలె మానవ జీవనంలో నీటి అనివార్యతను,మానవ సంబంధాలతో పోల్చాడు.మానేర్ జలాశయం చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడి ప్రాంత ప్రజల వ్యవసాయానికి మద్దతుగా నిలుస్తుంది.కవి మానేరు ప్రవాహాన్ని ప్రజల జీవనాధారంగా,సౌభాగ్యదాతగా చూపాడు.
“దిగువ జిల్లాలకు జల నిధుల కేంద్రమై/కరీంనగర్ దిగువ మానేరు మహాశక్తి దాయినివై/కవి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ప్రాంతీయ సమతుల్యతలోని ప్రాధాన్యతను,ఉజ్వలంగా చూపాడు.మానేర్ జలాశయం కరీంనగర్ జిల్లాకే కాకుండా దిగువ జిల్లా ప్రాంతాలన్నింటికీ అది నీటినిధిగా నిలుస్తుంది.కవి ఆ ప్రాజెక్టు యొక్క వ్యాప్తిని సార్వజనీనతను ఆవిష్కరించాడు.మానేరును కేవలం నీటి ప్రాజెక్ట్ గా కాకుండా కరీంనగర్ ప్రాంతానికి మహా శక్తివంతమైన జీవనదాతగా పేర్కొన్నాడు.మహాశక్తిదాయినివై అనేది దైవత్వాన్ని వ్యక్తం చేస్తుంది.
“ప్రగతి చక్రాల్లో ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తివై/ అనే కవితా పంక్తి ఆర్థికాభివృద్ధి,సామూహిక సొత్తు భావనలను ప్రతిబింబిస్తుంది.కవి దానిని సమగ్రాభివృద్ధికి సంకేతంగా ఆవిష్కరించాడు. మానేరు జలాశయం ప్రగతి చక్రంలో ముఖ్యమైనది. ఉత్తర తెలంగాణకి ఉమ్మడి ఆస్తి,రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది.జలాశయం సామాజిక ప్రగతికి మూలధనం వంటిది.
“ఎలగందుల కోటకు మహారాణివై వర్ధిల్లు తల్లీ!/ ఎలగందుల కోట తెలంగాణకు గౌరవాన్ని సూచిస్తే మిడ్ మానేర్ ఆ గౌరవానికి ఆధారమైన రాణిగా ప్రతిష్టించబడింది.కవి మహారాణి అనే పదం ఉపయోగించి ప్రాజెక్టును కేవలం నిర్మాణంగా కాకుండా జీవమూర్తిగా తీర్చిదిద్దినాడు.ఈ కవితలో కవి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణకు సమకూరిన జల స్రవంతి వైభవాన్ని ఆరాధ్యమైనట్టిదిగా చిత్రించాడు.సాగరాలను దేవతా రూపంలో,మిడ్ మానేరును తల్లిగా,రాణిగా, శక్తిదాయినిగా ఊహించి రాసిన ఈ కవిత గౌరవం, కృతజ్ఞతల సమ్మేళనంలా నిలుస్తుంది.మహారాణివై, ప్రాణదాయినివై అనేది నీటి ప్రాముఖ్యతను, గౌరవప్రదమైన రూపంలో చూపించాయి.కవి తన భూమి తన సాగరాల పట్ల గాడమైన ప్రేమను ప్రకటించాడు.ఈ కవిత మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ను ఇంజనీరింగ్ అద్భుతంగా కాకుండా ఉత్తర తెలంగాణ ప్రాణాధారంగా భావించాడు.దానికి తల్లి,రాణి రూపాలను ఇచ్చిన కవి స్ఫూర్తి,సృష్టి అద్భుతంగా ఉంది.
“నీ కోసం పదహారు గ్రామాలు మాసిపోయినా/మాజీ శాసనసభ్యుడు రేగులపాటి రుద్రుడు/పాపారాయుడి భూముల చిరునామాలు కోల్పోయినా/
డా.చెన్నమనేని రమేష్,కెటీఆర్ ల కీలు గుర్రానివై/ఆది శ్రీనివాసుడి అపూర్వధామమై/ ప్రభవిస్తున్న నీకు వందనం తల్లీ!/ఇక్కడ మానేరు ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా సమీప పదహారు గ్రామాలు మునిగిపోయి ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయినారు.ప్రజల జీవితం అంధకారబంధురమై సమస్యల వలయంలోకి నెట్టబడింది.భూములు ఇచ్చిన ప్రజల త్యాగం ఎంతో విలువైనది.
మానేరు ప్రాజెక్టు కోసం మాజీ శాసనసభ్యుడు రేగులపాటి పాపారావుకు తన భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసారు.అట్టి భూములు చిరునామాలు కోల్పోవడం జరిగింది అని కవి ఆవేదన వ్యక్తం చేశాడు.కవి ఇక్కడ రాజకీయ మరియు భూసంపత్తి సంబంధ సమస్యలను స్పర్శించాడు.మానేరు కోసం చేసిన త్యాగం, వ్యక్తిగత,రాజకీయ,భౌతిక కష్టాలను మించినట్టిది.
మానేరు ప్రాజెక్టు కోసం డా.చెన్నమనేని రమేష్, కేటీఆర్ లాంటి ప్రముఖ వ్యక్తులు కృషి చేశారు. ఇలాంటి గొప్ప నాయకులు మానేరు ప్రాజెక్టు విజయానికి తమ శక్తి యుక్తులను అందించి మార్గదర్శనం చేసారు.
“ఆది శ్రీనివాసుడి అపూర్వధామమై/కవి ఒక పంక్తితోనే ఒక యుగాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఒక ప్రాంతాన్ని ప్రతిబింబింప చేయగలిగినాడు. వేములవాడ ప్రాంత ప్రజలు తన పట్ల చూపించిన కృతజ్ఞతా,సేవా స్పూర్తికి అనుగుణంగా ఆది శ్రీనివాస్ గారు ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు.ఆది శ్రీనివాస్ అక్కడి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు.ప్రజా సేవలో పాల్గొన్న అతని కృషి,అంకితభావం,ప్రజల పట్ల చూపిన మమకారం,ఆ ప్రాంతాన్ని సుసంపన్నమైన ధామంగా మార్చింది.ఆది శ్రీనివాస్ గారి కృషి ప్రజల మదిలో ధామంగా నిలిచిపోయినందున ఈ కవితా పంక్తి అక్షరాల నిజం అవుతుంది.
“ప్రభవిస్తున్న నీకు వందనం తల్లీ!/నాయకుల కృషి, దైవానుగ్రహం ద్వారా నీరు ప్రవహిస్తున్నది.మానేర్ జలాశయంలోని నీరుతో పంటలు సస్యశ్యామలమైనాయి,ప్రజలకు జీవనాధారమై నిలిచింది.మానేర్ సౌభాగ్యం,ఆధ్యాత్మిక శక్తిగా నిలిచిన నీకు వందనం తల్లీ అని కవి వ్యక్తం చేసిన తీరు బాగుంది.
“ఇరవై అయిదు టిఎంసీల/బల పరాక్రమాలతో అవతరించిన/నీవు మహా జలేశ్వరివి తల్లీ!/ఇరవై అయిదు టిఎంసీలతో మానేర్ జలాశయం అవతరించింది.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతి వ్యక్తి చేసిన శ్రామిక,సాంకేతిక కృషిని గుర్తు చేస్తోంది.వారి శక్తి సామర్థ్యాలు మరియు కృషి ఫలితంగా జలాశయం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఇక్కడ జలదేవత,జీవనదాత,ప్రాణదాతగా ప్రతిష్టాత్మక రూపంలో ప్రత్యక్షంగా ప్రాజెక్టును చూస్తున్నాం.తల్లికి పూజ్య భావంతో నమస్కరిస్తున్నాడు.ఇరవై అయిదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మానేరు ప్రజలకు జీవన సౌభాగ్యదాతగా,మహా జలేశ్వరి తల్లిగా వెలసినది అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అగ్రహారం హన్మాన్ గుట్టల్లో ఒరుసుకునిపోయి/ రాజేశుడి ధర్మకుండ పుష్కరిణీకి/జలదాతవై, భీముని మల్లారెడ్డి పేట/జలపాతానికి పెద్దపీటవై ఎగువ మానేర్ కి తిరునామమై/ కె.వి.రమణాచార్యుడి నారాయణపురానికి/ ఆదిశంకరుడి కనకవర్షానివై/బహుభాషావేత్త డా.నలిమెల భాస్కరునికి/బంగారు తెలంగాణావై పరిమళిస్తున్న నీవు/మాకు నిత్య సంక్రాంతుల కానుకవు!/
మానేర్ జల ప్రవాహం తన మార్గంలో సాగుతుండగా అగ్రహారం,హన్మాన్ గుట్టలకు తాకి ఒరుసుకుని పోయి మానేర్ నీరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ధర్మకుండ పుష్కరిణీకి పవిత్ర జీవనదాతగా నిలిచింది.
భీముని మల్లారెడ్డిపేట జలపాతానికి ప్రధాన మానేర్ జలాశయం పెద్ద పీటలా ఉంది అని వర్ణించిన తీరు గొప్పగా ఉంది.అక్కడి ప్రజలకు ఎగువ మానేర్ తిరునామంగా నిలిచింది.మానేరు జలాశయం ప్రధాన పరిపూర్ణ శక్తి,ప్రగతికి కేంద్రం అనే కవి భావన అద్భుతంగా ఉంది.
కెవి రమణాచారి నారాయణపురం గ్రామం,రాజన్న సిరిసిల్లకు చెందిన వారు.వీరి తండ్రి రాఘవాచారి అధ్యాపకుడిగా పని చేశారు.వీరు 1982 లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.వీరు 2010లో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ నుంచి తెలుగు పద్య కవిత్వం మీద పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు 2012లో రిటైర్ అయ్యారు.వీరు నారాయణపురం గ్రామంలో దేవాలయాలు నిర్మించారు.వీరు పుట్టిన నేల నారాయణపురం గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.వీరు చేపట్టిన పలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తూ ఆదిశంకరుడు కనక వర్షాన్ని కురిపించినట్లుగా ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.వీరు పరిపాలనా రంగంలోనూ, సాహిత్య,సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో ప్రసిద్ధి పొందారు.
బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్ తేది 01 – 04 – 1956 రోజున నారాయణపురం గ్రామం,ఎల్లారెడ్డి పేట మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు : బుచ్చమ్మ, రాంచంద్రంలు.వీరు తెలుగు,కన్నడ,తమిళ మలయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశారు.వీరు తెలుగు, మలయాళ కుటుంబ సామెతల అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పి.హెచ్ డి.పట్టా పొందారు.వీరు పదునాలుగు భాషల చెట్టు అనే ఖ్యాతిని సంపాదించుకున్నారు. వీరు తెలుగు భాషా ఉపన్యాసకులుగా ఎస్,ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ నుండి 2011 నవంబర్ లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.వీరు తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు.వీరు 2013 సంవత్సరం అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్నారు.
మానేరు జలాశయం ఆనుకుని పారుతున్న నారాయణపురంలో పుట్టిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కె.వి రమణాచార్యులు,బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ గారలు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించింది.వారి గ్రామమైన నారాయణపురంను తాకుతూ మానేరు జలాశయం ప్రవహిస్తోంది.వారిరువురు సాంకేతిక,సాంస్కృతిక, సాహిత్య అంశాలను సమన్వయపరిచిన వ్యక్తులు.
మానేరు నీరు తెలంగాణ భూభాగానికి సౌభాగ్యాన్ని అందించింది.మానేరు జలాశయం నీటి శోభా సంపత్తితో పరిమళిస్తున్నది.మానేరు ప్రకృతి అందాలు చిందిస్తూ,సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. జలాశయం ద్వారా రాష్ట్ర ప్రజల సంప్రదాయ కళలు,ప్రాణప్రదమై శ్రేయస్కర శక్తిని ఇస్తున్నాయి. మాకు నిత్య సంక్రాంతుల కానుకవు అనే కవితా పంక్తి పూజ్య,భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నది.నిత్య సంక్రాంతి కానుక అనేది మానేరు జలాశయం అందిస్తున్న ఆనంద సౌభాగ్యాలను వ్యక్తం చేస్తున్నది.మానేరు జలాశయం రాజకీయ సాంస్కృతిక,సామాజిక రంగాల్లో ప్రధాన స్థానం సంపాదించింది అని తెలియజేయబడింది.
బంగారు తెలంగాణాగా పరిమళిస్తున్న మానేర్ జలాశయం రాష్ట్రాభివృద్ధికి మూలమై,నిత్య సంక్రాంతుల కానుకగా,ప్రజలకు జీవన,ఆధ్యాత్మిక, సాంస్కృతిక గౌరవాన్ని అందిస్తున్నది.ప్రజల నిత్య సంక్రాంతుల కానుకగా నున్న మానేర్ ప్రాజెక్ట్ ను మహాజలేశ్వరి తల్లిగా కవి భావించిన తీరు బాగుంది.
“నేతన్నల ఖిల్లా సిరిసిల్లా జిల్లా శక్తివంతమైనది/ అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరల కళాకారులకి నిలయమై/పరంధామ విజయమై హరికృష్ణల అద్దకమై/యోగాచార్య జక్కని వెంకట రాజమై/ పుస్తక నిధి నిజాం వెంకటేశమై/వడ్డేపల్లి కృష్ణ సులలిత గీతానివై/కథల గూడు గూడూరు సీతన్న చైతన్యాల వస్త్ర సంగమమై/ఆధ్యాత్మిక సాహితీ జ్యోతి జనపాల శంకరమై/అభ్యుదయ సృజనల చిటికెన సూర్యకిరణమై/ముక్కంటి జగన్నాథ రథచక్రమై/పెద్దింటి కథానిధి అశోక చక్రమై/మానేటి బాల సాహిత్య ధీర పత్తిపాక మన్మోహనమై/రంగినేని ట్రస్ట్ పల్లవమై మారసం ఎలగొండ రవమై/చేనేత కవి ఆడెపు లక్షణమై,జిందం అశోకమై/మధురకవి సాంబ కవి శర్మ సుప్రభాత గానమై/సంస్కృత పండిత్ నమిలికొండ హరిప్రసాదుడి/శృంగేరి మఠ ప్రాభవమై/ వీరగోని ఆంజనేయుడి గ్రంథాలయమై/బాలల అందెల సిరిజల్లుల/కందేపి రాణీప్రసాదరావై/ పరిశోధకురాలు ఇట్టేడు వందనమై/మహనీయ దూడం నాంపల్లి పద్య కవిత్వ ధారయై/చొప్పకట్ల చంద్రమౌళీ వచన కవిత్వమై/గర్రెపల్లి అశోకన్న బాలరసాలవాలమై/నమిలకొండ జయంత్ సంగీతమై/సలక్షణమై వర్ధిల్లు తల్లీ!/
నేతన్నల ఖిల్లా సిరిసిల్లా జిల్లా శక్తివంతమైనది. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరల కళాకారులకు నిలయమై ఉంది.సిరిసిల్ల జిల్లా ప్రాంతీయ శక్తి, సాంప్రదాయ సంపద,కళాకారుల అభిమానాన్ని ప్రతిబింబిస్తుంది.అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారుచేసే కళాకారులకు సిరిసిల్లా జిల్లా నిలయంగా ఉంది.ఇది సాంస్కృతిక,ఆర్థిక కళారూపాల ఆధార కేంద్రం.ఇది మానేరు విశిష్ట జలాశయం గల ప్రాంతం,భౌతిక,సామాజిక, సాంస్కృతిక శక్తుల కేంద్రం అని సూచిస్తుంది. సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారులు పరంధాములు ఆయన కుమారుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు తయారు చేసే వారు. హరికృష్ణ చీరలపై అద్దకం వేసే నిపుణుడుగా ఖ్యాతిని ఆర్జించినాడు.కవి సిరిసిల్లకు చెందిన పరంధాము,విజయ్,హరికృష్ణ వారు సాధించిన కళా నైపుణ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.
“యోగాచార్య జక్కని వెంకటరాజమై/కవి జక్కని వెంకటరాజం తేది 10 – 05 – 1947 రోజున జన్మించారు.వీరు గూడెం గ్రామం,ముస్తాబాద్ మండలం,సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : మల్లవ్వ,రామకిష్టయ్యలు.వీరి విద్యార్హతలు బి.ఏ. హెచ్.డి.సి‌.వీరు 1961 సంవత్సరం విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్, సిరిసిల్ల,(సెస్) ఉద్యోగంలో నియమించబడ్డారు.వీరు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా మే,2005లో రిటైర్ అయ్యారు.వీరు ప్రవృత్తిరీత్యా కవిగా, యోగాచార్యుడిగా ప్రసిద్ధి పొందారు.
కవి వెంకటరాజం ముద్రిత రచనలు : 1) యువ స్వరాలు కవితా సంకలనం,1973. (ఐదుగురు కవులలో వీరు ఒకరు) 2)అర్ధరాత్రి సూర్యుడు కవితా సంపుటి,1977.3)ఆట వెలదులు – తేట గీతులు శతకం,2011.4)వేంకట రాజ శతకం (కందాలు) 2014.5)జక్కని రుబాయిలు 2016. 6)కఠోపనిషత్తు (ముత్యాల సరాలలో) 2018. 7)ఉపనిషత్త్రయము (ముత్యాల సరాలలో) 2023. 8)వరలక్ష్మి ద్విశతి (స్మృతి కావ్యం) 2023.9)ఐతరేయ ప్రశ్నోపనిషత్తులు (ముత్యాల సరాలలో) 2024.10) తైత్తిరీయోపనిషత్తు (ముత్యాల సరాలలో) మార్చి,2025.11)శ్రీరామ శతకం (కందాలు) ఏప్రిల్, 2025.
“పుస్తక నిధి నిజాం వెంకటేశమై/కవి నిజాం వెంకటేశం తేది 14 – 11 – 1948 రోజున సిరిసిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు సత్యమ్మ, విశ్వనాథంలు.వీరు వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాలో పని చేసి 1997లో రిటైర్ అయ్యారు.వీరు హైదరాబాదులోని పద్మారావునగర్ లో స్థిరపడ్డారు.వీరు ప్రముఖ కవి, అనువాదకుడు.వీరు ఎందరో కవులకు ఉచితంగా పుస్తకాలు వితరణ చేసే వారు.వీరు18 – 09 – 2022 రోజున గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి పోయారు.
“వడ్డేపల్లి కృష్ణ సులలిత గీతానివై/వడ్డేపల్లి కృష్ణ తేది 05 – 08 – 1948 రోజున సిరిసిల్లాలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ,లింగయ్యలు.వీరు ప్రముఖ కవిగా,సినీ గేయ రచయితగా ప్రసిద్ధి పొందారు.వీరు అనారోగ్యంతో 06 – 09 – 2024 రోజున పరమపదించారు.
“కథల గూడు గూడూరి సీతన్న చైతన్యాల వస్త్ర సంగమమై/కవి గూడూరి సీతారాం
తేది 18 – 07 – 1936 రోజున జన్మించాడు.వీరు హనుమాజీపేట గ్రామం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరు 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాశారు.వీరు తెలంగాణ కథా సాహిత్యంలో,పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్దం చేసినారు. వీరు 1953లో తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా పని చేశారు.వీరు పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు.వీరు రాసిన కథల్లో మారాజు,లచ్చి,పిచ్చోడు, రాజమ్మ రాజీరకం,ప్రసిద్ధ కథలనుగా చెప్పుకుంటారు.వీరు తాను రాసిన కథల్లో తెలంగాణా భాషకు,యాసకు పట్టం కట్టారు. వీరు తెలంగాణకు చెందిన తొలి తరం కథకుడిగా పేరుగాంచారు.వీరు తేది 25 – 09 – 2011 రోజున పరమపదించారు.
“ఆధ్యాత్మిక సాహితీ జ్యోతి జనపాల శంకరమై/ డాక్టర్ జనపాల శంకరయ్య తేది 05 – 02 – 1958 రోజున సాధారణ నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరు ఆవునూరు గ్రామం,ముస్తాబాద్ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు లస్మవ్వ,నరసయ్యలు.వీరు ఆవునూరు ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు.తెలుగులో విశారద పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు.వీరు డి.ఓఎల్, బి.ఏ. బిఈడి,ఎంఏ (తెలుగు),ఎం.ఫిల్.డిగ్రీ, పి.హెచ్ డి.పట్టాను పొందారు.వీరు కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు అనే అంశంపై ఎం.ఫిల్ డిగ్రీని పొందారు.వీరు తెలుగు లంబాడీల గేయ సాహిత్యం పై పరిశోధన చేసి పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు తేది 04 – 01 – 1984 రోజున తెలుగు పండిట్ టీచర్ గా ప్రభుత్వ పాఠశాల,బద్దెనపల్లి గ్రామంలో నియమించబడ్డారు. జనపాల శంకరయ్య ముద్రిత రచనలు : 1)కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు – ఎం.ఫిల్. గ్రంథం,1998.2) తెలుగు లంబాడీల గేయ సాహిత్యం పి.హెచ్ డి. సిద్ధాంత గ్రంథం, 2000. 3)ఆచార్యదేవోభవ శతకం,2004.
4)బహుముఖ ప్రజ్ఞాశాలి కేటీఆర్ బుర్రకథ, 2019. 5)మా అవ్వ పాడిన సద్దుల బతుకమ్మ పాట, 2024.6)అక్షరామృతం గేయాలు,2023. 7)భారతరత్న వాజపేయి గారి సంక్షిప్త చరిత్ర కథ గేయం,2024.
“కవి చిటికెన కిరణ్ కుమార్ తేది 06 – 10 – 1980 రోజున సిరిసిల్లలో జన్మించారు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు.వీరి తల్లిదండ్రులు ఉమ,కనుకయ్యలు.వీరు ఎం.కాం.విద్యను అభ్యసించారు.వీరు ఓ తండ్రి తీర్పు లఘు చిత్రం నిర్మించారు.వీరు ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రిసెర్చ్ ఫోరం ఫౌండేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరు చైతన్య స్ఫూర్తి చిటికెన వ్యాస సంపుటిని ముద్రించారు.వీరు సమాజ అభ్యుదయం కాంక్షించి పలు కవితలు,కథలు,సాహిత్య వ్యాసాలు విస్తృతంగా రాస్తున్నారు.
కవి జూకంటి జగన్నాథం తేది 20 – 06 – 1955 రోజున తంగళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందినవారు.వీరి తల్లిదండ్రులు సుశీల,దుర్గయ్యలు.వీరు 1993 నుండి సాహిత్య సృజన చేస్తున్నారు.వీరు ముద్రించిన వచన కవిత్వం వివరాలు:పాతాళగరిగె 1993,ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1996, గంగడోలు 1998,వాస్కోడిగామా డాట్ కామ్ 2000, బొడ్డుతాడు 2002,ఒకరోజు పది గాయాలు (అత్యాధునిక కావ్యం) 2004,తల్లి కొంగు 2006, పిడికెడు కలలు! పిడికెడు కన్నీళ్లు! 2008,తారంగం 2009,రాజ పత్రం 2011,చిలుక రహస్యం 2012, చెట్టును దాటుకుంటూ.. 2015,వస 2017,ఊరు ఒక నారు మడి 2018,సద్ది ముల్లె, 2020,ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్ లు, 2023,మనాది, 2025. వీరు ముద్రించిన కథా సంకలనాలు :వైపణి, 2004, జూకంటి జగన్నాథం కథలు, 2020.గాంధీ గారి మూడు కోతులు సామాజిక రాజకీయ వ్యాసాలు, 2024.
“పెద్దింటి కథానిధి అశోక చక్రమై/కవి పెద్దింటి అశోక్ కుమార్ తేది 06 – 02 – 1968 రోజున జన్మించాడు. వీరు భీముని మల్లారెడ్డి పేట గ్రామం,గంభీర్రావు పేట మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు. వీరు రాజన్న సిరిసిల్లా జిల్లా,చందుర్తి మండలం, కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.వీరు కథా, నవలా రచయితగా ప్రసిద్ధి పొందారు.వీరు సినిమాలకు కథలు,మాటలు,పాటలు రాస్తున్నారు. వీరు రెండు వందల యాభై పైగా కథలు,ఏడు నవలలు,పది కథా సంపుటాలు ప్రచురించారు.
కవి పత్తిపాక మోహన్ తేది 05 – 01 – 1972 రోజున జన్మించాడు.వీరు లింగంపేట గ్రామం,చందుర్తి మండలం రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు గంగాబాయి,లక్ష్మీరాజంలు.వీరు ఎం.ఏ.తెలుగు,పి.హెచ్ డి. పట్టాను పొందారు.వీరు గజల్ ప్రక్రియలో సమగ్ర పరిశీలన అనే అంశం మీద పరిశోధన చేశారు.వీరు బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి పొందారు.వీరు నేషనల్ బుక్ ట్రస్ట్,హైదరాబాద్, ప్రాంతీయ సంపాదకుడిగా పని చేస్తున్నారు.వీరు రాసిన బాలల తాత బాపూజీ గేయ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.
“రంగినేని ట్రస్టు పల్లవమై అనే కవితా పంక్తి ఈ ట్రస్టు చేసిన సేవలను ప్రతిబింబిస్తుంది.రంగినేని మోహన్ రావు 2000 సంవత్సరంలో రంగినేని ట్రస్ట్ ను స్థాపించారు.అయితే ట్రస్ట్ ప్రధాన కార్యక్రమాలు 2002 నుండి సక్రమంగా ప్రారంభమయ్యాయి.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థాపించబడింది.ట్రస్టుకు అనుబంధంగా గల విద్యాలయంలో మెరుగైన విద్యను అందిస్తున్నది.చదువు కోసం ఆర్థిక సహాయం లేని అనాధ బాలబాలికలకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు.వారి విద్య భవిష్యత్తు నిర్మాణం కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు వారికి బాల సాహిత్యం రాయించే అవకాశం కల్పిస్తున్నారు.ఇలా రాయించిన కథలు,పద్యాలు,వ్యాసాలు మొదలైనవి వారిలోని ప్రతిభను ప్రతిబింబిస్తాయి.వీరు పిల్లల వ్యక్తిత్వ వికాసం,నైపుణ్యాల పెంపునకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు‌.సాంస్కృతిక విద్యా,సామాజిక రంగాల్లో పిల్లల ప్రగతికి తోడ్పడుతున్నారు.బాల సాహిత్యం రచించే రచయితలను ప్రోత్సహించడం,వారి రచనలకు వేదిక కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మొత్తం మీద రంగినేని ట్రస్ట్ సమాజంలోని వెనుకబడిన పిల్లల విద్య, సృజనాత్మకత,వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం సేవలు అందిస్తూ తెలుగు బాల సాహిత్య అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తోంది.విద్యార్థులలోని మేధాశక్తికి పదును పెడుతూ,వారిలో సృజనను ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థులు చేత కథలు,కవితలు రాయించి వారిని బాలసాహితీకారులుగా తీర్చిదిద్దుతున్నారు.బాలల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు.ప్రతి సంవత్సరం బాల సాహిత్యంలో పోటీలు నిర్వహించి రచయితలకు అవార్డులను కూడా ఇస్తున్నారు.రంగినేని ట్రస్టు ద్వారా బాలలకు విశిష్ట సేవలను అందిస్తున్నారు.
“కవి ఎలగొండ రవి తేది 30 – 05 – 1970 రోజున సిరిసిల్లలో జన్మించాడు.వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.వీరు1994 నుంచి సాహిత్య సృజన గావిస్తున్నారు.వీరు ప్రచురించిన పుస్తకాలు:1) ఖడ్గ ధార,2)సముద్రం 3)జీవితం పియానో మెట్ల మీద.వీరు సిరిసిల్ల మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు.వీరు ప్రస్తుతం మారసం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
“కవి ఆడెపు లక్ష్మణ్ తేది 06 – 10 – 1971 రోజన ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించాడు. వీరు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రుక్కమ్మ,బాలయ్యలు.వీరు తొమ్మిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్లలో చదువుకున్నారు.వీరు వృత్తిరీత్యా చేనేత కార్మికుడిగా పని చేస్తున్నారు.వీరు ప్రవృత్తి రీత్యా కవిత్వం రాస్తున్నారు.కవి ఆడెపు లక్ష్మణ్ ప్రచురించిన పుస్తకాలు :
1)రాత్ పైలీ దివస్ పైలీ కవితా సంపుటి
2) సిరిసిల్ల నానీలు 3)కామ్ గార్ కవితా సంపుటి.
కవి జిందం అశోక్ తేది 05 – 04 – 1973 రోజున జన్మించాడు.వీరు రామచంద్రాపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : ఎల్లవ్వ, రాజయ్యలు.వీరు ఎంఎస్సీ,బిఇడి,విద్యను అభ్యసించారు.వీరు వృత్తిరీత్యా ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.వీరు ప్రవృత్తిరీత్యా సాహిత్య సృజన గావిస్తున్నారు.వీరి ముద్రిత రచనలు: 1)అదృశ్య కిరణాలు కవితా సంపుటి,2)మానేరు నానీలు, 3)ఎనగర్ర కవితా సంపుటి,4)గవ్వలు కవితా సంపుటి,5)చుక్క పొద్దు కవితా సంపుటి, 6)వర్గమూలాలు కవితా సంపుటి.వీరు పెద్ద గడియారం పుస్తకానికి సంపాదకత్వం వహించారు.
“మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ (సాంబ కవి) తేది 24 – 06 – 1918 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరు వేములవాడకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు : సత్తెమ్మ,మృత్యుంజయ శర్మలు.వీరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర నాట్యమండలి వారు ప్రదర్శించిన ఎన్నో పౌరాణిక నాటకాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలనందినారు.వీరు హిందీ భాషా ప్రచారోద్యమంలో పాల్గొని భాషా గేయ రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా హిందీ భాషా ప్రచారాన్ని గావించారు.వీరు స్వాతంత్ర్య సమరయోధులు.వీరు గ్రంథాలయ నిర్వహణ గావించారు.వీరు కాకతీయ పత్రికకు విలేకరిగా పని చేసారు.వీరు 09 – 01 -1998 రోజున స్వర్గస్తులయ్యారు.
కవి సాంబశివశర్మ ముద్రిత రచనలు :1.ముక్తాహారం (పద్య కావ్యం)2.కుంజ విహారం (పద్య కావ్యం) 3.జయశ్రీ (పద్య కావ్యం) 4.లోభ సంహారం (అధిక్షేప కావ్యం) 5.మధుర ఝంకారం (మంగళ హారతులు, కీర్తనలు)6.భక్తి గీతాలు (భజనలు)7.ద్విపద రామాయణం (రాధే శ్యాం రామాయణానికి స్వేచ్ఛానువాదం)బాల సుందరకాండములు.
8) దక్షయజ్ఞం (బుర్రకథ) 9.శ్రీ రాజ రాజేశ్వర సుప్రభాతం.10.శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర సుప్రభాతం.11.శ్రీ మదాది శంకరాచార్య సుప్రభాతం.12) బాసర సరస్వతి సుప్రభాతం. 13.గంగా సుప్రభాతం.
కవి సాంబశివశర్మ అముద్రిత రచనలు:
1.భద్రావతి (నాటకము).2.త్యాగయ్య (నాటకము) 3.ముగ్గురు మరాఠీలు (బుర్రకథ)4.శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర మహాత్మ్యం (హరికథ)5.ద్విపద రామాయణము (అయోధ్య,అరణ్య, కిష్కింద,యుద్ధకాండాలు కొంత వరకు లభ్యం) 6.శ్రీ రాజేశ్వర తారావళి (లిఖితపూర్వకమైన చివరి రచన)

కొమురవెల్లి మల్లన్న సుప్రభాతం
బెల్లంపల్లి శ్రీ రామచంద్ర సుప్రభాతం
శ్రీ మదుజ్జయిని మహాకాళీ సుప్రభాతం.
“కవి నమిలకొండ హరి ప్రసాద్ శర్మ తేది 05 – 06 – 1953 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు: నాగుబాయి, కోటయ్య ఘనాపాటి.వీరు సంస్కృత బి.ఓ.ఎల్. శిక్షా శాస్త్రి, ఎం,ఏ. సంస్కృతాంధ్రములు విద్యను అభ్యసించారు.వీరు శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఉన్నత సంస్కృత పాఠశాల,వేములవాడలో ఉపాధ్యాయుడిగా పని చేశారు.కవి నమిలకొండ హరిప్రసాద్ శర్మ ముద్రిత రచనల వివరాలు :
1)శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతము,
2)రాజేశ్వరోదాహరణం, 3)అష్టమూర్తి స్తవము,4)రాజేశ్వర ఋణ హర స్తోత్రం,5)దేశ శ్లోకీ సాయి స్తుతి,
6) మాతృ స్మృతి,7) ముక్తాత్మ బంధం,
8) ముకుంద మాల (పద్యానువాదం),
9) ఇందూరు గణేశ సుప్రభాతం,
వీరు 2006 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేత అందుకున్నారు.వీరు కరీంనగర్ లో స్వగృహం నిర్మించుకున్నారు.వీరు అనారోగ్యంతో 31 – 8 – 2022 రోజున పరమపదించినారు.వీరి భార్య శ్రీమతి యమున సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, చింతకుంట గ్రామంలో,తెలుగు భాషా ఉపన్యాసకులుగా పని చేసి రిటైర్ అయ్యారు. కవయిత్రి యమున ఎం.ఏ. తెలుగు,ఎం.ఫిల్ డిగ్రీని పూర్తి చేశారు.వీరు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి వేములవాడ రాజేశ్వరుని మహాత్మ్యం – అనుశీలన అంశంపై పరిశోధన చేసి ఎంఫిల్ డిగ్రీని పొందారు.
వీరగోని ఆంజనేయులు గౌడ్ తేది 06 – 05 – 1951 రోజున సుల్తానాబాద్ మండలం,గర్రెపల్లి గ్రామంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు :హనుమవ్వ, బసవయ్య గౌడ్ లు.వీరు 1 వ తరగతి నుంచి 11 వ తరగతి వరకు 1956 నుంచి 1968 వరకు ప్రభుత్వ పాఠశాల,గర్రెపల్లి గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. వీరు పియుసి 1968 నుంచి 1969 వరకు మరియు బిఏ డిగ్రీ 1969 నుంచి 1973 వరకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్ లో చదివారు.వీరు బిఇడి 1975 సంవత్సరంలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,వరంగల్ లో చదివారు.వీరు సుల్తానాబాద్ తాలూకాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,అబ్బాపూర్ లో టీచర్ గా నియమింపబడ్డారు.వీరు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల,వేములవాడలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం టీచర్ గా పనిచేసి తేది 31- 05 – 2009 రోజున రిటైర్ అయ్యారు.వీరు 1978లో తన తల్లిదండ్రుల పేరిట వీరగోని హనుమమ్మ,బసవయ్య పౌర గ్రంథాలయం,వేములవాడలో ఏర్పాటు చేసినారు. వీరు స్థాపించిన గ్రంథాలయంలో లక్షా డెబ్భై వేలకు పైగా పుస్తకాలు తెలుగు,హిందీ,ఇంగ్లీష్,సంస్కృతం అందుబాటులో ఉన్నాయి.వీరు స్థాపించిన గ్రంథాలయం ఎందరో యువతీ యువకులకు, విద్యార్థులకు,పరిశోధకులకు,పాత్రికేయులకు, సాహితీ ప్రియులకు విజ్ఞాన కల్పతరువుగా సేవలు అందిస్తున్నది.వీరు నడుస్తున్న గ్రంథాలయ ఉద్యమకారుడుగా ఖ్యాతిని ఆర్జించారు.వీరు అందిస్తున్న గ్రంథాలయ సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులను పొందారు.వీరు గ్రంథాలయం పూర్తిగా సొంత ఖర్చులతో నిర్మించినారు.వీరు అందిస్తున్న గ్రంథాలయ సేవలకు,వారి కుటుంబ సభ్యులు తోడ్పాటును అందిస్తున్నారు.
కవయిత్రి డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ తేది 19 – 10 – 1969 లో జన్మించారు.వీరు ‌బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందినారు.వీరి తల్లిదండ్రులు : అంగలకుదిటి గోవిందమ్మ,సుందరాచారి గారలు.వీరి తండ్రి సుందరాచారి స్వాతంత్ర సమరయోధులు.వీరి భర్త డాక్టర్ కందేపి ప్రసాద రావు పిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు.వీరు ఎం.ఎస్సీ. (జువాలజీ) ఎంఏ (తెలుగు) చదివారు.వీరు నాగార్జున యూనివర్సిటీ నుండి బాల సాహిత్యంలో వైజ్ఞానిక రచనలు అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాను పొందారు.
కవయిత్రి కందేపి రాణీప్రసాద్ ముద్రిత రచనలు:1) పూల తోట కవితా సంకలనం బాల సాహిత్యం.2) సరదా సరదా బొమ్మలు.3) వార్త దినపత్రిక మొగ్గ లో పిల్లల కోసం బొమ్మలతో అచ్చయిన వ్యాసాలు.4) హరివిల్లు కవితా సంకలనం బాల సాహిత్యం. మచ్చుకు కొన్ని వివరాలు ఇచ్చాను.వారు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి.
కవయిత్రి డాక్టర్ ఇట్టేడు విష్ణు వందనా దేవి వేములవాడలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు : శారదాబాయి,జగదీశ్వరయ్యలు.వీరు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ జీవితం – రచనలు అంశంపై పరిశోధన చేసి పి.హెచ్ డి. పట్టాను పొందారు.పర్యవేక్షకులుగా డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ వ్యవహరించారు.కవయిత్రి విష్ణువందనాదేవి ముద్రిత రచనలు:1) మధురకవి సాంబశివశర్మ జీవితం – రచనలు పరిశోధనా గ్రంథం, 2009.2) మౌన శబ్దాలు నానీలు,2012. 3) మామిడిపల్లి సాంబ కవి మోనోగ్రాఫ్ ముద్రణ 2019.వీరు రాసిన వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.వీరు 25 సంవత్సరాలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి రిటైర్ అయ్యారు.వీరు ప్రస్తుతం మిద్దె సేద్యం చేస్తూ సమాజంలో అవగాహన కల్పిస్తున్నారు.
కవి దూడం నాంపల్లి తేది 20 – 05 – 1944 రోజున పొత్తూరు గ్రామం ఇల్లంతకుంట మండలం,కరీంనగర్ జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు లక్ష్మి, నరసయ్యలు.వీరు సిరిసిల్ల,ప్రగతినగర్ లో స్థిరపడ్డారు.వీరి భార్య జానాబాయి.వీరి కుమారుడు దూడం మనోహర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తూనే ప్రవృత్తిరీత్యా సాహితీ సృజన గావిస్తున్నారు.కవి దూడం నాంపల్లి 14 – 04 -1964 రోజున మలేరియా వర్కర్ గా నియమించబడ్డాడు. వీరు తెలుగు పండిట్ గా 20 – 07 – 1970 రోజున నియమింపబడ్డారు.వీరు పోతుగల్,రేపాక,పెద్ద లింగాపూర్,సిరిసిల్ల పలు పాఠశాలల్లో విధులు నిర్వహించారు.వీరు 31 – 07 – 2002 రోజున తెలుగు పండిట్ గా రిటైర్ అయ్యారు.వీరు 05 -09 -2013 రోజున కీర్తిశేషులైనారు.కవి దూడం నాంపల్లి ముద్రిత రచనలు :1) శిష్య ద్విశతి (కందాలు) 1982.2)జీమూత వాహనుడు పద్య కావ్యం 1986. 3) శకుంతల హరికథ 1988.4) పాండవ జననం హరికథ 1991. 5)ద్వయి నాదం ఖండకావ్యం 1993. 6)పాండవ అజ్ఞాత వాసం వీధి నాటకం 1994.7)పంచామృతం సాహిత్య వ్యాసాలు,1997. 8) అభినందన చందనం గేయ సంపుటి 2000. 9)పాటల పల్లకి (పాటల పేటిక)2003.10)సాహితీ సమదర్శనం (షష్టిపూర్తి సంచిక) 2004.
11) భూమిక (కె.భూమిరెడ్డి షష్ఠబ్ది సంచిక పద్య కృతి) 2005.12)మావూరు బడి (అధిక్షేప కథానిక) 2005.13)కవన కలశం కవితా సంపుటి,2006. 14)జైనానీ – జైజైనానీ (గల్పిక)2007.15)జైనానీ – లేఖలు (కూర్పు) 2007.16) సన్మాన కోలాహలం (కథానిక) 2008.17) పరశురామ ప్రీతి పద్య కృతి 2009. 18) స్వర్ణముఖి (సాహితీ స్వర్ణోత్సవ సంచిక) 2011
ప్రముఖ కవి చొప్పకట్ల చంద్రమౌళి తేది 27 – 10 -1937 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి,రాధాకృష్ణయ్యలు.వీరు టీచర్ గా నియమింపబడి,తర్వాత హెడ్మాస్టర్ గా,తర్వాత సిరిసిల్ల జూనియర్ కళాశాలలో తెలుగు భాషా ఉపన్యాసకులుగా పని చేసి మే,1996 సంవత్సరంలో రిటైర్ అయ్యారు.వీరు ముద్రించిన సమతా దీపాలు కవితా సంపుటి,1976 సంవత్సరంలో వెలువడింది.వీరు వేములవాడలో స్థిరపడ్డారు.వీరి భార్య శ్రీమతి అంజని.కవి చంద్రమౌళి అనారోగ్యంతో తేది 13 – 03 – 2014 రోజున పరమపదించారు.
కవి గర్రెపల్లి అశోక్ తేది 15 – 8 – 1959 రోజున భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరు ఎం.ఏ. (తెలుగు),బిఇడి,ఎం.ఫిల్.డిగ్రీని పొందారు. వీరు1984 తెలుగు పండిట్ గా నియమింపబడ్డారు. వీరు 2016లో రిటైర్ అయ్యారు.వీరు దూడం నాంపల్లి సాహిత్యం పై పరిశోధించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎం.ఫిల్.డిగ్రీని పొందారు.వీరు బాల సాహితీవేత్తగా ప్రసిద్ధి పొందారు.కవి గర్రెపల్లి అశోక్ ముద్రిత రచనలు :1)నాంది కవితా సంపుటి,1977.2)ఎంకటి కథలు పిల్లల కథలు,2019.3) మా బడి కథలు పిల్లల కథలు,2020.4) సరికొత్త ఆవు – పులి కథలు రంగుల చిత్రాలతో పిల్లల కథలు 2020. 5)ఎం.ఫిల్.పరిశోధనా గ్రంథం మధురకవి దూడం నాంపల్లి రచనలు పరిశీలన – 2020. కవి నమిలకొండ జయంత్ తేది 06 – 12 – 1964 రోజున సాధారణ బ్రాహ్మణ కుటుంబం, వేములవాడలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు : నాగుబాయి,కోటయ్య ఘనాపాటిగారలు.వీరు ఎం.ఏ.(తెలుగు), బిఇడి.విద్యను అభ్యసించారు. వీరు17 – 04 – 1989 రోజునప్రభుత్వ పాఠశాల, ఘన్ముక్ల గ్రామంలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డారు.వీరు కవిత్వం,గేయాలు, పాటలు రాస్తున్నారు.వీరికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది.వీరు గొప్ప కళాకారుడు,చిత్రకారుడు.వీరు వేములవాడలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప కీర్తిని సంపాదించారు.వీరు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కవి నాగేంద్ర శర్మ మిడ్ మానేర్ ప్రాంతం కవులకు, కళాకారులకు నిలయం అని పేర్కొన్నారు.మానేరు జలాశయాన్ని సలక్షణమై వర్ధిల్లు తల్లీ అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“అసలు సిసలైన ఒక కావ్య నాయికవు/మానేటి నాగరికతా మహ భాగవతానివి/కావ్య నాయిక ఈ పదం కవిత్వపరంగా మానేరు జలాశయాన్ని ప్రాణప్రదమైన పాత్రధారిగా చూపిస్తుంది.మానేరు మానవ సంబంధమైన ప్రాంతీయ నాగరికతను, సాంస్కృతిక సంపదను పరిరక్షించే కేంద్రం. మహాభాగవతానివి అంటే భక్తి,ధార్మికత, సాంస్కృతిక విలువలు కలిగినట్టిది అని అర్థం. మానేర్ కేవలం జలధార కాదు,ప్రజల సంస్కృతి, ధర్మ,సాహిత్య ఆధ్యాత్మిక పరిరక్షణ వేదిక.మానేరు ప్రజల జీవితానికి,నాగరికతకు,సాహిత్యానికి ప్రాణదాత.మానేరు అసలు సిసలైన కావ్య నాయిక అని చెప్పడం బాగుంది.
“పర్యాటక దర్శినివి!/ఈ కవితా పంక్తిలో పర్యాటక దర్శనివి అనేది ఆ జలాశయ సౌందర్యానికి, ఆధ్యాత్మికతకి,సామాజిక ప్రయోజనానికి కల్పించిన రూపం.మానేర్ జలాశయం సూర్యోదయ వేళల్లో ముత్యాల్లా మెరుస్తున్న అలలతో,సాయంత్రపు సమయంలో బంగారు కాంతి కలిగిన నీటి అలలతో ఒక చిత్రకారుడు చిత్రించిన దృశ్యంలా ఉంటుంది. విస్తృతమైన నీరు చుట్టూ ఉన్న కొండలు, పచ్చదనంతో కలబోసిన ఒక దివ్య దృశ్య రూపాన్ని సృష్టిస్తాయి.మానేర్ నదీ పరివాహక ప్రాంతం తెలంగాణా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం గలది. మానేర్ జలాశయం ప్రక్కన ఉన్న దేవాలయాలు, శిలాశాసనాలు,పురాతన కట్టడాలు అన్ని ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికతను,సాంప్రదాయక గాఢతను సమకూరుస్తున్నాయి.మానేర్ జలాశయం పరిసర ప్రాంతాల సాగు భూములకు ఆధారం.కవి దీనిని పర్యాటక దృక్కోణంలో చెప్పినా అంతర్భావంగా అది ప్రజల జీవనాధారానికి మూలం అనే సూచన ఉంది.ప్రకృతిని దర్శించడానికి వచ్చిన పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రాంతం.పర్యాటక దర్శిని అనే కవితా పంక్తి తెలంగాణ భూభాగ సౌందర్యాన్ని ప్రజల అభివృద్ధి స్ఫూర్తిని ఒకే శ్వాసలో మన ముందు ఉంచుతుంది.
“మత్స్యకారులకు కోహినూరంతటి/అమూల్య వజ్రాభరణానివి!/ఈ కవితా పంక్తులు మానేర్ జలాశయం సారాన్ని అత్యంత మృదువైన,గాడమైన భాషలో వ్యక్త పరుస్తాయి.కవి ఇక్కడ జలాశయాన్ని కేవలం నీటి నిల్వగా కాకుండా జీవనాధారంగా విలువైన సంపదగా చిత్రించాడు.కోహినూర్ వజ్రంతో జలాశయాన్ని పోల్చాడు.కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైనది.కవి ఆ విలువను మత్స్యకారుల వృత్తిలోకి మార్చాడు. మత్స్యకారులకి జలాశయం జీవన గని. మత్స్యకారుల జీవితం జలాశయంతో ముడివడి ఉంటుంది.ఆ జలాశయం నీటిలోనే వారి ఆహారం, ఆదాయం,ఆనందం,అస్తిత్వం దాగి ఉన్నాయి. అందుకే కవి దానిని అమూల్య వజ్రాభరణం అని పిలిచాడు.కవి మానేర్ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా,సాగునీటికి మూలంగా మాత్రమే కాకుండా సామాజిక జీవనానికి ఆధారమైన వనరుగా కూడా భావించాడు.జలాశయం వల్ల ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.మానేర్ జలాశయం మత్స్యకారులకి కోహినూర్ వజ్రం వలె అమూల్యమైనది అని చెప్పిన తీరు బాగుంది.
“వరదవెళ్ళి గురుదత్త దేవునికి బంగారు కొండవు!/ ఇది కేవలం భౌగోళిక స్థల వివరణ కాదు. ఆధ్యాత్మికత,భక్తి,ప్రకృతి సౌందర్యం,ప్రజల భావోద్వేగం అన్నీ కలిసిన కవితా దృశ్యం.మానేరు జలాశయం పరిసరాలు వరదవెళ్ళి గ్రామంలో కొలువై ఉన్న గురుదత్త దేవాలయం ఆ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రమై విలసిల్లింది.కవి ఆ దృశ్యాన్ని బంగారు కొండగా చిత్రీకరించి ఆ జలాశయం యొక్క మహిమను దేవాలయంతో అనుసంధానించాడు.బంగారు కొండవు అనేది ప్రకృతి సౌందర్యాన్ని,ఆధ్యాత్మిక శోభను సూచిస్తుంది.మానేరు జలాశయంలోని నీరు సూర్యరశ్మిలో మెరుస్తూ బంగారు వర్ణంలో కాంతులు విరజిమ్ముతుంది.ఆ దృశ్యం గురుదత్త స్వామి పుణ్యక్షేత్రానికి బంగారు కొండలా కనిపిస్తుంది అని కవి భావించాడు.మానేరు జలాశయం భక్తి మరియు ప్రకృతి కలయికగా దేవునికి సమర్పితమైన స్వర్ణ శిఖరంగా మారింది.జలాశయం యొక్క సౌందర్యం, దేవాలయం యొక్క పవిత్రత,ఇవి కవిలో గాఢమైన ఆరాధనా భావాన్ని రేకెత్తించాయి.జలాశయాన్ని బంగారు కొండతో పోల్చినప్పటికి.జలాశయం నిజంగా బంగారు కొండ కాదు.కానీ,కవి దృష్టికి ఆ జలాశయం దేవుని ఆలయానికి స్వర్ణ శోభతో నిండిన కొండ వలె కనిపిస్తుంది.వరదవెళ్ళి గురుదత్త దేవునికి అనే పదాలు శ్రవణానందాన్ని కలిగిస్తాయి. తెలంగాణా భక్తి సంప్రదాయంలో దత్తాత్రేయ స్వామికి విశేష ప్రాధాన్యం ఉంది.జలాశయ నిర్మాణం తరువాత నీటితో కప్పబడిన పరిసరాలు ప్రకాశవంతమై,దేవుని వైభవాన్ని మరింత పెంచాయి. కవి మానేరు జలాశయాన్ని భక్తి, ప్రకృతి శోభల సమ్మేళనంగా చిత్రించారు.
“నీ ప్రవాహ సామర్థ్యాలు జగత్కళ్యాణాలు!/ కవి మానేర్ జలాశయం ప్రాజెక్ట్ మహిమను,అది సమాజానికి అందించే పరమహితాన్ని,అత్యంత స్ఫూర్తిదాయకంగా వ్యక్తపరిచాడు.మానేర్ జలాశయం కేవలం ఒక ప్రాంతానికే కాదు.దాని నీరు చేరే ప్రతి భూమికి,ప్రతి చెట్టుకి,ప్రతి రైతుకు కళ్యాణకారకంగా ఉంటుంది.మానేర్ జలాశయం వల్ల ఉత్తర తెలంగాణలోని సాగు విస్తరిస్తుంది. రైతుల జీవనోపాధి మెరుగుపడుతుంది.నీటి కొరత తగ్గుతుంది.నీరు ప్రవహిస్తే జీవితం వికసిస్తుంది.నీరు నిలిస్తే సమాజం నిలుస్తుంది.మానేర్ జలాశయ ప్రవాహం కవి దృష్టిలో నీటి తరలింపు కాదు.అది ప్రజల ప్రగతికి,పంటల పుష్టికి,ప్రకృతి పరిమళానికి మూలం.మానేరు జలాశయం జగత్కల్యాణకారకం అయినట్టిదిగా భావించవచ్చు.
“జన సామాన్యానికి భువనేశ్వరి మాతవై/ ఏడాదంతా జలసింగారాలతో/మా నేలలో ఎములాడ రాజన్న జ్యోతిర్లింగానివై/నిండు చందమామవై చల్లని చూపులు ప్రసాదించు తల్లీ!/కవి ఈ జలాశయాన్ని ఒక దేవతా స్వరూపంగా భువనేశ్వరి మాతగా ఆవిష్కరించాడు.
భువనేశ్వరి మాత సృష్టికి,పోషణకు,కరుణకు ప్రతీక.అదే విధంగా మానేరు జలాశయం ప్రజలందరికీ సమానంగా జీవజలం ప్రసాదిస్తుంది కాబట్టి గొప్పగా ఉంది.
“ఏడాదంతా జల సింగారాలతో/ఈ కవితా పంక్తిలో జల సింగారం అనేది ఇంపైన ఉపమానం. జలాశయం సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండి దానిపై ప్రసరించే సూర్యకాంతితో ప్రతిబింబించే ఆకాశంతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది.
మానేర్ జలాశయాన్ని ఎములాడ రాజన్న జ్యోతిర్లింగంతో పోల్చడం జరిగింది.ఇది రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజల భక్తికి,శ్రద్ధకు నిదర్శనం. జలాశయం రూపంలో ఆధ్యాత్మిక శక్తి భూమిపై అవతరించినట్లు కవి భావించాడు.
నిండు చందమామవై చల్లని చూపులు ప్రసాదించు తల్లీ!/ఇక్కడ మానేరు జలాశయాన్ని కవి చందమామతో పోల్చాడు.చందమామను చల్లదనానికి,ప్రశాంతతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఆ విధంగానే జలాశయం ప్రజలకు సాంత్వనను ఇస్తుంది.ఈ కవితా పంక్తిలో భక్తి,కృతజ్ఞత,ప్రకృతి సౌందర్యాలు ఒదిగి ఉన్నాయి.మానేరు జలాశయాన్ని భువనేశ్వరి మాతగా నిండు చంద్రునిగా వర్ణించిన తీరు అద్భుతంగా ఉంది.
“ముంపు గ్రామాల ప్రజల సమస్యలకు/
మద్యస్థం కాకుండా ఆయవు పట్టువై../ఆధార శిలవై .. నిలువు తల్లీ!/ఈ కవితా పంక్తులు మానేర్ జలాశయ నిర్మాణం వల్ల ముంపుకు గురైన ప్రజల మనో వేదనను,వారి ఆశలను నమ్మకాన్ని ఆవిష్కరించే హృద్యమైన సాహిత్య భావ రేఖలుగా నిలుస్తాయి.కవి తల్లి రూపంలో మానేర్ జలాశయాన్ని సంబోధించి ప్రజల తరపున ఆమెను ప్రార్థిస్తున్నాడు.
జలాశయం నిర్మాణం వెనుక వేలాది కుటుంబాల త్యాగం దాగి ఉంది.వారి ఇండ్లు,పంట పొలాలు, జ్ఞాపకాలు నీటి ముంపులో కలిసి పోయాయి.కవి ఈ బాధను గుర్తించి ఆ ప్రజల సమస్యలకు పరిష్కరించాలని ఆర్తిగా కోరుతున్నాడు.
“మద్యస్థం కాకుండా ఆయు పట్టువై../ఇక్కడ కవి మానేరు జలాశయాన్ని నిర్లిప్తంగా,నిష్క్రియంగా ఉన్నట్లు కాకుండా,ఆయువు పట్టుగా మారమని కోరుతున్నాడు.ఈ తల్లి వంటి జలాశయం తమ బాధల్ని దూరం చేయడంలో సహకరించి తోడ్పాటును అందించాలి అని కవి కోరుతున్నాడు.
“ఆధార శిలవై .. నిలువు తల్లీ!/ఈ కవితా పంక్తిలో భావ వ్యక్తీకరణ పరాకాష్టను చేరుతుంది.ఆధార శిల స్థిరత్వానికి,నమ్మకానికి,భరోసాకు ప్రతీక.మానేర్ జలాశయం కేవలం నీటి వనరుగా కాకుండా, ముంపు బాధితులకు ధైర్యం ఇచ్చే చిహ్నంగా నిలవాలి అని కవి కోరుతున్నాడు.
“నిలువు తల్లీ! అనే సంబోధనలో మాతృత్వపు భావన చక్కగా ఉంది.ఈ కవితా పంక్తులలో కవి భావుకతను,మానవతా దృష్టిని,కృతజ్ఞతను, సామాజిక చింతనను సమన్వయపరచాడు. జలాశయానికి మానవ గుణాలను ఆపాదించడం ద్వారా ఉత్కంఠభరితమైన కవి హృదయం ప్రస్ఫుటమైంది.ఈ కవితలోని భావం బాధిత ప్రజల హృదయ స్పందన.మానేరు జలాశయం వల్ల తమ సర్వస్వాన్ని కోల్పోయిన వారికి అండగా ఉండాలి అనే విన్నపం ఈ కవితలో ప్రతిధ్వనిస్తుంది.కవి భక్తితో,ఆర్తితో మానేరు తల్లిని వేడుకోవడం చక్కగా ఉంది.
“భూములిచ్చిన త్యాగధనులకు/సరి కానుకలిచ్చి ఆదుకో తల్లీ!/ఈ కవితా పంక్తులలో కవి మనసులో ఉన్న గాఢమైన కృతజ్ఞతా భావం,మానవతా దృక్పథం స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది.మానేర్ జలాశయం నిర్మాణం కోసం ప్రజల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.తమ భూములను ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సమర్పించిన వారే అసలైన త్యాగధనులు.సమాజ శ్రేయస్సు కోసం మహోన్నత త్యాగం చేసి తమ సర్వస్వం కోల్పోయిన ప్రజలకు సహాయం చేయాలి అని,ఆ తల్లి త్యాగధనులను మరువకుండా,వారిని కానుకలతో ఆదరించాలి అని కవి మనసారా ప్రార్థిస్తున్నాడు.ఈ కవితా పంక్తులలో త్యాగానికి గౌరవం,సామాజిక న్యాయం పట్ల ఉన్న ఆరాటం గాఢంగా వ్యక్తం అయింది.భూములు ఇచ్చిన రైతులు కేవలం భౌతికంగా నష్టపడడమే కాక వారు తమ ఆత్మీయ అనుబంధాన్ని కోల్పోయారు. కాబట్టి వారికి మానేరు జలాశయం ప్రాజెక్ట్ నుంచి సరైన న్యాయం జరగాలి అని కవి తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశాడు.భూములు ఇచ్చిన త్యాగధనుల పట్ల కవి చూపిన గౌరవం,మానేర్ తల్లిని ఆశ్రయించిన విధానం కవితకు హృద్యమైన స్ఫూర్తి నిచ్చింది.మిడ్ మానేర్ పై అద్భుతమైన కవితను రాసిన కవి సంకేపల్లి నాగేంద్ర శర్మను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ తేది 01 – 06 – 1960 రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ గ్రామంలో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.వీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు కమలమ్మ,లక్ష్మీకాంతం గారలు.వీరు ఎం.ఏ. ఎల్ఎల్ బి, బిఇడి.పిజి డిప్లమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ డిగ్రీలను పొందారు.వీరు 1984 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల లో టీచర్ గా నియమింపబడ్డారు.వీరు 17 – 07 – 2017లో రిటైర్ అయ్యారు.వీరు ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.వీరు కరీంనగర్ లో స్వగృహం నిర్మించుకున్నారు.వీరు చరిత్ర పరిశోధకుడిగా ప్రఖ్యాతి గాంచారు. కవి నాగేంద్ర శర్మ ముద్రిత రచనలు : 1.హరివిల్లు సాహిత్య సంస్కృతిక వ్యాసాలు,2004.2. సబ్బినాడు ప్రతిభా మూర్తులు (సాహిత్య, సాంస్కృతిక,చారిత్రక వ్యాసాలు) 3.మానేరు తరంగాలు కవితా సంకలనం.4.జీవన వేదం కవిత్వం. 5.ఎములాడ మూలవాగు కవిత్వం. 6. తెలంగాణ వీణ (సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వ్యాస సంపుటి) 7. నాగేంద్ర శర్మ కథలు. 8. బతుకు తెరువు కథలు. 9.తెలంగాణా ఉద్యమంలో చారిత్రికాంశాలు (సాంస్కృతిక రంగం ప్రధానంగా) 10.రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య చరిత్ర (ప్రచురణ తెలంగాణా సాహిత్య అకాడమి)11.వేములవాడ అనువంశిక బ్రాహ్మణ చరిత్ర. 12.వేములవాడ క్షేత్ర చరిత్ర (వ్యాసాలు), 2021.13) మూల వాగు మందారం షష్టిపూర్తి అభినందన సంచిక. 14.పాలపిట్ట సెప్టెంబర్ 2022 సాహితీ మాసపత్రిక కవి నాగేంద్ర శర్మ ఇంటర్వ్యూతో ప్రత్యేక సంచిక గా వెలువడింది.
15.మిడ్ మానేర్ కవిత్వం,2024.
వీరు సాహితీ గౌతమి సాహిత్య సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.వీరు కరీంనగర్ జిల్లా అరసం శాఖకు ఉపాధ్యక్షులుగా పని చేశారు.వీరు తెలంగాణా రచయితల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అధ్యక్షుడిగా పని చేశారు‌.వీరు తెలంగాణా రచయితల వేదిక రాష్ట్ర శాఖకి సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.వీరు తెలంగాణా పద్య కవితా సదస్సు కార్యవర్గ సభ్యులు.వీరు కరీంనగర్, శరత్ సాహితీ కళా స్రవంతి సంస్థకు, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నారు.ఇవి కాక ఇప్పటికీ కవి నాగేంద్ర శర్మ గారు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

You may also like

Leave a Comment