మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

నాంధో గృహిణులు

by చంద్రకళ దీకొండ March 7, 2023
written by చంద్రకళ దీకొండ

ప్రబంధాల ముఖ్య లక్షణం అష్టాదశ వర్ణనలు.అందులో ఋతు వర్ణన ప్రముఖమైనది.శ్రీకృష్ణ దేవరాయలవారు తమ ఆముక్తమాల్యద లో ప్రకృతిని అనేక కోణాలలో దర్శించి, మనకి దర్శింపజేసారు.

పూర్వకాలం మనిషి జీవితం ప్రకృతితో మమేకమైనది.భారతీయ జీవన విధానంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.తినే తిండి,వేసుకునే బట్ట,చేసే పనులు,జరుపుకునే పండుగలు, ఇలా వ్యక్తిగత జీవితం మొదలుకొని సాంఘిక వ్యవహారాల వరకూ అన్నీ ప్రకృతిపై ఆధారపడినవే.వివిధ ఋతువర్ణనలలో రాయల వారు వాటిని మన కళ్ళకు కట్టిస్తారు.అలాంటి ఒక సజీవదృశ్యం ఈ పద్యం:

సీ. ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బె
నేనింటిలో బూరి యిడి విసరక
రాజదు రాజిన రవులుకోల్ వాసాల
గాని కల్గదు మఱి దాన గలిగె
నేని కూడగుట మందైన
బెన్పొగ సుఖ
భుక్తి సేకూర దా భుక్తి కిడిన
బ్రాగ్భో క్తలకె తీఱు బహుజనాన్నము దీఱ
నారుల కొదవు బునఃప్రయత్న

తే. మాజ్యపటముఖ్య లయ మొన్న రాలయాంగ
దారు లయ మెన్నరంతిక కారజనిక
పచన నాంధోగృహిణి రామి బడక మరుడు
వెడవెడనే యార్ప నొగిలి రజ్జడిని గృహులు

వాక్యాలు ఒక పాదంలోంచి ఇంకో పాదంలోకి ఇలా చొచ్చుకుపోయే సీసాన్ని గునుగు సీసంఅంటారు.వాటిని విడగొట్టుకున్నాక కొంత అర్థం అవడం మొదలుపెడుతుంది.కానీ,
రవులుకోల్,మందు,ప్రాగ్భోక్తలు-మొదలైన పదాలు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంటాయి.
వీటన్నింటినీ దాటుకువెళ్లినా ఎత్తుగీతి కొరుకుడు పడడం చాలా కష్టం.అందులో ఉన్నవన్నీ చాలా వరకూ తెలుగు పదాలే. అయినా ఇది నారికేళపాకం! దానికి కారణం రాయల వారికే ప్రత్యేకమైన పదాల పోహళింపు, వాక్య నిర్మాణం.బహుశా ఇది సంస్కృత వాక్య నిర్మాణ ప్రభావంతో అదే తరహాలో తెలుగు వాక్యాలను చేర్చడం వలన కలిగిన అన్వయ క్లిష్టత.
సంజీవని అనే పేర వేదం వెంకటరాయశాస్త్రి గారు,సౌందర్య లహరి* అనే పేర తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆముక్తమాల్యదకు వ్యాఖ్యానాలు రచించారు.

వానాకాలంలో ఇల్లాళ్లకు పొద్దుననుండీ రాత్రిదాకా వంటపనితోనే సరిపోయేది.వారి అవస్థ ఏమిటో వివరంగా చెప్పారీ పద్యంలో.ఇల్లిల్లు తిరిగితే కానీ కాస్తంత నిప్పు దొరకదు.ఒకవేళ దొరికినా, ఆ నిప్పుని మంటగా రాజెయ్యాలంటే గడ్డి పెట్టి విసరాలి.అదెక్కడినుండి వస్తుంది?ఇంటికప్పునుంచి (పూరి గుడిసెలే కాబట్టి).దానివల్ల కొద్దిగా నిప్పు రాజుకుంటుంది కానీ,అది వంటంతా అయ్యేంత రగులుకోవాలి.(రవులుకొను అనే క్రియకి నామరూపం రవులుకోల్) అంటే గడ్డి సరిపోదు.కట్టెలు కావాలి.అవి కూడా పాపం ఇంటి వాసాలనుంచే. అలా వాసాలు పీకి వంట చేయడం మొదలెట్టినా, కూడు పూర్తిగా(అన్నం,కూరలు వగైరా) అవ్వడం చాలా కష్టం(మందు అంటే దుర్లభం అని అర్థం).
ఒకవేళ ఏదో అయింది తిందామన్నా,తినడం కుదరదు.సరే, అలాగే తినడానికి వడ్డించినా,చాలామందికని వండిన అన్నం(బహుజనాన్నము),
మొదటి పంక్తిలో కూర్చున్నవారికే(ప్రాక్ భోక్తలకే) అయిపోతుంది.దానితో,
ఆడవాళ్లకి(నారులకు) వంట ప్రయత్నం మళ్లీ మొదలౌతుంది! అంతిక అంటే పొయ్యి. పొయ్యి మళ్లీ రాజెయ్యాలి.ఆజ్యపటము అంటే నేతిలో తడిపిన వస్త్రం.ఆలయ అంగదారులు అంటే ఇంటిలో భాగమైన కట్టెలు(వాసాలు).అలా ఆరజనిక అంటే రాత్రయినా కూడా, వంట(పచన) చేస్తూ, చేస్తూ,ఆ గృహిణులు వంటపనులతో తీరిక లేక, నాంధస్(అన్నము లేని) గృహిణులుగా మిగిలిపోతారు.

ఇలా పద్యమంతా వానాకాలంలో గృహిణుల ఇక్కట్లను వర్ణించి,కొసమెరుపుగా ఆఖరి పాదంలో ఒక అనుకోని ముక్తాయింపునిచ్చారు.
పద్యానికి అసలు బిగింపు దాని ముగింపులో వేసారన్నమాట !

ఒకపక్క వంట పనులతో, తిండి కూడా తినకుండా గృహిణులు సతమతమవుతుంటే,
మరోపక్క భార్య ఇంకా పడకగదిలోకి రాదేమని మగరాయుళ్లు మన్మథ బాధతో వేదన పడుతుంటారట!

ఇలాంటి ఊహించని ముగింపు పద్యానికి పరిపుష్టతను చేకూర్చింది.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కా ..కీచకులు

by Butam Mutyalu March 7, 2023
written by Butam Mutyalu

రైయ్యిమంటు బుల్లెట్ వేగంతో వచ్చి బైక్ ప్రక్కగా ఆపి ముందుకు రెండడుగులు కదలి కుడిచేతి పైకెత్తి సెల్యూట్ చేస్తూ ” గుడ్ మార్నింగ్ సార్ ” అంటూ పలకరించిండు
” ఆ.. రావయ్యా హెడ్డు రా నీకోసమే చూస్తున్నా , నువ్వు వచ్చావు సరే మీ సార్ ఎక్కడా ” అంటూ పలకరించిండు సర్కిల్ ఇన్స్పెక్టర్.
” సార్ అతను వచ్చాడనుకొన్నా, వస్తు వున్నాలే సార్ మీ కాల్ వచ్చిందంటే సాకు చూపి తప్పించుకుంటామా సార్ మీ వల్లనే మేము ఈ స్థాయిలో వున్నది మీరు ఓ మెట్టు ఎక్కితే మీ వెనకాల మేము ఓ మెట్టు ఎక్కుతూ వచ్చాం సార్. ” వినయం నటిస్తూ పలికిండు హెడ్ కానిస్టేబుల్ అబ్బయ.
సరిగ్గా అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ నాగులు వచ్చి వాలిండు సెల్యూట్ కొడుతూ నంగాడుతున్న డు.
” ఇంత లేటా ” అడిగిండు.
” సార్ దారిలో ట్రాఫిక్ జామ్ అందుకే కాస్తా ఆలస్యం అయ్యింది.” సావధానంగా పలికిండు.
” అరే ఇదిగో అబ్బన్న టీ చెప్పు తాగుతూ మాట్లాడుదాం. “
” అలాగే సార్, చిటికెలో” అంటూ ” అరే మల్లేశన్న స్పెషల్ చాయ్ పట్కరా సార్ కూ”
” తెస్తున్న సార్ రెండు నిమిషాలు ఆగండి గరం చేస్తున్నా” అన్నడు
” ఏంది నాగన్నా ఆ ఒక్కటి ఎంతవరకు వచ్చింది ఏమన్నా కదలిక వుందా “
” సార్ నేను మన అబ్బనా అదే పనిలో మునిగి వున్నం సార్ క్షణం తీరిక లేకుండా “
” చూడు మనం ఎన్నో కేసులు చూసిన అనుభవం మనది కానీ ఆ ఒక్కటి కొరకరాని కొయ్యగా తయారయ్యింది నన్ను పైనుంచి ఒకటే దొబ్బుల పెడుతున్నరు జల్ది పినిషింగ్ టచ్ ఇస్తే పోలా, ఇంకెందుకు ఆలస్యం అవుతుంది.” ఇంతలేశి కండ్లు పెద్దవి చేసి వారివైపు చూస్తూ పలికిండు.
” సార్ ఆ వొక్కడు చానా డిస్ట్రబ్ చేస్తున్నడు, కాలికేస్తే ఏలుకు, ఎలుకేస్తే కాలుకు , చుట్టుకుంటుంది. శతవిధాల ప్రయత్నించినా బురద మట్ట లెక్కా జారిపోతుండు , మీరు చెప్పినట్టు ఆ ఒక్కదాన్ని వదిలించు కావాలని పడరాని పాట్లు పడుతున్నాము. ఇంతవరకు వాని ఉసు లేదు అనుపు లేదు. అంతా వొట్టిదై పోయింది “
” మనం ఎన్ని చూడలేదు అది నీకు తెలుసు నాకూ తెలుసు ఏమంటావ్ అబ్బులు, ఇది మన ముగ్గురికే కాదు ఎంటైర్ మన కె ఇదో సవాల్ ! మనకెన్ని తెల్వవు!వాటి లింకుల మతలబు ఏమిటో నీకు నాకే కాదు జనమందరికీ తెలిసిందే. మనమే తిమ్మిని బమ్మిని చేసి కొన్నింటికి షో చూపుతున్నము. కానీ పై నుంచి ఇంత వత్తిడి వస్తదనుకొలేదు. మీరే ఏదో ఆలోచించండి. ” తిన్నగా పలికిండు అతను
” ఎవడన్నా బకరా వుండేమో చూడు”
మనం సృష్టించింది చిన్నది కాదు దీనికీ బకరా సరిపోదు”
” అవును సార్ పులి చారాలాంటి పిల్లి కావాలి, వున్నదానికి వాత పెట్టాలి , ఎందరికి ఎన్ని పెట్టినం, ఈ కుర్చీ పవరు తెలియనిది కాదు. ఏదో అశ్కలు బుష్కలు చేయాలి మనం చెప్పిందే వేదం. కాదంటోడు ఎవడు , మనం ఎంత అంటే అంతా నిజమా కాదా”
” అవుననుకొండి మీ అంత దైర్యం మాకెక్కడిది సార్”
” నీ అసొంటి వానికి ఈ కొలువెందుకు రాజీనామా చేసి వేరేది చూసుకో. “
” అంత మాట ఎందుకు సార్ ఏదో ఒకటి చేద్దాం”
” చేద్దాం, చూద్దాం అంటే కుదురదు. బరి లోకి దిగినమంటే దెబ్బకు టా అన్నట్టు వుండాలే”
” సార్ ముందు చాయ్ తాగండి చల్లారి పోతుంది. ” అన్నడు అబ్బన్నా.
” ముగ్గురు కూడిండ్రు ఎవనిళ్లు ముంచుతారో పో ” చాయ్ బండి అతను వారివైపు వారగా చూస్తు లోలోన సనిగిండు.
” ఒకడుండు సార్ వానికి ఎనకా ముందు ఎవడు లేడు, వాడిని మనం ఏమయినా చెయ్యొచ్చు, ఎంతయినా ఆడుకోవచ్చు. వాడిని మభ్య పెట్టీ ఏదోలా ముగ్గులోకి దింపి ఇరికిస్తే సరి. మన పని కతం అయిపొద్ది” ఉషారుగా పలికిండు అబ్బన్నా*….
…
” మీరు దీనికి శ్రీకారం చుట్టి చెక్ పెట్టండి జింక పిల్ల ఎక్కడికి తప్పించుకోలేదు. మన ఎత్తు కు కొండయిన చిత్తు కావలసిందే మనం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, వాడిని అష్ట దిగ్బంధనం చేస్తే ఊపిరి మెస్లక ఉక్కిరబిక్కిరై సావాలే కొడుకు . “

“చేతిని మన్నంటకుండ కావాలి, పోయినోడు పొయినా ఆ పీడా మనకు చుట్టుకోవద్దు.”

“పీడా గిడా ఏం మాట్లాడుతున్న వు నీతులు వల్లిస్తే పప్పు ఉడకదు ఊకనే కొరుగుతున్నావు”

“అంటే అదీ అదీ”

“నీళ్లు మింగకుర బై మనకు అక్కా చెల్లి అంటూ మీన మేశాలు లెక్కిస్తే కుదురదు అయ్యగారు వొచ్చిన దాంక అమాస ఆగుతదా చెల్ నడు ఇంతకు ఎవడు “

” వాడే అదిగో వాడే”

” వాడి వంక చూస్తూ ఎవడో ఒకడు పటూ “

  • ” అంతా సిద్దం చెసే వున్నావ్ అబ్బన్నా “
    ” సార్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్న “
    ” వెరీ గుడ్ పైకి వస్తావ్ కిపిట్ అప్ ఇప్పుడు థ్రిల్లింగా వుంది రుచి పాకం అమోఘం, “
    ” సార్ అది ఈ రోజుల్లో గడ్డి గాలికి పోతెంది వోడ్లు వాగుల పోతేంది. నూకలు పెడితే మేకల జాడ మస్తుమంది చెపుతరు. వీని ఇంటి అటిటు పక్కొల్లే చాలు ఒక్క ఫుల్లు బాటిల్ మనది కాదంటే “
    ” అవునవును నిజమే , ఎని హౌ మన పని మరింత సులువు చేశినవ్ “
    ” సార్ నన్ను కనిపెట్టండి “
    ” కొనేది చారానా కొసరేది బారానా అన్నట్టు ఆశ కానీ నిన్ను కనిపెట్టకుంటే ఎట్టా నెక్స్ట్ ప్రమోషన్ నీదే “
    ” అంతా మీ దయ “
    ” ఆపరేషన్ యాత్ర శ్రీశైలమా, శ్రీకాకుళమా లేక భద్రాచలమా ఎక్కడ ముగిద్దాం.”
    ” వీని ఓపికను బట్టి చెరువు తగల బెడితే చాపలు చెట్లు ఎక్కుతయ, చూద్దాం “
    ” ఏజెంటు రవిక సిద్దమేనా అడపడచు లెక్క ముస్తాబు చేయండి మన రుచి చూపండి.”
    *…….
    ” ఏం పేరు రా”
    ” ఆయ్యా నా పేరు జే భీములు “
    అచ్చ అట్లన సందకం పెట్టు”
    ” దేనికి సారు “
    అరే సొత్తు చోరీ చేసింది నువ్వే ఒప్పుకో లేదంటే మక్కిలిరుగుతయ్”
    ” నాకేం తెల్వదు సార్”
    ” అరే చల్ నక్రాలు చెయ్యకు సక్కురంగ ఒప్పుకొని సంతకం పెట్టు” గుడ్లురిమి చూసి కసరుతు పలికిండు డి ఎస్ పి, పక్కంగ సిఐ చూస్తూ
  • ఒక్కసారి ఒప్పుకొరా వదిలి పెడుతం” అంటూ పలికిండు కనుబొమ్మలు ఎగరేస్తూ.

సార్ నేను ఏం చేయకుండా ఎలా వొప్పుకోవాలి నేను అమాయకున్ని సార్, నేను చేయని నేరానికి నన్ను బలి పశువును చేస్తున్నారు. మీకిది న్యాయం కాదు సార్.నన్ను వదిలి పెట్టండి సార్. నేనే దొరికిన్నా నేను ఎక్కడికి పొతే అక్కడికి వచ్చి నాకు ఎరేసి ఇరికిస్తున్నరు, గుడిసెలో వుంటే నమ్మించి ఎత్తుకొచ్చి .నన్ను బెదిరించి నింద నా మీద ఎస్తారు.మీరు సంపినా సరే నేను సంతకం పెట్టను

హేడ్డు ఎక్కడ దొరికిండు వీడు..
ఒప్పుకున్న దాంకా వుతుకు కొడ్కుని
” సార్ ఎప్పటి లెక్కనే గస్తికి వెళ్లిన, నిన్న రాత్రి వీడు ఇంట్లోకి తొంగి చూసిండని బస్తి కాలని లో అనుకుంటున్నరు వీడు అక్కరోస్తడని వాని గుడిసె దగ్గరికి వెళ్లి చూసిన వాడు వాని పెండ్లాం కుషిమిద వున్నరు వాడు పాట పాడుతింటే అది వంత పాడింది ….
” నల్ల నల్లని దాన చెంచితా ఓనవ్వు మొకం దాన చెంచితా….
కోరింత పువ్వోలె చెంచితా నీ కొప్పులో దాగుంట చెంచితా…
కొప్పు తిప్పి కొడితే ఓ మావ మళ్ళప్పుడెడుంటవుర నా మావ..
దిర్సన పువ్వోలే చెంచితా నీ దాపునా నేనుంట చెంచితా…
దాపున నివుంటే ఓ మావ దాసి గా నేనుంట ఓ మావ నీ దాసిగా నేనుంట ఓ మావ…
పొద్దు తిరుగుడు పువ్వోలే చెంచితా పొద్దంత చూస్తాను చెంచితా… నిన్ను పోద్దంత కాస్తాను చెంచిత…
” అబ్బా పాటతో సంపకు మావ” అంటూ కిల కిలా నవ్వు తూ మిల మిల మెరిసే కళ్ళతో విపరి చూసింది
” ఎమ్రో మాంచి జోరుమీదున్నారు సరసాలు చాలు గాని నడువు” అని నేను అనాగానే
” ఎక్కడికి సారు ” అంటూ బెదురుగా చూసిండు భీములు.
” చెబితే గాని రావారా, ఎదురు అడుగుతున్నావు నడువు సార్ రమ్మంటోండు చెల్ నడువు ” అని నేను అనంగనే
” ఎందుకు రమ్మంటోండు మేమెంటి చేసినం సారు, నా మావ ను రమ్మంటున్నవు.” అంటది నాకు కోపం నషాళానికి ఎక్కి
” ఆశే ఇద్దరు నడవండి” అని వాని దండ రెట్ట పట్టి జీపెక్కించా.”

” ఏం జరుగుతుందో తెలియక అయోమయం లో అమాయకంగా వారి వైపు చూస్తూ
అమ్మా అయ్యా నన్ను ఇడువండి సారూ నన్ను వోదులండి సార్… ” అనేలోపు
” ఏయ్యి ఎత్తి కొట్టు ఎయ్యి గట్టిగ ఎ య్యి ఏంది అబ్బన్నా ఇలాగేనా దంచేది దెబ్బకు దేవుడు దిగిరావాలే ఇగ్గొ ఆడోళ్ళకు గుండెల ధైర్యం వుండాలే- మోగోళ్ళకు పిక్కన పట్టు వుండాలే అప్పుడు తాకత్ తెలుసుద్ది ఎర్కేన. “

” అమ్మా అయ్యా… నీ కాల్మొక్కుత..

” వదిలే ముచ్చట లేదు కొడుకుని మూడు చెరువుల నీళ్లు తాపాలి కొడుకుని వెలాడదియ్యిర.. ఎయ్యి “

పెడి పెడి

“ఎనకమర్ల రెక్కలు విరిసి కట్టు , అరే కాళ్ళు ఎనక్కి మల్చు , అరికాళ్ళ మీద సర్సు….. “

పెడి పె డి

” వీపు మీద ఎక్కి సర్సుర ఎయ్యి సావనియ్యి “

” సా ర్ సస్తడు సార్ “

“సావానియ్యి కొట్టు పెడి పెడి.. ఎయ్యి సర్సు”

” రక్తం గక్కుతుండు సార్ “

” అరే ఐసు పెట్టారా “

” అబా అబ్బా వొదులు సా.. ర్”
” అరే కారం సల్లురా”
మంట మంట మంట
” ఉప్పు నీళ్లు సళ్లురా ఆ హా హ హ… ఆ ఆ. అబ్బా “

” కొట్టి కొట్టి నాకే విసుగు పుడుతుంది ఒప్పుకోర..”

” ఇచ్చి పుచ్చుకున్నోడు అసుంట పోయినట్టు పొతే ఎట్టర.. పెట్టిపోయనొడు పెయ్యంత గిల్లి చూసినట్టు కానియ్ కానీయ్..కారం ముద్ద పెట్టారా…”
…..
” ఆయిన్ని ఇడువుండ్రి సార్ మాకేం తెలువదు సార్”
అరే దీన్నీ ఎక్కురా ఈడ్సుకరారా!చెప్పు వానికి ఒప్పుకోమని”

“చేయని తప్పుకు సార్ ఒక్కసారి ఒప్పుకుంటే బతుకంతా నింద మోయ్యాలే సార్ మేము మోయ్యం”

” సంపు తరా సంపుండ్రి నువ్వేం డుటి చేస్తున్నావురా మంది ఉసురు తీసుకుంటూ రూపాలకు ఆశపడి ఇట్లా చేస్తున్నావు నేను రెక్కల కట్టం జేసి తెస్తరా ఆ సొమ్ము తిని బత్కర , కడిగి పోస్త గిన్నె తెచ్చుకో నా కండలు కర్గ బెడుత
జీతం సాలలేదురా కావాలి కుసో కొడుతవ కడుపుల తంతావు రారా నీకు లేని సిగ్గు మాకెందుకు నువ్వు బట్ట కట్టీనావు నీకు పెండ్లాం పిల్లలు లేర్రా అల్లకు మా ఆసొంటి వొళ్ల ఉసురు తాకదా “

” దెబ్బకు గెక్కున గునుపూ ఓయామ్మ సంపెనే ఇట్లా తెగబడ్డారు”

” నోటిలో గుడ్డలు కుక్కిరే సెలిమెల పొంట నెత్తురు కారుతుందే ఓయామ్మో ఒదేవుడో బావో బావా మనం ఏం తప్పు చేస్తిమి బావా మనం ఏం నేరం చెస్తిమి బావా యమునోల్ల లెక్క యెంట పడ్డరు బావా
తల్లికి పిల్లకు ఎడబాపే కొడుకులు బావా.. అగ్గిపెట్టి పక పక నవ్వు తున్నరా బావా..కయ్యం లేనికాడ కయ్యం బెట్టే కొడుకులు బావా తమాషా సుస్తున్నరా బావా వీళ్ల ఇంట్ల పీనుగెళ్ళ బావా తప్పు చేసిన వాడు తల ఎత్తి తిరుగుతుంది బావా మందిని ముంచినొడు మంచోడు అంట బావా బొడ్రాయి సాచ్చిగ బావా అబద్ధాలు ఆడేవారు బావా సంసారులు ఆయిపాయే బావా నరానికి పుండు పెట్టీ నడమంత్రపు సిరి తొనీ కులుకుతున్నరు బావా
వాళ్ళు నాటకము ఆడుకుంటూ మనాయి నాటకాలు అంటూర్రు బావా కడుపు కాలి మనముంటే బావా పక పక నవ్వు తున్నారు. మట్టి కరువాలే బావా ఇంతకి ఇంతకు గోస తియ్యాలే
…..
Tomorrow ఎస్పీ, డి ఎస్ పి విజిటింగ్ వుంది పట్కరాపో వాన్ని

*
అరే నీ కేసేంది
నాకేం తెల్వదు సార్
ఎవరు పట్టుకొచ్చిర్రి
అగో ఆ సార్ నీతో పనుంది రా అన్నడు వొచ్చిన
అట్లా కూసో
….
ఆరేయ్ బెంచీమీద కూర్చుంటావు లే బెంచి మీద నుంచి లే కింద కుసొ అరే ఆ సెళ్లు పక్కన కుషో..

నేల చూపులు చూస్తావు దొంగ గాడిదా!”
అయ్యా నా పెనిమిటి చూపే అంత అయ్య మమ్ముల ఎందుకు తీసుకొచ్చారు మా తప్పెండో చెప్పండి…

అసే నువ్వు ముయి నోరు ముయ్యి ఇది ఎదురు మాట్లాడుతుంది…

ఇదిగో హెడ్డు అక్కడ అదేమో చెబుతావుంది వాళ్లు సినిమా చూసినట్టు చూస్తున్నారు …

నిజమైంది
అది
అదికూడా మనం అల్లింది
అవును సార్

అరే అబద్దం ఆడితే అతికినట్టు వుండాలే

Fir వుందా లేదా
లేదు
ఏం పికుతున్నరు
ఆ పది మంది బయట ఇంకో పది మంది కి చెప్పరా….
మన పని చేతికి పచ్చ బొట్టు ముద్దేర ఎసినట్టు వుండాలే అది సచ్చిండాక పోతాదా…
పోదు కానీ, కానీ ఏంది
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తియ్యొచ్చు

వానికి తింటందుకు నూకలు గతి లేవు కదా ఇంగా ప్లాస్టిక్ సర్జరీ చేపించు కుంటడ వానికి అంత సీను లేదు
…..* ఇంతకీ మనకు ప్రమోషన్ వచ్చినట్టేనా
ఇది అయితే వస్తది
నక్కను తొక్కిన వూ పట్టు….

March 7, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

స్పందన కథాసంపుటిలో స్త్రీ పాత్ర చిత్రణ

by Devendra March 7, 2023
written by Devendra

కవయిత్రి, రచయిత్రి, సాహితీ సౌజన్యమూర్తి, గుడి మరియు బడిని నిర్మించి సామాజిక సేవలో ముందున్న మహిళామణిదీపం, అంతకు మించిన గొప్ప మానవతామూర్తి. డా. అమృతలత గారు బహుముఖ రంగాలలో మరియు అనేక సాహితీ ప్రక్రియల్లో ప్రవేశం ఉన్న వీరు కవిత్వం, నవల, నాటిక, కథలు రాశారు.
‘‘స్పందన’’ కథా సంపుటిని 2017లో వెలువరించారు. ఇందులో ఉన్న కథలు 1969 నుండి 2016 వరు సుదీర్ఘకాలంపాటు 47 సం॥లలో రాసినవి. వివిధ జీవనదశల్లో సాగిన ఈ కథలు ఆణిముత్యాలు. రచయిత్రి తన దృష్టికి వచ్చిన అనుభవాలను, అనుభూతులను సమస్యలను, సంఘర్షణలను ఎంతో సహజంగా చిత్రించారు. బాల్యదశ నుండి వృద్దాప్యదశ వరకు సాగే పాత్రలు స్నేహ పరిమళాలను పూయిస్తూ ముందుకు సాగుతాయి. ఈ కథలన్ని కూడా ఆయా పత్రికల్లో అచ్చయిపాఠకుల మన్ననలను పొందిన కథలు.
స్త్రీ పాత్రల విషయానికి వచ్చినప్పుడు మహిళల చుట్టు ఉండే సున్నితమైన అంశాలు మృధుమధురమైన కథన పద్ధతిలో, విలక్షణమైన వస్తువైవిధ్యంతో నడుచుకుంటాయి. ప్రేమలు, పెండ్లిళ్ళు, రిజర్వేషన్లు, సమాజంలో ఉండే స్వార్థపూరితమైన అంశాలు ఇట్లా అనేక సీరియస్‌ అంశాలు కూడా చర్చకువచ్చాయి.
‘‘కాలం వెక్కిరించింది’’, ‘‘మనసు ఎదగని మనుషులు’’, ‘‘కన్నీళ్ళతో కాలక్షేపం’’, ‘‘అన్‌రెస్ట్‌’’ కథలు కాలేజీ వాతావరణ నేపథ్యంలో నడిచిన కథలు. ‘‘కాలం వెక్కిరించింది’’ కథలో విజయ, రజితలు యుక్తవయస్సులో ఉండి కాలేజీకి వెళ్తున్న పాత్రలు. ఆ వయస్సులో ప్రేమలు, ఆకర్షణలు సర్వసాధారణం. రజిత ప్రకాష్‌లు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ, కాలం, పరిస్థితులు వారిని వేరుచేస్తాయి. విజయను తోటిస్నేహితుడు రవి ప్రేమిస్తాడు. వీరి విషయంలో ప్రేమ వన్‌సైడ్‌గా ఉంటుంది. రవి విజయను ఇష్టపడతాడు కాని విజయ రవిని ప్రేమించదు. కాలగమనంలో విజయకు ప్రకాష్‌ పెండ్లి అవుతుంది. మనసులు కలువని పెండ్లి వారిద్దరిని ఒకటిచేయలేకపోయింది. కథాముగింపులో ఉత్తరం ద్వారా విజయ అసలు విషయం తెలుసుకుంటుంది.
రవి, ప్రకాష్‌, రజిత పాత్రలు చనిపోవడంతో పాఠకులకు అయ్యో! అనిపిస్తుంది. రచయిత్రి బి.ఎ.లో ఉన్నప్పుడు రాశారు కాని విద్యార్థుల కళల ప్రపంచం చుట్టూ ఉన్న యదార్థం వస్తువుగా స్వీకరించారు.
1970 లో రాసిన కథ ‘‘ఆశయాలుఆదర్శాలు’’ మంజుల, వినీల, షీలా పాత్రలు విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ, హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న యువతులు. ఉడుకురక్తంతో ఉన్న వీరు ఆదర్శాల గురించి చర్చించడమే కాదు, ఆచరించాలనే ఉత్సాహం కలిగినవారు. వరకట్న సమస్యను నిర్మూలించాలనే ఉద్ధేశ్యంతో వారి నిజజీవితంలో అక్షరాల పాటిస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పం ఉన్నపాత్రలు. కన్నీళ్ళతో కాలక్షేపం కథలో వజ్రమాల, స్పందన కథలో ‘అరుణ’, ఆమె నవ్వు కథలో సుజాత, ‘నా సరి నీవని నేసరి నేనని’ కథలో సత్య పాత్రలు దాంపత్యజీవితంలో ఉండే కష్టసుఖాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న పాత్రలు.
వజ్రమాల చాలా అందమైన అమ్మాయి. తెలివైన అమ్మాయికూడా. బి.ఎస్సీ. చదువుతున్న సమయంలోనే ఆమె తండ్రి, ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని నెపంతో నల్లటిరూపం కలిగిన ఒక మోస్తారు ధనవంతుడికి ఇచ్చిపెండ్లి చేస్తాడు. ఆడపిల్ల జీవితం పెండ్లికి ముందు, పెండ్లి తరువాత అనే రెండు విభిన్న పార్శ్వాలుగా ఉంటుంది. కొన్ని బొమ్మా బొరుసులో మారిపోతుంది. పెండ్లి తర్వాత వజ్రమాల జీవితం కూడా నరకప్రాయం అవుతుంది. ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించిన సమస్యలోంచి బయటపడలేకపోతుంది. కథా ముగింపులో వజ్రమాల నిండుజీవితం ఆత్మహత్యకు బలికావలసి వస్తుంది.
స్పందన కథలో రెండు జంటలు ఒకే కుటుంబానికి చెందినవి. అర్థం చేసుకునే ప్రేమ, అవగాహనాలోపం ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయో సమాంతరంగా చిత్రించిన కథ ఇది. ఒక జంట రవి, మాధవి దాంపత్య జీవితానికి ఇంద్రధనుస్సు రంగులను అద్దగలుగుతారు. మరొక జంట శ్రీనివాస్‌, అరుణలు ఒకరినొకరు అర్థం చేసుకోరు. ముఖ్యంగా అరుణ సున్నిత మనస్తత్వాన్ని భర్త శ్రీనివాస్‌ అర్థంచేసుకోలేని స్థితిలో ఉంటాడు. దాంతో అరుణ జీవితం మోడుబారిన చెట్టును తలపిస్తుంది. ఈ కథలో దాంపత్య జీవితం ఎలా ఉండాలి! ఎలా ఉండకూడదు! అన్న సందేహం పాఠకులకు బోధపడుతుంది.
ఆమె నవ్వు కథలో సుజాత పాత్ర వైవాహిక జీవితం ఎవరికి చెప్పుకోలేని సమస్యను అనుభవిస్తుంది. సమాజంలో అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలను చూస్తూనే ఉంటాము. కథంతా నాటకీయ పద్ధతిలో సాగుతూ ఉత్తరంతో ముగుస్తుంది.
‘నాసరి నీవని` నీసరి నేనని’ కథలో కథా ఎత్తుగడలోనే ఆడపిల్లగా పుట్టినందుకు మురిక్కాలువలో విడిచిపెట్టబడుతుంది. పెంచినతల్లి మాత్రం అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. సత్యభామ అని పేరు పెట్టుకుంటుంది. ఆ దంపతులకు కొన్నిరోజులకు మగసంతానం పుడితే వరప్రసాద్‌ అని పేరు పెట్టుకుంటారు. ఆ తల్లి బిడ్డకొడుకు అనే వ్యత్యాసం పెంపకంలో చూపించదు. తల్లిపెంపకం ఆడా, మగా అనే తేడా లేకుండా సమానంగా పెంచాలనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. కథలో సందర్భానుసారంగా ‘ఆడంగి పనులు’, ‘మగమహరాజు’, ‘సిగ్గుపడటం’, ‘ఇంటిపని’ ఇట్లా స్త్రీల చుట్టు తాడే మడికట్లు పదాలను ఎత్తి చూపిస్తాయి.
కాలని తెప్ప, స్వీట్‌ నాన్సెస్స్‌, అన్‌రెస్ట, నేనుసైతం, అంతుపట్టని ఆంతర్యాలు, ఆత్మీయస్పర్శ, చరిత్రను సృష్టిస్తా, టెంప్టేషన్‌ కథలు సామాజిక సమస్యలను విశ్లేషిస్తాయి. ఇందులోని పాత్రలు వర్గతారతమ్యాలను ఆర్థిక అవసరాల చుట్టూ అల్లబడిన భ్రమలను తేటతెల్లంచేస్తాయి.
టెంప్టేషన్‌, కాలని తెప్పకథల్లో స్త్రీ పాత్రలు వర్గతారతమ్యాలకు ప్రతీకలుగా కనిపిస్తారు. రంగి, ధనవంతుల ఇంట్లో పనిమనిషి, లచ్చి బిక్షగత్తె. విమల, విజయలు ధనికవర్గానికి చెందిన స్త్రీలు. అందరూ మనుషులే. మాతృత్వం అందరికి ఒకటే. కోరికలు అందరికి ఉంటాయి. కొందరికి మాత్రమే నెరవేరుతాయి అనే జీవన కఠోర వాస్తవాలను ఈ కథలు తెలియజేస్తాయి. ‘స్వీట్‌నాన్సెస్స్‌’ కథలో కుంతి, సీత పాత్రలు చిన్నప్పుడు కలిసి ఆడుకున్న బాల్యమిత్రులు ఇరవై ఐదేండ్ల తర్వాత అనుకోకుండా మళ్ళీ కలుసుకుంటారు. అప్పటికి వారిరువురి జీవితం ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనే సామెతతో పోల్చవచ్చు. సీత ఒకప్పుడు గుమస్తా కూతురు. ఆ తర్వాత కృషిని నమ్ముకుంది. పట్టుదలతో శ్రమించింది. కలెక్టర్‌ కాగలిగింది. కుంతి యజమాని కూతురు. చిన్నప్పుడు చాలా గారాబంగా పెరిగింది. ధనంలో పుట్టిపెరిగిన కుంతికి కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోని కారణాలవల్ల ధనంపోతుంది. హఠాత్తుగా చనిపోతాడు. చిన్న పాపను పెంచాల్సిన బాధ్యత తనపైపడుతుంది. ఉద్యోగం చేయడం అనివార్యమవుతుంది. అందుకని లెక్చరర్‌ ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో స్నేహితులు కలుసుకుంటారు. వారి ప్రస్తుత పరిస్థితిని ఒకరినొకరు తెలుసుకుంటారు.
‘అన్‌రెస్ట్‌’ కథలో అరుణమేడం, విమల, కిరణ్‌ మంజుల, ఉష, గీత, సునంద పాత్రలు మహిళా కళాశాలలో రిజర్వేషన్‌ గురించి విస్తృతమైన స్థాయిలో చర్చను లేవనెత్తుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ ఉండాలని కొంతమంది, వద్దని కొంతమంది ఎవరికోణంలో వాళ్ళు వాదిస్తుంటారు. అరుణమేడం వీరి చర్చలను శ్రద్దగా వింటుంది. ప్రజాస్వామ్యదేశం, సోషలిస్టు దేశం, ప్రెజిడెంట్‌ రూల్‌దేశంలలో ఏది ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ప్రజలమధ్య అంతరాలను ఏ ప్రభుత్వం తగ్గించగులగుతుంది. అన్ని చర్చల్లో అరుణ మేడమ్‌ హత్య విద్యార్థి సంఘాలలో మార్పును తీసుకువస్తుంది. ‘సంఘటిత శక్తి’గా ఎదగాలని నిర్ణయించుకుంటారు.
నేను సైతం కథ రెండు వర్గాల ప్రజల జీవన విధానాన్ని అద్దంలో పెట్టిచూపింది. ఉత్తమపురుషలో సాగుతూ బాల్యంలో ఉన్న ధనవంతుల అమ్మాయి సంచార జీవితాన్ని గడుపుతూ ఉన్న బంజారాల బండిని పరిశీలనగా చూస్తుంది. ఆమె ఇంటిముందు ఆపి వారు వంటఏర్పాట్లు చేసుకుంటారు. అటెండర్‌కు చెప్పి వాళ్ళకు నీళ్ళు ఇప్పిస్తుంది. వారి పిల్లలను చూస్తే తనతోటి వయస్సు, తన చిన్నవారులా కన్పించారు. ఇంట్లో అమ్మ లేకపోవడంతో తను వేసుకొని బట్టలను వారికిచ్చి నేను సైతం సహాయం చేశాను అని మానవత్వాన్ని చాటుకుంటుంది. వర్షం బారినుండి కాపాడటానికి వారి అవుట్‌హౌజ్‌ ఇచ్చి అమ్మాయి వాళ్ళమ్మ మరింత మానవత్వాన్ని చాటుకుంటుంది. మనుషుల్లో దయ, జాలి, కరుణ ఎల్లప్పుడు ఉండాలనే సందేశాన్ని కథ అందిస్తుంది.
‘అంతుపట్టని ఆంతర్యాలు’ కథలో షేమ పాత్ర ద్వారా రచయిత్రి లౌకిక సమాజంలో ఉన్న ఆర్థిక అవసరాలను తెలియజేస్తుంది. ‘ఈ లోకంలో అంతుబట్టనిదంటూ ఉంటే అది మనిషి ఆంతర్యమేన’ని హేమ పాత్ర కథాముగింపులో అడవడంతో మనిషిలోని స్వార్థం, మోహం, కామం, జుగుప్సలతో నిండి వుంటుదన్న వైఖరి కథా సంఘటనల్లో తెలిసివస్తుంది.
ఇట్లా కథలన్ని కూడా సామాజిక, ఆర్థిక, అసమానతలపై వైవాహిక సమస్యలపై స్త్రీల ఆంతరంగిక మనోభావాలను సున్నితమైన శైలిలో వ్యక్తీకరిస్తాయి. విలక్షణమైన వస్తువును ప్రథమపురుష, ఉత్తపురుష, ఉత్తరాల కథనంతో కథను నడిపిస్తూ హాయిగా పాఠకులను చదివించగలిగే భావవ్యక్తీకరణలు ఈ స్పందన కథాసంపుటి సమాహారం.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అమ్మ హృదయం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, March 7, 2023
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

           అడవిలో  రెండు కోతి పిల్లలు  బయటకు వచ్చి అడవంతా తిరుగసాగాయి.  అవి దారితప్పి  తమ నివాసం ఎక్కడ ఉందో తెలియక  కంగారు పడ్డాయి.    ఇంతలో వాటికి ఒక పెద్దపులి ఎదురయింది .వెంటనే అవి భయపడి అక్కడే దగ్గర లోనే ఉన్న  ఒక చెట్టును ఎక్కాయి. కానీ ఆ చెట్టు పైన ఇదివరకే ఒక పెద్ద చిరుత పులి ఉంది. దానిని చూసి అవి గజగజ వణకసాగాయి.  తమకు ఎలాగూ చావు తప్పదని అవి నిర్ణయించుకున్నాయి .వాటి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా  తయారైంది. “క్రిందికి దిగితే పెద్దపులి పొట్టన పెట్టుకుంటుంది.  ఇక్కడ ఉంటే  చిరుత పులి  చేతిలో చావు తప్పదు ” అని అవి అనుకున్నాయి .  చివరకు అవి ఆ చెట్టు పైననే ఉండాలని  నిర్ణయించుకున్నాయి.
       ఇంతలో  భయపడుతున్న ఆ కోతి పిల్లలను  చూసి చిరుతపులి” పిల్లల్లారా!భయపడకండి .నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఉండగా మిమ్మల్ని ఏ జంతువు చంపలేదు. ఆ పులికి మీరు భయపడవద్దు” అని వాటికి ధైర్యం చెప్పింది.  నేలపైన ఉన్న ఆ పెద్దపులి చెట్టు పైన ఉన్న చిరుతపులిని  చూసింది. అది  కొద్దిసేపు  ఆ కోతిపిల్లలు క్రిందికి దిగుతాయేమోనని వాటి  కొరకు  ఎదురుచూసింది. చివరకు  అవి దిగకపోవడంతో ఆ పెద్దపులి నిరాశతో  వెనుతిరిగి  వెళ్లిపోయింది.
       చెట్టు పైన ఉన్న చిరుత పులి మొదట ఆకలిచే ఈ కోతి పిల్లలకు హాని చేయాలని అనుకొంది. కానీ  ఆ పులి వెళ్ళిన తర్వాత ఆ కోతి పిల్లలు ఆ చిరుతను తమను కాపాడిన దేవతగా, అమ్మగా స్తుతించాయి.  భయంతో వణుకుతున్న ఆ  కోతి పిల్లలను చూడగానే దానికి తన పిల్లలు గుర్తుకు వచ్చి దానిలోని మాతృ హృదయం పెల్లుబికింది. వాటి మాటలు విన్న ఆ చిరుత పులికి ఆ పిల్లల పై జాలి కలిగి తన మనసును మార్చుకుంది .
       ఆ కోతి పిల్లలు తర్వాత చెట్టును దిగి చిరుత తమకు తోడు రాగా అవి తమ నివాసానికి ఎట్టకేలకు చేరాయి .అవి తమ తల్లిని కలుసుకొని ఈ చిరుత పులి తమకు ప్రాణదానం చేసిందని తమను  పెద్దపులి నుండి కూడా కాపాడిందని చెప్పాయి. ఆ తల్లి కోతి ఎంతో సంతోషించి చిరుతపులికి తన ధన్యవాదాలను తెలిపింది.
              చిరుతపులి వెళ్లి పోయిన తర్వాత అది  ఈ విషయాన్ని తోటి జంతువులన్నింటికీ చెప్పింది .మరొకసారి  తనకు  చెప్పకుండా ఎక్కడికి వెళ్లవద్దని అది తన పిల్లలను హెచ్చరించింది.  అవి అలాగేనన్నాయి.ఈ వార్త సింహానికి చేరింది. అది చిరుతపులిని పిలిపించి దానిని ఘనంగా సత్కరించింది.      
         తాను చేసిన మంచి పనికి ఆ చిరుత పులి ఎంతగానో సంతోషించి ఇక ముందు పిల్లల పట్ల క్రూర స్వభావాన్ని విడనాడి ఇదే మంచితనాన్ని కొనసాగించాలని అనుకుంది. ఆనాటి నుండి అది పిల్లల జోలికి వెళ్లవద్దని నక్క ,తోడేలు వంటి  జంతువులను కూడా హెచ్చరించింది.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అపర భగీరథుడు బాబా లక్కీషా బంజారా

by Rathod Sravan March 7, 2023
written by Rathod Sravan

చరిత్ర అనగా జరిగిన కాలంలోని విషయాలు,రాతల ద్వారా మనషుల గురించి గాని సమాజం గురించి గాని మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచడిన దానినే మనం చరిత్ర అంటాము . 

చరిత్ర రచనా శాస్త్రం  ప్రకారం చరిత్రకారుల కలాల నుండి జాలువారిన అంశాలు ప్రభుత్వ ఎప్పుడైతే రచనా ముద్రణ గావించి వెలుగులోకి తేస్తుందో  దానిని చారిత్రక ఆధారాలు అని అంటారు. సింధూ నాగరికత కాలం నుండి బ్రిటిష్ పాలన వరకు అన్ని విషయాలను పరిశీలించిన మీదట హస్తినలో చరిత్ర సృష్టించిన ఒక మహాపురుషని జాడ చరిత్రలో కనిపించకపోవడం అప్పటి ప్రభుత్వ తప్పిదమే. ఇంతటి గొప్ప ధైర్యం సాహస గల మహా పురుషుడు,బల‌యోధుడు, ధనికుడు,

 పెద ప్రజల పేన్నిది, ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యాపారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అని ఈ సందర్భంగా చేపవచ్చు. అతను ఎవ్వరో కాదు అతడే *బాబా లక్కీషా బంజారా*

లక్కిసా బంజారా

బాబా లక్కీషా బంజారా  04 జులై 1580‌ వ సంవత్సరంలో  దేశ రాజధాని ఢీల్లీ సమీపంలోని రాయిసిన తండాలో  జన్మించారని  గోర్ వంశం బంజారా ఉపజాతి  భాట్  గోత్రం‌ వడ్త్యా నాన్న  పేరు గోదూనాయిక్ బణజారా, తాత ఠాకూర్ నాయక్ బణజారా వద్ద ఇంట్లోనే విద్యాభ్యాసం తో పాటు భారతియ సంస్కృతి సభ్యతా నేర్చుకున్నారు.అతని అర్ధాంగి పేరు పారాబాయి, పుత్రులు ఏడుగురు కూతురు ఒక్కరూ అందులో హేమ,హడి,నగైయా,హియా,పూండియా, బక్షి, బాలాజ్  కూతురు సీతా, మొదలగు విరి కుటుంబ. జాదవ్ బన్సీ భాట్ ఖాతా పుస్తకంలో బంజారా భాట్  ఆధారంగా  ఖైరపూర్ ముజాఫర్ ఆలిపూర్ జిల్లా పాకిస్థాన్ లో జన్మించారని, సిక్కుల చరిత్ర ఆధారంగా హరియ్యాణ రాష్ట్రలో జన్మించారని కొందరి  వాదన మరణం తేది 28-మే 1680 కొత్త ఢిల్లీ సమిపంలోని మలచాతండాలో  అతను 99 సంవత్సరాలు 10 నేలలు జీవించారని  అంటారు. వృతిరిత్య వ్యాపారం చేసెవారు  ప్రపంచంలో ఆసియాఖండంలో నే అతి పెద్ద ధనవంతుడు అని చెప్పవచ్చు.అతని వద్ద జీతగాళ్ళు లక్షల్లో ఉండేవారు, గుర్రాలు లక్షల్లో,ఏనుగులు లక్షల్లో,ఆవులు లక్షల్లో ఎడ్లు, ఎడ్లబండ్లు లక్షల్లో  అతని వద్ద ఏది ఉన్నా  అవి అన్నీ లక్షల సంఖ్యలో ఉండేవని‌ లక్ష శబ్దం అపభ్రంసం చెంది లక్కీషాగా మారిందని అందుకే అతనిని లక్షబంజారా అని, లక్కీబంజారా అని, లక్కీరామ్ నాయక్ బంజారా  అని లాఖాబణజారా అని, లక్కీషాబంజారా అని వివిధ పేర్లతో పిలిచేవారు.

బాబా లక్కీషా బంజారా  మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సైనికులకు గుర్రాలకు సంబంధించిన కళ్ళేము, 

ఇతరఇతర సామాగ్రిలు వివిధ రకాల సరుకులు ఉప్పు, పప్పు, కారం, పసుపు, బెల్లం, మసాలా దినుసులు మొదలగు ఏడ్ల బండ్లు పైన రవాణ చెసేవారు.అంతేకాకుండా ఢిల్లీ నుండి  పాకిస్థాన్ లోని లాహోర్, పెషావర్, కాబుల్, కాందహర మొదలగు  ప్రాంతాలలో కుడా ఎడ్లబండ్లు, గుర్రాలబండ్ల పైన ముఖ్యంగా ఉప్పు ఇతరసరుకులు రవాణ చెసేవారు దారిలో గుర్రపుబండ్లు , ఏండ్లబండ్లు జీతగాళ్ళుకు స్వేదా తిర్చడానికి దారిలోని వివిధ ప్రాంతాలలో తండాలు ఏర్పాటు చేసారు.అతను పెద్ద భూస్వామి ఉండటం వలన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో  వందల  ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలు అన్ని అతని అధినంలో ఉండేవి వాటిలో రాయసిన,మరాచి, నరేల ,బరాఖంబా ఢిల్లీ నగరాన రాయిగడ్ తండా మొదలగు ప్రాంతాలు అయిన పరదిలో ఉండేవి.ప్రస్తుతం ఉన్న పార్లమెంటుభవనం, రాష్ట్రపతి భవనం, ఎర్రకోట, ఇండియా గేట్, చాందినీ చౌక్, చావడిబజార్, దర్యాగంజ్ ,ఢీల్లి ఇప్పటి మెట్రో ప్రాంతం ఢీల్లి కంటోన్మెంట్  మొదలగు ఇతని ఆధిపత్యంలో ఉండేవని సిక్కుల చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. లక్కీసాబంజారా వద్ద పనిచేసే  జీతగాళ్ళులంతా  ఢిల్లీ లోని ఎర్రకోట, పూరానా ఖిల్లా,లోడిగార్డేన్,సబ్దర్ జంగ్,ఎలియాదర్వాజా మొదలగు నిర్మాణానికి, ఎడ్లబండ్లుతో  భవనానికి సంబంధించిన రాళ్ళు, ఇటుకలు,సున్నం, లోహపు వస్తువులు తలుపులు, మొదలగు సామాగ్రిని మోసినారని  చెప్పుతారు.

మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తిగా  ఔరంగజేబు క్రీ శ 1658 వ సంవత్సరం నుండి 1707 వ సంవత్సరం వరకు రాజ్యాన్ని పరిపాలించారు.దేశాన్ని పాలించిన అత్యంత వివాదాస్పదమైన మరియు కౄరమైన వ్వక్తిగా పేరు సంపాదించారు అతని కాలంలో   మొఘల్ సామ్రాజ్యాం అత్యంత విస్తీర్ణం సాధించి  దక్షిణన మహా రాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మొదలగు ప్రాంతాలలో ఆధిపత్యం కొనసాగింది.అతని కాలంలో హిందువులు, సిక్కులు, ద్వితీయ శ్రేణి పౌరులుగా  ఉండి నిరంతరము పీడించబడుతూ భయపడుతూ కాలం గడిపేవారు. సిక్కు మతములో  తోమ్మిదవ గురువు అయిన గురు టేక్ బహదూర్ మత మార్పిడికి నిరాకరించడంతో అతనికి 11 నవంబర్ 1675 వ సంవత్సరంలో భాయిజేతా,భాయిగురుభక్షసింగ్ కళ్ళముందే ఢీల్లీ నగరం లోని చాందినీ చౌక్ వద్ద  శిరశ్చేదం చేయించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఢీల్లీ సుబేదారుల ఆజ్ఞా ప్రకారం గురువు యొక్క పార్థీవదేహాన్ని  చాందినీచౌక్ నుండి తిసుకొని వేళ్ళి అంతిమ సంస్కారాలు చెయ్యుటకు ఎవ్వరు కుడా ధైర్యసాహసాలు చెయ్యలేదు.ఒక రోజు భాయి నానురాయ ఇంట్లో భాయి జేతా,ఉదా అందరూ కలిసి సమావేశమై గురువు దేహ అంతిమ సంస్కారాలు గురించి చర్చించి చివరికి నానురాయ నిర్ణయం ప్రకారం బాబా లక్కీషాబంజారా మాత్రమే ఈ పని చెయ్యగలడని ఒక నిర్ణయానికి వచ్చారు.లక్కీషా బంజారా తన  యొక్క కొడుకులు మరియు జీతగాళ్ళతో  ఐదువందల ఎడ్లబండ్లు తీసుకోని చాందినీ చౌక్ బయలుదేరి గురువు టేక్ బహదూర్ పార్థీవ శరీరాన్ని ఔరంగజేబు సైన్యాంతో కోట్లాడి రాయిసిన తండాకు తీసుకునివచ్చి గురువు తల లేని మొండెంను అతని ఇంట్లోనే ఉంచి ఇంటికి నిప్పుపెట్టి గురువు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.ఇది సిక్కు మతములో బాబా లక్కీషా బంజారా సృష్టించిన కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు.అంతటి బల యోధుడు, వీరుడు,శురుడు, కార్యనిర్వాహకుడు,కర్తవ్యదీక్షాపరునిగా, అన్యాయాన్ని ఎదిరించే సాహసం, శత్రువులను ఎదురించే ధైర్యం తన ధైర్య సాహసంతో  ఔరంగజేబు సైన్యాన్ని గడగడలాడించి వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు బాబా లక్కీషా బంజారా. ఇంతటి గొప్ప నాయకుని  గురించి భారతదేశ చరిత్రలో స్థానం కల్పించక పోవడం విచారకరం.

*భారతీయ రోడ్లకు పునాది*

 భారతీయ రోడ్లకు బాబా లక్కీషాబంజారా పునాదులు వేసారని, అడవుల్లో గోవులను మేపి ఎక్కడైతే చీకటి పడుతుందో ఆ ప్రాంతంలో ఢేరాలను ఏర్పాటు చేసి అచ్చటనే ఉండేవారు ఆ ఢేరాలే ఇప్పటి తండాలు లక్కీషాబంజారా ఆవులు,ఎడ్లు, నడచిన చేసిన మార్గాలు మరియు లక్షల సంఖ్యల ఎడ్లబండ్లతో ఉప్పు ఇతర సరుకులు రావాణా చెసారు.అవి ఏ ఏ మార్గాల నుండి రవాణా చేసినారో దానిని పరిశీలించిన అప్పటి

 బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసి గారు దానినే ఆధారంగా చేసుకుని,1853 వ సంవత్సరంలో రోడ్డు,రైలు వ్వవస్థాను ప్రారంభించారు.

అపర భగీరథుడు బాబా లక్కీషాబంజారా

భగీరథుడు  గంగానదిని  భూవికి తీసుకుని రావడానికి  తపస్సు చేసి శివుడు అనుగ్రహించడంతో  గంగాను తలపై మోపి జటాజూటంలో బంధించి ఒక పాయను నెల పైకి వదలినాడు అని పురాణాలలో విన్నాం. 16 వ శతాబ్దంలో 

బాబాలక్కీషా బంజారా తన వద్ద ఉన్న లక్షల ప్రజలకోసం,లక్షల మూగజీవాల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ ఝీల్ ను  నిర్మించి జనాలను,ముగజీవాలను దప్పిక తీర్చాడాని తవ్వించారని  చెరువులో నీళ్ళు రాకపోవడంతో తన స్వంత కోడుకుకోడళ్ళలను నీళ్ళ కోసం బలిదానాలు చేసినాడని చెప్పడంలో ఎలాంటి  సందేహము లేదు. సాగర్ జిల్లా లోని సాగర్ చెరువు బుందేల్ ఖండ్ చెరువు, రేవులు వందల ఎకరాల విస్తరణంతో  ఇప్పటికీ ఉన్నాయి ఇది ప్రత్యేక్షసాక్షం. సాగర్‌ ఝీల్ ( లాఖాబంజారా ఝీల్ ) అనుపేరుతో ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో ఉంది. లాఖా బంజారా ఝీల్ ను సందర్శించిన అప్పటి భారత ప్రథమ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ సాగర్ చెరువును భారతదేశపు స్విట్జర్లాండ్ అని అన్నారు.

ఢిల్లీనగరంలోని బారాబంఖీ, నరేలా ,లోహగడ్, కాసంగ్ గంజ్ రాయమల్ కాంజీ, పురాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని మథూరా, వృంధావన్  బరేలి మొదలగు నగరాల్లో లక్కీషా బంజారాఖ తవ్వించిన  బావులు, చెరువులు రేవులు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. 

*ఆదిలాబాదు జిల్లా నార్నూరులో విగ్రహము*

ఆఖీల భారతీయు బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు గౌ, శ్రీ ,అంబర్ సింగ్ తిలావత్ గారు, బంజారా సేవా సంఘం అదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు లంబాడీ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ స్వర్గీయ బానోత్ జాలంసింగ్ గారు ప్రస్తుతం ‌నార్నూర్ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, శీవాజీ పటేల్ , రాథోడ్ ఉత్తం  బానోత్ సూరేష్  ఆడే విశ్వనాథ్ , చౌహాన్ యశ్వంత్ రావు నాయక్ మరియు సమస్త గ్రామస్థుల సాహాయసాకారంతో బాబా లక్కీషాబంజారా కాంస్యావిగ్రాహాన్ని తేది 05-02-2014 న  నార్నూర్ మండలంలోని విజయనగర్ కాలని నార్నూర్ నుండి భీంపూర్ వెళ్లే రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి కుడలి సమీపంలో మహానాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాబా లక్కీషాబంజారా విగ్రాహాం భారత దేశంలో ఢీల్లీ నగరంలో ఒకటి మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఒకటి  దేశమంతటా రెండు మాత్రమే ఉన్నాయని సమాచారం.

భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,ఒక గొప్ప రాజు లక్కీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లయితే ఇది దేశంలోని 15కోట్ల బంజారాలతో పాటు విదేశాల్లో ఉన్న సమస్త గోర్ బంజారా సముదాయాన్ని  గౌరవించినట్లు ఉంటుంది.

March 7, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

బంధం

by Damaraju Vishalakshi March 7, 2023
written by Damaraju Vishalakshi

“అక్క  మీనాక్షి ఇంట్లో ఉండి ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు మధు ..

తమ్ముడిని చూసి వెక్కి వెక్కి ఏడవసాగింది మీనాక్షి” .

నేను  ఉండడానికి  వచ్చానని తెలిసిందేమిటి ?

ఊరకే ఏడుస్తున్నావ్   …వెటకారంగా అన్నాడు మధు.

అది కాదురా, తమ్ముడూ..

  “నా గుండెల్లోఅగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి ” ..

నిన్ను చూసి దు:ఖం  ఆపుకోలేక పోయాను వెక్కిళ్ళు

పెట్టింది మీనాక్షి. 

“అయ్యో ।అదేమిటే ,అక్కా …

వెతికి  వెతికి అప్పులు జేసిమరీ ,మంచివాడని , ఆఫీసరని ,సుందరుడని కదా ,వెతికితెచ్చి. బావకినిన్నిచ్చి పెళ్ళిజేసాం.

బావ బాధలుపెడుతున్నాడా?ఆవేదనగా అడిగాడు మధు.

“ఏమి చెప్పనురా ,తమ్ముడూ !  ఆపల్లెలో ఉన్నంతవరకూ   పద్ధతిగానే ఉన్నాడు.ఊరు వదిలి పట్నంలో అడుగు పెట్టేసరికి, ఆయనలో దాగిన, అసలుగుణాలు ఒక్కొక్కటీ బయిటపడసాగాయిరా..

“అగ్నికిఆజ్యం పోసినట్లు” ఆయనకి “శకారి” ఒక స్నేహితుడు ఉన్నాడు.”వికారి “అనిపేరుపెట్టలేక “శకారి”అని పేట్టారేమో ?

వాడు సప్తవ్యసనాల సమ్మిళితం అనితర్వాత తెలిసింది.

 “మీబావ నన్నయినా వదిలేస్తారు గాని. వాడిని వదలరు”.

వాడు “ప్రజలవద్దకు పాలనలా,మీ బావ వద్దకు అన్నీ  తెచ్చి అందిస్తాడు  .ఇంటినే ఒక పబ్బుగా ,క్లబ్బుగా మార్చేసారు .. అదిగో! ఆమేడమీది గది వీళ్ళ సామ్రాజ్యం….

వాడిస్నేహం ఆయన బలహీనత ..వాడు పూర్తిగా తన అవసరాలకు ఈయన్ను వాడుకుంటాడు.

మీబావ ఎవరికీ తెలియకుండా, నాలుగు గోడల మద్యనే,  ఉన్న నాలుగు వ్యసనాలనూ నాణ్యంగా పోషిస్తున్నాడు.

మీబావను వదులుకుంటే, పబ్బం గడవదని వాడు

ఈయననుఅంటి పెట్టుకుని తిరుగుతాడు.

వాడి ధర్మమా! అని నన్ను చెల్లెమ్మ అంటాడు.

ఆ విషయంలో మర్యాదగా ఉంటాడు లే .

చెల్లమ్మఅంటునేమనింటినే.క్లబ్బుచేలి నీవిట రాకమ్మా,

బరువుగల ఇంటి పిల్లవు.. నన్ను  చెడ్డ చేస్తున్నాడు .అంటూనే……పేకాటలోబావదగ్గర డబ్బులు ఊడ్చేస్తాడు.ఆ పరిస్ధితిలో సేవలు చేస్తాడు ..

మీ బావచే  బాగా తాగించి, కక్కుకున్నాసరే తుడిచి ,

తనే పట్టుకుని  తీసుకొచ్చి ,సోఫాలో పడుకోబెట్టి వెళ్తాడు”.

“నేను ఏమిటిదని అడిగానంటే! నేను బ్రహ్మచారిని ,

నీకు లక్షణమైన భార్యుంది.వద్దురా! వద్దని చెప్పినా వినడమ్మా..వాడికి నేనురానంటేకోపం..

అందుకే నాకు తప్పడం లేదు అంటాడు .

“నాకేదో మహోప కారం చేసినట్లు ఫోజులు వాడూ”

.కోపంగా అంది మీనాక్షి” ..

మరి, మీ అత్తా మామా ? అనుమానంగా అడిగాడుమధు . పాపం, వాళ్లు మాత్రంఏమిచేస్తారురా?పరువుగలవాళ్ళు.

ఈ పాపిష్టి పనులు చూడలేక ,పాపం కుమిలిపోయారు .

ఇంత పెద్దఇల్లు కష్టపడి కట్టించి కూడా !ఈయన  తీరు భరించలేక, ఊరిలోనే ఎలాగోలా గడుపుకొని ఉంటామని వెళ్ళిపోయారు.. ఈవిషయాలేవీ ,మాకు చెప్పలేదేమిఅక్కా ?

 “ఏమిచెప్పనురా? ఆమ్మకి హార్ట్ ప్రాబ్లం. నాన్నకు డబ్బు ప్రోబ్లం. నీకింకా ఏఉద్యోగం రాలేదని బెంగలో వాళ్ళున్నారు …

         పిల్ల సుఖపడుతుందని గవర్నమెంటు ఉద్యోగస్తుడని, అప్పుచేసి మరీ ఇతడికి ఇచ్చి పెళ్ళిచేసి అవస్థలలో ఉన్నారు” .

“చెల్లని కాణీలాంటి  ఈ స్నేహితుడు, మా బ్రతుకుకు చిల్లు పెట్టాడు”.ఇవన్నీచెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక

అనుభవిస్తున్నాను అంది కళ్ళొత్తుకుంటూ మీనాక్షి.

“మీ బావ,ఇంకా బయిటకు వెళ్ళి రభస చేయడం లేదు.

దొరికిపోతే. పోలీసుల దెబ్బలు తినలేమని, ,గౌరవం  పోతుందని  ,కేసులుంటే ఉద్యోగము పరువుపోతుందని, భయాలున్నాయి కాబట్టి ఇంట్లోనే వాడి సాయంతో వ్యసనాలు  సాగిస్తున్నారు .  మీ బావ స్వతహాగా మంచి వాడే.

ఆదరిద్రుడే! మీ బావని, వాడుకొని  పబ్బం గడుపుకోడానికి ఇంటికొచ్చిమరీ  పాడుచేస్తున్నాడురా!  మళ్ళీ బావురుమంది మీనాక్షి.  “మన నువ్వులలో నూనె లేకపోతే నూనెఆడించిన వాడిని అని లాభమేంటి” ?బావకు బుద్ధి లేదు. అనవు.

“నామాటవిని ఏడుపు ఆపు”. నేనున్నాను బాధపడకు .         బావకి నేనొచ్చిన సంగతి చెప్పకు.బావ రాకముందేవెల్తాను.

నీకు సాయంగాఉంటాను .నీసమస్య పరిష్కరిస్తాను ,

నన్ను నమ్ము .. బావని మామూలు మనిషిని చేస్తాను “

“నువ్వు కొన్నాళ్లు నాకు ఆర్ధిక సమస్య రాకుండా ఆదుకో”. అమ్మా నాన్నలకు నీదగ్గరున్నట్లే చెప్పు ..

     బావవాళ్ళతో  నాగురించి మాటాడకుండా చూడు” .

ఏడవకు .ఇలాచెయ్యని చెవిలో చెప్పి  వెళ్ళాడు మధు” ..

..    నా కాపరం నిలబెడతానంటే నువ్వు చెప్పినట్లే చేస్తాను తమ్ముడిని దిగ బెడుతూ అంది మీనాక్షి .

                              ************.        

“లాన్లో కూర్చుని. పేకాట ఆడుతున్న. సుందర్, శకారీలు

మే  ఐ. కమిన్. అన్న పిలుపుకి. తలెత్తిచూసారు “ఎదురుగా.ఎంతో అందమైన. అమ్మాయి”.  వ్హాట్. కెన్ .ఐ .డూ. ఫర్. యూ. .? అని వంకర్లు తిరిగిపొతున్న“శకారి” వికారాలు పట్టించుకోకుండా,సుందర్ దగ్గరకెళ్ళి నిలబడి .

మీఇంట్లో మేడమీద పోర్షన్ ఉందని తెలిసివచ్చాను.

అద్దెకు ఇవ్వడానికి వీలవుతుందా ? వయ్యారంగా అడిగింది

 ఆ అందాల సుందరి” .. ఆ !.. ఓహ్  ..అని చెయ్యి ముందుకి జాపిన  సుందర్  చేరువగా వచ్చి నిలబడి ,ఐయాం మిస్. మయూరీ।అంది.

“అయినా ! మీకెవరుచెప్పారు? మామేడమీద అద్దెకు గదిఉందని? పై వాళ్ళకి  ఇవ్వం అన్నాడు సుందర్.

 “పకపకా నవ్వుతూ! నేను పైదాన్ని కాదండీ!

మీ ఆవిడకు చిన్నాన్నకూతురిని అవుతాను  .

మాదీ ఆ ఊరే .మీ పెళ్ళికి ఊర్లోలేక  నేను రాలేదు ..

ఇక్కడ కొత్తగాఉద్యోగంలో చేరాను. 

“అప్పుడు కోవిద్ వలన హొస్టల్ ఖాళీచెయ్యమంటే

వెళ్ళి పోయాను”.కంపినీ వాళ్ళు రమ్మంటే మళ్ళీ ఇక్కడికి  వచ్చేసాను..ఫ్రెండ్  తో ఉంటున్నాను అది

రూమ్ ఖాళీ చేసింది..ఒంటరిదాన్ని .. మా వాళ్ళుఛెప్తే మీ మేడమీది గది ఖాళీ అని తెలిసివచ్చాను ..

అయినా ! అక్క మా అక్కేగాని మీరు ఒప్పుకోవాలిగదా?

మీకు ఇష్టం  లేకపోతే మిమ్మల్ని ఇబ్బందిపెట్టను,బావగారూ.. అక్క తో చెప్పనే లేదు .ఫోన్లోనే ముభావంగా మాటాడింది. ఏమంటుందో డౌటు?దానికి నేనుండడం ఇష్టముండదేమో ?

           మీకు మాట రానివ్వను..పొందికగాఉండి నాపని నెరవేరగానే వెళ్ళిపోతాను ..ప్లీజ్! బావగారూ !

 మీరే ఆదుకోవాలి. “ముందరికాళ్లకి బంధంవేస్తూ” మెలికలు తిరుగుతూచెప్పింది మయూరి.  . ……….

ఆశ్చర్యంగా చూస్తున్న సుందర్ తో ,ఒరే,ఓకే! అనేయరా।..అని ఫ్రెండు వికారి  పొడుస్తుంటే, అతనిని ఆశ్చర్యంగాచూస్తూ.ఇతనెవరు బావగారూ ?      

 మధ్యవాళ్ళ ప్రమేయం నాకిష్టముండదు .మీరే చెప్పాలి ..

మీకుఇష్టంలేకపోతే చెప్పండి అంది అతన్ని చిరాగ్గాచూస్తూ

మయూరి. .. వాడి స్నేహీతుడు  అంటుంటే,

అక్కను కలిసి   వస్తాను అని ముందుకు కదిలింది వయ్యారంగా మయూరి..

   “ ఒరే। నువ్వు మధ్యలో దూరకురా..మయూరీ।ఎంతమాట.నువ్వునిరభ్యంతరంగాఉండవచ్చు…  హామీ! ఇచ్చేసాడు సుందర్…

 సరేగాని ,బావగారూ ,ఒకసారి అక్కని అడగండి .

అని దీర్ఘాలుతీస్తూ అంది మయూరి.

మబావగారిళ్ళు  మీది అనుకోండి..మంచి పనిచేసావురా ! అంటున్న,  బావ స్నేహితుని,విసుగ్గాచూసి…. ,

ఇతనెవరు బావగారూ ? మీకు ఇతని సలహాలు కావాలా? మీకు వ్యక్తిత్వం లేదా ? సారీ బావగారూ …నేను మీ ఇంట్లో ఉండలేనంటూ బయిటకు నడవబోయింది మయూరీ ..

 ఒరేయ్ !  ఆటక్లోజ్ చేద్దాం.నువ్వెళ్ళుఅంటూ లేచాడు సుందర్…అదికాదురా ! అంటుంటే ,వెళ్ళరా !వెళ్ళు అని,

అదేంటిరా !.  అన్న శకారి తో ,”ఇంకోక మాట .మనం ఇకపై బయిటనే కలిసి మాట్లాడు కుందాం.నీకు ఫోన్చేస్తేనే కలియు. .నువ్వు మాయింటికి రాకు”. ..పాపం। మయూరిని .ఇబ్బంది పెట్టడం ఎందుకు ? అని చెప్పి ,పద మయూరీ అని ,వెనుదిరిగి ,అతని వైపు.చూడకుండా లోపలికి దారితీసాడు ,సుందర్, …

“మరదలిని చూసి మతిపోయిందా”?

నన్ను రావద్దని చెప్తావా? చూస్తానురా ?ఆ అమ్మాయి నీ కొంపలో చిచ్చు పెట్టకపోతే నాపేరు “శకారి”. కాదు ..

అరుస్తున్న స్నేహితుడిని పట్టించుకోకుండా..

పో, ఫోరా ! నా సంగతి నేను చూసుకుంటానని మయూరి

వెనుక వచ్చేసాడు సుందర్ “..

“వరండాలో చాటుగా నిలబడి అంతావిన్న మీనాక్షి విస్తుపోయింది” ..

“మీనా ! చూడు, ఎవరొచ్చారో? సంబరంగా లోపలికొస్తున్న భర్తను ,అతని వెనుకే వస్తున్న అమ్మాయిని  ఆశ్చర్యంతో అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి “….

“అదేంటే!అలా అయిపోయావు?మీ చెల్లెల్ని పలకరించవా ? అన్న సుందర్ మాటలకు తేరుకొని……

హాయ్ ! అక్కయ్యా ! అంటున్న మయూరితో  …

ఎప్పుడొచ్చావే ? ఎలా ఉన్నారు మన వాళ్ళంతా ? అంది . ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ..

బాగున్నారక్కయ్యా ! అంటుంటే ……

మీనా !హొస్టల్  క్లోజయిందట . వర్కింగ్ వుమెన హాస్టల్ ఎందుకు ? మయూరి మనతోనే ఉంటుంది అన్నాడు సుందర్ ..ప్లీజ్ !బ్రతిమాలింది మయూరి ..

మీరు ఒకసారి లోపలికి రండని. భర్తను పిలిచింది మీనాక్షి. …

“అదికాదండీ ! పెళ్ళి కావల్సిన పిల్ల .రేపు ఎటునుండి ఏదొచ్చినా?మనం చిక్కుల్లోపడతాం …మీ ఫ్రెండు కూడా వస్తుంటాడు . అసలే!రోజులు బాగాలేవు. ఇదసలే చాలాచురుకు..ఏక్షన్ ఎక్కువ జేస్తుంది…

అసలే! వాళ్ళ నాన్న గొడ వల. మనిషి ….జాగ్రత్తా !

ఎటునుండి ఏమొచ్చినా మనకు చెడ్డపేరు అంది సందేహంగా మీనాక్షి…

“వాడిని ఇక మనింటికి రావద్దని చెప్పేసానే…

అయినా। ఆ అమ్మాయే,మనిల్లు వెతుక్కుంటూవచ్చింది..

మనం రమ్మనలేదుకదా? సరదాగా ఉంది.నాకు స్వంత మరదళ్ళెలాగూ లేరు సరదా తీర్చుకోనీ మీనా!

 నువ్వీమీ!  కుళ్ళు కోకు…నాకు బోరు కొడుతోందే …

నీకు తెలుసు .అమ్మాయిలతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను .అయినా ।నేను నిన్నొక్కతినే పోషించలేక పోతున్నాను .“నిన్ను పెళ్ళాడింది మొదలూ, మనింటికి.

మీ తమ్ముడు తప్ప ,ఒక్క చుట్టమైనా రాలేదు” ….

“సరే! ఆమేడమీద గది . ఆ అమ్మాయి కొదిలేద్దాం.

నేనాదిక్కుకు కూడా రాను .కావలిస్తే నువ్వు వెళ్ళు ..

తనతోనే ఉండు .  మనకీ చేంజ్ ఉంటుంది హుషారుగా అన్నాడు సుందర్” ….“మీకు కొత్త మోజు కదా ! నేను చెప్పినా వినరు” ..ఏమి జరిగినా మీదే బాధ్యత.నాకు సంబంధం లేదు అంది మీనాక్షి.లోపలికెల్తూ .

ఇప్పుడు అక్క ఇలాగే అంటుంది .రేపటినుండి చూడండి ఎలా మార్చేస్తానో ? నవ్వుతూఅంది మయూరి

            **********************

 మర్నాడు వచ్చిన స్నేహితునికి మయూరి వాళ్ళ నాన్నపెద్ద అధికారిని ,లేని పోనివి చెప్పి బెదిరించి పంపించేసాడు సుందర్ ..

  మీనాక్షి అంది.ఏమిటో బాబూ ,”సారీ అక్కా ! నేను కరోనా వలన షాపింగ్ చెయ్య లేక పోయానని ,నాచీరలు,వస్తువులు వాడేస్తోంది కోపంగా అంది ..

పోనీవే !చిన్నపిల్ల .దానికి కావలసినవి వాడుకోనీ .

నీకు నేను కొంటానుగా అన్నాడు మయూరిని వెనకేసు కొచ్చి సుందర్” ..

ఏంటే,మీనా! ఈ అమ్మాయి.  మాటాడితే,గదిలో దూరిపోయి తలుపులేసుకుంటుంది.  ఏమిచేస్తుందంటావ్?ఒక రోజు భార్యనడిగాడు సుందర్ …

“ఏమోనండీ! అందరూ!నాలాగఉంటారా? అసలే ఇదిజాన. ,ఈరోజుల్లో అమ్మాయిలను నమ్మలేం? దీనికే వ్యవహారంఉందో? మీరు ఒవర్అవ్వకండి.జాగ్రత్తా! అందనుమానిస్తూ మీనాక్షి….

“తనలాటిది కాదే! అయినా మీనూ ?

ఈ అమ్మాయిగొంతేంటే ఒక్కో సారి బొంగురుగామగాడు ఆడవేషం వేసినట్లు  .మగగొంతులావినిపిస్తుంది  ? చాలా అందంగా ఉంది కానీ,,.కాళ్ళూ చేతులు  మొరటుగా !.

 నెల రోజులతర్వాత అన్నాడు సుందర్,

                మగరాయుడిలా పెరిగింది .. కరాటే అవీ నేర్చింది,దీనికీ నాటకాల పిచ్చే. రిహార్సులు వేస్తుందేమో? అది పొలం పనులు కూడా చేసేదండీ. ?అదృష్టం బాగుండి,

పట్టుదలగాచదివి , ఈస్థితికొఛ్చింది .

మీకు తెలుసా ? మావూరిలో దీన్నిమగరాయుడనేవారు..

అంటూ నెలరోజులకే మీకు మోజు తీరిందా ?వెటకారంగా అంది. మీనాక్షి .. ఓహో !అలాగా? ఏదయినా మంచి అమ్మాయి..కలుపు గోలుగా ఉంటుంది అన్నాడు  సుందర్.

                       ******************

నేనూ కిచెన్లో పనికి సాయం చేస్తాను .రా !అక్కా  !

బావగారిని కార్డ్స్ లో ఓడిద్దామని పిలిచి.ఆటలో ఓడిపోయిన సుందర్ని అల్లరల్లరి చేసేది  మయూరి.. .

   అబ్బ ! బావగారికి , కూల్డ్రింక్ తాగుతునైనా కంపెనీ ఇవ్వొచ్చు కదా !ఆడిన్నర్!  సంగతి నేను చూస్తానులే  అనేది  ఒకసారి ..“అన్నీ అరేంజ్ చేసి. మీనాక్షి ,సుందరేశులను వదిలి తను కిచెన్లో దూరేది మయూరి “…

ఆశ్చర్యంగా.!సుందర్లో చాలా మార్పు వచ్చింది …

తాగుడు ,పేకాట తగ్గాయి .. ముగ్గురూ కూర్చొని .కేరం,జల్దీ ఫైవ్ ,లాన్లో షటిల్ ,లాటివిఆడడం  చోటు చేసుకున్నాయి ..

ఇంట్లో ఏడ్పులు ,అరుపులు ,కేకల స్థానంలో

“ఆనందంగా  నవ్వులు .కేరింతలు సరసాలువినిపిస్తున్నాయి …యూట్యూబ్ ! చూసి మీనాక్షి రకరకాల వంటలు చెయ్యడం..ఇంటి నుండిపని.మయూరి, సాయం చెయ్యడం బాగుంది సుందర్  కి .

సుందర్. మయూరీ చెరొక లేప్ టాప్ .పట్టుకొని, పగలంతా పని. తీరికైతే ఆటలు ..భలే !బాగా.గడుస్తోంది..

ఆన్లైన్ ఆర్డర్లు. .కొత్తరకమైన,ఆటలు , సుందర్ మీనాక్షులను దగ్గర చేయడం మొదలుపెట్టింది మయూరి.

.          ***************

బావగారూ ! రండి మెడిటేషన్. ,యోగా. నేర్పిస్తాను .

నేను యోగా కోర్స్. చేసాను తెలుసా ? లాక్డౌన్   కాదు గాని మీకు పొట్టొచ్చింది తెలుసా ?

అక్కా ! బావగారు ఎంచక్కా యోగా చేస్తున్నారో చూడవే !,  నీకేమయిందే. .. సన్నగా చక్కగా ఉండేదానివి,మయూరి సలహా .. మీనాక్షిసుందర్లు, యోగా, మెడిటేషన్,  జాగింగ్ ,మొదలు పెట్టారు  . 

             ++++++++++++++++++++++.

 అదేంటక్కా ? అంతా బాగానే చేసాను గదా!

 వామిటింగ్స్ చేసుకుంటున్నావేం ? ఫుడ్ పాయిజనా. అని ..సిగ్గుపడుతున్న మీనాక్షితో ..

ఆహా! ,అదాసంగతి …

ఓహో !  కంగ్రాట్స్. !అక్కా !  బావగారూ !  కంగ్రాట్స్. 

మీరు ,తండ్రి కాబోతున్నారుట .సంతోషంగా అంది  మయూరి ..“చిన్నపిల్లలా గెంతుతూ మయూరి అంటుంటే ,,,,

 “నువ్వు ,మాఇంట అడుగిడిన మాఅదృష్టదేవతవి.

 నిజంగా !మయూరీ , నువ్వే ముహుర్తంలో  మాయింట్లో అడుగుపెట్టావోగాని! నాజీవితంలోమంచి మార్పు వచ్చింది.. ధన్యవాదాలుమయూరీ,చాలా.చాలామార్పులొచ్చాయి.

మాలో, అన్నాడు సుందర్ .మీనాక్షి అదే మాటంది ..

నాకూ మంచి జరిగింది బావగారు .మీకు చాలా ధన్యవాదాలు..

అర్జంటుగా రమ్మని అమ్మా ! నాన్న ఫోన్. చేసారు .

  నాన్న కసలే చాలా తిక్క. బావగారూ !ఏ సమస్యను.

 ఎపుడు ఎదురు పెడతారో ?

ఆయిన సంగతి నాకు బాగా తెలుసు ….నేను వెల్తాను .…

ఏదయినా ,మిమ్మల్ని చూస్తే నాకు గొప్ప గౌరవం ..

చిన్న గవర్నమెంటు బడిలోచదివి గ్రూప్ వన్ ఆఫీసరయ్యారు.

కోచింగ సెంటర్ పెట్టి మీ తెలివి బీదవారికి పంచండి బావగారూ .మంచి సమయంలో ఆదుకున్నారని ,ఆదరాబాదరగా బయిల్దేరింది  మయూరి .

.మీ అక్క ! ఈ స్థితి లో ఉంది ..నేను  నీతో  వద్దామంటే!  ..కుదరదు..జాగ్రత్తగా ! వెళ్ళివచ్చేయ్.  బాధగా అన్నాడు సుందర్ .స్వయంగావచ్చి అన్నీ కొనిచ్చి ,బస్సు ఎక్కించాడు సుందర్.

కాలం ఎంత తొందరగా గడచి పోయిందో ।.

నీ మేలు. జీవితంలో మరచి పోలేను .కన్నీళ్ళ తోఅంది మీనాక్షి        **** 

ఏమయిందే  ! మయూరికి ?వారం రోజులైనా!  ఫొన్ లేదు? అంటుండగానే, బావమరిది.మధు ప్రత్యక్ష మయ్యాడు…

ఏమయిపోయావురా, ఈమధ్య ? పలకరిస్తూ అన్నాడు సుందర్ …

మయూరీ ! అని ఏదో అడగబోతుంటే ,

అదో పెద్దగాధ బావగారూ! !వాళ్ళనాన్న దానికిష్టం లేని పెళ్ళి కుదిర్చాడు .ఇది ఒక రాత్రికిరాత్రి  చెప్పాపట్టకుండావెల్లి పోయింది ..దుబాయ్ వెళ్లిపోయిందని ఊరంతా గోలగోల ..

 వాళ్ళ నాన్న గంతు లేస్తున్నాడు .

మీరు ఇన్వాల్వ్ అవ్వకండి బావగారూ!వాళ్ళసలే పేచీ కోరువాళ్ళు.ఎవరిని ఇరికిద్దామా అని చూస్తారు. . 

.మీ అదృష్టం బాగుండి ,అది మీ యింటికి రాలేదు.అన్నాడు మధు .అవునవును, అన్నాడు సుందర్  ..

మధూ!   మీసం అవీ తీసేసావేమిటిరా ? అనుమానంగా చూస్తూ. …అదా ! మా ఫ్రెండ్స్ తో కలసి డ్రామా అడాను బావగారూ ..అందుకోసం ..అన్నట్టు నాకు “దుబాయ్లోఉద్యోగం”వచ్చింది .అదిచెప్పడానికే వచ్చాను ఆనందంగా అన్నాడు .. 

                 *********

థేంక్స్ రా.,తమ్ముడూ ! నా!బ్రతుకు నిలబెట్టావు ..

అమ్మా! నాన్నా! నాటకాలాడుతాడు.ఆడవేషాలు వేస్తాడు. ఎలా!బతకుతాడో?  అని తిడుతుంటే, అవుననుకున్నాను..

కానీ ! ఆవేషంతోనే అద్భుతంగా నటించి ,నా బ్రతుకు నిలబెట్టావురా! అంది మీనాక్షి. అయినా ! అసలనుమానం రాకుండా ! అద్భుతంగాఎలా?నాటక మాడావురా ? ఆశ్చర్యంగా అందిమీనాక్షి,…

కళా కారులను తక్కువంచనా,వెయ్యొద్దుఅక్కా !

“కళాకారుడు పూర్తి గా మనసు పెట్టి చేస్తే!అది జీవ కళే” .

ఇక నిలబెట్టుకోవడం.నీచేతుల్లో ఉంది. సంతోషంగా ఉండు అన్నాడు మధు..

ఇదిరా,తమ్ముడూ।  బంధం అంటే అని నవ్వింది మీనాక్షి….

     +++++++++సమాప్తం .++++++

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఊర్లోఉషోదయం

by Damaraju Vishalakshi March 7, 2023
written by Damaraju Vishalakshi

చీకటి తెరలుతొలగించుకొని చిరువెలుగులు పరచుకుంటున్నాయి/

వెలుగులు విరజిమ్ముకుంటూవేకువ వెల్లువౌతోంది 

తూర్పుకనుమలపొత్తిళ్ళు తొలగించుకొని /

కందగడ్డలాంటిముఖంతో కళ్ళుతెరచి చూస్తున్నాడు భానుడు  .

ఉర్వీకాంత ఉద్విఘ్నభరితమౌతుంటే  /

కమలబాంధవుడు కనులు విప్పార్చి చూస్తున్నాడు .

సూర్యుని సొగసుచూసి సిగ్గుల మొగ్గైన కమలిని/

 కమలముల చాటున దాకున్నదృశ్యం కమనీయంగా ఉంది .

పసుపుగడపలపై పడిపరావర్తనం చెదుతున్న ప్రభాతకిరణాలు /

ముత్యాల ముగ్గులపైపడి మెరసిపోతున్నాయి

కోదండరాముని శిఖరంపై కోవెలగంటలపైపడి 

పవిత్రతపొందిన  ప్రభాకర కిరణాలు/

శిరస్సులను స్పృశించి శిరోధార్యమౌతున్నాయి …

చరాచర జగత్తునంతాచైతన్యపరచే బాలభానుని బంగరుకిరణాలు భేదభావం లేకుండా/

 ప్రసరిస్తూ ప్రమోదాన్ని కలిగిస్తున్నాయి 

గుండెలనిండా ఊపిరిపీల్ఛుకొని గూళ్ళనుండి బయిటకొస్తూ  

కలసికట్టుగా ఆహారాణ్వేషణకు బయిల్దేరిన పక్షులగుంపులు/

సమైక్యతాత్మక జీవనానికి సజీవసాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. 

పచ్చనిపైరులనుండి విచ్చుకుంటున్నవిరులపైనుండి 

వీస్తున్న గాలులు  ప్రేమగా శరీరాన్ని నిమురుతూ /

ప్రకృతిని కాపాడుకోమని పరోక్షంగా చెప్తున్నాయి .

శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా సాగిపోయే

కర్షకులతో కార్మిక శ్రామికులతో కలకలలాడుతూ 

సౌందర్యానికి సాకామైన  ఆ ఊరు /

ఉత్సాహంగా ఉగాది సంబరాలకు ముస్తాబౌతోంది .

నిండు గర్భిణిలా నూతనోత్సాహంతో ఉన్న ప్రకృతికాంతకు

సీమంతం చేయడానికి సిద్ధమైన వసంతం /

పచ్చనిచెట్ల పసుపు  ఎర్రనిచిగుర్ల కుంకుమతో

 ఎదను పులకింప జేస్తోంది  .

గున్నమామిడి చెట్లగుబురులలో నుండి మావిచిగుర్లు తిని 

మత్తెక్కి కూసున్న కోయిల /

కాల మహావిపంచిలోని ఈ శుభకృతు నామ సంవత్సర 

తంత్రిని మీటుతూ కుహు కుహురావాలతో  

ఈకొత్త సంవత్సరానికి స్వాగతం పల్కు తోంది 

 ఊర్లో ఉగాది ఉషోదయం ఉత్సాహాన్నినింపుతూ 

కనులపండువ చేస్తోంది

 ఇట్లాంటిగ్రామాలేకదా!గాంధీజీ కలలుగన్నగ్రామసౌభాగ్యమును 

అభివృద్ధి చేస్తాయి అన్నట్లుంది ఊర్లో ఉషోదయం ..

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – సినీ గీత విశ్లేషణ.

by Padmasri Chennojwala March 7, 2023
written by Padmasri Chennojwala

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట భావం ఎంత గొప్ప గా ఉందో చూద్దాం:-
1969 వ సంవత్సరంలో మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో విడుదలైన ‘మాతృదేవత ‘అనే చిత్రంలో ని పాట ఇది.
సి .నారాయణ రెడ్డి గారు రచించి కె.వి.మహదేవన్ గారు స్వరపరిచి, పి. సుశీల , వి. వసంత గార్లు గానం చేసిన పాట. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ‘ అనే ఈ సినీ గీతం స్త్రీ ను మనిషి జీవితంలో పరిణామక్రమంలోని భిన్న దశలను ఆవిష్కరింపజేస్తుంది.

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ‘

జాతికి ప్రాణం పోసింది అనకుండా జాతి మనుగడకే ప్రాణం పోసింది అనడంలోనే నిత్యజీవితంలోనూ, జీవన గమనంలోని వివిధ అధ్యాయాల్లోనూ ఆమె పోషిస్తున్న పాత్ర ఎంత శక్తివంతమైందో , తన వారి ఆనందం కోసం అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని అనురాగమూర్తి అని చెబుతున్నారు .

‘ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి ‘

చెల్లిగా , ప్రేయసిగా , తల్లిగా జీవితంలోని వివిధ మలుపుల్లో బాధ్యతనెరిగిన ఆమె తీరును చక్కగా ఉటంకిస్తూ , సమయానికి అందరికీ అన్నీ సమకూర్చే ఆమె భువిపై వెలసిన కల్పవృక్షం వంటిదని అంటున్నారు . ఈ చరణంలో జీవితంలోని వివిధ బంధాల పట్ల ఆమె వ్యవహార శైలిని చక్కగా వర్ణించారు . ‘

‘సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది ‘

సహనంలో ఆమె భూమాత పుత్రిక అయిన సీతమ్మ వంటిది అంటున్నారు . అయితే అయి ఉండవచ్చు . సహనం ఉన్నతమైన లక్షణమే . దాన్ని ఎవ్వరూ కాదన లేరు . కానీ ఎదుటి వ్యక్తి దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందనీ , అది ఒక్కసారి హద్దు దాటితే గనుక ఎదురయ్యే పరిస్థితులను తక్కువగా అంచనా వేయకూడదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది . ఇక్కడ మనం ఇంకాస్త లోతైన విశ్లేషణలోనికి వెళితే ఏ తిరుగుబాటైనా అణచివేత నుండే పుడుతుందనీ, ఏ తిరుగుబాటుకైనా పురిటిగడ్డ అణచివేతేననీ ఎన్నో పురాణాలు , చారిత్రక ఆధారాల ద్వారా ఇది నిరూపితమైందనే విషయాన్ని మనం మరువకూడదు.

‘రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది ‘

యమునా తీరాన కృష్ణుని రాకకై ఎదురుచూసే రాధమ్మ గుండెలోని తీయని వేదనను వ్యక్తపరచడంలో అంటే మధుర భక్తిని , శృంగార రసాన్ని పలికించే స్వాధీనపతిక (జయదేవ కవి తన గీతగోవిందం కావ్యం లో రాధమ్మను స్వాధీన పతికగా అభివర్ణించారు ) కూడా ఈమెలో దాగుంటుందని చెబుతున్నారు .

‘మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది’

కలం అనే దారంతో అక్షర కుసుమాలను హారంగా అల్లగలిగే కుసుమ కోమలి అనీ, శరత్కాల పున్నమి వెలుగులు ఆ కవనవనంపై తేనెజల్లుగా కురిపించగల ప్రజ్ఞాశాలి అని అంటున్నారు .

‘లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది ‘

స్నేహాన్నీ, అనురాగాన్ని పంచితే ఎంత సుతిమెత్తగా మసులుకుంటుందో, పరిస్థితులు వేడెక్కితే అపరదుర్గలా తిరగబడుతుందనీ , ఈమెలో భిన్న పార్శ్వాలు దాగుంటాయనీ, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరమైతే అది ఆమెలోంచి బయటకు వెలువడుతుందనీ, ఎదుటి వ్యక్తి జాగరూకుడై మెలగాలని హెచ్చరిస్తున్నారు. ఈ చరణం లో రచయిత స్త్రీలోని భావోద్వేగాలను గూర్చి , ఆమెలోని మానసిక సంఘర్షణను , ప్రజ్ఞాపాటవాలను అందంగా విశదీకరించారు .

“తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాలసరులు”

ఆమె పెదవిపై మెరిసిన చిరునవ్వును ముత్యాల సరులతో పోల్చుతున్నారు . ఇక్కడ మనం ఇంకాస్త ముందుకెళ్లి ఉత్ప్రేక్షను అన్వయిస్తే గనుక ఆమె నోటిని నగల పెట్టగా , ఆమె రెండు పెదవులను ఆ పెట్టయొక్క రెండు భాగాలుగా , ఆ పెట్టెను తెరవగానే మెరిసే ముత్యాల హారాలు అంటే ఇక్కడ ముత్యాల దండలాంటి ఆమె పలువరస ఏం తెలుపుతుంది అంటే, ఆమె గుండె లోతుల్లోంచి పెల్లుబికే భావాలు ఆమె ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది ,అవి నవ్వులుగా విరబూయిస్తుంది అనే విషయాన్ని తెలుపుతున్నాయి .ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మనసుకు కష్టం కలిగించకూడదని హితాన్ని బోధిస్తున్నారు . “

“కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు “

స్త్రీ హృదయంలో తుఫానులు, సునామీలు సృష్టిస్తే ఆమె కన్నీరు కార్చే చోట సిరి క్షణం కూడా నిలబడదని హెచ్చరిస్తున్నారు. సిరి తొలగిన చోటు ఎంత దుర్భరంగా ఉంటుందో , ఎంత వేదన తాండవిస్తుందో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే ఏం లాభం? ఆమె కన్నీటిని తేలికగా తీసుకోకూడదని , ఆ కళ్ళలోంచి రాలిన ఒక్కొక్క కన్నీటి చుక్క సప్త సముద్రాలై ఉప్పొంగి వాటికి కారణమైన వారిని ముంచేస్తుందని హెచ్చరిస్తున్నారు .

“కన్న కడుపున చిచ్చు రగిలెనా కరువుల పాలవును దేశం “
కరువు అంటే ఏమిటి? వర్షాలు కురవక పంటలు పండక, తాగునీటి కీ, సాగునీటి కీ తట్టుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవటం. సరిగ్గా ఈ భావాలను మనుషుల నిత్య జీవితానికి అన్వయించుకుని పాటలోని ఈ భావాన్ని విశ్లేషించుకోవాలి. ఇక్కడ,
కరువు అంటే అమ్మాయి ల ను అంటే ఆడపిల్ల లను కనవద్దని బెదిరిస్తాడు ఆంక్షలు పెడతారు. దొంగచాటుగా పరీక్ష లు చేయించి భ్రూణ హత్యలకు పాల్పడతారు. ‘ఆమె ల‘ హృదయం లలో అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యి అసలు పిల్లలను కనడానికే నిరాకరించారంటే ఇక జనాభా ఉండదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఎండిన బీడులా, పచ్చదనం మొలకెత్తని ఎడారి లా ఈ భూమి మనుషులు లేక మొత్తం కరువుల పాలవుతుంది అని హెచ్చరించారు . అంతే కాదు ,
ఇక్కడ స్త్రీ ని దేవతగా , ఆమె కడుపును
గర్భగుడిగా భావిస్తే , గర్భగుడిలో దీపం వెలిగిస్తే అందులో కొలువై ఉన్న దేవతామూర్తి రక్షణ కవచమై మనల్ని కాపాడుతుంది . అదే చిచ్చు పెడితే కార్చిచ్చై దహించి వేస్తుంది . అంటే కడుపు రగిలిన స్త్రీ శాపం పెడితే ఎంత శక్తిమంతంగా ఉంటుందో , ఆమెలో రగిలిన ఆ చిచ్చుకు కారణమైన జీవితాలను అది ఎంతగా తుత్తునియలు చేయగలదో , అత్యంత బరువైన బాధను చాలా చక్కని పదాలతో చెప్పగలిగిన రచయిత రచనాకౌశలానికి వేనవేల వందనాలు .

“తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం ” కనిపెంచిన తల్లిని (తల్లిదండ్రులను ) దైవ సమానులుగా పూజించాలని, వృద్ధాప్యంలో వారిని నిర్దాక్షిణ్యంగా వదిలి వేయకూడదనీ, వారికి ఊతమై కంటికి రెప్పలా కాపాడాలని హితాన్ని బోధిస్తున్నారు. ఈ చరణంలో రచయిత స్త్రీ తో మెలగాల్సిన తీరును సూచించారు. ఆ స్త్రీ తల్లి అయినా , సోదరైనా భార్య అయినా ఇంకెవరైనా అది బంధమైనా లేక స్నేహమైనా ఆమె మానవ కళ్యాణానికి జీవగర్ర అని తెలుసుకోవాలి.

మూడు చరణాలుగా సాగిన ఈ గీతంలోని మొదటి చరణంలో ఆమె వ్యవహార శైలిని , రెండవ చరణంలో ఆమెలోని భావోద్వేగాలను , మూడవ చరణంలో ఆమె పట్ల ఇతరులు మెలగాల్సిన తీరును రచయిత చక్కగా వర్ణించారు .

ఈ గీతం ప్రబోధాత్మకమైనదా లేక సందేశాత్మకమైనదా అనే ప్రశ్న నాలో తలెత్తినప్పుడు రెండింటి కలయిక అనే నిశ్చయానికి రాగలిగాను . ఇంత చక్కని గీతాన్ని రచించిన రచయిత గారికి , సంగీతాన్ని సమకూర్చిన స్వరకర్తల వారికి , తమ గాత్ర సౌందర్యంతో శ్రోతలను గాన సుధా స్రవంతిలో ఓలలాడించిన గాయనీమణులకు అందరికీ అభివందనాలు . స్త్రీ ఉనికిని అన్ని కోణాలలో ఆవిష్కరింపజేసిన ఈ గీతాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫురించుకోవడం ఆ గీతానికి మనం అందించే చక్కని గౌరవం.

                   పద్మశ్రీ చెన్నోజ్వల
March 7, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సదాశివ బ్రహ్మేంద్రరలు

by Krishna Kumari Yagnambhatt March 7, 2023
written by Krishna Kumari Yagnambhatt

17 వ శతాబ్దికి చ ేందిన ఉత్తమ వాగ్గేయకారులలో సదాశివ బ్రహ్మేంద్రరల వారొకరు. వీరి ఋషిత్ులుుల ైన పదాలలో ఆధ్ాుత్మమక , భకిత భవనాలు నేండారి ఉనాాయి. ఎననా యజ్ఞా లు చేసిన పవిత్ర మూరుత లు వీరు. అేంతేకాద్ర, దారుకావన విలాసము, ఉత్సవ మేండపము అనర మేండపములు కట్టేంచిన విత్రణ శీలురు.వీరిది పరసిదిికెకిిన శీీ శివా ద ైైత్ మతానకి చ ేందిన సేంపరదాయేం అయినపపట్కీ సేంగ్ీత్ కచేరీలలో వీరి కీరతనలు పాడడేంవిదాైేంసరలకు అలవాటే.సదాశివ బ్రహ్మేంద్రర ల పెరు చ పపగ్ానే “మానస సేంచరరగ “ అనా కీరతన గురుత కు వసరత ేందిఎవరికెైనా. వీరి కీరతనలలో సగుణోపాసన, నరుేణో పాసన రెేండు భావనలు కనపసరత నాయి. ద్క్షిణ భారత్ేంలో అనేక ఆశ్రమాలలో వీరి కీర్త నలు అక్షర్ బద్ధ ం చేయబడి ర్క్ష ంపబడుతున్నాయి. దాని ఆధార్ంగా వీరు పర యోగంచిన రాగాలు తెలుస్తు న్నాయి. కంతలవరాళి, స్తర్టి,కంభోజి, మోహన, తోడి, ధనశ్రర,ఆనంద్ భై ర్వి మొద్లై న రాగాలను వీరు ఉపయోగంచారు. భగవంతుని నిరాకరునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని, సగుణునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని గమనించినట్ల యితే వీరి భక్త గాఢత, తతపర్త అర్థ మవుతాయి. పర్మేశ్వరుని పట్ల వీరిక్ గల అపరిమిత విశ్వవసం తెలుస్తు ంది. అయితే కీర్త నల లో ఏ లౌక్కమై న కోరికలు కోరుతునాట్లల కనిపంచదు.నిర్మలమై న భక్త విశ్వవసాలు తపప ఇంకో భావన ఈ కీర్త నలలో గోచర్ం కదు. వీరిది పర్మహంస ముద్ర. మృదువై న భాషతో కూడిన వీరి కీర్త నలు సంగీత చరితర లో ఒక పర తేేక సాథ న్ననిా కల్గి ఉన్నాయి. ఒక ఉదాహర్ణ చూడండి. పలల వి: చింతా న్నస్తు ఖిలం తేషం చర్ణం: శ్మద్మ కరుణా సంపూరాా న్నం సాధు సమాగమ సంకీర్ాన్నం చర్ణం: పర్మహంస గురు పద్ చితాున్నం బర హ్మమ నందా మృత మతున్నం . ఇదీ మన వాగ్గి య కరుల సంక్ష పు చరితర. ఒక్కొకొ వాగ్గి య కరుని గురించి తెలుస్తకోవ లస్తంది ఎంతో ఉంది. వారు మనక ఇచిిన సందేశ్వనిా అర్థ ం చేస్తక్కని ముందుక సాగడం మన కర్త వేం.వారు జనిమంచిన దేశ్ంలో మనం పుట్ట డం ఎంతో అద్ృషట ం. ఈ అద్ృషట నిా మన స్తకృతంగా భావించి కర్త వాేనిా పాల్గంచినట్ల యితే మన జీవితాలు ధనేం అవుతాయి.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi March 7, 2023
written by Chillara Bhavanidevi

6
మనస్సు శాంతపరుచుకోవడానికి మంజరికి ఒకే ఒక మార్గం మిగిలింది. అది వివిధ శిల్ప సుందర దృశ్యాలను చూసి సమ్మోహనంగా నర్తించటం. ఆ రోజు ఉదయమే మంజరి భూగర్భ ప్రసన్నవిరూపాక్ష దేవాలయానికి బయలుదేరింది.
దేవాలయప్రాంగణం చేరి నిరంతరం నీటిలో నిమగ్నమై ఉండే విరూపాక్షుని సందర్శించింది. ఈ స్వామిని కొలిచినవారి మనస్సు పరమ ప్రసన్నమౌతుందిట. మంజరికీనాడు స్వామి దర్శనం పరమానందాన్ని కల్గించింది.
భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరం కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైన సందర్భంగా పునరుద్ధరణకు నోచుకున్నది. భూమట్టానికి దిగువగా ఉన్న ఈ దేవాలయం తూర్పు అభిముఖంగా రెండు పెద్ద గోపురాలతో గంభీరతను ప్రసాదిస్తోంది.ధ్వజస్తంభం,మహామండపం, గగన దీపస్తంభం, పలుమండపాలతో శోభాయమానంగా అలరారుతున్న ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో చతురస్రాకారపు బలమైన స్తంభాలతో విశాలమైన మండపాలనేక మున్నాయి. మహామండపం నుంచి అర్థమండపం, షట్కోణాకారంతో ఉన్న మండపం నీటిలోనే ఉంది.
తీక్షణకుంభంగల పెద్ద విగ్రహం. కళ్యాణమండపాలను దాటింది మంజరి. ఆ దేవాలయ శిల్పకళా వైభవం ఆమెలో పరమ భక్తిభావాన్ని మేల్కొలిపింది. ప్రసన్న విరూపాక్షుని ఎదుట మహామండపంలో ముద్రపట్టి నృత్యరీతిలో శివారాధన చేస్తున్నది మంజరి.
పరమేశ్వరా దేవా జగదీశ్వరా!
దయాగుణశేఖరా, స్వామి పంపాపతీ!
నిను మనసార కొలిచేను మహేశ్వరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
ఆడేనురా పాట పాడేనురా!
ఎన్ని జన్మలకైనా పూజింతురా
నీచరణాలె శరణంటి నటధీవరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
గిరజావరా స్వామి వరసుందరా
భవములు బాపేటి ముల్లోక దీనబంధుడా!
మూడు కన్నుల కాచేటి మునివంద్యుడా
మమ్ముకృప జూపి కాపాడు శివశంకరా!
ఆమె పరవశంతో భక్తిభావంతో నర్తిస్తున్నది. శివకైంకర్యమైన ఆ నృత్య సమారాధనకు పరమశివుడు కూడా పరమానందంతో నర్తిస్తుంటే స్వామి జటాజూటం నుంచి గంగ తొణికిసలాడిరదేమోనన్నట్లు చిరుజల్లు ప్రారంభమైంది. గుడిప్రాంగణంలో జల్లుల స్వర విన్యాసంతోబాటు వీరేంద్రుని అట్టహాసానికి ఆమె ఒళ్లు జలదరించింది. చుట్టూ పరికించి చూసింది.
సిల్కుధోవతి, ఆపైన జరీ అంగరఖా, పట్టుకండువా, ముత్యాలపేర్లు ధరించి కన్నుల్లో కుటిలత్వం నింపుకున్న వీరేంద్రుడు ఆమె ఎదుట నిలిచాడు.
‘‘అమ్మాయీ… బాగు బాగు’’ మరోసారి విచిత్రంగా నవ్వాడు.
‘‘మీరా’’ ఆమె భయాందోళనతో ఒకడుగు వెనక్కి వేసింది.
‘‘జగన్నాథ! అంత భయమెందుకు? నీ నృత్యకౌశలం గురించి విన్నామేగానీ చూసింది లేదు. చిన్నాదేవి నృత్యంలో శృంగారం పాలు ఎక్కువట గదా! ఆమె నృత్యాన్ని చూసే అవకాశాన్ని రాయలు మాకివ్వలేదు. ప్చ్‌! ఏం చేద్దాం! జగన్నాథ!’’
‘‘ఏమిటీ మాటలు? వారిప్పుడు దేవేరులు. అలా మాట్లాడరాదు.’’
‘‘హు! ఏం దేవేరి? ఒక దేవదాసి ఎన్నటికీ దేవేరి కాలేదు. ఆ దాసీపుత్రుడు కృష్ణదేవరాయలకు ఆమె తగిన దేవేరియే! దేవేరి అంటే మా గజపతులపుత్రి అన్నపూర్ణాదేవే!’’
‘‘విూరిట్లా మాట్లాడటం తగదు. రాయలవారి తల్లిగారు వీరనరసింహ రాయలవారికి చాలాకాలంగా పుత్రసంతతి లేదు. నరసప్ప నాయకుని ముగ్గురు భార్యలలో నాగలాంబిక కుమారుడు రాయలవారు. అందరికీ తెల్సిన విషయమే గదా!’’ మంజరి వీరేంద్రుని అపోహను ఖండిరచింది.
అతడు వికటంగా నవ్వాడు.
‘‘ఇదంతా మీరనుకుంటున్నది. కానీ అది నిజం కాదు. మీలాంటి వారిని మభ్యపెట్టడానికి. అసలు సంగతి చెబుతాను విను జగన్నాథ!
రాయలు సత్కుల సంజాతుడు కానేకాదు. రాయల తండ్రి నరసనాయకుని చేతిలోని నీటిపాత్రలో ఓ సాయంత్రం ప్రకాశవంతమైన చుక్క రాలింది. ఆయన ఆ పాత్రమూసి మంత్రిగారికి ఈ విషయం కబురు చేశాడు. మంత్రిగారు ఆ నీటిని తాగమని రాజుకు వర్తమానం పంపాడు. రాజు నీటిని తాగి ఆ రాత్రి పట్టపుదేవి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ ఆమెను కలవలేని సందర్భంలో ఆమె పరిచారికతో కలిశాడు. కృష్ణరాయని జన్మ ఆమెవల్ల జరిగింది’’ వీరేంద్రుడు గొప్ప రహస్యం కనిపెట్టినవాడిలా నవ్వాడు.
‘‘అంటే మీ వుద్దేశం రాయలవారి తల్లి కులీన కాదనేగా’’
‘‘జగన్నాథ! అందుకే ఆయన బుద్ధి కూడా అలాగే పెడతోవబట్టింది. భోగకాంతయిన చిన్నాదేవిని చేరదీశాడు కదా!’’
‘‘ఛీ! మీకీ విషం ఎవరు పెట్టారు? మీరు కులీన స్త్రీకి జనించలేదా?’’ మంజరి బుసకొట్టింది.
ఆ క్షణంలో ఆమె పరమశివుని కంఠాభరణమైన నాగినిలా ఉంది.
‘‘ఏం కూశావ్‌! మా గజపతుల వీరపరాక్రమం గురించి నీకు తెలీదు! కొన్నాళ్ళు ఆగు. నువ్వూ, నీ రాయలు ఈ విజయనగరం మట్టిలో కలవకపోతే నా పేరు వీరేంద్రుడు కాదు’’ హుంకరించాడు.
మంజరి వెంటనే తేరుకుంది. యుక్తివంతంగా వ్యవహరించాలనుకుంది.
‘‘మీరన్నదే నిజమైతే ఇంతటి దాసీపుత్రునికి అన్నపూర్ణాదేవినిచ్చి ఎలా వివాహం చేశారు’’ ఆరా తీసింది.
‘‘అదా! గ్రహచారం జగన్నాథా! ఇస్తే ఇల్లలకగానే పండగయిందా? గజపతుల కృష్ణసర్పం పడగనీడలో రాయలున్నాడని మర్చిపోతున్నాడు. చూస్తావుగా ఇకనించి అంతా మా కాళ్ళకింద మట్టిగానే మిగుల్తుంది’’ వీరేంద్రుడు కాలితో నేలను తన్ని విసవిసా వెళ్ళిపోయాడు.
అతని నిజస్వరూపం తెలుసుకున్న మంజరి తుఫాను ఎదుర్కొనే ఆకులా అల్లాడిపోయింది. అతనితో మాట్లాడటం మేలుకే అయింది. ఇతగాడి విషబుద్ధి మహామంత్రికి సెలవీయాలి. విజయనగర సామ్రాజ్య పరిరక్షణ కోసం తన ఆఖరిశ్వాస దాకా అంకితమౌతుంది.
తిమ్మరుసువారికీ విషకీటకం బుసలు విన్పించకుండా ఉంటాయా! చంద్రప్ప రాగానే చర్చించాక అసలు విషయం బయటపెట్టాలి. పాపం అన్నపూర్ణాదేవి మహాసాధ్వి. గంధపుచెట్టును సర్పాలు చుట్టుకున్నట్లు ఇటువంటి నాగులెన్ని కదిలినా రాయలవారి ఖడ్గానికి బలికాక తప్పదు. ఏది ఏమైనా వీరేంద్రుని కదలికలని కొంత కనిపెట్టి ఉండాల్సిన అవసరమేర్పడుతున్నది.
ఆముక్త మాల్యదలో ప్రభువు రాసిన పద్యం గుర్తొస్తున్నది.
రాష్ట్రమెరియంపకొనుము దుర్గములు తదవ
రోధ మగవడ్డ బుట్టించి రూఢ నడపు
పరుషములు తద్రిపుల రాయబారు లెదుట
బలుకకుము సంధి యొకవేళ వలసియుండు (4)
శత్రుదేశాన్ని తగులబెట్టు. శత్రురాజుల కోటలను ఆక్రమించు. కానీ బందీలుగా ఉన్న శత్రువుల స్త్రీలను పుట్టింటి తోబుట్టువులుగా భావించి మర్యాదతో ప్రవర్తించు. రాయబారులతో పరుషవాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంధి చేసుకోవాల్సి రావచ్చు.
ఇటువంటి ఉన్నతాశయాలు కలవాడు కనుకనే రాయల సంస్కారం అదే తీరులో ఉంది. కానీ తమ ఇంటి ఆడబడుచు బంధువుగా వచ్చిన వీరేంద్రుడు ఇలా ప్రవర్తించటం అతని నీచత్వానికి నిదర్శనం. ప్రతాపరుద్ర గజపతిని ఓడిరచిన తర్వాత అతని కొడుకైన వీరభద్ర గజపతికి రాయలవారు ప్రాణభిక్ష పెట్టకపోతే గజపతులకు వారసుడెవరుంటారు? మరుక్షణంలోనే అన్నపూర్ణాదేవి కుమారుడు తిరుమలరాయలు స్ఫురణకొచ్చాడు. అంతకుముందు రాయల వారికి పుత్రులు పుట్టినా దక్కలేదు. తిరుమలరాయడే భావి విజయనగర సామ్రాజ్యాధినేత గదా! అని మంజరి తనలో తాను వితర్కించుకుంటూ మరోమారు ప్రసన్న విరూపాక్షునికి నమస్కరించి బయలుదేరింది. మెట్లెక్కి ప్రాకారం దాటి బయటికి రాగానే వెనుకనే రామేశ్వర శాస్త్రి బయటికి రావడం గమనించిన మంజరి ఆశ్చర్యచకితురాలయింది.
బ్రహ్మతేజస్సుతో అలరారే ముఖవర్చస్సు, స్ఫురద్రూపం, కాలికి కడియం, నుదుట విభూతిరేఖలు, దీటైన వస్త్రధారణతో పాతికేళ్ళ ఆ యువకుడు మంజరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెపట్ల అతని ఆరాధనభావమంతా ఆ కన్నులలో తొణికిసలాడిరది.మంజరికి ఈ యువకుని గురించి పూర్తిగా తెలియదు. చాలాసార్లు ఇతనిని శిల్పారామంలో చూసింది. యువశిల్పిగా భావించింది. కానీ శాస్త్రి మంజరి సౌందర్యాన్ని ఆమె నృత్యశోభను ఆరాధిస్తున్నాడని ఆమెకు తెలిసే అవకాశం లేదు.
తనకీ వీరేంద్రునికి మధ్య జరిగిన సంవాదానికి సాక్షి పరమేశ్వరశాస్త్రి అనే విషయం మంజరికి అర్థమయింది. ఆమె అతనికేదో చెప్పాలనుకొంది.
అతను మాత్రం ఆమెకా అవకాశం ఈయకుండానే మరోదోవలో చకచకా ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న అతనికేసి చూస్తూండిపోయింది మంజరి.
పరమేశ్వరశాస్త్రి పరమ శివభక్తుడు. ప్రశాంతంగా ఉండే భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరంలో రోజూ కొన్నిగంటలు యోగసాధన చేస్తుంటాడు. అతనెవ్వరివాడో ఎక్కడివాడో ఏ వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు.
పరమేశ్వరశాస్త్రి తిమ్మరుసు స్నేహితుని కుమారుడని మాత్రం అంతా చెప్పుకుంటారు. కళగల మొహంతో అందంగా బలంగా కన్పించే శాస్త్రి అప్పుడప్పుడు రాతిరథం దగ్గర కూచుని ఎలుగెత్తి శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడుతుంటాడని అందరికీ తెలుసు.
ఆరోజు కూడా విరూపాక్ష దేవాలయం నుంచి శాస్త్రి నేరుగా రాతిరథం దగ్గరికి వచ్చాడు. రెండు చక్రాల మధ్యస్థలంలో బాసీపట్టి వేసుకుని కూచున్నాడు. శివయోగం సాధన చేశాడు. మనసుకు శాంతి లభించటం లేదు. మంజరిని చూసినప్పుడల్లా తెలియని అశాంతికి లోనవుతున్నాడు.
నిలువ నీడలేని తనకు ఆశ్రయమిచ్చి సర్వశాస్త్రాలలోముఖ్యంగా శిల్పశాస్త్రంలో మెళకువలు అవగతం చేసిన గురువును స్మరించాడు. తనలోని సంగీతతృష్ణని పెంచి గంధర్వగానాన్ని నేర్పిన రెండవ గురువు అమ్మకి నమస్కరించాడు.
శిల్పాచార్యులవారి దగ్గరికి వెళ్ళి శిల్పిగా ఉద్యోగం అర్థిస్తే పాటలుపాడే శిల్పి మా కక్కర్లేదన్నాడు.
సంగీతాచార్యుడుగా మారుదామంటే రాళ్ళమధ్య బతికేవాడు సంగీతానికి పనికిరాడన్నారు.
ఎందుకిలా? ఎన్నాళ్ళిలా? నేనెవరిని? నా జీవితం ఎందుకిలా…. నా జీవితమే ఎందుకిలా? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇంత బలమైనదా!
విజయనగర సామ్రాజ్యంలో స్త్రీలకి ఎంత మర్యాద ఈయాలో తెలుసు. అందుకే మంజరితో ఏనాడూ పల్లెత్తి మాట్లాడలేకపోయాడు. కన్నెత్తి పూర్తిగా చూడలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు ఆ చంద్రప్పతో కల్సి కనిపిస్తుంటుంది. అతడు సంగీతకారుడే కాదు రాజుగారి వేగు అని అనుమానం. వారిద్దరూ అనురాగబద్ధులైతే…
అతని మనసు చిగురుటాకులా కంపించింది.
‘‘ఎవరు నాయనా నీవు? ఏమిటీ ధ్యానం?’’
ఎవరో కాషాయాంబరధారి అపరశివునిలా ఎదుట నిలిచి ప్రశ్నిస్తున్నాడు.
‘‘నేనెవర్ని స్వామి? నా మనసులో ఈ అశాంతి ఏమిటి?’’ శాస్త్రి ప్రశ్నించాడు.
స్వాములవారు శ్రద్ధగా అతన్ని చూశారు. దగ్గరకు రమ్మని పిలిచి తనతో మఠానికి తీసుకువెళ్ళారు. శాస్త్రి నమస్కరించి స్వాముల వారి ఎదుట కూర్చున్నాడు.
స్వాములవారి సైగతో శిష్యులొక రుద్రాక్షమాలనూ, శాలువాను స్వాములవారికి అందించారు. స్వాములవారు స్వయంగా శాలువాను శాస్త్రికి కప్పి, మెడలో రుద్రాక్షమాల వేశారు. తలపైన అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీది సన్యసించే జాతకం కాదు. అందుకే కాషాయ వస్త్రాలందించలేదు. కానీ నీకు ఎటువంటి భవబంధాలు వద్దు. నీకు మరుజన్మ లేదు. అంటే పూర్వజన్మ పరిహారం చేసుకో. నువ్వు కావాలనుకుంటున్న వ్యక్తి నిన్ను కోరుకోదు. నీమీద గౌరవం మాత్రమే ఉంది.’’
‘‘నామీద ఎవ్వరికీ ప్రేమ ఉండదా’’ రామేశ్వరిశాస్త్రి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘నిస్సంగుల్ని లోకం గౌరవిస్తుంది. పూజిస్తుంది. కానీ ప్రేమించదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను గౌరవించినవాళ్ళు ప్రేమించాలని కోరుకుంటే మిగిలేది దుఃఖమే గదా’’ స్వాములవారు అంతరార్థం చెప్పారు.
రామేశ్వరశాస్త్రి మనసు తేలికపడిరది. అతని దుఃఖం దూరమైంది. మనస్సులో చిత్రించుకున్న మంజరి బొమ్మను మనస్సే చెరిపేసుకుంది. ఇప్పుడు అపరిమితమైన ఆనందమంటే ఏమిటో తెలుస్తున్నది.
‘‘స్వామీ! నా జీవిత పరమార్థం ఏమిటి? ఇలా గమ్యంలేని ప్రయాణం ఎటు వెళ్తుంది?’’ అడిగాడు.
స్వాములవారు అతని శిరస్సున హస్తముంచారు. రెండు నిమిషాలు
కళ్ళు మూసుకుని తీవ్రంగా ధ్యానం చేశారు.
‘‘నీకు విముక్తి మార్గం లభిస్తుంది నాయన! అశాశ్వతమైన బంధాల నుంచి శాశ్వతమైనదానిని సాధించు. నీలోని శక్తిని మేల్కొలుపు. నీవు చేసిన సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ముందుతరాలవారు నిన్ను చిరయశస్విగా గుర్తిస్తారు. నీకు ఆత్మసంతృప్త్తి కూడా అందులోనే కలుగుతుంది. నువ్వు చిన్నతనంలో దీక్ష పొందిన మంత్రం గుర్తుందా కుమారా!’’ ప్రశ్నించారు స్వాములవారు.
రామేశ్వరశాస్త్రికి వెంటనే స్ఫురించలేదు. రెండు క్షణాలు ఆలోచించాక ఓ మెరుపు మెరిసింది. చిన్నతనంలో తండ్రి వెంట ఓ యోగిని దర్శించినపుడు ‘‘రూపధ్యాన గానావళీ’’మంత్రాన్ని ఉపదేశం పొందాడు. కానీ దానిని ఇంతదాకా ఉపాసన చేయలేదు.
‘‘అవును స్వామి. ఓ మంత్రం నాతో ఉంది’’ వినయంగా చెప్పాడు.
‘‘ఆ రూపధ్యాన గానావళీ మంత్రాన్ని సాధన చేయి. అది నిన్ను కటాక్షిస్తుంది. నువ్వు శిల్పగాయకుడివి. నువ్వు చెక్కిన దేవతామూర్తుల్ని చూస్తుంటే ఆ మూర్తులే మైమరిచిపోయేంతగా గానం విన్పిస్తుంది. నువ్వు ఆలపించే గానంతో దేవతామూర్తుల దివ్యరూపం కనిపిస్తుంది. ఇలా శిల్పంలో గానాన్ని, గానంలో శిల్పాన్ని సృష్టించు నాయనా!’’ స్వాములవారు ఆదేశించారు.
‘‘నేను విశ్వకర్మని కాను సాధారణ మానవుణ్ణి. స్వామీ! నాకిది సాధ్యమవుతుందా?’’
‘‘నీ శక్తి తెలీక అలా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు మనిషివి కావు.’’
‘‘అయితే నేను ఎవరిని స్వామీ?’’
‘‘తత్త్వమసి’’ అన్నారు స్వాములవారు నీలిగగనంలోకి చూస్తూ చేతులు జోడిస్తూ.
ఇపుడు రామేశ్వరశాస్త్రి మనసులో ఎటువంటి అనుమానాలు, భయాలు లేవు. అతని హృదయంలో వేయిరాగాలు వీణ మీటుతున్నాయి. కళ్ళముందు అనేక శిల్పకళామూర్తులు, కళారూపాలు ప్రత్యక్షమౌతున్నాయి.
అప్పటిదాకా ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ప్రధాన శిల్పాచార్యుడు ముందుకు వచ్చి స్వాములవారికి నమస్కరించాడు. రామేశ్వరశాస్త్రి చేయి పట్టుకున్నాడు.
‘‘పద నాయనా! విజయవిఠల దేవాలయ సప్తస్వర మండప వైభవం కోసమే నువ్వు పుట్టావు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ శిల్ప స్వర స్థానాలు పూర్తి స్థాయిలో కుదరటంలేదు. నాతో రా! నీ వల్ల నా జన్మ కూడా తరిస్తుంది’’ ప్రేమగా అన్నాడు ప్రధాన శిల్పాచార్యుడు.
‘‘సెలవు స్వామీ’’ రామేశ్వరశాస్త్రి సంతోషంగా స్వాములవారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ప్రధాన శిల్పాచార్యులతో బాటు వెళ్తున్న రామేశ్వరశాస్త్రిని చూసి స్వాములవారి గుబురుమీసాల మాటున తెల్లని చిరునవ్వు తొణికిసలాడిరది. విఠల మండపం తుదిరూపురేఖలు పూర్తవుతాయనే విశ్వాసం కలిగింది. పైనుండి దేవతలు కూడా ‘తధాస్తు’ అని ఉంటారు. అందుకే రాయల విజయయాత్ర విహారం తర్వాత విజయనగరంలో శిల్పకళాశక్తి ఆత్మశక్తితో రూపుదిద్దుకున్నది.
విజయ నగరమునన్‌ విఠ్ఠలాలయమున
బ్రథిత శిల్పము జక్కపరుప జేసె
మాన్య హజారు రామస్వామి కోవెలన్‌
దగు చెక్కడమ్ముల తావు జేసె
దివ్య పంపావతీ దేవాలయమునకు
స్థాపించె శిల్పాల గోపురమ్ము
ధీరోగ్ర నరసింహదేవు విగ్రహమును
బ్రౌఢ శిల్పంబు తావలయుజేసె
మంజులారామముల సభామంటపముల
హర్మ్యారాజీ విరాజి రత్నాపణముల
జాల దీర్పించి శిల్పకళాలయముగ
రాయలలరించె దన దివ్యరాజధాని
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘శ్రీవేంకటేశ్వర పాదపద్మావేశిత సదయహృదయ! తిరుమల దేవీవల్లభా! రాజకంఠీరవా! ఈశ్వర నరసింహ భూఫురంధర! చిన్నమదేవీ జీవిత నాయకా! కవితా సామ్రాజ్య ఫణీశ! శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్‌! బహుపరాక్‌!’’ వందిమాగధుల కైవారాలు మిన్నుముట్టాయి.
శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ వచ్చారు. సభలోని కవిగాయక సేనానులు, పండితులు అందరూలేచి అభివాదం చేశారు. రాయలు అప్పాజీకి, అందరికీ అభివాదం జేసి సింహాసనం అధిష్టించాడు. రాయల దేవేరులు కూడా
ఉచితాసనాన్ని అలంకరించారు.
పెద్దనామాత్యుడు రాయల కీర్తిని నుతిస్తూ…
‘‘ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
రతకు గ్రౌంచాచల రాజమయ్యె
నావాడ పతి శకంధర సింధురాధ్యక్షు
లరికాపుల నెవ్వాని ఖరత రాసి
కాపంచగౌడ ధాత్రీ పధంబెటవ్వాని
కసివాడగ నేగునట్టి బయలు
సకల యాచక జనాపూర్తి కెవ్వాని
ఘన భుజాదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప
రాజ పరమేశ బిరుద విభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు’’
అని ఆశీర్వదించాడు. రాయలు చిరునవ్వుతో నమస్కరించాడు. నందితిమ్మనగారు రాయలను వినుతిస్తూ…
‘‘ఉదయావేగత్యుయద్ధతి సాధించె
వినుకొండ మాటమాత్రాన హరించె
గూటము ల్సెదరంగ కొండవీడగవించె
బెల్లమకొండ యచ్చల్లజెరిచె
దేవరకొండ యుద్వృత్తి భంగముసేసె
జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె
గినుకవిూర ననంతిగిరి క్రిందపడజేసె
గంబంబు మెట్టు గ్రక్కున గదల్చె
బలనికాయము కాలిమట్టులక నెక్కునయడచు
గటకమును నింక ననుచు నుత్కలమహీశు
డనుదినమ్మున వెరచు నెవ్వనికి నతడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు’’
రాయలు అంజలిఘటించి కృతజ్ఞతలు తెలిపాడు. సంగీత సాహిత్య కోవిదులున్న ఆ సభలో ఒకే ఒక వ్యక్తి రాయలకేసి కార్పణ్య దృష్టితో చూస్తున్నాడు. వీరేంద్రునికీ వైభోగం ఆనందం కల్గించటం లేదు.
విజయయాత్రలకు కారకులైన సేనానాయకులందరినీ ప్రభువు ఘనంగా సత్కరించాడు. అప్పాజీ సభనుద్దేశించి ప్రసగించారు.
‘‘దక్షిణాన విలసిల్లుతున్న ఈ సువిశాల హైందవ స్రామాజ్యం విద్యారణ్యుల వారి ఆశీఃబలంతో ఏర్పడిరది. మనవారి అనైక్యత, ఈర్ష్యాసూయలు, స్వార్థంవల్ల ఇంకా పరదేశీయులను ఆపలేకున్నాము. రాయలవారి గురించి నా కలలు నెరవేరాయి. ప్రభువు పరాక్రమశౌర్యులు, వినయశీలురు, ఆదర్శనీయులు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, వికలాంగులైనవారికి తగిన పరిహారం, పారితోషికాలు ఇస్తున్నాం. నిద్రాహారాలుమాని విజయనగరం కోసం శ్రమిస్తున్న మన వీరులందరికీ అభినందనలు. విజయనగర కేతనం చిరకాలం వినువీధిలో రెపరెపలాడాలని అభిలషిస్తున్నాం’’ అని ముగించారు.
‘‘నా జీవనదాత, రాజ్యానికి మూలశక్తి, మాకిన్ని విజయాల నందించి మమ్మల్నీ సింహాసనంపైన నిలిపిన మా అప్పాజీవారిని ఎలా గౌరవించినా తక్కువే అవుతుంది. అందుకే వారిని మా గౌరవప్రదమైన అభిమాన కౌగిలిలో బంధింప దలిచాము’’ రాయల గంభీరవచనాలతో అప్పాజీని మనసార కౌగిలించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీల మధ్య అతులితమైన ఆ ప్రేమానుబంధాన్ని చూసి సభ పులకించింది. కాని ఆ దృశ్యాన్ని చూసి కళ్ళనిప్పులు రాలుస్తున్నది వీరేంద్రుడొక్కడే.
‘ఈ మైత్రి ఇంకెన్నాళ్ళులే’ అనుకున్నాడు. అప్పటికే అతని మనసులో ఒక విషపన్నాగం రూపుదిద్దుకుంది. రాజు అంగరక్షకుడిగా వీరేంద్రుని ముఖకవళికలు చురుగ్గా గమనిస్తున్నాడు చంద్రప్ప.
నాటి సభ కవిపండిత సత్కారంతో ముగిసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్యులతో సమావేశమయ్యారు.
‘‘ఈ పరిస్థితుల్లో రాయలవారి జన్మకుండలి విశేషాలు సెలవీయండి జ్యోతిష్యవర్యా’’ తిమ్మరుసు గూఢంగా అడిగారు.
‘‘చిత్తం మహామంత్రీ’’ జ్యోతిష్యవేత్త తాళపత్రాలు చూసి రాయల జాతకం గణన చేసి నిట్టూర్చాడు.
‘‘ఏమయింది? రాయలవారి గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి?’’ ఆందోళనగా అడిగాడు తిమ్మరుసు. ఆ వృద్ధుని వదనంలో రాయలపైన ప్రేమ పొంగి పొర్లుతోంది. రాజ్యభద్రత గురించిన బాధ్యత ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. జ్యోతిష్యవేత్త మంద్రస్వరంతో చెప్తున్నాడు.
‘‘చక్రవర్తి జన్మకుండలి ప్రకారం శని, సూర్య, మంగళ గ్రహాల కలయికవల్ల హాని జరిగే సూచనలున్నాయి.’’
‘‘దీనికి శాంతి లేదా?’’
మనసులోని ఆందోళన బయటపడనీయని ధీరుడు తిమ్మరుసు మంత్రి.
‘‘ఉంది మంత్రివర్యా! రాయలవారి రాజయోగానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ దోషం తొలిగేదాకా సింహాసనంపై కూర్చోరాదు’’
‘‘సరే. మీరు వెళ్ళొచ్చు’’ జ్యోతిష్యవేత్తను పంపివేసి తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు. కాస్సేపట్లోనే ‘‘రాయవారి మందిరానికి పల్లకీ సిద్ధంచేయండి’’ సేవకుల్ని ఆజ్ఞాపించారు.
తిమ్మరుసు అనుకోకుండా తమ మందిరానికి రావటం రాయలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పాజీ వివిరించిన విషయాలు సావధానంగా విన్నారు రాయలు. ఇద్దరూ గురుదేవులయిన వ్యాసరాయలవారి కుటీరానికి ప్రయాణమయ్యారు.
వ్యాసరాయలవారి కుటీర ప్రాంగణం మునివాటికలా ప్రశాంతంగా ఉంది. ఎత్తైన వృక్షాలు, పూలచెట్లు, లేళ్లు, నెమళ్ళు, ఆ ఆశ్రమ వాతావరణంలోకి అడుగుపెడితేనే ఎవరికైనా వేదనలు, బాధలు తీరిపోతాయి. ఆవరణంతా
శుభ్రంగా అలికి ముగ్గులు తీర్చి ఉంది.
విజయనగర మహాసామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు మహామంత్రితో వచ్చి వ్యాసరాయల ముంగిట యాచకుడై నిలిచారు.
గురుదేవులైన వ్యాసరాయలు పరమ ఆదరంతో రాయలకు ఎదురేగి లోపలికి తోడితెచ్చాడు. భద్రాసనాలను అలంకరింపజేశారు.
‘‘రాయా! ఏమిటీ ఆకస్మికాగమనం?’’ వ్యాసరాయలి ప్రశ్నకు రాయలు తిమ్మరుసువైపు అర్థవంతంగా చూశారు.
‘‘గురువర్యా! కృష్ణరాయలి జన్మకుండలిరీత్యా యోగభంగం వుంది’’ తిమ్మరుసులవారు వ్యాసరాయలితో చెప్పారు. వ్యాసరాయలు కలవరంగా చూశారు.
‘‘దీనికి ఎన్ని జపహోమాలు చేయించినా ఉపశాంతి లేదన్నారు’’ తిమ్మరుసు తానే మళ్ళీ చెప్పారు.
‘‘అయితే?’’ వ్యాసరాయలు ఆలోచనగా అన్నాడు.
‘‘అందుకే అర్థులమై వచ్చాము. కృష్ణరాయలకీ యోగభంగం కొద్దిరోజులు మాత్రమే ఉంది. మీరీ దోషకాలం రాయల సింహాసనం అధిష్టిస్తే ఆ దోష నివారణ జరుగుతుంది’’ అభ్యర్థనలోనే అధికారాన్ని మేళవించారు తిమ్మరుసు.
‘‘కానీ…’’ వ్యాసరాయలు సంకోచం వెలిబుచ్చారు.
‘‘కాదనకండి గురుదేవా! మీరు తప్ప దోషహరణం చేయగల సమర్థులు మరొకరు లేరు. నా ప్రార్థన మన్నించి విజయనగర సింహాసనంపై చక్రవర్తిగా కొన్నిదినాలు రాజ్యపాలన చేయండి. మేమంతా మీవెంట దోయిలొగ్గి ఉండగలం’’ కృష్ణరాయలు అంజలి ఘటించారు.
విశాలమైన కనుదోయి. నిలువునామం. రాచఠీవి, జ్ఞానతేజస్సుతో, భుకపరాక్రమంతో వెలుగొందే కృష్ణరాయలు తన ఎదుట అలా కైమోడ్చి ప్రార్థిస్తుంటే వ్యాసరాయల మనసు శిష్యవాత్సల్యంతో కరిగిపోయింది.
‘‘రాయా! నీవు నామీద ఉంచిన నమ్మకానికి నీ గురుభక్తికి నాకెంతో ఆనందంగా ఉంది. నా మఠదైవం గోపాలకృష్ణునికి అంకితంగా నేనీ బాధ్యత స్వీకరిస్తున్నాను’’ అన్నారు వ్యాసరాయలు.
కృష్ణరాయలు, తిమ్మరుసుమంత్రి, వ్యాసరాయలకు ధన్యవాదాలు తెలిపారు.
మరునాడు సభలో ఈ విషయం ప్రకటించబడిరది. మొదలు సామంత దండనాథులకేమీ అర్థం కాలేదు. ఇది ఏ విపరీతానికి దారితీస్తుందోనని వాళ్ళు భయపడ్డారు. తిమ్మరుసు మంత్రి కృష్ణరాయని జన్మకుండలిలోని దోషం గురించి ఇతర వివరాలను సభాసదులకు తెలియజేశారు.సభ ఆమోదం పొందింది.
ఒక శుభదినాన నిండుసభలో మంత్రయుక్తంగా శ్రీకృష్ణదేవరాయలు తమ భుజబల సముపార్జితం, తిమ్మరుసు ధీశక్తితో విలసితం అయిన విజయనగర మహాసామ్రాజ్యాన్ని వ్యాసరాయ గురుదేవులకు అప్పగించారు.
వ్యాసరాయలవారిని భద్రాసనంపై సగౌరవంగా కూర్చుండబెట్టి నవరత్నాలతో అభిషేకించారు. వినమిత శిరస్కుడై రాయలు నమస్కరించారు.
వ్యాసరాయలు శిష్యునికి తనపట్ల గౌరవాభిమానాలకు చాలా సంతోషించాడు. ప్రేమార శిష్యుని కౌగలించుకున్నాడు.
‘‘నాయనా! యీ రాజ్యప్రేమ, నిర్మలహృదయం వల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలువగలదు’’ అని ఆశీర్వదించాడు.
తనను అభిషేకించిన నవరత్నాలను కులమతభేదం లేకుండా బీదలకు పంచిపెట్టాడు వ్యాసరాయలు.
జన్మకుండలిలోని దోషకాలం పూర్తయ్యేవరకు సింహాసనాన్ని వ్యాసరాయలవారే అధిష్టించారు. అది తొలగిపోగానే మరలా శాస్త్రోక్తంగా రాయలు సింహాసనాన్ని అధిష్టించారు. ఇపుడు రాయలు మబ్బువిడిచిన సూర్యుడిలా మరింత వీరప్రతాపాలతో వెలుగొందుతున్నారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
రామేశ్వరశాస్త్రి అన్నం తిని మూడుదినాలయింది. నిరంతరం విఠలమందిరంలోనే ఉంటున్నాడు. తాను తీర్చిదిద్దిన సంగీత స్తంభాలను స్పర్శించి ఆ స్వరమాధురుని ఆనందిస్తూ కొసమెరుగులు దిద్దుతున్నాడు.
ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు. గడ్డం పెరిగి మాసిన వస్త్రాలతో మారువేషంలో ఉన్న విశ్వకర్మలా ఉన్నాడు శాస్త్రి.
మంజరి రోజూ భోజనం తనే తీసుకువస్తున్నది. కానీ అతను దానికేసి చూడటం కూడా లేదు. ఆమెనా పనికి ఎవరూ నియోగించలేదు. ఆమె కళాసక్తి అలాంటిది.
ఆ రోజుకూడా మంజరి భోజనం తెచ్చింది. కాని ఎప్పటిలా అక్కడ వుంచి వెళ్ళలేదు.
‘‘అయ్యా!’’ పిలిచింది. అతను ఆమెకేసి చూడలేదు. ‘నవమోహిని’ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తుదిమెరుగులు గురించి ఆలోచిస్తున్నాడు.
‘‘అయ్యా! నేను మంజరిని.’’
అతను ఆమెకేసి చూశాడు. అతని కళ్ళలో లిప్తపాటు మెరుపు. మళ్ళీ అంతలోనే ప్రశాంత కాంతి.
‘‘అక్కడ వుంచివెళ్ళు మంజరీ’’
‘‘లేదు స్వామి! మూడురోజులుగా మీరు తినటం లేదు. నేనుండగానే తినండి.’’
‘‘ఫర్వాలేదు. అక్కడ ఉంచి వెళ్ళు’’ అతని చూపులు మాత్రం ఆ శిల్పం మీదే! ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు కన్పిస్తున్నాడు.
‘‘స్వామీ! మీరు ఇంతలా శ్రమపడితే ఆరోగ్యం పాడయిపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అవసరం’’ మంజరి మెల్లగా చెప్పి భోజనపాత్ర అక్కడ
ఉంచింది.
రెండు ఘడియల పాటు తదేకంగా అతను చెక్కే ‘నవమోహిని’ విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహంలో కుదురుకున్న స్త్రీమూర్తిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ? ఎక్కడ? తటాలున విద్యుల్లతలాంటి స్ఫురణ! అది అద్దంలో తన ప్రతిబింబమే! అంటే తనలాంటి విగ్రహాన్ని ఈ రామేశ్వరశాస్త్రి చెక్కడం ఎంత ఆశ్చర్యమో అంతే ఆనందం!
ఆ స్త్రీమూర్తిని మరింతగా చూడాలనిపించింది. నాట్యభంగిమలో వయ్యారంగా నిలబడి ఉంది. సర్వాభరణ భూషితురాలై ప్రేమగా చూస్తున్నది. ఆ చూపులో పారవశ్యం, తాదాత్మ్యం మమేకమైనాయి. ఆమె శిరస్సుపై నుండి ఇరుపక్కలకి జాలువారుతున్న పుష్పతోరణం మరింత అందాన్ని ప్రసాదిస్తున్నది. స్త్రీమూర్తి విగ్రహం కొలత దాదాపు మానవ సహజమైన ఎత్తుతో నల్లశిలలో ఉంది. రామేశ్వరశాస్త్రి చేతిలో ‘నల్లనిరాయి వెన్న, మైనంలా’ మారిందా అనిపిస్తుంది. వంపుసొంపులు, ఇంపులు, వస్త్రాలు, నగలు నఖశిఖ పర్యంతం ప్రతి అంశంలో తెలుగుదనం ఉట్టిపడుతూ చూసేవారికి పవిత్రభావాన్ని ప్రసాదిస్తున్నది. శాస్త్రి ఉలివిన్యాసం, హృదయఔన్నత్యం ఆ శిల్పంలో ప్రతిఫలిస్తున్నది.
మంజరి కళ్ళనిండుగా నీళ్ళు. రామేశ్వరశాస్త్రి ఆరాధన తనకి తెలియంది కాదు. తన నాట్యం ఒక శిల్పికి స్ఫూర్తినీయటం తనకీ ఆనందమే! కానీ తనదైన లోకంలో బతికే ఈ యువశిల్పి భవిష్యత్‌ ఏం కానున్నది? విజయనగర సామ్రాజ్య కళాజగత్‌లో ఈతని స్థానం ఏమిటి? దీనిని కాలమే నిర్ణయిస్తుంది. నిట్టూర్చి కర్తవ్య స్ఫురణతో కదిలింది.
రామేశ్వర శాస్త్రి విఠలమండప నిర్మాణంలో సప్తస్వర స్తంభాలను పూర్తి చేయటంలో ప్రధాన పాత్ర వహించాడు. దాని నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ప్రధాన శిల్పాచార్యుడు శాస్త్రిని తిరుపతిలో నిర్మిస్తున్న వేయిస్తంభాల మండప నిర్మాణంలోతోడ్పడమని కోరాడు. శాస్త్రి మరునాడే తిరుపతికి ప్రయాణమయ్యాడు. బయలుదేరినప్పుడు శాస్త్రికే తెలియదు తాను మళ్ళీ ఎప్పుడీ కళానగరానికి రాగలడో! ఎప్పుడీ మంజరిని మళ్ళీ చూడగలడో! మంజరికి శాస్త్రి తిరుమల ప్రయాణం గురించిన సమాచారం మర్నాడు అతను వెళ్ళిపోయాక గానీ తెలియలేదు.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us