నాకు తెలుసు, నాకు తెలుసు అంటూ కాంతం నోరు నొక్కేసినప్పుడల్లా ఏదో తెలియని విజయగర్వం తలెత్తుత్తుండేది. కానీ ఇప్పుడు తెలుస్తున్నది. నాకు ఏమీ తెలియదని. ఒంటిచేత్తో సంసారాన్ని లాగుకొస్తున్నాననే అనుకున్నానుగానీ సగం భారం నాకు తెలియకుండా తానూ మోస్తుందనుకోలేదు. ఇదంత అబద్ధమైపోతే బావుండు. ఈ వారం రోజుల నరకయాతన చాలు. ‘నేను’ అంటే ఏమనుకున్నావు?’ అని కళ్ళెగరేస్తూ కాలరెగిరేస్తూంటే, తిరిగి తిరిగి చూసే కాంతం నాకు కావాలి. ఈత నేర్చిన చేపపిల్ల అన్నప్పుడల్లా ముసిముసిగా నవ్వుకుంటూ పనిలో నిమగ్నమయ్యే నా కాంతం కావాలి. నా కాంతం నాకు కావాలి’’ ఈతి బాధలంటే ఏందోయ్ ఇవ్వే కదా…!’ అని నేన్నప్పుడల్లా సమయస్ఫూర్తిగా సర్దిచెప్పేనా కాంతం కావాలి కాంతం కావాలి. ఇంతకన్నా ఈతిబాధే ముంటుంది. కాంతంలేని బతుకొద్దు, కాంతం కావాలి కాంతమే కావాలి.
* * *
దుర్గయ్యకు, ఒక్కగానొక్క బిడ్డ కమలమణి. రాధమ్మ తల్లి పేరునూ, దుర్గయ్య తల్లి పేరునూ ఇద్దరిదీ పేర్లూ వచ్చేలా పెట్టుకున్న పేరు.
సింగారగ్రామం పట్టణానికి దగ్గరలో ఉన్నది కాబట్టి కమలమణి చదువుకు ఆటంకం లేకుండా డిగ్రీవరకు పూర్తి చేసుకున్నది. తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఎన్నడు పోని ఊళ్ళకు పోయి, ఎప్పుడు కలవని మనుషులనూ కలిసి, వెతికి వెతికి సుధాకర్ను దొరకబట్టాడు. అందగాడు, యోగ్యుడు, ఆస్తిపరుడు, అయినవాడు. ఇంకేం?
‘‘తల్లీ! నీకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా.’’
‘‘ఏం నాన్నా ఎందుకు ఆ అనుమానం వచ్చింది?’’ ముసిముసి నవ్వులతో కమల సమాధానం. ‘‘ఆ ఏం లేదు, ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, నిన్నటి నుండి ఎట్లాగో అదోలా ఉన్నావు అని…’’ తండ్రి మాటలకు కళ్ళ నీళ్ళు తిరిగిన కమల ‘‘ఆయన నచ్చిండన్న సంతోషం కన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది గదా అనే భయం పట్టుకున్నది నాన్నా’’ అన్నది.
ఆ మాటలకు దుర్గయ్య ఒక్కసారి తనను తాను నమ్మలేకపోయాడు. ఒక విధమైన ఆశ్చర్యము, ఒక విధమైన ఒణుకు కలిగింది. ఆడపిల్లలు అమ్మా నాన్నల దగ్గర ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి చేసుకొని మరొకరితో జీవితం పంచుకోవాలని ఉన్నా తెలియని సంకెళ్ళవో పడబోతున్నాయని భయపడ్తారు. కాని తల్లిదండ్రులకు చెప్పరు, తెలియనివ్వరు. ఇవన్నీ తెలిసిన తండ్రే దుర్గయ్య. కమలను కన్నీళ్ళను పలకరిస్తూ ‘‘తప్పదు కదా బిడ్డా….’’ గాద్గిక స్వరం. ఒక ఇక్కడ ఉండలేక వెళ్లిపోయాడు.
* * *
పెంకుటింటి ముందు పెండ చాన్పి పచ్చగా మెరిసిపోతున్నది. వాకిలంతా తెల్లని ముగ్గులు నవ్వుతున్నయి. ఆ చిన్న ఇంటికే ప్రహరీగోడ పొందికగా ఉన్నది. దానికి ద్వారతోరణంగా మామిడాకులు సాదరంగా ఆహ్వానిస్తున్నవి. పందిరి గుంజలకు బంతిపూల దండలు వేళాడుతూ అందరిని పలకరిస్తున్నట్లున్నవి. పైనుండి కొబ్బరి మట్టలూ, పెండ్లి మంటపానికి కట్టిన అరిటాకులు ఆకుపచ్చదనంతో పోటీపడ్తున్నవి. పండ్లూ ఫలహారాలు తింటూ పిల్లలు అటు ఇటూ పరుగులు దీస్తున్నారు. ఇంటిముందు చావిడిలో అందరు కూర్చోడానికి చాపలు వేసి ఉ్ననవి. అటు ఇటు ఎండదగులకుండా తడకలు కట్టున్నవి. ఇంటి గోడలపైన ప్రహరీ గోడలమీదా వేసిన బొమ్మలు, జరగబోయే పెండ్లి తాలూకు సంబరాల్ని తెలుపుత్నువి. తెల్ల సున్నం గోడకు, ఎర్రని జాజుపట్టీల రేఖా చిత్రాలు, గీతలబొమ్మలు భలే అమాయకత్వపు అందాలతో ఆకర్షిస్తున్నవి. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే కొందరు పెద్దోళ్ళు చూస్తున్నారు. గణపతి పూజకాగానే ‘‘పెండ్లి పిల్లను తీసుకురావాలే’’ అని అయ్యగారు అనగానే సన్నాయి మేళం గట్టిగా వాయిస్తున్నరు. ‘‘బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెండ్లి జరిగేనే….’’ కదా! ఎంత ఆశ్చర్యం. పెండ్లి కూతురు అనగానే సిగ్గుల మొగ్గయిపోయి, ఏదో కొత్త కళతో చెప్పనలవి కాని అందంతో ఉంటారు వధూవరులు. ‘‘మాంగల్యం తంతునా….’’ మనోవాక్కాయ కర్మేణా ఒకరికొకరు ఒదిగి ఉండే అద్భుత జీవన ఘట్టానికి నాంది పెళ్ళి. దుర్గయ్య, రాధమ్మలు కన్యాదానం చేయడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు జిలకరబెల్లం పెట్టుకున్న ఆ జంటపై అక్షతలు వేస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తరువాత జరుపబోయే తలంబ్రాల తంతు కోసం ఆత్రంగా చూస్తున్నారు, ఎక్కడో ఆడుతున్న పిల్లలూ బిలబిలమంటూ వచ్చి చేరిపోయారు మంటపం దగ్గర. అయ్యవారు చెప్పినట్టు ఒద్దికగా తలంబ్రాలు పోసుకున్న జంటనే ఇక పోటీపడి తలంబ్రాలు పోసుకోవడం అందరికీ ఓ సరదా. అప్పటివరకూ ఉన్న ఉద్వేగపూరిత, భయపూరిత వాతావరణం మొత్తం ఈ తంతుతో చల్లబడి, ప్రశాంతత తెస్తుంది.
పెళ్ళి భోజనాల కోసం మగపెళ్ళి వారిని పిలవడానికి చేతిలో కుంకుమ కాయ పట్టుకోని పోయినారు, పెండ్లి పిల్ల తల్లి రాధమ్మ, ఆమె వెనుక దుర్గయ్య. అక్కడ ఏడుపు వినిపిస్తున్నది, ఆడపడుచు సత్య చుట్టు బంధువులు చేరి బుజ్జగిస్తున్నారు. విషయం తెలుసుకోగా, ఆడబిడ్డ కట్నం ఇప్పుడు ఇయ్యకుంటే పెళ్ళి ఇంట్లోంచి తినకుండా పోతనంటున్నడు మా ఆయన అని! మాట ముచ్చట్లల్లో మాట్లాడుకున్న కట్నం నేను ఇచ్చేశానే అన్నాడు దుర్గయ్య. వియ్యంకుడు దగ్గరికొచ్చి, అనుకోని అవసరం బడి ఆ డబ్బులు వాడుకున్న, పంట ఇంటికొచ్చిన తర్వాత బిడ్డకు అల్లునికి పిలిచి కట్నం బెడ్దామనుకున్నాం అన్నాడు. ఇంత కష్టపడి ఇంత జేసినాక ఆడపిల్ల ఏడ్చుకుంటు పోవడమేందని ఆలోచించుకొని, దుర్గయ్యనే ఇస్తానన్నాడు. కొద్దిసేపటికి సర్దుబాటు చేస్తేగానీ అందరూ ఆనందంగా భోజనాలు చేయలేదు. అప్పుడే తెలిసింది కమలమణికి, మోయాల్సిన బాధ్యత ఉంటుంది చాలానే అని!
* * *
రామాపురంలో ఊరు పెద్దదే, లింగయ్య కుటుంబమూ పెద్దదే. ఉన్న కొద్ది పంట చేన్లతోపాటు, చేసుకునే బడిపంతులు ఉద్యోగంతో ఎట్లాగో అట్లా నెట్టుకొస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు. భార్య చనిపోయేవరకే ఇద్దరాడపిల్లల పెండ్లిళ్ళు చేసిండు. పెద్ద కొడుకు సుధాకర్ పెండ్లి హడావిడి తగ్గింది. పదిమందిల పరువు కాపాడిన దుర్గయ్యను తలుచుకుంటుంటేనే కోడలు కమలమలమణి ఛాయగిలాసతో లోపలికొచ్చింది.
చేతికున్న గోరింటాకు ఇంకా పోలేదు. కొత్త పెండ్లి పిల్ల అప్పుడే ఇంటి పని చేస్తున్నది అనుకుంటూ ‘‘ఏం సంగతులు కమలమ్మా! చిన్నబోయి ఉన్నవు, అమ్మ నాయన యాదికొస్తున్నారా ఏంది?’’ అన్నాడు కోడలితో లింగయ్య.
‘‘అయ్యో అదేం లేదు మామయ్యా!….’’ అని అక్కడే ఆగిన కోడలుతో ‘ఏందమ్మా ఏదో చెప్పబోయినవ్, మళ్ళీ ఆగిపోయినవ్, ఏందో చెప్పు’’ అన్నడు.
‘‘నేను బడిలో ఉద్యోగం కోసం పోదామనుకుంటున్న మామ… మీకు చెప్పినాంక దరఖాస్తు బెట్టుకొమ్మన్నడు ఆయన’’ అని ఆగింది. ‘‘ఉద్యోగం జేస్తవా?’’ ఆశ్చర్యంగా అంటున్న మామగారి నుండి మరిన్ని మాటలు ఆశించకుండా.
‘‘మీ కొడుకు సంపాదన సరిపోదనిగాదు, మనకున్నవి తక్కువనిగాదు గాని ఇంత చదువుకున్న ఉట్టిగానే ఇంట్ల కూచోబుద్దయిత లేదు, టీచర్ జాబ్ అయితే మంచిగుంటదని….’’ ధైర్యంగా అన్నది కమల.
‘‘సరే! మావోడు సరేనన్నాడా? ఇంటెడు చాకిరి చేసుకోనిపోయి మళ్ల బళ్ళె చెయ్యాల్నంటె కష్టంగాదా?’’ తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ
‘‘ఏంగాదు మామయ్య, ఈ కాలంల అందరు చేస్తున్నరు గదా… ఏదో ఓటిచేసుకొని, కష్టపడదాం’’ అన్నది ధైర్యంగా.
ఆమెలోని పట్టుదల చూసి సరే అన్నడు లింగయ్య. సంబరపడిపోతూ భర్త సుధాకర్ దగ్గరికి ఉరికింది కమలమణి.
* * *
కుండపోత వాన కురుస్తున్నది. రోడ్లన్నీ జలమయమైపోయినవి. సందు సందులకు చేరుతున్న ఇళ్ళ చూర్లనీళ్ళన్నీ పల్లం కోసం పరుగులు తీస్తున్నవి. ఆకాశానికి భూమికి నీటి వంతెన ఏర్పడ్డట్టు ఎడతెగని వాన. ఇంట్లో నిండు చూలాలి ప్రసవ వేదన. ‘‘అమ్మా! అమ్మా నొప్పి! నొప్పి!’’ అరుపులు మేఘగర్జనల్లో కలిసిపోతున్నవి.
కమలమణి ఆ గడపలో కాలుబెట్టినప్పటి నుండి ఆమె చేతులమీదుగా ఇది రెండో కాన్పు! పెద్దాడ బిడ్డ మల్చూరు కాన్పు, ఇప్పుడు చిన్నాడి బిడ్డ తొల్చూరు కాన్పు. వానను సైతం లెక్కచేయక భర్త సాయంతో ఎడ్ల బండిలో చిన్నాడ బిడ్డ నెక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకొనిపోవడం, పెద్దాపరేషన్ చేయించడం, ఇంటికి తీసుకొచ్చి బాలింతకు సేవలు చేయడం, చంటిపిల్లవాణ్ణి సాకడం, ఆమెను అత్తగారింటికి పంపేదనుక కన్నతల్లిలాగా కమలనే చేసింది. తనకోవైపు వేవిళ్ళు, అన్నం సయించకున్నా, చేతగాకపోయినా పంటి బిగువున భరిస్తూ అన్ని పనులు చేసింది. కాలం దెచ్చే సంబురాలు ఆ ఇంటిలో విరిసినవి.
దుర్గయ్య, రాధమ్మలు వచ్చి తొలి కాన్పుకు తల్లిగారింట్లో జరగాలని కమలను తీసుకుపోవడంతోగాని ఆమెకు విశ్రాంతి దొరకలేదు. చదువులకని పట్నంల ఉన్న మరిది మధ్య మధ్య వీళ్ళింటికి వచ్చిపోతూ అన్న సుధాకర్కు ఎప్పటికప్పుడు ఇక్కడి ముచ్చట్లు చేరవేస్తుండేది. సుఖప్రసవం అయ్యి, బిడ్డను చూసుకునే దాక ఆమె మనసంతా, అత్తగారింటి మీదికే పొయ్యేది. ఇట్లా ఇరువై ఒక్కటి అయ్యిందో లేదో నెలలోపే అత్తగారింటికి వెళ్ళిపోయింది. బ్రతిమిలాడితేగాని అన్నం తినని తమ గార్వాల బిడ్డేనా అని కమలలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు.
* * *
టీచర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ‘‘బతకలేనోళ్లు బడిపంతుళ్ళు’’ కాని ఇప్పుడు బతకనేర్చినోళ్ళు బడి పంతుళ్ళు’’. సమాజ పోకడలతో తానూ జతకడుతూ చదువు చెప్పడం, అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. అయినా ఏ మాత్రం బెదరక ఏ మాత్రం ‘పని’ మానక పనులు చేస్తూ చేస్తూ ‘తనకు ముగ్గురు సంతానమయిన తర్వాత కమల ఉద్యోగం వదిలేసింది. ఆమె ఆ నిర్ణయాన్ని ముందు భర్తకే చెప్పింది.
ముసలివాడైన మామ మంచాన బడడం, ఆడబిడ్డలిద్దరి బాధ్యతలు చూడడం, ఒకరి తరువాత మరొకరు ముగ్గురు పిల్లలవ్వడం, ఒచ్చిపోయే ఇల్లు, ఇక తన వల్లగాదని మానేసిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా భావించింది కమల. ఈ మధ్యలో మరిది చదువు పూర్తయ్యి, ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకూ పెండ్లి చేసే బాధ్యత అన్నా వదినలదే అయ్యింది. ఉన్న పొలంలో ఏదో కొంత పంట పండినా, చెల్కలన్నీ అమ్మేసి పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. గవర్నమెంటు ఉద్యోగం, మధ్య మధ్య ట్రాన్స్ఫర్లు సుధాకర్కూ కష్టమైపోతుండేది. ఎక్కడ ఉద్యోగముంటే అక్కడ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఒక్కడే ఒండుకుంటూ ఉండేవాడు. శని, ఆదివారాలు ఒచ్చిపోతూ ఉండేవాడు. పెళ్ళయ్యి రాగానే కమల తమ పెరట్లో నాటిన మందార చెట్టు ఇప్పుడు పెరిగిపెద్దయ్యింది. ఏం మారతాయి? శరీరంలో సత్తువ తగ్గడం, ఎముకలు కుంగడం తప్ప. ఎప్పుడూ ఖాళీగా ఉండడం, నింపాదిగా తినడం, హాయిగా పడుకోవడమే తెలియని కమలమణి తలలో వెండి తీగలు మెరిసేవరకు యంత్రంలా చేస్తూనే ఉండేది.
మామగారు లింగయ్య కాలం చేయడంతో ఇంట్లో ఏదో శూన్యం నిండుకున్నట్లు అనిపించినా తన పిల్లలతో వెలితిని పూడ్చుకునేది.
‘‘అమ్మా! ఇదేందే నాకు ఇంత తక్కువ మార్కులొచ్చినవి. ఛీ! ఇజ్జత్ మొత్తం బోయిందే’’ అని దుఃఖించే పెద్ద కొడుకును ఎట్లా ఓదార్చిందో, పెరిగిన రూపురేఖల ప్రభావం మీద పడి ఇబ్బంది పెట్టకుండా కన్న బిడ్డనూ చూసుకున్నది. కాలప్రవాహానికి తట్టుకునేలా చిన్న కొడుకు చదువువరకు ట్యూషన్లూ పెట్టించి మరీ చదివించేది.
ఊళ్ళో అమ్మా నాయనలు పెద్ద వయస్సోళ్ళై పోయినారన్న బాధ. వాళ్ళకెవ్వరూ చూసుకునే వోళ్ళే లేరన్న బాధ. ఒక్కగానొక్క బిడ్డను నేను గాకుంటే మరెవ్వరౌతారని వాళ్ళ విషయాలూ పట్టించుకునే కమలకు ఎక్కడ అడ్డురాలేదు భర్త సుధాకర్. అదొక్కటే ఆమెకు చేయూత. మధ్య మధ్య కన్నవారింటికి వెళ్ళిరావడం, ఇక్కడ అక్కడ ఓ మూడుతరాల వారధిగా కమల నిలబడిరది.
* * *
‘‘మణెమ్మా ఓ మణెమ్మా… ఏం జేస్తున్నవూ? రాజత్త పిలుస్తునే ఉన్నది.
‘‘ఒస్తున్నా’’
‘‘రా ఇట్లా కూర్చో…’’
‘‘ఏందత్తమ్మా ఏమాయె అంత అదురు? దా ఇట్లా కూర్చో అని గద్దెపీట చూపిస్తుంటే, రాజత్త ఒచ్చి కూర్చున్నది.
‘‘గా నడిమింటి పుల్లయ్య లేడూ….’’
‘‘ఆఁ…. ఏమైంది!’’ ‘‘వాళ్ళింట్ల దొంగలు పడ్డరంట.’’ అన్నది గట్టిగా. ‘‘అయ్యో పాపం! ఏం బోయినయి ఏంది?’’ ఆత్రుత.
‘‘దుకుణంలా నగదు ఎత్తుకుపోయిన్రట’’ అన్నది రాజత్త.
‘‘అయ్యో పాపం! కమల, ఆమె ముచ్చట్లు పెట్టుకున్నరు.
కమల, కన్నతల్లి తల్లిగారివైపు వాళ్ళంతా మణి, మణెమ్మ అని పిలిచేది. ఆమె అమ్మ చెల్లెలు, చిన్నాయన బిడ్డ. రాజవ్వది అదే ఊరు. ఊరు కూరికే కమల దగ్గరి కొచ్చిపోవుడు ‘ఊరి ముచ్చట్లు చెప్పిపోవుడు ఆమె కలవాటు. తండ్రివైపు బంధువులు కమల అంటే తల్లి వైపువాళ్ళు. మణెమ్మ అనేది. రాజవ్వ వరసకు చిన్నమ్మగావాలె. కాని ఆమెను వాళ్ళ చిన్న మామకు ఇచ్చినందుకు, ఆ వరస కన్నా ఈ వరసే ముఖ్యమని అత్త అనమనేవోళ్ళు, అందుకే రాజత్త అనడమే అలవాటయ్యింది కమలమణికి.
ఒడ్లెండ బోయించుడు, చింతపండు గింజలు గొట్టుడు, కారం దంపించుడు, పసుపు పట్టించుడు, పిండి గిర్నీకి బియ్యం పంపుడు, కందులు ఇసిరించుడు. ఒక్కటా రెండా, నలుగు రొచ్చిపోయే ఇల్లు అన్నీ ఉండొద్దా అని భర్తతోని వాదించే కమల ఏడాదికి సరిపడే గ్రాసాన్ని సిద్ధం చేసుకునేది.
‘‘పెద్దోనికి ఉద్యోగం రావాలె, చిన్నోనికి కాలేజీల సీటు రావాలె, పిల్ల చదువులో మంచిగున్నది. పై చదువులు చదివిస్తుంటేనే మంచి సంబంధం వస్తది… ఏమంటవ్’’ కమల ఎప్పుడు భర్తతో చెప్పే మాటలు. దీపావళి పండుగకు పటాకులు కాల్చినంత సంబరంగ చెప్పే మాటలు. బాధ్యత అనేది బరువుగాకుంటే బావుంటుంది. కష్టంలోనూ ఇష్టం చూసుకుంటే బావుంటుంది.
* * *
‘ఆయాసం ఒస్తుంది, ఒక్కటే గుండెల్ల నొప్పొస్తున్నది’’ అని అంటూనే పడిపోయిన కమలమణి హాస్పటల్ ఐసీయూలో నిస్తేజంగా ఉన్నది. వెయ్యి తుఫాన్లు ఒక్కసారే కూల్చినట్లు, అగాధంలోకి విసిరేసినట్టు అంతా చీకటిమయం అంతా దుఃఖమయం. ముసలి తల్లిదండ్రులు కంటి మంటికి ధారగా రోధిస్తూనే ఉన్నరు. ముగ్గురు పిల్లలు అచేతనులయిపోయినారు. వారి దుఃఖం ఎవ్వరు తీర్చలేనివి అయ్యింది.
సుధాకర్కు బ్రతుకంతా అంధకారబంధురమైపోయింది. కాంతి ఎగిరిపోయింది.
‘‘ఇంకో ఏడాదిలో రిటైర్ అయిపోతాను. కమల చెప్పిన లిస్ట్లేమో చాలా ఉన్నాయి రా తమ్మీ’’ అని మొన్ననే నాతో అన్నవ్ గదా అన్నా ఇంతలోనే ఒదినమ్మ ఇట్లా అయిపోయిందేందే’’ అని సుధాకర్ తమ్ముడు కన్నీళ్ళు కారుస్తున్నడు. బంధువులంత ఒక్కొక్కరు సుధాకర్ను పలకరిస్తూం ఉన్నరు. ఆడబిడ్డలిద్దరూ ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు.
* * *
‘‘ఏయ్ ఇగో! నిన్నే!’’
‘‘ఏంది, ఎహే! ఎవరన్న జూస్తరు.’’
‘‘ఏం కాదు! మనం మొగుడుపెళ్లాలం. ఎవ్వరేమనుకోరుగాని, నీకు ఓ మాట చెప్పాలి ఇక్కడ కూర్చో’’.
‘‘ఊఁ…’’
‘‘మా ఇంట్లో ఇంతమంది ఉన్నరు. అందరు నిన్ను పిలిచే పేరులోని నేను నిన్ను పిలువను. నీకో పేరు పెట్టుకుంటా.’’
‘‘అబ్బో! ఎందుకో?’’
‘‘నా జీవితంలో నువ్వు ఓ కొత్త వెలుగువువు కావాలె. దారి దీపంగావాలె.’’
‘‘అంటే?’’… ముసి ముసి నవ్వులతో కమల ఓరగ చూసింది.
‘‘కాంతం’’ అని పిలుస్తాను. కాంతి అంటే వెలుగు, దీపం ఇచ్చే వెలుగు’’ అంటున్న సుధాకర్ను ఆశ్చర్యంగా చూస్తూ ‘‘అబ్బో! నాకు నవ్వొస్తుంది. ఎవ్వరు లేనప్పుడు అట్ల పిలువుగాని, అందరి ముందట అట్ల ‘కాంతం’ అని పిలువకు సరేనా’’ అన్న కమల మాటలకు సరే నన్న ఈ ముప్ఫై ఏళ్ళ జీవితంలో ఎవ్వరికీ తెలియని పేరు ‘కాంతం’ ఇప్పుడు దూరమైపోయింది. ఒంటరిగా ఈ సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి?
సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి!
కాంతం కావాలి. నాకు కాంతమే కావాలి. కష్టాల్లో కష్టంగా, ఇష్టాల్లో ఇష్టంగా ఇన్నాళ్ళు ‘తను’ మొత్తం ‘నాది’గా అయ్యి ఇంటిని దిద్దుకొచ్చిన నా కాంతం కావాలి. ఉన్నప్పుడు తెలువదు విలువ, లేనప్పుడే తెలుస్తది. వారం రోజులు హాస్పటల్లో ఉంటే తను బాగయి ఒస్తుందనే నమ్మకంతో కష్టంగా గడిపినం. అమాయకంగా చూస్తున్న పిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు అయ్యో! ఎంత పనయ్యింది. ఆ గుండెనొప్పి ఏదో నా కన్న రాకపాయె… సుధాకర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. దుఃఖ సంద్రం ప్రక్కన నిగ్రహం లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు.
Kondapally Neeharini
మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం
- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే సంకేతాన్ని తెలియజేయడానికి, ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి చరవాణిలో పంపిన మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం. అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ దగ్గరలో. ఒక కుటుంబంలోని పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”
జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.
“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా? ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.
సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.
ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత
వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి. మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…
సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి? ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!
అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా
చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.
గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను పావులుగా వాడుకుంటున్నారు.
“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”
పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న
భారతదేశం ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.
ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…
రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.
“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు
పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.
మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.
అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!
____***____
నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
నువ్వు ఏదైనా చెబితే నేను మరిచిపోతాను. నువ్వు ఏదైనా నేర్పిస్తే నేను గుర్తు పెట్టుకుంటాను
నువ్వు నన్ను పనిలో భాగం చేస్తే నేను నేర్చుకుంటాను
ఎంత సత్య వచనాలు!! నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అంటాం కదా? ఇప్పటి యువతరాన్ని చూస్తే వీటిలో ఏది నమ్ముతున్నారు అర్థం కావడం లేదు ఆలోచించాల్సి వస్తోంది. వాళ్లు వాళ్ల సమయాన్ని కోరుతున్నారు వాళ్ళదైనా సమయాన్ని మాత్రమే కోరుతున్నారు. ఈ సమయాన్ని కప్పిపుచ్చుతున్నదంతా స్వార్థం. స్వార్థం అవసరమే కొంతవరకు కానీ మితిమీరిన స్వార్థం ప్రమాదకరం. ఈ మాట స్వేచ్ఛ అనే పదంతో కూడా జోడించుకోవచ్చు మనం ఇటు స్వేచ్ఛ అటు స్వార్థం రెండూ కలగసి ఇప్పటివరకు సరైన నిర్ణయాలు తీసుకొని ఇవ్వడం లేదు. వాళ్లు వైపు మొత్తుకుంటున్నారు మాకు మా కుటుంబం అంటే ఇష్టం అమ్మ నాన్న అంటే ఇష్టం అని. తల్లిదండ్రులు వాళ్లకు టైం ను కేటాయించడం లేదు టైం స్పెండ్ చేయడం లేదు మాతోని అంటూ కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు.
పైన చెప్పిన రెండు వాస్తవాలే కానీ… స్వేచ్ఛ స్వార్థం రెండూ వాళ్ళ తెలివిని ఆలోచన నిర్వీర్యం చేస్తున్నాయి అన్నది సత్యమే తల్లిదండ్రులు సరైన సమయాన్ని పిల్లల మీద పెట్టలేకపోతున్నారు అనేది సత్యమే. మీ రెండు తప్పవు ఓవైపు బాగా చదువుకోవాలి లేదా గొప్ప ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి డబ్బు పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు యువత ఒకవైపు. ఇదే యువతకు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్లు కూడా డబ్బు సంపాదించాలి అనే కాకుండా ఉద్యోగ ధర్మం కదా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కదా అంటూ జీవితాన్నే పరిగెత్తిస్తున్నారు.
ఓ 20 ఏళ్ల క్రితం వాళ్లు పడ్డ కష్టనష్టాలు తమ సంతానం పడవద్దు అనే ఆలోచనతోనే తమ పిల్లలకు కావలసిన వాటికంటే ఎక్కువ సదుపాయాలను సమకూరుస్తున్నారు. వాళ్ళు అప్పుడు పొదుపుగా ఉన్నారు నోరు కట్టుకొని మరీ బ్రతికారు పైసా పైసా కూడ పెట్టి పిల్లల అవసరాల కోసం ఖర్చుచేసారు.మగ పిల్లాడైతే అందరిలో నా కొడుకు బాగుండాలి…. అని, నాకన్నా బాగుండాలి అని అనుకుంటున్నారు అమ్మాయైతే కొడుకులతో సమానంగా కూతుర్లను పెంచారు.ఆడపిల్లలు బాగా చదువుతున్న ఈ కాలంలో కూతురు ఎందుకు ఉద్యోగం చేయవద్దు తను తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే ఉద్యోగం చేయాలి అని గట్టిగా నమ్మి అదే బాటలో నడిచేలా చేస్తున్నారు. తప్పదు కదా అస్తిత్వ పోరాటాలలో ప్రథమ స్థానం ఇదే కదా. ఆర్థిక స్వావలంబన అవసరం కాబట్టి ఇక్కడి వరకు బాగానే జరుగుతున్నది కానీ, మరి వీటికి ప్రతిఫలంగా ఇదే సంతానం కుటుంబానికి ఏమిస్తుంది?
సాధించాలనుకున్న గమ్యానికి తమదైన ప్రతిభతో ఒక గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తున్న వీళ్ళు ఇళ్లల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. అసలు పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. ఉదాహరణగా చెప్పాలంటే… ఇంట్లో చెత్త డబ్బా తీసుకువెళ్లి చెత్త తీసుకువెళ్లే వాళ్లకు ఇవ్వాలి అనే స్పృహ ఉండడం లేదు. అదేదో మన పని కాదు అన్నట్టే ఉంటున్నారు కానీ ఎంతకని అమ్మ మాత్రమే చేస్తుంది ఎంతకని నాన్న మాత్రమే చేస్తాడు అని ఆలోచన ఉండడం లేదు. వంట ఎలా వస్తుంది టేబుల్ మీదికి అనే ధ్యాస లేని పిల్లలకు చెత్త డబ్బా గురించి ఏం చెప్తాం? అది మరీ పెద్ద విషయం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చేసేది ఎవరు? పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తేనే ఇల్లు శుభ్రం కావడం లేదంటే అట్లాగే ఉంటుంది లేదా అమ్మ చేస్తుంది ఎంతకని? ఎంతకాలం ఈ ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటుందో!
వంటలో సాయం చేయడం, ఇల్లు శుభ్రంగా .. నీట్ గా పెట్టడం అందరి పని అనుకోవడం ఇలా… ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోని యువత రేపటి రోజున ఎవరికి ఆదర్శమవుతారు? ఎలా ఆదర్శమవుతారు?
There is no elevator to success you have to take the stairs … ఈ మెట్లు ఏవి అంటే ఇదిగో ఇవే…. చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి ఇంటి పనుల్లో భాగస్వాములైతే! ఇది నిజం గా నిజం. చక్కని జ్ఞాపకాలు వెంట వస్తాయి. అమ్మా నాన్న ల కష్ట సుఖాల్లో మేం ఉండాలి అని అనుకున్న వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు.
పాపం ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అస్సలు పని నేర్పుకుంటారు. బహుశా విధి విధానాలు వేరుకావచ్చు. అంతేకానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లలు సోమరులు అవ్వాలనో దుర్మార్గాలు తొక్కాలనో అనుకోరు.
The greatest gifts we can give our children are the roots of responsibility and the wings of independence అంటాం కదా! స్వేచ్ఛ తో పాటు బాధ్యత లను నేర్పించాలి. పదహారేళ్ళు వచ్చాక కూడా బుద్ధి రాకుంటే ఎట్లా? చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బయటి వాళ్ళు చెప్పేవి…. మీ జీవితం బలి కాకుండా చూసుకోవాలి.
సెప్టెంబర్ 2024 మయూఖ పత్రిక సంపాదకీయం
ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!
మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.
ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.
లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?
ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.
రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.
ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!
సాహిత్యం జీవితాన్ని ప్రజ్వలనం చేస్తుంది.వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది. చదువు సంస్కారాల విలువను తెలియజేస్తుంది. గొడవర్తి సంధ్య గారి పరిచయం ప్రథమం గా ఉపాధ్యాయినిగానే ! హైదరాబాద్ రామ్ కోటి , కింగ్ కోటి ల దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో మేం కొలీగ్స్ మి. తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా వారు విధులు నిర్వహించారు.

కానీ నాకు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆమె కవయిత్రి రచయిత్రి అని.
ఆమె సాధన నరసింహాచార్యులు గారి అర్ధాంగి అని. ” సాధన ” అనగానే సాహిత్య సంస్థగా నరసింహాచార్యులు గారికి పేరు. వీరి అర్థాంగి గా అడుగడుగున ఆయన కి సంపూర్ణ సహకారాలు అందిస్తూ సాహిత్య సభలలో వెన్నుదన్నుగా నిలిచారు సంధ్య గారు. కవిత్వం లో అందెవేసిన చేయి సంధ్య గారి ది అని వారి కవిత్వం వింటే తెలుస్తుంది. కొన్ని సభా వేదిక ల మీద కవి సమ్మేళనం లో కవిత చదవగానే నేను దగ్గర గా వెళ్లి అభినందనలు తెలిపేదాన్ని. ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ దంపతులు. హైదరాబాద్ లోని చాలా పాఠశాల లో పద్య పఠన పోటీ, వ్యాస రచన పోటీలు వంటివి పెట్టి తెలుగు భాష కోసం పాటుపడిన జంట.
సంధ్య గారి తల్లిదండ్రులుకీ.శే.భాగ్యలక్ష్మి తెలికిచర్ల కృష్ణ మూర్తి గారు.
సంధ్య గారి ఆడపడుచు వైదేహి నేను ఒకే సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరాం. మాకన్నా సంధ్య గారు సీనియర్. తర్వాత కాలంలో
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
పుస్తకపఠనం ఎంత ఇష్టపడేవారో రచనాసేద్యం అంతే ఇష్టపడేవారు. స్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. అవసరార్థం నాటకాలు కూడా అప్పుడే రాసేవారు. “పోతన చరిత్ర “, “కథా భారతం ” సంధ్య గారి ప్రసిద్ధ ముద్రితగ్రంథాలు.
దూరదర్శన్ ఆకాశవాణి ల లో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ లో ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లో ఎన్నో కవి సమ్మేళనాలలో కవితా పఠనం చేశారు. ఎన్నో అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు, కార్యక్రమాలు నిర్వహించారు. సాహితీ సమీక్షకురాలిగా మన్ననలందారు. సంధ్య గారి కి ప్రాచీన సాహిత్యం అంటే ఎంత ఇష్టమో ఆధునిక సాహిత్య మంటే కూడా అంతే ఇష్టం. తాము చదివిన సాహిత్యం అందరికీ పంచటంలోనే ఆనందం అనేవారు.
ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం లో సంధ్య గారు, మరో సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని రచయిత్రి కొమండూరి అరుంధతి గారు కలిసి నాటకాలు వేయించేవాళ్ళు . తోటి తెలుగు ఉపాధ్యాయులుగా మేమందరం సహాయపడేవాళ్ళం. ఒక సంవత్సరం ” పుష్ప విలాపం” టాబ్లో ను అద్భుతంగా వేయించారు.
వానమామలై వరదాచార్యులు గారు రచించిన
“పోతనచరిత్ర” ను తేట తెలుగు వచనం లో సంధ్య గారు రాసిన పుస్తకం ప్రశంసలు అందుకుంది. పోతనపై తనకు ప్రత్యేక అభిమానం కల్గటానికి కారణం కీ.శే.బ్రహ్మశ్రీ మల్లంపల్లి పరమేశ్వర శర్మగారు అనీ, రాజమండ్రిలో స్థానం ప్రాచ్య కళాశాల లో ఆయన చెప్పిన పాఠాలు “పోతన చరిత్ర” ను రాయడానికి కారణం అని అనేవారు.
శ్రీవానమామలై వరదాచార్యులు గారి కావ్యంలోని అందాలను సులభశైలిలో తేట తెలుగులో రాసి భర్త ప్రోత్సాహంతో వచనంగా ” పోతన చరిత్ర” తో రాసారు. కవయిత్రి గా రచయిత్రి గా ప్రసిద్ధి కెక్కిన సంధ్యగారు ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి కవితలను ఒక కవితా సంపుటి గా ప్రచురించారు కూడా. గొడవర్తి సంధ్య గారు గా సాహితీ లోకంలో పేరు పొందినా, మాకు నర్సమాంబ గారు గానే చాలా దగ్గర. నర్సమాంబగారు మంచి స్నేహశీలి.
ఈ మధ్య కాలంలో నేను నడుపుతున్న అంతర్జాల పత్రిక” మయూఖ” లోనూ సంధ్య గారి వ్యాసం ప్రచురించాను.
దాదాపు 25 ఏళ్ల క్రితం సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో సంధ్య గారి తో పరిచయం. అప్పటి నుండి ఆ సాధన నర్సింహా చార్యులు గారి తో మాకు అంటే నా భర్త కొండపల్లి వేణుగోపాల్ రావు గారి కీ నాకూ పరిచయం. ఒక కవయిత్రి గా, ఒక కవిగా ఈ దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉండేవాళ్ళు. కూకట్ పల్లిలో లో వారి ఇల్లు సాహితీ వేత్తలనిలయం.వీళ్ళ ఏకైక కుమారుడు చిరంజీవి సాయిమానస్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
గొడవర్తి సంధ్య గారు నువ్వు ముఖం తో , మంచి మాట లతో స్నేహశీలి గా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వారి కిదే తరుణి పత్రిక సంపాదకురాలిగా, స్నేహితురాలిగా నా శ్రద్ధాంజలి.*
2024 మయూఖ పత్రిక జూలై సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, సంపాదకులు
ఈ ఆధునిక ప్రపంచంలో నిత్య సత్యాలకు విలువనిచ్చే సందర్భాలను తరచి చూడాల్సిన పరిస్థితులున్నవి. ఇదంతా stage of publicity నడుస్తున్న కాలం. ఈ ప్రచార పటాటోపాలు లేకుండా వాళ్ళ జీవితమంతా పోరాటాలకు ధారపోసి వెలుగులోకి వచ్చిన కొందరు మహనీయులను స్మరించుకోవడం కొరకనే శత జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉంటాం.
మహాప్రళయంగా ఉద్యమించిన సముద్ర ఆటుపోటుల వంటి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలకు ఎందరో వీరులు బలయ్యారు. బరిలోకి దిగి ఉద్యమించిన నేతలందరూ నిస్వార్థ జీవితాలే గడిపారానాడు. సాహిత్యం అనే కత్తిని చేతపట్టి సమాజమనే యుద్ధభూమిలో రాజునెదిరించిన విప్లవకణిక దాశరథి కృష్ణమాచార్య.
ఏ నైసర్గిక సాధన కోసం ఆనాడు గళమెత్తాడు దాశరథి? ఏ అస్తిత్వం కోసం జెండా నెత్తాడు దాశరథి?? సామాన్యుల కోసం! సంఘం కోసం!!
“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో …” అంటూ కష్టజీవి పక్షాన కలమెత్తిన కవి. ” మా నిజాం రాజు జన్మజన్మాల బూజు …”అంటూ ప్రభుత్వ పనులను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం తలయెత్తిన కవి. అలసత్వాలపై, అధికారపు పెత్తనాలపై కవిత్వ నిప్పులు చిమ్ముతూ కవిత్వం రచించినా , కరుణ రసాత్మకంగా పేదవాడి పక్షాన కవిత్వం రచించినా దాశరథి దాశరథే! ఇకమరో కవి ఉండడు అన్నంత గొప్ప కవి.
అది కవిత్వం కావచ్చు అది పాట కావచ్చు బడుగు జీవుల బాధల గాథలు దాశరథి కవిత్వంలో కవిత్వమై కన్నీరు తెప్పించాయి. కవి ధర్మం, కవిత్వ ధర్మం రెండు ఒక్కటి గా కనిపించిన దాశరథి సాహిత్యం ఇప్పుడు ఈ కాలంలోనూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్న వ్యక్తిగా, పద్యాల చురకత్తులు విసిరిన శక్తిగా దాశరధి ఎట్లా నిలబడగలిగారు? ఎట్లా సినీ జగత్తులో అక్షర దివ్వె గా వెలగలిగారు? ఇవి తెలుసుకోవాలి.
ఎంతసేపు పరనింద,ఆత్మ స్తుతి తో బ్రతుకుతున్న మనుషులకు మార్గదర్శకత్వంగా దాశరథి వంటి కవుల కవిత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఈనాటి సాహితీవేత్తలది, పత్రికారంగానిది, ప్రభుత్వానిది. అతిగా పెరిగిన లంచగొండిలపై కంచు గొంతు ఎగరాలి. అడుగడుగునా అవినీతి అవతారాలు కనిపిస్తున్న కసాయి లోకానికి కనువిప్పు కలిగించే దాశరథి కవిత్వం కావాలి.
ఎంతసేపు వాగాడంబరమూర్తుల ఉపన్యాసాలు వినీ వినీ యువత నిస్తేజం లో పడిపోతున్నది. అభ్యుదయ భావకాంక్షతో సత్కవిలోకానికే సంభ్రమాశ్చర్యాలు కలగజేసిన దాశరథి పద్య శక్తి ని తెలుపాలి.
సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అనే మాట దాశరధి నోట వచ్చిన పాట, పద్యాలు పెద్ద రుజువు.
ఋతు బద్ధంగా వికసన చెందే పంట చేను,ఎండి కడుపు ఆకలి మంటను చల్లార్చే పంట దాశరథి సాహిత్యం. కవుల గురించి రచించినా , పీఠికలు రాసినా, సభనుద్దేశించి మాట్లాడినా జవం జీవం ముప్పిరిగొని పాఠకులకు శ్రోతలకు ఆనందాన్ని ఆలోచనలని కలిగించినవి.
నాటి ఖమ్మం జిల్లా మానుకోట తాలూకా లోని చిన్న ఊరు గూడూరు లో 1925 సంవత్సరంలో జూలై నెలలో జన్మించాడు దాశరథి. పల్లెటూరి చదువు నుండి పట్నం చదువులకు ఎదిగిన ఈ పట్టభద్రుడు పాటను పట్టుకొని చిత్రసీమలోకి అడుగు పెట్టే వరకు దాటిన మైలురాళ్ళు ప్రతి అడుగులో దాశరథికి కొత్త పాఠాలు నేర్పించాయి. తిమిరంతో సమరం జరిపినా ,రుద్రవీణలు మోగించినా, అగ్ని ధారలు కురిపించినా, నవ మంజరులు మ్రోగించినా,కవితా పుష్పకం వికసింపజేసినా, పునర్నవం తో కవితా ప్రక్రియని పరిపుష్టం చేసినా దాశరథి దాశరథే!!
” ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని
ఇట ఉషస్సులు లేవు,భరింపరాని
అంబువాహన సందోహ నివాళిగాని…..”
భాషా పాండిత్యాల విలువ ఏమిటి అంటే , దాశరథి గారి ఇటువంటి కవిత్వం చదివితే తెలుస్తుంది.
” అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూసుకొని నిక్కినట్టి పిశాచహేల…”
తప్పు చేసే ప్రభువును ఎదిరించే ధైర్యం అంటే ఇటు ఉండాలి అనేది దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడే ఇదే మాట అనే స్తాను….”అంటూ వాస్తవికతకు అద్దం పడుతూ కృతకంగా లేకుండా స్వచ్ఛమైన కవిత్వాన్ని రాయడం అంటే ఏమిటో దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” అంబర చుంబి సౌధములు కాయవు పోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు దగ్గరెలెమ్ము! నీ నవా
స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టు మా! ” అంటూ పీడిత పక్షాన ఎలా గొంతెత్తాలో దాశరథి గారి ఇటువంటి పద్య రచనా పాటవాన్ని చూస్తే తెలుస్తుంది.
జైలులోను తమ నిరసన గళాన్ని పద్యమై బొగ్గుతో రాసే వినిపించినా,
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి సాహితీ చైతన్యాన్ని రగిలించినా, అద్భుతమైన ఉపన్యాసాలతో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చినా కవిగా ఉద్యమ తేజంగా దాశరథి ఓ పెద్ద ఉదాహరణ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసినా ఎందరో కవులకు దాశరథి మార్గదర్శి అయ్యాడు.
“నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవని రా” అంటూ మచ్చలేని ప్రేమ, మలినం కాని ప్రేమ విలువేమిటో తెలిపాడు.
“గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది” అంటూ పల్లె పట్టున గంతులేసే యవ్వన కాలాన్ని ప్రాసాలంకారాల పాటల్లో పలికించాడు.
” మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా”అన్నా,” రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్య” అని వేడుకొనమన్నా,
” నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ ఆనాటి దురాగతాలను ఎదిరించే రుద్రవీణను మోగించిన దాశరథి అంటే అక్షర విప్లవం.
చదువు అంటే బద్ధకం,పనిచేయడం పైన నిరాసక్తత, ఏదో సాధించాలన్న తపన లేని తనం, అయిన వాళ్ళను కూడా ఆదరించలేని యువతరం ఇప్పుడు మన ముందుంది. ఒక నిబద్ధతతో ఒక విశ్వాసంతో ఆనాడున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఎదిరించినా,స్వాతంత్ర్య అందిన తర్వాత ధీటుగా నిలబడినా దాశరథి గారు ఇప్పటికీ ఆదర్శవంతులే. స్వదేశాభిమానమైనా సంప్రదాయ వాదమైనా దాశరథికి ఇష్టమైనవి. ప్రకృతికి మనుషులకు పారస్పరిక బాంధవ్యాన్ని ఆకాంక్షించాడు, వ్యక్తికి సమాజానికి మధ్య సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాడు, సాహిత్యం సంఘానికి చేసే మేలును తన రచనలలో చూపాడు.
” రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు పగులకపోతే లేదా సొల్యూషన్?
హింసా యుద్ధం అవుట్ డేటెడ్ అని నేనంటాను!
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్!!” అంటూ ఈ కవిత్వమేదో నిన్న మొన్న రాసినట్టున్నదే అనే ఆలోచనలో పడవేసే దాశరథి అంటే మోడరన్ థింకింగ్ కు నిలువెత్తు నిదర్శనం.
దాశరథి గారి కవిత్వం సార్వకాలికమైంది సర్వజనీనమైనది.
“గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల” అని చెప్పిన మాటలు దాశరథి శతవత్సరాల కవితా శరధి అంటున్నాయి. నూరేళ్ళ వారి జీవితమే స్ఫూర్తి దాయకం.
( మే నెల మయూఖ పత్రిక సంపాదకీయం)
డాక్టర్ కొండపల్లి నీహారిణి , మయూఖ పత్రిక సంపాదకులు
జాతి మొత్తం ఏకతాటి మీద నడవాలి అనుకోవడం వెనుక ఆంతర్యం ఏముంటుందంటే, ప్రజల సుఖశాంతుల ప్రయోజనాలకే. ప్రయోజనాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు? తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు…., మనిషి పుట్టుక నుంచి చావు వరకు అడుగడుగునా క్షణక్షణాన మనుషులు లాభాపేక్ష తోనే జీవిస్తుంటారు. మంచి తిండి, మంచి బట్ట, మంచి ఇల్లు వంటి కోరికలు ఏవీ లేని వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు.వాళ్లని సర్వ సంగ పరి త్యాగులు అంటాం.వీళ్ళు మహానుభావులు. అతి తక్కువ శాతం లో ఇటువంటి వ్యక్తులు ఉంటారు.
సాధారణంగా ఆచరణ యోగ్యాలేవి,ఆచరణ యోగ్యం కానివేవి అనే తర్క సహితమైన ఆలోచనలు లేనివాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా… అనుకోకుండానే చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇందులో పరిశుభ్రత అనే విషయాన్ని తీసుకుంటే, మంచినీళ్లు త్రాగడం అనే ఒక్క విషయాన్ని ఉదాహరించవచ్చు. ఆదిమానవుని నుండైనా మనుషులు స్వచ్ఛమైన నీరు…. ఏదైతే తాగడానికి అనువైనదో ఆ నీళ్లనే త్రాగారు. అదే పరంపరను పాటిస్తున్నారు ఇప్పటికీ ….ఈ ఆధునిక మానవులు.అంటే, తమ క్షేమానికి,తమ ఆరోగ్యానికి పెద్ద పీట వేసి ,కార్యరంగంలో అడుగులు వేస్తారు మనుషులు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
దాహమైనప్పుడే బావిని తవ్వుకోవద్దన్న నిజాన్ని గ్రహించే అన్నేసి నిర్మాణాలను మంచి నీళ్ళ కోసం కట్టుకున్నారు ఆధునికులు. దీనితోనే యోగ్యమైనవేవి, అయోగ్యమైనవి ఏవి అని వివేచనతోనే మనుగడ సాగిస్తారు అన్నది తెలుస్తుంది. ఆచరణ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది దీంట్లోనే సామాజిక ప్రయోజనం కలసిపోయి ఉంటుంది ఈ మంచినీటి విషయాన్నే మానవ స్వధర్మానికి,సధర్మానికీ అన్వయించుకున్నప్పుడు….” స్వధర్మే నిధనఃశ్రేయమ్, పర ధర్మోభయావః” అని మంచి మాట పుట్టుకు వచ్చింది. ఈ వాక్యం జీవిత సత్యం. ఈ వాక్యం అనల్పమైన వాక్యం. ఇందులోంచి “శ్రేయస్సు”అనే ఒక్క పదం చాలు! మనుషులకు ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది అనడానికి !!అందుకే ఏదో దేశాన్ని చూసో, ఏవో సౌకర్యాలను ఆశించో, సంపదలను చూసో మనకు మనం ఆపాదించుకోవడమైనా… మనంగా కోరుకోవడమైనా….అన్నిచోట్ల సాధ్యం కాకపోవచ్చు. దేశకాల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం అని యోచించి నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి, ఆశపడాలి.
ప్రయోజనాలలో శిశువులకు ఒక రకమైనవి, వృద్ధులకు ఒక రకమైనవి, యువకులకు ఒక రకమైనవి,మధ్య వయస్కులకు ఒక రకమైనవి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి,విద్యకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి,సామాజిక అంశాలకు సంబంధించినవి బ్రతుకుతెరువుకు సంబంధించినవి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. నడక, నడత, తిండి,చదువు, ఉద్యోగం, పదవి విరమణ, ఇన్సూరెన్స్ లు వంటివి కానీ అన్నింటికన్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
జీవమున్నప్పుడు శరీరానికి, మరణం తరువాత శవానికి …. ఈ వ్యవస్థలో ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, పరిచయాలు పెంచుకుంటుంటారు.
వీటిలో మంచి చెడులను చెప్పేవాళ్ళు, uses and losses ఏమిటో చెప్పేవాళ్ళు ఉండాలి. శరీరంలోని కణజాలాల లాగా,ఉప కళా కణజాలాల లాగా,శరీరంలోని భాగాల లాగా, భాగాలు పనిచేసే తీరు లాగా మానవ ప్రయోజనాలు ఉండాలి. ఏది సరైనది ఏది సరైనది కాదు అనే విచక్షణ ఉంటే అన్నీ సవ్యంగా నడుస్తాయి.
మానవ పరిణామ క్రమంలో వచ్చిందే కాకుండా….బుద్ధి పరిణామ క్రమం కూడా పెరగాలి. భాష, భావం సరిగ్గా ఉంటే నాలుగు కాలాలపాటు నలుగురితో సరిగ్గా ఉండగలరు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది?సరళ రేఖ లా,సాలీడు గూడులా, పరమత సహనం లా ,పాదరసం లా పరిమితమైన అపరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి. సహజమైన ఎంపిక, సత్య మైన ఎంపిక నిలబెడుతుంది, నిలబడుతుంది.
ఇవే బ్రతుకు ప్రయోజనాలు!!
మహిళలూ – సమాజం March మయూఖ సంపాదకీయం
డాక్టర్ కొండపల్లి నీహారిణి మయూఖ సంపాదకులు
మార్చ్ నెల,మే నెల మహిళా ప్రాతినిధ్యానికి ముఖ్యమైన నెల లు గా గుర్తించారు. బాగానే ఉంది. ఏడాది పొడుగునా ఎదురయ్యే సమస్యలు సందేహాలతో ఆడవాళ్ళు పడే వేదనలకు ఏమైనా జవాబుగా మార్గం చూపాయా? చూపితే, ఏ దారి గా ఏ ఋజువులు గా చూపారు? చూపగలరు? అని ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తాయి.
అడుగడుగునా ఆధిపత్యాన్ని చూపిస్తూ అణగదొక్కుతూ ఆడవాళ్లను ఆత్మ న్యూనతలో పడవేస్తున్న ఈ పురుషస్వామ్య సమాజం ఒక్కసారైనా ఆత్మావలోకనం చేసుకోవాలి.
మగవాళ్ళంతా చెడ్డ వాళ్లని ఆడవాళ్లంతా మంచి వాళ్ళని అనడం లేదు. ఆడవాళ్లు చెడ్డవాళ్ళు ఉంటారు,మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎక్కడైనా మంచి చేస్తూనే ఉంటారు. ఇది మంచి చెడు సమస్య కాదు ఇది ప్రస్తుతంలో దృష్టి పెట్టి చూడాల్సిన సమస్య కాదు యుగయుగాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలను బట్టి ఆలోచించాల్సిన విషయం. మంచి ఉద్దేశంతోటే, గొప్ప ఉద్దేశంతోటే స్త్రీని గౌరవిస్తూ జగతికి మూలం స్త్రీ అని, ముగ్గురమ్మల మూలపుటమ్మా అని, ఆదిశక్తి అని పరాశక్తి అని అన్ని స్థానాలలో అమ్మకే స్థానం ముఖ్యమని, ఆడవాళ్ళకే ప్రముఖ స్థానం అంటూనే… అమ్మానాన్న తల్లి తండ్రి, సీతారాములు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు అంటూ ఉన్నాము , స్త్రీ లకు గౌరవం ఇచ్చేవాళ్ళు అని చెప్పిన వేద కాలాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది.
స్వార్ధచింతనతో అధికార దాహంతో, అహంభావాదివికారాలతో స్త్రీల అస్తిత్వాన్ని అణచివేసినటువంటి దుర్మార్గాలన్నీ అందరికీ తెలుసు. అయినా నిజాన్ని ఎవరు ఒప్పుకోరు. పుత్రుడు పుడితేనే పున్నాగ నరకం నుండి తప్పిస్తాడని అనడంతోటే పురుషస్వామ్యం అంటే ఏంటో బయటపడింది. ఇలాంటి ఏవేవో, ఎన్నెన్నో ఉన్నాయి. “ఆ బొంత లోనిదే ఆ మాసిక “అన్నట్టు తమ కన్న ముందు తరాల వాళ్ళు ఏం చేశారో చూసి అదే వ్యవహారాలు నడిపే మగవాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. మేము తప్పు చేయమని అంటారు.కానీ శారీరక శక్తిని తక్కువ చూపిస్తూను అపాయాలు ఎక్కువ పరిస్థితులు ఎదురవుతాయని స్త్రీలు బయట కాలు పెడితే ఎవరీ మతాచారాలు చేస్తారో నని ఇంటిపట్టున ఉంచాము అని సర్ది చెప్పుతూ ఉంటారు.అసలు ఇలాంటి పరిస్థితులు దారి తీయడానికి కారణం ఏమై ఉంటుంది మొదటి నుంచే స్త్రీలకు విలువ ఇస్తూ, స్త్రీల స్థానాన్ని పదిల పరుస్తూ వచ్చినట్టయితే ఈ అపాయాలు వస్తాయి అనే ఆలోచననే కలగకపోయేది. ఆడవాళ్ళని భోగపు వస్తువుగా వాడుకున్నంత వరకు పని యంత్రాలుగా మార్చినంతవరకు పురుషులు ఇటువంటి విపరీతాలకు దారి తీసే రోజులు వస్తాయని ఆ మధ్య యుగంలో ఆలోచించి ఉండకపోవచ్చు. అప్పటికప్పటికీ ప్రస్తుతానికే ఆలోచించుకున్నారు వాళ్ళానాడు. కానీ, భావి జీవితం గురించి ఆలోచించలేదు.అదే ఇప్పుడు ఒక పెద్ద సంఘవిద్రోహంగా సామాజిక దాష్టీకంగా తయారై పురుష జాతిలోని మేధావులను కలవర పరుస్తున్నది. పాత రోజులను తీసుకురాలేము కొత్త రోజులను ఆపలేమూ, నడుస్తున్న రోజులను మార్చలేము !ఇటువంటి సందిగ్ధావస్థలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు మంచి వాళ్లంతా.
అయితే నిస్తేజం లో పడిపోయే పనిలేదు. ఎంతటి వ్రణాణికైనా మందు ఉంటుంది. ఎంతటి కఠినమైన పనికైనా ప్రణాళిక ఉంటుంది. ఏ జాతిని గురించే అయితే తక్కువ చేసి ఇళ్లల్లో మాట్లాడారో ,ఉదాహరణకు ఆ …ఆడపిల్ల దానిపైఎందుకు ఇంత ఖర్చు చేయాలి ?ఆ… ఆడపిల్ల ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్లొచ్చింది? ఆ …ఆడపిల్ల ఇంట్లో వంట చేసి పెడితే సరిపోతుంది? ఆ… ఆడపిల్ల అంత పెద్ద చదువులకు ఎందుకు? ఆ…. ఆడపిల్ల సైనా సైన్యాధ్యక్షురాలు వంటి పదవులు ఎందుకు ?ఆడపిల్ల రాజకీయాలు ఎందుకు అంటూ అనడం మానేసి, కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అనుకోవాలి.కొడుకును కూతురును ఒకటే బడిలో చదివిస్తున్న వాళ్లు కూడా ఏర్పడకుండా ఇళ్లల్లో భయాలను కలుగజేసేలా మాట్లాడే మాటలు మానుకోవాలి.తండ్రి, తాత బాబాయ్, మామ, తమ్ముడు, అన్న వంటి పురుష పాత్రలందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక కొందరు ఆడవాళ్లు, కాస్త నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడితేనైనా ఈ మగవాళ్ళు అణిగి ఉంటారనుకునే వాళ్ళు ఉంటారు. దీనికి కారణం తన అమ్మకు నానమ్మ కు అమ్మమ్మకు అత్తకు ఇంటి పక్క వాళ్లకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి అనుభవాలను ఆ భయం తెలియకుండానే వాళ్ళ మనసులలో జొరబడి ఇంకా ఇలాగే,పాతకాలం వారిలా ఉంటే ఎలా ? నన్నూ అట్లాగే చేస్తారనుకొని, ముందు జాగ్రత్త గా ఉండాలని అనుకోని ఇప్పుడు కొందరు కాస్త నోరు చేసుకుంటున్నారు. ఎదురు తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది ఆలోచన చేయాలి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా గ్రహిస్తారు.
ఒకటి మాత్రం నిజం పెరుగుట విరుగుట కొరకే! సామాజిక న్యాయం కోసం ఆలోచించే వాళ్ళు ఇది గ్రహిస్తారు. ఆనాటి చరిత్ర ను తిరిగి చూస్తే తెలుస్తుంది.
_____*****_____
పూర్వ సామ్రాజ్యాలను కీర్తించడమో, రాజుల గాథలను చెప్పడమో అసలైన చరిత్రకాదు. సకల ప్రజల, సకల జాతి ప్రగతిని కోరుకున్న విషయాలు చెప్పేది చరిత్ర. ఈ ప్రజా చరిత్రలో అత్యంత మహత్తరమైన వ్యక్తి బీదవాడు. ఆ బీదల వైపు నిలబడిన వాడు అసలైన నాయకుడు. చారిత్రక పురుషుడు తన జీవితంలో ముఖ్యమైన కాలన్నంతా ప్రజాపక్షాన పోరాడిన నాయకుడు పెండ్యాల రాఘవరావు.ఆయనలో దేశభక్తి బీజాలు మొక్కౖెె మానై మహావృక్షమై ఫలాలందించే స్థాయికి ఎదిగాయి. ఆనాటి తెలంగాణా ప్రాంతమంతా చీకటిలో మ్రగ్గి ఉందన్నది రాఘవరావు తన చిన్న వయసులోనే గ్రహించి ప్రపంచ జ్ఞానాన్ని చారిత్రకాంశాలనీ, భారతదేశ ఆర్య సంస్కృతినీ అన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఒక దేశం సునపంన్న దేశంగా ఎదగాలంటే అది సారవంతమైనదే కావాల్సిన అవసరం లేదనీ, స్వతంత్ర దేశం అయితే చాలుననీ గ్రహించాడు రాఘవరావు. మహాత్మాగాంధీ సత్యాగ్రహాలు చేయడం వీరిపై పెద్ద ప్రభావమే చూపింది. తాను కూడా వరంగల్లో నిరాహార దీక్ష చేసి, హరిజనోద్ధరణకు నడుకట్టాడు. మత మార్పిడి పై వచ్చిన తబ్లీగ్ ఉద్యమాన్ని అడ్డుకోవడం, వీటి వల్ల వచ్చిన ఆంక్షలను, ఎదుర్కోవడంతో రాఘవరావులో గట్టి నిర్ణాయకుడు ఉద్భవించాడు.

ఆనాటి సామాజిక వ్యవస్థలోని కుళ్ళు వ్యవస్థ అయిన అంటరానితనాన్ని ఎండగడ్తూ హరిజనులను ఇంట్లోకి తీసుకురావడం వారితో సహపంక్తి భోజనాలు చేయడం, దేవాలయ ప్రవేశంచేయడం, హరిజన స్త్రీలతో బతుకమ్మ ఆడించడం వంటివన్నీ రాఘవరావు ఎంతో దృఢ నిశ్చయంతో చేశారు. జాతీయోద్యమాలను అనుసరిస్తూ అత్యంత ప్రభావం చూపిన ఆర్య సమాజంలో, చేరడం సత్యాగ్రహోద్యమం, గ్రంథాలయోద్యమం, రైతు కూలీ పక్షాన నిలబడడం ఈ పోరాటాలలో అతని ప్రాణాలు తీయాలన్న ప్రయత్నాల నెదుర్కోవడం అన్నీ రాఘవరావు జీవితంలో ప్రముఖ ఘట్టాలే!కాంగ్రెస్ సత్యాగ్రాహిగా ఉండి జైలు జీవితాన్ని అనుభవించడం రాఘవరావులో అణగారి ఉన్న విప్లవవాదికి కొత్త భావాలు తోడైనవి. కమ్యూనిస్టు కార్యకర్తగా కాలక్రమంగా నాయకునిగా ఎదిగి ప్రజారాజ్యాన్ని చూడాలని సాయుధ వీరుడయ్యాడు.అజ్ఞాత జీవితంలో అనేక సంఘటనలు చవి చూశాడు. రజాకార్ల నెదుర్కొంటూ పోలీస్ ఆక్షన్ సమయంలో వీరోచిత పోరాటం చేశాడు. జాతీయ రాజకీయాలకు తోడు నిజాం గద్దె దిగడం, ఎన్నికలు రావడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చేయాలనుకోవడం అన్ని పరిస్థితులననుసరించే జరిగినవి. పి.డి.ఎఫ్ ద్వారా ఎన్నికల్లో పాల్గొన్న విషయాలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయాలెన్నో! ఆయన ఉపన్యాస ధోరణిని, వాక్కుపటిమనీ, కథలు కథలుగా చెప్పుకునేవారు ప్రజలు. ప్రత్యక్షంగా ఎన్నో తడవలు విన్న అనుభవాలు ఆ రోజుల్లో రికార్డు చేసుకోలేని పరిస్థితి. కాలం వేగంగా పరుగిస్తూ ఎన్నో సత్యాలను తనతో తీసుకెళ్ళింది.”అవి ఎమర్జన్సీ చీకటి రోజులు, రాజ్యమేలుతున్న కాలం. మహాసభానంతరం జనగామ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో రావి నారాయణ రెడ్డి గారి ప్రసంగం తరువాత రాఘవరావుగారి ఉపన్యాసం వింటూ కాళోజీ ఏడుస్తూ చెట్టు క్రింద రాయిపై కూర్చున్నాడు. తర్వాత కాళోజీని ప్రసంగించమంటే ”రాఘవరావు ప్రసంగం తర్వాత నేను ఉపన్యసించడం అనవసరమని” కన్నీటితో జవాబు చెప్పి, వేదికపైకి రానే లేదు. స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఆనాటి ప్రజల కడగండ్లను చెప్పుతుంటే సభికులు అచ్చెరువొందారు. రాఘవరావు గారి ప్రసంగం ఆ స్థాయిలో ఉండేదని చెప్పడానికే ఇది రాశాను. ఆ ఉపన్యాసం కొన్ని పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది చాలా వాటితో పాటు అదికూడా మీకు లభ్యం కాలేదు.” అంటూ జనగామ నుండి కె. మాధవ రెడ్డిగారు వ్రాసిన ఉత్తరంలో ఉంది. 2007లో రాఘవరావుగారి 20వ వర్ధంతి సందర్భంగా ‘నా ప్రజాజీవితం’ పుస్తకావిష్కరణ చేసిన తర్వాత అందిన ఉత్తరం. రాఘవరావుగారు వ్రాసుకున్న అనుభవాలు కొన్ని, పెద్దల అభిప్రాయాలు కొన్ని ఉన్న ఆ పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకం అసమగ్రంగా వుంది అంటూ ఎన్నో విషయాలను ఉటంకిస్తూ 18 పేజీల ఉత్తరం ఒకటి, 9 పేజీల ఉత్తరం మరొకటి వ్రాశారు. మాదవరెడ్డిగారు కొంతకాలం జిల్లా పార్టీ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసి, రాఘవరావుగారిని దగ్గరినుండి చూసిన, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవాలు ఆ ఉత్తరాలలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నవి.ఎంతో శ్రమకోర్చి పుస్తకాన్ని అచ్చువేయిస్తే, తర్వాత చాలా విషయాలు తెలిశాయి. అది సమగ్రమైందికాదని తెలిసీ, అసలు విషయాలెన్నో వెలుగులోకి రాలేదనీ ఇంకా ఏదైనా చేయాలనీ సంకల్పం ధృవపడింది. వీలున్నపడల్లా రాఘవరావుగారి గురించి సమాచారం సేకరించి సిద్ధం చేసుకున్న విషయలనూ, రాఘవరావుగారి మేనకోడలు దయామతిగారు చెప్పిన విషయాలనూ ఆధారం చేసుకొని కొంత వ్రాసి పెట్టుకోవడం జరిగింది. వీరిది రాయపర్తిగ్రామం, ఈమె పరమ పండితోత్తమురాలు. రామాయణ భారత, భాగవతాలను కక్షుణ్ణంగా చదివి, పద్యాలనూ, శ్లోకాలనూ అనర్గళంగా చవగలుగోవారిమె. ఇప్పటికీ చదువుతున్నారామె. 2007లోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వూ తీసుకున్నాను. చిన్నపెండ్యాల ఊళ్ళన్నీ చుట్టు ప్రక్కల తిరిగి సమాచారం సేకరించి ‘నా ప్రజా జీవితం’ ప్రచురించినప్పుడు దయామతిగారి దగ్గర సేకరించలేదు. ఆ పుస్తకం చదవగానే ఆమె నన్ను దగ్గరకు పిలిపించుకుని ఎన్నో విషయాలు చెప్పారు. తర్వాత కొత్తపల్లి భగవానుగారు 30 పేజీల పోరాటాల చరిత్రను వ్రాసి పంపారు. అందులో ప్రతి, సాయుధ పోరాటంలోనూ రాఘవరావే వున్నాడు. ఆ ఉదంతాలన్నీ ఈ రచనకు ప్రేరణ.’వీర తెలంగాణా సాయుధ సమరం’ కందిమళ్ళ ప్రతారెడ్డిగారి పుస్తకం, వాసిరెడ్డి నవీన్ గారి ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’ పుస్తకం, తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల’ వరవరరావు గారి పుస్తకం, పోరాటాల బాటలో అనుభవాలు జ్ఞాపకాలు’ యస్.వి.కె.ప్రసాద్ గారి పుస్తకము, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము, విజ్ఞాన సర్వస్వం వంటి ఎన్నో పుస్తకాలు చదివి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాను. 2008లో అఫ్జల్ గంజ్ లో వున్న లైబ్రరీకి చాలారోజులు పోయిసేకరించిన పాత పత్రికలూ నాకు రచనలకు తోడ్పడ్డవే. రాఘవరావు వ్రాసిన ”నా ప్రజాజీవితం” ఆధారంగా పై పుస్తకాల నుండి సేకరించిన సమాచారంతోనూ, మా జ్ఞాపకాల ఆధారంగాను ఈ పుస్తకాన్ని వ్రాశాను.”స్వాతంత్య్ర పోరాటంలో వరంగల్ తాలూకా’ అనే వ్యాసం కొయ్యడ రాజయ్య, పెండ్యాల రాఘవరావుగార్లు వరంగల్ జిల్లా స్వాతంత్య్ర యోధుల ద్వితీయ మహాసభ సందర్భంలో, సావనీర్ వెలువరించిన సందర్భంలో వచ్చిందై వుంటుంది. ఆ వ్యాసం చదివితే చాలు రాఘవరావుగారి వ్యక్తిత్వం అర్థమౌతుంది. అంత పెద్ద వ్యాసంలో తన విషయానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. వరంగల్ జిల్లా అంతా, ఊళ్ళన్నీ తిరిగిన వీరు ఏ ఒక్క పంక్తిలోనూ ఈ వ్యాసంలో కనిపించరు. అదీ! అదివారి నిస్వార్థసేవాభావం, ప్రతిఫలం ఆశించని మనస్తత్వం.ఈ పుస్తక రచనకు పూనుకొన్నప్పుడు యస్.వి.కె. ప్రసాద్ గారి పుస్తకాన్ని చదివి, రాఘవరావు గారి సందర్భం వచ్చినప్పుడు వీరు వ్రాసిన విషయాల్ని చదివి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.” ‘పెండ్యాల రాఘవరావు, చింతల రామకృష్ణారెడ్డిగారలకు అప్పగించిన వరంగల్లు పడమటి ప్రాంతములో భూపంపక కార్యక్రమం కొంతవరకైనా అమలు జరుగలేదు. తూర్పు వరంగల్లు ప్రాంతంలో పెద్ద భూస్వాముల వద్దగల భూమి కూడా సకాలంలో పంచబడనందున, రాష్ట్ర కమిటీ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.” అని వారి పుస్తకంలో పేజీ 53లో ఎస్.వి.కె గారు వ్రాశారు. 1948 రోజుల్లో జరిగినట్టు వ్రాశారు. అదే పుస్తకంలో 49వ పేజీలో ”గ్రామ రక్షణ దళాలతోపాటు, చైత్రయాత్రా దళాలు వెలిశాయి. ఇచ్చట వాలంటీర్లు చేతులు చాచి కొట్టడానికి అనువుగా తయారుచేసుకున్న పొడవాటి లావు కర్రలను ‘గుత్పలు’ అనేవారు. దీనివల్ల దీనికి ‘గుత్పల సంఘం’ గా పేరొచ్చింది”. అని వ్రాసుకున్నారు వారి పుస్తకంలో., ఇంత అసంబద్ధ అన్యాయమైన విషయాన్ని సభ్యసమాజం ఖండించాలి. ‘గుత్పలు ‘ అంటే ఏమిటో అర్థం చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు అక్కర లేదు.”1947 సెప్టెంబర్ 11వ తేదీన కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ విముక్తి కోసం సాయుధపోరాటానికి పిలుపునిచ్చింది. నైజాం సైన్యాలకు, రజాకారు ముఠాలను ప్రజలు సాయుధంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని, ప్రభుత్వ భూములను ప్రజలకు పంచే కార్యక్రమం, గ్రామరాజ్యాల ఏర్పాటు ప్రారంభమయినవి.” ఇట్లా పై మాటలతో పొంతన లేకుండా వ్రాశారు. వరంగల్ ప్రాంతానికి వీరు వచ్చిందే 1948లల్లో ఇట్లా వ్యక్తుల మీద తప్పుడు రిపోర్టులు పంపినారనడానికి ఇంతకన్నా సాక్ష్యమింకేం కావాలి? బహుశా ఆ రోజు, ఆ క్షణంలో వారు ఇచ్చిన ఆదేశాల అమలు జరపలేకపోయి వుంటారు. కానీ వారు ఇక్కడికి వచ్చేవరకే కొన్నిగ్రామాల్లో భూపంపిణీ ఉద్యమాన్ని రాఘవరావు జరిపారు. ప్రజా పోరాటాల భాగం లో తన యవ్వన కాలమంతా అడవులలో గడిపి, ఎన్నో ఉద్యమాలు చేసిన రాఘవరావు ఇట్లాంటి అభియోగాలను ఎదుర్కోవడం లో న్యాయం ఎక్కడున్నది? వాటి పర్యవసానాలను ఏమీ పట్టించుకోని రాఘవరావు నష్టపోయింది చాలానే అని పుస్తకాలు చదివాక తెలిసింది.అయినా సరే, ఇప్పటికి తెలిసిన విషయాలైనా వ్రాయాలని నిర్ణయించుకొని వ్రాసిందే ఈ పుస్తకం! దాదాపు 1932,33ల నుండే ప్రజాపోరాటాల్లో వుండి సాయుధుడై అద్భుత విజయాలు సాధించిన రాఘవరావు క్రిష్ణారెడ్డి గార్లు తాము ఇచ్చిన భూపంపకాల కార్యమాల డ్యూటీని సరిగ్గా నిర్వర్తించలేదని వ్రాయడం ఎంతవరకు సబబు? దాదాపు 15 ఏళ్ళు వీరికంటే ముందే పోరాటాల్లో పాల్గొంటున్నవారి గురించి ఈ విధంగా నిందలు వేశారంటే ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.”మావి రికార్డులు ఏమీ లేవు. వున్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయే ” అని నాతో, నేను తీసుకున్న ఇంటర్వ్యూ లో చెప్పిన బొమ్మగాని ధర్మభిక్షంగారి మాటలు గుర్తుకువచ్చాయి. ”అసలు మేము బ్రతుకుతామనుకున్నామా? రాఘవరావు గారి జీవితం, విశేషాలు అది ఒక మహాసముద్రం. దానికి న్యాయం జరగాలంటే ఒకరిద్దరు మాటలతో అయ్యేదిగాదు” అని చెప్తూ మద్దికాయల ఓంకార్ గారు కొన్ని సలహాలు ఇచ్చారు , నేను వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. ఇవన్నీ చూస్తుంటే నేను రాఘవరావుగారి జీవిత విశేషాలను సమగ్రంగా తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించేలా చేశాయి. ఎవరు వ్యక్తులను ఎక్కడెక్కడ ఎలా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తారో కదా!మా బాల్యమంతా రాఘవరావుగారి క్రమశిక్షణలో, శ్రమతత్వపు ఆలోచనలతో పెరిగింది. అబద్ధాలడవద్దు, అన్యాయం చేయవద్దు. తెలివిగా విజ్ఞానదాయకంగా మంచినడవడితో జీవించాలని నేర్పించారు. కమ్యూనిస్టు భావాలతో వున్న పెండ్యాల రాఘవరావు గారి భార్య , మా అమ్మ కౌసల్యాదేవి తమ పిల్లలను రాఘవరావుగారి ఆదర్శాలకనుగుణంగా తీర్చిదిద్దింది. క్రియాశీలక రాజకీయాల్లో నిలువలేకపోవడం వారి అసమర్ధతవల్లగాడు చుట్టూ వున్న వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలవల్ల, ఒక ప్రణాళికతో ఆక్రమించే ప్రయత్నాలవల్ల అని అర్థమైంది.నిరంతరం ప్రజాసేవాభిలాషలో జ్వలించిన వారి ఆలోచనలు ఆదర్శవంతమైన జీవితపు వెలుగులు నేటి యువతరానికి, భావిభారతపౌరులకు తెలియజేయాలన్న సంకల్పంతో వ్రాయడం జరిగింది. పెండ్యాల రాఘవరావుగారి కన్న బిడ్డగా గర్వంగా తలెత్తుకొనగలుగుతున్నానని సవినయంగా తెల్పుతూ – నేను ఇందులో వ్రాయనివి, మీకు తెల్సినవి, ఆనాటి పోరాటాల విషయాలైనా, రాఘవరావుగారి వ్యక్తిత్వ విషయాలైనా తెలిసినవి వుంటే మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. _*_(పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం’ అనే జీవిత చరిత్రను నేను తెలుగు అకాడమీకి వ్రాసిచ్చాను. 2014లో అకాడమీ ప్రచురించింది. నేను రాసిన చాలా భాగాలను తొలగించారు. నేను రాసిన ఈ ముందుమాటను కూడా అందులో ప్రచురించలేదు. ఆ జీవిత చరిత్రను ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదేమో !)( 2017 మార్చ్ నెలలో పెండ్యాల రాఘవరావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాము మేము . రాఘవరావు గారి సంతానం కొడుకులు కోడళ్లు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరం కలిసి. )
( మార్చ్ 15 పెండ్యాల రాఘవరావు గారి జన్మదిన సందర్భంగా)