మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

 వెలుగు నీడలు

by తడక మళ్ళ మురళీధర్ January 16, 2023
written by తడక మళ్ళ మురళీధర్

(సినిమా బిర్యానీ)

మీనా, శివల వివాహబంధానికి దశాబ్దం గడచింది. వారి పూర్వీకులది బొబ్బిలి వంశం.  ఆస్తులు-అంతస్తులు ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయాయి. ఔనన్నా కాదన్నా ఇద్దరు ప్రేమమూర్తులు.  ప్రేమకు చిహ్నంగా వారికి పుట్టిన ముద్దుల సంతానం రాము, ఆది.  తల్లిదండ్రులు రామును పండూ అని, ఆదిని చంటి అని పిలవటం అలవాటైంది.   ఆట నుండి అప్పుడే రాము ఇంటికొచ్చాడు. “ఒరేయ్ పండూ,  నీ స్నేహితుడు మురారితో గొడవ పడి కాలికి గాయం అయ్యేట్టు దెబ్బలు కొట్టావట. అతడు నీతో తప్పుగా ప్రవర్తిస్తే నాతో చెప్పి ఉండాల్సింది, నేను వాళ్ళ డాడీతో మాట్లాడే దాన్ని” అంటూ మీనా తన కొడుకు రామును మందలించింది.

“అమ్మా , కన్నతల్లివై ఉండి నిజం తెలుసుకోకుండా నన్నే దోషి అంటావేం,  వాడు నన్ను దొంగ అంటే చూస్తూ ఊరుకోవాలా!  ప్రతీకారం తీర్చుకున్నాను” ఉచ్ఛస్వరంతో బదులిచ్చాడు రాము.

“అంత  పౌరుషం వద్దు పండూ. నీవు వాడిని కొట్టిన విషయం మీ నాన్నకు తెలిస్తే పెద్ద రచ్చ జరుగుతుంది.  ఈ అమ్మమాట విని శ్రద్ధగా చదువుకో  నాన్నా, చదువు-సంస్కారం ఉన్నవాడే అందరి అభిమానం పొందగలుగుతాడు” కొడుక్కి హితబోధ చేసింది మీనా.

  “అలాగే నువ్వు చెప్పింది చేస్తా. నిజంగా ఒట్టేసి చెప్తున్నా.  అవును, శ్రీశైలం నుండి  కల్పన  పిన్ని వాళ్ళు వస్తారన్నావుగా, ఎప్పుడొస్తారు” అడిగాడు రాము.

“బాబాయి బొంబాయి వెళ్ళారట.  పిన్ని మామగారు అనారోగ్యంతో ఉన్నారని  డాక్టర్ బాబుకి చూపిస్తే రెండు రోజులు విశ్రాంతి తీసుకొమ్మన్నారట.   అంజలి స్కూలుకు ఇంకా శలవులు ఇవ్వలేదట. అందుకే ఎప్పుడు వచ్చేది  నిర్ణయం తీసుకోలేదట” జవాబిచ్చింది మీనా.

“నేను, తమ్ముడు చంటి, పిన్ని కూతురు అంజలి సరదా సరదాగా శలవులు గడపొచ్చనుకున్నాను”.

“నిజమే, సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా. బొమ్మల కొలువు పెడతాను. నీవు దీపావళి పండుగకి  చేసినట్టే ఇంటి దర్వాజలకి మావిడాకుల తోరణాలు కట్టి నాకు సాయం చెయ్యాలి” సలహా ఇచ్చింది మీనా.

“మన చంటిగాడు బొమ్మల కొలువును పెట్టనిస్తాడా, వీడొక్కడే చాలు చెడగొట్టడానికి.”

 “ఈ మధ్య వాడు బుద్దిమంతుడు అయ్యాడు.  అయినా వాడి సంగతి  చూసుకోడానికి నా దగ్గర మంత్రదండం ఉందిలే. సరే గానీ  దేవాలయానికి వెళ్దాం రెడీ అవ్వు”.

“ఎప్పుడు దేవాలయం, అమ్మవారు, పూజ, నోములంటావు.  సరదాగా సర్కసుకో, జురాసిక్ పార్కుకో తీసుకెళ్లవచ్చు కదా” బుంగమూతి పెట్టి మారాముగా అన్నాడు రాము.

“శలవుల్లో  అందరం ఎంచక్కా జెమిని వారి ఫ్యామిలీ సర్కస్,  నెక్లెస్ రోడ్డు, గోల్కొండ కోట వెళ్దాం.  ఈ రోజు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కంచి స్వామి వస్తున్నారట. వారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో శుభప్రదం”

“థాంక్స్ అమ్మా, కాసేపట్లో రెడీ అవుతాను”.

                       **

కూతురు అంజలితో పాటు టాక్సీ దిగిన కల్పన ఇంట్లోకి వస్తూ  “అక్కా బాగున్నావా, పండు, చంటి బాగున్నారా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“అందరం బాగున్నాం. మీరెలా ఉన్నారే. అబ్బో, బంగారం జడగంటలు వేసుకుందే” అంటూ అంజలిని దగ్గరకు తీసుకుని కౌగలించుకుంది మీనా.

ఆహా బాగున్నాం.  అక్కా బావెక్కడ, అడిగింది కల్పన.  అడుగుతుండగానే  శివ ఇంట్లోకి  వచ్చాడు.   బావగారూ బాగున్నారా అంటూ శివను పలకరించింది కల్పన.  సూపర్ గా ఉన్నాను.  తమ్ముడు రాలేదా అంటూ శివ ప్రశ్నించాడు .

“పోలీసు ఇన్స్పెక్టర్  ఉద్యోగం మానేసి సినిమా ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టారు మా ఆయనగారు.  మొదటి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మా ఇలవేలుపు తిరపతి వెంకన్న అనుగ్రహం కోసం  వెళ్లారు.  కాలి నడకన ఏడుకొండలు ఎక్కి దైవదర్శనం చేసుకోవాలని ఆయన అభిలాష.  సినిమా సినిమా అంటూ ఈ మధ్య ఆయనగారు పిచ్చిమారాజులా చేస్తున్న ఆలోచన మా జీవితంలో ఎన్ని యూటర్న్ లు తిప్పుతుందో” అంటూ కల్పన కాసింత వెటకారంగానే అంది.

“వావ్, పోలీసుభార్య ఇప్పుడొక నిర్మాతకు అర్ధాంగి కాబోతుంది. కాసింత పాజిటివ్ గా  ఆలోచన చెయ్యి కల్పనా.  చక్రవర్తి చేసేది అంతా మనమంచికే. అతడు కుటుంబం కొరకు కష్టపడే మంచిమనిషి.  నువ్వనుకుంటు న్నట్లు ఆయన పిచ్చిమారాజు కాదులే, మంచి మారాజు కాబట్టే భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు” అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేసింది మీనా.

ఇంతలో పనుందంటూ శివ బయటకు వెళ్ళాడు.  “అక్కా మీ మాయదారి మరిది చిరంజీవి, తోడికోడలు జ్యోతి  మీతో కలిసి ఉండట్లేదా” అడిగింది కల్పన.

“ఏం చెప్పమంటావు.  పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే రకాలు ఆ ఆలుమగలు. ఇద్దరూ ఇద్దరే. మా పెళ్ళిరోజు వాళ్ళు చేసిన నిర్వాకానికి  మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే మా కాపురం కొంతకాలం కలహాల కాపురంగా మారింది . ఉమ్మడి కుటుంబంలో ఉండాలని వాళ్ళకూ లేదు. కాలం మారింది. పోనీలే, ఆ విషయాన్ని వదిలేద్దాం ” అంటూ నవ్వింది మీనా.

                      **

సంక్రాంతి పండక్కి రెండు రోజుల ముందుగానే చక్రవర్తి శివ ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు ముగిశాయి. సినిమా స్క్రిప్ట్ అయిపోయిందని, దేశభక్తికి సంబంధించిన సినిమా అని, పేరు సుభాష్ చంద్ర బోస్ అనుకుంటు న్నట్లు,  శ్రావణ మాసం కల్లా  షూటింగ్ పూర్తి చేసి దేవీ అభయంతో దీపావళి రోజు విడుదల చేసి ప్రేక్షకుల దీవెన అందుకోవాలని డైరెక్టర్ పంతం అంటూ సగర్వంగా చెప్పాడు చక్రవర్తి.

తోడల్లుళ్ళు శివ, చక్రవర్తి  సొంత అన్న-తమ్ముడు  మాదిరి కలిసిపోయే రకం.  ఇల్లంతా పెళ్ళిసందడి లాగా పెద్దలు, పిల్లలతో ఎవడిగోల వాడిది అన్న చందాన సందడే సందడి.  పిల్లలు టీవీ లో హ్యారీ పోటర్, డిస్కవరీ ఛానల్ మార్చి మార్చి చూస్తూ ఖుషీ చేస్తున్నారు.  అక్కా చెల్లెలు మీనా, కల్పనలు అన్నపూర్ణ బ్యూటీ పార్లరు, బాబు టైలర్ షాపు, లీలా మహల్ సెంటర్ లోని శంకరాభరణం జెవలర్స్, రాఘవేంద్ర స్వగృహ ఫుడ్స్ అంటూ పూటకో షాప్ కు పరుగుతీస్తూ హంగామా చేస్తున్నారు. మీనా, కల్పనల తండ్రి సాంబయ్య ఆరు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో కన్ను మూశారు.  కొడుకులు లేనందున తల్లి యశోద మూడు సంవత్సరాల పాటు సొంత ఊరులో ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత  ఆరోగ్యం బాగా లేక పల్లెటూరులో  సరైన వైద్యం  అందుబాటులో లేక  కుమార్తెల పంచన చేరింది. కూతుళ్ళు బాగానే చూసుకున్నా, అభిమానవతి అయిన యశోద పోరు పెట్టి అల్లుళ్ళకు ఇష్టం లేకున్నా  వృద్ధాశ్రమంలో చేరింది. 

భార్యలు లేని సమయం చూసుకొని శివ చక్రవర్తితో అత్తగారి ప్రస్తావన తెచ్చాడు.

“అత్తగారికి కూతుళ్ళైనా, కొడుకులైనా మీ వదిన, కల్పనే కదా. న్యాయపరంగా కూడ అత్తగారి మంచీ-చెడూ చూసుకోవలసిన బాధ్యత ఆవిడ సంతానందే అని నా మిత్రుడు లాయర్ విశ్వనాధ్  చెప్పాడు. మన మామగారి మరణం అత్తగారిని బాగా కుంగదీసింది. జీవితం చరమాంకంలో  మనవళ్ళతో ఆనందంగా గడపటానికి ఆమెను

వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే బాగుంటుందని నా సూచన.  నేనొక్కడినే కోరుకోవడం కాకుండా నీ అభిప్రాయం అడుగుతున్నాను చక్రవర్తి” అన్నాడు శివ.

“ఎప్పటినుండో నా మదిలో ఇదే ఆలోచన ఉంది అన్నయ్యా. కానీ ఆనాడు పంతం పట్టి వెళ్లినావిడ తిరిగి వస్తుందా.  నాకైతే హోప్ లేదు ”  బదులిచ్చాడు చక్రవర్తి .

“నిజం చెప్పాలంటే మన కుటుంబాల్లో నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆనాటి గందరగోళానికి కారణం అసాధ్యుడు లాంటి నా తమ్ముడు, మహానటి లాంటి వాడి భార్యామణి.  ఇద్దరు ఇప్పుడు సింహాచలం వెళ్లి అక్కడే కొత్త కాపురం పెట్టారు కదా. అదీ గాక ఈ మధ్యనే నీ ధర్మపత్ని కల్పన ఉద్యోగంలో చేరింది.   ఆమె ఆఫీసుకు వెళ్తే అంజలి స్కూలు నుండి రాగానే ఇంటి దగ్గర రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండాలి.  ఈ విషయాలు చెప్పి అక్కా చెల్లెళ్ళను ఒప్పించే ప్రయత్నం చేద్దాం.”

శివ చెప్పిన ఐడియా నచ్చిన చక్రవర్తి సరేనంటూ అభినందన పూర్వకంగా కళ్ళు పెద్దవిగా చేసి నిలువుగా తల తిప్పాడు. ఐడియాను వెంటనే అమలు చేయటానికి మీనా, కల్పనను కూర్చోబెట్టి పెద్దమనిషిగా అత్తగారి పెత్తనం, కూతుళ్ళ ధర్మం, న్యాయం, బాంధవ్యాలు గురించి శివ చెప్పటంతో ఇద్దరిలో  పరివర్తన వచ్చింది. తప్పును సరిదిద్దు కోవాలనుకున్న  అక్కా చెల్లెళ్లిద్దరూ తక్షణమే కారులో ఆనందనిలయం వృద్ధాశ్రమానికి వెళ్ళి యశోదను క్షమాపణ కోరి, ఆవిడను ఒప్పించి,తోడ్కొని వచ్చి కుటుంబగౌరవం నిలబెట్టారు. సిసింద్రీలు ఆనందమానంద మాయె అంటూ  అమ్మమ్మకు సంబరంగా స్వాగతం పలికారు.  అమ్మమ్మా మాకు చందమామ కథలు, రాముడు కృష్ణుడు కథలు చెప్పాలి అంటూ రాము యశోద చీర  కుచ్చిళ్ళు పట్టుకున్నాడు. యశోద ముగ్గురు జూనియర్స్ ని దగ్గరకి తీసుకుని శుభాశీస్సులు అందిస్తుండగా ఆవిడ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.

(160 పైగా తెలుగు సినిమాల పేర్లతో అల్లిన కథ )

January 16, 2023 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం విస్మరించిన కవి రచయిత – యజ్ఞకృష్ణమదాసు

by Nakka Harikrishna January 16, 2023
written by Nakka Harikrishna

ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజ నాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు.అలాంటివారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమి రత్నం  యజ్ఞ కృష్ణమదాసు.

యజ్ఞకృష్ణమదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లామారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేత పని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారా లన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తేమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువ బడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాన్గి పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.

విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవ రాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడంపట్ల అభివృద్ధి పెరిగింది.గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు.ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జనసంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.

వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధుపత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞ కృష్ణమదాసు పరిచయమయ్యాడు.

బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమదాసులో గల పఠణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణమదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు.అక్కడి నుండి ఆయనలో చెప్పుకో తగినంత సాహిత్య పరిణతి కలిగింది.

యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన  యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని  డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోగల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.

వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞ కృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

పశువుల కాపరై పద్మశాలిగపుట్టి

కట్టెలేరుకొనియు గడుపు నన్ను

అవధానములు చేయునట్టి సభన జూచి

కడుపేద నైనను కరుణజూపి

సంస్కృతముర్దూయు ఛందస్సులను నేర్పి

నట్టి బెల్లంకొండ నాచార్య సోదర

ద్వయముకంజలి తనువువీడువరకు

యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను

తే .దేశ బంధు పత్రిక నాకు దిశనుజూపె

పత్రిక సభల అధ్యక్షు నై పాల్గొనుమని

బెల్లంకొండసోదరులైన వారె నిలను

నొందినఘనులనేమని నుడువువాడ

యజ్ఞ కృష్ణ దాసు కథలు :

యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతిశర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దు కున్నప్పటికి కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.

యాజ్ఞకృష్ణమదాసు అర్థశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమ దాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథవైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.

ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్థమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాదా లహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమల మాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనేవి వరం పేర్కొనబడిఉంది.

ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈకథ తెలియజేస్తుంది.

ఇంద్రమాలిక కథలో మంజీర కాదేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకాదేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్యఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు. ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.

కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలోనూ కమంజీరకాదేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆజామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంతవలె శంకువు లేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.

పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకులవలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకామోన్మాది రాజుగా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమేకాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.

ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్యవచ్చును. ఇంద్రమాలిక నిద్రించు వారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.

ఒకనాటి మాఘ స్నాన ప్రారంభంలో రాజుగర్వానికి అడ్డుకట్ట వేసే సందర్భం ఏర్పడుతుంది. రాజుపల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళతోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైనమలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వత శ్రేణిలోకి తీసుకొని వెళ్తారు రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకో వచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్యవలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజురాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాటలేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరి పాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈకథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.

విమర్శ :

కృష్ణదాసు “భారతీయసాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్నిరాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామసంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యనికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవనపరిధి లోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపరలో కసార్ధకత ఏ విధంగా పరిఢ విల్లిందో అదేవిధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారతభాగవతాలను రచించిన వారి జన్మధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్ష్యనికులు చెప్పినకవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్యసాధన అవసరమని తెలిపాడు. “దర్శనాద్వర్ణనాచ్చాడరూడాలోకేకవిశ్రుతిః. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణ రసహృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.

ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించిన వాడు ఉత్తమకవి కాజాలడు అన్నాడు.  “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలిం చాడు.

” సశబ్దో నసన్యాయో నసా విద్యా నసాకళా

జాయతే యన్న కావ్యాంగమతో భారో మహాకవేః ”

సా విద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞ కృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయతలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తిలోపం వలన ప్రతిభ నశించిపోతుందని చెప్ప టానికి.

“అవ్యుత్పత్తి కృతో దోషఃశక్తా సంవ్రియతేకవేః

జస్త్వశక్తికృత స్థస్యఝడిత్యే వావ భాసతే “

అని తెలిపాడు. ప్రతిభ గుణసంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞకృష్ణమ దాసు కవితా విమర్శనం చేశాడు.

ఈ విధంగా కృష్ణమ దాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా, పత్రికరంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరంప్రతాపరెడ్డితో మెప్పుపొందిన మేటిరచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.

యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమేకాదు. ఆయన ఆర్యసమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్రమహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహసంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరంతుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞ కృష్ణమదాసు వంటి వారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు నవల….మరపురాని పాత్రలు….

by Dr.Gaddam Syamala January 3, 2023
written by Dr.Gaddam Syamala

అంతర్గతాంశం..
వాస్తవిక మరపురాని నవలా నాయికలు….ఇందిర..మంజరి..జానకి..
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
నిర్వాహకులకు..నమస్కారం..

ఈ సదస్సులో నేను సమర్పించబోయే పత్రం…
వాస్తవిక మరపురాని నవలా నాయికలు….
1.ఇందిర…కాలాతీత వ్యక్తులు…డా.పి.శ్రీదేవి

  1. మంజరి….పాకుడు రాళ్ళు….శ్రీ రావూరి భరద్వాజ
  2. 3.జానకి ……జానకి విముక్తి…రంగనాయకమ్మ….

ఈ మూడు పాత్రలూ దాదాపు 10..15..సంవత్సరాల
తేడాతో సృష్టించబడిన పాత్రలు…
ఇంటా, బయటా ,ఇతరరంగాలలో స్త్రీలు పడుతున్న బాధలనేకం. పై మూడు పాత్రలూ వేటికవే విశిష్టమైన పాత్రలు….కాలవ్యవధి ఉన్నప్పటికీ మార్పులేని స్త్రీల
జీవితాలే కన్పిస్తాయి. రచయితలు భవిష్యత్సూచకంగా
పరిష్కారమార్గాలు సూచించడం మనం చూస్తాం..

మొదటగా….ఇందిర….కాలాతీత వ్యక్తులు..డా.పి.శ్రీదేవి.

మరపురాని పాత్రను చర్చించే ముందు రచయిత్రి ప్రతిభను
చెప్పుకోవడం అవసరం.
1929లో జన్మించి ,1961లో 32 సంవత్సరాలకే అనారోగ్యంతో మరణించిన శ్రీదేవి మరపురాని నవల . అందులో మరపురాని ఇందిర పాత్ర సృష్టి ఒక కళాఖండం…
నవల మాత్రమే కాక కథలు17, సమీక్షలు రాసి,ఎం.బి.బి.యస్ చేసి డాక్టరుగా,సేవలు చేసారు. ..ఎంత కాలం జీవించానన్నది కాదు ఎంతకాలం తన రచన ద్వారా మ బ్రతికున్నామన్నది ముఖ్యం..అని పెద్దలు చెప్పినట్లు శ్రీదేవి కలకాలం గుర్తుండిపోయే నవల రాసారు.అందులో 20 సం.ల ముందుచూపుతో ఇందిర పాత్రను సృష్టించారు….
ఈ నవల 1957-58 మధ్యకాలంలో తెలుగు స్వతంత్రలో
ధారా వాహికంగా వెలువడింది.
కథకు రంగస్థలం విశాఖపట్టణం. ఈ నవల నాలుగు స్తంభాలాటగా నలుగురి మధ్య, ప్రధానంగా తిరుగుతుంది.
ఇందిర,ప్రకాశం, కృష్ణమూర్తి,కళ్యాణి..ఏదో ఒక విధంగా మిగిలిన ముగ్గురితోనూ సంబంధమున్న పాత్ర..అంతేకాదు వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకు పోయే పాత్ర….

కానీ ఒకసారి నవల చదివితే గుర్తుండిపోయే పాత్ర ఇందిరనే…అంత విలక్షణమైన పాత్ర..నవలాకాలం 1953-54 మధ్యకాలం అయి ఉండవచ్చు..ఆ కాలం నాటికి స్త్రీలు
ఉద్యోగం చేయడమే అరుదు..ఆ మాటకొస్తే చదువుకున్న మహిళలే తక్కువ.సంప్రదాయ చట్రాలలో బిగుసుకొని,బాల్యవివాహాలు తో, ఇంటిచాకిరీతో ఉండే మహిళలే ఎక్కువ ఆనాడు.
సమాజంలో కనిపించే అరుదైన వ్యక్తులకు ప్రతీక ఇందిర.
భవిష్యద్దర్శనంగా ఇందిర పాత్రని సృష్టించారు.
ఇప్పటి కాలంలో ఇందిర లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కోకొల్లలు…
ఇందిర పెరిగిన విధానం,..చిన్నప్పుడే తల్లి చనిపోవడం,
తండ్రి బాధ్యతా రాహిత్యంతో ఉండడమే కాక,దురలవాట్లు కలిగి ఉండడం, తనని పోషించాల్సిన వాడు తన మీదే
ఆధారపడడం ఇవన్నీ ఇందిర వ్యక్తిత్వాన్ని రాటు తేల్చాయి.
ఇందిర వ్యక్తిత్వాన్ని చెప్పడానికి తాను మాట్లాడే మాటలు చాలు…” నా ఇల్లు నేను కట్టుకుంటుంటే పక్కనుంచి
నడిచే వాళ్ళ మీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చెయ్యగలను? ఎవరిమట్టుకీ వాళ్ళు చూసుకు నడవాలి.
అంతె..అంటుంది..అంటె తన జీవితాన్ని బాగుచేసుకునేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకుంటాననే భావంతో కృష్ణ మూర్తి తో చెప్తుంది..
జీవితకాలం అందరూ గుర్తు పెట్టుకునే సంభాషణ కొనసాగిస్తుంది ఇందిర.
“నీ జీవితకాలం లో నిండుగా,నిర్భయంగా బతుకు.రోజుకు
పదిసార్లు చావకు. మన చుట్టూరా వున్న స్వార్ధం, ద్వేషం, క్రౌర్యం, భయం యివి మనిషిలోనూ ఉన్నాయి. కాబట్టి
వీటికి భయపడకు . అంటూ మనలో మానవత్వం ఉండటం నేరం కాదు…అంటుంది…ఇవన్నీ పెళ్ళయిన మొదటి రోజు కృష్ణమూర్తి కి బోధిస్తుంది. ఈనవలలో లోకాన్ని క్షుణ్ణంగా చదివిన పాత్ర ఇందిరనే….నా వ్యక్తిత్వాన్ని చంపుకోను అంటుంది.అంటే పెళ్ళయ్యాక
తనమీద అధికారం చలాయిస్తే ఊరుకోను న్నట్లు కృష్ణమూర్తి తో చెబుతుంది…
…ఇందిర తమ మేడపైనున్న ప్రకాశంతో.”..ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం..బతుకులో నాకు కావలసిందొకటి.దొరుకుతున్నదింకొకటి.అంచేత లోకాన్ని ధిక్కరిస్తున్నాను” .అంటుంది…తాను ఎందుకంత కఠినంగా ఉంటుందో ముక్కుసూటిగా మాట్లాడుతుందో చెప్తుంది.
తనకు భర్త ఎలాంటి వాడు కావాలో చెప్తుంది.
నేనున్నానులే.నీకేం భయంలేదు.నీ సమస్యలూ, బరువులూ నా మీద పడెయ్….అనే భర్త కావాలంటుంది.
పిరికివాడైన ప్రకాశాన్ని తిరస్కరిస్తుంది.వేరొకరి సానుభూతిని ఆశించని వ్యక్తి.తన మాటలతో ఎవరినైనా దగ్గర చేసుకోగలదు…అదేవిధంగా తనకు అవసరం లేదు అన్నప్పుడు దూరం కూడా చెయ్యగలదు.ప్రకాశానికి దగ్గరవుతున్న కళ్యాణిని ఇంటినుంచి బయటకు పంపిస్తుంది..ప్రేమలు,ఆప్యాయతలు, బంధాలు, బాంధవ్యాలూ ఇవన్ని ఇందిరకు శాశ్వతం కాదు..అలా
ఆమెను ఆ విధంగా తయారు చేస్తాయి పరిస్థితులు..

తనకున్న ఆస్తిపాస్తులు తో కులాసాగా తిరిగే కృష్ణమూర్తి ని
చివరిలో వివాహం చేసుకుంటుంది….అదీ, అన్ని తన
అభిప్రాయాలతో ఏకీభవించిన తరువాతనే…
ఎంతో విలక్షణమైన పాత్ర ఇందిరది.ఆ నవలలో ప్రకాశం,కళ్యాణీ,కృష్ణమూర్తి మొ.న పాత్రలన్నీ వాస్తవిక పాత్రలే..ఆనాడే ఇందిర పాత్ర ద్వారా స్త్రీ స్వేచ్చ ను ప్రతిపాదించడం, మహిళలు ధృఢమనస్కులైసాంఘిక జీవనం చెయ్యాలనీ ఇందిర పాత్ర ద్వారా మహిళలకు సూచించారు..
నవల చదివిన వారెవరైనా ఇందిర పాత్రను మరిచిపోరు.నిజంగా మరపురాని పాత్ర ఇందిరది.

2. మంజరి….పాకుడు రాళ్ళు నవల…శ్రీ రావూరి భరద్వాజ
&&&&&&&&

2013లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పురస్కారం ఙ్ఙానపీఠ్ అవార్డు సంపాదించి పెట్టిన నవల పాకుడురాళ్ళు….చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా తీసుకుని, తెలుగులో మొట్టమొదటగా రాసిన నవల పాకుడు రాళ్ళు. దీనికి మొదట మాయా జలతారు అని పేరు పెట్టారు భరద్వాజ గారు…శీలా వీర్రాజు గారు దీనిని పాకుడురాళ్ళు గా మార్చారు. భరద్వాజ గారు అంతకుముందురాసిన పాలపుంత అనే ఓ పెద్ద కథను ఈ నవలగా రాసారు…3 సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో
ధారావాహికంగా సాగిన నవల.1965…కి అటుఇటుగా రాయబడిన నవలగా చెప్పుకోవచ్చు…ఆ సమయంలో రంగస్థల నాటకాలను వెనుకబడి, రంగుల కలైన రంగుల వల వైపు వెళ్తున్న రోజులు.సినిమా నటులుగా స్థిరపడాలని పల్లెలనుంచి కూడా ఎంతోమంది మద్రాసు పట్టణానికి వెళ్ళడం, కొందరికి అది దొరక్క నిరాశ తో వెనుకకు మరలడం……ఇలాంటి రోజులు…
ఆ రంగంలో తెరవెనుక జరిగే రాజకీయాలు,ఎత్తులూ, పై ఎత్తులు , రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఇవన్నీ అక్షరబద్ధం చేశారు భరద్వాజ…సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా
నటించేవారు మనకు నవలలో తరచూ తారసపడతారు.
ఇందులో ప్రధానపాత్ర మంజరి…ఈ పాత్ర మరపురాని పాత్ర…
నవ్యాంధ్ర కళా మండలి అనే నాటక సంస్థలో , స్త్రీ పాత్రధారిగా 15 ఏండ్ల మంగమ్మ నాటిక రంగం లో ప్రవేశించింది…అంతకుముందు నాగమణి అనే ఆవిడ దగ్గర పడుపు వృత్తి సాగించింది….గుంటూరు గుడిసెల్లో తిరిగి , బొంబాయి చలువరాతి మేడలో చేరిన మధ్య కాలంలో మంగమ్మ మంజరిగా మారి ఆమె అనుభవాలను చలనచిత్ర ప్రపంచాన్ని చూపిన నవల ఇది.తన వద్దకు విటుడుగా
వచ్చిన చలపతి సినిమా రంగాన్ని పరిచయం చేస్తాడు …
మద్రాసు తీసుకు వెళ్తాడు..అక్కడ మంజరి గా పేరు మార్చుకుంది….తన తెలివితేటలు నిరంతర, కృషి
పెట్టుబడిగా పెట్టి అవసరమైతే అందాన్ని ఎరగా వేసి
సినిమారంగంలో నాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఆరంగంలో నిలబడడానికి తన వ్యక్తిత్వాన్ని చంపుకొంటుంది.చేతినిండా డబ్బుండే స్థాయికి ఎదుగుతుంది.తక్కవ కాలంలోనే అగ్రశ్రేణి నాయికగా
అవుతుంది..అనుకున్నది సాధించేదాకా కృషి చేస్తుంది…
తన లక్ష్యం నెరవేరింతరువాత ఎవరినీ లెక్కచేయలేదు.
మంజరి.చలపతిని,నిర్మాతలను ఆడిస్తుంది…కానీ ఆమెలో
కృతఙ్ఞత ఉంది.నాటకరంగంలో తనని నాయికను చేసిన
మాధవరావు,రామచంద్రం పట్ల కృతజ్ఞతగా ఉంటుంది.
లోకం నీతిని తెలుసుకుంటుంది.కాలానుగుణంగా తన స్వభావాన్ని మార్చుకుంటుంది…తెలుగులో అగ్రశ్రేణి నాయికగా ఉన్నప్పుడే హిందీలో అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తుంది. భారత దేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా కూడా వెళ్తుంది.అక్కడ మార్లిన్ మన్రోని కలుసుకుంటుంది. ఆమె జీవిత గాధ విని
సినిమా నాయికల జీవితాలన్నీ ఇలాగే ఉంటాయన్న విషయాన్ని గ్రహిస్తుంది.
ఇలా మంజరి చివరికి అనుభవాల రాపిడి లో నలిగిపోయి ఏదైనా పల్లెటూరు పోయి హాయిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతే బాగుండు..అనుకుంటుంది….మనశ్శాంతి కరువై బాధపడుతుంది.నవల చివరిలో నాటకరంగం సంస్థ వాడైన మాధవరావు మంజరిని కలుస్తాడు.మంజరి రాజభవనాన్ని చూస్తాడు.” నువ్వుమంచిదానివి.మెత్తటిదానివి.జాలిగుండె నీది “అంటాడు మాధవరావు ఒక సందర్భంలో…
దానికి మంజరి “కొంత మేరకే నిజం.కొందరు సుఖపడుతున్నా నేను చూడలేను.ముఖ్యంగా నా శత్రువులూ.నన్ను సాధించిన వారి మీద కసి తీర్చుకోవడం లో నేను పరమానందం అనుభవిస్తారు.డబ్బుతో, మనుషుల్నీ కళలనూ కొని వ్యాపారం చేసేవారంటే ఇష్టం లేదంటుంది…ఎప్పుడో నేను పొందిన అవమానం, తిన్న దెబ్బలు, ఈసడింపులూ….సినిమా లైన్ లోనూ ఓ బుకింగ్ రావడం కోసం ఎన్ని ఆశ్రయింపులు, ఎంతోమంది ఎన్నెన్ని ఆశలు చూపడం…తలచుకుంటే ఎంతో అసహ్యం వేస్తుందో చెప్పలేను”.అంటుంది.. తనకు ఆప్తుడనిపించిన మాధవరావు తో తన వేదనను వినిపిస్తుంది.

చివరిగా ఆమె తెలుసుకున్న సత్యం..”..జీవితంలో విషాదం డబ్బు లేకపోవడం కాదు.మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవడం. మనం ప్రేమించడానికి ఎవరూ దొరక్కపోవడం..” అంటుంది మాధవరావు తో…
చివరకు మోసం చేసే మనుషుల ఉచ్చులో చిక్కి వేదనననుభవించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటుంది….మాధవరావు ఆమె ఇంట్లో ఉండగా నే.
రచయిత ప్రవేశించి, “అనన్యమైన ప్రతిభా సంపదలున్న వ్యక్తి మీద జీవితం ఏదో ఒక రూపంగా కసితీర్చుకుంటుంది” .అంటారు.
మంజరి విషయంలోనూ అదే జరిగింది. పోలీసులడిగే ప్రశ్నలకు అక్కడ సువిశాలమైన ఆ చలువరాతి మందిరంలో శబ్దం కూడా శిలా రూపం దాల్చింది.అంటారు భరద్వాజ గారు.

సినీతారల జీవితాలు అద్దాలమేడలు…పేకమేడలు…ఎప్పుడు కూలుతాయో తెలియదు.
పంజరంలోంచి బయటపడలేని పక్షుల జీవితాలు..రెక్కలు ఉండీ ఎగురలేని జీవితాలు. రంగుల వలలు. …
మంజరి పేదరికంతో నూ బాధపడింది. ఎడాపెడా డబ్బు సంపాదించీ వేదన చెందింది. ఉత్థాన పతనాలను చవి చూసింది..పాకుడు రాళ్ళని తెలిసీ , వాటిపై పయనించి తనను తాను కోల్పోయింది.
ఈనాడు కాదు ఆనాడూ పాకుడురాళ్ళ వంటి సినీ ప్రపంచంనుండి జారిపడిన తారలు న్నారు.ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హాలీవుడ్ నటి మార్టిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని మరణించింది.
పాకీజా వంటి అద్భుత కళాఖండం లో నటించిన మీనాకుమారి తాగుడుకి బానిసై మరణించింది…
మహానటి సావిత్రి స్వచ్ఛమైన ప్రేమకు నోచుకోక ,తాగుడుకు బానిసై ఈ లోకొన్ని విడిచి పెట్టింది.
ఇలా ఈమధ్య తారల్లో ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, దివ్యభారతి లాంటి ఎంతోమంది జీవితాన్ని చాలించారు చిన్న వయసులోనే…
ఇలా సినీరంగులవలలో చిక్కుకుని బయటకు రాలేక, అందులో ఉండలేక, వ్యధననుభవించిన వారందరికీ ప్రతీక మంజరి పాత్ర…చీకటి వెలుగుల రంగేళీ,, మాయా జలతారు మనుషులనీ మాయం చేస్తుందని చెప్పకనే చెప్పారు…ఇది వాస్తవం…వాస్తవ జీవన చిత్రణ, మరపురాని పాత్ర, సినీ ప్రపంచంలోని లోటుపాట్లను గురించిన ఒక హెచ్చరిక మంజరి పాత్ర….పాకుడు రాళ్ళు నవల….మరపురాని నవల…మరపురాని పాత్రగా మిగిలింది మంజరి..

  1. మూడవ నవలా నాయిక జానకి….జానకి విముక్తి నవల….రంగనాయకమ్మ….

స్త్రీల సమస్యలు ప్రధానంగా చేసుకుని1960ల నుండీ మహిళా రచయితలు నవలలు రాస్తున్ధప్పటికీ 1980 ల తరువాత వెలువడిన నవలా సాహిత్యం సమస్యలకు పరిష్కారదిశగా సాగింది..1975-85 మధ్య కాలం అంతర్జాతీయ మహిళాదశాబ్దంగా యూ.ఎన్.ఓ. ప్రకటించింది.ఈ నేపథ్యంలో స్త్రీల సమస్యలు సమావేశాల్లో చర్చించడం, తమకుతాముగా మహిళలు చైతన్యవంతులవడం, ఈ దశాబ్దంలో జరిగింది.రంగనాయకమ్మ పేకమేడలు, రచయిత్రి వంటి నవలలు రాసినా1980 లో ప్రచురించబడి వెలుగు చూసిననవల జానకి విముక్తి…
.. జానకి విముక్తి..మార్క్సిస్ట్ భావజాలంతో కూడిన నవల అయినప్పటికీ స్త్రీ వాదం పురిటినొప్పులు పడుతున్న కాలం.ఈ దశలో జానకి విముక్తి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
నవలలో కథానాయిక జానకి…అమాయకురాలు.భర్తచేత పీడింపబడి, ఆ పీడను సహించలేక, అన్న, సత్యం బోధనలతో , చైతన్యవంతంగా తన జీవన మార్గాన్ని మార్చుకుంటుంది.
ఈ సందర్భంలో కుటుంబరావు గారి మాటలు గుర్తు చేసుకోవాలి.” మన సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు.కొందరు బీదలకడుపున పుడతారు.మరి కొందరు ఆడవాళ్ళు గా పుడతారు.”అంటారు.
అంటే ఆడదానిగా పీడించబడడానికి కులం,మతం, బీద, ధనిక తేడాలు లేవు.ఆడతనం ఒక ప్రత్యేకత తరహా తక్కువతనం…
విప్లవ చైతన్యాన్ని ఇష్టపడే రచయిత రంగనాయకమ్మ
జానకి విముక్తి నవల ద్వారా స్త్రీ సమస్యల విముక్తి మార్గాలను చెప్పారు.
పితృస్వామ్య భావజాలం పేరుకుపోయిన సమాజంలో
పురుషాధిక్యత పెచ్చుమీరిన సమాజంలో ఆడది ఎక్కువ చదువుకోకపోవడం వలన , పెద్దలు నమ్మిన సంప్రదాయాలను మనసులో స్థిరపరచుకుంటుంది. జానకి.
పెళ్ళయింతరువాత రెండేళ్ళ నుండీ అత్తవారింట్లో ,అత్తవలన , భర్త వల్ల పడుతున్న బాధలని తన అన్న సత్యంతో చెప్పుకుంటుంది.ఈ సందర్భంలో నవల మొదలవుతుంది…జానకీ పరిచయం అవుతుంది పాఠకులకు…భర్త మూర్ఖ చేష్టలన్నీ అన్న అసహ్యించుకోగా,
చీదరించుకో గా ,తనంటే అంత ప్రేమ చూపడం తనకు తెలియకుండానే జానకికి ఇష్టమనిపిస్తుంది…అంటారు రచయిత.అతని చేష్టల వలన తన మనసు భర్తకు వ్యతిరేకంగా మారుతుందని తనకు తెలుస్తుంది.”ఈ నీచునితో కాపురం చేస్తోనే వున్నావు అంటే చిన్నబుచ్చుకుంటుంది…”తప్పుతుందా! అంటుంది.”
ఇక్కడ కట్టుబాట్లకు లోనైన సాధారణ యువతి కనబడుతుంది.”తక్షణం వెళ్ళిపోయాం పద!”
అని సత్యం అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది.అలా చెయ్యొచ్చా! అన్నట్లు…”నీకిష్టమైతే మంచి వ్యక్తిని పెళ్ళి చేసుకుందువు గాని..” అని అన్న అనగా, ఛీ! పెళ్ళేంటీ! అంటుంది.మళ్ళీ పెళ్ళి చెసుకోవడం అవమానంగా భావించిన సగటు ఇల్లాలు జానకి.అంటే భర్త ఏమన్నా ,కొట్టనీ, తిట్టనీ, ఇంటెడు చాకిరీ చేసి కూడా, ఏమీ ప్రతిఘటన చెయ్యకుండా ఉండాలి ఆడది
..ఇది సమాజం నీతి.జానకి విముక్తి నవల కాలం నాటి
న్యాయం.ఇప్పుడు కొంత మారినప్పటికీ స్త్రీ జీవితం పెళ్ళితో మారుతుందన్న ది నిజం…మంచీ కావచ్చు, చెడూ కావచ్చు.
ఇప్పుడున్న సమాజంలో స్త్రీల కేమైనా సమస్యలున్నాయా లేవా…ఉంటే.. అవి యేమిటి? ఎందుచేత ఉన్నాయి?
అవి ఎలా పోతాయి? అనే విషయాలు స్త్రీలకు తెలపడమే ఈ నవల ముఖ్య ఉద్దేశ్యం అంటారు రచయిత..ముందుమాటలో…
జానకి విముక్తి నవల 3 భాగాలుగా ఉంటుంది.
ప్రధానంగా జానకి, భర్త వెంకట్రావు, అన్న సత్యం పాత్రలుంటాయి.
మొదటి భాగంలో జానకి హావభావాలతో ఆమెను చిత్రీకరిస్తారు రచయిత….ఈ భాగంలో జానకి ఆమె ప్రమేయం లేకుండానే భర్త బాధలను అన్నతో పంచుకోగా
పుట్టింటికి పోదామని జానకిని తీసుకు వెళ్తాడు సత్యం….
చిన్నప్పుడే పెళ్ళయిన ,లోకం చూడని ఆడదానికి స్వంత నిర్ణయాలుండవు కదా! అన్నతో వెళ్ళిందె కానీ తన సంసారం మూన్నాళ్ళ ముచ్చటేసింది బాధ పడుతుంది.
మళ్ళీ భర్త వచ్చి పశ్చాత్తాపం నాటకాలాడి జానకిని తీసుకువెళ్తాడు..అప్పుడూ తన ప్రమేయం ఏమీ లేదు..
వయసు పెరిగే కొద్దీ, అన్న బోధనల వలన, పుస్తక పఠనంతో తనని తాను తెలుసుకుంటుంది..రెండవ భాగంలో సాహసం మూర్తీభవించిన మనిషిగా, సత్యాన్ని, నిజాయితీని నమ్మే మనిషిగా జానకి కన్పిస్తుంది…అప్పటికి ఒక మగ పిల్లవాడిని జన్మనిస్తుంది….
ఎన్ని సంవత్సరాలు గడిచినా మారని మనిషి వెంకట్రావు.
” మూఢాచారాలని నమ్మే వెంకట్రావు, అబధ్ధాలాడే వెంకట్రావు,కోపంకలిగిన వెంకట్రావు,నీతిలేని వెంకట్రావు, అవసరాన్ని బట్టి ఊసరవెల్లి లా రంగులు మార్చే వెంకట్రావు
వల్ల చేదు అనుభవాలెన్నింటినో చూసింది జానకి.
ఆ అనుభవాలకు పరాకాష్ట భర్తకు వ్యభిచార లక్షణాలు కూడా వుండడం….ఇంక ఆమె సహనానికి తెరపడింది.
కోపం కట్టలు తెంచుకుంది…ఆవెశం ఊపిరి పోసుకుంది.
వెంకట్రావు ను నిలదీసింది‌ ..ఇది జానకి మానసిక పరిణామ
క్రమం…అవునూ! పిల్లిని కూడా కట్టేసి కొడితే పులి అవుతుంది…అలాగే జానకి బాధలు పడీ,పడీ చివరకు భర్తతో పెనవేసుకున్న జీవిత బంధం అబధ్ధమనీ, కృత్రిమమనీ,మో‌సపూరితమనీ రుజువైనప్పుడు ఒక నిర్మలమైన ఆత్మకు కలిగే పరితాపం అది.
నేటి సమాజంలో కూడా ఎంతోమంది జానకి వంటి బాధలను భావిస్తున్న ఆడవారున్నారు..తను చదివిన పుస్తకాల ఙ్ఙానంతో …ఇంకానా…ఇకపై చెల్లదు… దుర్మార్గం..అనుకుని ఒక స్థిర నిశ్చయంతో ఇంటినుంచి
,అతని నుంచి దూరంగా కొడుకుతో సహా వెళ్ళిపోతుంది..

3 విభాగంలో గుప్పిట్లో ఉంచిన తన సంసారవిషయాలన్నీ
ఆవేశంతో తల్లికి అన్నకు చెబుతుంది. …
“24 గంటలూ ఏదో ఒక సాధింపు తో చూస్తూ ఉంటాడు.మనిషిలో ఏ గుణము చూద్దామన్నా అసహ్యమే! నోరు తెరిస్తే అబద్ధాలు.” అని అతని దుర్గుణాలచిట్టా పరుస్తుంది.
సున్నిత స్వభావం, పేదలపై సానుభూతి కలిగిన జానకి లోకఙ్ఙానంతో ఎదిగి, స్టడి సర్కిల్ లో పనిచేస్తున్న ,పరిచయమైన ప్రభాకర్ అన్నివిధాలా యోగ్యుడని
భావించి అతనితో జీవితం పంచుకోడానికి సిద్ధపడుతుంది.
అతను కోరిన తరువాత…కొడుకుతో సహా అతని జీవితంలో ప్రవేశిస్తుంది.ఆత్మానుభవంతో ప్రవర్తించి ,మానసిక, శారీరక బాధలనుండి విముక్తి పొందింది.
ఇలా జానకి పాత్రలో క్రమ పరిణామాన్ని చూపారు.
రచయిత.తనకు తానుగా చైతన్యవంతమైతేనే ఆ మార్పు శాశ్వతం అని కూడా ఆ పాత్ర ద్వారా చూపారు.సాంప్రదాయ బద్ధంగా పెరిగిన జానకి,తాను సంపాదించిన ఙ్ఙానంతో తన మార్గొన్ని సుగమం చేసుకుంది.
ఈ రోజుల్లో ఇలాగే కొంతమంది భర్తలతో వేగలేనప్పుడు విడాకులు తీసుకుని మళ్ళీ వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం..పురుషులందరూ అలా ఉంటారని కాదు…కానీ చదువుకుని,ఉద్యోగం చేస్తున్న స్త్రీని కూడా నీకేం తెలియదు…అని తీసి వేయడం ,ఆమెపై పెత్తనం చేయడం ఇంకా జరుగుతూనే ఉన్నది..ఆడవాళ్ళు సహనవంతులు కాబట్టి సర్దుకుని వెళ్ళిపొతున్నారు….అత్యాధునిక కాలంలో ఆడవాళ్ళ ద్వారా బాధలు పడుతున్న మగవాళ్ళు కూడా లేకపోలేదు…
ఈవిధంగా సగటు స్త్రీ గా మొదలైన జానకి పాత్ర తన జీవితానికి తానే నియంత అనే విధంగా నిర్ణయాలు తీసుకునే సాహసం కల స్త్రీ పాత్ర జానకి..

ఈ విధంగా విభిన్న పరిస్థితులు, వివిధ రంగాల, వివిధ కాలాలూ, కలిగిన సమాజంలో నిరంతరం మనకు ఎదురవుతున్న మనుషులు,కుటుంబ వ్యవహారాలు,వైవిధ్యం కలిగిన మనస్తత్వాలు మూడు నవలల్లోని మూడు పాత్రలు…
ఇందిర…..మంజరి…..జానకి…..

నాకు సదస్సులో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న సదస్సు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు…

డా.( శ్రీమతి ) గడ్డం శ్యామల….
అసోసాయెట్ ప్రొఫెసర్…(రిటైర్డ్)
ఎస్.పి.యం.కె.,
హైదరాబాదు… తెలంగాణా రాష్ట్రము….

January 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అన్నం తిని పోయి ఆడుకోరా..

by Chandu Pendyala January 2, 2023
written by Chandu Pendyala

అని ఓ అమ్మ పిలుపు,బాబూ ఎప్పుడూ ఆటలేనా కాస్త చదువుకోండిరా పరీక్షలు వస్తున్నయిరా అని అదే ఊళ్ళో కిరాయికి వుంటూ ఆ ఊరి ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పే సారు,అమ్మ పిలిచినా రాలేదు ఇంటికి అని కోప్పడే సోదరుడు , ఇంత మంది ఇన్ని తీరులుగ మందలించినా ఆట నుండి అర అడుగు కూడా ముందుకు వేయనివ్వని చిన్నప్పటి ఆటలు మనసును పొరలు పొరలుగా మెలిబెడుతుంటే బాల్యపు బడుద్దాయి చేష్టలు,అల్లరులు,మరి ముఖ్యంగా ఆడిన ఆటలు “అరటాకు లాంటి కాగితంలో ఆరబోయక తప్పదు”.

పక్క పక్కన ఇండ్లు,ఇండ్లను ఆనుకుని గుడిసెలు , అక్కడక్కడ అద్దాల మిద్దెలు అన్నిటిని అనుసంధానం చేస్తూ వాడలు , మధ్య మధ్య సన్నని సందులతో కూడిన పల్లెలు.ఆ పల్లెలో ఇంటికిద్దరు అన్నదమ్ములు ఇంటికిద్దరు అక్కచెల్లెలు.భారము లేని చదువులు,సమయాన్ని లెక్కించని లెక్కలు.
ఇవన్నీ ఆటలకు అనుకూలించే అంశాలు.
“దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ ఎలుక భద్రం కోర్ ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ ” అని గోడ చాటుకు పోయి పది లెక్కపెట్టేసరికి దోస్తులంతా తలుపుల చాటుకు,గడ్డివాముల చాటుకు దాచుకుంటే లెక్కపెట్టినతను దొరకబట్టకుంటే వెనుక నుండి పోయి వీపులో కొడితే వాడు మళ్ళా లెక్కబెట్టాలె”.
” చిర్రా గోనె అనే ఆటలో రెండు వైపులా కొచ్చెగా చెక్కిన చిన్న కర్రనే చిర్ర.గోనె అంటే పొడవాటి కర్ర.ముందుగా చిన్న రంధ్రం ( బద్ది ) తవ్వి చిర్రను బద్దికి అడ్డంగా పెట్టి గోనెతో

చిర్రను లేపి కొడితే అది పైకి ఎగరగానే అదే గోనెతో గట్టిగ కొడితే దానిని అవతలి వాడు పట్టుకుంటే కొట్టిన వాడు అవుటయినట్లు”.
” బొంగరం అయితే అది రయ్యిన తిరుగుతూ కాలాన్ని కూడా తిప్పేది.దానితో నేలతో పాటు అరచేతిలో కూడా తిప్పిన అనుభవాలు”
” నీ నేలంత తొక్కి తొక్కి పాడుచేస్త, రాయి రంగన్న , కట్టెలమోపు అనే హుషారైన ఆట”
” వినవే బాలా నా ప్రేమ గోల”
తొక్కుడు బిళ్ళ ఆడా రావే ” అని హాస్య నటుడు రేలంగి హీరోయిన్ తో పాతాళభైరవి సినిమాలో సరదాగా ఆడుతూ పాడే పాటలోని ఆ తొక్కుడు బిళ్ళ ఆటలో చిన్న’ పెంకాసు’ ను నాలికకు అద్దుకుని ఎనిమిది డబ్బాలు గీసి ఆ పెంకాసును అందులో వేసి దానిని కదిలిస్తూ కుంటుతూ ఆడే ఆట “.
” చింత గింజలతో ఆడే ఓనగుంటల ఆట”
” కచ్చకాయల ఆట “
” గోలీలాట లో రంగురంగుల గోలీలు రకరకాల సైజులతో ఎక్కువగా పిల్లలు ఆడే ఆట అది”.

ఇటువంటి ఎన్నో ఆటలు నాడు పిల్లలకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేవి.ఖర్చు తక్కువతో తల్లిదండ్రులకు భారం కాకుండా,తోటి సమాజానికి హాని జరుగకుండా ఆడిన ఆటలు నేటి పిల్లలకు కూడా నేర్పితే కొంతైనా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేయగలమేమో…

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

 మా  ఊరి పిట్టలు !!

by రాఘవాచార్య‌ January 2, 2023
written by రాఘవాచార్య‌

పక్క  ఊరికి వచ్చినా మా ఊరి
పిట్టలే కనిపిస్తున్నాయి
అవును ! నేను గుర్తు పట్టగలను
కిచ కిచలు నాకు ఎరుకైనా భాషనే మరి !

మా ఇంటి చూరు కింది పిచ్చుకలే
ఇక్కడి చూరుల్లో చేరినట్లున్నాయి
ఆశ్చర్యం ! నాకు తెలువకుండానే
పిట్టలు నా వెంటవచ్చినట్లున్నాయి
నేను బస్సులో
పిట్టలు ఆకాశంలో 
చిన్ని రెక్కలకు ఎంత అలసటైందో
సంతనుంచి నూకలు తెచ్చి
పిచ్చుకలకు సంతర్పణ చేయాలి

నాలో పక్షి ప్రేమ గూడుకట్టుకున్నట్లే
అన్ని ఊర్ల పిట్టలు 
మా ఊరి పిట్టల్లాగే అనిపిస్తాయి!
చెప్పుకుంటే అంతా హేలనచేస్తారు వికార ముఖంతో
పైన రెట్టలు రాలినట్లు !
వాళ్లు పక్షి ప్రేమికులు కాదన్నట్లే

ఎంత పెద్ద సంక్రాంతి ముగ్గు వేసినా
పిట్టలు ముగ్గుల్లో తిరుగాడితేనే
అది పెద్ద వాకిలి – పిట్టల స్టేడియం
లేకుంటే వాకిలి బోడ బోడ

నిజంగా పిచ్చుకలు ఊర్లో కనిపిస్తేనే
ఆ ఊర్లో ప్రాణాంతక
కాలుష్యం లేనట్లు
అయ్యో ! ఏ పాడు కాలానికైనా
మన పిట్టలు కనిపించకపోతే
ప్రకృతి తల్లి పిచ్చిలేసిపోతుంది
అకాలంగా మనిషి ఉనికికీ ప్రళయం

మనకు తెల్వదు ‌ ఊర్లన్నీ
పిచ్చుకలపేర్ల మీదే ఉంటాయి
అందుకే వాటిని ముద్దుగా
ఊర పిచ్చుకలంటారు !
లోపల ఇల్లేమో మనది
ఇంటి ముందు చూరేమో పిట్టలది
 
అదిగో ! అద్దాన్ని పిట్టలు 
ముక్కుతో పొడుస్తున్నాయి
అద్దం కూడ పిట్టలదే

పిట్టల్లేని ఊరు పుట్ట కిందికి జమ
పిట్టలుంటేనే ఊరు
ఊరు పిట్టల జాగీరు
       

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తొలి ప్రార్థన

by Parvati Mohan January 2, 2023
written by Parvati Mohan

నాటి చల్లని రాత్రి

సూర్యోదయపు గులాబి పిడికిళ్ళు విప్పుతూ

ఒక వెలుగు రేఖ పుట్టింది.

హస్త రేఖలు చూసి

ప్రాతః సమీరం చెవుల్లో గుసగుసలాడింది

చెమర్చిన హిమబిందువులని చూసి

నక్షత్రాలు నవ్వాయి

వెన్నెలతో కలిసి వీడ్కోలు చెప్పాయి

పక్కకు ఒత్తిగిలి నీరసంగా

తనకై చేసే తొలి ప్రార్ధన వినాలని

చెవులు రిక్కించిన శిశువుకి,

ఆడపిల్లా అన్న గొణుగుడు

ఆగొంతులో ఎంత విషాదం

ఓ – గాడ్ –

మొదటగా నా చెవుల్లో పడిన

అమృత వాక్కు వినా

మొదటి శ్వాసలోనే

విషాదాన్నీ, ఓటమినీ పీలుస్తూ

వింటున్నాను

ప్రతి అడుగూ ఓటమికి సన్నద్ధముకమ్మని

కాలకూట విషంతో ప్రారంభించిన

జీవన సరళి,

ఓ ఆడపిల్లా – అయితే ఈమె భవిష్యత్తుకై

ప్రార్థించు అంటున్న తొలి ప్రార్థనలు

రింగుమంటూనే ఉంటాయి జీవితాంతం

(పాకిస్తాన్ కవయిత్రి మేడం ఇస్రత్ ఆఫ్రిన్ కవిత ది ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ మై ఎల్డర్స్ కు అనుసృజన)

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అన్వేషణ

by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం January 2, 2023
written by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం

        ( వచనకవిత )

మనిషి!

నిరంతరాన్వేషి!!

మాతృగర్భంలోనే

మొదలౌతుంది

వెదుకులాట!

అగమ్యాటవిలో

అమాయకుడి వేట!!

గర్భశోకవిముక్తికోసం

పెనుగులాడుతూ,

సుడులుతిరుగుతూ…..

బయటపడి

అంతులేని

దుఃఖసాగరంలో

పడతాడు!

ప్రేమకోసం పరితపించే

ఆ  పసి గుండెలు

ఎన్నిటికో

ఆశ్రయమిస్తాయి

పెంపకుప్పలు!

కొన్నిటికి

“కిరాయి తల్లుల కూటములు!!”

బాల్యం

మొగ్గతొడక్కముందే

విజ్ఞానార్జన పేరుతో

మాతృప్రేమ

అందనంత దూరం

వెళ్ళిపోతుంది!

కూటికోసం,

గూటికోసం,

సమాజంతో

పోటీకోసం…….

ఆరాటపడే

ఆ  అరవిరిసిన మొగ్గకు

దృష్టిపథంనుండి

తప్పుకుంటుంది

ప్రేమ!

ఎండమావులై

ప్రలోభింపజేస్తూ

ముందుకు తోస్తూంటాయి

ఎన్నో ఆసలు!!

బాల్యంలో –

యౌవనంలో

తీరని

ముద్దులు – ముచ్చట్లు

ముసలితనం

ముంచుకొస్తూంటే

‘వ్వె వ్వె వ్వె’  అంటూ

వెక్కిరిస్తాయి!

కడుపుపంటల రూపంలో

కొక్కరిస్తాయి!!

ముదిరిన ముసలితనం

చేతగానితనమై

ధిక్కరిస్తుంది!!!

ప్రకృతి అందించిన

ఇంద్రియపటుత్వం

కోశస్థదశకు

ఆహ్వానిస్తుంది!

అందని ద్రాక్ష పండైన

ప్రే మ కో సం

నిస్తేజస్కాలైన

ఆ కళ్ళు

చివరివరకూ

వెదుకుతూనే ఉంటాయి!

దేనికో అమ్ముడుపోయిన

“ఆ  ప్రే మ“

మరో జన్మకైనా

దక్కుతుందా?

ఆ జీవికి

ఆ నం దం

చిక్కుతుందా??

ఏమో!?!?!?

మనిషి!

నిరంతరాన్వేషి!!

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్వరాంజలి-11

by Krishna Kumari Yagnambhatt January 2, 2023
written by Krishna Kumari Yagnambhatt

ముత్తుస్వామి దీక్షితులవారు సంగీత శాస్త్ర రహస్యాలు ఇమిడ్చి కీర్తనలు రచించారు. అంతేకాదు, వీరు ఇతర శాస్తాల నెన్నింటిలోనో అపారమైన జ్ఞానం ఉన్నవారు. ఈ జ్ఞానమంతా వారి కీర్తనలలో గమనించవచ్చును. “గురు గుహ” ముద్రతో వీరు రచించిన కీర్తనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.

వెంకట మఖీ సంప్రదాయాన్ని అనుసరించి రాగ నామాలు కీర్తనలో వచ్చేవిధంగా రచించడమే కాకుండా సూళాదిసప్త తాళాలతో నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు రచించారు. ఇటువంటి అపూర్వ రచనలు ఏ వాగ్గేయకారుడు కూడా చేయలేదు. ప్రపంచంలో అన్ని రకాల సంగీతం కంటే భారతీయ సంగీతం ముఖ్యంగా రాగానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కొక్క రాగం, దాని స్వరసమూహాలు, స్వరప్రస్తారాలు ఎంతో ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అటువంటి ప్రత్యేకత కల్గిన “రాగం” పట్ల దీక్షితుల వారి అవగాహన అద్భుతం. అందువలననే వారి కీర్తనలకు ఒక ప్రత్యేకత కల్గింది. రచన ఎంత ప్రౌఢంగా ఉన్నప్పటికి, మంత్రపూరితములైనప్పటికి, వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి. దీక్షితులవారి కీర్తనలు శ్రేష్ఠమైన సంస్కృతి పాండిత్యము, స్వరరాగ పద్ధతిపాటు భక్తి, ధ్యానము కూడా కలిసి శాస్త్రసమ్మతిని రచింపబడ్డాయి. ఈ ఉదాహరణ చూడండి.

 ప్లల వి:

నీలోత్పలాంబికే నిత్య శుద్ధాంబికే మామవ!

అనుప్లల వి:

 త్రిలోక జననీ త్రిభువన మోహిని

త్రైలోక్య చక్రలాసిన

సత్ గురుగుహ విశ్వాసిని!

చరణం :

మాయా ప్రభంజాతీత సవరూపిణీ

 ముచుకంద బాకట పాలిని వరదాయిని

“ఛాయా గౌళ” రాగ రంజని నిరంజని

సాయుజ్యాది దాయిని సచ్చిదానంద రూపిణి !

 ఈ నాటికి కూడా చాలా మంది విద్వాంసులు సంగీత సభ ప్రారంభంలో దీక్షితుల వారి కృతి అయిన హంసధ్వని రాగంలోని వాతాపి గణపతింభజే ఆలపిస్తారు.

వీరి కీర్తనలలోని మంత్రశాస్త్ర తత్త్వంవారి మంత్రశాస్త్ర సమర్థతని, వైదుష్యాన్ని తెలియచేస్తాయి. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతంలో చాలా వైవిధ్యం ఉంది కానీ, దీక్షితులవారి కృతులలో అతి సహజంగా సంస్కృత భాష ఒదిగిపోయింది.

దీక్షితులవారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించలేదు కానీ ఏ దైవాన్ని అర్పించినా అమేయమైన సమర్పణ భావనతోనే రచనలు చేశారు. భగవంతుడు– భక్తుడు అన్న సంబంధం తప్ప ఇతర ప్రక్రియలను వారు ఉపయోగించలేదు. ఇది వారి అనన్య భక్తి తత్పరతకు తార్కాణం.

 ఈ కీర్తనను చూడండి

ప్లల వి:

శ్రీ మహా గణపతి రవతుమాం

 సిద్ధి వినాయకో మాతంగ్ ముఖ: !

అనుప్లల వి:

 కామ జనక విధీంద్ర సన్నుత

 కమలాలయ తట న్నివాసొ

 కోమలధర పల్లవ పద ఖర

 గురుగుహోగ్రజ శివాత్మజ!

చరణం:

 సువర్ణా కర్ణణ విఘ్న రాజో

పాదాం బుజో గౌర వర్ణ వసన ధరో

 బాలచంద్రో నరాది వినుత లంబోధరో

 కువలయ స్వ విషాణ పాశాంకుశ

 మోదక ప్రకాశ కరో భవ జలధి నావో

 మూల ప్ర కృతి సవభావ సూకతరో

 రవి సహసర సన్నిభ దేహో

 కవి జననుత మూషిక వాహో

 అవనత దేవతా సమూహో

 ఆవినాశ కైవల్య గేహో !

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యంపుస్త‌క స‌మీక్ష‌

ప్రదీప్ బిస్వాల్ వి రెండు కవితలు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు January 2, 2023
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

మాటలు

మాటల గురించి మాట్లాడకపోవడమే మంచిది

అనాథ పిల్లల్లాగా అవి శవాల వెనుక

శ్మశానం వైపు పరుగెత్తుతాయి

చుట్టూ పడిపోయిన చిల్లర నాణేలను ఏరుకుంటాయి

వాటిని ఆపేవాళ్లెవరూ లేరు

చీకటి నిండిన రాత్రిలో

నక్షత్రాల మసక వెలుతురులో

దుమ్ము నిండిన ఊరితోవ మీద

కలల ముక్కల్ని వెతుకుతూ సాగుతాయి అవి

ఎవరు చెప్పగలరు వాటికి, అది నిరర్థకం అని?

వేకువ వేళ కొండకొమ్ము మీద

కొన్ని పచ్చని ఆకులు సూర్యకాంతితో మెరుస్తాయి

అక్కడ చారెడు కాంతిని చేజిక్కించుకునేందుకు

                                         సాహసిస్తాయి

వద్దనేందుకు నేనెవర్ని?

ఇక్కడ నా భార్య

నన్ను వాటికి దూరంగా ఉండమంటోంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ఎక్కడున్నావిప్పుడు?

భరత్! నువ్వెక్కడున్నావు?

దినపత్రికల్లో గానీ

వార, మాస పత్రికల్లో గానీ

ఎన్నో రోజులనుండి నువ్వు కనిపించలేదు

రాజధానిలో నల్లజెండాలతో

ప్రదర్శనలు జరిపినవారిలో నువ్వు లేవు

పాత బస్ స్టాండ్ లో ఎవరో

నీ ప్రసక్తిని తీసుకొచ్చారు

నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చినట్టు

నీ ఫోన్ నంబరును మారుస్తుంటావు

అంతేనా భరత్?

ఇప్పుడెక్కడున్నావు నువ్వు?

బొలంగీర్ లోనా, భువనేశ్వర్ లోనా?

కలహండికి వెళ్లావా నువ్వు?

అక్కడ ఒక ముసలి తండ్రి

పొలాల్లో కాయకష్టం చేస్తుంటాడు

ఇప్పుడు పిఛనుదార్ల వెంట

ఎందుకు పడుతున్నావు నువ్వు?

రైతులు ప్రభుత్వోద్యోగులు కారు

మాలో చాలా మంది లాగే

నువ్వు కూడా ఉన్నదాంతో తృప్తిగా ఉండు

భరత్!

రా ఒకసారి

మనం ఎన్నో చర్చించుకోవాల్సి ఉంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ప్రదీప్ బిస్వాల్ పరిచయం:

ప్రదీప్ బిస్వాల్ రెండు భాషలలో రచనా నైపుణ్యం ఉన్న ప్రసిద్ధ కవి. సుమారు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఒడియా భాషలో ఆరు కవితా సంపుటులను, ఆంగ్లంలో రెండింటిని వెలువరించారు. వీరి రెండు కవితా సంపుటులు హిందీలోకి అనువదింపబడినాయి.కొన్ని కవితలు హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర ప్రధాన భారతీయ భాషలలోకి తర్జుమా చేయబడినాయి. వీరు ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నేషనల్ బుక్ ట్రస్ట్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.సరళమైన భాషలో హృద్యమైన కవిత్వం రాస్తారు.ఈయన పేరెన్నిక గన్న సంపాదకులు, అనువాదకులు. ఇప్పుడు kabitalive(kabitalive.com)అనే వెబ్ మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.IAS క్యాడర్ కు చెందిన ఈయన ఒడిశా రాష్ట్రప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత,ప్రభుత్వం చేత మళ్లీ ఒడిశా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)మెంబర్ గా నియమితులైనారు. ప్రస్తుతం వీరు భువనేశ్వర్ లో నివసిస్తున్నారు.

***

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితా టపాసులు ఎడ్డీయకుండ్రి!

by సుదర్శనం వేణుశ్రీ. January 1, 2023
written by సుదర్శనం వేణుశ్రీ.

వచన కవిత్వాన్ని ఉమ్మగిల్లనీయకుండ
వడ్డిస్తున్నారు అందరూ అని ఎగాదిగా చూడకండి

మార్మికత సంక్లిష్టత ప్రతీకలు లేకుండా కవిత్వమా అనుకోకండి

అవార్డు రివార్డుల కోసంకాదు
తాడిత పీడితుల కొరకే
సామాన్య జనుల కొరకే కవిత్వం
వాడుక భాష పచనం కాని వచన కవితలనకండి

సమాజ మనుగడకోసమే సామాన్యుల మాటలు కవితా వాహిని అయ్యేది

ఎవరేమన్నా కిమ్మనకుండా కవిత్వ బాటలో పోయేటోళ్లం

పద్యాన్ని అలంకార సమాసాల నింపకుండ
జిగిబిగి లేకున్నా గజిబిజి లేకుండా ఉండాలనుకుంటాము
పద ఫలహారాలు పంచుతున్నామనుకోని పరిహాసాలాడకండి

జరుగుబాటుకో తిరుగుబాటుకో రాయడం లేదు
జరిగిన వాస్తవాలను
వాడుక భాషలో రాసేటోళ్లం పెదవుల మీద చిరునవ్వుల భాషణ చేయటం
కాగితాలపై అందమైన ఆదర్శ కవిత్వం కురిపించడం
మనసు కుళ్లు కుతంత్రాలతో
కుతకుతలతో
తోటి కవుల అంతర్గత యుద్ధాలను కోరడం చేయం
కుల మత వర్గ విభేదాల కవిత్వ కుంపటులను రగిలించము
ఒకే భావజాలంలోనూ అంతర్యుద్ధాలనూ కోరము

భక్తి శృంగార భావకవులలో మతాలతో మనుషులు వేరై రాజకీయపు టెత్తులు కవుల హృదయాల్లో తిష్టవేసుకున్న కవులున్నా
అనైక్యత సృష్టించం
ఐక్యత చెడగొట్టం

కవులందరూ కాగితాల పెదవులపై కవితలవుతారు
ఎవరికి అర్థం కాని కవులుంటారు
ఎవరి ధోరణిలలో వారు ఉంటారు
సమాజ శ్రేయస్సొక్కటే అసలు నినాదమై
వినూత్న పోకడల బాటలేసుకుంటాం
వాద వివాదాల పోత పోసుకుంటాం
అసలు జనానికి అందాలన్నదేకాక
అస్సలు అంతరాలు లేకపోలేదుసుమా!
అందరు కవులొక్కతీరేకారుసుమా!
తోటి కవుల తొక్కి పైకెక్కి మహాకవులు ఉన్నారు!
తోటి కవులు పైకెదగాలని అక్కున చేర్చుకునే కవులూ ఉన్నారు!

కాల ప్రవాహానికి నిలిచే కవులున్నారు జన కవులున్నారు
స్వార్థం వీడి కవిత్వ సాంగత్యం కోరే కవులూ ఉన్నారు
ఉన్నమాటకు ఎవరు ఉలిక్కిపడక
అన్న మాటలను ఆలోచించండి
అందుకే అందరిని కోరుతున్న-
ఎడ్డీయకుండ్రి!
కవితా టపాసులు ఎడ్డీయకుండ్రి!!

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us