పజిల్ నింపి పంపిన వారు – ఉమ నెల్లుట్ల


తేడా….
ఈ కులాలు
ఈ మతాలు
ఈ వరకట్నపు
దురాచారాలు
ఈ సనాతన సాంప్రదాయాలు
మానవుడు నిర్మించుకున్న
సామ్రాజ్య సౌధాలయితే
దేవుని దృష్టిలో
ఇవన్ని
పనికిరాని శిథిలాలు
పగిలిన ప్రతిబింబాలు
తెలివి
ఎదుటివాడి కంటే
నువ్వు తెలివిగా
ఉండాలనుకోవడంలో
తప్పు లేదు –
కాని
వాడి తెలివిని
దెబ్బ కొట్టాలని
అతి తెలివి
ప్రదర్శించావో
నీ అంత మూర్ఖుడు
మరొకడు లేడు
రాజమౌళి గారు దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇందులో తారక్,రామ్ చరణ్ లు హీరోలుగా చేసారు. కథాకమామీషు పక్కనపెడితే ఈ మధ్య ముందుగా వచ్చే పాటలతోనే సినిమాలు సగం హిట్ కొట్టేస్తున్నాయి. ఒక్క పాట ఆ సినిమా పరిధిని ఎక్కడికో తీసుకెళ్ళి పోతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను అందించారు మన యం.యం.కీరవాణి గారు. అంతకంటే అద్భుతమైన పద సంపదను సమకూర్చారు మన పాటల రచయితలు. ప్రస్తుతం మనం ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని ఒక చక్కని పాట గురించి మాట్లాడుకుందాం. మూవీ లో మొదటిగా వచ్చే పాట “కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల” పాట. దీనిని సుద్దాల అశోక్ తేజ గారు రాసారు. అసలు సినిమా మొదలయ్యేది ఈ పాట తోనే. గోండు జాతికి చెందిన ఒక చిన్నారి బ్రిటిష్ రాణి చేతికి మెహందీ పెడుతూ ఈ పాట పాడుతుంటుంది. కొండ కోనల్లో తిరిగే చిన్నారులు హాయిగా ఆడుకుంటూ పాడుకునే ఆహ్లాదకరమైన గాలి పాటలా ఉంటుంది ఈ పాట. పసితనపు ఛాయలు వీడని ఒక చిన్నారి, అమ్మే తన లోకంగా ఆ కొండ ప్రాంతపు ప్రకృతిలో తనతో పాటు స్వేచ్ఛగా తిరిగే జంతు జాలాలనే సహవాసాలుగా భావించి తన పాటలో వాటిని జత కడుతుంది. తాను ఉంటున్న చిన్ని ప్రపంచంలో తాను పొందుతున్న ఆనందానుభూతులు తనతో ఎప్పటికీ అలానే ఉండాలని, ఉంటాయని భావిస్తూ పాట పాడుతుంటుంది. ఈ పాటకు కీరవాణిగారు అందించిన బాణీలు ఎంతో మధురంగా మనసును తాదాత్మ్యం చెందిస్తుంటాయి. చిన్నారుల గురించి పాట రాయడం వేరు. కానీ చిన్నారులు పాడే పాట రాయాలి అంటే వారి వయస్సు లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిందే. గీత రచయిత అశోక్ తేజ గారు ఇలా మనకు ఒక మంచి పాటను అందించటానికి ఆ వయసుకు వెళ్ళి ఆపాప ఆలోచనా దృక్పథాన్ని మన ముందుంచారు.
ఇంతకీ ఈ పాట పాడింది ఎవరో తెలుసా? ‘ప్రకృతి’ అనే మరో చిన్నారి. కీరవాణి అద్భుతమైన బాణీలకు, అశోక్ తేజగారి అందమైన పదసంపద తోడయ్యి, ‘ప్రకృతి’ గళం లోని మాధుర్యం సినిమాలో నటించిన చిన్నారి చక్కని నట ప్రదర్శన వెరసి ఒక అందమైన పాట మనముందు ఆవిష్కృతమయ్యింది.
సినిమా పాటకు కమర్షియల్ హంగులు
ఉంటేనే రచయితకు మనుగడ..
పది కాలాల పాటు పాటకు ఆదరణ..
కమర్షియాలిటీ మిస్సవ్వకుండా
చక్కని సందేశంతో..
జనం నాలుకలపై నిలిచిన పాట..
జన హారతి పట్టిన పాట…
“జనతా గ్యారేజ్” సినిమా కోసం
” రామజోగయ్య శాస్త్రి” రాసి..
ప్రకృతికి అక్షరాభిషేకం చేసిన
ప్రణామం ప్రణామం ప్రణామం …పాట
తోం.. ధిరననన ధిర ధిర న…
తోం.. ధిరననన ధిర ధిర న…
ప్రణామం ప్రణామం ప్రణామం…
ప్రభాత సూర్యుడికి ప్రణామం…
ప్రణామం ప్రణామం ప్రణామం…
సమస్త ప్రకృతికి ప్రణామం…
ప్రమోదం ప్రమోదం ప్రమోదం…
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం…
ప్రయాణం ప్రయాణం ప్రయాణం…
విశ్వంతో మమేకం ప్రయాణం..
మనిషి పంచ ప్రాణాలు
పంచ భూతాలతో ముడిపడి ఉన్నాయి
ఆ పంచ భూతాలకు రుణపడి ఉన్నాయి..
అందుకే
పంచభూతాలలో ఒకటైన
సూర్యుడి(నిప్పు)కి ప్రణామాలు అర్పిస్తూ
పల్లవిని ప్రారంభించారు రామజోగయ్య శాస్త్రి..
మనలో కొలువై ఉన్న సమస్త ప్రకృతికి ప్రణామాలు అర్పిస్తున్నారు..
ప్రకృతి ఎంతో సుందరం
దాన్ని సృష్టి మరెంతో ప్రమోదం
సౌందర్యాత్మక హృదయం ఉండీ
కళాత్మక దృష్టితో చూస్తే..
అందంగా పేర్చినట్టు
కుంచె నుంచి జాలువారినట్టు
కన్నుల ముందు కొలువుదీరిన
ప్రకృతిలోని ప్రతి దృశ్యం ఒక చిత్రమే..!
మనిషి పుట్టుక.. చర్య , ప్రతిచర్య
ఇలా కాలచక్రంలో.. జీవన గమనంలో
మనిషి సాగించే ప్రయాణం
ఊపిరి ఉన్నంత వరకూ
విశ్వంతో మమేకమైనదే..
చిన్న చిరునవ్వే.. వికసిత పద్మాలు
ఇక ఏ పద్మశ్రీలు.. పద్మ విభూషణ్ లు అవసరంలేదు.
అందుకే కవి అంటున్నారు
మన చిరునవ్వులే పూలు…
నిట్టూర్పులు తడి మేఘాలు…
హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం…
బాగున్నారా..? అని అంటే..
ఏం బాగో.. ఏమోలెండి.
ఇలా ఉన్నాం అంటారు కొందరు..
ఆ నిట్టూర్పులే తడి మేఘాలు
ప్రతి నిత్యం చూసే సూర్యోదయం
ఏరోజుకారోజు ఎంతో అందంగా ఉంటుంది..
అందుకే కష్ట నష్టాలు ఎన్ని ఉన్నా
ఆశావాద దృక్పథం ఉండాలి..
అప్పుడే
మన జీవితం చిగురులు తొడుగుతుంది
సరికొత్తగా ఉంటుంది.
అందుకే
ఆశే పచ్చదనం.. అంటున్నారు కవి.
మనిషిని ప్రకృతిని కలిపి చూస్తే
ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబమే
దుఃఖం.. సంతోషం.. కోపం.. ప్రేమ..
ఇలా మనసులోని ప్రతి భావోద్వేగం
ప్రకృతిలో రిప్లెక్ట్ అవుతున్నదే..
ప్రతి ఋతువు మనకు ఒక బతుకు పాఠం చెబుతోంది..
ఆకులు రాలితేనే కదా
మరో ఆకు ఉద్భవించేది..
శిశిరం ఉంటేనే వసంతం వస్తుంది
వసంతం వస్తేనే ప్రకృతి కొత్త శోభను
సంతరించుకుంటుంది..
మారే ఋతువుల వర్ణం…
మన మనసుల భావోద్వేగం…
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం
నువ్వెంత నేనెంత రవ్వంత…
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత…
అనుభవమే దాచింది కొండంత…
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా…
తరాలు మారుతున్నాయి..
నీది నాది అనే అంతరాలు పెరుగుతున్నాయి .
అసలు ఈ సృష్టి ముందు మనమెంత
నిన్న వచ్చాము.. రేపు వెళ్తాము..
కొండంత అనుభవాన్ని దాచిన
సృష్టి నుండి నేర్చుకుందాం
అనుసరణీయమైన ఆ అడుగుల్లో అడుగేసి
ఈ జన్మంతా వెళదాం..
ప్రకృతిని పాటకు వస్తువుగా తీసుకుని
ఆ ప్రకృతి ఆంతర్యాన్ని విడమరుస్తూ..
ఆ ప్రకృతిని విస్మరించ వద్దని వివరిస్తూ..
ప్రభోదిస్తూ.. కలాన్ని ఉరకలెత్తించిన వైనం
రామజోగయ్య శాస్త్రీ పదును తెలియజేస్తుంది.
ప్రకృతికి భావోద్వేగాలను అన్వయించి సాగిన మొదటి చరణం
ఒక్కో అక్షరం.. ఒక్కోఆణిముత్యం…
ఇక
మానసిక దొంతరలోని మనిషి డొల్లతనాన్ని
ఎండగట్టి.. హెచ్చరిస్తున్న రెండవ చరణాన్ని
పరిశీలిద్దాం..!
మన చుట్టూ ఉంటూ
మనతో దోబూచులాడుతూ
చల్లని గాలిని హాయిని ఇచ్చే
చెట్లంటే మనకు చిన్న చూపు
ఎవడికి సొంతమిదంతా…
ఇది ఎవ్వడు నాటిన పంట…
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా…
తరములనాటి కధంతా…
మన తదుపరి మిగలాలంటా…
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా..
తరతరాలుగా నాటిన చెట్లను
రేపటి తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత
మనదే..
కానీ..
స్వార్థపూరిత ఆలోచనల కోసం
అమ్ముకుంటున్నాడు..అంతమొందిస్తున్నాడు..
అందుకే
ప్రాణ వాయువును ఇచ్చి
ప్రాణ ప్రతిష్ట చేసే చెట్లను రక్షించుకుందాం
అంటూ ఉద్భోద చేస్తున్నాడు.
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం…
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం…
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం…
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం…
ప్రకృతి వినాశనానికి పాదువేసే
పాడు ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి.
ఈనేల తల్లి.. తల్లిడిల్లితే మహోగ్రరూపం దాల్చుతుంది..
ప్రకృతి ప్రకోపానికి విశ్వమంతా విస్ఫోటనం చెందుతుంది.
ప్రకృతిని ప్రేమిద్దాం..
ప్రకృతి పరిరక్షణకు పాటుపడుదాం..
అంటూ..
ఇష్టంగా గుండెకు హత్తుకునే పాటను విశ్వమానవాళికి అందించి..
ప్రబోధ గీతంగా పదికాలాల పాటు నిలిచే
అద్భుతమైన సాహిత్యాన్ని
శ్రోతల మస్తిష్కాలలో నాటి..
అజరామరం రామజోగయ్య శాస్త్రీ
అనిపించుకున్నారు.
అగ్ర కథానాయకుడి బరువైన సన్నివేశాన్ని
అంతే బాధ్యతగా పరిచయ గీతంగా మలిచి
సృజనాత్మకతను.. సామాజిక స్పృహను
మేళవించి అందించిన ఈ “ప్రణామం..ప్రణామం.. ప్రణామం..”
సినీ పాటల పూదోటకు ఒక గౌరవాన్ని అద్దింది.
(జూన్ 5.. పర్యావరణ దినోత్సవం సందర్బంగా)
కైవల్య శ్రీ దపాదం కలికలుష మహత్వ చ్ఛిదారూఢ పాదం సత్పూజాపాదపాదం సకల రుగపహరామూల్య సంపాదపాదం శాపాస్తామోద పాదం సురవరసరి దుద్భూత ఫూతాబ్ద పాదం వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం: మోక్షలక్ష్మిని ఇచ్చే పాదము; కలిపురుషుడు మానవుల చేత చేయించే సమస్త పాప భారాన్నీ ఛేదించడం కోసం పైకెత్తబడిన పాదము; చక్కని పూజలు అందుకోవటానికి ఆశ్రయమైన పాదము; సకల విధ రోగాలను – జాడ్యాలను హరించివేసే – అమూల్యమైన వరాలను అనుగ్రహించే – పాదము; మునివరులు, మహర్షులు ఇచ్చిన అస్త్రాల వంటి శాపాలను సంతోషంతో అంగీకరించిన పాదము; దేవనదియైన గంగ పుట్టుకకు మూలమై పవిత్రమైన పాదపద్మము కలవాడు శ్రీహరి. అట్టి యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: లోకులు తమకోసం, తమ కుటుంబం కోసం ఎన్నో చిన్న-సన్న కోరికలతో ఎందరో దేవతల్ని పూజిస్తూ ఉంటారు. వారిచ్చే అల్పమైన వరాలు భక్తుల తాత్కాలిక సుఖాలను, భోగవాంఛల్ని కొంతవరకే తీర్చగలుగుతాయి. కాని శాశ్వతానందాన్ని మాత్రం అందించలేవు. మోక్షప్రాప్తితో మాత్రమే నిజమైన, నిత్యానందం లభిస్తుంది. “మోక్షమిచ్చే జనార్ధనాత్” అని ఋషివచనం. (కైవల్య+శ్రీ +ద+పాదం=) అటువంటి మోక్షసంపదను అనుగ్రహించేవాడు విష్ణువు మాత్రమే! హరిపాదాలను ఆశ్రయించటమే మోక్షసంపత్పాప్తికి ఉన్న ఏకైక మార్గం!
కలియుగంలో ధర్మం ఒక్క పాదంతో మాత్రమే నడుస్తుందని సమస్త పురాణాలూ వక్కాణిస్తున్నాయి. సుఖలాలస–భోగవాంఛ మితిమీరి, ద్రవ్య సంపాదన మాత్రమే ఏకైక మార్గంగా బతికేస్తున్న నేటి కలియుగంలోని మానవుడు చేయని పాపాలు లేవు. (కలి+కలుష మహత్వ +ఛిద్+ఆరూఢ+పాదం=) కలిపురుష ప్రభావితులై మానవులు చేస్తున్న ఘోరమైన పాపాల మోపుల్ని ఛేదించి వేయడం కోసం హరి తన పాదాలను సంసిద్ధంగా ఉంచుతాడు. అంటే విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించిన వారికి పాపవిముక్తి చాలా తేలిక!
(సత్పూజా+ఆపాద+పాదం=) పూజ అంటే అర్చనాదులు. పెద్ద వాళ్ళను గౌరవించడానికి చేసేవే పూజలు మొదలైనవి! అటువంటి సత్పూజల్ని అందుకునేవి శ్రీహరి పాదాలు. అంతమాత్రమే కాదు. హరిపాదాలను ఆశ్రయించినవాళ్ళు గొప్ప పూజాదికాల్ని అందుకోవటానికి అర్హులౌతారు కూడ!
భోగాభిలాష శరీరాన్నే కాదు – మనస్సుని, ఇంద్రియాలను కూడ గాడి తప్పిస్తుంది. దాంతో ఎన్నో విధాల మానసిక – శారీరక బాధలు, రోగాలు మనిషిని క్రమంగా ఆక్రమిస్తాయి. (సకల+రుక్+అపహర+అమూల్య+సంపాద+ పాదం=) అటువంటి సమస్త రోగాలను క్షణాలలో తొలగించి, నయం చేసే – గొప్పదనాన్ని సంపాదించి పెట్టే – విలువ కట్టలేనివి శ్రీహరిపాదాలు!
మహర్షులు మహనీయులు. తపస్సంపన్నులు! వారికి ఆగ్రహం వచ్చినా-అనుగ్రహం కలిగినా క్షణాలలో స్పందిస్తారు. భవిష్యత్ దర్శనం చేయగల మహర్షులు శ్రీహరిని కూడ అనేక సందర్భాలలో శపించారు! విష్ణువు అనేకములైన – మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది రూపాలలో – జన్మలెత్తటం, రామకృష్ణాది అవతారాలలో ఎన్నో కష్టాలు అనుభవించటం,
కలియుగంలో ఆపద్బాంధవుడై వరదుడైన శ్రీనివాసుడు లక్ష్మీదేవితో ఎడబాటు పొందటం మొదలైనవన్నీ మహర్షులిచ్చిన శాపఫలాలే కదా! అటువంటి (శాప+అస్త్ర+ఆమోద+పాదం=) మహర్షుల శాపాలనే అస్త్రాలను సంతోషంతో ఆమోదించి, భూమిపై వివిధ రూపాలలో జన్మించి, నేటికీ భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీహరి!
సమస్త పాపాలను హరించివేసేది గంగానది! (సురవర+సరిత్ + ఉద్భూత +పూత +అబ్జ+పాదం=) బ్రహ్మసృష్టికి ఉపయోగపడుతూ ఆయన కమండలంలో అడిగి ఉందట ఆకాశగంగ! ఆయన విష్ణుమూర్తి పాదాలను కడిగితే – అక్కడ నుండి ప్రవహించిన గంగ విష్ణుపాదోద్భవి అని పేరు పొందింది. సురవర సరిత్ అంటే ఆకాశ గంగ! గంగ పుట్టుకకు ఆధారమైన పవిత్ర పాదం, తామర పూవులాంటి పాదం, కలిగినవాడు విష్ణుమూర్తి! శ్రీయాదగిరిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహుణ్ణి కవి తన పద్య రక్తారవిందాలచే పూజించి, నమస్కరిస్తున్నాడు.
ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోకగ మొక్కి నులింతు సైకత
శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షి తానత
శ్రీణికి దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్ష రామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
(6-I. పోతన భాగవతం)
మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!
నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం. విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.
రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!
వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.
అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!
అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి
స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూప. ఉపాసనా రూప.
ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత
ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)గారి ఈ గీతానికి ఎ.ఎం.రాజా మధురంగా బాణీ కూర్చితే జిక్కి మృదు మధురంగా గానం చేశారు.
పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు ||పులకించు||
సంగీతం, సాహిత్యం రెండు కూడా గానంతో మేళవిస్తే ఇక మానవ జీవితానికి కావలసింది ఏముంది? ఆ మూడు కళలకు మన మనసు పులకించి పోతుంది. మన మనసులో వుండే తీరని వ్యథలను, దుఃఖాలను మరపింప చేస్తాయి.
రాగ మందను రాగ మొలికి, రక్తి నొసగును గానం,
రేపు రేపను తీపి కలలకు, రూపమిచ్చును గానం,
చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం,
జీవమొసగును గానం, మది చింత బావును గానం ||పులకించని||
గానంలోని రాగంలో అనురాగం నిండితే మానవ మనుగడలో రక్తి కలుగుతుంది. సంగీతం రాగాన్ని కూడా అనురాగమయం చేస్తుంది. జీవితంలో ఆసక్తిని, రక్తిని నింపుతుంది. మనకు గానం రాగాలాపనతో ఎంతో దూరాన వున్న కలలను, ఆశలను మన హృదయానికి చేరుస్తుంది. మన భావాలు చెల్లా చెదురుగ పడి వుంటే వాటినన్నింటినీ పూలను దండిగా మార్చే విధంగా ఒక దగ్గరికి చేర్చి అస్తిత్వాన్ని కలుగజేస్తుంది. మన మనసులో వుండే బాధలను తొలగించి, హాయిని కలుగజేస్తుంది.
వాడిపోయిన పైరులైనా, నీరుగని నర్తించును,
కూలిపోయిన తీగలైనా, కొమ్మనల మీ ప్రాకును,
కన్నెమనసు ఎన్నుకున్న తోడు దొరికిన మరియు
దోరవలపే మరియు, మది దోచుకొమ్మని పిలుచు ||పులకించని||
వర్షాలు లేకపోతే పైర్లు ఎండిపోతాయి. కాని వర్షం కురిసి నీరు వాటికి అందినచో, మానవ హృదయం గానానికి పరవశించినట్లు, పైర్లు కూడ, నాట్యం చేస్తాయని కవి భావన. ఆధారం లేకపోతే తీగ ప్రాకజాలదు. అలా కూలిపోయిన తీగలు కూడా వాటి ప్రక్కన గల కొమ్మలను ఆసరా చేసికొని వాటిలో పునరుజ్జీవం కలిగి మళ్ళీ ప్రాకుతాయి. అదేవిధంగా కన్నెమనసులో ఎన్నో ఆశలుంటాయి. కాని, తాను మనసులో కోరుకున్న తోడు (జీవిత భాగస్వామి) దొరకాలన్నదే ఆమె జీవితంలో పెద్ద ఆశ. ఆ తోడు దొరికిందంటే ఆమె మనసు మురుస్తుంది. ఆ తోడు దొరికిన వెంటనే ఆమె పులకించి, తన హృదయాన్ని, జీవితాన్ని ఆ భాగస్వామికి సమర్పించి, తన మనసును కూడా. దోచుకొమ్మని ఆహ్వానిస్తుంది. గానం అనే కళ మానవ జీవితాల్లో వుండే జఢత్వాన్ని తొలగింపచేసే ఒక ఔషధం లాంటిది. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః” అని ఆర్యోక్తి. పశువులను, శిశువులోనే కాకుండా, పాములను కూడా పరవశింపచేసేది గాన రసం.
పెళ్లి కానుక సినిమా 1960 సంవత్సరంలో విడుదలైనది. ఈ పాట నటి కృష్ణకుమారి పై చిత్రీకరించబడింది. 60 సం గడిచినప్పికి ఇప్పటికి మన తెలుగు నాట అందరి హృదయాలను కొల్లగొడుతూనే వుంది.

ఆధారములు
^^^^^^^^^^^^
నిలువు
**
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ!
నేనొక డిగ్రీ కళాశాలకు, వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా వెళ్ళిన సందర్భంలో ఒక డిగ్రీ విద్యార్ధిని పై పద్యాన్ని చదివి “పురుషులందే పుణ్యపురుషులుంటారా ? స్త్రీలలో ఉండరా ? సారు!” అని ప్రశ్నించింది.
పురుషులంటే మగవారని సామాన్యార్థం. కాని పురుష శబ్దానికి అర్థం తెలిస్తే విషయం ఎంత ఉదాత్తమైందో బోధపడుతుంది. ‘పురీశేతి ఇతి పురుషు’ అని నిర్వచనం. పురమునందు ప్రకాశించువాడని అర్థం. ఇక్కడ పురశబ్దానికి రెండర్థాలున్నాయి. ఒక అర్ధం బ్రహ్మాండమని, రెండవ అర్థం శరీరమని. బ్రహ్మాండంలో ప్రకాశించేవాడు దేవుడని, శరీరంలో ప్రకాశించేవాడు జీవుడని తెలుసుకోవాలి.
అప్పుడు జీవులందు పుణ్యజీవులు వేరుగా ఉంటారనే అర్థం వస్తుంది. మగవారుగాని, స్త్రీలుగాని ఎవరైనా పుణ్యాత్ములేననే విశేషార్ధం స్ఫురిస్తుంది. నేను ఇదే విషయాన్ని స్త్రీ పురుషుల మధ్య తేడాలేకుండా తెలియజేసినప్పుడు ప్రశ్నించిన అమ్మాయి, ఆమె తోటి విద్యార్థినులు విన్నారు. ఎంతో సంతోషించారు.
మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని ఆరంభిస్తూ చెప్పిన “వాగర్ధా వివసంపృత్తా” అనే శ్లోకం పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు తల్లిదండ్రులుగా పేర్కొన్నది. శబ్దార్థాల వలె భార్యా భర్తలు అవినాభావ సంబంధం కలిగిన వారుగా తెలియజేసింది.
మన ప్రాచీన సంస్కృతిలో పురుషునికెంత ప్రాధాన్యమో స్త్రీకంతే ప్రాధాన్యం. యాజ్ఞ వల్కుడు ‘బృహదారణ్యకోపనిషత్తు’లో భార్యాభర్తల సంబంధాన్ని ‘అర్ధభృగలం’తో పోలుస్తాడు. గింజలోని రెండు పలుకుల లాంటివారు భార్యాభర్తలు, వంశాభివృద్ధికి దాంపత్యమే శరణ్యము కదా!
నాకు ఎక్కడా ప్రాచీన సంప్రదాయంలో స్త్రీ పురుషుని కంటే తక్కువ అన్న విషయం కనిపించలేదు.
“త్వమేవ మాతాచ పితాత్వమేవ” అని భగవంతుణ్ణి మాతృమూర్తిగా స్తుతిస్తాం. భారతీయులకు వేదం, భూమి, గోవు, గాయత్రి, తులసి, గంగానది మాతృ సమానులు. ఇంత గొప్ప సంప్రదాయం మనకుండగా మనం విదేశాల నుంచి వచ్చిన చదువుల ఆధారంగా స్త్రీ చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఉందా ? అనిపిస్తుంది.
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలుంటారని మనుస్మృతి చెప్తుంది. అంతేకాదు, ఉపాధ్యాయునికంటే ఆచార్యుడు పదిరెట్లెక్కువగా, ఆచార్యుని కంటె తండ్రి వందరెట్లెక్కువగా, తండ్రికంటె తల్లి వెయ్యిరెట్లెక్కువగా గౌరవానికి అర్హురాలని కూడా మనుస్మృతి చెప్తుంది.
ప్రాచీన కాలంలో ఇన్ని విధాలుగా స్త్రీ ఔన్నత్యం తెలుపబడుతుండగా, స్త్రీని విద్యకు దూరంగా ఉంచిన కొన్ని సందర్భాలు నన్నెంతగానో బాధించాయి. విద్యావేత్త లెవ్వరూ జ్ఞానార్జన విషయంలో స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరు.
యజ్ఞయాగాదులందు భర్తకు భార్య కుడివైపున కూర్చోవడమంటే, అన్ని వ్యవహారాలలో పురుషుని స్త్రీ కుడి భుజం అనే అర్థం స్పష్టమౌతుంది.
ఉపనిషత్తుల కాలానికి వస్తే ఒక జబాల, ఒక మైత్రేయి, ఒక గార్గి స్త్రీ ఔన్నత్యానికి ఎత్తిన స్వర్ణ పతాకలు. జనకుని సభలో గార్గి యాజ్ఞ వల్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం మన సంప్రదాయంలో స్త్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది.
జబాల సత్యకాముణ్ణి పెంచిన విధం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మైత్రేయి యాజ్ఞ వల్యుణ్ణి ఆత్మ గురించి అడిగిన ప్రశ్నలు స్త్రీ సాహసాన్ని, ఆధ్యాత్మిక పరిణతిని తెలుపుతున్నాయి. జీవితంలో సీత అనసూయకంటే రెండాకులు ఎక్కువ చదివినట్లు రామాయణ అరణ్యకాండ తెలియజేస్తుంది. వసిష్ఠుని ధర్మపత్ని అరుంధతి విజ్ఞాన జ్యోతి. అన్న విషయం అందరూ ఎదిగిందే.
పూర్వం ఏ కాలంలోను స్త్రీ విద్యకు దూరంగా లేదు. బహుశా ముస్లింల ఏలుబడిలో స్త్రీలు గడపదాటి బయటికి రాకపోవడం వల్ల వారికి విద్య దూరమైంది. ఇది భారతేదశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఒక విధంగా ఆంగ్లేయులు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారనే దాంట్లో కొత్త దనమేమీ లేదు. భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు అన్న మాట విస్మరించరానిది . ఈ సందర్భంగా
స్వాతంత్ర్యానంతర క్రమంగా స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించింది. కాని మనం ఏనాడు స్త్రీని విద్యకు దూరం చేయలేదు. ఒక్కసారి వేదమంత్రాలను గమనిస్తే, మంత్రార్ధం తెలిసిన ద్రష్టలుగా ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు
సంప్రదాయాన్ని అవగాహన చేసుకొని, మన సంస్కృతిని గౌరవిస్తూ మళ్ళీ స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావులెందరో ఉన్నారు. అటువంటి పుణ్యపురుషుల మూలంగా బాలికలు బాలురతో పాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి తమ ప్రతిభాపాటవాలను చూపుతున్నారు. తల్లి దండ్రులకు గౌరవాన్ని తెస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఒక్క రాజకీయ రంగమనేకాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ స్త్రీల యోగదానం ప్రశంసనీయం. అగ్రరాజ్యాధిపత్యాన్ని కైవసం చేసుకోవడానికి కూడా స్త్రీ శక్తి ఉరకలేస్తుందంటే, స్త్రీలకు సమాజంలో గల స్థానం ఎంత గొప్పదో ఊహించవచ్చు. అయితే కొన్ని దేశాలలో స్త్రీ విద్యగల ప్రాధాన్యం
అంతంతమాత్రమే. కాని భారతీయులు మాత్రం సాంప్రదాయకంగా మహిళాభ్యుదయ సాధనలో విద్యార్జనకు అగ్రతాంబూలమివ్వడం సత్యం.
లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతర్వురిన్ సద్ద్విజశ్రేయమై –భాగవతంలో పోతన
బమ్మెర పోతనామాత్యుని శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని అవతారికాపద్యమిది. మూలంలో గల సంస్కృత భాగవత వైశిష్ట్యాన్ని తెలిపే ఈ పద్యం తెలుగులోకి మహాకవి పోతనచే అనూదితం. భాగవతాఖ్య కల్పతరువనే మాటతో భాగవతం కల్పతరువు (వృక్షం)తో పోల్చబడి ద్వ్యర్థిలో రచించబడింది.
భాగవతార్థంలో పరిశీలిస్తే లలితాదేవి కాండంగా, శ్రీకృష్ణుడు తల్లివేరుగా, శుకమహర్షి ప్రవచించగా మనోహరత్వంతో శోభిస్తూ, దేవతలను తృప్తిపరుస్తూ, మిక్కిలి అందమైన కథతో, గొప్ప భక్తి ఫలాన్ని ఇస్తూ, స్వచ్ఛమైన కథకుడు వ్యాసమహర్షికి ఆలంబనై మంచివారికి (పుణ్యాత్ములకు) ఆశ్రయమిస్తున్నది. భాగవతమనే వృక్షార్థంలో పరిశీలిస్తే చిన్న చిన్న కొమ్మలతో, నల్లని మూలంతో కొమ్మపై వాలిన చిలుకుల పలుకులతో, చక్కని లతలు తనకాధారమై పైకి పాకగా, మంచి ఆకులు, పుష్పాలతో, గుండ్రని కాండంతో, చక్కటి పండ్లనిస్తూ, విశాలమైన మొదలుతో, అనేక పక్షుల కాశ్రయమైన చెట్టు భాగవతంలా శోభిస్తున్నది.
ఈ పద్యం శ్లేషసొబగుల్లో లలితాదేవి కాండంగా ఉండటమేగాక లలితమైన (కోమలమైన) అనే అర్థం వచ్చింది. “మూగురమ్మల మూలపుటమ్మ”ను పోతన విశేషంగా స్మరించినాడు. కృష్ణ శబ్దానికి శ్రీ కృష్ణపరమాత్మ, నల్లనైన కాండం అనే అర్థంతోబాటు “నల్లనివాడు పద్మనయనంబులవాడన్న మహాకవి వాక్యం స్మరణీయం. కృష్ణుడు నల్లనయ్య కదా! శుకమహర్షి భాగవతం పరీక్షిత్తుకు చెప్పినట్టుగా విశదమైన ఈ పురాణం చిలుక పలుకులవంటి మధురవాక్య శోభితమని అర్థం. “మంజులత” మంజులత్వమనే అర్థంలోనూ, మంజు – లత అనగా మనోహరమైన తీగలతో అల్లుకొన్నదని ద్వ్యర్థి జోడించబడింది. సువర్ణు లంటే దేవతలని, సుమనః అంటే మంచివారని, సుజ్ఞేయమంటే చక్కగా తెలుసుకొనబడవలసినదని భాగవత శోభను, తత్త్వాన్ని తెలిపి, మంచి ఆకులు, పువ్వులతో చక్కని వృక్షంగా తెలుసుకోవాలని సూచించబడింది.
వ్యాసమనే మాటకు వృక్షవ్యాసమనీ, జోడించబడి భాగవతంలో సంబంధం గల లలిత, కృష్ణ, శుక, వ్యాసులను, స్మరించి వృక్షార్థంలో శ్లేష సాధించడంలోనే ఈ పద్యం రాబడింది.
వృత్త శబ్దానికి కావ్యేతివృత్తం అనగా భాగవత కథ అని, చెట్టు చుట్టూ గల గుండ్రని తనం, ఫల శబ్దానికి పురాణశ్రవణ జనిత మోక్ష ఫలం, చెట్టు పండు అని, ద్విజ శబ్దానికి పండితుల శ్రేయస్సును, పక్షులకు ఆశ్రయమని ఇలా పది అంశాలు భాగవత వృక్షార్థాల్లో రెండర్థాల్లో శోభించడం ఈ పద్య విశిష్టత.
భాగవతం ఎంత లోతుగా తెలిస్తే ఈ పద్యం అంత అందంగా అర్థమవుతుంది. వృక్షం లక్షణం అందరికీ తెల్సిందే గదా!ఉత్తమ వృక్షంలా భాగవతం, భాగవతం వలె ఉత్తమ వృక్షం ఈ భూమిపై ప్రకాశిస్తోంది.
