Home వ్యాసాలు తెలంగాణ కవయిత్రులు

తెలంగాణ కవయిత్రులు

by Dr. Sujatha Reddy Mudiganti
తెలంగాణ కవయిత్రులు

` డా॥ ముదిగంటి సుజాతారెడ్డి

తెలంగాణ నేలలో ఎందరో వీరవనితలు, విదుషీమణులు జన్మించారు. సమ్మక్క సారలమ్మలు తమ భూములను గుంజుకునే కాకతీయుల సైన్యాన్ని కదనరంగంలో ఎదిరించి పోరాడారు. రాణి రుద్రమ శత్రువులనెదిరించి కత్తిసాములు చేసి శత్రువులను పారద్రోలింది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ స్త్రీలు కొడవళ్ళు, రోకళ్ళు కారంపొడులతో దుండగులనెదరించి ధైర్యసాహసాలు చూపించారు. ఇక కవిత్వం అల్లడంలో ఏమీ వెనుకబడిలేమని తమ పదాలు పాటలతో నిరూపించారు. పలకా బలపం చేతికి రాని కాలంలో చదువు విజ్ఞానానికి దూరమైన దూరంగా వుంచబడిన స్త్రీలు తమ సృజనాత్మకతను చావనియ్యలేదు. ఏ పని చేస్తే ఆ పనికాడ కవిత్వం కట్టారు. తమ భావోద్వేగాన్ని వెల్లగక్కుతూ తమ కథన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మౌఖికమైన కవిత్వాన్ని సృష్టించారు.

నాట్లు పెడ్తున్నా, కలుపు తీస్తున్నా తమ కవితా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పాటలు కట్టారు. విసుర్రాయి విసురుతూ, ధాన్యం దంచుతూ పదాలు రచించారు. భక్తిపాటలు పాడారు. మంగళారతులు, జోల పాటలు పాడారు. పెండ్లిపాటలు సృష్టించి కమ్మని గొంతులతో పాడారు. బొడ్డెమ్మ పాటలు బతుకమ్మ పాటల సృష్టికి అంతే లేకుండా రచించారు. రామాయణం పురాణాల కథలను మంచి కథనాత్మకంతో పాటల కావ్యాలు రచించారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకున్నా  రాజాస్థానాలు వాళ్ళను గౌరవించకున్నా సన్మానాలు చేయకున్నా స్త్రీలు తమ కవితాశక్తిని పదాలు పాటలు రూపంలో రచించి అనంతమైన సాహిత్యాన్ని సృష్టించారు. మౌఖికమైన ఆ సాహిత్యం ఆధునిక కాలంలో కొంత నశించినా పరిశోధకులు సేకరించిన స్త్రీల పాటలు పదాలు కొన్నయినా మనకు లభిస్తున్నాయి. తెలంగాణ స్త్రీల సృజనాత్మక శక్తిని కవితా రచనా ప్రావీణ్యాన్ని తెలియచేస్తున్నాయి. వేదాలూ మౌఖికంగానే నిలిచిన సాహిత్యం. స్త్రీల కవిత్వం కూడా ఆ విధంగా మౌఖికంగానే నిలచిన సాహిత్యం.

ఇక తాటాకులు ఘంటాలు రావటం అక్షర రచన కొనసాగినప్పుడు కూడా స్త్రీలు తమకు దొరికిన అవకాశాలను విడిచిపెట్టుకోకుండా రచనలు చేసారు. కావ్యాలు రచించారు. అట్లా తెలుగులో మొదటి పద్య రచన చేసిన కవయిత్రి విరియాల కామసాని కన్పిస్తున్నది. క్రీ.శ.1000లో అంటే నన్నయ మహాభారత రచనకు 50 సంవత్సరాలు పూర్వం గూడూరు శాసనాన్ని విరియాల కామసాని వేయించింది. ఈ శాసనకాలం గురించి అభిప్రాయ భేదాలున్నాయి. కాని క్రీ.శ.1000 అని ఎక్కువమంది అంగీకరించారు.

తన భర్త ఎర్రభూపతి వీరమరణం పొందగా తాను ముందుకువచ్చిన రాక తప్పని కారణంగా చిన్న పిల్లవాన్ని కాకతి సింహాసనం మీద కూర్చోబెట్టి కాకతీయ వంశాన్ని నిలిపిన ధీరవనిత, పాలనాధ్యక్షురాలు, రాజనీతి తెలిసిన స్త్రీ మూర్తి విరియాల కామసాని. ఆ విషయాన్ని కామసాని ఈ శాసనంలో చెప్పింది. మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలలో వున్న ఈ శాసనాన్ని ఆమె రచించిందని చెప్పాలె. రూపకోత్ప్రేక్షాలంకారాలతో చక్కని పదాల కూర్పుతో వున్న ఈ పద్యాలు కామసాని కవితా రచనా సామర్థ్యానికి నిదర్శనాలుగా  నిలిచివున్నాయి.

అద్దంకి శాసనం బెజవాడ శాసనాలను తూర్పు చాళక్యుల సేనాని పండరంగు వేయించాడు. శాసనం వ్రాసినవాళ్ల పేర్లు లేవు కాబట్టి ఆ శాసనాలను పండరంగుయే రచించాడని నిడదవోలు వేంకటరావుగారన్నారు. అదే విధంగా కవి పేరు లేని గూడురు శాసనాన్ని విరియాల కామసాని రచించిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనాలి.

రంగనాథ రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డి కూతురు. కాకతీయ రాజుల సామంతులైన మల్యాల వారి కోడలు కుప్పాంబిక బూదపుర శాసనం వేయించింది. అయ్యలరాజు తన పద్య సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్ని ఒకటి ఇచ్చాడు ` ఆమె కాలం క్రీ.శ.1230`1300.

వనజాతాంబకుడేయు సాయకములన్‌ వర్ణింపగా రాదు నూ

తన బాల్యాధిక యవ్వనంబు మదికిన్‌ ధైర్యంబు రానీయద

త్యనురక్తిన్‌ మిము బోంట్లకున్‌ దెలుప నాలో సిగుమై కోదు పా

వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్‌ తుదల్ముట్టునే

నేర్పుగల కవి వ్రాసిన పద్యం కన్నా తక్కువేం లేదు కుప్పాంబిక పద్యం. ఇది కావ్యంలోని నాయికా విరహతాపాన్ని  వర్ణించే పద్యం. దీన్ని బట్టి కుప్పాంబిక ఏదైనా కావ్యం రచించింది కాబోలు.

కాకతీయ రెండో ప్రతాపరుద్రుని ప్రియురాలు మాచల్దేవి విదుషీమణి అని క్రీడాభిరామంను బట్టి తెలుస్తున్నది. ఆమె తప్పక కవిత్వం వ్రాసి వుంటుంది. కవయిత్రి మొల్ల ఓరుగల్లు నివాసి. రెండో ప్రతాపరుద్రుని  ఆస్థానంలో వున్నదని ‘‘ప్రతాప చరిత్ర’’ చారిత్రక కావ్యం చెప్తున్నది. మొల్ల పోతనకు సమకాలికురాలు, లేదా కొంచెం తర్వాత వున్నదిగ చెప్పవచ్చును. ఆమె తన తండ్రి ‘‘గురులింగజంగమార్చన పరుడు ‘‘శివభక్తి నిరతుడ’’ని చెప్పుకున్న దాన్ని బట్టి ఆమె వీరశైవ కుటుంబంలో జన్మించిందని తెలుస్తున్నది. వీరశైవం తెలంగాణలో ముఖ్యంగా ఓరుగల్లులో విస్తరించి వుండిరది. వీరశైవురాలు కాబట్టే మొల్ల నిమ్నకులం కుమ్మరి కులంలో జన్మించినా పాండిత్యం సంపాదించగలిగింది. స్త్రీకి గౌరవం వుండే వీరశైవ కుటుంబంలో జన్మించడం వల్లనే ఆమె చదువుకోగలిగింది. పోతనకు, మొల్లకు కొన్ని పోలికలు కన్పిస్తున్నాయి. ఇద్దరు వీరశైవ కుటుంబంలో పుట్టి రామభక్తులైనారు. పోతన ` ‘‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, ఇక నే పలికిన భవహరమగు…’’ నని చెప్పుకున్నట్లుగానే మొల్ల ` ‘‘చెప్పమని రామచంద్రుడు సెప్పించిన పలుకు మీద చెప్పెద, నేనెల్లప్పుడు నిహపర సాధనమిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్‌’’ ` అని నివేదించుకుంది. పోతనలాగానే ` ‘‘రామ నర పాలకుని కంఠోక్తిగా స్తుతి సేయు జిహ్వకున్‌ చిల్లర రాజలోకమును జేకొని మెచ్చగనిచ్చబుట్టునే…’’ అని పలికింది. ‘చిల్లర’ దేశ్యపదం తెలంగాణలోనే ప్రయోగంలో వుంది. ఉర్దూలోకి ప్రవేశించింది. ఒక్క రంగనాథ రామాయణంలో ఈ పద ప్రయోగం కన్పిస్తున్నది. పోతన ‘మనుజేశ్వరాథముల…’ అని ప్రయోగిస్తే మొల్ల ‘‘చిల్లర రాజలోకము..’’ అని అన్నది. గ్రంథాంకితం దృష్ట్యా ఇది గమనింపదగిన అంశం.

మొల్ల కన్న ముందు తెలంగాణలో రెండు రామాయణాలు రచింపబడినాయి. కాని మొల్ల మాత్రమే రామభక్తురాలుగా ప్రసద్ధి చెందింది. శ్రీకంఠమల్లేశుని వరం చేత కవిత్వం చెప్పగలిగానని మొల్ల చెప్పుకుంది. మొల్ల రామాయణం సంగ్రహంగా వుంది. అయినా కాలం తాకిడులకు నిలిచిందంటె ఆమె ప్రతిభ సహజ కవిత్వ నైపుణ్యం కారణాలని చెప్పాలె.

మొల్ల తన రామాయణాన్ని అయోధ్యాపుర వర్ణనతో ఆరంభించి కావ్య స్వరూపాన్ని ఇచ్చింది. మొల్ల భావాలు సరళ సుందరంగా వుంటాయి. సీత హనుమంతునితో రామునికి సందేశం పంపే ఘట్టాన్ని ఎంతో విజ్ఞతతో రమ్యంగా రచించింది. గుహుడు రాముని పాదధూళి సోకి తన పడవ ఏమౌతుందో అని భయంతో కూడిన మూఢభక్తిని మొల్ల చక్కని పద్యంలో చెప్పింది `

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయియే

ర్పడనొక కాంతయయ్యేనట పన్నుగ నీతిని పాదరేణువి

య్యెడ వడి నోడ సోక నిదియేమగునోయని సంశయాత్ముడై

కడిగె గుహుడు రామపదకంజయుగంబు భయంబు పెంపునన్‌.

మొల్ల సరళమైన కవిత్వం సరళ స్వభావం ఈ పద్యంలో ప్రతిబించించాయి.

‘‘మధురా విజయం’’ రచించిన గంగాదేవి తెలంగాణ కవయిత్రి. ఈమె ఓరుగల్లు నివాసి. అగస్త్య పండితుని మేనల్లుడు విశ్వనాథుని శిష్యురాలు. సంస్కృతంలో మధురమైన దృఢమైన కవిత్వంతో కావ్యం రచించిన కవయిత్రి. బుక్కరాయల కొడుకు వీరకంపరాయలను వివాహమాడి విజయనగరం చేరుకున్న కవయిత్రి.  విశాలమైన సంస్కృత సాహిత్యంలో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి గంగాదేవి. ఆ తర్వాత విజయనగరం తంజావూరు ఆస్థానంలో వున్న మహిళలు రామాయణాది కావ్యాలు సంస్కృతంలో రచించారు.

తెలంగాణలో ప్రాచీన కాలంలో మౌఖికమైన సాహిత్య సృజన చేసిన పామర కవయిత్రులతో పాటు కావ్యాలు రచించిన పద్యరచన చేసిన కవయిత్రులున్నారు. 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో స్త్రీలు చైతన్యవంతులై అయిలమ్మ, ఆరుట్ల కమలాదేవి లలితాదేవి మల్లు స్వరాజ్యం, ప్రియంవద వంటి ఎందరో స్త్రీలు తుపాకి పట్టారు, పోరాటాలు చేసారు. గళమెత్తి పాటలు కట్టి పాడారు. బుర్రకథలు చెప్పారు. నిజాం సర్కారుని ఎదిరించారు.

నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యం అన్నప్పుడు దాన్ని సవాలుగా తీసుకొని ఆత్మగౌరవానికి పరీక్షగా భావించి తెలంగాణ వైతాళికులలో సుప్రసిద్ధులు సురవరం ప్రతాపరెడ్డి గారు ‘‘గోలకొండ కవుల సంచిక’’తో తెలంగాణ కవుల కవిత్వం ప్రచురించి కృతార్థులైనారు. ఆ సంపుటం 354 కవుల్లో దాదాపు 10 మంది కవయిత్రులున్నారు. వీరివి అన్నీ పద్య కవితలే. చదువు శూన్యమైన వాతావరణంలో పదిమంది స్త్రీలు కవిత్వం వ్రాయటం, అదీ ఉత్తమమైన ఛందోబద్ధ కవిత్వం వ్రాయటం చెప్పుకోదగిన విషయం. వాళ్ళల్లో రూస్థాన్‌పేట రత్నమ్మ, పునిగోటి ఆనందమాంబ, ఆండాలమ్మ, జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీబాయి మొ॥న వాళ్ళున్నారు. భక్తి, దేశభక్తి, స్త్రీ విద్యకు సంబంధించిన కవిత్వం వ్రాసారు. లక్ష్మీబాయి అనే కవయిత్రి తన తండ్రి మరణ దుఃఖంతో ‘‘ఎలిజీ’’ పద్యాలతో స్మృతి కవిత్వం రచించింది. ఇదొక విశేషం. సోమరాజు ఇందుమతీబాయి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ రచించిన ‘‘ఆంధ్ర రచయిత్రులు’’ గ్రంథంలో ` ‘‘దక్కను సారస్వతరంగంలో కల్పన బాగుగా ప్రసిద్ధురాలయిన’’ కవయిత్రిగా చెప్పబడిరది. ఇందుమతి బాయి ‘గౌరి’ అనే కావ్యాన్ని రచించింది.

తెలంగాణలో 1910లో ఆరంభమైన గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు, కాంగ్రెసు, ఆర్య సమాజోద్యమం, కమ్యూనిస్టుల పోరాటం ఆధునికతను తెచ్చాయి. ప్రజల్లో చైతన్యాన్ని జాగృతిని తెచ్చాయి. నాలుగు శాతం అక్షరాస్యత అందులో స్త్రీల అక్షరాస్యత శూన్యమనే చెప్పాలె. అటువంటి పరిస్థితులో పునరుజ్జీవనోద్యమంతో స్త్రీలల్లోను జాగృతి ప్రవేశించింది. స్వాతంత్య్రానంతరం స్త్రీ విద్య పెరిగింది. 1960లో స్త్రీలు నవలలు కథలు అధికసంఖ్యలో వ్రాస్తున్న కాలం. తెలంగాణ నుండి కూడా  యశోదారెడ్డి, నందగిరి ఇందిరాదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మా హైమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి కథలు, నవలలు వ్రాసి సాహిత్య  సృజన చేసారు. అప్పుడు స్త్రీలు కవిత్వం జోలికి పోలేదు. 1980, 90ల్లో స్త్రీవాదం ముమ్మరంగా సాగింది. అరసం, విరసం కాలంలోను తెలుగులో స్త్రీలు కవిత్వం వ్రాయలేదు. అస్తిత్వ ఉద్యమాలతోనే స్త్రీలు విరివిగా కవిత్వం వ్రాయటం ఆరంభమైంది. స్త్రీవాదం, దళితవాదం, ముస్లింవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం కాలంలో తెలంగాణ నుంచి చాలామంది స్త్రీలు కవిత్వం రచించారు. పురుష కవుల కవిత్వానికి తీసిపోని కవితాశిల్పం వీరి రచనలకు విశేష వ్యాప్తినీ కీర్తిని కలిగించింది. ఉత్తమమైన కవిత్వం రచించారు. మగవాళ్ళతో దీటుగా కవిత్వం రచించారని మరో వాక్యంతో సమర్థించవచ్చును.  స్త్రీవాదం ప్రతినిధిత్వం కవితాసంపుటి ‘‘నీలిమేఘాలు’’ ప్రచురింపబడిరది. దానిలో విమల తెలంగాణ కవయిత్రి ‘‘వంటిల్లు’’ కవిత అందరి ప్రశంసలను పొందింది. ఈ కవితలో ప్రతీకాత్మకత, అన్యాపదేశం వున్నటువంటి ఉత్తమ కవిత ‘‘వంటిల్లు’’. స్త్రీ అణచివేతకూ పురుషాధిక్యతకు ప్రతీకగా తీసుకోబడిరది.

‘‘మెల్లగా బాల్యపు ఛాయలు వదిలిపెడుతుండగానే

ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలైంది

‘‘వంటింటితనాన్ని’’ ఇక్కడే నేర్పారు నాకు ’’

‘‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి

అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే!’’

వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు

వంటలక్కలమైన మనం

మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం

గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను

ధ్వంసం చేద్దాం రండి! ’’ `

అంటుంది కవయిత్రి విమల. వంటిల్లు స్త్రీ ఇంటి చాకిరికి ప్రతీక. బయటి ప్రపంచం తెలియనితనానికి ప్రతీక. ఇంటికి బానిస బందీ అయిన దానికి ప్రతీక. ఆఖరికి స్త్రీ సంప్రదాయం పురుషాధిపత్యానికి గురయిన దానికి ప్రతీక. వంటిల్లును ఒక ప్రతీకగా చేసి స్త్రీ తరతరాల దాస్యాన్ని కవయిత్రి చాల గాఢంగా భావ తీవ్రతతో వ్యక్తం చేసింది. ఈ ఒక్క ‘‘వంటింటి’’ కవితతో విమల తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్నది.

అరసం విరసం కాలల నుంచే వచన కవిత్వం ఆరంభమైంది. మొదట్లో వచన కవిత్వం అంటే వచనాన్ని వ్రాసి వాక్యాలుగా వ్రాసి పాదాలుగా పేర్చటం పలుచన అయిన రచనలు చేసారు చాలామంది. తర్వాత కొంత ప్రాస అంత్యానుప్రాస చేర్చారు. ఆ తర్వాత కొంత తూగు వచ్చేట్లుగా పాదాలను పేర్చారు. కాని రానురాను వచన కవిత్వం ప్రతీకలు, భావవైచిత్రులు, భావచిత్రాలు, పదచిత్రాలు, మార్శికతలతో ఎదిగింది. ఇప్పుడు వచన కవితవో కేవలం వచనం లేదు. అర్థం చేసుకోవటానికి ఆలోచన, విషయావగాహన శక్తి అవసరం కవయిత్రులు కూడా అటువంటి భావ వైచిత్రులతో వచన కవిత్వం వ్రాస్తున్నారు. ‘‘వంటిల్లు’’ కవితతోనే తెలంగాణ కవయిత్రులు వచన కవిత్వాన్ని చిక్కగా చెప్పటం నేర్చుకున్నారు. మేమెవరికి తీసిపోము అన్నట్లుగా కవిత్వం వ్రాస్తున్నారు.

అప్పుడు స్త్రీ మీద జరిగే హింస అత్యాచారాలను గురించి ‘‘సిద్ధార్థి’’ కవితలో షాజహానా ఇలా అంటుంది `

‘‘నేనో చెట్టు కోసం చూశాను

అక్కడి కొమ్మలు నన్ను అత్యాచారం చేశాయి’’

స్త్రీల ఆంక్షలు ఇంటికి పరిమితం చేయటం కట్టుబాట్లను గురించి షాజహానా ఇట్లా అంటుంది `

‘‘ఊహ తెలియని వయస్సులో

గుమ్మానికి పరదా కడితే

రంగురంగుల కుచ్చులు చూసి మురిసిపోయేదాన్ని

అప్పుడే స్వేచ్ఛకు మొదటి బేడీ అని తెలుసుకో లేకపోయినదాన్ని `

ఎవరెస్టులాంటి చండ్రుడ్ని సైతం తాకొస్తున్న స్త్రీలను

సంసారాలనేంటి ఇంగ్లీషు ఛానల్‌ చూస్తూ ఈదుతున్న

ఈతరం స్త్రీలను చూస్తూ ఇంకా ఇంకా మౌనంగా ఉండడం నావల్ల కాదు!’’

ముస్లిం స్త్రీల సంప్రదాయపు పర్దాలను, ముసుగులను ఎదిరించడాన్ని వాళ్ళ ఆశయాలను, ఆశలను ఈ కొద్దిమాటల్లోనే షాజహానా బలంగా చాటి చెప్పింది.

సీనియర్‌ కవయిత్రుల్లో అనిశెట్టి రజిత చెప్పుకోదగిన కవయిత్రి. ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ వంటి నాలుగు వరకు కవితా సంపుటాలను ప్రచురించింది. బహుజనుల స్త్రీల అస్తిత్వ వాదనను వ్యక్తీకరించిన కవయిత్రి ‘‘లచ్చవ్వ’’ అనే దీర్ఘకవితను నానీలను వ్రాసింది. తెలంగాణ కవయిత్రులు నానీలను కూడా చేపట్టి రచించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమృతలత సంపాదకత్వంలో ‘‘గాయాలే గాయాలై’’ అనే కవితా సంకలనం వచ్చింది. దీనిలో కవయిత్రులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో కవిత్వం వ్రాసారు. దీనిలో కవయిత్రులు వ్రాసిన కవితలు భావ వైచిత్రిలో వున్నాయి. ఆమె ఇంకా కవిత్వం వ్రాసి కవితా సంపుటాలు తేవాలని ఆశిస్తున్నారు. అదే విధంగా అనిశెట్టి రజిత, డా॥ లావణ్య సంపాదకత్వంలో ‘‘జిగర్‌’’ పేరుతో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద కవితల సంకలనం వచ్చింది. ఈ విధంగా తెలంగాణ కవయిత్రులు మంచి కవితా సంకలనాలనీ తేవటం విశేషం.

డా. కొండపల్లి నీహారిణి మంచి ప్రతిభ గల కవయిత్రి. ఈమె భావవ్యక్తీకరణ కవితా శిల్పం స్వీయానుభవ పద చిత్రాలతో పదబంధాలతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఎన్నెన్నో కవి సమ్మేళనాలలో పాల్గొని విశేష ప్రాచుర్యం పొందుతున్న కవయిత్రులలో నీహారిణి ఒకరు. ‘హమ్‌ దర్దీ’ అనే కవితలో ఒక ముస్లిం స్త్రీ,  కూతురును కన్నదని ఆమె భర్త హింసించిన సంఘటనకు స్పందించి ఈ కవిత రాసినట్టు, తెలుస్తున్నది.

‘‘భూమాత ఓర్పు తడి ‘నఖాబ్‌’ వెనుక

నీ మోహపు భారాన్నిమోసి, ఆడపిల్ల రూపునిచ్చే

ఏ నిజ నిర్ధారణ లోతుల్లోనో మనసును స్కానింగ్‌ చేస్తే,

మనువాడకముందే, మనిషివని తెలిస్తే బావుండేది!

ఆనాటి ‘ఖబూల్‌ నామా’ విచ్చుకత్తుల ముళ్లుదింపె.

అబ్బాజాన్‌ అన్యాయపు తత్వానికి అమ్మీజాన్‌

అసహాయత్వానికి రుజువులేవి?

‘కూతురు నా వారసురాల’ని కన్న తండ్రిగ ఎలుగెత్తితే,

షాది ముబారక్‌ స్వరజతుల్లో ‘షాన్‌ ఎ మర్ద్‌’ నీవవుతావు.

ఆమె దర్దీ నీవై, నీ హృదయార్తి ఆమెదైతే

హమ్‌ దర్దీలున్న తల్లిదండ్రులకు నీవు పుట్టిన

‘‘ సోయి నీ కొస్తది! ’’ 2017 ఏప్రిల్‌ ‘చెలిమి’లో వచ్చిన ఈ కవిత నీహారిణి దృష్టి కోణంలో సమాజం పట్ల ఉన్న హమ్‌ దర్దీ కూడా తెలుస్తుంది. మంచి అభివ్యక్తి, మంచి ఆలోచనల మేళవింపు ఈ కవిత. నిత్య వ్యవహార భాషను అలవోకగా ఒడిసిపట్టిన కలం నీహారిణిది.

2008లో తాజ్‌ దుర్ఘటనలో చనిపోయిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (ుఱఎవం శీట Iఅసఱa) కన్సల్టింగ్‌ ఎడిటర్‌ సబీనా సెహగలం (జశీఅంaశ్ర్‌ీఱఅస్త్ర జుసఱ్‌శీతీ ూaపవవఅa ూవష్ట్రaస్త్రaశ్రీ) చనిపోయిన విషయానికి స్పందించి రాసిన కవిత, ఆనాటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ‘‘సబీనా! ఓ సబీనా!’’ అనే కవితలో ఓ సబీనా! నీ చెవుల మార్మోగిన తుపాకుల పేలుళ్ల శబ్దాలు మరిపించే… మము మురిపించే గాక కోకిలవైరా! ఫెళఫెళ ధ్వనులతో రుధిర జ్వాలల్లో నుంచి, వీణానాదానివైరా! సబీనా! సబీనా! ‘స్టిల్‌ వుయ్‌ లవ్యూ!’ అంటూ రాసిన కవిత ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఇట్లా కవిత్వంలో మలిచి ఆ ఉద్యోగిని తిరిగి రమ్మని పిలిచే నేపథ్యంలో ఆమె వీరోచిత లక్షణాలను వెల్లడిరపచేసింది నీహారిణి.

‘విలక్షణ కవి’గా జాషువాను వర్ణిస్తూ ‘‘స్వగత పరగత / భావగాంభీర్య ప్రాధాన్యతలకు / తలవొగ్గక / నీ సాహిత్య సువాసనలతో / మతులు పోగొట్టిన విశారదునివి!’’ అని అనడమైనా! ‘దార్శనికుడు’ అని కాళోజీని వర్ణిస్తూ ‘’తెలుగు తేనియలకు ప్రాంతీయ సొగసులద్ది / తెలంగాణ కొరకు తీరు తీరుగ జీవితాంతం తపియించే/ కవి అంటే ఎవరు మన కాళోజికాక ? / భావి కవులకు ఏమగునతడు దార్శనికుడు కాక?’’ అనడం మహావ్యక్తి జీవిత పరిశీలనకు పూనుకున్న కవయిత్రి అని తెలుపుతుంది.  ఈమె తన తండ్రిగారి, మామగారి జీవిత చరిత్రలను రచించిన రచయిత్రి.  ఒకరు ప్రజాసేవా రంగంలోని వ్యక్తి కాగా మరొకరు చిత్ర కళాకారులు. నీహారిణి విస్త ృత పఠనాభిలాష గల కవయిత్రిగా తెలుస్తుంది. ‘సంసారం ఓ వృక్ష రాజం’ ‘నవ నిరసనోపాఖ్యానం’ ‘గొంగట్ల మెతుకులు’, ‘ఖేల్‌ ఖతమ్‌ దుకుణమ్‌ బంద్‌’ వంటి వైవిధ్యమైన కవితలెన్నో రాసింది.

  1. అర్ర తలుపులు 2. నిర్ణిద్ర గానం, 3. ఎనిమిదో అడుగు అనే కవితా సంపుటులను వెలువరించింది.

ఈ మధ్య తెలంగాణ కవయిత్రులు మేర్స్‌ మార్గరెట్‌ కవిత్వానికి కొత్త వ్యాకరణాన్ని రచిస్తున్నది. కొత్త పదాలు మనకు తెలిసిన పదాలనే కొత్త అర్థంలో వాడటం, కొంత ప్రతీకలు, భావవ్యక్తీకరణలో నూతనత్వం కొత్త పదబంధాలతో వ్రాస్తున్నది. వివక్షకు హింసకు గురయిన సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘‘ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు’’ కవితలో ఇట్లా వ్రాసింది.

అక్కడ ప్రజాస్వామ్యం

పేరుకి కుర్చీ వేసుకొని

కులం సినిమా టికెట్లులు అమ్ముకుంటుంటే కులగజ్జికి చికిత్స

ప్రభుత్వాసుపత్రులలో కూడా దొరక్కపోగా

చూసి అయ్యో అన్నవారి మీదకే ఎగబడే

ఈ అశుద్ధ యంత్రాంగ వ్యవస్థ నిర్మాణాన్ని

మాటల్ని వ్యర్థం చేసుకోవడం దండుగే

గాయమయ్యి ఇన్ని రోజులైనా ఏది చికిత్స!!

స్రవిస్తున్న రక్తానికి ఏది ఆనకట్ట

రక్తంలో రంగు రుచి చిక్కదనం

వాసన చూసే శునకాలే చెప్పాలి!

అన్నీ సమస్యలు వివక్షలు సమూహాలు వర్ణాలు మధ్య చీకటి! ‘‘చీకటి దీపం’’ కవితలో మెర్సీ ఇట్లా అంటుంది `

చూట్టూ చీకటి / అడుగు తీసి అడుగు వేస్తే

ఇసుకలా తగిలే చీకటి

ఆ చీకట్లో గుజ్జనగూళ్ళు కట్టుకుందాం రా అని

ఆహ్వానిస్తుంది చీకటి.

చీకటంటే భయం కదా

చీకటంటే నిశ్శబ్దాన్ని నిలువునా నింపుకోవడం కదా

చీకటంటె మనసు తలుపులకు గొళ్ళెం పెట్టి

ఎగిసివచ్చే జ్ఞాపకాలతో గెలవడానికి చేసే యుద్ధం కదా

కాని ఈ చీకటేంటి ఇసుక రేణువులై వంటికంటుకుంది.

పాదాలను వేవేల చేతులై మర్దన చేస్తుంది…

సమాజంలో చీకటిలాగానే ప్రశ్నలు

చిక్కులు చిక్కులుగా ఉండలు చుట్టి పడేసిన

ఊలుదారాల్లాంటి ప్రశ్నలు…

జీవాన్ని ఆవిరి చేసుకుంటూ

శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న

క్యాలెండరు లాంటి ప్రశ్నలు…

తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే

కుళ్ళిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు…

` మరో కవితలో ఇట్లా అంటుంది `

‘‘తడిమే ప్రతి చూపులో

వినే ప్రతి మాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి ’’

‘‘కాల్చుకోవాలి’’ అంటె నన్ను నేను దహించుకోవాలని అర్థం. కులం, రంగు, జెండరు వీటన్నింటిని వివక్షలను ఎదుర్కుంటున్న మెర్సీ మార్గెరెట్‌ అస్తిత్వ వేదనను ఆమె కవిత్వంలో కన్పిస్తుంది. కొత్త భాషలో కొత్త పదాలలో కొత్త వ్యక్తీకరణలతో వైచిత్రులతో ప్రతీకలతో వ్యక్తమౌతున్నది. తెలంగాణ కవయిత్రి కొత్త గొంతు విచ్చుకున్నది. ‘‘మాటల మడుగు’’ అనే కవితా సంపుటిని ప్రచురించింది. తన సమూహాల వేదనను ఆమె ఇంకా వ్యక్తీకరించేది చాల వున్నది. ఇంకా వ్రాస్తూనే వున్నది.

తెలంగాణ నుంచి కవయిత్రులు ఎందరో కవిత్వం వ్రాస్తున్నారు. కవితా సంపుటాలు ప్రచురిస్తున్నారు. నెల్లుట్ల రమాదేవి, కందాళ శోభాదేవి, కొలిపాక శోభారాణి షంషాద్‌ బేగం, రజియా బేగం, సూరేపల్లి సుజాత, కిరణ్‌బాల, తుర్లపాటి లక్ష్మి, ఎన్‌.అరుణ, భండారు విజయ, హన్మాండు శారద, అడవాల సుజాత, జ్వలిత, హిమజ, సూర్యధనంజయ్‌, గోగుశ్యామల, జాజుల గౌరి, జూపాక సుభద్ర, దేవులపల్లి వాణి ఇంకా ఎందరెందరో కవిత్వం వ్రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. నిజంగా నేటి తెలంగాణ కవయిత్రుల కవితా కంఠాలతో మేటి రత్నాల వీణ.

You may also like

1 comment

ముద్దు వెంకటలక్ష్మి August 21, 2023 - 5:03 pm

తెలంగాణ కవయిత్రుల గురించిన ఈవ్యాసం చాలా బాగుంది, ఎందరో రచయిత్రుల గురించి తెలియని విశేషాలెన్నో తెలుసుకున్నాను, ధన్యవాదాలు.
‘ చిల్లర ‘ అనే పదం తెలంగాణ లోనే వినిపించే దేశ్య పదం అన్నారు కానీ ఈ పదం ఆంధ్రప్రదేశ్ లో కూడా వాడుకభాషలో ఉంది, ఉదాహరణకు చిల్లర డబ్బులు, అల్లరి చిల్లరగా, చిల్లర దేవుళ్ళు…

Reply

Leave a Comment