ఉదయం సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపే ముందు మనం పట్టించుకోని, సాధారణంగా జరిగుతున్న విషయం, ఎవరో ఒకరి చెమట భూమిని తడుపుతుందని. మనం గ్రహించని, కళ్లకు కనిపించని ఆ క్షణంలోనే ప్రపంచం మేలుకుంటుందని.
మానవ సమాజం నాగరికతను, అభివృద్ధిని రూపుదిద్దుకుంటున్న వేళ పంటలను పండించడం, పండిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించి నిప్పులపై వండుకుని తినే కాలం వచ్చింది. నివాసయోగ్యమైన నీడను కల్పించుకునే దశలోకి ప్రవేశించాడు మానవుడు. అప్పటినుండే పొలం దున్నే రైతు చెమటలో అన్నం మొలుస్తుంది. ఇటుక మోసే కూలీ భుజంపై ఇల్లు నిలబడుతుంది. మిల్లులో చక్రం తిప్పే కార్మికుడి చేతుల్లో సమాజం కదులుతుంది. వారివల్లే ప్రపంచం ఒక విస్తారమైన రంగస్థలం అయితే, దానిపై నిశ్శబ్దంగా నడిచే పాత్రలు శ్రామికులయ్యారు. వారి పేర్లు చరిత్ర పుస్తకాలలో పెద్ద అక్షరాల్లో ఉండకపోవచ్చు… కానీ వారి చెమట చుక్కలతోనే నాగరికత తన కథను రాసుకుందనేది జగమెరుగని సత్యం.
ప్రథమంగా ప్రధానమైంది వ్యవసాయం. ఎక్కువ మంది రైతులుగానే ఉండేవారు. తమ భూముల్లో లేదా జమీందార్ల భూముల్లో పనిచేసేవారు. వీరికి సమయ నిబంధన ఏదీ లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు, ప్రకృతి ఆధారితంగా పని చేసేవారు.
తరువాత వృత్తిదారులు. అంటే నేయుగాళ్ళు, కమ్మర్లు, కుండలు చేసేవారు, బంగారు పని చేసే వారు. ఇవే వీరి కులవృత్తులుగా మారాయి. వీరంతా తమ ఇంటి దగ్గరనుంచే, కుటుంబం అంతా కలిపి పని చేసే తమ పనికి తామే యజమానులు ఉండేవారు. కుటుంబ ఆధారిత పనులు. పిల్లలు కూడా చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేవారు. పిల్లల శ్రమలాగా కాకుండా కుటుంబ సహాయంగా ఉండేది.
రాజులు, జమీందారుల వ్యవస్థ ఏర్పడింది. చాలా మంది “సర్వులు” (serfs)గా ఉండేవారు. భూమి యజమానుల కోసం పనిచేసేవారు. చాలా భాగం తమ స్వేచ్ఛను కోల్పోయారు. వారి పనికి సమయ నిబంధనలు హరించుకు పోయాయి.
18వ శతాబ్దం చివరిలో పారిశ్రామిక విప్లవం (Industrial Revolution)ప్రారంభమైంది. యంత్రాలు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ప్రజలు తమ భూములు భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళి పోవటంతో జీవనాధారం కోసం గ్రామాలనుండి పట్టణాలకు వలసలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలలో పని చేయటం వల్ల వారి జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ముందు “తమ పని-తమ సమయం” తర్వాత “యజమాని పని-నిర్ణీతకాలం” అయిపోయాయి. ఇదే “కార్మికుడు” అనే కొత్త వర్గాన్ని సృష్టించింది. ఎడతెరపిలేని పని వల్ల పని చేసే గంటలు కూడా పెరిగాయి. 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. యంత్రాలు 24 గంటలు నడవాలి. యజమానులు లాభాలకోసం ఎక్కువ పని చేయించేవారు. ఫాక్టరీల ప్రారంభ దశ కావడంతో ఉద్యోగాలు తక్కువ, పోటీలు ఎక్కువగా ఉండి, ఆ కార్మికుడు బలవంతంగా ఎక్కువ సేపు పని చేయాల్సి వచ్చేది. వారి జీవిత కాలంలో ఎక్కవ భాగం ఫాక్టరీల్లోనే గడిచిపోయేది. ఆరోగ్యాలు పాడై పోయేవి. అప్పుడు చట్టాలు, కార్మికుల హక్కులు లేవు.
ముందు స్వయం ఉపాది, ప్రకృతి ఆధారితం, కొంత స్వేచ్ఛ, కుటుంబ పనిగా ఉండే జీవనోపాధి రానురాను ఫాక్టరీ ఉద్యోగం, యంత్రాల ఆధారితం, కఠిన నియంత్రణ, వేతనాల కార్మికుడి జీవితం చట్రంలో బంధింపబడింది. మానవుడు ఒకప్పుడు తన పనికి యజమాని… పరిశ్రమల యుగంలో తన శ్రమకు మాత్రమే యజమాని అయ్యాడు.
కర్మాగారాల గోడలు మానవ విలాపనలు వినేవి. వెలుతురు కన్నా చీకటి ఎక్కువగా ఉండే కార్మికుల జీవితాలు యంత్రాల కంటే చవకగా మారాయి. పగలు-రాత్రి అనే తేడా లేకుండా, 16 గంటల వరకు పనిచేసే వారి శరీరాలు అలసిపోయేవి. కర్మాగారాల పొగమంచులో మానవ శ్వాసలు కనుమరుగైపోవటం ప్రారంభమైంది. యంత్రాల గర్జనలో మనిషి హృదయ స్పందన వినిపించని కాలమై పోయింది.
ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఎంత అణచి వేతలుంటాయో అంత తిరుగుబాట్లు మొదలవుతాయనటానికి నిదర్శనంగా వారి ఆశలు మేల్కొన్నాయి. ఆ ఆశలే ఒక రోజు నినాదాలుగా మారాయి. అప్పుడు ఒక చిన్న స్వరం పుట్టింది. “జీవితం కూడా కావాలి…” ఆ స్వరం పెరిగి నినాదమైంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల మనసు కోసం…” ఆ నినాదం వీధుల్లో ప్రవహించింది… చికాగో గుండెల్లో అగ్నిలా రగిలింది… అక్కడే చరిత్ర రక్తంతో రాసుకుంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల జీవితం.” ఆ నినాదాల ప్రతిధ్వని 1886 మే 1న అమెరికాలో గర్జించింది. చికాగో వీధుల్లో కార్మికుల అడుగులు భూమిని కంపించాయి. కానీ ఆ స్వరాలను అణచివేయడానికి ప్రయత్నించిన హింస, రక్తపాతం చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ రోజు జరిగిన హింసాత్మక సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ నిరసనలో బాంబు పేలుళ్ళు, పోలీసుల కాల్పులు జరిగాయి అనేక మంది కార్మికులు, పోలీసుల మరణించారు. ఈ సంఘటన కార్మిక ఉద్యమానికి మలుపు తీసుకువచ్చింది.
ఆ త్యాగాలు వృథా కాలేదు. అవి ప్రపంచ కార్మిక హక్కుల పునాది అయ్యాయి. ఆ సంఘటననే మనం “హేమార్కెట్ అఫైర్” (Haymarket Affair)గా ప్రపంచం గుర్తుంచుకునేలా చేసింది. అక్కడ చిందిన ప్రతి రక్తపు చుక్క, భవిష్యత్తులో కార్మిక హక్కుల విత్తనంగా మొలిచింది. ఆ రక్తపు ప్రతి చుక్క ఈ రోజు మన హక్కుల పునాది అయింది.
1886 మే 1న అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం, చికాగోలో జరిగిన Haymarket Affair ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపు తీసుకుంది.చికాగోలో జరిగిన ఉద్యమం ఒక చినుకు కాదు, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక చైతన్యాన్ని రగిలించిన మెరుపు. భారీ సమ్మెలు, 8 గంటల పని కోసం పోరాటాల అంకురార్పణ జరిగింది. ఇదే ప్రపంచ కార్మిక ఉద్యమానికి బీజం.
ఇది అలలా వ్యాపించిన ఉద్యమం ఒకేసారి అనేక ప్రాంతాల్లో పెల్లుబికింది. చరిత్రలో నిలిచి పోయింది. ప్రపంచమంతా వ్యాపించింది. చికాగోలో మొదలైన ఆ నినాదం, సరిహద్దులు దాటి ఖండాలను తాకింది. ఒక నగరంలో పుట్టిన స్వరం, ప్రపంచ కార్మికుల గొంతుకగా మారింది.
తరువాత 1880ల చివరన కెనడాలో అమెరికా ప్రభావంతో కార్మిక సంఘాలు బలపడాయి. 8 గంటల పని కోసం డిమాండ్లు మొదలయ్యాయి.
1889–1891 కాలంలో యూరప్ లో ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందింది. సెకెండ్ ఇంటర్నేషనల్ సమావేశం పారిస్ లో 1889 సంవత్సరంలో ముఖ్య మలుపు తిరిగింది. మే 1ను అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించారు. వెంటనే యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలుబ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో విస్తరించాయి. 1890లోనే యూరప్ అంతటా మొదటి “గ్లోబల్ మే డే” జరుపుకున్నారు.
1890లు–1917 లలో రష్యా విప్లవ దిశగా అడుగులు వేసింది. సర్కార్ భయం వల్ల మే డే రహస్యంగా జరిపేవారు. తర్వాత ఇది పెద్ద రాజకీయ ఉద్యమంగా మారింది. చివరికిది రష్యన్ రెవల్యూషన్ (Russian Revolution) కి దారితీసిన చైతన్యంలో భాగమైంది.
1900–1920 ఆసియాలో ప్రారంభమై వ్యాప్తిచెందింది.జపాన్, చైనా దేశాల్లో కార్మిక ఉద్యమాలు మొదలయ్యాయి. మే డే జరుపుకోవడం ప్రారంభమైంది
భారతదేశం లో 1923 లో అధికారికంగా ఆరంభం మైంది.మొదటి మే డే చెన్నైలో జరిగింది. సముద్ర గాలిలో ఎర్ర జెండా, చెన్నైతీరాన ఎమ్. సింగరవేలు చెట్టియార్చేతుల్లో మొదటిసారి ఎగిరింది. అది కేవలం జెండా కాదు వేదనకు రంగు, పోరాటానికి రూపం. ఆయనేభారత కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించి మార్గదర్శకుడిగా నిలిచారు. అదే సందర్భంలో ఎర్ర జెండాను కార్మిక ఐక్యతకు ప్రతీకగా ఎగురవేశారు. ఆ జెండా కేవలం ఒక రంగు కాదు, అది బాధల జ్ఞాపకం, పోరాటాల ప్రతీక, ఐక్యతకు సంకేతంగా ముద్రవేసుకుంది. అప్పటి నుంచి మే డే భారతదేశంలో కూడా శ్రమకు గౌరవం ఇచ్చే రోజుగా స్థిరపడింది. ఇక్కడి నుంచి భారత కార్మిక ఉద్యమం బలపడింది.
ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాలలో 20వ శతాబ్దం మధ్యకాలంలో విస్తరించింది. అప్పటినుండి మే డే ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. శ్రామికుడి చెమటకు భాష్యం చెప్పిన రోజే ఆ మేడగా అవతరించింది.
ఆ శ్రమించే కార్మికుడి చేతుల్ని మనం ఎప్పుడైనా గమనించామా? ఆ చెమట చుక్కలకి కూడా ఒక రోజు పండుగగా చేసుకునే రోజుకొటి ఉంది. అదే మే ఒకటవ తారీకు అని చరిత్ర నినదించింది. మనమది“ఇంటర్నేషనల్ వర్కర్స్ డే” అని పిలుస్తాం.
కానీ, ఆ రోజు కేవలం ఒక తేదీ కాదు. నిశ్శబ్దంగా రాసుకున్న రక్త గాథ. ప్రపంచాన్ని ముందుకు నడిపేది యంత్రాలు కాదు. వాటిని నడిపించే చేతులు. ఆ చేతుల వెనుక ఉన్న శ్రమ, చెమట, నొప్పి, ఆశల సమాహారానికి ప్రతీకగా నిలిచిన రోజు మే డే. ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే International Workers’ Day కేవలం ఒక పండుగ కాదు. ఇది పోరాటాల చరిత్ర, హక్కుల సాధన, సమానత్వ స్వప్నాలకు చిహ్నం.
మే డే మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. పని చేసే ప్రతి మనిషి గౌరవించబడాలి. కనీస వేతనం, సురక్షిత పని పరిస్థితులు, సమాన అవకాశాలు ఇవన్నీ హక్కులుగా మారడానికి ఈ రోజు పునాది వేసింది. కార్మికుల ఐక్యత ఎంత శక్తివంతమో ప్రపంచానికి తెలియజేసింది.
ఆశ్చర్యకరంగా, ఈ ఉద్యమానికి జన్మనిచ్చిన అమెరికాలో మే 1న లేబర్ డే జరపరు. అక్కడ అది సెప్టెంబర్లో నిర్వహిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మే డే ఒకప్పుడు యూరప్లో వసంత ఋతువును ఆహ్వానించే పండుగగా కూడా ఉండేది. కాలక్రమేణా అది కార్మికుల హక్కుల దినంగా మారింది.
మే డే కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది మనం వినియోగించే ప్రతి సౌకర్యం వెనుక ఉన్న శ్రమను గుర్తు చేసే రోజు. కార్మికుల చెమటతో నిర్మితమైన ఈ ప్రపంచంలో, వారి గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. శ్రమే శక్తి… శ్రామికుడే సమాజానికి అసలైన ఆధారం. చెమట చుక్కల చరిత్ర – మే డే”. ఇది మనకు ఒక గాఢమైన సత్యాన్ని చెబుతుంది. శ్రమే సృష్టి మూలం. ఈ ప్రపంచం నడిచేది చేతుల శ్రమతోనే. ఈ రోజు వెనుక మరో మృదువైన గాథ ఉంది. ఒకప్పుడు మే 1 వసంత ఋతువు ఆరంభంగా పండుగలా జరుపుకునేవారు. ప్రకృతి పచ్చదనాన్ని ఆహ్వానించే ఆ రోజు, కాలక్రమేణా శ్రమికుల గౌరవానికి అంకితమైంది. ప్రకృతి పునర్జన్మ పొందినట్లే, కార్మికుల హక్కులు కూడా పునర్జన్మ పొందిన రోజు ఇది.

మే డే చరిత్రలో మహిళల అడుగులు కూడా స్పష్టంగా వినిపిస్తాయి. నూలు మిల్లులలో, గార్మెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసిన మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడ్డారు. తమ హక్కుల కోసం ముందుండి పోరాటం చేశారు. వారి స్వరం సున్నితమైనదైనా, దాని ప్రభావం గొప్పది. అలాగే చిన్నారులపై బానిసత్వపు బరువును తగ్గించడంలో కూడా ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మే డే చరిత్రలో మహిళల పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి. అలాగే పిల్లల శ్రమ నిర్మూలనలో కూడా కార్మిక ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి.
ఈరోజు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నప్పటికీ, శ్రమ విలువ తగ్గలేదు. కొత్త రూపాల్లో సమస్యలు మారినా అసంఘటిత రంగం, అందుకే మే డే కేవలం చరిత్ర కాదు… అది ప్రస్తుతానికి కూడా మార్గదర్శకం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగినా, కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కొన్నిరంగాలలో పనిచేసే వారికి ఇంకా సరైన రక్షణ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, గిగ్ వర్క్ కార్మికుని పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి కొత్త తరహా కార్మికులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే మే డే ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు. అది మరింత అవసరమైంది.
ముగింపుగా, మే డే మనకు ఒక ప్రశ్న వేస్తుంది. “మన జీవితాన్ని సులభం చేసిన ఆ చేతులను మనం గౌరవిస్తున్నామా?” ప్రపంచం, ఎత్తుకు ఎదిగిన ప్రతి మెట్టు వెనుక, ఒక కార్మికుడి చెమట చుక్క ఉంది. ఆ చుక్కను గుర్తు చేసుకోవడమే మే డే. ఇది ఒక ప్రశ్న, ఒక జ్ఞాపకం, ఒక కర్తవ్యం. హక్కులు పుట్టాయి పోరాటంతో. నిశ్శబ్దంగా పనిచేసే మహిళా చేతులు చరిత్రను నెమ్మదిగా మార్చాయి. చిన్నారి కన్నీళ్లు తగ్గించడానికి ఈ ఉద్యమం కవచమైంది. ఇప్పటికీ ప్రపంచం మారినా శ్రమ మారలేదు. పేర్లు మారాయి. గిగ్ వర్కర్… కాంట్రాక్ట్ ఉద్యోగి…కానీ బాధ మాత్రం అదే… అందుకే మే డే ఇంకా ముగియని కవిత. మన సుఖాల వెనుక వారి నిశ్శబ్ద త్యాగం ఉంది. ఆ చెమటకు నమస్కరించే రోజు మే డే.
శ్రమ ఒక పదం కాదు. అది జీవితం. శ్రామికుడు ఒక మనిషి కాదు. అతడే సమాజం. శ్రమకు నమస్కారం… శ్రామికుడికి గౌరవం… అదే మే డే సారాంశం. చెమట చుక్కల సాక్ష్యం మే డే”
