Home బాల‌సాహిత్యం కష్టపడితేనే ఫలితం

నరసింహపురం లో శరభయ్య అనే  ఒక రైతు ఉండేవాడు.  అతడు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు .  అతనికి రవి అనే ఒక కొడుకు ఉండేవాడు.  అతన్ని చదివించి గొప్ప వానిగా చేయాలని శరభయ్య  ఆశ. 
        రవి మొదట చదువు మీద ఆసక్తి చూపినా  అటు తర్వాత మిత్రులవల్ల అతనికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది.   అతడు పదవ తరగతి పూర్తి చేసిన పిదప అతనిని శరభయ్య డబ్బు కట్టి ఒక పేరు మోసిన కళాశాలలో చేర్పించాడు .  కానీ రవి చదువు మీద శ్రద్ధ చూపకుండా ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకోసాగాడు.  శరభయ్య కు ఆ కళాశాల వారు  రవి చదవడం లేదని మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయని కబురు అందించారు.   ఈ విషయం విని శరభయ్య చాలా బాధపడ్డాడు . 
         ఒకసారి దసరా సెలవులకు రవి ఇంటికి వచ్చాడు.  శరభయ్య  తన వెంట రవిని వ్యవసాయ పనికి తీసుకొని వెళ్ళాడు.   అక్కడ అతన్ని తనతో పాటు పని చేయమన్నాడు .  కానీ రవికి ఆ పని ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అయినా తండ్రి మాట కాదనలేక అతడు చెప్పిన పనల్లా చేసాడు. 
        అలా వారం రోజులు గడిచాయి .  రవికి ఈ వ్యవసాయం కన్నా తాను చదువుకోవడమే ఉత్తమంగా అనిపించింది.   చదువు మీద తనకు కూడా ఆసక్తి ఉంది.  కానీ అనవసరంగా  తాను ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకొని చదువును నిర్లక్ష్యం చేస్తున్నానని అతనికి అనిపించింది. తండ్రి కష్టం చూసిన తర్వాత తన పద్దతిని మార్చుకోవాలని రవి భావించాడు.  
           శరభయ్య కుమారునిలో వచ్చిన  మార్పును గమనించాడు.   అతడు రవితో “ఒరేయ్ ! మేము అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాం .  పంట ఒకసారి వస్తున్నది. మరోసారి రావడం లేదు.   చివరికి ఎప్పుడైనా దేవుడు ఆదుకోకపోతాడా అని వ్యవసాయం  వృత్తిగా భావించి జీవిస్తున్నాం .  నలుగురికి కడుపు నింపుతున్నామన్న సంతృప్తి మాలో ఉంది.  నీవు మందమతివి కూడా కావు.  మరి నీకు  వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగితే అదే చెయ్యి.  అదేం తక్కువ కాదు.    రేపు భార్యాపిల్లలను పోషించాలంటే  నీవు ఏదో ఒక పని చేయాలి కదా !”అని అన్నాడు. 
       అది విన్న రవి ” నాన్నా!  నాకు వ్యవసాయం చేయడం  కన్నా చదవడమే ఉత్తమంగా అనిపిస్తున్నది .  కష్టపడనిది ఏదీ సాధించలేమని నాకు అర్థమైంది .  అందుకే రేపటినుండి కష్టపడి చదివి ఈ వ్యవసాయంలో పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాను” అని అన్నాడు.   ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషించాడు. 
        ఆ తర్వాత కళాశాలకు వెళ్లిన రవి బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత సాధించాడు.  తర్వాత అతను  వ్యవసాయ శాస్త్రాన్ని చదివి కొత్త కొత్త పద్ధతులు వ్యవసాయంలో తెలుసుకొని రైతులకు దిగుబడి ఎక్కువ వచ్చే మార్గాన్ని  తెలుసుకున్నాడు.  ఆ తర్వాత తన తండ్రితో పాటు ఇతర రైతులకు వ్యవసాయం లోని కొత్త కొత్త పద్దతులను తెలిపాడు. చదువు అంటే ఆసక్తి లేని  తన మిత్రులకు రవి  వ్యవసాయం చేయమని ప్రోత్సహించాడు.    తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు.  ఆ తర్వాత కొన్ని రోజులలోనే అతను ఒక మంచి కొలువును కూడా సంపాదించాడు.  అందుకే పిల్లలూ! ఎందులో నైనా  కష్టపడనిదే ఫలితం రాదని గ్రహించాలి. 

    You may also like

    Leave a Comment