భరతనాట్యంలో ప్రప్రథమ భారతీయ మహిళా నృత్య కళాకారిణియైన వీరు ఫిబ్రవరి
29 ,1904 లో మధురై, మద్రాస్ (ప్రెసిడెన్సి బ్రిటిష్ ఇండియా)లో జన్మించారు .తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి శేషమ్మాళ్ గార్లు. సంస్కృత పండితులు, చరిత్రకారులైన నీలకంఠ శాస్త్రిగారు “థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా “లో సభ్యులు .
నాటి సామాజిక పరిస్థితులను అనుసరించి బాల్యవివాహానికి పెద్దలు ప్రయత్నించినప్పుడు తిరస్కరించిన రుక్మిణి ,ఏడవ సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రితో పాటు ఆమె సొసైటీలో చేరారు. కర్ణాటక సంగీతము , భరతనాట్యం లో అభిననివేశం సంపాదించారు . విదేశీయులైన జార్జ్ ఆరుండేళ్ ను 1920లో తన పదహారవ ఏట వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు కాగా, జార్జ్ ఆరుండేళ్ వయసు నలభై సంవత్సరాలు . తల్లిదండ్రులు విముఖత చూపినప్పటికీ అనిబిసెంట్ ఆధ్వర్యంలో వీరి వివాహం జరిగింది.
ఆధ్యాత్మికత పైనున్న ఆసక్తే ఆమెను,’ యంగ్ థియోసాఫిస్టిక్స్ ఫెడరేషన్’ అధ్యక్షురాలిని చేసింది. ‘థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో జార్జ్ అరుండేల్ బోధకులు. వివాహానంతరం దంపతులిద్దరూ ఇరు సంప్రదాయాల్ని పరస్పరం గౌరవించుకుంటూ చక్కని జీవన యానం చేశారు. ఒకానొక సందర్భంలో భర్త గురించి చెప్తూ , “చతుర భాషణులు, జన సమూహంలోఉంటూ,అందరిని చైతన్య పరచడం వారి ప్రత్యేకత అంటారు .వీరి వివాహం సనాతన సాంప్రదాయ వర్గాలకు నచ్చక సంఘం నుండి కొత్తజంటను, ఆమె కుటుంబాన్ని బహిష్కరించినప్పటికీ వారి కలివిడితనం ప్రజల మద్దతుతో తిరిగి సమాజంలో కలిసిపోయారు.

మరోసందర్భంలో తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ మా ఇంట్లో ఆంక్షలు, కట్టుబాట్లు ఉండేవి కావని, సంస్కృతీసాంప్రదాయాల్ని తమవారిని చూస్తూనే నేర్చుకున్నానంటారు. కులమత భేదాలు, సంకుచిత స్వభావాలు ,జంతుబలులు లాంటి మూఢనమ్మకాలు ఉండేవి కావంటారు .
జార్జ్ అరుండేల్ వృత్తి ధర్మం లో భాగంగా వారు ఎన్నో దేశాలను చుట్టివచ్చే అవకాశం వారికి లభించింది .ఆ సందర్భంగా
అన్నాపావ్లోవా బావ్లే అనే రష్యన్ కళాకారిణి చేసిన బ్యాలెరీనా నృత్యాన్నిచూసి, పాశ్చాత్య బాలేట్ వైపు ఆకర్షితరాలైన ఈమె బావ్లే గురువు’ క్లియోనార్టి ‘వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తరువాత బావ్లే సలహాతో
భరత నాట్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం కేవలం దేవదాసీలు మాత్రమే చేసే ఆ నృత్యాన్ని సనాతన వర్గపు స్త్రీలు భరతనాట్యం నేర్చుకోవడం అవమానంగా భావించే సందర్భం. ఐనా అందరి విమర్శల్ని ,అభ్యంతరాలని పక్కకు నెట్టి ‘మీనాక్షి సుందరం పిళ్ళై ‘దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. ‘కేలూనాయర్’ వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు. ‘థియోసాఫికల్ సొసైటీ’ వజ్రోత్సవాల్లో భాగంగా ఇరవై వేల మంది ఆహుతుల మధ్య ప్రదర్శన ఇచ్చి రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంస పొందిన ప్రతిభాశాలి. ‘జేమ్స్ కజిన్’ అనే ఐర్లాండ్ కవిని ఆమె నాట్యం ఎంతగానో ఆకర్షించగా ,అతని ప్రోత్సాహంతో ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ‘ పేరిట 1936 లో నృత్యాలయాన్ని ఏర్పాటు చేశారీదంపతులు .అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ‘కళాక్షేత్రం’గా రూపం మార్చుకుంది. తన తొలి గురువైన సుందరం పిళ్ళై మరియు వారి అల్లుడు చొక్కలింగం పిళ్ళైలను తమ కళాక్షేత్రంలో గురువులుగా నియమించుకుని ,నలుగురు విద్యార్థులతో ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రాన నిలిచిందీనాడు. నాట్యంతో పాటు సంగీతాన్ని కూడా చేర్చినేర్పిస్తున్నారు .తోటలు తామరకొలను సాంప్రదాయిక కట్టడాలతో తన అభిరుచికి తగ్గట్టు ఒక నాట్య దేవాలయంగా తీర్చిదిద్దారీ కళాక్షేత్రాన్ని.
కేవలం దేవదాసీలు మాత్రమే ఈ నృత్యం చేయాలన్న ముద్రను చెరిపేసి ఈ కళారూపాన్ని జన రంజకంగా తీర్చి దిద్దిన
లాస్య ప్రియ.
శ్రీ జార్జ్ అరుండేల్ 1945 లో మరణించేనాటికి రుక్మిణీఆరుండేల్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు .(ప్రముఖ తత్వవేత్త ఐన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు జార్జ్ అరుండేల్ గారి పూర్వ విద్యార్థి.)
1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ని కూడా పొందారీమె.
1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా
శ్రీమతి ఆరుండేల్ ను ప్రతిపాదించినపుడు సున్నితంగా తిరస్కరించారట .రాష్ట్రపతి పదవి కన్నా నాట్యాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అని , ‘2013 లో కళాక్షేత్రలో రుక్మిణీ దేవి స్మారకోపన్యాసం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
గుర్తు చేశారు ‘.

భరతనాట్యానికి మార్పులు చేర్పులు చేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రపంచ ప్రాముఖ్యతను కలిగించారు. దేవదాసి సమాజంలోని టి. బాల సరస్వతి మరికొందరు నృత్య కళాకారుల సహాయ సహకారాలతో ఈ కళను గుడిమెట్లు దాటించి ప్రపంచ వేదిక పైకి తీసుకురావడంలో విశేష కృషి సల్పిన రుక్మిణి ఆరుండేల్ , భరతనాట్యంలో శృంగార అంశాలను తొలగించి భక్తి రసానికి ప్రాధాన్యతను కలిగించి పాఠ్యాంశాల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. ఆహార్యంలో, ఆభరణాలకు, రంగస్థల దృశ్యాలకు కొత్తదనాన్ని జోడించి నృత్య , నాటక ఆకృతినిచ్చి రామాయణంలోని కొన్ని అంశాలను అత్యంత జనాదరణ పొందేలా రూపొందించారు.
1952 ఏప్రిల్ లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తొలి నాట్య కళాకారిణిగా రికార్డు సాధించారు .రెండుసార్లు ఈ పదవినలంకరించిన వీరు జంతు సంక్షేమం కోసం “ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్ ఆక్ట్ “కోసం “జంతు క్రూరత్వ నిరోధక బిల్లు 1960 “తేవడంలోను,”జంతు సంక్షేమ బోర్డు “స్థాపనలో విశేషమైన కృషి చేశారు .ఈ బిల్లు ప్రవేశ పెడుతూ ఆమె చేసిన ప్రసంగానికి ప్రభావితులైన ప్రధాని నెహ్రూ చొరవతో త్వరితగతిన చట్టం రూపుదాల్చింది. ఎన్నో సంస్థలతో కలిసి జంతు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956లో ‘పద్మభూషణ్’ తో సత్కరించగా , ‘దేశికోత్తమ’ బిరుదుతో ‘శాంతినికేతన్’ సన్మానించింది.
నాట్య రీతిలో భగవత్తత్వాన్ని జోడించి , వీరు భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందడమే కాక ,నాట్యాన్ని ఉన్నత శిఖరాన నిలిపిన ఘనత సాధించారు .
ఫిబ్రవరి 24 ,1986న శ్రీమతి రుక్మిణీఆరుండేళ్ హంసమంజీరమై నటరాజ పాదాల చెంత చేరారు .

6 comments
Sign up now and access top-converting affiliate offers!
Boost your earnings effortlessly—become our affiliate!
Become our affiliate and watch your wallet grow—apply now!
Turn traffic into cash—apply to our affiliate program today!
Start sharing our link and start earning today!
Your network, your earnings—apply to our affiliate program now!