అమ్మ కవిత
కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన నా లక్ష్యం – నా గమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి క్రాంత దర్శి.రవి గాంచని చోటు కవి గాంచును అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది. మల్లారెడ్డి పోరాటాల పురిటి గడ్డ అయిన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని పోతారం (జె) తుర్కవానికుంట గ్రామం రైతు కుటుంబంలో జన్మించాడు.మల్లారెడ్డి విద్యాభ్యాసం పోతారం (జె) గ్రామం,హుస్నాబాద్, సిద్దిపేట,హైదరాబాదులో కొనసాగించారు.మల్లారెడ్డి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే గులాబీ అనే పత్రిక నడిపాడు. మల్లారెడ్డికి చదువుకునే రోజుల్లోనే సాహిత్య సృజన పట్ల అనురక్తి పెరిగింది.మల్లారెడ్డి విద్యార్థిగా రాయడం ప్రారంభించి సాహిత్యాన్ని నిత్య కృషీవలుడుగా కొనసాగిస్తున్నాడు.నిరంతర అధ్యయనం,సునిశిత పరిశీలనా శక్తి ఉన్న వారే చక్కటి కవితలను రాయగలరు అని కవి మల్లారెడ్డి నిరూపించాడు.వ్యక్తి ఎదుగుదలకు కుటుంబం మరియు సమాజం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చును.తెలంగాణలో తొలి పోరాట యోధుడు మల్ దాదా యొక్క మనవడు మల్లారెడ్డి.మల్ దాదా కుమారుడు లింగా రెడ్డి కూడా పోరాట యోధుడు.మల్లారెడ్డి తాత,తండ్రి నుండి పుణికిపుచ్చుకొన్న సంస్కారంతో పీడితుల పక్షాన నిలిచాడు.మల్లారెడ్డి 1978 నుండి కరీంనగర్ లో వకీలు వృత్తిని కొనసాగిస్తున్నాడు.మల్లారెడ్డి అణగారిన వర్గాలకు అండగా ఉన్నాడు.మల్లారెడ్డి స్వగ్రామమైన పోతారం (జె) తుర్కవానికుంట గ్రామానికి సర్పంచిగా ఎన్నికైనాడు.గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘానికి కార్యదర్శిగా పనిచేసి సేవలందించాడు.రచయిత నరేంద్ర సందినేని,కవి మల్లారెడ్డిని వారి స్వగృహం వావిలాలపల్లిలో కలవడం జరిగింది.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు.మల్లారెడ్డి రచించిన “నా లక్ష్యం– నా గమ్యం” కవితా సంపుటి చదవమని ఇచ్చాడు. మల్లారెడ్డి ఆఫీసులో కేసులకు సంబంధించిన ఫైళ్లు మరియు న్యాయవాద వృత్తికి సంబంధించిన జర్నల్స్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు వారి లైబ్రరీలో నిండి ఉన్నాయి.రచయిత నరేంద్ర సందినేని మల్లారెడ్డితో సాహిత్య విషయాలతో పాటు న్యాయవాద వృత్తికి సంబంధించిన విషయాలను గురించి కూడా చర్చించడం జరిగింది.రచయిత నరేంద్ర నాన్నగారు ఎస్. కె. పిళ్ళే ప్రముఖ కవిగా ప్రసిద్ది పొందారు.ఎస్ కె పిళ్ళే సమాజ అభ్యున్నతి కాంక్షించి చక్కటి రచనలు అందించాడు.ఎస్.కె.పిళ్ళే తెలంగాణ సాయుధ పోరాటంలో అమృత లాల్ శుక్ల గారలతో కలిసి పని చేశారు.మల్లారెడ్డి ఎస్.కె పిళ్ళేను జ్ఞాపకం చేశాడు. కవి,మల్లారెడ్డి నా లక్ష్యం– నాగమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవితలోని చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.చక్కటి అనుభూతులను సొంతం చేసుకోండి.

“అమ్మ ఎన్ని కొమ్మల చెట్టు/అంటున్నారు.ప్రకృతి అంటే అమ్మ.ప్రకృతి అంటే చెట్లు చేమలు.ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనలను తల్లిలా కాపాడుతుంది.వృక్షో రక్షతి రక్షితః అని శాస్త్రాలు చెబుతున్నాయి.మనం చరిత్ర పుస్తకాలు చదివితే కళింగరాజు అశోకుడు చెట్లు నాటించాడు అని చదివాం.ఆనాటి రాజులు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు.ప్రజల అభ్యుదయానికి తోడ్పాటు అందించారు.ఆనాటి రాజులు మానవ నాగరికత వికాసానికి తమ వంతు సాయం అందించారు.ఏపుగా పెరిగిన చెట్టు నీడన ఎండన వెళ్ళే బాటసారి సేద తీరతాడు.వర్షం కురుస్తున్నప్పుడు కూడా తడవకుండా ఉండటానికి చెట్టును ఆశ్రయిస్తారు.చెట్ల కట్టెలతో వంట చేసుకుంటారు.చెట్ల కలపతో దర్వాజాలు, తలుపులు,కిటికీలు,దూలాలు,కుర్చీలు,బల్లలు మరియు పారిశ్రామిక కార్యకలాపాలకి కూడా ఉపయోగిస్తారు.పేదవాడి ఏసీ.రూం చెట్టు.ఎందరో పేదవాళ్లు చెట్ల కిందనే ఆవాసాలు ఏర్పరచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.స్వచ్ఛమైన గాలి చెట్లనుండి లభిస్తుంది.చెట్టు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.చెట్లు కాలుష్యం దరిచేరకుండా నివారిస్తుంది.చెట్లు వాతావరణాన్ని పరిరక్షిస్తుంది.ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లాగే అమ్మను ఎన్ని కొమ్ముల చెట్టు అనే మల్లారెడ్డి కవి భావన కల్పన కాదు,వాస్తవం అని మనం అర్థం చేసుకోవాలి.
“అమ్మలో ఎన్ని పూల మెట్లు/అంటున్నారు. పూల చెట్లను చూడండి.రకరకాల పూలు. రంగురంగుల పూలు.కనులవిందు చేసే పూలు.అవి మల్లెలు,బొండు మల్లెలు,బంతులు,చామంతులు, విరజాజులు,గోరింటలు,నంది వర్ధనాలు, కనకాంబరాలు,జాజి పువ్వులు,కట్ల పూలు,తంగేడు పూలు,గుమ్మడి పూలు,తెలుపు,ఎరుపు,పసుపు,నీలి పువ్వులు.పూలతో దేవుని పూజిస్తారు.శుభకార్యాల్లో గృహంలో దర్వాజాలకి పూలదండలు కడతారు. స్త్రీలు తమ సిగలను పూలతో అలంకరించుకుంటారు.అశుభకార్యాల్లో కూడా వ్యక్తి చనిపోతే అతన్ని పూలతో అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తిని పూలతో సాగనంపుతారు. సన్మాన సభల్లో సన్మానిస్తూ పూలదండలు వేస్తారు. పూలు శాంతికి ప్రతిరూపాలు.పూలు లోక కళ్యాణానికి తోడ్పాటు అందిస్తాయి.పూలు సకల జనసౌఖ్యానికి మరియు శాంతికి ప్రతీకలు అని తెలుస్తుంది.అమ్మలో ఎన్నో పూల మెట్లు దాగి ఉన్నాయి అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.

“నిజానికి అమ్మనే ఒక సతత హరితారణ్యమ్ ‘ఒట్టు/ అంటున్నారు.అమ్మను సతత హరితారణ్యముతో పోల్చాడు.కవి మల్లారెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేస్తున్నాడు.పచ్చని చెట్లతో పక్షుల కిలకిలా రావాలతో జంతువుల అరుపులతో ఆహ్లాదంగా అరణ్యం కళకళలాడుతుంటుంది.మనం ఇంటి వద్ద కానీ,మరెక్కడైనా కానీ,పంచాయతీలో కానీ,ఒట్టు పెట్టుకుంటే అమ్మతోడు అని అంటాం.దేవుని తోడు అని కూడా అంటారు.ఒట్టు అంటే ప్రమాణం చేయడం.అమ్మ పట్ల చెప్పలేనంత భక్తి,అనురక్తి, నమ్మకం మరియు అంత ప్రాధాన్యత ఉంది.
“ఒక పరిపూవులా నవ్వుతుంది అమ్మ/అంటున్నారు.
నవ్వు టానిక్ లాంటిది.నవ్వు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.నవ్వితే శారీరక మానసిక రోగాలు నయమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.లాఫింగ్ థెరపీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.లాఫింగ్ థెరపీని ఆచరించి ఎందరో తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకుంటున్నారు.అమ్మ నవ్వులో అనురాగపు జల్లులు కురుస్తాయని కవి మల్లారెడ్డి తెలియజేశాడు.
“ఎంత పరిమళమో అమ్మ నవ్వు/ అంటున్నారు. అమ్మ నవ్వులో గులాబీలు,మల్లెలు,బంతులు, చామంతుల పరిమళాల సుగంధాలు వ్యాపిస్తాయి. పూల పరిమళాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
“మరుక్షణమె తేనెలా కురుస్తుంది అమ్మ/ అంటున్నారు.ఆయుర్వేదం,ఆల్లోపతి, హోమియోపతి,యునాని వైద్యంలో మరియు పతంజలి మహర్షి మరియు చరకుడు,హోమియో వైద్య పితామహుడైన హనిమన్ మహాశయుడు మొదలుకొని అలనాటి ఋషుల పరంపర మరియు ఈనాటి ఆధునిక వైద్యంలో తేనె ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.తేనె త్రాగడం వల్ల ఎన్నో జబ్బులు నయమౌతాయి,శారీరక మానసిక శక్తులు వికాసం పొందుతాయి.అమ్మ ఎప్పుడు అలసట ఎరుగక ఉల్లాసంగా ఉంటుంది.అమ్మ కుటుంబాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.అమ్మ కుటుంబ సంక్షేమం కొరకు తన తనువును మనసును ఏకాగ్రం చేసి పనిచేస్తుంది.కవి మల్లారెడ్డి తేనెలా కురుస్తుంది అమ్మా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎన్ని తీయదనాలో అమ్మలో/అంటున్నారు.చంటి పిల్లవాడికి అమ్మ పాల తీయదనం గురించి తెలుసు. చెరుకుతో తయారైన పంచదార,బెల్లం ఎంతో తీపిగా ఉంటుంది.అమ్మ ఏది చేసినా అమృతంలా ఉంటుంది.అమ్మ మనసు తీపి అని కవి మల్లా రెడ్డి తెలియజేయడం చక్కగా ఉంది.
“ అమ్మ ఒళ్ళు నిమిరితె ఎంత పారవశ్యం/ అంటున్నారు.అమ్మ ఒళ్ళు నిమిరితే ఆ పాప ఎంతో పారవశ్యంతో పొంగిపోతుంది.అమ్మ చేయి తాకగానే పాప ఆనందంతో ఓలలాడుతుంది.అమ్మను చూడగానే పాప కేరింతలు కొడుతుంది.అమ్మ లాలనలో పాప ఆనంద తాండవం చేస్తుంది అని కవి మల్ల రెడ్డి తెలియజేస్తున్నాడు.
“అమ్మ మాటలే మమతల మూటలు/అంటున్నారు.
పసిపాపకు అమ్మ మాటలే మమతానురాగాల మూటలు.తల్లి భాషను పసిపాప అర్థం చేసుకుంటుంది.అమ్మ స్పర్శ కోసం పసిపాప తపించిపోతుంది.పసి పాపకు అమ్మే కద ప్రాణం మరియు వెలుగు అని చెబుతున్నాడు.
“అమ్మ కళ్ళు నిజాయితీకి ఆనవాళ్లు/అంటున్నారు.
ఇప్పుడున్న వ్యవస్థలో నిజాయితీని వెదకడం చాలా కష్టంగా అనిపిస్తుంది.ఎటు చూసినా అవినీతి,ఆశ్రిత పక్షపాతం,బంధుప్రీతి ఆవరించి ఉంది.కానీ ఈ వ్యవస్థలో అమ్మ కళ్ళు నిజాయితీతో నిండి ఉంటాయి.అప్పటికి,ఇప్పటికీ,ఎప్పటికీ పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే అనే సినీ గీతం మన విని ఉన్నాం. అలాగే అమ్మ కళ్ళు కూడా నిజాయితీకి ఆనవాళ్లు అనేది సత్యం అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.
“ఎన్నో ధీర గుణాలకి నకళ్ళు ఆ కళ్ళు/అంటున్నారు.
ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది తల్లి జిజియాబాయి. మనం అతన్ని వీర శివాజీ అని పిలుస్తాం. “అమ్మ ఒక్క చూపు చాలు సుదూర గమ్యం చేరడానికి/అంటున్నారు.అమ్మ యొక్క చల్లని చూపు ఆశీర్వాదాల వల్లనే ఎందరో పిల్లలు ఉన్నత విద్య కొరకు ఉద్యోగాల కొరకు అమెరికా,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,న్యూజిలాండ్,జర్మనీ,కెనడా మరెన్నో విదేశాలకు వెళ్లి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.విదేశాల్లో స్థిరపడుతున్నారు.తమ దేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు.
“ఎన్ని గండాలను గట్టెక్కించింది అమ్మ/ అంటున్నారు.అమ్మ నవ మాసాలు మోసి పసిపాపను కంటుంది.ఆ పసిపాపను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాన్ని చేస్తుంది.ఎన్ని గండాలు ఎదురైనా గట్టెక్కిస్తుంది అమ్మ.కవి మల్లారెడ్డికి అమ్మ పట్ల ఆనిర్వచనీయమైన ప్రేమ,నమ్మకం,విశ్వాసం ఉన్నట్లు తెలుస్తుంది.
“చిన్ని బ్రతుక్కి అమృత బాండమైంది అమ్మ/అంటున్నారు.మనం పురాణాలు చదివితే అమృతం దేవతలకి మాత్రమే లభించింది.కానీ రాక్షసులకు అమృతం దొరకలేదు.అమృతాన్ని గ్రోలిన వారు అమరులై ఉంటారంటారు.చిన్నారులు అమ్మ ప్రేమతో అమృత భాండాన్ని అందుకుంటున్నారు.
“నిజానికి అమ్మ సమస్త సమాజానికి అధి దేవత/ కొలిస్తేనే కాదు పిలిస్తేనే కాదు – /తనంత తానే ఒక శక్తిపీఠవుతుంది అమ్మ/ అంటున్నారు.అమ్మను దుర్గామాతగా కొలుస్తారు.సకల దేవతల స్వరూపం అమ్మ.రామకృష్ణ పరమహంస కాళీమాత ఉపాసకుడు.రామకృష్ణ పరమహంస శిష్యుడే స్వామి వివేకానంద.అమ్మ సకల మానవాళి సంక్షేమాన్ని కోరుతుంది.అమ్మకు సంబంధించిన ఆలయాలన్నీ శక్తి పీఠాలే.అమ్మను ఆరాధించడం వల్ల సకల భయాల నుండి సంకటాల నుండి అరిష్ఠాల నుండి ఆమె నివారిస్తుంది.
“సంకల్పబలమనే స్తన్యమిచ్చి పెంచింది అమ్మ/ అంటున్నారు.అమ్మ పాలు తాగి సంకల్ప బలంతో వీర శివాజీ,నేతాజీ సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్ మరెందరో వీరులు మన భారతదేశం స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారితో పోరాడి వీరులుగా పేరు తెచ్చుకున్నారు.
“అమ్మనే జీవితానికి భూమిక దిగంతాలకి వేడుక/అంటున్నారు.అమ్మలేని జీవితం లేదు.అమ్మే కద అన్నిటికీ మూలం మరియు అమ్మ ఆకాశానికి వేడుక అని కవి మల్లారెడ్డి చెప్పాడు.
“మాతృదేవోభవ నమో నమామి/అంటున్నారు. అమ్మని దేవతగా ఆరాధించమని మన పురాణాలు చెపుతున్నాయి.అమ్మని పూజిస్తే దైవాన్ని పూజించినట్లే.కనిపించే దైవం అమ్మ.కానీ ఈనాడు ఎందరు తమ ప్రత్యక్ష దైవమైన తమ తల్లులను పూజిస్తున్నారు?.అహంకారం తలకెక్కి తల్లులను క్షోభకు గురి చేస్తున్నారు.వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేస్తున్నారు.తల్లుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదు.బంధాలు బాంధవ్యాలను మరిచి పోతున్నారు.మమతానురాగాలకకు మసి పూస్తున్నారు.మన ప్రభుత్వాలు తల్లుల సంక్షేమం కోసం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అవి చట్టు బండలుగా మారుతున్నాయి.అమ్మను ఆప్యాయంగా పలకరించుకొనే సంప్రదాయం పల్లెలోనే ఉండేది.ఇప్పుడు ఆ పల్లెలు అన్ని ఖాళీ అయిపోతున్నాయి.వర్షాలు ఉండవు.కరువులు కాటకాలు.ఉన్న ఊరిలో ఉపాధి కరువై పల్లె జనాలు పట్టణాలకి విదేశాలకి వలస వెళుతున్నారు.పాడి పంటలతో తులతూగే పల్లెలు ఈనాడు వల్లకాడుగా మారుతున్నాయి.మరుభూమిని తలపింపజేస్తున్నాయి.పాత ఇండ్లు అన్నీ కూలిపోతున్నాయి.రోజులన్నీ మారిపోతున్నాయి. ఒక తల్లి పిల్లలే పాలి పగలు పెంచుకొని చంపుకుంటున్నారు.కన్నతల్లులను నిరాదరణకి గురి చేస్తున్నారు.తల్లులను ప్రేమించడం లేదు.తల్లులను ప్రేమించలేని వారు తమ వ్యక్తిత్వం,సంపద మరియు ఉన్నతమైన విలువలను కోల్పోతున్నారు.తల్లుల్ని ప్రేమించిన వారికి కామధేనువులా,కల్ప వృక్షంలా కోరినవన్నీ లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు.అమ్మను జగదాంబ,ఆదిశక్తి, పరాశక్తి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.అమ్మ గురించి చక్కటి కవిత రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి గులాబీల మల్లారెడ్డి మరిన్ని మంచి కవిత సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.












