నెల్లుట్ల సునీత రచించిన “అరుగు” కవిత. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే చిత్రణ. కవయిత్రి నెల్లుట్ల సునీత కలం నుండి జాలువారిన “అరుగు” కవిత పై విశ్లేషణ.తెలంగాణ గ్రామీణ సంస్కృతికి,మానవీయ విలువలకు,కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన కవిత.అరుగు అనేది కేవలం ఇంటి ముందు నిర్మించిన రాతి వేదిక మాత్రమే కాదని ; అది ఒక కుటుంబానికి ఆత్మగా,గ్రామ సమాజానికి జీవన వేదికగా, ఆప్యాయతలకు నిలయంగా నిలిచింది.బాల్యపు మధుర జ్ఞాపకాలు,పల్లె జీవన సౌందర్యం, కుటుంబ బంధాల వెచ్చదనం, ఇరుగు – పొరుగు,ఆత్మీయ అనుబంధాలు,గ్రామీణ జీవన మాధుర్యాన్ని అరుగు అనే ప్రతీక ద్వారా కవయత్రి హృద్యంగా ఆవిష్కరించారు. కవితలోని ప్రతి దృశ్యం పాఠకుడి హృదయంలో జ్ఞాపకాల అలలను రేకేత్తిస్తూ,తెలంగాణ పల్లె జీవన ఆత్మీయతను సాక్షాత్కరింపజేస్తుంది. ఈ కవితలో అరుగు ఒక నిర్జీవ వస్తువుగా కాకుండా,గ్రామ జీవితానికి సాక్షిగా,కాలగమనానికి సాక్ష్యంగా,అనుబంధాలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది. ప్రతీకాత్మకత,భావగాఢత, సరళమైన భాష,సహజమైన చిత్రణ ఈ కవితకు ప్రత్యేక ఆకర్షణను చేకూర్చాయి.ఆధునిక జీవన శైలిలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలను గుర్తు చేస్తూ,గ్రామీణ సంస్కృతి పరిరక్షణ అవసరాన్ని కవయిత్రి పరోక్షంగా తెలియజేశారు. అందువల్ల “అరుగు” బాల్య జ్ఞాపకాల కవిత మాత్రమే కాదు ; తెలంగాణ పల్లె జీవన సౌందర్యానికి,మానవ సంబంధాలకు,ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే హృద్యమైన కవిత. “గతించిన కాలాన్ని/తనలో ఇముడ్చుకుని/తరగని జ్ఞాపకాల నిధిగా/బాల్యపు అనుభవాలలో/ చుక్కల ముగ్గుల చక్కదనమై/ తళుక్కున మెరిసింది”/అనే పంక్తుల్లో కవయిత్రి అరుగును జ్ఞాపకాల నిధిగా చిత్రించడం ఎంతో ప్రతీకాత్మకంగా ఉంది.గతించిన కాలాన్ని తనలో ఇముడ్చుకొని, తరతరాల అనుభవాలను సజీవంగా నిలుపుకోవడం అరుగుకే సాధ్యమవుతుంది. అందుకే అరుగును “తరగని జ్ఞాపకాల నిధి”గా అభివర్ణించడం అత్యంత సముచితంగా అనిపిస్తుంది.బాల్యంలోని ఆటలు, అల్లర్లు,ఆత్మీయ సంభాషణలు, కుటుంబ సభ్యులతో గడిపిన మరపురాని మధుర క్షణాలు అన్నీ అరుగు చుట్టూనే తిరిగిన రోజుల జ్ఞాపకాలను ఈ పంక్తులు మన కళ్ళు ముందు సజీవంగా ఆవిష్కరిస్తాయి.ఆనాటి అరుగులు ఎక్కువగా మట్టితో నిర్మించబడినవి.వాటిపై ప్రతి ఉదయం అమ్మ వేసిన చుక్కల ముగ్గులు ఆ ఇంటి అందాన్ని మరింత ఇనుమడింపజేసేవి. ”చుక్కల ముగ్గుల చక్కదనమై/ తళుక్కున మెరిసింది”అనే అభివ్యక్తి ద్వారా,పల్లె సంస్కృతిలో అరుగు యొక్క విశిష్ట స్థానాన్ని దాని సౌందర్యాన్ని,ఆప్యాయతను కవయిత్రి అద్భుతంగా ఆవిష్కరించారు. “జాజు తడిపిన పిడిసెతో/తన చుట్టు తీనెల తీసి/అలికి అమ్మ ఎంతగా/మురిసేదో/అనే పంక్తుల ద్వారా అమ్మ చేతి స్పర్శతో అరుగు సంతరించుకున్న అందాన్ని,ఆప్యాయతను లోతైన భావంతో చిత్రించారు.జాజు తడిపిన పిడిసెతో అరుగును అలికి,తీనెలు తీసి,ముగ్గులతో అలంకరించిన అమ్మ ప్రేమ, మమకారాల మాధుర్యానికి అరుగు ప్రతీకగా నిలుస్తుందనే భావాన్ని వ్యక్తం చేశారు. “అదే/పల్లెతనపు సింహాసనమై/ నిలిచిన అరుగు/వచ్చి పోయే బాటసారులు/తన ఒడిలో సేద తీర్చుకునేవారు”/అనే పంక్తులు అరుగు ప్రాధాన్యాన్ని చక్కగా తెలియజేస్తాయి.ఒకప్పుడు గ్రామ పెద్దలు,ఇంటి పెద్దలు అరుగు మీద కూర్చుని గ్రామ విషయాలను చర్చించేవారు.అందుకే కవయిత్రి అరుగును “పల్లెతనపు సింహాసనం”గా అభివర్ణించారు. పల్లె ప్రజలకే కాకుండా దారిన వెళ్లే బాటసారులకు కూడా అరుగు విశ్రాంతి నిలయంగా ఉండేది. అలసిన బాటసారులు అరుగు ఒడిలో కాసేపు కూర్చుని సేదతీరుతూ,ఆ ఇంటి వారి ఆతిథ్యాన్ని ఆస్వాదించేవారు.ఈ విధంగా అరుగు ఆప్యాయతకు, ఆతిథ్యానికి,మానవ అనుబంధాలకు ప్రతీకగా నిలిచిందని కవయిత్రి ఎంతో భావగర్భితంగా వివరించారు. అందుకే అరుగును “పల్లెతనపు సింహాసనంగా” అభివర్ణించారు. “పల్లె వాకిలికి అందమై/పల్లె తల్లి అనుబంధమై/మర్చిపోలేని నిశ్చల జ్ఞాపకమై/మమకారాలకు మారుపేరుగా/వెల కట్టలేని అనురాగమంత/అక్కడే చేరి ముచ్చటించేది”/అనే పంక్తుల ద్వారా అరుగు యొక్క సాంస్కృతిక,సామాజిక,భావోద్వేగ ప్రాధాన్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. తెలంగాణ పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటి వాకిలి ఎదురుగా ఓ అరుగు ఉండేది.అది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా,పల్లె తల్లి అనుబంధానికి ప్రతీకగా నిలిచేది. కుటుంబ సభ్యులు,బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఒకచోట చేర్చి ఆత్మీయబంధాలను బలోపేతం చేసిన అరుగు,పల్లె జీవితంలో ఒక అవిభాజ్య భాగంగా మానవీయ విలువలకు సజీవ సాక్ష్యంగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఎంతో సహజంగా వ్యక్తీకరించారు. కొన్ని అనురాగాలకు వెలకట్టడం సాధ్యం కాదు.తల్లితండ్రుల ప్రేమ ఎంత అమూల్యమో,అలాగే అరుగు చుట్టూ పెనవేసుకున్న ఆత్మీయత,మమకారాలు కూడా అంతే అమూల్యమైనవి.ఆరుగు మీద సబ్బండ వర్ణాల ప్రజలు ఎలాంటి అరమరికలు, భేదభావాలు లేకుండా ఒక్కచోట చేరి తమ సుఖదుఃఖాలను పంచుకునేవారు.గ్రామ అభివృద్దికి సంబంధించిన విషయాలను పరస్పరం సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చించుకుంటూ, ఆప్యాయంగా ముచ్చటించుకునే వారు.ఈ విధంగా అరుగు సామాజిక సమానత్వానికి,మానవ సంబంధాలకు,పల్లె సంస్కృతికి సజీవ ప్రతీకగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి మనసును హత్తుకునేలా వ్యక్తీకరించారు. “మానవత్వపు నీడలన్నీ/చేరి అంతరంగాన్ని/ ఆవిష్కరించుకునేవి”/అనే పంక్తులలో కవయిత్రి అరుగును సామాజిక జీవనానికి కేంద్ర బిందువుగా ప్రతీకాత్మకంగా చిత్రించారు.సబ్బండ వర్ణాలకు చెందిన ప్రజలందరూ ఎలాంటి భేదభావాలు లేకుండా అరుగు మీద చేరి ఆత్మీయంగా తమ సుఖదుఃఖాలను పంచుకునేవారు. ఒకరితో ఒకరు తమ మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకుంటూ,పరస్పరం ఓదార్పు పొందే ఆప్యాయ వేదికగా అరుగు నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఎంతో లోతైన భావంతో చిత్రించారు. “అమ్మ మోసుకొచ్చిన/గడ్డిమోపైన/ నాన్న తెచ్చిన/కట్టెల మోపు/ భారాన్నైనా/తన ఎద పైనే దించుకునేది”/అనే పంక్తులు అరుగు కుటుంబ జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందో తెలియజేస్తాయి. పొలాల నుంచి అమ్మ మోసుకొచ్చిన గడ్డిమోపును, కష్టపడి నాన్న తెచ్చిన కట్టెల మోపును ముందుగా అరుగు మీదనే దించేవారు.రోజంతా కాయకష్టం చేసి వచ్చిన వారి శ్రమకు అరుగు చక్కటి విశ్రాంతి స్థలంగా మారేది.ఇక్కడ కవయిత్రి అరుగును ఎద ఉందని చెప్పడం మానవీకరణ (Personification) అలంకారానికి చక్కని ఉదాహరణ. నిర్జీవమైన అరుగును సజీవమైన మనిషి రూపాన్ని ఆపాదించి, మనుషుల భారాన్ని తన ఎదపై మోస్తున్నట్లుగా చిత్రించడం ద్వారా కవయిత్రి కవితకు ప్రత్యేకమైన సౌందర్యాన్ని,భావగాంభీర్యాన్ని చేకూర్చారు. అమ్మానాన్నల శ్రమను పంచుకుంటూ,వారు మోసుకొచ్చిన భారాన్ని తనపై దించుకునే ఆప్యాయ సహచరిగా అరుగును చిత్రిస్తూ,కవయిత్రి హృదయాన్ని హత్తుకునే భావాన్ని వ్యక్తీకరించారు. “అమ్మమ్మ చెప్పే చందమామ కథలు/ఆకాశవాణి రేడియో ప్రసారాలు/పత్రికల సమాచారాలు/ పరీక్షల విజయాలు/అష్టాచమ్మా ఆటలు/అమ్మ వేసే జడలు/ అక్క అల్లే పూమాలలు అబ్బో/ ఒక్కటేమిటి అన్ని పనులు/అక్కడే ఊపిరి పోసుకునేవి”/అనే పంక్తులు అరుగు చుట్టూ పరిభ్రమించిన పల్లె జీవనాన్ని సజీవంగా ఆవిష్కరిస్తాయి. అరుగు కేవలం ఇంటి ముందున్న రాతి వేదిక మాత్రమే కాదు ; అది జ్ఞాపకాల నిలయం,ఆత్మీయతకు ఆలవాలం ; సామాజిక బంధాలకు ప్రతీక.సాయంత్రం వేళ అరుగుపై కూర్చుని అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వినడం చిన్నారులకు మరపురాని అనుభూతిగా ఉండేది.ఆ కథలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా నీతి,సంస్కారం,జీవన విలువలను కూడా అందించేవి. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, ఊహాశక్తి పెంపొందించడానికి అవి ఎంతో దోహదపడేవి. ఆ రోజుల్లో ఆకాశవాణి రేడియో గ్రామీణ జీవితంలో ఒక విశేష ఆకర్షణగా నిలిచేది.పేదరికం కారణంగా ప్రతి ఇంటిలో రేడియో ఉండేది కాదు.ఊరిలో ఒకరిద్దరి ఇళ్లలో మాత్రమే రేడియో ఉండేది. ఆ ఇంటి వారు రేడియోను అరుగుపై ఉంచి,గ్రామస్తులందరు కలిసి వినేలా చేసేవారు.అందులో ప్రసారమయ్యే వార్తలు,నాటకాలు, పాటలు,వ్యవసాయ కార్యక్రమాలను అందరూ ఆసక్తిగా ఆలకించేవారు.దీంతో ఆ అరుగు ఒక చిన్న ప్రజావేదికగా మారి, గ్రామస్తుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేసేది. అలాగే గ్రామ పెద్ద ఇంటికి వచ్చే వార్తాపత్రికలను కూడా అరుగు పై ఉంచేవారు.గ్రామస్తులందరూ అక్కడే కూర్చొని పత్రికలు చదువుతూ దేశ,విదేశీ వార్తలను పరస్పరం పంచుకుంటూ చర్చించుకునేవారు. పరీక్షల ఫలితాలు కూడా అప్పట్లో వార్తాపత్రికల ద్వారానే తెలిసేవి. పరీక్షల్లో విజయం సాధించిన గ్రామీణ యువత విజయాన్ని అందరూ అరుగుపైనే కలిసి ఆనందంగా జరుపుకునేవారు. ఒకరి విజయాన్ని అందరి విజయంగా భావించే పల్లె సంస్కృతికి ఇది ఓ చక్కని నిదర్శనం. కాలక్షేపానికి అష్టాచమ్మా వంటి ఆటలు ఆడడం,అమ్మ పిల్లలకు జడలు వేయడం,అక్క పూలమాలలు అల్లడం వంటి ఎన్నో కుటుంబ,సామాజిక కార్యక్రమాలకు అరుగు కేంద్రబిందువుగా ఉండేది.అందుకే అన్ని పనులు అక్కడే ఊపిరి పోసుకునేవని కవయిత్రి చేసిన అభివ్యక్తి సహజత్వంతో పాటు గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. పల్లె సంస్కృతిలో అతిథి సత్కారానికి విశేష ప్రాధాన్యం ఉంది.”అతిథి దేవోభవ” అనే భారతీయ సంస్కృతి సారాన్ని ఆచరణలో చూపిస్తూ,ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమగా ఆహ్వానించి,”మర్యాద రామన్న సపర్యలు”తో ఆదరించడం గ్రామీణ ప్రజల సుగుణం. “మర్యాద రామన్న సపర్యలు” అనే పద ప్రయోగం ద్వారా పల్లె ప్రజల ఆతిథ్య గుణాన్ని ప్రతీకాత్మకంగా, హృద్యంగా వ్యక్తీకరించారు. అక్క,చెల్లి,అన్న,తమ్ముడు,బాపు,అమ్మ,బాబాయి,అత్త,తాత, నానమ్మ వంటి బంధుత్వాల పేర్లతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే సంస్కారం పల్లె జీవితానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.అనురాగం,ఆప్యాయత, ఆత్మీయత,పరస్పర సహకారం, మానవీయ విలువలతో గ్రామస్తులంతా ఒకే కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి జీవించేవారు.“వసుధైవ కుటుంబకం” అనే భారతీయ జీవన తత్వాన్ని ప్రతిబింబించే ఈ భావాలను కవయిత్రి ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ఈ విధంగా అరుగు పల్లె జీవితానికి కేంద్రబిందువుగా, మానవ సంబంధాల నిలయంగా, గ్రామీణ సంస్కృతి వైభవానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిందనే భావాన్ని కవయిత్రి ఈ పంక్తుల ద్వారా హృద్యంగా వ్యక్తం చేశారు. “కుశల ప్రశ్నలు కులాసాలు/అక్కడే చేరి/మురిపెంగా ఊసులాడేవి”/ అనే పంక్తులు అరుగు మీద కూర్చుని కుశల ప్రశ్నలతో సంభాషణను ప్రారంభించి, కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపిన పల్లె జీవనాన్ని మన కళ్ళముందు సజీవంగా ఆవిష్కరిస్తాయి.ఆ అరుగు మీద గ్రామస్తులు ఆత్మీయంగా చేరి ముచ్చటించుకోవడం ఆనాటి పల్లె జీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.కవయిత్రి ఆ మధురమైన రోజుల జ్ఞాపకాలను మనకు గుర్తుచేస్తూ,పాఠకులను అనుభూతుల లోకంలోకి తీసుకెళ్లి ఆనందింపజేస్తున్నారు. “ఆ సిరుల లోగిలిలో/ చిలకరించేది”/అనే పంక్తులు, అరుగు ఇంటి సిరిసంపదకు మాత్రమే కాకుండా,బంధుమిత్రుల మధ్య ప్రేమ,ఆత్మీయత, అనుబంధాలు చిగురించే పవిత్ర వేదికగా నిలిచిందనే భావాన్ని ఆవిష్కరిస్తున్నాయి.అరుగు కేవలం ఒక నిర్మాణం కాదు ; మానవ సంబంధాలు పరిమళించే ఆప్యాయతల నిలయమని కవయిత్రి హృద్యంగా వ్యక్తీకరించారు. “అలసిన తనువులకు/స్వాంతన ఇస్తూ/నిత్య నూతన/ఆనందాలు పంచేది”/అనే పంక్తులు పల్లె ప్రజలు రోజంతా వ్యవసాయ పనులతో అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత,అరుగు వారికి విశ్రాంతిని, స్వాంతనను అందించేదని తెలియజేస్తున్నాయి.అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, కొన్నిసార్లు పడుకొని సేదతీరడం వంటి దృశ్యాలు ఆనాటి పల్లె జీవితంలో సహజంగా కనిపించేవి. ఈ విధంగా పల్లెవాసుల శారీరక అలసటను తీర్చి,వారి మనసులకు ఉల్లాసాన్ని,ఆత్మీయతను పంచిన అరుగు గొప్పతనాన్ని కవయిత్రి ఎంతో హృద్యంగా చిత్రించారు. “కొత్త తరాల/హైటెక్ ప్రపంచపు/ రంపపు నోటి ముక్కలై/గత వర్తమానపు/పల్లె/చిత్రంపై మసకబారి/తన ఉనికి ఎక్కడ అని/మూగ రోదనల మధ్య/ నలిగిపోయిన హృదయంతో/ జవాబు లేని ప్రశ్నగా/శిథిలమై మిగిలిపోయింది”/అనే పంక్తులు ఆధునిక సాంకేతిక ప్రభావంతో పల్లె సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.మారుతున్న కాలంతో పల్లె జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడటంతో ఉపాధి కోసం గ్రామాల నుంచి వలసలు పెరిగాయి.ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన పల్లెలు నేడు వెలవెలబోతున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో “అరుగు తన ఉనికి ఎక్కడ?”అని మూగరోదనతో ప్రశ్నిస్తున్నట్లుగా కవయిత్రి ఎంతో హృదయవిదారకంగా చిత్రించారు. “పేక మేడల అంతస్తుల/ పునాదుల్లో అరుగు/పగిలిపోయి మూగబోయింది”/అనే పంక్తులు ఆధునిక నాగరికత పేరిట విలువల విధ్వంసాన్ని అత్యంత ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తాయి. వాటిలో వ్యక్తమైన ఆవేదన పాఠకుని హృదయాన్ని కదిలించడమే కాక,మారుతున్న సామాజిక జీవన స్వరూపంపై ఆలోచింపజేస్తుంది.పల్లె సంస్కృతికి జీవనాడిగా, మానవీయ అనుబంధాలకు వేదికగా నిలిచిన అరుగును కవయిత్రి కేవలం ఒక నిర్మాణంగా కాక,ఒక సాంస్కృతిక చిహ్నంగా, జీవన తాత్త్విక ప్రతీకగా మలిచారు.అరుగు శిథిలమవడం అంటే ఒక రాతి నిర్మాణం కూలిపోవడం మాత్రమే కాదు ; దానితోపాటు ఆత్మీయత,ఆదరణ, ఇరుగు – పొరుగు అనుబంధాలు, సామూహిక జీవన సంస్కృతి, మానవీయ విలువలు క్రమంగా కనుమరుగవుతున్న విషాద వాస్తవాన్ని అత్యంత హృద్యంగా ప్రతిబింబించారు. ఈ కవితలో ప్రతీక,భావచిత్రం, సామాజిక స్పృహ సమన్వయమై, పాఠకుని మనస్సులో దీర్ఘకాలం నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తాయి.గత వైభవాన్ని కేవలం స్మరించడమే కాక,వర్తమాన సమాజం కోల్పోతున్న విలువలను ప్రశ్నిస్తూ,భవిష్యత్తు తరాలకు ఒక మౌన హెచ్చరికను అందించే కవితగా ఇది నిలుస్తుంది. పల్లె జీవన సౌందర్యాన్ని, మానవీయ విలువల ఔన్నత్యాన్ని,, అనుబంధాల మాధుర్యాన్ని కళాత్మకంగా ఆవిష్కరించిన కవయిత్రి నెల్లుట్ల సునీత గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.ఇలాంటి విలువలతో కూడిన మరెన్నో కవితా సుమాలను తెలుగు సాహిత్యలోకానికి అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.