ప్రముఖ కవి,కందుకూరి అంజయ్య కలం నుండి జాలువారిన కట్టెపల్క కవితా సంపుటిలోని కట్టెపల్క కవితపై విశ్లేషణా వ్యాసం.పూర్వ కాలంలో బాల్యంలో కట్టెపల్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇది చదువుకోవడానికి సాధనం మాత్రమే కాదు,ఇందులో ఒక చిన్న పిల్లవాడి జీవితం, అనుభవాలు,పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పిల్లవాడు పలకను సిద్ధం చేసుకునే దృశ్యం పాఠకునిలో ఒక రకమైన ఆసక్తిని కలిగిస్తుంది.కట్టె పల్క ఒక జ్ఞాపకాల ఖజానా,చిన్నపిల్ల వాడి ప్రపంచం,బాల్యం, భావోద్వేగాలు,ఆత్మగౌరవం,విద్య, సంస్కృతి,సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు కట్టెపల్కకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడి చేతిలో కట్టెపల్క కనిపించేది.కవి అంజయ్య చదువుకోవడానికి సాధనమైన కట్టెపల్కను ఆధారంగా తీసుకుని కవితకు ప్రాణం పోశాడు.ఇది ఒక బాలుడి చిన్ననాటి గాథ,ఆనాటి అపురూపమైన జ్ఞాపకాలను సమృద్ధిగా కవితలో చిత్రించాడు.కట్టెపల్క పుస్తకాలతో కూడిన వస్తువు కాదు.అది చిన్నారికి శక్తిని,గర్వాన్ని, గుర్తింపును,భద్రతను అందిస్తుంది.కట్టె పల్క పై చదువు నేర్చిన, తన చిన్ననాటి పాఠశాల అనుభవాలను,అందమైన బాల్యాన్ని అక్షరీకరించడం చక్కగా ఉంది.ఇది తాను బాల్యంలో చదువు నేర్చుకునే క్రమంలో ఎదురైన కష్టాలను, అడ్డంకులను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగిన రోజులను,ఆనాటి మధురమైన జ్ఞాపకాలను ప్రతిబింబిస్తుంది.కవి అంజయ్య కట్టెపల్క కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
“బీరాకు బొగ్గు మెత్తగా దంచి/రెండు వైపుల పూసి ఆరబెట్టితే/నల్లసరం బండలాగ నిగనిగా మెరిసేది/ఈ కవితా పంక్తులు చిన్నప్పటి గ్రామీణ బాలుడికి చదువు పట్ల గల శ్రద్ధ,పలకను అందంగా తీర్చిదిద్దే నైపుణ్యం,సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

కట్టెపల్క రాసుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవడానికి ప్రకృతిలో దొరికే పదార్థాలైన బీర ఆకులు,బొగ్గుతో దంచి పలకపై దట్టంగా పట్టించే పద్ధతి వాడుకలో ఉండేది.ఇలా పాలిష్ చేసిన కట్టెపల్క నల్లసరం బండలాగా నిగనిగ మెరిసేది. కట్టెపల్క మెరవడమే పిల్లాడికి గర్వం,దానిని చూడగానే అతనిలో ఆనందం పొంగిపొర్లేది. గ్రామాల్లో నల్లసరం రాతిబండలు మెరిసిపోతుంటాయి.కవి కట్టెపల్క నల్లసరం బండలాగా మెరిసేది అని చెప్పిన తీరు బాగుంది.
“చేతిలో అమరక/భుజం మీద పెట్టుకొని/ బడికి పోతుంటే బాల భీముడు అనేవారు/మెరిసే కట్టెపల్కను భుజంపై పెట్టుకొని బడికి వెళుతున్న చిన్నారిని బాల భీమునిగా పేర్కొనడం అద్భుతంగా ఉంది.కట్టెపల్కను భుజం మీద పెట్టుకొని తాను వేసే ప్రతి అడుగులో తనపై ఎనలేని ఆత్మవిశ్వాసం, ప్రత్యేకమైన నమ్మకం కలిగేది.అది తనకు బలాన్ని,ధైర్యాన్ని ఇచ్చేది.బడికి వెళ్తుండగా చూసిన గ్రామస్తులు బాల భీముడు అని సంబోధించడం, ఎంతో ఉత్సాహాన్ని,గర్వాన్ని కలిగించేది.ఇది బాల్యంలోని అమాయకత్వాన్ని,చిన్ననాటి సంఘటనల సమాహారంగా సూచిస్తుంది.భుజం మీద పెట్టుకున్న కట్టె పల్కను బలంగా భావించడం, పిల్లాడికి ఆత్మగౌరవం,బలమైన వ్యక్తిత్వం,సామాజిక గుర్తింపును అందించింది.ఇది పిల్లవాడి గ్రామీణ బాల్యంలోని ఈ అసాధారణ దృశ్యం అద్భుతంగా ఉంది.
“నా జోలికి వచ్చిన వాళ్లను జోపడానికి/ ఆయుధం అంగరక్షకుడు పలుకనే/ఈ కవితా పంక్తులలో కట్టెపల్కను అంగరక్షకుడిగా, ఆయుధంగా చెప్పడం,బాల్యంలో కనిపించే అమాయకత్వం,అల్లరి భావనలతో మిళితం చేసిన తీరు బాగుంది. ఆకతాయి పిల్లల చిలిపి చేష్టలు చికాకును కలిగిస్తాయి,భరించలేనివిగా ఉంటాయి. అనవసరంగా తన జోలికి వచ్చిన వారిని జోపడానికి కట్టెపల్క ఆయుధంలా రక్షణను అందించేది.ఇది తనకంటూ ఉన్న చిన్న ప్రపంచానికి చిన్నారి ఊహా శక్తికి,ధైర్యానికి నిదర్శనం.కట్టెపల్క కేవలం చదువుకోవడానికే కాదు,అది పిల్లాడికి రక్షణను కూడా అందిస్తుంది.ఇందులో కట్టెపల్కను అంగ రక్షకుడుగా భావించడం,రాజుల భద్రతను కాపాడే అంగరక్షకుని గుర్తు చేస్తుంది.ఒక చిన్న పిల్లవాడికి కట్టెపల్క కల్పించే రక్షణ దానిపై విశ్వాసం గొప్పగా ఉన్నది అని వర్ణించడం చక్కగా ఉంది.
“బలపం పట్టి అడ్డం పొడువు గీతలు పెడితే/ సాలు పొన్న సాలు పెట్టి/పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/కట్టెపల్కపై బలపంతో రాసే అలవాటు పిల్లవాడిలోని శ్రద్ధను,క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. విద్య నేర్చుకునే చిన్న పిల్లాడి ప్రపంచంలో భాగంగా బలపం పట్టుకుని కట్టెపల్కపై సన్నని గీతలు గీయడం,రాయడం అనేది అతని సహజ స్వభావాన్ని తెలుపుతుంది.కాన్వాస్ పై చిత్రాలు గీసే కళాకారుడిని పోలి కట్టెపల్కపై అక్షరాలు దిద్దే చిన్నారి కనిపిస్తున్నాడు.పలకపై బలపంతో దిద్దిన ఆ మొదటి అక్షరాలు,నేర్చుకున్న విద్య అతనిలోని వ్యక్తిత్వాన్ని మలిచే మొదటి మెట్టు.విద్య జీవితానికి పునాది.అతని భవిష్యత్తు వృద్ధికి,జ్ఞానానికి,నిర్ణయ శక్తికి,జీవన దర్శనానికి మొదటి రూప కల్పన. ఉపాధ్యాయుడి బోధన ద్వారా పిల్లవాడు చదువు నేర్చుకుని జ్ఞానాన్ని పొందుతాడు.చదువు అందించిన జ్ఞానం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడానికి మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతుంది. కట్టెపల్క ఒక చిన్నారి చేతిలో ఉన్నప్పుడు అది చదువుకి ఆరంభం.జ్ఞానానికి ప్రవేశ ద్వారం.అది భవిష్యత్తుకు పునాదిగా,సంస్కృతికి జ్ఞాపకంగా చిరస్థాయిగా నిలుస్తుంది.
“పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/రైతు పొలంలో దుక్కి దున్ని వ్యవసాయానికి అనువగునట్లుగా పొతం చేసిన నల్లరేగడి భూమిలా కట్టెపల్క ఉంది. ప్రతి పిల్లవాడు ఒక కళాకారుడే.నల్లరేగడి పూత వలె మెరిసే కట్టెపల్క ఒక గ్రామీణ సౌందర్య చిహ్నం. అది అక్షరాల భాషను నేర్పిన గురువులా ఉంటుంది. చిన్ననాటి అలవాట్లు,చదువు పట్ల ఆకర్షణ పలక మీదే మొదలయ్యేది.ఈ రోజు ఆధునిక టెక్నాలజీ పెరిగింది. కంప్యూటర్,ల్యాప్ టాప్,స్మార్ట్ ఫోన్, డిజిటల్ పాఠాలు వచ్చిన తర్వాత వాటి వాడకం తగ్గింది.కట్టెపలకపై దిద్దిన అక్షరాలు,అది ఇచ్చిన ఆత్మవిశ్వాసం,చదువు విలువ మరిచిపోలేనిది. కట్టెపల్క పిల్లల బాల్యంలోని ఒక చిన్న వస్తువు అయినప్పటికి ఎంత గొప్ప భావాలను, జ్ఞాపకాలను,విలువలను అందించగలదో ఈ కవిత అద్భుతంగా తెలియజేస్తుంది. కట్టెపల్క ఒక వస్తువు కాదు.ఒక యుగం,ఒక జీవన పాఠం,ఒక చిన్నారి చేతుల్లో మొదలైన మహాప్రస్థానం.పాతకాలం పాఠశాలల్లో చదివిన వారందరికీ కట్టెపల్క సరైన గుర్తింపును పొందింది.ఆనాడు అదే ఉత్తమం. కట్టెపల్కను భుజంపై పెట్టుకోవడం ఇది పిల్లాడి వ్యక్తిత్వానికి మొదటి రూపం. ఆనాడు అదే రక్షణ కవచం.అది తోడుగా ఉంటే ఒంటరిగా అనిపించేది కాదు.కట్టె పలకపై అక్షరాలు దిద్దడం,గీతలు గీయడం అది వారి కళ,దానిని చూసిన వెంటనే పాతకాలపు విద్య,ఆ తరానికి చెందిన బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి.కట్టెపల్క అతని బలం,రక్షణ,ఆత్మగౌరవం,చిన్న ప్రపంచం అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అక్షరం పొన్న అక్షరం పొదుగుతుంటే/గొర్రు పట్టి జొన్నపోత పోసినట్టుండేది/ఈ కవితా పంక్తులు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పద్ధతిని అక్షరాలు రాయడంలోని సున్నితమైన అనుబంధాన్ని ఎంతో సహజంగా ప్రతిబింబిస్తున్నది.ఇక్కడ అక్షరం కేవలం భాషా చిహ్నం కాదు.అది జ్ఞానానికి అవగాహనకు ప్రతీక.ఒక అక్షరం మరొక అక్షరంతో కూర్చడం అనేది విద్య క్రమంగా,సహజంగా,మనసులో స్థిరపడుతున్న ప్రక్రియను సూచిస్తుంది.చదువు అనేది యాంత్రికమైన చర్య కాదు.జీవంతో కూడిన సృజనాత్మక భావనను వ్యక్తపరుస్తుంది.పెరడు దున్ని జొన్నవిత్తు నాటి రైతు చూపే శ్రద్ధ,ఓర్పు, నమ్మకం అనే లక్షణాలు ఇక్కడ అక్షర విద్యలోను ప్రతిఫలిస్తున్నాయి.ఈ ఉపమానం గ్రామీణ జీవన నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం అనేది విత్తనాలు నేలలో నాటినట్టే, వెంటనే ఫలితం కనిపించకపోయినా,కాలక్రమేణా అవి పంటగా ఎదుగుతాయి.ఈ కవితా పంక్తులలో కవి విద్యను గ్రామీణ వ్యవసాయంతో పోల్చి చదువు మన జీవనానికి ఎంత సహజమైనదో,ఎంత శ్రమతో కూడినదో తెలియజేస్తున్నాడు.కట్టెపల్కపై అక్షరాలు రాయడం ఒక వ్యవసాయ కార్యంలా,శ్రమతో కూడిన పనిలా చిత్రీకరించబడింది.ఇది గ్రామీణ జీవనానికి విద్య ఎంత దగ్గరగా ఉందో సూచిస్తుంది.
“అ నుండి ఱ వరకు రాసిన అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకులై పలకరించేవి/ఈ కవితా పంక్తులు అక్షర విద్యను గ్రామీణ జీవన అనుభవంతో మేళవిస్తూ – భాష – సంస్కృతి – కాల ప్రవాహాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది.ఇక్కడ అ నుండి ఱ వరకు అనేది క్రమబద్ధమైన తెలుగు అక్షరమాల సంపూర్ణతను సూచిస్తుంది.పాలు పట్టిన జొన్న కంకులు అన్నది పరిణతి చెందుతున్న గింజల దశను సూచిస్తుంది.అక్షరాలు అలా పలకరించేవిగా మారడం అంటే అవి కాగితంపై నిశ్చలంగా,చిహ్నాల రూపంలో కాకుండా జీవంతో కూడిన స్నేహితుల్లా విద్యార్థిని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించడం, నేర్చుకున్న అక్షరాలు జ్ఞానంగా,అనుభవంగా మనసులో నిలిచిన దశను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులలో అక్షర విద్యను పంట ఎదుగుదలతో పోల్చి భాషా సంపదను గ్రామీణ సౌందర్యంతో అనుసంధానించారు.అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకుల్లా కనిపించడం – విద్య ఫలప్రదమైన దశకు చేరుతున్నది అనే ఆనందాన్ని, భాష పట్ల ఉన్న సాన్నిహిత్యాన్ని,అలాగే కాలంతో పాటు మారిపోయిన అక్షరాల పట్ల ఉన్న నోస్టాల్జియాను ఒకే సారి వ్యక్తం చేస్తుంది. అక్షరాలను జొన్న కంకులతో పోల్చడం,చాలా అందమైన ఉపమానం.అక్షరాలు పిల్లల మనసులో ఫలవంతంగా ఎదుగుతున్న పంటలుగా మారాయి. విద్య అంటే కేవలం చదువు కాదు.అది జీవనానికి ఆహారం అన్న భావం ఇక్కడ కనిపిస్తుంది.

“వర్ణమాల నేర్చుకుంటేనే/వర్ణాన్ని జయించినట్టు అనిపించేది/ఈ కవితా పంక్తులు అక్షర విద్యకు ఉన్న అంతర్గత గౌరవాన్ని,భాషా చైతన్యాన్ని గాఢమైన రీతిలో వ్యక్తపరుస్తాయి.ఇక్కడ వర్ణమాల అనేది అక్షరాల సమాహారం మాత్రమే కాదు.జ్ఞానానికి అలంకారమైన దండ.వర్ణం అంటే అక్షరం,కులం/ జాతి,రంగు,స్వభావం వంటి అర్థాలు ఉన్నాయి. రంగులను వర్ణం అంటారు.హిందూ ధర్మంలో సమాజాన్ని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర నాలుగు ప్రధాన వర్ణాలుగా విభజించడానికి జాతి పదం వర్ణంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో అక్షరాలను కూడా వర్ణాలు అంటారు.విడివిడిగా ఉన్న అక్షరాలు ఒక క్రమంలో,ఒక శైలిలో గుచ్చబడినప్పుడు అవి భాషగా,భావవ్యక్తీకరణగా మారుతాయి.కవి ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా అక్షరాల మధ్య ఉన్న సౌందర్యంను, సంపూర్ణతను సూచిస్తున్నాడు.వర్ణాన్ని జయించినట్టు అనిపించేది.ఇది అత్యంత భావగర్బితమైనది.జయం అనేది ఇక్కడ ఇతరులపై సాధించిన గెలుపు కాదు,అజ్ఞానంపై సాధించిన అంతర్గత విజయం.ఒక్కో అక్షరాన్ని నేర్చుకోవడం అంటే భాషలోని ఒక్కో అడ్డంకిని దాటడం, భావవ్యక్తీకరణకు మార్గాన్ని తెరవడం,వర్ణమాలపై పట్టు సాధించినప్పుడు అక్షరాలపై అధికారం కలిగినట్టుగా వాటిని తన భావాలకు లోబర్చుకున్నట్టుగా అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల్లో విద్య ఒక యుద్ధంలా కాకుండా,సాధనగా ఆవిష్కృతమవుతుంది.అక్షరాలు ఒకప్పుడు అపరిచితమైనవిగా కనిపించినా వర్ణమాలగా క్రమబద్ధం అయినప్పుడు అవి జయించదగినవిగా మారతాయి.కవి బాల్య అనుభవాన్ని ఆధారంగా చేసుకుని చదువు ఒక విజయం,భాష ఒక సాధన, అక్షరాల అవగాహన ఆత్మవిశ్వాసానికి మూలం అనే భావాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు.వర్ణమాల నేర్చుకోవడం అంటే కేవలం చదవడం,రాయడం మాత్రమే కాదు.భాషా లోకాన్ని జయించి తన భావాలకు అనుగుణంగా అక్షర రూపం ఇవ్వడం అనేది గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం ద్వారా వ్యక్తి తనపై సమాజం మోపిన మౌనాన్ని చెరిపేసుకుని తన అస్తిత్వాన్ని ప్రకటించుకుని చైతన్యాన్ని పొందుతాడు.విద్య అతనిని వర్ణ వ్యవస్థ అనే అడ్డుగోడను దాటే శక్తిగా మారుతుంది.చదువు వల్ల కలిగే ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం,ఇవి కులపరమైన పరిమితులను ప్రశ్నించే చైతన్యంగా రూపాంతరం చెందుతాయి. అక్షర జ్ఞానం అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు. అది ఆలోచనల స్వేచ్ఛ,ప్రశ్నించే ధైర్యం,వివక్షను దాటి సమానత్వాన్ని సాధించాలనే తపన.వర్ణాన్ని జయించడం అనేది సమాజంలోని అసమానతలను అధిగమించడం. సంఘంలోని కుల వ్యవస్థను జయించినట్లుగా భావించవచ్చు.
“పాఠాలు వెంట వెంటనే అప్పగిస్తుంటే/పంతులు గుండెలో దడ మొదలయ్యేది/ఇది విరామం లేకుండా పాఠాలు అప్పగించడం పిల్లవాడి బుద్ధి తీక్షణతను విద్య నేర్చుకోవడంలోని నిరంతర సాధనను ప్రకటిస్తుంది.చదువు ఇక్కడ ఆనందంగా కాక బాధ్యతగా మారిన క్షణాన్ని కవి గుర్తు చేస్తాడు. సాధారణంగా చదువు నేర్చుకునేటప్పుడు భయపడేది విద్యార్థి.కానీ,ఇక్కడ చక్కగా చదువు నేర్చుకున్న విద్యార్థి వల్ల పంతులుకు గుండెలో దడ మొదలవుతుంది.ఇది కవి చేసిన ముఖ్యమైన భావ విప్లవం.గురువు చెప్పిన పాఠాలను చక్కగా నేర్చుకొని వెంట వెంటనే విద్యార్థి అప్పగిస్తుంటే అతనికి చదువు పట్ల గల అసాధారణ శ్రద్ధను, క్రమశిక్షణను తెలియచేస్తుంది.ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా,తప్పులు లేకుండా,నిర్ణీత సమయానికి పాఠాలు అప్పగించడం, విద్యార్థి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తున్న స్థితిని తెలియజేస్తుంది.ఇది సాధారణ పరిస్థితి కాదు.ఇది గురువు అంచనాలను సవాలు చేసే స్థాయి.ఇక్కడ పంతులుకు కలిగిన భయం ఏమిటి? శిక్షించాల్సిన అవసరం లేకపోవడం వల్ల వచ్చిన భయం కాదు.అది బాధ్యత,ప్రతిష్ట, అధికారం కదిలిపోవడం వల్ల వచ్చిన భయం. పాఠాలు వెంట వెంటనే అప్పగించే విద్యార్థి ముందు గురువు తన కఠినత్వాన్ని ప్రయోగించే అవకాశం కోల్పోతాడు.శిక్ష ద్వారా నిలబెట్టుకున్న అధికారానికి ఇది ఒక మౌన సవాలు.అందుకే పంతులుకు అంతర్గత అసౌకర్యం కలుగుతుంది.గురువు వ్యవస్థలో తప్పు పట్టడం ఒక అలవాటుగా మారినప్పుడు,తప్పులు లేకుండా చక్కగా చదువుకున్న విద్యార్థి అతనికి ఒత్తిడిని కలిగిస్తాడు. విద్యార్థి తప్పు లేకపోతే శిక్షించలేడు.శిక్ష లేకపోతే తన ఆధిపత్యం తగ్గిపోతుంది ఏమో అన్న భయం పంతులు గుండెల్లో దడగా మారుతుంది.విద్యార్థి బాగా నేర్చుకుంటే గురువుకి ఆనందం కలగాలి. కానీ,ఇక్కడ గురువుకి భయం కలగడం,అప్పటి విద్యా వ్యవస్థలో గురువు పాత్ర బోధకుడిగా కాక నియంత్రకుడిగా మారిపోయింది అని సూచిస్తుంది. ఈ అంతర్ముఖ విరోధమే గురువు గుండెలో దడగా వ్యక్తమవుతుంది.విద్యార్థి బాగా చదువుకొని చక్కగా పాఠాలు అప్పజెప్పినప్పుడు ఇతరుల ముందు గురువు అప్రమత్తంగా ఉండాలి.ప్రశ్నలు,లోపాలు వెతకాలి.తన స్థాయి తగ్గకుండా జాగ్రత్తపడాలి.ఈ సామాజిక ఒత్తిడి భయానికి కారణం.ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది ఏమిటి?అప్పటి విద్యావ్యవస్థలో భయం విద్యార్థి నుంచి గురువు వైపు కూడా ప్రవహించేది.చదువు జ్ఞానోత్సవం కాక, అధికార – ఆధిపత్యాల ఆటగా మారినప్పుడు,నిజాయితీగా నేర్చుకున్న విద్యార్థి కూడా గురువుకు అసౌకర్యాన్ని కలిగిస్తాడు.అందు వల్ల పంతులుకు వచ్చిన గుండెలో దడ భయానికి కాదు.తన అధికారం,తన పాత్ర,తన వ్యవస్థ పై పడిన మౌన ప్రశ్నకు ప్రతిధ్వని.ఈ కవితా పంక్తులు – ముఖ్యంగా బాల్యంలోని భయం శిక్ష, గర్వం,ఆనందం అన్నిటిని నిర్బంధం లేకుండా నిజాయితీగా ఆవిష్కరిస్తుంది.
“తొక్కుడు బండ తొవ్వలో పడుతుందని/ అదిమిపట్టేవాడు/ఇది శారీరక శిక్షణ ద్వారా క్రమశిక్షణను నేర్పే పద్ధతికి సంకేతం.విద్యతో పాటు భయం కూడా ఎలా కలిసి నడిచేదో తెలియ జేస్తుంది.ఈ కవితా పంక్తి గ్రామీణ జీవన అనుభవాన్ని బలమైన ప్రతీకాత్మకతతో ఆవిష్కరిస్తుంది.తొక్కుడు బండ అన్నది నియంత్రణ లేకపోతే ప్రమాదం కలిగించే శక్తిని సూచిస్తుంది. తొవ్వ అంటే దారి.అది జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు,ప్రమాదకర పరిస్థితులకు రూపకం. అదిమి పట్టేవాడు అనే పదం అప్రమత్తతకు,బాధ్యతాయుతమైన నియంత్రణకు ప్రతీక. ప్రమాదం సంభవించే లోపు దాన్ని అడ్డుకునే జాగ్రత్త,అనుభవం,చైతన్యం ఇందులో ప్రతిఫలిస్తాయి.ఇది కేవలం శారీరక చర్య కాదు : మానసిక స్థితి – భయం కాదు,బాధ్యత – అనే భావనను బలపరుస్తుంది.ఈ కవితా పంక్తిలో కవి ఒక సామాజిక సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.నియంత్రణ లేని శక్తి వినాశానికి దారి తీస్తుంది.జాగ్రత్తతో కూడిన నియంత్రణే భద్రతకు మార్గం అనే తత్వాన్ని సులభసాధ్యంగా పాఠకుడి హృదయంలో నాటే శిల్పం ఇది.ఈ కవితా పంక్తి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం,జాగ్రత్తగా ఉంటే భద్రత కలుగుతుందనే బాధ్యతాయుతమైన జీవన దృష్టిని ప్రతిపాదిస్తుంది.
“నవ్వుకుంటూ తొడపాశం పెడితే/నరకం కనబడేది/ గురువు నవ్వే ముఖం వెనుక దాగిన శిక్ష పిల్లవాడి దృష్టిలో నరకప్రాయంగా ఉంటుంది.నవ్వుకుంటూ అనే పదం మాయను,మృదుత్వాన్ని,పైకి కనిపించే అమాయకత్వాన్ని సూచిస్తుంది. కానీ,అదే నవ్వు వెనుక దాగి ఉన్నది తొడ పాశం,అది బంధనం, మోసం,అణిచివేతకు ప్రతీక.నవ్వుతూ ప్రారంభమైన బంధం చివరకు వ్యక్తిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం – అదే నరకం కనబడేది అన్న అనుభూతి.ఇక్కడ నరకం అనేది మతపరమైన భావన కాదు.అది జీవితంలోని ఎదురయ్యే బాధ,అవమానం, మోసపూరిత సాన్నిహిత్యం.వ్యక్తి స్వేచ్ఛను హరించగా లోపల నరకతుల్యమైన వేదన ఉద్భవిస్తుంది అని కవి చెబుతాడు.పైకి ప్రేమగా, నవ్వుగా కనిపించే సంబంధాలు,ఎలా హింసాత్మకంగా మారుతాయో.కవి బలమైన ప్రతీకలతో ఆవిష్కరించాడు.
“డస్టర్ తోని దవడల మీద పొడిస్తే/దండగ మాలిన చదువు అనిపించేది/ఇక్కడ శిక్షల వల్ల చదువు పట్ల విరక్తి కలుగుతుంది అనే విషయం ఇందులో ఉంది. ఈ కవితా పంక్తులు విద్యావ్యవస్థలోని నిర్దయతను, బాలుర మనసుపై పడే హింసాత్మక ముద్రను హృదయ విదారకమైన స్థితిని ఆవిష్కరిస్తాయి. జ్ఞానాన్ని అందించాల్సిన గురువు చేతిలోని డస్టర్ – బ్లాక్ బోర్డ్ తుడవడానికి ఉపయోగించే సాధనం – ఇక్కడ శిక్షించడానికి వాడబడుతున్నది. దవడల మీద పొడిస్తే అనే పదం – శారీరక వేదన మాత్రమే కాదు.బాలుడి గౌరవానికి కలిగే గాయాన్ని కూడా సూచిస్తుంది.పిల్లవాడి ముఖంపైన పడ్డ దెబ్బ వల్ల అతని మనసులో భయం,అవమానం చోటు చేసుకుంటుంది.గురువు అసహనం పిల్లవాడిపై హింసగా మారిన క్షణమే విద్య తన మానవీయతను కోల్పోతుంది.అందుకే బాలుడికి ఇది దండగ మాలిన చదువు అన్న భావన కలుగుతుంది.చదువు పట్ల ప్రేమ,ఆసక్తి పెరగాల్సిన వయసులో భయం,ద్వేషం కలుగుతుంది.ఇది చదువుపై కాదు – చదువును బలవంతంగా,హింసతో నేర్పే విధానంపై వచ్చిన నిరసన.ఇక్కడ దండగ అనే పదం చదువు వ్యర్థం అని కాదు.హింసతో కూడిన చదువు నిరర్ధకం అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవి విద్యా వ్యవస్థ పై మౌన విమర్శ చేస్తాడు. బాల్యాన్ని సృజనాత్మకంగా వికసింప చేయాల్సిన పాఠశాల భయాన్ని నింపే స్థలంగా మారినప్పుడు,చదువు తన అసలు లక్ష్యాన్ని కోల్పోతుంది అని సూచిస్తాడు. కవితలోని ఈ దృశ్యం విద్య అనే పవిత్ర ప్రక్రియపై పడిన మచ్చగా నిలుస్తుంది.కవి ఈ కవితా పంక్తులలో హింసాత్మక బోధన వల్ల కలిగే భయాన్ని, చదువు పట్ల విరక్తి కలుగడాన్ని స్పష్టంగా చూపిస్తునే మానవత్వంతో కూడిన విద్యా బోధన యొక్క ఆవశ్యకతను బలంగా ప్రతిపాదిస్తున్నాడు.
“అందరిలో అగ్రభాగాన నిలిస్తే/ఆకాశాన్ని అందుకున్నట్టుండేది/విద్య ద్వారా లభించే గౌరవం, ఆనందం ఈ కవితా పంక్తిలో శిఖరానికి చేరుతుంది. ఈ కవిత గ్రామీణ బాల్యాన్ని,పాత విద్యావిధానాన్ని, విద్యలోని కఠినత్వం,ఆనందం,సహజ ఉపమానాలతో భావోద్వేగంతో వ్యక్తపరుస్తుంది.ఇది కేవలం ఒక వ్యక్తి జ్ఞాపకం కాదు.ఒక తరం విద్య, అనుభవానికి అద్దం పట్టిన కవిత.కట్టెపల్క కవిత చదువు ద్వారా బాలుడికి కలిగే ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని,ఆశా పూరిత దృక్పధాన్ని హృద్యంగా ప్రతిబింబిస్తున్నది. కట్టెపల్క పై అక్షరాలు దిద్దుకుంటూ గురువు చెప్పిన పాఠాలను శ్రమతో నేర్చుకుని పిల్లవాడు ఇతరుల కంటే ముందు ఉండ గలిగిన క్షణం అతని జీవితంలో ఒక విజయోత్సవంలా మారుతుంది.అందరిలో అగ్ర భాగాన నిలిస్తే అది కేవలం శ్రేణిలో ముందు ఉండడం మాత్రమే కాదు.తనపై తనకు కలిగిన నమ్మకాన్ని అణిచివేతల మధ్య ఎదగగలిగిన గర్వాన్ని సూచిస్తుంది. ఇది పోటీ భావన కంటే సాధన ఫలితంగా వచ్చిన గెలుపు,అక్షర జ్ఞానం అనే చిన్న అడుగు అతని మనసును పెద్ద స్వప్నాల వైపు తీసుకొని వెళ్తుంది.ఆకాశాన్ని అందుకున్నట్టు ఉండేది అనే ఉపమానం, బాలుడి మనసులోని సున్నితమైన కలల విస్తృతిని ప్రతీకాత్మకంగా చూపుతుంది. ఆకాశం – అపారమైన అవకాశాలకు, అంతులేని ఆశలకు సంకేతం.పిల్లవాడికి చదువు ద్వారా తన స్థితి మారుతుంది అనే అపారమైన నమ్మకం కలుగుతుంది.కవి చదువు యొక్క సానుకూల శక్తిని ప్రశంసిస్తాడు.శిక్ష, భయం,అవమానం చూపిన ఇతర పంక్తులతో పోలిస్తే ఇవి ముఖ్యంగా చదువు యొక్క ప్రాముఖ్యతను వ్యక్తం చేస్తున్నాయి. కట్టెపల్క అనే సాధారణ పరికరం కూడా సరైన మార్గ నిర్దేశం లభిస్తే బాలుడిని ఆకాశాన్ని అందుకునే స్థాయికి చేర్చగలదు అనే ఆశావాహ దృక్పథం ఇక్కడ వ్యక్తం అవుతుంది.ఈ కవితా పంక్తులు గ్రామీణ పాఠశాల జీవితంలోని బాల్య స్మృతులు, విద్య, అనుభవాలను చాలా సహజమైన ఉపమానాలు, ప్రతీకలతో ఆవిష్కరిస్తాయి.కవి తన చిన్ననాటి పాఠశాల అనుభవాన్ని ఒక జీవన దృశ్యంగా మన ముందు ఉంచుతాడు.కట్టె పల్క అనేది కేవలం ఒక పలక కాదు.అది ఒక కాలానికి,ఒక జీవన విధానానికి చిహ్నం.మొదటిసారిగా కట్టెపల్క పై అక్షరాలు దిద్దడం అనేది కేవలం చదువునకు ప్రారంభం కాదు. అది వారి జీవిత ప్రస్థానానికి మొదటి అడుగులుగా నిలుస్తుంది.కట్టెపల్క జ్ఞానానికి మొదటి వెలుగు. విద్యా లోకానికి ద్వారం.భవిష్యత్తు నిర్మాణానికి సోఫానం.కట్టెపల్క పై శ్రమతో నేర్చుకున్న అక్షరాలు పిల్లవాడి జీవితమంతా తోడుగా ఉంటాయి.కాలం మారినా,అక్షరాలు విలువ ఎప్పటికి తగ్గదు. విద్యకు జీవితాన్ని మలిచే శక్తి ఉంది. కట్టెపల్క కవిత అందించే ముఖ్యమైన సందేశం ఇది.విద్య మనిషిని తీర్చిదిద్దే గొప్ప ఆయుధం.బాల్యంలో కట్టెపల్క పై దిద్దిన అక్షరాలు అందించిన జ్ఞానం జీవితంలో ముందుకు సాగడానికి తోడ్పడుతుంది.ఈ కవితా పంక్తులు శ్రమ,విజయం,స్వప్నాల విస్తరణ అనే జీవన సత్యాన్ని బాల్య అనుభవాల ద్వారా ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తుంది.విద్యా వ్యవస్థలో భాగమైన కట్టెపల్క గురించి చక్కటి కవితను అందించిన కవి అంజయ్యను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కందుకూరి అంజయ్య తేది 04 – 08 – 1960 రోజున జన్మించారు.వీరి తల్లిదండ్రులు: లక్ష్మి,రాజయ్య గారలు.వీరు గుల్లకోట గ్రామం,వెల్గటూర్ మండలం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు.వీరు 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,గుల్లకోట గ్రామంలో చదివారు. వీరు గుల్లకోట నుండి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఎండపెల్లి గ్రామంనకు నడిచి వెళ్ళి 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్,ఎండపల్లి గ్రామంలో చదివారు.వీరు ఇంటర్మీడియట్ బై.పిసి.బిషప్ సాలమన్ జూనియర్ కాలేజి,కరీంనగర్ లో చదివారు.వీరు బి.ఎస్సీ.డిగ్రీ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
కరీంనగర్ లో చదివారు.వీరు ఎం.ఏ. (తెలుగు), ఎం.ఫిల్.డిగ్రీ పూర్తి చేశారు.వీరు కేంద్రీయ విశ్వవిద్యాలయం,హైదరాబాదు నుండి చెరబండరాజు నవలలు అను అంశం పై పరిశోధన చేసి 1989 సంవత్సరంలో ఎం.ఫిల్. డిగ్రీని పొందారు.శ్రీ కె.కె. రంగనాథాచార్యులుగారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.వీరు1990లో చేనేత & జౌళి శాఖలో అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా నియమింపబడ్డారు.వీరు తేది 31 – 08 – 2018 రోజున డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. వీరు సాహితీ సోపతి, ఎన్నీల ముచ్చట్లు,తెలంగాణ రచయితల వేదిక వంటి పలు సంస్థల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.
కవి అంజయ్య ముద్రిత రచనలు :
1.కట్టెపల్క కవితా సంపుటి,2013.
2.జమిడిక కవితా సంపుటి,2023.
3.కదలిక సాహిత్య వ్యాసాలు,2024.
4.వడపోత కందుకూరి అంజయ్య కవిత్వంపై అనుశీలనా వ్యాసాలు,2025.
కవి అంజయ్య పొందిన పురస్కారాలు :
1.అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం,2014లో పొందారు.
2.అక్కెపెల్లి ఫౌండేషన్ సినారే అవార్డు 2021లో అందుకున్నారు.
3.తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్
రావికంటి వాసునందన్ ధర్మనిధి పురస్కారం,2025లో పొందారు.
