మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

‘సంబరాల సంక్రాంతి వైశిష్ట్యం ..తెలుగు సంస్కృతికి బ్రహ్మ రథం’

by cvl sujatha January 17, 2023
written by cvl sujatha

సంక్రాతి సంబరం, సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున భోగి’ , రెండోరోజు ‘మకర సంక్రాతి’, మూడోరోజు ‘కనుమ పండుగ.’! మకర సంక్రాంతినే’ తిల సంక్రమణం’ , ‘ పంటల పండుగ’ ‘ఆమని పండుగ’, అల్లుళ్ళ పండుగ’, జానపదుల పండుగ’ వంటి పేర్లతోనూ పిలుస్తారు. సస్య లక్ష్మిని వెంటబెట్టుకు వచ్చే పండుగ ఇది. సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీలలోనే వస్తుంటుంది.

‘సంక్రాతి’ అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ ఈ సంక్రాంతి. మరణానికి సైతం పనికిరాని చేదు కాలంగా భావించే దక్షిణా యుగానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి ‘ మకర సంక్రాంతి’ పండుగే స్వాగతం పలుకుతుంది. ఆ రోజునుంచే మంచి రోజులకు శ్రీకారం. సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని ‘మాస సంక్రాంతు’లంటారు. ధనుస్సు రాశి తర్వాత వచ్చే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్టుగా చెబుతారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు, తర్వాత కొన్నాళ్ల పాటు ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. పతంగులు గాలిలో ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గాలిపటాల విహంగం అధికమయ్యాయి. గాలిపటాలు ఎగుర వెయ్యటానికి ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపిస్తున్నారు.

మిగిలిన అన్ని పర్వదినాల మాటెలా వున్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. పసుపు, కుంకుమలు, మామిడాకులు, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతివారి వాకిళ్ళ ముంగిట ”ముత్యాల ముగ్గులు” ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు …బంతిపూల అలంకరణలు …గంగిరెద్దుల ఆటపాటలు…హరిదాసు కీర్తనలతో’ సంక్రాంతి లక్ష్మి’ కి స్వాగతం పలుకుతారు.

(తరుణి అంతర్లాజల వారపత్రిక సౌజన్యంతో)

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పిల్లల్ని చెడు ప్రభావాల నుంచి తప్పించే బాధ్యత తల్లిదండ్రులదే !!

by రసస్రవంతి& కావ్యసుధ January 17, 2023
written by రసస్రవంతి& కావ్యసుధ

మనదేశంలో యువతీ యువకులలో చాలా మందికి నేరహింసా ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి వచ్చిన పిల్లలు ఉపాధి అవకాశాల్లేక, పేదరికం నుంచి బయటపడడానికి నేరాలబాట పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలకు బానిస లౌతున్నారు. జులాయిలుగా తిరుగుతున్నారు. మధ్య తరగతి ప్రజల పిల్లలు ఉద్యోగాలు సంపాదించినా, చాలీ చాలని జీతంతో కనీస అవసరాలు తీరక, లంచగొండు తెలుగా, అవినీతి పరులుగా మారుతున్నారు. ఎగువ మధ్య తరగతి ధనికుల పిల్లలు చదువుకున్నా, విలాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొంతమంది డబ్బు సంపాదన యావతో, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, అక్కడే స్థిరపడి తల్లిదండ్రులకు, దేశానికి దూరంగా, అనుబంధా లకు అతీతంగా గడుపుతున్నారు. భారతదేశ భవిష్యత్తుగాని, సమాజ సంక్షేమంగాని, భావిపౌరులైన బాలబాలికలపైనే ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు, భావిభారత సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పిల్లలు బాగా చదువుకోవ డమే కాకుండా మంచి గుణగణాలు అలవరచుకోవాలి. క్రమశిక్షణతో పెరగాలి. కుటుంబం సమాజంపట్ల తమ బాధ్యతలను గుర్తించాలి. కాలాన్ని సద్వినియోగం చేసు కోవాలి. పెద్దలను, సంప్రదాయాలను గౌరవించాలి.

సమాజం నుంచి తాము పొందడంతోబాటు సమాజానికి తానేదో చేయాలన్న భావం కలగాలి. ఇవన్నీ నేటి యువతరానికి ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే చాలావరకు లేవని చెప్పాల్సిరావడం నిజంగా దురదృష్ట కరం. నేటి యువతరంలో క్రమశిక్షణ లేకపోయినా, వారు నేరాలకు, వ్యసనాలకు అలవాటు పడినా, లేకపోతే కుటుంబంపట్ల తమ బాధ్యతలను విస్మరించి తమ స్వార్ధ ప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇచ్చినా, మనం వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ అవలక్షణాలన్నింటిలోనూ తల్లిదండ్రుల బాధ్యత ఎంతగానో ఉంది.

నేటి జీవన విధానంలో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండడంతో పిల్లల పెంపకం చాలా క్లిష్టంగా ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలను ఎలా పెంచాలో సరైన అవగాహన ఉండడంలేదు. దీనికి ప్రజల్లోని నిరక్షరాస్యతే కారణం. బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా పాశ్చాత్య పోకడలతో పిల్లలను పెంచుతున్నారు. కాన్వెంటు, కాన్సెప్టు, టెక్నో వంటి పేర్లతో నడుస్తోన్న ఇంగ్లీషు స్కూళ్లల్లో చదివే పిల్లలకు మన సమాజంపట్ల సరైన అవగాహన ఏర్పడడంలేదు. పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాల్లో సరైన విద్య లభించడంలేదు. పేద కుటుంబాల పిల్లలు చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే తీరికలేదు. చిన్నప్పుడే పిల్లలను కేర్సెంటర్లలో చేర్పిస్తు న్నారు. వారు పెద్దవుతున్నా వారి స్నేహితుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడంలేదు. చాలా మంది పిల్లలు గంటలకొద్దీ టీవీ ముందు కూర్చోవడం, కాలం వృథాచేసే క్రికెట్ మ్యాచ్లు, హింసాత్మక కార్టూన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. వీటివల్ల పిల్లల మానసిక దృక్పథం, వైఖరి ప్రభావితం అవుతున్నాయి.

పిల్లలను పాడుచేస్తున్నాయని ఒక విద్యావేత్త అన్నారు. ఇది అక్షరాలా నిజం పిల్లలు విజ్ఞానం పెంచుకోవడానికి, చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి, వ్యాయామం చేయడానికి, సృజనాత్మక శక్తి వంటి నైపుణ్యాలను పెందు కోవడానికి విలువైన కాలాన్ని టివి ముందు వృథాగా ఖర్చుచేస్తున్నారు. సహజ సిద్ధంగా పిల్లలకు ఆ వయసులో ఉండాల్సిన అమాయకత్వం, ఉత్సాహం, పరుగులుతీసే వేగం ఉండడంలేదు.

పిల్లలకు సహజసిద్ధమైన ఆలోచనలుకాక పెద్దపెద్ద విషయాల గురించి ఆలోచించడం పరిపాటైంది. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల మంచి ప్రవర్తన పట్టించుకోరుగాని చెడును తొందరగా పట్టించుకొని శిక్షిస్తుంటారు. పిల్లల్లోని మంచి లక్షణాలు, నైపుణ్యాలు, బలాలను ఏ మాత్రం గుర్తించరు. గుర్తించినా ప్రోత్స హించరు. పిల్లల్లో చెదులక్షణాలు ఉన్నట్లే మంచివికూడా ఉంటాయి. ఆ లక్షణాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే పిల్లలు మరింత అభివృద్ధి సాధిస్తారు. రోజులో ఒక్క గంటసేపైనా తల్లిదండ్రులు పిల్లలతో చర్చించాలి. వారి సమస్యల గురించి వాకబు చేయాలి. వారి అలవాట్లు, మానసిక స్థితిని పట్టించుకోవాలి. మన సంప్రదాయం. గురించి, ఉన్నత విలువల గురించి వారికి నచ్చేరీతిలో చెప్పాలి. ఏదైనా చెడుపని చేసినపుడు అది తప్పని నచ్చ: చెప్పగలగాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తారు. వాళ్లు అడిగినది ఏదీ కాదనరు. వారి ప్రవర్తన బాగా లేకపోయినా మండలించరు. దానివల్ల అలా పెరిగినవారిలో మొండితనం ఏర్పడుతుంది. గొడవ చేస్తే తాము అడిగింది ఏదైనా సాధించుకోగలమున్న గర్వం ఏర్పడుతుంది. తీరా వీళ్లు పెద్దయ్యాక తమమాట చెల్లక పోయినా, తమమాటను ఎవరైనా ఖండించినా భరించ లేదు. ఇలాంటివారు బయట ఏ అవమానం ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఈ మనస్తత్వానికి కారణం వారి తల్లిదండ్రులే, అతిగారాబం వల్ల మంకుపట్టుదల ఏర్పడుతుంది.

మరికొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలే. ఉత్తి పనికిరానివారుగా, దరిద్రులుగా కన్పిస్తారు. వారిని ఎప్పుడూ శిక్షిస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తుంటారు. ఇతరులు ముందు వారి గురించి చులకనగా మాట్లాడు: తుంటారు. ఇలాంటివారికి చిన్నతనం నుంచే తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. పెద్దయిన తర్వాత అది. సమాజంపై కసిగా మారుతుంది. దాంతో అలాంటివారు. అందరినీ ద్వేషిస్తూ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. లేదా కసితో పెట్రేగిపోయి నేరాలబాట పడతారు. రకరకాల వ్యసనాలకు బానిసలవుతారు. నిజంగా ఈనాడు పిల్లల మనసులకు ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదువు కోకపోతే చెడుతిరుగుళ్లు తిరగడం, చదువుకోమంటే బడి ఎగ్గొట్టి షికారులకు పోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది పిల్లలకు ఆదుకోవడానికి, ఆలోచించడానికి కూడా టైం ఉండదు. బండెడు పుస్తకాలు మోసుకుంటూ సాయంత్రం వరకు జైలుగదివంటి క్లాస్ రూంలో కూర్చోవడం, తర్వాత ట్యూషన్లకు వెళ్లడం, వీటితో అలసిపోయి ఇంటికి వచ్చాక గంపెడు హెూంవర్కు చేయడం ఇదీ దినచర్య దానికితోడు తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని కనుక్కోకుండా తమ ఆశలను, ఆశయా లను వారిపై రుద్ది వారిని హింసించడం. చాలామంది. తల్లిదండ్రులు చదవమని గోల పెడుతూ పిల్లలను రచి రంపాన పెడుతుంటారు. వారికి మానసిక ఉల్లాసం కలిగే వీలేలేదు. ఆ కారణంగా వారు చదువును ద్వేషించడం లేదా చదువుతప్ప వేరే ఏ విషయం పట్టించుకోకపోవడం, దీనివల్ల వాళ్లు ర్యాంకుల రేసులో పరుగెడుతుంటారు. అందుకు తగినట్లుగానే – న్యూన్లు, ప్రైవేటు కాలేజీలు కూడా రోజంతా వారిని రుబ్బుతూనే ఉంటాయి. దీంతో చదువనే జాడ్యం తప్ప సమాజంలో బతకాల్సిన తీరు గురించి సాటి మనుషులతో మెలిగే పద్ధతికూడా తెలియకుండా పోతుంది. అందువల్ల వారు ర్యాంకులు తెచ్చుకొని తల్లిదండ్రులకు గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లిపోతారు. తండ్రిపోయినా, తల్లిపోయినా లేక వాళ్లు ఇక్కడ దిక్కు లేకుండా పోయినా వారికి చీమకుట్టినట్లయినా ఉండదు. అందులో వారి తప్పేమీలేదు. అలా వారిని తయారు చేసిన తప్పంతా తల్లిదండ్రులదే.

అబ్బాయి, అమ్మాయిగాని బాగా చదివి లక్షలు గడించే ఉద్యోగాలు సంపాదించి, మహానగ రాల్లోనో విదేశాల్లోనో స్థిరపడాలని కలలుగని, ఒక ఏ. విషయాలు పిల్లలకు చెప్పకుండా చదువు చదువు అనే మంత్రాన్నే జపిస్తుంటారు. దానివల్ల ఆ పిల్లలకు పెద్ద వారిని గౌరవించడంగాని, తనవారిని ప్రేమించడంగాని, సంప్రదాయాలను గౌరవించడంగాని తెలియకుండా పోతుంది. చాలామంది తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పిల్లలు తమను లెక్కచేయనపుడు లబోదిబోమని కుమిలిపోతుంటారు. ఇలాంటివారిని చూసి కూడా గుణపాఠం నేర్చుకోకుండా తాము కూడా అదే మార్గంలో నడుస్తుండడం చాలా విచారించదగిన విషయం పెద్దలు పిల్లలు చెప్పేది వినాలి. ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని వికసింపచేసుకోవడానికి తగిన ప్రోత్సాహం, ప్రేరణ తల్లిదండ్రులు కలిగించాలి. అలాగే వారిని అతి గారాబం చేసి చెడగొట్టకూడదు. మగపిల్లలు బయట ఏం చేస్తున్నారో గమనించాలి. వారి అలవాట్లను గమనించాలి. క్రమశిక్షణతో మెలిగేలా శ్రద్ద తీసుకోవాలి. పిల్లల ముందే తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. తండ్రులు బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వారి ముందే తాగడం వంటివి చేయకూడదు. అలాగే వారిముందే తండ్రిని తీసేసినట్టు మాట్లాడడం, ఇరుగుపొరుగువారి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా గదిలో కూర్చుని నెట్లలో గడుపుతుంటే ఏం చేస్తున్నారో గమనించాలి. చాలామంది నెట్లో ముక్కూ మొహం తెలియనివారితో చాటింగులు చేసి ప్రేమలో పడుతుంటారు. సెల్ ఫోన్ విరివిగా మాట్లాడు. కుంటారు. వీటన్నింటినీ గుర్తించి వాటివల్ల కలిగే చెడు ప్రభావాలనుంచి తప్పించే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్వేచ్ఛనివ్వకుండా ఉండడం ఎంత తప్పో, అతిగా స్వేచ్ఛనిచ్చి వారిగురించి పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు, పిల్లలకు సారీ చెప్పడానికి తల్లిదండ్రులు వెనకాడకూడదు. అలాగే పిల్లలు వారిమాట నెగ్గించుకోవ దానికి నానాయాగీ చేస్తే వెంటనే వారి కోర్కెలు తీర్చడానికి సిద్ధమైపోకూడదు. తగని విషయాల గురించి పిల్లలు మారాం చేస్తే వారిని మందలించగలగాలి. ముఖ్యంగా చిన్నవాటి నుంచే వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లలకు నేర్చేముందు వారి పెద్దవాళ్లు, తల్లి
దండ్రులు క్రమశిక్షణతో ఉండాలి. పిల్లల్ని క్రమశిక్షణలో
పెట్టే ప్రక్రియ ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమలోనే వారలోపాలను కచ్చితంగా సరిదిద్దగలగాలి. పిల్లల్లోని అసంబద్ధప్రవర్తన అనవసర ప్రసంగాలు మంకుపట్టుతో. మొరాయించడం పెద్దలపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వంటివి ఆదిలోనే తుంచేయాలి. పిల్లలతో చాలా స్నేహంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఒకనాటి పిల్లలే. అని గుర్తుపెట్టుకొని వారిని భయపెట్టకూడదు. వారిని అసహ్యంగా తిట్టకూడదు. వాళ్లను శాంతింపచేయడానికి లంచాలు కానుకలు ఇస్తుంటారు. అది చాలా తప్పు, దాంతో పిల్లలు ఏదైనా ఇస్తామని చెబితేనే మాటవినే పరిస్థితి వస్తుంది. పిల్లల్లో తల్లిదండ్రులు కానుకలిచ్చే అలవాటు చేయడం వల్ల వాళ్లు పెద్దయ్యాక లంచ గొందులుగా మారతారు.

పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని. ఎప్పటికప్పుడు చెబుతుండాలి. అలాగే బహుమానంగా ఏదో ఒకటి ఇచ్చి వారిని మంచి చేసుకోవడం సరైనది. కాదు. చాలా కుటుంబాల్లో ఈ క్రమశిక్షణ భారాన్ని తల్లులకే వదిలేస్తారు. తల్లుల గురించి తండ్రులకు చాడీలు చెప్పి, తండ్రుల గురించి తల్లులకు చెప్పి ఎవరో ఒకరికి దగ్గరై వారినుంచి డబ్బులు, కానుకలు పొందు తుంటారు. ఈ చాడీలను ప్రోత్సహించకూడదు. కొందరు తండ్రులు తల్లి విషయంలో పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. అలాగే తల్లులు కూడా. దీనివల్ల పిల్లలకు చాడీలు చెప్పే మనస్తత్వం బాగా అలవడుతుంది. వీడు పెద్దయ్యాక ఎవరో ఒకరిగురించి చెడుగా మాట్లాడుతుంటాడు. పెద్దల్లోనే చాలా లోపాలున్నపుడు పిల్లల్లో లోపాలు అత్యంత సహజం. ఆ లోపాల గురించి వారికి చెప్పాలి. అంతేగాని ఈ లోపంవల్ల నువ్వు దేనికీ పనికిరావని అనకూడదు.
అలాగే మాటవిననివారిని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు.. దీనివల్ల పిల్లల్లో ఒకరకమైన భయం ఏర్పడుతుంది. వారిలో తిరస్కారానికి గురయ్యామన్న భావం కలిగి ఆందోళన చెందుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం వంటివి తగ్గిపోతాయి.

పిల్లలనుకూడా గౌరవించాలని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది వారి పిల్లలను మనం గౌరవించినట్లు మాట్లాడితే “వాడిమొహం వాడు. దేనికీ పనికిరాదనో లేదా దానిమొహం అదొక ఏడుపు గొట్టుది ఎలా బతుకుతుందోనని భయపడుతున్నాం” అని అంటారు. దానివల్ల వారికి తాము నిజంగా పనికిరామన్న భావం కలుగుతుంది. వీటన్నిటి గురించి మనం చర్చించు కొనేటపుడు పిల్లల్ని పెంచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అనే భావం కలగవచ్చు. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహిస్తే ఇదేమంత కష్టమైనదికాదు. అలాగని ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యవహారంకూడా కాదు. పిల్లల పెంపకం అన్నది గొప్పకళ, కొన్ని కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దయి ఎంత ప్రయోజనకారులవుతారో వారు ఎంత చక్కగా కుటుంబ పద్ధతులను సంప్రదాయాలను గౌరవిస్తారో చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. అందుకు వారి తల్లిదండ్రులను ప్రశంసించాలి. కాబట్టి మనం ఒక బంగారం ఉంగరం పోగొట్టుకుంటే ఎంతబాధ పడతామో ఆలోచించండి. అలాంటిది మన పిల్లలంటే మనకు నిలువెత్తు బంగారంలాంటివారు. ఆ బంగారా లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైనా ఉంది. వాళ్లను తమ బంగారాలుగా భావించగలిగితే ప్రతి తల్లితండ్రీ పిల్లల పెంపకంపట్ల మరింత శ్రద్ధచూపి స్తారు. అప్పుడే ఆ పిల్లలు ప్రయోజకులవుతారు.

“కవి శిరోమణి” -“రసస్రవంతి”
“ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ “
” కావ్యసుధ

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26)

by రూపాదేవి January 17, 2023
written by రూపాదేవి
(Soft pastel colours తో వేశాను పై చిత్రాన్ని)

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. కాబట్టి 2015 నుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం.

1949లో ఆమోదం లభించినా గానీ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది.

కానీ, భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.

రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26కు 73 ఏళ్లు పూర్తవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేటి భారతం

by A. Venugopal January 17, 2023
written by A. Venugopal

ఏటి భారతం – ఈనాటి భారతం

మాటల పోటీల బ్రతుకె నేటి భారతం

రాజ ధర్మ పరిరక్షణె నాటి భారతం

ఓటు సీటు, నోట్ల కొఱకె నేటి భారతం

సోదర, ప్రేమలు పంచుట నాటి భారతం

ఉదర పిండ విధ్వంసం నేటి భారతం

గీత బోధ జరిగినదలనాటి భారతం

హితుల కీడు నెంచేటి నేటి భారతం

విదురగీతి నాదరించె నాటి భారతం

అవినీతికి, పట్టమొసగె నేటి భారతం

మానవత్వమున కర్థం నాటి భారతం

అమానుషం, అన్యాయం నేటి భారతం

మనిషిలోనె దేవునిగనె నాటి భారతం,

మనిషికి, మనిషే శతృవు నేటి భారతం

అర్థ, స్వార్థముల నిండెను, అహంకారమే హెచ్చెను

అమాయకపు జనులనెల్ల ‘మాయ’లోనె ముంచేసెను నేటి భారతం

శాశ్వతమేదీ కాదనె నాటి భారతం

అంతా శాశ్వతమని యెంచెను నేటి భారతం….

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వి’శ్వాస’ దీపం

by కె. వీణారెడ్డి, January 16, 2023
written by కె. వీణారెడ్డి,

ఆకాశంలో ఉరుములు మెరుపులు… భూమిపైన జోరుగా వర్షపు చినుకులు… చెవులకు సోకుతున్న హోరుగాలి… ఆ చల్లని వాతావరణంలో టకటక వినిపిస్తున్న ఒక శబ్దం!

హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి, తన బావమరుదులతో కూడి డాక్టర్ రాజారాం చేసుకుంటున్న మందు పార్టీలో అది రెండో రౌండ్. ‘ఛీర్స్… ఛీర్స్’ గ్లాసుల గలగల శబ్దానికి పోటీపడుతున్నట్టుగా టకటకమంటూ మళ్లీ అదే శబ్దం!

చిరాకుగా వెళ్ళి వీధి తలుపు తీసి చూశాడు రాజారాం. తెరుచుకున్న ఆ తలుపుల ముందు… తడిసిన తల కొప్పెరతో, బురదనిండిన చెప్పుల్లేని కాళ్లతో, సన్నగా వణుకుతూ నిల్చున్నాడో పదేళ్ల పిల్లాడు.

‘అరె…. వీడా? ఏడాదినాడే కాలం చేసిన, కాలనీ చివరింటి జానయ్య కొడుకు శీనయ్యగాడా!” అనుకుంటూ అదోలా చూశాడు రాజారాం.

ఆ రాత్రి వేళ తనను డిస్టర్బ్ చేసిన వాడి రాకకు, తడిసి నేలను తడుపుతున్న వాడి తీరుకు అసహనం కలిగింది డా. రాజారాంకు.

“ఏంట్రా శీనూ?” విసుగ్గా అడిగాడు.

“డాక్టర్ సార్… నిన్నట్నుండి మా యమ్మకు జెరం. రాత్రికి రాత్రే ఎక్కువైంది. కరోనా వచ్చిందేమోనని భయమైతుంది. ఓసారి మీరొచ్చి సూడండి సార్… ఏదైనా గవర్నమెంట్ దవకాన్ల సేర్పించి పరీచ్చలు సేయించండి. కరోనా అయితేగాన దయచేసి మందులిప్పించండి!” అంటూ డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్ళతో శీనుగాడు.

మజాగా నడుస్తున్న మంది పార్టీ నుండి వైద్యుడిగా బయటకు రానివ్వలేదు రాజారాం మనసు.

“ఒరేయ్ శీనుగా… కష్టం జేసుకునేటోళ్లకు కరోనా రాదు లేరా! శక్తికి మించి పనిచేసిందేమో….. సుస్తీ చేసుంటది. మీయమ్మకేమీ కాదులే… రేపటికల్లా తగ్గిపోతుంది గానీ వెళ్లువెళ్లు!”

అంటూ… వాడిని బలవంతంగా బయటికి పంపించేసి, తలుపులు మూసేసి, గదిలోకొచ్చి మరో బాటిల్ ఓపెన్ చేశాడు డాక్టర్ రాజారాం.

* * *

ఓ వారం అనంతరం….

ఇంట్లోనే ఓ మూల గదిలో… బెడ్ పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ చిన్నగా మూలుగుతున్నాడు రాజారాం.

‘వైద్యుడుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తను కూడా కరోనా బారిన పడక తప్పలేదు. హోం క్వారంటైన్ పద్నాలుగు రోజులు పడకేసే తిప్పలు పడక తప్పడం లేదు! బాధగా, భయంగా, ఒంటరిగా… ఏదోలా గడుపుతున్నాడు తను. కొవిడ్ భయంతో బంధు మిత్రులెవరూ రావడం లేదు. కుటుంబీకులు మాత్రం అన్న పానాదులను గది బయటే పెట్టి తలుపు కొట్టి వెళుతున్నారు. అంతటి వైద్యుణ్ణి తనను తాకడానికే భయపడుతూ…. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. తననో అంటరానివాణ్ణి చేసిన కరోనా కాలమెంతటి భయంకరమైనది!’

ఆయాసంతో కూడిన ఆవేదనతో అనుకున్నాడు ఆరో రోజున డా.రాజారాం.

                   * * *

మందుల ప్రభావంతో, మగతగా పడుకున్న రాజారాం నుదుటిపై ఓ సున్నితమైన చల్లని స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.

ఏదో జ్ఞాపకం… మంద్రపవనంలా అతడి మనసులో కదలాడింది!

‘పక్షం రోజుల క్రితం…. ఆనాటి వర్షపు రాత్రిలో…. నిర్ధాక్షిణ్యంగా వీణ్ణి తను వెళ్ళగొట్టినా ఈనాడు తనకు కరోనా వున్నా, తనను ముట్టుకని తన నుదుట బొట్టుపెట్టిన ఈ శీనుగాడి సింధూరం చేతులు అప్పుడే విచ్చిన మందారాల్లా అన్పిస్తున్నాయి తనకు!’ అనుకొంటూ “శీనూ ఏంట్రా ఇది?” సంచలనంతో కూడిన ఆశ్చర్యంతో అడిగాడు!

‘’దండాలు డాక్టర్ గారూ… నిజంగా మీరు దేవుడే! ఆ రాత్రి మీరు సెప్పిన…. కాదు కాదు మీరు దీవించిన మాటతో మయమ్మకు జెరం తగ్గింది.  కరోనా కూడా రాలేదు. అయ్య లేని నాకు అమ్మ తోడైనా నిలబెట్టిండ్రు మీరు!”

కృతజ్ఞతతో నమస్కారం పెడుతూ అన్నాడు శీనుగాడు.

“నిజమా శీనూ” నమ్మలేనట్టుగా అడిగాడు రాజారాం.

“అవును సార్! మందులేకుండానే మీ నోటి మాటతోనే మాయమ్మ రోగాన్ని తగ్గించిన మనిసి దేవుడు మీరు! అట్లాంటి మీకు కరోనా వచ్చిందని తెలిసి బాగా బాధపడిన. మనిసిదేవుడికి గుళ్ళోని ఆ పెద్ద దేవుడే కదా తగ్గించాలె! అందుకే మన కాలనీలున్న ఆంజనేయస్వామి గుడికెల్లి మీకు తగ్గించమని రోజూ మొక్కేటోణ్ని. ఇయాల గుళ్లో ఏదో పండుగుంట! టెంకాయ కొట్టి దండం పెట్టి సిందూరం తెచ్చిన…. ఎవరు సూడకుండ మీ ఇంటి లోపలికొచ్చిన…. ఆ దేవుని     బొట్టు మీకు పెట్టిన, మీకు తప్పక తగ్గిపోతది సార్!

అంటున్న శీనుగాడి కళ్లల్లో అంతులేని విశ్వాసం అగుపించింది.

అబ్బురంగా వాడివైపు చూశాడు రాజారాం!

‘ప్రాణాంతకమైన కరోనా భయంతో తన వాళ్ళెవరూ తనను తాకనైనా తాకలేని దుర్భరమైన స్థితిలో… తననే దేవుడనుకున్న అమాయకమైన నమ్మకంతో… భయంలేని బాల రుద్రుడిలా తనను తాకిన వీడి హస్తముద్ర తనకెంతో సాంత్వన కలిగించిన మాట నిజం!’

అనుకొంటూ అపురూపంగా చూశాడా పిల్లాడివైపు.
‘ఆనాడు… మందు మత్తులో వాళ్ళమ్మకు మందివ్వని మా గొప్ప వైద్యుడు తను! తండ్రిలేని పిల్లాడు, తల్లినైనా బ్రతికించుకుందామని… ఎంతో ఆత్రంగా ఆ జోరువానాలో తన దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ… తను… విసుగును దాచుకున్న నటనతో చెప్పిన తన మాయమాటలు నమ్మి, ఆ నమ్మకంతోనే తన తల్లియందు ఆరోగ్య దేవతను దర్శించుకున్న అదృష్టవంతుడు!

ఆర్ద్రతా హృదయంతో అనుకున్నాడు డా. రాజారాం.

అంతలోనే….

“రాజా…. మొన్నటి శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ నుండి నా మొబైల్ కు ఫార్ వర్డ్ చేశారు. నీకు కరోనా నెగెటివ్ వచ్చింది కంగ్రాట్స్ రా!”

సాటి డాక్టర్ మిత్రుడి మాటలతో…. అణువణువునా ఆనంద స్పందన కలిగింది రాజారాంలో, ఆప్యాయంగా శీనుగాడివైపు చూశాడు.

“నీ విశ్వాసంతో, నీ స్పర్శతో నన్ను స్వస్తుణ్ని చేసిన బాల ధన్వంతరివి నీవు శీనూ….      నా వృత్తి ధర్మంలోని పరమార్థాన్నెరిగించిన బాల గురుడవు కూడా నీవే! నీకు నా జోహార్లు శ్రీనివాసా!”

అంటూ పశ్చాత్తాపంతో కూడిన బాధానందాశ్రువులతో వాడి సింధూరం చేతుల్ని పూజా పుష్పల్లా కళ్ళకద్దుకున్నాడు  డాక్టర్ రాజారాం.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2023
written by డా॥ సంగనభట్ల నరసయ్య

ఉ.       వాడిమయూఖములం గలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

          నేడిట వచ్చే నేకతము, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్

          పోడిమి వేల్వగా బడియె, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్

          రాడు, వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో (ఆది ప. 3-112)

ఈ పద్యం నన్నయ రాసిన గొప్ప పద్యాల్లో ఒకటి. ఆంధ్రమహాభారతంలో కచదేవయానిగాథ లోనిది. మృత సంజీవని విద్య కోసం శ్రతు శిబిరం నుండి అంటే దేవలోకం నుండి వచ్చిన కచుడు గురువు శుక్రునివద్ద శుశ్రూష చేసి విద్య పొందడమే లక్ష్యంగా ఉన్నాడే తప్ప మరో ఆలోచనలేదు. దేవయాని కచుని ఇష్టపడి, రాక్షసుల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా కచుడు గోవులను తీసికని మేపడానికి అడవికి వెళ్లినాడు. అతణ్ణి రాక్షసులు చంపివేసినారు. తిరిగిరాని కచుని కోసం ఎదురు చూసి, తండ్రితో పై విధంగా అన్నది.

సూర్యుడు అస్తమించినాడు. గోవులు కచుడు లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి. మీరు శిష్యులతో కలిసి సాయం కాలపు అగ్నిహోత్రాన్ని పూజించారు. బాగా పొద్దుపోయింది. కచుడింకా రాలేదు. అడవిలో క్రూరమృగాలు, సర్పాలు, రాక్షసుల నుండి ఏమైనా అపకారం జరిగిందేమో అని బాధపడిందని పై పద్యం తాత్పర్యం.

ఈ పద్యం వెనుక అనేక అర్థాలు నన్నయ నిక్షేపించాడు. అవన్నీ “లో నారసి” చూడాలి.

వాడి మయూఖములు (కిరణములు) కలవాడని ప్రారంభించబడిన పద్యంలో నిజానికి సూర్యుడస్తమించడని చెప్పుతోంది. మరి మధ్యాహ్న సూర్యుని ప్రచండత్వ ప్రస్తావన ఎందుకు? అదీ పద్య ప్రారంభంలోనే.

తండ్రి (శుక్రుని)కి సంబంధించిన సేవలు, ఆహారాదులు సమకూర్చి, మధ్యాహ్నం విశ్రాంతి లభించాక, తన ప్రియుణ్ణి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. మధ్యాహ్న సూర్యుని నుండి అస్తమయ సూర్యునివరకు ఎదురు చూస్తున్నదని, క్షణక్షణం లెక్క పెట్టుకని కచుని రాకకై తపన పడుతుందనే అర్థం. మరింకా రాలేదంటే ఆర్తి మొదలైంది.

గతంలో సూర్యుడస్తమించినపుడోసారి, మరోసారి ఆవులను మేపుకని కొంచెం ఆలస్యంగా , మరోసారి అగ్ని హోత్రాదుల పూజలు ముగించేసరికి, మరోసారి ఇంకొంచెం పొద్దుపోయి, చీకటి అలుముకున్నాక కొంచెం ముందు వెనుకలుగా వచ్చినాడు. ఈసారి అన్ని రకాలుగా అన్ని దశలు దాటి నా కచుని జూడలేదని, ఆ దశలననినటిని వరుసగా ఎదురుచూస్తూ, ఐనా రాలేదని, దుఃఖంలో అన్ని సంఘటనలను ఏకరువు పెట్టింది.

ఈ సంఘటనల పరంపర గూర్చి ఇంకా చెప్పాలంటే సూర్యుడూ కచుణ్ణి పట్టించుకోకుండా అస్తమించాడు, ధేనువులూ కాపరిని (కచుణ్ణి) పట్టించుకోకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి, మీరూ ఆయనకు పట్టించుకోకుండా, మీమీ సాయం సంధ్యాగ్ని విధుల్ని నిర్వర్తించుకొన్నారని అర్థం. ఓ రకంగా తండ్రితో నిష్ఠూరాలాడిందని భావం.

క్రుంకె అంటే తనదారిన తాను (మునిగి) పోయాడని, ధేనువులు తమ దారిన తాము వచ్చాయని, మీ దారిన మీరు మీ పూజాదికములు నిర్వర్తించుకున్నారని, ఎవరూ ఆతని గూర్చి ఆలోచించలేరని వాపోయింది.

సూర్యుడస్తమించాడని మొదటిపాదం నిండా మహాకవి పరచినా, తిరిగి “పొద్దును పోయె” అన్న నుడికారంతో వచ్చే సమయం ఐపోయిందని స్పష్టపరచినాడు. లేకుంటే పునరుక్తి కాదా? అంతేకాదు అస్తమయాన్ని పునరుక్తి చేయడంలో దేవయాని ఆర్తి అధికమైందని నిష్కర్ష.

సూర్యుడు పోయాడంటే చిరువెలుగుల్లో మృగబాధలు, ధేనువుల రాకతో సంధ్య పూర్తి ఐందంటే రాక్షస బాధలు, అగ్నిపూజలైనా యంటే చిక్కటి చీకటిలో పాముల బాధలు మూడు దశలకు మూడు బాధలు క్రమాలంకారంగా భాసించాయి.

సూర్యునిలా కచుడు ఈమెను పట్టించుకోకుండా అస్తమించాడు. అంటే రాక్షసులు సంహరించారు. కోర్కెలు ధేనువులు. అవి కచుడు లేకుండా వచ్చినట్టే, కచుడు లేక – తీరని వైనాయి.  ఏకతమ శబ్ద ప్రయోగంలో ఒంటరితనపు దేవయాని మానసిక స్థితిని వ్యంజించినాడని గమనించాలి. కచుడు నిర్లక్ష్యపు ప్రియుడు. కచుని అభాంలో ధేనువుల్లా కోర్కెలు, విరహజ్వాలల్లో అగ్నిజ్వాలలు. కచుడు (చని)పోయాడని, ధేనువులు కోర్కెలా దేహం (ఇల్లు) చేరాయని, అగ్ని విరహంలా ప్రజ్వరిల్లిందని సూచించబడిన క్రియలు. అగ్నిజ్వాలలు విరహజ్వాలలకు సంకేతాలు. అవీ ప్రజ్వరిల్లాయి. అణగిపొయ్యాయి. ఇంటిలోనే కాదు దేవయాని వంటిలో జరుగుతున్న సంఘర్షణలకు గుర్తులు.

ఈ దశ ఇపుడే కాదు, కచుడు స్వర్గానికివెళ్ళి పోయాక కూడా జరిగింది. దేవయాని (దేవలోకానికి ప్రయాణించవలసినది అని శబ్దార్థం) దేవతలవలె సుఖలాలస హెచ్చింది. కచుడు మృతితో అమృతత్వం సాధిస్తే దేవయాన చేయవలసింది, దేవ గురువు పుత్రుని వెంబడి వెళ్ళలేక, తీరని కోర్కెలతో భూమ్మీదే ఉండిపోయింది. స్వధర్మాన్ని (మానవ ధర్మాలను) తిరస్కరించి, పరధర్మాన్ని (దేవతల ధర్మాలను, ఆ లోకాలను) ఆశ్రయించ బోయి తిరస్కృతయై విఫలమైంది.

అబిధార్థం తండ్రికి గోచరమైంది. వ్యంజన పాఠకులకు అందించాడు మహాకవి. ఆనంద వర్ధనుడు అలఁకార శాస్త్ర వాఙ్మయంలో ప్రతిష్ఠించిన వెనక అతనికి శత సంవత్సరం పిదప నన్నయ ఆవిర్భవించాడు. ధ్వనిని ఈ సందర్భంలో అనంగమించాడు. “గతోస్తమర్కః” అన్న వ్యంగ్యార్థ వాక్యం అలంకారశాస్త్రంలో ప్రసిద్ధం. “అస్తంగతః అర్కః” అనగా సూర్యుడస్తమించాడని దానికి ప్రకరణవశాత్తు అనేకార్థాలు ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు ఉదాహరిస్తారు. అది మనసులో సుప్రతిష్ఠం ఐన నన్నయ అర్కుని అస్తమయాన్నే వర్ణించి, తన పద్యంలో ధ్వని ఉందని నిశ్చయపరిచాడు.

ఈ పద్యం శిల్పంలో వైవిధ్యం కలది. ఏకవాక్య తాత్పర్యంతో ఉండే పద్యాలకు భిన్నంగా బహువాక్యభరితం. వాక్య పంచకం ఉంది దీంట్లో. నాలుగు క్రియలు భూతార్థకాలు. ఐదవ క్రియ ‘రాడు’, దేవయానికి సంభాషించేనాటికి భవిష్యదర్థకమే కాక, నిశ్చయార్థకమైనా “వాచమర్థోనుధావతి” ఐంది. ఆరవ క్రియ సందేహాన్ని, ప్రమాదాన్ని సూచించింది.

కచుడు అరణ్యానికి గోవులను మేపడానికి వెళ్లినంతసేపూ కుడు లేని గృహ సీమ ఆమెను విరహంతో బాధించింది. అందుకే పగలొనర్చిన పగటిరేడు బాధకుడై వాడి మయూఖముల వాడయ్యాడు. అస్తమించినపుడు కూడా సూర్యుడామెకు వాడి మయూఖములవాడే. అదే తొలి పాదం అర్థం.

కచుడు రాకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇంకా ఆలస్యం చేస్తే రాత్రి గడిస్తే ప్రమాదమని, తాను పట్టించుకున్నట్టు బయటపడింది. జరిగిన క్రియలతో జరుగని పని తెలుపుటచే వస్తుధ్వని. మృగరాక్షస పన్నగ బాధలు ఆతడు పొంది ఉంటాడనే ఊహ నిజమే ఐంది. సహజ సాయంకాలవర్ణనలో అసహజమైన కచుని మృత్యువు అలంకార ధ్వని చెప్పక చెప్పిన తన విరహబాధ రసధ్వని. ఈ పద్యం లోనారసి చూస్తే అర్థ రత్నాలగని.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిఘా నేత్రమా

by Kamala Reddy January 16, 2023
written by Kamala Reddy

నిఘా నేత్రమా

నీకు వందనం
పసి పిల్లల మనసును
పాడు చేసే ద్వంద వైఖరిని
నిఘానేత్రంతో చూసావు
వలస కూలీలు
వలవల కార్చే కన్నీరు
నిఘానేత్రంతో చూసావు
కార్మికుల కర్షకుల
కష్టాలను
నిఘానేత్రంతో చూసావు
రవి గాన్సని చోటు కవి కాంచుతాడని
నీ కవితల ద్వారా నిరూపించావు
ఉస్మానియా ఉద్యమాలను
ఆ ఉర్రూతల ప్రభంజనాలను
సమాజ హితమును కోరి
సాగే నీ నిఘానేత్రం
మేధావులు మౌనంగా ఉండరాదని
మేల్కొల్పే నీ నిఘానేత్రం
అందు కో నా అభినందన

(నా అభిమాన రచయిత్రి పై రాసిన కవిత)

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖాప్రపంచంలో నార్ల

by Cheedella Seetha Lakshmi January 16, 2023
written by Cheedella Seetha Lakshmi

“పత్రికొక్కటున్న పదివేల సైన్యము

పత్రికొక్కటున్న మిత్రకోటి

ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!

అని నమ్మిన డా.నార్ల వెంకటేశ్వర రావు పత్రిక సైన్యాధ్యక్షునిగా ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి పత్రికలలో ఎడిటర్ గా పనిచేసి పత్రికను పైకి తేవడానికి కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి కాగడా,జనవాణి పత్రికల్లో  తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా సమర్థంగా కొనసాగించిన దిట్ట.

     హేతువాది,రాజ్యసభ సభ్యుడు ,సంపాదకుడు అయిన నార్ల   వెంకటేశ్వర రావు డిసెంబర్ 1 వతేదీ 1908 సంవత్సరంలో లక్ష్మణరావు,మహాలక్ష్మి దంపతులకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించాడు. కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం కొనసాగింది.

    మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే ” కాంగ్రెస్” పత్రికకు 1928 సంవత్సరం తన 20 సంవత్సరాల వయసులో రాసిన మొదటి ఉత్తరం నార్ల పత్రికారచన వైపుకు దారి తీసింది.  మొదట్లో ఉపేంద్ర,రవీంద్ర పేరుతో స్వరాజ్య,జనవాణి,ప్రజామిత్ర  పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

1938 సంవత్సరంలో సులోచనాదేవితో వివాహం జరిగింది.

 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 నుండి 1959 వరకు ఎడిటర్ గా బాధ్యత ను నిర్వహించాడు.

   కేవలం ఒక సంపాదకుడి కోసం  ఆ రోజుల్లో కె.ఎల్.ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక  1960 జులై 1 వ తేదీ విజయవాడలో ఆవిర్భవించింది.  ఆ సంపాదకుడు నార్ల  వెంకటేశ్వర రావు. ఆయన సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి పత్రిక కొత్త పుంతలు తొక్కింది.నిజాయితీకి,నిర్భీతికి మారుపేరు నార్ల.

    ఎవ్వరికీ భయపడని ఆదరని బెదరని వ్యక్తిత్వం నార్లది.ప్రజలకు అర్ధమయ్యే జీవ భాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధిస్తే రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం కదిలించిన యోధుడు.

   జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తనకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక  నానా కత్తిరింపులతో సెన్సార్ చెయ్యబడి వస్తున్నదేమిటి అని నార్ల వారికి ఉత్తరం రాశారు.తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికను ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయ ఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒకరోజు పత్రిక మొదటి పేజీనిండా నల్లగా తారు పూసి విడుదల చేశాడు.అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన.దానితో ప్రభుత్వం దిగివచ్చి సెన్సార్ చేయడం మానుకుంది.

   నార్ల స్వతంత్రుడు.ఏ రాజకీయ నాయకుణ్ణి విమర్శించకుండా వదలలేదు.రాజగోపాలచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినపుడు దానికి నిరసనగా నార్ల  శరపరంపరగా సంపాదక అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. నచ్చని నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీతో సహా ఎవరికీ లేదు అని తెగేసి చెప్పాడు. ఇందిరాగాంధీ నిరంకుశపాలనను,కుటుంబ వారసత్వ పాలన రాజకీయాలను ద్వేషించాడు.పౌరహక్కులు, మానవ విలువలు కావాలనుకునే వాడు.

    ఆధునిక పత్రికా ప్రపంచాన్ని తన సంపాదకీయాల ద్వారా ఉర్రూతలూగించి, పత్రికకు ప్రాణదీపాలుగా మార్చి, సామాజిక సంస్కరణకు వాహికలుగా మార్చిన ఘనుడు లేఖాప్రపంచాన్ని కూడా పరిపుష్టం చేసిన మహనీయుడు.

నార్ల వారిలో ఎంతో సృజనాత్మక దృక్పథం ఉంది.దానిని మించి విమర్శావలోకనం కూడా ఉంది.సమకాలీన కాలంలో ఎంతో మందికి వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఆయన విమర్శనా దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చు.

   బిరుసైన పండితులనుంచి మొదలుపెట్టి ప్రాథమికావస్థలో ఉన్న సాహిత్య ప్రియులవరకు నార్ల స్వయంగా స్వదస్తూరితో లేఖలు రాసి తమ మనోగతాభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

   బెంగుళూరు నివాసి అయిన ” హరిహరప్రియ” అని పిలువబడే సాతవల్లి వెంకట విశ్వనాథకు నార్లకు మధ్య  సాహిత్య సంబంధాలున్నాయి.

వయోరీత్యా ఆలోచిస్తే నార్ల హరిహరప్రియ కంటె చాలా పెద్దవాడు.చిన్నవాడైన హరిహరప్రియ వ్రాసిన ఎన్నో ఉత్తరాలకు నార్ల ప్రతిస్పందించి ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు.అది నిజమైన సాహితీవేత్తకుండే సమ్యక్ దృష్టి.ఈ దృష్టి నార్లలో విశాలంగా ఉంది.

      నార్ల వ్రాసిన ఉత్తరాలను 50కి పైగా జాగ్రత్తగా భద్రపరచి హరిహరప్రియ  ముద్రించి పుస్తకరూపంలో వెలికి తెచ్చాడు.అయితే ఈ ఉత్తరాలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.నార్లకు తెలుగులో ఎంత భావావేశం ఉందో ఆంగ్లంలో కూడా అంతకు రెట్టింపు భావావేశమున్నదని ఈ ఉత్తరాలను లోతుగా దర్శిస్తే తెలిసిపోతుంది.ఉత్తమ విమర్శకునికి ఉండాల్సిన సమ్యక్ దృష్టి ,విశ్లేషణాత్మక, నార్లలో పుష్కలంగా ఉన్నాయి.

     “హరిహరప్రియ” కు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన అరుదైన విషయాలను ప్రస్తావించాడు. చిన్నవాడైన హరిహరప్రియతో తన ఆరోగ్య విషయాలు చర్చించాడు. విషయాలను ప్రస్తావించేటప్పుడు నిర్మొహమాటంగా చెప్పడం నార్ల వారి ప్రధాన లక్షణం.తనకు నచ్చని విషయాలను కూడా నచ్చిన విషయాలతో కలుపుతూ చురకలంటించిన సందర్భాలు చాలా వున్నాయి.వైజ్ఞానిక వ్యవహారాలు,వైయక్తిక విషయాలు,సమకాలికుల ప్రస్తావన, పుస్తకాల ముద్రణ,పుస్తక వ్యవహారాల ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటి వెన్నెన్నో అంశాలు నార్ల లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.నార్ల రాసిన లేఖలను హరిహరప్రియ భద్రపరచి ముద్రించాలనుకొన్నప్పుడు హరిహరప్రియ నార్ల అనుమతి కోరాడు.తనపై చూపే అభిమానాన్ని ఒకవైపు మెచ్చుకుంటూనే తన మరణానంతరం లేఖలను ముద్రించవచ్చని నార్ల కోరాడు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఏ ఉత్తరంలోనైతే నార్ల

ఈ విషయాన్ని ప్రస్తావించాడో ఆ ఉత్తరమే హరిహరప్రియకు చివరిసారిగా వ్రాసిన ఉత్తరమైంది.

 కవులు,విమర్శకులు క్రాంతదర్శిత్వం కలవారని చెప్పటానికి  ఈ ఉత్తరం ఒక ప్రత్యక్ష తార్కాణం.

     నార్ల లేఖలను భిన్నకోణాలనుండి దర్శించి సమీక్షింపవచ్చు.హరిహరప్రియ కు వ్రాసిన ఉత్తారాల్లో చాలావరకు సమీక్షాత్మక లేఖలే అధికం.సరళమైన ఆంగ్ల పదాలతో భావ వ్యక్తీకరణ చేశాడు పదాల పటాటోపం కోసం ప్రాకులాడినట్లు ఎక్కడా కనిపించదు.పరాయిభాష పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించే మనస్తత్వం నార్లలో కనిపించదు.అసలు పదాడంబరం అంటేనే నార్లకు అసహ్యం.ఒకచోట నార్ల పదాలపై నా అధికారం చూడు అనేది నా మట్టుకు కవిత్వం కాదు.నీ గుండెపై నా రాజ్యాన్ని చూడు అని చెప్పగలిగిందే కవిత్వం అని అంటాడు. ఈ వాక్యంలో కవిత్వాన్ని ఎంత ప్రస్ఫుటంగా గాఢంగా నిర్వచించాడో తెలుస్తుంది.

    హరిహరప్రియకు రాసిన ఉత్తరాల్లో నార్ల తన ఆరోగ్యం గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా ప్రస్తావించాడు. ఆ లేఖలను బట్టి జీవితంలో ఎక్కువభాగం అనారోగ్యంతో బాధపడినట్లు తెలుసుకోవచ్చును.

అనారోగ్యం వలన ఆరోగ్యంగా ఉన్న సమయాలలో కూడా అస్వస్థులుగా కనిపించే వారట.

 నార్లలో నిండైన  మానవత్వం తొణికిసలాడుతుంది.గర్వం మచ్చుకైనా కన్పించదు.

తాను గొప్పవాడినని భావించినప్పటికీ అదే మోతాదులో ఇతరుల గొప్పతనాన్ని కూడా గుర్తించే హృదయవైశాల్యం కలవాడు.అందుకే

ఆయన నిండైన మానవతావాది.ఇతరులను గౌరవించడం వలన తమ గౌరవం కూడా పెరుగుతుందన్న విశాల దృక్పథం కలిగినవాడు నార్ల.

        నార్ల రచించిన ” జాబాలి” ని హరిహరప్రియ కన్నడభాషలోకి అనువదించాడు ఆ సందర్భంలో ముగింపు వాక్యాలను గురించి అనువాదకుడు కొన్ని సూచనలు చేశారు. హరిహరప్రియ చేసిన సూచనలను నార్ల అంగీకరించాడు.దీనిని బట్టి ఆయన హృదయవైశాల్యాన్ని అంచనా వేయవచ్చు.” జాబాలి” కన్నడంలోకి అనువదింపబడిన తర్వాత హరిహరప్రియను ప్రశంసిస్తూ నార్ల ఆయనకు లేఖలు రాశాడు. కన్నడ పాఠకులు తన అనువాదగ్రంథాన్ని ఆదరించాలని దీవించాడు.ఆద్య రచయితగా కన్నడంలో ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత తనకు రెండు ప్రతులను పంపించమని నార్ల కోరాడు.చూసే వారికి ఈ కోరిక ఎంత చిన్నదైనా నార్ల ఎంత సంతృప్తిపరుడో తెలుస్తుంది.

అచ్చువేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నార్ల హరిహరప్రియకు సూచించాడు.దీనినిబట్టి ఆయనలోని భావసౌందర్యమే కాదు రస సౌందర్యం,రూప సౌందర్యం కూడా వ్యక్తమౌతుంది.

జాబాలి కావ్యాన్ని కన్నడంలో డా.పుట్టప్ప చదివి తన అభిప్రాయం తెలిపినట్లు రాశాడు ఉత్తరంలో. అలాగే ఒక కాపీని డా.ఆద్య రంగాచార్యకు అందచేయమని చెప్పాడు.

 రామాయణంలోని రెండవ నాటకం సీత జోస్యం ప్రచురణ అయ్యాక నీకు పోస్ట్ చేయిస్తానని రాశాడు. మీ ఇంట్లో అమ్మ నాన్నకు మీ శ్రీమతికి శుభాకాంక్షలు అని రాశాడు.

       కన్నడంలోకి ” జాబాలి” అనువదింపబడిన తర్వాత మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్.వి.యెస్.సుందరం జాబాలిపై వ్యతిరేకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు.ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని నార్ల ఒకచోట ప్రస్తావిస్తూ ” సుందరం గారి విజ్ఞతకు ఒకవైపు మెచ్చుకుంటూ చురక వేశాడు. మృదువుగా విమర్శించి మౌనముద్ర దాల్చడం నార్లకు పెట్టని భూషణం.

     రచయితలు పుస్తక రచనలు చేస్తూ తమకు తాము ప్రచురించుకోవడం సరియైనది కాదని నార్ల అభిప్రాయపడ్డాడు.

ఈ విషయాన్ని హరిహరప్రియకు సూచించాడు కూడా.పుస్తకాలను తమకు తామే ప్రచురించుకోవడం వలన అమ్మడం కష్టమవుతుందని తత్ఫలితంగా విపరీతమైన నష్టాన్ని భరించవలసి వస్తుందని నార్ల అభిప్రాయ పడ్డాడు.పుస్తక ముద్రణ విషయంలో ప్రచురణకర్తలు ప్రోత్సహించాలని కూడా హరిహరప్రియకు సూచించాడు.

     నార్ల భౌతిక జగత్తుకు చెందిన మనిషి. ఆయన ఉత్తరాల్లో ఎక్కడా మర్మవాదపు ఛాయలు గోచరించవు.ఆధ్యాత్మిక బోధలు అసలు రుచించవు. ఉత్తరాలను విశ్లేషిస్తే సామాన్యమానవుని జీవితానికి  సంబంధించిన నమ్మశక్యంగాని రాయిలాంటి వాస్తవాలు బయటపడతాయి.అది ఆయన ఉత్తరాలలోని ప్రత్యేకత అంతేగాని ఊహాలోకాల్లో తేలిపోవడం అసలే నచ్చదు.

    నార్ల చక్కని కుటుంబ జీవి.సాంసారిక సుఖాలను స్వర్గంలా భావించిన విశాల హృదయుడు. ఒక్కొక్కసారి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకుంటూ నా సంతానమే నా సౌభాగ్యం అని పరవశించిపోతూ ఉండేవాడు.

   నార్ల వారి ఉత్తరాల్లో హాస్య చమత్కారాలు మబ్బుచాటున మెరుపుతీగల్లా మెరిసిపోతుంటాయి.

ఐదుగురు కొడుకులు ,కోడళ్ళు,ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు డాక్టర్లు.అందరూ విదేశాల్లోనే. ఒక కూతురు అల్లుడు మాత్రం ఇక్కడున్నారు మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతా వారంతా డాక్టర్లే.ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది.అప్పుడు మాఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు.ఇంతమంది డాక్టరులున్నా నేనెప్పుడూ పేషేంట్ నే.తలనుంచి కాలుదాకా నేనో రోగాల పుట్టని”. నార్లవారి అరుదైన చమత్కారానికి ఈ ఉత్తరం నిదర్శనం. ఇప్పటి లాగా డబ్బులిచ్చి కొనుక్కునే దొంగ డాక్టర్ డిగ్రీలు ఆనాడు లేవు మరి.

 నార్ల ఉత్తరాల్లో ఒకచోట తన వచనశైలికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది తాను పాతకాలపు మనిషి అయిన కారణంచేత తన వచనం కూడా పాతదేనని తెగేసి చెప్పాడు. పత్రికారంగంలో ఆంధ్రజ్యోతి సంపాదకునిగా గణనీయమైన స్థానాన్ని సంపాదించిన నార్ల

ఏ పరిస్థితుల్లో దాన్ని వదులుకోవలసి వచ్చిందో హరిహరప్రియకు లేఖద్వారా తెలియచేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.పత్రికాస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న యాజమాన్యంపై నార్ల విరుచుకు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి.

       సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నార్లవారికి ఉన్న చక్కని అలవాటు ” తెలుగు విద్యార్థి” వంటి పత్రికలను క్రమం తప్పకుండా చదివి యువరచయితలను అర్థం చేసుకుంటానని హరిహరప్రియకు నార్ల మాట ఇచ్చాడు.ఇతరులు రాసిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసినపుడు ఆలస్యం జరిగినపుడు క్షమార్పణ చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి నార్ల.హరిహరప్రియకు ఎన్నో సందర్భాల్లో క్షమార్పణ చెప్పి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు.

      మిత్రులతో కలిసి భోజనం చేయడమంటే నార్లకు చాలా ఇష్టం.అది ఆయన సంస్కారాన్ని తెలియచేసే విషయం.ఎంతో సంయమనంతో సమకాలికులతో జీవితాన్ని పంచుకోవాలన్న మనస్తత్వం నార్లది.తాను మైసూరు,బెంగుళూరు నగరాలకు వెళ్లినప్పుడు హరిహరప్రియ ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ నార్ల ప్రశంసల వర్షం కురిపించాడు.

   నార్ల వ్యక్తిత్వాన్ని తలపింపజేసే ఎన్నో విషయాలు హరిహరప్రియ రాసిన లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.ఒక ఉత్తరంలో నార్లను హరిహరప్రియ డా.నార్ల అని సంబోధించాడు. అలా సంబోధించడం వల్ల తన వ్యక్తిత్వం అంతగా పెరగదని నార్లకి, డా.నార్లకి అంత వ్యత్యాసం కనిపించడంలేదని మృదువుగా త్రోసిపుచ్చి భవిష్యత్తులో  అలాంటి సంబోధనలు అక్కరలేదని సూచించాడు.అనవసర ఆడంబరాలకోసం ప్రాకులాడడం నార్లకు గిట్టదని ఈ లేఖ ద్వారా విదితమౌతుంది.

      నార్ల వ్రాసిన కొన్ని గ్రంథాలు మరాఠీ భాషలోనికి కూడా అనువదించబడ్డాయి.

వీరేశలింగంపై

రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలో కూడా అనువదించబడింది.ఆయన రచనల గొప్పతనం తెలుగువారికే పరిమితం కాకుండా సమస్త భారతీయులు సైతం అవగాహన చేసుకొనే స్థితికి దిగారు.

  నార్లకు సమకాలీన సమస్యలపై చక్కని అవగాహన ఉంది.తన కూతురు వివాహ విషయంలో తాను స్వయంగా కలుగజేసుకొని తన అల్లుడికి వరకట్నం ఇవ్వ ప్రయత్నించినప్పటికీ ఆయన కట్నంలేకుండా  పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని హరిహరప్రియతో ప్రస్తావించి ఎంతో మురిసిపోయాడు.సమకాలీన కాలంనాటి వరకట్న సమస్యకు భిన్నంగా తాను మంచిబుద్ధి కలిగిన అల్లుడి ద్వారా అధిగమించానన్న ఆనందాన్ని నార్ల పొందినట్లున్నాడు.

  ఇలా నార్ల వారి ఉత్తరాలను విశ్లేషించుకుంటూపోతే ఎన్నో అంశాలు బయట పడ్తాయి. కుటుంబ విషయాలు,మిత్రుల విషయాలు,రచనలకు సంబంధించిన విషయాలు,సాహిత్య విమర్శలు, సమకాలీన సమస్యలపై చర్చలు మొదలగు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ఈ లేఖలవల్ల సమకాలీన సమాజానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉండడం వల్ల సాహితీజగత్తుకు ఈ లేఖలు చక్కని సందేశాన్ని అందించినట్లు తెలుస్తుంది.

   సంపాదకీయ వ్యాసాలు,సమకాలీన రాజకీయ పరిస్థితులను ఏ రకంగా శాసించాయో

లేఖాప్రపంచంలోని లేఖలు కూడా సమకాలీన సాహిత్యాంశాలను ఎన్నింటినో ఎత్తి చూపుతూ ఉత్తమ విమర్శకు చక్కని ఉదాహరణలుగా మిగిలిపోయాయి.

 నార్ల వెంకటేశ్వర రావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. నవయుగాల బాట నార్ల మాట  అనే మకుటంతో  700 పైగా సందేశాత్మకంగా ఆట వెలది పద్యాలు,బాలలకోసం నీతి పద్యాలు,16 ఏకాంకికల సంపుటి,సాంఘిక,పౌరాణిక నాటకాలు,వ్యాసాలు మొదలైనవి ఎన్నో రాశాడు. ఏది రాసినా సామాజిక ప్రయోజనమే.

ఇంగిలీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్ లో  ప్రచురితమైంది.

నార్ల ఎన్నో కొత్తమాటలు,పదబంధాలు సృష్టించాడు.మాండలికానికి పెద్దపీట వేశాడు.భాషాపరమైన అంశాలలో  ప్రయోగాలు ఆయన సొత్తు.  ఆయన ఒక కదిలే  విజ్ఞాన బాండాగారం.

   ప్రశ్న ప్రగతికి మూలం.ప్రశ్నలేని జగత్తు ప్రశ్నార్థకం అని అంటాడు.

   ” తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం” అని ఆనాడే తోటి జర్నలిస్టులకు ఉద్బోధించాడు. నిజాయితీగా,నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల.

     1981లో “సీత జోస్యం” నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందాడు.1983లో ఎన్. టి. రామారావు    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా నియమించారు.

   నిజాయితీయే  ఆయుధమై స్వేచ్ఛగా జీవితాన్ని గడిపి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించి, కొన్ని దశాబ్దాల పాటు పత్రికారంగాన్ని శాసించి,పఠితలను ఉర్రూతలూగించిన  డా. నార్ల వెంకటేశ్వర రావు  1985 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన . నార్ల  స్వర్గస్తులయ్యారన్న వార్త పత్రికారంగానికి  శరాఘాతంగా,తీరని లోటుగా మిగిలింది.

——————————-

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

విశ్రాంత సహాయాచార్యులు

హైదరాబాద్

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తొలి చలనచిత్రాలపై నాటకాల ప్రభావాలు

by Dr. V.V. RamaRao January 16, 2023
written by Dr. V.V. RamaRao

సినిమా దృశ్య శ్రవ్య ప్రధానమైన వినోదకళ. అలనాటి నాటకానికి సాంకేతిక  పొడగింపే సినిమా. తెలుగు సినిమా వెండి తెరపై వెలుగులు చిందడానికి
తెలుగు నాటకాలు మౌలికంగా ప్రధాన భూమిక పోషించాయి. కారణం తెలుగు తొలి టాకి యుగం మొదలు నేటివరకు జన బాహుళ్యంలో ఉన్న నాటకాల
నే తెరకు ఎక్కించారు కాబట్టి,సినిమాకు మూలంగా  నిలిచిన నాటక చరిత్రను విహంగవీక్షణంగా స్ప్రశించడం సబబు. రంగస్థలంపై సజీవంగా నటించేది నాటకంలో. కథానుగుణంగా నటీనటులతో నటింపజేసి, సెల్యు లాయిడ్ గా మలచి వెండితెరపైన ప్రదర్శించేది సినిమా.అందుకే దీనిని కదిలేబొమ్మల రూపకం అని, “చలన చిత్రం”( బొమ్మలు చలిస్తాయి కాబట్టి ) అంటారు.
            వాస్తవానికి విశ్వ సాహిత్యంలోనే  నాటకానికి ఒక విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో “కావ్యేషు నాటకం రమ్యం… నాటకాంతం హి సాహిత్యమ్” అంటూ నాటక ప్రాముఖ్యతను చాటిచెప్పబడింది.*1 క్రీస్తుశకం నాటికే మనదేశంలో దృశ్యకావ్య ప్రక్రియ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దీన్ని శాస్త్రీయంగా సూత్రీకరించిన వాడు ‘భరతుడు’.
       . తెలుగు సాహిత్య ప్రక్రియ ప్రారంభమైన కాలం నుంచి క్రీస్తుశకం 1860 వరకు మొదటి కాలం. ఈ కాలంలో వీధి నాటకాలను ఎక్కువ సంఖ్యలో ప్రదర్శించేవారు. ఆ తరువాతి కాలాన్ని ముఖ్యంగా క్రీస్తుశకం 1860 నుండి 1960 వరకు, ఈ వంద సంవత్సరాల కాలం తెలుగు నాటక రచనకు ప్రత్యేక కాలంగా పెద్దలు పేర్కొన్నారు.
ఆధునిక కాలంలో శ్రీయుతులు కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు మరియు పరవస్తు రంగాచార్యుల గార్లను తొలి నాటక కర్తలుగా పేర్కొంటారు.   తెలుగులో వెలువడిన మొట్టమొదటి నాటకం ‘మంజరీమధుకరీయం’. ఈ నాటకాన్ని 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించారు. ఈ నాటకం ముద్రణ మాత్రం 1903లో జరిగింది. 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ‘నరకాసుర విజయం’ నాటకాన్ని తెలుగులో రచించారు. అదే సంవత్సరం పరవస్తు రంగాచార్యులు గారు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని  తెలుగులో రచించారు. మూల నాటకంలోని  ప్రాకృత భాషల స్థానంలో తెలుగును ప్రవేశపెట్టిన ఘనత ఈ ఆచార్యుల వారిదే
ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభదశలో ప్రథములు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. 1880లోనే వీరి రచనలు ‘బ్రాహ్మ వివాహము’, ‘చమత్కార రత్నావళి’ దిగ్విజయంగా ప్రదర్శించబడినవి. తెలుగులో మొదటి సాంఘిక నాటకం ‘నందక రాజ్యం’. 1880లో వావిలాల వాసుదేవశాస్త్రి దీనిని రచించారు. 1883లో వడ్డాది సుబ్బారాయుడు రచించిన ‘వేనీ సంహారం’ సుప్రసిద్ధమైన తెలుగు నాటకంగా నిలిచింది. నాదెళ్ళ పురుషోత్తమకవి గారు 1884- 86 ప్రాంతంలో 32 నాటకాలను రచించి పాత్రోచితమైన సంభాషణలతో నాటకాలను రక్తికట్టించారు. ఉత్తమ శ్రేణికి చెందిన నటులైన ధర్మవరం కృష్ణమాచార్యులు 1887లో ‘చిత్రనళీయం’ 1989లో ‘విషాద సారంగధరము’ మొదలైన 25  స్వతంత్ర తెలుగు నాటకాలను రచించారు. ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితులైన వీరు తెలుగులో విషాద నాటకాలు రచించిన ప్రథములు. నాటకములలో పాటలను ప్రవేశపెట్టిన ఘనత వీరిదే. లక్షకుపైగా ప్రతులు అమ్ముడుపోయిన  ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని 1889లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించారు.
‌.    సరిగ్గా ఇదేసమయంలో మనదేశంలో సినిమా అడుగిడింది.1886లో లుమీర్ సోదరు లు   భారత దేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో “భక్త పుండరీక”, 1911లో “రాజదర్బార్” అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.
తెలుగు నాటక చరిత్రలో విశిష్టమైన సంవత్సరం 1897. ఈ ఏడాదిలోనే వేదం వెంకటరాయ శాస్త్రి గారు ‘ప్రతాపరుద్రీయం’ నాటకాన్ని, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రచించి తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు.
1901- 1920 కాలంలో విశిష్టమైన చారిత్రాత్మక నాటకరచన కొనసాగింది. కోలాచలం శ్రీనివాసరావు 1907లో ‘రామరాజు చరిత్ర’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1909లో ‘బొబ్బిలియుద్ధం’, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ మొదలైన నాటకాలను రచించారు. ఈ కాలంలోనే సోమరాజు రచించిన ‘రంగూన్ రౌడీ’ నాటకం అధిక సంఖ్యలో ప్రదర్శనలు అందుకున్న నాటకం. 1911లో తిరుపతి వేంకటకవులు రచించిన ‘పాండవోద్యోగ విజయములు’, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ‘సత్యహరిశ్చంద్రీయము’ నాటకాలు ఇప్పటికీ ఘనమైన స్థితిలో కొనసాగుతున్న అద్భుత నాటక రాజములు. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో  సంఘసంస్కరణ నాటక రచనలలో పేరుగాంచిన వారు కాళ్ళకూరి నారాయణరావు. వీరు 1921లో చింతామణి, 1926లో వరవిక్రయం నాటకాలను రచించారు. ఇలా మరెందరో నాటక రచయిత లు ఉన్నారు . కొన్ని వెలుగు లో కి రావు కొన్ని ప్రసిద్ధి చెందవు. అయితే తెలంగాణ నుండి కూడా చాలా మంది రచయితలు ఆకాలం లోనే అనేక ప్రక్రియలను చేపట్టారు. వారిలో ‘ఒద్దిరాజు సోదరులు‘ అని కీర్తి గాంచిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు సాహిత్యం లో ని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసారు . 1912 లోనే ” మోహినీ విలాసం” నాటకాన్ని రచించారని వారిపై 2017 లో వచ్చిన పరిశోధన గ్రంథం చదివితే తెలిసింది. 1918 లో సోదరులు రచించి, ముద్రించిన ” రుద్రమదేవి నవల పీఠిక లో ఈ నాటక ప్రస్తావన ఉన్నదని కూడా తెలిసింది. ఈ విషయం ” ఒద్దిరాజు సోదరురుల జీవితం సాహిత్యం అనే” పరిశోధన గ్రంథం లో ఉన్నది . ఇప్పుడు ఈ నాటకం లభించడం లేదు . 1920 లో ఈ సోదరులు రచించిన ” భక్తిసార చరితము” అనే నాటకం ఆనాడు ముద్రించారు మళ్లీ కొత్త గా ముద్రణ కూడా అయ్యింది.‘ తెనుగు‘ పత్రికా వ్యవస్థాపకులూ , సాహితీ వేత్తలు ఒద్దిరాజు సోదరుల పై 2017 న వెలువడిన డా॥ కొండపల్లి నీహారిణి గారి పరిశోధన గ్రంథం ద్వారా తెలియవస్తున్నది.
బహుశః “మోహినీ విలాసం ” నాటకం అనంతర కాలంలో తెలుగులో వెలువడిన” )మోహినీ భస్మాసుర” ( 1966) సినిమాకు మూలం గా భావించాల్సి వస్తుంది. అంతేకాదు 1918 లో ఈ సోదరులు రచించి న ‘ రుద్రమ దేవి‘ నవల పీఠిక లోఈ నాటకం ప్రస్తావింపబడటం గమనించదగ్గ అంశం.

జాతీయ ఉద్యమం ప్రస్థానంలో పాట, నవల, కథ వంటి ప్రక్రియలతో పాటు నాటకం పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా నిలిచి పోయింది. స్వాతంత్ర్య ఉద్యమం వైపు చైతన్య దిశగా కదిలించిన తెలుగ నాటకాలు కోకొల్లలుగా వచ్చాయి. పౌరాణిక నాటక ఇతివృత్తాలతో పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి ‘సంపూర్ణ మహాభారతం’ ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నాటకాలను, ధర్మవరం కృష్ణమాచార్యులు  ‘స్వయంవరం’ నాటకాన్ని, మొక్కపాటి వెంకటరత్నం ‘ద్రౌపది మాన సంరక్షణ’ నాటకాన్ని, వేదాంత కవి ‘యుద్ధభూమి’ నాటకాన్ని, కాళ్ళకూరి నారాయణరావు ‘పద్మవ్యూహం’ ఊటుకూరు  సత్యనారాయణ ‘భానుమతి’ ధర్మవరం కృష్ణమాచార్యులు ‘ప్రమీలార్జునీయం’ పట్టాభి సీతారామయ్య ‘మాతృ దాస్య విమోచనం’ మొదలైన నాటకాలను రచించారు.
1900లో కోలాచలం శ్రీనివాసరావు ‘సుల్తాన్”, 1921లో కొప్పరపు సుబ్బారావు ‘రోషనార,’ 1932లో ముత్తరాజు సుబ్బారావు ‘చంద్రగుప్త’, 1928లో ప్రభులింగాచారి ‘పల్నాటి వీరచరిత్రము’, 1926లో ఉన్నవ లక్ష్మీనారా యణ ‘నాయకురాలు’,నాటకానికి అంత శక్తి ఉంది.
1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. 1921 నుండి తొలి టాకీ వరకు (1932) విడుదైలన మూకీలు ,ఆనాటి రంగస్థల నాటకాల ముందు నిలువలేకపోయాయి.
టాకీ యుగం ప్రారంభమయ్యాక నాటకప్రభ సన్నగిల్లింది.
ప్రేక్షకులు కొత్తదనాన్ని వేలంవెర్రిగా స్వాగతించారు
1932 లో హెచ్ ఎం రెడ్డిగారు తెలుగునాట ప్రసిద్ధి చెందిన సురభి నాటక కంపెనీ అధినేత సురభి కమలాభాయి బృందాన్ని, రంగస్థల నటుడు మునిపల్లి సుబ్బయ్యని బొంబాయి తీసుకువెళ్లి, తెలుగు తమిళ భాషలలో ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని1932లో తనదర్శ కత్వం లో రూపొందించారు. ఆ తరువాత తెలుగులో తీసిన సినిమాలు అధికశాతంనాటకాలనే మూలంగా చేసుకొని తీశారు.భక్తప్రహ్లాద, పాదుకా పట్టాభిషేకం,చింతామణి, సత్యహరిశ్చంద్ర, వరవిక్రయం ,లవ కుశ సారంగ ధర, శకుంతల,కన్యా శుల్కం ..మొదలైనవి తెలుగునాట విజయభేరిని మ్రోగించిన నాటకాలు.
      ఈవిధంగా తెలుగులో తొలినాళ్ళలో నిర్మితమైన సినిమాలకు నాటకాలే మూలద్రవ్యాలను అందించాయి.
   *
     

January 16, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

“మా శారద గొప్పది”

by -  బి ఎస్ రాములు January 16, 2023
written by -  బి ఎస్ రాములు

ప్రేమించానని వెంటబడి పెళ్లి చేసుకొన్న అద్వైతకు కులాంతరాలు గుర్తుకు రాలేదు. ఏ లోపాలూ కన పడలేదు. నిన్ను పెళ్లి చేసుకోలేని ఈ జీవితం వ్యర్థం అన్నాడు. రొమాంటిక్ బ్లాక్ మేల్ చేసి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చింది శారద. పెళ్లి చేసుకొన్న మూడేళ్లకు ఏదో కెమిస్ట్రీ కుదరలేదని భార్యను బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు అద్వైత .
శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం. కోర్టు , అడ్వకేటు , కలిసి దిగిన ఫోటోలు సాక్ష్యాలు అన్నీ బలంగానే ఉన్నాయి.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద. శారద ఇపుడు తన ఏటియం కార్డు తానే వాడుకుంటుంది . కేసు పెట్టింది. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద మనోవర్తి కేసు వేసాడు.
కేసు వాసుతీసుకుంటానన్నాడు. అతడు
అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద.
ఏదో కెమిస్ట్రీ కలవడం లేదన్న బింకం అహంకారం ఎక్కడ పోయిందో! ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం.
?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి?
తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం..
శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది.
వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది. మా శారద గొప్పది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది. స్కూటర్ పై
బిడ్డను స్కూల్‌లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us