Home పుస్త‌క స‌మీక్ష‌ “కళింగ కథా జాడ”

“కళింగ కథా జాడ”

by Maji Bharathi

ఈ సంకలనంలో ఎక్కువ శాతం కథలు ఉత్తరాంధ్ర మాండలికంతో వన్నె నింపుకున్నవే, వస్తు శిల్పాల్లో వైవిధ్యమున్నవే, అణగారిన బ్రతుకుల గురించి, ప్రజల జీవన స్థితిగతులను మన కళ్ళముందు నిలిపేవే.
మొదటి, రెండవ తరం కథలలో ఎక్కువగా పెత్తందారుల, శ్రామికవర్గాల మధ్య తారతమ్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆ కాలంలో ఉన్న సమస్యలను చర్చించే కథలుంటే, మూడవ తరం వారు వ్రాసిన కథలు, రెక్కాడితేగాని డొక్కాడని పల్లె బతుకులను, ఆదివాసి పోరాటాలను మన కళ్ళముందు నిలబెట్టాయి. సంపాదకులు చెప్పినట్లు నాల్గవ తరం సమాజంలోని అన్ని వర్గాలను స్పృశిస్తూ కథలల్లారు. ఏ తరమైనా సమకాలీన, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేటట్లుగా కథలను వ్రాశారు. ఇందులోని ప్రతి కథా ఆణిముత్యమే.

మొదటి తరం రచయితల కథలు:
“దిద్దుబాటు” కథ ద్వారా తెలుగు కథకు ఆద్యుడైన గురజాడవారి “దేవుళ్ళారా మీ పేరేమిటి” లో, ఒక వ్యక్తి స్వార్థచింతన కారణంగా శైవులకు వైష్ణవులకు మధ్య ఘర్షణలు చెలరేగే పరిస్థితి… నిజానికి దేవుడిని నమ్మిన ఎవరైనా, ఇతరులతో సంబంధం లేకుండా తమ నమ్మకానికి కట్టుబడి ఉంటూ, ఇతరుల నమ్మకాలకు కూడా గౌరవిస్తూ సమాజ ధర్మం పాటిస్తారు. గాని కొంతమంది స్వార్థపరుల కారణంగానే మతాలమధ్యనో, లేక ఒకే మతంలో ఉన్న వేర్వేరు వర్గాల మధ్యనో కలహాలు చెలరేగుతుంటాయి.
“ఈ కథలో పీరు అనేది ఏమిటనుకున్నారు స్వామి వారి తిరునామమే” అంటూ, నాంచారమ్మ అనే ఒక బలమైన పాత్రను సృష్టించి, ఆ పాత్ర ద్వారా చెప్పించి, ఆఖరికి అది త్రిశూలాకారం గనక శివ పీరని శైవులు, రామస్వామి వారి నామము గనుక విష్ణు పీరని వైష్ణవుడు వాదించినప్పుడు, శివుడు విష్ణు పీర్లే అయినప్పుడు బుద్ధుడు శివుడు కారాదా అని ఒక ప్రశ్న ఇంకొకరితో లేవనెత్తించి, “శివుడో, విష్ణువో, పీరో, బుద్ధుడో… పేరేదైనా పరమాత్మ ఒక్కడే కదా!” అన్న బ్రహ్మాండమైన సందేశాన్ని ఇస్తారు గురజాడవారు.
కూలిపనినే వారసత్వంగా పిల్లలకిచ్చే పేదరికాన్ని “వారసత్వం” కథలో ఆయల నరసింహశర్మ గారు ఆవిష్కరిస్తే, పనిచేస్తున్న వాళ్లు ఎందుకు పడుండాలని ప్రశ్నిస్తుందొక గొంతు “ప్రభువెక్కిన పల్లకి”లో బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావుగారి కలం నుండి. పెత్తందారులు ఏమి చేసినా మారు మాటాడకుండా చేసిన తరం నుండి, ప్రశ్నించే స్థాయికి చేరుకుంది ఆ తర్వాతి తరం.
రెండవ తరం రచయితల కథలు:
పొయ్యి మీదకు ఉన్నా, లేకపోయినా పొయ్యి లోపలికి కంపో, ఎండిన ఆకులో తేవలసిన బాధ్యత, బడికి వెళ్లి చదువుకోవలసిన ఎనిమిదేళ్ల బాలిక మీద పడితే, ఆ ఎండుటాకులు ఏరడానికి ఆ బాలిక పడే అవస్థ ద్వారా… “కుంకుడాకు”లో చాసోగారు పేదల దయనీయ స్థితిని వర్ణిస్తే, తప్పులెన్ని చేసినా శివరాత్రి రోజు చనిపోతే స్వర్గప్రాప్తి అవుతుందన్న ప్రజల మూఢ నమ్మకాన్ని వ్యంగ్యంగా చెప్పిన కథ రావిశాస్త్రి గారి “పాపి”.
మా అమ్మ చాలా మంచిది, నన్ను చెప్పలేనంత ప్రేమిస్తుంది, నా కొరకు ఎంత కష్టమైనా ఓరుస్తుంది, అన్నమాట తల్లి హృదయమేమిటో, కులమత ఆర్థిక స్థితులకు అతీతంగా, దేశ, కాలమాన పరిస్థితులకు అతీతంగా అమ్మంటే ఏమిటో హృదయానికి హత్తుకునేలా చెప్పారు అవసరాల రామకృష్ణారావు, “అమ్మ చాలా మంచిది” అన్న కథలో.
కారా మాస్టారు గారి “ఆర్తి” కథనే తీసుకుంటే… “ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో, ఆ విస్తళ్ళలో భోజనం చేసిన వారికి అర్థం కాకపోవచ్చంటూ”, కాలు ఆడి కూలి చేస్తే గాని నోటికెల్లని వేళ్ళు, కూలి డబ్బుల కోసం బంధువుల మధ్య చెలరేగే తగాదాలు, పల్లెటూర్లలో సామాన్య ప్రజానీక స్థితిగతులు, ఆకలి తీరడానికి పడే పాట్లు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఆ కథలో. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు, పని చేస్తే వచ్చే కూలి కోసం కూతురు నా దగ్గర ఉండాలని తల్లి, కోడలు నా ఇంట్లో ఉండాలని అత్త పోట్లాడుకోవడం పేదల బతుకులకు అద్దం పడుతుందీ కథ.

అన్యాయం అయిపోతున్న వాళ్ళు, వాళ్లకు న్యాయం చేయాలనుకుంటున్న వాళ్ళు, తుపాకులు పట్టుకొని అడవి దారి పడుతున్నారు. దౌర్జన్యం, అన్యాయం లేకపోతే అడవి దారి పట్టాల్సిన అవసరమేమిటి ఎవరికైనా? ఈ విషయం సమాజం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ, ఆదివాసీ రైతులకు అప్పులిచ్చి, వడ్డీ రూపంలో పండిన పంటను పీల్చేస్తూ, అసలు కోసం దౌర్జన్యంగా భూమిని రాయించుకుంటే తిరగబడ్డ రాజన్న గురించి “ఇదే దారి” లో భూషణం గారు చెప్తారు.
నాల్గవ తరం రచయితల కథలు:
“మీ రేపటి కోసం మా నేటిని త్యాగం చేస్తున్నామన్న వాళ్లు”… వాళ్ళెవరో పాఠకుల ఊహకే వదిలేస్తూ కథ మొత్తం నడిపించారు ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడుగారు “వాళ్లు” కథలో. వాళ్లను పట్టుకోవడానికి వచ్చినా, “వాళ్ల తుపాకులకు ఆశయముందని భావించి, తుపాకీతో వాళ్ల ఉద్యమాన్ని ఆపగలమా?” అని తనను తానే ప్రశ్నించుకుంటూ, తాను వ్రాస్తున్న కథకైనా, ఇప్పటి వర్తమానానికైనా, జరుగుతున్న ఎన్ కౌంటర్… ఇది ముగింపేనా అన్న సంశయంతో తటపటాయిస్తూ నమ్మిన సిద్ధాంతానికి, డ్యూటీకి మధ్య నలిగిపోయిన వ్యక్తిగా ఈ కథలో జిల్లా ఎస్పీ కనిపిస్తారు.
తాత ముత్తాతల నుండి పొలాలకు అరకలు, బండ్లు వెళ్లే త్రోవలను మూసివేసి, పంట పండించుకోవడానికి వీల్లేకుండా చేసి, పొలం అమ్ముకొనక తప్పనిసరి పరిస్థితులను సృష్టించి, ఉత్తరాంధ్రలోని భూములను చవగ్గా కొనుక్కొని ఇక్కడి రైతుల మీదే పెత్తనం చలాయించే దొరల గురించి, తమ పొలాల్లో తామే పాలేరులైన దుస్థితి గురించి “తిరుగుడిగుమ్మి” లో, ఇంకొక ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడుగారు విశదపరిచిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
తప్పనిసరి పరిస్థితులలో పొలాలను అమ్ముకున్న రైతుల కష్టాలను దగ్గరనుండి చూసిన వారి కలం, “ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చిన పెట్టుబడులు, మన ముందు ఓ సాగరంలాగ తయారై, అలల నాలుకల తోటి ఆహ్వానిస్తుంటే, ఈతకొలను అనుకొని మురిసిపోతున్నాం గాని, అదొక తిరుగుడు గుమ్మని తెలుసుకోలేక పోతున్నాం. రేపది మన ఊళ్ళనే ముంచేస్తుందన్నా ఆశ్చర్యం లేదు” అంటూ పదునైన సంభాషణలను రాయడం ద్వారా, తాత ముత్తాతల నాటి తమ ఊర్లలో, తామే వలసదారులైన ఉత్తరాంధ్ర రైతుల దుస్థితి గురించి చెప్పారు.
అణగారిన కులాలకు రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వంలో పదవులు ఇచ్చినా, అవి పేరుకు మాత్రమేనని “పెద్దోళ్ళు” కథలో బొడ్డ కూర్మారావు గారు తెలియబరిస్తే, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలు శుద్ధి చెయ్యకుండా వదిలేస్తుంటే భూగర్భ జలాలు, భూమి, గాలి కలుషితమై ప్రజానీకం జబ్బులు పాలవుతుంటే, తనకెందుకులే అని ఊరుకోలేక, చేస్తున్న పీహెచ్డీని వదిలి, ప్రజల మధ్య ఉండి పోరాడాలని కొడుకు అనుకుంటే, అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధను తెలిపే కథ, బివిఏ రామారావు నాయుడుగారి “ఎదిగొచ్చే కొడుకు.

నేటి సినిమాలు పిల్లలనెలా ప్రభావితం చేస్తున్నాయో “ఆయుధపాణి”లో దాసరి రామచంద్రరావు గారు వివరిస్తే, నాటకాలు వేయడానికి ఇష్టపడే రైతు మనోవేదనను, పూర్వకాలంలో నాటకాలు చూడడానికి గ్రామస్తులు ఎలా వెళ్లేవారో వివరిస్తూ జ్ఞాపకాలలోనికి తీసుకు వెళ్తుంది, ఆల్తి మోహనరావుగారి “ఋషి” కథ.
యాక్సిడెంట్ అయిన వ్యక్తిని రక్షించే క్రమంలో, తన ఎంట్రెన్స్ ఎగ్జామ్ టైం దాటిపోయినా బాధపడని యువకుడు, కొడుకు చేసిన పనిని సమర్థిస్తూ ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని భావించే తండ్రి, విద్యార్థులకు పరీక్షల్లో సోషల్ బిహేవియరుకు కూడా మార్కులుంటే బాగుండేదని ఆ తండ్రి అన్నప్పుడు, “పొలమైనా, రానున్న తరమైనా సరిగ్గా సాకగల చేతుల్లో ఉన్నప్పుడే ఫలవంతం అయ్యేదని”, “ఫలితం” కథలో తన భావాన్ని వ్యక్తీకరిస్తారు మాజీ ఎంపీ, రచయిత డివిజి శంకర్రావుగారు. పుట్టుకతో ఎవరూ దొంగలు కాదు పరిస్థితుల బట్టి దొంగలమయ్యామంటూ “సమాజం చెక్కిన దొంగలు”లో కలమట దాసుబాబుగారు చెప్తున్నారు.
రచయిత్రులను తీసుకుంటే, తొలితరంలో రుక్మిణమ్మగారు సాధారణంగా కుటుంబాల్లో దాయాదుల మధ్య జరిగే గొడవల గురించి చెప్తే, మూడవతరంలో చాగంటి తులసిగారు – “మనువు”లో భార్యల మీద భర్తల దాష్టీకం, భార్యల సర్దుకుపోయే తత్వాన్ని చెప్తే, నాల్గవ తరంలో మల్లీశ్వరిగారు భర్త చేతిలో కష్టాలు పడ్డ రావులమ్మ కథ చెప్తే, తండ్రైనా, భర్తైనా, బాంధవ్యం ఏదైనా మగాడన్నవాడి చేతిలో దగా చెయ్యబడుతూనే ఉంటారు ఆడవాళ్లు. అలా దగా కాబడ్డ కనక గురించి “కూరాకుల మడి”లో అయ్యగారి సీతారత్నం గారు చెప్తే, “మా ఊరి కథ” అని ఇనుగంటి జానకి గారు ఆ ఊరిలో జరిగిన కథల గురించి చెప్తూ, అందులో మరల అన్యాయంగా చనిపోయిన స్త్రీ మూర్తుల కథలే ఉంటే, చెట్లను నరుకుతూ, డైనమైట్లు పెట్టి కొండల్ని పిండి చేస్తూ, భూగర్భ జలాలను ఇష్టానుసారం తోడేస్తూ, పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, భూకంపాలు రాక ఏమవుతాయని ప్రశ్నిస్తూ, అలా కాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో “కల” కథలో మజ్జి భారతి గారు, వివరిస్తారు.
ఉత్తరాంధ్ర కవుల కథలను సంకలనంగా చేసి, “కళింగ కథా జాడ” అని పేరు పెట్టారు గాని, ఇందులోని అన్ని కథలు, అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, సమస్యలకు ముగింపు ఏ రకంగా దొరుకుతుందని పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వ్యాసంలో కొన్ని కథలనే ఉటంకించడం జరిగింది. గాని, ఇందులోని ప్రతికథ ఒక ఆణిముత్యమే. అందుకే కొని, చదవవలసిన కథల సంకలనమిది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సంకలనం తేవాలన్న ఆలోచన చేసి, శ్రమ కోర్చి, కథలను యేరి, వడబోసి, అర్థవంతమైన ముఖచిత్రంతో అలంకరించి, మనకందించిన సంపాదకత్రయం అట్టాడ అప్పలనాయుడు గారు, గంటేడ గౌరునాయుడు గారు మరియు చీకటి దివాకర్ గార్లకు ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, మాతృకలో ప్రచురింపబడ్డ నా కథ “కల” ను కూడా, ఈ సంకలనంలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి
*

You may also like

Leave a Comment