mayuukha
తెలుగుజాతి గర్వించదగ్గ మహా కళాకారుడు
కొండపల్లి శేషగిరి రావు శత జయంతి
జనవరి 27 ఆయన్ని మరోసారి తలుచుకుంటూ
……………………………………………..
ఊళ్ళో పెళ్ళికి మా వాళ్ల హడావిడి. ఫోన్లు, సూడియోకి బండేసుకొస్తే కలిసిపోదామా? మీరు ఫలానా ఆర్టిస్టులతో కలిసి వస్తారా అని ఎంక్వయిరీలు. సర్లెండి డైరెక్టుగా సభ దగ్గరే కలిసి రాత్రికి అందరం కూచుందాం అంటూ ఎలాబరేట్ ఎరేంజ్మెంట్లు. ఎన్నడూ ఏ సన్మాన సభకూ చచ్చినా పోని మహానుభావులైన వీరంతా కాళ్లు తొక్కుకొనుట ఎలా? బాపూగారికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎవార్డిచ్చుకుంటే వీళ్లు మధ్యాహ్నం నుంచే చంకలెగరైడమేల?
వీళ్లు సరే, ఎక్కడో కొత్తగూడెం నుంచి అజ్ఞాత కార్టూనిస్టు చిరుద్యోగానికి లాస్ ఆఫ్ పే పెట్టుకుని, బండికట్టుకొని వచ్చి స్వహస్త చమురొదిలించుకుని, అనేక వందల గజాల దూరం నుంచి మరనేక వందల మంది గుంపుల మధ్య నుంచి బాపూగార్ని చూసి కళ్లు చెమర్చి మళ్లీ మౌనంగా
కొత్తగూడెంకేసి మరలిపోవడమేంటి?
వెర్రా? సర్రియలిజమా? ఏమో.
యూనివర్సిటీ కాంపౌండ్ అంతా సాహిత్య ప్రముఖులూ, కవులూ, ఆర్టిస్టులతో సందడిగా ఉంది. ఎంట్రెన్స్లో మాత్రం పోలీస్ బందోబస్త్ జబర్దస్తీగా ఉంది. ఆడ నక్సలైట్లను కనిపెట్టడానికి రహస్య మెటల్ డిటెక్టర్. మగ నక్సలైట్ల కోసం ఓపెన్ డిటెక్టర్, అందర్నీ తడుముతున్నారు. గుచ్చి గుచ్చి చెకింగ్. అలిపిరిలో చేయని పనులన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా బాపూగారు పీపుల్స్ వార్ హిట్ లిస్టులో ఉన్నందువల్ల కాదు. ఆఫ్ట్రాల్ చిత్రకారుడి కోసం డైరెక్షనల్ మైన్లు వేస్టుచేసుకుంటారా నక్సలైట్లు?
దేవేంద్రగౌడ్ గారు చీఫ్ గెస్ట్ గనక ఈ తతంగం. ముందుస్తుగా తోసుకొచ్చిన అనేకానేక కారణాల వల్లా, కళకి బొత్తిగా టైమ్ లేనందువల్లా గౌడ్ గారు రాలేకపోయారు. బాపూగారి యందు, మా వంటి పేదల యందూ శ్రీ వేంకటేశ్వరస్వామి దయవల్లా, దీవెనెల వల్ల గూడా గౌడ్ గారు రాలేకపోయారని మా మూఢ విశ్వాసం. నిజంగా ఆయన వచ్చి “బాపూ చిత్రకళ, పత్రికల్లో కార్టూన్లు, గ్రేహౌండ్స్ తక్షణ కర్తవ్యం” అని లెక్చరిచ్చి ఉంటే మా గుంపు కకావికలై ఉండేది.సభ ప్రారంభం అనుకోని అద్భుతం, జి.వి. సుబ్రహ్మణ్యం గారు బాపూ గురించి సుతారంగా చెప్పారు. ఏకకాలంలో కవితలాగా, సంగీతంలాగా, శాస్త్రీయ విశ్లేషణలాగా, లోతైన అంచనాలా సాగిందాయన ప్రసంగం. సందర్భోచితంగా మినిమమ్ ఓవర్ యాక్షన్ కూడా లేకపోవడం సుబ్రహ్మణ్యం గారి సూపర్ స్పెషాలిటీ . తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, నూతన్ ప్రసాద్ గార్ల ప్రసంగాలు పెద్ద దుర్భరంగా ఏమీ లేవు. రవీంద్రభారతి, త్యాగరాయగాన సన్మాన సభల బ్రాండ్ ఉపన్యాసాలెంత దుర్భరంగా ఉంటాయో ఖచ్చితంగా అంతే దుర్భరంగా ఉన్నాయి. అలవాటుపడ్డ ప్రాణాలంగనక పరమ వీజీగా తట్టుకున్నాము. తదనంతర అంత్యప్రాసల కామిక్ ఇంటర్లూడ్స్ మమ్మల్ని కదిలించాయి. ప్రాణవాయువు కోసమూ సిగిరెట్ల కోసమూ ఆనందంగా హాలు నుంచి బయటపడ్డాము.
అదిగో మా ఆర్టిస్టు హీరోలు చంద్ర, గోపీ కారిడార్లో ముందే ఉన్నారు. వి. రాజారామ్మోహనరావు లెక్చర్లు. అక్కడ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జానకీబాల, ఇటు శ్రీరమణ, ఆర్టిస్టు చిత్ర, కార్టూనిస్టులు శంకర్, అన్వర్లు, బాలి రాలేదేమో అని తలుచుకుంటున్నారు. ఇంకా బోల్డన్ని పెద్ద పేర్లు పుంజీళ్లు పుంజీళ్లుగా కబుర్లు కొడుతున్నారు. అంతలో కొండపల్లి శేషగిరిరావు గారొక్కరే శాలువా సర్దుకుంటూ గుంపుల్లోంచి దారిచేసుకుంటూ వెళ్తున్నారు. వెంట ఎవరూ లేరు. ఆయన్నీ చూసి చాలా రోజులయింది. ఆనందంగా నమస్కారం పెట్టా. పక్కనే ఉన్న కొత్తగూడెం కార్టూనిస్టుని పిలిచి ఇతను వెంకటి అని పరిచయం చేశా. మా వాళ్లంతా ఆరాధనా భావంతో చుట్టూచేరారు. లోపల సభ ఇంకా నడుస్తూనే ఉంది. ఈతి బాధల వల్ల ఈ మధ్య మీ ఇంటికి రాలేదని సంజాయిషీ చెప్పి, కొత్తగా పెయింటింగ్ లు ఏం వేస్తున్నారని అడిగితే కొద్ది రోజులుగా చూపుసరిగా లేదనీ ‘బొమ్మలకు తాత్కాలికంగా సెలవిచ్చానని చెప్పినపుడు ప్రాణం కొట్టుకుంది. అయినా తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మీద సుదీర్ఘమయిన పానెల్స్ తయారు చేశానన్నారు. (వాటిలో కొన్ని స్కెచ్లు ముందే మేమందరం చూశాం) త్వరలో తప్పక వాటిని పూర్తి చేస్తానన్నారు. “ఈనాటి చిత్రకారులకు ఆనాటి చరిత్ర గురించి తెలీదు గనక ఆ పని ముగిస్తా”నన్నారు. ఈ పని ఆయన ఒక్కరే చేయగలరని అక్కడున్న మా అందరికీ తెలుసు. శేషగిరిరావుగారి గ్రాంధిక భాష, ఇంగ్లీషు విన ముచ్చటగా ఉంటాయి. అంతకు మించిన అమాయకత్వం ముడతలు పడ్డ తెల్లటి పొడుగాటి వేళ్లు తిప్పుతూ మాట్లాడుతుంటే ఆయన చైనా చెట్లు, కోడిపుంజుల రంగులూ కదలాడుతాయి. తటాకము వద్ద కణ్వమహర్షి వెంట ఉన్న శకుంతల పక్కన లేడి, ఒంపులు తిరిగిన స్టైలైజ్డ్ చెట్లూ కొండలూ కదిలొస్తాయి. భక్తిపరుడైన కొండపల్లిగారి దేవతామూర్తుల భంగిమలూ ఆ రంగులూ చూస్తే మొండి నాస్తికులు కూడా మోకాళ్లపై వంగి నమస్కారాలు చేయాల్సిందే.
తెలంగాణ కొండలు ఆయన దోసిట నీలపురాళ్ళై మెరుస్తాయి. వాటి మధ్య రావి నారాయణరెడ్డి గర్జించే ఆయిల్ పెయింటింగ్ కెంపుల పోవు. రామప్ప దేవాలయం నంది మెడ గంటల తాళ్ల ముడుల గ్రామర్నీ, నాగరిక సమస్యల నడుముల పట్టీల మడతల శాస్త్రాన్ని రచించి విశ్లేషించిన చేతులవి. తెలుగునాట ప్రాచ్య కళా సంప్రదాయ జ్యోతి ఆరిపోకుండా అడ్డంపెట్టే ఆఖరి చేతులివే.
హాల్లో సభ అయిపోయింది. మేడ మీద ఆర్ట్ ఎగ్జిబిషన్ను బాపూ ప్రారంభించాలి
(ఏంటో! అష్టకష్టాలూ పడి పగలూ రాత్రి బొమ్మలేయాలి. మళ్లీ వాటిని తానే ఇనాగురేట్ చేసుకోవాలి. పాపం ఎంత కష్టం) బాపూ చుట్టూ పాతికమంది నిర్వాహకులు రక్షణ వలయంలా కమ్ముకున్నారు. హాల్లోంచి కారిడార్ గుండా ఆయన్ని తీసుకెళ్తున్నారు. అడ్డంగా ఉన్న మా గుంపుల్ని చెదరగొడుతున్నారు. తప్పుకోండని అరిచి ఏ మాత్రం అక్కర్లేని హడావుడంతా చేస్తున్నారు. బాపూ గుంపు మమ్మల్ని తాకి ముందుకెళ్తుంది. తప్పుకున్నాం. ఎందుకో ఆయత్నకృతంగా (స్పాంటేనియస్ గా అన్నమాట) “బాపూ గారూ” అని అరిచాను.
ఆయన ఆగారు. ఆ గుంపూ ఆగింది.
ఆయన ముందుకొచ్చారు. ‘కొండపల్లి శేషగిరిరావు గారు” అని పరిచయం చేశాను. వాళ్ల చేతులు కలిశాయి. శేషగిరిరావు మరింత ముందుకెళ్లారు.
ఆ పొడుగాటి చేతులు రెండూ బాపూ భుజాలపై పడ్డాయి. “నాయనా బాపూ నీ రేఖ నిజంగా ఒక విలక్షణమైన… (ఆయన గ్రాంధికం తడబడుతోంది)మనిషి ఎక్సైట్ అయిపోతున్నాడు. అది నీవే గీసేగీత. యువార్ గ్రేట్. రియల్లీ గ్రేట్. నాట్ ఓన్లీ ఫర్ ఆవర్ స్టేట్. బట్ టు అవర్ నేషన్…చెప్తూనే ఉన్నాడాయన. ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది.
మాటలు మరీ ఇన్ కొహెరెంట్ గా వస్తున్నాయి. సన్నగా వణికి అరిచేతులు బాపూ భుజాల మీంచి దిగి మోచేతుల దగ్గరకొచ్చాయి. ఇంకా ఏదో చెప్తున్నాడు. చెప్పలేకనూ పోతున్నాడు.
హఠాత్తుగా ఆ చేతులు నేలకి వంగాయి. బాపూ పాదాలు రెండూ పట్టుకుని ఆయన నమస్కారం పెట్టాడు. చుట్టూ ఉన్న మేం ఈ షాక్ కి రెడీగా లేము. బాపూ గారి దుస్థితి వర్ణనాతీతం, బాగా ఎంబారాస్ అయిపోయి, సిగ్గుపడిపోయి, తల్లకిందులయ్యారు. శేషగిరిరావు గారిని రెండు చేతుల్తో లేవ దీశారు. ఈయన ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు. “బాబూ, నేను శాంతి నికేతన్లో చదివినా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నా, ఎన్ని చేసినా నీ రేఖ మాత్రం“ అంటూనే ఉన్నాడు. పెద్దవారు మీరు మాకలా చెప్పాలా.. అయ్యో’ అంటూ బాపూగారు సిగ్గు భారంతో కొంచెం వంగి అంతలోనే ఆయన కాళ్ల మీద పడి పాదాలు పట్టుకుని నమస్కారం చేసేశారు. డబుల్ షాక్… అంతా సైలెన్స్.
ఈ షార్ట్ సర్క్యూట్ కి నివ్వెరపోయిన మాలో కొందరికి కన్నీళ్లే తక్కువ.ఇంతలో నిర్వాహకులు బాపూని పైకి తీసుకుపోయారు. అందరం శేషగిరిరావు గారి వెంట బయటికొచ్చాం. ఆయనింకా బాపూ హిప్నాటిక్ స్పెల్ నుంచి తేరుకోలేదు. “ఈతని వలే ఎవరూ గీయలేదు.
అదియాతని సొంతము. వాక్చమత్కృతి లేదు. సకల చమత్కృతినీ చిత్ర చమత్కృతిగా మార్చినాడు.” ఇంకా చాలా చెప్పాడాయన.
తెలుగు చిత్రకళ చరిత్రలో ఒకే ఒక భువనగిరి కోట, ఆదిలాబాద్ పచ్చల కొండ, కరీంనగర్ అడివితల్లి వంగి తెలుగు రేఖకీ రంగుకీ నమస్కారం చేసింది.
ఈ నర్సాపురం నది సిగ్గుతో మెలికలు తిరిగి
ఆ నూనె రంగుల బృహత్పాదాలను కడిగింది.
ఇలాటి దృశ్యం ఈ దెష్ఠ బతుకులో ఇంకెప్పుడేనా చూడగలమా, కెమెరాలేవి? లైట్లేవి? ఎవరక్కడ?
కాలచక్రం గిర్రున కాకుండా టిక్కు టిక్కుమంటూ రెండ్రోజులే తిరిగింది. శ్రీరమణగారి ఫోను. “బాపూగారు మీకొక్క జపనీస్ యానిమేషన్ కేసెట్, మరో లెటర్ ఇచ్చారు”.
అమాంతంగా అరడజను ఆఘమేఘాలనూ సింగిల్ ఆటోనూ బుక్చేసి ఆంధ్రజ్యోతిలో వాలాను.
స్టూడియోకి తిరిగి రాగానే కేసెట్ను మూడు సీడీలుగా మార్చి మా సిస్టమ్ లో అందరం చూశాం. మళ్ళీ చూశాం. రెండున్నర గంటల ఎండ్వెంచర్. అంతా జపాన్ భాష ఒక్క ముక్క అర్ధం కాలేదు. సినిమా మొత్తం ముక్కస్య ముక్కహా అర్ధమయింది. ఇలాంటి కేసెట్లు ఇంకా సంపాయించాలి ఎలా? సింపుల్! బాపూగారు మద్రాసు మనిషి గదా. హైదరాబాద్ లో కొండపల్లి శేషగిరిరావు గారి లాంటి వారిని పరిచయం చేస్తే కేసెట్ పంపిస్తారని అర్థమయింది గదా.
మరైతే ఇక్కడగానీ హోల్ ఇండియాలో గానీ
మరో కొండపల్లిని పట్టుకోడం ఈ జన్మకి గానీ
మరేడు జన్మలకిగాని జరిగే పనేనా?
నాకింకో కేసెట్ దొరకదా!
ఈ వ్యాసం 2002లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో అచ్చయింది.
ఎందరో
మేధావులు…
సమతా వాదులు…
సంఘ సంస్కర్తలు…ఈ
పుణ్యభూమిలో జన్మించి
మెరుగైన సమాజం కోసం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం…
ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం…
ఎన్ని సందేశాలిచ్చినా…
ఎన్ని హెచ్చరికలు చేసినా…
తమ జీవితాలను ఫణంగా
పెట్టి ఎన్ని ఉద్యమాలు
ఎన్ని పోరాటాలు చేసినా…
ఎంతగా పరితపించినా…
ఎంతగా ఆశపడినా…
ఎంతగా ఆరాటపడినా…
ఈ సమాజంలో
“విప్లవాత్మకమైన
మార్పులు” రాకపోవడానికి…
ఈ దేశంలో “ఆశించి ప్రగతి”
కళ్ళకు కనిపించక పోవడానికి కారణం…
పేదవాళ్లలో…
ధైర్యం లేకపోవడం…
సాహసం చేయకపోవడం…
అంతులేని అమాయకత్వంలో…
అజ్ఞానాంధకారంలో మునిగిపోవడం…
మధ్యతరగతి వారికి…
సమయం లేకపోవడం…
సమిష్టిగా స్పందించక పోవడం…
ధనవంతులకు దాసోహం అనడం …
పేదవారిపై పెత్తనం చెలాయించడం…
చైతన్య రహితులై మౌనవ్రతం దాల్చడం…
ధనవంతులకు…
అవసరం లేకపోవడం….
చీకటి వ్యాపారాలు చేసి
దొరికినంత దోచుకోవడం…
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం…
అట్టడుగు వర్గాల్ని అణగద్రొక్కడం…
మధ్యతరగతి వారిని మాయచేయడం…
ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం.
మరి సమసమాజం నిర్మాణ స్థాపనెప్పుడు?
దేశంలో శాంతిసౌభాగ్యాలు వర్థిల్లేదెప్పుడు?
మనిషి మనిషిలో…
మానవత్వం వికసించినప్పుడు…
పేదలు…
ఆర్థిక అసమానతలనుండి బానిసత్వపు
భావనలనుండి విముక్తి పొందినప్పుడు…
మధ్యతరగతి ప్రజల్లో…
విజ్ఞాన జ్యోతులు వెలిగినప్పుడు…
విప్లవజ్వాలలు రగిలినప్పుడు…
ధనవంతుల చేతుల్లో…దాతృత్వం
గుండెల్లో…దైవత్వం పొంగి పొరలినప్పుడు.
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ!
(భాగవతము – పోతన)
“మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం.
ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..
నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది.
భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి.
అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది. పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…
అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు.
దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…
“మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి.
అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.
ఇకపోతే.. ముందు చెప్పిన వాల్మీకి వ్యాసుల మధ్యలో శరవణ భవుడు ఎందుకు వచ్చాడు అనేది చర్చ.. సుబ్రహ్మణ్య స్వామి కవిగా కాని పురాణకర్తగా కానీ ఎక్కడా చెప్పబడలేదు కదా మరి ఆ వరసలో ఆయనను ఎందుకు చేర్చినట్లు అనేది అనుమానం.
దీనిని చర్చిస్తూ.. మా ఆప్త మిత్రులు, పెద్దలు కీ. శ్రీ సత్యనారాయణ రాజుగారు ఒక మాట చెప్పేవారు. ఒకప్పుడు భారతి మాస పత్రికలో దీనిపై చర్చ జరిగిందని… శరంబునన్ మొలవ అనేది నిజానికి శిరంబునన్ మొలవ అని ఉండాలని కొందరు పండితులు అభిప్రాయ పడ్డారని అయితే ఆ అభిప్రాయాన్ని పలువురు పరిష్కర్తలు, పండితులు ఖండించారని చెప్పేవారు. పుట్టం, బుట్టశిరంబునన్ అనేది కాలక్రమంలో పుట్టంబుట్ట, శరంబునన్ మొలవగా మారిందని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పేవారు.
మహాకవి చెప్పిన పాఠాన్ని మార్చడం చాలా అన్యాయమని పెద్దల అభిప్రాయం. కావ్యమనేది పురుషుడని.. ఆ కావ్య పురుషునికి కుమార స్వామికి గాఢమైన మైత్రి ఉన్నదని.. అంతేకాదు.. అతడు గొప్ప రసజ్ఞుడని అందుకే కవికి పురాణ కర్తకు మధ్య కుమార స్వామిని పెట్టాడని మా సత్యనారాయణ రాజు గారి అభిప్రాయం.
పెద్దలు ఈ పద్యాన్ని పరిశీలించి మీ మీ అభిప్రాయాలను జోడింపుల రూపంలో పంచుకుంటే రసజ్ఞులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తూ.. నమస్సులతో..
తెలంగాణలో దోమకొండ సంస్థానం చేస్తున్న సాహితీసేవ అమూల్యమైందని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తంగెడు కిషన్ రావు అన్నారు. ఈ నెల 6 వ తేదీన కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో జరిగిన ‘తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.జయరామరెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సంస్థానాల పాత్ర విశిష్టమైందని అన్నారు.మరొక విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి డాక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రసంగిస్తూ దోమకొండకోటలో పలు సామాజికాభివృద్ధి కార్యక్రమాలు జరగడం హర్షణీయం అన్నారు. సభకు స్వాగతం పలికిన సంస్థాన పాలకుల వారసులు అనిల్ కామినేని మాట్లాడుతూ తమ పూర్వికులు నడచిన మార్గంలో సాహిత్యసేవను కొనసాగించడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ కవి డా.ఏనుగు నరసింహారెడ్డి సంస్థాన సాహిత్య వికాసంపై విపులంగా ప్రసంగించారు. ప్రముఖ చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా.లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నృత్య దర్శకురాలు మధుమతి కులకర్ణి శిక్షణలో పలువురు నృత్యవిద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకొన్నది. అనంతరం ప్రారంభమైన తొలి సదస్సుకు డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బాబ్జీ జాలాది సమన్వయకర్తలుగా వ్యవహరించారు.ప్రముఖ పరిశోధక పండితుడు వైద్యం వేంకటేశ్వరాచార్యుల అధ్యక్షతన పలు సంస్థానాలలోని సాహిత్యసేవలపై వక్తలు ప్రసంగించారు. ప్రముఖ పరిశోధకులు, రచయితలు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, డాక్టర్ అంబటి భానుప్రకాశ్,అబ్దుల్ అజీజ్, డాక్టర్ జి.శ్యామసుందర్, డాక్టర్ నాయకంటి నరసింహశర్మ, డాక్టర్ ఎం.అనంతకుమారశర్మ, డాక్టర్ తాడేపల్లి పతంజలి, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, శాస్త్రుల రఘురామశర్మ, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ వడ్ల శంకరయ్య తదితరులు వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత కృషిపై పత్ర సమర్పణలు చేశారు. వేదార్థంమధుసూదనశర్మ అనుసంధానకర్తగా వ్యవహరించారు. సదస్సులో పత్ర సమర్పణలు చేసిన పరిశోధకులను దోమకొండ సంస్థానాధీశులు అనిల్ కామినేని ఘనంగా సత్కరించారు.
ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా అమరచింత, ఆత్మకూరు, ఆలంపూరు, ఆనెగొంది, గద్వాల, గోపాలపేట, జటప్రోలు, కొల్లాపూరు, సిర్నాపల్లి, నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, బేతవోలు, రాజాపేట, సురపురం సంస్థానాల వారసులు హాజరయ్యారు.
అనంతరం జరిగిన కవిసమ్మేళనానికి ప్రముఖ విద్వత్కవి, దాశరథి సాహితీ పురస్కార గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కవిసమ్మేళనంలో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, గుమ్మన్నగారి బాలసరస్వతి, బండకాడి అంజయ్యగౌడ్, డాక్టర్ శాస్త్రుల రఘుపతి, సాయిప్రసాద్, మంచినీళ్ల సరస్వతీరామశర్మ, కొరిడె విశ్వనాథశర్మ, ప్రసాదం స్వాతి, చింతా రామకృష్ణారావు, పబ్బా విజయశ్రీ తదితరులు కవితాగానం చేశారు.
సదస్సు ముగింపులో సాయంకాలం ఆరుగంటలకు ‘ప్రతాపరుద్రవిజయం’ సాహితీరూపకప్రదర్శన జరిగింది.డాక్టర్ సంగనభట్ల నరసయ్య రచించి, దర్శకత్వం వహించిన ఈ రూపకానికి మరుమాముల దత్తాత్రేయశర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. హైదరాబాదులోని అభ్యుదయకళావికాస్ సంస్థ నిర్వహణలో కొనసాగిన ఈ రూపకానికి ప్రముఖసంగీతదర్శకులు దేశపతి శ్రీనివాస్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు.ఎం.ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించారు.
దోమకొండసంస్థానవారసుల నిర్వహణలో ఒకరోజు సాహితీసదస్సు ఎన్నో మధురానుభూతులను పంచింది.ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ సంస్థానం పక్షాన అనిల్ కామినేని సత్కారాలు చేసి, కృతజ్ఞతలను చెప్పగా ఈ సదస్సు అద్వితీయంగా ముగిసింది.
గాయాలెన్నైను
గుట్టుగా సర్దుకోవడమే తప్ప
మనసు విప్పి చెప్పలేను
అర్థం చేసుకోవడమే తప్ప
అవసరమైనవి అడగలేను
కష్టమెంతైనను కన్నీరు కార్చడమే తప్ప
కాదని అనలేను
అందరిప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే తప్ప
ప్రశ్నించలేను
సుఖదుఃఖాలలో సహాచరిణిని
సర్వము అంకితం చేసిన సౌభాగ్యినిని
ఇంటందరి బాగోగులు చూసే ఇల్లాలిని
కాపురం గుట్టుచప్పుడు కాకుండా సర్దుకుపోయే గృహిణిని
జీవితపయనంలో జీవచ్చవంగా బతుకుతున్న
అతిసాధారణమైన అర్ధాంగిని నేను
ఈ తరతరాల బ్రతుకులో తరుణిగా బ్రతుకుతున్న
అనుదినం నా వేదనలను వెనుకేసి ముందుకు కదులుతున్న
కదనరంగంలో నన్ను నేను
నిరంతరం
నిత్యచైతన్యవంతంగా నిలబెట్టుకుంటున్న
అయినా ఈనాటికి ఒంటరి ఆడది అంటే ఆ లోకం చూపేవేరు
ఆదిశక్తిలా కొలువైన ఆడదానిగా అలుసైన
నివురుగప్పిన ఈ సమాజం ఎప్పుడూ విసురుతూనే ఉంటుంది నాపై ఓ చూపు