శ్రీరామనవమి సందర్భంగా
రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధు,
మిత్ర, పుత్ర పరివారంతో సహా సంహరించాడు. విభీషణని కి రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం చేశాడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇదంతా క్లుప్తంగా చెప్పిన రామ కథ. కానీ దీనిని మన పెద్దలు”కొట్టే, కట్టే, తెచ్చే” అనే మూడు మాటలతో చెప్పుకునేవారు. అలా అంటే రామాయణం అంతా జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడైనా ఎవరైనా పని సులువుగా చేసుకొస్తే ఈ మాటే వాడతారుపట్టాభిషేకం విధాలా మనకి. రాముడు మంచి బాలుడు అంటాం బుద్ధిమంతుడైన పిల్లాడిని చూసి . మంచి పరిపాలన చూసి రామరాజ్యం అంటాం. దంపతులను చూసి సీతారాముల ఉన్నారంట. పురుషుడు రాముని వలె ఏకపత్నీవృతుడు అయి ఉండాలంటా. సహనశీలుని రాముడు అంత సహనం కలవాడు అంటాం. ఎవరైనా కష్టాలు పడుతుంటే రాముని కష్టాల కంటే గొప్పవా అంటాం.
ఇక్ష్వాకులను గురించి వశిష్ట విశ్వామిత్రులు ఇలా అన్నారు” సదృశ్య ధర్మ సంబంధః సదృశవరూప సంపదా “అని. వేలాదిమంది బలాఢ్యులు ఎంతో కష్టపడి తీసుకువచ్చిన శివధనస్సును ఎక్కుపెట్టే సమయంలో వాల్మీకి రాముని గురించి ” పశ్యతాంనృ సహస్రానాం బహు నామ్ రఘునంద నః., ఆరోప వత్స ధర్మాత్మ సలీలమిమ దద్దను హు “. నీ పరాక్రమాన్ని చూపించు అనేటట్టుగా.
జనకమహారాజు తన కూతురిని చూపించి ” ప్రతి వ్రత మహాభాగ ఛాయావాను గత సదా ‘” అని చెప్పి కన్యాదానం చేశాడు. అందుకే సీత ఆయనను వెన్నంటి ఎప్పుడూ ఉంది. ఇప్పటికి కూడా ఉంటోంది.
లక్ష్మణుడి విషయానికొస్తే తల్లి సుమిత్ర రామునితో అడవికి వెళ్లడానికి అంగీక రిస్తూ ” రామ దశరథం విద్ధిమామ్ విద్ధి జనకాత్మజామ్ అయోధ్య మండలి విద్ధి గచ్చ తార యధా సుఖం “అంది. సుమిత్ర ఎంతటి ఔదార్యరాలో తెలుస్తోంది.
భరతుని విషయానికొస్తే కైకేయి అంది”త్వత్ కృతే మయ సర్వమేతం విధం కృతమ్.'” ఇదంతా నీ అభ్యుదయం కోసమే చేశానంది. అప్పుడు భరతుడు ” బలమైన ఎద్దు మెడపై ఉంచవలసిన కాడిని లేగ దూడ మెడ పై పెడితే మొయ్యగలదా? రాజ్య భారం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అది వహించడం రాముడే చెల్లు అన్నాను “. రాముని దగ్గరికి వెళ్లి రామపాదకులు తెచ్చుకుని వాటికి రాజ్యభిషేకం చేసి రాజ్యాన్ని పాలించసాగాడు. అంటే ధర్మాన్ని ఎంత ఎలా పాటించాడో చూడండి.
సీతా రాముని గురించి ఏముందో ఏముందో”” దధ్యాన్న ప్రతి గృ హిణి యాన్న బ్రుయాత్ కించిత ప్రియం అపి జీవిత వేతోర్వా రామః సత్య పరాక్రమః ” అతడు సత్య పరాక్రమడు. ఎవరికైనా ఇవ్వడమే తప్ప ఎవరి నుండి తీసుకోడు. ప్రాణం పోయినా ఎవరితోనూ అప్రయంగా మాట్లాడడు
రామ రావణ యుద్ధంలో ఇంద్రుడు వస్తే పోయిన వారిని బతికించమని ఇలా అడిగాడు”” మమ హే తో పరాక్రా నా ఏ గతా యమ సాధనమ్, తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరః “” ఎంత దయాద్ర హృదయుడో ఈ రాముడు కదా.
ఒకసారి లక్ష్మణుడితో”‘” ధర్మాన్ని పాటించడం వలన అర్థ కామాలు వెంటనే లభించకపోవచ్చు. అటువంటి అప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి. అర్ధాన్నే ప్రధానంగా చూసేవారిని లోకం ద్వేషిస్తుంది. కామమే ప్రధానంగా ప్రవర్తించే వాడికి గౌరవం ఉండదు.”’ అంటాడు. ఋజు స్వభావాన్ని ఎలా విశదీకరించాడో కదా. “” ఆత్మా నామ్ మనుషo మన్యే రామం దశరదాత్మజం ”” అన్నాడే కానీ నేను భగవంతుని ఎప్పుడూ చెప్పుకోలేదు శ్రీకృష్ణుని వలె.
సుగ్రీవుణ్ణి మా నలుగురికి నువ్వు ఐదవ సోదరుడివి అని చెప్పాడు. . ఆఖరికి హనుమంతుడిని “” తేజోధృతి యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయః, పౌరుషం విక్రమో బుద్ధిర్ యాస్మిన్నే తాని సర్వదా.” అని పొగిడాడు అంటే ఎవరికి ఎప్పుడు తేజస్సు, నేర్పు, ధైర్యం, యశస్సు సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి కలవాడు. రాముని యొక్క వినయానికి ఇదొక నిదర్శనం.
“” ఏ మమే తత్పురా వృత్తా మా ఖ్యా మ్ భద్ర మస్తవః ప్రవ్యహరత విస్ర బ్ద ం బలం విష్ణు ప్రవర్ధితాం “” అని వాల్మీకి చివర రామ కథకి ప ల శృతి కూడా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే”” ప్రజలారా! ఈ రామాయణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ కథను దృఢ విశ్వాసంతో చెప్పండి. మీకు క్షేమం కలుగుతుంది. ఆ మహావిష్ణువు యొక్క బలం తేజస్సు వృద్ధి చెందుగాక!.
కనుక మనందరం రామ మార్గంలో నడుస్తూ ఈ కష్టమైన కలియుగంలో కాస్త ద్వాపరయుగంలోని రామరాజ్యాన్ని అనుసరిదాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ” పుంసాం మోహన రూపాయ ” అయిన ఆ రామచంద్రునికి మంగళాలు పలుకుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు.x
వ్యాసాలు
విధి ఎవరి రాతను ఎలా లిఖిస్తుందో ఎవరూ ఊహించలేరు.బాల్యంలో సినిమా చూడటం కోసం రెండేండ్ల బండిలో ప్రయాణించిన బాలుడు పెద్దయ్యాక తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగ్గ దర్శకుడవుతాడని ఎవరూహించారు.ఆ బాలుడే విధాత తలపున ప్రభవించిన విశ్వనాథుడు.అనతికాలంలోనే
కళాతపస్విగా వాసికెక్కాడు.ఆనతినిచ్చిన విధాతకు తన చిత్రమాలిక కానుకగా సమర్పించాడు. ఆయనే ఒకచోటంటారు.నేనేదీ ప్లాన్ చేసుకోలేదు.అన్నీ అలా జరిగి పోయాయని.
విచిత్రమేమిటంటే కె.విశ్వనాథ్ గారి తండ్రిగారికి జాతకాలు చూస్తారని మంచి పేరుండేది.
తన కుమారుడు ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఆ తండ్రి ఊహించారో లేదో మరి.విశ్వనాథ్ తండ్రి చాటు బిడ్డ.గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే వారి బంధువొకరు వాహిని స్టూడియోలో చేరితే బావుంటుంది, అక్కడ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పగానే తండ్రి ఆజ్ఞ మేరకు వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్ లో చేరారాయన.తండ్రి వాహిని డిస్ట్రిబ్యూషన్ లో ఉండేవారు.
ఆయనక్కడ పనిచేస్తుండగానే ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టిలో పడ్డారు.ఏపని చేసినా అందులో నిమగ్నమై పనిచేయటం విశ్వనాథ్ లో ఉందని ఆయన గమనించారు.అప్రెంటిస్ గా ఆహ్వానించారు.దర్శకత్వ మెళకువలు నేర్పారు.మూగమనసులు సెకండ్ యూనిట్ దర్శకుడు విశ్వనాథే.ఇంకో పక్క వాహిని స్టూడియోలో ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి.ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక టీంలా ఉండేవారని తెలిసిందేకదా.విశ్వనాథ్ కి పనిపట్ల ఉన్న శ్రద్ద.
అక్కినేని వారిని ఆకట్టుకుంది.ఓ శుభ ముహూర్తాన తమతో కలిసి తమ కంపెనీలో (అన్నపూర్ణ ప్రొడక్షన్స్)
దర్శకత్వ శాఖలో చేరమని ఆహ్వానించారు.చేరాలా వద్దా అని విశ్వనాథ్ చాలామంది సలహా అడిగారు.వారందరి అభిప్రాయాలు మరింత సందిగ్ధంలోకి నెట్టాయి వారిని.

గురువైన ఆదుర్తి కూడా నిర్ణయం నీదే అనేశారు.
విశ్వనాథ్ గారి సందేహానికి కారణం,ఆయన త్వరలో వాహిని సౌండ్ చీఫ్ కాబోతున్నారు.అది వదులుకోవటం సబబేనా అని.అప్పుడు ఆయన వెన్నుతట్టి వెళ్ళమని చెప్పిన వారు చక్రపాణి గారు.అలా సౌండ్ రికార్డిస్ట్ విశ్వనాథ్, దర్శకుడిగా మారటానికి వారధి అయ్యారు విజయా ప్రొడక్షన్స్ సారధి చక్రపాణి.
దర్శకుడిగా ఆయనకు బ్రేక్ నిచ్చింది అన్నపూర్ణ సంస్థ.
ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం.1965 లో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ కథకు నంది పురస్కారం పొందింది.
కె.విశ్వనాథ్ గారికి పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్న మాట జగద్విదితం.ఆయన పాటెప్పుడూ కథను ముందుకు తీసుకెళ్ళాలి గానీ, కథా గమనానికి అడ్డుపడకూడదనేవారు.పాట ప్రేక్షకుడు టీ తాగడానికో,సిగిరెట్ తాగడానికో రిలీఫ్ కాకూడదనేది వారి స్థిర అభిప్రాయం.స్క్రిప్ట్ రాసుకునే సమయంలోనే పాట అక్కడెందుకుండాలి,ఎలా ఉండాలో రాసుకునేవారుట.
చాలా పాటలకు పల్లవులు ఆయనే సమకూర్చేవారని
ఈమధ్య తెలిసిన నిజం.ఆత్మగౌరవం లోని “అందెను నేడే అందని జాబిల్లి” పాట పల్లవి ఆయనదే.చరణాలు ఆత్రేయ రాశారు.ఆత్రేయ ఆ పాట పారితోషికం లో
నీ వాటా కుడా ఉందని కొంత ముట్టజెప్పారని విశ్వనాథే స్వయంగా పేర్కొన్నారు.దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పల్లవులు ఉండేవి.అది తన ప్రతిభ కన్నా గీతరచయితల ఔదార్యం అని వినయంగా అంటుండేవారు కళాతపస్వి.ఒక సభలో డా.సి.నారాయణరెడ్డి తను, విశ్వనాథ్ జంటకవుల వంటివారమని ముసిముసి నవ్వుల మధ్య చెప్పారు.
జీవన జ్యోతి చిత్రం లోని “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు,సద్దు చేశాడంటే ఉలుకులికి పడతాడు”
పాట పల్లవి విశ్వనాథ్ ఇస్తే, నారాయణ రెడ్డి గారు పూర్తి చేశారు.
తను లయలో పలుకుతానో తెలియదని, సంగీత దర్శకులు తన పల్లవికి లయ కల్పిస్తారని ఓసారన్నారు విశ్వనాథ్.
పాటల పల్లవులు గురించి ఇంకొన్ని తర్వాత.సినిమాల్లో పాట అవసరం లేదంటారు విశ్వనాథ్.కానీ వారి సినిమాల్లో పాటలూ ఎక్కువే.వాటి నిడివీ ఎక్కువే.పాట అవసరం గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు పాట ఎప్పుడొస్తోందో వూహించగలుగుతున్నాడు.అలాకాకుండా పాటను ప్రేక్షకుడు ఉహించని చొప్పించటం నాకు నేను పెట్టుకున్న నియమం.దానితోపాటు పాట కథను ముందుకు తీసుకెళ్ళాలి అని బలంగా నమ్మాను అనేవారు.వారు చెప్పినట్టు వారి చిత్రాలలోని పాటలు కథలో భాగంగా కనిపిస్తాయి.
శంకరాభరణం సినిమా విశ్వనాథ్ ని శిఖరారోహణం చేయించింది.అంతకుముందు చేసిన సినిమాలొకెత్తు.ఆతర్వాత చేసిన సినిమాలొకెత్తు.అంతకుముందు చిత్రాలన్నీ కుటుంబ కథా చిత్రాలయితే, శంకరాభరణం తరువాత ఆయన చిత్రాలన్నీ సంగీత, నృత్యాల ప్రతిబింబాలయ్యాయి.ఆవిధంగా శంకరాభరణం వారినో చట్రంలో బిగించిందా అనిపిస్తుంది.విశ్వనాథ్ చిత్రాలను గుర్తు తెచ్చుకోండి. నిండు హృదయాలు,ఉండమ్మా బొట్టు పెడతా,జీవిత నౌక, నేరము-శిక్ష,శారద,కాలం మారింది,
చెల్లెలి కాపురం,జీవనజ్యోతి, సీతామాలక్ష్మి, చిన్ననాటి స్నేహితులు,అమ్మమనసు, ప్రేమబంధం, సిరిసిరిమువ్వ..ఇలా ఎన్నో చిత్రాలు.. ఇవన్నీ శంకరాభరణం ముందు కాలం నాటివి.ఆ తరువాత వచ్చినవి శుభలేఖ,సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం,స్వయం కృషి, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు,శ్రుతిలయలు,స్వాతి కిరణం,సూత్రధారులు ,శుభసంకల్పం మొదలైనవి.
ప్రతి చిత్రం కూడా ఏదో ఒక ఉద్వేగాన్ని పట్టి చూపేదే.
కథలు ఎంపిక గురించి మాట్లాడుతూ విశ్వనాథ్ ఒక మాటంటారు.తన నిర్మాత అనుకున్న కథనే తీస్తానని
చెబుతానని
చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే తన కథతో తీస్తానని అంటారు.కానీ నిర్మాత చివరికి విశ్వనాథ్ కథనే తీయటం అనేక సందర్భాల్లో జరిగింది.
విశ్వనాథ్ సినిమాలలో హాస్యం చవకబారుగా ఉండదు.
పాత్రలు నేలవిడిచి సాము చేయవు.నా పాత్రలన్నీ జనజీవనంలోంచి పుట్టినవే.ఒక బాబయ్యో,ఒక మామయ్యో అల్లు రామలింగయ్య గానో, సాక్షి రంగారావు గానో పలకరిస్తారని ఒకసారన్నారు.హీరో నేరేటివ్ అలవాటు అయిన మనకు గా విశ్వనాథ్ చిత్రాలలో పాత్రలు సినిమాను నడిపిస్తాయి.సన్నివేశ కల్పనా చాతుర్యం ఆశ్చర్యపరుస్తుంది.
శంకరాభరణం లో శంకరశాస్త్రి, స్వర్ణ కమలంలో మీనాక్షి,
సిరిసిరిమువ్వ లోని హేమ,జీవన జ్యోతి లోని శోభ,శారద లోని శారద..ఇలా ఆయన చిత్రాలలోని పాత్రలను పరిశీలిస్తే నటులు కనిపించరు.హీరోలు కూడా పాత్రల్లో ఒదిగిపోవటం చూస్తాం.అదే స్వయంకృషి చిత్రంలో మెగాస్టార్ పక్కకు వెళ్ళిపోయి నటుడు చిరంజీవి తన పాత్రతో శ్రమలోని ఔన్నత్యాన్ని చూపుతాడు.
ప్రతి సినిమా దర్శకుడు సందేశాన్నిచ్చే ప్రయత్నమే చేస్తాడు కదా.ఇందులో ప్రత్యేకత ఏముందని అన్న ప్రశ్న రావొచ్చు.
సినిమా కళగా కన్నా వ్యాపారంగానే అభివృద్ధి చెందింది. ప్రేక్షకులకు వినోదమే ప్రధానమని నిర్మాత,దర్శకులు భావించి కథను తెరకెక్కించటంలో
అసలు కథను మరిచి, కమర్షియల్ ధోరణులతో సినిమాను నిర్మించి కుటుంబమంతా కలిసి చూడాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నవేళ విశ్వనాథ్ చిత్రాలు కొంత హాయిని కొంత కాంతిని పంచుతాయి విసుగుతెప్పించే విన్యాసాలు, పోరాటాలు,ద్వంద్వార్థాల సంభాషణలు,ఐటం సాంగ్స్,డ్రిల్లు లాంటి డాన్సులు ఉండేవి కావు.
అలాగే విశ్వనాథ్ చిత్రాలకు ఎవరు సంభాషణలు రాసినా వాటిలో చమత్కారం ఉంటుంది.చిలిపిదనముంటుందే తప్ప జుగుప్స ఉండదు.మాటలు రాసిన జంధ్యాల,ఆకెళ్ళ,సాయినాథ్,
ఎమ్.వి.యస్.హరినాథరావు మొదలైన వారంతా తమ పెన్నుకు వెన్ను,దన్ను దొరికాయని సంబరపడినవారే.
పాత్రల మధ్య చిక్కని అనుబంధం వారి చిత్రాల్లో మనం గమనించవచ్చు.
విశ్వనాథ్ చిత్రాలలో సామాజిక సందేశాలు ఉన్నాయి.
శుభలేఖ చిత్రం వరకట్నాన్ని ప్రశ్నిస్తుంది.శుభోదయం మనలో ఉండే సోమరిపోతుతనాన్ని బాధ్యతారాహిత్యాన్ని చూపుతుంది.శ్రుతిలయలు విజయం తలకెక్కిన మనిషి పతనాన్ని, స్వాతి కిరణం
గురువు కూడా అసూయకు అతీతుడు కాదని చెబుతుంది.ఇక సప్తపది ప్రేమెప్పుడూ కులం గోడలు ఛేదించేదే అంటుంది.సాగరసంగమం మాత్రం జీవితంలో వైఫల్యాన్ని కథగా చెబుతుంది.స్వర్ణకమలం
నాట్యకళలోని ఉదాత్తతను చూపుతుంది.
ఎనభై,తొంభై దశకాల్లో విశ్వనాథ్,బాపు,దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు అగ్రదర్శకులు.
విశ్వనాథ్ చిత్రాలు వారితో పోటీపడావా అంటే లేదనే చెప్పాలి.ఎవరి ధోరణి వారిదే అయినా విశ్వనాథ్ కి ప్రత్యేక స్థానాన్నిచ్చారు ప్రేక్షకులు.
శంకరాభరణం చిత్రం తెలుగు సినిమాకు అంతకుమించి
భారతీయ చిత్రానికో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.ప్రతి ఫ్రేములోనూ
శాస్త్రీయసంగీతాన్ని నింపుకుని కొత్త నటుడిని, ప్రధాన పాత్రలో పరిచయం చేయాలంటే ఎంత దమ్ము ,ధైర్యం కావాలి.రిస్కు తీసుకునే నిర్మాత ఎక్కడ దొరకాలి.అలా
ధైర్యం చేశారు ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు.శంకరశాస్త్రి పాత్రకు కేవలం రంగస్థల అనుభవమున్న జె.వి.సోమయాజులు ని ఎంచుకున్నారు. మసకబారుతున్న శాస్త్రీయ సంగీత వెలుగులని పరిరక్షించే ప్రయత్నం విశ్వనాథ్ ది.
తనకు బ్రేక్ నిచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్ర పోషించాలని ఉబలాటపడ్డారని అప్పట్లో ఓ వార్త వ్యాప్తిలో ఉండేది.అదేవిధంగా బాలమురళీకృష్ణ నటించి, సంగీతాన్ని సమకూర్చాలని ఆరాటపడినట్లు మరోకధనం.ఆ స్క్రిప్ట్ కొత్త నటుడితోనే పండుతుందనుకున్న విశ్వనాథ్ అలాగే సాగారు.ఒక సంగీత కళాకారుడికి కళతోపాటు మానవత్వం ఉండాలని సూచిస్తారు.
అదే స్వాతి కిరణం లో కళాకారుడి అహం అసూయలు
ఎలా దెబ్బతీస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు.శంకరాభరణాన్ని తలపై మోసిన ప్రేక్షకులే స్వాతి కిరణం చిత్రాన్ని తిరస్కరించారు.రెండింటిలోను గొప్ప పాటలున్నాయి.వేటూరి విశ్వరూపం శంకరాభరణం చూపితే, సిరివెన్నెల సౌకుమార్యం స్వాతి కిరణం చూపిస్తుంది.
మళ్ళీ శంకరాభరణం విషయానికొస్తే, అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించని పంపిణీదారులు ఆ తర్వాత లెంపలేసుకున్నారు.
సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని లీనమయేలా చేయటం అన్నిసార్లు జరగదు.మాయాబజార్ గురించో, లవకుశ గురించో ఎంత గొప్పగా చెప్పుకుంటామో
ఆతర్వాత అంతటి గౌరవాన్ని పొందింది శంకరాభరణం.
చెప్పులు బయటే ఉంచి థియేటర్ లో సినిమా చూశానని ఒక కార్పొరేట్ సిఇఒ చెప్పారని విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.96 సార్లు చూశానని
ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడుట విశ్వనాథ్ గారికి.ఆయన దగ్గర డబ్బులు కూడా పుచ్చుకోలేదుట.తమిళనాట కూడా తెలుగు శంకరాభరణం నడిచింది ఆరోజుల్లో.ముప్ఫైఏళ్ళ తర్వాత కానీ అనువాదం చేయలేదు.సినిమాని అంతగా హర్షించని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ సినిమాని చూసి రాసిన సమీక్ష మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
“శంకరశాస్త్రి పాత్రలో ప్రత్యేకత ,ఆయన సంగీత విద్వాంసుడు కావటం కాదు.సంగీతవిద్వాంసులు చాలామంది ఉంటారు.చిత్తశుద్థీ,ఆత్మగౌరవం,కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే కరుణ స్వభావం ,సమాజపు సంకుచిత్వాన్ని లక్ష్య పెట్టని ధీరత్వం,నమ్మిన లక్ష్యాన్ని నుంచి చలించని పట్టుదలా,సహజ గంభీరమైన ప్రవర్తనా లక్షణాలే ఆయన ప్రత్యేకత.
ఈ చిత్రాన్ని నిజ జీవితంలా చిత్రించిన దర్శకుడు, సంభాషణల రచయిత, పాత్రధారులు కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు.”
బలమైన పాత్రను సృష్టించడం దర్శకుడికి ఎప్పుడూ సవాలే.ఆ సవాలును స్వీకరించి తన చిత్రాల్లో బలమైన పాత్రలు,వాటి ప్రవర్తనా తీరును నిర్దేశించగలగటం కేవలం కె.విశ్వనాధ్ కే సాధ్యం.
సినిమా మాధ్యమం తనకో దేవాలయం లాంటిదని విశ్వనాథ్ అంటుండేవారు.అందుకే తన ప్రతిచిత్రాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించేవారు.ఆయన సినిమాలన్నీ కనక వర్షం కురిపించేవి కావు.కానీ ప్రేక్షకుడికి చక్కటి విలువలను, విలువైన పాటలను
బిగువైన కధనాన్ని అందించటంలో వెనకబడుండేవి కావు.నిర్మాతకు మాట రానిచ్చేవికావు.విశ్వనాథ్ లేకపోతే వేటూరి, సిరివెన్నెలల పాటల వెన్నెల మనకు దొరికేది కాదు.చాలా పాటలకు పల్లవులు విశ్వనాధ్ సూచించేవారని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా.
“రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అని మాటసాయం చేస్తే ఉండమ్మా బొట్టు పెడతాలోని ఆ గొప్ప పాటను నారాయణ రెడ్డి గారందించారు.అలాగే సిరివెన్నెల లోని చందమామ రావే,జాబిల్లిరావే అన్ని అన్నమయ్య పల్లవిని సూచిస్తే అది పాటై ప్రకంపించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలో.నా సూచనను అంగీకరించిన తన గీతరచయితలెంతో గొప్పవారని విశ్వనాథ్ అంటుండేవారు.
ఏ సన్నివేశాన్నయినా నటించి చూపడం విశ్వనాథ్ కి అలవాటు.అదే అనంతరకాలంలో వారిని నటుడిని చేసింది.లేటు వయసులో ఎంత ఘాటు నటనయో అని అనిపించేలా చేసింది.దర్శకత్వం చేసినంత సేపు వారు ఖాకీ డ్రెస్ ధరించేవారు.దానికి వారేవో కారణాలు చెప్పినా అది సాంకేతిక నిపుణులకు కర్తవ్యాన్ని, క్రమశిక్షణను, నటీనటులకు ఏకాగ్రతను బోధించింది.
అభ్యుదయవాదులు గా చెలామణీ అయ్యేవారు విశ్వనాథ్ చిత్రాలను విమర్శించే ప్రయత్నం చేశారు.వాటిని ప్రేక్షకులూ పట్టించుకోలేదు.సినీపరిశ్రమా పట్టించుకోలేదు.
2017లో విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన వేళ ఆకాశవాణి తరఫున ఈ వ్యాసకర్త ఓ ప్రశ్న వేశారు.మీ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తే రాబోయే తరాలకు ఉపయోగం కదా అని.దానికి సమాధానంగా వారో ప్రశ్న వేశారు.ఎవరైనా నా చిత్రాలను పరిశీలించి
నా పాత్రలను విశ్లేషిస్తే అది చాలు,నా జీవిత చరిత్ర అక్కర్లేదని నవ్వుల మధ్య అన్నారు ఆరోజున.
కానీ వారారోజున అన్నమాటను నిజం చేస్తూ 2021లో “అనామకుడు” కలం పేరుతో అనేక కథలు రాసిన డా.ఏ.యస్.రామశాస్త్రి “విశ్వనాథ విశ్వరూపం” పేరుతో విశ్వనాథ్ చిత్రాలను విశ్లేషించారు.
“విశ్వనాథ్ గారి చిత్రాలు అమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే భోజనాలు.కుటుంబమంతా హాయిగా కూచుని తినే ఇంటి భోజనాలు.అందుకే ఎన్నిసార్లు తిన్నా రుచిగా తృప్తిగా అనిపిస్తాయే కానీ విసుగు పుట్టదు.వెగటు కలగదు” అంటూ విశ్వనాథ్ సినిమాలను అమ్మ వంటతో పోల్చారు.
తెలుగు సినిమా
రొటీన్ రొచ్చులో కూరుకుపోయిన ప్రతిసారీ కాస్త ఊపిరిపోశారు విశ్వనాథ్.తనో కళాఖండం తీశానన్న అతిశయమెన్నడూ లేనివాడు ఆయన.తన పరిధిలో,తన అభిరుచి మేరకు భారతీయ సంగీతానికీ,నృత్యానికి వెండితెరపై వెలుగులు పంచాడు.సగటు ప్రేక్షకుడి గుండె తలుపు తట్టాడు.
అతని హృదయాన్ని గెలుచుకున్నాడు.సినిమా దేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన అసలు సిసలు భక్తుడు.
అందుకే విశ్వనాథ్ తన చిత్రాలతో మనందరిలో శాశ్వతంగా నిలిచిపోయారు.
సి.యస్.రాంబాబు
‘ ఆస్కార్ ‘ ప్రపంచ సినీ పరిశ్రమ జగత్తులో అందరూ అందుకోవాలని కలలు కనే అవార్డ్.
ప్రపంచంలో సినిమాలను నిర్మించే అన్ని దేశాలు ఆస్కార్ అవార్డు కోసం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా విడుదల కావాలంటే ఏ ఏ రంగాలు పనిచేయాలో ఏ విభాగాలు పని చేయాలో ఆయా ప్రముఖమైన విభాగాలకు అవార్డును ఇస్తూ ఉంటారు. దర్శకత్వం, నిర్మాణం, కథ ఫోటోగ్రఫీ,ఎడిటింగ్, మేకప్, పాట ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆస్కార్ అవార్డు గత 95 ఏళ్ళు గా ప్రదానం చేస్తున్నారు. Oscar Awards- Academy ఇచ్చే ఈ అవార్డు కోసం హాలీవుడ్ మొత్తం తమ యావత్ ప్రతిభను వెచ్చించి మరీ సినిమా లను నిర్మిస్తూ ఉంటారు.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతుంది.
నిన్న , మార్చ్ 12 ఆదివారం నాడు 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగాయి.
ఇవన్నీ తెలియని వారు ఎవరున్నారు? అందరికీ అన్ని తెలుసు !కానీ , మన చంద్రబోస్ గారి గురించి కదా ఇక్కడ చెప్పుకోవాలి. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం సామాన్య విషయం కాదు. పాట రాసిన రచయిత చంద్రబోస్ గారు.
పాటకు వాద్య సహకారాలు అందించిన ,గాత్ర సాకారాలందిచిన ,తెరపైన నృత్య సహకారాలు అందించిన ,నృత్యం చేసిన నటీనటులు ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే! వస్తాయి కూడా!ఇంతకన్నా మించి ఈ పాటను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పెట్టడం వలన గుర్తింపు లోకి వచ్చింది. అన్నింటికన్నా మించి అంత భారీ ఖర్చుతో అంత నిబద్ధతతో అంత అత్యద్భుతంగా చిత్రీకరణ చేసి దర్శకత్వం వహించిన వారి వలన ఈ సినిమాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి పాట రైటర్,సింగర్స్,మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్, డైరెక్టర్ ఇన్ని కలిస్తే ,వీటన్నింటి కన్నా ప్రచార హోదా కల్పించడం గొప్పగా అయినందుకు ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి ఆస్కార్ అవార్డు” నాటు …..నాటు……” పాట సొంతం చేసుకుంది. ప్రపంచమంతా ఆన్లైన్ మీడియాతో నడుస్తోంది అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి పోటీలు, ఫలితాలు . సమాచార వేగం కూడా కారణం. ఒక వంటకం కుదరాలంటే వస్తువులు, పదార్థాలు ,చేసే వ్యక్తి , చేసే తీరు, వంటవండేవారి శ్రద్ధ ఇన్ని కూడాలి! ఇన్ని సరిపడ్డాక వంటకాన్ని వడ్డించబోయే ముందే ఎవరైనా అది బాగాలేదు రుచి సరిగా లేదు అన్నారంటే గిన్నెడు పదార్థం వృధా అయిపోతుంది. ముందు తిన్న వాళ్ళు పదార్థం చాలా రుచికరంగా ఉంది అంటే ,ఇక తర్వాత తినేవాళ్ళు అదే అభిప్రాయంతో తింటారు. అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ప్రచారమే ఉపయోగపడుతుంది.ఒక మంచి నవల వచ్చింది అంటే నవల పేరు ,అంశము, రాసిన శైలి,అభూత కల్పన కాని సత్య నిరూపణము, అద్భుతమైన సందేశం. ఇవన్నీ కావాలి.వీటన్నింటిని మించి ఆ నవల ముద్రితమై అందరూ చదవడం, ఇతర భాషల్లోకి అనువాదం కావడం ప్రపంచానికి అందడం ముఖ్యం. ఇటువంటి ప్రచారం నలుగురు బాగుంది అన్నారంటే అప్పుడు కదా ఇలా సింహాసనం పైన దిష్టింప చేసేది! అయినా కానీ…..ఈ పాట విషయానికి వస్తే, పాటను ఒక్కటే విశ్లేషణ చేస్తే, పాటలోని మాటలు …మాటల్లోని భావము ….పలుకుబడులు ….ప్రజల భాష , పల్లెపదాల పరిమళం ,జానపద పదగుంఫనం ….!ఇవి ఆకట్టుకునేలా ఉండడం ఈ పాటకు ప్రాణం అయింది. అవేంటో తెలియాలంటే అట్లా దుమ్మురేగే పొలం గట్టుకోసారి పోవాల్సిందే!!పోతరాజు ఆడినట్టు ఎవరాడగలరేంది?, దుమ్ము దులుపుతుంటె చూడాల్సిందే! జాతర ..పోలేరమ్మ జాతర! ఇవన్నీ వాటి వాటి ప్రత్యేకతలను కళ్ళముందు కదలాడేలా చేసాయి కదా!పొలం గట్టు ,మిరప తొక్కుల యవ్వారం మొత్తం ఎర్ర జొన్న రొట్టె చెప్పదూ!! కుర్ర గుంపు లొల్లి లొల్లంతా మర్రి సెట్టు నీడలు తెలియజేశాయి కదా! అంతే కాదు కిర్రు సెప్పులు ఊరుకుంటాయా? ఊం..హూ…. కర్ర సాము చేసేందుకు పోవూ!!

ఇంత సహజ సిద్ధంగా మాటలు అలా అలా అలా స్వరప్రవాహమై రాలే!!
మనసు మళ్ళీ మళ్ళీ నవ్వుకోలె!!
‘నాటు’లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పెట్టేసాడు కవి చంద్రబోస్! అసలు’ నాటు’ అనే పదానికి అర్థం ఆస్కార్ వాళ్ళకు అర్థమైందో కాలేదో కానీ, అక్కడ వేదిక మీద చ ‘నాటు ‘కి చెప్పిన అర్థమైతే వేరే! మనకు తెలుసిన నాటు కాదు!ఇవే కదా పలుకుబళ్ళు! వ్యవహారిక భాష ,యాస, ప్రాంతీయ భాష,భావము! ఓసారి పలకరించుకొని పులకించి పోదామా?
ఒంటి లోని రగతం!
రంకెలేసి ఎగరదూ!!
ఎకా ఎకీ!
లోపలున్న పానమంతా!!
డుముకు డుముకులాడేయదూ!!
ఎక్కడి పదాలు ఇవి? మా చినపెండ్యాలలో, మా హన్మకొండ, మా వరంగల్ లలో తిరిగేసి వచ్చి ఉప్పస చెందినట్టు, ఊరట పొందినట్టు,నా చిన్నప్పుడు మా అన్నయ్య లు, తమ్ముడు, అక్కయ్య లతో ఆడుకున్నట్టున్నది, మేము మా దోస్తులందరం మాట్లాడుకున్నట్టున్నది.
ఈ ఒక్క పాటను నేనైతే ఎన్ని సార్లు చూసిన్నో!
మా పిల్లలే కాదు,మా మనవరాళ్ళు, మనవడూ ఎన్ని సార్లు డాన్సులు చేస్తారో, ఎంతగా పాడ్తారో! ఇవాళ ఈ సందర్భం వచ్చిందని చెప్పడం కాదు, చెప్పేఅవకాశం వచ్చింది కనుక చెప్పడం.
డింకిచక,
డింకనకర,
డిక్కనకర!!
ఏందిది?కవి పల్లె బుట్టలో మాటలు పోసుకొచ్చాడు. ఈ జానపద సాహిత్యాన్ని ఎన్ని దోసిళ్ళకు ఎత్తు కోవాలీ ఏందీ?
వీటి అందం తెలుసుకోగలిగితే మరింత ఆనందం! పోనీలెండి ఆస్కార్ వాళ్లకి ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ, పాటలో ఉన్న ఏదో అందం వాళ్ళనాకర్షించింది! మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది! ఆస్కార్ వచ్చి పడింది. ఆస్కార్ తెలంగాణ యాసకు మోకరిల్లింది. ఆస్కార్ తెలుగు సినిమాకు జోహార్లు అన్నది. ఆస్కార్ తెలుగు పాట లోని వైభవాన్ని గుర్తించింది! ఇది చాలదు మనం ఇలా అనుకోవడానికి చెప్పుకోవడానికి! ఇది చాలు! ఇట్ ఈజ్ ఎ రికార్డ్! దట్సిట్!!
హాట్సాఫ్ టు చంద్రబోస్ గారు!!
మానుకోట బిడ్డడు, వరంగల్ గడ్డ ప్రతాపం చూపించి, ఆస్కార్ అవార్డు ను పడ కొట్టిండు! తెలుగు ప్రజలకు ఆస్కార్ చేరేలా చేసిన చంద్రబోస్ గారి కి శుభాకాంక్షలు!
“ఆస్కారన్న చంద్రబోసన్న ” అనే పేరు తెచ్చుకున్న చంద్రబోస్ గారి కి అభినందనలు!!
“సైన్స్”ను విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా వివరిస్తే శాస్త్ర వ్యాసాలు/ శాస్త్ర గ్రంథాలు. లోకం పోకడను, మనసు సవ్వడిని పాత్రల ముఖతః సంఘటనా శ్రయంగా వివరిస్తే కథలు, నవలలు. ఈ రెండు భిన్నమైన రంగాలు. సైన్స్ విషయాలను ఆధారభూమికగా చేసుకొని కొన్ని సామాజిక సంఘటనలకు సైన్సును అనువర్తించి పాత్రల ముఖతః సృజనాత్మకంగా వర్ణిస్తే ‘సైన్స్ ఫిక్షన్’. అంటే శాస్త్రబద్ధమైన, ఆలోచనాత్మకమైన ‘సైన్స్’కు ఊహాత్మకమైన సృజనాత్మకమైన సాహిత్యానికి పెళ్ళి చేస్తే పుట్టే బిడ్డ సైన్స్ ఫిక్షన్ అన్నమాట.
ఈ ‘సైన్స్ ఫిక్షన్’ మీద డా. ఎన్. సుధాకర్ నాయుడు చేసిన పరిశోధన గ్రంథం ఇది. ఈ రోజుల్లో మంచి పరిశోధనాంశం దొరకడం పరిశోధకులకు అదృష్టమే. సరిగ్గా చేయగలిగిన మంచి పరిశోధకుడు దొరకడం మంచి పరిశోధనాంశానికి అదృష్టమే. ఈ రెండు ఒకే చోట కలవడం పాఠకుల అదృష్టం. సుధాకర్ నాయుడు చేతిలో ఈ పరిశోధనాంశం సమాచార పౌష్కల్యంతో విషయ నిర్భరంగా రూపుదాల్చడం ఆనందాన్ని కలిగించే అంశం. ఈ విషయంలో ఇదే ఏకైక ఆకర (reference) గ్రంథం.
సుధాకర్నాయుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ముగ్గురు వైస్ ఛాన్స్లర్స్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. పని పట్ల నిబద్ధత, వ్యక్తుల పట్ల ఆత్మీయత సుధాకర్నాయుడు నైజగుణం.
ఈ సిద్ధాంత గ్రంథం ఒక ప్రక్రియా వికాస చరిత్ర. ప్రక్రియా వికాసం చరిత్రలన్నింటికి ప్రధానంగా కావలసింది విస్తృత సమాచార సేకరణ. ప్రాథమ్యాల, వైవిధ్యాల, ప్రయోగాల పరిశీలనం. (అవకాశం ఉంటే) అన్యభాషల్లో ఆ ప్రక్రియా వికాస స్థూల పరిచయం. ఆ తర్వాత ఆ ప్రక్రియలోని రచనల విశ్లేషణ. ఇలాగే వెనుకటి పెద్దలు తమ డాక్టరేటు గ్రంథాలలో పరిశోధించి ఒక ఒరవడి నిర్దేశించారు. సి. నారాయణరెడ్డి (ఆధునికాంధ్ర కవిత్వం బి.వి. కుటుంబరావు (ఆంధ్ర నవలా పరిణామం), పోరంకి దక్షిణామూర్తి (తెలుగుకథ), సంప్రదాయాలు, ప్రయోగాలు), మద్దూరి సుబ్బారెడ్డి (దేశభక్తి కవిత్వం), జి.వి. సుబ్రహ్మణ్యం (ప్రథమాంధ్ర పురాణం). ఎస్.వి. రామారావు (సాహిత్య విమర్శ) లాంటి సిద్ధాంత గ్రంథాల ధోరణిలో సుధాకర్ నాయుడు సిద్ధాంత గ్రంథ రచన సాగడం అభినందనీయమైన అంశం.
చారిత్రక వైజ్ఞానిక నేపథ్యం పేరిట కూర్చిన ప్రథమాధ్యాయంలో పరిశోధకులు పాలిటి గని అంతే గాక పరిశోధకుని దృష్టి కోణాన్ని శ్రమశీలాన్ని తెల్పుతుంది. ఆచంట సాంఖ్యాయన శర్మ భూతత్త్వ శాస్త్ర, ఖనిజశాస్త్ర, క్రిమికీటక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించినవారు. వారు నిర్వహించిన కల్పలత పత్రికలో ‘విజ్ఞాన వల్లిక’ అనే శీర్షిక కింద ఎన్నో ఆధునిక భౌతిక శాస్త్రాంశాలు రాసే వారట. శ్రీ శర్మగారు రహస్య దర్పణం పేరుతో 1892లో రాసిన గ్రంథంలో మనుష్యేతర జీవాల జీవన రహస్యాల గురించి చర్చించారట. భూతత్త్వశాస్త్రం అని ఓ గ్రంథాన్ని రాశారు. డార్విన్ సిద్ధాంతాన్ని తెలుగులో చెప్పారు. కొమర్రాజు లక్ష్మణరావు లాంటివారు సాంఖ్యాయన శర్మను విజ్ఞాన సర్వస్వంగా ప్రశంసించారు. మరి అలాంటి ఆచంట సాంఖ్యాయన శర్మ జీవన, రచనల వివరాల మీద ఎవరైనా డాక్టరేటుకు పూనుకొంటే ఎంత బాగుంటుందోనని నాలాంటివాడికి అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అట్లాగే టేకుమళ్ళ అచ్యుతరావు, టేకుమళ్ళ రాజగోపాలరావు ప్రభృతుల వైజ్ఞానిక రచనలను సుధాకర్నాయుడు ప్రస్తావించారు. వీరిని గురించి మన పరిశోధకులకు తట్టడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న కాంక్ష ఉవ్వెత్తున చెలరేగింది. ఆ ప్రభావంతో సైన్స్ రచనలు కూడా ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత సైన్స్ రచనలు బాల సాహిత్య విభాగంలో, లేదా
సైన్స్ ఫిక్షన్గానో, పాపులర్ మార్గంలో వచ్చాయేమోననిపిస్తుంది. ‘సీరియస్’ శాస్త్ర వాఙ్మయ రచనం – పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి నానాటికీ విస్తరిస్తున్న ఆంగ్ల భాషా ప్రభావం కావచ్చు.
స్వయంకృషితో బహుభాషలు నేర్చుకొన్న ఒద్దిరాజు సోదరులు తెలంగాణాలో మారుమూల వైజ్ఞానిక శాస్త్ర వ్యాసంగం నెరపిన వివరాలు ఈ గ్రంథంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఆయుర్వేద గ్రంథాలు, చరకం, శుశ్రుతం, బాహాటం, మాధవ నిదానం, బసవరాజీయం లాంటి గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యసించిన ఒద్దిరాజు సోదరులు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు (2.4.1887; 28.1.1956) ఒద్దిరాజు రాఘవ రంగారావు (4.4, 1894 – 17.5.1973) మలేరియా నివారణకు ‘తిక్త’ అనే ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి వేలాది మందిని కాపాడారట. హోమియో వైద్య గ్రంథాలు కలకత్తా నుండి తెప్పించుకొని అధ్యయనం చేసి హోమియోలో ఎం.డి. పట్టా పొందారట. ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించినవారు. ఫోటోగ్రఫీ నేర్చుకొని ‘ఛాయాగ్రహణ తంత్రం’ చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష విద్యుద్విజ్ఞానం లాంటి గ్రంథాలు రాశారు. సాహిత్య సంబంధ రచనలు సరేసరి. వైజ్ఞానిక సంబంధమైన వ్యాసాలను, పుస్తకాలను, విజ్ఞాన సర్వస్వాలను ప్రచురణ సంస్థలను, సంస్థానాలను, విశ్వవిద్యాలయాలు చేసిన కృషిని పత్రికలను, పత్రికల్లోని సైన్స్ కాలమ్స్న కొండ అద్దమందు చూపినట్లుగా సుధాకర్నాయుడు ఈ ప్రథమాధ్యాయంలో ప్రదర్శించారు. దీని ఆధారంగా మరికొన్ని పరిశోధనాంశాలను దొరికించుకోవచ్చు.
సైన్స్ ఫిక్షన్కు వివిధ పండితులు, విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు ఇచ్చిన నిర్వచనాలను, లక్షణాలను రెండవ అధ్యాయంలో పేర్కొన్నారు. రేడియో టెలివిజన్ ఛానల్స్లోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కార్యక్రమాల, సినిమాల వివరాలు సాధారణంగా లభించవు. వాటిని పేర్కొనడం సుధాకర్నాయుడు శ్రమశీలానికి, వెచ్చించిన సమయానికి దర్పణం పడుతోంది. వర్తమాన పరిశోధక విద్యార్థులు ప్రత్యేకించి గుర్తించాల్సిన ఆధునిక సాహిత్యంలో మొదటి సైన్స్ ఫిక్షన్ గ్రంథం మేరీ షేల్లి 1818లో రాసిన ప్రాంపెయిన్ స్టయిన్ అనే పేరున్నది మొడరన్ ప్రొమిధస్. సుధాకర్ నాయుడు దానితో మొదలుపెట్టి అడ్గర్ ఆలెన్పో, ఆల్డస్ హక్స్ లీ, జార్జి ఆర్వెల్, సి.యస్. లెవిన్లను మొదలుకొని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల రచనల వివిధ భారతీయ భాషల్లోని సైన్స్ ఫిక్షన్ రచనలను ఆంగ్లాది ఇతర భాషల నుండి చేసిన ఈ అనువాదాలను సుధాకర్ నాయుడు పేర్కొనడం గమనించినపుడు నాకు పాతకాలం సిద్ధాంత గ్రంథాలు (పైన పేర్లు పేర్కొన్నాను) మదిలో మెదిలాయి.
సుధాకర్నాయుడు తొలి తెలుగు సైన్స్ కథలు తెలంగాణా నుండి వచ్చాయని నిర్ధారించడం గమనార్హం. సింగూరి జయరావు (పరమాణువులో మేజువాణి, డిసెంబర్, 1927) ఎల్. శంకరనారాయణ (చంద్రమండలపు చోద్యములు – మార్చి, ఏప్రిల్ 1928), ఒద్దిరాజు సీతారామచంద్రరావు (అదృశ్యవ్యక్తి, అక్టోబర్ 1928 గారలు రాసిన ఈ మూడు కథలు తెలంగాణా నుండి వచ్చిన సుజాత పత్రికలో వచ్చాయి. కొడవటిగంటి, కె.ఆర్.కె. మోహన్, ఎన్.ఆర్. నంది, పురాణపండ రంగనాథ్, మైనంపాటి భాస్కర్ లాంటి వారి సైన్స్ ఫిక్షన్ కథలన్నింటినీ సుధాకర్నాయుడు చర్చించారు.
టేకుమళ్ళ రాజగోపాలరావు 1934లో రాసిన ‘విహంగయానం’ తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల. అప్పటికి సైన్స్ ఫిక్షన్ అనే పదబంధం వాడుకలోకి రానందున ‘ప్రకృతి శాస్త్ర సంబంధ నవల’ గా పిలిచారు. 22.1.1934 తేదీతో పీఠిక రాస్తూ రచయితనే స్వయంగా ‘విహంగ యానము తెలుగులోని ప్రకృతి శాస్త్ర సంబంధమైన నవలలో మొట్టమొదటిది. స్వతంత్రముగా రచింపబడినది. కాని ఇందలి ప్రకృతి శాస్త్ర విషయాలు జనసామాన్యమున కందుబాటులో నుండు రీతిని కూర్చబడినది. వాయు, విమాన నిర్మాణ పద్ధతులు 18,20 ప్రకరణములలో దెలుపబడినది. శాస్త్ర నవలారచనకు, మన భాషకు నాకును గూడ నిదియే ప్రధమము’ అని స్వయంగా పేర్కొన్నారు. ‘ఇది మనకు కొత్తది. మన భాషకు కొత్తది. ప్రకృతి శాస్త్ర సంబంధమగు మొట్టమొదటి నవల. స్వతంత్రంగా వ్రాయబడినది. ప్రకృతి శాస్త్ర జ్ఞానమును సామాన్య జనుల హృదయమున కెక్కించునుత్తమ నవలలు ఫ్రెంచి, జర్మను భాషలలో మాత్రమే కలవు అంటూ కపిస్థలం శ్రీరంగాచారి భారతి డిసెంబర్ 1934 సంచికలో విహంగయానాన్ని సమీక్షిస్తూ అభిప్రాయపడ్డారు. ప్రక్రియ వికాసాల మీద పరిశోధించే ప్రతి పరిశోధకుడు ముందుగా నిర్ధారించవలసింది ఏది తొలి రచన ఎప్పుడు తొలి రచన వచ్చింది. సుధాకర్ నాయుడు తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ లేదా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల అన్న విషయంలో ఆధార సమన్వితం పరిశోధన తత్పరతతో చూశారు. భవిష్యత్తులో దీనిని ఎవరైనా కాదంటే సుధాకర్నాయుడు పేర్కొన్న కాలాలకు చెందిన కథ / నవలలకన్నా ముందువి దొరికి వాటి చరిత్ర, మరికాస్త వెనక్కి వెళ్ళిందని సంతోషించవచ్చు.
సైన్స్ఫక్షన్కు కుహనా సైన్స్ ఫిక్షన్కు అంతరం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ద్వారా సంభవమయ్యే అవకాశమున్న మేరకు రక్తి కట్టించే కల్పనను జోడించి రాయడం సైన్స్ ఫిక్షన్ అవుతుంది. అంతేగాని సైన్స్ ఏమాత్రం అంగీకరించని దాన్ని ఏదో వింత పేర్లు కల్పించి రాసేవి కుహనా సైన్స్ ఫిక్షన్ (సోషియో ఫాంటసీ) కథలు / నవలలు అవుతాయి. సుధాకర్నాయుడు ఏది సైన్స్ ఫిక్షన్? ఏది సోషియో ఫాంటసీ అని గుర్తించి పేర్కొనడం పరిశోధకునిగా ఆయన అప్రమత్తతను తెలుపుతుంది. 1934 నుంచి 1970 వరకు 37 ఏళ్ళ కాలంలో సైన్స్ ఫిక్షన్ నవలలు పదికి మించి లేవని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. (పుట. ) సోషియోఫాంటసీ, సైన్స్ ఫిక్షన్కు రెండు విభాగాలుగా చెప్పుకొన్నా ఎక్కడో ఒకచోట ఈ రెండు కొంతమేరకు కలగలిసిపోతాయేమో! కాకుంటే పాళ్ళల్లో ఎక్కువ తక్కువ లను బట్టి వర్గీకరించుకోవలసి రావచ్చు.
మొత్తమీద తెలుగులో ఇప్పటిదాకా 89 డైరెక్ట్ కథలు, 17 అనువాద కథలు 503 పైగా నవలలు సైన్స్ ఫిక్షన్కు సంబంధించి వచ్చాయని పరిశోధకుడు అంచనాకు వచ్చారు. ఒకటి రెండు జారిపోయినా నష్టం లేదు. 1987 జూన్ నుంచి 1996 సెప్టెంబర్ 67 సిద్ధాంత గ్రంథాలు ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ మీద వచ్చాయని సుధాకర్నాయుడు ఉపసంహారంలో పేర్కొన్నారు. తెలుగులో మాత్రం ఇంతదాకా ఇదొకటే. సాహిత్యం విస్తృతంగా వస్తే పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి. సైన్స్ ఫిక్షన్ రాయడమే తక్కువ. పాఠకుల్లో విపరీతాసక్తి ఉంటే రచయితలు బాగా రాస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షిస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షితులు – ఇదంతా ఒకదానికి ఒకటి సంబంధించిన (Interlinked) వ్యవహారం.
తెలుగు సాహిత్యంలో ‘సైన్స్ ఫిక్షన్’పై విషయ నిర్భరమైన సమాచార పౌష్కల్యంతో కూడిన ఏకైక ఆకర (రిఫరెన్స్) గ్రంథంగా మలచిన సన్మిత్రులు డా. ఎన్. సుధాకర్ నాయుడు గారికి మనసారా అభినందనలు. నాకీ నాలుగు మాటలు రాసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
తెలుగు భాషలో భావకవితా ప్రపంచానికి అదినేత బావ కవిగా పుట్టి భావగీతాలాలపించి, భావ కవిత్వాన్ని ఉధ్యమంగా స్వీకరించి విశేషప్రచారం చేసి రెండు దశాబ్దాల కాలం ఎదురు లేని తనహొ కవితా లహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వలోకాల కేగిన గాన మూర్తి, పద్య కవిత్వాన్ని పండిచారు. పాటల కవిగాను, నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాసినప్పటికి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాతకొత్తల మేలుకలయిక.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు క్రీ॥శ 1897 సంవత్సరంలో జన్మించారు. తల్లి దండ్రులు శ్రీమతి. శ్రీ సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లు కృష్ణశాస్త్రి చిన్నతనంలోనే పద్య, మరియు కవితా రచన చేసి కన్న వారి దీవెనలు పొందారు. 1918వ సంవత్సరంలో పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పెద్దబావగారి కూతురినే వివాహం చేసుకున్నారు. 1919వ సం॥లో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి స్థాపించిన “సాహితి సమితి” లో సభ్యులైనారు. ఓ సందర్భంలో కృష్ణశాస్త్రి బి.ఎ అనిపించుకోవడం కంటే “సాహితి సమితి సభ్యుడను” అపిపించుకోవడమే తనకిష్టమని చెప్పారు. కాకినాడ పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. కాలం పిలుపులోని కల్మషాన్ని కడిగి వేయడానికి రాసిన ఈయన పాటలు సంప్రదాయవాదులకు గిట్టనందుకు రాజా వారికి చెప్పి సంఘబహిష్కరణచేయించారు. పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా ‘ధర్మసాదన’ అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాయడంతో రాజావారు ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండ తండ్రులకాలం నుండి వచ్చె ‘వార్షికం’ నిలుపు చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే శాస్త్రిగారి భార్య మరణించారు. భార్య వియోగం తో శోకతప్త హృదయంతో ‘కన్నీరు’ అనే ఖండకావ్యం రాశారు. గాడేపల్లి సూర్యనారాయణ గారి పెద్దమ్మాయి ‘ రాజహంస’ను వివాహము చేసుకొని మామగారి ప్రోత్సాహంతో సహయం నిరాకరణోద్యమ కార్యక్రమాలలో భాగస్వామి అవడంతో స్కూలుమాష్టారి ఉద్యోగం పోగొట్టుకున్నారు అయిన అదితన అదృష్టంగానే భావించారు ఎందుకంటే దేశ సేవనే గొప్పది అనుకున్నారు.
కృష్ణశాస్త్రిగారు రచించిన ఖండకావ్యాలు చేర్చి 1925లో ‘కృష్ణపక్షము’ అనే పేరుతో సాహితి సమితి తరుపున ప్రచురించారు. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి’సింహవలోకనం’ అనే పరిచయ వాక్యాలతో ఈ కావ్యం పాఠకుల ముందు కొచ్చింది. ఈ కావ్యాన్ని సూర్యరాయ బహద్దూర్ గార్కి అంకితమిచ్చారు. ఇందులో 59 శీర్షికలున్న ఈ గ్రంధం పద్యగేయంమిశ్రమం కాని కృష్ణపక్షమనే మకుటంతో ఏ శీర్షికలేదు. కాని “నాకు మరణమ్ము” అనే శీర్షిక తేటగీతి పద్యాల్లో ఒక చోట ఆపదం కనిపిస్తుంది. 14 చీకటి రాత్రులన్న కృష్ణ పక్షాన్ని తనలో సగమైన, చేయి కలిపి కష్ట సుఖాలు పంచుకున్న అర్ధాంగి తనను అందకారంలో ముంచి వెళ్లిపోయిన విషాద సన్నివేశానికి, సింబాలిక్ గా ఈ పదం వాడారని చెప్పవచ్చును.
కృష్ణశాస్ర్తీ గారు భావగీతలను కూడ రాశారు.
” ఆకులో ఆకునై పువ్వులలో పూవ్వునై / కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై / ఈయడవిదాగిపోనా ఎట్లైనా/ నిచటనే దాగి పోనా అంటుసాగిపోతాయి.
కృష్ణ పక్షం కావ్యంలో గొప్ప కవితా ఖండిక ‘అన్వేషణ’ తనకుతానే గోపికయై వంశీ మోహనుడైన గోపాల దేవున్ని కవి వెతకడం అన్వేషణలోని ప్రధాన ఇతి వృత్తం సెల యేటి కెరటాలలో తేలిపోతున్న విరికన్నె వలపు గాను, తొలి ప్రొద్దు తెమ్మర త్రోవలో పయనమై పరిగెత్తు కోయిల పాటగాను తెల్లని వెన్నెలలో కలసి కరిగి పోతున్న మబ్బు తునక లాగాను తీయదనమైన గోపికా హృదయాంతరాన్ని తన్మయత్వంలో ముంచి తట్టిలేపింది. అనంత సంగీత మకరంద మాధుర్యాన్ని చవి చూసిన గోపికా నాథుని వెదుకుచు ఆయన పల్లె వదిలి ప్రాణ నాథుని పట్టువొదలి యమునా సైకత భూవిలో వెరిగ్రా తిరగసాగింది ఇలా “శారద శర్వరే మధుర చంద్రిక / సూర్యమంతా స్రవంతిగా చారు వినీల వీచిక ప్రశాంత నిశా | పవనోర్మి మాలికా ” అంటు సాగింది. కృష్ణ శాస్త్రి జీవితమే అన్వేషణగా జీవించి మురళీ మోహమనే ద్యాన భజనలో మధుర భక్తిని పండించిన ఆపరజయదేవుడు. లోక నీతికి, సంప్రదాయ రీతికి భిన్నంగా శ్రీకృష్ణునికి తనకు తాను అర్పించుకున్న రాధగా జయదేవ కవి ఆలపించిన భావ సౌందర్యాన్ని పూతగా స్వీకరించ కృష్ణ శాస్త్రి అన్వేషణలో రాశారు. దేశ మాతను బంధించిన కఠిన దాస్య శృంఖలాలు చెదరి పోయినట్లు గగనతలం మారు మ్రోగెటట్లు కంఠమెత్తి స్వేచ్ఛాగానం చేశారు. ఏల ప్రేమింతును, నా ప్రేమ, ప్రాణకాంత వంటి గీతా మాలికలు రాశారు. భార్య వియోగంతో తపించిపోయిన శాస్త్రిగారు దుఃఖంలో విషాదకావ్యాలు రాశారు. ‘ఆశ్రువులను మాయం చేసె మరణం కన్నా జీవించి ఆమె కోసం దుఃఖించటమే తనకు ఆనందం అంటారు.
1929వ సం||లో జ్వాల పత్రికను నడుపుతున్న ముద్దు కృష్ణగారు ప్రవాసము ఊర్వశి అనే సంపుటిని ముద్రించారు. ‘కృష్ణపక్షము’ లోని వియోగం నుండి ప్రవాసములోని దుఃఖం ఆ దుఃఖం నుండి గమనించిన నాయిక “ఊర్వశి” అని చెప్పవచ్చు. దుఃఖాన్నే సౌఖ్యంగా అనుభవిస్తూ ప్రవాస గీతాలల్లడం, ప్రవాస గీత మాధుర్యాన్ని భావనకు అనునయించి ఆ భావనలో దివి నుండి దివ్యమూర్తి ‘ఊర్వశి’ ని భూమికి దించారు కృష్ణ శాస్త్రి గారు. ఉషస్సులు రావని తన జీవితం వలె కాలం కూడ చీకటి మయం గా కనిపిస్తుందని వాపోయారు. ఆయన బాధనుఏ గంధర్వలు అలకించారో ఏ వసంతుడు విశ్వ ప్రేయసి ఊర్వశికి తెలియచేశారో కాని ఆమె నిశీధిలో వెల్లు రేఖలా కవి హృదయకవాటాన్ని తట్టి లేపింది. ఆ విధఃగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ మాత్రమే కాదు సర్వలోకాలను కదిపి వేసిన గాధ కూడ ఆమె కోసం నిశీథిలో అన్వేషించారు. తపించారు కళ్ళలో వత్తులువేసుకొని నిరీక్షించారుఎద లోపలి ఎదలో దాచుకున్నారు. ఊర్వశిని “తొలిపొద్దున కురిసిన మంచు’ లా, విశ్వ వేదన మాల్యంగాను, విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలసిన ప్రేయసిగా ఊహించుకున్నారు. శాస్త్రాగారి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ సీతమ్మ, ప్రేయసి ఊర్వశి’అని అంటారు.
రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి శిష్యరికంలో బ్రహ్మ సమాజంలోని విశాల మానవ దృష్టి సంకల్ప శక్తి ఆయనకునైతిక బలాన్నిచ్చాయి. వైష్ణవి గీతాల్లోని వర్ణన మాధుర్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. వీరి భావనలోని అణువణువు లయతో ఉంటుంది. శాస్త్రిగారి లేఖిని నుంచి జాలువారె ప్రతి గేయంలోను శబ్ధార్ధాలు పొందికలో నాట్యం చేస్తుంది. ఇంకా భక్తి గీతాలు అమృత వీణా ‘మంగళ కాహళి అనే సంపుటాలుగా వెలువరించారు. కృష్ణ రజని కన్నీరు, మహతి, మధు మురళి, గుడి గంటలు, ఋతుభేల, విరితూపు అనేవి సప్తస్వర సమ్మిళితం అయతే నిరాశ, కరుణ, ఆర్తి, భక్తి, ప్రణయం, ప్రకృతి ఆరాధన, పుణ్యయ ప్రేమ అనేవి సప్త స్వరాఅంత నాదాలు ఉంటాయి.
ఋతుశోభను ప్రకృతి కాంతలీలా మాధుర్యాన్ని కళ్ళారా చూచి, మనసారా అనుభవించిన కృష్ణశాస్త్రి వైష్ణవ భావ పరిపక్వతతో అండాళ్ళు ‘తిరుప్పావై’ ని ఆంధ్రీకరించారు శబ్దమాధుర్యంతో పాటు రూపమాధుర్యాన్ని అంతర్నేత్రంతో దర్శించి ఆనందించగల కృష్ణశాస్త్రికి దేవుడికి ఏ పూవ్వులు కావాలో, తెలుగులో ఏ అలంకారాలు, ఏ దేవుడికిష్టమో తెలుసు. ఏ అక్షరాలలో ఏ దేవుని పూజిస్తే అతడు సంతృప్తుడౌతాడో తెలుసు. అందుకే పుష్పాక్షరాలతో పూజించిన పుణ్య మూర్తి కాబట్టి వందలాది భక్తి కీర్తనలను రచించారు. కృష్ణశాస్త్రి గారి గొంతు పోయాక రాసిన గేయ సంకలనం కృష్ణ రజని’ లో ఆర్తిగీతాలు అద్భుతంగా పలికించారు.
కృష్ణశాస్త్రి పద్యాన్ని పాటను ఎంత రమణీయ శిల్పరంజితంగా తీర్చిదిద్దారో అంతటి నైపుణ్యాన్ని వచన రచనల్లో కూడ చూపించారు మంచి గంధంతో మల్లెపూలు అత్తరులో కలిపిచినుకు చినుకు చిలకరించినట్లుంది. వారి వచన శైలి, పచ్చకర్పూరపు గుభాళింపుతో వున్న పాయస పాత్రను నోటికందించినట్టుగా వుంటుంది. శాస్త్రిగారి విషయ విన్యాసం. కృష్ణశాస్త్రి పుట్టుకతో కవిగా అవతరించిన నిరంతర కవితా ధ్యానంతో పరిణతి చెందారు. వచనంలో కూడ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. ఆధునిక అవసరాలను ఊటకింస్తూ రాసిన చిన్న చిన్న వ్యాసాలల్లో కవిత్వం హృదయాన్ని ఎంత రంజిప చేస్తుందో వారి వచనం కూడా అంతగానే ఆలోచనలను తట్టి లేపుతుంది. వీరి కవిత్వంలో ప్రధాన గుణం భావమైతే మరో గుణం సంగీతం అంతర్వాహినిలా సాగుతుంది. అందుకే 1960 సం||లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు అనతి కాలంలోనే చలన చిత్ర పరిశ్రమ కూడా కృష్ణశాస్త్రి గార్ని ఆహ్వానించింది. సినిమా మరుగైనా పాట నిలిచే ఉండే మంచి పాటలు రాసిన కవుల్లో దేవులపల్లి అద్వీతీయులు.
1939వ సం|| నాటికే ప్రతినాగరికుడి నోటికి కూని రాగాలయ్యాయి. ఆనాడు రాసిన గీతాల్లో “మవదూదయంలో మంచి ముహుర్తం/ మాధవి లతకు పెండ్లి/ మాదవి పెండ్లికి మల్లెమాలలు /మంధారాలు పేరంటాళ్లు” అనే పాట బహ్మండమైన ప్రచారంలో ఉండేది. ఇలాంటి పదచిత్రాలు చూసిన సినిమా రంగం 1951లో వారిచే పాటలు రాయించింది. దేవులపల్లిగారు పాటలు రాసిన మొదటి సినిమా ” మల్లీశ్వరి’ రాణి వాసపు పంజరంలో బంధీయైన మల్లీశ్వరి రాత్రిపూట రహస్యంగా ప్రియునిన కలుసుకున్నపుడు ఆమె మనస్సు మల్లెలు ఊగిపోయాయి హాయి నిండిన ఆ రేయిలో ఆమె బతుకే పండింది అంటూ ఈ పాట ‘మనసున మల్లెల మాల లూగెనే / కన్నుల వెన్నెలడోల లూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో / ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటు సందేశాన్ని పంపినా ప్రతి పాటా ఒక మధుర కావ్యం. కాళిదాసు మేఘ సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లీశ్వరిలో మంచి పాటలు రాశారు. జావళీలు రాయడంలో కూడా ఆయనకు తిరుగు లేదు. పిలిచిన బిగువటరా / పిలిచినా బిగువరా / ఔరౌర అంటు సాగే జావళీ పాట నేటికి నిత్య నూతనంగా అందరి హృదయాలను అలరిస్తూనే ఉంది. పాటలో జీవిత చిత్రాన్ని చిత్రించడంలో ‘వారికి వారె సాటి. జీవితంలో అన్ని విధాల ఓడిపోయిన మారిపోయిన ఉక్కు మనిషిలోపరివర్తనకు కారణమైంది ఒక పసిపాప. అతడు పాప కోసమే జీవిస్తాడు కారణాంతరాన చెరసాలకు వెళ్లి తిరిగి వచ్చాక పాప పెద్దదవుతుంది. అతన్ని మర్చిపోతుంది. బరువెక్కిన గుండెలతో ఒక పాప బొమ్మను లాలిస్తూ. తథిమి తకథిమిల్ బొమ్మ /దీని తమాస చూడవే కీల్ బొమ్మ / దీని తమాస చూడవే మాయ బొమ్మ అంటు పాడతాడు తలచుకుంటేనే గుండె కరిగిపోయే ఈ సన్నివేశంలో తత్త్వాన్ని చాలా గొప్పగా పలికించారు. కృష్ణశాస్త్రి గారు. మల్లెల్లో పూలల్లో కూడ సృష్టి విలాసాన్ని పొదిగి చెప్పిన పాటలు లెక్కకందవు. అందులో ఒక్కటి ” ఇది మల్లెల వేళయని / ఇది వెన్నెల మాసమని / తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అంటు మల్లెలు, వెన్నెల, కోయిలతో మహత్తరమైన జీవిత సత్యాన్ని పాడారు. అందులోనే “మరిగిపోయెకి మానవ హృదయం / కరుణ కలిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురైవచ్చు, వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం అంటు సాగే ఈ పాటలో విషాదం వెనుక వసంతాన్ని సృష్టించి ఊపిరిపోస్తారు. సినిమాల్లో కూడ ఎన్నో భక్తి గీతలు రాశారు “సంపూర్ణ రామాయణం” లో శబరి రాముని కోసం ఎదురు చూస్తుంది రాముడు సమీపానికి వస్తున్నాడు ఈ సన్నివేశంలో శబరికి, శాస్త్రిగార్కి బేధం లేదు. ఆ సందర్భంలో ఇలా… ముందు తెలిసెనా ప్రభూ / ఈ మందిర మిటులుండేనా, మంద మతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ముందు తెలిసినా……. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుందసును దళములు పరవనా…. అంటు షాగే ఈ పాట గళం మూగబోయాక రాసిన గగన తలాన్ని సృశిస్తుంది భగవంతుని పిలుస్తుంది. భాగ్య రేఖ సినిమాలో “నే వుండేదాకొండపై రాజమకుంలో ‘సడిసేయకేగాలి” భక్త శబరి చిత్రంలో “ఏమి రామ కథ” మంచి రోజులొచ్చాయి చిత్రంలో “నేలతో నీడ అన్నది నను తాకరాదని” ఆమెరికా అమ్మాయిలో పాడనా తెలుగుపాటా”, బంగారు పంజరంలో ‘గట్టుకాడ ఎవరో ” మొదలైనవి శాస్త్రి గారి పాటల్లో ఆణిముత్యాలుగా చెప్పవచ్చును. వందల సినిమాల్లో దాదాపు 500పైగా పాటలు రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన ఘనత కృష్ణశాస్త్రి గార్కె దక్కింది.
కృష్ణశాస్త్రి గారు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ గీతాలు పాడారు. “జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ దివ్వ దాత్రి ” అంటూ నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను కదిలిస్తూ రాసిన గీతం ” ప్రజారథం తరలింది / ప్రపంచ పధం పొరలింది/ కనుక పదవోయి పద” అంటూ హెచ్చరిస్తూ ఉత్తేజతుల్ని చేసింది. 1939 ప్రాంతంలో దేశంలో క్షామ దేవత తాండవిస్తున్న తరుణంలో ఆకలిగేయం రాశారు. 1941లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి మహ సభకు ఉద్యమానికి ప్రేరణగా అవేశం అంతర్భూతంగా ఒక స్వభోధ గీతాన్ని రచించారు. శాస్త్రిగారు అభ్యుదయ కవుల హృదయాల్లో చెలరేగిన ఉద్వేగ భావాలు గుర్తించారు. ఆశీర్వదించి వారికి పద నిర్దేశం చేసి ముందుకుసాగనించారు. తృతీయ అభ్యుదయ రచయితల మమాసభకు అధ్యక్షత వహించడం ఆయన అభ్యుదయ ప్రియత్వానికి నిదర్శనం శాస్త్రిగారు భావ కవితా ప్రతినిధే కాదు కవితా వైతాళికుడు కూడా. వారు పాడితే పక్షులు వంతపాడుతాయి. మబ్బులు శృతి కలుపుతాయి, నదులు పర్వతాలు లయలు చూపుతాయి. అందుకే ఆయన అచ్చమైన ప్రకృతికవి. ఆయన పాటల్లో ఆకుల నాడించే కొత్తగాలి, మాటల్లో విశ్వ ప్రేమ ను చూపించే కొత్త ఊపు, ఆలోచనల్లో సామాజిక హృదయ స్పందనలపై కొత్త చూపు కలంలో కరుణ, జాలు వార్చెడి కొత్త రసస్పందన కవితలలో సర్వహృదయాలను కదిలి కదిలిపోయె నూతన భాష్పీభవన పరిస్పందన. దేవులపల్లి కవిత ఆత్మీయుడైన మిత్రుడు సంస్కారాన్ని తట్టి మేలు కొల్పినట్లుంటుంది. సంప్రదాయం నుంచి చైతన్య పూరితమైన సన్నివేశాలు తెలసుకోగలరు. అవి రెండు కలిపి కవిత్వంగా ఆవిష్కరించగలరు. ఆ కవిత్వాన్ని పాడి ఎదుటి వాడి గుండెలో గూడు కట్టి కాపురం చేయగలరు. అందుకే ” కవి కృష్ణ శాస్త్రి కమ్మని కవితల కతడు మేస్త్రి అంటారు. 1942లో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1964లో శాస్త్రి గారి స్వరపేటికలో కాన్సర్ సోకింది. ఆపరేషన్ చేశారు. గళం మూగబోయింది. మధుమాస కోయిలకు గొంతు మూగ బోయదంటే ప్రకృతిలో ఎంత విచిత్ర మైన లీలలు సాగుతున్నాయో గదా !
గొంతు మూగబోయిన చివరి వరకు ఆయన మానసికంగా ఎంతో ఉత్సాహంగా జీవించారు. కవితా వ్యాసం సగం విడువలేదు ఆ సమయంలో రాసినదే “కృష్ణరజని” అని పేరు పెట్టారు. తన అభిమానులకు కొండంత సాహిత్యంతోపాటు రవంత కన్నీరు మిగిల్చి 24-02-1980 వ సంవత్సరములో గంధర్వ లోకం వెళ్ళిపోయారు.
“నన్ను గొపోవరాదా నాదా / నా హృదయం నాదా ” అంటూ భగవంతుని సన్నిధానం చేరుకున్నారు. కృష్ణ శాస్త్రి కవిత్వం రాయడానికి కొన్న హంగులు కావాలి నిరంతరం సాహితి గోష్ఠికావాలి మంచి సంగీతం వింటూ ఉండాలి. ఊసులు చెప్పుకోడానికి ఊహ తెలిసిన మిత్రులు కావాలి. ఈ హంగులుంటేకాని ఎక్కడో గున్నమావి కొమ్మల్లో ఉన్న గువ్వ కలంతో కలిసి పాడదు. కదిలి పోయే గుండె ఉండాలే కాని కృష్ణ కోయిల ప్రతి వసంతానికి తట్టి లేపుతునే ఉంటుంది.
” గూడు నిద్రపోయిన గువ్వ మేలుకుంది.
గొంతు మూగ పోయిన గుండె మేలుకుంది “
వనపర్తి పద్మావతి
ప్రముఖ కవి, రచయిత
ఉపన్యాస సిరోమణి
ఆదికవి నన్నయ్య వేదిక ఉ//9గం.లు
విజయవాడ లో 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లో నా ప్రసంగం:
19 వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ఆధునిక కాలంగా భావించవచ్చు. ఈ కాలంలో వచ్చిన ప్రధాన మార్పులు జాతీయ వాదం , దేశభక్తి, ప్రగతిశీల అభ్యుదయ భావాలు, స్త్రీ విద్య,బాల్య వివాహాల రద్దు ,వితంతు వివాహాలు, సామ్యవాద దృక్పథం తో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, కార్మిక కర్షక వర్గాల శ్రేయస్సు, ఆధునిక వైజ్ఞానిక అవగాహనా దిశగా హేతువాద దృక్పథం పెంపొందించడం యిత్యాదులు .వీటన్నిటి నేపథ్యంలో కూడా ఆథ్యాత్మిక చింతన కూడా మనిషి వైఖరిలో మార్పుకు , మంచి వైపుమరలడానికి దోహదం చేసింది.
ఈ పై భావజాలాల దృష్ట్యా రచయితలు, కవులు తమ తమ రచనల ద్వారా మంచి మంచి ఫలితాలు సాధించారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, వంటి వారు ఏర్పరచిన దారిలో గాడిచర్ల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, త్రిపురనేని, తాపీ వంటి వారలు చాలా వరకు లక్ష్యాలు సాధించారు.
అందు వల్లనే కుల ,మత బేధాలు తగ్గి సమైక్యంగా అందరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనగలిగారు. సురవరం ప్రతాప రెడ్డి, సరోజినీ నాయుడు, దాశరథి సోదరులు, కాళోజీ సోదరులు, ముఖ్దూం మొయినుద్దీన్, షోయబుల్లాఖాన్, అడవి బాపిరాజు వంటి వారలు ప్రత్యేక ముద్ర వేశారు.దేవులపల్లి రామానుజరావు వంటి వారలు ఆసులో దారంలా యీఅన్ని భావాల వైఖరులు ఉద్యమాల సంధానకర్తలుగా దీప్తి నందించారు.
గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవి గాయకులు గాంధీ శకానికి/ యుగానికి ప్రతినిధులు. వారి పాటల ద్వారా ప్రజలలో మంచి భావావేశాన్ని కలిగించారు. వామపక్ష సోషలిస్టు దృక్పథాలు ఫలితాలు సాధించి ఆధునిక ప్రజాస్వామ్య ప్రయాణాన్ని బలోపేతం చేశాయి.
ప్రజాస్వామ్య యుతంగా , రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాల్ని ఏర్పరచుకోవడం , ప్రభుత్వాల్ని మార్చడం అనేది అతిపెద్ద సామాజిక మార్పు . దీనికి రచయితలు కవులు ఎంతో దోహదం చేశారు. నిరక్షరాస్యులైనా , గ్రామీణులైనా దళిత గిరిజనులైనా తమ తమ విచక్షణ జ్ఞానం ద్వారా ప్రభుత్వాల్ని మార్చడమనేది ఒక గొప్ప శుభ పరిమాణం, పరిణామం. దీనికి రచయితలు కవితలు , నాటకాలు, పాటలు , బుర్రకథలు యిత్యాదుల ద్వారా ప్రజల అవగాహనకు తోడ్పడ్డారు.
కుల మతాల సాంప్రదాయ భావజాలాలు పునర్వికాసం చెందుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమ రూపంలో కలిసి పనిచేసినవారు ,పోరాడినవారు కొంత కాలానికి కుల మత భావజాలాలకు లోనవుతున్నారు.
ఛందో రూపమైన ప్రాచీన సాహిత్యం కన్నా వచన కవిత్వం విశేష ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఐనా మంచి పద్యాలు, సమస్యొ పూరణలు వస్తున్నాయి. తిరుపతి వేంకట కవులు, కొప్పురపు కవులు , జాషువా, విశ్వనాథ, శ్రీశ్రీ, నండూరి రామకృష్ణమాచార్య , ఆశావాది ప్రకాశరావులు మంచి పద్య శిల్పాన్ని నిర్మించారు.
శ్రీ గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధాని. శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆథ్యాత్మిక ప్రవచన కర్త. ఆధునికత వెర్రి తలలు వేసి సమాజం అడ్డదారులు తొక్కుతున్న తరుణంలో ఈ యిద్దరు ప్రవచనకర్తలు మంచి మార్పుకై దోహదం చేస్తున్నారు.
ఏ సమాజంలో నైనా మంచి ని ప్రోత్సహించడం , చెడును విమర్శించడం , త్యాగమయ దేశభక్తి జాతీయతా దీప్తిని ప్రోత్సహించడం, ధర్మనిరతిని కాపాడటం రచయితల పాత్ర.
ఈ విధంగా ప్రధానంగా అరసం విరసం వంటి సంఘాలు గద్దరు / వంగపండు వంటి కవి గాయకులు చాలా సామాజిక మార్పు సాధించారు. కేవలం రాజకీయ పార్టీల వల్ల 150-200 సంవత్సరాలు పట్టగల మార్పును , వీరు 40 సంవత్సరాల్లో సాధించారు. ఈ యీ సామాజిక ఉద్యమాల / రచయితల రచనల ద్వారానే సామాన్య ప్రజానీకానికి మార్పు తేగలం అనే నమ్మకాన్ని కలిగించారు .
ప్రస్తుత తరుణంలో నేరమయ జీవిత నేపథ్యం గల రాజకీయ రంగమును క్షాళన చేయడానికై రచయితలు/ కవులు ప్రజల అవగాహనను ఈ ప్రధాన సమస్యపై కేంద్రీకరించడానికి కృషి చేయవలసిందిగా ఆయత్త పరచాలి.
విషయ ప్రధానమైన భావగతి, నిండైన వర్ణనలు సంపూర్ణ రస నిర్వాహణ ఎర్రన కవితా లక్షణాలు. పురాణ మార్గం నుండి దేశిమార్గం వైపు, జాను తెనుగువైపు పాఠకులను మళ్లించి నూతన సాహిత్య నిర్మాణాన్ని చేసినవాడు నాచనసోమన. ఈ ఇద్దరి కవిత్వాలను, సాహిత్య పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన డా॥ పాకాల యశోదారెడ్డి ఆధునిక సాహిత్య నిర్మాణానికి సాహితీ బాటను నిర్మించింది. “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పరిశోధన చేసి ప్రాశ్చ్య, ఆధునిక రచయిత్రిగా, విమర్శకురాలుగా తెలుగు సాహితీ రంగంలో సుస్థిర స్థానాన్ని పొందింది.
తెలుగు సాహిత్య వికాసంలో ఎర్రన ప్రబంధ నిర్మాణానికి బలమైన భూమికను, పునాదిని నిర్మించి “ఋషిగా” కన్పిస్తే నాచనసోమన పాత్రల మూర్తి కల్పనా, సంభాషణా చాతుర్యంతో పద్యాల విరుపులతో, జాతీయాలు, సామెతలతో కవిత్వాన్ని వ్రాసి నవీనగుణసనాథుడైన “కవి”గా కన్పించాడు. ఈ ఇద్దరి కవిత్వగుణాలను తనలో ఆకళింపు చేసుకొని యశోదారెడ్డి “సాహితీ తపస్వి”గా తనదంటూ ప్రత్యేక ముద్రను సాహితీ ప్రస్థానంలో స్థిరీకరించింది. తాను చెప్పదలచుకుంది, వ్రాయదలచుకుందీ సూటిగా చెప్పి, వ్రాసి భావి పరిశోధకులకు కావల్సినంత సాహిత్య సరుకును అందించింది.
ఇంగ్లీష్లో “English Men of Letters” అనే పేరు మీద ఆ వాఙ్మయంలోని మహాకవుల, రచయితల జీవిత విశేషాలకు, రచనా సౌందర్య విశేషాలను విశదీకరించే విమర్శ గ్రంథ పరంపర ఒకటున్నది. దాని మాదిరిగానే ఆంధ్రవాఙ్మయంలో ప్రముఖ కవుల జీవిత రచనా విశేషాలను వెలువరించాలనే ఉద్దేశంతో ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నపుడు UGC వారి సహాయంతో “ఆంధ్రకవి నక్షత్రమాల” అనే పేరుతో 27 గ్రంథాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో రెండవది “ఎఱ్ఱాప్రెగడ” గ్రంథం. 1972, డిసెంబరులో ప్రచురితమైన ఈ గ్రంథం డా॥ పాకాల యశోదారెడ్డి వ్రాసింది. ఎఱ్ఱాప్రెగడ తాత, తండ్రుల వివరాలను మొదలుకొని, ఎర్రన వ్యక్తిత్వంతో పాటు, ఆయన రచనల సారాన్నంతా కూలంకషంగా యశోదారెడ్డి ఈ గ్రంథంలో వివరించింది.
తెలంగాణ ప్రాంత యాసతో ఈ ప్రాంత భాషా నిర్మాణానికి పునాది వేసిన యశోదారెడ్డి కథలు ఎంత ప్రాచుర్యం పొందినా, తెలంగాణా సమాజాన్ని కదిలించినా ముందుగా ఆమె విమర్శకురాలని నా అభిప్రాయం. ప్రాచీన కవిత్వాన్నంతా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టును సాధించింది. ఆధునిక సాహిత్యంలో అతి తక్కువ మంది మొదటి తరం విమర్శకుల్లో ప్రముఖ స్థానం యశోదారెడ్డిది. మూల గ్రంథాలనే అధ్యయనం చేసింది. అందుకుగాను సంస్కృతం, ప్రాకృతం, జర్మన్ వంటి భాషలను నేర్చుకొని మూలాల సారాంశాల కోసం వెతుకులాడింది. ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన కృషి, వెలువరించిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. మహిళలు చదువుకునే పరిస్థితులు సమాజంలోలేని కాలంలో చదువుకొని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అందరికీ జ్ఞానోదయం కలిగించింది.
ఇక “ఎఱ్ఱాప్రెగడ” కవిత్వానుశీలనలో ఎర్రనది ప్రబంధ లక్షణాలున్న సహజ కవిత్వమని యశోదారెడ్డి అభిప్రాయం. కావ్య ప్రయోజనాన్ని ఆశించి, కావ్య రచన చేయడం ఎర్రన కవిత్వ లక్షణాల్లో ప్రధానమైంది. అందుకే రామాయణంలోనూ, మహాభారత అరణ్యపర్వశేషభాగ రచనలోనూ, నృసింహపురాణంలోనూ, హరివంశంలోనూ కావ్య ప్రయోజన సాధనకోసం ప్రబంధరచనా ప్రావీణ్యం, చమత్కారంగా వ్రాసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలిబుచ్చారు.
ఎర్రాప్రగడ జీవించిన కాలాన్ని వీరేశలింగం పంతులు పరిశోధన ఆధారంగా, చరిత్ర గ్రంథాల ఆధారంగా క్రీ॥శ॥ 1280-85 మధ్యకాలంలో పుట్టి, 1355 వరకు జీవించివున్నాడని తెలిపారు. విష్ణు పారమ్య ప్రతిబోధకాలైన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషభాగం, నృసింహపురాణం ఎర్రన రచనలు. ఇవన్నీ విష్ణుభక్తి ప్రతిబోధకాలే. నేడు రామాయణం ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, పింగళి లక్ష్మీకాంతం, వేదాల తిరువేంగళాచారి, దివాకర్ల వేంకటావధాని, చాగంటి శేషయ్య, వేలూరి శివరామశాస్త్రి వేదాల తిరువేంగాళాచార్యులు, నోరి నరసింహశాస్త్రి పరిశోధనలను అనుసరించి, ఎర్రన మొదట రామాయణ హరివంశాలను తరువాత అరణ్య పర్వశేషం, నృసింహపురాణాలను వ్రాసినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడింది.
నోరి నరసింహశాస్త్రి “ఈశ్వర ప్రణిపాతములో గూడిన విజ్ఞాన యోగమునందభినివేశము కలిగిన సమాధిని నిమీలితేక్షణుండనై క్షణంబున్న” అని చెప్పుకున్న వాక్యం అప్రయత్నంగా వచ్చిన సత్యవాక్యమని కవి ఆధ్యాత్మికోన్నతిని పొగిడినాడు. దీన్ని బట్టి నృసింహపురాణమే మొదటిదని చెప్పినా యశోదారెడ్డి అందుకు అంగీకరించలేదు. ఆత్మోన్నతి కలిగిన మహాకవికి నృసింహపురాణం బాల్య రచన కాదనేది యశోదారెడ్డి అభిప్రాయం.
ఎర్రన నృసింహ పురాణంలో “ఎన్నికమై బ్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశేషోన్నయమంధ్ర భాష సుజనోచ్చ మెప్పగ నిర్వహించితి”నని చెప్పినాడు. చదులవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “ప్రతిభతో నారణ్యపర్వశేషము జెప్పె కవులకు జెవుల పండువులుగాగ” అని ఎర్రన అరణ్యపర్వశేషమును చెప్పినట్టు ధృవపరిచాడు. జక్కన విక్రమార్క చరిత్రలోనూ “ఈత్రయిదా బ్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి నరణ్య పర్వమున శేషము” అని శబ్దవైచిత్రితో ఎర్రన అరణ్య పర్వశేషం వ్రాసెనని చెప్పాడు. ఈ ఆధారాలను తీసుకొని యశోదారెడ్డి అరణ్య పర్వశేష భాగం ఎర్రనే వ్రాసినాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
భారతమూలరచనను పరిశీలించి నన్నయ కన్నా ఎక్కువగా మూలాన్ని అనుసరించాడన్నది. నన్నయ తిక్కనల కన్నా ఎర్రనే ఆంధ్రమహాభారతలక్ష్మిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడని, వారిద్దరూ సంపూర్ణ భారతాన్ని అందించలేదూ – ఎర్రన పూర్తి చేసిన తరువాతే భారత రచన ఫలవంతమైందని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
సంస్కృత భారతంలో శరదృతువు వర్ణన ఏడు (7) శ్లోకాల్లో ఉంటే, నన్నయ శ్లోక సారాంశాన్ని కలుపుకొని “(1) భూసతికిం దివంబునకు బొల్పె సగంగ శరత్సమాగమం…”, (2). శారద రాత్రు లుజ్వలలస్తతర తారక హార పంక్తులం…”, అనే రెండు పద్యాల్లో శరదృతువు యొక్క ప్రధాన లక్షణాలను చెప్పినాడు. ఈ పద్యాల తరువాతే ఉన్న “స్ఫురదరుణాంశు రాగ రుచి బొంపిరివోయి” పద్యాన్ని పరిశీలించినపుడు పూర్తిగా మూల భారత అనువాదంగానే కనిపించింది. దీంతో భారత రచనా విధాన భేదాన్ని గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు సత్యభామతో పాండవుల దగ్గరకు వచ్చిన సందర్భంలో మూలగ్రంథంలో ఉన్న ఋతు వర్ణనను పరిశీలించినపుడు మూల శ్లోకాలకు మెరుగులు దిద్దినట్లుగా కనబడింది. మూలగ్రంథంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రశంసించిన సందర్భంలో, ద్రౌపదిని ఆమె కుమారుల క్షేమాన్ని గురించి అడిగిన సందర్భంలోనూ మూలంలోని శ్లోకాలు భావ వైవిధ్యం లేక చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినట్లుగా ఉన్నదని, మూలశ్లోక భావాన్నంతటిని సమీకరించినట్లున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
సంస్కృత భారతంలోని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్లున్న రామాయణ కథాభాగం అనువదించిన విధానాన్ని పోల్చి చూసినపుడు మూలశ్లోక భావాన్ని తప్పక యతి సమర్థుడై వర్ణించాడు ఎర్రన. మూలభారతంలోని రావణ సంహారములో రాముడు బ్రహ్మాస్త్ర సంధానం చేసాడని అది రావణుని నీరుగావించిందని ఉంది. బ్రహ్మాస్త్ర సంధానం తరువాత దేవదావన కిన్నెరాదులు రావణున కాయురల్వావశేషమై ఉన్నదని తలచినట్లున్నదన్న విషయాన్ని వదిలిపెట్టాడు. అశోకవనంలో ఉన్న సీతతో రావణ సంవాదం తరువాత వాల్మీకీ రామాయణంలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉన్నది. మూలభారతంలో త్రిజటా స్వప్న వృత్తాంతం తరువాతే సీతారావణ సంవాదం ఉంది. ఎర్రన భారత కథనం ప్రకారమే అనువాదము చేసినాడు. 30 శ్లోకాల సంభాషణను 7 గద్య పద్యాలల్లోనే వర్ణించాడు ఎర్రన. అంటే భారతంలో రామాయణం ఇతివృత్త ప్రాధాన్యం కొంతవరకే అవసరమని గుర్తించాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
హరివంశంలోని “నా తమ్ముండు ఘనుండు అనే పద్యంలో రామకథమున్ జెప్పించి యత్యుత్తమ ఖ్యాతింబొందితి నింకనేను” అనే పద్యాల్లోనూ, కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలోని అనేక సందర్భాల్లో ఎర్రన పద్యాలను ప్రస్తావించడంలోనూ, గణపవరపు వేంకటకవి ప్రయోగ రత్నాకరమనే లక్షణ గ్రంథంలోనూ, చెదలువాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోనూ, ఆనందరంగకవి ఆనందరంగరాట్భందములోనూ, ఎర్రన రామాయణ ప్రస్తావనలున్నాయి. ఎర్రన కాలంలోనే భాస్కర రామాయణం వ్రాయబడింది. అయినా ఎర్రన వ్రాసివున్నట్లుగా అనేక ఆధారాలున్నందున మనోజ్ఞంగా రామాయణం కూడ వ్రాసే ఉంటాడని యశోదారెడ్డి బలంగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
మహాభారతం పంచమ వేదమైతే, హరివంశం వేదశిఖ అని యశోదారెడ్డి అభిప్రాయం. భారతంలో శ్రీ కృష్ణుని గురించి సూక్ష్మంగా, వ్యంగ్యంగా చెప్పబడితే, హరివంశంలో విపులంగా, వాచ్యంగా శ్రీహరి చరిత్ర వర్ణింపబడింది. మహాభారత యుద్ధం, క్షత్రియ సంహారంతో పాఠకుని మనస్సు బాధతో నిండి ఉంటుంది. పాఠకునిలో తొలగించే నిర్వేదవైరాగ్యాలను తొలగించడానికి హరివంశం వ్రాయబడింది. ప్రోలయ వేమారెడ్డి ఎర్రనను హరివంశరచన చేయమని కోరగా, ఇదివరకే నన్నయ తిక్కనలు భారత రచన చేసినారు. వారి త్రోవలో నడుచుటకు సంతోషంగా ఉంది. హరివంశం, భారతం రెండూ కూడ వ్యాసమహర్షి వ్రాసినవే అని హరివంశ పీఠికలో అనడంతో హరివంశ రచనాకాలం నాటికే భారత అరణ్యపర్వశేషం వ్రాయలేదని స్పష్టంగా తెలుస్తున్నదనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వ్యక్తపరిచింది.
సంస్కృతంలో హరివంశపర్వము, విష్ణుపర్వము, భవిష్యపర్వములుంటే, ఎర్రన మూల గ్రంథాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలుగా ఎర్రన విభజించి అనువదించాడు. అయితే ఇక్కడ నాచనసోముని ఉత్తర హరివంశాన్ని గురించి కొంత చెప్పుకోవాలి. నాచనసోమన ఉత్తర హరివంశాన్ని ఆరు ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. అయితే ఎర్రనను అనుకరించాడని చెప్పే వీలు లేదు. ఎర్రన హరివంశానికి పీఠిక ఉంటే, ఉత్తర హరివంశానికి లేదు. ఎర్రనకు విషయ ప్రధానమైన భావగతి మీద, వర్ణనల మీద, రస నిర్వహణ మీద ప్రధాన దృష్టి ఉంటే, సోమన తెలుగు కవితను పురాణ మార్గం నుండి మళ్లించాలని ప్రయత్నించాడు. సఫలీకృతుడైనాడు. ఎర్రన “ఋషిగా కావ్యం వ్రాస్తే సోమన “కవి”గానే కావ్యం వ్రాశాడు. ఎర్రన హరివంశ అనుకరణలు ఉత్తర హరివంశంలో కానరావు.
సంస్కృతంలోని పద్దెనిమిది పురాణాల్లో నృసింహపురాణం లేదు. ఎర్రన వ్రాసిన నృసింహపురాణం “పురాణం” కాదని స్పష్టమవుతున్నది. ఎర్రన తాత ఎఱపోతసూరి శ్రీమహోబలీశ నరసింహుని భక్తుడు. తన దైవంపై తీర్ధ మహాత్మ్యాన్ని అవతార వైశిష్ట్యాన్ని వ్రాయమని కోరగా ఎర్రన నృసింహపురాణం వ్రాశాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది. కథా ప్రారంభంలో “ఏను విన్నవంబు సేయంగల లక్ష్మీ నరసింహావతారంబను పురాణకథకు బ్రారంభం బెట్టిదనిన” అని పేర్కొన్నాడు. అసలీ గ్రంథం పేరు “లక్ష్మీ నరసింహావతార కథ”. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి నన్నునెన్నడు చూచినాడు వనగ” అని వ్రాసిన వాక్యాలను బట్టి “నృసింహపురాణం” అనే తెలుస్తున్నది. ఇది అనువాదం కాదు. క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పబడిన స్వతంత్ర కావ్యం. పురాణానికి ఉండవలసిన సర్గ ప్రతి సర్గాది పంచలక్షణాలు ఇందులో లేవు. కొంతవరకు బ్రహ్మాండ పురాణంతో సంబంధం ఉన్నది. విష్ణుపురాణంలో కనిపించే కథాసరళి తనకు అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకున్నాడు. భాగవతంలోని నృసింహావతార కథాభాగాన్ని కాక, వామన ప్రాదుర్భావానికి తరువాత చెప్పిన కథా భాగాన్ని స్వీకరించినాడు. నృసింహ పురాణంలో ఎర్రన హిరణ్యకశిపుని దిగ్విజయాన్ని వర్ణించిన విధానం హరివంశంలోని కాలనేమ్యాదుల దిగ్విజయ వర్ణనా విధానాన్ని తలపింపజేస్తున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
ఎర్రన శ్రీమద్భాగవత తృతీయాస్కంధంలోని వైకుంఠపురవర్ణనను నృసింహపురాణంలో అనువదించాడు. “నారాయణుని దివ్య నామ సంకీర్తనంబని శంబు జేయు మహాత్ములకును బద్మాక్షు శ్రీపాద పద్మంబులత్యంత భక్తిమై బూజించు ప్రాజ్ఞులకును” అన్ని రకాల సుఖాలను నారాయణుడు ప్రసాదిస్తాడని వైకుంఠపురవర్దనను జేస్తూ వివరిస్తాడు ఎర్రన. కొన్నిచోట్ల విష్ణుపురాణంలోని హిరణ్యకశిపు ప్రహ్లాదుల సంవాదాన్ని యధాతథంగా వర్ణించాడు.
ఎర్రన రచనలన్నింటిలోను జాతీయాలు, అలంకారాలు సహజ సుందరంగా సందర్భోచితంగా వ్రాశాడు. ఎర్రన నృసింహపురాణంలో భాగవత శ్లోకాలను సంక్షేపించినట్లు, విష్ణుపురాణ శ్లోకాలను యధాతథంగా అనువదించినట్ట్లు, కావ్యకళావైభవాన్ని ప్రదర్శించినాడు. కొన్నిచోట్ల హరివంశ పద్యాలను విపులీకరించాడు. మూలంలోని సూచన ఆధారంగా విస్తృతంగా వ్రాస్తూనే నాచనసోముని అనుకరించినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రన కాలం నాటికే అనువాదాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఎర్రన రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పొంది అనువాదం చేయడం సులభమైంది. దానికి తోడు రాజపోషణ వల్ల కూడ తెలుగు భాష స్థిరరూపాన్ని పొందింది. నన్నయ, తిక్కన అనువాదంలో మూలానికి విపులీకరణ, సంక్షేపము, విషయ పరిహరణం, వ్యత్యయం ఈ నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎర్రన అనువాదంలో యధామూలకథ ఉన్నాకూడ ఆయా సందర్భాలను బట్టి వివిధ కావ్యాల్లోని సారాంశాలను ఒక సందర్భోచిత కావ్యంగా మలచడం హరివంశ, నృసింహ పురాణంలో కనిపించిందదే. సందర్భోచితంగా కథాపాత్రల పేర్లను కూడ ఎర్రన మార్చినాడు. అనేక సందర్భాల్లో ఇతర గ్రంధాల నుండి సేకరించిన శ్లోకభావాలను తన గ్రంథంలో చేర్చుకోవడమనే విశేష రచనా విధానానికి శ్రీనాథునకు ఎర్రనయే మార్గదర్శకుడై యుండవచ్చని యశోదారెడ్డి అభిప్రాయం.
వ్యక్తి, వస్తు, క్షేత్రాది బాహ్యవర్జనతో తృప్తి పొందక మనోవృత్తులను, భావవైఖరులను విపులీకరించి పాఠకులకు ఆసక్తి కలిగించుటకు మధ్యలో సంభాషణలను పెట్టాడు. భారతారణ్య పర్వశేషంలో అనువాదంలోని “మూలాసరణమును, హరివంశంలో కొంత “స్వేచ్ఛను పాటించి ఇతర గ్రంధాలనుండి ఆయా కథావృత్తాంతాలను తీసుకున్నాడు. నృసింహపురాణంలో కథాక్రమమును పాటించక ఇష్టంవచ్చినట్లు కథాసూత్రంను తనే ఏర్పాటు చేసుకున్నాడు. సోమన రచన స్వతంత్ర రచన. అందుకే సోమన అనువాదం “మూలాతిరిక్తమైన స్వేచ్ఛానువాదమనీ” చెప్పవచ్చని తన పరిశోధన ద్వారా ధృవీకరించింది యశోదారెడ్డి. ఎర్రన అనువాదం అట్లకాదు. మూలాధారం లేక ఏ విషయాన్ని వ్రాయలేదు. “ఒక ఆలంబనమును పురస్కరించుకొని దానిని మెరుగులు దిద్ది తనది కావించుకొనుట ఎర్రన అనువాద విధానం”. ఇతని దృష్టి ఎపుడూ ఒకరిని అనుకరించి, అనుసరించి వాళ్ళను మించి రచన చేయగల దక్షత తనకు కలదని లోకానికి చాటడమే ఎర్రన అనువాద విధానమని యశోదారెడ్డి యొక్క స్థిరమైన అభిప్రాయం. అందుకే ఎర్రన అనువాద పద్ధతి “మూలాతిరిక్తమయ్యు మూలానుసారి” అని చెప్పవచ్చును.
సకల భాషాకవిత్వవేది, బహుపురాణ కథాసకల సంవేదియైన ఇతనిని లోకం కవిత్రయం అన్నందున ఎర్రన అదృష్టవంతుడని అంటుంది యశోదారెడ్డి. రాజపోషణ వల్ల, లిఖిత గ్రంథప్రాచుర్యం వల్ల తెలుగు భాష విస్తరించింది. దానికి ఇంపులు సొంపులు కూర్చినవాడు ఎర్రన. “Personality is what is the Unique in Man” అని పాశ్చాత్య సాహిత్యవేత్తలన్నారు. అదే వ్యక్తిని వ్యక్తి నుండి వేరు చేసి ప్రత్యేకించేది. ఇది ఎర్రనలో సహజ సుందరంగా కనిపించింది.
కథాసంవిధానములో విచిత్ర పద ప్రయోగ వైచిత్య్రములో, శబ్దార్ధాల మేలుకలయికలో నాచనసోమన అనుకరించాడు. నన్నయ, తిక్కన, నాచనసోమనలను ఎర్రన ఆదర్శంగా తీసుకుంటే ఆ తరువాతి శ్రీనాథుని మొదలు కవులంతా ఎర్రననే అనుకరించారు. శ్రీనాథుడు “పరిఢ వింతం బ్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాట” అని ఎర్రనను అతిగా సంభావించినాడు. ఎర్రన స్వభావోక్తి అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. సూక్తి వైచిత్రాన్ని ప్రదర్శించాడు.
ఎర్రన సకలకళారహస్యాలను తెలిసిన కవి మాత్రమే కాదు. సంగీత సాహిత్య పోషకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండడం వల్ల, ఆయా సందర్భాన్ని బట్టి తాను చూసిన ఆ కళల్లో ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఎర్రన కావ్యాల్లో గానకళా ప్రసంగాలు కన్పిస్తాయి. ఉదాహరణకు నృసింహపురాణంలో అప్సరసల విభ్రమవ్యాపారాలను చెప్పు సందర్భం. హరివంశంలో వాద్యసంగీతము, నాట్యం గురించి చెప్పాడు. ఎర్రన ఎక్కువగా “విజ్ఞానము” అనే శబ్దాన్ని వాడినాడు. విజ్ఞానమంటే పరతత్త్వవిద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. వీటిని ఉపయోగించే కవిత్వం వ్రాశాడు. గోపికల విరహం, పరమ పవిత్రమైన భక్తి పరిణమింపజేసి మధుర భక్తి విధానానికి దారితీసినవాడు ఎర్రనయే అని యశోదారెడ్డి అభిప్రాయపడింది. ఎర్రనకు “యోగం” అంటే అభిమానం ఎక్కువ. శృంగారిని కూడా మహాయోగిగా అభివర్ణించిన యోగి ఎర్రన. నమ్మకములు, ఆచారాలు కూడా ఎర్రన కావ్యాల్లో ఉన్నాయి. శివములు, పూనికలు, ఆనాటి సహజ సాంఘిక పరిస్థితులను తెలుపుచున్నాయి. నేటి Democracy కన్న ఉత్తమలక్షణం నాటి రాజులకుందని, ప్రజారంజనమే ప్రభువు ప్రథమ ధర్మమన్నట్లు నాటి రాజు చూసినారని ఎర్రన కవిత్వంలో రాజనీతికి సంబంధించిన పద్యాలు కూడా ఉన్నాయని యశోదారెడ్డి నిరూపించినారు.
ఎర్రన ఉత్పల, చంపకమాలలే కాక, మత్తకోకిల, క్రౌంచపదము, మందాక్రాంత, మాలిని, స్రగృణి, తోదకము, కంద తదితర వృతాలను ఉపయోగించాడని యశోదారెడ్డి అభిప్రాయం. ల-ళ, శ-స, ద-ధ, ఖండాఖండ బిందు ప్రాసలు ఎక్కువగా వాడినాడు. టకార-డకారల ప్రయోగం, బహువచనంపై బహువచన ప్రయోగాలు, ఇకార సంధులు, ప్రత్యయాలు, సందర్భోచిత పద ప్రయోగాలు, చమత్కారాలు ఎర్రన కవిత్వంలో ఉన్నాయని శబ్ధరత్నాకరములోనూ ఈ పద ప్రయోగాలకు అర్ధాలు లేవని యశోదారెడ్డి పరిశోధనలో తేలింది.
పద్నాలుగవ శతాబ్దంలో ఉన్న కవుల కవిత్వమే ఆ తరువాతి కవుల కవిత్వానికి ఆదర్శప్రాయమైంది. ప్రాచీన సమ్మతమైన వేదవ్యాసముని ప్రతిపాదితమైన, హరిహరభేద తత్వమును తిక్కన, ఎర్రన, నాచనసోమన ప్రభోదించగా, పోతన ప్రధాన తత్త్వంగా స్వీకరించి భాగవతంలో పరిపూర్ణత సాధించాడు.
అనువాద సందర్భాల్లో నన్నయ, తిక్కన, నాచనసోమనాధుల కన్న కొంత భిన్నంగా, విశిష్టమైన ఎర్రన అనువాద విధానంతో ప్రభావితుడైనవాడు శ్రీనాథుడు. ఎర్రన సూక్తివైచిత్రియే శ్రీనాథునికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. నన్నయ ధారాశుద్ధి, తిక్కన తెలుగు తీయదనము, తన సహజ పరిశీలనాదృష్టితో మేళవించి ఒక కొత్త వికాసంతో పద్యాలను అల్లినవాడు ఎర్రన అని స్థిరమైన అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలువరించింది.
ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజనాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వ జ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు. అలాంటి వారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమిరత్నం యజ్ఞ కృష్ణమదాసు,
యజ్ఞకృష్ణదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లా మారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేతపని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారాలన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తిమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువబడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాళీ పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.
విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంధాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడం పట్ల అభివృద్ధి పెరిగింది. గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు. ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జన సంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.
వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధు పత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సుభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞకృష్ణను దాసు పరిచయమయ్యాడు.
బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమ దాసులో గల పరణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు. అక్కడి నుండి ఆయనలో చెప్పుకోతగినంత సాహిత్య పరిణతి కలిగింది.
యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.
వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞకృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. పశువుల కాపరై పద్మశాలిగపుట్టి
కట్టెలేరుకొనియు గడుపు నన్ను
అవధానములు చేయు నట్టిసభనజూచి
కడుపేద నైనను కరుణజూపి
సంస్కృతముద్దూయు ఛందస్సులను నేర్పి
నట్టిబెల్లంకొండ నాచార్య సోదర
ద్వయముకంజలి తనువు వీడువరకు
యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను
తే. దేశ బంధుపత్రికనాకు దిశనుజు
పత్రికసభల అధ్యకునై పాల్గొనుమని
బెల్లంకొండసోదరులైన వారె నిలను
నొందినఘనులనేమని నుడువువాడ
యజ్ఞ కృష్ణ దాసు కథలు:
యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతి శర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దుకున్నప్పటికీ కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.
యాజ్ఞకృష్ణదాసు అర్ధశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమదాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథ వైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.
ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్ధమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాధాలహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమలమాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనే వివరం పేర్కొంది.
ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈ కథ తెలియజేస్తుంది.
ఇంద్రమాలిక కథలో మంజీరకా దేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకా దేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్య ఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.
కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలో నూక మంజీరకా దేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆ జామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంత వలె శంకువులేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.
పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకుల వలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కామోన్మాదిరాజు గా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.
ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్య వచ్చును. ఇంద్రమాలిక నిద్రించువారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.
ఒకనాటి మాఘస్నాన ప్రారంభంలో రాజు గర్వానికి అడ్డుకట్ట వేసి సందర్భం ఏర్పడుతుంది. రాజు పల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళ తోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైన మలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు. అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వతశ్రేణిలోకి తీసుకొని వెళ్తారు. రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకోవచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్య వలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజు రాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాట లేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈ కథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.
విమర్శ:
కృష్ణ దాసు “భారతీయ సాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామ సంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యానికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవన పరిధిలోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపర లోక
సార్ధకత ఏ విధంగా పరిరవిల్లిందో అదే విధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారత భాగవతాలను రచించిన వారి జన్మ ధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్యనికులు చెప్పిన కవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్య సాధన అవసరమని తెలిపాడు. “దర్శనా ద్వ ర్ణనాచ్చాడ రూడాలోకే కవి శ్రుతి. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణరస హృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.
ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించినవాడు ఉత్తమ కవి కాజాలడు అన్నాడు. “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలించాడు.
“సశబ్దో నసన్యా యోన సావిద్యా నసా కళా
తే యన్న కావ్యాంగ మతో భారో మహా కమే”
సావిద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞకృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయ తలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తి లోపం వలన ప్రతిభ నశించి పోతుందని చెప్పటానికి
” అవ్యుత్పత్తి కృతో దోషః శక్తా సంప్రియతే కవేః
జ స్త్వశక్తి కృతస్థన్య ఝడిత్యేవా వభాసత “
అని తెలిపాడు. ప్రతిభ గుణ సంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞ కృష్ణమదాసు కవితా విమర్శనం చేశాడు.
ఈ విధంగా కృష్ణమదాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథా రచయితగా, విమర్శకుడిగా, పత్రిక రంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరం ప్రతాపరెడ్డితో మెప్పు పొందిన మేటి రచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.
యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమే కాదు. ఆయన ఆర్య సమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర మహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరం తుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞకృష్ణమదాసు వంటివారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.
1. జీడిగింజ-ప్రాముఖ్యం
గ్రామీణుల జీవితంలో ప్రాధాన్యత కలిగిన అనేక వస్తువుల్లో జీడిగింజ ఒకటి. జీడిగింజ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది దాని ‘నలుపురంగు‘. అందుకే అది ‘నల్లజీడి‘గా ప్రసిద్ధి పొందింది. వంటల్లో ఉపయోగించే దాన్ని తెల్లజీడి, కొండజీడి, కాజు అని అంటారు. అన్నిపళ్లలో (ఫ్రూట్స్)లో గింజ ఉంటుంది. కాని జీడిగింజ పండుకు వెలుపల ఉంటుంది. ఈ విధంగా దీనికి రంగులోనే కాకుండా స్వరూపంలోనూ ఓ వైశిష్ట్యం ఉంది. నల్లజీడిగింజ ఆంగ్ల నామం మార్కింగ్ నట్, ట్రేసింగ్ నట్.
2. భారతీయ భాషల్లో నల్లజీడిగింజ పేర్లు
కన్నడం : అగ్నిముఖి, భల్లాతక, చేర, గెర్కాయి, కేరుబీజ.
తమిళం : కెల్కొట్టాయి, అరుత్కర్మ్, కెరాన్ కొట్టాయి, ఎరిమముఖి, పెంగొట్టాయి, సెరావొట్టాయి.
తెలుగు : జీడి, తుమ్మెద మామిడి, నల్ల జీడి, భల్లాతక, గుడోవా,
మరాఠీ : బిబ్బ, బిభ, బిబో, బిబ్బా,
మళయాళం : అలక్కుచేరు, కేరు, కెర్కోట్ట, షెగ్గొట్ట, తెల్కొట్ట.
హిందీ: ఖిలావా, బేలతక్, భేలా,
3. వివిధ గ్రంథాల్లో జీడి పేర్లు, గుణాలు
3.1 జీడిపేర్లు: సర్వమూలికా గుణరత్నాకరమ్ (పుట. 104) లో నల్లజీడి (భల్లాతక)కి ఉన్న పర్యాయపదాలు, దాని రుచులు, లక్షణాలు, మొదలైనవాటిని సంస్కృత శ్లోకాల్లో ఇచ్చారు. వాటి చీకను కింద తెలపడమైంది. భల్లాతకః, నభోభల్లీ, రవృక్షః, అగ్ని వక్రకః, అరుష్కర, రూక్ష్మ, తపనః, అగ్నిముఖీ, ధను
3.2. జీడిగుణాలు: జీడిపండు వగరుగా, మధురంగా ఉంటుంది. కొంచెం కాక (వేడి) చేస్తుంది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. వాతం, శ్లేష్మం, ఉదరరోగం, అనాహం, కుష్టువు, అర్మరోగం, గ్రహణి, గుల్మం, జ్వరం, శ్విత, అగ్నిమాంద్యం, క్రిమిజ్వరాలను పోగొడుతుంది, కఫరోగం, బడలిక, వాపు, కడుపుబ్బరం, మలబద్ధకం, శూల, ఆధ్యానం, కృమలను పోగొట్టుతుంది. దాని మజ్జ అతితాపం, పిత్తం, వాతం, అరుచిని హరిస్తుంది. అంతేకాక శీఘ్రంగా పిత్తరోగాన్ని నిర్మూలిస్తుంది. ఈ అంశాలను ‘వస్తుగుణ దీపిక’లో కూడా చెప్పారు.
4. జానపదులు – జ్ఞానపదులు – వినూత్న ప్రయోగశీలురు
చెట్లకు, తాటిచెట్లకు చీమలు పట్టుకుండా జీడి పూస్తారు, కాళ్ళ పగుళ్ళకు, మడమ శూలకు, గుర్రం మూతులకు కూడా జీడిని పెడతారు. అంతేకాక జీడిని నూనెలో కాగబెట్టి, తలకు పెట్టుకుంటారు. వీటితోపాటు గంపలు, గుల్లలు, చేటలు, జల్లెడలకు, కుండలకు కూడా పూస్తారు. అయితే ఈ విషయాలను వైద్య గ్రంథాల్లో ఎక్కడా తెలపలేదు. జానపదులు వైద్య గ్రంథాలను చదవకపోయినా జీడిగింజను నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా మనుషులకు, పశువులకు వాడుకుంటున్నారు. గింజలనుండి చమురు తీసి, చమురు తీయకుండా ఆచారవ్యహారాల్లో, అటు జానపద వైద్యంలో, ఇటు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ‘జానపదులు జ్ఞానపదులనీ, ప్రాయోగశీలురనీ, వినూత్న శాస్త్రీయ ఆవిష్కరణల కర్తలనీ, వారు జీడిగింజలను ఉపయోగించుకునే తీరును బట్టి చెప్పవచ్చు. నిరూపించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం-
4.1. ఆచారవ్యవహారాల్లో, శుభకార్యాల్లో జీడిగింజు: 4.1.1 హిందువుల వివాహ సమయంలో కుమ్మరింటి నుండి ‘అరివేణి కుండలు’ను ఇంటికి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే. కొందరి ఇండ్లల్లో వారి ఆనవాయితీ ప్రకారం ఆ కుండలను ఇంటిలో దించిన తర్వాత, వాటిలో ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో నైవేద్యం (అన్నం) సమర్పిస్తారు. ఎరుపుకోసం కుంకుమను కానీ, సున్నం, పసుపులు మిశ్రవాన్నిగానీ వాడ్తారు. అలాగే నలుపుకు బొగ్గును దంచి, ఆ పొడినిగానీ, మసినిగానీ వాడుతారు. ఆ నైవేద్యంపై నుండి, అరివేణులపై నుండి ‘సూదికి గుచ్చిన జీడిగింజ’ను మూడుసార్లు తిప్పి, ఆ నైవేద్యం పైన పెడ్తారు.
4,1,2. సంక్రాంతి సమయంలో పిల్లల తలపై పోసే భోగిపండ్లలో జీడి(గింజ) పండ్లను కూడా కలుపుతారు. ఇల్లు అనగానే ఇంటికి ఓ భౌతికస్వరూపం, ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు (గృహిణి), పిల్లలు, పెద్దలు, గొడ్డుగోదలు (పశుసంపద), వాటి పిల్లాజెల్లా మొదలైనవి గుర్తుకు వస్తాయి. వీటికి జీడిగింజకు ఉన్న సంబంధం కూడా తెలుసుకుందాం. 4.2. గృహిణులకు నిత్యావసర (ఔపయోగిక) వస్తువు: 1, పప్పులకు, పొడులకు క్రిమిసంహారక పదార్థం (మందు), 2. వస్తువుల మన్నికకు, దృఢత్వానికి ఉపయోగపడే రసాయనం, 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసు.
4.2.1. క్రిమిసంహారక పదార్థం: దీర్ఘకాలం నిలవ ఉండే పప్పులు, మిరపపొడి, దనియాలపొడి, పసుపు పొడి, మొదలయిన వాటిలో జీడిగింజలను వేసిపెట్టడంవల్ల పురుగు పట్టదు. గింజ ఘాటువల్ల ఆ పొడుల్లో తెల్లపురుగు వంటి క్రిమికీటకాదులు చేరవు, పొడులు చాలాకాలం నిలువ ఉంటాయి.
4.2.2. వస్తువులకు మన్నిక: జీడినూనెను (చమురును, రసాన్ని, తైలాన్ని) చేటలు, జల్లెడలు, గుల్లలు, కుండలు, మొదలైన వాటికి దట్టగా పట్టించడం వల్ల అవి సుదీర్ఘకాలం మన్నికతో ఉంటాయి. అవి జీడినూనెతో గట్టిపడతాయి, కిందపడ్డా విరిగిపోవు. వాటి పేడు (చెక్క బడ్డ)కు కూడా పురుగు పట్టదు.
మామిడికాయ వంటి నిలవపచ్చళ్ళకు ‘జీడిపోత పోసిన కుండలు’ను ఉపయోగిస్తారు. అవి నేటి జాడీలలాగ పనిచేస్తాయి. పూర్వకాలంలో జీడిపోత పోసిన (పూత పూసిన కుండల్లోనే పచ్చడి పెట్టుకొన్నారు. అందులోనే నిలవ చేసుకున్నారు. అందుకోసం జీడగింజలతో ‘బట్టీ’ పెట్టి, వాటినుండి చమురును తీశారు. దాన్ని దట్టంగా కుండలలోపల పట్టించారు. అది ఆరిన తర్వాత అందులో పచ్చడిని నింపారు. జీడిగింజ చమురువల్ల కుండగోడలు గట్టిపడతాయి, అంతేకాక, కుండలను ఉప్పుకారం పచ్చడికుండ ‘మట్టి’ పచ్చడిలోకి రాలదు.
4. 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసుః గృహవైద్యంలో జీడిగింజను మించిన మరో వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని అంటువ్యాధులు, దగ్గులు, చర్మవ్యాధులు, నొప్పులు, చుండ్రు, మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
ఇంట్లో శిశువులు, పిల్లలు అకారణంగా గుక్కపట్టి (నిర్విరామంగా) ఏడుస్తుంటారు. వారి ‘ఏద్పు’కు దృష్టిదోషం (దిష్టి) కారణం అనుకుంటారు. మాటలు 204 వచ్చిన పిల్లలైతే, కడుపు పట్టుకొని, కడుపు నొస్తుందని ఏడుస్తారు. వారి కడుపు మీద వేలుతో కొట్టి చూస్తారు. కడుపు ఉబ్బరంగా ఉండి, ‘టక్ టక్’ అని శబ్దం వస్తే, ‘సరదృష్టి – దిష్టి’ కారణం అనుకుంటారు. అప్పుడు డబ్బడం లేదా ఒక ఇనుప చువ్వకు జీడిగింజను గుచ్చి, దానికి అగ్గిని అంటిస్తారు. దానిని ఎడమచేతిలో పట్టుకొని, పిల్లల మీదినుండి తల చుట్టూ వలయాకారంగా తిప్పి, ఆ తర్వాత ముఖం మీది నుండి కిందికి ‘దిగతుడుస్తారు. ఆ జీడిగింజ చిటపటలాడుతూ, పల్చటి చమురు (రసం) కారిస్తే దృష్టిదోషం (దిష్టి/ జిష్టి) తగిలిందనీ, చిటపటలాడకుండా చిక్కటి రసాన్ని కారిస్తే, దృష్టిదోషం తగల్లేదని భావస్తారు. రోగం పోవాలని భావించినపుడు, దేనినైనా తిప్పి తీయదల్చుకున్నప్పుడు, వ్యక్తులకు పైనుండి కిందికి దిగతుడవాలి. అంటే చేతిని పైనుంచి కిందికి తేవాలి. అలా గాకుండా చేతిని కిందినుండి పైకి ఎగతుడిస్తే, రోగమైనా, జిష్టి అయినా ఎక్కువవుతుందని
కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు చిన్నా పెద్దా భేదం లేకుండా ఈ జీడిగింజ చమురును పాదం మధ్యలో (అరికాలులో పెట్టుకుంటారు. పిల్లలకు, పెద్దలకు రకరకాల దగ్గులు వచ్చినప్పుడు, జీడిగింజను కచ్చె పిచ్చె మెత్తగా కాకుండా, కసపిస గా దంచి, పాలల్లో వేసి, మరిగించి, వడబోసి, బాధితులకు తాగిస్తారు.
స్త్రీలు నిరంతరం నీళ్ళల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చేతిగోళ్ల పక్కన, కాలివేళ్ళ మధ్య దురద, నొప్పి కలుగుతుంది. ఆ చిగురును సన్న సూదిమొనతో కొంచెం అటుఇటు అని (కెలగించి), ఆ సందుల్లో జీడిగింజ నూనె (రసం) పూయాలి. దానివల్ల నొప్పి, దురద (ఇన్ఫెక్షన్) తగ్గుతుంది. అంతేగాకుండా, కాలి మడమలు పగిలి, నెర్రెలు (వెడల్పుగా చీలడం) ఏర్పడతాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉ ంటుంది. అలాంటప్పుడు ఆ నెర్రెలకు జీడిపూస్తే, నొప్పులు తగ్గుతాయి, నెర్రెలు మానతాయి.
మడమనొప్పి లేచినా, మడమ వెనకాల ‘గుర్రం మూతులు’ వచ్చి, నొప్పి కలిగినా, జీడిగింజతో కాల్చాలి. గింజకు ఒకవైపు చిన్నరంధ్రం పెట్టి, మరోవైపు డబ్బడం గుచ్చి, దీపానికి (సెగకు) కాలిస్తే, అందులో నుండి జీడినూనె బయటకు వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు అలాగే కాలుకు పెట్టి నొక్కాలి. కొందరికి ఇది పడక వుండు కూడా అవుతుంది.ముల్లు గుచ్చుకొన్నచోట కూడా ఇలా చేస్తే, నొప్పితగ్గుతుంది.
పూర్వం తలకు మరిగించిన మంచినూనె వాడారు. ఆ నూనె మరుగుతున్నప్పుడు అందులో కొంచెం ఆముదం, సువాసనకోసం కచ్చూరాలు, తుంగగడ్డలు వేసేవారు. ఆ నూనెలోనే నల్లజీడిగింజలను కూడా వేసేవారు. అందులో వేయగానే అవి చిట్లి (పగిలి), అందులోని చమురు నూనెలోకి వచ్చేది, చల్లారిన తర్వాత దాన్ని వడగట్టి, తలకు రాసుకునేవారు.
4.4. దిష్టి తగలకుండా పశువులకు, వాహనాలకు జీడిగింజల దండలు: గ్రామాల్లో ఆవులు, బర్రెలు ఈనగానే (ప్రసవించగానే), వాటికి పెయ్యి కడిగి (స్నానం చేయించి), ‘జీడిగింజల దండ’ కడ్తారు. ఈనిన కొత్తలో దూడ చిన్నగా ఉండి, పాలు తక్కువగా తాగడం వల్ల పొదుగు బరువుగా ఉంటుంది. దూడ కూడా గంతులు వేస్తూ అందంగా, ఆనందదంగా ఎగురుతుంటుంది. వాటిని కొందరు ఈర్ష్యాసూయలతో చూస్తారని, వారి చూపువల్ల ఆ తల్లీపిల్లలకు దిష్టి తగుల్తందని భావిస్తారు. దిష్టి తగిలితే పాలు తగ్గుతాయి. పాడిపశువులు ఎండిపోకుండా ఉండాలని, నల్లదారానికి కుచ్చిన జీడిగింజలదండలను వాటి కాలుకుగానీ, మెడకుగానీ, రెండింటికిగానీ కడ్తారు. జీడిగింజల దండలు అంగడి (సంత) జరిగిన రోజు కొనుక్కోవచ్చు. ఆ దండల్లో జీడిగింజలతోపాటు గవ్వలు, పగడాలు (ఎర్ర పూసలు) కూడా ఉంటాయి. కొందరు ఆ దండలో నిమ్మకాయలు కూడా కలిపి కడ్తారు. అంతేగాకుండా వాటికి ఏమైనా జరిగినా, పాలు ఇవ్వక పోయినా, మేత మేయకపోయినా, పాలు ఇగిరిపోతున్నా, పెరుగు బంకలాగా సాగుతున్నా, వాటికి దిష్టి తగిలిందని, జీడిగింజులతోపాటు, మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వ్యానులు, లారీలు, మొదలైన వాహనాలు, ఎద్దుల బిళ్లు, వ్యాపార సంబంధ ఇతర వాహనాలకు కూడా దృష్టి తగలకుండా జీడిగింజల దండలను కడతారు.
4.5. జీడిగింజ (చమురు / నూనె) చెట్లు: తాటి చెట్లను ‘భూలోక కల్పవృక్షాలు’ అంటారు, తాటి ‘కల్లు’ను తాగడానికి గండుచీమలు బారు (వరసలు) కడ్తాయి, కల్లుగీత కార్మికుడు రోజుకు మూడుసార్లు కల్లు తేవడానికి చెట్టు ఎక్కవలసి ఉంటుంది. చెట్టుపైకి వెళ్తుంటే అవి కుడుతుంటాయి. వాటి బాధకు తాళలేక కిందికి దునికితే, కార్మికుని ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది, గాయాలవుతాయి. ఈ కారణంగా వాటి బాధ పోవడానికి, ఆ చెట్టుపైకి ఎక్కకుండా ఉండడానికి తాటి చెట్టు చుట్టూ జీడిచమురుతో వెడల్పుగా ‘జీడికట్టు’ పెడ్తారు. అంతేగాకుండా తాటికల్లుపై ‘నరదృష్టి’ పడకూడదని, కల్లు ఉత్పత్తి తగ్గ కూడదని, చెట్టు ఎండిపోకూడదని చెట్టుమొదలుకు జీడిగింజనూనెతో ‘జీడికట్టు’ను వలయాకారంగా పెడ్తారు. ఈ జీడికట్టునుండి వచ్చే ఘాటువల్ల గండుచీమలు కూడా కల్లుతాగడానికి చెట్టుపైకి ఎక్కవు.
4.6. బట్టలకు గుర్తులు పెట్టడానికి రజకులు వాడతారు: జీడిగింజను ‘మార్కింగ్ నట్, దోభీ నటి’ అని కూడా అంటారు. దీనికి ఈ పేరు వారివల్లనే వచ్చింది. అందరికన్నా రజకులు తెలివైనవారు అనే గుర్తింపు కూడా జీడిగింజ వల్లనే వచ్చిందంటే ఆశ్చర్యంలేదు.
| బట్టలు ఏ ఇంటివో తెలుసుకోవడానికి చుక్కలతో ఒక గుర్తును ఏర్పాటుచేసుకుంటారు. ఆ గుర్తులను ఆయా ఇంటివారి బట్టలపైన నల్ల జీడిగింజ చమురుతో పెడ్తారు. బట్టలు చిరిగిపోతాయి, కాని జీడిగింజ చమురు గుర్తులు పోవు.
జీడిచమురు పైన తెలంగాణలో ఒక ఉయ్యాలపాట కూడా ఉంది. ‘ఒక మరదలు (ఆడపడుచు) తన అన్నభార్య (వదిన) వద్ద పట్టుచీరను అడుక్కొని, కట్టుకొని, ‘బతుకమ్మ’ ఆడడానికి వెళ్తుంది. ఒక ఆకతాయి అబ్బాయి ఆమె పట్టు చీరపైన చిత్తన గొయ్య (రంగులు చిమ్మేగొట్టం)తో ‘జీడి చమురు’ను కొడ్తాడు (చిల్లిస్తాడు). ఆ అమ్మాయి ఆ చీరతో ఇంటికి వెళ్తే, వదిన కొత్తచీర అని భయపడి, రజకుని వద్దకు వెళ్తుంది. దాన్ని ఉతికి, మచ్చలు పోగొట్టి ఇవ్వమని అడుగుతుంది. ఆ రజకుడు ఇదే సమయమని, ఆమె భయాన్ని తన స్వార్థానికి వాడుకుంటాడు. ‘నువ్వు నన్ను పెండ్లి చేసుకుంటే, తికిస్తాను’ అంటాడు. అందుకు ఆమె ఒప్పు కుంటుంది, పెండ్లి చేసుకుంటుంది. అయితే రజకుడు ఆ చీరను ఎంత ఉతికినా మచ్చలు పోవు. ఆమె పుట్టింటికి పోదు, ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోని అయొడిన్ లాగా మంచికి, చెడుకు పైన చెప్పుకున్న విధంగా గ్రామాల్లో జీడిగింజ ఒక ఔషధంగా ఉపయోగపడుతున్నది. ఆయుర్వేద గ్రంథాల్లో ఆయుర్వృద్ధి కోసం, కుష్టు, ఆర్మరోగాలు పోగొట్టడానికి, పుండ్లమచ్చలు పోగొట్టడానికి, రోగనిరోధకశక్తిని మొదలైనవాటిని పెంచుకోవడానికి నల్లజీడిగింజలను వాడారని తెలుస్తున్నది. ఈ నల్లజీడిగింజతో జానపదులు చేసే వైద్యం ఎంతవరకు శాస్త్రీయమైందో తెలుసుకోవడానికి కూడా ఆయుర్వేద వైద్యగ్రంథాలను సంప్రదిస్తే బాగుంటుంది. 5. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో నల్లజీడి
ఆయుర్వేద గ్రంథాలు: 1. అగ్నివేశమహర్షి రచించిన చరక సంహిత, 2.సుశ్రుత సంహిత, 3. ధన్వంతరి, 4. బసవరాజీయమ్, 5. భైషజ్యరత్నాకరమ్ 6. సర్వమూలికా గుణరత్నాకరమ్, 7. వస్తుగుణదీపిక, మొదలైనవి బాగా ప్రసిద్ధి పొందాయి.
‘కృతయుగంలో చరక సంహిత, త్రేతాయుగంలో రసరత్నాకరమ్, ద్వాపరయుగంలో సిద్ధ-ద్యాభువు, కలియుగంలో బసవరాజీయమ్ శ్రేష్ఠమైన గ్రంథాలని బసవరాజీయం (పుట. 3)లో చెప్పారు. అలాగే ధన్వంతరి ఆయుర్వేద గ్రంథంలో కూడా చరక సంహిత, తర్వాతనే సుశ్రుత సంహిత అని చెప్పారు. వస్తు గుణ దీపిక (పుట 35) లో జీడిగింజ పేర్లను, గుణాలను కూడా చెప్పారు. కాబట్టి ముందుగా చరకసంహితలో జీడిగింజ గురించి ఏం చెప్పారో చూద్దాం. చరక సంహిత మూడు అంశాలు 1. భల్లాతక క్షీరరసాయన యోగం (పుట 35), 2. భల్లాతక క్షౌద్ర రసాయనం (పుట 37), 3. భల్లాతక తైలప్రయోగం (పులు 37) గురించి చెప్పారు.
5.1. చరక సంహిత-భల్లాతక క్షీర రసాయన యోగం: వాతావరణ వైపరీత్యాల వల్ల, వృక్షసామాన్యమైన రోగాలవల్ల చెడిపోని, రసంతో బాగానిండినవి, మంచి పరిమాణం కలవి, నేరేడుపండ్లలాగ నల్లని కాంతి కలిగిన నల్లజీడిగింజలను జ్యేష్ఠమాసంలోనైనా, ఆషాఢమాసంలోనైనా తెచ్చుకోవాలి. వాటిని యవలరాశిలోనైనా, ఉద్దుల (ఎనుముల) రాశిలోనైనా నాల్గునెలలు పెట్టాలి. ఆ తర్వాత ఆ గింజలను వెలికి దీయాలి. ఆరోగ్యవంతుడైనవ్యక్తి వాటిని ఆరోహణావరోహణాక్రమంలో 30 రోజులు వాడాలి. పైన చెప్పుకున్న జీడిగింజల నుండి తొలుత పదింటిని నలగ దంచాలి. దానికి ఎనిమిది భాగాలు నీళ్లు పోసి, ఎనిదవ వంతు మిగిలేటట్లు కాచాలి. ఆ రసాన్ని వడగట్టాలి. అందులో ఆవుపాలు కలపాలి. వాటిని తాగే ముందు నోటికి ‘నెయ్యి’ని పూసుకోవాలి. పాలతో కూడిన ఆ జీడిగింజల రసాన్ని మార్గశిర మాసంలోనైనా, పుష్యమాసంలోనైనా తాగాలి. ఇది మొదటి దినం సేవించే పద్ధతి.
రెండవదినం నుండి మిగిలిన (29) రోజులు రోజుకు ఒక్కొక్కటి చొప్పున (10-1) పెంచుకుంటూ పోవాలి. అలా రోజుకు ఒక్కొక్క జీడిగింజ వంతున పది కన్న ఎక్కువగ చేర్చుకుంటూ పైన చెప్పిన విధంగా ఎనిమిదిపాళ్లు నీళ్లు పోసి, ఎనిమిదవ భాగం మిగుల కాచి, వడగట్టి, అందులో పాలు కలుపుకొని తాగాలి. ఈ విధంగా ఒక్కొక్క గింజవంతున హెచ్చించుకుంటూ, ముప్ఫైగింజలు అయ్యే వరకు, పైన చెప్పిన విధంగానే తాగాలి. ఆ గింజల సంఖ్య ‘ముప్పై’ అయిపోయిన మరుసటి రోజునుండి. ఒక్కొక్క గింజ వంతున తగ్గించుకుంటూ, ప్రతి రోజు పైన చెప్పిన విధంగానే తాగాలి. అలా వాడిన మొదటినుండి ఉపయోగించినవన్నీ కలిపి, ‘ఒక వేయి’ సంఖ్య అయ్యేవరకు మాత్రమే తాగాలి. వేయిసంఖ్య కాగానే పూర్తిగా మానాలి.
పై రసాయనం వాడినప్పుడు, ప్రతిదినం ఔషధం జీర్ణమై, ఆకలి కల్గినపుడు ‘రాజనాల’ అన్నమైనా లేదా 60 రోజుల్లో పండే ‘సంబావుల’ అన్నమైనా నేతిని, పాలను కలిపి తినాలి. ఈ రసాయనాన్ని ఉపయోగించడంవల్ల యౌవనం స్థిరంగా ఉంటుంది. నూరు సంవత్సరాలకాలం సుఖంగా జీవించి ఉంటాడు. భల్లాతక (నల్లజీడి) రసాన్ని పాలల్లో (క్షీరంలో) కలిపి వాడడం వల్ల దీన్ని ‘భల్లాతక క్షీరరసాయనము’అని అంటారు. 5.2. భల్లాతక క్షౌద్ర రసాయనం: ఇంతకుముందు (నల్లజీడి గింజల గురించి చెప్పుకున్న లక్షణాలు కలిగిన జీడిగింజలను ముక్కలుముక్కలు చేయాలి. ఆ ముక్కలను ‘సన్నని రంధ్రాలు కలిగిన ఒక కుండ’లో నిండుగ పోయాలి.
భూమిలో గుంటను తవ్వి, నూనె లేదా నెయ్యిలో చాలాకాలం మాగిన (పీల్చుకొన్న) కుండను కంఠం వరకు పాతాలి. పైన చెప్పుకున్న రంధ్రాలున్న పాత్రను దానిపై ఇమిడి ఉండునట్లు బోర్లించాలి. అవి రెండూ కలిపిన చోటు వద్ద (సందులను) నల్లని బంకమట్టిని పూయాలి. దానిపైన ‘ఏడు పిడకలు’ చేత మూటుబెట్టి, ఉడికించాలి. వేడికి గింజలు పగిలి, గింజల్లోని చమురు (తైలం) కింది కుండలోకి కారుతుంది. ఆ గింజల చమురుకు ఎనిమిది భాగాలు తేనెను, రెండింతలు నేయిని కలిపి, ప్రతిదినం ఉదయం పూట, జఠరాగ్నిని అనుసరించి, వాడుకోవాలి. ఈ రసాయనాన్ని వాడడంవల్ల, నూరు సంవత్సరాల వరకు ముసలితనం దరిచేరదు (పుట 37) క్షాద్రం అంటే తేనె. 5.3. భల్లాతక తైల ప్రయోగం: పైన చెప్పిన ‘ధి’ ప్రకారం సిద్ధమైన భల్లాతక స్వరసాన్నే ‘భల్లాతక తైలం’ అంటారు. భల్లాతక తైలాన్ని, పాలును ఒక పాత్రప్రమాణం (ఆడకం) సిద్ధం చేసుకొని, అందులో సమభాగం ఆవుపాలను పోసి, అక్ష(కర) ప్రమాణం అతి మధుర కల్కాన్ని చేర్చి, స్నేహక ప్రకారం పక్వం చేయాలి. పైన చెప్పిన పాలను, అతిమధుర కల్కాన్ని మాటిమాటికి చేరుస్తూ, వంద మార్లు చేయాలి. ఈ భల్లాతక తైలాన్ని, ఇంతకు ముందు చెప్పిన భల్లాతక స్వరసంలాగా ఎనిమిదింతలు తేనెను, నాల్గవపాలు నేతిని చేర్చి, తగిన పరిమాణంలో సేవించాలి (పుట. 37).
భల్లాతక యోగ విశేషాలు పది. అవి- 1, భల్లాతక ఘృతం (జీడి, నేయి), 2. భల్లాతక క్షీరం (జీడిపాలు), 3. భల్లాతక కేంద్రము (జీడి, తేనె), 4. గుడ భల్లాతకము (జీడి, బెల్లం), 5, భల్లాతక యూషము (జీడి,గంజి), 6, భల్లాతక తైలము (జీడి తైలం), 7. భల్లాతక ఫలము, (జీడి, మాంసం- జీడిగింజలను చేర్చి సంస్కరింపదగిన మాంసం),
8.భల్లాతక సక్తువు (జీడి, సత్తుపిండి జీడిగింజలను చేర్చి, సంస్కరింపబగిని సత్తుపిండి). 9. భల్లాతక లవణము (జీడి, లవణం), 10, భల్లాతకతర్పణము (వేపుడు బియ్యపు పిండిని మూకుటిలో వెచ్చ జేయుచు, అందులో నీరు పోసి, ఉడికించిన ముద్ద) పైన చెప్పిన వాటితో వేరువేరుగా సంస్కారం చేయబడినదే భల్లాతకమృతం.
ఆయుర్వేదంలో మిక్కిలి ప్రసిద్ధిపొందిన రెండవ గ్రంథం- సుబ్రత సంహిత, అందులో మూడు విషయాలు- 1. భల్లాతక తైలం కృష్ణకర్మకు లేపనం (పుట 29, 30), 2.భల్లాతక కల్పం (పుట,122), 3. భల్లాతక ధానాలు (పుట 123,124) గురించి చెప్పారు. 5.4. భల్లాతక తైలం (లేపనం) కృష్ణకర్మకు లేపనం: వ్రణం (పుండు), మచ్చలు ఏర్పడినపుడు ‘కృష్ణకర్మ’ను చేయాలి. అందుకు ‘భల్లాతక తైల లేపనం’ చేయాలి.
నల్లజీడిగింజలను ముందుగా ఏడురోజులు గోమూత్రంలో తడిపి, ఎండబెట్టాలి. తరువాత పాలలో నానవేయాలి. బాగుగా నానిన తర్వాత వాటిని తీసి, మధ్యకు రెండు ముక్కలుగా కత్తిరించాలి. వాటి కింది భాగంలో చిన్న రంధ్రాలున్న ఇనుప పాత్రలో పోయాలి. వేరొకమట్టి పాత్రకు లోపల నేతిపూసి ఆరబెట్టాలి. దానిని భూమిలో మెడ వరకు పాతిపెట్టాలి, దాని మూతిమీద జీడిగింజలు పోసిన ఇనుపపాత్ర అడుగుమోపి, నిలబెట్టి, దాని మూతిమీద మూకుడు బోర్లించి, మెత్తాలి. ఆ ఇనుపకుండ చుట్టు పిడకలు పేర్చి (పెట్టి) పుటం వేయాలి. అప్పుడు ఆ జీడిగింజలు చమురు అడుగున ఉన్న మట్టి పాత్రలోనికి దిగుతుంది. దానిని మెల్లెగ తీయాలి. అందులో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, మొదలైన వాటి డెక్కల గిట్టలను కాల్చి, ఆ మసిని మెత్తగా నూరి కలిపి, తెల్లగా ఉండే కురుపు మచ్చలపైన పూయాలి. దానివల్ల ఆ మచ్చలు నల్లబడి శరీరం సవర్ణమగును, (“కృష్ణకర్మ’కు భల్లాతక తైలం లేపనం, చికిత్సాస్థానం, ప్రథమ అధ్యాయం, పుట 29, 30 6. జానపదులు ప్రాయోగిక జ్ఞానం: పైన చెప్పుకున్న జీడిగింజ జానపదులు నిత్యజీవితంలో ఒక భాగమై, సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఉంది. ఇలా వారికి ‘ఔపయోగిక వస్తువు’గా, జీర్ణాశయవ్యాధులు మొదలైన వాటికి ‘వైద్య దినుసు”గా అనేక విధాలుగా పనికి వస్తున్నది. ఇలాంటి నల్లజీడి గురించి జానపదులు, వైద్యశాస్త్ర గ్రంథాలు ఏమన్నాయో కూడా తెలుసుకున్నాం.
జానపదుల పూర్తిగా ప్రాయోగిక వైద్యం, ప్రాయోగిక జ్ఞానం, వైద్య గ్రంథాలలో చెప్పని అనేక రోగాలకు కూడా ఈ జీడిగింజను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. జీడిగింజలనుండి తైలం తీసే పద్ధతిని జానపదులను చూసి, వైద్యులు నేర్చుకున్నారా?
వైద్యులను చూసి, జానపదులు నేర్చుకున్నారా? అనే సంధిగ్ధావస్థ ఎవరికైనా కలుగుతుంది. ఇప్పటికీ కల్లుగీత కార్మికులు బట్టీ పెట్టి, జీడిగింజలనుండి చమురును తీస్తున్నారు. ఏది ఏమైనా జానపదుల జీవితంలో ‘జీడి’కి ప్రాశస్త్య స్థానమున్న దనేది సుస్పష్టం.
ఆధార గ్రంథాలు:
1 . అగ్నివేశమహర్షికృత చరకసంహిత, పండిత నుదురుపాటి విశ్వనాథ శాస్త్రి (వ్యాఖ్యానం), రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి, ప్రథమముద్రణ, 2010.
2. పండిత మల్లంపల్లి భైరవమూర్తి పంతులు, ధన్వంతరి ఆయుర్వేద గ్రంథము. ఎ.బి.ఎస్. పబ్లిషరు, 4వ ముద్రణ. సంవత్సరం
3. బసవరాజు. బసవరాజీయము. ఎ.బి. ఎఎస్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 1998.
4. రామచంద్రరావు, పువ్వాడ, భైషజ్య రత్నాకరం, రోహిణి, పబ్లికేషన్స్, 2016.
5. సుబ్బారాయుడు, యర్రా, వస్తుగుణ దీపిక, ఎ.బి, ఎఎస్ పబ్లిషర్పు, 11వ ముద్రణ. 2010.
6. సుశ్రుతుడు. సుశ్రుత సంహిత, ద్వితీయ ముద్రణ, 2014.
7. సూర్యనారాయణరావు, పువ్వాడ సర్వమూలికా గుణరత్నాకరం, ముద్రణ మోహన్ పబ్లికేషన్స్ 2016
“ఓం ఐం.. హ్రీం…క్లీం…! అంటూ ఒకొక్క నామాన్ని ‘కుంకుమ’తో అమ్మవారి పాద – చరణాలవిందములకు ఎంతో భక్తితో ప్రతి నామం చివరలో ‘నమః’ అని పలుకుతూ కుంకుమను స్వీకరించమని అమ్మవారికి సమర్పిస్తాము.
అమ్మవారి పూజలో ఎక్కువగా ‘కుంకుమ’ పూజ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్ళ తరబడి ఆచరణలో ఉంది. ఎప్పుడు, ఎలా, ఎవరినుంచి ఈ ఆచారం వచ్చిందో ఇంతవరకూ తెలియదు.
అచ్చమైన స్వచ్ఛమైన కుంకుమ పొడిని పసుపునుంచి తయారు చేస్తారు. ప్యూర్ పసుపు తీసుకొని దానిలో
నిమ్మరసం,కొంత కర్పూరం వేసి కలిపితే కుంకుమ తయారయి, పూజకు సిద్ధమయ్యింది. ఒకసారి కుంకుమ తయారైన తర్వాత పసుపు తన మునుపటి సువాసన కోల్పోతుంది. ఈ కుంకుమలో ఓ కొత్త సుగంధం వాసన తయారై దాని సువాసన విస్తరిస్తాయి. ప్యూర్ కుంకుమ చేతికి అంటుకోదు. బాగా తడి ఆరి పొడి పొడిగా ఉంటుంది. దైవజ్ఞ శక్తి ఈ కుంకుమలో కలిసి విస్తరిస్తుంది.
పూజలో అర్చనలోనూ, నుదట పై కుంకుమ కూడా ఆకర్షింపజేస్తుంది. కుంకుమనుంచి చైతన్యం చెలరేగి అన్ని చోట్ల విస్తరిస్తుంది. అదే కుంకుమ మహత్యం.
అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చన అమ్మని ఆకర్శించి భక్తులను రక్షిస్తుంది. అర్చనలలో అష్టార్చన 108 నామాలు పఠిస్తూ కుంకుమతో అర్చన చేయడం జరగుతుంది. సహస్రార్చనలో 1008 వివిధ నామాలతో కుంకుమతో అర్చన చేస్తూ అమ్మను కొలుస్తారు. ఈ ఒకొక్క నామం ఉచ్చరించేప్పుడు అది హృదయారవిందంనుంచి వికసించి భక్తి పూర్వకంగా నామంతో సహ కుంకుమను అమ్మ పాదాలకు సమర్పించడం జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తిలోను ఒక ఆధ్యాత్మికమైన భావన కలిగించి శక్తిని చేకూరుస్తుంది.
‘ఓం’- ఓం అనే అలలు ప్రపంచమంతా విస్తరించి, సృష్టి, స్థితి, లయ లో చేరి ఒకటై కలిసిపోతుంది. ఒక సారి ఉచ్ఛరించినప్పుడు వ్యక్తిలో ఈ మూడు అంశాలలో, ఏదైనా ఒకటి ప్రయోగంలో ఉంటుంది. ‘ఐం’- మహా సరస్వతిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ.
‘హ్రీం’- మహా లక్ష్మిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ. ”క్లీ’- మహా కాళిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ.
ఇలా నామాలతో కుంకుమా చేయడం వల్ల వ్యక్తికి శాంతి, రక్షణ, విజయం, మంచి ఆరోగ్యం కలిగి, సంపన్నులు కావడం జరుగుతుంది. అమ్మవారికి చాలా ప్రియమైనది. కుంకుమ-అర్చన. అందుకే అర్చనతో అమ్మవారిని ఆకర్శించ గల అద్భుత శక్తి ఒక ‘కుంకుమ’కే గలదు..
బ్రుకుటి మధ్యన కుంకుమ, తిలకధారణతో బొట్టు పెట్టుకోవడమన్నది స్త్రీలకు అలంకరణే కాదు, అది సౌభాగ్యచిహ్నం కుంకుమ పెట్టుకోకుండా పూజ చేయకూడదని చెబుతారు పెద్దలు. సుదుటన తిలకం బొట్టు బిళ్ళ ధరించినప్పటికీ పాపిల్లో కుంకుమను ధరించాలి వివాహితులు పురుషులు కూడా పూజకు ముందు కుంకుమ, చందనం, విభూమి, సింధూరంతో బొట్టు పెట్టుకుంటారు. నుదుటన ధరించే బొట్టు శుభప్రదంగా భావించబడుతోంది. పురాణ గ్రంథాలలో నిదుట తిలక ధారణ పవిత్రత గురించి తెలుపబడింది. లక్ష్మీదేవి ఐదు ప్రాంతాలలో ఉంటుందట. ముత్తయిదువ పాపిట భాగంలో పెట్టుకునే కుంకుమ వద్ద, గోమాత వెనుక భాగంలో, ఏనుగు యొక్క శిరస్సు భాగంలో, తామర పూలలో, బిల్వ దళాలలో లక్ష్మి ఉంటుంది.
మతపరంగా వారు నుదుటన పెట్టుకునే తిలక ధారణలో వ్యత్యాసాలు ఉంటాయి. శైవులు నుదుటన విభూదితో మూడు రేఖలను అడ్డంగా గీసుకుంటారు. ఆ రేఖల మధ్యన కుంకుమను పెట్టుకుంటారు. వైష్ణవులు నిలువుగా మూడు నామాలను పెట్టుకుంటారు. శాక్తేయులు ఎర్రటి కుంకుమతో పెద్ద బొట్టును చేయుటన ధరిస్తారు. తమిళులు నుదుట మీద పెట్టుకున్న బొడ్డుపైన విభూదితో చిన్న అవరేఖను పెట్టుకుంటారు. మన సాంప్రదాయంలో కుంకునుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్త్రీలు నుదుటన తిలకాన్ని కానీ, బొట్టుబిళ్ళను గానీ పెట్టుకున్నప్పటికీ పాపిల్లో కుంకుమను పెట్టుకోవడం శుభసూచకంగానూ, సౌభాగ్య చిహ్నంగానూ భావిస్తారు.నుదుటన బొట్టు లేకపోతే అశుభ చిహ్నంగా తలుస్తారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, సహస్ర కుంకు మార్చన చేయడం శుభప్రదం, వారికి అష్టఐశ్వర్యాలు, సుఖసౌఖ్యాలు, ఆనందం లభిస్తాయి.
నుదుటన కుంకుమను ధరించినప్పుడు మూలా ధారంలో ప్రారంభమైన సుషుమ్న నాడి శిరస్సులోని సహస్రాన చక్రాన్ని కలుస్తుంది. దాని పక్కనే ఉన్న ఇడ, పింగళ అనే నాడులతో, కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞా చక్రానికి చేరుకుని, ఆ తర్వాత నుదుటని కలసిపోతుంది. నుదుట మీద ఉన్న ఆ స్థానాన్ని త్రికూటమని అంటారు. ఆ స్థానం నుంచి యోగశక్తి మొదలవుతుంది. అక్కడే జ్ఞాననేత్రం ఉంటుందనీ, దానికి శక్తి కలిగించటానికి, నుదుటన కుంకుమను ధరించాలనీ ఆధ్యాత్మికులు చెబుతున్నారు.
బొట్టు పెట్టుకునే ఆచారం, శిశువు పుట్టి పురిటిస్నానం అయిన వెంటనే చేసే వారసాలు, నామకరణపు వేడుకలతోనే ఆరంభమవుతుంది. నల్లటి బొట్టును శిశువు నుదుటన పెడతారు. ఆ నల్ల బొట్టును ఇంట్లోన పెద్దవారే తయారు చేస్తారు. పాపాయికి దిష్టి తగలకుండా ఉండాలని ఆ విధంగా నల్లబొట్టును పెడతారు పెద్దలు. స్త్రీలే కాదు, పురుషులు కూడా కుంకుమ బొట్టును పెట్టుకునే, వారు పూర్వపు రోజుల్లో స్త్రీలు నుదుటి మధ్యన కుంకు మను పెట్టుకునేవారు. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు రాజులు తమ భర్తలకు వీర తిలకాన్ని దిద్ది పంపించే వారని తెలుస్తోంది. ఈ విధంగా బొట్టుకు మన హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి.
నుదుటన కుంకుమ ధారణ వల్ల అజ్ఞాచక్రం స్పందించి, అక్కడున్న నరాలు ఉత్తేజితమవుతాయి. నొసలు మధ్యన పెట్టుకునే చందనం బొట్టు శరీరానికి చల్లదనాన్ని సమకూరుస్తుంది. అంతేకాదు, సిరిసంపదలను కలిగిస్తుంది. ఆంజనేయుని సింధూరాన్ని నొసల మధ్య పెట్టుకుంటే గాలి, ధూళి, భూతప్రేత పిశాచాలు దరి చేరవు. వారు ధైర్యవంతులవుతారు. శత్రుపీడనాన్ని తొలగించుకోగలుగుతారు. ఆయురారోగ్యాలు పెంపొందు తాయి. రామాయణంలో తిలకధారణ ప్రస్తావన ఉంది సీతారామలక్ష్మణుల వనవాస సమయంలో సీతాదేవి, శ్రీరామునితో కలసి విహరిస్తున్నప్పుడు స్వేదం వల్ల కుంకుమ చెదిరిపోయి చెమట నీటితో బొట్టు కరిగి పోయింది. అప్పుడు శ్రీరాముడు మణి శిలతో తిలకాన్ని తయారు చేసి సీతాదేవి నుదుటన తీర్చి దిద్దాడు. అశోకవనంలో ఉన్న సీత హనుమంతునితో ఆ విషయాన్ని చెప్పి హనును తనను కలసిన విషయాన్ని ఆ విషయం ద్వారా తెలుసుకుంటాడని, అప్పుడు శ్రీరాముడు విషయాన్ని గుర్తు చేసుకుంటాడని తెలియచేసింది. వివాహిత అయిన స్త్రీ నుదుటన బొట్టు లేకుండా ఉండ కూడదు. దాన్ని అశుభంగా భావిస్తారు.
ముత్తయిదువుకు కుంకుమ సౌభాగ్య చిహ్నం. పాపిట్లో పెట్టుకునే కుంకుమ భర్తకు రక్షణగా పని చేస్తుందని చెబుతారు. పేరంటానికి పిలవటానికి స్త్రీలకు నుదుటన కుంకమను పెట్టి ఆహ్వానిస్తారు. పేరంటానికి వచ్చిన స్త్రీలకు కుంకుమ పెట్టి గంధం, పసుపు రాసి సత్కరిస్తారు. ఇవన్నీ స్త్రీలకు సౌభాగ్య చిహ్నాలు ఇంటికి ఎవరైనా స్త్రీలు ముఖ్యంగా వివాహితులు వస్తే వారు వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో మరువక కుంకుమతో బొట్టు పెట్టి పంపిస్తారు.స్త్రీలు చేసే నోములలో పసుపు కుంకుమ, కేదారేశ్వరీ గౌరీవ్రతం, ఉదయ కుంకుమ అనే నోములు ఉన్నాయి. ఎవరింటికైనా వెళ్ళి పేరంటానికి బొట్టు పెట్టి పిలవాలను కుంటే ఆ సమయంలో ఇంట్లో స్త్రీలు లేకపోతే గడపకు కుంకుమను.
కడపకు పెట్టే ఆచారం మనలో ఉంది. అంటే గడప లక్ష్మీదేవి అన్న భావన. కుంకుమ లక్ష్మీ ప్రధానమైనది. కుంకుమ ధారణ సౌభాగ్యవంతం. హిందూ సాంప్రదాయంలో కుంకుమ ధారణకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత,విలువ ఉన్నాయి
తిలకం తయారీకి తేనె, హోమయజ్ఞ భస్మాలు, ఆవు పేడ , ఆవుపాద ధూళి, పెరుగు, నెయ్యి, గోరో జనం, కస్తూరి, గోపీచందనం, బిల్వా, రావి, తులసి, భస్మం, ఎర్రచందనం, తెల్ల చందనం, అగరు, అంజీర, పసుపు, కుంకుమ, నల్లపసుపు, ఆష్టగంధం, తదితర పదార్ధా లను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి రక్షగా కవచం వంటివి.
అమ్మవారికి ప్రియమైన కుంకుమ ఆర్చనలోని మహాత్మ్యం, అమ్మవారిని ఆకర్షించగల అద్భుతమైన శక్తి ఒక్క కుంకుమకే ఉంది. పసుపును తీసికొని నిమ్మరసం కొంత, కొంత కర్పూరం కలిపితే స్వచ్ఛమైన కుంకుమ.తయారవుతుంది. ఇది అమ్మవారికి చాలా ప్రియమైనది. మహర్షులు మనకందించిన, సంస్కావంతమైన, స్త్రీలకు ముత్తైదువతనానకి చిహన్నమైన ఈ సనాతన కుంకుమబొట్టు సంప్రదాయాన్ని నేటి యువతులు గ్రహించి.. స్త్రీల ముఖారవిందానికి, ఆభరణం అయిన కుంకుమబొట్టులోని విలువలను భావితరానకి తెలిపే ప్రయత్నం చేయాలి.
