Home పుస్త‌క స‌మీక్ష‌ మనిషిని మేలుకొలిపే సంపుటి”భావ కదంబం”

మనిషిని మేలుకొలిపే సంపుటి”భావ కదంబం”

by Samala Kiran

      మనసైనది రాయకుంటే ఎలా? అంటూ మనసులోని భావాలన్నింటినీ “భావకదంబం”గా అందించిన మనసుకల రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి. పరిశీలన గుణం, స్పందించే గుణం ఈ రెండు కవికి చాలంటాను అయితే వీటి వెనుక హృదయం ఉండాలి. సమాజాన్ని పరిశీలించి, హృదయముతో స్పందించి, భావాలను కవితా సంపుటిగా తీసుకురావడం అభినందనీయం.        

              కవిని కాదు,కవితారీతులు నాకు తెలియదంటూనే కవితాత్మకంగా కవిత్వం చెప్పిన రచయిత నిరాడంబరులు, నిరహంకారులని అర్థమవుతుంది. కవిత్వం చాలావరకు ఆత్మాశ్రయమే అయినా విరివిగా వస్తువులను ఎంచుకున్నారు. సంపుటిలోని పలు కవితలు సామాజిక, ధార్మిక, దేశభక్తి ప్రబోధాత్మకంగా పటుత్వాన్ని కలిగి ఉన్నవి. అనేక కవితల్లో సహజమైన అంత్యనుప్రాస అలరింపజేస్తుంది. అల్ప అక్షరాలతో అనల్ప భావాలను వెదజల్లిన కవితలు మరెన్నో. పద సంపద కొదువలేనంతగా…..బలంగా,  భావ సంపద అదుపులేనంతగా…. వేగంగా ప్రకటించటం ఈ రచయితకే చెల్లింది.
            కవికి జీవితానుభవం ఎక్కువ. అందుకే “జీవితం” కవితలో అక్షరాలతో ఆడుకున్నారు. జననం,మరణం,పయనం,తోరణం,పోరాటం, ఆరాటం, కోలాటం, ఊగిసలాట, దోబూచులాట, సోపానపు ఆట, చదరంగం, రణరంగం, బొంగరం, క్షణభంగురం, అమరం, అజరామరం వంటి పదాలతో జీవితాన్ని హృద్యంగా చెప్పారు.  “అనంత గమనం” లో విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థను గుర్తు చేస్తూ, భార్యాభర్తల అనుబంధం ప్రాధాన్యతను చెప్పుకొచ్చారు. “నువ్వు ఏడుస్తూనే ఉండు నేను నవ్వుతూనే ఉంటా” కవిత ద్వారా ఈర్ష్యా ద్వేషాలను విడిచి జీవించాలనే సందేశం నర్మగర్భంగా నొక్కి చెప్పారు రచయిత. “దేవుడు దీవించాడు” అంటూ అమ్మలో అందరినీ, అన్నింటిని ఇచ్చాడని అమ్మ గొప్పతనాన్ని కవిత్వంలో పంచారు. “పెళ్లి సందడి”లో సాంప్రదాయ వివాహ పద్ధతిని కళ్ళ ముందు నిలబెట్టారు. సామాన్యుడి సైకిల్ గురించి చెబుతూ బాలగేయం లాంటి కవితని రాసిన విషయం పాఠకులకు ఇట్లే తెలిసిపోతుంది.
        నిరీక్షణ,జ్ఞాపకాలపుటలు, పాదాక్రాంతం, ఎదురుచూపులు, నీకు తెలుసా, ఇలా సాగనీ ప్రియా, రారాధ నా ప్రియ, నడిచిరా నా ప్రియ, తకిట తకధిమి కవితల్లో భావకవి కృష్ణశాస్త్రిలా ఊహాసుందరిని సృష్టించుకున్నారో, గతకాలపు మధుర అనుభూతులో, భార్యని ప్రేయసిగా ఊహించుకొని రాసుకున్నారో కానీ అన్నియు సుమధుర సుస్వర మధుర కవితలే.
              “నిర్భయ”కవితలో రచయిత  భావావేశాన్ని “వావి వరస మరచిన జాతిని నపుంసకుల చేయమని” దేవతలకు వినిపించేలా ప్రకటించాడు. ‘పీఎసెల్వీ’ లో దేశభక్తిని, ‘అమ్మ భాష’లో భాషానురక్తిని, ‘ఇది జన ఉగాది’ లో హిందూ ధర్మ ప్రశస్తి ని చాటి చెప్పారు. “గాంధారం గొల్లుమంటుంది” కవిత మధ్యయుగాలనాటి మతమౌడ్యమూలాలను ప్రశ్నిస్తుంది. మానవత్వ రక్షణకు క్రూరత్వం అంతం కావాలని కవి అంతరంగం. విస్తరిస్తున్న మతమౌడ్య ఛాయలను “షరియా కోరలు చాస్తోంది, తుపాకి గొట్టం చట్టం చేస్తోంది” అంటూ ధ్వనిస్పోరకంగా ఉగ్రమనస్తత్వాలను ధైర్యంగా దునుమాడారు. “పరాన్నభుక్కులు”, “అక్షరం అమ్ముడుపోయింది” కవితలలో వాళ్లే….వాళ్లే….. అంటూ హిందూ వ్యతిరేకుల కుట్రలను బట్టబయలు చేశారు. ‘దేశం గీశం జాన్తానై యని వేషాలెన్నో వేస్తోంది మోసాలెన్నో చేస్తోంది’ అని చైనా, పాకిస్తాన్ లకు వంత పాడే కలాలను కడిగిపారేశారు. అసంపూర్ణ తైల వర్ణచిత్రంలో ‘విప్లవపు పసిగుడ్డు’ విధ్వంస సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు. ఇలా అనేక కవితల ద్వారా సాహితీ, సామాజిక, చారిత్రక రంగాలలో చొరబడిన భీభత్సకారుల్ని చెడుగుడి ఆడుకున్నారు.
         రచయిత శ్యామప్రసాదులు కావున శ్రీకృష్ణుడే ఇష్టసఖుడేమో…. పలు కవితలను జగద్గురువు పై సృష్టించారు. “మీ కన్నవాడు మీ కన్నా మిన్నవాడు” అంత్యప్రాసలతో కన్నయ్యకు పట్టాభిషేకం చేసింది. “కలుద్దాం కడుగుదాం” అంటూ సమాజంలోని దుర్మార్గాలను చెండాడేందుకు ఒక్కసారైనా కన్నీరు కార్చేద్దామంటూ పిలుపునిస్తారు రచయిత. “కల్లోలిత కలం”తో కవితా సంపుటిని పూర్తిచేస్తూ – నా కలం రేపిన కలకలం తప్ప, నా తప్పేం లేదు’అంటూ కవితలన్నింటితో కవిత రాయడం ఈ సంపుటి ఓ విశేషం అయితే, ముగ్గురు లబ్ద ప్రతిష్ఠితులతో ముందుమాట రాయించటం మరో విశేషం. ఆకర్షణీయమైన ముఖచిత్రముతో పుస్తక ప్రచురణల సంస్థ మెగా మైండ్స్ ముద్రించడం ఆనందదాయకం. మొదటి సంపుటితోనే పాఠకుల హృదయాలను ఆకట్టుకునే కవిత్వాన్ని అందించిన రచయిత మరెన్నో రచనలు తీసుకురావాలని ఆశిద్దాం, అభినందిద్దాం.

ప్రతులకు:-
మెగా మైండ్స్ పబ్లికేషన్స్ – 8500581928

You may also like

Leave a Comment