Home పుస్త‌క స‌మీక్ష‌ ఓ కర్షకా ! ఓ హాలికా

ఓ కర్షకా ! ఓ హాలికా

by Narendra Sandineni

అన్నాడి గజేందర్ రెడ్డి, ఓ కర్షకా! కవిత పై విశ్లేషణా వ్యాసం.
కవి,గాయకుడు,రిటైర్డ్ ప్రిన్సిపల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల,మానకొండూర్,అన్నాడి గజేందర్ రెడ్డి కలం నుండి జాలువారిన”ఓ కర్షకా” కవిత పై విశ్లేషణా వ్యాసం.ఓ కర్షకా కవిత ఏమిటి? అని ఆసక్తి తో చదివాను.నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.

“ఓ కర్షకా ! ఓ హాలికా
“అన్నదాతా ! సౌభాగ్య ప్రదాత
కర్షకుడు ఎవరు? వ్యవసాయం చేసేవాడు. పొలం దున్ని బతుకువాడు.కర్షకున్ని,రైతు, వ్యవసాయదారుడు అని పిలుస్తారు.హాలికుడు ఎవరు? నాగలి పట్టి దున్నేవాడు.నిరంతరం కృషి చేసేవాడు రైతు అని చెప్పవచ్చు.మనదేశంలో ముందుగా పేర్కొన దగ్గ వారిలో రైతులు ముందు ఉంటారు.రైతే రాజు.రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు.అన్నదాత ఎవరు? అన్నదాత సుఖీభవ అని అంటారు.మనకు అన్నాన్ని ప్రసాదించే రైతు సుఖంగా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పవచ్చు.కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది.హాలికుల శ్రమకు దేశంలోని ప్రజలంతా ఋణ పడి ఉంటారు.సౌభాగ్య ప్రదాత ఎవరు? అంటే మనకు సౌభాగ్యాన్ని ఇచ్చేవాడు రైతు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.ఇందులో సందేహానికి తావు లేదు.
“రైతు రాకతోనే ప్రతి చేను పులకరిస్తుంది”
రైతు రాకతోనే చేను ఎందుకు పులకరిస్తుంది? అది ఏమైనా జీవమున్న మనిషా? భూమికి ఎలా స్పందనలు ఉంటాయి అని మనకు ఆశ్చర్యం కలిగవచ్చు.రైతు రాకతోనే అంటే రైతు చేనులో అడుగుపెట్టగానే చేను పులకరిస్తుంది. ఆ గగుర్పాటును చూడగానే రైతు ముఖం లో ఆనందం వెల్లివిరిస్తుంది.అలాంటి ఆనందపు అనుభూతులు రైతు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. రైతు రాకడ తెలియగానే చేను ఎదలో కలిగే గిలిగింతలతో,ఆనందంతో మరియు తన్మయత్వంతో పులకరిస్తుంది అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన గొప్పగా ఉంది.
“నీ మాటతోనే ప్రతి పిట్ట పలకరిస్తుంది”
రైతు మాట వినగానే పిట్టలు ఎక్కడైనా పలకరిస్తాయా? పిట్టలు తమ సహజ స్వభావంతో కిచకిచ శబ్దం చేస్తాయి.కోకిలలు కుహు కుహు రాగాలతో పాటలు పాడుతాయి.రైతు మాట వినగానే పిట్టలు మాట్లాడుతాయి.పిట్టలు మాట్లాడటం గురించి మనం చిన్నతనంలో పంచతంత్ర కథలలో చదివాం.ఆనాటి ఆ కథల్లో ఎంతో నీతి దాగి ఉంది. మరి ఇప్పుడు కవి గజేందర్ రెడ్డి సైతం రైతు తో పిట్టలు సంభాషిస్తున్నాయి అని చెప్పిన భావం అద్భుతం.
“పశు పక్ష్యాదులకు తెలుసు నీ జీవ కారుణ్యం
పశువులంటే నాలుగు కాళ్ల జంతువులు.గొర్రె,ఆవు, బర్రె లాంటివి అని చెప్పవచ్చు,పక్షులు,పిట్టలు కూడా నానా రకాలుగా ఉన్నాయి.జీవ కారుణ్యం అంటే ఏమిటి? జీవుల పట్ల జాలి,దయ కలిగి ఉండటాన్ని జీవ కారుణ్యం అంటారు.సకల జీవుల పట్ల భూత దయ కలిగి ఉండాలి.సమస్త జీవకోటిని ప్రేమించాలి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి అని గ్రహించి నడుచుకున్నవారు రైతులు అని చెప్పవచ్చు.ఒక మనిషి దుఃఖం,బాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది కారుణ్యం.దయ ఒక సాత్విక భావన. ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం రైతులది. రైతుల వల్లనే మనమందరం బతుకుతున్నాం.రైతు పశువులను పెంచుతాడు మరియు పశువులను ప్రాణంగా ప్రేమిస్తాడు.రైతు చేను చెలకల్లో పక్షులు గింజలు తిని బతుకుతాయి.రైతు పశువుల పట్ల మరియు పక్షుల పట్ల కారుణ్యంతో ఉంటాడని లోకమంతా ఎరిగినదే.పశుపక్ష్యాదులకు రైతుల జీవ కారుణ్యం తెలుసని చెప్పడం,కవి గజేందర్ రెడ్డికి రైతుల పట్ల గల ఎనలేని ప్రేమను తెలియ చేస్తుంది..
“మానవాళి కంతటికి నువ్వే శరణ్యం” రైతులు ఎండనక,వాననక,పగలనక,రాత్రనక చేనులో,పొలంలో దిగి కష్టపడతారు.దుక్కి దున్నుతారు.విత్తనాలు నాటుతారు.నీరు పెడతారు. చేనుకు కాపలా కాస్తారు.రాత్రి పగలు చేనులోనే ఉంటారు.అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతు పంటలు పండిస్తాడు.అందుకే మానవాళికంతటికి రైతు రక్షించే కవచం,నువ్వే శరణ్యం అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన చక్కగా ఉంది.

అన్నాడి గజేందర్ రెడ్డి

“ఏ నేలకి ఏ పంటో తెలిసిన శాస్త్రజ్ఞుడివి”
నేల భూగోళంపై ఎగువ పొరలో వృక్షాలు పెరిగే భాగాన్ని నేల అంటారు.నేలలు భూ ఉపరితలంపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావంతో మెత్తటి నేలలుగా మారతాయి.నల్లరేగడి నేలలు,ఎర్ర నేలలు, జిగురు నేలలు మొదలైనవి.నీటిపారకం ఎక్కువ ఉన్నచోట వరి వంటి పంటలను పండిస్తారు. నీటిపారకం తక్కువ ఉన్నచోట మిగతా పంటలు పండిస్తారు.ఏ నేలలో ఏ పంట పండించాలో రైతుకు తెలిసిన విద్య.పంటలు పండించడంలో రైతుకు ప్రావీణ్యత ఉంది.రైతును శాస్త్రజ్ఞుడివి అని కీర్తించిన కవి గజేందర్ రెడ్డి భావన చక్కగా ఉంది.
“అనుభవాన్ని జోడించి పండించే విజ్ఞుడివి”
రైతు పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది.రైతు అనుభవాన్ని ఆచరణలో పెడుతూ వ్యవసాయం చేస్తే మరింత లాభం పొందుతాడు. రైతు అనుభవానికి మరింత పదును పెడితే మరిన్ని విజయాలు సాధిస్తాడు.వాస్తవ జ్ఞానమే సరైన జ్ఞానం.రైతు నిరంతరం పని చేయడం ద్వారా, పరిశీలన ద్వారా అనుభవం వస్తుంది.రైతులు అనుభవాన్ని జోడించి పంటలు పండించే నిపుణులు అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన అద్భుతం గా ఉంది.
“నీ స్వేద జలంతో పసిడి పంట పండుతుంది”
రైతు నేలతల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటగా మార్చి బంగారాన్ని పండిస్తాడు.రైతు చెమట చుక్కలకు బంగారు రాశుల పంట పండించే శక్తి ఉంది.కార్మిక కర్షక స్వేద జలానికి ఖరీదు కట్టి షరాబు లేడోయ్ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. కర్షకుల శ్రమతోనే బంగారు పంటలు పండుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
“నీ స్వేద బలంతో సిరి ఇంట నిండుతుంది’. రైతు చెమట చుక్కల బలంతోనే ధాన్య రాశులతో ఇల్లు నిండుతుంది. రైతు కష్టించి స్వేధం చిందించడం వల్లనే సంపద లభిస్తుందని కవి చెప్పిన భావం చక్కగా ఉంది.
“చెట్టు ఎంత ఎదిగినా వేళ్ళు భూమిలోనే”
చెట్లు నేల పటుత్వాన్ని మరియు భూసారాన్ని చక్కగా కాపాడుతాయి.ప్రకృతికి అందాలు చేకూర్చడంలోను వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.చెట్టు కొమ్మలు రెమ్మలు కలిగి 20 అడుగులు ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు.ఇవి ప్రతి సంవత్సరం చిగురిస్తు,పుష్పిస్తూ,కాయలు, పండ్లు అందిస్తాయి.చెట్టు ఎంత ఎదిగినా వేళ్ళు భూమిలోనే ఉంటాయనే నిజాన్ని కవి తెలియ జేస్తున్నారు.
“మహోన్నతుడవైనా నీ కాళ్లు నేలపైనే”
మహోన్నతుడు అంటే గొప్ప వాడు లేక అధికారం కలవాడు అని అర్థం.రైతును మహోన్నతుడు అని అంటున్నారు.రైతు మహోన్నతుడు ఎలా అవుతాడు అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యానికి అధిపతి అయిన రాష్ట్రపతిని మహోన్నతుడు అని అంటాం.కాని కవి గజేందర్ రెడ్డి సామాన్యమైన రైతును మహోన్నతుడని పోల్చడం చక్కగా ఉంది.నిజంగా కవి రైతు జీవితాన్ని పరిశీలించి,పరిశోధించి చెప్పినట్లుగా ఉంది.ఇవాళ కొంత సంపద సంపాదించగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ఎవరిని లెక్కచేయకుండా ఆకాశం పైన ఉన్నట్లు తామేదో గొప్పవారు అయినట్లుగా కొంత మంది ప్రవర్తిస్తుంటారు.కాని మహోన్నతుడు అయిన రైతు కాళ్లు నేల మీదనే ఉంటాయని అని చెప్పడం అద్భుతం.
“నీ మట్టి కాళ్ళ నెప్పుడు మేము కళ్ళకద్దుకోవాలి”
రైతు మట్టికాళ్లతో పొలంలో దిగి పొలాన్ని దున్నుతాడు.మట్టిలో మట్టై రైతు అనేక కష్టాలను పడతాడు.రైతుకు పురుగు పుట్రా మరియు తేల్లు మరియు పాములతో ప్రమాదం ఉంటుంది.ఎండ వానల్ని లెక్క చేయకుండా రైతు అహారహం శ్రమిస్తాడు.కలుపుతీస్తాడు.పంటను ఎలుకలు, పక్షులు తినకుండా కాపాడుతాడు.చివరకు పంటను పండిస్తాడు.రైతు మాత్రం కడుపును మాడ్చు కుంటాడు.రైతు కన్నీళ్లు అలాగే ఉంటాయి.ఎంత రాతి గుండెనైన కరిగించే కష్టాలు రైతువి అని చెప్పవచ్చు.వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.నిర్విరామంగా కష్టపడుతున్న రైతు కాళ్ళను మేము కళ్ళ కద్దుకోవాలి అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి సంస్కారాన్ని మెచ్చుకోవాలి.
“నీ నడవడి చూచి మేము బతుకుదిద్దుకోవాలి
రైతు యొక్క ప్రవర్తనను చూసి మా యొక్క బతుకులు మార్చుకోవాలని చెప్పడం చక్కగా ఉంది. రైతు ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నాడు. రైతు జీవితం ఆచరణీయమైనది.రైతు ఎలా బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడో.మేము కూడా రైతులాగా జీవితాన్ని సత్ప్రవర్తనతో సరి దిద్దుకోవాలని చెప్పిన తీరు కవి గజేందర్ రెడ్డికి రైతుల పట్ల గల ప్రేమను
వ్యక్తం చేస్తుంది.
“నీ శిరమే హిమవన్నగ శిఖరం”
హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది.భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు రక్షణ కవచాలుగా ఉన్నాయి. హిమాలయాలు తీవ్రమైన చలికాలంలో వచ్చే చల్లటి గాలులని అడ్డుకుంటున్నాయి.హిమాలయ నదులు జీవనదులు.గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు. ఉపనదుల వల్ల హిమాలయ ప్రాంతం అత్యంత సారవంతమైన నేలలు కలిగి ఉంది.ఆహారం మరియు వాణిజ్య పంటలు పండటానికి ఉపయోగకరంగా ఉంది.కవి గజేందర్ రెడ్డి రైతు యొక్క కృషిని తలుచుకున్నారు.రైతు చేస్తున్న కృషి మరపురానిది,మరువలేనిది. రైతును హిమాలయ పర్వతం యొక్క శిఖరంతో పోల్చడం అద్భుతంగా ఉంది.
“నీ చిరునవ్వే దేశానికి వరం”
వరం అంటే దేవతల వల్ల తీర్చబడు కోరిక.అలాంటి వరంను మనం కోరకుండానే ఇస్తున్నవాడు ఎవరు? అంటే రైతు అని చెప్పవచ్చు.అన్నదాత గా ఉండి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలు పండిస్తున్నాడు. సకల మానవాళికి ఆహారం అందించి ప్రాణాలు కాపాడుతున్నది రైతు అని చెప్పడం,రైతు సుఖంగా ఉండాలని రైతు యొక్క చిరునవ్వు దేశానికి వరం అని చెప్పడం కవి గజేందర్ రెడ్డి రైతు యొక్క బాగును కాంక్షించడం చక్కగా ఉంది.
“నీ త్యాగం నిరుపమాన మనితర సాధ్యం”
కష్టాన్ని దాచుకోని రైతు దేశాభివృద్ధికి మూలమైన గొప్పవాడు.నేల తల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతు త్యాగానికి వెలకట్టలేము.కంటికి రెప్పవలె చేను చుట్టు కంచె వలె రైతు శ్రమించి పంటలను పండిస్తున్నాడు.దేశ జనాల ఆకలి మంటలను చల్లారుస్తున్న కష్టించి పనిచేసే రైతుకు ఏమిచ్చి మనం ఋణం తీర్చు కోగలం.రైతులు చేస్తున్న త్యాగం ఇతరులకు సాధ్యం కానిదని చెప్పడంలో సందేహం లేదు.
“నీ బతుకే దేశానికి సందేశం”
రైతు సామాన్యుడిగా బతుకుతున్నాడు.అతని జీవన విధానం,అందరికీ ఆదర్శం,మరియు ఆచరణీయం అని పేర్కొనదగినది.రైతు బతుకు దేశానికి సందేశం అని చెప్పడం చక్కగా ఉంది.రైతు గురించి కవి గజేందర్ రెడ్డి రాసిన కర్షకా కవితను గేయం గా కూడా పాడుకొనవచ్చు.ఈ కవిత అలతి అలతి పదాలతో చక్కగా ఉంది.కవి గజేందర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. అన్నాడి గజేందర్ రెడ్డి,జవారి పేట గ్రామం, ఇల్లంతకుంట మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు.తేది 16- 06- 1958 రోజున సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యమ్మ,ఆనంద రెడ్డి.తండ్రి ఆనందరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.గజేందర్ రెడ్డి 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ గాలిపల్లి లో చదివారు.10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆర్ట్స్ కరీంనగర్ లో చదివారు.డిగ్రీ ప్రైవేట్ గా,ఆ తర్వాత ఎం.ఏ.తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ లో చదివారు.గజేందర్ రెడ్డి 1985లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల మానకొండూరులో ప్రిన్సిపల్ గా 31-03-2015 రోజున రిటైర్ అయ్యారు. గజేందర్ రెడ్డి లెక్చరర్ గా పనిచేస్తూనే పలు సాహిత్య సంస్థలతో అనుబంధం పెంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా పలు సాహిత్య సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.కవి,గాయకుడు మరియు మంచి వక్త. అందరితో స్నేహంగా ఉంటారు.స్వయంగా పాటలు రాసి చక్కని స్వరంతో లీనమై పాడుతారు. 7 వ తరగతి చదువుతున్నప్పుడే ఉత్తర గోగ్రహణం అనే నాటకాన్ని రాసి అభినయించారు.9వ తరగతిలో భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడిగా అభినయించారు మరియు 10వ తరగతి చదువుతున్నప్పుడు కిరాతార్జునీయం నాటకంలో అర్జునుని గా నటించారు.చిన్నతనంలోనే పాటలంటే ఆసక్తి కలిగి పాడుతుండేవారు.అలాగే పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు‌. గజేందర్ రెడ్డి వివిధ పత్రికలలో 150 వరకు సాహిత్య వ్యాసాలు రాశారు.వివిధ పత్రికలలో వెలువడిన వ్యాసాలతో “వెలుగుల వెల్లువ” కవిత్వ వ్యాసాలు పుస్తకం డిసెంబర్ 2022లో ప్రచురించారు.గజేందర్ రెడ్డి ప్రముఖ దినపత్రిక వెలుగులో వారం వారం సమీక్ష వ్యాసం రాస్తున్నారు.

You may also like

Leave a Comment