Home పుస్త‌క స‌మీక్ష‌ ఆధునిక తెలుగు కథానిక – పర్యావరణ స్పృహ

ఆధునిక తెలుగు కథానిక – పర్యావరణ స్పృహ

by Dr. Y. Subhashini


పరిశుభ్రత పేరిట, నాగరికత పేరిట పిచ్చుకలు పెట్టే గూళ్ళను ఊడబీకడం ఎంత కారుణ్యరాహిత్యమో తెలియజేస్తూ రాసిన మరోకథ “పిట్టపాట”. ఒకప్పుడు పంటపొలాల్లో వచ్చే పురుగులను ఏరి తినే పక్షులు నేడు లేకపోవడం వల్ల పంటలమీద పురుగులు ఎక్కువై దిగుబడి లేక రైతులు అప్పులు పాలైన స్థితిని చిత్రీకరించిన కథ. పాతతరంలో పొలాలు కుటుంబాన్ని పోషిస్తే నేటితరం పొలాన్ని పోషించుకోవాల్సి రావటం బాధాకరం. అది మనిషి స్వయంకృతాపరాధమేనని తెలిపిన కథ. పర్యావరణ చేతనారాహిత్యం జీవావరణ విధ్వంసానికి కారణమవుతుందని హెచ్చరించిన కథ. చివరికి బంధువులను కలవడమన్నది అవసరానికేకాదు హృదయసంబంధమైనదిగా భావించాల్సిన అవసరాన్నికూడా తెలిపిన కథ. అందుకే కేకలతూరి కృష్ణయ్యగారు సామాజిక విలువలు, సమతామమతలను అందించే ‘సృష్టి జనజీవన దర్పణం’ అనే ఒక మంచి పుస్తకం వెలువరించారు. బంధాలు అవసరానికి మాత్రమే అనే నేటి సమాజంలో అవి ఎంతమేర ఉండాలో చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇదే విషయాన్ని ‘పిట్టపాట’ కథలోనూ రచయిత సూచించడం నేటి సమాజానికి ఇది ఎంత అవసరమో తెలుస్తూ ఉంది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత చిత్తర్వు మధు. ఇతను వృత్తిరీత్యా డాక్టరు. తన వృత్తిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ లాంటి ముఖ్య విషయాల మీద పరిశోధించి రాసిన కథ “రెండు డిగ్రీలు”. రాబోయే తరాలు ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారో చూపిన కథ. భవిష్యత్తు పరమైనటువంటి అవగాహనలేని మనల్నిఇక ఆ భగవంతుడే కాపాడాలనేఅద్భుతమైన కథనంతో ఈకథనుమనకుఅందించారు.
ప్రభుత్వంచేసిన నల్లచట్టంవల్ల బాక్సైట్ తవ్వకాలు చేయడంతో జంతువులన్నీ మాయమైపోతున్నాయని చెప్తూ గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”కథరాస్తే, నీళ్లులేక ఎన్నో జీవాలు అంతరించిపోయిన దుస్థితిని చిత్రిస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి“కడితి వేట”అనే కథను రాశారు. నోరులేని మూగజీవాలమీద మనిషి పైశాచికత్వానికి నిదర్శనం జంతువుల అదృశ్యం. అరణ్యాలలోని చెట్లను నరికి మంటపెట్టడంవల్ల ఎన్నో పక్షులు, జంతువులు, లేతచెట్లు మాడిపోయి కనీసం తాగడానికి నీళ్లుకూడా లేని దుస్థితిలో ఒక కడితి నీళ్ల కోసం మడుగులో దిగి తాగితే దాన్ని కూడా చంపి తినడానికి సిద్ధమైన మానవ మృగాలను చిత్రించిన కథఇది.
మన పర్యావరణంలో ఒకరిమీద ఆధారపడి మరొకరు జీవించటం సహజం. కాని ఇది జరగనప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియజేస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు “అతడిబాధ” అనే మరోకథను రాశారు. నక్కలు, తోడేళ్ళు అంతరించిపోయాక కుక్కలను పెంచేవాళ్ళులేక అవి తిండికోసం పెద్దనక్కలు తోడేళ్ళ బదులు కుక్కలే గొర్రెలని, కోళ్ళను తినే పరిస్థితికి వచ్చిన తీరుని తెలిపిన కథ ఇది. ఒకప్పుడు కుక్కలకు ఇంట్లో తిండి పెట్టేవారు. కాని నేడు అలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. దానితో కుక్కలకి తిండి దొరకక రాబోయేకాలానికి నక్కలు, తోడేళ్ళ మాదిరి మారిపోతాయేమోననే ఆవేదన రచయితది.

***

You may also like

Leave a Comment