నిజాయితీపరుడైన ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజల హృదయరథాల్లో తెలుగునేల నాలుగు చెరగులా ఊరేగిన పేరు కె.వి. రమణాచారి. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చదివి, ఐ.ఏ.ఎస్. అధికారిగా తలమునకలయ్యే పని భారాలున్నా తన మృదుగంభీర వచస్సుతో సాహిత్యాభిమానుల మనసుల్ని తేలికపరిచే కారంచేడు వెంకట రమణాచారి గారు తన అభిరుచి మేరకు తెలుగులో ఎమ్. ఏ. పూర్తి చేసి, 57 వసంతాల వయస్సులో పిహెచ్.డి. కూడా చేసిన నిరంతర విద్యార్థి.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక సలహాదారుడిగా, దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కమిషనర్ గా, కడప జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు రమణాచారి గారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈఓ)గా చేసిన సేవలే ఆయన మనుసుకు నచ్చిన సేవలని భావించవచ్చు.
2012లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రమణాచారి గారు ఏవో శుభఘడియల్లో తన పాదాలకు ఏదో పసరు పూసుకున్నట్లున్నారు. కాలపు వినువీధిలో వెనుదిరిగి 2007-2009 సంవత్సరాలకు పయనించారు. ఆనాడు టీటీడీ ఈఓ గా నిర్వహించిన విద్యుక్తధర్మాలను సంతృప్తికరంగా పునఃదర్శించుకున్నారు. పాత జ్ఞాపకాలను అక్షరాల్లోకి ఒదిగించి, 2024-25 లో ‘స్వాతి’ మాసపత్రికలో వ్యాసాలుగా వెలువరించారు. ఆ అనుభవాల దొంతరనే ఇప్పుడు ఏప్రిల్ 2025లో ఎమెస్కో ద్వారా ‘హరే శ్రీనివాసా!’ పుస్తకంగా ప్రకటించారు.
22 ప్రకరణలుగా విస్తరించిన ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు అంతర్లీన సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది ఏడుకొండల స్వామి దర్శనాన్ని ప్రజాస్వామీకరించడం – అంటే దేవుణ్ణి ప్రజల వద్దకే తీసుకుపోవడం. తాను ఏది చేసినా, చేయగలిగినా అదంతా దైవానుగ్రహమేనని విశ్వసిస్తూ ‘హరే శ్రీనివాసా’ అని అడుగడుగునా తలచుకోవడం రెండవ అంతఃసూత్రం.
దైవ ప్రజాస్వామీకరణ అన్నప్పుడు అలనాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదివి, స్వాతంత్య్ర సమరయోధుడిగా, చివరకు పరమయోగిగా మారిన అరబిందో ఘోష్ వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది:
“I want to invoke … direct manifestation of the Divine in our entire being and daily life.” (… మన అంతరంగమంతటా, దైనందిన జీవితమంతటా దైవం ప్రత్యక్షంగా ఆవిష్కారం కావాలని దీక్ష వహిస్తాను.) – అరబిందో
దైవచైతన్యం ఈ నేల మీదనే అవతరిస్తుందని అరబిందో విశ్వసిస్తే, కలియుగదైవం సప్తగిరుల మీద అందకుండా ఆగిపోకూడదనీ, సామాన్యప్రజల చెంతకు చేరాలనీ భగీరథ ప్రయత్నం చేసినవారు రమణాచారి గారు. భగీరథ ప్రయత్నమని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఎంత ఐ.ఏ.ఎస్. ఆఫీసరైనా, ఆయన కూడా తన సంకల్పాలకు దేవస్థానం ధర్మకర్తల అనుమతులనూ, ప్రభుత్వనేతల ఆశీస్సులనూ పొందగలగాలి.
దేవస్థానం సంప్రదాయాల ప్రకారం శ్రీవైష్ణవులు మాత్రమే గర్భగుడి లోకి ప్రవేశించగలరు. తిరుమల తిరుపతి దేవస్థానం 75 సంవత్సరాల (1933-2008) చరిత్రలో గర్భగుడి లోకి ప్రవేశించిన తొలి కార్యనిర్వహణాధికారి రమణాచారి గారు. ఆయన శ్రీవైష్ణవుడు. నియమనిష్ఠలతో అర్చకత్వమూ నేర్చుకున్న వారు. తన అదృష్టం సరే! మరి సామాన్యుల మాటేమిటి?
“స్వామీ! నీ భక్తుల కోసం నువ్వే భక్తుల దగ్గరకు పోలేవా?” – ఇదీ రమణార్తి!
ఆయన సంకల్పం వలన ‘భజగోవిందం’ ద్వారా స్వామి గ్రామాలకు వేంచేశారు. ‘దళితగోవిందం’ ద్వారా వాడవాడలకూ చేరుకున్నారు. ఇది దైవ ప్రజాస్వామీకరణ కాక మరేమిటి?
తిరుమలేశుడు సాక్షిగా జరిగే వివాహాలు కలకాలం నిలుస్తాయనే నమ్మికతో ప్రారంభమైనది ‘కళ్యాణమస్తు’. అందుకయ్యే ఆర్థికవ్యయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుంది. ఈ ప్రకరణలో ఒక ఆసక్తికరమైన ఉదంతం కనిపిస్తుంది. బావామరదళ్ళే అయినా కట్నం అడ్డుపడి వివాహం క్లిష్టమైపోయి రమణాచారి గారిని ఆశ్రయిస్తారు రాజేష్, వసంతలు! రమణాచారి గారు ప్రేమికుల పెద్దలతో మాట్లాడడం ద్వారా కళ్యాణం జరిగిపోతుంది!
అత్యంత మహత్వపూర్ణంగా జరిగిన కార్యక్రమం ‘చతుర్యుగ బంధ భక్తిచైతన్య యాత్ర’. కలియుగ దైవసన్నిధి నుండి కృతయుగపు నరసింహ స్థానం సింహాచలానికీ, త్రేతాయుగపు శ్రీరాముడి క్షేత్రం భద్రాచలానికీ, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడి ఆలయం మొవ్వకూ సాగిన మూడురథాల యాత్ర, నాలుగు యుగాల అనుసంధానయాత్ర ఈ ఈ చైతన్యయాత్ర. ఈ యాత్రను సాకారం చేయడానికి రమణాచారి గారు పడ్డ కష్టాలు చదివితీరవలసిందే.
నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన ‘శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్’ కూడా రమణాచారి గారి సంకల్పసిద్ధే. అందుకు అవసరమైన కేంద్రప్రభుత్వ అనుమతులూ, ఆర్థిక వనరులూ, నిర్వహణా నైపుణ్యాలూ – ఆలోచన సులభమే గానీ ఆచరణలో ఎన్ని అవరోధాల్ని అధిగమించాలి!
పిల్లల కోసం పెద్దల కోసం ఆధ్యాత్మిక విషయ ప్రధానమైన ‘పుస్తక ప్రసాదం’, ఆర్థిక స్థోమత లేని ఆడపిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే ‘శ్రీ పద్మావతీ అమ్మవారి పుస్తక ప్రసాదం’ వంటివి ప్రజల వద్దకే దైవం వేంచేసే ఇతర కార్యక్రమాలు!
కాకతాళీయంగా బయటపడ్డ 32,000 అన్నమయ్య కీర్తనలు! 1978 లో పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ప్రారంభించిన ‘అన్నమాచార్య ప్రాజెక్టు’! లల్లాయి పదాలంటూ మొదట తృణీకరించి, పిదప పశ్చాత్తాపపడి, చివరకు అన్నమయ్య కీర్తనలను స్వయంగా స్వరపరచిన మహా సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి గారి వృత్తాంతం! అన్నమయ్య 600వ జయంతి ఉత్సవ సందర్భంగా 2008లో తాళ్ళపాక గ్రామంలో 108 అడుగుల విగ్రహావిష్కరణ! 1,116 మంది సంగీత కళాకారులతో సప్తగిరి సంకీర్తన! హైదరాబాద్ లో అన్నమయ్య అధ్యయన కేంద్రం ఏర్పాటు! అన్నమయ్య వారసులకు నెలసరి జీవనభృతి! సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షగళార్చన! … … … సాయంసంధ్యను అచ్చతెలుగులో ‘దివ్వెలెత్తు పొద్దు’ అని పిలిచిన అన్నమయ్యను తలచుకుంటూ, కొలుచుకుంటూ చాలావరకు తీరిన రమణార్తి రెండు ప్రకరణల్లో విస్తరించి కనిపిస్తుంది.!
చిత్రకారుడు శివకుమార్ చిన్నిలేఖ కలిగించిన గొప్ప ఆలోచన టీటీడీ అమృతోత్సవం! 2008లో టీటీడీ కి 75 సంవత్సరాలు నిండినట్లు ఉన్నతాధికారులెవరూ గుర్తించరు. శివకుమార్ తన లేఖ ద్వారా రమణాచారి గారి దృష్టికి తీసుకువస్తారు. చివరకు అమృతోత్సవం రాష్ట్రపతి చేత ప్రారంభమవుతుంది. అలిపిరిలో అమృతోత్సవ స్థూపావిష్కరణ జరుగుతుంది. ‘అక్షరామృతం’ సంచిక వెలువడుతుంది. ఉద్యోగులకు ‘స్వామివారి బంగారు డాలర్’ బహుమతులు లభిస్తాయి. ఇంత బృహత్కార్యం రూపుదాలుస్తుండగా ఉద్యోగుల మధ్య ‘రూల్ అఫ్ రిజర్వేషన్’ చిచ్చు రగులుతుంది! రమణాచారి గారి సహృదయతతో చల్లని మాటలతో దావానలం శాంతిస్తుంది! ఇదంతా మరొక ప్రకరణ!
“హరే శ్రీనివాసా!” అని వేడుకోగానే “సరే వెంకట రమణా” అంటూ ఎన్నో అభ్యర్థనలను అనుగ్రహించిన అంతటి శ్రీనివాసుడు కూడా దయచూపని సందర్భాలున్నాయి. అందులో ఒకటి ‘దివ్యభారతి’ – తిరుమల కొండ మీద రద్దీని తగ్గించే దిశగా అలిపిరి టోల్ గేట్ వద్ద 12 వరుసల రహదారిని నిర్మించడం లాంటి ప్రయత్నాలు. మరొకటి ‘ఆనందనిలయం అనంత స్వర్ణమయం’ – గర్భగుడి గోడల మీద లోపలా వెలుపలా బంగారు పూత పూయడం. ‘మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది’ అనే నానుడికి కూడా ఉదాహరణలు కావాలి కదా!
“టీటీడీ ఈఓ కన్నా పెద్ద పోస్టులోకి పంపిస్తున్నాను రమణా!” ముఖ్యమంత్రి పలుకులు. మరింత ఉన్నతమైన పదవిని చేపట్టే అవకాశం ఎలా విచారహేతువౌతుందో ‘ప్రాప్తం’ ప్రకరణలో చూస్తాం.
ఇక చివరిదైన ‘వేంకటాద్రి దిగి వేంకటాద్రి ఎక్కి’ ప్రకరణ చదువుతూ చదువుతూ మన హృదయాలు ఉద్విగ్నమవుతాయి. నయనాలు అశ్రుసరస్సులవుతాయి. అసలు ఈ ప్రకరణ శీర్షికే అత్యంత భావుకతతో పరిపుష్టమైనది – దిగినది వేంకటేశ్వరుడి కొండ, ఎక్కినది హైదరాబాద్ వెళ్ళే వేంకటాద్రి రైలు!
రైలెక్కడానికి ముందు ఆయనను కలవడానికి, కరచాలనం చేయడానికి, దూరం నుండైనా కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చిన అశేషజనసమూహాన్ని చూసిన రమణాచారి గారు కన్నీళ్ళ పర్యంతమవుతారు. వనవాసానికి వెళ్ళే రాముణ్ణి సాగనంపిన అయోధ్య ప్రజల కన్నీటి కాలువలు గుర్తొచ్చాయేమో నగరవాసానికి వెళ్తూ తిరుపతివాసుల కళ్ళను చూసిన రమణాచారి గారికి – వనవాసకాండకు సంబంధించిన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు ఈ అశ్రుమయమైన ఘట్టంలో! “శంఖమా! పోయివత్తునా! … చక్రమా! పోయివత్తునా!” అనే అన్నమయ్య పల్లవినీ ఉటంకించి తన కవితాత్మను మరోసారి చాటుకుంటారు. ‘ఉన్నకాలం’ నుండి ‘సన్నకాలం’ లోకి జారిపోయిన స్వామివారి సేవాసౌభాగ్య దినాలను నెమరువేసుకుంటూ తట్టుకోలేక విలవిలలాడుతారు.
2007 ఏప్రిల్ 22 నుండి 2009 జూన్ 19 వరకూ ఏడు కొండల మీద సాగిన తన జీవనప్రస్థానాన్ని రమణాచారి గారు మరచిపోలేరు. చదివితే మనమూ మరచిపోలేం.
“స్వామే భక్తుల దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?” టీటీడీ ఈఓ కాకమునుపే రమణాచారి గారు వేసుకున్న ‘వెర్రిప్రశ్న’తో మొదటి ప్రకరణ చదువరులకు కుతూహలం కలిగిస్తే, వివిధ అంశాల్లో తన ఆలోచనలను ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నారో తదుపరి ప్రకరణల్లో వర్ణిస్తారు రమణాచారి గారు. మనసా వాచా కర్మణా కొలిచిన శ్రీనివాసుడికీ, సహోద్యోగులకూ, ఆత్మీయులకూ వీడ్కోలు పలకడమే చివరి ప్రకరణ.
రెండు నెలల్లోనే మూడు ముద్రణల్లో వెలువడిన ఈ రచన పాఠకుల అశేషమైన ఆదరణకు నిదర్శనం! రమణాచారి గారి ఆధ్యాత్మిక సేవలను ప్రత్యక్షంగానూ, వ్యక్తిత్వాన్ని పరోక్షంగానూ ప్రతిబింబించే ఈ పుస్తకం హస్తభూషణమే కాదు, హృదయపోషకం కూడా!
(‘హరే శ్రీనివాసా’ రచయిత డా. కె.వి. రమణాచారి, ప్రచురణకర్త ఎమెస్కో, పుటలు 192, వెల రూ. 150.)
chittiprolu Subbarao
chittiprolu Subbarao
చిట్టిప్రోలు సుబ్బారావు చార్టర్డ్ అకౌంటెంట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (రిటైర్డ్) హైదరాబాద్ రచనలు: అక్షరమేఘాలు (కవితాసంపుటి) కవి 9701049000
హోటల్ అశోకా. నగరం నడిబొడ్డు లాంటి లక్డీ కా పూల్ లోని ఒక మోస్తరు హోటల్. పాతతరం వారికి బాగా తెలిసిన హోటల్. కొత్తగా బిల్డింగులు వచ్చీ రోడ్డు మధ్యలో ఎత్తైన మెట్రో కట్టీ ఇప్పుడు అంతగా బయటకు కనిపించని హోటల్. అయినా కొంతమందికి ఇప్పటికీ హైదరాబాద్ లో విడిది అంటే అశోకా హోటలే.
ఖద్దరులాల్చీ తొడుక్కుని నూలుపంచె కట్టుకున్న ఆ పెద్దమనిషి హోటల్ నుండి బయటకొచ్చాడో లేదో అప్పుడే సన్నగా మొదలైంది వర్షం. ఆలస్యమవుతుందనిపించినా ఎందుకైనా మంచిదని వెనక్కిమళ్ళి హోటల్ లాంజ్ లోకి వెళ్లారు. ఆయన్ని చూసి విషయం గ్రహించింది రిసెప్షనిస్టు కుశాగ్ర. తమ హోటల్ అతిథుల సౌకర్యం కోసం అలమరాలో సిద్ధపరచిన గొడుగుల్లోంచి ఒకటి తీసిచ్చింది. ఇటువంటి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటున్న యాజమాన్యం శ్రద్ధ వల్లనే ఈ హోటల్ ఇప్పటికీ రాణిస్తుందనుకుంటూ పంచెకట్టుమనిషి మళ్ళీ బయటకు నడిచాడు.
సాయంకాలం ఆరుగంటలవుతోంది. అందరూ ఆఫీసుల నుండి ఇళ్ళకెళ్ళే సమయం. ఇళ్ల నుండి పార్కులకూ సినిమాలకూ వెళ్లే సమయం కూడా. అందువల్ల కార్లతో ఆటోలతో రద్దీ ఎక్కువగానే ఉంది. వర్షం వల్లనేమో స్కూటర్లూ మోటార్ సైకిళ్ళూ కొంచెం తక్కువగా ఉన్నాయి.
రోడ్డుకు బాగా ఎడమ ప్రక్కగా అడుగులేస్తూ వర్షానికి తడవకుండా గొడుగు పట్టుకుని రవీంద్రభారతి వైపు వడివడిగా నడుస్తున్నాడు అరగంట ముందే గమ్యం చేరుకునే అలవాటున్న ఆ పంచెకట్టుమనిషి. తనను హైదరాబాద్ కి ఆహ్వానించినవాళ్ళు కారు పంపిస్తామని చెప్పినా ఇంత తక్కువ దూరం కోసం వృధాఖర్చని తనే వద్దన్నాడు.
ఇంకో నాలుగడుగులు వేసేసరికి అంత ట్రాఫిక్ లోనూ రోడ్డుకు ఒక వారగా ఆగిపోయిన పెద్దకారొకటి కనిపించింది. తల మీద టోపీ పెట్టుకుని తెల్లటి యూనిఫామ్ ధరించిన డ్రైవర్ వానలో తడుస్తూ తెరిచిపెట్టిన బోనెట్ లో ఏవో వైర్లు సరిచేస్తున్నాడు.
కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన సూటూబూటుమనిషితో కళ్ళూకళ్ళూ కలిశాయి పంచెకట్టు మనిషికి. క్షణం సేపట్లోనే అర్థమైంది సూటూబూటుమనిషి భావం ‘గొడుగులో నాకూ కాస్త చోటిస్తారా’ అని.
“ఇక్కడే రవీంద్రభారతిలో అర్జెంట్ ప్రోగ్రాముంది. నన్నక్కడిదాకా తడవకుండా మీ గొడుగునీడలో తీసుకెళ్తారా! ప్లీజ్!”
“ఈరోజే కొట్టించుకున్న కోటు. మీరేమీ అనుకోకపోతే …”
విషయం గ్రహించిన పంచెకట్టుమనిషి గొడుగు నుండి కొంచెం బయటకొచ్చి తన దుస్తులు ఒక భాగం తడుపుకుంటూ నడుస్తున్నాడు. అంతలో వెనుక నుండి ఆ పెద్దకారు వచ్చి సూటూబూటుమనిషి ప్రక్కన ఆగింది. అతడు వేగంగా డోర్ తీసి అంతకంటే వేగంగా ‘థాంక్స్’ చెప్పి కారులో కూర్చుని రయ్యిమన్నాడు.
“పోనీలే పాపం. కారు స్టార్టయ్యింది. లేదంటే ఆ డ్రైవర్ కి ఇంకెన్ని తిట్లు పడేవో” అనుకుంటూ ఇక ఏమాత్రం తడవకుండా నడక సాగించాడు పంచెకట్టుమనిషి, కళాభవన్ ప్రాంగణం దాటుకుంటూ.
తన కొత్తకోటు తడవనందుకు చాలా సంతోషంగా ఉంది కారులో పోతున్న సూటూబూటుమనిషికి. ముంబైలో రేమాండ్స్ షాపుకు తనే స్వయంగా వెళ్లి తనకు నచ్చిన ఒకలాంటి బ్లూ కలర్ క్లాత్ కొనుక్కుని హైదరాబాద్ లోని ఖరీదైన టైలర్ తో మనసుపడి కొట్టించుకున్న కోటు మరి. “ఈ రోజు ప్రోగ్రాం కోసమే కుట్టించుకున్న కోటు తడిసిపోయుంటే … ?” తడవనందుకు చాలా రిలీఫ్ ఫీలై టై నాట్ మరికొంచెం క్రిందికి లాక్కున్నాడు.
రవీంద్రభారతి ఆవరణ లోకి అడుగుపెడుతుండగా గేటుకు ఒకప్రక్కన కట్టిన ప్లాస్టిక్ బ్యానర్ కనిపించింది పంచెకట్టుమనిషికి. నగరంలో పెద్దపేరున్న ‘చంద్రవంక కళావాహిని’ సంస్థ వారు ఒక సంగీతవిద్వాంసుడికి ఒక పెద్ద ఆఫీసర్ చేతుల మీదుగా చేస్తున్న సన్మానం. అదీ ఆ బ్యానర్ సారాంశం.
రవీంద్రభారతి హాల్లో ముందువరుస సీట్ల వైపు వెళ్ళబోయి స్టేజి మీద సూటూబూటుమనిషిని చూసి లిప్తపాటు ఏదో ఆలోచించుకుని సన్నగా నవ్వుకుంటూ తల మీద ఉత్తరీయం కప్పుకుంటూ వెళ్ళి హాల్లోని చివరివరుస సీట్లో కూర్చున్నాడు.
“ఈనాటి సభకు కథానాయకులైన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ప్రాచీనమూర్తి గారు సభకు ఏ క్షణమైనా రావచ్చు. ముఖ్య అతిథీ సన్మానకర్తా ప్రభుత్వ సాంస్కృతికశాఖ అధ్యక్షులూ శ్రీ అధునాతన్, ఐ.ఏ.ఎస్. గారు సభకు ఇప్పటికే విచ్చేశారు. వేదిక మీదే మీ ముందున్నారు. మీ కరతాళధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ … వారికి ముఖ్యమైన మరో ప్రోగ్రాం ఉన్నందువలనా సమయాభావం వలనా ప్రకటించిన సమయానికి ముందుగానే ఇప్పుడే తమ ప్రసంగం వినిపించి వెళ్ళిపోతారు. …” సభానిర్వాహక కార్యదర్శి పరిచయవాక్యాలు పలికి మైకును శ్రీ అధునాతన్ గారికి అందజేశారు.
“సభాసరస్వతికి నమస్సులు. నేను తెలుగువాణ్ణే. ఇంట్లో మాతృభాషే మాట్లాడాలన్న నియమం పెట్టుకున్న కుటుంబం నుండి వచ్చాను. కానీ పుట్టిందీ పెరిగిందీ మొన్నటిదాకా ఉద్యోగం చేసిందీ ఇతర రాష్ట్రాల్లో కాబట్టేమో నాకు తెలుగు సంగీతవిద్వాంసుల గురించి పెద్దగా తెలియదు. సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా ఈరోజే బాధ్యతలు తీసుకున్న నేను శ్రీ ప్రాచీనమూర్తి గారి ప్రాభవం గురించి విన్నాను గానీ వారి పాండిత్యం గురించి ఇంకా తెలుసుకోవలసి ఉంది. ఈ సాయంత్రం మనం సన్మానించుకోనున్న ఆ మహనీయుణ్ణి నేనిప్పటిదాకా చూడనే లేదు. వారెక్కడన్నా తారసపడ్డా గుర్తుపట్టలేని అశక్తుణ్ణి నేను. తాము బసచేసిన హోటల్ నుండి బయలుదేరారట. ఏ క్షణమైనా ఇక్కడకు రావచ్చట. వస్తూవస్తూ దారిలో వారు అమృతవర్షిణి రాగం ఆలపిస్తున్నారేమో. అందువల్లనే ఇక్కడ వర్షం కురుస్తోందేమో. రాగానే వారితో దీపక్ రాగం పాడించుకోవాలి. వాతావరణం వెచ్చబడుతుంది. …” ప్రసంగం ముగించి ప్రేక్షకుల చప్పట్లతో ప్రతిధ్వనిస్తున్న సభామందిరాన్ని నలువైపులా తిలకిస్తూ కోటుజేబుల్లో చేతులుపెట్టుకున్నారు శ్రీ అధునాతన్ గారు గర్వంగా.
రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తల మీది ఉత్తరీయం తీసి వేదిక వైపు నడిచాడు పంచెకట్టుమనిషి. అల్లంత దూరం నుండే ఆయన్ను చూసిన సభానిర్వాహకులు పరుగుపరుగున వచ్చి పంచెకట్టుమనిషిని సాదరంగా వేదిక మీదికి తోడ్కొనివెళ్ళారు.
పంచెకట్టుమనిషీ సూటూబూటుమనిషీ వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నారు. మరోసారి కలుసుకున్న ఆ రెండుజతల కళ్ళు ఏం మాట్లాడుకున్నాయో తెలియదుగానీ ఎవరిలోనూ తొట్రుపాటు లేదు. ఇంతకుముందొకసారి కలుసుకున్నామన్న భావనే లేదు ఇద్దరి ముఖాల్లో.
మరో ప్రోగ్రాం కోసం త్వరగా వెళ్ళిపోవాలన్న శ్రీ అధునాతన్ గారు సభ ఆసాంతం ముందువరుస కుర్చీలో కూర్చుని ప్రాచీనమూర్తి గారి రాగాలన్నీ వింటూ మైమరచిపోయారు. పాటపాటకూ మధ్య వచ్చే కొద్ది క్షణాల విరామంలో తననెవరూ గమనించకుండా తన కోటును తానే పదేపదే ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.
చివరగా పాడిన దీపక్ రాగం తరువాత సన్మానకార్యక్రమం మొదలైంది.
మళ్ళీ వేదిక మీదికి వచ్చిన శ్రీ అధునాతన్ గారు సరాసరి వేదిక ప్రక్కనున్న గదిలోకి వెళ్లి రెండు నిమిషాల తరువాత తిరిగివచ్చారు. ఇప్పుడతడి శరీరం కొంత తేలికపడింది. మనసు బాగా తేటపడింది.
శ్రీ అధునాతన్ గారు శ్రీ ప్రాచీనమూర్తి గారికి పూలమాల వేసి శాలువా కప్పి సన్మానపత్రం సమర్పిస్తున్నప్పడు వారిద్దరి చూపులు మళ్ళీ నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాయి.
ఇంటికొచ్చిన భర్త అధునాతన్ ను మురిపెంగా చూసుకుంది అతడి అర్థాంగి. అతడి ప్రసంగాన్నీ సన్మానకార్యక్రమాన్నీ టీవీలో కళ్ళార్పకుండా చూశానంది. స్వంత రాష్ట్రం లోకి వచ్చిన మొదటి రోజే అధునాతన్ ఇంత గొప్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గోవటం మనసుకు తృప్తినిచ్చిందనీ, ఆ సభను తాను ప్రత్యక్షంగా తిలకించలేకపోవటం తన దురదృష్టమనీ కళ్ళు తిప్పుకుంటూ భర్తతో చెప్పుకుంది.
అంతగా మనసుపడి కుట్టించుకున్న కోటును సన్మానం చేసే సమయంలో వేసుకోలేదేంటని అడిగింది. జరిగిన విషయం ముచ్చటించుకుని ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా, టైనీ కోటునూ ఏమాత్రం విడవని దర్పం భర్తది. తనెన్నో సార్లు చెప్పి చూసింది అవసరం లేని సందర్భాల్లోనూ ఈ డాబుసరి వేషమెందుకని. కానీ ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తు ఈరోజు తన కోరిక తీరింది.
దొడ్డతనానికి దుస్తుల కంటే వ్యక్తిత్వమే నిజమైన గీటురాయని తన భర్తకు కనువిప్పు కలిగించిన వర్షానికీ పంచెకట్టుమనిషికీ మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది శ్రీమతి నమ్రత.
పూశిశువుకు పాలపీకనై
జీవరసాలను కుడిపికుడిపి
తల్లి కాని తల్లినవుతాను
కష్టసుఖాల సంవేదనలను
అటుయిటు మోసుకుపోతూ
చెట్టుకూ పూవుకూ నడుమ
పచ్చటి చిరువంతెననవుతాను
పూవును చెట్టునుండి విడదీసే
కఠినమైన బాధ్యతను నాపై పెట్టింది ప్రకృతి
ప్రేగుతో బిడ్డ తల్లిని వీడినట్లు
ఒకనాటికి నాతోపాటు పూవూ
చెట్టును వీడి నేలరాలుతుంది
నన్నే తల్లిగా తలపోస్తూ
గట్టిగా హత్తుకునుండే పూవు
గాలికీ ఎండకూ కమలిపోయి
మట్టిలో కలిసిపోతూ కంటతడిపెట్టుకుంటూ
చివరివరకూ కనిపెట్టుకునున్న నన్ను
ఓరిమికవచంగా కొనియాడుతుంది
జీవితాంతం నన్నంటిపెట్టుకున్న పూవు
తుదిశ్వాస విడిచాక
నా బాధ్యత తీరిపోయినట్లే
ఇక నా పాత్రా చివరి అంకానికి చేరినట్లే
రంగూ రూపం తేనే తావీ
కలగలిసిన భువనైకసౌందర్యం పువ్వు
విత్తుకూ వేరుకూ ఆకుకూ రెమ్మకూ
కొమ్మకూ మానుకూ లేని విలువ
నేను సాకిన పువ్వుకే
చెట్టుకిరీటంలో
మెరిసే అనర్ఘరత్నం పువ్వే
ఆ పూవుకు జీవితాంతం సేవలు చేసిన నన్ను
కనీసం ఆయాగా గుర్తిస్తారా ఎవరైనా
మనసారా ఒక పద్యం రాస్తారా ఎపుడైనా
పిడికిళ్ళు బిగుసుకుని
సంకెళ్ళు సడలినట్లు
ఛాతీలు ఉప్పొంగి
జైలుగోడలు బ్రద్దలై కూలినట్లు
స్థంభించిన గాలి
ఒక్కసారిగా నలుదిశలా వీచినట్లు
కలలు నిజమై
కళ్ళు తారకలైనట్లు
రెక్కలు రెక్కలై
ప్రతి మనిషీ స్వేచ్ఛావిహంగమై
నింగిలోకి ఎగిరినట్లు
నాటి జనుల భావోద్వేగాలు
నేటి మన హృదయ ప్రకంపనల్లో
మూడు రంగుల రెపరెపల్లాగా
నూరు కోట్ల కెరటాల్లాగా
వందేమాతరం! జైహింద్!
… సి యస్ ఆర్
మూడు చీమలు
భద్రాచలం క్షేత్రంలో మంచిమిత్రులైన మూడు చీమలుండేవి. అవన్నీ ఒకసారి పాపికొండలు చూడాలనుకున్నాయి. ఒక్కొక్కటి ఎవరి దారిలో వారు వెళ్ళి పాపికొండల్లో కలుసుకోవాలనే షరతు విధించుకున్నాయి.
గోదావరి ఒడ్డుకు చేరిన మొదటి చీమకు అక్కడ ఒక పడవ కనిపించింది. మనుషుల మాటలు విని ఆ పడవ పాపికొండలకు వెళ్తుందని అర్థం చేసుకుని పడవ మీద అపాయం లేని ఒక మూలన కూర్చుని ప్రయాణమైంది.
రెండవ చీమ గోదావరి ఒడ్డునే నడచుకుంటూ పాపికొండల వైపు సాగిపోయింది.
మూడవ చీమ కళ్ళుమూసుకుని దేవుడికి ప్రార్థించి గోదావరి నదిలోకి దూకేసింది.
ముందుగా మొదటి చీమ పాపికొండలు చేరింది. ఇద్దరు మిత్రుల కోసం ఎదురుచూసింది. ఎట్టకేలకు రెండవ చీమ చాలా ఆలస్యంగా వచ్చి మొదటి చీమను కలిసింది. ఇక ఆ రెండు చీమలూ మూడవ చీమ కోసం నిరీక్షించాయి. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. కానీ మూడవ చీమ జాడే లేదు. చేసేది లేక రెండు చీమలూ కలిసి తిరుగుప్రయాణానికి భద్రాచలం వెళ్ళే పడవెక్కాయి.
భద్రాచలం చేరగానే రెండు చీమలూ సరాసరి మూడవ చీమ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాయి. బయటకు వచ్చిన చీమ దిగులుగా జరిగిన విషయం చెప్పింది.
భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన మూడవ చీమ నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో ఈదటం మొదలుపెట్టిందట. కొంతసేపటికి అలసిపోయిందట. కళ్ళు తేలేసి నదిలో కొట్టుకుపోతున్న ఆ చీమను ఎదురుగా వస్తున్న ఒక తాబేలు చూసి తన వీపు మీదకు ఎక్కించుకుందట.
చీమ పాపికొండలు పోవాలని తాబేలుకీ, తాబేలు భద్రాచలం పోవాలని చీమకూ అర్థమైంది. తాబేలు వెనక్కు వెళ్ళదు . చీమ తనంతట తాను ఈదుకుంటూ పాపికొండలు వెళ్ళలేదు. బతికుంటే పాపికొండలు మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చని తాబేలుతోపాటు భద్రాచలానికే తిరిగివచ్చింది మూడవ చీమ.
విషయం మళ్ళీమళ్ళీ చెప్పీ చెప్పించుకునీ మూడు చీమలూ పెద్దగా నవ్వుకున్నాయి. కానీ మూడవ చీమకు లోలోపల ఎక్కడో తీరని దుఃఖం మిగిలిపోయింది. ఆ రాత్రంతా నిద్రపట్టక అల్లాడిపోయింది.
మరుసటి రోజు తాను చేసిన పనికీ ఇద్దరు మిత్రుల పనులకూ గల తేడా ఏమిటోనని ఆలోచించుకుంటే విషయం అర్థమై మనసు కుదుటపడి హాయిగా నిద్రపోయింది.
“ఏదైనా గమ్యం చేరాలంటే దేవుడిచ్చిన తెలివితేటల్ని వాడుకోవాలి. దేవుడిచ్చిన దేహంతో కష్టపడాలి. అంతేగానీ దేవుడి మీద భారం వేశామనుకుని గుడ్డిగా ప్రవర్తించకూడదు, తన ప్రయత్నం మానకూడదు.”
