Home వ్యాసాలు సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం

సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం

by Padmasri Chennojwala

ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.

మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.

నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.

హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.

ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.

ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ(గ్వాలియర్ ఘరానా).
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు.

తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు.

వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది.

కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు.
కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.

మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన రాగసుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..

You may also like

1 comment

విజయ కందాళ February 1, 2026 - 12:33 am

అద్భుతమైన విశ్లేషణ అందించారు.అభినందనలు

Reply

Leave a Comment