Home ఇంట‌ర్వ్యూలు మనిషికి విచక్షణ ఉంటే తప్పులు జరగవు – వేంకట అనంతకృష్ణ శర్మ

మనిషికి విచక్షణ ఉంటే తప్పులు జరగవు – వేంకట అనంతకృష్ణ శర్మ

by Aruna Dhulipala

ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, సాహితీమూర్తి, ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి నారుమంచి వేంకట అనంతకృష్ణ శర్మగారితో మయూఖ ముఖాముఖి

– ధూళిపాళ అరుణ

జ:- నమస్కారం! మా నాన్నగారి పేరు నారుమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అమ్మ పేరు సరోజిని. అమ్మ ఇప్పుడు 90 ఏళ్ల యువతి (నవ్వుతూ). నేను 1957, డిసెంబర్ 27న జన్మించాను. మా నాన్నగారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ లో సుమారు 25 సంవత్సరాలు పనిచేశారు. నేను వరంగల్ లోనే పుట్టాను. నాన్నగారికి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ కావడంతో విద్యానగర్ కి వచ్చాం. రామ్ నగర్ లో సెయింట్ పయస్ X స్కూల్లో 3వ తరగతి చదివాను. 1964లో ఇల్లు కట్టుకున్న తర్వాత మలక్ పేట్ దగ్గర సలీం నగర్ కు వచ్చాం. అక్కడే స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్లో 4 వ తరగతిలో చేరి 8 వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. Madrasa-e- Aliya స్కూల్ లో 9, 10 తరగతులు చదువుకున్నాను. దోమలగూడ A.V కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంజినీరింగ్ ప్రవేశం ఒక్క మార్కులో పోయింది. బెంగుళూరులో 5వేలు కడితే ప్రయివేట్ కాలేజీలో జాయిన్ చేసుకున్నారుఅక్కడ బాబాయ్ వాళ్ళింట్లో నాలుగేళ్లు ఉండాలి. నాకు ఇబ్బందిగా అనిపించి వెళ్ళలేదు. నాన్నకు చెప్పలేదు. సైకిల్ మీద అంతటా తిరిగి ఎంక్వైరీ చేసి భద్రుక నైట్ కాలేజీలో చేరాను. నాన్నగారికి తెలిసిన లెక్చరర్ వి.ఎస్.ఆర్. మూర్తిగారు అక్కడ ఉండడం వల్ల సీటు ఇప్పించారు. ఆ తర్వాత ఎమ్.ఏ సంస్కృతం, ఎమ్. ఎస్.సి. సైకాలజీ, ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎమ్. ఇట్లా అనేక క్వాలిఫికేషన్లు సంపాదించుకున్నాను.

జ:  సాహిత్యపరంగా వారసత్వమంటూ లేదు కానీ మా ముత్తాత గారు వేదాంత అధ్యయనం చేసి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. బహుశా ఆ వాసన వల్ల నాకు వేదాంతం పట్టుబడిందేమో! కానీ నన్ను తీర్చిదిద్దిన మా గురువులను ఇక్కడ తప్పనిసరిగా స్మరించుకోవాలి. నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు లక్ష్మీపతి రావు గారని ప్రిన్సిపాల్. ఆయన మాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు. తెలుగు ఛందస్సులో పద్యాలు వ్రాయించేవాడు. అట్లా అంత చిన్నవయసులోనే పద్యం మీద మాకు మనసు కలిగేటట్లు చేశాడు. ఆయన ప్రోత్సాహంతో నాల్గవ తరగతిలో ఉత్పలమాల పద్యం రాశాను. ఆ విధంగా చేతిలో తేనేచుక్క వేసిన మాష్టారు. ఆయన చాలా నిక్కచ్చి మనిషి. ఆయన ప్రేమించినంతగా విద్యార్థులను ఎవరూ ప్రేమించలేరేమో? అలాగే ఆయన శిక్షించినంతగా ఎవరూ శిక్షించలేరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వ్యాకరణాలు చెప్పేవారు. దెబ్బలు తిని చదువుకున్న బుద్ధిమంతులం మేము (గట్టిగా నవ్వేస్తూ). మా వివేకానంద స్కూల్లో ఆ రోజుల్లో చదువుకున్న ప్రతీ ఒక్కరం అన్నం తింటున్నామంటే ఆయన పేరే చెప్పుకుంటాం. ఆరోజుల్లో కర్త, కర్మ, క్రియలను క్లారిఫై చేస్తూ ఆయన చెప్పిన ‘ఇంగ్లీషు గ్రామర్ లో Parsing ‘ ని తరువాత పుస్తకాల్లో తీసేసారని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే విద్యా విధానం అప్పటికీ ఇప్పటికీ ఎంత పలచబడి పోయిందో తెలుస్తోంది. ‘మదర్ సే అలియా’ స్కూల్లో 9,10 తరగతులు చదువుతున్నప్పుడు హనుమంతరావు సార్ అద్భుతమైన గురువు. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని పంచుకోవాలి. ఆ సమయంలో ఒకసారి విద్యార్థులను వైజాగ్ సైన్స్ ఫేయిర్ కు తీసుకువెళ్లారు. మా నాన్నగారు స్టేషన్ కు వచ్చారు. నా పక్క సీటులో కూర్చున్న అమ్మాయి “తమ్ముణ్ణి నేను చూసుకుంటాను” అని నాన్నగారికి హామీ ఇచ్చింది. ఆరోజు నుండి ఇప్పటి వరకు ఆమే మా ఇంటికి పెద్ద ఆడపడుచు. ఇక ఇంటర్మీడియట్ ఎ. వి కాలేజీలో అద్భుతమైన లెక్చరర్లు ఉండేవారు. భద్రుక కాలేజీలో నేను ఇందాక చెప్పిన మూర్తి గారు ఎకనామిక్స్ చెప్పేవారు. ఆ క్లాస్ చివరకు ఉండేది. అన్ని క్లాసులు ఎగ్గొట్టి ఆ చివరి క్లాసుకు మాత్రమే అటెండ్ అయ్యే విద్యార్థులు ఉండేవారంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మా వైపు చూస్తూ చూస్తూ వెనుకవైపు ఉన్న బ్లాక్ బోర్డ్ మీద పర్ఫెక్ట్ గా గ్రాఫ్స్ గీసేవాడు. “Application of knowledge” నేర్పించారాయన. ఆర్. రంగాచారి అని ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన అకౌంట్స్, స్టాటిస్టిక్స్ లో ఎక్స్ పర్ట్. ఆయన ఒక లెక్క వరుసక్రమాన్ని బోర్డ్ మీద రాసి బుక్ లో ఏ పేజీలో ఉందో చెప్పేవారు. రీప్రింట్ గా ఉండేది. ఏ సబ్జెక్టుకు సంబంధించిన లెక్చరర్ రాకపోయినా క్లాసుకు వచ్చి, ఆ సబ్జెక్టులో ఎంతవరకు క్లాసు జరిగిందో అడిగి అక్కడినుండి కంటిన్యూ చేస్తూ క్లాస్ చెప్పేవారు. అంతటి మహానుభావుడు. ఎల్.ఎల్. ఎమ్ కాకతీయ యూనివర్సిటీలో విజయ్ చందర్ గారు మరో అద్భుతం. ఎమ్.ఏ. సంస్కృతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాములు, పి.టి.జి. రంగాచార్యులు సంస్కృతపండితులు కాంట్రాక్ట్ క్లాసులు చెప్పేవారు. ఆయన కూడా ఏ సబ్జెక్ట్ అయినా చెప్తారు. ఇక సంస్కృత వ్యాకరణం విషయానికి వస్తే కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గారు మా గురువు గారు. వ్యాకరణం తప్ప ఆయన నోటినుండి మరోమాట వచ్చేది కాదు. ఆయన ‘ఆకాంక్ష’ పద్ధతిలో పాఠాన్ని మా చేతనే చెప్పించేవారు. ఇంతమంది మహానుభావుల చేత నేను చెక్కబడ్డాను.

జ:   తప్పకుండా. రంగాచారి గారు ప్రిన్సిపాల్ అని చెప్పాను కదా! నా చదువు అక్కడ పూర్తయిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆయనను కలవడం జరిగింది. మా బావగారు రంగావఝల పాండురంగ శర్మ (ఆర్. వి.పి. శర్మ) సంగీత విద్వాంసులు. పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి దగ్గర, డి. కె. పట్టమ్మాళ్ దగ్గర, ములుకుట్ల సదాశివశాస్త్రి గారి దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీత కచేరీ నల్లకుంటలో ఏర్పాటుచేశారు. ఆ కచేరీకి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి కింద వేసిన పట్టా మీద కూర్చున్నారు. నేను ఆయనను చూసి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి, ఫలానా బ్యాచ్ స్టూడెంటునని చెప్పుకున్నా. ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. అప్పటికే ఇంటర్, డిగ్రీ, ఐసిడబ్ల్యూ, సి.ఏ, ఎల్ ఎల్ బి విద్యార్థులకు నేను పాఠాలు చెప్తున్నాను. అందువల్ల మీలాగే అన్ని సబ్జెక్ట్స్ పాఠాలు చెబుతున్నా అన్నాను. వెరీగుడ్. “స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నావా?” అన్నారు. అవునన్నాను. అప్పుడాయన “అనంతకృష్ణా! ఈ రోజుల్లో ఎవరూ కూడా స్టాటిస్టిక్స్ బైనామియల్ థియరం చెప్పడం లేదు. నువ్వు చెబుతున్నావా?” అంటూ అక్కడే పట్టా మీదనే ఆ థియరం అంతా తనవేలితో గీసి “ఇట్లా చెబుతున్నావా, లేదా?” అన్నారు. అంటే ఆయన దగ్గర చదువుకున్న నేను ఇంకొకరికి అన్యాయం చేయకూడదని ఆయన ఉద్దేశ్యం. అలాంటి మెంటల్ ఫ్రేం వర్క్ ఉన్న టీచర్లు ఈరోజుల్లో చాలా అరుదు అనిపిస్తుంది. ఈ అనుభవాన్ని నేను వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టుకున్నాను. లక్ష్మీపతి సార్ తో ఉన్న అనుభవాలను కూడా ఫేస్ బుక్ లో భద్రపరచుకున్నాను.

జ:    చక్కటి ప్రశ్న వేశారు. నేను మూడు బ్యాంకులకు ఇంటర్వ్యూలకు వెళితే మూడింట్లో ఉద్యోగం వచ్చింది. మొట్టమొదట అపాయింట్ మెంట్ వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాయినయ్యాను. నేను మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకల్లా నా పని పూర్తి చేసుకొని ఇతర సిబ్బంది చేస్తున్న పనులను చూస్తూ అడిగి తెలుసుకుంటూ ఆరు నెలల్లో అన్ని పనులను నేర్చుకున్నాను. ప్రమోషన్ల విషయంలో తేడాలుండేవి. అందువల్ల ప్రమోషన్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను. 5 ఏండ్ల తరువాత రీజినల్ ఆఫీసుకు వెళ్ళాను. భండారు రామచంద్రరావు గారు అని గొప్ప వ్యక్తిత్వం కలవాడు. పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు గారి సోదరులు. ఆయన రీజినల్ మేనేజర్. ఆయన వ్యక్తిత్వం నుండి చాలా నేర్చుకున్నాను. నా టాలెంట్ గుర్తించి ఆఫీసర్ చేసే పనులను కూడా నమ్మకంతో నాకప్పగించే వారు. 5 ఏళ్ల తర్వాత అవే పనులే ఎప్పుడూ చేస్తుండడం తప్ప కొత్తదనం, కొత్తగా ఆలోచించేవి ఏవీ లేవు. మీరు నమ్మరు! ఇదే విషయం రాస్తూ రాజీనామా చేశాను. ఆయన నన్ను పిలిచి అడిగినా అదే చెప్పాను. నా కుటుంబం గురించి అడిగాడు. పెళ్ళయిందని, ఒక పాప ఉందని చెప్పాను. వెంటనే లెటర్ చించేసి పాప పెద్దయ్యాక రిజైన్ చేయి అన్నారు. ఆ తర్వాత మరో బ్రాంచ్ కి వెళ్ళాను. అంతకుముందు బ్యాంక్ లో నాకు ఆఫీసర్ గా ఉన్న సి.వి.శాస్త్రి ఇక్కడ మేనేజర్. మా ఇద్దరి మధ్య ఆయన ఏరా?..అనేంత చనువు ఉండేది. అక్కడ కూడా రాజీనామా లెటర్ ఇచ్చాను. మానేసి ఏం చేస్తావ్? అన్నాడు. నేను అనుకుంటున్న నాలుగు ఆప్షన్స్ చెప్పాను. ఆయన ఇంకేం మాట్లాడలేదు. 2001 లో VRSస్కీం వచ్చింది. వెంటనే దానికి అప్లై చేశాను. అంతకుముందే LLB చేసి ఉన్నాను కదా! ఎవరికిందా ప్రాక్టీసుకు చేరలేదు. N. V. అనంతకృష్ణ అడ్వకేట్ అని బోర్డు పెట్టి దిల్ షుక్ నగర్ లో ఆఫీసు పెట్టాను(గట్టిగా నవ్వేస్తూ). అమ్మవారే అన్నీ చూసుకుంటుందని నమ్మకం.

జ: 1990 – 94 మధ్య భాగవత సప్తాహానికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన తట్టింది. మనకు విష్ణు, శివ, లలిత, లక్ష్మి ఇట్లా దేవతలకు సహస్రనామాలున్నాయి. కానీ దేవుడున్నాడని నమ్మకం కలిగించి గురూపదేశం చేసిన గురువుకు సహస్ర నామం లేదు కదా! అనిపించింది. అప్పుడు గురు సహస్రనామం అని పేరు పెట్టి రాయాలనుకున్నా. కానీ అప్పటికి నాకు సంస్కృతం రాదు. సంస్కృతమే రానప్పుడు సంస్కృత ఛందస్సు ఎలా రాయగలను? అప్పుడు వెళ్లి వృత్తరత్నాకరం కొనుక్కొని వచ్చి అనుష్టుప్ ఛందస్సు తెలుసుకొని దానికి నోట్స్ రాసుకున్నాను. నామాలు రిపీట్ కాకుండా చూడాలనుకున్నాను. ఒక నోట్ బుక్ తీసుకొని ఇండెక్స్ లాగా పేపర్లను కట్ చేసుకున్నాను. ఏ పేరు రాద్దామని గుర్తుకు వస్తే ఆ అక్షరం దగ్గర ఆ పేరు రాసుకున్న. అట్లా ముందు వేయి నామాలు తయారు చేసుకున్నాను. ఇది కేవలం నా గురువు కోసం అని కాదు. ప్రతి ఒక్కరి గురువుకు సమన్వయించుకునేలాగా ఉండేలా చేయాలనుకున్నాను. తెనాలిలో చావలి వామనమూర్తి శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. అష్టాదశ పురాణాలు గుళ్లో ప్రవచనం చెప్పడమే ఆయన వృత్తి. గొప్ప పండితులు. ఆయన దగ్గరికి వెళ్లి ఇది చూపించా. మురిసిపోయాడు. ఇంకేమీ ఆలోచించొద్దు అన్నారు. నేను హైదరాబాద్ కి వచ్చాక ఆయన ఒక కార్డు రాశాడు. అందులో చివరగా “మాగాయి త్యప మంగళం..”అన్న శ్లోకం చెప్పి ఏమయ్యా వెళ్లొద్దు. అన్నానంటేఅమంగళం. ‘వ్రజ సఖేతి హీనం వచః’ వెళ్ళమంటే అమర్యాద. ‘తిష్ఠేతి ప్రభుత’ ఉండమంటే నీమీద అధికారం చెలాయించినట్లవుతుంది. ‘యథా రుచి కురుష్వాపి’ అంటే నిర్లక్ష్యం చేసినట్టు. కిమ్ కర్తవ్యమితఃపరం యదుపతే త్రైలోక్య నాథ ప్రభో! స్మర్తవ్యావయ మాదరేణ భవతాం! యావత్ పునర్దర్శనమ్! నిన్ను మళ్లీ దర్శించుకునేంత వరకు స్మరిస్తూనే ఉంటాను. అని రాశాడు. గురువు ఎట్లా ఉంటాడు? ఆయన లక్షణాలు, ఉపదేశాలు, స్థూల రూపం, ఆయన స్వరూపకత, దైవానికి గురువుకు ఉండే అభేదం, ఇట్లా ఒక్కొక్కదాన్ని విశ్లేషించుకుంటూ రాస్తున్నప్పుడు ఒక దశలో ఆపేశాను. ఒక స్టేజీలో ‘నావల్ల కాదు’ అని ఆపేశాను. నేను ఆపేసిన రోజే రోడ్డుమీద ఒక వందరూపాయల నోట్ దొరికింది. దాని వెనుక “Stay with hope. End with success” అని రాసి ఉంది. అది గుర్వాజ్ఞగా భావించి ఇంటికి వచ్చి మళ్లీ మొదలుపెట్టాను. మొదటగా ధ్యాన శ్లోకం రాశాను.
“శాంతం శుచి స్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం
కవచం శిష్య గణస్య, భిషజం భవరోగిణాం
ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాఙ్మానస గోచరం
సద్యః సిద్ధిం కరం గురుం నమామి స్వాత్మ నాయకం”

నేనెక్కడ ఉపన్యాసం, ప్రసంగం చేసినా ధ్యానశ్లోకం ఇదే చదువుతాను. మా గురువు గారిని ఇంటికి పిలిచి, నేను రాసిన సహస్ర నామాలతో ఆయనకు పాదపూజ చేసుకున్నాను.

జ:   ఆ రోజుల్లో ఒక అనుభవం చెప్పాలి. బహుశా శుక్రవారం అనుకుంటా. ఉద్యోగం లేదు కాబట్టి ఖాళీగా ఉండడం వల్ల అమ్మవారి శతకం రాస్తున్నాను. అప్పటికే కొన్ని పద్యాలు రాశాను. నాకు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి నానామాటలు అన్నాడు. నేను కూడా ఆవేశంతో సోమవారం సాయంత్రం వచ్చి డబ్బు తీసుకెళ్లు అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. “చిన్ని పాపనమ్మా! నన్నిట్లు శోధించ/ తాళలేను తల్లి తెలియవమ్మా/ ఆర్తి తోడ పిలువ ఆదుకొందువటంచు/లలిత పదముల మది లలిత గొలుతు” అని బాధపడుతూ ఈ పద్యం రాశాను. సాయంత్రం నా స్నేహితుడు, తన బ్యాంకుకు సంబంధించిన డేటా సమస్యను గురించి నా దగ్గరకు వచ్చాడు. బ్యాంకులో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విషయమంతా వివరించి ఒక డిపాజిట్ ను మూడు నెలలు ఆపి,తర్వాత రెండవ దాంట్లో కలపమని, బ్యాంకు లావాదేవీలు తెలిసిన వాడిగా సలహా ఇచ్చాను. సరేనని వెళ్తున్నవాడు వెనక్కి వచ్చి ఎవరికో ఎందుకు నీకే ఇస్తాను. మూడు నెలల తర్వాత నాకు ఇవ్వు అన్నాడు. ఆదివారం కూడా పనిచేసే బ్యాంకులో ప్రాసెస్ అంతా చేసి పెట్టాను. చెబితే మీరు నమ్మరు. అతను నా దగ్గర పెట్టుకోమని ఇచ్చిన డబ్బు అక్షరాలా నాకు అప్పు ఇచ్చినవానికి నేను ఇవ్వాల్సిన అమౌంట్. నిజంగా ఇది దైవికంగా జరిగిందే. ఈ శతకాన్ని ఏలూరుపాటి అనంతరామయ్యగారు ఆవిష్కరించారు.

అనంత కృష్ణగారితో ముఖాముఖి గ్రహిత ధూళిపాళ అరుణ

జ:శక్తి పంచాయతనంలో అమ్మవారి శతకం అయిపోయింది కాబట్టి మిగతా వాటి మీద కూడా శతకాలు రాయాలనిపించి గణపతి శతకం ఉత్పలమాలలో రాశాను. సూర్య శతకాన్ని అనంత భాస్కర శతకమనే పేరుతో సంస్కృత మకుటంతో సీసంలో రాశాను. ఇది సూర్యారాధనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. శార్దూలంలో విష్ణు శతకం ఉంటుంది. విష్ణు సాధన, విష్ణు విద్య, విష్ణు తత్త్వం దీంట్లో ఉంటాయి. ఈశా కల్పద్రుమా! పేరుతో శివ శతకం రాశాను. మా స్నేహితునికి అంకితంగా వాసుదేవ శతకం, నా మనుమడు, మనుమరాలిని ఉద్దేశించి పిల్లల కోసం నీతి శతకాన్ని ‘బంగరు కొండ’ పేరుతో రాశాను. అన్ని విషయాల్లోను సమాజంలో కనబడుతున్న దుర్నీతిని చూసి ఒక్కరోజులో శతకం రాయాలని ‘వెధవ శతకం’ అని రాశాను. విద్య, సంసారం, ఆసుపత్రి… ఇట్లా వివిధ శీర్షికలు 11 ఎంచుకొని ఒక్కో శీర్షిక కింద 9 పద్యాలు రాశాను. ఓ వ్యక్తి నన్ను ఉదాహరణ కావ్యం రాయమన్నాడు. ఆత్మతత్త్వం మీద ‘ఆత్మోదాహరణం’ అనే పేరుతో రాశాను.

జ:    ఫేస్ బుక్ లో నేను, పట్వర్ధన్ శతావధాని, వి.ఆర్. గణపతి అని మంచి పద్యకవి. ముగ్గురం అడ్మిన్లుగా ‘ప్రజ పద్యం’ పేరుతో ఒక గ్రూపును నిర్వహిస్తున్నాం. ఇందులో పద్యాల పోటీలు నిర్వహిస్తుంటాం. పోటీలకు కొన్ని నియమాలను ఏర్పరిచాం. గెలిచిన వారికి ఐదు, మూడు, రెండు వేల రూపాయల చొప్పున బహుమతులు ఇస్తుంటాం. ఒకసారి ‘మహా సామాజిక పద్య ప్రబంధం’ పేరుతో 32 కావ్యాలు రాయించాం. 150 నుండి 200 పద్యాల వరకు లిమిట్ పెట్టుకున్నాం. అందులో అష్టాదశ వర్ణనలు, సామాజికాంశం తప్పనిసరిగా ఉండాలి అని ఒక నిబంధన కూడా పెట్టాం. పేరు నమోదు చేసుకున్నప్పుడు వందకు పైగా ఉన్నారు. మా గడువు లోపల ఇచ్చిన వాళ్ళు 32 మంది ఉన్నారు. ఈ 32 కావ్యాలను త్యాగరాయ గానసభలో ఆవిష్కరించాం. వెలుదండ నిత్యానంద రావుగారు, అనుమాండ్ల భూమయ్యగారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తిరునగరి గారు మొదలైన వాళ్లు వచ్చారు. ఆ పుస్తకాలకు వీళ్లే ఎవాల్యూయేటర్స్. మా నియమం ప్రకారం ఏ పోటీ పెట్టినా అడ్మిన్స్ తప్పకుండా పాల్గొనాలి. కానీ ప్రైజులకు అర్హులు కారు. సందర్భంలో నేను ‘అనామకుడు’ అనే పద్య కావ్యం రాశాను. ‘యాని నామాని గౌణాని’ అన్నట్లు పేరు లేకుండా ఉపయోగపడిన వాడు అన్న ఉద్దేశ్యంతో రాసిన కావ్యం. 32 పుస్తకాలు ఒకేసారి డిజిటల్ ఆవిష్కరణ అవడం సాహితీ చరిత్రలోనే అదొక మైలురాయి.

జ:    అవునమ్మా! నేను రాసిన సూర్య శతకము కొన్ని చిత్ర బంధాలతోనే ఉంటుంది. “కాలోహ్యనంతః విపులాచ పృథ్వీ” అన్నాడు భారవి మహాశయుడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలియదు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని కాదు కానీ ఒక్క విషయం చెప్పాలి. నా మేనల్లుడు ‘తెలుగు నుడి’ అనే ఒక కార్యక్రమాన్ని రెగ్యులర్ గా చేస్తుంటాడు. రెండు, మూడు గంటల కార్యక్రమం. వందమందితో కలిసి ఆన్లైన్ లో చేస్తున్నాడు. కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ సాహిత్యం మొదలుకొని అన్ని సాహిత్యాలు చదువుతున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే పేరుతో సంస్థ స్థాపించి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మీరన్నట్లు చిత్రబంధ కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు, రాసేవాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో కోలార్ నగరంలో ఉండే ఒకాయన కేవలం చిత్రబంధాలే రాస్తారు. నాకు ఫోన్ చేసి ఎట్లా ఉందో చెప్పుమంటాడు. కాబట్టి ఈ కాలంలో కూడా వీటిని ఆస్వాదించేవారున్నారు.

జ:   నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కారులో నా వెంబడి తెచ్చుకున్న పుస్తకాన్ని చదువుతుంటాను. అట్లాగే Teaching is twice learning. నేను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిస్తున్నాను. చెప్పేటప్పుడు వాళ్లకు వచ్చే సందేహాలు తీర్చడం కోసం నేను నేర్చుకుంటా. ఇక్కడ నేను వాళ్లకు బోధిస్తున్నాను అనడం కంటే నేను నేర్చుకుంటూ నన్ను నేను దిద్దుకుంటున్నా. ఏ సబ్జెక్టుదైనా సరే కనిపించిన పుస్తకమల్లా చదువుతాను. విపరీతంగా పుస్తకాలు కొంటాను. రాత్రి ఒంటిగంటలోపు పడుకోను. నా మంచం చుట్టూ పుస్తకాలే ఉంటాయి.

జ:   ఏ భాషా కవిత్వంలో నైనా సరే, కవిత్వంలో కమ్మటి వాసన రావాలంటే, భావుకత రావాలంటే, పది కాలాలపాటు నిలవాలంటే రెండు విషయాలు తప్పనిసరి. ఒకటి సమాజాన్ని పరిశీలించడం, రెండు ప్రకృతిని పరిశీలించడం. ఏ వ్యక్తి ప్రకృతితో మమేకమై ఉంటాడో వారి కవిత్వంలో ఆ మట్టి పరిమళిస్తుంది. అందుకే కవిని క్రాంతదర్శి అంటారు. కాళిదాసు వంటి కవుల గొప్పతనం, అన్ని గొప్పలక్షణాలు అంతటి స్థాయిలో లేకపోయినా, ఏదో కొంత నిష్పత్తి ఉన్నవాళ్లు ఈనాటికీ రాణిస్తున్నారు. అటువంటి కవిత్వం చదవడం వల్ల మనం సంస్కరించబడతాం. ప్రాచీన కవులు సమాజంతోను, ప్రకృతితోను మమేకమయ్యారు కాబట్టి అట్లా రాయగలిగారు. మనం ఇప్పటికీ చదువుతున్నాం. కావ్య వృక్షం, సంస్కారవృక్షం ఎప్పటికీ చచ్చిపోవు. నేనిప్పుడు విద్యార్థులకు ఆ కావ్యాలను బోధిస్తున్నానంటే నన్ను నేను సంస్కరించుకుంటూ ఇతరులను సంస్కరిస్తున్నాను. మనమెంత భ్రమలో ఉన్నామంటే సంస్కృత కావ్యాలు, ప్రాచీన కావ్యాలు ఒక కాలానికో, మతానికో, వర్గానికో చెందనవని, లేదా కేవలం భగవంతునికి సంబంధించిన విషయాలను తెలిపేవి అనే భ్రమలో ఉన్నాం. వాటిలో ఉండే మౌలిక విలువలు తెలుసుకోలేకపోతున్నాం. మంచి విలువలతో కూడిన కావ్యాలు ఒకే కాలానికి పరిమితమైనవి కావు కదా! అవెప్పుడైనా శాశ్వతాలే!

జ:    మనం రచన చేసేటప్పుడు ఎవరికి చెబుతున్నామో వారికి అర్థం కావాలి. అంటే మీరు తగ్గాలి. అప్పుడు భాషను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భాష కావాలంటే చదివేవాళ్లకు భాష సొగసును చెప్పగలగాలి. అల్టిమేట్ గా చెప్పాలంటే రససిద్ధి ప్రధానం. వ్యావహారికంలో రససిద్ధి కలిగిస్తే అది కూడా గొప్పదే. ప్రాచీన పద్యంలో ఉన్న అర్థం, సొగసు తెలిస్తే అద్భుతంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో తెలుగు భాషను సరిగా నేర్పించకుండా పెద్ద తప్పు చేస్తున్నారు. సమాజం దానివల్లే నాశనమవుతోంది. ఉదాహరణకు పాణిని ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథం రాశాడని అందరికీ తెలిసిందే. శబ్దాల యొక్క సాధుత్వాన్ని, అసాధుత్వాన్ని వివరించేది వ్యాకరణం. ఆయన వాటిని సూత్రీ కరించాడు. ఆ కాలంలో ఆయన రాసినప్పుడు సమాజంలో వాళ్లకు బాగా అర్థమైంది. ఆ తరువాత కొన్ని వందల ఏండ్ల తరువాత భట్టోజీ దీక్షితులు ఆ నాలుగువేల సూత్రాలను రీ ఫ్రేమ్ చేసి ‘సిద్ధాంత కౌముది’ ని తయారుచేశాడు. దీనికే ‘ప్రక్రియా విధానం’ అని పేరు. ఆయన శిష్యుడు వరదరాజులు ఇంకా దాన్ని సంక్షిప్తీకరించి ఆ నాలుగు వేల సూత్రాలను తగ్గించి సుమారు 1400 సూత్రాలతో ‘లఘు సిద్ధాంత కౌముది’ తయారుచేశాడు. అది కూడా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు పాండిచ్చేరి అరబిందో ఆశ్రమంలో ఇంకా సులభతరం చేసి వంద సూత్రాలతో ‘పాణినీయం’ అని వేశారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలక్రమంలో భాషను అర్థం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. అందరికీ అవగతం కావాలన్నది నిజమే అయినా భాషా సౌందర్యాన్ని కోల్పోతున్నామని కూడా గ్రహించాలి. ఇందాక చెప్పినట్టు వ్యావహారికంలో కూడా సౌందర్యాన్ని చూపించవచ్చు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శబ్దసౌందర్యాన్ని, పద సౌందర్యాన్ని అర్థం చేసుకునే స్థాయి బాగా తగ్గిపోయింది.

ధన్యవాదాలు సార్. అవిశ్రాంతమైన మీ సమయాన్ని మాకోసం కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారాలు🙏🏼

You may also like

Leave a Comment