చరా చర జీవ నిర్జీవ చేతన అచేతన ప్రాణకోటి ప్రతిబింబమే ఈ మట్టి గీతం. ఒక పాఠం లా మొదలై ఒక భావంలా ముగిసిన అలుపెరిగిన ప్రయత్నం ఈ దీర్ఘ కవిత. “మట్టి ఆరడుగులవుతుంది, మట్టి అమ్మ ఒడి అవుతుంది… సుఖదుఃఖాలకతీతమైన సమాధి అవుతుంది… అని ఒక జీవి తన జీవన క్రమంలో మట్టితో పెనవేసుకున్న విడదీ యరాన్ని ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ కవిత.. సృష్టికి భూమాతకి భూమాతని తల్లిలా కొలిచి ఆరాధించే భారతీయ హైందవ సనాతన ధర్మ సంక్లిష్ట పరమార్ధాన్ని అందులో మనిషి పోషించే కీలక పాత్రని కవయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు మట్టి గీతం దీర్ఘ కవితగా మలచడం అభినందనీయం. “నీ వేళ్ళని దాచుకొని నిన్ను ఎదగనిచ్చేది భూమి కదా ! సారం లేని నిస్సారవనిగా అమ్మ నేడ్పించడం నీ కాళ్లు తెంచుకొని పరిగెత్తడమే ! అని అనడంలో కవయిత్రి అనుభవం ప్రస్ఫుటిస్తుంది. మనిషి తను ఆధారపడిన భూమిని తన స్వార్థంతో నాశనం చేస్తూ తన సొంత మనుగడ ప్రశ్నార్థకంగా మార్చి ఎలా మనగలడనే వాదాన్ని నిస్సంకోచంగా నిరూపించారు కవయిత్రి సుజాత శేఖర్. మట్టి గీతం సాంతము ఒక నదిలా పరవళ్ళు తొక్కుతూ తన భావజాలాన్ని ఇమిడ్చిన వైనం కొనయాడదగినది. మట్టి ప్రాధాన్యతను వివరిస్తూ మనుషులు తప్పించుకోలేని ఒక బాధ్యత ఉందని తన నిర్లక్ష్యం సమస్త జీవరాశుల భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని నిక్కచ్చితంగా చెప్పారు. వనరుల్ని విచ్చలవిడిగా వినియోగిస్తే నిస్సారమైన నిస్తేజమైన భూమాత ప్రకృతి రూపంలో పలు రకాలుగా ప్రళయతాండవమై మనిషిని వరదలు సునామీలు భూకంపాలుగా హెచ్చరించాయ న్నారు. డాక్టర్ బండారు సుజాత శేఖర్ ఒక ఉపాధ్యాయునిగా, విద్యావేత్తగా,సామాజిక కార్యకర్తగా, గాయనిగా మనకు పరిచయమే. అన్నింటిని మించి ఓ అమ్మగా, అమ్మమ్మగా నానమ్మగా తన వంతు ప్రేమను బాధ్యతని కుటుంబానికి పంచుతూ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించారో ఒక రచయిత్రిగా పాఠకులకు ఈ దీర్ఘ కవిత మట్టిగీతం అందించడము అంతే ప్రశంసనీయం. అలాగే ప్రతి జీవి తన కర్తవ్య బాధ్యతలను నిస్సందేహంగా నిర్వర్తించాలని ప్రస్తుత సమకాలీన వాస్తవిక పరిస్థితులను వివరిస్తూ పొందుపరిచిన ప్రతిరూప ప్రతిబింబం ఈ మట్టి గీతం దీర్ఘ కవిత. నాటి విశ్వంభర, దీర్ఘ కవితలను గుర్తు చేస్తుందనవచ్చు. “ఇది మట్టి గీతం , ఇది మహోజ్వల గీతం, అమ్మ చనుబాల ఉద్బోధ గీతం…. అంటూ ఉద్బోధ చేసిన రీతి జనులందరికి కనువిప్పుగా అణువు నుండి అణ్వాయుధం వరకు పలు కోణాలను వివరించిన తీరు ప్రశంసనీయంగా ఉంది. నేటి యువత ఒక్క నిమిషం ఆలోచించే రీతిలో ఉన్న ఈ మట్టి గీతం అన్ని వయసుల వారిని కచ్చితంగా ఆలోచింప చేస్తుంది. భూమి తల్లి మట్టి రూపాలను తాత్వికంగా, మరెన్నో ఎన్నో కోణాలుగా చూపించిన కవయిత్రికి అభినందనలు, వందనాలు.