ప్రముఖ కవి, అనువాదకులు, కథకులు నిఖిలేశ్వర్ గారితో మయూఖ ముఖాముఖి…..ధూళిపాళ అరుణ
******************************************
సాహితీ ప్రపంచంలో విప్లవాత్మకమైన పరిణామానికి శ్రీకారం చుట్టి, దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన వారిలో ఒకరైన నిఖిలేశ్వర్ గారి గురించి, వారి జీవన, సాహిత్య ప్రస్థానాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్🙏🏼
సమాజంలో అనూహ్యరీతి మార్పుకు దోహదపడటంలో భాగస్వాములైన మీ జీవితవిశేషాలను మా మయూఖ పాఠకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా..
1. మీరు ఎక్కడ జన్మించారు? ఎలాంటి వాతావరణంలో పెరిగారో చెప్పండి.
జ: నమస్కారం. నా పేరు కుంభం యాదవరెడ్డి. నేను ఆగస్ట్ 11,1938లో నేటి యాదాద్రి జిల్లా, వీరవల్లి గ్రామంలో జన్మించాను. నేను ఏడాది వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. వ్యవసాయం చేయడం ఇబ్బంది కావడం వల్ల మా అమ్మ ఆ బాధ్యతను వాళ్ళ తమ్మునికి అప్పగించి, 1940 లో నన్ను తీసుకొని హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ ఒక సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేసి కష్టపడి నన్ను చదివించింది.
ఎన్నో ఆర్థిక ఒడిదుడుకుల మధ్య నేను బిఏ ఫిలాసఫీ, ఇంగ్లీషు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో పూర్తి చేశాను. అప్పటికే హిందీ భూషణ్ పాసయ్యాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో కావాల్సినంత పర్సెంటేజ్ రాకపోవడంతో ఎమ్. ఏ. సైకాలజీలో చేరాల్సి వచ్చింది. ఒక సంవత్సరం పూర్తి చేశాను. ఆర్థిక స్థితి బాగా లేకపోవడం, 1965 లో దిగంబర కవిత్వోద్యమం వీటివల్ల ఇక చదువు మీద ఆసక్తి లేకుండా పోయింది..
2. సామాజిక సమస్యల పట్ల నిరసన గళమెత్తాలన్న ఆలోచన మీకెట్లా కలిగింది?
జ: ఆనాటి యువతరం సమాజంలో నిరుద్యోగానికి, నిరాశకు గురవుతున్న పరిస్థితులవి. 1960 నుండి నా కవితలు, కథలు గోల్కొండ పత్రికలో వచ్చేవి. 1964 వరకు ఒక యువకుడిగా, కాలేజీ విద్యార్థిగా అనేక వ్యక్తిగత, సామాజిక సమస్యల మధ్య ఆనాటి రాజకీయ ఆర్థిక పరిస్థితులను గమనించి ‘కోపోద్రిక్త యువతరం’ పేరుతో రచనలు చేశాను. ఆ పేరుతో చేయడానికి ఒక కారణం, ప్రేరణ ఉన్నాయి. అప్పటికే “Angry young men movement” అని ఇంగ్లాండ్ లో ఉన్న మధ్యతరగతి యువకులంతా కొన్ని రచనలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైంది “Look back in anger” ( కోపంతో వెనక్కి చూడు)అనే పేరుతో జాన్ అస్బార్న్ అనే రచయిత రాసిన నాటకం. ఇంగ్లీషు లిటరేచర్ స్టూడెంట్ గా అది నేను చదివాను. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఈ దేశంలో కూడా యువతరం వెనక్కి చూడాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకే ‘కోపోద్రిక్త యువతరం’ అనే పేరుతో సామాజిక విశ్లేషణ, సామాజిక సమస్యలు తదితర అంశాలపైన నేను రాసిన అనేక వ్యాసాలు గోల్కొండ పత్రికలో వచ్చాయి.
3. మీ నిరసనను దిగంబర కవిత్వంగా రాయాలని అనుకోవడానికి, మీ ఆరుగురు ఒకే భావజాలాన్ని కలిగి ఉండడానికి ఏ పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి?
జ: నేను ఇంతకుముందు చెప్పిన ‘కోపోద్రిక్త యువతరం’ అనేది నా నిరసనకు మొదటి దశ. ఇక 1965 నాటికి యువకులమైన మేము ఆరుగురం వచన కవిత్వం రాయడం మొదలు పెట్టాం. అప్పటికే మేమంతా కాలేజీలో చదువుతూనే ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు సమకాలీనులైన కుందుర్తి ఆంజనేయులు, అలిపిరాల విశ్వం, అడిదికొలను మురళీధర్ ఇట్లా అనేకులు కవిత్వం రాశారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తో సమావేశం, మాతో పోయెట్రీ చెప్పడం ఇదంతా ఒక ఒరవడిని సృష్టించింది. అలిపిరాల విశ్వం ఇంట్లో సమావేశమయ్యేవాళ్ళం. ఈవినింగ్ కాలేజీలో బిఏ చేస్తున్నప్పుడు నేను, జ్వాలాముఖి, నగ్నముని క్లాస్ మేట్స్. చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న, కుందుర్తి ఆంజనేయులు ప్రతీ నెలా ఒకచోట కవిత్వం చదివేవారు. అక్కడ అందరం కలుసుకునేవాళ్ళం. వచన కవిత్వం ఒక ప్రక్రియగా రాస్తూ ఉన్నాం. అయితే భావజాలపరంగా ప్రజాస్వామికంగానో, రాజకీయంగా నిర్దుష్టంగా సమస్యలను ఆలోచించలేకపోతున్నామన్న భావన కలిగింది. కేవలం వ్యక్తిగత అనుభూతులు, రొమాంటిసైజ్ చేయడం మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక మలుపు రావాలి. ఏదో ఒకటి చేయాలి అని తీవ్రంగా ఆలోచించాం. ఆ ఆలోచనకు రూపమే దిగంబర కవిత్వం.

4. మీరంతా మీమీ పేర్లతో కాకుండా మారు పేర్లతో కవిత్వం రాయడానికి కారణం తెలుసుకోవచ్చా?
జ: ఆనాటి యువతరానికి ప్రాతినిధ్యం వహించేలా మా కవిత్వం ఉండాలని మేం కోరుకున్నాం. సమాజ వ్యవస్థను ఎలాంటి దాపరికం లేకుండా బట్టబయలు చేయాలనుకున్నాం. పేర్లు మార్చుకోవాలనుకోవడానికి కారణం మా ఆరుగురి పేర్లన్నీ కుల మతాలకు సింబాలిక్ గా యాదవరెడ్డి, కేశవరావు, మన్మోహన్ సహాయ్, రాఘవాచారి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు అని ఉన్నాయి. మేము తీసుకురావాలనుకుంటున్న మార్పుకు ఒక మౌలికమైన ఆలోచన కూడా ప్రత్యామ్నాయంగా యువతరానికి ఇవ్వాలనుకున్నాం. ముందుగా మేము మా జీవితాలలో దాన్ని ఆచరణలో చూపించాలనుకున్నాం. అందువల్ల యాదవరెడ్డి (నేను) నిఖిలేశ్వర్, కేశవరావు-నగ్నముని, మన్మోహన్ సహాయ్- భైరవయ్య, రాఘవాచార్య- జ్వాలాముఖి, భాస్కర్ రెడ్డి- చెరబండరాజు, వెంకటేశ్వర్ రావు- మహాస్వప్న గా మార్చుకున్నాం. సమాజంలోని సమస్యలకు యువతరం ఎట్లా ప్రతిస్పందించాలో చెప్పడానికి సాహిత్యరీత్యా ఒక గొంతుకనిచ్చాం. అన్నిరంగాల్లో ఆవేశంగానో, కోపంగానో సమాజాన్ని ప్రశ్నించడమే మా ప్రధాన లక్ష్యం.
5. దిగంబర కవిత్వం మూడు సంపుటాలను వెలువరించిన విధానాన్ని, వాటి రచనా విధానంలోను, ఆలోచనా విస్తృతిలోను వచ్చిన పరిణామాలను వివరించండి.
జ: ఇంతకుముందు చెప్పినట్లు సమాజాన్ని ప్రశ్నించే దిశగా దిగంబర కవిత్వం మొదటి సంపుటాన్ని 1965 మే 6వ తేదీ అర్ధరాత్రి ఆబిడ్స్ లో నాంపల్లి పాండు అనే ఒక రిక్షా కార్మికుని చేత ఆవిష్కరింపజేసాం. రెండవ సంపుటానికి వచ్చేటప్పటికి దాని పరిణామ క్రమంలో
కవిత్వపరంగా, ఆలోచనల పరంగా ఒక పురోగమనం వచ్చింది. 1966 డిసెంబర్ 8 అర్ధరాత్రి, విజయవాడలో హోటల్ క్లీనర్ జంగాల చిట్టి చేతులమీదుగా ఆవిష్కరించాం. మూడవ సంపుటి వరకు మా ఆలోచనలు పదునెక్కాయి. 1968 జూన్ అర్ధరాత్రి విశాఖపట్నంలో యశోద అనే బిచ్చగత్తె చేత ఆవిష్కరించాం. ఆమె తన పూర్వ జీవితంలో వేశ్యా వృత్తిలో ఉండి బిచ్చగత్తెగా మారింది. ఇట్లా వెలువరించడానికి ఈ సమాజంలో ధనికులు, మధ్యతరగతి ప్రజలే కాక నికృష్ట జీవితాన్ని గడుపుతున్న అతి కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి సాహిత్యం ద్వారా వారి చిరునామాలను చూపించాలి అన్నది మా ఉద్దేశ్యం.
అయితే ఈ మూడు సంపుటాలకు మీరడిగినట్లు ఒక పరిణామక్రమం ఉంది. మొదటి సంపుటిలో ఆరుగురు కవుల యొక్క ఒక ఆవేశం, ఒక ఉద్రేకం, నిన్ను నీవు తెలుసుకో, సమాజాన్ని ప్రశ్నించు, అన్నింటిలో భ్రమలు తొలగించుకో అన్న విధంగా మొదలవుతుంది. రెండవ సంపుటం నాటికి భావజాల పరంగా ఈ సమాజంలో భూమిపైన ఆకలి, పేదరికం ఉన్నంతకాలం మార్క్సిజమ్, లెనినిజమ్ చింతనను సవాలు చేసే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే సమాజంలో పేదరికం, అసమానతలున్నంత వరకు చింతనలు కూడా సమకాలీనమైనవే. వాటిని నమ్మాల్సిందే. 1968 లో మూడవసంపుటి వచ్చేనాటికి నక్సల్ బరీ పోరాటం మొదలైంది. దాని ప్రభావంతో శ్రీకాకుళంలో గిరిజన పోరాటం మొదలైంది. వీటి ప్రభావం యువతపై పడింది.
మౌలికంగా సమాజంలో సమూలంగా మార్పు తేవాలంటే ప్రజలు తిరగబడాలి. అవసరమైతే ఆయుధాలు పట్టుకోవాలి. ఈ సాయుధపోరాటాన్ని సమర్థిస్తూ మూడవ సంపుటం వెలువరించాం. కవిత్వ పరంగా ఆరుగురిలో ఉండే భాష, శైలీ సంవిధానం వేరువేరు. అందువల్ల ఆరుగురం మేం రాసిన కవితలను గురించి చర్చించి, ఊకదంపుడు లాగా కాకుండా వాటిని సానబడుతూ కృషి చేసి మూడు సంపుటాలనువెలువరించాం.
విశాఖలో జరిగిన మూడవ సంపుటికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటికే మా పేరు విని ఉండడం వల్ల అర్ధరాత్రి ఆవిష్కరణకు రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, బలివాడ కాంతారావు వచ్చారు. పురిపండ అప్పలస్వామి మమ్మల్ని వెంటబెట్టుకొని అన్ని చోట్లు తిరిగారు. మమ్మల్ని మారుస్తానని ఆయన నమ్మకం. చివరకు కొండమీద దేవాలయానికి తీసుకెళ్లి పూజ కూడా చేయించారు (నవ్వుతూ). పెద్దాయన కాబట్టి ఏమనలేకపోయాం. ఇక రెండవ సంఘటన ఏంటంటే విశాఖలో టౌన్ హాల్ లైబ్రరీలో సభ జరుగుతుందని, దిగంబరకవులు ఉపన్యసిస్తారని ప్రకటన చేశారు. సభ ప్రారంభం కాకమునుపే ఐదారుగురు సన్యాసులు వచ్చి కూర్చున్నారు. ఎవరో దిగంబర స్వాములు వస్తున్నారని (గట్టిగా నవ్వేస్తూ).
6. ధర్మాగ్రహంగా మీరు భావించిన దిగంబర కవిత్వంలో ఉపయోగించిన భాషా పదాల విషయంలో విమర్శ కూడా ఎదుర్కున్నారు కదా! దానికి మీరు ఇచ్చిన వివరణ ఎటువంటిది?
జ: కవిత్వపరంగా, ప్రక్రియా పరంగా ఈ వచన కవిత్వానికి మేం ప్రత్యేకంగా పేరు పెట్టాం. ‘దిక్’ అంటే దిక్కులు. ప్రతీ కవిత దిక్సూచిగా ఉండాలని ఆ పేరు పెట్టాం. ఉన్న వాస్తవాలను అందరికీ తెలియజేయడం, మార్పును ఆశించడం మా ఉద్దేశ్యం. దిగంబర కవులు ఈ వ్యవస్థ పట్ల కోపంతోనో, ఆవేశంతోనో అశ్లీల పదాలు వాడారని ప్రధాన విమర్శ ఎదుర్కొన్నాం. దీనికి మేమిచ్చిన వివరణ ఏంటంటే ఈ సమాజంలో వ్యక్తి అన్నవాడు నైరాశ్యానికి గురైనప్పుడు, తిరగబడినప్పుడు అరుస్తాడు, తిడతాడు. మేం కూడా కవులుగా యువతరంలో ఒక కోపం, ఆవేశాన్ని వ్యక్తీకరించిన పదజాలమే తప్ప మరో అర్థపరమైనవి కావు. అయితే సమాజంలో కొన్ని రూఢిగా ఉన్న బూతు పదాలను యథాతథంగా పెట్టడం జరిగింది కానీ వాటిని మేము ఉపయోగించిన ఉద్దేశ్యం వేరు. విమర్శలకు మా సమాధానం అదే.
7. మూడు సంపుటాలుగా వెలువడిన దిగంబర కవిత్వం మీ ఆశయాలను, ధ్యేయాలను నెరవేర్చిందని భావించవచ్చా?
జ: తప్పకుండా. మూడు సంపుటాలు ప్రచురించిన తర్వాత భావజాల పరంగాను, కవిత్వ శైలీ పరంగాను మేమనుకున్న లక్ష్యం నెరవేరిందనే చెప్పాలి. యువతరంపై ఈ రచనల ప్రభావం పడిందనడంలో సందేహం లేదు. కేవలం మనదగ్గరే కాదు. సమకాలీనంగా భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ సాహిత్యంలో ‘హంగరీ జనరేషన్’ అనే సాహితీ ఉద్యమం సాగింది. సౌమిత్ర మోహన్ అనే కవి హిందీలో ‘అకవిత’ ఉద్యమాన్ని ప్రతిపాదించాడు. ఇంకోవైపు పంజాబ్, మరాఠీలలో ఇట్లా…అన్నిచోట్ల సమకాలీన యువతరంలో తిరుగుబాటు తత్త్వం మొదలైంది. 1967 లో ‘ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు” అనే పేరుతో ‘భారతి’ పత్రికలో పెద్ద వ్యాసం రాసాను. అమెరికాలో వచ్చిన ‘Beat Generation Movement’ లండన్ లో వచ్చిన ‘Angry Young Men Movement’ గురించి ఇట్లా ఆనాటి సమకాలీన ఉద్యమాలను గురించి అందులో వివరించాను. అంటే మనదేశంలోనే కాక ప్రపంచ సాహిత్య పరిణామ దిశగా దిగంబర కవిత్వం కూడా సమకాలీనంగా సాగిందని చెప్పడం నా ఉద్దేశ్యం.

8. తదనంతరం వచ్చిన ‘విప్లవ రచయితల సంఘ’ స్థాపనకు దిగంబర కవిత్వం ఏ విధంగా దోహదపడింది?
జ: మూడు సంపుటాలు వెలువడిన తర్వాత నాల్గవ సంపుటం వేసే దశలో అప్పటికే వస్తున్న ఉద్యమాలను అందరూ సమర్థించడం ప్రారంభమైంది. అట్లా విప్లవ భావజాలం వ్యాపిస్తున్న సమయంలో ఒక సంస్థను ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న ఆలోచనలో 1970 నాటి విప్లవ రచయితల సంఘానికి మేమంతా మూలకారణం. దిగంబర కవులలో భైరవయ్య, మహాస్వప్న ఇద్దరూ మార్క్సిస్టు భావజాలంతో ఏకీభవించమని, స్వతంత్రంగా రాస్తామని మా నుండి విడిపోయారు. మిగతా నలుగురం కేవలం తిరుగుబాటు స్వరమే కాదు, విప్లవంగా మారాలనుకున్నాం. విప్లవ భావజాలంతో ప్రజలను మేల్కొల్పాలి అంటే సమూలంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని భావించాం. అందువల్ల శ్రీశ్రీ,కొడవటి గంటి కుటుంబరావు, రావిశాస్త్రి వంటి వారితో పాటు వరవరరావు మొదలైన మా తరం అంతా కలిసి ‘విప్లవ రచయితల సంఘం’ స్థాపించాం. దిగంబర కవులు అనేవారు తిరుగుబాటు నుండి విప్లవంలోకి రావడం పెద్ద మలుపు.
9. ఆ ప్రభావం అలాగే కొనసాగుతూ వచ్చిందా? దాని మూలంగా సాహిత్యంలో చోటు చేసుకున్న మార్పులు ఎటువంటివి?
జ: సాహిత్యపరంగా దిగంబర కవిత్వం ఒక అధ్యాయం. అందరికీ దానిపట్ల ఒక స్పష్టత ఏర్పడింది. ఎమ్. ఏ.లో డిగ్రీలో కూడా ఇప్పుడు పాఠ్యాంశాలుగా బోధించడం జరుగుతోంది. దీనిపైన మూడు పిహెచ్ డి లు కూడా వచ్చాయి. దీన్ని బట్టి ఆ సాహిత్యాన్ని ఒప్పుకున్నట్టే కదా! అంటే దీని ఉద్దేశ్యం, భావజాలం అందరికీ అర్థమైంది. ప్రగతిశీల భావాలతో రాసినది కాబట్టి సందేహం లేకుండా అందరూ ఒప్పుకోవలసిందే. సమసమాజ స్థాపన కావాలనే కదా!అందరం కోరుకునేది.
10. దిగంబర కవులలో జ్వాలాముఖిగారు, మీరు జంటగా ఉండేవారని విన్నాం. వారితో మీ అనుబంధాన్ని వివరించండి.

జ: దిగంబర కవుల నాటికే మేమిద్దరం స్నేహితులం. కాలేజీలో క్లాస్ మేట్స్. AOC సెంటర్ మారేడ్ పల్లిలో ఇద్దరం సైనికులకు చదువు చెప్పేవాళ్ళం. ఇద్దరికీ ఎయిర్ ఫోర్స్ కు ట్రాన్స్ ఫర్ ఐంది. రెండు, మూడు నెలలు విడివిడిగా ఇతర రాష్ట్రాలలో పనిచేసాం. 1963 నాది కులాంతర ప్రేమ వివాహం. దానికి తాను పూర్తిగా సహకరించాడు. తాను ఎం.ఏ. ఎల్.ఎల్.బి కూడా చేశాడు. ప్రొఫెసర్ కె.కె. రంగనాథాచార్యులు గారు కూడా మాకు సన్నిహిత మిత్రుడు. 60 ఏళ్ల జీవితంలో వ్యక్తిగతంగాను, ఉద్యమ పరంగాను జ్వాలకు, నాకు ఉన్న అనుబంధం అట్లాగే నిలిచింది. ఏ సభలకు, మీటింగులకైనా వెళ్లడం, ఉపన్యాసాలు ఇవ్వడం, కవితలు చదివే వాళ్ళం. ఉపాధ్యాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టారు. మహాసభలు ఎక్కడ జరిగినా కలిసి వెళ్ళేవాళ్ళం. మార్పు బాలకృష్ణమ గారు మమ్మల్ని ఉపాధ్యాయ రంగానికి వీళ్లిద్దరూ ఆస్థానకవులు అనేవారు. జ్వాల చనిపోయినప్పుడు ‘కవితాజ్వాల’ అనే పుస్తకాన్ని వేశాం. ఇటీవలే ఆయన వర్ధంతి సందర్భంగా దాన్ని కొంత రివైజ్ చేసి మళ్లీ వేశాం.
11. PD ఆక్ట్ కింద జైలు జీవితాన్ని గడిపిన మీ అనుభవాలను చెప్పండి.
జ: ఇది 1970-71 మధ్య జరిగింది. విరసం స్థాపించిన తరువాత కేవలం రచనలు కాకుండా శ్రీశ్రీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక హక్కుల కోసం, విప్లవకారుల ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా పోరాడాలని పౌరహక్కుల ఉద్యమాన్ని (సివిల్ రైట్స్) కూడా ప్రారంభించాం. అందులో భాగంగా నేను, జ్వాల, చెరబండరాజు ఎన్నో గ్రామాలు తిరిగాం. మరో వైపు విరసం ‘ఝం ఝ’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది. కె. వి రమణారెడ్డి గారు దానికి సంపాదకులు. ప్రచురించిన మూడు నెలల్లో మూడు ఎడిషన్లు వచ్చాయి. లక్షకాపీలు అమ్ముడు పోయాయి. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. దాంతోపాటు మా ఉపన్యాసాల మూలంగా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని వీళ్ళు కూలదోస్తున్నారని ఆరోపణలు చేసి నన్ను, జ్వాల, చెరబండరాజులను, రాజద్రోహం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తరువాత PDA (Preventive Detention Act) కింద సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ జైల్లో (ప్రస్తుతం ముషీరాబాద్ గాంధీ ఆసుపత్రి ఉన్న ప్రాంతం) మమ్మల్ని ‘A’ క్లాస్ ఖైదీలుగా 55 రోజులు నిర్బంధంలో ఉంచారు. మేము హైకోర్టులో సవాలు చేశాం. మా పక్షాన న్యాయవాదులు కె.జి. కన్నభిరాన్, పత్తిపాటి వెంకటేశ్వర్లు గార్లు “రచయితల భావవ్యక్తీకరణ రాజ్యాంగ పరమైన హక్కు అని, దాన్ని నిషేధించే అధికారం ప్రభుత్వానికి లేద”ని సవాలు చేశారు. హైకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి జస్టిస్ చెన్నపరెడ్డి గారు మా ముగ్గురినీ కోర్టులో హాజరు పరిచి, “కవుల కవిత్వం ఏదో రాజద్రోహం అంటున్నారు. ఆ శక్తి ఏంటో చూద్దాం.” అని మా ముగ్గురి చేత కవిత్వం చదివించారు (నవ్వుతూ). మా పోయెట్రీ విన్న తరువాత ఆయన “విశ్వాసాలు నియంత్రణకు లోబడవు. విశ్వాసాలు ఉన్నంత మాత్రాన నిర్బంధించరాదు. కవుల కలాలకు సంకెళ్లు వేయరాదు. అది వ్యక్తి జన్మహక్కు” అని తీర్పు ఇస్తూ విడుదల చేశారు.
12. ‘గోడల వెనుక’ అనే రచన జైలు అనుభవాలను గురించి రాసినదేనా?
జ: అవును. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ అనుభవాలను ‘గోడల వెనుక’ పుస్తకాన్ని వెలువరించాను. 1972 లో మొదటగా ఇది అచ్చయింది. మహీధర రామ్మోహన్ రావుగారు ‘ఆంధ్రపత్రిక’లో దీన్ని సమీక్షించారు. స్వాతి మాసపత్రికలో పునర్ముద్రించారు. ‘Walls’ శీర్షికన కీ.శే. మోహన్ రామ్ గారు ఇంగ్లీషులోకి అనువదించారు. 1974లో “The point of view” అనే వారపత్రిక ఇంగ్లీష్ అనువాదాన్ని ఎనిమిది వారాలు సీరియల్ గా వేసింది. తరువాత హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా అనువదించబడింది. 2025 నవంబర్ లో ఇంగ్లీషుతో పాటు ద్వితీయ ముద్రణ జరిగింది.
13. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన ‘అగ్నిశ్వాస’ను అంతరంగ భాష అని పేర్కొన్నారు కదా! అందులోని అంశం ఎటువంటిది?
జ: ‘అగ్నిశ్వాస’ అనేది నా అంతరంగ భాష. పోరాటం ఉన్నంతవరకు ఇది కొనసాగుతుంది. అంటే సమాజంలో శ్రామికవర్గ పోరాటం జరుగుతున్నంతవరకూ ఈ శ్వాస అగ్నిలా జ్వలిస్తుంది. ఈ కవితా సంపుటిలో 50 కి పైగా కవితలున్నాయి. చివరలో చేగువేరా గురించి రాసిన కవిత కూడా ఒకటి ఉంటుంది. ప్రధానంగా 2015 నుండి 2017 నాటి వరకు రాసిన కవితాసంపుటి. సమాజంలో అసమానతలు, అమానవీయతలు, మత దురహంకారాలు, పతనమవుతున్న విలువలు వీటి గురించి సహించలేక రాసిన కవితలు. 2020 కి గాను ఈ సంపుటికి 2021 మార్చిలో ‘కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం’ ప్రకటించారు.
14. ‘హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు’ ఏ కాల పరిస్థితులను తెలుపుతుంది?
జ: ఖండేరావు కులకర్ణి అని హైదరాబాద్ వాసి. కన్నడిగుడు. కొంత ఆర్య సమాజీయుడు కూడా. ఖండేరావు గారు కేశవరావు బాయ్స్ స్కూల్లో హెడ్మాస్టర్ గా ఉండేవాడు. అక్కడే నేను ఇంగ్లీషు, సోషల్ టీచర్ గా 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. ఆ కాలంలో వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమాలు, భూస్వామ్య పోరాటాలు, నిజాం వ్యతిరేక ఉద్యమాల గురించి ఆయన ‘హైదరాబాద్ కా ముక్తి సంగ్రామ్’ అనే పేరుతో హిందీలో పుస్తకం రాశాడు. గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీసుకున్నాడు. హిందీలోని ఆ 20 వ్యాసాల రాతప్రతిని నేను ముందు చదివాను. స్వయంగా ఆయనే నన్ను “నా దృష్టిలో రాశాను. ఇది తెలంగాణ చరిత్ర కదా! తెలుగులో వస్తే బాగుంటుంద”ని అడిగారు. నాకు అవి బాగా నచ్చాయి. మూడు వ్యాసాలను అనువాదం చేశాను. 1971లో వాటిని గోరాశాస్త్రి గారు ‘ఆంధ్రభూమి’ పత్రికలో వరుసగా ప్రచురించారు. తర్వాత గ్యాప్ వచ్చింది. 1975 లో ‘హైదరాబాద్ కా ముక్తి సంగ్రామ్’ అని హిందీలో పుస్తకంగా వచ్చింది. నేను అనువదించిన మిగిలిన వ్యాసాలు కూడా ‘ఆంధ్రభూమి’ లో ప్రచురితమయ్యాయి. నిజానికది విముక్తి సంగ్రామం కాదు. హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర. ఇందులో తెలంగాణ నిజాం సంస్థాన విషయాలు, యూనియన్ ప్రభుత్వంలో విలీనం, అప్పుడు జరిగిన పోరాటాలు, సంఘటనలతో పాటు అటు మరాఠా, కర్ణాటకలో జరిగిన పరిణామాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల ‘హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు’ అని పేరు పెట్టాను. RSS కేశవనిలయం సంస్థవాళ్లే దీన్ని ప్రచురించారు. ఇందులో ఈ తరానికి తెలియని హైదరాబాద్ చరిత్ర ఎంతో ఉంది. 4,5 ఎడిషన్స్ వచ్చాయి. అంత పాపులర్ అయింది.
15. విప్లవ పోరాటాలు, సంస్కరణోద్యమాలు రెండూ సామాజిక పరిణామాన్ని ఆశించేవే కదా! ఈ రెండిటి మధ్య ఉండే వ్యత్యాసం చెప్తారా?
జ: రెండిటి ఉద్దేశ్యం ఒకటే అయినా సంఘంలో అందరూ సమూహంగా తిరగబడి ఈ వ్యవస్థను మార్చగలిగితే అది విప్లవం అవుతుంది. అట్లా కాకుండా సమ్మెలు, ధర్నాలు చేస్తూ మార్చాలనుకోవడం సంస్కరణ అవుతుంది. సంస్కరణలో మార్పు రానప్పుడు అది విప్లవంగా మారుతుంది. 1946లో నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం మావోయిస్టులను అణచి పెడుతున్నప్పటికీ భావజాలాన్ని అణచిపెట్టలేరు కదా!అసంతృప్తి, నైరాశ్యం ఉన్నంతవరకు విప్లవం ఉంటూనే ఉంటుంది.
16. ఇప్పటివరకూ మీ కాలం నుండి వెలువడిన రచనలు అనువాదాలు, పురస్కారాల గురించి చెప్పండి.
జ: ఇప్పటివరకు నేను రచించిన14 కవితా సంపుటాలు, 12 వ్యాస సంపుటాలు, వచనరచనలు, 9 అనువాదాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇక పురస్కారాలలో ప్రధానంగా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, శ్రీశ్రీ శతజయంతి అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి వివిధ పురస్కారాలు అందుకున్నాను.
17. “సామాజిక ప్రయోజనమే కవిత్వ ప్రయోజనం” అన్న మీ మాటలను వివరించండి.
జ: ఆధునిక తెలుగు సాహిత్యంలో మొదటినుండి ఒక ఒరవడి ఉన్నది. గత వంద సంవత్సరాల కాలంలో భావ, అభ్యుదయ, వచన కవిత్వాలు ఇలాంటివన్నీ వచ్చాయి కదా! ఈ క్రమంలో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సమాంతరంగా కాల్పనిక సాహిత్యం ఉంది. భావ కవితా ధోరణి, వ్యక్తిగత ధోరణి కూడా ఉంది. మేము ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ప్రారంభమై, ఒక కాల్పనిక ధోరణిలో జీవించి, సమిష్టిలోకి వెళితే తప్ప ఈ సమాజం మారదని చెప్పి దాన్ని సామాజిక ప్రయోజనం అన్నాం. అంటే యాంత్రికంగా కాకుండా ఏ ప్రక్రియ అయినా తమ శైలీ రూపాన్ని, కళాత్మికతను కాపాడుకుంటూ ప్రజల అభీష్టాన్ని ఉద్యమానికి అద్దం పట్టగలిగితే ప్రయోజనం చేకూరుతుందని మా ఉద్దేశ్యం. వ్యక్తిగత రచనలు వ్యక్తిగత అనుభూతికి పరిమితమవుతాయి. కవి గానీ, రచయిత గానీ విశాలదృక్పథంతో ముందుకు సాగి, రాజకీయాల పట్ల విస్తృతమైన అవగాహన ఉంటే ఉన్నతమైన రచనలు చేయగలడు. లేకుంటే కొన్ని పరిమితులకు మాత్రమే లోబడి ఉంటాడు. కేవలం సమాజాన్ని ఆకట్టుకునే రచనలు చేయడం కాదు. సామాజిక ప్రయోజనకారి కావాలి.
18. ప్రస్తుతం వస్తున్న కవిత్వం మీరనుకున్న ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా వస్తోందని మీరు భావిస్తున్నారా?
జ: వర్తమానకాలంలో సామాజిక దృక్పథంతో, వాస్తవిక దృష్టితో, సామ్యవాద దృష్టితో వచ్చే రచనల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత 20, 25 సంవత్సరాలుగా
సామాజికంగా, రాజకీయంగా దేశంలో చాలా మార్పులు వచ్చాయి. వామపక్ష ఉద్యమాలు సన్నగిల్లాయి. అయితే సాహిత్యపరంగా రచయితల్లో పునరాలోచన మొదలైందని, కాలానుగుణంగా ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. శ్రామిక విప్లవం రావలసిన అవసరం ఇప్పటికీ ఉంది. ఎందుకంటే రైతాంగ, కార్మిక వర్గాలలో మార్పు వస్తే తప్ప సామాజిక, రాజకీయ మార్పులు రావు. ఆత్మాశ్రయ కవిత్వమే సమకాలీనంగా, సమాంతరంగా వస్తున్నది. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వ్యక్తిగత దృష్టి పెరగడం వల్ల సమకాలీనంగా ఒక సంఘర్షణ కొనసాగుతున్నది. రాజకీయంగా దీన్ని ఒక సంధి కాలంగా నేను భావిస్తాను. మితవాదానికి, అతివాదానికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతోంది. అలాగే మతవాద దృష్టి పెరిగి మనిషి మూఢత్వానికి లోనవుతున్నాడు. మనిషి తను స్వతంత్రత కలిగి ప్రశ్నించగలిగే హేతువాద స్థితిలో ఉన్నప్పుడు సమాజంలో మార్పు మొదలైంది.
19. సమాజాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకున్న రచయితగా సమకాలీన పరిస్థితుల పట్ల మీ అభిప్రాయాన్ని, రావాల్సిన మార్పును సూచించండి
జ: గత ఆరున్నర దశాబ్దాల నా సాహితీ యాత్రలో 1960 నుండి 70 వరకు ఒక దశ, 80, 90 వరకు ఒక దశ ఇట్లా అనేక దశలు దాటుతూ వచ్చిన జీవితం నాది. ఈ క్రమంలో సహజంగానే పాత తరం నుండి కొత్త తరాన్ని సమన్వయం చేసుకుంటూనే వస్తున్నాను. కాబట్టి వీటి మధ్య స్వయంగా నేను అనుభవించింది, చూసింది కేవలం పుస్తకాల పరంగానే కాకుండా ఒక ఆక్టివిస్ట్ గా అటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో కానీ, కులాంతర వివాహంలో కానీ, సంఘ సంస్కరణ కోసం సహాయపడాలనే ఉద్దేశ్యంగా ఆ దిశలో పనిచేస్తూ వచ్చిన వాడిని. సమాజంలో హేతువాద దృక్పథంతో మనిషి ఆలోచించినప్పుడే చాదస్తాలు, మూఢ నమ్మకాలు తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇక మతం, దైవభక్తి అనేవి వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినవి. అదే దేశపరంగా, జాతి పరంగా చూసినప్పుడు భారతదేశ సంస్కృతి, దాని పరిరక్షణ గురించి ఆలోచిస్తే ఇక్కడి మిశ్రమ సంస్కృతి మూలంగా బహుళ జాతులు, బహుళ మతాలున్నాయి కాబట్టి ఒక సెక్యులర్ భావనే ఉంటుంది తప్ప దేని ఆధిపత్యమూ కుదరదు. రచయితలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రచనలు చేయాలని నేను భావిస్తాను.
20. బలమైన సమాజాన్ని తయారు చేయడానికి ఎటువంటి రచనలు అవసరం? నేటి కాలానికి మీరిచ్చే సూచనలు?
జ: సాహిత్యవేత్తలకు, సృజనాత్మక రచయితలకు సమాజంలో తమదైన బాధ్యత ఒకటుంది. రచయిత అంటే వ్యక్తి కాదు. సమాజంలో పుట్టి పెరిగిన జీవి కాబట్టి ఇది సమిష్టి బాధ్యత. ఒక రచయిత తాను తన వ్యక్తిగత అనుభవాలను వ్యక్తీకరిస్తూనే సమాజాన్ని పరిశీలించి పురోగామి దృష్టితో మనిషిగా ఎదగడానికి మానసిక విశ్లేషణ ఇస్తూ వ్యక్తిగత, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే దిశలో కథలు, నవలలు రాయాలి. ఎందుకంటే కవిత్వం కంటే కథలు, నవలల్లో విషయాన్ని విపులంగా చెప్పే వీలుంటుంది. శరత్ బాబు, ప్రేమ్ చంద్, గోపీచంద్, రావిశాస్త్రి వంటి రచయితలు సమాజాన్ని లోతుగా పరిశీలించినవారు. సమాజ సంఘర్షణను కథల్లో, నవలల్లో చెప్పినంతగా కవిత్వం ద్వారా చెప్పలేం. ప్రపంచ భాషలతో సమానంగా తెలుగులో మంచి కథలు వస్తున్నాయి కానీ పటిష్టమైన నవలలు రావడం లేదు. రచయిత సమాజంలో మమేకమై, నిజాయితీతో, ప్రజల కోసం, ఈ భూమి కోసం రచనలు చేసినప్పుడు రచనా ధ్యేయం నెరవేరుతుంది. సమాజం బలోపేతమవుతుంది.
చాలా సంతోషం సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, దాదాపు ఏడు దశాబ్దాల మీ సాహితీ యాత్రను గురించి సమగ్రంగా తెలిపినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన అనేక ధన్యవాదాలు, నమస్సులు🙏🏼

27 comments
https://shorturl.fm/PlkTi
https://shorturl.fm/rawMv
generic cialis otc
generic cialis otc
viagra off label
viagra off label
https://shorturl.fm/EY680
vidalista 60 reddit
vidalista 60 reddit
https://shorturl.fm/Mfk7H
https://shorturl.fm/TGxUQ
cenforce 100 vs viagra
cenforce 100 vs viagra
https://shorturl.fm/6Sryo
https://shorturl.fm/tD4yq
https://shorturl.fm/lYX6H
https://shorturl.fm/I7b8o
https://shorturl.fm/wKqCA
udenafil brand name
udenafil brand name
https://shorturl.fm/Y4GKZ
https://shorturl.fm/rIJ0Q
https://shorturl.fm/PyIT3
https://shorturl.fm/8DjKy
fincar 1mg price
fincar 1mg price
semaglutid nebenwirkungen augen
semaglutid nebenwirkungen augen
tadalafil causes heartburn
tadalafil causes heartburn
doxycycline dosage chart dogs
doxycycline dosage chart dogs
https://shorturl.fm/6qdv9
https://shorturl.fm/MdrXo
https://shorturl.fm/o0LDQ
flagyl for cats diarrhea
flagyl for cats diarrhea