ఇంటర్వ్యూలు
డా. కూరెళ్ళ విఠలాచార్య
పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్య గారితో మయూఖ ముఖాముఖి…
అభినవ పోతన, మధురకవి, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర సామ్రాట్ బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, సామాజిక వేత్త , భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నోట “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రశంసించబడి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. – అరుణ ధూళిపాళ
నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం మా భాగ్యం. మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.
1. మీ జననం, పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి.
జ: అమ్మా! నమస్కారం. నేను జూలై 9, 1938 లో నీర్నేముల గ్రామంలో జన్మించాను. మా అమ్మగారి పేరు కూరెళ్ళ లక్ష్మమ్మ, నాన్నగారు కూరెళ్ళ వేంకటరాజయ్య. అప్పటి కాలంలో అన్నీ బాల్య వివాహాలు కావడం వల్ల మా అమ్మ గారికి 15 ఏళ్ళ వయస్సు వున్నప్పుడు నేను పుట్టాను. దురదృష్టవశాత్తు నేను అయిదు నెలల పసివానిగా ఉన్న సమయంలో మా నాన్నగారు మరణించారు. మా చిన్న పెద్దనాయన గారు నన్ను ఎత్తుకొని మా నాన్న చితిని ముట్టిస్తుంటే జనమంతా ఏడ్చారట. అప్పటినుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెల్లంకిలో మా పెదనాన్నలెవ్వరూ మమ్మల్ని చేరదీయలేదు. మా మాతామహులు మమ్మల్ని నీర్నేములకు తీసుకుపోయినారు. మా అమ్మమ్మకు నేనంటే అమితమైన ప్రాణం. ఒక్క క్షణం నేను కనబడకపోతే ఆమె ప్రాణం విలవిలలాడేది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మా అమ్మగారితో పాటు నేను బంధువుల ఇంటికి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే నా పాదాలను జాజులో ముంచి, గోడకు ముద్రించి వాటిని చూస్తూ నేను తిరిగి వచ్చేవరకు గడిపేది. అంతటి ప్రేమమూర్తి ఆమె. ఆ సందర్భాన్ని తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి నాకు ( కన్నీటి పర్యంతమవుతూ). అందుకే వీళ్ళ ఋణం తీర్చుకోవడానికి మా అమ్మమ్మ పేర , తాతయ్య గారి పేర ఏటా బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ పురస్కారాన్ని ఇస్తున్నాను. 7వ తరగతిలో తెలుగు భాషలో ప్రథమశ్రేణి వచ్చినవారికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినాసరే ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను.

2. బాల్యమంతా ఇంత కష్టాన్ని ఎదుర్కొన్న మీ విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ: నేను పుట్టింది 1938లో అయినా విద్యాభ్యాసం మటుకు 1945 లో జరిగింది. ఆ కాలంలో ఊళ్ళల్లో ముస్లింలు చదువు చెప్పేవారు. మసూల్ దార్ సాహెబ్ నీర్నేములలో, వెల్లంకిలో షేక్ అహ్మద్, సిరిపురంలో గాలిబ్ సాబ్, రామన్నపేటలో గులాం రసూల్ అని టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు భాష రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పేవారు. అప్పుడు పాఠశాలలు లేవు. విచిత్రం ఏమిటంటే మసూల్ దార్ సాహెబ్ నాకు పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మతో పాటు తిరగాల్సి రావడం వలన నాది వానాకాలం చదువయ్యింది. ఆ పరంపరలో నీర్నేముల, ముని పంపుల, వెలివర్తి, వెల్లంకి ఇలా రకరకాల ఊళ్ళల్లో నా చదువు సాగింది. ఆ తర్వాత 1950 నుండి రామన్నపేటలో నాల్గవ తరగతి నుండి ఒక క్రమపద్ధతిలో నా చదువు కొనసాగింది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో కోటిచింతల పురుషోత్తమం గారని పాఠశాల హెడ్ మాస్టర్ వయసు ఎక్కువవుతుందని రికార్డులలో జననం 1940 గా రాయించారు. నీర్నేముల నుండి సద్దిగట్టుకొని రామన్నపేటకు పోయి చదువుకునేది. ఆ కాలంలో కుల వ్యవస్థ కూడా గట్టిగా ఉండేది. అంగీ తగిలినా, సద్దులున్న గోడ తగిలినా సద్దులు పారేసేవాళ్ళు. అట్లా ఏడవతరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నాకు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడంవల్ల భువనగిరిలో విశ్వకర్మ హాస్టల్ నిర్వాహకుల పిలుపు మేరకు మా మేనమామ నన్ను అక్కడ చేర్పించాడు. నిర్వాహకులు ఒక బజారు చూపించి అక్కడ విశ్వకర్మల ఇళ్లల్లో భిక్ష పైసలుగానీ, బియ్యం గానీ తెమ్మని ఆదేశించారు. అదే ప్రకారం వెళ్లి తెచ్చి రూములో వండుకొని తినేవాళ్ళం. చదువు కోసం వారేది చెబితే అది చేశాము. 1954 జూన్ నుండి 1957 వరకు 8,9,10 తరగతులు అక్కడే చదువుకున్నాను. ఆదిరాజు వీరభద్రరావు గారి అల్లుడు ఆంజనేయ శాస్త్రి గారు నాకు గురువు. ఆయన పాఠశాలకు రాని రోజు నన్ను పాఠం చెప్పుమనేవారు. అందువల్ల చిన్నతనం నుండే నాకు తెలుగు భాష పట్ల కొంత పట్టు ఏర్పడింది. ఆయన నేను బాగా చదువుతానని హైద్రాబాదుకు తీసుకువెళ్లి వారాల భోజనం పెట్టిస్తాను చదువుకోమన్నారు. కానీ ఇక ఇంటింటికి తిరిగి భోజనం సంపాదించడం నావల్ల కాదని పదవతరగతి పూర్తవగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను.
3. మరి అప్పుడే ఉద్యోగం సంపాదించగలిగారా? మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
జ. 1950 ఆ ప్రాంతంలో పదవతరగతి హాల్ టికెట్ చూపిస్తే ఉద్యోగం ఇచ్చేవారు. అలా రామన్నపేట తహశీల్ ఆఫీసులో తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉండేవాడు. ఆయన “కాపీయిస్ట్ పోస్ట్ ఉంది.చేస్తావా?” అని అడిగారు. ఏదైనా చేస్తానన్నాను. ఇంగ్లీషు రాయొచ్చా అని అడిగారు. రాస్తానన్నాను. 20 రూపాయలకు రెవెన్యూలో కాపీయిస్ట్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో కో ఆపరేటివ్ బ్యాంకులో సూపర్ వైజర్ గా వచ్చింది. దాంట్లో చేరాను. భువనగిరి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర రైటర్ గా చేశాను. అప్పుడే సేల్స్ టాక్స్ లో ఉద్యోగం దొరికింది. ఒక దాని తర్వాత ఒకటి ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చేశాను. డబ్బులు వచ్చాయి. కానీ లంచాలు తీసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకే ఉద్యోగం విడిచిపెట్టి టీచరు ట్రైనింగ్ చేసి, 1959లో టీచరునయ్యాను. ఉపాధ్యాయ శిక్షణా కాలం నాలో కవితా వ్యాసంగానికి బలమైన పునాది వేసింది. నేను, మా అమ్మ ఎన్నో బాధలు పడి రెండుగదుల పెంకుటిల్లు వెల్లంకిలో కట్టుకున్నాం. ఆ ఒత్తిడిలో జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటి నల్లగొండ జిల్లా విద్యాధికారి రామదాసుగారు దయార్ద్ర హృదయులు. “మహానుభావా! ఇప్పుడు వచ్చావా” అని ప్రేమతో మందలించి ఉద్యోగం ఇచ్చారు. ఆగస్టు 29 1959 నాడు రామన్నపేట తాలుకాలో మునిపంపుల గ్రామంలో సహాయోపాధ్యాయునిగా జాయినయ్యాను. అప్పటినుండి మొదలుకొని నాకు ‘గ్లకోమా’ వ్యాధి వల్ల కంటిచూపు చాలావరకు కోల్పోవడంతో నా ఉద్యోగ జీవితాన్ని 1993లో జూనియర్ లెక్చరర్ గా విరమించవలసి వచ్చింది. చేసినంతకాలం విద్యాలయాల, విద్యార్థుల అభివృద్ధికి శాయా శక్తులా కృషి చేశానన్న తృప్తి ఉంది.
4. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఫిల్ , పి హెచ్ డిలు ఎలా పూర్తి చేయగలిగారు?
జ: నేను పదవతరగతి వరకే క్లాస్ రూములో కూర్చొని చదవడం తప్ప ఎక్కడా తరగతులు వినలేదు. నాకు స్ఫూర్తి బి. ఎన్. శాస్త్రి గారు. ఆయన ఎమ్. ఏ చదువుతుంటే ఎన్ని కష్టాలు పడ్డాడో చూసినవాణ్ణి. నేనూ రవ్వా శ్రీహరి బాల్య స్నేహితులం. నాకంటే చిన్నవాడు. ఆయనకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఇద్దరమూ ‘మునిపంపు’ లో పెరిగిన వాళ్ళం. ఇద్దరమూ కలిసి ఆడుకున్నాం. ఉద్యోగం చేస్తూనే నేను ఎమ్ ఏ దాకా ప్రయివేటుగా చదువుకున్నాను. పి హెచ్ డి చేయాలనుకుంటున్నట్లు రవ్వా శ్రీహరితో అన్నాను. ఎమ్ ఏ లో కూడా సెకండ్ క్లాస్ లో పాసయ్యాను. పాటిబండ మాధవశర్మ గారు నన్ను బాగా అభిమానించేవారు. సీటు గురించి రామరాజు గారిని అడగాలంటే అందరికీ భయం. ఆయన చాలా సహృదయులు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలంటే భయం. రవ్వా శ్రీహరి గారిని అడిగితే “అమ్మో! నేను వెళ్ళను” అన్నారు (నవ్వుతూ). నేనే అడుగుదామని వెళ్ళాను. అప్పటికి ఒక హైస్కూలు హెడ్ మాష్టరును నేను. పదిన్నరకు ఇంటర్వ్యూ ఉంటే ఎనిమిది గంటలకే వెళ్ళి నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. “ఎందుకొచ్చావ్? నీ నమస్కారాల సంగతి నాకు తెలుసు. ఇవాళ ఎంఫిల్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! అప్లై చేసి ఉంటావు. ఆ సీటు కొరకే వచ్చావు . అట్లా రావచ్చునా? పోనీ ఓ పని చెయ్యి. మొత్తం 12 సీట్లు ఉన్నాయి. నీకిస్తాను పంచిపెట్టుకో ” అని కోప్పడ్డారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి వస్తుంటే “మాస్టారూ ఇలా రండి” అన్నారు. నా సంస్కారం ఆయన మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. “నువ్వు హైస్కూలు హెడ్ మాస్టర్ వి. వయసులో పెద్ద. రీసెర్చ్ చేసి ఏం సాధిస్తావు?” అన్నారు. చేద్దామనే కోరిక ఉంది సార్! మీరు అనుగ్రహిస్తే చేస్తాను అన్నాను. ‘ఏమైనా రాశావా?’ అప్పటికే దాదాపు రకరకాల ప్రక్రియల మీద నేను వ్యాసాలు రాశాను. సూట్ కేస్ నిండా తీసుకువెళ్ళాను కూడా. “వంద దాకా రాశాను సార్! చూస్తారా?” అన్నాను. వద్దన్నారు. ముందు ఎంత కోప్పడ్డారో అంత అనుగ్రహం చూపారు. ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో మొట్టమొదటగా ఏర్పడ్డ ఎంఫిల్ పరిశోధకుల్లో నేను ఒకడిని కావడం గర్వకారణం. రవ్వా శ్రీహరి ప్రోత్సాహం, పూజ్య గురువర్యులు బిరుదురాజు రామరాజు గారి బలమైన ఆశీస్సులు నన్ను పరిశోధనారంగంలో ప్రవేశించేటట్టు చేశాయి.
5. ఎంఫిల్ అంశంగా తీసుకున్న “తెలుగులో గొలుసు కట్టు నవలలు” నవలా ప్రక్రియను, మీ అనుభవాలను తెలపండి.
జ : అప్పటి తెలుగు శాఖా అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అప్పటివరకు విమర్శకులు ఎవరూ స్పృశించని వినూత్నమైన, విచిత్రమైన నా పరిశోధనాంశం “తెలుగులో గొలుసుకట్టు నవలలు” అనే దాన్ని పరిశీలించి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో రామరాజుగారు, నారాయణరెడ్డి గారు, నాయని కృష్ణకుమారి గారు, కులశేఖర్ రావు గారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. “అందులో సాహిత్యమే లేదు. అదెలా చేస్తావన్నారు?” అన్నారు. అందుకే చేస్తానన్నాను ( నవ్వుతూ). వారి ప్రశ్నలకు తగినరీతిలో సమాధానాలు చెప్పి వారిని సంతృప్తి పరిచాను. మామూలుగా అయితే ఒక పుస్తకాన్ని ఒకరు రాస్తారు. గొలుసు కట్టు నవల అంటే ఇందులో అనేకమంది రాస్తారు. ఒక రచయిత కథ ప్రారంభం చేస్తాడు. మరొకరు దాన్ని కొనసాగిస్తారు. కథలోని కథా నాయకుడిని ఒకరు సృష్టిస్తే, మరొకరు మిగిలిన కథను రాస్తారు. కథను అనుకూలంగా మార్చడం, ప్రతికూలంగా మార్చడం ఎవరి వారి ఇష్టం. సృష్టించిన కథానాయకుని గొప్పగా చూపించొచ్చు. లేదా చంపవచ్చు. అట్లా ఆనాడు 24 మంది రచయితలు, రచయిత్రులు రాసిన “ముద్దు దిద్దిన కాపురం” నవలను వారికి విడమరిచి చెప్పాను. ‘హాస్యప్రభ’ పత్రికలో సీరియల్ గా వస్తుండేది. రాంబాబు అనే ఆయన వేసేవాడు. మొత్తానికి ఆ టాపిక్ లో చేయడానికి నాకు అనుమతి లభించింది. కానీ దాంట్లో ఏమీ లేదని గైడుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహానుభావుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు. ” నేను గురువును కాదు నీవు శిష్యుడవు కావు ఇద్దరం మిత్రులం” అనేవారు. ఇద్దరం చేతులు పట్టుకొని ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పాతపుస్తకాల్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం. మద్రాసు, తిరుపతి, విజయవాడ, భీమవరం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. “గొలుసుకట్టు నవల” రచయితలలో పాలగుమ్మి పద్మరాజు, శ్రీ శ్రీ , ఆనందారామం, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి, రావూరి భరద్వాజ, కొడవటిగంటి, ఆరుద్ర , పురాణం సుబ్రహ్మణ్య శర్మ , మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. రంగనాయకమ్మ గారు, ఆరుద్ర గారు లేఖాముఖంగా పంపించారు. వీళ్ళందరి సమాధానాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో విలక్షణమైన నా పరిశోధనలో నవలా వ్యాసంగాన్ని పూర్తిచేశాను. 250 పేజీల సాహిత్యాన్ని సృష్టించాను. ఇప్పుడు 40 మంది, 60 మంది రాసినవి కూడా వస్తున్నాయి. 1980 లో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. తెలుగు పరిశోధనారంగంలో నా సిద్ధాంతగ్రంథం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే రవీంద్ర భారతిలో జరిగిన ‘గొలుసు కట్టు నవల’ ఆవిష్కారానికి నన్ను పిలిచి సన్మానం చేశారు.
6. పి హెచ్ డి అంశంగా “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” మీద తీసుకున్న నవలలేవి?
జ: ఎంఫిల్ పూర్తయిన వెంటనే పిహెచ్ డి సీటు సులభంగానే దొరికింది. రామరాజు గారికి, నారాయణ రెడ్డి గారికి చేస్తాడన్న నమ్మకమూ కుదిరింది. నాకు ఎంఫిల్ పర్యవేక్షకులైన ఇరివెంటి కృష్ణమూర్తి గారు వెంటనే పి హెచ్ డి చేయమని సలహా ఇస్తూ “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” అనే పరిశోధనాంశాన్ని సూచించారు. దాన్ని రామరాజు గారు 1947 వరకు అని సవరించారు. చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ పర్యవేక్షణలో నా పరిశోధన సాగింది. దీనికోసం క్షేత్ర పర్యటన చాలానే చేశాను. 1947కు పూర్వం వచ్చిన నవలలు, నవలలు కావు కావ్యాలు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” వేలూరి శివరామశాస్త్రి గారి ‘ఓబయ్య’, విశ్వనాథ వారి ‘వేయి పడగలు’, అడవి బాపిరాజుగారి ‘నారాయణరావు’, ‘కోనంగి’, వాశిష్ఠ గణపతి ముని గారి ‘పూర్ణ’, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి ‘హేలావతి’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘లక్ష్మీ ప్రసాదం’, వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’.. ఈ పది నవలలు తీసుకున్నాను. 1947 వరకు ఈ నవలలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ సాహిత్యం ఉద్యమానికి, ఉద్యమం సాహిత్యానికి ఎట్లా ఉపయోగపడింది ఇందులో వివరించాను. ఈ పరిశోధన కారణంగా జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయులను ఎంతోమందిని దర్శించుకునే భాగ్యం కలిగింది. దీనికి “Best Informative Thesis” అని పేరు వచ్చింది. చాలా కష్టపడి వడబోసి తయారుచేసిన సిద్ధాంతగ్రంథం. సరి చేయడానికి ఏమీ లేకుండె. శివప్రసాద్ నాకంటే చిన్నవాడు. అందుకే “మొత్తం పూర్తయ్యాక సంతకం కోసమే నా దగ్గరకు రండి” అన్నాడు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి గారిని, రావి నారాయణరెడ్డి గారిని, ఎన్. జి రంగాగారిని, గడియారం రామకృష్ణ శర్మ లాంటి ఎందరినో ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాను. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన నవలలు చాలా తక్కువే కానీ నవలా సాహిత్యానికి అది స్వర్ణయుగం. నవలాకారులందరూ మహనీయులు. స్వాతంత్ర్యోద్యమ నుండి ప్రభావితులైనవారు. వారి హృదయం నుండి జాలువారిన ఈ రచనలు జాతిని ఉత్తేజపరిచాయి. ముందుకు నడిపించాయి.
7. సంస్కృత భాష పట్ల మీకు ఆసక్తిని కలిగించినదెవరు?
జ: మొదటి నుండీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. అయినా సరియైన పరిస్థితులు, వాతావరణం లేక సంస్కృతంలో అనుకున్నంత ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయాను. అప్పుడు ఎనిమిదవ తరగతిలో సంస్కృతం ఆప్షనల్ గా ఉండేది. భువనగిరి హైస్కూలులో, సూర్యాపేటలో మొట్టమొదటగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. దానికోసమే నేను భువనగిరి హైస్కూలులో చేరాను. కోవెల సంపత్కుమారాచార్య గారు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. మొదటి స్టూడెంటును నేనే. అప్పలాచార్యులు గారు, సంపత్కుమారాచార్య గారు సంస్కృత గురువులు నాకు. నా విషయంలో సంస్కృతం వచ్చు అని చెప్పడం ఎంత అబద్ధమో, రాదని చెప్పడం కూడా అంతే అబద్ధం ( నవ్వుతూ ). ఆ గురువులిద్దరి మూలంగా సంస్కృతం మీద పట్టు ఏర్పడింది.
8. మీ పద్య పఠన పద్ధతికి ఉత్పల సత్యనారాయణాచారి గారి ప్రభావం ఉందంటారు. అది ఎలాగో వివరిస్తారా?
జ : 1958లో నేను మేడ్చల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉత్పల సత్యనారాయణాచార్యగారు అతిథిగా వచ్చారు. బహుభాషా కవిసమ్మేళనం జరిగింది. తెలుగు భాషకు సంబంధించి ఆయన వచ్చారు. నేను ఆ సభలో ఆయన మీద ఆశువుగా పద్యం ఆయానలాగే చదివాను. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటినుండీ “మరో ఉత్పల” అనే పేరు వచ్చింది. ఉత్పలగారు చనిపోయే చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు నేనొక పద్యం కార్డు మీద రాసి పంపించాను. ” కమ్మని తేట తెల్గు నుడికారము కల్గిన పద్యమొక్కటిన్, ఇమ్ముగ కోరుకున్న మనకిమ్మహనీయుడొసంగు గొప్ప భాగ్యమ్మున గల్గె ఉత్పల మహాకవి తెల్గునాడులో తమ్ములు రండి రండి కవితామూర్తిని కొలువగా వలెన్” అని పంపాను. ఆయన సంతోషపడి నా మీద మూడు పద్యాలు రాసి పంపించారు.

9. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులేవి?
జ: గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొని చదువుకునేంత స్తోమత నాకు లేదు. పుస్తకాలు ఉన్నవాళ్ళ దగ్గర వారు రాత్రి చదువుకోవడం పూర్తయిన తర్వాత పుస్తకాలు అడిగి తీసుకొని రాత్రంతా చదువుకొని ఉదయం నాలుగు గంటలకే వాళ్లకు అప్పగించే ఒప్పందంతో తెచ్చుకునేవాడిని. ఇలాంటి నా కష్టాలు తరువాతి యువతరానికి రావొద్దని లైబ్రరీ పెట్టాను. అది చాలలేదు. 1954 లో వెల్లంకిలో శంభు లింగేశ్వర గ్రంథాలయం అని చిన్న లైబ్రరీ పెట్టాను. నాకు పెద్దలు ఎవరూ సహకరించలేదు. 1962 లో నేను మాఊరికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. మా తల్లిదండ్రుల పేరుతో లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం పెట్టాను. ప్రముఖ నాటక రచయిత ఆకెళ్ల నర్సింహమూర్తి గారు ప్రారంభించారు. 1993లో తెలుగు ఉపన్యాసకునిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. గ్రంథాలయ స్థాపన నా మనసులోంచి పోలేదు. ఎలాగైనా ఈ మారు మూలలో మహా గ్రంథాలయం పెట్టాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను. అందుకే నా ఇంటినే దీనికోసం ఇచ్చాను. పెద్దలు దీనికి “కూరెళ్ళ గ్రంథాలయం” అని నామకరణం చేశారు. నా సొంత ఐదువేల పుస్తకాలతో ఫిబ్రవరి 13, 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు రెండు లక్షల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ అయింది. మా పిల్లలు, లైబ్రేరియన్ సహకరిస్తున్నారు. శిష్యులు, స్నేహితులు చాలామంది ఉండడం వల్ల సాహితీప్రియులు ఎంతోమంది పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ద్వానా శాస్త్రి గారు తన లైబ్రరీలోని మొత్తం పుస్తకాలను ఇచ్చారు. కోడూరు పుల్లారెడ్డి గారు కూడా వేల పుస్తకాలు ఇచ్చారు. భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలియని వాళ్ళు కూడా ఈ అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చి వందలాది పుస్తకాలు ఇవ్వడం నా అదృష్టం. వారందరి సహకారం వల్లనే ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఇందులో సమకూర్చగలిగాను. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, వేదాలు, పరిశోధన, చరిత్ర, పద్య గద్య ఇలా అన్ని విభాగాల్లో ప్రక్రియల్లో పుస్తకాలున్నాయి. ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తలచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని.
10. మీ గ్రంథాలయం గురించి 2021 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” లో ప్రశంసింపబడడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : అది నా జీవితానికి గొప్ప వరం. పల్లెటూళ్ళని వదిలి చాలామంది నగరానికి వెళ్లి పోతున్నారు. అందరూ మళ్లీ పల్లెబాట పట్టాలని గ్రంథాలయం నెలకొల్పాను. నా కోరిక తీరి ఎంతోమంది సద్దులు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు నా విషయం ప్రధానమంత్రి వరకు ఎలా వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన “మన్ కీ బాత్” లో నన్ను , నా లైబ్రరీని ప్రశంసించారు.

ఈ ప్రభావం వల్ల అస్సామ్ విశ్వవిద్యాలయం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సందర్శకులు వచ్చారు. అమెరికా లోని ‘తానా’ వారు స్వరమీడియా వారు నాతో ఇంటర్వ్యూలు జరిపారు. అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్ నారాయణ మూర్తి గారు ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు పంపించారు. నిన్న కూడా హయత్ నగర్ నుండి సర్వేపల్లి సుందరం అని ఒక వ్యక్తి వచ్చి ఆయన రాసిన పుస్తకాలు ఇచ్చి వెళ్లారు. అలా ఎంతోమంది సహకరిస్తున్నారు. నా శ్రమకు ప్రధానిగారు ఊపిరి పోశారు. మోదీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన వల్ల నాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్రపతి నుండి పోయిన ఏప్రిల్ 2023లో ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్ గారి చేత సన్మానం అందుకున్నాను. మాకు మూడు రోజులు వసతి కల్పించి అక్కడి విశేషమైన ప్రాంతాలను చూపించారు. పెద్ద సభ కూడా జరిగింది. ఈ నెలలో కూడా గణతంత్ర దినోత్సవాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికమైన చలి కారణంగా రాలేనని చెప్పాను.






11. దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన జనగామ రైలు ప్రమాదం గురించి మీరు రాసిన “అధికవృష్టి” పద్యాలను గూర్చి తెలపండి
జ : ఇది 1954లో జరిగింది. అప్పుడు కురిసిన అధికమైన వర్షాలకు “వసంతవాగు” పొంగుతుండడం వల్ల రైలు పట్టాలు తప్పింది. అప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నాను. ఆ దుర్ఘటనకు కదిలిపోయి నేను రాసుకున్న పద్యాలే మొట్టమొదటగా అచ్చులో చూసుకున్న పద్యాలు.
ఉరుములు మెరుపులు నొకసారె ఉద్భవించె
గాలి సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె
సరవి ధారగ వర్షంబు కురియుచుండె
అల్ల తెలగాణ రఘునాథ పల్లియందు!
అధిక వర్షంబుచే నంత నయ్యె గాదె
మృత్యుదేవత ఆనాడు నృత్యమాడె
ఇట్టివెప్పుడు రాకుండ నెల్ల వేళ
మనల వేలుపు గాపాడి మనుచు గాత!
ఇలా రాశాను. ఆ పద్యాలు చూసి మా మాస్టార్లు ఆశ్చర్యపోయారు. కోవెల సంపత్కుమారాచార్య గారు “నీకు పద్యం మీద మంచి పట్టు ఉంది” అని ప్రశంసించారు. స్కూల్ వార్షిక సంచిక ‘ఉదయ’ లో కూడా వేశారు. ఆనాటి నుండి నా మిత్రులు తమాషాగా ‘పోతన’ అని పిలిచేవారు.
12. “వెల్లంకి వెలుగు” పేర రాసిన ఎల్లంకి గ్రామ వైభవం ఎటువంటిది?
జ: “వెల్లంకి వెలుగు” నా పల్లెతో నాకున్న అనుబంధాన్ని, గురించి రాసుకున్నది. చాలా చిన్న పుస్తకం. ఆ ఊరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది మొదలుకొని నాకు తెలిసినంతవరకు ఆ గ్రామాన్ని గురించి ఆనోటా ఈ నోటా విన్న విషయాలు రాసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరే. ఇప్పటికీ పల్లెటూళ్ళోనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నిటికీ ప్రధాన భూమిక పల్లెటూరు. అందుకే “విఠ్ఠలేశ్వర శతకం” లో పల్లెను దేవతగా భావిస్తూ..
పల్లియలోనె పుట్టితిని పల్లియయే నను పెంచె
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టె
పల్లియె ‘అమ్మ’ ఆవనుచు’పల్కులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!
13. వేమన శతకంతో సమానమని పలువురి ప్రశంసలు అందుకున్న మీ “విఠ్ఠలేశ్వర శతకము” గూర్చి చెప్పండి.
జ : 1991 ఆగస్టు 1న మా ఇంటి గేదెకు వైద్యం చేస్తుండగా అది ఎగిరి నా మీద పడడం వల్ల జరిగిన ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. అంతకుముందే నాకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి. నేత్ర వ్యాధి ‘గ్లకోమా’ వల్ల కంటి చూపు చాలావరకు తగ్గిపోయింది. ఈ దుర్భర పరిస్థితుల్లో బాధతో అలవోకగా నా గుండె లోంచి ఒక పద్యం వచ్చింది.
“పుట్టుకతోనె కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎ
ప్పట్టున నైన కొందరికి పట్టినదెల్ల పసిండియే యగున్
తిట్టు వరంబు కొందరికి దీవెన కొందరి పట్ల తిట్టగున్
ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠ్ఠలేశ్వరా!”
అలా వరుసగా పద్యాలు రాసుకుంటూ పోయాను. నన్ను పలకరించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, రసజ్ఞులకు వినిపించేవాణ్ణి. అందరూ అభినందించారు. మకుటం బాగుందన్నారు. మా అమ్మగారు నాకు మా నాన్నగారు విఠలేశ్వరుని భక్తులని అందుకే ఆ స్వామి పేరు మీదనే నాకు పేరు పెట్టారని చెప్పారు. అందుకే మా నాన్నగారి ఆకాంక్ష వల్లే ఇది ఉద్భవించిందేమో. నా ఆత్మ వేదనే అయినా ఆ విఠలేశ్వరుని అనుగ్రహంతోనే మంచం మీద ఉన్న మూడు నెలల్లో శతకం పూర్తి చేయగలిగాను. వివిధ సేవా కార్యక్రమాల కారణంగా పుస్తకరూపం చేయాలన్న ఆలోచన రాలేదు. ప్రింట్ కాకపోయినా జనుల నోళ్ళల్లో నానుతుండేవి. నాకు అరవై ఏళ్లు నిండిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. శతక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారు దీనిలోని కొన్ని పద్యాలను హిందీ, ఇంగ్లీషు లోనికి అనువాదం చేయించారు. ఇందులో సమాజంలోని రకరకాల విషయాల పట్ల కలిగిన వేదనతో రాసిన పద్యాలున్నాయి. దీని రెండవ ముద్రణ గవర్నర్ గారిచే ఆవిష్కృతం కానుంది.
14. “శిల్పాచార్యులు” కావ్యం రాయడానికి ప్రేరణ ఎవరు?
జ : నా ఎనిమిదవ ఏట నుండి భువనగిరిలో నా చదువు కొనసాగింది. అక్కడే నా కవిత్వం మొగ్గ తొడిగింది. ఎంతోమంది సహృదయులు మిత్రులయ్యారు. ఇక్కడ నేనొక ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ కవిగా ప్రధానాచార్యుల, ఆచార్యుల పండితుల మన్ననలు పొందాను. అందుకే భువనగిరి కోటను నా హృదయంలో ముద్రించుకున్నాను. ఆ ఋణం కొంతైనా తీర్చుకుందామన్న ఆశయంతో ఈ పట్టణానికి, పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రఖ్యాత త్యాగమూర్తులను కొందరిని, ప్రసిద్ధ స్థలాలను కొన్నింటిని తలచుకుంటూ ఆ స్మృతులతో ఈ కావ్యం ద్వారా వారిని మనసారా స్మరించుకుంటున్నాను.
ఆరుట్ల దంపతులను ఉద్దేశించి…
“నాడు నేడైన ఏనాడు నైన/ కొలనుపాకనంగ మదిలొ గుర్తుకొచ్చె….” బి. ఎన్.శాస్త్రి గారిని ఉద్దేశించి..
“ఊళ్ళన్ని వడబోసి రాళ్ళ రాత చదివి/ వేల యేండ్ల చరిత వెలికి తీసె….”
ఇలా స్మరించుకుంటూ పద్యాలు రాశాను. ఈ ప్రాంతం శిల్ప కళకు ప్రసిద్ధి.
“శిలలపై గీత గీసె ఈ శిల్పి వాడు/ తెల్పినాడు నాటి చరిత్ర నిల్పి నేడు..” ఎక్కడో గాని చక్కని చెక్కడాల/ పనిని నేర్పితివి కద! ఓ పరమ శిల్పి!/ బుక్కెడన్నము దొరికెడి దిక్కు లేదు/ నాయనా తమ చక్కదనాల పనికి”
అంటూ శిల్పకారుల కళా నైపుణ్యాన్ని, వారి దీనావస్థను గురించి రాశాను.
“భువనగిరి తెలంగాణ సంపుటములోన / పసిడి వర్ణాలలో చెక్కబడును లెస్స” అని ఆ పట్టణాన్ని గురించి రాసి నమస్కృతులు తెలుపుకున్నాను.

15. మీరు రాసిన ఇతర రచనలేవి?
జ : 1953 లో నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా మాతామహుడు బేతోజు లక్ష్మీ నారాయణ చనిపోయినప్పుడు ఛందస్సు ఏమీ తెలియకున్నా ఆ దుఃఖాన్ని స్మృతి కావ్యంగా రాశాను. అలా ఎంతోమంది స్మృతులతో “స్మృత్యంజలి” పద్యాలు రాశాను. అవి ముద్రణలోనికి రాలేదు. అదీకాక “చద్దిమూటలు” అనే పేరుతో 5516 కొటేషన్లు ఒక్కచోట చేర్చాను. ఒక్కసారి ఆ పుస్తకం తిరగేస్తే చాలు ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. పుష్ప విలాపం ఖండికతో ప్రేరణ పొంది “గోవిలాపం” రాశాను. కుడ్య మాసపత్రికలో ప్రచురించబడింది.
” చిక్కగున్నంత కాలం చితుక గొట్టి
చేత చేయించుకొందురు, చేరదీసి
బక్క పడగానె మమ్ముల బాహ్యపరచి
కోత కమ్ముదురయ్య మీ కులము వారు”
ఇట్లా ఉంటాయి ఆ పద్యాలు.
ఛందో నియమాలు ఉన్న పద్య కవిత్వం రాయడానికి యువత ముందుకు రావడం లేదు. అందుకే వారికి సులువుగా ఉండడానికి “దొందూ దొందే” అనే త్రిపదుల కృతిని రాశాను. “దేవుడు లేని గుడి/ దేశికుడు లేని బడి/ దొందూ దొందే”…ఇలా అయితే ఎన్నో పద్యాలు రాశాను కానీ ఎప్పుడూ ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో తిరగడం వలన అచ్చు వేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు.
16. తెలంగాణా ఉద్యమం వైపు మిమ్మల్ని ఉత్తేజితులను చేసిందెవరు? ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఏమిటి?
జ: నేనెప్పుడూ విశ్రాంతి కోరుకోనమ్మా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చదువుకున్న రోజుల్లో చదువుకున్నాను. తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పాల్గొన్నాను. వాస్తవానికి ఆంధ్ర వ్యతిరేకోద్యమం కె సి ఆర్ పుట్టక.మునుపే 1952 లో ప్రారంభమైంది. “నాన్ ముల్కీ గో బ్యాక్” అనే నినాదంతో ముల్కీ ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. నాకేమీ తెలియదు. అయినా ఫ్లెక్సీ పట్టుకొని తిరిగిన వాణ్ణి. “ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్”, “గోంగూర పచ్చడి గో బ్యాక్” అనే నినాదాలు అప్పుడు పుట్టినవే. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమం రెండింటిలోనూ కవిగా, రచయితగా నా వంతు పాత్ర నిర్వహించాను. తెలంగాణా ఉద్యమంలో ‘ధూంధాం’ కార్యక్రమంలో పాటలతో ఎట్లా ఉర్రూతలూగించారో సభల్లో నేను పద్యాలతో ఉర్రూతలూగించిన వాడిని.
” ఆత్మార్పణము జేసి అమరులైనట్టి మా త్యాగమూర్తుల ప్రసాదంబు గాదె,
పుట్టుకంత తెలంగాణ పోరు కంకితమయ్యె జయశంకరులవారి జయము గాదె
మాట నిలుపుకున్న మహనీయురాలు మా సోనియా ఇచ్చిన వరము గాదె” ఇలా ఎన్నో పద్యాలు..
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి అంటే నా తెలంగాణ కోట్ల రతనాల వీణ” అని పద్యం చెప్పాను. “తెలంగాణలో చదువుకున్న పెద్దవాళ్ళు లేర”ని అంటే “ఎవడ్రా అన్నది?” “మందార మకరంద మాధుర్య మూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి” అంటూ వంద పాదాలతో “తెలుగు కాగడాలు” రాశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ్య పేరు పెట్టినట్లు, కడపలో విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టినట్లు 2007లో నల్లగొండలో మంజూరైన విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ఉద్యమం మొదలుపెట్టాను. చాలామంది పెద్దలు సహకరించారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మా విన్నపాన్ని పట్టించుకోకపోగా మా నోళ్లు మూయించాలని మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఏమీ అనలేక పోయాం. తెలంగాణా మహాకవి పోతన అంటే నేను ఊరుకోను. తెలంగాణాలో పుట్టిన మహాకవి ఆయన. రాజశేఖరరెడ్డిగారు పోతన మీ వాడు కాదు అన్నాడు. అప్పుడు వరంగల్ లో సెమినార్లు జరిగాయి. “పోతన మా వాడు కాదంటే డొక్క చీలుస్తాం” అని వార్నింగ్ ఇచ్చాము. అప్పటినుండీ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు రాసిన వ్యాసాలు రావడం ఆగిపోయాయి.
ఇట్లా తెలంగాణోద్యమం, మహాత్మాగాంధీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, పోతన నామ సాధక కమిటీ అధ్యక్షునిగా పోతన ఉద్యమం ఇలాంటివి చేశాను. అక్షరాస్యతా ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించకముందే నేను ప్రారంభించాను. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవాణ్ణి. ఉడాయి గూడెం అనే చిన్న ఊళ్ళో పిల్లలు బడికి వచ్చేవారు కాదు. నేనే పలక, బలపం పట్టుకొని వెళ్లి నేర్పించేది. చచ్చేముందు సంతకం అయినా నేర్చుకోవాలని 80 ఏళ్ల పెద్దమనుషులకు కూడా సంతకం నేర్పాను.
17. మీ సంపాదకత్వంలో వెలువడిన పత్రికలేవి?
జ : పత్రికలు రచనా శక్తిని పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని కలిగిస్తాయి. చైతన్య ప్రేరకాలు అవుతాయి. అందుకే నేను ఎక్కడ పని చేసినా స్కూల్లో కానీ, కాలేజీల్లో గానీ అక్కడ పత్రిక పెట్టేవాడిని. స్టాఫ్ ప్రోత్సహించేవారు కాదు. “ఈ పిల్లలకు ఏమొస్తది సార్? ఎందుకు ఈ పేపర్ ఇదంతా?” అని ఉత్సాహాన్ని నీరు కార్చేవారు. అయినా నేను వినేవాణ్ణి కాదు. మనం చేసే పని మనం చేయాలి. ఎవరో వద్దంటే ఊరుకుంటే పనులు ఎలా జరుగుతాయి?
నేను పని చేసిన విశ్వ విద్యాలయాల్లో కూడా కుడ్య పత్రికల ద్వారా విద్యార్థుల్లో రచనాసక్తి, సృజనశక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాను. ఇక నడిపిన పత్రికలు…. బాపు భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, చిరంజీవి, ప్రియంవద, ముచుకుంద. నాకు చేతనయినంత వరకు చదువుపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చేశాను.
18. సాహితీ సేవకై మీరు స్థాపించిన వివిధ సంస్థలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా?
జ : పల్లెటూళ్లను చైతన్య పరచడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. దానికోసం కొన్ని సంస్థలు స్థాపించాను. అక్షర భారతి, మిత్ర భారతి, సాహితీ స్నేహితులు, భువనభారతి, ప్రజా భారతి, మల్లెల భారతి ఇలాంటి సంస్థలే కాక సాంసృతిక సంస్థలను కూడా స్థాపించాను. అందులో ఇంకా ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటికీ మంచి స్పందన లభించింది. మా సేవలు గుర్తించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు మా సేవలను గుర్తించి, బిరుదులతో, పురస్కారాలతో గౌరవించారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నా జీవితం ప్రస్తుతం సాహిత్య సేవలో గడిచిపోతోంది. ఆ తృప్తి చాలు. ” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి” అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శం.
19. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మీకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇవ్వడం పట్ల ఎటువంటి అనుభూతి చెందుతున్నారు?
జ: అవార్డు ఇవ్వడం ఆనందమే. కానీ గర్వంగా భావించడం లేదు. ఎందుకంటే నాకు తోచినంతవరకు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం. నేను కీర్తి కాంక్షల కోసం ఈ పనులు చేయడం లేదు. నావల్ల ఒక్కరు బాగుపడ్డా దాన్ని నాకొచ్చిన అవార్డుగా భావిస్తాను. అవార్డు వచ్చిందని తెలిసి ఎంతోమంది స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ఎంతోమంది తమ అభినందనలు తెలిపారు. నా కృషిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రమ్మని ఆహ్వానం వచ్చినా ఆరోగ్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను.
20. ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన మీరు గ్రంథాలయ విషయంలో ఇంకా చేయాలనుకుంటున్న పనులు ఏమైనా ఉన్నాయా?
జ : ఇప్పుడున్న గ్రంథాలయానికి స్థలం సరిపోవడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా రెండు లక్షల పుస్తకాలకు పైగా ఉన్నాయని. ఇంకా ఎంతోమంది తెచ్చి ఇస్తున్నారు. అందుకే దీని పైన ఇంకో పెద్ద హాలు కట్టించాను. సాహితీ కార్యక్రమాలు కూడా జరుపుకునే లాగా చిన్న వేదిక కూడా ఏర్పాటు చేసాను. వచ్చే నెల ఫిబ్రవరిలో గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా అది ప్రారంభం కానున్నది. మీరు కూడా తప్పకుండా రావాలి ఆహ్వానం పంపుతాను ( నవ్వుతూ).

ధన్యవాదాలు సార్! తప్పకుండా వస్తాను. మీలాంటి ఆదర్శమూర్తులను కలుసుకోవడం, మా పాఠకులకు పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా మీ జీవిత విశేషాలను ఇంత ఓపికగా చెప్పిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.
ప్రతిష్టాత్మకమైన ఎన్.టి.ఆర్ పురస్కారం, ఎ.పి.జె అబ్దుల్ కలాం అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
సాధించిన ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ గంగాధర్ గారితో ముఖాముఖి – నరేశ్ చారి
గంగాధర్ గారు నమస్కారం. మీరు వేసిన చిత్రాలు, కార్టూన్స్ గురించి మా పాఠకులకు తెలియ చేయాలనుకుంటున్నాము.

1. మీరు పుట్టినది, విద్యాభ్యాసం, మీ బాల్యం గురించి చెప్పండి.
నేను జన్మించింది నిజామాబాద్ జిల్లాలోని బషీరాబాద్ గ్రామంలో. నా విద్యాభ్యాసం హైస్కూల్ వరకు బషీరాబాద్ లో సాగింది,ఇంటర్మీడియట్,డిగ్రీ(బి.ఎ) నిజామాబాద్ లో చదివాను.
2. మీరు ఆర్ట్ వైపు మొగ్గు చూపడానికి ప్రేరణ, ప్రోత్సాహం ఎవరు?
నేను చిన్నప్పటినుండి కార్టూన్స్ జోక్స్ ఇష్టపడేవాడిని ముఖ్యంగా ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చే మల్లిక్ గారి కార్టూన్ల ద్వారా నేను ఎక్కువగా ప్రేరణ పొందే వాడిని. ఎలాగైనా నేను కూడా కార్టూన్స్ వేయాలి అని అనుకునేవాడిని కానీ ఎలా వేయాలి ? వేటిపై వేయాలి ? ఎలాంటి పెన్నులు ఉపయోగించాలి? అని చాలా ఆలోచించేవాడిని ఆ సమయంలోనే కార్టూనిస్టులను సంప్రదించాలనుకున్నాను కానీ పత్రికల్లో వారి వివరాలు ఏవీ వచ్చేవి కావు. కార్టూన్… దానిపై వారి సిగ్నేచర్ మాత్రమే వచ్చేది.వారి వివరాలకోసం ఎంత వెతికినా లాభం లేకపోయేది. ఎందుకంటే ఇప్పట్లో లాగా అప్పుడు సెల్ ఫోన్ లు ఉండేవి కావు, ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా చాలా తక్కువ.
ఒకసారి బుక్ ఎగ్జిబిషన్లో కార్టూనిస్ట్ సత్యమూర్తి గారి ” కార్టూన్స్ ఎలా వేయాలి” అనే పుస్తకం కనిపించింది హమ్మయ్య అనుకొని వెంటనే ఆ బుక్ కొని తెచ్చుకున్నాను. అది మొత్తం చదివి కార్టూన్స్ వేయడానికి సిద్ధమయ్యాను. అప్పట్లో ఇండియన్ ఇంకును పెన్నులో పోసి ఆ పెన్నుతో కార్టూన్స్ వేసేవారు. ఆ ఇండియన్ ఇంకుతో పెద్ద తలనొప్పి డైరెక్ట్ గా ఆ ఇంకును పెన్నులో పోస్తే గడ్డ కట్టేది. గీతలు సరిగ్గా వచ్చేవి కావు. అందులో కొన్ని నీటిని కలిపి వాడాలి నీరు ఎక్కువ అయితే ఇంకు పల్చభారీ గీతలు మబ్బుగా వచ్చేవి అలా చాలా కష్టం అనిపించింది. ఎలాగోలా కొన్ని కార్టూన్స్ వేసి పత్రికలకు పంపించాను. అవి అలాగే శుభ్రంగా నాకు తిరిగి వచ్చేవి.
అలా ఎన్నోసార్లు పంపగా పంపగా అప్పట్లో బాలరంజని అని పిల్లల కథల పుస్తకం మాసపత్రికగా వస్తూ ఉండేది దానికి కొన్ని కార్టూన్లు వేసి పంపించాను. వారి వద్ద నుండి కొన్ని రోజులకు ఒక పోస్ట్ కార్డు వచ్చింది. అందులో “మీరు పంపిన కార్టూన్లలో ఒక కార్టూన్ సెలెక్ట్ అయింది దానిని వచ్చే నెలలో ప్రచురిస్తాము” అని ఉంది. ఆ వార్త చూసి చాలా సంతోషం అనిపించింది.త్వరలోనే ఎన్నో రోజుల కల తీరబోతోందని అనుకున్నాను. నెలరోజుల దాకా ఎదురు చూశాను.ఆ పత్రిక కావాలనుకుంటే నిజామాబాద్ వెళ్లి తెచ్చుకోవాల్సిందే నిజామాబాద్ వెళ్లి బుక్ షాప్ లో “బాలరంజని” బుక్ కావాలని అడిగాను.” సార్ ఈ నెల నుండి ఆ బుక్ రావడం లేదు” అని చావు కబురు చల్లగా చెప్పాడు.అంతే… నిరాశతో వచ్చేసాను. అయినా కార్టూన్లు గీసి పత్రికలకు పంపిస్తూనే ఉన్నాను. అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో “హారిక”అనే వార పత్రిక వస్తుండేది. ఆ పత్రికకు కూడా కొన్ని కార్టూన్లు వేసి పంపించాను.కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి రిప్లై వచ్చింది.” మీరు పంపిన కార్టూన్లలో నుండి రెండు కార్టూన్లు ప్రచురణకు స్వీకరించాము” అని ఉంది. నా కార్టూన్లు పత్రికలో చూసుకోవచ్చనే కోరికతో వారం రోజులు భారంగా గడిపాను. తర్వాత మళ్లీ బుక్ షాప్ కి వెళ్లి హారిక పత్రిక కావాలని అడిగాను.”ఆ పత్రికను ఆపేశారు ఈ వారం నుండి రావడం లేదు” అని షాప్ అతను చెప్పాడు. అప్పుడు అనిపించింది ఔరా….. నా కార్టూన్ లకు ఇంత పవర్ ఉందా అని. ఉరిమిన ఉత్సాహం చల్లగా చెప్పబడింది. కొన్ని రోజుల విరామం…. అయినా ఆగేది లేదు మళ్లీ కార్టూన్లను గీయడంమొదలుపెట్టాను.

అప్పట్లో కార్టూనిస్ట్ గోపాలకృష్ణ గారు పాపులర్ అయ్యారు. ఒకసారి ఒక పత్రికలో ఆయన అడ్రస్ కనిపించింది. నేను వెంటనే గోపాలకృష్ణ గారికి రీప్లే కవర్ పెట్టి లెటర్ రాశాను. నేను వేసే కార్టూన్ ల గురించి వివరాలన్నీ రాసి “మీరు వేసిన కార్టూన్ల నుండి నాకు ఒక కార్టూన్ శాంపిల్ గా పంపించండి” అని రాశాను. ఆయన వద్దనుండి రిప్లై వచ్చింది. అతను వేసిన కార్టూన్ ఒకటి నాకు శాంపిల్ గా పంపించాడు. అతని కార్టూన్ చూస్తే నాకు మతిపోయింది. ఆయన కార్టూన్ మంచి క్వాలిటీ పేపర్ మీద చాలా నీట్ గా ఉంది. మొత్తానికి అతను వేసిన కార్టూన్ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఇంకు కూడా చాలా షైనింగ్ గా ఉంది అలాగే కార్టూన్లు వేయడానికి రోటరీ ఇంక్ పెన్ను వాడమని సలహా కూడా ఇచ్చాడు. కొన్ని మెలకువలు తెలిపాడు. రోటరీఇంక్ పెన్ను మా ప్రాంతంలో దొరకదు. మళ్లీ నిజామాబాద్ వెళ్లి ఆ పెన్ను తెచ్చుకున్నాను. ఆ పెన్ను తెచ్చుకున్నాక కార్టూన్ వేయడం కాస్త సులభంగా అనిపించింది. ఇండియన్ ఇంకులాగా తలనొప్పి మాత్రం లేదు. ఆ మధ్యలో “ఆంధ్రజ్యోతి”వారపత్రిక వారు దీపావళి పండగ సందర్భంగా కార్టూన్ల పోటీ నిర్వహించారు. నేను కొన్ని కార్టూన్స్ వేసి పంపించాను. కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి పోస్టులో ఒక కవరు వచ్చింది.అది విప్పి చూస్తే ఆంధ్రజ్యోతి వారపత్రిక. పేజీలు తిప్పి చూస్తుండగా మధ్య పేజీ చూసి ఆశ్చర్యపోయాను .అందులో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించిన కార్టూన్లు ప్రింట్ చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన కార్టూన్ “డాక్టర్ శివ”బషీరాబాద్ అని ప్రింట్ చేశారు. అప్పుడు అనుకున్నాను అనుకున్నది సాధించానని. అందులో నేను వేసిన కార్టూన్లలో మొదటిసారిగా నా కార్టూన్ ప్రచురించడం మరియు మొదటిసారిగా ప్రింట్ అయిన నా కార్టూన్ కే మొదటి బహుమతి రావడం నిజంగా అద్భుతమనిపించింది.ఎంతో ఆనందం కలిగింది.
3.కార్టూన్లను వేయడం మీరు ఎవరిదగ్గరైనా నేర్చుకున్నారా? చూసి వేసేవారా?
నేను ఎవరి వద్ద నేర్చుకోలేదు కేవలం సొంతంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదే. కార్టూన్లు నవ్వుతెప్పిస్తూ ఆలోచన లలో పడవేస్తాయి. ఈ కారణం వల్ల నే నేను కార్టూన్స్ కు ఆకర్షతుణ్ణ య్యాను, సాధనచేసి నేర్చుకున్నాను.
4. ఆర్. ఎం. పి. డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్నారు కదా! మరి వృత్తి, ప్రవృత్తులను ఎలా సమన్వయం చేసు కుంటున్నారు?
డాక్టర్ వృత్తి నా కల! నా కలను సాకారం చేసుకున్నాను.వృత్తి సంపాదనను ఇస్తే, నా ప్రవృత్తి నాకు సంతృప్తిని ఇస్తుంది. ఎక్కువగా సొంత పనులకే సమయం కేటాయిస్తాను ఏదో హాబీగా అప్పుడప్పుడు మాత్రమే ఇవి వేస్తుంటాను. నాకు బాగా నచ్చింది అనుకున్న తరువాత నే ఎక్కడికైనా పంపిస్తాను.
5. ‘రీడింగ్ విమెన్’ చిత్రాన్ని , మనిషిలోని మూడు దశల చిత్రాన్ని ఒకే గీతను ఆధారంగా చేసుకుంటూ వేశారు. అది మీరు సొంతంగా నేర్చుకున్నదేనా? ఎవరి ప్రభావమైనా ఉందా?
మీరు అడిగిన డ్రాయింగ్ నేను సొంతంగా ఊహించుకుని వేసినదే. ఎవరి ప్రభావం లేదు. సృజనాత్మకత జోడించి నూతన రేఖాచిత్రం గీయడం లో స్పష్టం గా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. నా ఊహల లోకం నుంచి వ్యంగ్య చిత్రాలు గీసాను, గీస్తాను కూడా
6. నిజామాబాద్ లో మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది?
సాధారణంగా పల్లెటూరు లలో. అంత అవకాశాలు ఉండవు. జిల్లా స్థాయిలో. ఉన్నా మనస్ఫూర్తిగా స్పందనలు తెలియజేయరు.
మామూలు స్పందన లభించింది. ఆర్ట్ గురించి వాళ్లకు పెద్దగా అవగాహన, అభిరుచి లేవనుకుంటున్నాను.
7. హైదరాబాద్ వంటి నగరాల్లో అలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోలేదు?
అది అది ఖర్చుతో కూడుకున్న పని.తగినంత సేల్స్ కాకపోతే బూడిదలో పోసిన పన్నీరు లాగా అవుతుంది పరిస్థితి. ఇంతే కాదు చాలా విషయాలు అందుబాటులో ఉండవు. ఆర్థికంగా నే కాదు, మిగతా సౌకర్యాలు వేరే ప్రాంతం నుంచి వచ్చి. ఇలా చిత్ర ప్రదర్శన చేయడం కష్టం.
8. మీరు పొందిన అవార్డులు, సత్కారాల గురించి చెప్పండి.
ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇలా అన్నీ కలిపి 20 అవార్డుల వరకు వచ్చాయి. అవార్డు లు , రివార్డులు కళాకారులకు ఆనందాన్ని , అలాగే బాధ్యతలనూ ఇస్తాయి .
9. ఈ అవార్డులు , సత్కారాలు మీకు సంతృప్తిని కలిగించాయా? ఇంకా ఏదైనా ఆశిస్తున్నారా?
నాకు వచ్చిన అవార్డులు,రివార్డులు సత్కారాలపరంగా చూస్తే సంతృప్తి గానే ఉంది. కానీ ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అసంతృప్తిగానే ఫీలవుతున్నాను.

10. మీరు విదేశాలను కూడా సందర్శించినట్లు విన్నాం. ఆయా దేశాలలో మీ అనుభవాలను తెలియజేయండి.
ప్రమోషన్ లో భాగంగా సింగపూర్ ,థాయిలాండ్ దేశాలు సందర్శించాను. మొదటిసారిగా రెండు విదేశాలు సందర్శించడం లో జీవితంలో మర్చిపోలేని అనుభవం.
11. విదేశాల్లో మన చిత్రకళ పట్ల ఉన్న ఆసక్తి ఎటువంటిది?
ప్రాంతం ఎక్కడైనా వాళ్ళ అభిరుచి అవగాహనబట్టి ఉంటుంది.
12. ఈ కళలో ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా? వాటి గురించిన వివరాలు చెప్పండి.
లేదు. ఎవరికి శిక్షణ ఇవ్వదలుచుకోలేదు. ఆర్థిక రాబడి లేని రంగం ఇది.
13. మీరు వేసిన చిత్రాలను తెలంగాణ రాష్ట్రానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పుకున్నారు. కారణం చెప్తారా?
కె.సి.ఆర్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు పథకాల వల్ల ఆకర్షితుడనై తెలంగాణ ప్రభుత్వానికి అంకితం ఇచ్చాను.
14. గంగాధర్ అనేది మీపేరు అయితే శివ ఆర్ట్స్ అని పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా?
నా అసలు పేరు గంగాధర్. అంటే గంగను ధరించిన వాడు. ఎవరు శివుడు. ఇది ఒక కారణమైతే అప్పట్లో సినీ హీరో నాగార్జున నటించిన “శివ” చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేరు పెట్టుకోవడానికి మరో కారణం. ఇక మూడో కారణం కూడా ఉంది కార్టూనిస్టులు, ఆర్టిస్టులు, రైటర్స్ వారి అసలు పేరు కాకుండా కలం పేరు ఇష్టమైనది పెట్టుకుని ఆ పేరు మీదనే కార్టూన్స్,ఆర్ట్స్ ,రచనలు చేస్తుంటారు కాబట్టి ఈ మూడు కారణాలు కలిపి శివ అనే కలంపేరు(పెన్ నేమ్ ) పెట్టుకోవడం జరిగింది.ఆర్.ఎం.పి వైద్యునిగా పనిచేస్తాను కాబట్టి అందరికీ డాక్టర్ శివ అంటేనే తెలుసు.
15. మీకు తెలిసిన, మీరు ఇష్టపడే రాష్ట్రీయ, జాతీయ చిత్రకారులు ఎవరు?
నాకు ఇష్టమైన రాష్ట్రీయ చిత్రకారుడు బాపు, జాతీయ చిత్రకారుడు ఆంజనేయులు.
16. మీ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏది? ఎందుకు?
ఇప్పటివరకు నేను వేసిన కార్టూన్స్ ఆర్ట్ చిత్రాలలో నాకు బాగా నచ్చింది కేవలం ఒక్క లైన్ తో వేసిన డ్రాయింగ్. దాని ప్రత్యేకత ఏమంటే కేవలం ఒకే ఒక్క లైన్లో మనిషి జీవితంలోని మూడు దశలను అంటే బాల్యం, యవ్వనం,వృద్ధాప్యం ఈ మూడు దశలను కేవలం ఒక్క లైన్తో వేయడం నిజంగా అద్భుతం ఈ డ్రాయింగ్ తోనే గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాను.చివరిగా నా కోరిక కాంబోడియా దేశంలోని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రఖ్యాత హిందూ దేవాలయ “అంగ్ కోర్ వాట్”ను సందర్శించాలని. అలాగే బ్యాంకాక్ సిటీలోని “జేమ్స్ ఆర్ట్ గ్యాలరీ”(రత్నాలతో చేసిన ఆర్ట్ గ్యాలరి) దర్శించాలని ఉంది.నాలాంటి వారి ప్రతిభను ప్రోత్సహించే వారు ఎవరైనా టూర్ ను స్పాన్సర్ చేస్తారని అనుకుంటున్నాను.కచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను.
కవిరాజహంస, కవిరత్న బిరుదాంకితులైన సుప్రసిద్ధ విమర్శకులు, కవి, రచయిత, ఆధ్యాత్మిక, తత్త్వవేత్త, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య గారితో మయూఖ ముఖాముఖి..

1.నమస్కారం సార్..మీరు పుట్టి పెరిగిన ఊరు, మీ బాల్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఉంది మాకు. వాటిని గురించి చెప్పండి.
జ: నమస్కారం అమ్మా! మా ఊరు కరీంనగర్ జిల్లా లోని వెదురుగట్ట గ్రామం. మా అమ్మగారి పేరు శాంతమ్మ, మా నాన్నగారి పేరు లస్మయ్య. సెప్టెంబర్ 5, 1950 వ సంవత్సరంలో నేను పుట్టాను. 5వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదివాను. అది గుడిసె బడి. 4, 5 క్లాసులు అందులోనే ఉంటాయి. హైస్కూల్ చదవడానికి చొప్పదండి వెళ్ళాను. మా ఊరికి, అక్కడికి ఒక మూడు మైళ్ళ దూరం ఉంటుంది. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాణ్ణి. 6వ తరగతి నుండి 11వ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూలు చొప్పదండిలో చదివాను. కరీంనగర్ లో ఎస్.ఆర్.ఆర్ కాలేజీ ( శ్రీ రాజరాజేశ్వర కళాశాల )లో 12వ తరగతి (పియుసి) చదువుకున్నాను. ఆ తర్వాత బీఎస్సీ కరీంనగర్ జిల్లాలోని ఆర్ట్స్& సైన్సు కళాశాల జగిత్యాలలో చేశాను. అప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర తొలి ఉద్యమం (1969-70) జరుగుతోంది. ఆ తర్వాత ఎమ్.ఏ తెలుగు వైపు ఆసక్తి కలిగింది. దాంతో హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్& సైన్సు కాలేజీలో చేరి ఎమ్.ఏ తెలుగు పూర్తి చేశాను.
2. మీరు ఎంఫిల్ ప్రాచీన సాహిత్యం పైన, పిహెచ్ డి ఆధునిక సాహిత్యం పైన చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
జ.. నేను తీసుకున్న విషయాలు రెండూ పద్యకావ్యాలే. నాకు ప్రాచీన కవిత్వం మీద ఎంత మక్కువో ఆధునిక కవిత్వం పైన కూడా అంతే మక్కువ. పద్యం మీద ప్రేమే ఆ దిశగా ప్రోత్సహించింది. నేను ఎమ్.ఏ తెలుగు చదివిన తర్వాత వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో మొదటిసారి జూనియర్ లెక్చరరుగా చేరాను. ఎంఫిల్ చేయాలనిపించింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పి.జి. సెంటర్ వరంగల్ లో ఉంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లనవసరం లేదు కదా! అటు ఉద్యోగం చేస్తూనే ఎంఫిల్ చేయడానికి అవకాశం ఉంది. కొరవి గోపరాజు “సింహాసన ద్వాత్రింశిక” మీద చేయాలనుకున్నాను. ఈ టాపిక్ ను సూచించింది డా. పాటిబండ మాధవ శర్మ గారు. దానికి సూపర్ వైజర్ కోవెల సుప్రసన్నాచార్య గారు. 1976లో ఎంఫిల్ అయిపోయింది. వెంటనే కాకతీయ యూనివర్సిటీ లో ( అప్పుడే ప్రారంభం అయింది.. తెలుగులో మొదటి రిజిస్ట్రేషన్ నాదే) చేరాను. సుప్రసన్నాచార్య గారే నలుగురైదుగురు భావ కవుల పేర్లను సూచించారు. ఇదీ అని చెప్పలేదు. అందులో నేను నాయని సుబ్బారావు గారిని ఎంచుకున్నాను. దానికి రెండు కారణాలు. మాకు ఎమ్ఏ లో అధ్యాపకురాలు నాయని కృష్ణకుమారి గారు. వారి నాన్నగారే సుబ్బారావు గారు. అందువల్ల ఆ పేరు తెలుసు. ఆమె మాకు బోధకురాలు కావడం వల్ల ఒక ఆత్మీయత ఉంటుంది కదా! ఇది ఒక కారణమైతే అంతకుముందు ఆయన మీద పిహెచ్ డి ఎవరూ చేయకపోవడం రెండవ కారణం. తదనంతర కాలంలో ఎవరికైనా సుబ్బారావు గారి సమాచారం కావాలంటే నా థీసిస్ చూస్తారు కదా! కొరవి గోపరాజు గురించి కూడా అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాక నాయని సుబ్బారావు గారిలో ఇతరులకు లేని ప్రత్యేకత ఏంటంటే ఆయన తన జీవితాన్నే కవిత్వంగా రాసుకున్నారు. గొప్పకవిగా పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు గారిలోను, మహా భావకవిగా పేరు తెచ్చుకున్న కృష్ణశాస్త్రి గారిలోనూ ఇది లేదు. అందువల్ల నేను ఆయన పట్ల ఆకర్షితుడనయ్యాను. ఆయనపై పరిశోధన 1980లో అయిపోయింది. 1981లో అచ్చు వేయించాను. ఎంఫిల్ పుస్తకం 1983 లో అచ్చయింది.
3. మిమ్ములను అంతగా ప్రేరేపితులను చేసిన నాయని సుబ్బారావు గారి భావ కవిత్వ గొప్పదనం ఎటువంటిది?
జ…..ఇంతకుముందే చెప్పాను కదా! నాయని సుబ్బారావు గారు తన జీవితాన్నే కవిత్వీకరించారని. మొదట ఆయన “సౌభద్రుని ప్రణయ యాత్ర” రచించారు( 1922-25 ) ఆయన మేనమామ కూతురు హనుమాయమ్మ. కానీ ఆయన ‘వత్సల’ అని రాసుకున్నారు. మొదట ఆ అమ్మాయిని మేనమామ ఈయనకు ఇస్తాననడం కారణాంతరాల వల్ల నిర్ణయాన్ని మార్చుకోవడం, తిరిగి అంగీకరించడం.. ఇదంతా అభిమన్యుడు, శశిరేఖల పరిణయాన్ని పోలి ఉండడం వల్ల దానికి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య రెండేళ్ల కాలం విరహాన్ని అనుభవించి విరహగీతాలు రాశారు. ఒకచోట కృష్ణశాస్త్రి ఈయనను గురించి రాస్తూ ” కవిత్వం రాయకపోతే ఈయన ఏమై పోయేవాడో ” అన్నారట. తన వేదననంతా కవిత్వం ద్వారా తొలగించుకున్నారు.
వివాహం జరిగిన తర్వాత ఫలశ్రుతి (1926) అని కూడా రాసుకున్నారు. అయితే ఈ ఫలశ్రుతి ప్రబంధ ధోరణిలో కాకుండా ఆధ్యాత్మికమైన స్పర్శతో ఉంటుంది. పెళ్లయిన తర్వాత బీఏ పరీక్షలు రాస్తుండగా పరీక్ష హాలులో మూడు పద్యాలు రాశరట. ఇవి సంయోగ శృంగారాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి.
ఉదా.. “మత్పురానేక పుణ్య జన్మములు పండి/ జాహ్నవీ స్వచ్ఛవును సుధా సాధుమూర్తి/ వైన నీ దివ్య సాన్నిధ్యమందుకొంటి/ పుడమికిన్, స్వర్గమునకొక్క ముడి రచించి…ఇలా అద్భుతమైన భావాన్ని పండించారు.
విశ్వనాథవారు, సుబ్బారావు గారు చాలా సన్నిహితులు. విశ్వనాథ వారు “వేయిపడగలు” లో వీరి వియోగ, సంయోగ శృంగారాల గురించి కిరీటి, శశిరేఖ పేర్లతో కొన్ని పేజీలు ఉపాఖ్యానంగా రాశారు. నేను ఒక ఇంటర్వ్యూలో సుబ్బారావు గారి భార్య వత్సల గారిని ‘ఇది నిజమేనా?’ అని అడిగితే చివరలో వుండే చిన్న కల్పన తప్ప అంతా నిజమే అని చెప్పారు. ఇక సుబ్బారావు గారి తల్లి మేన కోడలు తన ఇంటి కోడలుగా రావాలన్న కోరిక తీరకుండానే మరణించడంతో ఆయన రాసుకున్న పుస్తకం ‘మాతృగీతాలు’. ఇందులో 63 పద్యాలున్నాయి. ప్రతీ ఖండికకు నెంబర్ -1అని పెట్టి మూడు పద్యాలు రాశారు. అందులో “ఒక్క ఏడాది అయినా ఆగకపోతివి” అంటూ తల్లిని గురించిన బాధతో విషాద కావ్యంగా రాసినారు. ఒకటి వియోగ సంయోగ కావ్యం, మరొకటి విషాద కావ్యం. ఈ రెండు కావ్యాలు 1922 – 26 మధ్య వచ్చాయి. ఇవి ఆయనకు గొప్ప భావ కవిగా పేరు తెచ్చాయి. ఆ తర్వాత మూడు దశాబ్దాల వరకు ఆయన రచనలు వెలువడలేదు.
రిటైర్మెంట్ తర్వాత హైద్రాబాదుకు వచ్చి ఆగిపోయిన కవిత్వాన్ని తిరిగి ఆరంభించి 1958లో “భాగ్యనగర కోకిల” రాసారు. ఆ తర్వాత తానెదుర్కొన్న పరిస్థితులను “వేదనా వాసుదేవం” గా రాశారు. దీంట్లో 108 పద్యాలున్నాయి. మకుట నియమం, ఛందో నియమం లేకపోయినా ఇది కొన్ని శతక లక్షణాలతో శతకంగా పేర్కొనబడింది. వేదన అంటే ఒక అర్థం భక్తి అని కదా! తన బాధను చెప్పుకున్నట్టే వుంటూ భక్తి భావంతో ఉంటుంది. అందుకే విష్ణు సహస్ర నామాలలోని వాసుదేవ తత్వం యొక్క ప్రభావం ఉందని థీసిస్ లో రాశాను. నేను రాసిన పుస్తకాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైన కృష్ణకుమారి గారు “మా నాన్నగారు బతికి ఉంటే ఎంత బాగుండు?” అన్నారు.
మరో బాధాకరమైన విషయం సుబ్బరావు గారి ఒక్కగానొక్క కొడుకు హఠాత్తుగా మరణించాడు. అతని పేరు మోహన్ రావ్. ఆ పేరు మీద ఆయన “విషాద మోహనం” కావ్యం రాశారు. 75 ఖండికలు, ఒక్కో దానికి మూడు పద్యాల చొప్పున 225 మధ్యాక్కరలతో రాసిన కావ్యం. నంబర్ -1 అని రాస్తూ 3 పద్యాలు, నంబర్ – 2 అని రాస్తూ 3 పద్యాలు రాసుకుంటూ వచ్చారు. ఆ మూడు పద్యాల్లో ఒకే భావం ఉంటుంది. ఈ కావ్యంలో, ఎవరైనా చనిపోయినప్పుడు మనిషికి ఉండే దుఃఖాన్ని సహజమైన స్థితిలో వర్ణిస్తూ దుఃఖ తీవ్రత, దుఃఖ ఉపశమనం, స్మృతి…ఇలా మూడు దశలుగా చెప్తారు. చివరకు రాసిన పద్యాల్లో విష్ణువును స్మరిస్తూ “లోకానికి శాంతి కలుగు గాక” అనే శాంతివచనాలు ఉంటాయి.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యం రాశారు. వీటన్నింటి గురించి విపులీకరించాను.

4.. “భౌమ మార్గం” అని చెప్పబడిన మీ విమర్శనాత్మక శైలిలోని వైవిధ్యం ఏమిటి?
జ. నేనొక వినూత్న పద్దతిలో విమర్శ ప్రారంభించాను. “కొత్త విషయం లేకుండా రాయడం” నా జీవ లక్షణం కాదు (నవ్వుతూ) అదే విమర్శలోనూ కొనసాగింది. అందరు చేసే విమర్శ ధోరణికి భిన్నంగా ఒక కొత్త ఊహ వచ్చింది. పాఠకుడిని కవికి దగ్గర చేర్చడం, వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఉండే ఉద్దేశ్యం ప్రధానంగా స్టూడెంట్ ప్రశ్న వేసినట్టుగా చెప్పుకొని దానికి నేనే సమాధానం చెప్పడం. అంటే అక్కడ ప్రశ్న, జవాబు రెండూ నేనే. ఆ పద్ధతిలో మొదటగా “నాయనితో కాసేపు” రాశాను. సుబ్బారావు గారు రామారావు గారికి అభిమాన కవి కావడం వల్ల, ఆయన గురించి నేను రాసినందువల్ల నేనంటే రామారావు గారికి ఎంతో అభిమానం ఏర్పడింది. ఆ తర్వాత అదే కోవలో నేను రాసిన “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అన్న పుస్తకానికి ముందుమాట రాస్తూ నా విమర్శకు “భౌమ మార్గం” అని పేరు పెట్టారు. భౌమ అంటే భూమయ్యకు సంబంధించిన ఒక అర్థం, మరో విధంగా రామారావుగారు భౌమ అంటే “Down to Earth Approach” అనే అర్థం చెప్పారు. అంటే ఆకాశం నుండి భూమికి దిగడం. అంటే విమర్శ క్లిష్టంగా కాకుండా సరళంగా, అందరికీ అర్ధమయ్యే విధంగా ఉందని చెప్పడం. భౌమ అంటే భూమికి సంబంధించినది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ‘భౌమమార్గం’ అంటే సంభాషణాత్మక శైలి. “ముందు ముందు కాలంలో ఇది ఏ పేరుతో స్థిరపడుతుందో కానీ ఇప్పటికి మాత్రం నేను దీనికి ‘భౌమమార్గం’ అని పేరు పెడుతున్నా” నని చేకూరి రామరావు గారు అన్నారు. అలా నా విమర్శకు ఒక ప్రత్యేకత ఏర్పడింది.
5. ‘భౌమ మార్గం’ లో వెలువడిన మీ రచనలేవి?
జ. భౌమ మార్గంలో వెలువడిన నా విమర్శ గ్రంథాలు 7. అందులో అయిదు తెలుగు కవిత్వం అయితే 2 సంస్కృతం. 2000 సంవత్సరంలో ఈ వరుసలో నాలుగు పుస్తకాలు అచ్చు అయినాయి. తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో ఒక సెమినార్ జరిగింది. అందులో పాల్గొని “కర్పూర వసంతరాయలు” కావ్యంలోని దాంపత్యంపై పత్ర సమర్పణ చేశాను. ఆ నేపథ్యంలో “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే స్ఫురణ వచ్చింది. లోతుగా పరిశీలిస్తే సినారె గారి ఋతుచక్రం , గుఱ్ఱం జాషువా ముంతాజ్ మహల్ , విద్వాన్ విశ్వం పెన్నేటి పాట మొదలైనవి. వాటిలో సంపత్ అనే కలం పేరుతో శంఖవరం రాఘవాచార్యులు విశ్వనాథ విజయం అనే కావ్యం రాశాడు. చాలా అందమైన కావ్యం. ఇలాంటి కొన్ని కావ్యాలు తీసుకొని వాటిలో దాంపత్యం ఎంత గొప్పగా చిత్రించబడిందో చెప్తూ “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే విమర్శ గ్రంథం రాశాను. మూడవది “కర్పూర వసంతరాయలు- కథా కళాఝంకృతులు”.
ఇందులో కర్పూరవసంతరాయలు గేయ కావ్యంలోని కవితావిశేషాలను వివరించాను. వస్తు స్వీకృతిలో, వస్తు నిర్వహణలో,పాత్రల చిత్రణలో, సన్నివేశ కల్పనలో సినారె గారి ప్రతిభను వివరించాను. ఇక నాల్గవది సురవరం ప్రతాపరెడ్డి గారు 354 మంది కవులతో వెలువరించిన “గోలకొండ కవుల సంచిక” ఆధారంగా “గోలకొండ కవుల సంచిక” రాశాను. 2012 లో “వేమన అనుభవసారం” కూడా ఇదే మార్గంలో రాశాను. ఇందులో 15 శీర్షికలు ఉంటాయి. మానవ జీవితంలోని మంచి చెడులను, మనిషికి ఉండాల్సినవి, ఉండకూడనివి అయిన లక్షణాలను కాచి వడబోసి చెప్పిన కవి ఆయన. ఒక యోగిగా మారితే తప్ప ఆ యోగిని అర్థం చేసుకోలేము. అంతటి తత్త్వవేత్త ఆయన. ..ఇక సంస్కృతంలో శంకరాచార్యులవారి సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల పైన కూడా ఇదే మార్గంలో విమర్శ పుస్తకాలు రాశాను.
6. నాయని సుబ్బారావుగారి రచనల సమాహారంగా ” నాయనితో కాసేపు ” అనే పుస్తకంలో సుబ్బారావు గారి కవిత్వాన్ని గురించి చెప్పిన విషయాలేవి?
జ.. నాయని సుబ్బారావు గారు 1899 లో జన్మించారు. 2000 సంవత్సరంలో ఆయన శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో ఒక వ్యాసం కాకుండా పుస్తకమే రాయాలనిపించింది. దీంట్లో నాయని సుబ్బారావు గారి కృతులన్నిటి గురించి గురు శిష్యుల సంవాద రూపంగా రాశాను. నా పిహెచ్ డి లో ఆయన రాసిన ‘జన్మభూమి’ గురించి ఎక్కువగా రాయలేదు. ఒక చాప్టరుగా రాశాను. అందుకే దాని గురించి సవివరంగా రాయలనుకున్నాను. అంతకు ముందు నేను విమర్శ గ్రంథాలు రాసి, తర్వాత 5 పద్య కావ్యాలు రాశాను కాబట్టి కవిత్వం, దాని శ్రమ అన్నీ అవగతమైనాయి. దానికి తోడు నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా! అందుకే ఈ పద్యకావ్యాల తర్వాత వచ్చిన విమర్శ వినూత్నంగా వచ్చింది. అప్పటి, విమర్శకు, తర్వాతి విమర్శకు మధ్య ఉన్న శైలీ పరమైన తేడాను గుర్తించారు కాబట్టే చేకూరి రామారావు గారు భౌమమార్గం అన్నారు. అదేంటంటే ఎమ్ ఏ చదివిన విద్యార్థులు పి హెచ్ డి కోసం ఏ టాపిక్ రాయాలనే దాని కోసం మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అలా వచ్చే స్టూడెంటును కల్పన చేసుకొని అతని చేత ప్రశ్నలు వేయించు కున్నట్టుగా నేను ఈ విమర్శ రాయడం మొదలు పెట్టాను. దీంట్లో సీరియస్ నెస్ ఉండదు. కవిత్వం యొక్క అందచందాలు చెప్పటమే ఉద్దేశ్యం. పాఠకుడిని కవికి దగ్గర చేయడం ప్రధానం. ప్రశ్న జవాబుల పద్దతిలో రెండూ నేనే అయి చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పడం.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యంగా రాశారు…. “ఇతర జనపదముల నేను ప్రవాసినై/ మరచి యైన మేను మరచి యైన/ కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు /లుంచి యెపుడు పవ్వళించ లేదు” అంటారాయన. ఊరిమీద ఆయనకున్న అపారభక్తికి తార్కాణమిది. ఇందులో 5 ఖండాలుంటాయి. 1. ప్రకృతి ఖండం 2. తటాక ఖండం 3. ధరణిధర ఖండం 4. శివ ఖండం 5. శక్తి ఖండం. ఊళ్ళో ఉన్న ఆలయాల్లో కొన్నింటికి పూర్వగాథలు సేకరించి రాశారు. ధరణి ధర ఖండంలో కొండపై వెలసిన నరసింహ స్వామి, శక్తి, శివ ఖండాల్లో అమ్మవారి, శివునికి గల కథలను ప్రత్యేకంగా చెప్పడం ద్వారా వైష్ణవ, శాక్తేయ, శైవ సంప్రదాయాలను ఆయన వివరించినట్టు తెలుస్తుంది. కవిత్వంలో తప్పిపోయి కూడా విదేశీయత ఉండదు. ఆయన వర్ణనలన్నీ ప్రకృతికి, భారతీయతకు, సనాతన వైదిక ధర్మాలను కలుపుతూ ఉంటాయి..
ఉదా.. మర్రిచెట్టు మధ్యలో తాటి చెట్లను వర్ణిస్తూ “ఈ మర్రిచెట్టు కొమ్మలు శివుడు తాండవం చేస్తుండగా ఊగిన జడలు” అంటారు. తాటిచెట్టును త్రిశూలంగా వర్ణిస్తారు. అంతటి గొప్ప భావుకత ఆయనది. నాయని గారి రచనలన్నింటినీ ఇందులో వివరించినా జన్మభూమి గురించే 60 పేజీలు రాశాను.
7. ” తెలంగాణా భావ విపంచిక” గా మీరు రాసిన “గోలకొండ కవుల సంచిక ” కు ప్రేరణ ఏమిటి?
జ. సురవరం ప్రతాపరెడ్డి గారు నడిపిన పత్రిక ‘గోలకొండ’ మన ప్రాంతాన్ని నిజాం స్టేట్ అనేవారు. అప్పుడు తెలంగాణా జిల్లాలతో పాటు గుల్బర్గా, రాయలసీమ, పక్కన కన్నడ దేశంలో ఉండే 2, 3 జిల్లాలు, మహారాష్ట్రలో కలిసిన దౌలతాబాద్, ఇంకో రెండు, మూడు జిల్లాలు మొత్తం 10 జిల్లాలు కలిపి గోలకొండ అనేవాళ్ళు. 1934 వ సంవత్సరంలో ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ప్రతాపరెడ్డి గారికి ఒక వ్యాసం పంపుతూ ప్రాసంగికంగా “నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం” అని రాసినాడు. రాయడం తప్పే అయినప్పటికీ అందరూ అనుకుంటున్న విషయం అదే కదా! అధికార భాష ఉర్దూ. తెలుగు పాఠశాలలు లేవు. అలాంటప్పుడు కవులు ఎలా ఉంటారు? అని వాళ్లకున్న దురభిప్రాయం. ఆంధ్ర కూడా ఇందులో కలిసి లేదు. ఆ మాటలు సురవరం ప్రతాపరెడ్డి గారిని బాగా కదిలించాయి. దీన్ని సవాలుగా తీసుకొని పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. “వచ్చే దీపావళి ప్రత్యేక సంచిక. కవుల గురించి వేస్తున్నాము. ఇందులో ఎవరైనా ఆధునిక కవులు పద్యాలైతే 5, కథాత్మకంగా పద్యాలు రాస్తే 5 పేజీలు మించకుండా పంపండి” అని, 1900 సంవత్సరం పిదప పుట్టిన వాళ్ళందరినీ నేను ఆధునికులు అనుకుంటున్నాను. దాని ప్రకారంగా పుట్టిన వాళ్ళంతా పద్యాలు పంపండి. దాంతో పాటు, ఊరు, బిరుదులు, రాసిన పుస్తకాలు, ఏ జిల్లా, ఏ కులం…ఇవన్నీ రాయమన్నారు. వాటికొక లిస్టు కూడా ఇచ్చారు. దానికి వచ్చిన స్పందన అమోఘం. వచ్చిన వాటన్నింటినీ జిల్లాలు, కులాల వారీగా చేరుస్తూ 354 మంది కవులతో “గోలకొండ కవుల సంచిక” తయారు చేశారు ప్రతాపరెడ్డి గారు. ఇందులో పదిమంది కవయిత్రులు కూడా ఉన్నారు. నాటి తెలంగాణా స్థితి గతులకు దర్పణం ఈ పుస్తకం.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ వారు సురవరం
ప్రతాపరెడ్డి గారి మీద ఒక సెమినార్ తలపెట్టారు. అప్పుడు నేను వరంగల్ లో ఉన్నాను. ఆయన రచించిన అనేక విషయాల పైన మాట్లాడడానికి ఒక్కొక్కరు సిద్ధం చేసుకున్నారు. గోలకొండ కవుల సంచిక జనాలకు పరిచయమే లేదు. ఆ సెమినార్ ను నిర్వహించింది ఎల్లూరి శివారెడ్డి. ఆయన కూడా మహబూబ్ నగర్ వాడే అవడం వల్ల అభిమానంతో సెమినార్ నిర్వహించారు. “గోలకొండ కవుల సంచిక”
పైన 10, 12 పేజీల వ్యాసాన్ని సెమినార్ లో చదివాను. ఈ వ్యాసం రాసిన తర్వాత అది నన్ను వెన్నాడి పుస్తకం రాసేదాకా వదిలి పెట్టలేదు. అలా గోలకొండ కవుల సంచిక కూడా నాదైన విమర్శశైలిలో రూపు దిద్దుకుంది. ప్రతాపరెడ్డి గారి కవితా సంకలనం గురించి నేను రాసినదే మొదటి విమర్శ గ్రంథం.
8. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ‘వేయిపడగలు’ నవలను ఇతిహాసంగా చిత్రించారు. దానిలోని ఐతిహాసిక లక్షణాలు ఏవి?
జ: నేను ‘వేయిపడగలు’ పుస్తకాన్ని బీఎస్సీలో చదివాను. అది మనసులో ఉంది. అది చెబుతున్నప్పుడు అధ్యాపకులు దాన్ని ‘Epic’
అన్నారు. అసలు ఇది ఒక నవల. మహాభారతం ఒక ఎపిక్. మరి నవలలో అలాంటి లక్షణాలు ఏమున్నాయి? ఇంగ్లీషులో ఉన్న పది, పదిహేను ప్రక్రియల్లో ఒక్కో దానికి ఒక్కో చిన్న పుస్తకం ఉంది. ఎపిక్ అనే ప్రక్రియ మీద అదృష్టవశాత్తు ఒక చిన్న పుస్తకం లైబ్రరీలో దొరికింది. అందులో ప్రాచీన కాలం నుండి వస్తున్న మహాకావ్యాలే కాకుండా ఆధునికమైన నాటకం, నవల కూడా ఇతిహాసమే అని ఉంది. అక్కడ దొరికింది వస్తువు నాకు. ఇతిహాస లక్షణాలలో ప్రధానమైన వాటిని ఈ నవలకు సమన్వయం చేస్తూ “ఆధునిక ఇతిహాసంగా వేయిపడగలు” నవలను అభివర్ణించాను. అందులో ప్రధానమైనది వస్త్వెక్యత. వేయి పేజీల నవలలో అనేక కథలున్నప్పటికీ కథా సూత్రాన్ని పట్టుకొని అందులోని ఏకరూపతను
చూపించాను. అలాగే కథానాయకత్వం. ఇందులో ధర్మారావును నాయకుడుగా అందరూ అంగీకరించిన విషయం. మహాభారతంలో శ్రీకృష్ణుని వంటివాడు ధర్మారావు. శ్రీకృష్ణుడు ఎంతటి వాడైనా మహాభారత కథానాయకుడు కాదు కదా! కథను మొత్తం లోతుగా అధ్యయనం చేసి రంగారావే కథానాయకుడని చెప్పాను. వరంగల్లులో లక్ష్మణ యతీంద్రులు అని మా గురువు గారు.
ఆయనకు విశ్వనాథ సత్యనారాయణ అంటే వీరాభిమానం. నేను చెప్పిన వస్త్వైక్యం విని “నేను ఒక 70 సార్లు ‘వేయిపడగలు’ నవలను చదివాను. కానీ ఈ ఆలోచన నాకెప్పుడూ రాలేదు” అని ప్రశంసించారు. ఇక ఇతిహాస లక్షణమైన ఉపాఖ్యానాలు కూడా ఇందులో ఉన్నాయి. మూలకథకు అనుగుణంగా ఎన్నో కథలు చేర్చారు విశ్వనాథ వారు. మరో లక్షణం కర్మ ఫలానుభవం. ఇందులో కొన్ని పాత్రలు వారి వారి కర్మఫలాలను అనుభవించిన విషయాన్ని చూపించాను. అలాగే ప్రతీకాత్మకత…ఒక భౌతిక స్థితి నుండి తాత్త్విక స్థితికి మారడం..దాన్ని దర్శించగలగడం. వీటన్నింటినీ సమన్వయిస్తూ “వేయిపడగలు” నవలను “ఆధునిక ఇతిహాసం” గా నిరూపించాను. 1984 లో ఇది అచ్చు అయింది. ఏ పుస్తకం చదివినా దానిమీద విమర్శ వ్యాసం కాకుండా పుస్తకమే రాశాను.
9. ‘మాలపల్లి’ నవలను కేవలం దాంట్లోని రెండు గీతాల ఆధారంగా “అభ్యుదయ మహా కావ్యం”గా నిరూపించానని చెప్పారు…అందులో ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి అభ్యుదయభావాలు ఎటువంటివి?
జ: ‘మాలపల్లి’ నవల నేను ఎంఫిల్ చేస్తున్నప్పుడు చదివాను. వేయిపడగలు రాస్తున్నప్పుడే దీన్ని కూడా రాయాలనే సంకల్పం కలిగింది. 1992 లో నేను రాస్తున్నప్పుడు అంతకుముందు నేను దీని గూర్చి రాసిన పేజీలు దొరకలేదు. దొరకక పోవడం మంచిదయింది… (నవ్వుతూ). ఈ మధ్యకాలంలో నా ఆలోచనలు మారాయి. నా విమర్శకు బలం వినూత్నంగా ఆలోచించడమే. ఇందులో ఆయన రెండు గీతాలు రాశారు. ఒకటి భారతదేశ కులవ్యవస్థకు సంబంధించినదైతే మరొకటి దేశ ఆర్థిక దుస్థితి గురించి. ఇందులో అగ్రవర్ణాలకు, బడుగు వర్గాలకు మధ్య ఉండే ఇబ్బందుల్ని చిత్రించడం ఒకటైతే…రష్యాలో వచ్చిన బోల్ష్ విక్ ఉద్యమం (1917) రెండవది. ఉన్నవాళ్లను దోచి లేనివాళ్లకు పెట్టి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ఇందులో ప్రధానం. సమానత్వం కోసం విప్లవం జరిగి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ‘ఇజం’ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అప్పుడంతా రాజరికమే కాబట్టి ప్రజల తిరుగుబాటు వలన రాజరికం నశించి ఇలాంటి ప్రభుత్వం ఏర్పడడం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యమాలు రావడం వేరు. దానివల్ల రాజరికం నశించడం విశేషం కదా! ఆ ఉద్యమాన్నే ఒక పాత్ర ద్వారా ఇందులో ప్రవేశ పెట్టారు లక్ష్మీ నారాయణ గారు.
భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యల ఆధారంగా అంత పెద్ద నవలను రాశారు. కులవ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘చరమగీతం’ అని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘సమతాధర్మం’ అని పేర్లు పెట్టారు. 1917 లో రష్యాలో విప్లవం వస్తే మాలపల్లి నవల 1922లో వచ్చింది. అంత తొందరగా ఆయన ఆ ఉద్యమం చేత ఆకర్షించబడ్డారు. ఒక దళితుడిని కథా నాయకునిగా పెట్టి నవల రాయడం అంతకు మునుపు ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైన చర్య. ఈరెండు గీతాల వ్యాఖ్యానమే ఈ నవల. అభ్యుదయం అంటే ఉన్నతమైన భావాలతో సమాజం అభివృద్ధి చెందడమే కదా! అందుకే దీన్ని నేను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. ఈ అభ్యుదయ కవిత్వాన్ని మార్క్సిజం భావాలతో మొదట రాసింది శ్రీ శ్రీ అని చెబుతున్నారు. అట్లా కాదని ఉన్నవ గారి గీతాన్ని ఉదాహరణగా చూపుతూ ఒక వ్యాసం రాశాను. ఆ గీతంలో ఒకచోట ఉన్నవ లక్ష్మీ నారాయణ రావు గారు “తిరుగుబాటు చేయండి” అని అంటారు. 1922 లోనే ఆయన ఈ మాట అనగలిగారు. శ్రీశ్రీ మహాప్రస్థానం 1934 నుండి వచ్చిన కవితలు. కాబట్టి మాలపల్లి నవలను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. నా పుస్తకంలో రెండు వ్యాసాలుంటాయి. ఆయన గీతాలకు సంబంధించినది ఒకటి. ఆయనే మొదటి అభ్యుదయ కవి అని చెప్పేది మరొకటి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక మహానుభావుడు నా పుస్తకాన్ని చదివి ఇది అభ్యుదయ మహాకావ్యం అని కాకుండా “తొలి అభ్యుదయ మహాకావ్యం” అనవలసింది అన్నారు.
10.కట్టమంచి వారి “ముసలమ్మ మరణం” కావ్యాన్ని తొలి ఆధునిక కావ్యంగా ఎలా నిరూపించారు? అంతకు ముందున్న కావ్యాలకు, దీనికి గల భేదం ఏ అంశాలకు సంబంధించినది?
జ: “ముసలమ్మ మరణం” గురించి రాయడానికి మొదటి ప్రేరణ ఏంటంటే వరంగల్ రేడియో స్టేషన్ వాళ్ళు ఈ కావ్యం మీద ప్రసంగం చేయమన్నారు? ప్రసంగం చేసిన సమయం 11 నిమిషాలే. కానీ అది నన్ను వెన్నాడింది. దాని మీద ఇంకా రాయాలనిపించింది. దీనిమీద నాలుగు వ్యాసాలు రాసి ఆంధ్రభూమి పత్రికకు పంపించాను. వాళ్ళు వరుసగా ప్రచురించారు. అయితే పుస్తకం రాయడానికి ఇంకో కారణం ఉంది. సినారె గారి సిద్ధాంత గ్రంథం “ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు” ఆధునిక విమర్శ చేసేవాళ్ళు తప్పనిసరిగా చదవవలసిన గ్రంథం. దీంట్లో ఆయన ముసలమ్మ మరణాన్ని మొదటి కావ్యం అని చెప్పలేదు. అరుణోదయం అని, వేగుచుక్క అని ప్రశంసించారు. కానీ ఆధునిక కావ్యమని రాజముద్ర వేసింది రాయప్రోలు వారి తృణకంకణానికే.. సినారె గారు భావ కవిత్వానికి లక్షణాలు చెబుతూ వస్తువు,భావం,రచన…ఈ మూడింటిలో నవ్యత ఉన్నప్పుడే అది ఆధునిక కావ్యం అన్నారు. ఇదే విషయాన్ని అంతకు ముందు చెప్పినవారు కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు. ఆయన తన “నవ్యాంధ్ర సాహిత్య వీధులు” పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వీరికంటే ముందు చెప్పినవారు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు”నాచన సోముని నవీన గుణములు” అనే వ్యాసంలో ప్రాస్తావికంగా కవిత్వానికి మూడు అంగాలు ఉంటాయని అన్నారు. రచన వస్తువుకు, వస్తువు భావానికి ఒదిగి ఉన్న కవిత్వమే రస ప్రధాన కావ్యంగా ఉంటుందని రాళ్లపల్లి వారు సిద్ధాంతీకరించారు. ఈ మూడింటిని ఆధునిక కవిత్వానికి ఆపాదించుకుంటూ రచనా నవ్యతకు ఆద్యుడు గురజాడ అని, భావ నవ్యతకు రాయప్రోలు అని అన్నారు. అక్కడే పడింది నా కన్ను. ఇది కాక రాయప్రోలు సుబ్బారావు గారికి కట్టమంచి రామలింగారెడ్డి గారు అనుయాయులు అన్నారు. అక్కడ నాకు మరో ఆలోచన తట్టింది. కట్టమంచి వారు తాను 1899 లో బీఏలో ఉండగా పోటీ కోసం రాసిన కావ్యం “ముసలమ్మ మరణం” కావ్యం. ఇది 1900 సంవత్సరంలో అచ్చు అయింది. రాయప్రోలు సుబ్బారావుగారు ‘తృణకంకణం’ రాసి కట్టమంచి వారి దగ్గరకు వెళ్లి చదివి వినిపించాడన్నది అందరికీ తెలిసిందే. అదీకాక ముత్యాల సరాలు వచ్చింది 1909లో. తృణ కంకణం వచ్చింది 1913లో. కట్టమంచివారి కావ్యం వస్తు నవ్యతతో కూడుకొన్నది. అంతకుముందు విషాదాంత కావ్యాలు లేవు మనకు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ అది. లార్డ్ మెకంజీ సేకరించిన కైఫీయత్ లో ఉన్న కథ. గ్రామ క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన బసిరెడ్డి చిన్న కోడలు ముసలమ్మ కథ. ఆధునిక కవిత్వంలో కథా నాయిక మరణాన్ని నవ్యతగా నిరూపించాను. ఎందుకంటే అంతకు మునుపు లేనివిధంగా ఇదే క్రమంలో గురజాడ వారి పూర్ణమ్మ, దువ్వూరి వారి నలజారమ్మ, రాయప్రోలు వారి స్నేహలత విషాదాంత కావ్యాలు ముసలమ్మ మరణాన్ని అనుసరిస్తూ వచ్చినవే.
ఆద్యుడు అని ఎందుకు పెట్టానంటే ఆయన కవిత్వానికే కాదు విమర్శకు కూడా ఆద్యుడే. నేను రాసిన పుస్తకంలో మొదటి వ్యాసం ముసలమ్మ మరణం అయితే రెండవ వ్యాసం కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారానికి సంబంధించినది. “ఆద్యుడు కట్టమంచి” పుస్తకానికి మా గురువు గారు సి.నారాయణరెడ్డి గారితో ముందుమాట రాయించాను. మొత్తం చదివి ఒక పేజీ రాశారు. “భూమయ్య తన వాదాన్ని ఎదుటి వారిని నొప్పించకుండా, అతి జాగ్రత్తగా తనదైనటువంటి భావాన్ని సుతారంగా ప్రవేశపెడతాడు” అని రాశారు. రేడియోలో పనిచేసే నాగసూరి వేణుగోపాల్ అనే ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఒక వ్యాసం ‘మెత్తని పులి’ అనే పేరుతో రాశాడు (నవ్వేస్తూ).
11. మధునాపంతుల సత్యనారాయణ గారి ఆంధ్రపురాణాన్ని “భారతీయ సంసృతీ వైభవం” గా రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: మధునాపంతుల సత్యనారాయణ గారు ఆంధ్రుల చరిత్రను శాతవాహనులు మొదలుకొని దక్షిణాంధ్ర దేశాన్ని పరిపాలించిన నాయక రాజుల వరకు మొత్తం 9 విభాగాలుగా చేసి వాటికి పర్వాలు అని పేరు పెట్టారాయన. మొదటి భాగానికి ‘ఉదయపర్వం’ అన్నారు. ఆంధ్రుడికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు ఏ పురాణంలో కనిపిస్తున్నాయో అన్నీ వెలికితీసి ఉదయపర్వంలో రాశారు. ఏడు, ఎనిమిది వందల సంవత్సరాల్లో పరిపాలించిన తెలుగు రాజవంశాల చరిత్ర ఇది. చరిత్రను కావ్యంగా మలిచారు. ఒక్కో రాజవంశంలో ఎంతోమంది పరిపాలిస్తారు. అందులో ఎవరు గొప్పవారనే విషయాన్ని గ్రహించి రాయడంలోనే ఆయన ప్రతిభ వ్యక్తమవుతోంది. ఉదా.. కాకతీయ వంశం తీసుకుంటే గణపతిదేవ చక్రవర్తి, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి..ఇలా ప్రముఖులు కనిపిస్తారు…లోతుగా పరిశీలిస్తే వైదిక ధర్మానికి సంబంధించిన యజ్ఞ యాగాదులు, ఆలయాలు ఇట్లా ధార్మిక పద్ధతిలో పాలన చేసినవారిని ఆయన తీసుకున్నారని అవగతమవుతుంది. పురాణ లక్షణాలైన సర్గ, ప్రతిసర్గలు ఇందులో లేవు కానీ ‘వంశానుచరిత’ లక్షణ ప్రధానంగా రాశారు.
నాకొక ఆలోచన వస్తే తప్ప పుస్తకం రాయను. పాయింట్ దొరికితే తప్ప వ్యాసం రాయాలనుకోను. అలాగే దీని గురించి రాయడానికి కూడా నేపథ్యం ఉంది. శాస్త్రిగారు మరణించాక వారి కుటుంబీకులు ప్రతీ ఏటా ఆయన జయంతికి ఒక పండితుని పిలిపించి శాస్త్రిగారి గురించి ఉపన్యాసం ఇప్పించి సత్కారం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పదవ సంవత్సరంలో నన్ను పిలిచారు. అది రాజమండ్రిలో జరిగే సభ. శాస్త్రిగారు రాజమండ్రి వాస్తవ్యులు. వారి జీవితమంతా అక్కడే గడిచింది. ఆయనకు ఎంతోమంది శిష్యులు కూడా ఉన్నారక్కడ. నేను ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఆ సభాధ్యక్షుడు, శాస్త్రిగారి తమ్ముడు సూరయ్య శాస్త్రిగారు ” ఈ కావ్య రచనలో మా అన్న ఇన్ని రహస్యాలు పెట్టినాడా? మళ్లీ ఒక్కసారి దీన్ని నేను చదవాలి” అన్నారు ఆశ్చర్యపోతూ. ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెబుతుండగా ‘ఆంధ్రపురాణం’ రాసింది ఈయనే. అలాగే ధూళిపాళ మహాదేవమణి అనే పండితుడు రాజమండ్రిలో ఉన్నాడు.”చాలా బాగా మాట్లాడారని” నన్ను ప్రశంసించారు. నాకు కవిత్వం ద్వారా పరిచయమున్న సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ సభలో. ఆయన “బాగా మాట్లాడినారని” మెచ్చుకున్నారు. వీరు ముగ్గురి మాటలు విన్న తరువాత, ఆంధ్రపురాణంలో వీళ్లకు కూడా తెలియని ఏదో ప్రత్యేకత ఉందని నాకర్థమైంది. దాంతో మొత్తం మళ్లీ చదివి పుస్తకం రాశాను.
దీన్ని నేను భారతీయ సంస్కృతీ కోణంలో చూశాను. అందుకే “భారతీయ సంస్కృతీ వైభవం” అని పేరు పెట్టాను. శాస్త్రిగారు శాతవాహనులతో కాకుండా ‘ఉదయపర్వం’తో ప్రారంభించారు. పురాణంలో పుట్టిన ‘ఆంధ్ర’ శబ్దమాధారంగా కథ ఉంటుంది. సంతానం లేని రాజుకు వరుణదేవుని అనుగ్రహం వల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు. అంటే దీని అర్ధం భగవంతుని అనుగ్రహం వల్ల జన్మ కలుగుతుందనే కదా! చిట్టచివరి నాయక రాజులను వివరిస్తూ…ఆ రాజుకు అన్నదానం చేయడం ఎంతో ఇష్టమైన సత్కార్యం. ఇలాంటి ధార్మికమైన పనులు రాజ్యాన్ని సంక్షోభం లోంచి బయటపడేస్తాయి. గ్రంథం చివరి భాగానికి “ముక్తామణి దర్శనం” అనే ఉప శీర్షిక ఉంటుంది. కావ్యం మొత్తంలో మధ్యలో ఒకచోట అమ్మవారి ముక్కుపుడక మాయమయిందని చెప్పి, “ముక్తామణి దర్శనం”లో అది దొరికిందని కవి అందమైన పద్యాల్లో రాశారు. రాజవంశాలన్నీ వేరు వేరుగా ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. అందువల్ల నాకు, ఈ కావ్యానికి కథా సూత్రం ఎట్లా తయారు చేయాలని ఆలోచిస్తే ‘ఆంధ్రుడు’ అన్న దగ్గర సమాధానం దొరికింది. ఈ రాజవంశాలన్నింటికీ ‘ఆంధ్రుడు’ అనేదే సంకేతం. ఉదయపర్వం అంటే ఆంధ్రుడు ఉదయించాడు అన్నదే. అక్కడ ఏ రాజవంశాలతో పని లేదు. పాలనంతా చేసింది ఆంధ్రులే అయినప్పుడు ఆంధ్రుని యొక్క పురాణమనే కదా అర్థం. ఆంధ్రరాజుల పురాణం కాదు. చివర్లో ముక్తామణి దర్శనం కలగడం అంటే నాకు అది ‘ఆత్మదర్శనం’ అని స్ఫురించింది. ఉపనిషత్తులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం యొక్క ప్రభావమది. ఆత్మదర్శనం తోనే కావ్యాన్ని ముగించారాయన. జీవితానికి కావలసింది అదే కదా! ఈ ఆంధ్రుడు ఆత్మ దర్శనం పొందడానికి కారణాలు ఏంటంటే వైదిక మార్గంలో సాగడం. అంటే వ్యక్తి వైదిక మార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్న పాయింట్ నాకు దొరికింది. మధ్యలో వైదిక ధర్మాలకు సంబంధించి, యజ్ఞ యాగాదులు చేసిన వారిని గురించి ఉంటుంది. దీన్నిబట్టి మొదటగా భగవంతుని అనుగ్రహం వల్ల పుట్టిన మనిషి వైదిక ధర్మమార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్నది సారాంశం.

12. పల్లా దుర్గయ్య గారి “గంగిరెద్దు” కావ్యం మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి?
జ: తెలంగాణ జీవితాన్ని చిత్రించే కావ్యం ‘గంగిరెద్దు’. మనకు సంక్రాంతి పర్వదిన సమయంలో కనిపిస్తుంది. ఎద్దే కానీ గంగిరెద్దు ఎలా అయ్యిందన్నది ఇందులోని ఒక పాయింట్. గంగి అంటే పూజ్యమైన అని అర్థం కదా! దున్నుతున్న ఎద్దు పూజనీయం కాదు. గంగిరెద్దు పూజింపబడేది. ఆయన టీచరు కాబట్టి తెలివి తక్కువ పిల్లలకు చదువు చెప్పడం ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ఒక పశువును గంగిరెద్దుల వాడు ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దాడన్న విషయాన్ని ఆయన రాసిన తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. 400 పై చిలుకు పద్యాల అద్భుత కావ్యమిది. ఇందులో కవి పేదవారైన కాపువాడు, గంగిరెద్దుల వాడు ఎలాంటి స్థితిని అనుభవిస్తుంటారో తెలుపుతూ కోడెదూడ గంగిరెద్దు కావడానికి నేర్చిన విద్య, గంగిరెద్దు యొక్క పూర్వపు రెండు జన్మలు, ఒక జంతువు, మనిషి వల్ల పడ్డ కష్టాలను ఎంతో హృద్యంగా వివరిస్తారు.
పల్లా దుర్గయ్య గారు ఈ కావ్యం ద్వారా ఒక గంగిరెద్దు ఆవేదనను, దాని జీవితాన్ని, అందులోని మూడు దశలను అద్భుతంగా వర్ణించారు. ఇది ఆయన కవితాత్మకతకు నిదర్శనం. మూగ ప్రాణిలోని ఆవేదనను పరోక్షంగా దర్శించి, దాన్ని మనకు అనుభూతి చేయించడం నన్ను బాగా ఆకట్టుకుంది.
ఒక వికృతమైన ఆకారంతో పుట్టి, వ్యవసాయానికి పనికి రాని ఎద్దు అందరిచేత పరిహసింపబడి తిరిగి వాళ్ళచేత పూజలందుకున్నట్లు ఉదాత్తంగా చిత్రించారు దుర్గయ్య గారు. అలా వికృతంగా పుట్టడానికి ముందు రెండు జన్మలు కారణమయ్యాయి. మొదటి జన్మ ఆవుగా పుట్టడం, రెండో జన్మలో ఎద్దులా పుట్టడం.. కానీ ఈ రెండు జన్మలో అది అనేక కష్టాలను అనుభవించింది. ఇక మూడవ జన్మలో రెండు తోకలు, మూపురంపైన ఒక కాలుతో వికృతంగా కోడెదూడగా పుట్టింది. దాన్ని చూసి వ్యవసాయానికి పనికిరాదని కాపు వేదన చెందుతాడు. దూడ తల్లి కూడా ఆవేదనతో మరణించింది. ఒకవైపు అనాథగా మారడం, మరోవైపు అందరి అవహేళనలకు గురికావడం, తన యజమానికి తను ఏ రకంగానూ ఉపయోగ పడకపోవడం..వీటితో నిరాశకు గురి అయిన దూడ ఇంటినుంచి పారిపోతుంది. గమ్యం లేకుండా తిరుగుతూ ఒక మర్రిచెట్టు నీడలో నిద్రిస్తూ ఉంటే గంగిరెద్దుల వాడు దాని ప్రత్యేక ఆకారాన్ని చూసి తీసుకుపోతాడు. తన తెలివితో దానికి మరో ఆవు చేత శిక్షణ నిప్పించి గంగిరెద్దుగా మారుస్తాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న గంగిరెద్దును ఊళ్ళు తిప్పుతూ దాని స్వంత ఊరుకు తీసుకొస్తాడు. కాపు దాన్ని చూసి గుర్తుపట్టినా తాను చీదరించుకున్న దూడను గంగిరెద్దుల వాడు తీర్చిదిద్దిన వైనానికి ఆశ్చర్య పోతాడు.. చివరకు కాపుతో పాటుగా ఊరంతా దానికి పూజలు చేస్తారు..
ఇందులో ఆయన దాన్ని కవిత్వీకరించిన తీరు అనన్య సామాన్యం. ” ముందు చన గోయి, వెనుకకు బోవ నూయి/ మోట పని యెద్దులకు చాల మోసమమ్మ”… “ముక్కునకు త్రాడు బిగియించె, ముందు వెనుక/ కాళ్ళు బంధించి, నాల్గు డెక్కలకు నినుప/ నాడె ములు గొట్టె”…..” మొద్దు చుట్టుగ దిరిగెడు ప్రొద్దులందు/ కాశికిం జేరుదుము చక్కగా నడిచిన”…..” ఆ యెండ దెబ్బ కోర్వక/ కాయం బుడుకెత్త, కాళ్ళు కంపింపగా”…..ఇలాంటి పాదాలు ఎద్దు ఆవేదనకు అద్దం పడతాయి. చివరగా ” కావున,నాట్య కళా పుం/ భావ గిరాందేవియైన పశువు బసవడై/ ఏ వృషమును, నర
పశువును/ భావింపగ రాని గౌరవం బంది కొనెన్”…అంటూ ఎంత పూజనీయంగా మారిందో చెప్తారు. ఒక ఉపాధ్యాయునిగా.. ఒక్కొక్కప్పుడు తెలివితక్కువ పిల్లలు ఇంట్లో తిడుతుంటే ఇంట్లో నుండి పారిపోవడాన్ని దూడ పారిపోయినదానికి అన్వయిస్తారు. సరియైన గురువు ఉంటే విద్యార్థులు రాణిస్తారని, గంగిరెద్దులవాడు దేనికీ పనికిరాని జంతువును పూజనీయంగా మార్చిన పద్ధతిని అన్యాపదేశంగా చెప్తారు.

13. ” భాగవత భక్త పాలన కళ” అని రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: “భక్త పాలన కళ” అన్నది నా మాట కాదు. పోతన భాగవతంలో “శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర/
క్షైకారంభకు/ భక్తపాలన కళా సంరంభకున్”…. అన్న పద్యం ఉంటుంది కదా..దీంట్లో భక్తపాలన కళ అన్నాడు పోతన. అది నా మనస్సును పట్టుకున్నది. అంటే భక్తులను పాలించడం ఒక కళ. ఆయన రక్షించిన భక్తులలో ఒక ఐదుగురిని నేను తీసుకున్నాను. అందులో కుచేలోపాఖ్యానం, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, వామన చరితం.. వామన చరితంలో అదితి అపారమైన భక్తికి కటాక్షించి ఆమె గర్భమున వామనుడిగా జన్మించాడు ఆ భక్త పరాధీనుడు. మిగిలిన నాల్గు కథలు తెలిసినవే కదా! ఇవి పెద్ద కథలు. ఇందులో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా అనుగ్రహించాడు విష్ణువు. ఆ తర్వాత కృష్ణుని బాల్యచేష్టల గురించి చిన్న కథలు తీసుకొని ఇందులో భక్తపాలన కళ కాకుండా బాల్యక్రీడలు వివరించాను. కృష్ణుని జననానికి రేపల్లె వాసులు పొంగిపోవడం, పూతనను చంపడం, తన నోట్లో విశ్వదర్శనం చేయించడం, వృక్షములను కూల్చి శాప విమోచనం చేయడం, గోవర్ధన గిరినెత్తడం..ఈ అయిదు కథలతో బాల్య చేష్టలు రాశాను. నారదుడు వ్యాసునికి, వ్యాసుడు, శుకునికి, శుకుడు పరీక్షితుకు భాగవతాన్ని చెప్పడం, దాన్ని పోతన అనువదించడం నుండి మొదలుకొని కొండను అద్దంలో చూపినట్లు సంక్షిప్తంగా చెప్పాను. ఒక విశేషం ఏంటంటే ఈ పదికథలకు నేను రాసిన పద్యాల్లోని పాదాలనే శీర్షికలుగా మలిచాను. ఉదా: “మొఱ విని గజేంద్రు బ్రోచె మకరిని ద్రుంచి”, “అదితి నోమగా వామనుడై జనించె”, కొండ నొక కేలనే ఎత్తె గొడుగు వలెనె” ఇలా…. దీనివల్ల పాఠకునికి పద్యంతో పాటు కథ కూడా తెలుస్తుంది. ఒక ప్రసంగం లాగా కూడా చెప్పే విధంగా ఉంటుంది…
14. భక్తి రస ప్రవాహాలైన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల గురించి కూడా మీ మార్గంలో ఎలా రాయగలిగారు?
జ: సంస్కృతం అంటే నాకు ఎంతో అభిమానం. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాలకు పలువురు పండితులు టీకా తాత్పర్యాలు రాసినారు. సౌందర్యలహరిలోని తాత్త్వికతతో పాటు కవితా విశేషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది సామాన్య జనులు అందుకోవాలంటే సరళమైన వచనంలో రాయాలి. దానికి మళ్లీ నా మార్గాన్నే ఎన్నుకున్నాను. ఒక విద్యార్థిని ఊహించుకొని , ప్రతిరోజూ ఆ విద్యార్థికి పది శ్లోకాలు చెప్పినట్టు, ఒకటవరోజు, రెండవరోజు అని చెబుతూ పదిరోజుల్లో వంద శ్లోకాలు చెప్పినట్టు రాశాను. కేవలం తత్త్వం మాత్రమే చెప్తే కుదరదని ఇందులో భక్తి అంశంతో పాటు కవిత్వ సొబగులను వివరించాను. “సౌందర్య లహరి – భావ మకరందం” అనే పుస్తకం రాశాను. 2013లో ముద్రితమైంది.
శివానందలహరిని కూడా ఇలాగే రాయాలనుకున్నాను. 100 శ్లోకాలు పూర్తి చేశాను. 2018లో పూర్తి అయింది. రెండూ వేరు వేరు అయినా ఆ రెంటినీ కలిపి “శివ సౌందర్యలహరి” పేరుతో 2019లో ఒక సంపుటంగా వేశాను.
15. మీ మొదటి కావ్యం “వేయినదుల వెలుగు” దేన్ని చిత్రిస్తుంది?
జ: ఆ కావ్యం పేరు అందులో రాసినటువంటి పద్యాల్లోని ఒక పాదం. ‘దేవి’ అని పెట్టాలనుకున్నాను. ప్రతీ పద్యంలో దేవి అని వస్తుంది. శతక మకుటంలా కాదు. పద్యం మొత్తంలో ఒకచోట వస్తుంది. ఇదంతా భక్తి రస ప్రాధాన్యమే. పురాణ గాథే. కానీ “కనికరింతువే నాకొక్క పనిని చెప్పి” అన్నాను. అంటే ఆమె అనుగ్రహం కావాలనే కదా!”వరములిమ్మని వారలెవ్వరి అడుగున పడనె లేదు నేనింతవరకు…నీ అభయవర పదమ్ముల నమ్మి” అంటూ విన్న విషయమే అయినా దాన్ని నాదిగా చేసుకొని నేను ఆ భావంలో మమేకమై రాశాను. ” దేవి! నీ పాద నఖ దీధితి నిశిత శర జాలము కురిసి రాక్షసి చచ్చి చెడును” అంటే అమ్మవారిని నమ్ముకోవడం వల్ల ఇలాంటి కృపకు పాత్రులవుతామని చెప్పడం..ఇలా ఇందులో భక్తి భావమే గోచరిస్తుంది. “దేవి ! ఈ జలపాతపు తీవ్రమైన ధాటి ఇది ఎక్కడిది? నేను తట్టుకొనకపోయితిని గదే.. ఇందుండి పుట్టి వచ్చి నన్ను తాకినది ఒక వేయి నదుల వెలుగు” అని ఒకచోట రాశాను. జలము నుండి విద్యుత్తు పుట్టినట్టు అది ఒక కిరణ రేఖ కాదు. ఒక నది అంత వెలుగు కాదు. వేయినదులు ఒక్కసారి వెలుగుగా ప్రసరిస్తే ఎట్లా ఉంటుంది? అమ్మవారిని గురించి వర్ణించేటప్పుడు శతకోటి సూర్య తేజముల వెలుగు అంటారు. ఇలా కవితాత్మకమైన పాదం రావడం వల్ల దీనినే కావ్యానికి పేరుగా పెట్టడం జరిగింది. దీన్నే మొదటి పద్యంగా పెట్టుకున్నాను. 1992లో నా విమర్శ కావ్యాలు అచ్చు కాగానే 1993లో ఈ పద్య కావ్యం రాయడం జరిగింది. ఇది 1994 లో అచ్చు అయ్యింది. దీనికి ముందు మాట రాస్తూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు ” మాతృ శిశు సంబంధం లాగా ఉన్నాయ” ని ప్రశంసించారు. అమ్మవారిని భయంతోనో, భక్తితోనో కొలవలేదు. సాక్షాత్తు నా తల్లిలా,వాత్సల్య మూర్తిగా కొలిచాను. “దేవి! నీ పాదరజమింత తీసి నా నుదుట తిలకము దిద్దగా తోచె, కవిత యను మరాళమొకటి నీ వదన విశాల గగనమందున తెల్ల రెక్కలను విప్పి” కవిత్వం నీ వల్ల వచ్చిందని చెప్పుకోవడం. దీంట్లో కొన్ని సౌందర్యలహరి భావజాలంతో వచ్చిన అనువాదాల్లాగా ఉంటాయి. చివరలో అమ్మవారి నామ స్మరణతో చేసిన పద్యాలు కూర్చాను. ఇట్లా నామాలు, శ్లోకాల భావాలు నాకు పద్యాలైనాయి..
16. “వెలుగు నగల హంస” కూడా ఇదే క్రమంలో వచ్చిన కావ్యమేనా?
జ: అవును. దానికి వెనువెంటనే ఆరు మాసాల వ్యవధిలో 1995 లో “వెలుగు నగల హంస” వచ్చింది. ” మౌనముద్ర దాల్చి మానస సరసులో నున్న తనకు నీవె కన్నులందు మెరసినావు…దేవి!
మురిసి తానై ముందుకు ఎగిరివచ్చె వెలుగు నగల హంస”… అంటూ మొదటి పద్యంగా రాశాను. ఇందులో 5 ఖండికలు ఉంటాయి. ప్రతీ ఖండికకు అమ్మవారి నామాలలోని పూల పేర్లను పెట్టాను. కదంబ కుసుమం, చాంపేయ కుసుమం, పాటలీ కుసుమం, మందార కుసుమం, చైతన్య కుసుమం.
“వేయినదుల వెలుగు” లో సౌందర్యలహరికి, లలితా సహస్రనామాలకు సంబంధించిన భావానుగుణంగా పద్యాలున్నాయి. “వెలుగు నగల హంస” లో నావి ఎక్కువ ఉంటాయి. “త్రాగు నీటికై ఒక బావి త్రవ్వుచుండ.. దేవి! ఈ భూమి గుణమేమొ కానీ, దీనిలోన బాధలే ఊరుచున్నవి..బ్రతుకిదెల్ల బాధలనె తోడుకొని త్రాగవలెనె?” ఇలాంటి పద్యాలెన్నో.. “వేదముల తోడ దేవి! నివేదన లొనర్ప గల యంత కాదు..స్వర్ణముఖి జలములట్లు నోటితో తెచ్చెడునంత కాదు. మధ్యతరగతి నా భక్తి మనసు పడుదె” నా భక్తి మరీ అంత గొప్పది కాదు, మరీ అంత లేనిది కాదు( నవ్వుతూ )మధ్యస్థం… అలాగే వ్యవసాయానికి సంబంధించిన పద్యమొకటి..
“పెట్టుబడి అప్పు.. చల్లెడు విత్తనాలు నాగు. భూమి కౌలుకు కొని, నన్ను దున్నుకున్నట్లె దీనిని దున్నినాను..నేనె పంటనై అమ్ముకున్నాను నన్ను..” ఇలా భక్తి భావంతో సాగుతూ ఉంటాయి ఈ రెండు కావ్యాలు కూడా…
17. “లోకం దృష్టి ఒకవైపు అయితే భూమయ్య గారిది లోచూపు” అన్నట్లు జ్వలిత కౌసల్య, మకరహృదయం లాంటి ప్రత్యేక రచనలతో
మనసులను ఆకట్టుకున్నారు… ఆ విభిన్న దృక్కోణాన్ని వివరిస్తారా?
జ: నిజమే! ఇంతకు ముందు చెప్పాను కదా! కొత్త విషయం లేకుండా రాయనని. దేన్ని చదివినా దాంట్లో నూతన అంశం ఏదైనా ఉందా అని ఆ దిశగా ఆలోచిస్తాను. అట్లా రూపుదిద్దుకున్నవే మీరడిగిన కావ్యాలు. వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు కౌసల్య దుఃఖం నన్ను కంట తడి పెట్టించింది. కైకేయి ఆజ్ఞ ప్రకారం వనవాసాలకు వెళ్ళడానికి శ్రీరాముడు తల్లి అనుమతికై కౌసల్య మందిరానికి వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది వాల్మీకి రామాయణంలో, తెలుగు రామాయణాల్లో ఎక్కడా ఏకపత్నీవ్రతుడన్న మాట కనిపించదు. లోక వ్యవహారంలో ఉన్నది మాత్రమే. కౌసల్యాదేవి రాముని చూసి “భర్తతో ఎలాంటి సుఖం పొందలేదని, సపత్నుల వల్ల పొందిన పరాభవాలు తనను తీవ్ర దుఃఖంలో ముంచాయని, గొడ్రాలుగా మిగిలిపోయినా ఈ బాధ ఉండేది కాదని” తీవ్రంగా దుఃఖిస్తుంది. అప్పుడు రాముడు తల్లి దుఃఖానికి బహుభార్యాత్వం కారణం కాబట్టి తల్లి ముందు ప్రతిజ్ఞ చేశాడన్న ఊహ వచ్చి “ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు/ ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య” అని మాటిచ్చి ఊరడించాడు అన్నట్టుగా వెలువడింది ‘జ్వలిత కౌసల్య’…
త్రిజట స్వప్న వృత్తాంతం తీసుకుంటే ఆమె ఒక రాక్షసిగా పక్కకు పెట్టడం తప్ప వేరే రాక్షస గుణాలు కనిపించవు. ఆమె పరమ సాధ్వి. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఆమె రాముని స్వప్నంలో దర్శించింది. ఆ ఊహతో రాసిందే త్రిజట. ఆమె తన స్వప్నంలో భవిష్యత్తును దర్శించింది. తన స్వప్నాన్ని రాక్షస స్త్రీలకు చెప్పి సీతతో పరుష వాక్యాలు మాట్లాడరాదని, రావణుని మాట వినరాదని చెబుతుంది. రాముని గాంచిన కలను చెప్పి రాముడు రానున్నాడని సీతకు ధైర్యాన్నిస్తుంది. రాముని దర్శించిన ఆమె ఎంతటి అదృష్టవంతురాలో కదా! అందుకే ఆ దృష్టితో ఆలోచించాను.
“ప్రవర నిర్వేదం”లో హిమాలయాల్లో పాదలేపనం కరిగిపోయి అగ్నిదేవుని ద్వారా ఇంటికి చేరిన ప్రవరుడు జరిగిన ఉదంతాన్ని విచారిస్తూ భార్యకు వివరించినట్లుగా చెప్పి, అతడు కర్మ యోగం నుండి, జ్ఞానయోగాన్ని పొందడానికి అగ్నియే గురువుగా జ్ఞానబోధ చేశాడని చెప్పడం జరిగింది. ‘కబంధమోక్షం’ లో కబంధుడు శాపవశాత్తు వికృత రూపం కలవాడైనా రామునికి సుగ్రీవ మైత్రి లభించే దిశగా మార్గ నిర్దేశం చేసిన వానిగా తద్వారా సీతాన్వేషణ సులభతరం కావడం.. అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని కబంధుణ్ణి ఒక ఉదాత్త పాత్రగా చిత్రించాను. కథలో మార్పులేదు. చెప్పిన విషయమే వైవిధ్యం..
గజేంద్రమోక్షం అందరికీ తెలిసిందే. కానీ మకరి చేసిన పాపం ఏమిటి? అని కొత్త ఊహ వచ్చింది (గట్టిగా నవ్వేస్తూ). అందుకే
“నా నివాస గృహమునకు తాను వచ్చి/ అల్లకల్లోల మొనరింప నడ్డుపడగ/ వలదొ? ఇదియు నేరమగునొ? వచ్చినట్టి/వాడు వనరాజు
వాని గర్వమ్ము గనవొ!” అంటూ మకరి ఆవేదన చెంది విష్ణువును ప్రశ్నించినట్టుగా రాశాను. ఇక “పారిజాతావతరణము” అన్నది నంది తిమ్మన “పారిజాతపహరణము” కావ్య ప్రేరణ. ఇక్కడ దీన్ని అపహరించినట్టుగా కాక పారిజాత వృక్షము యొక్క మాహాత్మ్యం తెలిసిన సత్యభామ భూలోకంలోని ప్రజల సంక్షేమార్థం కృష్ణుని పారిజాత వృక్షాన్ని తెమ్మని కోరినట్లుగా చిత్రించాను. సత్యభామ పాత్రను కొత్త కోణంలో ఉదాత్తంగా ఆవిష్కరించాను..
18. సంపాదకత్వంలో సాధారణ సంపాదకుల నుండి మిమ్మల్ని వేరు చేసే ప్రత్యేక లక్షణంగా వచ్చిన పుస్తకాలను గురించి తెలపండి.
జ: నా సంపాదకత్వంలో వెలువడిన రచనలు మొత్తం 18. ఇందులో శాఖాధిపతిగా ఉన్నప్పుడు చేసినవి కూడా ఉన్నాయి. కాకతీయ తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఏటా ‘విమర్శిని’ అనే పుస్తకం వచ్చేది. శాఖాధిపతిగా ఉన్నవారే సంపాదకులుగా ఉంటారు. నేను ఒకసారి ప్రత్యేకంగా పాల్కురికి సోమనాథుని గురించి రాయించాను. అంతకుముందే 1993-94 లోనే నేను రీడర్ గా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం వారు “ముసలమ్మ మరణం” కావ్యాన్ని సంపాదకత్వం కోసం నాకిచ్చారు. దానికి నేను దాదాపు 30 పేజీల పీఠిక రాశాను. రెండుసార్లు శాఖాధిపతిగా ఉన్నాను. అప్పుడొక చిన్న తమాషా చేశాను. వివిధ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఉన్న టీచర్లను పిలిపించి వాళ్లకు ఒకే సబ్జెక్టు పైన వేరువేరు టాపిక్స్ ఇచ్చి సెమినార్లు నిర్వహించి వాటికి సంపాదకత్వం చేశాను. ప్రతీ సెమినార్ లో అధ్యాపకులు ఎవరైనా స్టూడెంటును రెకమండ్ చేస్తే వారికి అవకాశం ఇచ్చాము. స్టూడెంట్ పత్ర సమర్పణ చేయడం ఆ స్టూడెంటుకు క్రెడిట్. ఒకసారి మొత్తం ఎమ్.ఏ విద్యార్థులందరినీ కలిపి అంతకు ముందు ఎవరూ చేయని విధంగా కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్న
మూడు కాలేజీల స్టూడెంట్స్ ను తీసుకున్నాం. ఎంపిక ఆయా కాలేజీల వాళ్ళదే. ఒకే రోజు ఇలా నిర్వహించడంపద్ధతిలో భాగం కాదు. నా ఇష్టపూర్వకంగా చేసింది. సెమినార్ పత్రాలన్నీ యూనివర్సిటీ ద్వారా అచ్చు వేయించా. ఇదొక రకమైన సంపాదకత్వం. దీనివల్ల వాళ్ళ రచనను అచ్చులో చూసుకోవడం కాక పి.హెచ్.డి అడ్మిషన్ కోసం చూయించాల్సిన రెండు ముద్రిత వ్యాసాలకు వీటిని చూపించే విధంగా ఉంటుంది కదా! ఆ సెమినార్ పేరు “తెలుగు నందనం” పుస్తకానికి కూడా అదే పేరు పెట్టాను. దీంట్లో నేనొక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాను. విద్యార్థులను ఇందులో పాల్గొనేలాగా చేయడం నా అభిమతం.
ఇంకొకటి తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత “తెలంగాణా సంస్కృతి తొలి ఆవిష్కర్త” గా పాల్కురికి సోమనాథుని గురించి రాశాను. ఇంకొక సారి సోమనాథుని గురించి ఎవరికీ ఎలాంటి టాపిక్ ఇవ్వకుండా పాల్కురికి సోమనాథునికి సంబంధించి వాళ్లకు తెలిసిన విషయాలు వ్యాసాలుగా రాయమని అందరికీ చెప్పాను. కొంతమంది మేము రాయలేము పద్యాలు రాస్తామన్నారు. సరేనన్నాను. ఒక 16మంది పద్యాలు, వచన కవిత్వం కూడా రాశారు. ప్రశంస కదా! దీనివల్ల కవి స్తుతి అవుతుంది. అయితే ప్రధానం వ్యాసాలే. మొత్తం 74 వ్యాసాలు. ఇలా పాల్కురికి సోమనాథుని కవితా వైశిష్ట్యాన్ని తెలియజేసాను. ఇవి నా ఆలోచనతో వచ్చినటువంటి సంపాదకత్వాలు..తెలంగాణ వచ్చిన తర్వాత పాల్కురికి సోమనను మొదటి కవిగా గుర్తించారు. నేనిలా చేయడం వల్ల మళ్లీ ఒకసారి పాల్కురికి సోమనాథుని అందరికీ గుర్తు చేసినట్లయింది. ఈ మధ్య ‘బసవకృప’ అని వీరశైవులు నడుపుతున్న మాస పత్రిక ఒకటి వస్తున్నది. నా అనుమతిని తీసుకొని వాళ్ళు ఈ పుస్తకం తీసుకొని వ్యాసాలను ఎంపిక చేసుకొని వాళ్ళ పత్రికలో తిరిగి అచ్చు వేసుకుంటున్నారు. అట్లా ఉపయోగ పడడం సంతృప్తికరంగా ఉంది.
19. “మా ఊరు చెరువు బడి గుడి” కూడా విద్యార్థుల రచనలతో వచ్చిందేనా? ఆ వివరాలు చెప్పండి.
జ: అవును…”ప్రతిభా త్రయి” లో విద్యార్థుల రచనను బట్టి వాళ్లలో రచనాశక్తి ఉందని గ్రహించాను. ఇంకో పుస్తకం వాళ్ళతో రాయించాలనిపించింది. టీచింగ్ గురించి రాయగలిగారు. ఇంకోటి దేని మీద రాయించాలి అని ఆలోచించినపుడు కావ్యం గురించి ఇస్తే వాళ్ళు రాయలేకపోయారు. దీన్నిబట్టి కావ్య విమర్శ చేసి రాసేంత శక్తి వాళ్ళల్లో లేదు అని అర్థమయింది. అయినా వాళ్ళతో ఏదైనా రాయించాలని మీ ఊరి గురించి రాయండి అన్నాను. “మా ఊరు చెరువు బడి గుడి” అని టాపిక్ ఇచ్చాను ప్రతి ఊళ్ళో చెరువు ఉంటుంది. దానికి సంబంధించి ఈతకొట్టిన అనుభవాలో ఏవో ఉంటాయి. ఆడపిల్లలైతే బతుకమ్మ మొదలైన ఆటలు ఇలా ఏదైనా వుంటుంది కదా! ఇక బడి విషయాలు… వాళ్ళ స్కూలును జ్ఞాపకం తెచ్చుకొని చదువుకున్న చదువు, వాళ్ళ టీచర్లు, స్నేహితులు ఇలాంటివి రాస్తారు. గుడి అయితే గుళ్ళో జరిగే పండుగలు, జాతరల అనుభవాలు, అనుభూతులు రాయమన్నాను. నా దృష్టిలో ఊరును ఒక మనిషి అనుకుంటే ఆ ఊరుకు శరీరం వంటిది చెరువు. అది పంటలకు ఆధారం. పంటలు సరిగా పండితే ఆహారపోషణతో వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. బడి అన్నప్పుడు చదువుకోవడం కాబట్టి బుద్ధికి ప్రతీకగా పెట్టుకున్నా. గుడి అనేది హృదయ సంబంధం. భక్తి అనేది మనసుకు సంబంధించినది. మనిషికి భౌతిక శరీరం, బుద్ధి వీటితో పాటు హృదయ పవిత్రత ముఖ్యం. అందుకే ఈ మూడింటి గురించి రాయమనడం నా ఉద్దేశ్యం. 24 మంది వరకు స్పందించి చక్కగా రాశారు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ కింద నాల్గు జిల్లాలు ఉండేవి. విద్యార్థులను వాళ్ళ మాండలికాల్లో రాయమని చెప్పాను. ఇందులో రెండు ప్రయోజనాలు. ఒకటి వాళ్ళల్లో రచనా శక్తిని పెంపొందించడం. రెండు…ఆయా ప్రాంతాల్లో మాండలికాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం. ఒక 25 సంవత్సరాల క్రితం ఆయా జిల్లాల సామాజిక పరిస్థితులు వీటివల్ల తెలిశాయి. ఇదీ నా దృక్పథం.

20. చాలా బాగుంది సార్..ఇంకో ప్రశ్న. పోతన భాగవతం అందరికీ తెలుసు..మరి “పోతన రామాయణము” అని మీ సంపాదకత్వంలో వచ్చింది కదా! దాని గురించి చెప్పండి.
జ: పోతన భాగవతంలో రామాయణానికి సంబంధించిన పద్యాలు ఉన్నాయి. భాగవతం పురాణం కదా! పురాణ లక్షణాల్లో ఒకటైన “వంశానుచరిత” అనే లక్షణంతో రఘు వంశాన్ని గురించి రాస్తూ రాముని గురించి చెప్పే సందర్భంలో ఆయన ఈ పద్యాలను రాశారు. వీటిని ఎవరూ అంతగా పట్టించుకొనరు. వంద పద్యాలు ఉంటాయి అవి. ఆ వంద పద్యాలకు 15 పేజీల పీఠిక రాసి “పోతన రామాయణము” ( 2019 ) అనే పేరుతో అచ్చు వేయించాను. రామాయణంలో నారదుడు వంద శ్లోకాల్లో వాల్మీకికి సంక్షిప్త రామాయణాన్ని వివరించినట్టు ( దానికి ఇది అనువాదం కాదు ) పోతన వంద పద్యాల్లో రాముని చరితను రాశారు. నా సంపాదకత్వంలో చిట్ట చివర వచ్చిన పుస్తకం ఇది.
21. “పద్యాలయం” పేరుతో వెలువడిన నాలుగు సంపుటాలలోని విభాగాలకు అమ్మవారి నామాలు వచ్చేటట్లుగా పేర్లు పెట్టడంలో అంతరార్థమేమిటి?
జ: ‘పద్యాలయం’ అనేది నా ఆలోచనకు తగిన పద్దతిలో నా సంపాదకత్వంలో వచ్చిన నాల్గు సంపుటాలు. పద్యాలయం అని నేనొక వాట్సాప్ గ్రూపు పెట్టాను. దాని నుండి పుట్టిందే ఇది. అంటే దానికి కొనసాగింపుగా పుస్తకంగా వచ్చినటువంటింది. దానిని నేను మూడు విభాగాలుగా చేశాను. ఒకటి ప్రాచీన కవుల పద్యాలు ఒక భాగం, రెండవ భాగం ఇప్పటి కవులు ఏదైనా రాయొచ్చు. అంటే వాళ్ళు రాసిన పద్యాలు. మూడవది పద్య కావ్యాలకు సంబంధించిన విమర్శ వ్యాసాలు. “పద్యం చదవండి, పద్యం రాయండి, పద్యం గురించి రాయండి”. పద్యం చదవండి అన్నప్పుడు పూర్వ కవులను చదవాలి. అంటే అవి చదవకుండా మీరు పద్యం రాయొద్దని అన్యాపదేశంగా చెప్పడం. దీనికి నన్నయ్య, తిక్కన మొదలైన కవుల దాదాపు 20 పద్యాలను మోడల్ గా చూపించిన. అంటే ఒకరకంగా సిలబస్ లో చదివే పద్దతిలో ఇచ్చిన. రెండవది పద్యాలు రాయడం. పద్యాలయం ముఖ్యోద్దేశ్యమే అది. కానీ దీన్నుండి పుట్టిన ఆలోచన దీన్ని పుస్తకంగా తేవాలన్నది. పద్యం చదవడం, పద్యం రాయడం కాకుండా పద్యం గురించి విమర్శ కూడా రాయాలి కదా! అందువల్ల పద్యం గురించి రాయడం అని పెట్టుకున్న. వీటికి పేర్లు ప్రాచీన, ఆధునిక పద్యాలలో ఏవైనా పెట్టొచ్చు. కానీ అలా కాకుండా లలితా అమ్మవారి మీద ఉన్న ప్రేమ పూర్వక భక్తి వల్ల వెతికాను.
ప్రాచీన కవిత్వానికి సహస్ర నామాల్లోని “సంప్రదాయేశ్వరీ” అని అన్నాను. రెండవది రాజకీయ అంశాలు తప్ప ఏ అంశాలైనా, ఏ భావమైనా రాయమని వాళ్లకు నియమం పెట్టాను. దీనికి అమ్మవారి నామాల్లో “వివిధ వర్ణోప శోభితా” అనేది సరిగ్గా ఒప్పింది. మూడవది విమర్శ కదా! దానికి “విమర్శ రూపిణీ” అనే నామం సరిపోయింది. ఇక సంపాదకత్వం రాయాలి. ఈ మూడు విభాగాలు వచ్చే విధంగా “వదన త్రయ సంయుతా” అనే నామాన్ని పెట్టుకున్నాను. ఇలా సరిగ్గా భావానికి తగినట్లు నామాలు దొరకడం అదృష్టం కదా! రెండేళ్లలో (2018-19) ఈ నాలుగు సంపుటాలు పుస్తక రూపంలో వచ్చాయి.
పద్యాలయం వాట్సాప్ కు, ఈ సంపుటాలకు సంబంధం లేదు. అంటే అందులో వచ్చినవైనా నేను అడిగినప్పుడు నియమాలను అనుసరించి రాసినవే తీసుకుంటాను. దాన్నుండి పుట్టిన ఆలోచనే అయినా అందులో నుండి తీసుకున్నప్పుడు “అచ్చు కాని పద్యాలు” అని కండిషన్ పెట్టాను. అందువల్ల “పద్యాలయం” నాకిష్టమైన పద్ధతిలో నా సంపాదకత్వంలో వెలువడిన సంపుటాలు.
22. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.
23. విమర్శ, పద్య, గేయ కావ్యాలే కాకుండా అనువాదాలు ఏమైనా చేశారా?
జ: చేశాను. సంసృతం నుండి తెలుగులోకి నాలుగు పుస్తకాలను అనువాదం చేశాను. అందులో రెండు యధాతథానువాదాలు, రెండు స్వేచ్ఛానువాదాలు. “అష్టావక్రగీత” ఇది అద్వైత గ్రంథం. దీంట్లో 298 శ్లోకాలు ఉన్నాయి. వీటిని తేటగీతి ఛందస్సులో యధాతథంగా అనువదించాను. అలాగే శంకరాచార్యుల వారి “అపరోక్షానుభూతి” ని మాత్రా ఛందస్సులో గేయాలుగా రాశాను. ఇదీ యధాతథానువాదమే.
ఇక సౌందర్య లహరిలోని అన్ని శ్లోకాలకు కాకుండా 54 శ్లోకాలను గేయాలుగా స్వేచ్ఛానువాదం చేశాను. గణపతి సచ్చిదానంద స్వామి వారి “నీతిమాల సూక్తి మంజరి” లోని శ్లోక రూపంలో ఉన్న సూక్తులను తేటగీతి ఛందస్సులో శతకంగా స్వేచ్ఛానువాదం చేశాను. దీనికి మకుటంగా “దత్త గురుదత్త జయగురు దత్త దత్త” అని పెట్టాను.
24. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.
25. తెలంగాణా కవుల సాహిత్యం గురించి ప్రత్యేకమైన రచనలు ఏమైనా చేశారా?
జ: తెలంగాణా కవి కొరవి గోపరాజు గారు రచించిన “సింహాసన ద్వాత్రింశిక” మీద ఎమ్ ఫిల్ చేశాను. నా తొలి రచన అదే. ఆ గ్రంథం మీద వచ్చినటువంటి తొలి విమర్శ గ్రంథం కూడా అదే. గోలకొండ కవుల సంచిక గురించి, పోతన భాగవతం గురించి రాశాను. శేషప్ప కవి గారి’నృసింహ శతకం’, కాళోజీ నారాయణరావు గారి ‘నా గొడవ’, దాశరథి కృష్ణమాచార్య గారి ‘అగ్నిధార’, సినారె గారి ‘కర్పూర వసంతరాయలు’, ఋతు చక్రం, పాల్కురికి సోమనాథుని మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి ప్రచురించడం, తెలంగాణా వచ్చిన తర్వాత సోమనను “తెలంగాణా సంస్కృతి తొలి ఆవిష్కర్త”గా చూపించాను. వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన ‘ప్రజల మనిషి’ లో “కంఠీరవం” నాయకుడని అందరూ అన్న విషయం. నేను లోతుగా పరిశీలించి గొట్టం కొమురయ్య తాను కష్టపడి తన సమస్యపై తాను పోరాడి పరిష్కరించుకున్నాడు కాబట్టి అతనే నాయకుడని చెబుతూ తెలంగాణ చైతన్య స్ఫూర్తిగా ఆ నవలను చూపించాను. పొట్లపల్లి రామారావు గారి ‘అక్షరదీప్తి’ కవితోక్తులను గురించి వివరించాను. పాటకు గజ్జె కట్టిన గద్దర్ గారి గురించీ రాశాను. నందిని సిధారెడ్డి ఏడు వచన కవితా సంపుటాలను గురించి “తెలంగాణ నాగేటి చాళ్ళు” పేరుతోనే పుస్తకం రాశాను. తెలంగాణా కవులంటే ఎంతో మక్కువ నాకు. అందుకే ప్రాచీన, ఆధునిక కవులందరి గూర్చి రాశాను. ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, నవలలు, గేయం, వచన కవిత్వం ఇలా అన్ని ప్రక్రియల్లో రాసిన మన కవులందరినీ వివరించాను.
26. మీ గురించి వెలువడిన ఇతర గ్రంథాలేవి? వాటిని వివరించండి.
జ: నా “వేయినదుల వెలుగు” మొదలైన అయిదు పద్య కావ్యాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 50 వ్యాసాల సంపుటి “అంతర్వీక్షణ సార్వభౌమం” అనే పేరుతో వెలువడింది. దీనికి ఆచార్య చేకూరి రామారావు గారు, బేతవోలు రామబ్రహ్మం గారు సంపాదకత్వం వహించారు.
నా విమర్శ గ్రంథాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 76 వ్యాసాల సంపుటి “విమర్శ విద్యా సార్వభౌమం” ఆచార్య నాయని కృష్ణకుమారి గారి సంపాదకత్వంలో వెలువడింది.
“ఆలాపన” సంస్థవారు 2012 లో నాకు సన్మానం చేసి “అభినందన సంచిక” ను అచ్చు వేశారు. ఇందులో నా సాహిత్యం, వ్యక్తిత్వం గురించి 108 మంది ప్రముఖులు రాసిన అభిప్రాయాలున్నాయి.
“ఆచార్య అనుమాండ్ల భూమయ్య సప్తతి ప్రత్యేక సంచిక” వెల్చాల కొండలరావు గారి సంపాదకత్వంలో వెలువడింది. దీంట్లో నా సాహిత్యం గురించి కవి పండితులు రాసిన పలు వ్యాసాలు, అభినందనలు 76 ఉన్నాయి. కొండలరావు గారు “విశ్వనాథ జయంతి” అనే “విద్య, సాహిత్య- సాంస్కృతిక త్రైమాసిక పత్రిక ప్రత్యేక సంచికగా దీన్ని వెలువరించారు.
“అజో, విభొ,కందాళం” సంస్థ అధినేత ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణ రావు గారు ప్రతీ సంవత్సరం ఇచ్చే “విశిష్ట సాహితీ మూర్తి” జీవన సాఫల్య పురస్కారాన్ని 2021 వ సంవత్సరానికి గాను నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో “సమ్మానోత్సవ విశేష సంచిక” ను వెలువరించారు. ఇందులో నా సాహిత్యం గురించి ప్రముఖులు రాసిన వ్యాసాలున్నాయి.
నాలో ఉన్న ముఖ్యమైన ముఖాలు మూడు. ఒకటి బోధన, రెండవది
కవిత్వం, మూడవది విమర్శ. ఇక నా పాఠ్య బోధనను గురించి 54 మంది విద్యార్థులు రాసిన అభిప్రాయాల సంపుటి “ప్రతిభా త్రయి”గా
వెలువడింది. ఇందులో నా కవిత్వం, విమర్శ గురించి కవి, పండితులు రాసిన వ్యాసాల సంక్షిప్త రూపాలున్నాయి. దీనికి సంపాదకులు నా పర్యవేక్షణలో పి హెచ్ డి చేసిన ముగ్గురు విద్యార్థినులు. వారు డా. కె. ప్రియదర్శిని, నల్ల ప్రభావతి, డా.ఎస్.రాధిక.
నేను రాసిన “శాంతి గర్భ” అనే గేయ కావ్యం గురించి నా డా.కె. జ్యోత్స్న “శాంతి ధృత” అనే విమర్శ గ్రంథం రాశారు.
27. మీ రచనల్లో పద్యం నడక సాగే విధానంతో పాటు మీ కావ్య గానం రస హృదయాలను ఆకట్టుకుంటుంది. మీకు సంగీత కళలో ప్రవేశం ఏమైనా ఉందా?
జ: ప్రవేశం ఏమీ లేదు. నేర్చుకోవాలని అనుకోనూ లేదు. ఈ విషయంగా చెప్పాలంటే ఇద్దరి పేర్లు చెప్పాలి. పద్యం మీద ప్రేమ హైస్కూలులో భూమారెడ్డి సార్ పద్యం చదివే పద్ధతిని బట్టి కలిగింది. అలా చదవాలి అనుకునేవాడిని. ఎమ్ ఏ లో ఉన్నప్పుడు దివాకర్ల వేంకటావధాని గారు రాగయుక్తంగా పద్యం చదివే వారు. పద్యం పాడడానికి వీళ్లిద్దరూ ప్రేరణ. నేను క్లాసులో ఉన్నప్పుడు తన్మయత్వం చెందుతూ రకరకాలుగా పాడుతుండడం వల్ల తెలియకుండానే నాదొక
పద్ధతి ఏర్పడింది అంతే..
28. మీ సాహితీ ప్రస్థానంలో మిమ్ములను ప్రభావితులను చేసిన మీ గురువులను గురించి చెప్పండి.
జ: నన్ను ప్రభావితం చేసిన వాళ్ళల్లో మొదటి గురువు కోవెల సంపత్కుమారాచార్య గారు. బీఎస్సీలో పాఠాలు చెప్పిన తర్వాత తెలుగు పట్ల ఆసక్తి కలిగితే నిలబెట్టిన వారాయన. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంలో క్లాసులు సరిగా నడవక పోయేవి. అప్పుడు మా గురువు గారి ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాను. అక్కడ ఆయన చదవమని పుస్తకాలు ఇచ్చేవారు. ఏ పుస్తకాలు చదవాలో చెప్పేవారు. ఏదైనా పద్యమో, గేయమో రాసేవాడిని. ఎలా రాయాలో వివరించేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకు అభిమాన కవి. అందుకే విశ్వనాథ వారి “వేయిపడగలు” నవల గూర్చి నేను రాసిన “వేయి పడగలు- ఆధునిక ఇతిహాసం” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను. హైస్కూలులో పద్యం పాడడం మీద ఆసక్తి కలిగించిన భూమారెడ్డి సారుకు ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా “వ్యాసభూమి” వ్యాస సంకలనాన్ని అంకితం ఇచ్చాను. దివాకర్ల వేంకటావధాని గారికి మకరహృదయం అంకితమిచ్చాను. డా. సి. నారాయణరెడ్డి గారికి “అగ్ని వృక్షం”, ఆయన జన్మదిన సందర్భంగా “కర్పూరవసంతరాయలు కళా ఝంకృతులు” అంకితం ఇచ్చాను. డా.పాటిబండ మాధవశర్మ గారి ఇంటికి కూడా ఎమ్ ఏ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను పి హెచ్ డి చేస్తున్నప్పుడే ఆయన మరణించారు. ఆయన పేరిట అవార్డు ఇచ్చాను. కోవెల సుప్రసన్నాచార్యులు గారు నాకు గైడుగా ఉన్నారు. చాలా సన్నిహితంగా ఉండేవారు. “అమృతసేతువు” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను.
29. చివరగా.. ప్రసిద్ధ విమర్శకులైన మీరు విమర్శకులకు ఇచ్చే సూచనలు ఏవి?
జ: ముఖ్యంగా చెప్పాలంటే ప్రాచీన కావ్యాలను విమర్శించాలంటే అలంకార శాస్త్రాలను చదవాలి. వాటిని తాము విమర్శించే పుస్తకానికి అన్వయించాలి. ప్రాచీన కావ్యాలను ఇంకొక విధంగా విమర్శించవచ్చు అనే విషయాన్ని రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు చెప్పారు. దానికి మూడు విధాలు చెప్పారాయన. రచన, వస్తువు, భావం అన్నారు. రచన అంటే శైలి మొదలగునవి, వస్తువంటే కథాంశం. ఇక రసానికి ప్రాతిపదిక స్థాయీ భావమే కదా! రసానికి దారి తీసేదే భావం. ఈ మూడింటిని నాచన సోమనాథుని కావ్యానికి అన్వయం చేస్తూ రాశారాయన. రచన వస్తువుకు లోబడి ఉండాలి. ఈ రెండూ భావానికి లోబడి ఉండాలి. అప్పుడే అది రసాత్మక కావ్యం అవుతుందంటారు ఆయన. ఈయన తర్వాత కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు , సి. నారాయణ రెడ్డి గారు వీటినే అనుసరించారు. అలంకార శాస్త్రం చదవడం వల్ల కావ్యం ఎలా నడవాలో తెలుస్తుంది.
ఆధునిక కవిత్వాన్ని విమర్శించడానికి అలంకారశాస్త్రంతో పాటు తొలి ఆధునిక విమర్శకులు కట్టమంచివారి, ప్రసిద్ధ విమర్శకుల గ్రంథాలు చదవాలి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ లో విదేశీయులు రాసిన విమర్శలు చదవాలి.
మరీ ముఖ్య విషయం ఏమిటంటే ఏ రచనను విమర్శ చేయాలనుకుంటున్నావో దాన్ని పూర్తి లోతుల్లోకి అధ్యయనం చేయాలి. దానివల్ల కవిత్వం యొక్క అందచందాలు అవగతమవుతాయి. చదువుతున్న ప్రతీసారి కొత్త కొత్త విషయాలు స్ఫురిస్తాయి. ఇతిహాసాలు చదవకుండా దేన్ని చదివినా అందులో అందాన్ని పట్టుకోలేము. కాబట్టి ఇతిహాసాలు, ప్రాచీన కావ్యాలు, చదివే పుస్తకంపై శ్రద్ధ, కొత్త విషయాలు తెలియడానికి మోడ్రన్ భాష ఇంగ్లీషులోని రచనలు చదవడం వల్ల మంచి విమర్శకులుగా రాణిస్తారు.
ధన్యవాదాలు సార్..సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం, మీ సాహితీసేవ గురించి నేను అడిగిన అన్ని ప్రశ్నలకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఇంత విపులంగా, ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు ….
ఇటీవలే భూమయ్య గారు రచించిన సమగ్ర సాహిత్యమంతా కలిపి పద్య కావ్య సంపుటి, గేయ కావ్య సంపుటి, భౌమమార్గ విమర్శ సంపుటి వెలువడ్డాయి. సాహితీ విమర్శ మరొక సంపుటి అచ్చులో ఉంది. మహా పండితులైన గరికపాటి నరసింహారావు గారిచే ” ఇది అమ్మవారి మార్గం. అదే అనుమాండ్ల భూమయ్య మార్గం. ఈ మార్గంలో ఆయన చతుశ్శ్రుతి శిఖరారోహణం చేశారు. ఆ క్రమంలో ఋగ్వేద దిగ్వీణా గానమే “వేయి నదుల వెలుగు”. యజుర్వేద యజ్ఞ నిర్వహణమే “వెలుగు నగల హంస” సామవేద సోమపానమే “అగ్నివృక్షం”. అధర్వణ రూపమైన అవభృథ స్నానమే “చలువ పందిరి” అని ప్రశంసించబడ్డారు. అంతటి అసామాన్యులు వీరు… సెలవు.
అవధాన వరేణ్యులు మాన్యులు శ్రీ ముత్యంపేటగౌరీ శంకరశర్మ గారితో మయూఖ పత్రిక పరిపృచ్ఛా
సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!
సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు…

ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.
సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..
ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!!
ఆస్వాదించండి!
అష్టావధాన కార్య మ
దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్
కష్టమో సుఖమో యది యు
తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥
మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!
పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన కార్యక్రమంలో
బహుముఖీన విద్యా విశారదులు, జంట అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,
1,మహాకాళీ సుప్రభాతం ,
2. శ్రీరామచంద్ర సుప్రభాతం,
3.శ్రీ శివానందోదాహరణం,
4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము.
పద్మజ. నమస్కారమండీ!
ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.
పద్మజ (ప్ర) :-
మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?
గౌరీశంకర శర్మ:- (జ)
మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు.
న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.
పద్మజ:- (ప్ర)
మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?
గౌరీశంకర:- (జ)
నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను. సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.

పద్మజ ( ప్ర):–
ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?
గౌరీశంకర ( జ).
వృత్తిలో 2014లో జిల్లా స్థాయి [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.

పద్మజ ( ప్ర):-
పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?
గౌరీశంకర శర్మ (జ):-
“పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను
పద్మజ. ప్ర :-

ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?
గౌరీశంకర ( జ):- ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.
పద్మజ(ప్ర) :–
నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?
గౌరీశంకర ( జ):–
సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని
భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది.
పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.
పద్మజ (ప్ర):-
మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?
గౌరీశంకర ( జ) :–
అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.
పద్మజ( ప్ర) :–
అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలువివరించండి!
గౌరీశంకర శర్మ:- (జ)
మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు
వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది.

పద్మజ (ప్ర) :–
అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ(జ) :–
అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!

పద్మజ( ప్ర):–
కళలకు సమయం వెచ్చిస్తే చదువు
కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ (జ):–
కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!
పద్మజ ( ప్ర):–
తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?
గౌరీశంకర శర్మ (జ) :-
తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.

పద్మజ( ప్ర) :–
కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
గౌరీశంకర శర్మ ( జ):–
పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.
పద్మజ ( ప్ర):-
అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!
గౌరీశంకర శర్మ (జ):-
వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకచేస్తున్నాను.
క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…
పద్మజ ( ప్ర) :-
మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!
గౌరీశంకర శర్మ ( జ):–
అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!
హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!
వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్
ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్
అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే
హనుమత్పుత్రుడు …..
అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా! అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.
మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై
సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై
కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా
క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!
అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.
దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.
నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో పాల్గొనే అవకాశం లభించింది.
చివరగా మయూఖపత్రికా ప్రశంస
ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి
బహుముఖీనము గాంచుచు భద్రమగుత!
సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు
కీర్తినందుచుభవితకు స్ఫూర్తినిడుత!
ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.
శుభం.
రంగ రాజు పద్మజ:-
గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!
మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…
జయతు ! తెలుగు భాషామతల్లీ! జయతు !
పరిపృచ్ఛ- రంగరాజు పద్మజ.[కథా రచయిత్రి]
ఆర్షకవి, ఆర్షకోకిల, సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య డా.మసన చెన్నప్ప గారితో మయూఖ ముఖాముఖి.
నమస్కారం సర్.
మీ సాహితీ ప్రస్థానాన్ని గురించి మా పాఠకులకు తెలియజేయాలనే కోరికతో మీ ముందుకు వచ్చాము.
1.. మీరు పుట్టిన జన్మస్థలం, తల్లిదండ్రులు, మీ బాల్య విశేషాలు, చెప్పండి..
జ: అమ్మా! నమస్కారం. నేను తెలంగాణలో పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి తాలూకా, మాడుగుల మండలం, కొలుకులపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఫిబ్రవరి 8, 1955లో జన్మించాను. మా తల్లి రామలక్ష్మమ్మ గారు, తండ్రి బుచ్చయ్య గారు. వారికి నేను ఏడవ సంతానం. మాది చేనేత కుటుంబం. అక్కడ మా ఇద్దరన్నయ్యలకు చదువుకునే అవకాశం లభించలేదు. స్త్రీవిద్యకు కూడా అంతగా ప్రాధాన్యం లేని కాలం కాబట్టి మా అక్కయ్యలు కూడా చదువుకోలేదు. అన్నయ్యలిద్దరు మగ్గం నేస్తే తప్ప పూట గడవని పేద స్థితి మాది. ఇంట్లో దాదాపు 15 మందిమి ఉండేవాళ్ళం. అయినప్పటికీ నా చదువుకు అమ్మానాన్నల ప్రేరణతో బాటు అన్నయ్యలిద్దరి ప్రేరణ కూడా పుణ్యవశాత్తు లభించడం చేత నేను చదువుకోగలిగాను. చదువుకునే సమయంలో బాల్యంలో అ ఆ లు దిద్దించిన అబ్దుల్లా సార్, ఎ బి సి డి లు పెట్టించిన సాల్మన్ సార్ ఇప్పటికి నాకు బాగా గుర్తు. 5వ తరగతి వరకు వారు నాకు మంచి ప్రేరణ కలిగించారు. దాని తర్వాత ఒక విధంగా అక్కడ పై చదువుకు అవకాశం లేకపోవడం వల్ల చదువు ఆపాలి. కానీ మా పెద్దన్నయ్య వీరయ్య గారు, చిన్నన్నయ్య సత్తయ్య గారు మా తమ్ముడు చదువు కోవాలని నల్గొండ జిల్లా చింతపల్లికి పంపించారు. అందరికంటే చిన్నవాణ్ణి కాబట్టి నా పైన అందరికీ ప్రేమాభిమానాలు ఉండేవి.

2. చింతపల్లిలో మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?
జ: మాది కడు పేదరికం అని చెప్పాను కదా! వారం వారం చింతపల్లి నుండి సైకిల్ మీద కొలుకులపల్లికి వచ్చేవాడిని. మా అమ్మ గానీ వదిన గానీ ఒక ఇనుప సందూకలో బియ్యం వగైరా వస్తువులు వారానికి సరిపడా పెట్టి ఇచ్చేవారు. ఒక బియ్యం బస్తాలో కట్టెలు చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేవారు. కట్టెల పొయ్యి మీద వండుకునేవాడిని. చాలా కాలానికి బత్తీల స్టవ్ వచ్చింది. పెళ్లిలో మా అత్తగారు వాళ్ళు బర్నల్ స్టవ్ కానుకగా ఇచ్చారు (నవ్వుతూ). మా నాన్నగారు ప్రతీ వారం ఒక రూపాయి ఇచ్చేవారు. నా జీవితంలో మా నాన్నగారు ఎక్కువలో ఎక్కువ ఇచ్చిన కరెన్సీ ఒక్క రూపాయి అయితే మా పెద్దన్నయ్య ఎక్కువలో ఎక్కువ ఇచ్చిన కరెన్సీ పది రూపాయలు. మా వాళ్ళు నేను చదువుకుంటే చాలు అనుకోవడం, నాకూ చదువు మీద శ్రద్ధ ఉండడం, ఇంటి పరిస్థితులు తెలిసి ఉండడం వల్ల వారిని దేనికీ వేధించలేదు. అలా పదవతరగతి వరకు అక్కడే చదువుకున్నాను.
3. మీకు తెలుగు భాష పట్ల ఆసక్తిని, మక్కువను పెంచింది ఎవరు?
జ: చింతపల్లి పాఠశాలలో బాలకృష్ణ గారని తెలుగు పండితులు. నాకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య విద్యా సంస్థ పరీక్షల ఫీజు కట్టించి నాతో ఆరవ తరగతి నుండే పరీక్షలు రాయించారు. దానివల్ల నాకు తెలుగు భాషలో ప్రవేశంతో పాటు అభిమానం ఏర్పడింది. సుమతీ శతకంలోని యాభై పద్యాలు, వేమన శతకంలోని యాభై పద్యాలు కంఠస్థం అయ్యాయి. కాబట్టి మొత్తం మీద బద్దెన భూపాలుడు, వేమన్న గారు నాలో ఆవహించారు (పెద్దగా నవ్వేస్తూ) కనుక నేను నా రచనా వ్యాసంగంలో పది శతకాలు రాశాను. శతకం అంటే నూరు పద్యాల రచన. బహుశా నూరు సంవత్సరాలు జీవించాలని తెలుగు వాళ్ళు ఈ శతక రచనకు శ్రీకారం చుట్టారేమో అనిపిస్తుంది. అంతేకాక పిల్లలకు శతక పద్యాలు నేర్పిస్తే నైతికంగా వాళ్ళు ఎదుగుతారన్నది నా భావన. అందుకే శతక పద్యాల వల్ల అర్థ శత గ్రంథకర్తనయ్యాను. బాలకృష్ణ గారు, అడపాల నరసింహారెడ్డి గారు (నల్గొండ జిల్లా), మధుసూదన రావు గారు (సూర్యాపేట), శ్యామలయ్య గారు (దేవరకొండ) ఈ నలుగురూ ప్రత్యేకంగా నేను మరచిపోలేని నన్ను అభిమానించే గురువులు. వారి మార్గంలో నేనూ అధ్యాపకుడిని కావాలనే కోరిక ఆనాడే కలిగింది. ఈ సమయంలో నేను మరిచిపోలేని జ్ఞాపకాలను చెప్పాలి మీకు. నేను ఒకసారి “స్వయం పరిపాలనా దినోత్సవం” లో పాల్గొన్నాను. ఆ సందర్భంగా నాకు 40 పేజీల ఎక్సర్సైజ్ బుక్, ఒక పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. వాటిని నేను డిగ్రీ పాసయ్యేవరకు దాచుకున్నాను. 9వ తరగతి చదువుతున్నప్పుడు మధుసూదన్ రావు గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు. అప్పుడు ‘ఉదయిని’ అనే స్కూలు వార్షిక సంచిక వెలువడేది. దానికి సంపాదకునిగా ఉండాలంటే వారు పెట్టే వ్యాసరచన పోటీలో నెగ్గాలి. అయితే వారు కవిగా, రచయితగా, సంస్కర్తగా, వైతాళికుడుగా, యుగకర్తగా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ వ్యాసం రాయమని పోటీ పెట్టారు. నేను కందుకూరి వీరేశలింగం పంతులు గురించి రాశాను. హెచ్ ఎస్ సి విద్యార్థుల కంటే బాగా రాయడం వల్ల నన్ను విజేతగా చేసి ఆ పత్రికకు సంపాదకునిగా పెట్టారు. దానికోస…
5. గుండేరావు హర్కారే గారికి, మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది?
జ: విశ్వకర్మల హాస్టల్లో నేను ఉండేవాడిని అని చెప్పాను కదా! నేను బి ఓ ఎల్ పాసయిన తర్వాత హాస్టల్ వారు కులేతరులు ఉండకూడదని కండిషన్ పెట్టారు. దానితో నేను నా మిత్రులు రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డిలతో ఓల్డ్ సిటీకి వెళ్ళాను. అక్కడ గుండేరావు హర్కారే గారని గద్వాల ఆస్థానంలో సంస్కృత పండితులుగా లక్ష్మీ మహదేవమ్మ దగ్గర ఉన్నవాడు. సెషన్ జడ్జిగా, కలెక్టర్ గా పని చేశాడు. సాలార్జంగ్ కు క్లాస్ మేట్ ఆయన. అప్పుడు 86 సంవత్సరాల వయస్సు ఆయనకు. సంస్కృతంలో పాణినీ వ్యాకరణానికి మిషన్ తయారు చేశాడు. ఆయన శిష్యులు రవ్వా శ్రీహరిగారు. శ్రీహరి గారు మాకు ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యాకరణ బోధకులు. క్లాసులో ఏదో సందర్భంలో ఓల్డ్ సిటీలో ఉన్న గుండేరావు హర్కారే ఇలా మిషన్ తయారు చేశారని, తాను ఆయన శిష్యుడినని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని ఆయనను కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ” నీకు ఛందస్సు వచ్చా?” అని అడిగారాయన. ఆశువుగా పద్యం చెప్పగలను అన్నాను. ఒక పద్యం చెప్పమంటే చెప్పాను. “నేను నిన్ను కవీశ్వరా” అంటాను అన్నారు. సంతోషంగా నేను “మిమ్మల్ని తాతయ్యా” అంటాను అన్నాను. “తెలంగాణోదయం” లో ఆయన గురించి 40 పద్యాలు రాశాను. అలా ఓల్డ్ సిటీ నుండి బొగ్గుల కుంటకు తిరుగుతూ బిఓఎల్ చేస్తూ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది. 1975 నుండి 1977 వరకు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమై సామాను సర్దుకున్నాను. చెప్పడానికి ఆయన దగ్గరకు వెళ్ళాను. ఒక అపురూప క్షణమది. “ఊరుకు వెళ్తున్నాను. ఇక పట్నంతో సంబంధం లేదు” అన్నాను. ఆయనకెందుకో కన్నీళ్లు వచ్చాయి. 12 భాషల పండితుడాయన. “పోతున్నవా? లేదు. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండు” అన్నారు. ఆయన సంకల్పం ఏమిటో గాని అక్కడ ఉన్న ఆ నాల్గు రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. నేనున్న ఇంటి పక్కన పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. “సికింద్రాబాద్ ఇస్లామియా హైస్కూల్లో టీచరు ఉద్యోగం ఉన్నట్లు పత్రికలో ప్రకటన వచ్చిందని, నీవు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశావు కాబట్టి అప్లై చేయమని” ఆ ఇంటి యజమాని బట్టు నర్సిరెడ్డి చెప్పారు. ఆశ్చర్యంగా వాళ్ళు చెప్పిన రోజే ఆఖరి గడువు. గుండేరావు గారి దగ్గరకు వచ్చి విషయం చెప్పాను. ” శుభమ్ భూయాత్ ఉద్యోగ ప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించారు. అలాంటి మహానుభావుని ఆశీర్వచన ఫలితం వల్ల ఖండవల్లి లక్ష్మీ రంజనం, రాయప్రోలు సుబ్బారావు, దివాకర్ల వేంకటావధాని వంటి మహామహులు కూర్చున్న తెలుగు శాఖ సింహాసనంపై కూర్చుండే అదృష్టం దక్కింది.
6. “వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ సూచిక” అనే అంశంపై ఎం.ఫిల్ చేయడానికి మార్గదర్శకులు ఎవరు? దాని నేపథ్యం ఏమిటి?
జ: నేను వేటూరి ప్రభాకర శాస్త్రిగారి వాఙ్మయం మీద ఎమ్ ఫిల్ చేయుమని మా గురువు రవ్వా శ్రీహరి గారు సూచించారు. దీనికి మార్గదర్శకులు వేటూరి ఆనందమూర్తి గారు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారులు. మారిషస్ నుండి అప్పుడే వచ్చారు. ఆయన నాకు ఎమ్ ఏ లో అధ్యాపకులు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. విజయ్ నగర్ కాలనీలో ఉండేవారు. 1977 లో యూనివర్సిటీకి దగ్గర ఉండాలని నేను వారాశిగూడకు మారాను (ఎమ్ ఏ) కోసం. వారింటికి నేను ఎమ్ ఫిల్ గురించి 180సార్లు సైకిల్ మీద వెళ్ళాను. దీంట్లో శాస్త్రిగారి వాఙ్మయం మొత్తాన్ని తీసుకున్నాను. ఆయన రచించిన “చాటుపద్య మణిమంజరి” మంచి పేరు తీసుకు వచ్చిందాయనకు. ఆయన లైబ్రరీ చాలా పెద్దది. అందులోంచి ఆయన పుస్తకాలు తీసుకొని క్రమపద్ధతిలో పేర్చి ‘Bibilogrphy’ తయారుచేశాను. అంటే కేవలం పుస్తకాల పేర్లు కాకుండా వాటిని గురించి వివరణాత్మకంగా రాశాను. ఆవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పద్ధతిలో చేయడానికి శ్రీకారం చుట్టినవాడిని నేను.
7. “ప్రాచీన కావ్యాలు- జీవన చిత్రణ” అనే మీ పి హెచ్ డి అంశంలో ఏ కావ్యాలను తీసుకున్నారు? ఎటువంటి జీవితాలను చిత్రించారు?
జ: ఈ అంశాన్ని ఎస్వీ రామారావు గారు ఇచ్చారు. దీనికి గైడుగా ఆనందమూర్తి గారే ఉన్నారు. ఆయనతో పదేళ్ల అనుబంధం నాది. ఎమ్ ఏ లో రెండేళ్లు, ఎమ్ ఫిల్ లో మూడేళ్లు, పి హెచ్ డిలో అయిదేళ్ళు. ప్రాచీన కావ్యాల్లో నన్నెచోడుని “కుమారసంభవం” నుండి కూచిమంచి తిమ్మకవి “నీలాసుందరి పరిణయం” వరకు దాదాపు ఒక 40 కావ్యాలు తీసుకున్నాను. ప్రాచీన కాలంలో ఎఱ్ఱన, మధ్యయుగంలో శ్రీకృష్ణ దేవరాయలు, అనంతర కాలంలో శుక సప్తతి కారుడు కదిరీపతి. వీరంతా చాలా మేలుతరమైన గ్రామీణ జీవితాన్ని అభివర్ణించారు. ఆ కాలంలో నగరాలున్నా గ్రామీణ జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పట్నాల పక్కన పొలాలున్నాయంటే గ్రామాలున్నట్లే కదా! గ్రామీణ జీవన స్పర్శ లేని కవి లేనే లేడు. అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణ దేవరాయలు గ్రామీణ జీవనం గురించి తెలిసిన నాగరికుడు అని చెప్పవచ్చు. ఆయనను గ్రామాల గురించి తెలిసిన ప్రభువు, కవి, దార్శనికుడు అని నిరూపించాను. ప్రాచ్య కళాశాల విద్యార్థిని కావడం వల్ల ప్రాచీన కావ్యాలంటే చాలా మక్కువ నాకు. అందువల్ల ఈ అంశాన్ని ఎంచుకున్నాను. 300 పేజీలున్న సిద్ధాంత గ్రంథం రాశాను. ఎఱ్ఱన “హరివంశం” లో గొల్లవాళ్లకు ఆభరణాలు అని చెబుతూ అందరు వేసుకునే సాధారణమైన ఆభరణాల వంటివి కాకుండా కుండలో పాలు పోసి కాచడం వల్ల వచ్చే మసి వాళ్లకు ఆభరణం అంటాడు. పాల పొంగును ఆభరణం అంటాడు. పేడ తీస్తుండగా అంటుకునే పేడను కూడా ఆభరణం అంటాడు. అంటే చూడండి. పల్లీయుల యొక్క జీవితంలోని అందాన్ని ఎంత అద్భుతంగా చిత్రించాడో? అలాగే సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు చింతపండు ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళింట్లో చింతలు ఉండవని రాశాడు. ఇవన్నీ కూడా గ్రామజీవన వర్ణన ప్రధానమైన కావ్యాలు. అలా ప్రాచీన కావ్యాల గురించి 5, 6 ఏళ్ళు పరిశోధన చేశాను. చాలా కష్టమైన పని అది. బావిలో నుండి నీళ్ళు తోడినట్లుగా తీయాలి కదా! ఆనంద మూర్తి గారు నన్ను తన కుటుంబ సభ్యునిగా భావించేవారు. పరమ సాత్వికులు. “వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం” అని తిరుపతిలో ప్రారంభమైతే మూడు, నాలుగేళ్లు శాస్త్రిగారి మీద మాట్లాడడానికి ఆహ్వానించారాయన.
8. మీ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై కొనసాగిన క్రమాన్ని వివరించండి.
జ: మీకు ఇంతకు ముందు ఘుండేరావు హర్కారే గారి వాళ్ళింట్లో ఉన్నప్పుడు, చివర్లో వెళ్లిపోయే ముందు సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూల్ లో అవకాశం వచ్చిందని చెప్పాను కదా! ఆయన ఆశీర్వాద మాహాత్మ్యం వల్ల నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ (1975 ) అయ్యాను. మొట్టమొదటగా నా ఉద్యోగ ప్రస్థానం అక్కడే మొదలయ్యింది. 1980లో ఎమ్ఏ అయిపోగానే “ప్రగతి మహా విద్యాలయ” అని సుల్తాన్ బజార్ లో ఉండేది. వారి అడ్వర్టైజ్ మెంట్ వచ్చింది. ఒక్క పోస్ట్. ఇంటర్వ్యూకు 136 మంది వచ్చారు. జూనియర్ కాలేజీ జాబ్. అంతమందిలో నేను సెలెక్ట్ కావడం మా గురువు గారి ఆశీర్వాద బలమే తప్ప మరొకటి కాదు. అందుకే వైస్ ఛాన్స్ లర్ పదవి రాకపోయినా నాకు బాధ లేదు. కాలేజీకి సైకిల్ మీద వెళ్లి వచ్చేవాడిని. నేను అలా వస్తుండడం చూసి మా కాలేజీ ప్రిన్సిపాల్ (ఎన్. టి. వేదాచలం) గారు స్కూటర్ కొనుక్కోమని కాలేజీ నుండి 14 వేల రూపాయలు సాంక్షన్ చేయించారు. మంచివ్యక్తి ఆయన. ఎనిమిదేళ్ళు పని చేశాను అక్కడ. ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడే ఎంఫిల్ (1981-83) మూడేళ్లు, పిహెచ్ డి అయిదేళ్ళు (1983-88) చేశాను. 1989లో తెలుగు శాఖ ప్రకటన వచ్చింది. అప్లై చేశాను. 46మందిలో నలుగురైదుగురం సెలెక్ట్ అయ్యాము. మొదటి పిజి కాలేజ్ సికింద్రాబాద్. దానికి ప్రిన్సిపాల్ సౌందర రాజ నందన్ గారు. నాకు ఆయన ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడే పరిచయం. ఆయన నాకు చాలా ఇష్టుడు. వెల్దండ రఘుమన్న, రాజన్న శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్, నేను నల్గురం ఉండేవాళ్ళం. 1989 నుండి1996 దాకా అక్కడే పనిచేశాను. ఇలా 40 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో హైస్కూల్లో ఆరేళ్ళు, ప్రగతి మహావిద్యాలయంలో ఎనిమిదేళ్ళు, విశ్వవిద్యాలయంలో ఇరవై ఆరేళ్ళు ఎన్నో అనుభూతులతో జీవితం గడిచిపోయింది.
9. మీ ఉద్యోగ జీవితంలో మీరు నిర్వహించిన పదవులు, తీసుకొచ్చిన మార్పులు ఎటువంటివి?
జ: సమయపాలన నా మొదటి లక్షణం. దాన్ని చాలా క్రమశిక్షణతో నిర్వర్తించేవాడిని. ఏ క్లాసుకైనా అధ్యయనం లేకుండా వెళ్ళేవాడిని కాను. వివిధ మనస్తత్వాలు కలిగిన విద్యార్థులకు తగినట్టు వారి పురోగతికి పాటు పడడం, పుస్తకాలు చదివే దిశగా వారిని ప్రేరేపించడం, మంచి మంచి పుస్తకాలను సేకరించి
లైబ్రరీలో అందుబాటులో ఉంచడం చేసేవాడిని. E2 హాస్టల్ కు వార్డెన్ గా ఉన్నాను. పల్లెటూళ్ళ నుండి వచ్చే విద్యార్థులు ఎక్కువమంది ఉండేవారు. హాస్టల్ లో ఉండే విద్యార్థులు చాలామంది అధికారుల ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ నేను అటువంటి అధికారిని కాను. 9 సంవత్సరాలు చేశాను. నా హయాంలో 40 గదులను నిర్మాణం చేయించాను. విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక కార్యదర్శిగా చేశాను. వెల్ఫేర్ అసోసియేషన్ కన్సల్ట్ గా చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా ఉన్నాను. అనేక కాలేజీలకు సెమినార్లు నిర్వహించడానికి వెళ్లేవాడిని. పోతన మీద, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మీద సెమినార్లు నిర్వహించాను. భాషాభిమానమే తప్ప ఆంధ్ర, తెలంగాణా భేదం లేదు నాకు. నేను అక్కడ ఉన్నప్పుడు రావూరి భరద్వాజ గారు కూడా ఉన్నారు స్వచ్ఛందంగా అక్కడ ఉన్నారు. మేమిద్దరం సుమారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ బుక్స్ సెలెక్షన్ కమిటీ మెంబర్లుగా ఉన్నాం. ఆయనకు చాక్లెట్లు తినే అలవాటు ఉండేది. రోజూ ఒకటి, రెండు చాక్లెట్లు నాకు ఇచ్చేవారు. అది ఎప్పుడూ మర్చిపోను.
10. “మల్లిపదాలు” అనే పేరుతో మీ సాహితీ యాత్ర ప్రారంభమైంది కదా! దానికి నేపథ్యం ఏమైనా ఉందా?
జ: 1988 లో నేను ఎమ్ ఏ చేస్తున్నప్పుడు ఆరుద్ర “కూనలమ్మ పదాలు” దొరికాయి. అందులో ప్రతీ పాదంలో పది మాత్రలుంటాయి. చివరి పాదంలో ఒకటి, రెండు మాత్రలు తగ్గవచ్చు. నన్ను ఆ పుస్తకం ఆకర్షించి, పదాలు రాయడం మొదలు పెట్టాను.. ” తేనెలో కలమద్ది తెనిగించె పోతన్న, కనుకనే నా భాష తెలుగాయె మల్లి”…” వేమన్న పద్యాలు వేపాకు వైద్యాలు, తెలుగులో హృద్యాలు తెలుసుకో మల్లి”….. “ఆగినా ఒక గంట ఆపైన మరితంట, బస్సు డ్రైవరు కంట పడబోవు మల్లి”(జీవితానుభవం..నవ్వుతూ)….. 1980 లో ఒక సంఘటన జరిగింది. నారాయణరెడ్డి గారు ఆర్ట్స్ కాలేజీలో చెబుతున్నారు. నేను నిజాం కాలేజీలో చదువుతున్నాను. ఆయన ఉద్దేశ్యం ఆయన పాఠం చెప్పినవారికే గోల్డ్ మెడల్ రావాలని. కానీ మొదటి రెండు సెమిస్టర్లలో నేను ఆధిక్యంలో ఉన్నాను. ఇరివెంటి కృష్ణమూర్తి గారి ద్వారా నాతో మాట్లాడడానికి నన్ను ఆర్ట్స్ కాలేజీకి పిలిపించారు. ‘ఏం చేస్తున్నావని’ అడిగారు? “ఇస్లామియాలో ఉద్యోగం చేస్తూ, సాయం కళాశాలలో చదువుతున్నానన్నాను.’ఏం రాస్తున్నావని’ అడిగారు. ‘మల్లి పదాలు’ రాస్తున్నా అన్నాను. ‘ఏదీ చదువు?’ అన్నారు..” వచ్చి పోయెను పైస,తెచ్చి పెట్టెను గోస, రాకున్న ఏ ఆస లేకుండు మల్లి”…. చూడ వచ్చినవారు చుట్టాలు కాబోరు. పండుటాకుల జోరు ఎండుటకె మల్లి” అని విన్పించాను. ఆయన చాలా సంతోషించి ” చెన్నప్ప “మల్లిపదాలు” పుస్తక ప్రచురణకు డబ్బు ఇవ్వమని” అకాడెమీకి రాశారు. వారు 1000 రూపాయలు ఇచ్చారు. 30 పేజీల పుస్తకం అది. 200 రూపాయలు ఖర్చు అయింది. 800 రూపాయలు మిగిలాయి. ఇప్పటి మంత్రి తలసాని యాదవ్ హైస్కూలు లో నా విద్యార్థి. అతనికి నేనంటే ఎంతో ప్రేమ. 100 పుస్తకాలు అమ్ముడయ్యేలా చేశాడు. అలా వచ్చిన నా మొదటి పుస్తకం అది. దాన్ని నా మొదటి గురువు ఘుండేరావు హర్కారే గారికి అంకితం ఇచ్చాను.

11. సుదీర్ఘమైన మీ ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో ఆధ్యాత్మికత, తాత్త్వికత చోటు చేసుకోవడానికి ప్రేరణ ఎలా కలిగింది?
జ: నేను సికింద్రాబాద్ పిజి (OU) కాలేజీలో చేస్తున్నప్పుడు మా క్లాసులు 8.30 నుండి 12.30 వరకే ఉండేవి. 1995 లో ఒక సంఘటన జరిగింది. మా పిల్లలు సీతాఫల్ మండి ఆర్య సమాజం స్కూల్లో చదువుతుండేవారు. ఒకసారి పేరెంట్ గా అక్కడికి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఒక మహానుభావుడిని చూశాను. ఆయనే ఉన్నతమైన స్థానాన్ని అలంకరించిన “పండిత గోపదేవశాస్త్రి”. స్వామి దయానంద సరస్వతి శిష్యునికి శిష్యులు వీరు. ఆయనను చూడడం మొట్టమొదటి సారి. ఆయన భాషణం విన్నాను. అప్పటివరకు నేను ఎంతోమంది మాట్లాడగా విన్నాను. కానీ ఈయన లాగా వారు మాట్లాడలేదని అర్థం అయింది. ఆయన మాటలు నన్ను చాలా ఆకర్షించాయి. ఎందుకో “ఈయన నాకు గురువైతే బాగుండేది” అనిపించింది మనసులో. గమ్మత్తు ఏమిటంటే అదే సంవత్సరంలో సికింద్రాబాద్ లోఆయన శతజయంతి వేడుక జరుగుతోంది. శతజయంతి కన్వీనర్ నాకు పరిచయస్తులు. ఆయనకు ఫోన్ చేసి సభా నిర్వాహకులు ఎవరు? అని అడిగాను. “ఇంకా ఎవరినీ అనుకోలేదు. ఆలోచిస్తున్నాం” అన్నారాయన. నేను డా.సి. నారాయణ రెడ్డి గారి శిష్యుణ్ణి. నాకు అవకాశం ఇస్తే చేస్తాను అని అన్నాను. ఆయన నన్ను కె.ఎస్. మూర్తి అని ప్రిన్సిపాల్ సెక్రటరీ (సెంట్రల్ గవర్నమెంట్) దగ్గరకు తీసుకు వెళ్ళాడు. మూర్తిగారు నన్ను పరీక్షించారు. ఎలా చేయగలనో ఆ విధానాన్ని వారికి చెప్పాను. వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సభకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, గవర్నర్ కృష్ణ కాంత్ విచ్చేసారు. కృష్ణ కాంత్ గారు శాస్త్రిగారికి స్నేహితులు. ఆవుల సాంబశివరావు గారు కూడా శాస్త్రిగారికి శిష్యులు. ఆయన కూడా వచ్చారు. 5 వేల మంది సభకు హాజరయ్యారు. సభ విజయవంతంగా ముగిసింది. చాలా బాగా చేశారని పలువురు ప్రశంసించారు. అయిపోయిన తర్వాత నేను వస్తుంటే శాస్త్రిగారి శిష్యురాలు సంధ్యావందనం లక్ష్మీదేవి గారు ఎదురుపడి ” మీరు ఆర్యసమాజ్ సభ్యులు కారు, శాస్త్రిగారికి శిష్యులూ కారు. ఆయన పుస్తకాలు కూడా చదివినవారు కారు. అలాంటప్పుడు ఏ అర్హత ఉందని మీకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు? యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్ కాబట్టి మాట్లాడగలిగారు కానీ ఆయన గురించి మీకేం తెలుసు?” అన్నారు నన్ను నిలదీస్తూ. తెలియని వారి గురించి తెలిసినట్లు మాట్లాడడమే గొప్ప అన్నాను. వచ్చేముందు శాస్త్రి గారి పాదాలకు నమస్కరించాను. ఆయనకు వయసురీత్యా కళ్ళు కనబడేవి కావు. తెల్లవారి ఆయన ఎవరింట్లోనైతే ఉంటున్నారో ఆయన చేత నాకు ఫోన్ చేయించారు. ” గురువు గారు మిమ్మల్ని జ్ఞాపకం చేశారు. మీరు వస్తారా? ఆయనను రమ్మంటారా?” అన్నాడు. వారు ఇంటికి వస్తే మా జన్మ ధన్యమవుతుందని నా భార్య ఇక్కడికే రమ్మని చెప్పమంది. అదే విషయం చెప్పాను ఆయనతో. సరేనని మా ఇంటికి వచ్చారు. అంత గొప్పవారు మా ఇంటికి రావడంతో మా ఇల్లు పావనమైంది. ఆయన వచ్చారని తెలిసి 50 మంది దాకా బస్తీ వాళ్ళు వచ్చారు. అందరమూ ఆయనను మనసారా పూజించుకున్నాము. అప్పుడే నేను ఆయనకు అంకితమయ్యాను. చదువు మీద అభిరుచి ప్రైమరీలో కలిగితే, హైస్కూల్లో తెలుగులో అభిరుచి ఏర్పడింది. ముండేరావుగారి ద్వారా సాహిత్య పరిచయం అయితే ఆధ్యాత్మిక, తాత్త్వికతలకు నాలో ప్రేరణ కలిగించిన వారు గోపదేవశాస్త్రి గారు.
12. గోపదేవశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయాలనుకున్న మీ కోరిక ఎలా నెరవేరింది?
జ: గోపదేవులు సామాన్యులు కారు. వేద, వేదాంగాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఆపోశన పట్టిన మహాపండితులు. కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారివద్ద వీరు వేదాంత దర్శనం చదువుకున్నారు. వీరిరువురికీ మంచి సాన్నిహిత్యం. గోపదేవులు శాస్త్రం చదువుకున్నారు కాబట్టి ఆయనను ‘శాస్త్రి’ గా పేర్కొన్నారట చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు. శాస్త్రిగారు మా ఇంటికి ఆయన వచ్చిన రోజే నేను ఆయనకు శిష్యుడనయ్యాను. శాస్త్రిగారు నాతో “నీకు ‘దర్శనాలు’ చెప్పాలనుకుంటున్నాను. 1940లో నేను వాటికి వ్యాఖ్యానాలు రాశాను. ఎన్నో ప్రసంగాలు వాటి మీద చేశాను. కానీ ఇక్కడ ఎవ్వరూ నేర్చుకోలేదు. నీకు నేర్పుతాను” అన్నారు. పరమానందంగా అంగీకరించాను. అదృష్టం ఏమిటంటే నేను చేస్తున్న సికింద్రాబాద్ పిజి (OU) కళాశాల దగ్గర్లోనే వాళ్ళ ఇల్లు ఉండడం. కాబట్టి కాలేజీ మధ్యాహ్నం అయిపోగానే లంచ్ చేసి సౌందర రాజన్ గారికి చెప్పి శాస్త్రి గారింటికి వెళ్ళేవాడిని. ప్రతీరోజూ ఆరుగంటలు ఆయన నాకు ‘దర్శనాలు’ చెప్పేవారు. ఒకరోజు కాలేజీ బాయ్ కాట్ అయితే వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింటివాళ్ళు ఆయనకు కళ్ళు కనపడవు కాబట్టి పొద్దున టిఫిన్ పెట్టి బయట తాళం వేసి గేటు తెరిచి ఉంచి వాళ్ల పనుల మీద వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వస్తారు. నేను వెళ్లి గురువుగారూ! అని పిలిచాను. ఆయన కిటికీ దగ్గర నిలబడి “బయట తాళం ఉంది కదా!” అన్నారు. వెనక్కి వెళ్ళిపోతానన్నాను. అప్పుడాయన “ఒకరోజు వేస్ట్ అవుతుంది. నీకేమో కానీ నాకు కష్టం” అన్నారు. భవిష్యద్దర్శనం చేయగలిగినవారు ఆయన. బయట ఏదైనా కుర్చీ ఉంటే కిటికీ దగ్గరకు లాక్కొని కూర్చోమన్నారు. మూడుకాళ్ళ కుర్చీ ఒకటి ఉంది. అదే చెప్పాను. “పరవాలేదు. మనకు రెండే ఉన్నాయి కదా!” అన్నారు. ఆరోజు పాఠాన్ని ఆపకుండా మొత్తం చెప్పారు. ఇలా ఆయన దగ్గర 13 నెలలు చదువుకున్నాను. ఆయన మరణించే రోజు దసరా. అది ఆయనకు తెలుసు. అప్పటికి నూటా ఒక్కేళ్ళు ఆయనకు. ఆరోజు పొద్దున్నే ఇంటికి రమ్మన్నారు. ఆయన దగ్గరే కూర్చున్నాను. చాలా మంది ఉన్నారక్కడ. ఎన్నో విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ మాట్లాడుతూ అందరినీ బయటకు వెళ్ళిపొమ్మని, నన్నొక్కడినే ఆయన దగ్గర ఉండమన్నారు. నాతో మాట్లాడుతూ నా చేతుల్లోనే ప్రాణం వదిలారు. ఆయన న్యాయం, వైశేషికం, సాంఖ్యం,యోగం, ఉత్తర మీమాంస…ఈ ఐదింటికి వ్యాఖ్యానాలు రాశారు. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య , బృహదారణ్యకోపనిషత్తుల పైన కూడా వ్యాఖ్యానాలు రాశారు. ఆయన రాసిన వాటిల్లో ఈశావాస్యం, బృహదారణ్యకం మాత్రం చెప్పి మిగతావన్నీ నన్ను చదువుకోమన్నారు. 60 పుస్తకాలు రాశారు. ఆయన శిష్యరికం పొందడం పూర్వజన్మ సుకృతం. వారి ప్రభావం నామీద చాలా ఉంది. ఆయన వల్లే నాకు భక్తి, జ్ఞాన, కర్మ యోగాలకు సంబంధించిన విషయాల పట్ల మక్కువ ఏర్పడింది. అప్పటినుండి 25 ఏళ్లుగా నేను వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అధ్యయనం చేస్తూనే ఉన్నాను.
13. మీరు రాసిన ‘నేత్రోదయం’ ఆంగ్లంలోకి అనువదించబడింది. అలాంటి అనువాదాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? స్వయంగా మీరేమైనా అనువాదాలు చేశారా?
జ: నేను రాసిన ‘నేత్రోదయం’ కవితా సంపుటి “Eye – Rise” అనే పేరుతో ఉషా కె. శ్రీనివాస్ గారు, కె.శ్రీనివాస శాస్త్రిగారు ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఆమెను నా కవిత్వం బాగా ఆకర్షించింది. ఇదొక్కటే కాదు అన్యభాషల్లోకి అనువదించబడిన పుస్తకాల్లో “నయాగరా” ఒకటి. 2009 లో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నయాగరా జలపాతాన్ని చూశాను. మొదటి రోజు రెండు గంటలు, రెండవరోజు రెండు గంటలు చూశాను. దాని మీద ఒక గేయ కావ్యం రాశాను. దానిని జి. పరమేశ్ అనే అతను హిందీలోకి అనువదించాడు. అలాగే “ఆ సందూక” అనే పేరుతో నేను రాసిన కవితా సంకలనాన్ని “వహ్ సందూక్” అనే పేరుతో ఆయనే అనువదించాడు. నేను రాసిన శుకోపనిత్తును డా. ఎమ్. రంగయ్య హిందీలోకి అనువాదం చేశాడు. ‘చింతన’ అనే పేరుతో నేను రాసిన వ్యాసాలు “Contemplation” గా ఇంగ్లీషులోకి పాలకుర్తి రామమూర్తి అనువాదం చేశాడు. “హృదయకమలం” అనే ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని వెంకటేశ్ దేవన్ పల్లి (బెంగుళూరు) హిందీలోకి అనువదించాడు. ఇక నేను రవీంద్రుని గీతాంజలికి లఘుకవితారూపం ఇచ్చి “సడిలేని అడుగులు” అనే పేరుతో అనువదించాను. అనువాదమే కాకుండా విదేశీయాత్ర అనుభూతులతో “అమెరికా ఓ అమెరికా” అను పేరిట కవిత్వాన్ని రాశాను. “బ్రహ్మచర్యం” అనే హిందీ పుస్తకాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించాను.
14. భగవద్గీతను మాతృమూర్తిగా దర్శించి ‘మాతృగీత’ శతకాన్ని రాసిన మీ అనుభూతిని వివరించండి.
జ: మనకు దేశమాత ఎలాంటిదో గీతామాత కూడా అలాంటిదే. దేశమాతగా ఆ దేశంలోని మనుషులను ప్రేమించడం, సాహిత్యాన్ని గౌరవించడం, ఆదర్శంగా స్వీకరించడం ఎలా చేస్తామో అలాగే భగవద్గీతను కూడా అలా ఆదర్శంగా తీసుకోవాలని ఆ దృష్టితో ఈ పేరు పెట్టాను. వైదిక పరమైన వ్యాఖ్యలుగా ఉన్న వాటిలో కొన్ని శ్లోకాలను తీసుకొని శతకరూపంలోకి 102 పద్యాల్లో “మనసు వెట్టి చదువు మాతృ గీత” అనే మకుటంతో వ్యాఖ్యానించాను. ” శ్రీకరం బటంచు చిన్నప్పుడే బుద్ధి/ కీలు గొలిపినాడ గీత యందు/ గీత కన్న గొప్ప గీత యేమున్నది?/ మనసు వెట్టి చదువు మాతృ గీత”….పద్మపత్ర మెట్లు పంకమ్ము నంటదో/ అటుల జ్ఞాని అవని కంటకుండు/ కర్మ వాసనలను కాదన లేమయా/ మనసు వెట్టి చదువు మాతృ గీత” ఇలా సాగుతూ ఉంటాయి. కృష్ణుడు నిష్కామ కర్మ యోగి. ఆయన పురాణ పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు. జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కి యోగీశ్వరునిగా నిలబడ్డాడు. ఆయన నోటి నుంచి వచ్చిన గీతావాక్కులు వేదం సమ్మతమైనవి. అందుకే దీన్ని సరళంగా శతకరూపంలో రాశాను.
15. “సాహిత్యంలో తత్వ దర్శనం” ఎలా చేయగలిగారు? దానికి ప్రేరణ ఏమిటి?
జ: మానవ జీవితం ఎంతో విలువైంది. అట్టి జీవితానికి సార్థకత ధర్మాన్ని అనుష్ఠించడం వల్లనే కలుగుతుంది. సమస్త మానవాళికి చెందిన వాఙ్మయం అంతా మన దేశం నుండే పరివ్యాప్తమైంది. అందుకే ఆ ధార్మికత, తత్త్వ చింతన వేదకాలం నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే చెప్పాలనిపించింది. సాహిత్యంలో తత్త్వ దర్శనం అంటే వ్యక్తి ప్రధానంగా కాకుండా తత్త్వ ప్రధానంగా తీసుకున్నాను. వస్తువు వేరు. వస్తు తత్త్వం వేరు కదా! ఇక్కడ వస్తువు యొక్క తత్త్వం ప్రధానం. ఉదాహరణకు ఈశ్వరుడు అని భగవంతుని రకరకాల పేర్లతో కొలుస్తున్నాం. అది వేరు. కానీ ఈశ్వర తత్త్వం వేరు. నేను సాహిత్యంలో ఉపనిషత్ కారులను, దార్శనికులను తత్త్వదర్శనులుగా గుర్తించాను. తెలుగు రామాయణాల్లో కూడా తాత్త్విక చింతన ఉన్నది. అలాగే ఆముక్త మాల్యదలో కూడా శ్రీకృష్ణ దేవరాయలు తత్త్వ దర్శనం చేయిస్తారు. ఆధునికులలో కూడా వానమామలై వరదాచార్యులు, గురజాడ అప్పారావు, దాశరథి, కాళోజీ వీరి కవిత్వంలో తాత్త్వికత ఉన్నది. తరువాతి కాలంలో సామల సదాశివ కవిత్వంలోనూ, వేటూరి రచనల్లోనూ తాత్త్వికత కనిపిస్తుంది. వీళ్ళందరి సాహిత్యంలో నుండి తత్త్వాన్ని తీసుకున్నాను.
“ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ/ ఙ్ఞానాన్యాత్మనో లింగమ్”……(న్యాయం)
“అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః”… (యోగం)
“స హీదమన్నం ధియా ధియా జనయతే కర్మభిః, యద్ధైతన్న కుర్యాత్ క్షీయతే హ”(బృహదారణ్యకం)
“ఆత్మ కాని మేన నాత్మ బుద్ధియును………అవిద్య యను మహా తరువు నుత్పత్తి కీ ద్వయంబు విత్తు మొదలు” (ఆముక్తమాల్యద)
“స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్య/ లోపమెరిగిన వాడె పూర్ణుడగు నరుడు” (దాశరథి)
ఇలా సాహిత్యంలో చాలాచోట్ల తత్త్వం కనిపిస్తుంది.
16. మీ పద్య కవితా సంపుటి “తెలంగాణోదయం” గురించి చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా?
జ: ఉద్యమంలో పాల్గొనడం ప్రత్యక్షంగా కాకపోయినా ఆర్ట్స్ కాలేజీ బయట గంటసేపు ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. ఒక క్లాసు బయట ఒక క్లాసు లోపల (నవ్వుతూ). అంటే కాలేజీ లోపల పిల్లలకు తరగతులు తీసుకునే వాడిని. కాలేజీ అయిపోయాక బయట తెలంగాణ ఉపన్యాసాలు. విద్యార్థుల భూమిక ఎక్కువ. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఎందుకో 2013 లోనే నాకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఒక కవిగా కలిగింది.1956 లో విశాలాంధ్ర ఏర్పడింది. 1955 లో దాశరథి గారు “మహాంధ్రోదయం” రాసి సురవరం ప్రతాపరెడ్డి గారికి అంకితమిచ్చారు. అది నాకు నేపథ్యం. అలాగే నేను కూడా 2013 లో 13 శీర్షికలతో తెలంగాణ గురించి “మహా తెలంగాణోదయం” అనే పేరుతో పద్యాలు రాసి దాశరథి రంగాచార్యుల గారి వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన దాన్ని చూసి ‘మహా ‘ అనేది తీసేసి “తెలంగాణోదయం” అని పెట్టమన్నారు. ఆయనతో తీసుకున్న లాస్ట్ ఇంటర్వ్యూ అది. అలా రాసిన కావ్యాన్ని ఉద్యమంలో క్రియా శీలుడైన హరీశ్ రావు గారికి అంకితం ఇచ్చాను. అప్పుడున్న బిజీలో కెసిఆర్ గారు దొరికేవారు కారు. సిద్దిపేటలో రమణాచారి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. గుమ్మన్నగారి శ్రీనివాసమూర్తి గారు, నందిని సిధారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ సభలో.
” తమిళ సోదరుల్ మిమ్మట్లు తరిమివేయ/ వచ్చి మామీద పడితిరి వసతి లేక/ ఎంత కాలమ్ము మిమ్ము భరించగలము? ఆత్మగౌరవ పోరాటమయ్య మాది”
“ఒక్క దాశరథియు, నొక్క సురవరము/ నొక్క కాళుడు, మరి వొట్టికోట/ యెంత తపము జేసి యీ తెలగాణను/ గొప్ప జేసినారొ చెప్పలేను” ….ఇట్లా తెలంగాణ గొప్పదనాన్ని చెబుతూ రాసిన కావ్యమది.
17. “రాణివా? నీవు మద్గృహరాజ్ఞి వీవు” అని మీ సతీమణి గురించి “ప్రమీలా త్రిశతి” పేరుతో స్మృతి కావ్యంగా మలిచారు… ఆదర్శనీయమైన మీ అనుబంధాన్ని వివరించండి..
జ: 1976 లో ప్రమీలతో నా వివాహం జరిగింది. 40 ఏళ్ళ కాపురంలో నాల్గు సినిమాలు కూడా కలిసి చూశామో లేదో? తనకు ఇష్టం ఉండేది కాదు. ఆమె జీవితంలో 40 రూపాయలు కూడా ఆమెకు వైద్యం కోసం ఖర్చు పెట్టలేదు. అంతటి ఆరోగ్య వంతురాలు, మంచి యోగ్యురాలు ఆమె. ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాను నేను. నా చదువు ఆమె లోకంగా ఉండేది. ముగ్గురు పిల్లల బాధ్యత కూడా ఆమే తీసుకుంది. ఇంటి వ్యవహారాలు అన్నీ ఆమెనే చూసుకునేది. ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు పట్టుకుపోయే వాడిని. ముషీరాబాద్ కేర్ ఆసుపత్రిలో వాళ్లమ్మ గారిని చూడడానికి వెళ్తే వైద్యులు ఆమె బ్రతకదని చెప్పారు. ఆ వార్త విని షాక్ కు గురయి మరణించింది ఆమె. “ఐదు నిమిషాల సమయం ఇవ్వలేదు మీ భార్య. అందుకే బ్రతికించలేక పోయాం” అన్నారు డాక్టర్లు. ఆ తర్వాత సంవత్సరానికి తల్లి మరణించింది. ఎంతో మంది విద్యార్థులు మా ఇంటికి వచ్చేవారు. అందులో చాలామంది ఆమె చేతి భోజనం తిన్నవారే. అందరినీ కన్నతల్లిలా ఆదరించేది. ఈ రాజ్ఞి అనే పదం వేదం నుండి తీసుకున్నాను. రాణియే రాజ్ఞి. రాజు అంటే తండ్రి అని, రాణి అంటే తల్లి అని అర్థం. ఇది తెలియని పిచ్చివాళ్ళు కొంతమంది పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు “వాణి నా రాణి” అంటే తప్పు అర్థాలు వెతికారు. నా ఇంటికి తల్లి ఆమె. అందుకే గృహరాజ్ఞి అన్నాను. ప్రమీలకు 20 సంవత్సరాల 6 నెలల వయస్సులో పెళ్లి జరిగితే నా కూతురుకు అదే వయస్సులో పెళ్లి జరిగింది విచిత్రంగా. అందరూ భార్యను అర్ధాంగి అంటారు. కాని ఈ చెన్నప్ప దృష్టిలో అలా కాదు. పూర్ణాంగి ఆమె నాకు.
” అర్ధాంగి అను మాట అర్థ సత్యమె కాని/ పూర్ణాంగి వనుటయే పొసగు నాకు”…
“రాణివా? నీవు మద్గృహ రాజ్ఞివి వీవు/ ఇంతివా? నీవు
నా నేత్ర కాంతి వీవు’
“ప్రేయసి యను మాట ప్రియమైనదే గాని/ సహధర్మ చరియన్న చాలు నాకు”
అందరూ ప్రేయసి అనే మాటను ప్రియురాలు అనే అర్థంలో తీసుకుంటారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు వెళ్లిపోతుంటే భార్య ఎక్కడికని అడుగుతుంది. అప్పుడాయన సన్యాసాశ్రమానికి వెళ్తున్నానంటాడు. అప్పుడామె దేనికోసం అంటుంది. మోక్షం కోసం అంటాడు. మీ పురుషులకేనా మోక్షం మాకు అవసరం లేదా అని సూటిగా అడిగిన ప్ర…

18. వేదాల మీద, ఉపనిషత్తులపై అధికమైన మక్కువ కలిగిన మీరు వాటి మీద రచించిన రచనలు గానీ, చేసిన ప్రసంగాలు గానీ ఏమైనా ఉన్నాయా?
జ: వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయడం వల్ల కలిగిన సంస్కారంతో ‘ఈనాడు’ పత్రికలో అంతర్యామి శీర్షికన వచ్చిన వ్యాసాలన్నింటినీ “సమదర్శనం” పేరుతో వెలువరించాను. “నమస్తే తెలంగాణ” లో ‘చింతన’ శీర్షికన వచ్చిన వ్యాసాలను “చింతన”, “హృదయకమలం” పేరుతో వెలువరించాను. ప్రత్యేకంగా “వేదాలు – వేదాంగాలు”, “ఉపనిషత్తులు – దర్శనాలు”, “మోక్ష సాధనలో దశోపనిషత్తులు” అనే గ్రంథాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే శైలిలో రచించి, ముద్రింపచేసాను. “ఈశావ్యాసోపనిషత్తు” మీద నా ప్రసంగాలు యూట్యూబులో 30 ఎపిసోళ్లుగా ప్రసారమయ్యాయి. “శివ సంకల్ప మంత్ర వైశిష్ట్యం” పేర నా ప్రసంగాలు 20 ఎపిసోళ్లలో ప్రసారమయ్యాయి. నాకు వైదిక సాహిత్యం అంటే చాలా ఇష్టం. వేదాది శాస్త్రాలు సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు. వేదాలు అందరివి, వాదాలు కొందరివి. అని నా అభిప్రాయం.
19. మీకు విద్యాసంస్థలతోనే కాక ఇతర సాహితీ సంస్థలతో ఏమైనా అనుబంధం ఉందా?
జ: నేను 1981 లో “ప్రజా భారతి” అనే సంస్థకు స్థాపక కార్యదర్శిగా ఉండి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాను. 30 సంవత్సరాల క్రితమే ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ( ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్తు) కార్యవర్గ సభ్యునిగా దేవులపల్లి రామానుజరావు గారి చేత నియమింపబడ్డాను. సినారె అధ్యక్షులుగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పని చేశాను. ప్రస్తుతం పరీక్షా కార్యదర్శిగా ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర “సామాజిక సమరసతా వేదిక” కు అధ్యక్షునిగా 6 సంవత్సరాలు పని చేశాను. సీతాఫల్ మండి ఆర్యసమాజ గౌరవ సభ్యునిగా 1995 నుండి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాను.
20. ఇంతటి సాహితీ ప్రియులైన మిమ్ములను వరించిన అనేక పురస్కారాలలో మిమ్మల్ని సంతృప్తి పరచినవి ఏవి?
జ: నాజీవితంలో నేను పొందిన అవార్డులు ఎన్నో ఉన్నాయి. కాని వాటిలో గురజాడ అప్పారావు గారి గోల్డ్ మెడల్ రావడం గొప్ప సంతృప్తిని కలిగించింది. గురజాడ నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన ప్రత్యేక ఛందస్సుతో రాసిన “ముత్యాల సరాలు” నాకు చాలా ఇష్టం. అందువల్ల బృహదారణ్యకోపనిషత్తుకు రాసిన “బృహద్గీత”, సాంఖ్య దర్శనానికి రాసిన “ప్రకృతి పురుష వివేకం”, ఈశావ్యాసోపనిషత్తుకు రాసిన “ఈశావ్యాసం” ఛాందోగ్యోపనిషత్తుకు రాసిన “ఉద్గీథం”… వీటిని ముత్యాలు సరాలు ఛందస్సులో కూర్చాను. అగ్నిస్వరాలు, అమృతస్వరాలు కూడా ముత్యాల సరాలులో అందించాను. ఇవన్నీ కలిపి మొత్తం 4వేల ముత్యాల సరాలు అవుతాయి. ఇన్ని ముత్యాల సరాలు రాసిన కవిని బహుశా నేనే కావచ్చు. 2019 లో సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారు విశాఖపట్నం భీమిలీలో శివానంద మూర్తి గారు నాకు నేషనల్ లెవెల్ ప్రతిభా పురస్కారాన్నిస్తూ 51వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలాగే అమృతలత ఇందూరు అపురూప రాష్ట్రస్థాయి జీవన సాఫల్య పురస్కారంతో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతి పొందాను. అంటే ఒక విద్యార్థిగా ఒక అవార్డు, ఆధ్యాత్మిక వేత్తగా ఉన్నందుకు ఒక పురస్కారం, సాహితీవేత్తగా ఒక పురస్కారం పొందాను. ఇంతకు మించి ఏం కావాలి?
21..”ఆలోచనామృతమే కవిత్వం” అనే మీ దృష్టికోణంలో కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఎటువంటివి?
జ: ఆపాత మధురం సంగీతం, ఆలోచనామృతం కవిత్వం అని అంటారు కదా! సంగీతం మధురమైనది. కవిత్వం ఆలోచింపజేసేది. కవి కర్మ కావ్యం అంటారు. “ప్రజ్ఞా నవనవోన్మేష శాలిని ఇతి ప్రతిభామతా”. కవిత్వం ఎప్పుడూ కొత్తగా ఉండాలి. వస్తువు పాతదే కావచ్చు. కొత్త ఉపమానం వల్ల దాన్ని కొత్తగా ఆవిష్కరించాలి. “కవిర్ మనీషీ” అని యజుర్వేదంలో ఉంది. కవిః అంటే ఇక్కడ సర్వజ్ఞుడు అని, మనీషీ అంటే జీవుల మనస్తత్వాలను తెలిసినవాడు అని అర్థం. ఇక్కడ కవి అంటే సర్వజ్ఞుడు. అంటే భగవంతుడు. మనీషీ అంటే ఎవరి మనసులో ఏముందో ఏక కాలంలో తెలిసిన వాడు. అంటే కవి సర్వజ్ఞుడు కావాలి. అన్నీ తెలియాలి. లోకజ్ఞుడు కావాలి. ముందు ఋషి కావాలి. “నానృషిః కురుతే కావ్యం” అన్నారు కదా! మంత్రదృష్ట అయినవాడు ఋషి అవుతాడు. ఋషి అయినవాడు కవి అవుతాడు. “విశ్వ శ్రేయః కావ్యమ్” అన్నట్టు కావ్యం విశ్వానికి శ్రేయస్సు కలిగిస్తుంది. ఆంధ్రశబ్ద చింతామణిలో నన్నయ్యగారు చెప్పిన మాట ఇది. అంటే కవి తన కావ్యం ద్వారా లోకానికి మేలు కలిగించాలి. ఏవో రచనలు చేయడం కాదు. సమాజంలో అవి ఎంత మార్పును తీసుకొస్తున్నాయో ఆలోచించాలి. హృదయ పరివర్తనకు కారణభూతమయ్యేలా కవిత్వం ఉండాలి. మరిచిపోయేది, మారిపోయేది కవిత్వం కాదు. మార్పును కలిగించేది కవిత్వం కావాలి. అది విశ్వజనీనం కావాలి. కవి క్రాంతదర్శి కావాలి. గీతాంజలిలో ఒకచోట రవీంద్రులు ” నీప్రేమలో నా ప్రేమ. ఇద్దరి ప్రేమలో ఉన్నది నువ్వే కదా” అంటారు. భగవంతుడు ప్రేమమూర్తి. మనందరినీ ప్రేమిచేవాడు ఆయన. చూడండి ఎంతటి ఫిలాసఫర్ కదా ఆయన? నేను గీతాంజలికి చేసిన “సడిలేని అడుగులు” చదివి కొలకలూరి ఇనాక్ గారు మిమ్మల్ని “ఆత్మీయ స్పర్శాలింగనం” చేసుకోవాలనిపిస్తుంది అన్నారు. ఆధునిక కవుల్లో కూడా జాషువా, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లు అలాంటి మార్పు దిశగా కవిత్వం రాశారు. కాబట్టి కవి అలాంటి కవిత్వం రాయడం సమాజ హితవును కలిగిస్తుంది.
22. ప్రస్తుతం వస్తున్న ఆధునిక కవిత్వం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
జ: నేను మంచి కవిత్వం రావాలని ఆశిస్తాను. కవిత్వం ఎటర్నల్. కవి ఇవాళ ఉంటాడు. రేపు ఉండడు. కానీ కవిత్వం అలా నిలిచిపోతుంది. వ్యాసుడు, కాళిదాసాదులు కాక ఇతర భాషల్లోనూ గొప్ప కవులున్నారు. కవితాబలం పైనే కవి చిరకాలం నిలిచిపోతాడు. అంటే కవి యొక్క బలం కవిత్వం అన్నమాట. ఉదాహరణకు భారతీయ శిల్ప కళకు ఆలయాలు నిదర్శనాలు. రాయిని గుర్తించి అద్భుత శిల్ప కళా ఖండాలుగా మలిచారు వాళ్ళు. అంటే వస్తువును గుర్తించారు కాబట్టి శిల్పంగా చెక్కగలిగారు. ఈనాటి కవులకు అది లేదు. కవితావస్తువు లేకుండా మంచి కవిత్వం ఎలా వస్తుంది. ముందు ఒక మంచి వస్తువును ఎంచుకోవాలి. ఏదో రాస్తూ పోతున్నాం. అదే కవిత్వం అని ఒకరికొకరు పొగుడుకోవడమే తప్ప అసలు కవిత్వం రావడం లేదు.
23. తెలుగు సాహిత్యం పట్ల అత్యంతాసక్తి కలిగిన కవులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?
జ: ఏ సాహిత్య రచన అయినా ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు అది మానవ సమాజానికి ఉపయోగ పడుతుందని నా భావన. అంటే పారమార్థిక చింతన ఉండాలి. అర్థ చింతన ఉంది ఇప్పుడు (నవ్వుతూ). కానీ అది లౌకికం. పారమార్థిక చింతన ఉన్నప్పుడే సమాజం ‘అర్ధ’వంతమవుతుంది. ముఖ్యంగా అధ్యయనం చేయాలి. రాయడం పనిగా పెట్టుకుంటున్నారు. చదవడం లేదు. డెబ్భై శాతం రాయడమే చేస్తున్నారు. కానీ డెబ్భై శాతం అధ్యయనం చేయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. అధ్యయనం లేకపోతే అవగాహన ఉండదు. అవగాహన లేకుండా ఎలా రాయగలుగుతారు? రాసేటప్పుడు సమాజాన్ని తిరస్కార భావంతో చూడొద్దు. ఇష్టమైనదే చెప్పండి. ఇష్టం కాని దాన్ని రాస్తూ కష్ట పడడమెందుకు? నీకు ఇష్టం లేనిది మరొకరికి ఇష్టమైనదై ఉండొచ్చు కదా! ఈ రోజుల్లో అధ్యయనం లేకపోవడం వల్ల శబ్దజ్ఞానం కూడా తక్కువై పోయింది. వర్గ విభేదాలు, కుల మత భేదాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా రాసేది అందరి హితవు కోసం రాయాలి. ఎక్కడో ఒకచోట నేను “వేద విద్యకు దూరమైతిమి, భేద విద్యకు దగ్గరైతిమి” అన్నాను. “సర్వేజనాః సుఖినోభవంతు” అని కదా వేదం చెప్తోంది. వేదాలకు దూరం కావడం వల్ల స్త్రీ గొప్పదనం తెలుసుకోలేక పోతున్నాం. అన్నీ తెలుసుకోవాలంటే అధ్యయనం చేయాలి. అప్పుడే చక్కగా రాయగలుగుతారు.
24. మీ సాహితీ యాత్రను ఇంకా కొనసాగిస్తున్నారా?
జ: అవును ఇంకా కొనసాగిస్తున్నాను. శరీరంలో ఓపిక ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాను. పతంజలి యోగ దర్శనానికి నేను స్క్రిప్టులో 1100 పేజీలు రాశాను. 500 పేజీల్లో “సంపూర్ణ యోగదర్శనం”గా అది వెలువడనుంది. ప్రింట్ అవుతోంది. కృష్ణుడు మంచి యోగి. నాకు యోగమంటే చాలా ఇష్టం. అందుకే భగవద్గీతను ఎంతో ఇష్టపడతాను. వారానికి రెండురోజుల చొప్పున “వేదాంత దర్శనం” ఇంట్లోనే స్వయంగా బోధిస్తున్నాను. వారానికి రెండు రోజులు “యోగ దర్శనం” ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాను. ఈనెలలో (నవంబర్ 2023) చెరుకూరి రామారావు గారి ఆధ్వర్యంలో చెరుకూరి గ్రూపు తరఫున 11 రోజులు భగవద్గీత మీద ప్రసంగిస్తున్నాను. ఈ మధ్యనే నేను ఉత్తర కాశీకి వెళ్లి వచ్చాను. గంగోత్రికి సంబంధించి “గంగోత్రి వైభవం” పద్యకృతి రాశాను. అది ఈ మధ్యనే వెలువడింది కూడా. “శ్రేష్ఠారామం”, “నా చూపు దేశం వైపు” అనే వచన కవితా సంపుటాలు ముద్రణలో ఉన్నాయి. దత్తాత్రేయుని మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ధర్మవ్యాధుని మీద కూడా ఒక పుస్తకం రానున్నది. The success of Karma Yoga, Gnana Yoga అని రెండు పుస్తకాలు రాయాలి. విషయ సేకరణ కూడా చేయడం జరిగింది. కర్మ యోగానికి రాముడు ప్రతీక అయితే జ్ఞాన యోగానికి కృష్ణుడు ప్రతీక. అందుకే వాళ్ళిద్దరి గురించి రాయాలని అనుకుంటున్నాను. భగవంతుడు అనుగ్రహించినంత వరకు రాస్తూనే ఉంటాను.
నమస్కారాలు సార్…సుదీర్ఘమైన మీ సాహిత్య, ఆధ్యాత్మిక జీవిత ప్రస్థానాలను ఎంతో ఓర్మితో, కూర్మితో మాకు తెలియజేసినందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సెలవు.
.
– డా. వడ్డేపల్లి కృష్ణ
ప్రముఖ లలిత గీతాల కవి, లలిత గీత పరిశోధకులు రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ గారితో మయూఖ ముఖాముఖి.. శ్రీ, గేయకిరీటి, కవనప్రజ్ఞ బిరుదాంచితులు, జాతీయస్థాయి స్పెషల్ జ్యూరీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, గౌరవనీయులు డా. వడ్డేపల్లి కృష్ణ గారి జీవితం, సాహితీ ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. – మయూఖ ప్రతినిధి అరుణధూళిపాళ
నమస్కారం సార్, ఈరోజు మా మయూఖ పాఠకులకు
మీ గురించిన వివరాలు చెప్పండి.
మొదటగా…..
మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులు, మీ బాల్యం గురించి వివరించండి.
నమస్కారం. నేను 1949 జూలై 30వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారు లక్ష్మమ్మ, నాన్నగారు లింగయ్య. అక్కడే హైస్కూల్లో హెచ్.ఎస్.సి వరకు చదువుకున్నాను. చిన్నప్పటినుండీ నాటకాలు వేయడం, రాయడం పట్ల ఆసక్తి ఉండేది. బాల్యమంతా అలాగే గడిచింది. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. చేనేతవృత్తి జీవనంగా బతికినవాళ్ళు. ఈ వృత్తిలో వాళ్ళు మాస్టర్ వీవర్స్ గా ఉండేవాళ్ళు. మా నాన్న, మా పెద్దన్నయ్య మొదట షోలాపూర్ వెళ్లి అక్కడ నేత నేస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన వాళ్లే. మెల్ల మెల్లగా మంచి స్థాయిని సంపాదించుకున్నారు.
ప్రాథమిక దశలోనే మీకు అలాంటి ఆసక్తి కలగడానికి కారణం ఏమిటి?
నా విద్యాభ్యాస ప్రాథమిక దశలో కనపర్తి లక్ష్మీనర్సయ్య గారని సినారె గారి సహచరులు. హన్మాజీ పేటలో పుట్టి పెరిగినవారు. ఆయన నేను 6వతరగతిలో ఉన్నప్పుడు సినారె గారు రచించిన ‘సినీకవి’ అనే ‘ఏకాంకిక’ లో సినీ రచయిత తారాపతి పాత్ర నాతో వేయించారు. అప్పుడు నా వయస్సు 11 సంవత్సరాలు. ఆ విధంగా సినారె గారితో ఆనాడే అవినాభావ సంబంధం పరోక్షంగా ఏర్పడింది. అనంతరాజశర్మ గారు హైస్కూలులో మాకు తెలుగు పండితులు. మంచి వైయాకరణులు. ఆయన వల్ల పద్య ఛందస్సు బాగా పట్టువడింది. పోతన భాగవత పాఠాలకు సంబంధించిన పద్యాలు చెబుతూ ” మీరు కూడా పద్యాలను, ఛందస్సును ఒంట బట్టించుకుని రాస్తే మీ పద్యాలు కూడా పాఠ్యాంశాలు అవుతాయి ” అన్నారు. ఎందుకో ఆ రోజుల్లో తెలియకుండానే ఆ బీజం తలలో పడింది. సి.నారాయణరెడ్డి గారిది మా తాలూకా ఊరే. ఆయన రాసిన “సాగుమా ఓ నీల మేఘమా/ గగన వీణా మృదుల రాగమా” అనే పాటను అనంతరాజ శర్మ గారు రేడియోలో పాడారు. మా గురువు గారు సినారె గారికి నేను పాడాను అని చెప్పగా ఆయన బాగుందని మెచ్చుకున్నారు. అప్పుడు నేను గేయం రాయాలని ప్రయత్నించి ముందు ఒక ఆటవెలది పద్యం, ఆ తర్వాత ఒక గేయం రాశాను. ” నమో నమో శ్రీ రమణా/ చూపుము నాపై కరుణా ” అని మా ఊళ్ళో ఉన్న ఆలయంలోని వెంకటేశ్వర స్వామి మీద రాశాను. ప్రతి శరన్నవ రాత్రులకు పదిరోజులు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగేవి. మైకులో భక్తిగీతాల రికార్డు మోగుతుండేవి. అప్పుడప్పుడు గాయనీ గాయకులు కూడా వచ్చి పాడుతుండేవారు. నేను రాసిన గేయం విన్న మా గురువుగారు ” నీవు చాలా బాగా రాయగలుగుతున్నావ్” అన్నాడు. అప్పుడు నేను రాయడం కాదు. నేను రాసింది అందరికీ తెలియాలి కదా! అన్నాను. వెంటనే మా స్నేహితుడు రేపాక రాములును పిలిచి “ఈ పాట నువ్వు గుడి దగ్గర పాడాలి” అని చెప్పాను. నాకు ఆనందం కలిగింది. అతడు, నేనూ కలిసి నాటకాలు కూడా వేశాము. అతను రాజబాబు లాగా ఎక్కువ యాక్ట్ చేసేవాడు. నేను ఎఎన్ఆర్ లాగా హీరో పాత్రలు వేసే వాడిని. చదువులో కూడా ముందుండేవాళ్ళం. పాట విని అతడు ‘చాలా బాగుందిరా’ అని ఆ పాటను మైకులో పాడాడు. అందరూ దాన్ని వినడం చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. అప్పటి నుండి రచనలు చేయడం మొదలయ్యింది. ‘తరంగిణి’ అని స్కూల్ మ్యాగజైన్ వచ్చేది. దానికి నేను ‘విధి లిఖితం’ అని ఒక కథానిక రాసి ఇచ్చాను. అది అచ్చు వేశారు 1964 లో జరిగింది ఇది. మా గురువుగారు నన్ను పిలిచి ” ఈ కథ నువ్వే రాశావా?” అని అడిగారు. అవునన్నాను. “అందరూ వాళ్ళింట్లో పెద్దవాళ్ళను అడిగి రాసుకొస్తారు. కానీ నువ్వు బాగా రాయగలిగావురా..” అన్నాడు. ఆంధ్రప్రభ వారపత్రికలో 15వ ఆగస్టుకి బాలల కథా రచనల పోటీలు పెట్టేవారు. బహుమతులు కూడా ఇచ్చేవారు. నేను రెండు, మూడు సార్లు ప్రయత్నం చేసాను. ప్రైజు రాలేదు కానీ కథా రచన బలపడింది. ఆ తర్వాత గేయాల మీద మనసు పెట్టాను.

మరి సినారె గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏవిధంగా ప్రభావితం చేశారు?
నేను నారాయణరెడ్డి గారి లాగా లలిత గీతాలు రాయాలి. సినిమా గీతాలు రాయాలని అనుకున్నా. సినిమా గీతాల పట్ల ఆసక్తితో రాసి, వాటిని సినారె గారికి పోస్టులో పంపించేవాడిని. వారు బిజీగా ఉన్నప్పటికీ వాటిని చదివి ” నీ రచనలన్నీ బాగానే ఉన్నాయి. సినీ బాణీల ఒరవడితోనే రాసినట్టుగా తెలుస్తోంది. అలాకాదు. నీవు స్వతహాగా గేయ రచన చేయాలి. ఏదైనా కావ్యం అచ్చు వేయాలి. అలా ప్రయత్నం చేయి. నేను నీ కావ్యానికి ముందు మాట రాస్తాను ” అని ప్రోత్సహించారు. గేయాలు రాయాలంటే మాత్రా ఛందస్సు నేర్చుకోవాలి. పద్య ఛందస్సు తెలుసు కానీ మాత్రా ఛందస్సు తెలియదు. సినారె గారే కనపర్తి గారికి లెటర్ రాసి ” కృష్ణ మనవాడు. నువ్వు గేయ రచనా పద్ధతి చెప్పాలి ” అన్నారట. కనపర్తిగారు నా దగ్గరికి వచ్చి “నువ్వు నారాయణ రెడ్డి గారికి లెటర్ రాశావా? నువ్వు ఏం రాశావో చూపించు” అన్నాడు. మాత్రా ఛందస్సు గురించి అడిగా. “ఏముంది గురు లఘువుల గుణకారమే. గురువుకు రెండు మాత్రలు, లఘువుకు ఒక్క మాత్ర. అన్ని పాదాలు సమ మాత్రలతో ఉండేలా చూసుకో” అన్నారు. సరేనని “నేటికాలం ఏటి కాలం/ గొడ్డు కాలం గడ్డు కాలం” ఇట్లా మొదలు పెట్టాను. అది కృష్ణా పత్రికలో అచ్చు అయింది. అప్పటినుండీ సినారె గారు నన్ను అన్ని వేళలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే వున్నారు.
ఇలా రచనల మీద దృష్టి పెట్టిన మీరు ఉన్నత విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?
నేను హెచ్ ఎస్ సి లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. పియుసి లో డాక్టర్ కావాలని బైపిసి తీసుకున్నా. ఫస్టు క్లాసు స్టూడెంట్స్ అందరూ నిజాం కాలేజీలో చదువుతున్నారంటే అక్కడ చేరాను. హాస్టల్ లో నా రూమ్మేట్ జగన్నాథం అని బ్లైండ్ స్టూడెంట్ ఉండేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరోజు నేను చదువుకొని పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లి వచ్చేలోగా నా బట్టలు, పుస్తకాలు ఎవరో ఎత్తుకుపోయారు. ఆయన బ్లైండ్ కాబట్టి రూముకు తాళం వేయడానికి వీలు కాలేదు. ఆయనను అడిగితే తనకు తెలియదన్నాడు. ఆ డిప్రెషన్ తో 61% మార్కులు వచ్చాయి. 67% వరకు మెడిసిన్ సీటు వచ్చి ఆగిపోయింది. ఇప్పటిలాగా వేరే అవకాశాలు లేవు. మళ్లీ రిపీట్ చేయాల్సిందే. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అన్నయ్య నన్ను చదివించడం కుదరదన్నాడు. ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సెలెక్షన్స్ జరిగేవి. కావున నాకు మెడిసిన్ సీటు లభించలేదు. హెచ్ ఎస్ సి మార్కులతో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ కోసం వైజాగ్ వెళ్ళాను. ఆ తర్వాత ఉద్యోగం..తక్కిన చదువు అంతా ఎక్స్ టర్నల్ లో కొనసాగింది.
ఒకవైపు వృత్తి పరమైన బాధ్యతలు, మరో వైపు ప్రవృత్తి పరమైన రచనా వ్యాసంగం కొనసాగిస్తూ ఉండి ఇంకా చదవాలనే ఆలోచనకు ఎలాంటి పరిస్థితులు దోహదమయ్యాయి?
ధర్మపురిలో మొట్టమొదట పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత మా ఊరు సిరిసిల్లకు దగ్గరగా ఉంటుందని ఎల్లారెడ్డి పేటకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడ సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉన్నాను. నారాయణరెడ్డి గారు నాతో “పోయెట్ గా రాణించాలంటే పోస్టల్ లో కాదు. అకడమిక్ లైన్లో రావాలి” అన్నారు. అంటే ఎమ్ ఏ చేయాలి. ‘వివేకవర్ధిని’ లో బీఏ కోసం (1972, 73 ప్రాంతం) కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ వేయించుకునే విధంగా ఫీజు కట్టాను. అప్పుడు బోయిన్ పల్లిలో సబ్ పోస్ట్ మాష్టారుగా ఉన్నాను. అలా బిఏ పూర్తయింది. తర్వాత సిరిసిల్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1976 లో ఉస్మానియా ఎక్స్ టర్నల్ నోటిఫికేషన్ వచ్చింది. బహుశా 1st బ్యాచ్ నాది. 1978 లో ఎమ్ ఏ పూర్తయింది. అలా సినారె గారి మాట ప్రకారం అకడమిక్ లో ముందుకు నడిచాను.
ఆకాశవాణిలో మీ లలితగేయాల అరంగేట్రం ఎప్పుడు జరిగింది?
ఉద్యోగం కోసం ట్రైనింగ్ కి వైజాగ్ వెళ్లానని చెప్పాను కదా! అక్కడ మొట్టమొదటి సారి సముద్ర తీరాన్ని చూశాను. సాయంత్రం చూసి వెళ్లబోతుంటే అక్కడివాళ్ళు “ఇప్పుడెందుకు వెళ్తున్నారు? ఈరోజు పౌర్ణమి కదా!రెండు గంటలు ఆగితే అలలు తీరం దాటి వస్తాయి”అని చెప్పారు. రాత్రి 8.00..8.30 ప్రాంతంలో చాలా దూరం వరకు అలలు ఎగిసి వచ్చాయి. అప్పుడు “సంద్రము, చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును” అని ఆశువుగా వచ్చింది ఒక పాదం. “శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును/ చితికిన బతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును / వాడిన కుసుమాలలోని ఏడుపులను ఎవడెరుగును / వీడిన ప్రేమికుల లోని విరహాగ్నుల నెవడెరుగును / మినుకు మినుకు మను తారల కునికిపాట్ల నెవడెరుగును / నీకు నాకు వీలు కాని లోకానికి కానరాని విధిని గూర్చి ఎవడెరుగును / విను వీధుల కెవడెరుగును / ఆ మధ్యలో సంద్రము చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును /అని రాశాను. నారాయణ రెడ్డి గారు అంటుండేవారు గేయాలు రాయడానికి చేయితిరిగి ఉండాలని. ఈ గేయం ఆయనకు పంపిస్తే ” భేష్! నేను అనుకున్నది జరిగింది.
నీ కవితాగుణం పెరిగింది” అని స్రవంతి పత్రికకు పంపమన్నారు.. అది జూన్ లో అచ్చు అయింది. అదే జూన్ లో ” నేటికాలం ఏటికాలం ” కృష్ణా పత్రికలో అచ్చు అయింది. జూన్ లోనే ధర్మపురిలో పోస్టింగ్ వచ్చింది. అలా జూన్ 1968 నా జీవితంలో ఒక మలుపు. అలాగే గేయాలు, కవితలు రాస్తూ పోయాను. కృష్ణా పత్రిక, ప్రగతి, ప్రభవ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇలాంటి పత్రికల్లో అచ్చు అయినాయి. లలితసంగీతంలో కృష్ణశాస్త్రి, బోయిభీమన్న, దాశరథి, సినారె వీళ్ళు రాసిన పాటలు రేడియోలో ఎక్కువగా వినిపిస్తుండేవి. ఆ ప్రేరణతో లలితగీతాలు రాస్తూ పంపించేవాడిని. అవన్నీ తిరుగుటపాలో వచ్చేవి. ఎందుకు వాళ్లకు నచ్చలేదని అనుకుంటుంటే దాంట్లో ” It does not reflect upon your merit.” అని ఒక ప్రింటెడ్ మ్యాటర్ ఉండేది. అప్పుడు నాలో కసి పెరిగి, కృషి పెరిగి నాలుగైదు సార్లు ప్రయత్నించాక ఒకేసారి రెండు సెలెక్ట్ అయినాయి. “కనరా నీ దేశం, వినరా సందేశం/ కనులు తెరిచి ఒక్కసారి కనరా నీ దేశం/ మనసులోన మంచి నెంచి వినరా సందేశం” అనే దేశభక్తి గీతం ఒకటైతే, ప్రకృతి పరంగా నారాయణ రెడ్డి గారు ” సాగుమా ఓ నీలమేఘమా ” అని రచించినట్టు నేను ” వర్షించవె మేఘమా! వరి చేలు ఫలించగా, వనములు చిగురించగా, మనముల నలరించగా ” అని రాసినది రెండవది. ఈ రెండు సెలెక్ట్ అయినట్టు ఆల్ ఇండియా రేడియో నుండి లెటర్ వచ్చింది. అప్పటి నుండి వరుసగా ప్రోత్సాహంతో లలితగీతాలు రాస్తూ పోయాను. అలా వంద గీతాలు రాసి “కనరా నీదేశం” అని లలిత గీతాలను సంపుటిగా 1971 లో వెలువరించాను.
దీనికి సంబంధించినదే మరో ప్రశ్న… ఆకాశవాణిలో ప్రసారమైన మీ గేయాలను కొన్నింటి గురించి చెప్పండి.
1969 జనవరి నుండి ఆకాశవాణిలో నా గేయాలు ప్రసారమవుతున్నాయి. అలా వరుసగా రాస్తూ వచ్చాను. రేడియోలో ‘ఈ మాసపు పాట’ అని వచ్చేది నెలంతా. దాని కోసం గేయం రాస్తే 1972లో సెలెక్ట్ అయింది. “జగతి రథం జై కొడుతూ/ ప్రగతి పథం పై పోనీ/ ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలై రానీ/ స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి/ అదియే దేశాభ్యుదయపు అందమైన పునాది”..అనే ఈ పాటకు చిత్తరంజన్ స్వరాలు సమకూర్చి ఆయనే పాడారు. 1972 సెప్టెంబర్ నెలంతా ప్రసారం అయిందది. 50 సంవత్సరాలు దాటింది. అయినా అది ఇప్పటికీ One of the most better songs గా నిలిచింది. ఈ పాటను చిత్తరంజన్ పలు సందర్భాల్లో చెప్పారు. “ఈ పాట నేర్చుకుందాం” అనే కార్యక్రమంలో కూడా ఆయన దీన్ని నేర్పించారు. “ద్వేషమే విడనాడితే ఈ దేశమే నవ నందనం/ ప్రేమతో మనగలిగితే నీ హృదయమే శ్రీ చందనం” అనేది, అలాగే ” పాడై పోతున్నదోయి పరిసర వాతావరణం, మార్చుకో ఇకనైనా మసలే నీ ఆవరణం ” మొదలగునవి అనేకం ఈమాసపు పాటలుగా వచ్చాయి. ఎమ్. నర్సింహమూర్తి గారని జానపద గేయాలు పాడేవారు నా గీతాలు కూడా కొన్ని పాడారు. “మళ్లీ జన్మించు ప్రభూ మానవ కళ్యాణముకై/ మమ్ముల దీవించు ప్రభూ మానవతా సాధనకై/ వంచనకే నేడు విలువ మంచితనముకే శిలువ/ నవ నాగరికతతో భువి వదిలేస్తున్నది వలువ” అన్న నా పాటను ఆయన పాడారు.. చిత్రంగా ఆయన ఈ పాట పాడి విజయవాడ నుండి కారులో తిరిగి వస్తుంటే పెద్ద ఆక్సిడెంటు అయింది. అటు ఇటు ఉన్న ఫ్రెండ్స్ కి బాగా దెబ్బలు తగిలాయి. ఈయనకు మాత్రం కొంచెం నుదుట క్రాస్ పడింది. ఆయన నన్ను కౌగిలించుకుని “కృష్ణా! నేను ఈపాట పాడడం ఏమో కానీ మెరాకిల్ జరిగింది. ఆ దేవుడు నన్ను కాపాడాడు” అన్నాడు. “శ్రీ వేంకటేశా, శ్రీ తిరుమలేశా, శ్రీదేవి నాథా శ్రిత పారిజాతా” అనే పాట కూడా ఆయనే పాడారు. అట్లా చాలా పాటలు పాడారు.
“తెలుగులో లలితగీతాలు” అనే ప్రత్యేక అంశాన్ని పిహెచ్ డి కోసం తీసుకోవాలని అనుకోవడానికి కారణం ఏమిటి?
ముందు నుండీ సినారె లాగా సినీ గీతాలు రాయాలని ఉందని చెప్పాను కదా..ఆయన పేరు కింద వెండితెరపై నా పేరు కనిపించాలన్న కోరిక ‘అమృతకలశం’, ‘యుగకర్తలు’ లో తీరింది. డాక్టర్ సి. నారాయణరెడ్డి లాగా డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనిపించుకోవాలనే కోరిక కలిగింది (నవ్వుతూ). ఆయనలాగే లలితగీతాలు, సినీ గీతాలు, రుబాయిలు, ముక్తకాలు, గేయనాటికలు రాశాను. మరి ఈ కోరిక తీరాలంటే పిహెచ్ డి. చేయాలి. ఆ సమయంలో “భక్త కవి పోతన” సీరియల్ రచన, దర్శకత్వంలో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు పిలిచి “ఇంతవరకు లలితగీతాల మీద ఎవరూ పిహెచ్ డి చేయలేదని, మీరు చేస్తే బాగుంటుంది. కేవలం మీ గీతాల మీదనే పి హెచ్ డి చేయొచ్చు అన్ని లలితగీతాలు మీరు రాశారు”. అని అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి వాటి మీద చేయరు. చాలా సులువు అనుకుంటారు. దిగితే కాని లోతు తెలియలేదు. అందుకే ఎవరూ చేయడానికి సాహసించలేదు. నేను ఐచ్ఛికంగానే ఈ అంశాన్ని తీసుకున్నాను.
లలితగీతాలకు నిర్దేశితమైన లక్షణాలతో ప్రామాణిక పరిశోధన చేశారు కదా..అంతకుముందున్న లలితగీతాలకు, మీరు నిర్ణయించిన లక్షణాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
అసలు అంతకుముందు లలితగీతాలకు లక్ష్య, లక్షణ నిర్దేశమే లేదు. అదే నాకు ఎంతో కష్టమైంది. గురజాడ ‘దేశభక్తి’ గీతం నుండి తీసుకోవాల్సి వచ్చింది. 90 ఏళ్ళ సాహిత్యాన్ని వడబోయాల్సి వచ్చింది. ఒక్కరి రచనల మీదనే పిహెచ్ డి లు వస్తున్న సమయమది. అటువంటిది 90 ఏళ్ళ సాహిత్యాన్ని తలకెత్తుకోవలసి వచ్చింది. నాకు గైడుగా ఉన్న ఎస్వీ రామారావు గారు “నువ్వు మొట్టమొదటగా ప్రామాణికమైన బాట వేస్తున్నావు. కాబట్టి తప్పదు ఇది. కానీ నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది” అన్నారు. అదే సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్ లో నా అనేక లలితగీతాలు, పాటలు వస్తుండేవి. సీరియల్స్ కూడా బుల్లితెరకెక్కుతుండేవి. కావున కష్టమేమో అనిపించింది. హింసలు భరిస్తేనే కదా హంసలుగా మన పేరు విహరిస్తుంది అనుకున్నా. కష్టపడి పరిశోధన చేసాను. ఆ తర్వాత “తెలుగులో లలిత గీతాలు” పేరున సిద్ధాంత గ్రంథం వెలువరించాను. దానిని ఆవిష్కరించిన ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ” నా ఆధునికాంధ్ర కవిత్వం రెఫరెన్సు లాగా రీసెర్చ్ స్కాలర్స్ కి ఎట్లా ఉపయోగపడుతుందో వడ్డేపల్లి ఈ సిద్ధాంత గ్రంథం కూడా ప్రామాణికంగా అట్లే నిలబడుతుంది. అంతేగాక రీడబిలిటీ ఉన్న సిద్ధాంత గ్రంథం రాశాడు. గేయ రచనలో చేయి తిరిగిన వాడు అనిపించుకోవడమే కాక విమర్శనా దృక్పథంలో కూడా మంచి వన్నె కెక్కినవాడు అనిపించుకున్నాడు” అని అభినందించారు.
నేను ఆరుద్ర గారిని, తొలి గాయనీ గాయకులైన ఎస్. రాజేశ్వర రావు గారిని, బాల సరస్వతీ దేవి గారిని, లలిత సంగీత ప్రయోక్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు గారిని సంప్రదించాను. వాళ్ళను ఇంటర్వ్యూ చేసి..తగిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. మన పరిశోధన ఉపరిశోధన కావొద్దు కదా (నవ్వుతూ)…కావున ప్రామాణికంగా “తాళం, లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావ గీతం లలిత గీతం” అని లక్షణ నిర్దేశం చేశాను. అందుకు వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో ఆరుద్ర గారు “అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు తీసుకుంటున్నావా?” అని ఒక ప్రశ్న వేశారు. త్యాగరాయకృతులు రాగ నిర్దేశాలు కాబట్టి తీసుకోవడం లేదు. అన్నమయ్యవే అనుమానంగా ఉంది. కొంతమంది జానపదాలుగా పాడుకుంటున్నారు, లలితగీతాలుగా పాడుకుంటున్నారు అన్నాను. అందుకు ఆయన నవ్వుతూ …”వాళ్ళు పాడుకుంటే పాడుకోనీ.. కానీ అవి ముట్టుకోవద్దు అన్నారు” ‘ఎందుకు సార్’ అంటే అన్నమయ్య రాతలు మనకు రాగిరేకుల్లో భద్రంగా దొరికాయి. కానీ రాగనిర్దేశితాలు దొరకలేదు. కానీ అవన్నీ రాగ నిర్దేశితాలే, సంకీర్తనలే అన్నారు. బతికించారు అనుకున్నాను. 90 ఏళ్ళ సాహిత్యమే ఎలా అనుకుంటే అన్నమయ్య రచనలను తీసుకుంటే మరో 32 వేల సంకీర్తనలు అవుతాయి కదా…కావున వాటి నుండి బయటపడి ఇలా సమర్థవంతంగా మొత్తానికి పిహెచ్ డి పూర్తిచేశాను.
వేయికి పైగా లలితగీతాలు రాసిన మీరు సిద్ధాంత గ్రంథంలో ఏ క్రమంగా విశ్లేషించారు?
ముందుగా ప్రచురిత, ఆ తర్వాత ప్రసారిత గీతాలను ఎన్నుకోవడమైంది. కావున 1910 వ సంవత్సరంలో ప్రచురితమైన గురజాడ గారి ‘దేశభక్తి’ గేయాన్ని తొలి లలితగీతంగా చూపడమైనది. అది ఆకాశవాణిలో కూడా ఆ తర్వాత ప్రసారం అయింది. అంతకుముందు బాలాంత్రపు రజనీకాంతరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, మల్లవరపు విశ్వేశ్వర రావు, వింజమూరి శివరామారావు మరియు ఆ కోవలో రచించిన బోయి భీమన్న, దాశరథి, నారాయణరెడ్డి, శశాంక, బాపురెడ్డి గారల ప్రచురిత లలితగీతాలు ప్రసారం అవుతున్న కారణాన తీసుకోవడమైనది. ఆతర్వాత సి. నారాయణ రెడ్డి, బాపురెడ్డి గార్ల కోవలో అత్యధిక లలితగీతాలు రాసింది నేనే కావడం విశేషం. నా తర్వాత ఆచార్య తిరుమల, తిరుమల శ్రీనివాసాచార్య గార్లు నాకంటే సీనియర్లు కానీ లలితగీతాలు రాయడం ఆలస్యంగా ప్రారంభించారు. అలా నేను మలితరం అగ్రశ్రేణి లలితగీతాల రచయితగా గణుతికెక్కాను. 1969 జనవరిలో మొట్టమొదట నా లలితగీతం ప్రసారమైనప్పటినుండీ వరుసగా ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను. ఇటీవల 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత అమృతోత్సవంలో కూడా ఆకాశవాణి వారు నన్నే ‘ఈ మాసపుపాట’ రాయమన్నారు. వేరేవాళ్ళకు అవకాశం ఇవ్వక పోయారా? అన్నాను. అందుకు వారు నవ్వుతూ “ఇచ్చినా మేము అనుకున్న భావం రాలేదు. మీరైతే సత్తా ఉన్నవాళ్ళు. కరెక్టుగా తొందరగా రాసి ఇవ్వగలిగే వాళ్ళు కాబట్టి మీరే రాయమన్నారు. అప్పుడు ” ఎత్తరా మనజెండా వినువీధుల నిండా/ ఎలుగెత్తరా భారతీయ భావం ఎద నిండా” అని రాశాను. దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ఆకాశవాణిని ఇప్పటికీ వదిలి పెట్టలేదు. ఆకాశవాణి కూడా ఎప్పుడూ నన్ను విస్మరించక అమ్మలా లాలించింది. దూరదర్శన్ తండ్రిలా పోషించింది. పత్రికలు మిత్రుల్లా ప్రోత్సహించాయి. సినిమా రంగం మాత్రమే అప్పుడప్పుడు అవకాశం ఇస్తూ, మధ్యలో చేయిస్తూ ప్రియురాలిలా ఊరించింది ( గలగల నవ్వేస్తూ ).
సినారె గారి లాగా పేరు తెచ్చుకోవాలనుకున్న మీ కోరికకు తొలి మెట్టు ఎక్కడ మొదలైంది?
1974 లో వేములవాడలో పెద్ద బహిరంగసభ జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు మొదలగు పెద్దలంతా వచ్చారు..వీళ్ళందరికీ పౌర సన్మానం జరిగింది. మరునాడు జరిగిన సాహిత్య సదస్సులో నా అంతర్మథనం కవితా సంపుటిని గురువు గారైన ఆచార్య సినారె గారికి, వాన మామలై వరదాచార్య గారి అధ్యక్షతన అంకితం ఈయడమైనది. ఆ తర్వాత నారాయణరెడ్డి గారు ‘వెన్నెలవాడ’ అని రాస్తే నేను ‘వెలుగుమేడ’ పేరుతో 9 గేయనాటికలు రచించి ఒక సంపుటిగా వేశాను. దాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వదలిచాను. సి. నారాయణ రెడ్డి గారే నాగేశ్వరరావు గారిని పరిచయం చేశారు. అప్పుడు “నాకెందుకు అంకితం?” అన్నారాయన. అందుకు సినారె గారు “కావ్యమంటే ఒక పుష్పం లాంటిది, తీసుకోండి” అన్నారు. ” పుష్పాలు ఆడవాళ్లకు , నాకెందుకు?” అన్నారు నాగేశ్వరరావు గారు. “మీరనేది జడలో పువ్వు. ఇది గుడిలో పువ్వు” అని నారాయణరెడ్డి గారు సమర్థించేసరికి నవ్వుతూ ఆమోదించి స్వీకరించారు.
ఆ తర్వాత నేను ఆయనను సినిమా పాటకు అవకాశం ఇవ్వమని అడగడం జరిగింది. ‘వసంతోదయం’ గేయ కథా కావ్యం రాసి భానుమతి గారిని కలిశాను. గంట తర్వాత అనుమతి లభించింది. “సారీ కవిగారు! బయట నిలబెట్టాను. ఏమనుకోవద్దు. నీ కావ్యాలు తిరగేసానయ్యా. అచ్చం దాశరథి, నారాయణరెడ్డి గార్లు రాసినటువంటి పదాలు పడుతున్నాయి. నువ్వు సినిమా పాటలు ఎందుకు రాయకూడదు?” అన్నారు. (మనం వెళ్ళింది అందుకే గానీ ఎగిరి గంతేయకుండా) మీరు అవకాశం ఇస్తే రాస్తానండీ. అన్నాను. అందుకు ఆమె “ఇలా ఏదో భావగీతం కాదయ్యా. నేను బాణీ వినిపిస్తాను రాస్తావా?” అన్నారు. అప్పుడు నేను” మీదంతా రాగ ప్రస్తారం. నాదంతా మాత్రా ప్రస్థానం. మీటర్ తెలిసిన వాణ్ణి కాబట్టి మ్యాటర్ ఏదైనా రాస్తాను” అన్నాను. మాటలు బాగా చెప్తున్నావు పాట ఎలా రాస్తావో చూస్తాను. అని ఆమె ట్యూన్ వినిపించింది. మొదటి సారి శరత్ బాబును హీరోగా పరిచయం చేసిన సినిమా అది. హీరో హీరోయిన్ ను ప్రేమిస్తాడు కానీ హీరోయిన్ సెకండ్ హీరోను ప్రేమిస్తుంది.అక్కడ హీరో భగ్న హృదయంతో పాడుకునే పాట. ” నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనుగా, నాలో కలతై మిగిలెనుగా/పల్లవి లేని పాటగ వలపే తాళం తప్పెనుగా, దేవీ రాగం మారెనుగా” అని రాసి చూపించాను. అందుకు ఆమె ఎంతో మెచ్చుకొని ఏ పదం కూడా తీయడానికి వీల్లేకుండా రాశావు. ఇక చరణాలు కూడా నీవే రాయమని అన్నారు. రికార్డింగుకు కూడా రమ్మన్నారు. టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఉద్యోగరీత్యా వెళ్లలేక పోయాను. నా బాధ చూసి మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నువ్వు యుడిసి ఎగ్జామ్ పాసయితే హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులో ఉండొచ్చు. అక్కడ సెలవు పెట్టుకోవడం ఇబ్బంది కాదు అన్నారు. అది పోటీ పరీక్ష కాబట్టి కష్టపడి చదివి యుడిసి పాసయ్యాను. భానుమతి గారిని కలిసి రాలేని కారణం చెప్పాను.అప్పుడు రికార్డు చేసిన నాపాట వినిపించారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు బాగా వచ్చింది. ఆ విధంగా భానుమతి గారితో నా సినీ ప్రస్థానం మొదలైంది.
సినిమా రంగంలో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలేవి? వాటి అనుభవాలు చెప్పండి.
భానుమతి గారి ‘రచయిత్రి’ సినిమా ద్వారా మొదటి అవకాశం వచ్చినా అది రెండు సంవత్సరాలు ఆలస్యంగా విడుదల అయింది. ఈ మధ్యలో మళ్లీ నాగేశ్వరరావు గారిని కలిశాను. సంగీత సాహిత్యాలు తెలిసిన భానుమతి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు నామీద నమ్మకం కుదిరింది. 1980లో ‘పిల్ల జమీందార్’ షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో సింగీతం శ్రీనివాసరావు గారికి నన్ను పరిచయం చేసి, భానుమతి గారికి రాశాడు. సత్తా ఉన్నవాడే. మనం కూడా అవకాశం ఇద్దాం అన్నాడు. ఆయన నన్ను మద్రాసుకు రమ్మన్నారు. వెళ్లి ఆయన చెప్పినట్లుగా మూడు డ్యూయెట్లు రాశాను. కానీ చక్రవర్తి గారు మాత్రం ట్యూన్ చేయడం లేదు.అప్పుడు శ్రీనివాసరావు గారు నన్ను అక్కినేని గారిని కలవమన్నారు. కలిసి విషయం చెప్పాను. ఆయన చక్రవర్తి గారిని మ్యూజిక్ కంపోజింగ్ కు పిలిచి ఒక మెలోడీ ట్యూన్ చేయమన్నారు. అప్పుడు ఆయన “ఇప్పటి ట్రెండ్ స్లో మెలోడీకి బాగుండదు” అన్నారు. దానికి అక్కినేని గారు నవ్వి మా ‘దొంగరాముడు’ చిత్రం మొదలిడి ఇప్పటివరకు మెలోడీయే కొనసాగుతోంది. కావున స్లో ట్యూన్ చేయండి అని ఒప్పించారు. “కృష్ణా! ఈ ట్యూన్ కి తగ్గట్టు పదాలు వేసి మెప్పించుకో” అన్నారు. రెండు జంటల డ్యూయెటది.”నీ చూపులోన విరజాజి వాన, ఆ వానలోన నేను తడిసేనా హాయిగా/ నీ నవ్వులోన రతనాల వాన, ఆ వానలోన మేను మరిచేనా తీయగా” అని రాసి సింగీతం గారికి చూపిస్తే ” పల్లవి బాగుంది.సన్నజాజుల మీద చాలా వచ్చాయి. విరజాజుల మీద రాలేదు కావున నచ్చింది. బాణీకి సరిపోయింది. అయితే అనుపల్లవిలో మారిపోవాలి. రతనాల వాన రావొద్దు మరి” అన్నారు.
అలాగేనని ” నీనవ్వులోన వడగళ్ల వాన, ఆ వానలోన నేను మునిగేనా తేలేనా” అని సవరించాను..నవ్వి వెంటనే చరణాలు కూడా రాయమన్నారు. కానీ ట్యూన్ కి రాయడం వల్ల తమిళ్ డబ్బింగ్ లాగా వస్తుందేమోనని నా భయం. అప్పుడు “ఆ వెన్నెలేమొ పరదాలు వేసె, నీ వన్నెలేమొ సరదాలు చేసె/ వయసేమొ పొంగింది, వలపేమొ రేగింది” అని చరణం అందించాను. చాలా బావుందని మెచ్చుకున్నారు. చక్రవర్తిగారు ఫిటింగ్ పెట్టారు, చరణాంతంలో కటింగ్ వస్తే బాగుంటుందని. దానికొక ట్యూన్ ఇచ్చారు. దానికి సరిపడేలా ” కనివిని ఎరుగని తలపులు చిగురించె” అంటూ ముగింపు పలికాను. నాగేశ్వరరావు గారు శ్రద్ధగా విని అది గొప్ప హిట్టవుతుంది అన్నారు. నిజంగానే అది ఆ సినిమాలోనే కాక ఆ ఇయర్ (1980) లోనే హిట్ సాంగ్ అయింది. ఎన్నో సంవత్సరాలు ఆ రంగంలో ఉన్న అనుభవం ఆయనది. మొదట్లో హీరోగా స్వయంగా ఆయనే పాటలు కూడా పాడారు. అందుకే ఆయన మాట పొల్లు పోలేదు. ఆ తర్వాత నాకు సినిమాలో డైరెక్షన్ చేయాలని ఆసక్తి కలిగింది. గిడుతూరి సూర్యం గారు అది “అమృత కలశం” చిత్రంలో గమనించి తనతో ఉండమన్నారు. నెలన్నర సెలవు పెట్టి ఉన్నాను. ఒక సన్నివేశానికి జావళి కావాలన్నారు. నేను రాస్తాను అన్నాను. “నీవు కాదయ్యా..సినారె గారు రాయాలి” అన్నారు. అప్పుడు సినారె గారు “నేను డ్యూయెట్ రాస్తాను జావళి మనవాడికిచ్చెయ్యి నేను చాలా రాశాను కదా!” అన్నారు. ఆయన సందేహిస్తూనే ఇచ్చారు. జావళి అంటే సంప్రదాయ శృంగార గీతం. కృష్ణుని పరంగా అన్యాపదేశంగా ఉండాలి. ఆనందింప చేయాలి. ” సిగ్గాయె సిగ్గాయెరా స్వామీ బుగ్గంత ఎరుపాయెరా” అంటూ పల్లవి రాసి, చరణం సాహిత్యపరంగా ఉండాలని “చిగురు పెదవుల లోన తగని కోరికలాయె/ నిండు జవ్వనమందు పండు వెన్నెలలాయె” అంటూ రాశాను. ఆయన చాలా ఆశ్చర్య పోయి “నిజంగా సినారె లాగే అద్భుతంగా రాశావు” అని ఎలాంటి మార్పులు లేకుండా రమేష్ నాయుడు గారి చేత ట్యూన్ చేయించారు. సుశీల గారు అద్భుతంగా పాడారు. ఆ తర్వాత పెళ్ళిల్లోయ్ పెళ్లిళ్లు, యుగకర్తలు, అందరూ అందరే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. ఎ. ఎమ్. రత్నం గారి మొట్టమొదటి డైరెక్షన్ లో వచ్చిన ‘పెద్దరికం’ సినిమా నాకు బాగా పేరు తెచ్చింది. పరుచూరి వెంకటేశ్వరరావు నాకు మిత్రుడు. ఆయనే ఎ. ఎమ్ రత్నం గారికి పరిచయం చేశాడు. ” ఈ సినిమా మలయాళ మాతృకగా వస్తున్నది. కానీ ఈ ట్యూన్ రాజ్ కోయి చేత విడిగా చేయించాను. తెలుగు నేటివిటీ ఉండాలి. భానుమతి గారి మనవరాలుకు ఎంగేజ్ మెంటు. ఆమె అంచనాకు తగిన లెవెల్ లో ఉండాలి. అట్లయితేనే రికార్డు చేస్తా. తర్వాత బాధ పడొద్దు” అన్నారాయన. ” ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే” అని రాశాను. ఆయనకి బాగా నచ్చింది. ఇదే ట్యూన్ కి వేటూరి గారు భువనచంద్ర గారు కూడా రాశారట. నాకు తెలియదు. వేటూరి గారు కూడా ” భలే రాశావయ్యా. నా పారితోషికం నాకు ముట్టిందిలే. గోఎ హెడ్” అన్నారు నవ్వుతూ..ఇప్పటికీ ఆ పెళ్లి పాట 30 సంవత్సరాలు గడిచినా పెళ్లి వేడుకల్లో మోగుతూనే ఉంది. అన్ని వెడ్డింగ్ ఆల్బమ్స్ లో చోటు చేసుకుంటోంది. గూగుల్ సర్వేలో కూడా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల పెళ్లి పాటల్లో టాప్ టెన్ లో ఉంది. ఆ తర్వాత ‘భైరవద్వీపం’ లో ” అంబా శాంభవి భద్ర రాజ గమనా” పాట రాశాను. దానికి సింగీతం గారే డైరెక్టర్. మాధవపెద్ది సురేశ్ మ్యూజిక్ డైరెక్టర్. సింగీతం గారు మంచి సంగీతజ్ఞుడు కూడా. అందువల్ల ఒక పట్టాన ఓకే చేయరు. ఓకే అయిన వాటిని కూడా మళ్లీ ఇంకొక ప్రయత్నం చేద్దాం అంటారు. అందువల్ల 4, 5 సార్లు మద్రాసుకు పోవలసి వచ్చింది. అయినా ఓపికతో వెళ్ళి సాధించుకున్నాను. విజయా వారి సంస్థ కదా.! ఇలా ఎన్నో అనుభవాలు సినీరంగంలో కలిగాయి.
మీ రచనలు, పురస్కారాల గురించి చెప్పండి.
మొట్టమొదటి సారిగా “కనరా నీ దేశం” అనే పేరుతో 1971 లో నా మొదటి గేయసంపుటి అచ్చయ్యింది. రెండవది ‘అంతర్మథనం’ అనే కవితా సంపుటి. దాన్ని సినారె గారికి అంకితం ఇచ్చాను. లలిత గీతాలు ఎన్నో రాశాను కాబట్టి “వడ్డేపల్లి గేయవల్లి” అని 1995 లో నా సాహిత్య రజతోత్సవానికి సంపుటి వేశాను. దానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి గేయ సాహిత్య పురస్కారం లభించింది. అంతకుముందే 1992 లో బాల సాహిత్య రచనల పోటీ పెట్టారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ‘చిరుగజ్జెలు’ అనే పేరుతో పిల్లల పాటలు వంద రాశాను. దానికీ అవార్డు వచ్చింది. అందులోని ఒక పాటను ‘బాల భారతి’ పూణె వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పాఠ్యాంశంగా పెట్టారు. “మీరు పద్యాలు గానీ పాటలు గానీ బాగా రాస్తే భవిష్యత్తులో పాఠంగా ఉంటాయన్న” మా గురువు గారి మాటలు గుర్తుకొచ్చాయి. “చెట్లే జగతికి పనిముట్లు/ చెట్లే ప్రగతికి తొలి మెట్లు/ అందుకె వాటిని పెంచాలి/ ఆనందాలను పంచాలి…..ప్రాణ వాయువందించేవి/ పరిసరాల రక్షించేవి/ చెట్లు చెట్లు చెట్లు/ ఆ దేవుని దీవెన లైనట్లు…దీన్ని లైబ్రరీ పుస్తకంలో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 40 కావ్యాల్ని, 60కి పైగా సంగీత నృత్య రూపకాలను రచించాను. 60 ఆడియో ఆల్బమ్స్, 15 వరకు డాక్యుమెంటరీలు, 96 టీవీ సీరియళ్ళ ధారావాహికలరచన, అందులో 30 కి దర్శకత్వం కూడా చేశాను. ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. మనం రాసుకున్న రచనల్ని మనం వేసుకోవడం స్వార్థం. పరమార్థం ఏదైనా చేయాలని అనిపించింది. కరోనా కాలంలో ఇంట్లో ఉన్నప్పుడు తెలంగాణా ప్రముఖ కవులు, కావ్యాలు అని చెప్పి పంపన నుండి 2000 సంవత్సరం వరకు వర్ధిల్లిన ప్రముఖ కవులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాహిత్య పరిచయమే కాకుండా ఆ రచనలు ఎలా రాసారో కూడా మచ్చుకు చూపుతూ పుస్తకం రచించాను. మామిడి హరికృష్ణ గారు చూసి ఇది గొప్ప రీసెర్చ్ వర్క్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ కరదీపికగా పనిచేస్తుందని వాళ్ళ డిపార్ట్మెంట్ పక్షాన వెలువరించారు. మూడు నెలల క్రితం దీన్ని మంత్రివర్యులు శ్రీనివాసగౌడ్ గారు ఆవిష్కరించారు. అది ఎంతో సంతృప్తిని కలిగించింది. ఎందుకంటే ఇలా అందరి గురించి ఎవరు రాస్తారు? పైగా నాకు ఈర్శ్యతో అన్యాయం చేసిన పెద్ద మనుషుల గురించి కూడా చాలా సవ్యంగా రాశాను. విమర్శకుడు ఎప్పుడూ సమ్యక్ దృష్టితో ఉండాలి కదా. రచన, కవిత్వం ఎలా వుందో చూడాలి కానీ మనవాడా, కాదా అన్నది ఉండొద్దు. 500 పేజీల పుస్తకం అది. రాయడానికి ఏడాదిన్నర పట్టింది నాకు. అయినా అది తొందరగా అయినట్టే. ఎందుకంటే క్రీ.శ. 941 నుండి 2000 సం. వరకు వర్ధిల్లిన ప్రముఖ కవుల జీవిత, సాహిత్య సమాచారాలు ఉన్నాయి దాంట్లో. అందులో చేర్చినవాళ్ళు 1975 లోపు జన్మించి వుండాలి. 2000 సం. వరకు వాళ్ళ రచన, కావ్యం ఏదైనా వచ్చి ఉండాలి. దానికి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, ఎస్వీ రామారావు గారి తెలంగాణ సాహిత్య చరిత్ర, ఇంకా కొన్ని సాహిత్య చరిత్రలు తిరగేసి, ఆధునికులవి దొరకవు కాబట్టి ఫోన్లు చేసి, బయోడేటాలు, రచనలు సేకరించి చేశాను. ఎస్వీ రామారావు గారు కూడా ” ఇది పెద్ద రీసెర్చ్ వర్క్. పిహెచ్ డి చేయవచ్చు. ఒంటి చేత్తో చేశావని” ప్రశంసించారు.
ఆటా,తానా వంటి సభల్లో, మనదేశంలో మీ సంగీత నృత్య రూపకాలు ప్రదర్శించబడినప్పుడు వచ్చిన ప్రతిస్పందన ఎటువంటిది?
నేను లలితగీతాలు, సినిమా పాటలు రాస్తూనే మధ్యలో రూపకాలు రాశాను. “జయజయహే తెలంగాణ” రూపకం చాలా పేరు తెచ్చింది. అంతకు ముందు ‘ఆటా, తానా’ వీటికి స్వాగత గీతాలు రాశాను. 60కి పైగా సంగీత నృత్య రూపకాలు రాశాను. వాటన్నింటినీ పుస్తకాలుగా కూడా వేశాను. 2004 లో ‘ఆటా’ వాళ్ళకు స్వాగతగీతం రాయాలంటే సరే అయిదు నిమిషాల పాట అనుకున్నాను. కాదు… సంగీత నృత్య రూపకమది. వాళ్ళ ఆవిర్భావం, ప్రగతి, ప్రస్థానం, వాళ్ళ లక్ష్యాలు అన్నీ రావాలి. అందులో ఒక హరికథ, ఒక బుర్రకథ ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన తెలుగుదనం ఉట్టిపడే సమాహారంలా ఉండాలి. అలాగే రాశాను. బాగా వచ్చిందన్నారు. ప్రదర్శన చికాగోలో జరిగింది. ఆహ్వానించి టికెట్టు ఇచ్చారు. నారాయణరెడ్డి గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు వీళ్లంతా ముందు వరుసలో కూర్చున్నారు. నా స్వాగత గీతం తోనే ఆ ప్రపంచ తెలుగు మహాసభల వేడుక ప్రారంభం అయింది. స్టేజీ మీద 70 మంది నాట్య కళాకారులతో ప్రదర్శన జరిగింది. నన్ను పిలిచి దాసరి నారాయణరావు గారు ‘నువ్వే రాశావా’ అన్నారు. “ఇంకెవరు రాస్తారు నేను కాక?” అన్నాను. మళ్లీ ప్రదర్శన వేయించమని చెప్పి చూసి, అక్కడ నాకు ‘లలితశ్రీ’ బిరుదునిచ్చారు. హేమా హేమీలందరు ఉండగా ఇలా జరగడం గొప్ప అనుభూతి. 2014 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు “జయజయహే తెలంగాణ” రూపకాన్ని రూపొందించాను. అసలు 60 ఏళ్ళుగా ఏం జరిగింది? తెలంగాణా సంఘర్షణ, సాధన అన్నది ప్రధానంగా మలిచాను. కొమురం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కాళోజీ, దాశరథి వీళ్లంతా ఎట్లా పాటుపడ్డారు? నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకాల్ని , కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను, గద్దర్ పాట “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా!” ఇలా ఆయన కూడా ఎలా ప్రేరేపితులను చేశాడో ఇవన్నీ కలగలిపి ఒక సమాహారంగా చేశాను. అప్పుడు స్పీకర్ మధుసూధనాచారి గారు, స్వామి గౌడ్ గారు, మండలి ఛైర్మన్ గారు వాళ్ళు చూసి, ” మేము అన్నిచోట్ల ఎన్నో విషయాలు చెప్తున్నాం. కానీ కరెక్టుగా ఇప్పుడు మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు” అని ప్రశంసించారు. ఇది అన్ని జిల్లాల్లో ప్రదర్శించాలని కూడా వాళ్ళు ఆదేశించారు. పది జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శింప చేశారు. ఇది ఒక అపూర్వ సంఘటన. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫేర్ లో కూడా వేశాము. తర్వాత “విత్తనాల విలువ” అని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కు కూడా రాయడం జరిగింది. అలాగే ‘భారత రత్న’ అంబేద్కర్, మహాత్మా పూలే, భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ జీవితాలను కూడా డాన్స్ బేస్ డ్ రూపకలుగా రచించాను.
ఈ రూపకాలన్నిటికీ పూర్తిస్థాయిలో బాధ్యత మీరే వహించేవారా?
అవును. రాయడం, దానిని రూపొందించడం అంతా నేనే. ప్రదర్శింప చేయడం అంటే కోట్ల హనుమంతరావు అనే ఆయన డ్రామాకు, కొరియోగ్రాఫర్ గా ఆయన భార్య అనితారావు ఇద్దరూ చేశారు. “జయ జయహే తెలంగాణ” మొత్తం సత్కళా భారతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో వాళ్లే చేశారు. “భారతరత్న అంబేద్కర్” కూడా వాళ్ళకే ఇచ్చాను. తర్వాత “రమణీయ రామప్ప” వసుమతీ వర్కాల అనే ఆమెతో చేయించాను. అద్భుతంగా వచ్చింది అది. మేము ప్రదర్శించిన రెండేళ్లకు దానికి గ్లోబల్ రికగ్నీషన్ వచ్చింది. అంతకుముందే ‘ఆమ్రపాలి’ ని మద్దాలి ఉషా గాయత్రి చేసింది. “తెలంగాణ తేజాల అభినయం” అని వనజా ఉదయ్ చేసింది. దీపికారెడ్డి గారేమో “తెలంగాణ వైభవం” చేసింది. ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్రపతి వచ్చేముందు దాన్ని ప్రదర్శింప చేశారు. తర్వాత ఆటా, నాటా, టాటా మొదలగు వాటికి ఎన్నోసార్లు స్వాగత గీతాలు రాశాను. మొన్న మొన్న కూడా ‘నాట్స్’ న్యూజెర్సీలో జరిగినప్పుడు కూడా స్వాగతగీతం రాయడం జరిగింది. కానీ వెళ్ళడం కుదరలేదు. సినిమాలకు అనేక అవకాశాలు రాలేదని ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఏది అవకాశం వస్తే అది రాస్తూనే వున్నాను.
కరీంనగర్ లో ఉన్న క్షేత్రాలపైన చేసిన ఆడియో సీడీ వివరాలు చెప్పండి. ఆడియో రికార్డులు చేయాలి అనుకున్నది మీ ఆసక్తితోనేనా?
అవును. మీరు బాగానే గుర్తుచేశారు. నేను పోస్టల్ ఇన్సూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఆంధ్ర దేశమంతటా తిరిగాను. ప్రతీ జిల్లాకు వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వెళ్లి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ఎన్ లైటెన్ చేసి, ఎన్ రోల్ చేసేవాడిని. అయితే ఆంధ్రప్రాంతంలో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా క్యాసెట్లు మారుమోగుతుండేవి. వేములవాడ మా సిరిసిల్ల దగ్గరే కదా! శ్రీశైలం తర్వాత మన ప్రాంతంలో ద్వితీయ స్థానం ఉన్న దేవాలయమిది. దానికి ఒక్కరికార్డ్ కూడా లేకపోవడం గమనించి ఈవోను అడిగాను. ఎవరూ చేయలేదన్నాడు. సరేనని నేను పూనుకొని (1991)”కరీంనగర్ క్షేత్రాలు” పేరుతో బాల సుబ్రహ్మణ్యం గారు, వాణీ జయరాం గారి చేత పాడించి క్యాసెట్ చేయించాను. వాళ్ళు పాడడం అంటే చాలా గ్రేట్ ఆరోజుల్లో. ”
కైలాస నిజనివాస ఓ మహేశ్వరా/ వేములవాడ ప్రవాసా రాజేశ్వరా/ బూడిద ధరియిస్తావు, భుక్తి ప్రసాదిస్తావు….అంటూ బాలుగారి గాత్రంలో పాట సాగుతుంది. ఎ.ఎ.రాజ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. వాణీ జయరాం గారితో మేలుకొలుపు పాట పాడించారు. ఆ రోజుల్లోనే లక్ష క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఫేస్ బుక్ మాధ్యమంగా విదేశాల నుండి ఆ పాట ఉంటే పంపండి అని నన్ను అడుగుతుంటారు. వెబ్ సైట్ లో పెట్టాను కొన్ని. కైలాస నిజావాసా అనే పాట సినిమా పాట కంటే పాపులర్ అయింది. నేను రాసిన భక్తి గీతాల సంకలనం ఒకటి వేయాలనుకుంటున్నాను. బాల మురళీకృష్ణ గారు కూడా నా పాటలు పాడారు. ఒకసారి “శివ శివ నామం జపియించు/ భయ భవ బంధం తొలగించు.” అనే పల్లవి. ఆయన “భవ భయ బంధం” అని పాడారు. అలా కాదని సరి చేశాను. అప్పుడాయన అంత గొప్పవాడు అయి ఉండి కూడా “అందుకే మిమ్మల్ని ఉండమన్నది. మేమెంత స్వర కర్తలం అయినా సాహిత్యం రాసేవాళ్ళు ఉండాలి” అన్నారు. అది ఎంతో అనుభూతిని ఇచ్చింది.
‘నరకాసుర’ అనే సినిమా వస్తోంది. దానిలో శివుని మీద మూడు పాటలు రాశాను. అప్పుడు వాళ్ళు ” మీరు చాలా బాగా రాశారు. పేరున్న వాళ్ళను కూడా అడిగాము. కానీ సరిగా రాయలేకపోయారు” అని అన్నారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే సరిగ్గా పదాలు పడాలి అంటే ఆస్తికత్వం ఉండాలి. భక్తి, అనురక్తి ఉండాలి. అలాగే శబ్ద శక్తి కూడా ఉండాలి. పురాణాల అవగాహన ఉండాలి. అప్పుడే అది అనుకున్న విధంగా వస్తుంది. సాయిబాబా జీవిత చరిత్రను, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆడియో రికార్డు చేసి ఇంట్లోనే వింటూ చేసుకునేలాగా రూపొందించాను.
ఒక జాతీయ కవిగా మీరు గుర్తింపు పొందిన అనుభవాలేవి?
ఈ రోజు అందరూ “నేను జాతీయ కవిని” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. నేను 1975 లోనే జాతీయ కవినయ్యాను. ఎలాగంటే ఆకాశవాణి వాళ్ళు నన్ను “మీరు లలితగీతాలు అనేకం రాశారు “జాతీయ బాలల సామూహిక గానం కోసం ఒక పాట రాసి ఇవ్వండి. ఢిల్లీకి పంపుతాము. అది సెలెక్ట్ అయితే జాతీయకవి అవార్డు వస్తుంది.” అని అన్నారు. “జాతీయకవి అంటున్నారు మరి నాకంటే చాలామంది పెద్దవాళ్ళు వున్నారు కదా! వాళ్ళను అడగండి” అన్నాను. “అందరివీ పంపించాము. కానీ అవేవీ సెలెక్ట్ కాలేదు. మీరూ ఒక ప్రయత్నం చేయండి” అన్నారు.”భలేవాళ్లే! వారివే సెలెక్ట్ అవలేదంటే నేను రాస్తే ఏమవుతుంది?” అన్నాను. అప్పుడు కొట్రా మల్లికార్జునశర్మ గారు “మీ ప్రయత్నం మీరు చేయండి” అన్నారు. సరేనని రాసిచ్చాను. ” మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే జన జాగృతి కావాలి.” అని ఇచ్చాను ముందు. బాలల గీతం కాబట్టి జనజాగృతి కష్టమవుతుందేమో అన్నారు. అప్పుడు “మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే మంచిరోజు రావాలి” అని మార్చి, బిందువు బిందువును చేరి సింధువుగా పారునుగా/ సింధువు సింధువు చేరి సంద్రముగా మారునుగా/ మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందునుగా/ మాలను మలిచేందుకు ఒక దారమె ఆధారముగా/ అని రాసి, ఇచ్చాను. అదే సెలెక్ట్ అయింది. కావున అది సెప్టెంబర్ (1995 ) నెలంతా ఆలిండియా రేడియోలో అన్ని భాషల అనువాదాలతో తెలుగు పాట మారుమోగింది. థ్రిల్లింగ్ ఫీలయ్యాను. కానీ అది నేను రికార్డ్ చేసి పెట్టుకోలేదు. అనువదించబడిన ఇతర రాష్ట్ర భాషల పాటలను కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటే బాగుండేది. నేను రాసింది మాతృక కదా వీటికి. అంతకు ముందు ఎన్నో పాటలు రేడియోలో వచ్చాయి కదా! దీన్ని అంతగా పట్టించుకోలేదు. అందరూ ఆ గొప్పతనాన్ని పొగుడుతూ జాతీయ కవిగా ప్రశంసలు కురిపించారు. చిత్తరంజన్ గారు పాడిన తెలుగు పాటతో పాటు మిగతా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పాట ప్రసారమవుతుండేది. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో ఉభయ రాష్ట్రాల్లో నా కవిత సెలెక్టు అయింది. అలా కూడా జాతీయ కవినయ్యాను. అందరూ అంటుంటారు. “అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లోనే మీ పాటలు ప్రచారం అవుతుంటే ఎప్పుడో అంతర్జాతీయ కవి అయ్యారని.”నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.
తెలంగాణ మాండలిక భాషలో వెలువడిన మీ రచనలేవి?
తెలంగాణ భాషలో 1976 లోనే ‘వెలుగొచ్చింది’ అనే నాటిక రచన చేసి, దర్శకత్వం వహించి, ఎవరైనా పాత్రధారి రాకపోతే ఆ పాత్ర కూడా పోషించాను. అవార్డులు కూడా వచ్చాయి దానికి. అప్పటికి ఒక లోకువ తెలంగాణా భాష, యాసల్లో రాయడం. కానీ ఆ ప్రయత్నం, సాహసం అప్పుడే చేశాను నేను. ఇప్పుడు తెలంగాణా యాసలో రాస్తే గొప్ప. 10 నాటకాలు రాశాను. వెలుగొచ్చింది, భాగ్యనగర్, ఉద్యోగపర్వం, ముందుచూపు, అతిథి, అడ్డుతెరలు, చదువు బాట, మంచు తెరలు.. ఇలా అన్నింటినీ కలిపి “రంగ తరంగాలు” పేరుతో సంకలనం చేశాను. 2017 లో ప్రపంచ తెలుగు మహా సభలప్పుడు రమణాచారి గారు.. (జయ జయహే తెలంగాణకు కూడా ఆయనే ప్రేరణ) విదేశాల నుండి ఎంతో మంది వస్తారు కాబట్టి హైదరాబాద్ చరిత్ర గురించి తెలియడానికి రాయమంటే ‘భాగ్యనగర్’ రాశాను. భాగమతి, కులీ కుతుబ్షాల ప్రణయ నేపథ్యంతో పురానాపూల్ ఎలా ఏర్పడింది? చార్మినార్ ఎందుకు ఏర్పడింది? కందుకూరి రుద్రకవి మొదటి యక్ష గానాన్ని ( సుగ్రీవ విజయం ) మల్కిభ రామునికి వినిపించడం ఇవన్నీ వచ్చేలాగా చారిత్రకంగా రచించగా ‘సత్కళా భారతి’ ఆధ్వర్యంలో గొప్పగా ప్రదర్శించారు. అది సినిమాటిక్ గా అద్భుతంగా ఉందని ఎల్. బి శ్రీరామ్, గుమ్మడి గోపాలకృష్ణ వీళ్లంతా ప్రశంసించారు. ‘రస రంజని’ రజతోత్సవాల్లో కూడా దాన్ని ప్రదర్శించారు. ఇటీవలే నేను 75 ఏళ్ళ అమృతోత్సవంలో అడుగుపెట్టాక దాన్ని పుస్తకంగా “భాగ్యనగర్ – వెలుగొచ్చింది” అని వేశాను. వెలుగొచ్చింది నాటికను పాత్రలు, అంకాలు పెంచి నాటకంగా మలిచాను. మొన్నటి జూలైలో ఆవిష్కరణ జరిగింది. నారాయణ రెడ్డి గారు జూలై 29 న పుడితే నేను జూలై 30న పుట్టాను. సినారె గారు “నన్ను జన్మతః అనుసరిస్తున్నాడు” అనేవారు. ఆయన కూడా తన పుట్టినరోజున పుస్తకాన్ని ఆవిష్కరించుకునే వారు. అలానే నేను కూడా అట్టహాసం లేకుండా నా పుట్టినరోజు న పుస్తకం వేసుకున్నాను. “తెలంగాణ సంస్కృతి- బతుకమ్మ ఆకృతి” అని డాక్యుమెంటరీ చేసాను. అలానే మా సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి “నేతన్నల ఆత్మహత్యలు” పేరుతో అంటే ఆత్మహత్యలు కాదు ఆత్మస్థైర్యం పెంచుకోవాలని వాళ్లకు ప్రబోధకంగా డాక్యుమెంటరీ చేశాను. బొమ్మలమ్మ గుట్ట మీద తొలి కంద పద్యాలు నన్నయ్యకు 100 ఏళ్ళ ముందే తొంగి చూశాయని దానిమీద డాక్యుమెంటరీ చేసి ఆ కంద పద్యాలను ప్రొఫెషనల్ సింగర్స్ తో పాడించాను. అలా సాహిత్య పరంగా చేతనైనంత రాస్తూ దాన్ని పాటిస్తూ వచ్చాను.
పాటలు రాయడమే కాకుండా సినిమా, టీవీ సీరియల్స్ కు కూడా దర్శకత్వం చేశారు. ఏమైనా కష్టంగా అనిపించిందా? ఆ వివరాలు కూడా కొన్నింటిని చెప్పండి.
మొదట్లో మా హెడ్మాస్టర్ “మీరు స్కూల్ డే కి నాటకాలు వేయాలని, వేయకపోతే హాల్ టికెట్ ఇవ్వనన్నా”రు. ఆ ప్రేరణ తర్వాతి నా రచనలకు, నాటకాలకు, సినిమాలకు, టీవీ సీరియళ్లకు పునాది అయింది. ఇంతకుముందు చెప్పాను కదా. 30 సీరియల్స్ కి దర్శకత్వం వహించానని. సినిమాలు, టీవీలలో కట్ చేసి టేకులు తీసుకోవచ్చు. నాటకాలు అలా కావు కదా! ప్రత్యక్షంగా ఉంటాయి కాబట్టి పోర్షన్ మరిచిపోతే వెనకనుండి అందించేవాళ్ళం. జనం ముందు అభాసుపాలు కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు టెక్నికల్ డెవలప్ మెంట్ చాలా పెరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవీ లేవు. నేను “ఎక్కడికెళ్తుందో మనసు” ప్రేమకే తెలుసు అనే టాగ్ లైన్ తో సినిమాకు దర్శకత్వం వహించాను. అలాగే “లావణ్య విత్ లవ్ బాయ్స్” అనే సినిమా….అయితే ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిన విషయం చెప్తాను. “ఎక్కడికెళ్తుందో మనసు” సినిమాలో ఒక మంచి తెలుగు పాట ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాము. సన్నివేశంలో హీరో చికాగో నుండి స్వంత ఊరికి వస్తాడు. తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవంలో సర్పంచ్ తో (అక్కిరాజు సుందర రామకృష్ణ గారు) “తెలుగు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా శంకరం బాడి సుందరాచారి తర్వాత అలా తెలుగు పాట రాసి, పాడి మెప్పించేవాళ్ళు లేరా?” అనే డైలాగ్ పెట్టించాను. అప్పుడు హీరో లేచి నేనున్నాను అని పాడుతున్నట్లు పాట పెట్టాను. ” తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు/ రాజహంసల కులుకు తళుకు నా తెలుగు/ అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు/ అమృత ధారల కురియు అమ్మ నా తెలుగు/ ఆ తెలుగు తల్లికి అభివందనం/ అనురాగవల్లికి శ్రీచందనం- అని రాశాను. మిగతా రెండు చరణాల్లో ఒకటి సాహిత్యం, మరొకటి సంస్కృతి ఉండేలా రాశాను. ఆ పాట చూసి బాల సుబ్రహ్మణ్యం గారు ” ఎంత బాగా రాశారు? అప్పుడెప్పుడో ‘అమెరికా అమ్మాయి’ లో దేవులపల్లి, తర్వాత ఇన్నేళ్ళకు వడ్డేపల్లి ఇంత మంచి పాట రాశారు. ఇది పాడగలగడం నా అదృష్టం” అన్నారు. అలా జీవితంలో ఎన్నెన్నో మరువలేని అనుభూతులు మిగిలాయి.
వివిధ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతలుగా, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు కదా! మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి?
నేను సెన్సార్ బోర్డు మెంబరుగా మూడుసార్లు చేశాను. అప్పట్లో తెలంగాణ భాషను రౌడీలకు, గూండాలకు, హాస్య పాత్రలకు పెట్టేవాళ్ళు. దీన్ని నేను అడ్డుకునేవాడిని. కట్స్ పెట్టేవాడిని. మీరు తెలంగాణ వారయి ఉండి దీనిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అనేవాళ్ళు. తెలంగాణా వాడిని కాబట్టే కట్స్ పెడుతున్నాను. ఇదే భాషను హీరో, హీరోయిన్లకు పెట్టండి ఆదరిస్తాను. పరోక్షంగా మా భాషను అవమానిస్తుంటే ఎలా ఊరుకుంటాను అనేవాడిని.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా చేశాను (2003). 2006, 2009 లో నంది అవార్డుల కమిటీ చైర్మన్ గా చేశాను. సాధారణంగా ఒకసారి చేశాక మళ్ళీ ఇవ్వరు. కానీ రెండవసారి కూడా ఇచ్చారు. “అదేంటీ? ఎవరైనా అభ్యంతర పెడతారు” అంటే “ఎవరూ సరిగా చూడరు. మీరు న్యాయంగా, నిష్పక్షపాతంగా అన్నీ చూస్తారు. అందుకే మీరే చేయండి” అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నాను. చాలా కార్యక్రమాలకు, సీరియల్స్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. అంతకు ముందు ఒకే దానికి అవార్డులు వచ్చేవి. దానికి నేను బ్రేక్ వేశాను. ఒకదానిలో ఒక అంశానికి ప్రాధాన్యత నిస్తే మరో దానిలో ఇంకో ప్రత్యేక అంశానికి, అలా తీసుకొని కేటగిరీలుగా విభజించుకుంటూ ఇచ్చాము. కొందరు నొచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియారిటీ, శిఖర స్థాయిలో ఉన్న వాళ్లకు కాకుండా కొత్తగా వచ్చిన ప్రతిభావంతులకు ఇచ్చాము. పేరున్న వాళ్ళు అంతకుముందు ఎన్నో అవార్డులు పొంది వుంటారు కదా..వారికి ఇంకొకటి ఇవ్వడం లెక్క కాదు. అందుకే కొత్తవారికి ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రతిభకు పట్టం కట్టాము. దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. కానీ చలించలేదు. నిష్పక్షపాత వైఖరి నా అభిమతం.
ఇంతటి సాహితీ సేవ చేస్తున్న మీకు ‘ఇంకా ఇది జరగలేదు’ అన్న అసంతృప్తి ఏదైనా మిగిలివుందా?
ఇన్ని రచనలు చేసినా, ఎంత బాగా రాసినా, ఎన్ని ప్రశంసలు పొందినా, ఎన్ని పురస్కారాలు, సన్మాన, సత్కారాలు పొందినా నా రచనలు కేంద్ర సాహిత్య అకాడెమీ వరకు ఎందుకు వెళ్లడం లేదు? అని ఒక లోటు అనిపిస్తుంది. కొంతమంది 2, 3 రచనల్లోనే సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహిస్తున్నారు. 1992 లో రాష్ట్ర స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన బాలల కోసం నిర్వహించిన రచనల పోటీలో నేను రచించిన ‘చిరుగజ్జెలు’ గేయ సంపుటికి అవార్డు వచ్చింది. ఇటీవల కూడా 2020లో ‘బాల రసాలం’ అనే బాల గేయ సంపుటిని వెలువరించాను. అంతేకాక “రాగ రామాయణం” అనేది నేను పిల్లల కోసం చేసిన రచన. వారికి ప్రబోధకంగా, కర్తవ్య సుబోధకంగా ఉండేలా, మాతా పితరుల భక్తి, గురుభక్తి పెంచేలా ( ఈ రోజు పిల్లల్లో అదే లోపించింది కదా) చేయాలంటే రామాయణమే సరియైనదని భావించి వాల్మీకి రామాయణాన్ని 100 పేజీల్లో లవకుశుల్లా పాడుకునేలా రాశాను. దానికి తెలంగాణా సారస్వత పరిషత్తు అవార్డు కూడా వచ్చింది. ఆడియో కూడా చేయించాను. రామాయణ చరితమంత రమ్య రాగ భరితం/ త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం/ ఇది పల్లవి.. రామ రామాయన్న రాగాలు ఉదయించు/ రామ రామాయన్న రోమాలు పులకించు/ వ్యాధుని వాల్మీకిగ మార్చిన తారక మంత్రం/ శోకము శ్లోకమ్ముగ తీర్చిన అద్భుత మంత్రం…ఒక హైస్కూలు స్థాయి పిల్లలకి అర్థమయ్యేలాగా రాశాను. దానివల్ల మన సంస్కారం, మన సంస్కృతి గురించి తెలుస్తుంది. బాల సుబ్రహ్మణ్యం గారు దీనికి ముందు మాట రాస్తూ ” ఇంతటి అద్భుతమైన రచనాశక్తి, ప్రతిభ, వ్యుత్పత్తి ఉండి మీకు తగిన పేరు ఇంకా ఎందుకు రాలేదోనని వేదనగా ఉంది నాకు” అని రాశారు. అంతా రాజకీయమే. ప్రతీ దానికి లాబీయింగ్ చేసి సాధించుకోవడం అలవాటైపోయింది. అది నచ్చకనే జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాను. పల్లకీలు మోయడానికి కొంతమంది శిష్యులు వుంటారు. నాకు ఆ అవకాశం లేదు. పల్లకి పల్లకి గానే ఉండిపోవాలి ఎప్పుడూ. పోతన ఇప్పుడు లేకపోయినా ప్రతీ పద్యాన్ని కళ్లకద్దుకుంటున్నాము. అలా ఉండాలని నా సంకల్పం. దాశరథి గారు రాసిన “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అనే గీతానికి అప్పట్లో పేరు రాలేదు. ఇప్పుడు దాన్ని క్యాలెండర్ లో ముద్రించారు. ప్రతీ దాంట్లో చెప్తున్నారు. ఆయన రాసిన “నీలో దీపం వెలిగించు/ నీవే వెలుగై వ్యాపించు” అన్నదానికి ఎక్కువ పేరు వచ్చింది. దూరదర్శన్ లో కూడా గేయనాటికలు మొట్టమొదట నావే ప్రసారం అయ్యాయి. ఏదైనా రచన బాగుంటేనే కాల గర్భంలో కలిసి పోకుండా నిలిచిపోతుంది. ఆ తర్వాత శాశ్వతంగా ప్రకాశిస్తుంది. అన్నదే నా విశ్వాసం.
ధన్యవాదాలు సార్…విశేష సాహితీ మూర్తులైన మీరు మాకోసం మీ సమయాన్ని వెచ్చించడం మా అదృష్టంగా భావిస్తూ మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు..
-పాములపర్తి వేంకట మనోహరరావు
ధార్మిక జీవనులు, పరోపకార పరాయణులు, ఆధ్యాత్మిక చింతనా పరులు అయినటువంటి శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావు గారితో మయూఖ ముఖాముఖి…
పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్…
అని భర్తృహరి చెప్పినట్లు కొంతమంది తమ జీవితాలను ఇతరులకు ఉపకరించడానికే అన్నట్లు గడుపుతూ పరుల సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ప్రథమ గణ్యతలో లిఖించదగినవారు అయిన శ్రీ పాములపర్తి వేంకట మనోహరరావు గారి జీవితాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్.. మిమ్మల్ని మా పాఠకులకు పరిచయం చేయడం నిజంగా మా అదృష్టం. మీ ద్వారా మీ జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తితో మీ ముందుకు వచ్చాము.

మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ బాల్యం గడిచిన విధానాన్ని గురించి చెప్పండి.
నమస్కారం అమ్మా! నేను నవంబర్ 18, 1935 వ సంవత్సరంలో పూర్వపు కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించాను. అది ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. మా అమ్మగారి పేరు రుక్మిణి, మా నాయన గారు పాములపర్తి సీతారామారావు గారు. మా గ్రామం విఖ్యాతమైనటువంటి గ్రామం. ఎందుకంటే మా అన్నయ్యగారు ప్రధానమంత్రి అయినారు కాబట్టి దేశ విదేశాల్లో ఆ ఊరు ప్రసిద్ధమైంది. మా బాల్యంలో పరిశుభ్రమైన వాతావరణం, ఆహారం, చేదబావుల్లోని మంచినీరు, మా చేలో పండించిన కూరగాయలు, పప్పు దినుసులు, గానుగ ఆడించిన నూనెలు, ఈతలు, పలురకాల ఆటలు..వీటితో పెరిగాము కాబట్టి ఇప్పటికీ దృఢంగా ఉన్నాం. ఒక ప్రత్యేకమైన ఆట ఉండేది. గుండు, గొనే అనేది. జామపండంత చెక్కబంతి(గుండు) రెండడుగుల పొడవుతో, చేతి కర్రంత కర్ర(గోనె) తో దృష్టి మరల్చకుండా కొడితే 100 అడుగులు పైబడి (నేటి క్రికెట్) పోయిపడేది. గుండు వేసినవారు దమ్ము ఆపకుండా రాం, రాం లాంటి కూతతో ఆ బంతిని పట్టుకోవాలి. ఇవికాక రకరకాల ఆటలు గ్రామ మైదానాల్లో ఆడినాము. ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశమేది? మా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడిని కాబట్టి బాల్యంలో నేను చేసిన తుంటరి పనులు ఎవరూ చేయలేదని మా అన్నలు, అక్కయ్య నిన్న, మొన్నటివరకు గుర్తుచేసేవారు (నవ్వుతూ).
మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందో తెలపండి.
మా ఊళ్ళో విద్యాభ్యాసానికి సరయిన బడులు లేకుండెను. వెంకయ్య పంతులని సాతాని పంతులు వుండెను. ఆయన దగ్గర మేము అ, ఆలు చదువుకున్నాము. ఆ రోజుల్లో చదువుకోవాలని ఎవరికుండె? అందుకని నాటి సర్కారు పట్టించుకోలేదు? ఆ తర్వాత నరహరి పంతులు అనే ఆయన దగ్గర క, ఖ ల గుణితాలు, పాత లెక్కలు, పాత కొలతలు ఇవన్నీ నేర్చుకున్నా. మా ఊరుకు 10 మైళ్ళ దూరంలో వేలేరులో శ్రీధర రావు గారికి (వరంగల్ జిల్లా) మా అక్క నిచ్చినం. ఆమెకు నాకన్నా 17 సంవత్సరాలు పెద్ద. ఆమె వివాహం, మా అన్నయ్య వివాహం కూడా నాకు తెలియదు. మా ఊళ్ళో చదువు తర్వాత మా అన్నయ్య గారు, నేను కూడా అక్కడే చదువుకున్నాం. వేలేరులో నాల్గవ తరగతి వరకు చదివి ఆ తర్వాత అన్నయ్య హనుమకొండలో 10 వ తరగతి వరకు చదువుకొని పై చదువు కోసం నాగ్ పూర్ వెళ్ళాడు. నేను కూడా మూడవ తరగతి వరకు అక్కడ చదువుకొని, హుజురాబాద్ పోవలసి వచ్చింది. ఆ తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక హనుమకొండలో 2,3 నెలలు చికిత్సకై ఉండవలసి వచ్చింది. నా చదువు ఆగిపోయింది. మళ్ళీ వంగరకు వచ్చేటప్పటికి అదే సంవత్సరం నాల్గవతరగతి గవర్నమెంటుది వచ్చింది. వంగరలో 4వ తరగతి పూర్తి చేసి మళ్లీ 5వ తరగతి కోసం హుజురాబాద్ వెళ్ళాను. 1947 లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ సమయంలోనే (1948 ) నిజాం గవర్నమెంట్ ఇండియన్ యూనియన్ లో కలవక పోయినందున గొడవలు మొదలైనాయి. ఇంకా నా పరీక్షలు కాకముందే ఉధృతంగా అల్లరులు జరిగినాయి. అప్పుడు అన్నయ్య కాంగ్రెస్ లో పనిచేస్తుండెను. వందేమాతరంలో పార్టిసిపేట్ చేసినాడు. కాంగ్రెస్ నాయకులంతా కాందిశీకులుగా వేరే చోటుకి పోవల్సిన పరిస్థితి దాపురించింది (అటు చాందా, బలార్ షా, షోలాపూర్ మహారాష్ట్ర ప్రాంతాలు, ఇటు విజయవాడ, కర్నూలు).ఇక్కడ పగటిపూట రజాకార్లు, రాత్రిపూట కమ్యూనిస్టులు. ఇవి రెండూ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. అప్పుడు అన్నయ్య ఇక్కడ మా కుటుంబంలో ఎవరు ఉన్నా అన్నయ్య గురించి అడుగుతారని, బాధిస్తారని మా నాల్గు ఫ్యామిలీలను చాందాకు తీసుకుపోయినారు. అక్కడ 7 మాసాలు నానా ఇబ్బందీ పడ్డాం. చాందాలో ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాను. కాందిశీకుల జీవితం ఎట్లుంటదో తెల్సుకదమ్మా! పోలీసు యాక్షన్ అయిపోయిన తర్వాత ఊరికి చేరినాము.
ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీ చదువును ఎలా కొనసాగించగలిగారు?
మేము ఊరికి వచ్చి రెండు, మూడు నెలలు సెటిల్ అయింతర్వాత అన్నయ్య, నేను వరంగల్ కు పోయి పాములపర్తి సదాశివరావు గారి ఇంట్లో ఉన్నాం. ఆయన అన్నయ్య క్లాస్ మేట్. మాకు కొంచెం దూరపు బంధువు కూడా. అక్కడ మెహబూబియా స్కూల్లో ఆయన టీచరుగా కూడా ఉండేవాడు. అక్కడ నేను 6,7 తరగతులు చదువుకున్నాను. మళ్లీ ఆ తర్వాత హుజురాబాద్ కు పోయినాను. అక్కడ ఉంటే బియ్యమో, పప్పో మా ఊరినుండి తీసుకుపోవచ్చు. 3వ తరగతి నుండే వంట వండుకోవడం అలవాటు అయింది మాకు. ఇక అక్కణ్ణే 8,9,10 తరగతులు చదువుకున్నాను. దోమకొండలో జనతా కాలేజి అనే పేరుతో కళాశాల నడిపారు(బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) 3,4 నెలలు అక్కడ ఉన్నాను. దాంట్లో మొత్తం కమ్యూనిటీ లైఫ్ ఉండేది. 40మంది దాకా ఒక్కో బ్యాచ్ లో ఉండేవారు. ఆ కాలేజీకి వి.పి. రాఘవాచారి గారు ప్రిన్సిపాల్ గా ఉండెను. దొరలు ఉన్నటువంటి పాత బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టినారు. అదొక పెద్ద బిల్డింగ్. అక్కడ హాస్టల్ లో ఉన్నట్టుగానే ఉండేది. వానమామలై వరదాచార్యులు కల్చరల్ టీచరుగా ఉండేవారు. మాకు పెద్ద గురువు ఆయన. మాకు భాగవతం, రామాయణం, భారతం భగవద్గీతలపై రోజూ గంటసేపు చెప్పేవారు. దాని ప్రభావం నామీద చాలా పడింది. 4 నెలల ట్రైనింగ్ నా జీవితాన్ని మొత్తం మార్చింది. అక్కడ మేము బుర్రకథలు చెప్పడం, పక్క ఊళ్ళోకి వెళ్ళడం, కాలువలు బాగు చేయడం, పరిశుభ్రతను గురించి చెప్పడం చేసేవాళ్ళం. వాళ్ళను ఎడ్యుకేట్ చేయడమే కర్తవ్యంగా భావించేవాళ్ళం.
ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు. నానక్ రాం కాలేజీలో అప్లై చేసుకుంటే మొదటిలిస్టులో నాపేరు లేదు. అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామానంద తీర్థ. ఆయన దగ్గర అన్నయ్య జనరల్ సెక్రటరీగా ఉండెను. మేమంతా నాందేడుకు పోయినాము. నాతోటి కెప్టెన్ లక్ష్మీ కాంతరావు గారు కూడా ఉన్నారు. నాందేడు లోని రామానంద తీర్థ కాలేజీలో సీట్లు దొరికినవి. అది సైన్సు కాలేజీ. ఇంటికి వచ్చి అన్నీ సర్దుకొని ప్రయాణం అయి హైదరాబాద్ చేరేసరికి నానక్ రామ్ కాలేజీలో సెకండ్ లిస్టులో ఇరువురికి సీట్లు వచ్చాయి. ఇక అక్కడే రెండేళ్లు చదివిన తర్వాత అన్నయ్య బలవంతంగా ఆయుర్వేద కాలేజీలో చేర్పించాడు. ఆకారం నర్సింగం అని పెద్ద షావుకారు. ఆయనకు ఒక తోట ఉండేది. ఆ కాలేజీ కోసం ఫ్రీగా ఇచ్చాడు ఆయన. ఆ కాలేజీలో మొదటి, రెండు సంవత్సరాలు పూర్తి చేసినాను. నాకస్సలు ఇష్టం లేకుండింది. ఆ డెడ్ బాడీల దగ్గరకు పోవడం, డిసెక్షన్ చేయడం అసహ్యంగా ఉండేవి. “నువ్వు ముట్టుకోకపోతే ఎట్లొస్తదయ్యా” అనేవాళ్ళు మా లెక్చరర్లు(నవ్వుతూ). ఇష్టం లేని పని చేయడం ఇబ్బంది కదా! అందుకే చదువుకు స్వస్తి చెప్పి, వంగర చేరినాను (బహుశా 1960).
గ్రామ సర్పంచ్ నుండి అనేక పదవులు నిర్వహించిన మీ అనుభవాలు ఎటువంటివి?
నేను ఆయుర్వేద కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరంలోనే పెళ్ళి అయింది. నాకు చదువు ఇష్టం లేక ఒకటి, ఇప్పుడు సంసారం కూడా ఉంటుంది కాబట్టి వంగరకు వచ్చి వ్యవసాయం మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయనారంభించాను. మొట్టమొదటగా మేము తోటలు పెంచడం, ఆయిల్ ఇంజన్లు పెట్టడం, కరెంటు మోటార్లు పెట్టడం చూసి గ్రామస్తులు అనుసరించారు. 1980 వరకు వంగరలో ఉన్నాము. 1964లో సర్పంచ్ పదవికి నా ఎన్నిక యూనానిమస్ గా జరిగింది. వెంకట్రావని ఒక సమితి ప్రెసిడెంటు కావలసిన నాయకుడు ఉండేవాడు. ఆయన వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి వీటిపట్ల ఆలోచన కలిగి ఉండేవాడు. గ్రామస్తులలో అక్షరం ముక్క రానివారే ఎక్కువ. అలాంటి వాళ్ళు ఊరికి ఏం చేస్తారు? అని ” మనోహరరావు గారు ఉంటే మీకు అన్ని విధాలా గ్రామాభివృద్ధి, ఇతర సాయం ఉంటుంది. ఆయన అన్నయ్య కూడా పదవిలోఉన్నాడు. ఆయన ఉంటే గ్రామం అభివృద్ధి జరుగుతుంది” అని గ్రామస్తులకు చెప్పారు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక నా పిల్లలు, వాళ్ళ చదువు వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం గ్రామ అభివృద్ధి మీదే దృష్టి సారించాను. మొదటగా వీధిలైట్లు పెట్టించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, వసతి గృహాల నిర్మాణానికి పునాది వేసాను. ముల్కనూరు చెరువు నుండి వంగర వరకు కంకర రోడ్డు, వంగర నుండి సైదాపురం వరకు రోడ్డు సాంక్షన్ చేయించి, గ్రామంలో జడ్.పి. మాధ్యమిక పాఠశాల మాత్రమే ఉండేది. దాన్ని ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ ఉన్నత పాఠశాలగా మంజూరు చేయించాను. ఉపాధ్యాయులు తక్కువ ఉంటే మూడు మాసాలు ఇంగ్లీష్, లెక్కలు ఉన్నత తరగతులకు నేను చెప్పినాను. రెండు కొత్త ట్రాన్స్ ఫారాలు మంజూరు చేయించి, 40 మంది రైతుల మోటార్లకు కరెంట్ సాంక్షన్ చేయించి, నా చేతనైనంత వరకు గ్రామాభివృద్ధి సాధించాను. అయితే “ఊరికి చేసిన ఉపకారం, శవానికి చేసిన శృంగారం” అని సామెత కదా! సరిగ్గా అలాగే జరిగింది(బాధగా). ఎందుకంటే నేను స్వయంగా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ సాంక్షన్ చేయించి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఊళ్ళో మొట్టమొదటగా ప్రొటెక్టర్ వాటర్ సప్లై (మంచినీరు) వచ్చేలాగా చేసి, వాడ వాడలా చాలా ఇండ్లకు కుళాయిలు ఏర్పాటు చేయించాను. ఈ స్కీము కరీంనగర్ జిల్లాలోనే ప్రథమం. అయితే బావి తవ్వించడం, పెద్ద విద్యుత్తు మోటారు పెట్టడం, పెద్ద పెద్ద సిమెంటు పైపు లైన్లు వేయడం వీటన్నింటికీ 60 వేల రూపాయలు ఖర్చు అయినాయి. రెండవసారి ఎన్నికలు వచ్చేసరికి ఈ 60 వేలు ఈయన తిన్నాడని ప్రచారం చేసినారు నాటి కొందరు ధూర్తులు. అమాయకులు నమ్మినారు. ఇక నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈ లోపు మా అమ్మాయి పెళ్ళి జరిగింది. పిల్లల చదువులు… అందుకే మేము వరంగల్లుకు సంసారం మారినాము. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ఛైర్మన్ గా ఆలయాన్ని 4లక్షల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. వంగరలోని శ్రీ కైలాస కల్యాణి క్షేత్ర ఛైర్మన్ గా ఆలయాన్ని పునరుద్ధరింప చేసి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు.
వరంగల్లు నుండి హైదరాబాదుకు రావడానికి కారణం ఏమైనా ఉందా?
కారణం ఉందమ్మా! హన్మకొండలో 12 ఏళ్ళు ఉన్నాం. అన్నయ్య ముఖ్యమంత్రి అయింతర్వాత పిల్లల కొరకు ఇప్పుడైనా ఏమైనా చేసుకుందాం. వ్యవసాయం చేస్తూ మనమేం సంపాదించగలం? అని హైదరాబాదుకు వచ్చి రెండేళ్లు ప్రయత్నం సాగించాను. వంగరకు పోయి కాంట్రాక్టులు అవి చూసుకొని, నాలుగు రాళ్లు సంపాదించుకొని హైదరాబాదుకు పోయి ఖర్చు పెట్టుడు (నవ్వుకుంటూ). ఎంతోమంది నా దగ్గరికి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దామంటూ వచ్చేటోళ్లు. తర్వాత మా తల్లిదండ్రుల పేర్ల మీద వరంగల్లులో ఒక స్కూల్ పెట్టినాను. అది కూడా సరిగ్గా నడవలేదు. 2010 దాకా చేతి నుండి డబ్బు పెట్టుకుంటూ నడిపించాను. జీతాలు కూడా వెళ్లకపోయేది. 1991 లో అన్నయ్య ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఇక అంతే. మీకేం తక్కువ అని ఊళ్ళో వ్యవసాయం చేయనివ్వలేదు. భూమిని మాకు దానం చేయండి అని జెండాలు పాతినారు. నా దగ్గర 50,60 గేదెలు, ఆవులు ఉండేవి. 4,5 నాగళ్ళు ఉండేవి. పెద్ద వ్యవసాయం మాది. పశువులకు నీళ్లు కూడా పట్టేవాళ్ళు లేకపోతే ఎట్లా? అందుకే వంగర నుండి వరంగల్లు, అక్కడి నుండి హైదరాబాదుకు మారాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఉండాలంటే నిలదొక్కుకోవాలి కదా! ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను. తర్వాత నేను “సర్వార్థ సంక్షేమ సమితి ” స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధారాళంగా సలిపినాను.
మీరు ఊళ్ళో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించిన విశేషాలు చెప్పండి.
మా మూడు కుటుంబాల ఇళ్ళకు పోలీసుల బందోబస్తు ఉండేది. అందులో ఒక జవానుకు కల వచ్చింది. అదేంటంటే గ్రామం పక్కన ఉన్న చెరువు మధ్యలో ఒక మట్టి దిబ్బ ఉండేది. అయితే చిన్నపిల్లలు చనిపోతే ఆ గడ్డ పక్కన పాతి పెట్టేవారు. ఆ భయంతో అటువైపు మేము వెళ్ళక పోయేది. ఆ మట్టి దిబ్బ పైన చెట్లు, పుట్టలతో ఉన్న శిథిలమైన ఆలయంలో శివలింగం ఉన్నట్టు ఆయనకు వచ్చిన కల. గ్రామస్తులు పోలీసుల సహాయంతో ఆ చెట్లు, పుట్టలను తొలగించగా అందులో పెద్ద శివలింగం, పెద్ద పుట్ట, ఆ లింగానికి చుట్టుకున్న శ్వేతనాగు కూడా కనిపించినవట. మేము దీపావళి వ్రతం కోసం ఊరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మాకు తెలిసాయి. ఆ శివాలయ నిర్మాణ బాధ్యత నాపై పడింది. మా ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా అది నాకే చుట్టుకోవడం పరమేశ్వరుని అనుగ్రహం. అన్నయ్యకు, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల
విజయభాస్కర్ రెడ్డి గార్లకు ఈ విషయం వివరించి 14 లక్షల నిధులు మంజూరు చేయించి పని ఆరంభించాను. 2010 లో కూడా 17 లక్షలు సాంక్షను చేయించి మిగతా పనులు కూడా పూర్తి చేయించాను. నేను కైలాస మానసరోవరం పోయి వచ్చినందుకే నాకు ఈ మహద్భాగ్యం కలిగిందని అర్థం చేసుకొని, అమ్మవారి పేరు కూడా కలిపి “శ్రీ కైలాస కళ్యాణి క్షేత్రం” అని నామకరణం చేశాను. ఏది చేసినా ఊళ్ళో రాజకీయాల మీద, తాగుడు తందనాల మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద ఉండదు కదా! నలుగురు కూడా గుడికి పోయేటోళ్ళు లేరు. రామకళ్యాణం, శివకళ్యాణం, శివరాత్రి ఇలాంటి సందర్భాల్లో పక్క ఊళ్ళ నుండి కూడా జనాలు చాలామంది వస్తారు. ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బు ఏర్పాటు చేశాను. ఎన్ని చేసినా నేను ఇక్కడినుండి చేయడం కష్టం. ఊరివాళ్లను ఎవరినైనా బాధ్యత తీసుకోమంటే ముందుకు రావడం లేదు. వయసు రీత్యా నేను చేయలేక పోతున్నా. అందుకే భద్రకాళి ఆలయ ట్రస్టుకి అప్పగించేవిధంగా మొన్ననే కమిషనర్ గారి నుండి అనుమతి తీసుకున్నాను.
భారత ప్రధానిగా అనన్య సేవలందించిన పీవీ నరసింహారావు గారి ప్రభావం మీమీద ఎలా ఉంది?
నాకు కుటుంబపరంగా వచ్చిన ఆత్మీయత అన్నయ్య. సర్పంచ్ అయిన తర్వాత నాకు ఈ రాజకీయాలు వద్దు అనిపించింది. ఇక అన్నయ్య మార్గం మొత్తం అదే. మీకు తెలిసిందే. ఆయన నిరాడంబరుడు. నిష్కల్మషుడు. నిరంతర దేశసేవా పరాయణుడు. రోజు రోజుకు మారే రాజకీయాలలో కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్న ఘనత అన్నయ్యది. ఆయన నాకే కాదు అందరికీ ఆదర్శవంతుడు. రాజకీయం నచ్చకపోయినా అన్నయ్య ఎం.పి గా నాల్గుసార్లు పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా నాల్గు సార్లు పోటీ చేసినప్పుడు ఆయనతో పాటే తిరిగిన. ప్రచారం చేశాను. మోడీ లాంటి వాళ్ళు దేశం దేశం అని వేలాడుతుంటారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది మాత్రమే ఉంటారు? దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ. దేశాన్ని కాంగ్రెస్ వాళ్లు ఏ పరిస్థితికి తీసుకుపోయారో అందరికీ తెలుసు. అందుకే బీజేపీనా, కమ్యూనిస్టా, కాంగ్రెసా అని కాదు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు సపోర్ట్ చేయాలి. అన్నయ్య తదనంతరం ఆయన జయంతి సందర్భంగా గోల్డ్ మెడల్స్ ఇవ్వడం లాంటివి చేసి, శత జయంతి సందర్భంగా సభల్లో మాట్లాడటం, పెద్దలచే చెప్పించడం లాంటివి చేశాను. “సర్వార్థ సంక్షేమ సమితి” తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అన్నయ్యకు ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చి సత్కరించుకున్నాను. ఆనాడు ఆయన అమోఘ ప్రసంగం ఇచ్చారు. అన్నయ్యకు ఊళ్ళో ఏ పని వున్నా, పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు, వ్యవసాయం మొదలైన కార్యాలకు నాతో మాట్లాడేవాడు. ఇద్దరమూ చర్చించుకుని నిర్ణయించేవాళ్ళం.
సాక్షాత్తు రామలక్ష్మణులు అన్నట్టుగా కొనసాగిన మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.
మా ముఖాలు అచ్చుపోసినట్లు జన్మించాము. బ్రహ్మ సృష్టి (నవ్వుతూ). నన్ను చూసి అన్నయ్య అనుకొని పొరబడిన సందర్భాలు కూడా అనేకం. రాముడు ఏం చేశాడో మనకు తెల్సు. లక్ష్మణుడు ఏం చేశాడో కూడా తెల్సు. అలాగే అన్నయ్య ఏ పనిలోనైనా నేను వెనకాల ఉండేవాణ్ణి. ఇంతకుముందు చెప్పాను కదా! రాజకీయం ఇష్టం లేకపోయినా అన్నయ్యతో రాజకీయపరంగా అన్నిచోట్లకు తిరిగాను. నా ఏడేళ్ళ వయస్సులో మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుండీ అన్నయ్యే నాన్న లాగా ఆదరించారు. మాకు తండ్రి ఆయన. ఎవరికి వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాక కూడా ఇండ్లు మాత్రం పక్క పక్కనే నేటికీ ఉన్నాయి. వ్యవసాయం ఉంది. భగవంతుడు ఇచ్చిన దాంట్లో తక్కువేమీ లేదు. ఆయన చివరి క్షణం వరకు ఇది అది అని కాకుండా అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకునేవాళ్ళం.

మీలో ఇంతటి పాండిత్యానికి, ధార్మిక చింతనకు పూర్వీకుల నుండి సంక్రమించినదని భావించవచ్చా?
వారసత్వం కొంతవరకు. వానమామలై వరదాచార్యులు గారి ఇంప్రెషన్ ఉండింది నాకు. మా ఇంటి లైబ్రరీలో రామాయణాలు, భాగవత, భారతాలు, ఇతర సాహిత్య గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి చదవడం అలవాటుండేది. ఇప్పటికీ అలాగే చదువుతాను. పుస్తకపఠనం నా జ్ఞానాన్ని పెంచింది. అలాగే ‘జన్మగత సంస్కారం’ కూడా. నేను 5,6 ఏండ్ల వయస్సున్నప్పుడు మా నాన్నగారు పండరీపూర్ నుంచి ఎవరో వస్తే వాళ్ళతోటి 21 రోజులు రామాయణం చెప్పించారు. ఏ హరిదాసులు వచ్చినా మా ఇంటి ముందు హరికథా కాలక్షేపం జరుగవల్సిందే. వాళ్లకు భోజనాలు, వసతి అంతా మా ఇంట్లోనే. అది మా చిన్నన్నకు, నాకూ ఇద్దరికీ వచ్చింది. మా చిన్నన్నయ్య పేరు మాధవరావు. ఆయనకు చిన్నతనంలో స్ఫోటకం వల్ల రెండు కళ్ళు పోయాయి. కానీ అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయనది. అంతేకాక భాగవతం లోని, శతకాలలోని ఎన్నో పద్యాలు, పౌరాణిక గాథలు, మంగళహారతులు కంఠపాఠంగా వచ్చేవి. వ్యవసాయం, గ్రామ రాజకీయాల్లో ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవాడు. మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. ఆర్గనైజేషన్ అంతా మళ్ళా నేనే. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న హరిదాసుల్లో “మేం వంగరకు పోలేదన్న” హరిదాసును ఒక్కణ్ణి చూపించండి (పూర్తి నమ్మకంగా చెప్తూ). ఆ కాలంలో ప్రజలు మనం చెప్తే వినేవాళ్ళు. వానమామలై వరదాచార్యులు గారు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో ప్రవచనం పెట్టించాము. భద్రాచలం నుంచి నర్సింహమూర్తి అనే వైష్ణవుడు మా ఇంట్లో ఉండి 40 రోజులు భారతం హరికథ చెప్పించాము. బాగా నల్లగా, లావుగా ఉండేవాడు. ఆయన హరికథ చెప్తూ బల్లమీద కథకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే బల్లలు విరిగిపోతాయా అన్నట్టుండేది(గట్టిగా నవ్వుతూ). పైన లైటు ఫిట్ చేయిస్తే చుట్టుపక్కల 4,5 గ్రామాలనుండి ప్రజలు వచ్చి 40 రోజులూ కథ విన్నారు. అట్లా నాకు వాటి మీద ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు వినడంతో సాహిత్య సముపార్జన పెరిగింది. ఇప్పుడు కూడా పుస్తకాలకు ముందు మాటలో, సమీక్షో చేయాలంటే దానిలోని మంచి, చెడు నిర్ణయించాలి కదా! అందుకోసం చదవాలి. కాబట్టి ఇప్పటికీ చదువుతుంటా. నాకు డైరీ రాసే అలవాటుంది. రాయనిదే నిద్రపోను. ఇప్పటికీ రాస్తుంటా. మేము మానస సరోవర యాత్రకు పోయినప్పుడు నెలరోజులు ఎక్కుడు, దిగుడు, తిన్నది, పడుకున్నది మొదలగునవన్నీ రాసుకున్నాను. వచ్చిన తర్వాత ఇవే విషయాలు పదే పదే అందరికీ చెప్తుంటే మా అమ్మానాన్నల పేరుమీద ఉన్న స్కూల్ లోని హెడ్మాస్టర్ ” సార్! ఇలా ఎంతమందికి చెప్పుకుంటూ పోతారు? ఒక పుస్తకం రాయండి” అని సలహా ఇచ్చాడు. దాంతో ‘కైలాస దర్శనం’ అనే పుస్తకం రాశాను. అది నా మొదటిపుస్తకం. డైరీలో రాసుకున్నదే సరిపోదు కదా..అందుకోసం 22 గ్రంథాలు చదివి, విషయాలు తెలుసుకున్నాను. అక్కడికి పోయి దర్శనం చేసుకునేలా చేసిందీ, ఆ పుస్తకం రాయించుకున్నదీ ఆ పరమేశ్వరుడే. మన చేతుల్లో ఏముందమ్మా..??
మీరు చేసిన బ్రహ్మ మానస సరోవర యాత్ర అనుభవాలను బట్టి యాత్రలు మనిషి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పొచ్చు?
యాత్రలు ఇప్పుడు చేస్తున్నవి కాదు. పురాణ కాలం నుండీ ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి కాశీకో, మరో రాష్ట్రానికో పోతే. ఇక్కడి వాతావరణం అక్కడ ఉంటుందా? మనలాంటి మనుషులు దొరుకుతారా? లేదు కదా! అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. ఇక్కడ దొరికే భోజనం అక్కడ దొరకదు కాబట్టి సర్దుకోవాలి. ఇంకోటి ఏంటంటే వారి సాంఘిక ఆచారాలు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు అవగాహన కావాలి. వెనకట బద్రీనాథ్, కేదారినాథ్ లకు నడిచి పోయేవాళ్ళు. నా చిన్నతనంలో జనకమ్మ అని ఒక షావుకారు. వాళ్ళు కొంతమంది బద్రీనాథ్, కేదార్ నాథ్ లకు వెళ్లారు. కుంపట్లలో నిప్పులు వేసుకొని పొట్టకు కట్టుకొని, మీద నుంచి గొంగళ్ళు కప్పుకొని పోయి, మంచిగా దర్శనం చేసుకొని వచ్చినారు. దానికి ఎంతో మనోధైర్యం కావాలి. కార్యదీక్ష వుండాలి. అందుకే ఆ కాలంలో “కాశీకి పోతే కాటికి పోయినట్లు” అనే నానుడి వచ్చింది. మేము నెల రోజులు యాత్రకు పోయినప్పుడు కూడా ఎక్కుడు, దిగుడు, చలి, పలు ఆటంకాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ నాల్గు రోజుల్లోనే చారధామ్ చూడగలిగేంత సౌకర్యాలు ఉన్నాయి. కానీ నా అనుభవం మీద చెప్తున్నా. భగవద్దర్శనం చేసుకోవాలని ఆత్రుత ఉంటుంది కదా! అప్పుడు కష్టపడి ఆ తపనతో దర్శనం చేసుకుంటే కలిగే ఆనందం గంటలో పోయి వచ్చేవారలకు ఏమి తెలుస్తుంది? ఆ ప్రకృతి సౌందర్యాలు, ఆ అనుభూతి, ఆ అనుభవాలు ఇవేం పొందగలుగుతారు? కోవెల సుప్రసన్నాచార్యులు గారు, డా. మృత్యుంజయ శర్మ, భార్గవ రామశర్మ, డా. శ్రీ భాష్యం విజయసారథి వీళ్లంతా నా కైలాస యాత్రా దర్శనంపై ప్రత్యేకమైన మంచి ఆర్టికల్స్ ఇచ్చారు. యాత్రలు మనిషి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అలజడుల నుండి కొంత మానసిక ఉపశమనం లభిస్తుంది. మన దేశ స్థితిగతులు, వివిధ ప్రాంతాలలోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు,వేష భాషలు, జీవన విధానం అవగతమవుతుంది. ప్రతీ ఒక్కరు మనమెంతో కష్టపడుతున్నాం అనుకుంటారు కదా! పోయి చూస్తే మనకంటే ఎంతో బాధాకరంగా జీవితాలను గడిపేవాళ్లను కూడా మనం చూస్తాం. ప్రతీచోట సౌభాగ్య, దౌర్భాగ్యాలు పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా మనిషి అప్పుడప్పుడు తనున్న వాతావరణం నుండి కొంత బయటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కలిగే ఆనందం, అనుభవం మరువరానిది.
శివపూజా విధానాన్ని ఒక క్రమబద్ధంగా ఉండేలా ‘రుద్రాభిషేకం’ పేరుతో పుస్తకంగా అందరికీ అందుబాటులో తేవాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏంటి?
దానికి కారణం ఒకటున్నది. 1970-75 ప్రాంతంలో అనేక యాత్రలకు పోయి దర్శించాము. పక్కనే ఎనిమిది మైళ్ళలో మోనయ్యగారు అనే పురోహితుడు ఉండేవాడు. మనం ఎక్కడికి పోయినా ఆలయాల్లో అభిషేకాలు అవి పురోహితులే చేస్తారు కదా! మనం రోజూ చేసుకోవాలంటే ఎట్లా? అని నేనొక చిన్న పుస్తకం తీసుకొని 1970 నుండి అభిషేకం చేసుకోవడం మొదలుపెట్టాను. చేస్తున్నప్పుడు మనకు అర్థాలు కూడా తెలవాలి కదా! నేను వాటికి సంబంధించిన వ్యాఖ్యానాల పుస్తకాలు అన్నీ చదివి భస్మధారణ అంటే ఏంటి? సంధ్యావందనం ఏంటి? గంధమెందుకు, అక్షంతలెందుకు? ఇట్లా మొత్తం తెలుసుకున్నా. అభిషేకం చేయాలంటే ముందు గణపతి పూజ చేయాలి. అక్కణ్ణించి మొదలుపెట్టి నా సొంతంగా కాదు. పండితులు రాసినవి సేకరించి వాటి సారాంశాన్ని మొత్తం ఈ పుస్తకంలో కూర్చిన. సంధ్యావందనం గురించి అంటే ఒక పుస్తకం కావాలి. నమక చమకాలకు ఒక పుస్తకం కావాలి. ఇట్లా కాకుండ మొదటి నుండి ఆసాంతం వరకు శ్రీసూక్త, పురుష సూక్తాలతో సహా వివరణలతో తయారుచేశాను. అది తయారుకావడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంగన్యాస, కరన్యాసాలకు ఎక్కడా నాకు వివరణ దొరకలేదు. విఠల్ సిద్ధాంతి, నేను ఇద్దరం కలిసి ఒక పండితుని దగ్గరకు వెళ్లి ఆయన చెప్పిన వివరణతో ఆ పుస్తకం ముద్రించ బడింది(2003).
478 పేజీలున్న ఈ పుస్తకం చేతిలో పట్టుకోగలిగే సైజులో వయస్సు పైబడిన వారు కూడా చదువుకునే అక్షరాల సైజులో రూపొందించాను. ఈ పుస్తకం చేతిలో ఉంటే అభిషేకం గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా సులభంగా తమంతట తాము చేసుకోవచ్చు.
నేటితరం విద్యార్థులకే కాక మానవుడు తనను తాను ఉద్ధరించుకునే దిశగా “సద్విద్య-సత్పథం” అనే గ్రంథాన్ని రాశారు..దానిలో ప్రస్తావించబడిన విషయాలు ఏవి?
ఈరోజుల్లో చదువు ఎట్లా ఉందో మీకు చెప్పవలసిన పనిలేదు. తెల్సు కదా! విద్య అనేది వినయాన్ని, సంస్కారాన్ని, క్రమశిక్షణను ఇవ్వకుండా నైతిక విలువలు పతనమయ్యే దిశలో సాగుతున్నది. నా ఉద్దేశ్యంలో “ధర్మ మూల మిదం జగత్తు” ఆ ధర్మాన్ని తెలియచెప్పాలనుకున్నా. అందుకే శీలం విలువను గురించి, మతాల భావాల గురించి,సంస్కృతి గురించి, మాతృభాషను గురించి, తల్లిదండ్రులు,గురువుల స్థానం గురించి, అష్టకష్టాల గురించి, నవవిధ భక్తుల గురించి, చతుర్వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు, పురాణాలు. వాటిలో వుండే ధర్మాలు..ఇవన్నీ పుస్తకంలో చేర్చాను. .మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండ కూడదు? వీటన్నింటినీ దీంట్లో వివరించి, ఊరికే చెప్పడమే కాక 70 పేజీల ఈ పుస్తకాన్ని కొన్ని ఉన్నత పాఠశాలలకు స్వయంగా పోయి పంచి, ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులతో మాట్లాడి పరీక్షలు నిర్వహింప చేశాను. పుస్తకంలోని విషయాలపై 100 ప్రశ్నలు తయారుచేసి, వాటిని అటు ఇటుగా మారుస్తూ 10 సంవత్సరాలు పరీక్షలు ఏర్పాటు చేసి, వాటికి ప్రథమ బహుమతిగా 5000 రూ. ద్వితీయ బహుమతిగా 3000 రూ. తృతీయ బహుమతిగా 2000 రూ. ఇవ్వడం జరిగింది. రాను రాను ఫోనులో కూడా పరీక్షలు నిర్వహించి బహుమతులు ఇచ్చాను. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పుస్తకాన్ని చూసి, చాలా బాగుందని మెచ్చుకొని పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేస్తామన్నారు. క్రమంగా పాల్గొనేవారి సంఖ్య తగ్గడం మొదలైంది. కారణం తెలిసిందే. నేటి విద్యావిధానం, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల అనాసక్తత.
పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా! ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.
ఈ పుస్తకాన్ని కేవలం 15 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాసినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని భావించాను. దీనికి ఇంకొక కారణం ఉంది. అన్నయ్య నిర్వహించిన అనేక పదవుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి పదవి.
నూతన విద్యావిధానాల రూపకల్పన, నవోదయ పాఠశాలలు ఆయనవే. ఎందరో మహానుభావులు విద్యార్థి దశ నుండే అంకురించిన కారణంగా సనాతన సంస్కృతిని, దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసే విద్య రూపొందాలనే ఆయన కాంక్ష నాకు ఆదర్శం. వారి స్మృతి చిహ్నంగా నాల్గు కాలాల పాటు నలుగురికీ లాభించాలన్న చిన్ని ప్రయత్నం ఈ పుస్తకం. అన్నయ్యకు అనుజుడు అనే పారితోషికంతో నన్ను ఆ భగవంతుడు పుట్టించి, వారిలోని ఛాయలను కూడా నాకు అనుగ్రహించాడు. అంతకన్నా కావల్సింది ఏముంది? అందుకే ఈ చిన్న కృతిని కీ.శే. అన్నయ్యకు అంకితమిచ్చాను. ఇకముందు అయినా ఈ పుస్తకం విద్యార్థులకు ఉపయోగ పడేటట్లు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆకాంక్ష. వందమందిలో ఒక్కరైనా ఇందులోని విషయాలను గ్రహిస్తే నా ధ్యేయం నెరవేరినట్లు భావిస్తా.
“సర్వేజనాః సుఖినోభవంతు” అన్న సదాశయంతో మీరు స్థాపించిన “సర్వార్థ సంక్షేమ సమితి” కి మీకు లభించిన సహకారం ఎటువంటిది? ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు ఏవి?
వేరే వాళ్ళు ఎవరూ నాకు సహకారం లేరు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టుకోవాలనే ఆలోచనతో పెట్టుకున్నదే. పేరుకు ” సర్వార్థ సంక్షేమ సమితి.” కానీ మనోహరరావు ఒక్కడే. 30 ఏండ్లలో ఎవ్వరినీ ఒక్క పైస అడగలేదు. 1992లో ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక సమితిగా దీన్ని ప్రారంభం చేసి, శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు గౌరవ అధ్యక్షులుగా, సభ్యులుగా పి.వి. మదన్ మోహనరావు గారు, పి.వి.రాజమోహన్ గారు, పి. రాజిరెడ్డి గారు, బుడి సత్యనారాయణ సిద్ధాంతి గార్లతో స్థాపించాను. పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినాము. ఒక సందర్భంలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాగ త్రయం చేసినపుడు మాత్రం టిటిడి వారి సహాయం కోరాను. రమణాచారి గారు ఈవో గా ఉన్నప్పుడు రెండు, మూడు లక్షలు ఇచ్చినారు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత ఆయన 5 లక్షలు ఇచ్చారు. అప్పుడు 22 లక్షలతో 350 మంది ఋత్వికులను పెట్టి వైష్ణవం, శైవం, శాక్తేయాలకు సంబంధించిన 3 యజ్ఞాలు చేశాము. అయితే ఈ యజ్ఞ యాగాదులన్నీ దేవాదాయ శాఖవారు చేయించాల్సినవి. మనం చేయాల్సినవి కాదు కదా! చేసిన వాటిని కొంతమంది ప్రోత్సహించారు. అందరూ ఒప్పుకోరు కదా!
దీనిద్వారా ఎందరో మహానుభావులకు, పండితులకు సన్మాన సత్కారాలు చేయడం, బిరుదులు ఇవ్వడం చేశాము. ఆధ్యాత్మిక వేత్తల చేత సప్తాహలు, ప్రసంగాలు చేయించి, వారిని ఉచితరీతిలో సత్కరించుకున్నాము. లోక కళ్యాణం కోసం వందకు పైగా యజ్ఞ యాగాదులు నిర్వహించాము. అనేక సాహిత్య , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. ఉచిత హోమియో, ఉచిత మందులతో దవాఖాన, తుపాను, భూకంప బాధితులకు సహాయం చేయడం, వృద్ధాశ్రమాలకు, సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉన్నాం. మన సనాతన ధర్మ రక్షణకు 3000 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 3000 మంది పేద బ్రాహ్మణులకు కనీస పోషణ నిమిత్తం మా సంస్థ చేసిన కృషి వల్ల పూజారుల నియామకం జరిగింది. మొన్ననే కాశీలో పుష్కర సందర్భంగా 10 అన్న సత్రాలకు 30 వేల రూపాయల చొప్పున స్వంతంగా సహకరించాను. ఇది నీటి బిందువు మాత్రమే. మనం చేసే మంచి పనుల వల్ల కలిగే పుణ్యమే మనతో వచ్చేది. ఏదీ రాదు మన వెంట. అంతే కదా!
మీ దాంపత్య జీవితంలో మీతో ప్రయాణం కొనసాగిస్తూ, మీ ఆదర్శాలకు చేయూతనందిస్తున్న మీ సతీమణి శ్రీమతి సరస్వతమ్మ గారి గురించి వివరించండి…
నాకు 1958 లో వివాహం జరిగింది. అప్పటినుండి ఆమె నాకు అనుకూలవతిగా నా అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే ఉంది ఇప్పటివరకూ.. ఆమెకు యజ్ఞయాగాదులు అంటే చాలా ఇష్టం. అతిథి సత్కారం మాఇంట్లో ఆనవాయితీగా పూర్వం నుండి వస్తూనే ఉంది. ఈనాటికీ మా ఇల్లు ఒక సత్రం లాగానే ఉంటుంది. ఎవ్వరు ఏ సమయానికి వచ్చినా ఆతిథ్యం ఈయవల్సిందే. రోజు విడిచి రోజైనా మూడవ వ్యక్తి లేకుండా మా ఇంట్లో భోజనం చేయడం జరుగదు. ఈ విషయంలో నాకంటే ఎక్కువగానే ఆమె వారిని బలవంత పెడుతుంది. ఏ సమయం లోనూ చీకాకును ప్రదర్శించకపోవడం, చిరునవ్వుతో ఆదరించడం ఆమె ప్రత్యేకత. వంగరలో అదే నడిచింది. హన్మకొండలో అదే నడిచింది. ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. ఎందుకంటే వచ్చినవారిని మనం ఆదరించబట్టే వాళ్ళు మన దగ్గరకు వస్తారు కదా! అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.
మీరు నిర్మాతగా టీవీ సీరియళ్ళు చేశారని విన్నాం. వాటి గురించి చెప్పండి.
భాగవతం వంటి భక్తి రసాత్మకమైన కావ్యాన్ని మనకు అందించిన పోతన జీవితం గురించి అందరికీ తెలియాలని “భక్తకవి పోతన” అనే పేరుతో 13 భాగాలుగా చేసి హైదరాబాద్ దూరదర్శన్ ఛానల్ ద్వారా ప్రసారం చేశాము. పోతన భాగవత పద్యాలు, ఆయన జీవితం ఇందులో ఉండడం వల్ల మంచి ప్రజాదరణ పొందింది. అందులో ఒకటి, రెండు వేషాలు కూడా నేను వేశాను. నేను తిరిగిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు వీటిలో ఒక 13 ప్రముఖ ఆలయాలను తీసుకొని ( సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, తిరుపతి, రామేశ్వరం, శబరిమల అయ్యప్ప మొ..) వాటి చరిత్ర అంతా “సంస్కృతీ శిఖరాలు” పేరిట టీవీ సీరియల్ గా చిత్రీకరించి, 1998, 99 లలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చాయి. షూటింగ్ తీస్తున్నప్పుడు బృందంతో నేను కూడా రామేశ్వరం, శబరిమలకు వెళ్ళాను.
రాబోతున్న సినిమా ‘ప్రజాకవి’ కాళోజీ బయోపిక్ లో మీ సోదరులు నరసింహారావు గారి పాత్రలో మీరు అలరించబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు చెప్పండి. ఇంకా వేటిలోనైనా నటించారా?
అవును. నిజమే. సెప్టెంబరులో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన బయోపిక్ సినిమాగా రాబోతున్నది. అందులో ప్రధానిగా అన్నయ్య ఆయనతో ఫోన్లో మాట్లాడిన సన్నివేశం, ఆయనకు పౌర సన్మానం చేసే సన్నివేశంలో అన్నయ్య పాత్రను నేను పోషించాను. “Sand Storm” అని ఒక హిందీ సినిమా 2016 లో వచ్చింది. రాజస్థాన్ లో జరిగిన ఒక యదార్థ గాధ ఆధారంగా తీసిందది. ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఆ అమ్మాయి ధైర్యంగా అందరినీ ఎదిరించి కోర్టులో కేసు వేసి నిందితులందరినీ జైల్లో పెట్టిస్తుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆ పాత్ర చేశాను.
ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను గురించి మీ అభిప్రాయం చెప్పండి.
అమ్మా! మీకైనా, నాకైనా మనిషికి కావల్సింది పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా! ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.
ధన్యవాదాలు సార్ …మీ గురించిన అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కోటి వందనాలు…
శ్రీ.టేకులపల్లి. గోపాల్ రెడ్డి గారి ఇంటర్వ్యూ
నమస్కారం సార్
మీ నవల(జీవన స్రవంతి) విస్తృత ప్రజాదరణ పొందినందుకు ముందుగా మీకు అభినందనలు. ఒక అంధుడు నవల రాయడం బహుశా తెలుగు సాహిత్యంలో మీతోనే మొదలైందని చెప్పవచ్చు.అది చదువుతున్నంతసేపు ఒక చారిత్రక డాక్యుమెంటరీని చూసిన అనుభూతి కలిగింది.అందులో ఎన్నో చారిత్రక,రాజకీయ,ఆర్థిక,సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈ నవల మొదటిభాగమే దాదాపుగా 500 పేజీల ఉద్గ్రంథంగా తయారయింది. ఇది భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథంగా విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం. నేను మీ శిష్యుడనయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.
గోపాల్ రెడ్డి సర్ గారు: నాకు ధూళిపాల అరుణ,మహేందర్ ఇంకా మీలాంటి శిష్యులు లభించడం నా అదృష్టంగా భావిస్తాను. నా నవల విస్తృతంగా ప్రచారం కావడానికి దోహదం చేసిన మీకు, ఈ ఇంటర్వ్యూను ప్రచురించి నా నవలకి విస్తృత ప్రచారం కల్పిస్తున్నందుకు మయూఖ ఆన్లైన్ ద్వైమాసిక పత్రిక నిర్వాహకురాలు శ్రీమతి కొండపల్లి నిహారిణి గారికి మరియు నా నవల చదివి మంచి ఫీడ్ బ్యాక్ అందిస్తున్న పాఠకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రశ్న:1 సర్ మీజననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే వాక్యం రాముని నోట వెలువడింది.ఇది ఉత్తమోత్తమమైన వాక్యం. ప్రతి వ్యక్తి జీవితంలో జనని ఎంత ముఖ్యమో జన్మభూమి కూడా అంతే ముఖ్యం. జనని కుటుంబానికి పరిమితమైతే జన్మభూమి పూర్తి సమాజానికి సంబంధించినది. జననిని ప్రేమించినట్టే జన్మభూమిని కూడా ప్రేమిస్తారు,ఆరాధిస్తారు, అవసరమైతే ప్రాణమైనా ఇస్తారు. నాకు కూడా నా జన్మభూమైన పోచారం చాలా ఇష్టం. ఇది తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా,నాగిరెడ్డిపేట మండలంలో ఒక అందమైన పల్లెటూరు. నేను నా తల్లిదండ్రులైన రామకృష్ణారెడ్డి,సత్యమ్మలకు ఏప్రిల్ 1,1954 న జన్మించాను. ఒకవైపు ప్రాజెక్టు నీళ్ళు మరోవైపు పచ్చని పంట పొలాలు కలిసి మా ఊరును సుందరమయం చేశాయి. మా అందమైన పల్లెటూర్లోనే నా ఊహా శక్తి మొగ్గ తొడిగింది. ఊరు చుట్టూ నా పాదముద్రలు లేకపోయినా ఊహాశక్తితో నా పల్లె అందాన్ని దర్శించగలిగాను. అదే నా నవలలో చేర్చగలిగాను. నాకు ఇద్దరు సోదరీమణులు ముగ్గురు సోదరులున్నారు. నాకు ఇద్దరు పిల్లలు .కూతురు చైతన్య ప్రియదర్శిని,అల్లుడు విజయ్ భాస్కర్ రెడ్డి. కుమారుడు కృష్ణ కిషోర్ రెడ్డి,కోడలు సంగీత.శశాంక్ అన్వేష్ రెడ్డి,చతుర్వేద,సమీక్ష,మేఘవర్షిణి నా మనవడు మనవరాళ్లు. మాది పెద్ద కుటుంబమే.
ప్రశ్న:2 సర్ మీకు అంధత్వం పుట్టుకతో వచ్చిందా? లేక మధ్యలో వచ్చిందా?
దివ్యాంగులలో అంధత్వం చాలా బాధాకరమైనది. చూపు లేకపోతే ప్రపంచాన్ని దర్శించలేరు, ఇతరుల సహాయం లేనిదే ఎక్కువగా పనులు చేసుకోలేరు. ఇది బాధాకరమైన విషయమే. ఈ అంధత్వం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండవది ప్రమాదవశాత్తు పోయేది. మూడవది ఏదైనా జబ్బు చేసి నాటు వైద్యం వికటించినప్పుడు పోయేది. నాకు మూడవది సంభవించింది. నాకు నాలుగు సంవత్సరాల వయసు వరకు అందరిలాగే కళ్లు బాగా కనిపించేవి. ఒకరోజు నాకు కళ్లకలక వచ్చింది దాంతో కంటిపై పొరలు ఏర్పడ్డాయి.అప్పుడు నాటు వైద్యుడి వద్దకు తీసుకెళితే అతను నా కంటిలో బీరాకు పసరు వేయడంతో అది వికటించడంవల్ల,మెదక్ చర్చ్ఆసుపత్రిలోని నర్స్ నాకు ప్రాథమిక చికిత్స సరిగ్గా చేయకపోవడం వలన నా చూపు పోయింది. తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తే డాక్టర్లు ఎడమకంటికి కొంత చూపు తీసుకు రాగలిగారు. అందువల్లనే కొంతకాలంపాటు రంగులను గుర్తించగలిగాను, రాత్రింబగళ్ళను గుర్తించగలిగాను.
ప్రశ్న 3. మీ బాల్యం,విద్యాభ్యాసం గురించి చెప్పండి .
నిజానికి బాల్యం ఎవరికైనా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అందమైన జీవితమది.కల్మషం లేని మనసులు, కావలసినంత స్వేచ్ఛ ఈ సమయంలో దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా ఇది చాలా మధురమైందిగానే అనిపిస్తుంది. ఈ బాల్యం గురించి పెద్ద పెద్ద కవులు కూడా కవితలు రాశారు. శ్రీశ్రీ గారు శైశవగీతిలో బాల్యం గురించి అద్భుతంగా చెప్పారు. నా జీవితంలో నా బాల్యం కూడా మధురంగా గడపాలనుకున్నాను.. నేను మా ఇంటి బయట కూర్చుండి పిల్లలు ఆడుతుంటే గమనించేవాడిని.కొన్ని రోజులు నాకు పాక్షిక చూపు ఉండడం వల్ల వాళ్లతో ఆడుకోగలిగాను. తర్వాత తర్వాత నా వయసు రీత్యా ఆటలని తగ్గించుకున్నాను.నేను ఆ సమయంలో మా అక్కయ్య వాళ్ళతో పాఠశాలకు వెళ్లే వాడిని ,పరిసరాలు గమనించేవాడిని, మాటలు వినే వాడిని ,కానీ నాకు బాహ్య ప్రపంచం గురించి తెలిసింది మాత్రం రేడియో తోనే. 1959లో మా నాన్నగారు ఒక రేడియో కొన్నారు.దాని ద్వారా నాకు ప్రపంచంలోని చాలా విషయాలు అవగతమయ్యాయి. నిజానికి నా జీవితంలో రేడియో అనేది అత్యంత ప్రముఖ పాత్ర వహించింది. అందులో ముఖ్యంగా శారద శ్రీనివాసన్ అనే రేడియో ఆర్టిస్టు నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆమె మాటలతో ఊహల్లో తేలిపోయేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే నా ఊహ ప్రేయసి ఆమెనే…రేడియోలో వచ్చే కథానికలు,నాటకాలు,నవలలు నన్ను ఉత్తేజపరిచేవి,కార్యోన్ముఖుడిని చేసేవి.నా లక్ష్యాన్ని సాధించేలా ప్రేరేపించేవి. ఎప్పుడైనా ఇంట్లో గొడవ జరిగినప్పుడు నా మనసు బాధపడి నేను ఇంటి పై గదిలోకి వెళ్లి ఈ కార్యక్రమాలను,శారదాశ్రీనివాసన్ మాటలు విని సాంత్వనపొందేవాడిని. ఈ విధంగా మా నాన్నగారు రేడియో తెచ్చి నాకు ఎంతో మేలు చేశారు. రేడియోతో నా బాల్యం బాగా గడిచిపోయింది.

విద్యాభ్యాసం: నేను మొదటిసారిగా 1965లో మలక్పేటలోని అంధుల పాఠశాలలో చేరాను. నేను పాఠశాలలో లేటుగా జాయిన్ కావడానికి కారణం మా నాన్నగారి భయం. నా చూపు కోసం మా నాన్నగారు మద్రాస్ అపోలో హాస్పిటల్ కి రాయవెల్లూరు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు చూపు వస్తుందని చెప్పారు.అయితే వాళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అయితే మా నాన్నగారు నేను ఎలా ఉండగలుగుతానని అనుకున్నారో ఏమో నన్ను వెంటనే పాఠశాలలో జాయిన్ చేయలేదు. రెండోసారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మరోసారి డాక్టర్లు నన్ను అంధుల పాఠశాలలో చేర్పించమన్నారు అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. అప్పుడు మా నాన్నగారు నన్ను పాఠశాలకు తీసుకెళ్లారు కానీ వాళ్ళు జాయిన్ చేసుకోమన్నారు. అయితే మా నాన్నగారు కొన్ని రికమండేషన్లతో నన్ను జాయిన్ చేశారు.అలా నా విద్యాభ్యాసం 1965లో ప్రారంభమైంది నేను జాయిన్ అయిన రెండు సంవత్సరాలకి మా నాన్నగారు క్యాన్సర్ తో చనిపోయారు. అది నన్ను బాగా కలచివేసింది.మా నాన్నగారు లేకపోవడం నాకు తీరనిలోటు.ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను. చదువులో కూడా కొంత గ్యాప్ వచ్చింది.నేను 1968లో ప్రైవేటుగా 8వ తరగతి పాసయ్యాను.1971లో ఉస్మానియా మెట్రిక్ పాసయ్యాను. 1972లో పియుసి పూర్తయింది.1972-74 వరకుDOL ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాలలో విద్యాభ్యాసం చేశాను ,1975 లో తెలుగు విశారద,పండిట్ శిక్షణ పూర్తిచేశాను,1973-76 లో సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను, 1976-78లో ఉస్మానియా యూనివర్సిటీలో M.A.తెలుగు పూర్తి చేసి చదువులో నా స్నేహితులను అందుకోగలిగాను. తరువాత జూనియర్ లెక్చరర్(1978-98) గా, డిగ్రీ లెక్చరర్(1998-2012) గా విధులు నిర్వర్తించాను.
ప్రశ్న 4.చదువులో మీకు మిత్రుల సహాయం ఎలా వుండేది?
ఒక సందర్భంలో నందిని సిధారెడ్డి గారు ఏమంటారంటే “కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవడం కష్టమని”. అది కష్టాలలో ఆదుకునే స్నేహితుడు కావాలి,మనోధైర్యాన్నిచ్చే స్నేహితుడు కావాలి అంటాడు. నిజమే స్నేహితుడనే పదానికి అర్థం అదే కదా! నాకు కూడా నా జీవితంలో మంచి స్నేహితులు తారసపడ్డారు నేను అంధుల పాఠశాలలో ఉన్నప్పుడు ఆదినారాయణతో నా స్నేహం కుదిరింది.ఇతనిది ఆంధ్రా ప్రాంతం. మేము సన్నిహితంగా ఉండేవాళ్లం. మా స్నేహాన్నిచూసి హాస్టల్లో మా ఇద్దరిని జంటకవులు అనేవాళ్ళు. నిజానికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది ఆయనే. కర్ర పట్టి ఏ విధంగా నడవాలో నేర్పింది ఆయనే. కర్రపట్టి నడుస్తున్నప్పుడు గోడ దగ్గర కొడితే ఒక రకంగా శబ్దం వస్తుంది. తారు రోడ్డుపైన కొడితే ఒక రకమైన శబ్దం వస్తుంది. బస్ పక్కన కొడితే ఇంకొక రకమైన శబ్దం వస్తుంది,బైక్ పక్కన కొడితే మరొక రకమైన శబ్దం వస్తుంది. ఇలా కర్రతో కొట్టినప్పుడు వచ్చే శబ్దాలను ఎలా ఉంటాయి, నడిచేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, అదేవిధంగా ఎత్తుపల్లాలలో ఏ విధంగా నడవాలో కూడా చెప్పేవాడు .నేనెప్పుడైనా పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వారం రోజులు వుండవలసిన వచ్చేది. ఆ సమయంలో తను నాకు భోజనసదుపాయం కల్పించి,పుస్తకాలిచ్చి ఎంతో సహాయం చేసేవాడు. ఎగ్జామ్ కు ఏ విధంగా ప్రిపేర్ కావాలో,ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయో ఇలాంటి విషయాలను చెప్తుండేవాడు. నాకు దొరికిన మంచి మిత్రుడు తను. ఇదే తరగతిలో మోహన్ రావు అనే స్నేహితుడు వుండేవాడు.అతను కూడా నాకు సహాయపడ్డాడు.అదే విధంగా పీజీలో ఉన్నప్పుడు తుపాకుల సిద్ధారెడ్డి (కర్నూల్)అని మరో మిత్రుడు పరిచయమయ్యాడు.ఇతను పీజీ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో చక్కని సూచనలు చేసేవాడు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు పరిచయమై నా గమ్యం చేరుకోవడానికి ఎంతో సహాయపడ్డారు.వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రశ్న 5 మీరు జీవితంలో ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం చేశారు. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎప్పుడూ భయం వేయలేదా?
నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నెలకోసారైనా ఇంటికి ప్రయాణించాల్సి వచ్చేది.ఆ సమయంలో నన్ను ఆర్థిక సమస్యలు వెంటాడేవి. అందుకే నేను ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవాడిని.ఎందుకంటే మాకు టికెట్టు కన్సెషన్ ఉండేది. రైలు ప్రయాణంలో ఇంటికి వెళ్ళాలంటే అక్కన్నపేటలో దిగాలి.అక్కడ దిగేసరికి ఒక్కోసారి అర్ద రాత్రి 12 గంటలయ్యేది. ఆ సమయంలో రైలు పట్టాలు దాటేటప్పుడు విపరీతమైన భయంవేసేది.అయినా ఆర్థిక సమస్యల ముందు అవేం పెద్ద సమస్యలు కావని ముందుకు వెళ్లే వాడిని. అంతేకాకుండా నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా గమ్యం గుర్తొచ్చేది.గమ్యాన్ని చేరుకోవాలనే తీవ్రమైన కోరికే నా లోపల భయాన్ని పోగొట్టేది. నిజానికి ఆ సమయంలో మాకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది,డబ్బు కూడా ఉండేది కానీ నా ఆత్మాభిమానం మా వాళ్ళని అడగనిచ్చేది కాదు,వాళ్లూ అర్థం చేసుకొని తగినంత మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో డబ్బుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాను. ఆ ఇబ్బందులే నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాయి.ఎన్ని కష్టాలు ఉన్నా ముందడుగే వేశాను.అందుకే నన్నందరూ మొండివాడనేవారు.
ప్రశ్న:6 మీరు భూస్వామ్య కుటుంబం నుంచే వచ్చారు.మీరున్న పరిస్థితిలో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చదువుని గాఢంగా నమ్ముకొని దానివైపే అడుగులు వేశారు దానికి కారణం ఏమిటి?
వ్యవసాయం చేద్దామంటే తప్పకుండా నేను రోజు పొలానికి వెళ్ళాలి,జీతగాళ్ళ జీతాల వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలి.అది నాకు సాధ్యపడదు. నిజానికి నాకు మొదట్లో పాఠశాలకు వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. నాకు రేడియో ద్వారా చాలా విషయాలు తెలిసేవి. అందువల్ల పాఠశాల అవసరం లేదనుకున్నాను. అంతేకాకుండా చదువుకున్న చాలామంది నా దగ్గరికి వచ్చి వార్తలు అడిగి తెలుసుకునేవారు. నాకు అప్పుడు కొంచెం గర్వంగా ఉండేది.అందువల్ల విద్య అనేది కేవలం పాఠశాలకు వెళ్తే మాత్రమే వచ్చేది కాదని, అది రేడియో ద్వారా కూడా నేర్చుకోవచ్చని అనిపించింది .కానీ మా నాన్నగారు మలక్ పేట అంధుల స్కూల్లో నన్ను జాయిన్ చేసినప్పుడు రేడియో కంటే కూడా చాలా విషయాలు స్కూల్లో తెలుస్తాయనే విషయం అవగతం అయింది నాకు. నన్ను హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మా నాన్నగారికి నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అక్కడి డాక్టర్లు చెప్పేవారు.అలాగే వెంకటరెడ్డి సార్ గారు మా నాన్న గారితో చదువు ప్రాముఖ్యం చెప్పి నన్ను చదువులో ప్రోత్సహించమనేవారు. అందువల్ల మా నాన్నగారు ఇక నన్ను చదివించాలనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారు . నీ అన్ని సమస్యలకు చదివే పరిష్కారం చూపెడుతుందని చదువే నువ్వు ఎదగడానికి దోహదపడుతుందని అందువల్ల నువ్వు తప్పకుండా చదవాలని మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను చదువుకోగలిగాను. నాకు ఎప్పుడైనా నిరాశ ఎదురైనప్పుడు మా నాన్నగారి మాటలని గుర్తు చేసుకొని పునరుత్తేజితున్నయ్యే వాడిని. మా నాన్నగారి మాటలతో ఎప్పటికైనా చదువులోనే విజయం సాధించాలని నేను దృఢంగా నిర్ణయించుకున్నాను. నా సమస్యలన్నింటికీ చదువే పరిష్కారం చూపెడుతుందని,చదువే సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది అర్థమైంది.అందుకే నేనెప్పుడూ చదువును వదలలేదు.నాకు చదువులో మా చెల్లెలు, మిత్రులు జగన్మోహన్ రెడ్డి, లెక్కలు చేయడానికి షాప్ లోని మిత్రుడు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా ఊర్లో నిజాం చేత బహిష్కరణ గురైన స్వామీజీ, శివరాం సార్ గార్లు సహాయపడ్డారు. అలాగే స్క్రైబర్స్ కూడా ఎంతో సహాయపడ్డారు. ప్రధానంగా లెక్కల పరీక్షల్లో స్క్రైబర్స్ చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను వారికి నా ధన్యవాదాలు.
ప్రశ్న:7 ప్రస్తుతం అంధుల పాఠశాలల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?
నిజాం రాజు ఒకరకంగా అంధులకు ఎంతో మేలు చేశాడని చెప్పవచ్చు. అతను ముందుగా స్వచ్ఛంద సంస్థల ద్వారా అంధుల పాఠశాలను స్థాపించాడు. మొదట్లో డఫ్ అండ్ డం పాఠశాలలుండేటివి అందులో వికలాంగులు,అంధులు అందరూ కలిసి ఉండేవాళ్ళు .తర్వాత కాలంలో వేరు వేరుగా అంటే అంధుల పాఠశాలలుగా,డఫ్ అండ్ డం పాఠశాలలుగా వేరు చేసి నడపబడ్డాయి. ఇవి ఎంతోమందికి మేలును చేకూర్చాయి.ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయి. అంధుల పాఠశాలల్లో నిజానికి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంధులకు జంతువులు ఏ విధంగా ఉంటాయో తెలిసేలా, వాటి మోడల్ బొమ్మలను ఆ పాఠశాలలో ఏర్పాటు చేస్తే వాళ్లు స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా విజ్ఞాన విషయాలను అందించే ఇప్పుడున్న పరికరాలను వాళ్ళకి అందుబాటులోకి తేవాలి. అప్పుడు వారు కూడా మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళగలుగుతారు.
ప్రశ్న:8 మీరు సాహిత్యం వైపు మళ్ళడానికి కారకులు ఎవరు? మీ పూర్వీకులలో ఎవరైనా సాహిత్యకారులు ఉన్నారా?
పూర్వీకులలో సాహిత్య కారులు ఉంటేనే మనకు సాహిత్యం అలవడుతుందనేది సరైనది కాదు. ఉదాహరణకు సి.నారాయణ రెడ్డి గారు,నందిని సిద్ధారెడ్డి గార్ల కుటుంబాలలో వీళ్ళకంటే ముందు ఎవరు సాహిత్య కారులు లేరు.మా కుటుంబంలో కూడా సాహిత్య కారులు ఎవరూ లేరు. అయితే మా నాన్నకి మాత్రం చదువంటే చాలా ఇష్టం ఉండేది. మా నాన్నగారు కాంగ్రెస్ నాయకులు,పుస్తకాలు బాగా చదివేవారు. అందులో ప్రధానంగా స్వామి దయానంద సరస్వతి రాసిన “సత్యార్థ ప్రకాశిక”గ్రంథాన్ని రోజు ఆరు పేజీల చొప్పున చదివేవారు అలాగే మా ఇంట్లో పెట్టె నిండా ఉర్దూ పుస్తకాలు ఉండేవి. వాటిని కూడా చదివేవారు. అలా మా నాన్నగారు చదివేవారు ,నేనేమో రాస్తున్నాను మా నాన్నగారి చదివే అలవాటే నేను చదువుకోవడానికి, రాయడానికి కారణం అనుకుంటున్నాను.మనకి ఒక్క బ్రాహ్మణులలో లో తప్ప ఇంకా మిగతా ఏ కులాలలో కూడా వాళ్ల పూర్వీకులు ఎక్కువగా చదువుకున్నట్టు సాహిత్య కారులైనట్టు నాకైతే కనిపించలేదు.
ప్రశ్న:9 మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?
నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ప్రభావితం చేస్తే వ్యక్తులు కనిపిస్తారు. నన్ను కూడా ప్రభా చేసిన వారున్నారు.అందులో మొదటగా మా నాన్నగారు. మా నాన్నగారి వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. మా నాన్నగారు 10 సంవత్సరాలు మా ఊరికి సర్పంచ్ గా ఉన్నారు.ఆ సమయంలో అతను ఎన్నో సంస్కరణలు చేపట్టాడు.ఉదాహరణకి లేబర్స్ కి హాలిడే ప్రకటించడం,అంతేకాకుండా ఎవరైనా పంచాయతీ చెప్పమని వచ్చినప్పుడు వారికి జరిమానా విధించేవాడు కాదు.ఎందుకంటే వారివి అప్పటికే చితికిపోయిన బతుకులు. కష్ట సమయంలో ఏ విధంగా ఉండాలి,గమ్యం చేరడం కోసం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి మొదలైనవన్నీ మా నాన్నగారి నుంచే నేర్చుకున్నాను. ఇక రెండవది రేడియో నా జీవితంలో రేడియో చాలా ప్రముఖ పాత్ర వహించింది. రేడియోలో వచ్చే నాటకాలు ఆ నాటకాలలోని మంచి విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకు అది విజ్ఞానాన్ని అందివ్వడమే కాకుండా నా గమ్యం వైపు ముందుకెళ్లేలా ప్రేరేపించింది. నాకెప్పుడూ నిరాశ కలిగిన నేను రేడియో వినేవాడిని. ఈ విధంగా నేను మా నాన్నగారు మరియు రేడియో నాటకాలద్వారా ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాను.
ప్రశ్న:10 సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?
నేను మలక్ పేటలో చదువుతున్నప్పుడు నాకు తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు,తర్వాత కాలంలో అంటే PUC లో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టు కావడంతో చదివేవాడిని. ఆంధ్ర సారస్వత పరిషత్తులో DOL చదవడం ద్వారా,M.A తెలుగు చదవడం ద్వారా నాకు సాహిత్యం పై కొంత అవగాహన కలిగింది. అంతకంటే ముందే నాకు రేడియో పరిచయమైంది కాబట్టి నాకు చాలావరకు దాని ద్వారానే సాహిత్యం పరిచయమైంది.నాకు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం రామాయణ,మహాభారతాలకంటే కంటే ఆధునిక సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం.ఎందుకంటే ఆధునిక సాహిత్యంలో అభ్యుదయపథం వుంటుంది. అభ్యుదయ భావాలతో సాహిత్యం సృజించిన గురజాడ గారు కన్యాశుల్కం నాటకంలో, ముత్యాల సరాలలో బాల్యవివాహాలను ఖండించాడు.శ్రీశ్రీ కార్మికుల,కర్షకుల పక్షాన కవిత్వం రాశాడు,దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార, రుద్రవీణ ద్వారా ఉద్యమ స్ఫూర్తి రగిలించాడు అప్పటి పరిస్థితులలో నిజాం వ్యతిరేకంగా కవిత్వం రాయడం సాహసమనే చెప్పాలి. ఆయన తిరుగుబాటు తత్వం నన్ను ఆకర్షించింది. జాషువా తన “గబ్బిలం” కావ్యంలో కుల వ్యవస్థను ఖండించాడు. ఆయన ఎప్పుడూ నిమ్న వర్గాల గురించే కవిత్వం రాసేవాడు. నాకది బాగా నచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంలో ఓలలాడించాడు. తన ఊహ ప్రేయసి ఊర్వశి పై ఎంతో అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు. అది చదువుతున్నంతసేపు మనం కూడా అతనితోనే ప్రయాణిస్తాం. సినారె గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది.నాగార్జున సాగరంలో దాన్ని చూడవచ్చు. అదేవిధంగా కర్పూర వసంత రాయలు కావ్యం లో లకుమ పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది.ఆయన రచనలు మోటివేషనల్ గా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాపై ప్రభావం చూపారు.
ప్రశ్న:11. మీ జీవితాన్ని నవలగా రాయాలని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది?
నేను చిన్నతనం నుండి ఎక్కువగా ఒంటరిగా ఉండడం వల్ల బాగా ఆలోచించే వాడిని, స్పందించడమంటే ఇష్టపడేవాడిని, చర్చించడం అంటే ఇష్టపడేవాడిని. నేను చిన్నప్పటినుండి ఎక్కువగా నాటకాలు వినేవాడిని కాబట్టి అందులోని పాత్రలను బాగా గమనించేవాడిని, మాటలను కథలను వినేవాడిని. అంతేకానీ రాసేవాడినికాదు. అసలు నాకు 12 సంవత్సరాల వయసు వచ్చేవరకు చదువు అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అంధుల పాఠశాలలోచేరిన తర్వాత బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. ఆ తర్వాతే చిన్న చిన్న కథలను రాయడం సాధన చేశాను. నేను లెక్చరర్ అయిన(1978) తర్వాత నా జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను,పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషులను, అవకాశవాదులను, కొందరు అధికార దర్పంతో జీవితాలను ఎలా శాసిస్తారో మొదలైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి డైరీలో రాసేవాన్ని. నాకు డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చాక(1998) నందిని సిధారెడ్డి గారితో సాన్నిహిత్యం పెరిగింది. అతను ఒక రోజు “నువ్వు నీ జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను డైరీలో రాస్తున్నావు కదా!వాటి ఆధారంగా నీ జీతాన్ని నవలగా రాస్తే బాగుంటుంది”అని సలహా ఇచ్చాడు.ఆ ఆలోచన నాకు నచ్చింది.నేను నా జీవితాన్ని కథలుగా చెప్పడం సాధ్యం కాదు,నాటకంగా చెప్పలేను ,కాబట్టి నవలగానే రాయాలనుకున్నాను. దీని కారణమేంటంటే నవల విస్తృతి పెద్దది.నేను అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి”మాలపల్లి”వట్టి కోట ఆళ్వారు స్వామి గారి” ప్రజల మనిషి”వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు”,బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” మొదలైన నవలలు చదివాను కాబట్టి నవల రాయగలననిపించింది. అయితే అయితే మరి నా నవల కేవలం నా జీవితాన్నిమాత్రమే కాకుండా అప్పటి చారిత్రక, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించాలనుకున్నాను. దాదాపు 2000 సంవత్సరం నుండి 2012 వరకు నా యొక్క డైరీ ఆధారంగా నవలను బ్రెయిలీ లిపిలో రాసుకున్నాను.మామూలు పేజీలలో 500 పేజీలు అయితే బ్రెయిలీ స్క్రిప్ట్ లో 3000 పేజీలలో పూర్తయ్యింది.
ప్రశ్న:12, ఈ నవల రాయడంలో మీకు సహాయపడింది ఎవరు ?
ముందుగా నవలను నేను బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నాను.అప్పుడు ఎవరు సహాయపడలేదు.అది నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అయితే అది చూపు ఉన్న వాళ్లకు చదవడం సాధ్యం కాదు గనక దానిని వాళ్ళకు కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో పుస్తకంగా బయటకు తీసుకురావాలనుకున్నాను. ఈ క్రమంలో నా శిష్యుడు మహేందర్ రెడ్డి ఒక మూడు అధ్యాయాల వరకు రాశాడు. తర్వాత ఎందుకో అది పూర్తి కాలేదు. ఇక నా నవల బయటకు రాదేమోనని అనుకున్నాను. దీనికి పరిష్కారం ఎట్లా అని ఆలోచించే క్రమంలో నేను ఒక వాయిస్ రికార్డర్ కొన్నాను.అందులో నా బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నదాన్ని పూర్తిగా రికార్డు చేసుకున్నాను. ఎప్పుడైనా నా మనవడో మనవరాలో ఇది విని వాళ్లైనా పుస్తకంగా బయట తీసుకొస్తారని చిన్న ఆశ ఉండేది. ఎందుకంటే అన్నమయ్య కూడా తను పాటలు పాడుకుంటూ పోయేవాడు వాటిని లిఖితబద్దం చేసింది మాత్రం తన వారసులే.. అలాగే నా వాళ్ళు కూడా బయటకు తీసుకొస్తారని అనుకున్నాను. కరోనా సమయంలో ఒకసారి నా శిష్యురాలు ధూళిపాల అరుణ నాకు ఫోన్ చేసినప్పుడు మాటల మధ్యలో నా నవల విషయం ప్రస్తావనకు వచ్చింది అప్పుడు ఆమె ఈ నవలను నేను రాస్తాను సార్ అని ముందుకు వచ్చింది. అయితే నేను వాయిస్ రికార్డర్ లో భద్రపరచిన ఈ నవలను ఆమెకి పెన్ డ్రైవ్ ద్వారా పంపించాను. దాని ద్వారా వినుకుంటూ రాయడం ఆమెకు కొంత ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత అలా కాదని నేను ప్రతిరోజూ కొంత డిక్టేట్ చేస్తుంటే ఆమె రాసేది. ఇట్లా 2019 నుండి 2021 వరకు ఆమె నవల రాయడం పూర్తి చేసింది. దీనిని టిడిపి చేసే బాధ్యతను తన మిత్రురాలు వల్లి తీసుకుంది.నిజంగా వీళ్ళు లేకపోతే నా నవల బయటకు వచ్చేది కాదు. వీరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఈ నవల ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు. నందిని సిధారెడ్డి గారు ఈ నవలను డెని సైజులో ప్రింట్ చేయమన్నారు అలా చేస్తే 600 పేజీల వరకే అవుతుందన్నారు. రోమ్ సైజులో చేస్తే 500 పేజీల్లో పూర్తవుతుందన్నారు అందువల్ల దీన్ని రోమ్ సైజులోనే ప్రింట్ చేయమన్నాను. దానికి ముఖచిత్రం నుండి పూర్తయ్యే వరకు నా శిష్యురాలు ధూళిపాల అరుణనే పూర్తి బాధ్యత తీసుకుంది. ఆమెకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.నాకు శిష్యులు ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో ఎంతో సహాయం చేశారు. ఉదాహరణకు ఢిల్లీలో మహాభారతంపై సదస్సు జరుగుతున్నప్పుడు నన్ను ప్రసంగించమని నా శిష్యురాలు ఊర్మిళ కోరింది. నాకు సాధ్యం కాదు అనుకున్నాను. అయితే ఆమెనే కోఆర్డినేటర్ తో మాట్లాడి నేను ప్రసంగించడానికి అవకాశం కల్పించింది. నేను ఢిల్లీలో ఉన్న మూడు రోజులు నాకు ఎంతో సహాయం చేసింది. ఆ రోజు నేను మహాభారతంలోని స్త్రీ పాత్రలపై మాట్లాడాను. అది నా జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తాను. అంతే కాకుండా నేను కాలేజీ వెళ్తున్నప్పుడు నన్ను కాలేజీ వరకు తీసుకురావడానికి ఒక్కొక్క దశలో ఒక్కో విద్యార్థి ఇలా ఎందరో నాకు నా శిష్యులు సహాయం చేశారు వారికి ధన్యవాదాలు.
ప్రశ్న:13, మీ నవల ఒక చారిత్రక డాక్యుమెంట్ లా అనిపిస్తుంది అలా రాయడానికి కారణం ఏమయ్యుంటుంది.?
నేను నవల రాసేముందు కొన్ని నవలలు చదివాను అందులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” నవల బుచ్చిబాబు గారి “చివరికి మిగిలేది” నవల వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” చాలా బాగా అనిపించాయి. ఈ నవలలు చదివిన తర్వాత నవలకి ఒక లక్ష్యం అంటూ ఉండాలని అర్థం అయింది. అంతేకాకుండా అప్పటి పరిస్థితులను కూడా వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని తెలిసింది.
నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ వచ్చాను. నా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి వాటిని ఎదుర్కొన్నాను. నవల రాసేటప్పుడు అందులోని సమస్యలను చర్చించేటప్పుడు దాని వెనుకున్న నేపథ్యం చెప్తే ఆ సమస్యగురించి పూర్తిగా పాఠకులకు అర్థమవుతుందని, అలాగే ఆ కాలంనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా ముందుతరాలకు తెలియాలనే ఉద్దేశంతో అలాంటి అంశాలను ప్రస్తావించాను. బతుకమ్మ పండుగ గురించి చెప్పేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించాను, నేత పనివారీ మగ్గం గురించి వివరించాను.అలాగే బెల్లం ఏ విధంగా తయారవుతుంది దానికుపయోగించే పరికరాలు ఏమిటి అనే విషయాలను,కులం ప్రస్తావన వచ్చినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు-సమాజంపై దాని ప్రభావాన్ని వివరించాను. ఇవే కాకుండా అవసరమైన సందర్భాల్లో చాలా చారిత్రక అంశాలను ప్రస్తావించాను. ఇదంతా ముందు తరాల వారికి తెలియడం కోసమే.
ప్రశ్న: 14. మీకు ఈ నవల రాయడంలో ప్రతిబంధకాలు ఏమైనా ఏర్పడ్డాయా?
నేను నా జీవితంలోని ముఖ్య సంఘటనలన్నింటినీ డైరీలో రాసుకున్నాను కాబట్టి వాటి ప్రకారం నేను నవలను మొదట బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాలేదు. కానీ అది చూపు ఉన్నవారు చదివేలా బయటికి రావాలంటే మాత్రం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని రాయాలి,టిడిపి చేయించాలి,దాంట్లోని తప్పొప్పులను చూడాలి,ముఖచిత్రాన్ని వేయాలి ఇంత తతంగం ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా చేస్తానో అని అనుకున్నాను. కానీ ఈ సమస్యలన్నింటినీ దాటుకొని నవల బయటకు వచ్చిందంటే దానికి పూర్తి కారణం ధూళిపాల అరుణ. ఆమె పడ్డ శ్రమ అంతా అంతా కాదు నేను చెప్పడం వరకే ఆపై పూర్తి బాధ్యత ఆమెనే తీసుకుంది. ముఖచిత్రం పైన ఉండే ఆ డిజైన్ రూపకల్పన చేసింది అరుణ మేనల్లుడు ప్రవీణ్. చాలా చక్కగా వేయించింది. నవల వెలువడడంలో పూర్తి బాధ్యత అరుణనే తీసుకుంది కాబట్టి ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.అందుకే ఈ నవలను ఆమెకే అంకితం ఇచ్చాను.
ప్రశ్న:15. నవల చదువుతున్నంత సేపు మీరు స్త్రీ పక్షపాతి లాగా కనిపిస్తారు. దాని కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఎంత పెద్ద వాళ్ళయినా వాళ్ళ చిన్నతనంలో తల్లి దగ్గరే పెరుగుతారు తల్లి చూపే ప్రేమను ఆస్వాదిస్తారు.ఇది సాధారణ విషయమే కానీ నా జీవితంలో నేను అందరికంటే కొంచెం ఎక్కువగా తల్లి దగ్గరే గడిపాను. ఎందుకంటే నాకు చూపు లేదు కాబట్టి బయట ఆడుకోలేను. అందువల్ల ఇంట్లోనే ఎక్కువ ఉండేవాణ్ణి. మా అమ్మనే నన్ను జాగ్రత్తగా చూసుకునేది.అమ్మలోని తియ్యదనం అర్థమైందప్పుడు. నా జీవితంలో రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.ఆమె రేడియోలో మాట్లాడిన మాటల ద్వారా నేను ఎంతో ఉత్తేజం పొందేవాన్ని. ఎప్పుడు బాధ కలిగినా ఆమె మాటలు వింటూ సాంత్వన పొందేవాన్ని. నాలోని చాలా ఊహలకి కారణం ఆమె తీయనైన మాటలే. బహుశా ఇది కూడా ఇంకొక కారణం అయి ఉంటుంది.ఇక నాకు చిన్నతనంలో ఎక్కువగా అక్కయ్యలతో గడపడం వలన స్త్రీల మనస్తత్వాన్ని దగ్గరగా చూసి అవకాశం కలిగింది. నిజానికి స్త్రీ మన జీవితాల్లో అక్కగా, చెల్లిగా,అమ్మగా,భార్యగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది.మనం ఏ విషయమైనా ముందు అమ్మతో చెప్తాము. నేను ఇంకెక్కువ ఎందుకంటే నాకు మా నాన్నంటే భయం. నేను ప్రతి విషయాన్ని అమ్మతో పంచుకునేవాన్ని. మా అమ్మ నా సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేసేది అప్పుడు అమ్మ మీద మంచి అభిప్రాయం కలిగింది. నా చిన్నతనంలో మా ఇంటికి చుట్టుపక్కల ఉండే స్త్రీలు వచ్చి తమ బాధలన్నింటిని మా అమ్మతో పంచుకునేవారు. నేను ఇంటి పై గదిలోనుండి వినేవాడిని.అదేవిధంగా పంచాయతీ కోసం మా నాన్నగారి దగ్గర ఎప్పుడూ జనాలు ఉండేవారు అందులో ఎక్కువ మంది తమ భర్తల చేత బాధింపబడ్డ స్త్రీలే….వాళ్ల గోడు విన్నప్పుడు నా మనసు చివుక్కుమనేది. ఆడవాళ్లు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటారా? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్లు మళ్లీ భర్త కోసం,పిల్లల కోసం ఆలోచిస్తారు. వాళ్ళది ఎంతో గొప్ప మనసు అని అనుకునేవాన్ని. అలా స్త్రీల పట్ల నాకు జాలి వేసేది,తర్వాత గౌరవం పెరిగింది. సాధారణంగా మగవాళ్ళు బయట పని చేసి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ స్త్రీలు బయట కూలి పనికి వెళ్లి వచ్చి మళ్లీ ఇంటికి రాగానే ఇంటి పనులు చూసుకుంటారు. నిజానికి వాళ్లు కుటుంబంకోసం యంత్రంలాగ పనిచేస్తారు. వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.వారి ఓపికకు జోహార్లు. నాకు స్త్రీల జీవితం ఎంతో ప్రేరణనిచ్చేది. ఎందుకంటే వాళ్లు గృహబంధీలుగానే ఉంటారు, నేనూ గృహబంధీనే . వాళ్లకి లేని బాధలు నాకెందుకు అనుకునేవాన్ని నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళతో పోల్చుకొని కొంత సంతృప్తి పడేవాడిని. నా జీవితంలో అడుగడుగునా నాకు ఎక్కువగా సహాయపడింది స్త్రీలే.అంతెందుకు ఈ నవల బయటకు రావడానికి కారణం కూడా ధూళిపాల అరుణ మరియు వల్లిలే కారణం కదా ! అందువలన నేను స్త్రీపక్షపాతిలాగా కనిపిస్తాను.
ప్రశ్న:16. ఈ నవలలో మీరు భగ్న ప్రేమికులుగా కనిపిస్తారు. మరి మీ ప్రేమ విఫలం కావడంలో కులం పాత్ర ఏమిటి? అసలు కులం పైన మీ అభిప్రాయం ఏమిటి?
ఆర్యుల రాకపూర్వం కుల వ్యవస్థ ఇంత ఉండేది కాదు.వాళ్ళువాళ్ళ మనుగడ కోసం ఈ కుల వ్యవస్థను సృష్టించారు. వాళ్ళు మనుస్ర్మతిలో అన్ని అంశాలను వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు.విభజించి పాలించడానికి పునాదులు వేసింది వాళ్లే.ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి కూలకుండా తయారైంది. నా ప్రేమ విఫలంకావడంలో కూడా కులం ముఖ్యమైన పాత్ర వహించింది. నేను చదువుకుంటున్న రోజుల్లో నా వద్దకు మా వాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నేను మొదట వద్దన్నాను. ఎందుకంటే నాకు నా ఊహ సుందరి రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ వుండనే ఉంది. ఆమె మాటలే నాకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చేవి. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే అలా బాగా మాట్లాడే అమ్మాయిని చేసుకోవాలని కోరిక ఉండేది, అమ్మాయిల్లో అలాంటి ధైర్యం,అలాంటి మంచి స్వభావం,ఉండాలన్నదే నా కోరిక. ఆ స్వభావాలు ఆంధ్ర అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తాయని నా భావన. అలాంటి అమ్మాయిలు తెలంగాణలో దొరకదనేది నా నమ్మకం.నేను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో నాకు కొంత స్పష్టత ఉంది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు పుస్తకాలు చదివి పెట్టాలని,నాకు ధైర్యం చెప్పాలని,నా అంధత్వాన్ని అంగీకరించాలని అనుకున్నాను. అలాంటి అమ్మాయి దొరికితే మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్నాను.అప్పుడు మా గుమాస్తా హనుమంతయ్య మా ఇంటి పక్కన సంబంధం గురించి చెప్పాడు ఆ అమ్మాయి పేరు సాధన. వాళ్ళ నాన్న నర్సింగరావు, వెలమ కులస్తుడు.మా నాన్నగారితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది మా అమ్మతో చాలాసేపు మాట్లాడేది. అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు కానీ పెళ్లి ప్రస్తావన రాగానే కొంచెం ఆమె మాటల మీద ఆసక్తి పెరిగింది . ఆ అమ్మాయిలో నేను అనుకున్న లక్షణాలు పూర్తిగా ఉన్నాయని తెలిసింది. బాగా గమనించి రెండున్నర సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నాను.ఆ సమయంలో ఆమెతో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకున్నాను, ఊహల్లో బతికాను,ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను,ఇక సాధనే నా సరస్వము అనుకున్నాను. ఇక తీరా పెళ్లి పీటలెక్కే సమయంలో ఒక రెడ్డి కుల సంబంధం వచ్చింది,వాళ్ళు పేదవాళ్లు వెంటనే మా పెద్దవాళ్లు ప్రధానంగా మా బావ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు .రెండున్నర సంవత్సరాల నా ప్రేమని ముక్కలు చేసి తలవంచుకుని వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టమంటున్నాడు. అంటే నా అభిప్రాయాలపై వాళ్లకి గౌరవం లేదు అనుకున్నాను. వాళ్లకు కావాల్సింది కులమే. నేను ప్రేమించిన సాధన వాళ్ళ నాన్నకు రెండవ భార్య కూతురు,మొదటిభార్య చనిపోతే రెండవ భార్యగా బలిజకులస్తురాలిని పెళ్లి చేసుకున్నాడు. నాన్నమో వెలమ కులస్తుడు అమ్మేమో బలిజ కులస్తురాలు. కాబట్టి సాధనను కులం తక్కువ అన్నారు. అప్పుడు నేను మొదట్లో ఈ కులం గుర్తుకు రాలేదా ? అని ప్రశ్నించాను.వాళ్లు సమాధానం చెప్పలేదు. ఎవరు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. పంచాయతీ పెద్ద చేత కూడా చెప్పి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు నేను మహాభారతంలో కూడా కులాంతర వివాహాలు చాలా ఉన్నాయని శూద్ర కులస్తురాలైన అరుంధతిని వశిష్ఠుడు పెళ్లి చేసుకోలేదా? అని ఎదురు ప్రశ్నించాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేక వెళ్లిపోయాడు. అదే సమయంలో నాకు ఉస్మానియా మెట్రిక్ పరీక్ష ఫీజు డేటు దగ్గర పడుతుంది ,ఫీజు కట్టాలి నేను పెళ్లికొప్పుకుంటే మా బావ డబ్బులిస్తాడు, మా కుటుంబ సభ్యులు నాకు సహాయంగా ఉంటారు. లేకుంటే లేదు. మరేం చేయాలి అని నేను ఒక మూడు రోజులు విపరీతంగా మదనపడ్డాను. నిద్ర సరిగ్గా పట్టలేదు. భూమి బద్దలవుతున్నట్టు అనిపించింది.మనసు పడ్డ అమ్మాయిని వదిలి కులం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా…ఊహించుకోలేకపోయాను. కానీ చివరికి మా పెద్దవాళ్ల అధికార దర్పమనే ఖడ్గానికి నా ప్రేమ ముక్కలైపోయింది. చివరికి రెడ్డి కులస్తుల అమ్మాయి తోనే నా పెళ్లి జరిగింది.జూదంలో ధర్మరాజు ద్రౌపదిని బలి చేసినట్టు నేను కూడా ఈ కులభూతానికి నేను ప్రేమించిన అమ్మాయిని బలి చేశాననిపించింది. నాకు మొదటి నుంచి కులం మీద మంచి అభిప్రాయం లేదు.ఎందుకంటే అది మనుషులను వేరు చేస్తుంది. నిజానికి నేను ఒక హరిజన అమ్మాయిని లేదా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను .ఎందుకంటే వాళ్ళ లోపల జాలి,దయ ఎక్కువగా ఉంటాయి.రెడ్డి కులస్తులకు అధికార దర్పం ఉంటుంది, అహంకారం ఉంటుంది. నేను లెక్చరర్ గా పని చేస్తున్నప్పుడు కూడా నన్ను క్లాస్ రూమ్ కి ఎక్కువగా తీసుకెళ్లింది నిమ్నకుల అమ్మాయిలే. కాబట్టి వాళ్ల మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది. ఈ విధంగా కులం వేసిన కాటుకు నేను బలైపోయాను. ఈ కులం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే మనిషి మనిషిగా నిలబడతాడు.
ప్రశ్న:17 మీ నవల చదువుతుంటే “అల్పజీవి,అంపశయ్య” నవలలు గుర్తొచ్చాయి,వాటిలో ఉండే చైతన్య స్రవంతి శిల్పమే కొంతవరకు మీ నవలలోపల కనిపించింది.అది అనుకొని ఆ పద్దతిలో రాశారా ? లేక అనుకోకుండా మీ నవలలో చేరిందా?
సాధారణంగా చాలా నవలల్లో అధ్యాయాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి “ప్రజల మనిషి” నవలలో 20 అధ్యాయాలు ఉంటాయి. ఆ నవల మొత్తం 150 పేజీల్లో ముగుస్తుంది. నా నవలకు వచ్చేసరికి ఇది దాదాపుగా 500 పేజీలు ఉంటుంది కానీ అందులో 11 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక్కో అధ్యాయంలో 50 పేజీల వరకు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక అంశాన్ని వివరించేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పాల్సి వచ్చింది. ఉదాహరణకి బెల్లం గురించి చెప్పేటప్పుడు ఆ బట్టిల గురించి ప్రస్తావించడం,తయారు చేసే విధానాన్ని కూలంకషంగా చెప్పడం, అలాగే పద్మశాలీల మగ్గం గురించి వివరంగా చెప్పడం,పండగల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పండుగ నేపథ్యం ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు ?ఎలా జరుపుకుంటారు? అనే విషయాలను వివరంగా చర్చించడం వల్ల అంత పెద్దగా అయింది.అయితే నా మానసిక సంఘర్షణ గురించి చెప్పేటప్పుడు మాత్రం చైతన్య స్రవంతి శిల్పంలో చెపితే బాగుంటుందని అదే శిల్పాన్ని ఆశ్రయించాను. ఎందుకంటే ఆ శిల్పం పాఠకుల్ని తనతో పాటు తీసుకెళ్తుంది. రచయిత అనుభవించిన అనుభూతిని పాఠకులూ అనుభవిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాలలో నేను అనుకొని ఆ శిల్పాన్ని ఆశ్రయించాను.
ప్రశ్న:18 మీకు నచ్చిన ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు ఎవరు?వాళ్లు ఎందుకు నచ్చారు?
నాకు చిన్నతనంలో చదివే అలవాటు ఎక్కువ లేదు. ఎందుకంటే చదవడానికి మనిషి కావాలి కాబట్టి రేడియో ద్వారానే నాటకాలు,కథలు,నవలలు వినేవాడిని పెళ్లయిన తర్వాత నా భార్య జ్యోతి ఎన్నో పుస్తకాలను చదివి వినిపించేది.నాకు ప్రాచీన సాహిత్యంకంటే ఆధునిక సాహిత్యమన్నా,సాహిత్యకారులన్నా చాలా ఇష్టం. రాసిన రామాయణ,మహాభారతాల్లో స్త్రీని తక్కువ చేసినట్టనిపించింది. ఉదాహరణకు: సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయమనడం,భారతంలో ద్రౌపదిని ధర్మరాజు జూదంలో పెట్టడం లాంటివి బాధ కలిగించే విషయాలు. ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు గారు సంఘంలోని లోపాలను ఎత్తిచూపాడు,సంస్కరణలకు బాటలు వేశాడు ,కన్యాశుల్కంలో,ముత్యాల సరాలలో బాల్య వివాహాలను తప్పని ఎత్తి చూపాడు. దేశభక్తి గేయంలో అద్భుతంగా దేశభక్తిని ప్రతిబింబించాడు,అది ఏ దేశానికైనా వర్తించే దేశభక్తి గేయం. ఇలా గురజాడ తన అభ్యుదయభావాలతో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశాడు. అలాగే రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం ద్వారా అద్భుతమైన సాహిత్యాన్ని సృజించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంతో ఓలలాడించాడు. సి నారాయణ రెడ్డి గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది,అతని నాగార్జున సాగరం చాలా బాగుంటుంది. అలాగే కర్పూరవసంతరాయలు కావ్యంలో లకుమ త్యాగాన్ని గొప్పగా చిత్రించాడు. అదేవిధంగా దాశరధి లోని ఉద్యమ తత్వం నన్ను బాగా ఆకర్షించింది.అతను రాసిన అగ్నిధార, రుద్రవీణ నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఆ కాలంలో నిజాముకు వ్యతిరేకంగా కవిత్వాన్ని అలా రాయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. దాశరథిలోని ఉద్యమ తత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు రాస్తున్నవాళ్ళలో నందిని సిధారెడ్డి గారి కథలంటే నాకు చాలా ఇష్టం.అతని బందారం కథలలో స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది, అంతరించిపోతున్న కులవృత్తులు కనిపిస్తాయి, కథ సూటిగా స్పష్టంగా చెప్తాడు.అలాగే కందుకూరి శ్రీరాములు గారి కవిత్వం అంటే కూడా ఇష్టమే.
ప్రశ్న:19 మీరు భవిష్యత్తులో కూడా ఈ నవల ప్రక్రియనే కొనసాగిస్తారా లేదా మరేదైనా ప్రక్రియలో రచనలు చేపడతారా?
నేను ప్రస్తుతం అయితే ఈ నవల ట్రయాలజీని పూర్తి చేయాలనుకున్నాను. నా నవల మూడు భాగాలుగా వస్తుంది. ప్రస్తుత భాగం ఒకటవది. ఇది పుట్టినప్పటి నుండి కాలేజీ చదువు పూర్తి అయ్యేంతవరకు వుంటుంది. ఇక రెండవ భాగం ఉద్యోగ జీవితం. మూడవ భాగం రిటైర్మెంట్ తర్వాత జీవితం వీటిని పూర్తి చేయడంకోసం కసరత్తు జరుగుతుంది. ఇవి పూర్తయ్యాకే వేరే ప్రక్రియ లో రాయడానికి ఆలోచిస్తాను. నా నవల చదువుతున్నప్పుడు నందిని సిధారెడ్డి గారు ఏమన్నారంటే ఈ నవలలో కొన్ని “కథా లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు కథలు కూడా రాయగలవు వీలైతే రాయి” అని సలహా ఇచ్చాడు. అలాగే కందుకూరి శ్రీరాములు గారు కూడా నన్ను కథలు రాయమని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నవలల్ని పత్రికలు ప్రచురించడం తక్కువైంది కథలైతే ప్రచురించే ఆస్కారం ఎక్కువ అన్నారు. నేను కూడా ఆలోచిస్తున్నాను కవిత్వం రాద్దామంటే కొంత దృశ్యం చూడగలగాలి అది అసాధ్యం. కవిత్వం మెరుపు వంటిది అది క్షణకాలం ఉండి వెళ్ళిపోతుంది కథనైతే వెన్నెల లాంటిది చాలాసేపు నిలవగలుగుతుంది. కథ అయితే బాగా రాయొచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది.కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కథలు రాస్తాను.
ప్రశ్న:20 ఈ నవల రాయడంలో,మీ సాహిత్య అధ్యయనంలో,మీ జీవితంలో,మీ సహచరి యొక్క పాత్ర ఏమిటి ?
నా జీవితంలో నా సహచరి జ్యోతిప్రభ పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేను చదువుకునేటప్పుడు సబ్జెక్టు పుస్తకాలను చదివిపెట్టేది. నవలలు కూడా చదివి పెట్టేది.అలాగే నోట్స్ కూడా డిటెక్ట్ చేస్తే రాసేది, పరీక్షలు రాస్తున్న సమయంలో కూడా బాగా సహకరించేది.నా ఉద్యోగ ధర్మంలో ఆమె సహకారం మరువలేనిది. నేను ఈ నవలను ముందుగా బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను, నేనే వాయిస్ రికార్డ్ చేశాను కాబట్టి ఈ నవల రచనలో ఆమె పాత్ర అంతగా లేదు కానీ మిగతా జీవితంలో అన్నీ తానే అయింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాటే అవుతుంది.
ప్రశ్న:21 ఇప్పుడొస్తున్న కొత్త రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు చాలామంది యువకులు తమ కలాలను కదుపుతున్నారు.అయితే వాళ్లు ముందుగా గుర్తుంచుకోవాల్సింది అధ్యయన,దర్శనం,వర్ణనం.వాళ్లు ప్రథమంగా చేయాల్సింది తమ సీనియర్ రచయితల రచనల్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి కనిపిస్తుంది ఉదాహరణకి వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” నవలలో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది.యుద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లో కూడా వాస్తవికత ఉంటుంది కానీ దానికంటే ఎక్కువగా కల్పనలు ఉంటాయి. ఈ వాస్తవికతే పాఠకులకు త్వరగా చేరువౌతుంది. కాబట్టి కొత్త రచయితలు ఎక్కువగా వాస్తవిక చిత్రణ కోసం ప్రయత్నించాలి. ఆధునిక సాహిత్యమే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని కూడా విస్తృతంగా చదవాలి. ప్రాచీన కవులలో నన్నయది కథనాత్మకశైలి, తిక్కనది నాటకీయ శైలి,ఎర్రనది వర్ణణాత్మకశైలి. ఇలా ప్రతివారి శైలిని గమనించి వస్తువుకు ఏది బాగుంటుందో దాన్ని ఎన్నుకోవాలి.మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. పొలం దున్నేటప్పుడు, నాట్లువేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, వడ్లు ఎత్తేటప్పుడు, ఇలా అడుగడుగునా కాయ కష్టం ఉంటుంది.ఎక్కువగా శ్రామికులు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినట్లయితే ఎన్నో కథా వస్తువులు దొరుకుతాయి. వాటిని అక్షరబద్ధం చేయగలిగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి కథలల్లో మట్టి వాసన వుంటుంది.అందువల్ల అవి అందరికీ చేరువౌతాయి. అలాగే అంతరించిపోయిన కులవృత్తుల గురించి కూడా అద్భుతంగా కథలు రాయొచ్చు.అవి వాస్తవ జీవితాలు కాబట్టి అందరూ త్వరగా అక్కున చేర్చుకుంటారు .కాబట్టి యువరచయితలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
ప్రశ్న:22 ఈ నవల మూడు భాగాలుగా వస్తుందన్నారు మరి రెండవ,మూడవ భాగాలు ఎప్పుడు వస్తాయి,వాటిని గురించిన విశేషాలు చెప్పండి.
ఈ నవలలోని మొదటి భాగం నా చదువు పూర్తయ్యే వరకు ఉంటుంది. రెండో భాగం నా ఉద్యోగ జీవితం గురించి ఉంటుంది .నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం వచ్చింది కదా ఇక జీవితం హాయిగా ఉంటుందనుకుంటారు, కానీ అందరి జీవితం ఒకేలా ఉండదు కదా! నా 34 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో మలుపులు,ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో మధుర స్మృతులు ఉన్నాయి.నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భీమా రెడ్డి అనే విద్యార్థి నేను బాగా చెప్పడంలేదని నా పైన ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేశాడు. అప్పుడు ప్రిన్సిపాల్ నన్ను పిలిచి సబ్జెక్టు పైన ఇంకా పట్టు సంపాదించుకోవాలని చెప్పాడు. అది సరైన కారణం కాదు అని నా అంతరాత్మకు తెలుసు.ఆ సమయంలో నేను విపరీతంగా బాధపడ్డాను. నేను నమ్ముకున్నది అధ్యాపక వృత్తిని. ఇంకా నేర్చుకోవాలనుకున్నాను. ఇంకా బాగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత ఒక ప్రశ్న ఎదురయింది నేను సరిగా చెప్పకపోతే సెకండ్ ఇయర్ వాళ్లు కూడా కంప్లైంట్ చేయాలి కదా! మరి వాళ్ళు ఎందుకు చేయలేదు. తర్వాత కాలంలో నా పైన ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ అబ్బాయి నాతో సన్నిహితంగా మెలిగాడు అప్పుడు నేను అతడిని అడిగాను. ఎందుకు కంప్లైంట్ చేసావని అప్పుడు అతను ఏమన్నాడంటే “మిమ్మల్ని రోజు తీసుకురావడం ఇబ్బంది అనిపించింది” అని. నా టీచింగ్ లో లోపం లేకపోయినందుకు నాకు సంతోషమేసింది. అయినప్పటికీ నేను పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు మొత్తం పాఠమే కాకుండా చివరి 15 నిమిషాలు నేను విపులలో చదివిన కొత్తకొత్త కథలు చెప్పే వాడిని,వాళ్ళని చర్చలోకి తీసుకొచ్చేవాడిని అప్పుడు పిల్లల లోపల ఆసక్తి బాగా కలిగింది. నా క్లాసును ఆసక్తిగా వినడం వాళ్ళ అలవాటయింది. ఇలాంటి మధురస్మృతులు, సమస్యలు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి కాబట్టి వాటి గురించి ఒక భాగంగా రాయాలనుకున్నాను. నేను 2012లో రిటైర్ అయ్యాను ఆ తరువాత సమస్యలు ఏముంటాయని మీరు అడగవచ్చు, కానీ ఆ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను రిటైర్ అయ్యాక సొంతూరికి వెళ్లిపోయాను అక్కడ పొలం వ్యవహారాలు చూసుకున్నాను కొత్త విషయాలను చేరవేసే పరికరాలు, అవకాశాలు విపరితంగా పెరగడంతో కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిమగ్నమయ్యాను ఆ విషయాలన్నింటినీ మూడో భాగంగా (రిటైర్మెంట్ తరువాతి జీవితం 2012- 2022 వరకు)తీసుకు వస్తున్నాను. దాంతో ఈ నవల సమాప్తం అవుతుంది. నా నవల రెండవ భాగం ఈ సంవత్సరం (2023)చివర్లో రావచ్చు. మూడో భాగం తర్వాత సంవత్సరంలో(2024) వస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి పనులను కూడా ధూళిపాల అరుణనే చూసుకుంటుంది.
ప్రశ్న:23 మీరు మీ జీవితం ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి?
జీవితం పూల పాన్పు కాదు. అందులో అంధుల జీవితం అసలే కాదు. ఎవరికైనా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. నిరంతరం ఆ గమ్యాన్ని చేరుకోవడం గురించి ఆలోచించాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. గమ్యం చేరడం కోసం చేసే ప్రయత్నం లోనే జీవితం విలువ తెలుస్తుంది. అవి ఇతరులకు పాఠాలుగా నిలుస్తాయి. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేయాలి. నిరంతరం జ్ఞాన సంపాదన కోసం కృషి చేయాలి. జ్ఞానవంతులని ఈ సమాజం గౌరవిస్తుంది.ఆదరపుర్వకకమైన మాటలే మనకు సన్నిహితుల్ని పెంచుతుంది. నేను డిగ్రీ లెక్చరర్ గా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో రీప్రెషరీ కోర్సు చేయడం కోసం 25 రోజులు అక్కడే ఉన్నాను. కొత్త వాతావరణం కాబట్టి నేను కొంత ఇబ్బంది పడ్డాను.అప్పుడు అప్పటివరకు పరిచయం లేని సహాధ్యాయినిలు ఝాన్సీ,మోహన శ్రీ గార్లు నన్ను చేతి పట్టుకొని సెమినార్ హాల్ కి తీసుకువెళ్లేవారు. నేను చాలా ఆశ్చర్యపోయాను నాలో వారు ఏం గమనించారో ఏమో కానీ వాళ్లు నాపైన ఎంతో అభిమానం చూపించారు.తర్వాత వాళ్ళు నాకు మంచి మిత్రులుగా మారిపోయారు.ఆ సమయంలో ఎంతో సహాయం చేసిన వారిద్దకి ధన్యవాదాలు.
ఈ సందర్భంగా చెప్పే మరొక విషయం ఏమిటంటే అంధుల సాహిత్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.మొన్న నందిని సిద్ధారెడ్డి గారు ఉత్తర భారతదేశంలో జరిగిన సాహిత్య సభలకు వెళ్లి వచ్చారు. అక్కడ చాలామంది సాహితీ కారులను కలుసుకున్నారు.అక్కడ భిన్నమైన సాహిత్యం చర్చకు వచ్చిందట. అక్కడ అంధుల సాహిత్యం లేదని అన్నప్పుడు నాకు బాధ కలిగింది .అంధులు కూడా అద్భుతమైన సాహిత్యం సృజిస్తారు. వాళ్లను ఆదరించాలి,గౌరవించాలి. వాళ్లకు చూపు లేకపోయినా వాళ్లు సాహిత్యంతో సమాజానికి దారి చూపగలరు. వాళ్లను, వాళ్ల సాహిత్యాన్ని ఇకనైనా ఆదరిస్తారని నమ్ముతున్నాను.ఇక సెలవు.
– డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య
ప్రముఖ రచయిత, బహు గ్రంథ పరిష్కర్త, సంపాదకులు, సాహితీ పిపాసులు డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య గారితో మయూఖ ముఖాముఖి…
– అరుణ ధూళిపాళ
ఎన్నో గ్రంథాలను పరిష్కరించి, మరెన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించి, అనేకానేక కవులు, రచయితల గ్రంథాలకు పీఠికలు రచించి, తాను స్వయంగా పుస్తకాలు రచించి, తెలుగు సాహిత్య పరిమళాలను వ్యాపింప చేసిన సాహితీ జిజ్ఞాసులు డా. శ్రీ పెరుంబూదూరు రంగాచార్యులు. వారి యొక్క జీవిత విశేషాలను వారి మాటల్లోనే చూద్దాం.
నమస్కారం మాస్టారూ..
1. మీ జన్మస్థలం, మీ బాల్యం గడిచిన తీరు గురించి వివరించండి.
జ: నమస్కారం అమ్మా! నేను నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, చందుపట్ల గ్రామంలో అక్టోబరు 23, 1944 లో పుట్టాను. మా అమ్మగారు తాయమ్మ, నాన్నగారు రాఘవాచార్యులు గారు. మా ఊళ్ళో నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. అప్పటికి హైస్కూల్ లేదు ఆ వూళ్ళో. మా నాయనగారు సర్పంచ్ అయిన తర్వాత హైస్కూల్ వచ్చింది ఊరికి. కానీ అప్పటికే మా పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. మాకొక పది ఊళ్ళ పౌరోహిత్యం ఉండేది. కాబట్టి మా నాయనగారు మా అందరికీ తత్సంబంధమైన వేదాలు, మంత్రాలు, పురాణాలు, శ్రీవైష్ణవానికి సంబంధించిన దివ్య ప్రబంధాలు అన్నీ బాల్యంలోనే నేర్పించారు. అంతే కాకుండా ఊరు పెద్దది కావడం వలన అందరితో స్నేహపూరితమైన ఆత్మీయ భావం ఉండేది. అందరూ ఒకరికొకరు అన్నట్టు ఉండేది.

2. మీ కుటుంబం యొక్క వివరాలు తెలపండి.
జ: మా కుటుంబం అంటే చాలా పెద్దది. మా తల్లిదండ్రులకు మేము 11 మందిమి సంతానం. అన్నదమ్ములం ఐదుగురం, అక్క చెల్లెండ్లు ఆరుగురు.
మా ఇంటి పేరు శ్రీ పెరుంబూదూరు. శ్రీమద్రామానుజుల వారు పుట్టిన ఊరు. మా తాతగారు చెప్పిన విషయమది. ఆయన కంటే పైన 5,6 తరాల వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు. అక్కడ పానుగంటి అని ఇంటి పేరున్న వెలమదొరలు మా పూర్వీకులను ఇక్కడికి (చందుపట్ల) తీసుకొచ్చినారు. వాళ్ళను ఆ ఊర్లో ఉంచి అక్కడ ఒక రామాలయం కట్టించి వీళ్ళను అర్చకులుగా, స్థానాచార్యులుగా నియమించినారు. అంటే దాదాపు పానుగంటి వారంతా మావాళ్ళకు శిష్యులు (మా వరకు కూడా). అంటే మేము మా ఊరు నుంచి ఎట్లా వచ్చినమో పానుగంటివారు కూడా అట్లాగే వెళ్ళిపోయినారు. కాబట్టి బాంధవ్యాలు అనేవి తగ్గిపోయినవి. అట్లా మా ఊళ్ళో 4,5 శ్రీవైష్ణవుల కుటుంబాలు, ఒక వైదిక కుటుంబం, శైవుడైన ఒక కరణాల కుటుంబం ( గుండ్లపల్లి వారు) ఉండేది. అంతేగాక కోమట్లు, రెడ్లు, వెలమలు ఇలా అనేక కులాల వారు ( ఒక్క సాతాని వాళ్ళు తప్ప) ఉన్నారు. అట్లా కళకళ లాడుతూ సస్య శ్యామలోపేతంగా ఉండేది. మా ఆటపాటలన్నీ అక్కడే సాగినవి. ఆవూళ్ళోనే పుట్టి పెరిగినాము.
3. మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ ఎలా జరిగింది?
జ: ముందే విన్నవించుకున్నట్టు మా ఊళ్ళో 5వ తరగతి వరకు చదువుకొని మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చిన. హైదరాబాద్ లో అప్పటికే అప్పటికే సంస్కృతంలో ఎమ్.ఏ చేస్తున్న మా అన్నయ్య లక్ష్మణ మూర్తిగారు ( కాకతీయ యూనివర్సిటీలో రిటైర్ అయినాడు ) వచ్చి “ఈ చదువు చదువు కాదు. కులవృత్తులు ఇవన్నీ కొన్నాళ్ళకు ఏం నిలుస్తాయో, ఏం పోతాయో ఎవరికి తెలుస్తుందని” నన్ను ఓరియంటల్ విద్యలో ప్రవేశపెట్టిండు. అప్పుడు 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో ఓరియంటల్ తెలుగు ఎంట్రన్స్ లో అత్యధిక మార్కులతో ఉతీర్ణుడనయ్యాను (ప్రైవేట్ నుంచి). లక్ష్మీ రంజనం గారు, నిడదవోలు వెంకటరావుగారు, చలమచర్ల రంగాచార్యులు గారు వీళ్ళంతా మా గురువులు. నల్లకుంటలో ఒక ఓరియంటల్ కాలేజీ ఉండేది. ఆంధ్ర ప్రాచ్య కళాశాల అని దాని పేరు. తర్వాత ప్రభుత్వ వశమైంది. దాంట్లో డిప్ ఓ ఎల్. మొదటి సంవత్సరంలో చేరినప్పుడు డిప్ఓఎల్ , బిఓఎల్ రెండేళ్లు అంటే ప్రతి సంవత్సరం పరీక్ష ఉండకపోయేది. డిప్ ఓ ఎల్. రెండవ సంవత్సరంలో, బిఓఎల్ రెండవ సంవత్సరంలో పరీక్ష ఉండేది. అట్లా మాకు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, నిడదవోలు వెంకట్రావు గారు, చలమచర్ల రంగాచార్యుల వారు, ఆదిరాజు వీరభద్ర రావుగారు, నేలటూరి వెంకట రమణయ్య గారు ఈ పెద్దలంతా మాకు చదువు చెప్పిన గురువులు. అంటే వీళ్ళు అంత గొప్ప వాళ్ళని మాకు అప్పుడు ఊహ కూడా లేదు. కానీ మేము వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా చదువుకున్నాం. శాసనాలు చెబితే వాటికి సంబంధించిన పాఠాలు కంఠపాఠం చేసే వాళ్ళం. కరీంనగర్ శాసనం, వేయి స్తంభాల గుడి శాసనం అన్నీ చదివి అప్పచెప్పేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో మరి వేదం చదివిన గుర్తు ఏమో కానీ సంస్కృతం శ్లోకాలు, లఘు సిద్ధాంత కౌముది ఏదైనా పాఠం చెప్పిన తెల్లవారి కంఠపాఠం చేసేవాళ్ళం. ఇప్పటికి ఆ సూత్రాలు, శ్లోకాలు జిహ్వాగ్రంలో ఉన్నాయి. అందుకొరకు మా గురువులందరికీ మేము ప్రశంసా పాత్రులుగా ఉండేవాళ్ళం. నిడదవోలు వెంకట్రావు గారు అంటే అద్భుతమైన మేధావి. అప్పటికి ఆయన మద్రాసు యూనివర్సిటీ నుండి రిటైరై వచ్చి ఉస్మానియాలో యుజిసి ప్రొఫెసర్ గా ఉన్నారు. అప్పుడప్పుడే మన తెలుగు వాళ్లకు మంచి పరిష్కరణలతో మహాభారతం తయారవుతోంది. ఈయన, లక్ష్మీనారాయణ గారు, రామరాజు గారు వీళ్లంతా దాంట్లో పనిచేశారు. వీళ్ళతో మేము కలిసి తిరిగే వాళ్ళమే కాక మహాభారతం ప్రాజెక్టులో కూడా పనిచేశాం. అయినా చిన్నపిల్లల్లాగానే ఉండేవాళ్ళం. మా నామరూపాలు లేవు అక్కడ. వీళ్ళందరితో కలిసి తిరిగినామని తృప్తి ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే హైదరాబాదులో నల్లకుంటలో ఎక్కువగా ఉన్నాం. నల్లకుంట నుండి ఉస్మానియా యూనివర్సిటీకి నడిచిపోవడమే మాకలవాటు. బాగా చెట్లు ఉండేవి దారంతా. ఆ చెట్ల నీడన వెళ్లేవాళ్ళం. అప్పుడు సైకిల్, రిక్షాలు తప్ప ఏమీ కనబడకపోయేవి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఉండేవి. ఆ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంజనం గారు ఇంకో ఇద్దరు మొత్తం ముగ్గురు కార్లు స్టేట్ బ్యాంక్ పక్కన కారు షెడ్డులో పెట్టేవాళ్ళు. కింది అంతస్తులో ఆఫీసు పై అంతస్తులో క్లాసులు జరుగుతుండేవి. ఈ పెద్ద మనుషులంతా అక్కడే కనిపిస్తూ ఉండేవారు.
4. మీలో సాహితీ బీజం అంకురించడానికి, మీ సాహితీ పరిశోధనలకు సంబంధించిన నేపథ్యం ఎటువంటింది?
జ: నేను ఓరియంటల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మంచి మంచి గురువులు ఉండే వారిని చెప్పిన కదా! వాళ్ళు ఎప్పుడూ పత్రికల గురించి, శాసనాల గురించి, చరిత్ర గురించి ఏవేవో చెప్తుండేవారు. మనం డిగ్రీ అయిన తర్వాత ఏదైనా ఒక పని చేయాలి. గతానుగతికంగా పనిచేయడం కాదు. అనే ఊహ ఒకటి ఉంటుండేది మాకు. అట్లా ఆ పెద్ద మనుషుల వాసన ఒకటి. ఇంకోటి నేను చదువుకునే రోజుల్లోనే నారాయణగూడలో మా మిత్రుడు బిఎన్. శాస్త్రి గారు ఉండేవారు.ఆయన ఒక పుస్తకాల దుకాణం పెట్టిండు. దాని ఎదురుగా స్వామిరెడ్డి ‘త్రిలింగ’ అని ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. మేము శాస్త్రి గారి దుకాణంలో కూర్చునేవారం. పుస్తకాలు చాలా రకాలు ఉండేవి అక్కడ. పుస్తకాలు కొనే శక్తి లేక అక్కడ చదువుకునేవాళ్లం. చాలా పుస్తకాలకు వ్యాసాలకు ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్లం. (అప్పుడు అంతా కాగితాల్లో రఫ్ గా రాసుకునే వాళ్ళు). ప్రూఫ్ రీడింగ్ ఎలా చేయాలో కూడా శాస్త్రి గారే నేర్పించారు. పెద్దవాళ్లు చాలామంది అక్కడికి వచ్చేవారు. దాశరథి, పల్లా దుర్గయ్య, రామరాజు మొదలగు వాళ్లందర్నీ అక్కడే చూసిన నేను. వేరు వేరు కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళందరినీ ఆ షాపులో చూసిన. అట్లా శాస్త్రి గారితో సన్నిహితంగా ఉండడం వల్ల వాళ్ళంతా నన్ను కూడా ప్రేమగా చూసేవారు. అలా వాళ్ళందరి సాన్నిహిత్యంలో సాహిత్యాభిలాష పెంపొందింది. అప్పటికే శాస్త్రి గారు రచనా ధోరణిలో ఉన్నారు. సాంఘిక చరిత్ర రాస్తున్నారు. దానికి మొట్టమొదట ప్రూఫ్స్ చూసింది నేనే. అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాయటానికి ముందు భాగాలన్నీ ఈయన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” పేరుతో రాశారు (సురవరం ప్రతాపరెడ్డి గారు చాళుక్యుల నుండి సాహిత్యం ఆధారంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాస్తే బిఎన్. శాస్త్రి గారు శాసనాల ఆధారంగా చాళుక్యులకు పూర్వం చరిత్ర రాశారు).దాన్ని మొట్టమొదటగా ‘త్రిలింగ’ ప్రింటర్స్ లో చూసినం. ఆ సమయంలో కవి దాశరథి మా పక్కన వచ్చి కూర్చుండేవారు. శాస్త్రి గారు, నేను ఒక్క కుటుంబంలోని వాళ్లుగా మెలిగే వాళ్ళం. ఇప్పటికీ ఆ కుటుంబంతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి.
5. మరింగంటి సింగరాచార్యుల సాహిత్య సేవపై పరిశోధన చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?
జ: మరింగంటి సింగరాచార్యులనే కాదు. మరింగంటి కవుల మీద పరిశోధన చేశాను నేను. అది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రాంతంలో అత్యద్భుతమైన కవితా సృష్టి చేసి గోలకొండ సుల్తానుల ప్రశంసలు పొంది వాళ్ళ నుండి స్వర్ణాభిషేకాలు కూడా పొందినటువంటి కవులు మరింగంటి వారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని, విశిష్టాద్వైత తత్వాన్ని తమ రచనల్లో అంతర్లీనంగా, జాగ్రత్తగా చెప్పినవారు. అన్నీ కూడా విశిష్టాద్వైత సంబంధమైన భావనతో వచ్చిన రచనలు. వీటిని గమనించి వాటి మీద పరిశోధన చేయాలని ఊహ చేసిన. అప్పటికే నేను భారతిలో, మూసీ పత్రికలో వ్యాసాలు రాసిన. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ అంశంపైన నా పి హెచ్ డి కొరకు ఎంతో ఆలోచించి ఒక సంవత్సరం రిజెక్ట్ చేసి మరో సంవత్సరం నాకు పర్మిషన్ ఇచ్చారు. వారు మూడున్నర ఏళ్ళు గడువు పెడితే నేను రెండున్నర ఏళ్లలో పూర్తిచేసిన. కానీ యూనివర్సిటీ వాళ్ళు నా థీసిస్ ను తీసుకోలేదు. “ఇంకా గడువున్నది మీరు ఇయ్యకూడదంటే” కంట్రోలర్ రూమ్ లోనే ఒక బీరువాలో పెట్టి వచ్చిన. ఆ పరిశోధనలో భాగంగా 60, 70 గ్రామాలు తిరిగిన. 110 తాళపత్ర గ్రంథాలను పరిశోధించిన. 200 ముద్రిత గ్రంథాలను పరిశోధించిన. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళిన. మా శాస్త్రి గారు నాకు ఆయుధంగా ఉండేవాడు. నల్లగొండ దగ్గర ‘కనగల్లు’) అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఒక పెద్ద మనిషి ఉండేవాడు. మా శాస్త్రి గారికి కూడా ఆయన ఎరికే. అక్కడ తాళపత్రాలు లభ్యం అవుతాయని నాకు అనుమానం. ఆయన ఇంట్లో చాలా తాళపత్ర గ్రంథాలు ఉండేవి. కొంతమంది తెచ్చుకున్నారు కూడా. ఆయన ఇల్లంతా కూలిపోయింది. ఒకసారి నేను ఆ ఊరికి వెళ్ళి, ఒక పెద్దమనిషిని అడిగితే చూపించిండు. “కట్టెల తోటి ఒక స్టాండ్ కట్టించి దాంట్లో పుస్తకాలు పెట్టేది అయ్యగారు” అని అన్నాడు. మూడు రూపాయలకు ఒక మనిషిని కూలీ మాట్లాడి మట్టి తీయించిన. ఒక తోలు తిత్తి లో వరిపొట్టులో భద్రపరిచిన 25 తాళ పత్రాలు దొరికినయి. అవి నేను తెచ్చుకున్న (వరిపొట్టు పోసి పెట్టడం వల్ల చెదలు రాదు. తొందరగా చెడిపోవు. తోలును భూమి తొందరగా తినేయదు). ఆ పుస్తకాలు మొత్తం రాసినది మరింగంటి వేంకట నరసింహాచార్యులు అని గొప్పకవి. వాటిని తెచ్చి నేను పనిచేసే పాలెంలో కూర్చొని మూడు నెలలు కష్టపడి రీ-రైట్ చేసిన. నేను రాసిపెట్టిన పుస్తకాలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నవి. వాటి ఆధారంగానే పీహెచ్ డి కి పర్మిషన్ దొరికింది. నా పిహెచ్ డి లో వీటికి సంబంధించిన భాగమే ఎక్కువ ఉంటుంది. ఆయన దాదాపు 18 ప్రబంధాలను రాశాడు. దాంట్లో నాకు 16 దొరికినయి. అట్లా మరింగంటి వారి కవిత్వ వైశిష్టాన్ని లోకానికి తెలపాలి అనేది నా మనసులో ఉన్న ఊహ. అలాగే నా గైడ్ కోవెల సంపత్కుమారాచార్య గారు ఎంతో పరిణతి కలిగిన వ్యక్తి. సాహిత్యంలో మంచి శక్తి కలవాడు. అందుకే ఆయనను గైడుగా పెట్టుకున్నా. అట్లా నా పరిశోధన సాగింది. దీనికన్నా ముందు 1971 లో “నిరోష్ఠ్య రామాయణం” అని సింగరాచార్యుల వారు ( మీరు ముందు వారి గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడి నుండి చెప్తాను ) రచించిన పుస్తకం నా పీఠికతో “ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ” వారు ప్రచురించారు. “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ” ఉండేది. దాంట్లో దేవులపల్లి రామానుజరావుగారు, రామరాజు గారు, ఎస్వీ జోగారావు వీళ్ళందరూ నాకు ఎడిటింగ్ బాధ్యతలు అప్పజెప్పినారు. సాహిత్యకృషిలో అది నా మొట్టమొదటి పుస్తకం. దానికి నిడదవోలు వెంకట్రావు గారు ఎంతో సహకరించినారు. ఒక ఆరు నెలల్లో ఆ పుస్తకానికి రూపం తీసుకువచ్చిన. అందులో ఉన్న టెక్స్ట్ 120 పేజీలు అయితే నేను రాసిన పీఠిక 80 పేజీలు (గట్టిగా నవ్వుతూ) అసలు నిరోష్ఠ్యం అంటే ఏమిటి? తెలుగు, సంస్కృతంలో ఎట్లా ఉంటుంది? పుస్తకాలు ఎట్లా వచ్చాయి? ఆ వివరణలన్నీ దాంట్లో ఇచ్చిన .తర్వాత ఏమైంది అంటే 1975 -76 ప్రాంతంలో ఆ పుస్తకంలోని ఒక ఆశ్వాసాన్ని పాఠ్యాంశంగా ఓరియంటల్ విద్యార్థులకు పెట్టడం జరిగింది. అది మూడు ఎడిషన్స్ అయింది. పుస్తకం అలా వ్యాప్తి చెందింది. ఒక ముస్లిం రాజుల ఆస్థానంలో ఉండి కూడా గొప్ప పేరు తెచ్చుకున్న కవి మరింగంటి సింగరాచార్యులు. పొన్నిగంటి తెలగనాచార్యులను కుతుబ్షాహీలకు పరిచయం చేసింది మరింగంటి అప్పన్న గారు. స్వయంగా తెలగనార్యుడే ఈ విషయాన్ని తన రచనల్లో చెప్పుకున్నారు. అంత గొప్ప వాళ్ళు కాబట్టి నాకు ఆ రచనల మీద పరిశోధన చేయాలని మిక్కుటమైన కాంక్ష వచ్చింది. సింగరాచార్యుల కన్నా పెద్దవారు మరింగంటి జగన్నాథాచార్యులని ఉన్నారు. ఆయన ఆ రోజుల్లోనే అవధానాలు చేశాడు. ఆయన తన గురించి “కర్ణాట క్షమాభృత్సభాంతర పూజ్యున్ మరింగంటి వేంకట జగన్నాథాచార్యు” అంటూ ఇక్కడ గోల్కొండ రాజుల చేతనే కాక విజయనగర రాజుల చేత కూడా సన్మానం పొందానని చెప్పుకుంటాడు.ఆయన విజయనగర సంస్థానంలో అళియ రామరాజు చేత స్వర్ణాభిషేక సత్కారాన్ని పొందారు. ఆయన అక్కడ అవధానాలు చేశాడు. అంతటి గొప్ప కవుల వంశ చరిత్రను తెలపాలని నేను మరింగంటి కవులను అప్ టు డేట్ ఒక 83 మంది కవులను వాళ్ళ రచనలతో పరిచయం చేసిన. అవధానాలలో “తెరలను, నీటి లోపలను, దీపపు కాంతి” అని చెప్పుకున్నారు. అంటే ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని బట్ట పైన అక్షరాలను రాస్తే చెప్పడం, దీపపు కాంతిలో నీటి పైన రాసే అక్షరాలను గుర్తించడం ఇలాంటి విధంగా అవధానాలు చేసేవారు. ఆధునిక కాలంలో మాడభూషి వేంకటాచార్యుల వారు ‘కలశధ్వని’ అనే పద్ధతి ప్రవేశపెట్టినాడు. తిరుపతి వేంకట కవులు కూడా దాన్ని కష్టతరమని విరమించు కున్నారు. ఆ పద్ధతిని మరింగంటి జగన్నాథాచార్యుల వారు చేసినారు.అదేమిటంటే అవధాని ముందు 50 గాని వంద గాని చెంబులు పెట్టి వాటిల్లో నీళ్లు పోసి, వాటిపైన, ఒక్కొక్క దానిపైన నంబర్లు రాసి అవధానికి ఎదురుగా ఒక్కొక్క కలశం మీద కర్రతో గాని, ఇనుప కమ్మీతో గాని శబ్దం చేసేవారు. ఆ తర్వాత వాటిని చాటుగా పెట్టి అవధానం మధ్యలో ఏదో ఒక దానిపైన శబ్దం చేసేవారు. ధ్వనిని బట్టి అది ఏ నెంబర్ అయి ఉంటుందో అవధాని చెప్పాల్సి ఉంటుంది. ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అది. దీనికి తోడు వారికి నాలుగు, ఐదు భాషలు వచ్చు. తెలుగు, సంస్కృతం, అరబీ, ఉర్దూ ద్రావిడ మొదలైనవి. ఇంకా మనకు దొరకలేదు కానీ అబ్దుల్ కరీం సభావర్ణనను సీస మాలికలో చెప్పినాడట. నేను చాలా ప్రయత్నించిన ఇప్పటికీ ప్రయత్నిస్తున్న ఎక్కడన్నా దొరుకుతుందని ఆశతో. అందుకే అంత గొప్ప వాళ్ళ చరిత్ర మీద ఆసక్తితో పరిశోధన చేసిన. ఇప్పటికీ రెండు ప్రింట్లు అయింది ఆ గ్రంథం.
6. పాలెం కాలేజీలో ఉద్యోగం మొదలు పెట్టిన నాటినుండి రిటైర్మెంట్ వరకు ఏ ట్రాన్స్ ఫర్ లేకుండా అదే కాలేజీలో కొనసాగడం చాలా ఆశ్చర్యకరం. అది ఎలా జరిగిందో తెలుసుకోవచ్చా?
జ. నిజంగా ఇది చాలా ఆశ్చర్య కరమైన విషయమే. ఎవరి జీవితంలో ఇలా జరిగి ఉండకపోవచ్చు. నేను 1966 ఆగస్ట్ 3వ తేదీన ఉద్యోగంలో చేరినానమ్మా.. అప్పటికి పి.జి. చేయలేదు నేను. ఓరియంటల్ లో పి.జి.లేదప్పుడు. అక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు మొదలైన వారు నీవు ఓరియంటల్ కాలేజీలో చదివినవు కాబట్టి ఓరియంటల్ కాలేజీల్లోనే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. పాలమూరు పేరు వినడమే కానీ చూడలేదు, తెల్వదు నాకు. అప్పుడు 2రూ.80పై. బస్సు ఛార్జీ. రాసిపెట్టుకున్న. నా మిత్రునితో కలిసి పాలమూరు వెళ్లిన. ఇంటర్వ్యూ కైతే ఎవరూ రాలేదు. నేనొక్కణ్ణే మిగిలిన. ఆ వెళ్లిన విశేషం ఏమోగానీ 1966 ఆగస్ట్ 3వ తేదీ నుండి 2002 అక్టోబర్ దాకా అక్కడే ఉన్నా. మధ్యలో ఒకసారి ట్రాన్స్ ఫర్ అయింది నాకు. ఎందుకో అదేరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఒక డైరెక్టర్ ని కలవడానికి వెళ్ళిన. ” నిన్ను ట్రాన్స్ఫర్ జేసినమయ్యా నల్గొండ కాలేజీకి” అన్నారు. “మంచిది సార్ వెళ్తా గానీ నన్ను మళ్లీ అక్కడి నుండి డిస్టర్బ్ చేయొద్దు” అన్నా. ఎందుకు? అన్నారాయన. (అప్పుడు ఎన్ టి రామారావు గారి జీవో ఒకటి ఉండేది. గెజిటెడ్ ఆఫీసర్లు సొంత జిల్లాల్లో పనిచేయకూడదని) “నేను గెజిటెడ్ ఆఫీసర్ ను, మాది నల్గొండ జిల్లా. మీరు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన్రు. మరి నేనెట్లా ఉద్యోగం చేయను”అన్నాను. అపుడు ఆయన సెక్షన్ క్లర్క్ ను పిలిచి, నా సర్వీసు పర్టీ క్యులర్స్ తెప్పించుకొని చూసి ‘నీ ట్రాన్స్ ఫర్ క్యాన్సల్ చేసుకుంటున్నా’ అన్నాడు. అప్పుడది ప్రైవేటుగా ఉండింది. తర్వాత 1981లో ప్రభుత్వ స్వాధీనం అయింది. ఎంతోమంది లెక్చరర్లు ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళి పోయినారు. ఆయినా ఎందుకో హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నాపైన దృష్టి పెట్టలేదు. ఒకసారి పోయి అడిగిన. గవర్నమెంట్ అయింది కదా! రంగారెడ్డికో, ఎక్కడికో ట్రాన్స్ ఫర్ చేయుమని.”పాలెంలో మీకు ఏంతక్కువైంది” అన్నారు. అంతే అట్లా విచిత్రంగా గడిచిపోయింది.
7. మీ సంపాదకత్వంలో వెలువడిన మీ తండ్రిగారి “పాంచరాత్రాగమోక్త- భగవత్ప్రతిష్ఠా విధానం” గురించి మాకు అర్థమయ్యేలా వివరించండి.
జ: మా నాయనగారు ఇటు ద్రావిడ ప్రబంధాలు పౌరోహిత సంబంధమైనవి, పాంచారాత్రాగమ సంబంధ ప్రతిష్ఠా ఉత్సవాలు పుస్తక నిరపేక్షంగా కంఠోపాఠంగా చేయించేవాడు. సంస్కృతంలో ఒక సామెత ఉందమ్మా.. ” వివాహాదీని కార్యాణి గ్రంథం దృష్ట్వా న కారయేత్” వివాహం, ఉపనయనం మొదలగు ఎలాంటి కార్యాలు జరిగినా పుస్తకం చూసి మంత్రం చెప్పకూడదు. అయితే మరణాది కార్యక్రమాలకు తప్పనిసరిగా తనకు నోటికి వచ్చినా తొడపైన పుస్తకం పెట్టుకొని చూస్తూ చదవాలి. అందుకే మా నాన్నగారికి పాంచరాత్రం పూర్తిగా కంఠపాఠంగా ఉండేది. ఉత్సవాలు గానీ, ప్రతిష్ఠాంతం గానీ, బీజాక్షరాలు, యంత్రాలు ఇవన్నీ నోటికి ఉండేవి. ఇవన్నీ అందుబాటులోకి రావడం కోసం వీటన్నిటినీ పల్లెటూళ్ళో కూర్చొని చాలా జాగ్రత్తగా వివరంగా 1970 వరకే మొత్తం వాల్యూమ్స్ రాసి పెట్టారు. చాలా అందమైన రాత ఆయనది. 1995లో ఆయన అస్తమించిండు. అప్పటికే ఆయన నల్గొండ జిల్లాలో ప్రసిద్ధి పొందిన దేవ యాజ్ఞీకుడు. ఎన్నో దేవాలయాల్లో ప్రతిష్ఠాదులు చేయించిండు. తర్వాత నేను 2008లో ఆయన శతజయంతి సందర్భంగా ఆయన రాసిన “మహోత్సవవిధి”, “ప్రతిష్ఠావిధానం” రెండూ విడదీసి రెండు వాల్యూమ్స్ గా మొట్టమొదటగా ప్రచురింపజేశాను. దిల్ సుఖ్ నగర్ లో పెద్ద సభ జరిగింది. అప్పుడు కె.వి. రమణాచారి గారు తిరుపతి ఈవోగా ఉండేవాడు. ఈ పుస్తకాలు బయటకు రావడానికి ఆయన చాలా సహాయం చేసిండు నాకు. ఆయన అధ్యక్షతనే వీటిని ఆవిష్కరింపజేసినం. అక్కడ పుస్తకాలు దగ్గర పెట్టుకొని దేవ యాజ్ఞీకం, ప్రతిష్ఠా విధానం పట్ల అభిమానం ఉన్నవారు, చదవగలిగిన వాళ్ళు ఉచితంగా తీసుకుపోవచ్చు అని చెప్పిన. ఆరోజు అవి ఒక 370, ఇవి ఒక 370 పుస్తకాలు పోయినయి నాకు బాగా గుర్తు. విద్యావ్యాప్తి కావాలనేదే నా ఉద్దేశ్యం. అట్లా ఆ పుస్తకాలు 5 ఎడిషన్లు అయినాయి.

ఒకసారి నేను శ్రీరంగం పోయినప్పుడు మహోత్సవ విధి పుస్తకాన్ని పూజరితో పూజ చేయించి, వీటిని మీదగ్గరే ఉంచండి అన్నాను. ఆప్పుడాయన “ఈ పుస్తకాలు మా విద్యార్థులకు పాఠ్యగ్రంథమండి. మేము కాకినాడలో రాజారామమోహన్ రాయ్ లైబ్రరీ నుండి 60 పుస్తకాలు తెచ్చుకున్నాం. మాదగ్గర 40 మంది విద్యార్థులు వున్నారు. ఇంకా ఇరవై పుస్తకాలు మా లైబ్రరీలో ఉన్నాయి” అన్నాడు. పాంచరాత్ర పాఠశాల వాళ్ళది. (మేము కొన్ని పుస్తకాలను లైబ్రరీలకు ఇచ్చినం). ఇవి కూడా ఉంచండి. అని నా దగ్గరున్న పుస్తకాలు కూడా ఇచ్చిన. తిరుపతి, శ్రీరంగం, సింహాచలం ఇట్లా పాంచరాత్ర పాఠశాలల్లో ఈ పుస్తకమే ప్రామాణిక పాఠ్యగ్రంథం. ఇప్పటికి కూడా తెలంగాణాలో జరిగే భగవదుత్సవాల్లో (వైష్ణవ ఆలయాలు) మా నాయన గారి పుస్తకమే ప్రామాణికం. అది నేను ఘంటాపథంగా చెప్తాను. మరొక విశేషం ఏమిటంటే జీయర్ స్వామి వారు “భగవత్ప్రతిష్ఠావిధానం” పుస్తకం వేతామని ఒక కమిటీ వేశారు. సముద్రాల రమాకాంతాచార్యులు గారని పెద్ద యాజ్ఞీకుడు, నా క్లాస్ మేట్, మా నాయన గారి పేరు చెప్పి, మనం కొద్దిరోజులు ఆగి ఆ పుస్తకం చూసాక వేద్దాం అన్నారట. అంతేకాదు మా ఇంటికి స్వయంగా వచ్చి పుస్తకాలు తీసుకువెళ్ళి స్వామివారికి చూపించారట. అవి చూసిన జీయరుస్వామి గారు మనం పుస్తకం వేయాల్సిన పనిలేదు. ఆచార్యులవారి పుస్తకమే చాలు అన్నారట. అంటే మానాయన అంత ప్రామాణికంగా, పల్లెటూళ్ళో ఉండి అనేక పురాణాలు, సంహితలు మొదలగునవన్నీ చూసి ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని రాయడం ఆయన మేధాశక్తికి నిదర్శనం.
8. “శ్రీ సారంగశైల మాహాత్మ్యం” …మీరు రాసినదా? అందులోని క్షేత్రం గురించి చెప్పండి.
జ: అది నేను రాసినది కాదు. అయితే నేను మా ఊరు చందుపట్ల అని చెప్పిన కదా! దానికి తూర్పు వైపు బండపాలెం అనే ఊరు ఉంది. దానికి దగ్గర్లో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట పేరు సారంగాచలం. పూర్వం అక్కడ జింకలు బాగా తిరిగేవట. ఒక రామాలయం ఉంది అక్కడ. స్వయంవ్యక్త రామస్వామి. గోవర్దనం వేంకట నరసింహాచార్యులనే మహానుభావుడు. ఆయన మిర్యాలగూడ దగ్గర ఉండే అలియా మండలంలో ఇబ్రహీంపేట అనే ఊరులో ఉండేవాడు. ఆయన ఈ రాముని చరిత్రను మూడు ఆశ్వాసాల ప్రబంధం చెప్పినాడు. ఆయన మా తాతగారికి మామగారు. అంటే మా నాయనమ్మ ఆమె బిడ్డ. అప్పుడప్పుడూ మా ఊరికి బిడ్డను చూడడానికి వచ్చేవాడు. ఒకసారి అలా వచ్చినపుడు ఆ రామాలయ ఉత్సవాలు, విశేషాలతో రెండేరోజుల్లో ఆ ప్రబంధం చెప్పిండు. బ్రహ్మాండమైన కవి అతను. ఎన్నో మంగళహారతులు కూడా రాసిండు. “శ్రీసారంగ శైల మాహాత్మ్యం” అముద్రితగ్రంథం. నేను దానికొక పీఠిక రాశాను.
9. శేషభట్టర్ గారి గొప్పతనం ఎలాంటిదో మాకు వివరించండి.
జ: మా నల్లగొండ జిల్లాలో శేషభట్టర్ వెంకట రామానుజాచార్యులు అని ఉన్నారు. ఆయన పుస్తకాల సంకలనం వేసినం. ఆయన ఎంత గొప్పవాడు అంటే చిన్న వయసులోనే మరణించాడు (40 ఏళ్లకు) అప్పటికే ఆయన నాలుగు భాషల్లో ప్రావీణ్యత కలవాడు. మంచి లాయర్ కూడా. ఆయన రుక్మిణీదేవి కథను ‘రుక్మిణి’ అనే పుస్తకంగా రాశాడు.నిజాం రోజుల్లో ఆ పుస్తకాన్ని టెక్స్ట్ గా పెట్టినారు. అంటే ఆయన గొప్పతనం చూడండి. “తెలుగు పఢ్ నే వాలోంకో రుక్మిణి” అని ఉండేది. ఆయన ‘లోకజ్ఞుడు’ అనే పేరుతో చాలా పద్యాలు రాశారు. అకినేపల్లి జానకి రామారావు గారని కొండగడప జమీందారు ఉండేవాడు. ఆయన అడవి బాపిరాజు, తిరుమల రామచంద్ర ప్గార్లకు ‘మీజాన్’ పత్రిక నడపడానికి డబ్బు సహాయం చేసిండు. శేషభట్టర్ వెంకట రామానుజాచార్యుల వారు రాసుకున్న పుస్తకాల ముద్రణకు కూడా జానకి రామారావు గారు ఆర్థిక సాయం అందించారు. కొండగడప జమీందారు జానకి రామారావు ద్రవ్య సహాయంతో ముద్రింప బడిందని ఆయన ప్రతి పుస్తకం మీద రాసుకున్నారు. నల్లగొండ చరిత్ర రాసిండు. నల్లగొండ చరిత్ర రాసిన వాళ్లలో మొదటివాడు ఆయనే. అయితే మేము నల్లగొండ జిల్లా సర్వస్వం వేసేటప్పుడు నేను, బిఎన్. శాస్త్రి గారు ఆ పుస్తకం కొరకు చాలా వెతికినం మాకు దొరకలే. అసలు వారి వంశజులకు ఆయన రచయిత అన్న విషయమే తెలియదు. తర్వాత నేను వీరి పుస్తకాలు వేయించాలన్న ఆలోచన వచ్చినప్పుడు “వేమన భాషా నిలయం”లో పాత పేపర్ల కట్టలు వెతుకుతున్నప్పుడు నాలుగు కాయితాలు దొరికినాయి. దాంట్లో నల్లగొండ చరిత్ర దొరికింది. దొరికినంత వరకు నేను పుస్తకంలో వేసిన. ఆయన కొడుకుల్లో ఒకాయన ఎమ్మార్వోగా రిటైర్ అయినాడు నిజామాబాద్ లో. ఇక్కడే ఉండేవాడు ఎల్బీనగర్లో. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి మా నాయన గారి కాగితాలు ఉన్నాయని, వాటిని చూడమని ఒక పాతపెట్టె తెచ్చి ఇప్పుడు మీరు కూర్చున్న స్థలంలోనే పెట్టిండు. నేనొక పది రోజులు కష్టపడి వాటన్నింటినీ సవరించిన. పుస్తకాలు వేయించిన.
10. “నల్లగొండ జిల్లా కవులు – పండితులు” అనే పేరుతో కూర్చిన రచనలో ఎవరెవరి గురించి రాశారు?
జ: “నల్లగొండ జిల్లా కవులు – పండితులు” రచన చేయాలని ఊహ వచ్చింది. బిఎన్. శాస్త్రిగారు, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు సహాయం చేశారు. కూరెళ్ళ విఠలాచార్య నేను ఆ పనిలో ఉన్నప్పుడు మనోహరి (నా స్టూడెంట్. బిఎన్. శాస్త్రిగారి కూతురు) మాకు అన్నీ రాసి పెట్టేది. ప్రూఫ్స్ కూడా చూసేది. ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రత్యేక విభాగం అయింది కదా! అయినా భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎవరు సాహిత్య చరిత్ర రాసినా వారికి ఈ పుస్తకం కరదీపికలా ఉపయోగ పడుతుంది. నా పేరు చెప్పి కొందరు, చెప్పక కొందరు దానిలోని విషయాన్ని తీసుకుంటారు. ఇందులో పూర్వం నుంచి 1993 వరకు (1993లో పుస్తకం వేసిన) అప్పుడప్పుడే రచనలు చేస్తున్న కొత్త రచయితలను కూడా దాంట్లో తీసుకున్న. అందులో రకరకాల ప్రక్రియల్లో మొదటగా ఎవరెవరు ఉన్నారు? అన్న దృష్టితో కాలాన్ని అనుసరించి దరఖాస్తు తయారు చేశాము. దాన్ని నల్లగొండ జిల్లాలో తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ఫోటో ఉంటే దానితో సహా పేరు, ఊరు, మండలం విద్య, వారు చేసిన రచనలు, ముద్రితాలు, అముద్రితాలు, ఇంకా చేస్తున్న రచనలు, పొందిన పురస్కారాలు ఇలాంటి సమాచారం సేకరించిన.దాదాపు 40 శాతం మంది మాకు రిప్లై ఇచ్చినారు. కొంతమంది మౌనంగా ఉన్నారు. (వాళ్ళకి ఇష్టం లేక) ఆ తర్వాత చాలా కష్టపడి 370 మంది కవులు, పండితులను దొరికినంతవరకు ఫోటోలతో సహా దాంట్లో వేసిన. దానిని నల్లగొండలో అప్పుడు మినిస్టర్ గా ఉన్న కుందూరు జానారెడ్డి గారు ఆవిష్కరించారు. రవ్వా శ్రీహరి గారు, ప్రొఫెసర్ గోపి, రావి భారతి, పులిజాల రంగారావు మొదలైన వారంతా ఆ సభకు వచ్చారు. చాలా శోభాయమానంగా మా శాస్త్రి గారు ఆ సభా ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా “నల్లగొండ జిల్లా కవులు-పండితులు’ పుస్తకం తయారయింది.
11. మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి. అలాగే సంపాదకత్వం, పీఠికలు వీటిపై ఎక్కువగా మీదృష్టి నిల్పడానికి కారణం ఏమిటి?
జ: నేను దాదాపు 40 పుస్తకాలు ప్రింట్ చేశానమ్మ. అన్ ప్రింటెడ్ బుక్స్ 30,35 దాకా ఉంటాయి. కొన్ని రీ-ప్రింట్ అయినాయి. కొన్ని మూడు, నాలుగు ముద్రణలు కూడా అయినాయి. మొత్తం 46 పుస్తకాలు నేను ఎడిట్ చేసిన అన్ని ప్రక్రియల్లో. అన్నీ పద్యాలే. పుస్తకాలెన్నో పరిష్కరించాను కాబట్టి వాటిని వెలువరించడానికి పూనుకున్నాను. పీఠికలు రాయడంలో నిడదవోలు వెంకట్రావు గారు, ఇవివి.రాఘవాచార్యులు గారి ప్రభావం నాపై ఉండేది. అందువల్ల మొదట్లో పీఠికలు ఎట్లా ఉంటాయి? తర్వాత వచ్చిన పీఠికలు ఎట్లా ఉన్నాయి? ఇట్లా ఒక స్ఫురణతో రాస్తూ పోయిన. ఆ తర్వాత నాకే అనిపించింది. ఇట్లా పేజీలు పెంచడమే తప్ప ఉపయోగం లేదని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన. దాదాపు 40 పుస్తకాలకు పీఠికలు రాసిన. అవన్నీ కలిపి ఒక వాల్యూమ్ వేసిన (నవ్వుతూ..అవి ఎక్కడికైనా పోతాయేమోనని). పీఠిక అంటే ఏమిటి? పీఠికలు ఎందుకు అవసరం? వాటిని ఎట్లా చదవాలి? అనే సమాచారం ఇస్తూ మొట్టమొదట విమర్శ గురించి పరిశోధన చేసిన ఎస్వీ రామారావు గారితోను, ఉస్మానియాలో పీఠికల గురించి పరిశోధన చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారి తోను (ఇప్పుడు ఆయన ఎమెస్కో లో వున్నారు) నేను ఈ పుస్తకంలో అభిప్రాయాలు రాయించిన. దాన్ని నా విద్యార్థి ఒకడు సొంత ఖర్చులు పెట్టుకొని ఆవిష్కరణకు నన్ను ఒక్క రూపాయి అడగకుండా పుస్తకాన్ని ముద్రింప చేశాడు. నల్లగొండ జిల్లా వాడే. ఇంటికి దగ్గరగా ఉండేవాడు. అర్జున్ రావు అని వెలమ పిల్లవాడు. నా దగ్గర చదువుకున్నాడు. బీదవాడు. ఇప్పుడు వనస్థలిపురంలో స్కూల్స్ పెట్టి నడుపుతున్నాడు. నా దగ్గరకు వచ్చి, “సార్! ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయిస్తాను” అన్నాడు. ఆవిష్కరణలో కూడా భోజనాలు పెట్టి చాలా బాగా చేసిండు. నేను ఒక్కటే చెప్పిన “ఈ పుస్తకం ముద్రించి ఇంట్లో పెట్టుకుంటే ఎవరూ చదవరు అవసరం లేదు” అని. ఎందుకంటే ఈ రోజుల్లో సాహిత్య గ్రంథాలు ఎవ్వరూ చదవడం లేదు. “ఒక హితుడైన శత్రువుని నీ ఎదురుగా చూసినట్లు ఉంటుంది” అన్నాను. అయినా సరే పట్టు వదలకుండా వేయించాడు.
12. ఈ తరం సంపాదకులకు మీరిచ్చే సలహాలు ఏవి?
జ: ఈరోజుల్లో సంపాదకులు ఉన్నారు. తప్ప గ్రంథ సంపాదకులు లేరు. మా బిఎన్.శాస్త్రి గారు పత్రికా సంపాదకులు. ఆయన ఎలా అంటే తన ఇంట్లో ఉన్న బంగారం, వెండి కూడా అమ్మి పత్రికకు డబ్బులు పెట్టిండు. ఇప్పుడు పత్రికా సంపాదకులు ఉన్నారు. పత్రిక పేరు మీద డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ రోజుల్లో ఒక క్లాసిక్ పుస్తకాన్ని గాని, ప్రాచీన గ్రంథాన్ని చదివి పరిష్కరించి దాన్ని వేసే బహుభాషాంతర విపుల విషయ పరిష్కార పీఠికాయుతంగా ప్రచురించే వాళ్ళు ఎవరూ లేరు. అటువంటప్పుడు వాళ్ల గురించి ఆలోచించేది లేదు. మన మార్గమేదో మనం పోవాలి. మనం చెప్పినా ఎవరు పాటిస్తరు? అందుకని రెండు సంవత్సరాల నుంచి నేనవన్నీ చాలించుకున్న. ప్రశాంతంగా చదువుకుంటూ కూర్చున్న. తెలంగాణ సాహిత్య అకాడమీ పెట్టినప్పుడు ఆ సెక్రెటరీ, ప్రెసిడెంట్ నాకు తెలిసిన వాళ్ళు (నందిని సిధారెడ్డి, వెంకట నరసింహారెడ్డి) సర్వజ్ఞ సింగభూపాలుడు రచించిన “రసార్ణవ సుధాకరం” వేసిన పెద్ద పీఠికతో. అప్పకవికి సంబంధించిన చాలా సంస్కారమైన ప్రచురణలు వేసినం. ఒక దేవాలయ చరిత్ర (గంగాపురం మాహాత్మ్యం వేసినం) ఆ విధంగా సహృదయుడు అనేటటువంటివాడు, విలువ తెలిసినవాడు ఇది చేయండి. అని చెప్తే చేస్తామ కానీ విలువ తెలియని వాళ్ళతో ఏముంది? వెనుకట తిరుపతి వెంకట కవులు ఒక పద్యం చెప్పారట “ఏ భూమీశున్ చూడబోయినను నీవే పద్యం చెప్పి, నీవే భావమ్ములు చెప్పుకోవలె”. రాజు గారి దగ్గరికి పోతే పద్యం చెప్పాలి. దాని భావం చెప్పాలి. అంత చెప్పినా అర్థమవుతుందో కాదో ! అందుకే నేను కూడా ఇవన్నీ ఎందుకు అనుకొని ఊరుకున్నా. సాహిత్య అకాడమీ వాళ్లు ఏవో కొన్ని పనులు చెప్పినారు. చేసినం అయిపోయింది. ఇప్పుడు అడిగేవాళ్లు లేరు, చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు ఇష్టమైన మూసీ పత్రిక ఒకటి ఉంది. బిఎన్.శాస్త్రి గారు ఉన్నప్పుడు భారతికి దీటుగా ఒకటి ఉండాలని పత్రిక వేసుకున్నం. దాన్ని మనోహరీ, మా కమలాకర్ కష్టపడి నడుపుతున్నరు. అప్పుడప్పుడు సమీక్షలో, వ్యాసాలో దాంట్లో రాస్తూ ఉంటా. అట్లా కాలాన్ని గడుపుతున్న.
13. తాళపత్ర గ్రంథ పరిష్కరణలో ఒకే అంశానికి సంబంధించి ఉండి, మీకు ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయా?
జ: మొట్టమొదటిసారిగా 1971లో, 1973లో ప్రచురించిన నిరోష్ఠ్య రామాయణం (దశరథ రాజ నందన చరిత్ర) అదొక ప్రింటెడ్ కాపీ దొరికింది నాకు. అది 1910-20 ప్రాంతంలో ఏలూరులో ప్రింట్ అయింది తర్వాత నేను అన్వేషిస్తే నాకు దానికి సంబంధించి మూడు తాళపత్ర గ్రంథాలు దొరికినయి (ఒకటి విజయవాడ ఒకటి ఖమ్మం ఒకటి మహబూబ్ నగర్) ఆ మూడింటిలో ఏది సమగ్రం కాదు. వాటన్నిటినీ పట్టుకొని నేనే ఎడిట్ చేసిన. “దశరథ రాజనందన చరిత్ర”కు చాలా పాఠాంతరాలు వచ్చినై. అవన్నీ చూసి నేను పూర్తి చేయగలిగాను. ఇటువంటిదే మరొకటి మరింగంటి సింగరాచార్యుల శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కళ్యాణం 1971లో వేశాను. అది అచ్చ తెలుగు నిరోష్ఠ్యం, సీతాకళ్యాణం కథ. చిన్న పుస్తకం. దాన్ని వేసినప్పుడు నాకు రెండు పుస్తకాలు దొరికినయి. అందులో ఒకటి తిరుపతిలో దొరికిన తాళపత్ర గ్రంథం. తర్వాత మా నాయన గారు సంపాదించిన పుస్తకాల్లో చాలా పాతది. కనగల్లు వాళ్ళ బంధువు పురుషోత్తమాచార్య గారని సూర్యాపేటలో ఉండేవారు. ఆయన ఇంట్లో పాత పుస్తకాలన్నీ కట్టగట్టి పెట్టుకున్నారు. మేమిద్దరం కలిసి వెతికితే దాంట్లో ఒక పుస్తకం దొరికింది. ఇవన్నిటిని పెట్టుకుని నేను మంచి పార్ట్ ఏది ఉంటే అది తీసుకొని వేసేవాణ్ణి. అట్లా పుస్తకాలు ఎడిట్ చేయవలసి వచ్చింది.
14. ఒకే కవి రాసిన అంశానికి భిన్నమైన పాఠాంతరాలు ఎందుకుంటాయి?
జ: ఎందుకంటే ఒక కవి రాసిన అంశాన్ని ప్రత్యంతరాలు రాసుకున్న వాళ్ళుంటారు కదా! ప్రత్యంతరాలు రాసే వాళ్ళల్లో అనేక తేడాలుంటాయి. ఉదా: ఒకరు వశము అని రాస్తే, మరొకరు దశము అని రాస్తారు. ఇక్కడ పదం ఏది అనేది కాదు. దాంట్లో ఉన్న ప్రామాణికత ముఖ్యం. ఇలా వివిధములైన పాఠాంతరాలను పరిశీలించి దాన్ని పరిష్కరించాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. కొంతమంది తాళపత్ర గ్రంథాలు సంపాదించి, తమ కుటుంబ పోషణకు తనపేరు చేర్చుకొని, ఎవరో ఒక రాజుకిచ్చి డబ్బులు సంపాదించి పూట గడుపుకున్నారు. ఈ విషయం అల్లసాని పెద్దన మనుచరిత్రలో కూడా చెప్పబడింది. అప్పకవి రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు జరిగినై. ఆయన (మహబూబ్ నగర్ జిల్లా వాడు) కొన్ని వందల పుస్తకాలు సేకరించినాడు ఆరోజుల్లో. అముద్రిత గ్రంథాల లైబ్రరీ అప్పకవి దగ్గర ఉండేది. ఒట్టెం అనే ఒక ఊరుంది. అక్కడ ఉండేవాడు. అన్ని పుస్తకాలను సేకరించి “అప్పకవీయం” గొప్ప ఛందోగ్రంథాన్ని రాసిండు. ఒక శపథం చేస్తాడాయన. “ఇది చదివిన పిమ్మట మరి యదియేనియు చదువబుద్ధి ఏలా పొడమున్? పదపడి గ్రంథములన్నియు వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్” నా పుస్తకం ఒక్కటి గనుక మీరు చదివితే వందల పుస్తకాలు చదివినట్టు..అంటాడు. నేను కాలేజీలో పని చేసినంతసేపు ఒకటే సిద్ధాంతం ఉండేది నాకు. నా విద్యార్థులు అందరితో కూడా “అప్పకవీయం” రెండు ఆశ్వాసాలు కంఠపాఠం చేయించిన.(తృతీయ, చతుర్థ) వాళ్లకు అప్పుడు నేను ఒకటే చెప్పేది. మీరు ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు కానీ ఈ పద్యాలు మీరు గనక కంఠపాఠం చేస్తే మీరు వందల ప్రబంధాలు చదివిన తెలివి వస్తదని. ఉదాహరణకు “మరున్నందన శతకం” అని వస్తుంది. ఎక్కడ దొరకాలి అది? అట్లనే మా కసిరెడ్డి వెంకటరెడ్డి, గిరిజా మనోహర్ వీళ్ళందరికీ ఆ పద్యాలు నేర్పించిన. వాళ్ళు అలా ధారణ చేయడం వలన పద్యం నడక తెలిసింది. పద్యం ఒక్కసారి మనిషికి అబ్బిందంటే ఎక్కడా పోదు. అప్పుడు సాహిత్యం గురించిన అప్రతిహతమైన శైలి ఏర్పడుతుంది. వచన కవిత్వం రాసే వాడిని ఒక కవిత చదవమంటే పుస్తకం తీసి చదవాలి. పద్య కవిత్వం చదివిన వాడిని చదవమంటే పది పద్యాలు అవలీలగా చదవగలడు. పద్యంలో ఒక శక్తి ఉంది. యతి, ప్రాస, భావం మనిషిని పట్టేస్తుంది. అందుకొరకు పద్యం నిలుస్తుంది. ఎవడేం చేసినా పద్యం పోదు. అందుకే పుస్తకాలను రక్షించుకోవడం మన బాధ్యత. తెలంగాణ వారంతా అప్పకవీయాన్ని ఆదర్శంగా పెట్టుకోవాలి గ్రంథ రచనకు.
15. “మావూరు చందుపట్ల” అనే కైఫీయతు రాశారు. అసలు ‘కైఫీయత్’ అంటే ఏమిటి ? మీరు రాసిన దాంట్లోని విశేషాలు ఏవి?
జ: నేను దాన్ని కైఫీయతుగా రాసుకోలేదమ్మా ! మా ఊరు చారిత్రకమైనది. దాని గురించి ఎందుకో రాయాలనిపించింది. ఆంగ్లేయులు మన గ్రామ చరిత్రలను రాయించారు. వాటికే కైఫీయతు అని పేరు. కైఫీయతు అంటే స్థానిక చరిత్ర. అయితే మా ఊరికి బాట ఎట్లుండేది? శివాలయాలు ఎట్లుండేవి? శాసనాలు ఎట్లున్నయి? ఆ ఊళ్ళో కుటుంబాలు ఎన్ని ఉన్నయి? ఎన్ని కులాలు ఉన్నయి? అప్పటి సాంఘిక పరిస్థితులెట్లు న్నయి? మా కుటుంబము ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది? వారి విద్యా వైదుష్యాలు ఎట్లున్నయి? అవన్నీ మనసులో మెదిలి ఐదు రోజుల్లో పుస్తకం రాసిన. కారణమేంటంటే ఆ ఊర్లో కాకతి రుద్రమదేవి శాసనం ఒకటుంది. దానిలో విశేషమేంటంటే రుద్రమదేవి వీర స్వర్గ మలంకరించిన విషయం ఆ శాసనంలో ఉంది కాకతీయ చరిత్రకు ఇది చాలా అమూల్యమైనది. నేను 1966 ‘భారతి’ సెప్టెంబర్ పత్రికలో ఆ శాసనం గురించి ఢిల్లీ పత్రికల వాళ్లకు సమాచారం ఇచ్చిన. ఎవరూ స్పందించలేదు.తర్వాత ఆదిరాజు వీరభద్ర రావు గారు, నేను బి.ఎన్.శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారితో మొర పెడితే వాళ్లు ఆ శాసనాన్ని పరిశీలించారు. దాని గురించి భారతిలో మేము చర్చలు చేసినం. రుద్రమదేవి వీర స్వర్గ మలంకరించెనా? అని ఒకటి, కాకతీయుల చరిత్రకు అమూల్య శాసనం అని ఒకటి, రుద్రమదేవి స్థితిని తెలిపే చందుపట్ల అని ఒకటి ఇట్లా పత్రికల్లో చాలా వ్యాసాలు వచ్చినయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ ఊరి గురించి రాయాలి అని నేను ఆ పుస్తకంలో చందుపట్ల శాసనం గురించి కాపీ కూడా ఇచ్చిన. శాసనస్తంభం మీద 150 ఏళ్ల పూర్వానికి సంబంధించిన శాసనం ఒకటి ఉంది అది ఉంటే ఒకే స్తంభం మీద రెండు శాసనాలు భిన్న కాలాలకు చెందినవి చెక్కడం విచిత్రం.ఆ ఊరి చెరువు కూడా చాలా పాతది. ‘రా చెరువు’ అని దాని పేరు. మిషన్ కాకతీయ ప్రారంభించినప్పుడు కేసీఆర్ మా ఊరి చెరువుతోనే ప్రారంభించిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఊరి గురించి పుస్తకం వేసిన అయితే నల్లగొండ జిల్లాకు ఎన్. ముక్తేశ్వర రావు అని ఒక కలెక్టర్ వచ్చిండు. చాలా గొప్పవాడు. సంస్కృతం, వేదం, తెలుగు, ఇంగ్లీష్ బాగా చదివినవాడు. ఆయన్ని ఒక సారి కలిసి ఒక సహాయం చేయమని అడిగిన రోడ్డుపైన పడిపోయినటువంటి శాసన స్తంభాన్ని తీసి అరుగు మీద పాతి పెట్టడం, రుద్రమదేవి కాంస్య విగ్రహం చేయించడం. ఆయన ఒకసారి ఊరికి వచ్చి చూసి అక్కడ ఉన్న అధికారులకు చెప్పి పడిపోయిన ఆ స్తంభాన్ని అనామతు అరుగు మీద పాతించారు.ఆ తర్వాత ఇంకో స్తంభం మీద కూడా ఆ శాసనాన్ని చెక్కించి దాని పక్కనే పాతి పెట్టించినం. ఇప్పుడు రెండు స్తంభాలు ఉంటాయి అక్కడ. అంతేకాక అక్కడ సూర్యాలయం, శివాలయం రెండు ఉన్నాయి బాటకు రెండు వైపులా. శివాలయంలో చిన్న చిన్న ప్రాణవట్టాలు, శివలింగాలు ఉన్నాయి. సూర్య దేవాలయం ఆ జిల్లాలోని పెద్దది. ‘ఆకవరం’ అని నకిరేకల్ దగ్గర ఒక ఊరిలో పెద్ద సూర్యదేవాలయం ఉంది. ‘అర్కవరం’ అసలు దాని పేరు. కానీ క్రమంగా ఆకవరం అయిందది. పెద్ద శాసనాలు కూడా ఉన్నాయి. అయితే కలెక్టర్ ముక్తేశ్వర రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు రోజు రిటైర్ అయినారు. నేను అడిగిన విధంగా రుద్రమదేవి కాంస్య విగ్రహానికి డబ్బులు సాంక్షన్ చేయించిండు (ఆ రోజుల్లో ఒక లక్ష పదివేల రూపాయలు) ఆ రుద్రమదేవి విగ్రహాన్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. దాని చుట్టూ అరుగులు కట్టి సీకులు పెట్టించారు. రాజకీయ నాయకులు వచ్చి రోడ్డు వెడల్పు చేయడానికి ఆ విగ్రహాన్ని కూలగొడతామన్నారు. కానీ నేను దాన్ని అడ్డుకొని కావాలంటే మరోవైపు భూమిని ఇప్పిస్తానని చెప్పాను. అలా ఆ కలెక్టర్ పుణ్యం వల్ల రుద్రమ దేవి విగ్రహం, శాసన స్తంభాలు ఏర్పడ్డాయి.

16. ‘లాలి ప్రహరి’ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? దాన్ని రాసిన వారెవరు?
జ. నకిరేకల్లు దగ్గర నోములపాలెం నరసింహస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. నేను ఇంతకుముందు గోవర్ధన వెంకట నరసింహచార్యులు గారని కవి గురించి చెప్పాను కదా! ఆయన నరసింహస్వామి గురించి ఒక ప్రహరీ చెప్పినాడు. దాదాపు 1900 ప్రాంతంలో గుండంరాజు వాళ్ళనే కరణాలు ఆ దేవాలయాన్ని చూస్తూ ఉండేవారు. ప్రహరీ ఎట్లుంటది అంటే మొదలు ఒక శ్లోకం, తర్వాత ఒక పద్యం, తర్వాత అష్టదిక్పాలకులు ఆ స్వామిని రక్షిస్తున్నట్టు ఎనమండుగురికి ఎనిమిది శ్లోకాలు, ఎనిమిది వచనాలు, ఎనిమిది మంగళ హారతులు. ఇట్లా చేసి దాన్ని అందరూ అనుసరిస్తున్నట్లుగా స్వామిని కొలుస్తున్నట్లుగా చెప్పడం. ప్రహరీ అనేది నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటగా వచ్చింది. ఆయనకు అది ఎక్కడ నుండి వచ్చిందో, దాని ప్రేరణ ఏంటో ఎవరికీ తెలియదు. ఆ ప్రహరీ అనేది ఆయన పుస్తకం వచ్చిన తర్వాతనే తెలుగు సాహిత్యంలో పది పదిహేను ప్రహరీలు వచ్చినాయి. తిరుమల బుక్కపట్నం వారు అని ఆత్మకూరులో ఒక కవి ఉండేవాడు ఆయన ప్రహరీ అనే తెలుగు ప్రక్రియను సంస్కృతంలో చెప్పిండు. అంతటి గొప్ప ప్రక్రియ మా నల్లగొండ జిల్లాలో వచ్చింది. నల్లగొండ జిల్లాలో నిరోష్ఠ్య రామాయణం, అచ్చ తెలుగు నిరోష్ఠ్యం, ప్రహరీ, చక్కని ప్రబంధాలు చంద్రికా పరిణయం మొదలైనవి, వసుచరిత్రకు దీటుగా తాలాంక నందినీ పరిణయం లాంటి ప్రబంధాలు వచ్చినయి. కల్పిత కథాకావ్యాలను ప్రబంధాలుగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా విశిష్టమైన విశిష్టా ద్వైత సిద్ధాంతాన్ని తమ రచనల ద్వారా ఉపదేశాత్మకంగా చెప్పినటువంటి మరింగంటి కవులు పుట్టినది నల్గొండ జిల్లానే. ఆధునిక కాలంలో మా బి.ఎన్ శాస్త్రి లాంటి పరిశోధకుడు రావడం.. ఇట్లా అనేకులు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
17. మీ ఆత్మకథ “జీవనపర్వం” మీ పూర్తి జీవితానికి సంబంధించినదా? కేవలం మీ అనుభవాలు మాత్రమే రాశారా?
జ: నేను పూర్తిగా జీవితాన్ని రాయాలని ఊహతో ఆత్మ కథ రాసుకోలేదు. చాలా విషయాలు చెప్పకుండానే వదిలిపెట్టిన. ఎందుకంటే యదార్థాలు రాస్తే బాధపడే జనం కూడా ఉంటారు కదా! “యదార్థవాది లోక విరోధి” అని తెలిసిందే కదా! ( నవ్వుతూ) అందుకే అది మనసులో పెట్టుకొని ముఖ్యమైన విషయాలను మాత్రమే రాసిన. దాంట్లో ప్రారంభం నుంచీ మా ఊరు, మేము, మా వంశం, నా చదువు, నా ఉద్యోగం, ఎన్ని బాధలు పడింది? పాలెంలో ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఎట్లా ఉండేవి? రిటైర్మెంట్ తర్వాత ఎట్లా ఉండింది? ఇలా అన్నీ రాసిన. అయితే చివర్లో ఏం చేసిన అంటే మనం ఉన్నా, పోయినా నా సాహిత్యాన్ని గురించి, నా వ్యాసాల గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడితే చూడడానికి లిస్ట్ అంతా ఇచ్చిన. నా రచనలు అధిక భాగం మూసీ, భారతి పత్రికల్లో వచ్చినాయి. ఇప్పటికి కూడా మూసీకి రాస్తున్నానని చెప్పిన కదా! ఎందుకంటే పత్రిక ప్రారంభించినప్పటి నుండీ నేను, శాస్త్రి గారు దాన్ని బిడ్డలాగా భావించుకున్నాం. మన రచనలతోనైనా దాని అభివృద్ధి చేతామనే ఊహ నాకు ఉంటది. అట్లా “జీవనపర్వం” రాసుకున్నా.
18. ఏ ప్రక్రియలోనైనా ‘మంచి రచన’ అని చెప్పడానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జ: మంచి రచన అనడానికి రెండు కారణాలుంటాయి. ప్రతిభావంతుడైన రచయిత కావడం ఒకటి. ఎంచుకున్న వస్తువు శ్రేష్ఠమైనదై ఉండాలి. ఉదా: విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు. ఎంతోమంది రామాయణం రాసినారు. ఆయనే ఒకే ప్రశ్న వేసిండు.”మరల ఇదేల రామాయణంబన్నచో” అని. వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగు చేసి దానికి వ్యాఖ్య రాసిండు. అట్లే చాలామంది రామాయణాన్ని రాసినారు. కానీ విశ్వనాథ సత్యనారాయణ రాసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి కీర్తి వచ్చింది. కారణం ప్రతిభావంతుడు కావడం. ప్రతిభావంతుడైన వాడు ఒక శ్రేష్ఠమైన వస్తువును తీసుకొని దాన్ని పరిపూర్ణంగా చిత్రించినట్లయితే అది లోకంలో వ్యాప్తి చెందుతుంది. అంటే బీజ,క్షేత్ర న్యాయమది. మనం చవిటి నేలలో బలమైన విత్తనం వేసినా నిలువదు. బలమైన భూమిలో పుచ్చిపోయిన విత్తనాలు వేసినా లాభం లేదు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణాన్ని మించింది మరొకటి లేదు. ఒక్క బాలకాండ కృత్యాది గనక చదివితే విశ్వనాథ వారి విశ్వరూప సందర్శనమవుతది. అది కవి యొక్క ప్రతిభ. ” కవి ప్రతిభలోన నుండును కావ్య గత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు, ప్రాగ్వి పశ్చిన్మతమ్మున రసమ్ము వేయిరెట్లు గొప్పది. నవ కథాధృతిని మించి” అంటాడు. అందుకే రామాయణ కల్ప వృక్షం మీద నాలుగైదు పీహెచ్డీలు వచ్చినయి. కేవలం దాంట్లోని రాక్షసపాత్రల గురించి ఒకరు, స్త్రీ పాత్రల గురించి ఒకరు కవిత్వాన్ని, కవితా లక్షణాన్ని గురించి ఒకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో చేసినారు. అట్లాంటి పుస్తకం నిలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు “కృష్ణపక్షం” రాసిండు. చిన్న పుస్తకమది. మనం చదువుకుంటూ పోతుంటే చిత్రంగా అనిపిస్తది. నాయని సుబ్బారావు గారి “వేదనా వాసుదేవం” మొదలైనవి చదువుతుంటే లీనమైపోతాం. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి “దీపావళి” పుట్టపర్తి సత్యనారాయణ శాస్త్రి గారి “శివతాండవం” ఇలా ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అక్కడ శివుడా, విష్ణువా అన్నది కాదు. దాంట్లో లీనమయ్యే శక్తి కవిత్వానికి ఉండాలి. అది మనం సాహిత్యం లో అనుసరించాల్సిన పద్ధతి.
19. రచనా వ్యాసంగంలో ఇప్పుడొచ్చిన మార్పులపై మీ అభిప్రాయం ఏమిటి? ఆధునిక కవులకు మీరిచ్చే సూచనలు ఎటువంటివి?
జ: ఇప్పుడొచ్చే రచయితలు అంటే ఎమ్,ఏలు పీహెచ్ డి లు చేసిన వర్ధమాన రచయితలను చూస్తుంటాం. అది ఎట్లా ఉంటుందంటే శక్తి లేని పోట్లాట. మల్ల యుద్ధం చేసేవానికి శక్తి ఉండాలి. ఎదుటివారితో పోట్లాడాలి. ఇటు మేధాశక్తి లేదు. పరిచయం లేదు. బహు గ్రంథ పరిశీలన లేదు. ఇవేమీ లేకుండా ఏవేవో గొప్ప విద్యార్హతలు సాధించామంటారు. రచనలు చేస్తున్నామంటారు. అట్లా కాదు. మనం పరిశోధన చేయాలి. సాహిత్యంలో రకరకాల ప్రక్రియలు వస్తున్నాయి.ఇవాళ ఎవరికి వారు వాళ్లకు తోచినట్టు రాస్తున్నారు. అయితే పద్యం రాసే వాళ్ళు ఉన్నారు. పద్య కవిత్వాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే, ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను. పది పుస్తకాలు చదివి ఒక్క పుస్తకాన్ని రాయటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నువ్వు ఒక పుస్తకం సగం చదివి పది పుస్తకాలు రాయకు. అది నేను కోరుకునేది. సాహిత్యంలో ఎవ్వరైనా అతీతులు కావాలి. మన పూర్వులు సాహిత్యానికి అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం అని నాలుగు లక్షణాలు చెప్పినారు..అధీతి అంటే నేర్చుకోవడం, బోధ అంటే నేర్చుకున్నది మరొకరికి చెప్పడం, ఆచరణం అంటే నువ్వు ఒక ధర్మ శాస్త్రాన్ని చదువుకుంటే ఆ ధర్మాన్ని ఆచరణ చేసి చూపడం, వీటిని ప్రచారం చేయడం. దాన్నే విద్యా ప్రచారం అంటారు. పూర్వులు దీన్ని ఎట్లా చేశారంటే మీరు తాళపత్ర గ్రంథాలు పరిశీలిస్తే దాంట్లో కింద రాసి ఉంటుంది. ఉదా: “ఐదు మానికల జొన్నలకు ఈ పుస్తకం రాసి ఈయనైనది” అని. అంటే వీరికి కుటుంబం గడవాలి. కావాలనుకున్నవారికి పుస్తకం రావాలి. అంటే సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎవరెవరినో సంపాదించి వాళ్ళ ద్వారా పుస్తకాలు రాయించుకొని వ్యాప్తి చేసుకున్నారు. అందుకే గ్రంథ వితరణ అన్నది గొప్పనైనటువంటిది. నేను నాగుర్తులో ఆదిరాజు వీరభద్ర రావు గారిని చూసిన. ఆయన తన చాలా పుస్తకాలను అందమైన రాతతో రాసుకున్నారు. ఎందరికో రాసి ఇచ్చేవాడు కూడా. ఇప్పుడు ఆ శక్తి లేదు. మీరు చూడండి. ఇప్పుడు ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. లైబ్రరీలు వస్తున్నాయి. అలాంటి సౌకర్యం ఉంది ఇవ్వాళ. నేను దాదాపు 200 గ్రామాలు తిరిగినానమ్మ. ఒక మూడు, నాలుగు వందల పుస్తకాలు చదివిన. బస్సులో, సైకిల్ మీద, కెమెరా పట్టుకొని తిరుగుతూ పరిశోధన చేసిన. అప్పుడు ఒక రచన చేయాలంటే విషయాన్ని గూర్చి పూర్తి సమాచారం సేకరించేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది రాస్తున్న వ్యాసాలు, పుస్తకాలు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏం చేయగలం? అది చేయడమంటే మూసీ నదిని శుద్ధి చేయడమే (నవ్వేస్తూ).
20. పాలెంలో సుదీర్ఘమైన ఉద్యోగ ప్రస్థానం చేసిన మీరు ప్రాచ్య కళాశాలలను ప్రభుత్వం తీసివేసినప్పుడు పొందిన బాధ ఎటువంటిది?
జ: చాలా బాధ కలిగిందమ్మా ! ఎందుకంటే మీరు నమ్మండి, నమ్మకపొండి. మేము పాలెం కళాశాలలో సమిష్టి కృషి చేసినం. నేను రిటైర్ అయ్యే సమయానికి లైబ్రరీలో 80 వేల పుస్తకాలున్నాయి. కల్హణుని “రాజ తరంగిణి” జవహర్ లాల్ నెహ్రూ సంతకంతో వుంటుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా 5 ప్రతులు ఉంటాయి. విజ్ఞాన సర్వస్వాలు ఒక్కొక్క దానికి ఐదు కాపీలు ఉంటాయి (నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ మొదలైనవి). నేను రిటైర్ అయ్యేవరకు వచ్చిన అన్ని యూనివర్సిటీల తెలుగు, సంస్కృతం థీసిస్ లన్నీ కొనిపెట్టిన. అష్టాదశపురాణాలు, రాతప్రతులు ఇలా ఎన్నో. నా ఆధ్వర్యంలో ఓరియంటల్ కళాశాల యుజిసి గుర్తింపు పొంది, రాష్ట్రస్థాయిలో పేరు పొందింది. యుజిసి ద్వారా వచ్చిన డబ్బుతో కంప్యూటర్లు కొన్ని పెట్టినం జనరేటర్లతో సహా. ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేసినం. ఫ్యాన్లు తిరగనప్పుడు గ్రౌండ్లో చెట్ల కింద కంఠపాఠంగా పాఠాలు చెప్పేవాడిని. మీరు అతిశయోక్తిగా భావించకపోతే, నా సర్వీసులో ఎప్పుడూ నేను పుస్తకం చూసి పాఠం చెప్పలేదు. ఇంకొకటి క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నా సరే కూర్చుని పాఠం చెప్పలేదు నిలబడే చెప్పేవాడిని. నా పిల్లల కంటే నా విద్యార్థుల అభివృద్ధిని చూసి ఆనందించిన. అయితే నేను ఒకటి రెండు సార్లు ప్రాచ్య కళాశాలల గురించి రాసిన కూడా. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడితే తెలుగు సాహిత్యానికి మేలు జరుగుతుందనుకున్నాం. ఓరియంటల్ కాలేజీలు అభివృద్ధి చెందుతాయని అను కున్నాం. అది వ్యతిక్రమమైంది. ఎలాగంటే గవర్నమెంట్ లో ఖాళీలుంటే, ఓరియంటల్ కాలేజీలో నలుగురు అధ్యాపకులున్నారు. అందువల్ల ఇక్కడి నుండి అక్కడికి పంపేవారు. దాంతో చేసేది లేక మేనేజ్ మెంట్ వాళ్ళు మూసేసుకుంటారు అంతే! ఉన్నతస్థాయి అధికారులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సలహాలలో లోపం దీనికి ఒక కారణం. ఏదేమైనా చేసేదేం లేదు. ఒక్కటేనమ్మా! మొదటినుండీ సాహిత్యాన్ని నమ్ముకున్నా. సాహిత్యంతోనే ప్రయాణం చేస్తున్నా. దాంతోనే ముగింపు పలుకుతా అని ఆశ.
ఈరోజు ఒక సాహితీ ప్రస్థానం తీరు తెన్నులు దర్శించగలిగాం. చాలా సంతోషం. సహృదయంతో ఎన్నో విషయాలు మాకు వివరించినందుకు మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నమస్కారాలు. సెలవు.