నా జీవితం-
ఓటిపడవ ప్రయాణం
నిత్యం నా నిరీక్షణ
దరిదాపుకై సంశోధనం
నేను-
ఎడారి కోయిలను
నా హృదయాలాపన
గ్రీష్మకాల ప్రణవనాదం

నాది-
క్షతగాత్ర హృదయం
నా అంతరంగం
ఓ మరుభూమి
నాకు-
ఓదార్పు కలకంఠి గాత్రం
మోడువారిని నా జీవితానికి
తొలకరి జల్లు ఆ గీతం
మాటలో మతలబులెన్నో!
మర్మాలు ఇంకెన్నో కదా!
మాట మలయ మారుతంలా హాయినిస్తుంది
చందన లేపనంలా చల్లనైనది
ఆత్మబంధువు పలకరింపులా సాంత్వనమిస్తుంది
మాట చిన్నదే !మది గాయం పెద్దది చేస్తుంది
అదే మాట గాయాన్ని మాన్పే దివ్య ఔషధమౌతుంది
అలజడితో నిశ్శబ్ద తరంగమౌతుంది
మదిని కాల్చే అగ్ని కణమౌతుంది
కసిరేపి పాతాళానికి తొక్కేస్తుంది
మారణ హోమానికి పరాకాష్ఠౌతుంది
ఒక్క మాట జీవితాన్నే మార్చేస్తుంది
మార్పుకు మూల హేతువౌతుంది
మనసు పదిల పరిచే ప్రయత్నమౌతుంది
మానవత్వానికి మరో రూపమౌతుంది
ప్రేరణతో విశ్వవిజేతను చేస్తుంది
పెదవి దాటితే మరలి రాదు
మదిని కాల్చితే మరపురాదు
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ,వక్త, వ్యాసకర్త, అధ్యాపకురాలు ,బహుభాషా కోవిదరాలు ఐన శ్రీమతి పాకాల యశోద రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ .ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ‘బిజినేపల్లి’ గ్రామం, నాగర్ కర్నూల్ లో ఆగస్టు 8 1929న జన్మించారు .తల్లిదండ్రులు సరస్వతమ్మ ,కాశిరెడ్డి గార్లు. మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివి తదనంతరం ‘రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ‘గారి ప్రోత్సాహంతో నారాయణగూడ లోని ‘బాలికోన్నత పాఠశాల’లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషల్లో స్నాతకోత్తరపట్టా పొందారు. 1976లో” అలీఘర్ విశ్వవిద్యాలయం’ నుండి డి.లిట్.అందుకున్నారు.హిందీ, ఉర్దూ ,కన్నడ భాషలతో పాటు జర్మన్ భాషలో కూడా ప్రవీణురాలు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పాకాల తిరుమలరెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెడ్డిగారు గీసిన ఎన్నో చిత్రాలకు ఆమే స్ఫూర్తి ప్రదాత .స్వతహాగా కళాపిపాసి ఐన ఈమె ‘ఇత్తడి విగ్రహాల’ సేకరణ చేసేవారు. భర్త చిత్రకళా ప్రదర్శనలో చురుకుగా పాల్గొని విజయవంతం అయ్యేలా చూసేవారు. రెడ్డి గారితో ప్రదర్శనల కోసం పలు దేశాలు పర్యటించిన సందర్భంలో ‘భారతీయ చిత్రకళ’ అనే గ్రంథాన్ని రచించారు.
యశోద గారు తన 12వ ఏట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం రచయిత్రి .ఈమె రచనలు కల్పితాలు కావు. అవి అనుభవ సారాలు .తెలంగాణ జీవన విధానం ,సంస్కృతి- సంప్రదాయాలు ,ఆచార- వ్యవహారాలు ,సామెతలు సందర్భానుసారంగా తమ రచనల్లో నిక్షిప్తం చేసేవారు .బాల్యంలో ఈమెను ‘ఎచ్చమ్మ ‘అని పిలిచేవారట .ఆ పేరుతోనే ‘ఎచ్చమ్మ కథలు ‘రాశారు .యశోద గారు వందకు పైగా కథలల్లినా 63 మాత్రమే పుస్తక రూపం సంతరించుకున్నాయి. మూడు కథా సంపుటాల్లో ‘మా ఊరి ముచ్చట్లు’ (1973 )సంపుటిలో 1920 – 40 మధ్యకాలంనాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ‘ఎచ్చమ్మ కథలు'( 1999 )లో 1950- 70 నాటి తెలంగాణ సంస్కృతిని ప్రస్ఫుటంగా దర్శింప జేశారు .’ధర్మశాల'( 2000) సంపుటిలో 1980 – 90 మధ్యకాలం నాటి తెలంగాణ సమాజపు పరిస్థితులు చక్కగా వివరించారు. ఒక రకంగా తెలంగాణ సమాజపు నూతన శకానికి ‘దర్పణం’గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ మూడు సంపుటాల్లో తెలంగాణ భాష, మాండలికం ,సంస్కృతి ,సామాజిక అంశాలను చక్కగా వివరించారు. ‘మా ఊరి ముచ్చట్లు ‘,’ఎచ్చమ్మ కథలు ‘పాలమూరు మాండలికంలోను, ‘ధర్మశాల’వ్యావహారిక తెలుగులో రాశారు.
మాండలిక భాష పరిరక్షణే ధ్యేయంగా ఆమె రాసిన పరిశోధక వ్యాసాలు భారతి, జాగృతి ,మూసీలాంటి ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి వక్తయైన ఈమె ప్రాచీన తెలుగు సాహిత్యంపై చేసిన ప్రసంగాలతో పండితుల ప్రశంసలు అందుకున్నారు .తన మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేవారు .’ఆకాశవాణి’లో తెలంగాణ మాండలికంలో ప్రసంగించిన తొలి రచయితగా పేరుపొందారు .’ఆకాశవాణి’లో ‘పండుగలు – పబ్బాలు ‘,’జరఇను కోవే తల్లీ’ , ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ ఇలా పలు శీర్షికల పేరిట 200 పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
194 9- 50 ప్రాంతంలో” దక్కన్ రేడియో’లో మాండలిక భాషలో కథలు ,సంభాషణలు, పిల్లల నాటికలు మొదట ప్రారంభించిన ఘనత వహించారు. బాల సాహితీవేత్త ఐన ఈమె ‘బుచ్చయ్య పెబ్బె ‘నాటికను పిల్లలకోసం రచించారు.
యశోద గారు కవయిత్రిగా ఉగాదికి – ఉయ్యాల, భావిక అనే రెండు సంపుటాలు స్వయంగా వెలువరించారు. ఇంకా ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భాగవతసుధ రచించారు. సంయుక్తంగా వెలువరించిన మరొక రెండు రచనలు. 1.కావ్యానుశీలనం (డాక్టర్.కులశేఖర్ రావు గారితో కలిసి) 2.చిరుగజ్జెలు (ఆల్వార్ స్వామి ,సి.నారాయణరెడ్డి గార్లతో కలిసి)
వీరు పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం ,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించి విలువైన పీఠికలు రాసి వెలువరించారు. అనువాదకురాలైన ఈమె’ హిందీ కవయిత్రులు’ గ్రంథాన్ని అనువదించారు.
యశోద గారి అభిప్రాయం: భాషలో నానుడిగాని ,సామెత గానీ, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆయా ప్రాంతాల వారి అనుభవాల సారం నుండి ఉద్భవించినవి ఇవి. ‘నుడికారాలు ‘భాషకు ‘జీవనాడి’ అని ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ,లలిత కళా అకాడమీ, సంగీతా అకాడమీ లలో సభ్యురాలిగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో కూడా అనుబంధము ఉండేది .
నిక్కచ్చి మాట తీరు, నిర్విరామ కృషి ,తెలంగాణ భాషపై పట్టు, మాండలికం పై అవ్యాజమైన మమకారంతో
శైలిలో హృద్యంగా రాసి మాండలికాన్ని ‘సజీవ శిల్పం’గా మలిచి తెలంగాణా భాషా సొబగుల్ని తన విశిష్ట రచనావ్యాసంగాల ద్వారా విశ్వవ్యాప్తం చేసి అలసి ,ఆ భారతీదేవి పాదాల చెంత అక్టోబర్ 7 ,2007న ప్రశాంత నిద్రలోకి జారుకున్న ఈ అవిశ్రాంత బహుముఖ ప్రజ్ఞాశాలికి అందించే ‘అక్షర నివాళి’యే ఏ నిజమైన శ్రద్ధాంజలి.
భాషా వికాసానికి సాహిత్యం ఒక వేదిక లాంటిది . మానవునిలోని సృజనాత్మకతను, కవితా శక్తిని సమర్థవంతంగా వెలికి తీసే ఒక గొప్ప సాధనం . భాషాభివృద్ధి సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ కవిత్వంతోనే సాధ్యమవుతుందనేది నిర్వివాదాంశం . భావవ్యక్తీకరణకు కవిత్వం ఒక దర్పణంలాంటిది . ప్రతి దేశ చరిత్రలో సాహిత్య ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది . ఆయా దేశకాల పరిస్థితులను ప్రతిబింబించేటట్టుగా సమాజ శ్రేయస్సులో కవి పోషించిన పాత్ర అవగతం అవుతూనే ఉంటుంది .
మన దేశం కళలు , సాహిత్యాల కాణాచి . 11వ శతాబ్దికి ముందునుండే ఎంతో మంది సాహితీప్రియులైన రాజులు , చక్రవర్తులు సాహితీఅభినివేశులై కవులను , కళాకారులను ప్రోత్సహించి , ఆదరించిన నిదర్శనాలు కోకొల్లలు . (ఇతర దేశాలలో 18వ శతాబ్దికి ముందు వరకు ఇలాంటి సంస్కృతి మనకు ఎక్కడా కనిపించదు ) తెలుగు భాష 2000 ల సంవత్సరానికి ముందునుండే వాడుకలో ఉందనడానికి లభించిన సాక్ష్యం’ గాధా సప్తశతి ‘ . తొలి తెలుగు కావ్య ప్రక్రియ రాసిన నన్నయకు ముందు నుండే తెలుగు సాహిత్యం ఉందనడానికి ప్రధాన ఆధారం ,
క్రీస్తు శకము .1000 నాటి విరియాల కామసాని ‘గూడూరు శాసనం’. ఇందులో మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి . ప్రాచీన సాహిత్యం భక్తిరస ప్రధానమని పేర్కొనవచ్చును. తమ రచనలతో వెలుగొందిన కొందరు ప్రముఖ రచయిత్రులు :-
కుప్పాంబిక : తొలి తెలుగు కవయిత్రి గా భావించవచ్చు. 13వ శతాబ్దికి చెందినవారు . వనజా తాంబకుడేయు సా యకములన్ వర్ణింపగారాదు నూ … ఈపద్యం ఆమె తన ‘బూదపుర’ శాసనం లో వేయించారు. ఈ పద్యం అయ్యల రాజు తన ‘సంకలన గ్రంథం’లో ప్రస్తావించారు . ఇంతకు మించిన ఆధారాలు అలభ్యం.
తాళ్లపాక తిమ్మక్క :15వ శతాబ్దికి చెందినవారు .అన్నమయ్య భార్య అయిన వీరు ‘సుభద్రా కళ్యాణం ‘ , ‘ ద్విపద ‘ లో రచించారు.
ఆతుకూరి మొల్ల : ‘ మొల్ల రామాయణం ‘ రచించారు . కవయిత్రి మొల్లగా ప్రసిద్ధులు, 16వ శతాబ్దికి చెందినవారు.
రంగాజమ్మ : 17వ శతాబ్దికి చెందినవారు . ‘ మన్నారు దాస విలాసం ‘ ప్రబంధం రచించారు.
తరిగొండ వెంగమాంబ : 19వ శతాబ్దం వారు . ‘ వేంకటాచల మహాత్మ్యం ‘ రచించారు.
ఈ నారీమణులు తమ రచనలతో ప్రాచీన సాహిత్యాన్ని సుసంపన్నం చేసి చరిత్రలో తమ స్థానాన్నిపదిలపరుచుకున్నారు.
ఇక ఆధునిక సాహిత్య ప్రస్థానం విభిన్న రీతులతో వేగాన్ని పెంచుకుని వివిధ రూపాలుగా విస్తరించింది . ముఖ్యంగా వచన కవితలు ఊపందుకున్నాయి . ఛందోబద్ధం కాని పదాడంబరత లేని వచన కవిత్వాన్ని ఆధునిక సమాజం ఆదరిస్తోంది . సామాజిక చైతన్యమే కవిత్వం ప్రధాన లక్షణం . అలతి పదాలతో అందంగా విస్పష్టంగా చెప్పడం ‘ ఓ గొప్ప కళ ‘ . కవిత్వం ‘ అనుభూతి పరిమళాల ‘ను వెదజల్లాలి . ఆధునిక సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలువడ్డాయి. తెలుగులో సాహితీమణులు ఎందరో తమ తమ రచనలతో సమాజ పురోగతిలో కీలకపాత్ర పోషించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసి కీర్తి గడించారు. వారిలో కొందరి ముఖ్యరచనలు కొన్ని :-
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ‘ కిరీటం’ గా దాల్చిన నలుగురు మహిళా మణులు :-
1. ఇల్లిందల సరస్వతీదేవి : వీరు తమ రచనలతో ఎంతో ప్రభావితం చేశారు . ‘ కృష్ణా ‘ పత్రిక లో వీరి ‘ఇయం గేహే లక్ష్మి’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది . ‘ స్వర్ణ కమలాలు’ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు . ఈ అవార్డు పొందిన తొలి తెలుగు మహిళ కావడం విశేషం .
2. మాలతి చందూర్ : ఆంధ్రప్రభ లో వీరి ‘ ప్రమదావనం ‘ శీర్షిక విశ్వవిఖ్యాతినొంది’ గిన్నిస్ రికార్డు’ సాధించింది . ఎన్నో రచనలు చేసిన వీరికి ‘హృదయనేత్రి’ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
3. అబ్బూరి ఛాయదేవి : స్త్రీవాద రచయిత్రి . పిల్లల పెంపకంలోని లింగ వివక్ష పై వీరు రాసిన కథ ‘బోన్సాయి బతుకు’ అత్యంత ఆదరణ పొందింది. ‘ తన మార్గం ‘ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
4. కాత్యాయనీ విద్మహే: అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి . ‘ సాహిత్యా కాశంలో సగం ‘వ్యాస సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు .
ఇంకా సాహిత్యాకాశంలో మెరిసిన ధృవ తారలు వారి మేటి రచనలు కొన్ని :
బసవరాజు రాజ్యలక్ష్మి : ‘సౌదామిని ‘ కలం పేరుతో కవితలు అల్లారు.’ అప్పారావు గారు – నేను’ ఆత్మకథ రచించారు.
సత్యవాడ సోదరీమణులు : సత్యవాడ రఘునాథమ్మ , సత్యవాడ సూర్యకుమారి. సంగీత సాహిత్యాలలో అభినివే శమున్న వీరు’ సరస్వతీ నమస్తుభ్యం’ ,’హరిప్రియ’రచించారు.
జొన్నవాడ రాఘవమ్మ : ‘భావతరంగాలు’ ‘ రాధికా గీతాలు’ రాశారు.
భానుమతి రామకృష్ణ : సినీ నటి , రచయిత్రి ‘అత్తగారి కథ లు ‘ వీరు రచించిన వాటిలో ముఖ్యమైనవి.
మల్లు స్వరాజ్యం : సాయుధ పోరాటంలో వీరిది క్రియాశీల పాత్ర . జానపద బాణీల్లో రాసి , పాడి గిరిజనులకు స్ఫూర్తి కలిగించారు . సిపిఐ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ : సమాజంలోని అసమానతలపై కలం ఝలిపించి ఎన్నోరచనలు చేశారు. ‘ స్వీట్ హోమ్.’ ‘రామాయణ విషవృక్షం’ వీరి ముఖ్య రచనలు .
వాసిరెడ్డి సీతాదేవి : ‘వైతరిణి ‘, ‘మట్టి మనిషి’ నవలలు ముఖ్యమైనవి . మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువదించబడింది .
డి కామేశ్వరి : మానవీయ దృక్పథం వీరి రచనాశైలి . ‘ఆకలి ‘ , ‘ కొత్తనీరు’ ముఖ్యరచనలు.
వింజమూరి సోదరీమణులు : వింజమూరి అనసూయ , వింజమూరి సీతాదేవి . వీరు జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ప్రాచుర్యం పొందారు. అనసూయ గారు ‘భావ గీతాలు,’ ‘ జానపద గేయం’ రచించారు . సీతాదేవి గారు ‘ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ‘ రచించారు.
పాకాల యశోద : ప్రముఖ రచయిత్రి ‘ఉగాదికి ఉయ్యాల’ , ‘ భావిక ‘ సంకలనాలు వెలువరించారు.
ముదిగంటి సుజాత రెడ్డి : ప్రముఖ రచయిత్రి. ‘తెలంగాణ తొలి తరం కథలు ‘ చాలా ప్రా చుర్యం పొందింది.
డాక్టర్ మృణాళిని : ప్రముఖ రచయిత్రి . అధిక్షేపహాస్యం వీరి ప్రియమైన శైలి . ‘ కోమలి గాంధారం , ‘తాంబూలం’ వీరి ముఖ్య రచనలు.
డాక్టర్. పి. లక్ష్మి: కవయిత్రి , విమర్శకురాలు. ‘శిలాలోలిత’ కలం పేరుతో రచనలు చేస్తారు. ‘పంజరాన్ని నేనే – పక్షిని నేనే’ వీరి ముఖ్య రచన.
లలిత కుమారి : స్త్రీవాద రచయిత్రి . ‘ ఓల్గా’ కలం పేరుతో రచనలు చేస్తారు . వీరి ముఖ్య రచన ‘ స్వేచ్ఛ’ నవల. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడింది.
మల్లంపల్లి జలంధర : ప్రముఖ రచయిత్రి అయిన ఈమె రచనలలో ‘ఆటోగ్రాఫ్’ , ‘పున్నాగ పూలు’ ముఖ్యమైనవి.
కొండేపూడి నిర్మల : వీరు ప్రముఖ రచయిత్రి , కవయిత్రి , జర్నలిస్టు . వీరి ‘ లేబర్ రూమ్ ‘ కవిత అత్యంత ప్రాచుర్యం పొందింది.
పాటిబండ్ల రజని : ‘అబార్షన్ స్టేట్మెంట్ ‘ కవిత అత్యంత ఆదరణ పొందింది.
సమాజ హితవు కోరి స్ఫూర్తి ప్రదాతలై భావావేశపు ‘సిరా చుక్కల ఉలి’తో అక్షర శిల్పాలను అందంగా మలచి ‘జీవకళ ‘ నిచ్చిన సాహితీస్ర ష్టలైన మహిళా మణులు ఎందరో ! సమయాభావంతో పేర్కొనని తేజోవిరాజమానులైన ‘మహిళా మణులు ‘ ఇంకెందరో కదా ! అందరికీ అక్షరాభివాదములు .
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావ కారణాలు లింగ వివక్ష , పునరుత్పత్తి హక్కులు , ఉద్యోగం ,ఓటు హక్కు హింస ఇలా అనేక మహిళా సమస్యలే ప్రధానాంశాలుగా ఉద్యమ రూపం దాల్చి తదనంతర పరిణామ క్రమంలో ఏర్పాటయిందీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తొలుత ఎలాంటి నిర్ణీత తేదీ లేనప్పటికీ వివిధ మార్పులు- చేర్పుల అనంతరం ఐక్యరాజ్యసమితి మార్చి8 ,1977 లో దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా సెలవుదినంగా ప్రకటించింది .ఈరోజున వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషిని ,విజయాలను గుర్తించి ప్రోత్సహించడం ఒక రివాజుగా మారింది. భారతీయ సంస్కృతి- సంప్రదాయాలలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ మూర్తిదే అత్యంత కీలక స్థానం. ప్రతిరోజూ ఆమె నిర్వహించే పాత్ర ప్రధానమైనదే . మన దేశంలో ఎందరో మహిళామణులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి విశ్వవిఖ్యాతినొందారు . వారిలో ఒక మణిరత్నం శ్రీమతి మాలతీ చందూర్ గారు.
‘ప్రమదావనం’లో విరిసన ‘ సిందూర పుష్పం ‘ శ్రీమతి మాలతీ చందూర్. వీరు నూజివీడులో డిసెంబర్ 26,1928 న జ్ఞానాంబ ,వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు . 8వ తరగతి వరకు విద్యాభ్యాసం నూజివీడులోనే సాగించి తదనంతరం మేనమామ చందూర్ గారి వద్ద ఏలూరులో సెయింట్ థెరీసా స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించారు. అప్పుడే డి . కామేశ్వరి ఆనందరామం, శ్రీ శ్రీ , విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి నండూరి సుబ్బారావు మొదలైన వారిని కలిసే అవకాశం కలిగింది. 1947లో మేనమామ నాగేశ్వరరావు చందూర్ గారితో మద్రాస్ చేరుకుని వివాహానంతరం ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1949 నుండి రచనావ్యాసంగంలోకి అడుగు పెట్టారు. అప్పట్లో వారు రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. అక్కడే బుచ్చిబాబు , జనమంచి రామకృష్ణ, రాజమన్నార్ , మునిమాణిక్యం నరసింహారావు లాంటి సాహితీస్రష్టలెందరితోనో పరిచయాలు ఏర్పడ్డాయి.
సాధారణ చదువు కలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. తెలిసింది చెప్పడం అతి తేలిక కానీ అవగాహన లేని అంశాల్ని సైతం కూలంకషంగా తెలుసుకుని ఓర్పుతో నేర్పుగా అర్థవంతంగా అద్భుతంగా వివరించడం ఆమెకే సాధ్యపడింది. తన ప్రతిభాదక్షతలతో ఎన్నో శీర్షికల్ని నిర్వహించారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 1952 నుండి దశాబ్దాల పాటు ‘ప్రమదావనం’ శీర్షిక నిర్వహించి ‘గిన్నిస్ ‘ రికార్డు సాధించారు. ఈ శీర్షికలో ఆమె స్పృశించని అంశమే లేదు. స్త్రీల సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడిందీశీర్షిక. ‘వంటలు – పిండి వంటలు’ వంటల పుస్తకం కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉండి 30 సార్లు పునర్ముద్రింపబడింది .
వీరి ‘జవాబులు’ శీర్షికను మగవారు సైతం చదివేవారు.
‘మహిళ ‘ ప్రధానాంశంగా దాదాపు పాతిక నవలలు రచించారు . తెలుగు, తమిళం, ఆంగ్లభాషలపై పట్టున్న ఈమె 300కు పైగా ఆంగ్ల రచనలను అనువదించారు . జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీరాయ్ రచనల వరకు ఇలా ఎందరివో అనువదించారు. 1970 నుండి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ క్రమంలో తమిళ సినిమాల కోసం తమిళ భాష నేర్చుకుని అనువాదాలు చేసే స్థాయికి ఎదిగారు. ‘స్వాతి ‘ పత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షికన ఆంగ్లానువాదలన్నీ దాదాపుగా
ప్రచురితమయ్యాయి.
వీరి తొలి కథ : ‘ రవ్వల దుద్దులు’
” నవల: ‘చంపకం – చెదపురుగులు’
ముఖ్య రచనలు :- భూమిపుత్రి , ఆలోచించు, హృదయనేత్రి , శతాబ్ది సూరీడు, శిశిర వసంతం మొదలైనవి.
అవార్డులు: 1987 : సమైక్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. (‘హృదయనేత్రి’)
1990: ప్రతిష్టాత్మక భారతీయ
విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
1992: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (హృదయనేత్రి)
1996: రాజా – లక్ష్మీ అవార్డు
1996: తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
2005: శ్రీ చందూర్ , యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు సంయుక్తంగా స్థాపించిన ‘లోక్ నాయక్’ మొట్టమొదటి అవార్డు
2005: పద్మావతీవిశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ మరియు ‘కళాప్రపూర్ణ ‘ బిరుదు ప్రదానం.
జిజ్ఞాస , పట్టుదల , అవిశ్రాంత కృషితో సాహితీప్రక్రియలెన్నింటినో సృజించి సారస్వత శిఖరాలను అధిరోహించి అనేక సన్మానాలు సత్కారాలు పొందిన వీరికి జీవన సహచరుడు అందించిన సహాయ సహకారాలు అసాధారణం . తన పేరుకు చివర చందూర్ గారిని ‘మకుటం ‘ గా దాల్చి విరాజిల్లిన ఈ ‘విద్వన్మణి ‘ఆగస్టు 21, 2013న వాగ్దేవి పాదాల చెంత శాశ్వతంగా విశ్రమించారు. ఈ విజ్ఞానభాండాగారానికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదేముంటుంది
అక్షరసుమాంజలి తప్ప.
అందరి పాదాలకు రక్షణ కవచమై నిలుస్తూ
అలరించబడే ఓ పాదరక్షా! నిన్ను అవసరార్థం
ధరించేవారు కొందరైతే దర్పంగా భావించేవారు
ఇంకెందరో కదా! కరకు పాదాలకింద కర్కశంగా నలిగినా
సున్నిత పాదాలకు అందమైన అలంకారంగా బాసిల్లినా
తర తమ భేదాలెరుగక అందరి కాలిలో పొందికగా
ఒదిగుండే ఓ పాదరక్షా! రంగుల కలయికతో భిన్న ఆకృతులలో
అందంగా మలచి నీ కొక విలక్షణ స్థానమిచ్చిన ఆ చర్మకారుడెంత
కళాహృదయుడో కదా! ఆపద్భాంధవుడైన ఆ దాశరథి పాద పద్మాలలో
వినయంగా ఒదిగిన నీకు పట్టంగట్టి ప్రాభవం ఒసగిన ఆ భరతుడెంత
ధర్మాత్ముడో కదా! అరుదైన గౌరవంతో అలరారిన నీ జన్మ చరితార్థమాయె కదా!