Home వ్యాసాలు సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

by Aruna Dhulipala

     ఇందులోని అంశాలను బట్టి దీనిని ఆరు భాగాలుగా విభజించుకోవచ్చు.

* మొదటి మరియు మూడవ భాగంలో వివిధరంగాల  ప్రముఖులు, సాహితీవేత్తలు, బంధుమిత్రుల సందేశాలు, వ్యాసాలు, కవితలు ఉంటాయి.

* రెండవ భాగమంతా సేనాధిపతిగారి సాహిత్య సమాలోచన చేస్తూ ప్రసిద్ధ సాహితీవేత్తల విశ్లేషణలు, ప్రత్యేక వ్యాసాలున్నాయి.

* నాల్గవ భాగంలో ఆయనవి రెండు ఇంటర్వ్యూలు… పూర్తి సాహిత్య వివరాలతో ఆయన మాటల్లోనే చెప్పిన విశేషాలతో ఒకటి, వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వివరించిన అంశాలతో ఒకటి ఉంటాయి.

* అయిదవ విభాగమంతా వివిధ వర్ణ చిత్రాలు, ఆయా సందర్భాలలో ఆయనకు సంబంధించి వివిధ పత్రికల్లో వెలువడిన విశేషాలుంటాయి.

* ఆరవది పూర్తిగా ఆయన జీవిత పరిచయం ఉంటుంది.

పుస్తకం ఆసాంతం ఆయనతో ఆత్మీయత గలవారి ఛాయా చిత్రాలు సందర్భానుసారంగా క్రమపద్ధతిలో కూర్చడం ఈ పుస్తకానికి ఎంతో వన్నె తెచ్చింది.

       మాన్యులు సి.హెచ్. విద్యాసాగర్ రావు గారు దీనిని ఒక కర్తవ్య గాథగా పేర్కొంటూ “వాక్చాతుర్యంతో మంత్రించగలగడం మాత్రమే కాదు. మౌనంగా నిర్దేశం చేయగల శక్తి ఆయనది” అన్న మాటలు దాస్యం వారి జీవితస్వరూప స్వభావాన్ని మొత్తంగా ప్రత్యక్షం చేయిస్తాయి.

         మనం ఎన్నో అభినందన సంచికలను చూసి ఉంటాం. వాటిల్లో ఇది విభిన్నమైనది. సందేశాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకు కుటుంబంతో ఉన్న అనుబంధం, బంధుమిత్రులతో ఉన్న వాత్సల్యం, ఉద్యోగ ప్రస్థానంలో వారు తమ సహోద్యోగుల పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారితో ఉన్న స్నేహశీలత వల్ల ప్రతీఒక్కరూ వారిని గురించి తమ ఆత్మీయతను ఇందులో వెల్లడించడం దీనికొక ప్రత్యేకతను ఆపాదించింది. ఒకవైపు కౌటుంబిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు సాహిత్యంతో మమేకమై సభలు, సమావేశాలు , సాహితీ సంస్థలతో అనుబంధాన్ని పెనవేసుకొని ముందుకు సాగుతున్నారాయన.

          “మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్” అన్న శంకరాచార్యుల మాటలను ఆయన తమ జీవితంలో ఆచరణాత్మకంగా నిరూపించారు. క్షణభంగురమైన జీవితంలో ప్రతీ క్షణాన్ని వినియోగించుకున్నారు. ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ప్రయోజనకరంగా మలచుకున్నారు.

       ఒక వృత్తిలో ఉన్నవారికి క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం ప్రధానలక్షణాలు. అందులో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. దీనికి ఉదాహరణగా వారి సతీమణి గీతారాణి గారు ఈ పుస్తకంలో తమ దాంపత్య జీవితాన్ని వివరిస్తూ చెప్పుకున్న అనుభవాల్లో ఒకదానిని చూద్దాం. ఆయన శిశుమందిర్ జిల్లాల పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. ఒకనాడు మూడేళ్ళ కుమారుడు సేనాధిపతిగారిని చూసి ‘ఈయనెవరు?’ అని అడిగిన మాట ఆ తల్లిదండ్రుల మనస్సులను ఎంతగా కలచివేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి కార్యదీక్షాపరులు సేనాధిపతిగారు.

“Duty is more important than beauty and personal happiness” అని అంటారు. అయితే కావచ్చు. కానీ వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తులు కొన్ని అపురూపమైన ఆనందాలను కూడా త్యాగం చేయడం తప్పనిసరి అవుతుంది.

      “ప్రతిభా నవనవోన్మేష శాలినీ” అన్నట్లు ఆయన ఎప్పటికప్పుడు తమ ఆలోచనాసరళిని కొత్తగా రూపు దిద్దుకుంటూ వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇప్పటివరకూ 16 పుస్తకాలను వెలువరించి తమ సమర్థతను చాటుకున్నారు. సామాజిక అంశాలపై వెయ్యికి పైగా సంపాదక లేఖలు రాయడం వారి సాహిత్యాభిరుచితో పాటు వైశిష్ట్యాన్ని, వైయక్తిక అభీష్టాన్ని వ్యక్తపరుస్తుందని శ్రీ కె. వి. రమణాచార్యులు గారు దాస్యం వారిని ప్రశంసించారు.

         “ఇప్పుడు వస్తున్న కవిత్వంలోనూ, ఇతర రచనల్లోనూ పైపైన అక్షరాలు వెల్లువెత్తినంతగా హృదయం వెల్లువెత్తడం లేదు. హృదయస్పందన లేని కవిత్వం వ్యర్థమ”ని దాస్యం సేనాధిపతిగారు చెప్పిన మాటలు రచనల పట్ల కవులు, రచయితలకు ఉండాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఆయన సునిశిత పరిశీలనా దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి. కాలక్షేపానికో, మేమూ రాయగలమని పదిమందికి చెప్పుకోవడానికో రాస్తున్న వారందరూ ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

       ఒక పుస్తకం ఆయన చేతిలో పడడమే ఆలస్యం. వెంటనే స్పందించడం ఆయన నిరంతర అధ్యయన శీలత్వానికి నిదర్శనం. చదివిన వెంటనే స్పందించి దానికి సమీక్ష రాయడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్ధమాన కవులను కూడా ప్రోత్సహించడం ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణం. ఆయన సమీక్ష మూల గ్రంథాన్ని మించిన సౌందర్యాన్ని సంతరించుకోవడం పరిపాటి. ఇప్పటివరకు 1500 కు పైగా సమీక్షలు రాసారంటే ఆయన అక్షరాన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత బాధ్యతగా భావిస్తారో అర్థం చేసుకోవచ్చు.

         ఈ అభినందన సంచిక దాస్యం సేనాధిపతి గారి జీవితాన్ని వడ్డించిన విస్తరిలా మన ముందుంచుతున్నది. కంటికింపైనది మనసుకింపైనట్లు అందమైన పుస్తకంతో పాటు ఆయన వ్యక్తిత్వ, సాహిత్య జీవితాలు హృదయంగమంగా పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇంతటి పుస్తకాన్ని వెలువరించడానికి ‘ఉదయసాహితి’ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్యగారితో పాటు అంకితభావం కలిగిన ఆ సంస్థ నిర్వాహక సభ్యులు చేసిన కృషి ప్రశంసించదగినది. దాస్యం సేనాధిపతి గారు పరిపూర్ణ ఆరోగ్యవంతులై శతాధిక ఆయుష్మంతులై మరింత సాహితీ కృషి చేయగలగాలని కోరుకుంటూ సప్తతి మహోత్సవ సందర్భాన వారికి అభినందనలు.

You may also like

2 comments

Leave a Reply to Leia3960 Cancel Reply