గోపి చిన్న పిల్లాడు. అతడు తన పూల తోట లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా పూల మొక్కలు అందంగా రకరకాల రంగులతో ఉన్నాయి.ఇంతలో ఒక పూలమొక్క గాలికి అడ్డంగా అటూ,ఇటూ ఊగుతోంది.
గోపీకి ఒక సందేహం వచ్చింది.
ఇంతలో అక్కడకు అతని తాతయ్య వచ్చాడు. అప్పుడు గోపి తాతయ్య తో” చూడు తాతయ్యా! ఈ మొక్క గాలికి అడ్డంగా అటూ, ఇటూ ఊగుతుంది. దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాడు?
అప్పుడు తాతయ్య” ఇది నీకు భయపడి తనను తొలగిస్తావనుకొని తొలగించవద్దని అడ్డంగా ఊగుతోంది రా! . అంతే గాకుండా నేను చాలా మంచి మొక్కను. మీకు పూలు ఇస్తాను .నన్ను తొలగించవద్దని ప్రార్థిస్థున్నది ” అని అన్నాడు.
అప్పుడు గోపి “ఓహో! ఈ మొక్క ఇలా అడ్డంగా ఊగితే అర్థం ఇది అన్న మాట “అని బిగ్గరగా అన్నాడు. ఆ తర్వాత ” అయితే తాతయ్యా! దీనిని మనం తొలగించడం లేదు .అంతేకాదు. ఇలాంటి మొక్కలు ఇంకా కొన్ని కూడా తెచ్చి నాటుదాం” అని
అన్నాడు.గోపి అలా అనడమే కాకుండా మరి కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఆ తెల్లవారి నాటాడు.గోపి చేసిన పనికి తాతయ్య ఎంతో సంతోషించాడు.
మరొక రోజు గోపి తోట లోకి వెళ్లి తాతయ్యను పిలిచి ” తాతయ్యా! ఈ మొక్క అడ్డంగా కాకుండా నిలువుగా ఊగుతుంది . మరి దీని అర్థం ఏమిటి” అని ప్రశ్నించాడు? అందుకు తాతయ్య” గోపీ! నిన్ను ఆ మొక్క తన దగ్గరకు రమ్మని పిలుస్తోంది రా! తనను ఇక్కడనుండి తొలగించమని అది ప్రాధేయ పడుతోంది! “అని అన్నాడు. అప్పుడు గోపి “తాతయ్యా ! మొక్కలను తొలగించవద్దని మీరే చెప్పారుగా” అని అన్నాడు. ” అవును గోపీ! నీవన్నది నిజమే! కానీ ఇది కలుపు మొక్క. ఇతర మంచి మొక్కలకు నీరు ,ఎరువు అందకుండా ఇది చెరుపు చేసేది. ఇది మంచిమొక్కలను ఎదగనీయదు.అందుకే తనను తీసేయమని ఇది నీకు భయపడి నిన్ను ముందే వేడుకొంటోంది .ఇలాంటి వాటిని మనం తీసేయాలి రా!” అని అన్నాడు. ” అయితే దీనిని తొలగిద్దాం తాతయ్యా! ” అని అన్నాడు గోపి.” అవును !ఇలాంటి వాటిని తొలగిస్తే మంచి మొక్కలు ఎదిగి మన తోటలో చక్కని పూలు పూస్తాయి” అన్నాడు తాతయ్య.
మళ్లీ గోపి “మరి పూవులను మొక్కలనుండి తెంప కూడదా తాతయ్యా! ” అని ప్రశ్నించాడు ? “వద్దు. తెంపకూడదు. మనకు అత్యవసరమైనపుడు మాత్రమే ఒకటో, రెండో తెంపుకోవాలి.ఆ రంగు రంగుల పూలు మన కళ్ళకు ఎంతో అందంగా కనబడతాయి . వీటిని మనం మొక్కల నుండి వేరు చేయకూడదు. అవి మనకు కమ్మని సువాసనను, మంచి గాలిని ఇస్తాయి. మనం స్వార్ధం తో వీటి అన్నింటినీ ఒకేసారి తెంపకూడదు “అని అన్నాడు తాతయ్య. గోపి” సరే తాతయ్యా! నా సందేహాలు నివృత్తి అయినాయి. మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్లే నేను చేస్తాను ” అని అన్నాడు.
పిల్లలూ! అందుకే పూల మొక్కలను నాటి ప్రకృతి అందాలను కాపాడి పర్యావరణానికి తోడ్పడాలి.
కథలు
సాయంత్రం కావొస్తుంది. గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వానా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు. ఆ వెలుగు పడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది.
అదే పాత రిజ్వానా అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది. కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు. ఆమె, ఆమెనే కాదసలు. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. నిత్యం ఆత్మవిశ్వాసం తొణకిసలాడే ఆమె కళ్ళల్లో ఇప్పుడు శూన్యం నిండుకుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటూ దిక్కు తోచడం లేదు. తననే నమ్ముకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి. అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడంలేదు. సరిగ్గా ఊపిరైనా పోసుకోని ఆ నలుసును తలచుకుంటే రిజ్వానాకు ఊపిరాడ్డం లేదు. తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది.
కానీ స్నేహితులు ‘రానివాడి రూపెందుకు? అబార్షన్ చేయించుకో’ అని సలహాలిస్తున్నారు. బంధువులైతే ‘నీచమైన పని చేసావ్’ అంటూ చీదరించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది. తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు. ఇది ఆడవాళ్ళ బలమో బలహీనతో ఇదమిత్థంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి.
“లేదు నా రియాజ్ నా కోసం కచ్చితంగా వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. తండ్రి కాబోతున్నాడని తెలిస్తే కచ్చితంగా వస్తాడు. మళ్లీ పాత రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు” అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వానా. అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది.
“రియాజ్ రాకపోతే… ఎప్పటికీ రాకపోతే. ఈ బిడ్డ పరిస్థితి ఏంటీ? తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా” భవిష్యత్తును తలచుకుంటే తల తిరిగిపోతుంది.
“ఏది నీ బడీ బేటీ… నీ ప్యారీ బిడ్డా. ఎటు పోయింది. వాడెవడితోనే ప్రేమా ప్రేమా అంటూ తిరిగింది. వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్ళి చేసుకుంది. చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు. ఊళ్ళో నా పరువు తీసింది” బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు.
అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది. తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు. ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది.
“పైసా సంపాదించవు. ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు. నీకెక్కడిదిరా పరువు. నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా” అని భర్తను నిలదీయాలని వుంది ఆమెకూ. కానీ ఆ పని చేయలేదు.
పెండ్లయిన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నో సార్లు చెప్పుకుంది. అతన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తాగుబోతోడు ఎవరి మాట వింటాడు. పైగా మూర్ఖుడు. అందుకే వాళ్ళూ చేతులు దులుపుకున్నారు.
“మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. మేమేం చేయగలం. నిన్ను కన్నాము గానీ నీ తలరాతను కనలేముగా. చావైనా బతుకైనా అతనితోనే” పుట్టింటికి వచ్చిన ప్రతిసారీ తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు.
ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి. దెబ్బలకు అలవాటు పడిన ఆమె శరీరం పుట్టింటి సంగతే మరచింది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లయింది. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. అబ్బాయిని కనలేదని హింసించేవాడు. అయితే పెద్ద కూతురు రిజ్వానా కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది. “అమ్మీ… అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి?” అడిగేది రిజ్వానా.
“చావైనా బతుకైనా మొగుడితోనే” అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది. అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో, కోప్పడాలో అర్థమయ్యేది కాదు.
తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది. ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తుంది. ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది. ఎవరి మాటనూ లెక్క చేయని తండ్రి ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు. కానీ ఆడపిల్ల గడపదాటి బయటకు వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైసా సంపాదించడు. పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు. కూతురు ఎదురైతే కొరకొరమని చూస్తాడు. ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు.
అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దీనంతటికీ కారణం రియాజ్. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వాన కలలో కూడా అనుకోలేదు. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు.
సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే రియాజ్ ను చూసింది. తొలి చూపులోనే బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది. అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. రియాజ్ కూడా అందంలో తక్కువేం కాదు. ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాని పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది.
మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు ఇల్లూ, చెల్లెలు, తల్లీ బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. ఇద్దరం పెండ్లి చేసుకుందామన్నాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు హాయిగా గడిపేశారు.
వీరి ప్రేమ గురించి చుట్టు పక్కల అందరికీ తెలిసిపోయింది. దాంతో రిజ్వానా పెండ్లి చేసుకుందామని తొందరపెట్టింది. రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. పైగా ఆ పెండ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు. భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
పోలీసులు రియాజ్ ను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు.
పెండ్లి తర్వాత రిజ్వానా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. అక్కడ తల్లి, చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. ‘నా సుఖం నేను చూసుకొని వచ్చేశాను. అమ్మా, చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో’ అని ఆవేదన చెందింది. వాళ్ళ కోసం రిజ్వానా మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్ కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రియాజ్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది. వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుక్కు లేనిపోనివి చెప్పారు.
‘ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్ళి చేస్తాం’ అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, పెండ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులు ఏం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు.
రియాజ్ వెళ్ళిన కొద్ది రోజులకే తను తల్లికాబోతుందని తెలిసింది. ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది.
కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ‘ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మావాడిని వదిలి వెళ్ళమనండీ’ పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాజ్ తండ్రి జవాబు ఇది.
‘నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను’ అంది. ఆమె కన్నీళ్ళకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్తమామల కాళ్ళు పట్టుకుంది. అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు. చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది.
‘మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా. అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే లెక్కచేసేది కాదు. ఇప్పుడేమయింది? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి’ అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పే వారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే.
“మీ అమ్మాయికి ఎంత ధైర్యం. కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ. ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు. నిజంగా నూ అదృష్ట వంతురాలివి” అని రిజ్వానా తల్లితో తెగ చెప్పే వారు. ఇప్పుడేమో ఇలా నోటి కొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.
ఇప్పుడు కూతురికి మూడో నెల. తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా ఢీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు. నలుగురూ అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓ సారి ఆ ప్రయత్నం కూడా చేసింది. తల్లి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడితే మనసు మార్చుకుంది. ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూరొచ్చి ఆలోచిస్తూనే ఉంటుంది.
“దీదీ… అబ్బా అమ్మీని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. నూ ఒకసారి బయటకు వచ్చి నాన్నను ఆపు” రిజ్వానా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమలాడింది. .
“ఇప్పుడు నాన్న నా మాట వింటాడా. నేను చేసిన తప్పు అలాంటిది. నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది.
ఓపికున్నంత సేపూ రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లో జీవం లేదు. ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేది. రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది. ఇంట్లో అందరి కన్నా పెద్ద పిల్ల అయినా చిన్న పిల్లలా సరదాగా ఉండేది.
“ఇక ఈ బతుకు బతకడం అనవసరమా? చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారం” అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా. మెల్లగా లేచి తన గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తల్లిని చివరి చూపు చూసుకుందామని వెదికింది. వంటగది బయట తలుపుకు ఆనుకుని నిద్రపోతుంది. భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాగే నిద్రపోతోంది. పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు. వాళ్ళను ఆ స్థితిలో చూసి రిజ్వానా దుఖం ఆగలేదు.
‘వీళ్ళను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?’ అని ఒక్క క్షణం ఆలోచించింది. మళ్ళీ వెళ్ళి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.
కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్య కిరణాల వేడిమి భరించలేక కండ్లు తెరిచింది. మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది.
“మామీ… మామీ… రిజ్వానా ఏదీ? ఎక్కడుంది..?” అంటూ కంగారుగా అడిగింది.
ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె “ఏమైంది మున్నీ.. ఎందుకంత కంగారుగా ఉన్నావు. అసలేం జరిగింది. నాకు చెప్పు” అంది.
“లేదు మామీ…. రిజ్వానాకే చెప్తా… గదిలోనే ఉందా…” అంటూ అటువైపుగా పరిగెత్తింది. లోపల నుండి మున్నీ మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకు వచ్చింది.
“ఏంటి మున్నీ… రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా. తను నిన్ను కలిశాడా. నా గురించి తనకు చెప్పావా. నా కోసం వస్తానన్నాడా..?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.
“రియాజ్ పై ఎంత ప్రేమ ఈమెకు. అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో? కానీ చెప్పకపోతే ఎలా… చెప్పాల్సిందే. లేకపోతే ఇలా భ్రమల్లోనే బతికేస్తుంది” అని ధైర్యం తెచ్చుకుంది.
“లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు. కానీ రియాజ్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మానాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్ళి చేసి సైలెంట్ గా ఇక్కడకు తీసుకొచ్చారు. పెళ్ళి జరిగి కూడా పది రోజులయ్యిందంట” అని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయట తల్లి తల్లడిల్లిపోయింది. దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. రిజ్వానా కుక్కిమంచంలో పడి ఏడుస్తూనే ఉంది. “ఏమీ చేసుకోనని నాకు మాట ఇవ్వు రిజ్వానా” అంటూ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను మళ్ళీ వస్తా” అని మున్నీ వెళ్ళిపోయింది.
రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది. ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు. రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి పది దాటింది. తల్లి ఎంత బతిమలాడినా మెతుకు ముట్టుకోలేదు.
“అమ్మీ… కొద్ది సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్, ఊరికూరికే తినమని విసిగించకు. నేనేమీ చేసుకోనులే, నువ్వెళ్ళి తినుపో” అంది చిరాగ్గా.
కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుటపడుతుందిలే అని తల్లి వచ్చేసింది. ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్ళు తాగి అలా నడుం వాల్చింది. బాగా అలసిపోయింది వుంది. అయినా నిద్ర పట్టడం లేదు. రాత్రి పన్నెండు అయ్యింది.
రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్టు వినిపించి అటువైపు వెళ్ళింది. ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యానుకు కడుతుంది రిజ్వానా. అది చూసి తల్లి గుండెలు బాదుకుంది.
“అంత పని చేయకే తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి” అంటూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుంది. ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
“అమ్మీ… అసలు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా వల్ల కావడం లేదు. అందర్నీ ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఎవరికీ సుఖం లేకుండా పోయింది. ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురు చూశా. ఇక
రాడని అర్థమయింది. ఇక నేనెందుకు బతకాలి. ఈ బిడ్డను ఎలా బతికించాలి. నన్ను చావనీ అమ్మీ” అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది.
“నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి. నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా? నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళు ఉన్నారు. మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి. చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చద్దాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ఏడుపు విని నిద్ర పోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి అర్థమై అమ్మనూ, అక్కనూ చుట్టుకొని వాళ్ళూ ఏడుపు మొదలుపెట్టారు.
అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, రిజ్వానా కండ్లు తెరిచే సరికి ఎదురుగా స్వాతి. “స్వాతీ నువ్వేనా… ఎప్పుడు వచ్చావు. నువ్విక
రావేమో అనుకున్నాను. కోపంతో నా మొఖమే చూడవనుకున్నాను” అంటూ తలదించుకుంది.
“ఏంటే నువ్వు చేసిన పని. ఇదేనా రిజ్వానా అంటే. నా స్నేహితురాలు ఎలా ఉండేది. ఏంటిది? పిరికి దానిలా చావాలనుకుంటావా?” అంటూ కోప్పడింది.
“అమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పినట్టుంది” అంది.
“అవును చెప్పింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నేను వున్నాననుకున్నావా లేదా? ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు” అంది మళ్ళీ కాస్త కోపంగా.
“ఎలా చెప్పమంటావే? అప్పుడు అంటే, నువ్వు ఎంత చెప్పారు. ఇంకా చదువుకో, ఇప్పుడే పెళ్ళి ఎందుకని. అంటీ అయితే మరీ మరీ బతిమలాడారు.
కానీ నేను మీ మాట వినలేదు. చివరకు అంకుల్ కూడా చెప్పారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది? అందుకే రాలేదు” సంజాయిషీగా చెబుతూ తలదించుకుంది.
“నీ మొహం. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా. అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది.
కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది. అమ్మ డిపార్ట్ మెంట్ హెడ్ కదా.. కంపల్సరీగా ఉ ండాలి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను నాతో మాటు మా ఇంటికి తీసుకురమ్మంది. నాన్న కూడా ఇదే చెప్పారు.” అంది. “అవునా… అంటీ నా గురించి అడిగారా? నిజమేనా..?” అంటూ అత్రంగా అడిగింది రిజ్వానా. “నేను నీకు అబద్దం చెప్తానా” “లేదు, నువ్వెప్పుడూ అబద్దం చెప్పవు. అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు? వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా? మేమంతా ఏంటి మరి?” కోప్పడింది స్వాతి.
“ఏడ్వక ఏం చేయమంటావే. తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఎలా పెంచాలి? తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా?”.
“ఎవర్నే ఎదుర్కోవలసింది. ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు. సూటి పోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు. అయినా మోసపోవడం కాదే తప్పు. మోసగించిన ఆ వెధవది. అటువంటి దరిద్రులదే తప్పంతా. ఇప్పుడు రోజులు మారిపోయాయే. ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి తల్లులు ఎందరో ధైర్యంగా, ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు. చివరకు పాస్పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళుతున్నారు. సర్టిఫికేట్లో తల్లి పేరు కోసం పోరాటం చేసి గెలిచిన
వారు ఎందరో ఉన్నారు. నీ బిడ్డకు తండ్రి లేడు. అయితే ఏం. తల్లి వుంది. తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది. అది నువ్వే. ధైర్యంగా ఉండు. మేమంతా నీ ప్రతి కష్టంలో ఉన్నామని మరిచిపోకు”.
విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది. అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు. తిరిగి ఇలా అడిగింది.
“నన్ను ఈ సమాజం బతకనిస్తుందా? అంతెందుకు మా నాన్నే నన్ను నీచంగా చూస్తున్నాడు”
“నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు. ప్రేమించడం తప్పెలా అవుతుందే. అవతలి వాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు
అంగీకరించు. మళ్లీ నువు కోరుకున్న రోజులు నీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం మొదలుపెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు”.
“నువ్వు చెప్పేది నిజమే కానీ..” అంటూ ఏదో అనబోయింది రిజ్వానా. “చూడవే.. అనవసరంగా ఏదేదో అలోచించి మైండ్ పాడుచేసుకోకు. ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. హాయిగా బతుకు” అంది స్వాతి.
“నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా, అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమే. నువ్విచ్చిన ధైర్యమే. ప్రేమ పిచ్చిలో పడి నిన్నూ, నా ధైర్యాన్ని ఇన్ని రోజులూ పోగొట్టుకున్నాను.
యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ, సమస్యలంటూ పోరాడుతున్నావు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు. నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఏం చేశాను? మీ మాటలు పట్టించుకోలేదు. నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్నే తలకిందులు చేసేసింది.” మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది.
“నీకెన్ని సార్లు చెప్పాలి. పాత విషయాలు గుర్తు చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ముందు ఆ ఏడుపు మానుకో. నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని. అంతేకాదు. లోపల రూపుదిద్దుకుంటున్న బిడ్డకు అస్సలు మంచిది కాదు” అంది స్వాతి.
“అవును. నీకు ఏడిస్తే నచ్చదు. ఇక ఏడ్వనులే. నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలుపెడతా. నువ్వు నా తోడుంటే చాలు. ఈ ప్రపంచాన్నైనా జయిస్తా. నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా. మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఉ ద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను. అమ్మను, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. అంతే కాదు నీలా, అంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా. నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా” గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వానా.
“అద్దీ లెక్క! స్వాతీ ఫ్రెండంటే ఆశామాషీగా ఉంటుందా ఏమి? నాకు తెలుసు. నువ్వు తలచుకుంటే సాధించగలవు. నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేనూ. అమ్మా సిద్ధంగా ఉన్నాము” అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది.
“అంటీ, దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళతాను. వాతావరణం కాస్త మారితే మనసు కాస్త కుదటపడుతుంది” “సరే స్వాతమ్మా… ఆ పని చెయ్యి. కొన్ని రోజులు నీతోనే ఉంచుకో” అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా
“అంతా ఓకేనే… మరి ఆ రియాజ్ ను అలా వదిలేయాల్సిందేనా” అంది రిజ్వానా. “అలా ఎలా వదిలేస్తాం. వాడి సంగతి నాన్న చూసుకుంటారు”.
“అవును స్వాతి. నిజమే… అంకుల్ లాయర్ కదా, ఆ సంగతే మర్చిపోయా. ఇలాంటి వాళ్ళకు కచ్చితంగా శిక్ష పడాలి. ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు. మళ్ళీ పెండ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు. చట్టాలంటే అసలు భయం లేకుండా పోయింది. ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ళ ధీమా. వీడికి అంకులే సరైన మందు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే. నువ్వొచ్చి నాకు కొత్త ఊపిరి పోశావు” అంటూ నవ్వుతూ స్వాతి మెడచుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వానా.
నవీన్ పగటి నిద్ర తీస్తున్నాడు. స్నేహితుడు లేపటంవల్ల నిద్రాభంగమైంది.
”ఈ సమయాన వచ్చా వెందుకు”
”ఏమీ తోచడం లేదు”
”నీకు తోచకుంటే నా నిద్ర చెడగొడతావా”
”కోపానికి రాకురా, నీ దయను”
”ఎందుకంత బాధగా ఉన్నావు”
”బాధ కనిపిస్తుందా”
”అవును నీకేం తక్కువ. వాస్తవంగా నీ బాధ్యతలన్నీ తీరాయి. లోకం బాధ నీకెందుకు. ఎవరెక్కడ పోతేంది. మందిని బాగుచేయడం నీ శక్తికి మించిన పని. ప్రపంచంలో అందరూ సమర్థులే. ఒకరు చెబితే విని బాగుపడే స్థితిలో ఎవరూ లేరు. అందరికి అన్నీ తెలుసు. అందరికంటే నాకే తక్కువ తెలుసు అనుకోవాలి. అప్పుడే బి.పి., షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవు. ఆరోగ్యం, తృప్తి సమకూరుతాయి.”
”అనేక మార్పులు అనివార్యాలై పరాయితనం వైపు మనుషుల్ని తీసుకెళ్తుంటే ఎట్లా ఆలోచించకుండా ఉండగలం!”
”ఉదాహరణకు ఏదో ఒకటి చెప్పు చూద్దాం!”
నా చిన్నప్పుడు మా గురువు గారికి రెండు చేతులా దండం పెట్టేవాణ్ణి. నడుస్తున్నవాడల్లా ఆగి మంచీ చెడు మాట్లాడేవాడు. నేను టీచర్ను అయ్యాక బడికి సైకిల్ పై వెళ్ళాను. మా విద్యార్థులు దండం పెడితే ఒక చేత సైకిల్ హ్యాండిల్ పట్టుకొని, మరోచేత్తో నమస్కారం పెట్టి, ఆగి పలకరించేవాణ్ణి. మా అబ్బాయి టీచర్ అయ్యాడు. బైక్ పై బడికి వెళ్తున్నాడు. వాడి విద్యార్థులు సైకిల్పై వస్తున్నారు. విద్యార్థులు ఒక చేత ”హాయ్ సార్” అంటే మా వాడు బైక్ వదిలే వీలు లేక తల పంకించి ”హాయ్” అంటున్నాడు. పలకరించడం ఆగిపోయింది. నా మనమడు విద్యాశాఖాధికారి. కార్లో నుండే ఇతరులకు చేయి ఊపుతూ వెళతాడు. అలవాట్లలో మార్పు వచ్చిందా, లేదా? నమస్కారం లోని మానవీయత ఉందా? ఊడిందా?
”ఊడింది వాస్తవమే. ప్రగతి కూడా వాస్తవమే.
”మానవీయత లేని అభివృద్దే మిగిలిందని బాధ”
”అభివృద్దిలోని ఆనందాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. నీకు, మాత్రం ప్రతిదాంట్లో ఏదో ఒక తప్పు కనపడుతుంది. పాజిటివ్గా ఆలోచించు.”
”ప్రగతితో పాటు ప్రశాంతత ఉంటే సుఖమయ జీవితం సాధ్యం. మనుషుల మధ్య మానవీయత అవసరం. అది పోతుందనే బాధ. ఆత్మగల ఆలోచన, అవసరం మేరకు ఆలోచన, ఈ రెంటి మధ్యగల తేడా నీకు అర్థం కావడం లేదు.”
”నాకు, నీవు ఎప్పుడూ అర్థం కావు”.
పవన్కు ఊపిరాడడం లేదు. నవీన్ లాంటి వాడికి మానవీయతలోని మాధుర్యం ఎట్లా రుచి చూపించాలో పాలుపోవడం లేదు. జాలి, కరుణతో కూడిన సంస్కారం ఎలా ఉంటుందో అర్థం చేయించాలి. అందుకు ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచించాడు. కళ్ళుమూసుకొని అరగంట సేపు నిశ్చలంగా ఉన్నాడు. సెల్ మోగింది. దాని గొంతు పిసికాడు. మెసేజ్లతో పాటు ఆడియో మెసేజ్లు డిలిట్ అయ్యాయి. ఆ క్షణంలో తళుక్కున మెరిసిందో ఆలోచన. ఆడియో రికార్డర్ ద్వారా కథ చదివి నవీన్కు పంపిస్తే బాగుంటుందనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. మౌత్ మైక్ పెట్టు కొని ఆడియో రికార్డర్ ఆన్ చేసాడు. చదవడం మొదలు పెట్టాడు.
* * *
అప్పుడే పుట్టిందో జింకపిల్ల. అది చూసి చెట్టు ఫక్కున నవ్వింది. పూలు, పండ్లు రాలాయి. కళ్ళు తెరిచింది పిల్ల. నన్నెవరు తెచ్చారీ భూమిపైకి. వెతికింది. వెతుకుతూ, వెతుకుతూ ముందుకు సాగింది. పచ్చిక, గాలి ఎంత చల్లగున్నాయో, అనుకుంది. అమ్మకోసం ఆరాటపడింది. అప్పుడే భూమి పైకి వచ్చిన పిల్లను చూసి సమస్త సృష్టి పరవశించింది. భానుడు భగభగమనడం తగ్గించాడు. జింకపిల్ల అడుగులకు మడుగులొత్తింది పృథ్వి. గాలి వాయులీనం వినిపించింది. అమ్మ ప్రేమకోసం జింకపిల్ల తహతహలాడింది. అది తెలిసిన ఆకాశం ఆనందనాట్యం చేసింది. అమ్మకోసం వెతుకుతూ మరింత ముందుకు నడిచింది. నీరు దారిచ్చింది. నిప్పు చెమ్మగిల్లింది.
బయటకు వెళ్ళిన తల్లి తిరిగివచ్చింది. పిల్ల కనపడలేదు. ఇంత తొందరగా ఎటు వెళ్ళింది దుఃఖపడింది. వాడేడి! వాడికి పట్టింపులేదు. ఎటు వెళ్ళినట్లు ? ”నేను సైతం మేతకు వెళ్ళిన” అంటాడు. ”చెప్పిపోవాలి కదా.” ”నేను మాత్రం చెప్పివెళ్ళానా”, ”పడుకొని ఉంటే ఎలా లేపడం” అలా అంతర్మథనం సాగింది.
పంచభూతాలకు పాలుపోవడం లేదు. తల్లి, పిల్ల వేరు వేరయినవని కలవరపడ్డాయి. ఆకాశం తెల్లబోయింది. వాయువు హోరుమంది. నీరు సుళ్ళు తిరిగింది. అగ్నిని నివురు అలుముకొంది. భూమి పట్టన పగిలింది. పిల్ల-తల్లి పయనం సాగుతుంది. రెంటి దిక్కులు వేరయ్యాయి. తిరిగివచ్చిన తండ్రి జింక ఒళ్ళు విరిచింది. ఇల్లంతా కలియదిరిగింది. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరయింది. స్త్రీ పురుష ఫలం అందకుండా పోయిందనే బెంగ పట్టుకుంది. రాత్రంతా మెలకువగా ఉండడం వల్ల బిడ్డను చూసాను. దాహం తీర్చుకుని వచ్చేసరికి బిడ్డ మాయమైంది. బాధ్యత నాదా? చింత పడింది.
* * *
తప్పటడుగులు వేస్తూ ఆలోచిస్తుంది పిల్ల. ఇంతకూ అమ్మ ఎలా ఉంటుంది? కళ్ళు తెరవక ముందే ఎటో వెళ్ళింది. అమ్మ తిరిగి వచ్చేదే నా వద్దకు. నేనే తొందరపడి బయల్దేరాను. అమ్మ నాకు ఎదురుగా వస్తది. అమ్మ ఎలా ఉంటుంది ? అమ్మ ప్రేమకు మారు రూపం నేనే కదా! అమ్మ నాలాగే ఉంటుంది. నేనెలా ఉంటాను ? సందేహాలకు లోనౌతూ అడుగులు వేస్తుంది. నాలుగడుగులు వేసిందో లేదో. ‘అమ్మా ఆకలి అంది” నీరసంతో కూలబడింది. కళ్ళు తిరిగినవి. ప్రపంచం మసక బారింది. ఆ స్థితిలో కాస్తంత దూరంలో అమ్మలాగా కనిపించింది. లేని ఓపిక తెచ్చుకుంది. మెల్లమెల్లగా అటువైపు అడుగులేసింది.
* * *
అమ్మ పిచ్చిదైంది. పిల్లకోసం పిచ్చిగా తిరిగింది. ఎత్తుపల్లాలు, శిఖరాలు – లోయలు గాలించింది. చిన్నప్పుడు నేను అమ్మ చెప్పినట్లు వినేది. ఈ కాలపు పిల్లలు పుట్టుకతోనే స్వతంత్రులవుతున్నారు. స్వేచ్ఛ మంచిదే. ఉరిబిగించేదిగా ఉంటే ఎట్లా? ఈ కడుపు కోత దేనికి? అది వెళ్ళినందుకా? ప్రసవ ఫలితమా? బొడ్డుతాడు బంధమా? తల్లి ప్రేమ అంటే ఇదేనా? ఏమో తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. వాడి పరిస్థితి ఏమిటి? వాడి మొహం వాడికింత పట్టింపా? ఏమో? తనలో తానే నవ్వుకుంది. యాతన పడింది. వెతుకుతుంది. ఎక్కడని వెతకాలి. వెతకకుండా ఉండగలనా? పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి.
* * *
వెతకాలి… వెతకాలి…. ఎక్కడికని పోవాలి? ఎటువైపని వెళ్ళాలి? కూచుంటే ఇక్కడికే వస్తుందా? రాదుగాక రాదు. అది దారి తప్పిన పిల్ల. వెతకాలి… పట్టుకోవాలి…. ఈవిడ ఇంకా రాలేదు. అడుగు ముందుకేసాడు. భార్యాబిడ్డలు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. పరిపరి విధాల మనసుపోతుంది. పిల్లది తప్పే. ఉన్నచోట ఉండక ఎందుకు బయల్దేరినట్లు? ప్రేమ ఒక చోట ఉండనిస్తదా! ఎన్ని దివారాత్రాలు తిరిగిన. దీని తల్లిని ఒప్పించటానికి. మనసు, తనువుల ప్రతిఫలనం నా బిడ్డ. ఎక్కడుందో. మృగారణ్యం మొగారణ్యం అంతా అడవి, భయంపాకింది. ఈ పిల్లకు ఓపిక లేదు. ఈ తరమే అంత. ఒప్పుకోళ్ళ స్థానంలో బలవంతాలు వచ్చి చేరినయి. ఆలోచనలన్నీ పుకార్లలా విహరిస్తున్నవి. కళ్ళు-కాళ్ళు వెతుకుతున్నవి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది పరిస్థితి.
* * *
తల్లి, పిల్ల, తండ్రి, అడవిన పడ్డారు. తల్లి ప్రేమకోసం పిల్ల తహతహలాడింది. దగ్గరలో ఉన్న జంతువు తల్లే అనుకొని మరింత చేరువైంది. దాని మెడవరకు వెళ్ళింది. పిల్ల ఒళ్ళు పులకరించింది. తల్లిని ముద్దాడింది. ”భూమిపైకి నన్ను తెచ్చింది. నీవేకదా” అడిగింది. పిల్ల ప్రవర్తన వల్ల ఎదుటి జంతువులోని మాతృహృదయం పాలుగారింది. పిల్లను అక్కున చేర్చుకుంది. దాని విశాలమైన ఉదరం పిల్ల ఆటస్థలమైంది. బండలాంటి దాని తల నీడలో విశ్రమించింది. కళ్ళు విప్పార్చి తదేకంగా తల్లిని చూస్తూ పాలకోసం ప్రయత్నించింది.
* * *
తల్లిజింక, కొండా-కోన గాలించింది. డస్సింది. గుట్ట-గుండె తడిమింది. దహించుక పోయింది. అడుగులు తడబడ్డాయి. నీటి కోసం అలమటించి కూలబడింది. చావు వచ్చేలా ఉంది. ఆకాశం వైపు మెడసాచింది. కన్నీరుకార్చింది. లేని ఓపిక తెచ్చుకుంది. నీటి జాడకు బయల్దేరింది. సుడిగాలి పయనం చేసింది తండ్రి జింక. ”ఎక్కడున్నవు బిడ్డా” అని నోరారా అరిచింది. అడవంతా ప్రతిధ్వనించింది. నీరై దుమికింది. రాయి-రప్ప ఒరుసుకపోయింది. సుడిగాలై గాలించింది. కాయ-కంప గీరుకపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అడవిని అడిగింది. నిశ్ళబ్దం కనిపించింది. నీరసం కమ్మింది. నాలుక పిడచకట్టింది. లేని ఓపిక తెచ్చుకొని నీటికోసం బయల్దేరింది.
* * *
ఆకసాన్నంటినట్లున్న పొడవైన చెట్లు. వాటి ఆకులు రాలుతున్నవి. విశాలమైన నది ఒడ్డుకు ఇరువైపులా చెట్లు. అవి నదికి గొడుగు పడుతున్నట్లున్నవి. నది శబ్దిస్తుంది. ఆ శబ్దం దాహార్తులను పిలుస్తున్నట్లున్నది. తీరం పొడవునా జంతుజాలం సేదతీరుతుంది. రాలిన ఆకు, నీటితో తడిసి మెత్తటి పరుపులా విస్తరించింది. దానిపై సేదతీరిన జంతువు కదిలినా, నిద్రాభంగం కాకూడదని ఆకు శబ్దించడం లేదు. ప్రకృతి ఒడి మెత్తన. నిద్రించిన ప్రాణికి సాంత్వన. మెలకువ కలిగిన మెదడుకు ఆలంబన.
* * *
నదీ తీరంలో చెట్లతో పాటు దట్టమైన పొదలున్నవి. పొదల మాటున దాక్కుని జంతువులు ఉన్నాయి. వేటగాళ్ళు ఉన్నారు. దాడి చేయాలనుకున్నవారు మాటు వేయడం పరిపాటి. ఆ రోజు వేటకోసం భార్యతో సహా వచ్చాడు వేటగాడు. మాటు వేసాడు. అక్కడ ఆదమరిచి పడిపోయిన తల్లి జింక పై భార్యభర్తల చూపు పడింది. పడి ఉన్న దాని వైనం చూసి దంపతులు సంబరపడ్డారు. బాణం ఎక్కుపెట్టి నారి సారించాడు. వదలడమే ఆలస్యం. భార్య వారించింది.
”ఎందుకు అడ్డుకున్నావు” అన్నాడు
”నిద్రపోతున్న దాన్ని చంపడం పాపం”
”ఆకలిని చంపడం కూడా పాపమే”
”బాలింతలా ఉంది పాపం”
”నా ధర్మాన్ని విస్మరించడం పాపం”
”మనిషి పుటుక పుట్టినపుడు నెనరు ఉండాలె”
”అందుకే నిన్ను, నాతో రావద్దంట”
”అటు చూడు” అంది
మొహం వేళ్ళాడేసుకొని, తడబడుతున్న కాళ్ళతో వచ్చింది తండ్రి జింక. కడుపునిండా నీళ్ళు తాగింది. తాగిన చోటే సాగిలపడింది. కళ్ళు మూసింది. గతం కదలాడింది. కళ్ళు తెరిచింది. భారంగా నిశ్వసించింది. మళ్ళీ కళ్ళు మూసింది. దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళు తెరిచింది. ఓపిక లేకున్నా లేచి నిలబడింది. ఎదురుగా దగ్గర్లోనే పడి ఉన్న తల్లి జింక కనిపించింది. ఉత్సాహంగా ముందుకురికింది. అచేతనంగా పడి ఉన్నదాన్ని చూసి కంటనీరు పెట్టింది. నాలుకతో నిమిరింది. తలతో తట్టింది. భయంతో దిగ్గున లేచింది తల్లి జింక. ఎదురుగా తండ్రి జింక. భయం స్థానంలో కోపం చేరింది.
”ఎక్కడ తిరగబోయినవురా” కోపగించింది.
…………………………………………
”బిడ్డను పోగొట్టుకున్న రా” నిస్సహాయంగా అరిచింది.
…………………………………………
”ఇదంత నీ వల్లనే జరిగింది. నాశనమయిపోతవు” శపించింది.
”జరిగిందానికి ఇద్దరం బాధ్యులమే” నిశ్చలంగా అంది తండ్రి జింక
ఆ మాటతో కూలబడింది. సోయి తప్పింది. దాని పక్కనే కూర్చొని సపర్యలు చేసింది తండ్రి జింక. ఇదే అదనుగా మరోసారి దాడికి సిద్దమయ్యాడు వేటగాడు. మళ్ళీవారించింది భార్య.
”నా పాలిటి దరిద్రదేవతవు నీవు” అన్నాడు
”బిడ్డను పోగొట్టుకొని ఉన్నారు వాళ్ళు”
”అయితే నాకేంటి?”
”వన్య ప్రాణులను చంపితే జైల్ల పెడుతారట”
”నీతులు చెప్పకు. ఇవ్వాళ పూటగడవడం ఎట్ల?”
”ఒక్కరోజు ఉపాసం ఉందాం”
”రేపటికి ఎట్ల?”
”రేపటి సంగతి దేవుడెరుగు”
వేటగాడు విల్లు కింద పెట్టాడు. సపర్యల తరువాత తల్లిజింక తెలివికొచ్చింది. రెండు జింకలు కలిసి కనిపించిన దారిలో పయనించాయి. వాటిని వేటదంపతులు వెంబడించారు.
* * *
జింక పిల్ల పాలకోసం ప్రయత్నించింది. తనది కాని వాసనేదో వేసింది. వెగటు పుట్టింది. ముద్దాడిన మూతికి రక్త రుచి తెలిసింది. తొందరలోనే అది తన తల్లి కాదని గ్రహించింది. జింక పిల్ల రక్తంలో భయం చొరబడింది. అక్కడి నుండి పరుగెత్తింది. పరుగును చూడగానే జంతువులో వేటాడే లక్షణం మేల్కొంది. వెంటాడింది. క్షణంలో పంజా విప్పింది. విసిరింది. జింకపిల్ల తప్పించుకుంది. జంతువు గాండ్రించింది. ముందుకు దూకింది. మెడ పట్టింది. కొరికింది. పులినోట్లో పడి జింకపిల్ల చచ్చింది. కాసేపు స్థంబించిన ప్రకృతి మరల యధావిధిగా మారింది.
* * *
రెండు జంటలు ఒక దాని వెనుక ఒకటి పరుగునడక పెడుతున్నవి. అలా వెళుతున్న వాటికి చావు వాసన సోకింది. తల్లి జింక ఠక్కున ఆగింది. వాసన వైపు మళ్ళింది. తండ్రి జింక వెంబడించింది. అవి దారి మళ్ళడం చూసి వేటదంపతులు ఆశ్చర్యపోయారు. వాటి వెనకే వెళ్ళారు. ఆ దారి జింకపిల్ల చచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళింది. పిల్ల అవశేషాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్న బిడ్డను తలచుకుంటూ జింక జంట దుఃఖిస్తున్నది.
”అయ్యో బిడ్డా ఎంత పనైపాయె” అంది వేటకత్తె
”చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత” అన్నాడు వేటగాడు.
”ఈ మాత్రం దానికే ఎంత తతంగం. దేవునింట్ల మన్నువడ. చోద్యం చేస్తడు”
”జింకను పంపినోడే, పులిని పంపిండు”
”అంటే!! నీ ఉద్దేశం ఏంది”
”పులికి ఆహారంగా జింకను పంపిండు”
”చంపి తినుడేనా పులి పని”
”పిల్లను చంపలేకపోతే, పులి పరువేం కావాలె”
”బలవంతుడు, బలహీనుణ్ణి చంపుడేనా! కనీస పాపభీతి ఉండక్కర్లేదా?”
”నా బంగారం కదూ! ఇంటికి పోదాం పదా”
”ఏమోనయ్యా! అంత ఎటమటం అనిపిస్తుంది”
”జింకపిల్ల, నువ్వు ఇద్దరూ అమాయక ప్రాణులే”
”మనం ఆకలికి ఓర్చుకోగలం. బిడ్డ ఆకలి తీర్చడం ఎలా?
”జింకను చంపుతానంటే అడ్డుపడ్డావు. ఆకలి తీరే మార్గం నీవే చెప్పాలి.”
”పులి చంపిన జింక పిల్లను తీసికెళ్దాం”
”సరే పదా!
* * *
నవీన్, కథ విన్నావు కదా వేటగత్తె మానవీయ ఆలోచనల వల్ల పెద్ద జింకలు బతికి బయట పడ్డాయి. వేటాడే మనస్తత్వంవల్ల పిల్ల జింక చచ్చిఊర్కొంది. వేటాడే మనస్తత్వం మనుషుల్లో పెరగడంవల్ల పిల్ల జింకల్లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా!
ఆడిటోరియంలో ‘‘కాలేజీ వార్షికోత్సవ సభ’’ దేదీప్య కళాకాంతులతో ప్రారంభం అయ్యింది. కాలేజీ సెక్రటరీ పోడియం మైక్లో ఒక్కొక్క విద్యార్థినీ పరిచయంచేసి, వారిని వేదికపైకి ఆహ్వానిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సెక్రటరీ పద్మావతి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఆమెకు ఆమే సాటి.
కవిత్వం, నాటకం, సంగీతం ఇంకా వివిధ రంగాల విద్యార్థులు వేదికపైకి వచ్చి ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ చేతుల మీదుగా తమ బహుమతులను జ్ఞాపికలతోపాటు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్రకళలో మన కాలేజీకి గర్వకారణమైన ఇంద్రవర్మను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం! విజయ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది.
కానీ ఇంద్రవర్మ మాత్రం ఎందుకో నిదానంగా వస్తున్నాడు. అతడు ప్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ తన చిత్రకళను ప్రోత్సహించింది. తను వేసిన ప్రతి చిత్రానికీ రంగులు, మెరుగులు దిద్దించిన తోటి సహ విద్యార్థిని ప్రియను కూడా వేదికపైకి పిలవమని సెక్రటరీకి చెప్పాడు.
కానీ ప్రియ రాకపోవటంతో, పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి, జ్ఞాపికనూ అందుకున్నాడు ఇంద్రవర్మ.
అదే సమయంలో ఇంద్రవర్మ స్నేహితులు అందంగా ప్యాక్చేసిన ఒక పెద్ద ఫోట్ పోట్రైట్ను వేదికపైకి తీసుకొచ్చారు. ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ సంయుక్తంగా ఆ పోట్రైట్ను ఆవిష్కరించారు.
అది ఒక స్త్రీ మూర్తి కళాఖండం. ఆమెలో ఒక అమ్మ ఉంది. ఆ చిత్రంలో ఓ చిన్నారి, అక్క, చెల్లెలు, వదిన, భార్య అందరూ కన్పిస్తున్నారు. ఆమెలో ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సృష్టి అంతా స్త్రీ మూర్తిలోనే అంతర్లీనంగా ఉందన్న ఇంద్రవర్మ నిర్వచనం రసజ్ఞులను ఆకట్టుకొంది.
ఈ పెయింటింగు నేను నా తోటి విద్యార్థిని ప్రియతో కలసి చిత్రించాను. అందుకే ఈ బహుమతి మా ఇద్దరికీ చెందుతుందని ప్రియను కూడా వేదికపైకి ఆహ్వానించాను. నాకు రంగులు వేయటం నేర్పిన మన కళాశాలకి గుర్తుగా, దీనిని ‘‘ప్రియజ్ఞాపిక’’గా సమర్పిస్తున్నాను అని ఇంద్రవర్మ ఆనంద భాష్పాలతో కూడిన ఉద్వేగ చిరుప్రసంగంతో మళ్ళీ ఆహుతులంతా కరతాళ ధ్వనులతో, స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు.
చూస్తూ చూస్తూండగానే కాలేజీ జీవితం తెలియకుండా హాయిగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, చదువుల తల్లి దేవాలయ ప్రాంగణంలో నేర్పుతుంది.
మీరు కూడా స్వయంగా పెన్సిల్ గీతలతో బొమ్మలు వేయాలి. బాపుని గుర్తు చేసుకోండి. బొమ్మలు వేయగలరు. వేసిన బొమ్మలకు వాటర్ కలర్స్ వేయండి. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వేసిన చిత్రాలు మీకు నచ్చాయి అంటే మీరు కళాకారులే! వాటిని చూచిన స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు ఇచ్చే కాంప్లిమెంట్లు ఎన్నో ఉంటాయి సుమా! అవి ఆనాడు పాఠాలు చెప్పిన గురువుగారి మాటలు, ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి ఇంద్రవర్మకు.
కాలేజీలో విద్యార్థులందరూ…. నువు ఇంద్రవర్మవు కావు ` రవివర్మవే అనే వాళ్ళు. ‘‘ఏనాటికైనా మన ఇంద్రవర్మ ప్రపంచ ప్రఖ్యాత పికాసో వంటి గొప్ప చిత్రకారుడు అవుతాడని’’ ప్రసంసించాడు ప్రిన్సిపల్.
అసలు ఈ అభినందల, ప్రసంశల వెల్లువకు సూత్రధారి ప్రియ. ఇవన్నీ అందుకోవటానికి ఆమెకే అర్హత ఉందని ఆవేదన చెందాడు. ప్రియను చూడటానికి అతని హృదయం పరితపిస్తోంది. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలని తనకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియ.
ప్రియ స్ఫూర్తితోనే డిగ్రీలో ర్యాంకు సాధించాడు. ఆమె చెప్పకపోతే నిజంగానే తన చదువు అటకెక్కి కూర్చునేది అని తెలుసుకున్నాడు.
డిగ్రీ రెండో సంవత్సరంలో కూడా ఇంద్రవర్మకు అత్తీసరు మార్కులే వచ్చాయి. దాన్ని అలుసుగా తీసుకొన్నాడు హరిప్రసాద్. ఇంద్రవర్మను అవమానించాడు. ఒరేయ్! నీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకు. హాయిగా రోడ్డు పక్కన దేవుడు బొమ్మలు గీసుకున్నావనకో! ఏకంగా కాసుల వర్షమే కురుస్తుందన్నాడు. బాబు రవివర్మ! నీకు చదువెందుకు? మాకు లాగా మార్కులతో పనేంటి? అసలు రంగులు లేకపోయినా, బొగ్గులతో కూడా బొమ్మలేసి డబ్బు సంపాదిస్తావ్! అని కించపర్చాడు ఉదయ్కుమార్. వీరిద్దరికీ ప్రవీణ్, శేఖర్లు తోడై అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. వాళ్ళు మారరు! ర్యాగింగ్ చేసి చేసి నెగిటీవ్గా తయారైపోయారు.
ఇంద్రవర్మకు ఉద్యోగం వచ్చింది. అయినా అంత సంతోషంగా లేదు. ప్రతీ క్షణం ప్రియా ఆలోచనలే. అసలు ప్రియ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మనసు బాగోపోయినా, మనశ్శాంతి కోసం పెయింటింగ్ వేస్తున్నాడు. అది గ్రహించిన కంపెనీలోని సహ ఉద్యోగులు ‘‘ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ’’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఇంద్రవర్మ వేసిన పోట్రైట్లకు ఇతర దేశాలలో గిరాకీ పెరిగింది. ఇంద్రవర్మ భారతదేశంలో ప్రముఖ చిత్రకారునిగా అవార్డును అందుకున్నాడు. గౌతమబుద్ధుడు చెప్పినట్లు ‘‘నీవు ఏది ఆలోచిస్తే, అదే అవుతావు’’ ఔను! నేను ఇప్పుడు గొప్ప కళాకారుణ్ణి అయ్యాను అని గౌతమబుద్ధుని బొమ్మకు నమస్కరించాడు.
కానీ ఇంద్రవర్మ మనసులో మాత్రం ఏదో వెలితి, అశాంతి గూడుకట్టుకున్నాయి. హాలులో కూర్చుని టి.వి. చూస్తుండగా కొరియర్ వచ్చింది. ఆతృతతో కవర్ తెరిచాడు. అందులో ప్రియ వ్రాసిన ఉత్తరం, అంతే! వెంటనే ఒక్కసారిగా ఎగిరి గంతేసి…. యా! హూ… అంటూ గట్టిగా కేకవేశాడు.
కొడుకు వేసిన కేకకి వంటింట్లోంచి వచ్చిన తల్లి ‘‘అదేమిటిరా అంత గట్టిగా అరిచావ్! అని అడిగింది. అసలు తల్లిని పట్టించుకుంటేగా!
హలో ఇంద్రవర్మ! నేను అమెరికాలో నువ్వు వేసిన అపూర్వ కళాఖండాలు చూసి ఎంతో ఆనందించాను. నా సంతోషాన్ని వెంటనే ఫోన్ చేసి నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ‘‘నేను ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను. నా స్నేహితులకూ, బంధువులకూ ఉత్తరాలే వ్రాస్తుంటాను.’’ ` కరీనాకపూర్.
మనకున్న ప్రేమ, బాధ, ఆనందాలను ఉత్తరాల ద్వారా అయితే బాగా వివరంగా తెలియజేస్తాం. అలాంటి అమూల్యమైన ఉత్తరాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడూ చదువుకుంటాం కూడా. అందుకే నేను స్వీటు తిన్న తరువాత హాట్ తినను. ఎందుకంటే మనసారా మాధుర్యాన్ని ఆస్వాదించాలి కాబట్టి.
ఇంద్రవర్మ! నువ్వు నేను కలలు కన్నట్టు గొప్ప పెయింటర్ అయినందుకు నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్ ఇంద్రా.
‘‘ఇంద్రవర్మ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.’’ మన ప్రేమను జీవితాంతం అనుభవించాలంటే మనం పెళ్ళి చేసుకోకూడదు. ఈ విషయంలో నన్ను క్షమించు. శ్రీ కృష్ణుడు ఆరువేల భామలకు మధుర ప్రేమికుడు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మన ప్రేమ కూడా జీవితాంతం మధురతరంగిణిలా ప్రవహించాలి. రెండు రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. మిగిలిన అన్ని విషయాలు అక్కడ నెమరేసుకుందాం!
` నీ ప్రియ స్నేహితురాలు
ఉత్తరం చదివిన ఇంద్రవర్మ దృష్టి టి.వి. చానల్లో కన్పిస్తున్న బ్రేకింగ్ న్యూస్పై పడిరది, ‘‘బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోయింది” చూపిస్తున్న ఫోటోలలో ప్రియ ఫోటో, పేరునూ స్పష్టంగా చదివి సోఫాలో కూలబడిపోయాడు ఇంద్రవర్మ.
అలారం మోగింది . నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది . మొహం మీద నీళ్ళు జల్లుకొని పుస్తకం తెరవబోతుంటే పావని వచ్చింది. గుడ్ లేచావా! ఓ గంట సేపు చదువుకో. ఆరుగంటల కల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. . కిందకెళ్ళు , అటు తరువాత ..అని పావని ఇంకా ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి …అంతేగా! అమ్మా! విసుగ్గా అంది.
కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు .అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి . నేనొచ్చి తీసుకొస్తాను తరువాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని చదువు కుందువుగాని అంటూ, ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది పావని
నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో,
అమ్మా!…
ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి. పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితు లందరూ తరగతి లో మంచి పర్సెంటేజ్ రావాలని కొచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. .అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే
అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము . అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారుకదా ! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ క్లాసులకు వెళ్ళే టైములో ఏ యోగా క్లాస్ కో వెళ్ళావనుకో , ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది పావని.
చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక . లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రై వింగ్ నేర్చుకోడా నికి వెళ్తున్నావా? కొచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో , నీకేం , తెలివైన దానివి.. .వాళ్ళు అలా అంటుండ గానే
లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్లో ఉండే స్త్రీలు కొంతమంది కూచుని మాట్లాడుతూ ఉన్నారు . వాళ్ళు నేత్రికను చూడగానే, పావని తో
మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు.
తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ. మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ, మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు,అంటుంటే, . మీరు నేర్పించిన తెలుగు “అచార్” ను మాఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్.
అది సరేకాని రేపు హోళీ పండుగ కదా! మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేసాంకదా! ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం! సాయంత్రం అందరం కలసి కమ్యునిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది, అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలగూ సెలవేకదా,! వాళ్ళ తో కలసి రోజంతా హాయిగా గడుపుదాం అంది పావని.
హోలీ గురించిన కథలను పిల్లలకు నేను చెప్తాను అంది, పురాణ కథలను చదివిన కస్తూరి.
అదే ప్రహ్లాదుడు ఆతని సోదరి హోలిక, శివుని తపో భంగాని కొచ్చిన కాముని దహనం ..ఈకథలేనా? మంచిది …..సంక్షిప్తంగా చెప్పు అంది పావని.
హోలీ పున్నమ స్వచ్ఛతను ప్రసరించే పండుగ. ఈ పండుగ రోజున, వెన్నెల వెలుగు లోని వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణం లో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని పొందుతుంది. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ వ్యాధులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధాలుగా పనిచేస్తాయి. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు,బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్య విధానం లో, తయారు చేస్తారు.
తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పాలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగు లోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. కొన్నిసార్లు బట్టి పట్టి ముఖ్యమైన పానీయాన్ని తండై లేదా భంగు ను తయారుచేస్తారు …తనకు తెలిసిన విషయాలను చెప్పింది జ్ఞాన ప్రభ.
నొ ,నొ, పిల్లలను సమయం వేస్ట్ చేయ నీయరు. మాఅయన ఒప్పుకోరు. పరీక్షల రోజులు కదా! చదువుకోవాలంటారు… అంది కనక మహాలక్ష్మి
ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, అందరితో కలిసిమె లిసి ఉండటం అలవాటు చెయ్యాలి….అంది పావని.
అందరూ రేపటి సన్నా హా లను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.
రాత్రి 11 పదకొండు గం టలయింది నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో .మళ్ళీ రేపు చదువు కోవాలంటూ పొద్దున్నే లేస్తావు, అంటూ గదిలో కొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయ టికెళ్తూ . …
పావని భర్త ఈశ్వర్ “పావని ధోరణి తనకలవాటే కనుక “ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకొమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు ,”అన్నాడు అర్థం కానట్టు.
అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందే మీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే . చదువు జీవితానికి వెలుగు ,కాని ఆవెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆరంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి .ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, రక రకాల రంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి . అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ కదా!
ఆమనీ సుమడోలగా, రాసలీలగా, వసంతోత్సవ హేలగా, అలలారే ‘హోలీ’ మానవాళిలో సమైక్యతనీ, సంఘటిత శక్తినీ, సమాజ చైతన్య స్పృహనీ కలిగిస్తుంది. అందరిలో కొత్త ఉత్సాహం నింపడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా విశ్వకవి రవీంధ్రనాధ్ టాగూర్కి వసంతాగమన సమయానికి సుస్వాగతం పలికే హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం.శాంతి నికేతన్ లో చదువు కున్నారు. “ఒరె భాయి ఫగూన్ లగచె బొనె బోనె …దాలె దాలె ఫులె ఫులె, పతే, పతే రె,
ఆరలె ఆరలె కొనె కొనె” అని పాడే వారు కదా… రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.
అప్పటివరకు కుమ్ముల బెట్టినట్టున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. నీలాకాశం అంతా నల్లమబ్బులను కమ్ముకున్నది. హఠాత్తుగా చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. పశువుల కొట్టంలో గుంజకు కట్టేసిన ఆవు ఆందోళనగా ‘అంబా’ అని అరిచి తన లేగదూడ తలను నాలుకతో ప్రేమగా తడిమింది.
హాల్లో టీవి చూస్తున్న రామచంద్ర గబుక్కున లేచి కొట్టంవైపు నడిచాడు. అక్కడే గోలెం దగ్గర కుడిది కలుపుతున్న పాలేరు వెంకన్నతో “వెంకన్నా… వర్షం ఎక్కువయ్యేట్టుంది. ఈ లేగదూడను, ఆవును లోపల సాయబానుల గుంజకు కట్టేసి వెళ్ళు…” వెంకన్నను పురమాయించాడు. ” ఆ.. అట్లనే బాబు… అమ్మ సర్వపిండి చేస్తాన్నరు. పోయిల కట్టెలు గావాల్నాట. అమ్మ కిచ్చొచ్చి ఆవును గట్టేస్త బాబు..” అని అన్నాడు వెంకన్న.
“ఓ.. తప్యాల చెక్క చేస్తున్నదా అమ్మ” చిత్రంగా కళ్ళు ఎగరేస్తూ వంటింట్లోకి తొంగి చూసాడు రామచంద్ర. తల్లి కట్టెల పొయ్యి ముందాు కూర్చుని తప్యాల చెక్క చేస్తొంది. కమ్మటి నువ్వులతో కూడిన తప్యాల చెక్క వాసన ఆ వాతావరణంలో ఒక్కసారిగా గుప్పుమంటూ కమ్ముకొని నోరూరించింది. “అమ్మా… చాతగాక ఇప్పుడెందుకు ఈ పని పెట్టుకున్నట్టు? పైగా ఆ కట్టెల పొయ్యి పొగతో సతమతమవుతూ…! గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు కదా “వాతావరణం ఇట్లుంటే నీకు తప్యాల చెక్క ఇష్టం కదా చంద్రా…. ఇవ్వాళా అక్కకు నాకు గూడా ఉపవాసం. అందరికీ పనికొస్తుంది గదా అని చేస్తున్నా…. అయినా ఈ తప్యాల చెక్క కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద చేస్తేనే రుచిరా నాన్నా…” కొడుకు మాటలకు సమాధానమిస్తూ, మళ్ళీ “ఇదిగో… ఇది తీసుకో…” ఓ పళ్లెంలో వేడి వేడి తప్యాల చెక్కను బెట్టి కొడుకు చేతికిచ్చింది అనసూయమ్మ.
పళ్లెం అందుకొని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్న రామచంద్ర ‘అబ్బా… అమృతమమ్మా… నీ చేతి తప్యాల చెక్క, ‘కళ్ళెగరేస్తూ ప్రశంసాపూర్వకంగా తల్లివైపు చూశాడు రామచంద్ర. “ఊ. చాల్లే పొగడ్తలు, మురిపెంగా నవ్వుకూ అంటున్నా అనసూయమ్మ మొహంలో కించిత్ గర్వం తొణికిసలాడింది. “అందుకే అమ్మా నువ్వు చేసే ఈ తప్యాల చెక్కంటే మీనాకు ప్రాణం అనుకో….. తనెఁత బాగా చేసినా ఈ రుచి రాదు అంటుంది. పైగా అత్తయ్య చేతిలో ఏదో మంత్రదండముందండీ అంటుంది” తనను పొగడుతూనే భార్య గూర్చి మురిపెంగా చెబుతున్న కొడుకు మాటలు రుచించలేదు అనసూయమ్మకు. అప్పటివరకూ గల గలా మాట్లాడిన తల్లి మీనా ప్రస్తావన రాగానే ముభావంగా మారటం రామచంద్రను బాధించింది. “మామయ్య అత్త పిలుస్తోంది నిన్ను” అక్క కొడుకు పదేళ్ళ టీంకూ వచ్చి చెప్పగానే సగం తిన్న పళ్ళెం అక్కడే వదిలేసి వెళ్తున్న కొడుకుతో ‘అదేంటి చంద్రా… పూర్తిగా తిని వెళ్ళు” అంటున్న తల్లితో ‘చాలమ్మా’ అంటూ ముస్తసరిగా సమాధానమిచ్చి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు రామచంద్ర.
* * *
మీనా పట్ల అమ్మ కోపానికి కారణం వుంది. కట్న కానుకలేమీ ఇవ్వలేని దూరపు బంధువు రాజు మామయ్య కూతురుపై తను మనసు పారేసుకోవటం, ఆ అమ్మయానే పెళ్ళి చేసుకుంటాననటం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు. చివరకు, తను మీనానే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టడంతో, అన్నయ్యల బలవంతం కూడా తోడై తప్పనిసరై ఒప్పుకుంది అమ్మ పెళ్ళికి. అయితే, మీనాను మాత్రం మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించలేకపోతుంది ఇప్పటికీ. అమ్మ కోపం, అయిష్టం తాత్కాలికమేనని తరువాత పరిస్థితులు వాటంతటవే చక్కబడతాయని ఆశించాడు తను. అట్లని అమ్మ పట్టుదల తనకు తెలియంది కాదు. అమ్మ పట్టుదల ముందు నాన్నగారే తలవంచేవారు. అయితే, ఆయనకు అమ్మమీద వున్న ప్రేమ, అనురాగం కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. నాన్నగారు అమ్మను ఎత్తెత్తు మాణిక్యంలా చూసుకునేవారు. ఆయన సాహచర్యంలో హాయిగా సాగిపోతున్న అమ్మ జీవితం నాన్నగారి హఠాతం మరణంతో నడిసంద్రంలో నావలా అయింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామలుచ ేసిన పెళ్ళితో పన్నెండేళ్ళకే నాన్న చెయ్యి పట్టుకుని వచ్చిన అమ్మ, ఆయనే తన సర్వస్వంగా పిల్లలే తన లోకంగా మలుచుకుంది జీవితాన్ని. ఇదిలా వుంటే “ఉరువు ఉరిమి మంగళం మీద పడ్డట్టు” నాన్నగారు పోయిన సంవత్సరానికే అక్క పంకజం భర్తను పోగొట్టుకొని పిల్లాడితో పుట్టిల్లు చేరడం అమ్మను మానసికంగా కృంగదీసింది. నాన్నగారున్నప్పుడే తెల్సిన సంబంధం అంటూ హడావిడిగా పెళ్ళి చేసిన చెల్లెలు మంజు అత్తింటి వారితో సరిపడక మాట మాటికి అలిగి పుట్టింటికి రావడం, వచ్చినప్పుడల్లా నెలలకొద్ది ఇక్కడే వుండిపోవడం కూడా అమ్మ అశాంతికి మరో కారణం. కొడుకులు చదువుల పేరిట దూరంగా వుండడం వల్లనేమో, పెద్దగా చదువులబ్బని కూతుళ్ళు ఇంటి పట్టునే వుండడంవల్ల వాళ్లను కంటికి రెప్పలా గారాబంగా సాదుకుంది అమ్మ. కానీ ఇద్దరి కూతుళ్ళ జీవితాలు ఇలా సవ్యంగా లేకపోవడంతో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది అమ్మ జీవితం. అట్లని వాళ్ళను తను ఏమీ అనలేని స్థితి. తానే తన రెక్కల కింద వాళ్ళని సురక్షితంగా పొదుపు కోవలసిన పరిస్థితి రా చంద్రా అంటుంది కన్నీళ్ళతో అమ్మ. సమస్యంతా ఇక్కడే మొదలైంది. వీళ్ళిద్దరి ఆడపిల్లల రాకతో ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మునుపటి ప్రశాంత వాతావరణం మచ్చుకైనా లేదు. ఇంట్లో అన్ని విషయాల్లో పంకజం అక్క, మంజుల పెత్తనం వదినెలకు వాళ్ళకు మధ్య మనస్పర్థలకు, గొడవలకు దారితీసిఁది. తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ మంచి చెప్పాల్సిన ఇంట్లో పెద్ద దిక్కు కూతుళ్ళను గుడ్డిగా వెనకేసుకురావడం వదినెలనే కాదు అన్నయ్యలనూ బాధించింది. అట్లని అన్నయ్య అమ్మను గట్టిగా ఏమీ అనలేని అసహాయత, అశక్తత, అనునిత్యం ఇట్లాంటి యుద్ధపూరిత వాతావరణంలో ఇమడలేక వదినెలను, పిల్లల్ని తీసుకుని బదిలీ పేరుతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు, ఇద్దరన్నయ్యలూ, పీజి చదివి అప్పటికింకా పెళ్ళికాని తను కూడా ఏ ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుని వెళ్ళిపోయే అవకాశమున్నప్పటికీ అమ్మను, కుటుంబాన్ని వీధిన పడవేయలేని సంస్కారం కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని ఉన్న ఊళ్ళోనే వ్యవసాయం చెయ్యడానికి పురికొల్పింది. సహజంగానే ఇంట్లో చిన్నకొడుకుగా అమ్మ ఆప్యాయత, ప్రేమ కుటుంబ సభ్యులందరి గారాబంతో పెరిగాడు తను. అమ్మ, తోబుట్టువుల బాధ్యత చేపట్టి కుటుంబాన్ని నిలబెట్టి బంధువుల్లో తలెత్తుకునేలా చేసిన తనంటే అమ్మకు, అక్క, చెల్లెలికి ఎంతో ప్రేమ. అయితే, తన పట్ల వాళ్ళు కన్పరచే ఈ ప్రేమ తన భార్య పట్ల కూడా చూపుతారని ఆశించాడు తను. కానీ మీనా వీళ్ళ ప్రేమరాహిత్యానికి, అకారణ ద్వేషానికి అడుగడుగునా బాధపడ్తూనే వుంది అనే విషయం తెలిసినప్పుడు హతాశుడయ్యాడు. ముఖ్యంగా అక్క పంకజం, చెల్లెలు మంజు అహర్నిశలూ చిన్న చిన్న విషయాలను కూడా సూటీపోటీ మాటలతో అమ్మను కూడా మాటలనేట్టు రెచ్చగొడ్తూ మీనాను ఏడిపిస్తున్నారని టింకూ ద్వారా తెల్సినప్పుడు మనసు బాధతో పిండేసినట్టయింది. ఎవరి కోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టాడో వారే తన బాగోగుల గూర్చి ఆలోచించక, తన ఆనందాన్ని హరించాలని చూడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆలోచిస్తున్న రామచంద్ర మనసు మనసులో లేదు.
* * *
ఒక్క ఉదుటున గదిలో కొచ్చి దబాల్న తలుపేసుకుని విసురుగా మంచం మీద వాలిపోయింది మీనా. బలవంతంగా కన్నీళ్ళు ఆపుకోవడం వల్లనేమో ఆమె కళ్ళు ఎర్రటి జీరలు పులుముకున్నాయి. ఇంక ఆమెవల్ల కాలేదు. దిండులో తలదాచుకొని బావురుమన్నది ఒక్కసారిగా! ఆమె కళ్ళు ఉధృతంగా ఎగిసిపడ్తున్న జలపాతాలయ్యాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. కాస్సేపటికి లేచి మొహం కడుక్కుని వచ్చింది. ఏంటీ మనుషులు? ఎందుకు తనని ఏదో ఒక వంకతో అనరాని మాటలతో చిత్రవధ చేస్తారు? అసలిప్పుడు తను చేసిందాంట్లో తప్పేముంది? ఇంటెనక సాయబాను దగ్గర గచ్చు అంతా ఊడ్చి తను శుభ్రం చెయ్యాలనుకోవడమే నేరమా? తను చీపురు పట్టుకుని ఊడుస్తుంటనే పంకజం వదిన ‘అమ్మా….ఈ మహాతల్లి నీ మడిచీర అంట్లుచేసిందే’ అంటూ అరిచింది. తనకేం అర్థం కాలేదు. తనెక్కడో ఊడుస్తోంది. అత్తయ్య మడిచీర అల్లంత దూరాన గుమ్ములర్రకు వేళ్ళాడుతూ వుంది. తను దాన్ని తాకే అవకాశమే లేదు. ఇంతలో అత్తయ్య రానే వచ్చింది ఆదరాబాదరగా. తనవైపు ఈసడింపుగా చూస్తూ నీ శుభ్రం తగలేసినట్టే వుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఇటువైపు రావద్దని. నీకిక్కడేం పని…. వద్దని చెప్పినా పదే పదే మొండిగా ప్రవర్తిస్తావెందుకు. “మనిషికో మాట గొడ్డుకోదెబ్బ” అని వూరికే అనలేదు పెద్దలు. ఇంతలో అక్కడికొచ్చన మంజు అందుకుంది. “అసలావిడ గారికి ఈ పెత్తనాలెందుకు? తన గదిలో తను పడుండి వేళకి నువ్వింత పెడితే తిని వుండలేక….” తను మంజు మాటల్ని పట్టించుకోదల్చుకోలేదు. “ఇప్పుడు నేనేం చెయ్యకూడని పనిచేశానత్తయ్యా. మీ మడిచీర నేను తగలనే లేదు. నేనక్కడికి రాను కూడా లేదు… “తను సంజాయిషీ ఇచ్చుకోబోయింది.” అంటే నువ్వు తగలందే నా కూతురు అబద్ధం చెప్పిందంటావా? అబద్ధాలాడటం మీ ఇంటా వంటా వున్నాయేమో… నా పిల్లలకయితే లేవు. అయినా మీ తల్లిగారింట్లో మీకు మడి, దడి, ఆచారం పద్ధతులు తెల్సి ఏడిస్తే గద… అయినా నా బంగారం మంచిది గాక అవుసలిని అనడం దేనికిలే… నా కొడుకుకు చిలకకు చెప్పినట్లు చెప్పి… ఓ ఆచారం వ్యవహారంలేని కుటుంబంలా వుంది… వద్దురా… అని… వాడు వింటే గదా… నువ్వేమో చిన్న నా పొట్టకు శ్రీ రామరక్ష అని చాటుకు మాటుకు ఏ చిరుతుండో తింటావు పొద్దున్నే. నేను మళ్ళీ మడిబట్ట పిండుకునేదెప్పుడు… అందరికీ వండి నేను తినేదెప్పుడు… ఛీ…. ఛీ… ఇదంతా నా ఖర్మ….” గుమ్ములర్రకు వేలాడుతున్న చీరను లాగి విసురుగా నల్లాకింద పడేస్తూ అంటున్న అత్తయ్య మాటలకు ఏడుపొస్తున్నా బలవంతంగా ఆపుకుంది మీనా. ఇంక అక్కడ వుండలేక తన గదిలోకి పరిగెత్తుకొచ్చింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి? ఆలోచిస్తే ఎంతకూ అంతుపట్టదు తనకు. అత్తయ్యకు కూతుళ్ళంటే ఆరోప్రాణం. వాళ్ళెన్ని తప్పులు చేసినా సరే వాళ్ళమీద ఈగ కూడా వాలనివ్వదు. కానీ నిస్వార్థంగా తన సుఖం చూసుకోకుండా వీళ్ళ బాగోగులు పట్టించుకుంటున్న బావ పట్ల, బావ ఇల్లాలి పట్ల వీళ్లు ప్రవర్తించాల్సిన తీరేనా ఇది? తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఇంత విద్వేషం విరజిమ్ముతారా ఎవరైనా? అసలేంటి వీళ్ళ స్వభావం? వీళ్ళ స్వేచ్ఛకూ, సామ్రాజ్యానికి తనను ఓ అడ్డంకిగా భావించడమే తన పట్ల వీళ్ళకున్న కోపానికి, విద్వేషానికి కారణమా?
పెళ్ళయిన మొదటిరోజు నుండి తను అత్తయ్య మనసు గెల్చుకోవడాన్కి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆమె చూపులతోనే అల్లంత దూరాన నిలువరిస్తుంది తనను. దానికి తోడు తనకు అత్తయ్యకు మధ్య పంకజం వదిన, మంజుల ప్రమేయం కొరకరాని కొయ్యలా మారింది. తన పట్ల ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూ అత్తయ్యను ప్రభావితం చేస్తున్నారిద్దరూ. అత్తయ్యకు కూతుళ్ళ మాట వేదవాక్కు కావటం, పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతుండడం మీనాను కలవరపరుస్తున్న అంశం. చరిత్ర చెప్పినట్లుగా ధర్మరాజు జూద వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ర్టుడి మితిమీరిన పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి వల్లమాలిన మమకారం… ఇలా మనిషిలోని ఎన్నో స్వభావాలు మానవత్వ పతనానికి కారణమవుతున్నాయి. మానవ జీవన ఔన్నత్యాన్ని చివరికి మానవ మనుగడనే ప్రశ్నించే స్థితికి తీసుకెళ్ళాయి. ఈ స్వభావాల్లో ఏది మితిమీరినా అది మానవ సంబంధాలను, బాంధవ్యాలనూ విధ్వంసం చేస్తుంది. అత్తయ్యకు కూతుళ్లపట్ల వున్న అలవికాని ప్రేమ కూడా అట్లాంటిదేనా? ఆలోచిస్తున్న మీనా ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే వుంది. పెళ్ళికి ముందు ఎంతో చలాకీగా, ఉత్సాహంగా, ఉరుకుల పరుగుల నదిలా వున్న తను పెళ్లితో ఓ కల్లోల సముద్రంలా మారిపోయింది. మనిషిలోని ఇదివరకటి కళ లేదు. కళ్ల క్రింద నల్లని చారలు వయసును అమాంతం ఓ పదేళ్ళు పెంచేసాయి. పెళ్ళికి ముందు పాలరాతి బొమ్మలా వున్న తను ఇప్పుడు జీవనం కోల్పోయిన నల్లరాతి బొమ్మలా మారింది. రోజు రోజుకు ఏ పరిస్థితులలో మార్పు లేకపోగా, మానసికంగా తను చాలా చిత్రవధ ననుభవిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తను నిరాశావాదంలో కూరుకుపోయి బ్రతుకుమీదే విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు… లేదు… లేదు… అలా జరగడాన్కి వీల్లేదు. ఇంటి పరిస్థితులను తను చక్కదిద్దలేకపోతే, పరిస్థితుల నుండి తప్పుకొని అయినా తనను తాను కాపాడుకోవాలి. ఇప్పుడు తన ముందున్న సవాల్ అదే! ఇక లాభం లేదు పరిస్థితి బావకు చెప్పాలి. ఇంతకాలం చెప్పకపోవడమూ తాను చేసిన తప్పేనేమో… వీళ్ళ మీద పితూరీలు చెప్పినట్టవుతుందేమో అని, బావ మనసు విరుగుతుందో ఏమో అన్న సందిగ్ధంతో తనలో తనే మధనపడుతూ ఇంత కాలం నటించింది. చాలు… ఇక చాలు… ఈ రోజు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆలోచిస్తూ పడుకున్న మీనాకు కడుపులో వికారంగా అన్పించింది. నీరసంగా కూడ అన్పించింది. నాల్రోజులుగా ఎందుకో నలతగా ఉంటోంది ఒంట్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూనే అలాగే నిద్రలోకి జారుకుంది మీనా.
* * *
రాజ్యం పిన్నిని తీసుకుని ఊళ్ళో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేసి ‘మీరు తల్లికాబోతున్నారు’ డాక్టర్ చెప్పిన విషయం. ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత మధురమైన, ముఖ్యమైన ఈ విషయం తనకెందుకో సంతోషాన్ని పంచలేదు సరికదా మరింత ఆందోళనకు గురిచేసింది. నిన్నటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది.
అత్తయ్య ధిక్కార స్వరం, ఈసడింపు చూపు, కూతుళ్లతో కలిసి ఆమె సూటీ పోటీ మాటలు… మనసును మెలిపెడ్తున్నాయి. మనుషుల్లో ఈర్ష్యాసుయాలు, క్రోధ విద్వేషాలు సహజాతాలు అని తెలుసు. కానీ, అవసరానుగతంగా ఏర్పరచుకున్న ప్రవర్తనారీతులు మనిషి స్వార్థపరత్వాన్నీ, ప్రేమరాహిత్యాన్ని ప్రతిబింబిస్తూ మనిషి అసలు నైజాన్ని బట్టబయలు చేస్తున్నాయా? ముఖ్యంగా సాంకేతికత, యాంత్రికతతో నిండిపోయిన ఆధునిక జీవన విధానం సాక్షిగా మానవ సహజ లక్షణాలయిన ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, స్నేహం లాంటి మధురిమలను సమాధి చేస్తూ కుటుంబ బంధాలు కూడా ఈ ‘ప్రేమ రాహిత్య మనే వరదలో కొట్టుకు పోతున్నాయా? తన కల్లోల హృదయ స్పందనలు తెలియని రాజ్యం పిన్ని ప్రేమగా హత్తుకుని అభినందించి, ఇప్పటి నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ గల గల మాట్లాడుతూనే వుంది ఇల్లొచ్చేదాకా.
* * *
తను తండ్రి కాబోతున్నానన్న శుభవార్త విని సంతోషంతో తబ్బిబ్బయాడు రామచంద్ర. ”ఈ దెబ్బతో అమ్మ నిన్ను నెత్తిలో పెట్టుకుంటుంది మీనా” అంటూ మీనాను ప్రేమలో ముంచెత్తాడు. కానీ, అతని మాటలు నమ్మాలన్పించలేదు మీనాకు. ఇంట్లో జరిగే విషయాల తీవ్రత అతనికి తెలియదు. తను నిన్న చెప్పాలనుకుంది కానీ ఇంతలో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మూలాన కుదర్లేదు. ”మీనా ఈ సమయంలో ఏవేవో తినాలని కోరికలుంటాయట గదా…. నీకేదైనా తినాలన్పిస్తే నాకు చెప్పు” భర్త మాటలకు నవ్వింది మీనా. మీనా మొహంలో ఆనందం లేకపోవడం రామచంద్ర దృష్టిని దాటి పోలేదు. అయితే అది నీరసం వల్లేమో అనుకున్నాడు.
* * *
స్వాతి మెటర్నిటీ హాస్పిటల్ వెయింటింగ్ హాల్లో అసహనంగా కూర్చున్న రామచంద్ర ఆపాదమస్తకం కంపిస్తోంది. లోపలకు తీసికెళ్ళిన మీనాకు ఎలా వుందో? ఆలోచనలతో నరాలు తెగిపడ్తాయన్న టెన్షన్కు గురవుతున్నాడు. అసలు తప్పంతా తనదే! మీనాకు అమ్మ చేతి తప్యాల చెక్క ఇష్టం కదా అని మీనాకు తెలియకుండా అమ్మతో చేయించాలనుకున్నాడు. పాపం అమ్మ కూడా చాత గాకున్నా, మీనా కోసం రెండు మూకుళ్ళు పెట్టి బాక్స్లో పెట్టి ఇచ్చింది. మీనాకు ఎప్పుడు తినాలన్పిస్తే అప్పుడు తినొచ్చని. ఏమైందో ఏమో తెలియదు కానీ అది తినగానే మీనా అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో పరిస్థితి తీవ్రమై ఇదిలో ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సి వచ్చింది. ‘ఫుడ్పాయిజనింగ్’ అన్నారు డాక్టరు ఎందుకిలా జరిగిందో తనకంతు పట్టడం లేదు. ‘రామచంద్ర మీరేనా?’ అన్న మాటకు తలతిప్పి చూశాడు. నర్స్! తలుపాడు అవునన్నట్టు. ”పేషంట్కి ఈ బ్లడ్ గ్రూప్ రక్తం అర్జంటుగా అవసరం. హాస్పిటల్లో ఈ బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో లేదు” ఒక్కసారిగా ఆమె ఏం చెప్తుందో తనేం వింటున్నాడో అర్థం కాలేదతనికి. అదే అడిగాడు.
”అవును ఫుడ్ పాయిజనింగ్ వల్ల బ్లడ్ వామిటింగ్స్తో చాలా రక్తం పోయింది. పెషెంట్ అనిమిక్ అయింది.
వెంటనే బ్లడ్ ఎక్కించాలి” ఆ మాటలు వింటూనే స్థాణువుగా మారాడు ఒక్క క్షణం. కానీ వెంటనే తేరుకొని, బైక్ తీశాడు, ఫ్రెండ్స్ అందరినీ ఫోన్లో అలర్ట్ చేస్తూ విషయం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టమని చెప్పాడు రామచంద్ర.
‘బి’ నెగెటివ్ చాలా అరుదైన బ్లడ్ గ్రూప్! ఎంత ప్రయత్నించినా రామచంద్రకు ఈ గ్రూప్ బ్లడ్ కానీ, డోనర్స్ కానీ దొరకలేదు. ఊసూరుమంటూ హాస్పిటల్ చేరుకున్నాడు. ఎదురుగా వస్తున్న రాజ్యం పిన్నితో ‘పిన్నీ…’ బేలగా మారాడు రామచంద్ర. ”రక్తం ఎక్కించారు. కోలుకుంటోంది. ఇంకో గంట తర్వాత చూడొచ్చన్నారు రా చంద్రా… అంతా ఆ భగవంతుడి దయ… కాకపోతే అబార్షన్ అయిందట…. పెద్ద ప్రాణం బాగుంది చాలురా… అంటున్న రాజ్యం పిన్నితో ”ఎంత వెదకినా రక్తం దాతలుదొరకలేదు పిన్నీ… అయితే వీళ్ళే అరేంజ్ చేశారన్నమాట… నా మీనా బావుంటే చాలు పిన్నీ… మనసులోనే భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రామచంద్ర.
* * *
హాస్పిటల్ నుండి రామచంద్ర ఇంటికొచ్చే వరకు అనసూయమ్మ పెద్ద గొంతుతో ఆవేశంగా మాట్లాడడం విన్పించి ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. రాజ్యం పిన్నితో అంటోంది అమ్మ ”వాళ్ళింక ఈ ఇంట్లో ఒక్క క్షణం వుండటానికి వీల్లేదు రాజ్యం… నా మీదనే అనుమానపడ్డక ఇక ఈ ఇంట్లో నా కొడుకైనా సరే… వుండటానికి వీల్లేదు వెళ్ళిపొమ్మను. ఈ క్షణమే పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టుకొమ్మను. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళయినా ముట్టను ఆఁ…అంతే… ఈ అనసూయమ్మ మాటకు తిరుగులేదని చెప్పు…” రాజ్యం పిన్ని అమ్మను సముదాయిస్తోంది. ఊరుకో అక్కయ్య… సర్లే … బాధపడకు. అలాగే వెళ్తాడులే… వాడి ప్రాణాలన్నీ నీ మీదే. నిన్నొదిలి వెళ్లటం అంటే వాడెంత బాధపడ్తడో ఆలోచించు. బావగారు పోయినప్పటి నుండి నిన్నూ, కుటుంబాన్ని పట్టించుకుని మీరే లోకంగా బతుకుతున్నాడు… ఉన్న ఫళంగా వెళ్ళిపోమంటే…” ”అందుకే వెళ్ళి పోమంటున్నా.. మా బాగోగులు మేం చూసుకోగలం.. అయినా పట్నమెంత దూరమని. ఎప్పుడు రావాలన్పించినా వచ్చి పోవచ్చు. పొలం వ్యవహారాలు చూసుకోవచ్చు. కానీ ఈ ఇంట్లో వుండడనికి మాత్రం వీల్లేదు. అంతే….” తనకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది అమ్మ మాటలకు. తనకు… అమ్మ మీద అనుమానమా? ఛ… అమ్మ తనను అపార్థం చేసుకుంది. అమ్మను అనుమానిస్తే తనను తను అనుమానించుకున్నట్టే…! తను అమ్మతో మాట్లాడ్డనికన్నట్టు నాలుగడుగులేశాడో లేదో రాజ్యం పిన్ని వచ్చి తనను పక్కకు తీసుకెళ్ళింది. అమ్మ మనసేం బాగా లేదని, బాగా కోపంగా వుందని, కోపం చల్లారాక వచ్చి కలవచ్చనీ సర్ది చెప్పి పట్నంలో వాళ్ళ తమ్ముడి అపార్ట్మెంట్ ఖాళీగా వుందని అందులో వుండోచ్చాని చెప్పింది. అమ్మ మాటకు ఎదురుచెప్పకు అంది. ఇంకా ఏమోమో అంది పిన్ని. తన బుర్ర పనిచేయడం మానేసింది. ఏం జరుగుతుందో, ఎందుకో అనేది తెలియలేదు.
ట్రాలీ ఆటో రావడం, గ్యాస్ స్టవ్, బియ్యం, పప్పులు, సామాన్లన్నీ అందులో సర్దేయించటం, మరో ఆటోలో ఇల్లు సర్ది పెట్టి వస్తానంటూ రాజ్యం పిన్ని తనతో రావడం ఒక పీడకలలా చక-చకా జరిగిపోయాయి. అమ్మ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుందో ఎందుకంత నిషౖసరంగా మాట్లాడిందో ఎంత ఆలోచించినా రామచంద్రకర్థం కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను పంటి బిగువున ఆపడం సాధ్యం కాలేదతనికి. ఆటో కదుల్తుంటే, ఆశగా తల బయటపెట్టి తొంగి చూసిన తనకు కన్నీళ్ళ మసకలో పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలో నిలబడి చూస్తున్న అమ్మరూపం అస్పష్టంగా కన్పించింది.
* * *
అప్పుడే పదిహేను రోజులైంది.పట్నంలో మకాం పెట్టి. మీనా కోలుకుంటోంది నెమ్మదిగా. ఆ రోజు వచ్చి ఇల్లు సర్దిపోయిన రాజ్యం పిన్ని మీనాను చూసి పోదామని వచ్చింది మళ్ళీ. చదువు కోసం హాస్టల్లో వున్నప్పుడు తప్ప, పుట్టి బుద్దెరిగినప్పటి నుండు అమ్మను చూడక, మాట్లాడక పదిహేను రోజులుండటం తనకిదే మొదటిసారి. బాధగా అన్పించింది. అసలేం జరిగిందో తెలియక అయోమయానికి గురవుతుంది మీనా.
కానీ, ఈ రోజు రాజ్యం పిన్ని చెప్పిన విషయం విన్నప్పట్నించీ మనసు అమ్మ మీదికే వెళ్తోంది పదే…
పదే! అమ్మ ఇదంతా రాజ్యం పిన్నితో కల్సి తన సుఖం కోసమే తన సంతోషం కోసమే చేసిందని… ఇంట్లో వున్న అసహన పరిస్థితుల నుండి తాను, మీనా దూరంగా వెళ్ళి ఆనందంగా జీవించాలని తాపత్రయ పడిందనీ, ఊరికే తనను పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టమంటే తనొప్పుకోడనీ, ఆమె కోపంతో వెళ్ళిపొమ్మన్నట్లు నాటకమాడిందనీ తెలిసినప్పటి నుండు హృదయం బరువెక్కింది. తనకు తెలిసిన మరో కొత్త విషయం మీనాకు రక్తం అమ్మనే ఇచ్చిందని! ఈవిషయం ఎవరికీ తెలియనీయవద్దని డక్టర్లను కోరిందట.’అమ్మా…’ రామచంద్ర మనసు తల్లి పట్ల కృతజ్ఞతతో నిండిపోయి, మూగగా రోదించింది.
‘నేను మీనా సుఖంగా వుండటం కోసం ఇదంతా చేశావా అమ్మా…. నేను లేకుండ నువ్వెలా ఉండగలుగుతున్నావమ్మా… ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడ చెయ్యలేదు రామచంద్ర. చాలా సేపటికి తేరుకొని ‘మీనా లేచి తయారవు…అమ్మను చూసొద్దాం’ మీనాకు చెప్పి ఫోన్ తీశాడు క్యాబ్ బుక్ చేయ్యడానికి.
* * *
సాయబానులో పట్టెమంచంపై నీరసంగా పడుకొని వుంది అనసూయమ్మ. కళ్ళు మూసినా, తెరచినా కొడుకు చంద్ర బేల చూపులే కదలాడుతున్నాయి కళ్ళముందు. తాను తీసుకున్న ఈ అతి పెద్ద నిర్ణయం వెనక ఆమెకు, పంకజంకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటుంది. కోడలుకు తప్యాల చెక్క చెయ్యమని కొడుకు అడిగినప్పుడు తనకు చాత కాక, పంకజం సహాయం తీసుకున్న అనసూయమ్మ, పంకజం మీనా పట్ల కోపంతో, ద్వేషంతో లోగడ ఫలహారాలు చేసి వాడి పక్కకు పెట్టిన ముతక నూనెతో తప్యాల చెక్క చేసిచ్చిందని, దానివల్లే ఇంత ఉపద్రవం జరిగిందనీ తెలుసుకున్న అనసూయమ్మ హతాశురాలైంది. అయితే, తాను చేసిన పనివల్ల పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందని తాను అనుకోలేదని బావురమంది పంకజం తనను క్షమించమని తల్లిని వేడుకుంది. ధారాపాతంగా ప్రవహిస్తున్న పంకజం కన్నీళ్లలో మీనా పట్ల కోపం కొట్టుకుపోయింది. ఆమె కళ్లలో పశ్చాతాపం కనిపించింది. మీనా పట్ల కూతుళ్ళ అసహనం రోజు రోజుకూ హద్దులు దాటుతోందని గ్రహించిన అనసూయమ్మ బాధ్యతలు గుర్తెరిగిన బంగారు మనసున్న రామచంద్ర కాపురం సుఖంగా సంతోషంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంది. అంతులేని ఆవేదన ఆవహించినా, కొడుకును, కోడలును, ఆ పరిస్థితుల నుండి దూరంగా పంపడనికే నిశ్చయించుకుంది. తన నిర్ణయం వల్ల కొడుకు సంసారం సాఫీగా సాగుతుందని తలచి, వాళ్ళు ఆనందంగా పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుకుంది. తన మనసు ఇప్పుడు తృప్తిగా వుంది. మూసుకున్న ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జల జలా రాలాయి. ఇంతలో అమ్మా అంటూ పిలుపు! సందేహం లేదు… అది తన చంద్రదే…
గబుక్కున లేచి కూర్చుంది మంచంలో. అనసూయమ్మ మనసు ఆనందంతో పురివిప్పింది.
(సమాప్తం)
*” ఏమో ఏమో ఎంక ఎండుక పోతున్నావు
గాసం లేక నువ్వు గుంజుక పోతున్నావు
రోటిలో సజ్జా కంకి దంచితే మెదుగా దెందుకు..
తీటది తిర్లా గిరి
పడిదెల పసునురు
ఏతుల ఎంకటం పెటా
మాటల మల్లాపెల్లి …|| ఏమీరా.. || అంటూ తున్నగా రాగం తీసిండు
” దేహె వుకో తాతా నీ ఇనాం పెల్లి కి నా వారేదు ఊ అంటే సందులురు లో పడతావు ఎతుల బొచ్చు ఏడు గంపలు కింది బొచ్చు మూడు గంపలట గాని జరుపు పులిని జరుపు” పులి జూదం లో పులి కాయ వైపు చూస్తూ అన్నడు
” మనువడా నీ మేక సచ్చింది” అంటూ మేక కాయ రాయి చేత తీసుకుండు
” అబ్బా పులి జూదం ల నన్ను మెసుల నియ్యవే నీ ఎటూగాల”… అన్నడు విరేషా
” తాతా ఓ తాతగారు రాతిరి మా బావగారు కూతురు మీ అత్త గారు కూటికి పిలిచిందోయి అన్నదట ఎట్లనో చెప్పవైతివి మనువడ ” అన్నడు తాత
” ఓ తాత ఏం సాత్రం ఏస్తివే నీ దెబ్బ గాల ” నవ్వుతూ పక్కన నిలబడి పులి జూదం ఆట చూస్తున్న దమయంతి కొడుకు పరశురాముడు పక పక నవ్వసాగిండు
” రారా తమ్ముడ పెండ్లాం కొడకా సక్కగ రారా సన్నిస్తా అన్నదట యట్లనో చెప్పవైతివి ” మళ్ళీ నవ్వు పక పక నవ్వు నవ్వుతూ ” ఓ తాతా ఒక బీడీ ముక్క ఇయ్యవయితివి ” అనె వైరేశ
” దేష వూకోవు లజ్జ కాదోయ్ నన్ను అడుగ అడివిలో తిరిగే వానికి ఆకు కరువా ఊరిలో తిరిగే వానికి బీడీ కరువా ”
” అబ్బా మాటకు మాటేస్తవే ఓ సాత్రమన్న చెప్పు”
” ఓయి ఇంగో అతడు వేసిన కుందేలు యి య్యాల్ల యాట అయ్యింది సచ్చిన మొగడు సండ్ల మీద మని వున్న మొగడు మంచం మీద పడుకున్నారు ఎట్లానో చెప్పవైతీవి ”
” నువ్వే చెప్పు నేర్చుకుంట కానీ గింత పోవాకు అన్న పెట్టు ”
” సుట్ట గుతీ సుక్క గుతి వొకటే నషా ఇంగ పటు” అంటూ పొవాకు పెట్టిండు.
” అబ్బా ఎంత ఘాటు గుంది ఉచ్చుబ్బులకు సుట్ట తాగితే నోరంతా గత్తు వాసన కొడ్తుంది ..”
” అరే గొర్రెకు మండ తినవెట్టు నేను కుడితి తాపుత గాని”
ఇంటిముందు గొరెపిల్ల చెంగు చెంగున గంతులు వేస్తూ ఎగురులాడుతుంది అన్నది దమయంతి నీళ్లు తేస్తు
దాని మెడలో గజ్జె గల్లు గల్లున చప్పుడు చేస్తుంటే ఆమే కొడుకు ఆటాడసాగిండు
” అవునా మనువడ అట దిక్కులు జుస్తవు ఆడవు ”
” దెహి వుకొ తాతా , నువ్వు గింత
మేస్లనిస్తలేవు, నేను నీతోని గెన్నుతన ”
” ఆడవోయి జరంత వొడుపు తోని ఆడితే సరి ”
“ఇదిగో పెద్దమనిషి ఇది ఎంకట లచ్చమ్మ బండే కదా” కొత్త మనిషి అడిగిండు
” అవును ఏవురు మీది కొత్తగ చూస్తున్నా”
” మాది పాటిమీది గూడెం గాని జర గీ పత్త చెపుతావు”
” అరే గి చిట్టి జూడు ఎవరి పేరో ”
” ఏది ఇక్కడ తే ” అంటూ చేతులకు తీసుకుంటూ ” ఇదా ఇది అగ్గో దమయంతి అక్కది , ” తల గికుతూ అయింటి వైపు చూస్తూ వేలెత్తి చూపి ” దమయంతక్కో ఓ దామయంతక్కో” అని కుతేసిండు.
” ఎంద్రా విరేశా ఏంది అట్లా తొవ్వ తప్పిన దూడ లెక్కా అరుస్తున్నవు ” వారివైపు చూస్తూ అడిగింది
వచ్చిన అతను అమాయకథను నటిస్తూ తెలగండ్లేసి ఆమే వైపు చూస్తూ వుండు
ఆమె దగ్గరికి సమీపించి ” ఎవరు నువ్వు ” అంటూ పైకి కిందకీ ఎగాదిగా చూసి అడిగిందీ.
” మాది మాది. ” అంటూ నీళ్లు నమిలి మింగుతూ తటపటాయించి పాటిమిదిగూడెం నుంచి వస్తున్న కాకి ఎర్రయ్య పంపిండు.” అని అన్నడు
” ఎంపని మీద వచ్చినవు ” అడిగింది.
” ఇయ్యాల పనికి వస్తా అన్నవట గదా కాకి ఎర్రయ్య బాయి కాడికి నిన్ను పిల్చుక రమ్మని పంపిండు ” తమాయించుకుని పలికిండు.
” ఇయ్యాల నాకు తీరదు ఆదివారం మా వోడు ఇంటిపట్టున వుంటడు ఒక్కడే గద్దగాడు రేపు వాడు బడికి పోతడు రేపోస్త ” అంటూ అతనివైపు తీక్షణంగా చూస్తూ పలికింది
” అరే అయన మీ పెనిమిటి ఒక్క సోపతీ అటగదా మీ పెనిమిటి పట్నం ల వుండట కదా గా ముచ్చట సగా తెచ్చిండు ఆయిన అక్కడనే ఉండు ఊరికి ఈ మధ్యనే వచ్చె. నువ్వేమో పనికి రేపు మాపు అనుకుంట వొస్తలేవు అందుకే నన్ను తోలిండు కలుపు అట్ట నే వుంది నెల సంది వెంట బడ్డ కరువు పనిలో పడి కూలీ జనం దోర్కుత లేరు ఆయిన బాయి కాడికి నువ్వు నాట్లకు వచ్చినవు ఒక్క తీరుగ రమ్మన్నడు నీకు దంటగ మా యామె, ఆయన భార్య సగ వున్నరు” ఉరడిస్తు పలికిండు
” సరే వొస్తగాని నువ్వు పో నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది”
అయితేమాయే నువ్వు తయారు గా నువ్వు ఇంట్ల పని ముగించుకొని వొచ్చిందాక ఇక్కడ ఆట చూసుకుంట కుసుంట ” అన్నడు
ఒరే పరశరామ నేను పనికి పోతున్న గొర్రెకు మండ వుంది పగటిలి నీకు ఉట్టిమిద సద్ది పెడుతున్నా తిను ఇగో బుంగల బిందెల సాగరు నీళ్లు వున్నయి తాగు వుల్గ పోయకు అట్లనే గొర్రెకూ నీళ్లు దాపు విరేశోల్ల దొడ్డిలో ఆళ్ళ మేకల మండ వుంది కొంచెం ఎయ్యి. ” అని చెప్పింది దమయంతి.
” నీయమ్మ నేనోస్తనే ” అంటూ అమాయకంగా చూస్తూ అమ్మతో పలికిండు కొడుకు పరశరాముడు.
” వొద్దురా నేను వరి సేల కలుపు తీసే పనిల వుంట నా యెంట తిరిగితే కుదురదు ”
” తీసుక రావమ్మా అక్కడ ఆడుకుంటడు మేము వున్నము కదా” అని పలికిండు వొచ్చిన అతను.
ఆమె చేసేది లేక కొడుకువైపు చూస్తు సంచి సర్దింది
ఇంటిముందు గొర్రె ఆమెనే చూస్తూ ఆమెను రాసుకుంటూ పూసుకుంటూ తిరగసాగింది
ఆమె కొడుకు మురిసిపోతూ తల్లివైపు చూసిండు
” అరె మొక్కుర వెంకట లచ్చమ్మ బండ చేతులెత్తి మొక్కురా మీ అయ్య యాడున్నడో గని మన ఆకలి దూప యాల్ల మాల్ల తీర్చే సల్లనితల్లి ” అనగానే కొడుకు పరశరామ ఎంకటలచ్చమ్మ బండ కు మొక్కిండు
ఆమె తన పక్కింటి వారికి ఇల్లు చూడమని చెప్పి తన కొడుకును గొర్రె ను తోలుకొని పనివైపు కదిలింది ఆమెను చూస్తూ గొర్రె నడుస్తుంది. దానిని అదిలిస్తు కొడుకు నడుస్తుండు వారిని అనుసరిస్తూ వచ్చిన అతను నడవ సాగిండు…
” అరే నువ్వు బాయి మోటార పెట్టు నేను మండువా మలుపుత ఇదిగో దమయింతి వరి మడికట్ల నీకు తోడుగా మా ఆడోళ్లు వున్నరు వారిని కలుపుకొని కలుపు తియ్యి ”
” సరేఅన్నా “అంటూ అటువైపు కదల పోయింది
” మీ పెనిమిటి తోనీ మాట్లాడుతవా ” అని ఎర్రయ్య అనగానే “అమ్మో నేను మాట్లాడుతనే నాయిన తొని ” అనె కొడుకు
” అరే షిడం ఆగురా మీ నాయిన ఎటేట్టా వుండో ఆరునెలలు అయితుండే పొయ్యి ఇగవస్తి అగవస్తి అనుడే గాని ఇంత వరకు రాకపాయే అప్పుడప్పుడు సుక్కలెక్క మెరిసి నేనున్నా అంటడు కుదార్థంగా కూసొని మనసు తీరా మాటాడింది లేదు ఎట్టుండో, గాని కలిసిందా అన్నా పోను ఎది ఇటియ్యి” అని అడగగానే అతను పోను చేతికి అందిస్తే పోను తీసుకోని
” అలో… అలో , ఎందిది సడి సప్పుడు లేదు ఎట్టరా మాట్లాడేది” … చిత్రంగా పోను చూస్తూ అన్నది మళ్లీ
” అలో.. అలో ” అని అన్నది అవతల ఎత్తిన గొంతు ” అలో..
అలో ఎవరూ” అని పలికింది
” నేను దమయంతమ్మ ను మా రాజయ్య నేనా మాట్లాడేది”
” అలో రాజు పనిలో వుండు”
” కష ఇయ్యి మా రాజుకు” తడబడుతూ అన్నది
” ఇప్పుడు కుద్రదు లంచ్ టైముకు పోను చెయ్యి ” అంటూ పోను కట్ చేసిండు దూరంగా ఆమె వాలకం గమనించ సాగింది ఎర్రయ్య భార్య ముసిగా నవ్వుతూ పక్కకు తల తిప్పి చూడసాగిండు ఎమెరుగనట్టు ఆమె అమాయకంగా కొడుకు వైపు చూస్తూ
” ఓషే పనిమీద వుండట రా పరుషా మీ నాయిన. పగటీలి బువ్వ తింటప్పుడు మాట్లాడుదాం తియ్యి.”
“ఆర్నియమ్మ నాయినతోని మాట్లాడాలి అనుకుంటే పనిమీద వున్నాడు వుంటెంది పోను వచ్చిందని పిలువాలే”
” ఏదో పనిలో బిజగా వున్నట్టుంది
సరే గాని మధ్యాహ్నం చేద్దాము తియ్యి ” అంటూ తను పనిలో మునిగింది
కొడుకు గెట్టున కుసుండు బిట్ల గొర్రె ను తోలి కావాలి గాసుకుంట ఆమె వరి మడి కట్ల కలుపు తీసే పనిలో మునిగి వుంది ……
…
” అన్న రాజు గాడు మీ చెల్లిని తీసుక పోయిండని అనుమానం తో వానెంట పడితిమి వాడు చిక్కపాయే ఎన్ని రోజులు గాలం వేసి చూసినా దొరక లేదు గాని అతని భార్య ను ఇబ్బందుల పెడితె లెక్క ఓకేనా ”
” అరె వాడు యాడున్నా ఏ బొర్రెలో ఎంత కాలం దాసుకున్నా వానికి తప్పదు కానీ వాని పెండ్లాం పిల్లల ఇరుకు ఇబ్బందుల పెట్టాలి వానికి చుక్కలు చూపించాలి, వాడు శంకర గిరి మాన్యాలు పట్టాలి . ఎంతతోడు అంతనే వుండక మన ఇంటికి కన్నం బెడతడా కొడుకు గివ్వన్ని వానికి తెలుస్తయి తెలువాలే , మనమెంది మన కాందాన్ ఏంది తెలియదా ”
” అవుననుకో మనకు అనుమానమే కానీ కాని ఏంది కండ్ల చూస్తే ఏది లేదుకదా మన పిల్లకు తప్పులో పాలుంది కాదా”
” అరె మనం ఏమయినా చేస్తం వాడు బండమీద బతికే వాడు కుర్సిల కుకుంటాడు
మన పిల్లకు తప్పులో పాలుంది కాదాని వుకుంటమా
కుక్క ను సముద్రం దగ్గరికి తీసుకెళ్లినా గతుకుడే గాని మనలెక్క తాగుతదా ”
” నిజమే ననుకో మనకు ఏమన్నా ఇబ్బందులు వస్తయ”
” ఎందుకట్ల భయపడతవు మన మీద ఈగ వాలకుంట చేసినా టౌన్ లో ఎస్సై, సి ఐ, డిఎస్పీ అంతా మనోళ్లే వాడు చిక్కెనా ఏకీలు కా కీలు విరిచి పెడతరు నువ్వేం పరేషాన్ చెయ్యకు”
” నాకు ఇల్లు పొల్లు వుండే నాకేమన్నా వస్తదేమొనని నీ మాట విని నేను గింత పాపం మూట కట్టుకుంటి, నీకేంది బాగానే ఉంటవ్ ఎన్నిమాటలయిన చెబుతవు. నాకేం చుట్టుకుంటదొ పిల్లల గల్లోన్ని ” లోలోన అనుకుంటూ నీళ్లు నమిలి మింగసాగిండు దమయంతి వారివైపు చూస్తూ ” ఏమయివుంటది అబ్బా వాళ్లు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు” అని లోలోన అనుకుంటూ తిన్నగా లేసి వాల్చిన నడుము ఎత్తి కొట్టంలో కి కాడి మోకు కోసం వెళ్ళింది. అదే అదునుగా ఎర్రయ్య ఆమె వెనుకాల నాసి పెట్టుకోనీ అగంతకునిలా కొట్టంలోకి జొరబడి ఊపిరి ఆడకుండా ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు అతని చేతి లో ఆమె ఉక్కిరి బిక్కిరయ్యింది ఆ క్షణం జీవితం లో మొదటిసారి ఆమె నరకం అనుభవించింది అనుకొని హఠాత్ పరిణామానికి ఆమెకు ఏం చేయాలి తోచలేదు ఎవరికి చెప్పాలో తెలియదు గుండెల్లో ఒకటే దడ మొదలైంది ఉలికి పడిపోయింది ఒళ్లంతా చెమటలు పట్టింది గుండె వేగం పెరిగినకొద్దీ లోలోన ఆందోళన పడుతూనే వుంది రెప్పపాటులో అంతా జరిగిపోయింది కలా నిజమా తేల్చుకోలేని అయోమయం లో ఆమె ఎందుకు ఇలా జరిగింది బుర్రను తొలిచి వేస్తున్న ప్రశ్న అతను ఇలా చేయడం ఏమిటి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదొ తెలియకుండా వుంది ఏమిటి ఈ విపత్కర పరిస్థితి. తలిస్తే కంపరం పుడుతోంది. వాడిని అక్కడికక్కడే ఉప్పు పాతర వేయాలన్నంత కసి…. కాని మౌనం పాటించి మిన్నకుండి పోయింది అంతా కర్మ పళ్లు పటపట కొరుకుతూ నిష్చేస్తురాలైంది తనకు తెలియకుండానే పళ్ళతో కిందిపెదవిని అదిమి పెట్టింది పేదుం చిట్లి ధారలుగా రగుతం కారింది తిన్నగా దుల్పాయించుకొని బయటికి వచ్చి అటిటు చూసింది కొడుకు ఏటో పరుగు తిస్తుండు గొర్రె కనిపిస్తలేదు అంతా అయోమయం. …దిగులుతో చడి చప్పుడు చేయకుండా ఇల్లు చేరింది. కొడుకు గొర్రె కోసం తిరిగి తిరిగి అలసిపోయిండు. ఎనకాల తిన్నగా ఇల్లు చేరిండు కండ్లు కంతలకు పొయినయి మొకం పిర్చుక పోయింది గొర్రె జాడ లేదు. వుత్త చేతులు పిసుకుతూ అటుగా చూసాడు సాయమాను గుంజ చిన్నబోయింది అమ్మ మంచం లో నిద్ర పోయినట్టు వోరిగింది. ఏమీ తెలియని పరశురామ అమ్మ పక్కేంట మంచం మీద కూర్చుండు.
…
” అమ్మా అమ్మో మన గొర్రె ఎక్కడ పోయిందే నేను దాని పక్కనే ఉన్న చిత్రంగా మాయమైంది” ఆమె గునుస్తు తిన్నగా కళ్లు తెరచి ” ఎవరో దొంగలు ఎత్తుక పోయినట్టుంది లేకుంటే ఎవరి దొడ్డిలోకన్న పోయిందేమో పొద్దుగాల లచ్చమ్మ బండకు మొక్కి చూద్దాము రా” తిన్నగా అన్నది
” అమ్మా మన దేవునికి మొక్కితే దొరుకుతదా ” ఆమె వైపు అమాయకంగా చూస్తూ అన్నడు
” మన సొమ్ము మనకు రుడముంటే తప్ప క తిరిగొస్తది, మనది కాకుంటే మంది పాలు అయితది అంతా దేవుడు చూస్తడు తియ్యి రా ఎందుకు విసిగిస్తవు ” పాలిపోయిన మొముతో అన్నది
దారెంట వెళ్తున్న తాత వారి మాటలు విని ” ఏంది దమాయమ్మ పిలగాడు సతాయిస్తుండా ” అడిగిండు
” గోరెపిల్ల కాటు వడ్డది మామ ” తిన్నగా అన్నది
” అరే అట్లనా ఎర్కలి బువ్వమ్మ తానికిపొయ్యి సాట సకినం చుపియి యాడవుందో ఆనవాలు చెప్తది ” తీక్షణంగా చూస్తూ పలికిండు
” దోర్కేన మామా దొంగలు దోస్క పోయినట్టుంది” బేలగా చూస్తూ పలికింది
” ఇగ్గో ఆమె చెప్పినట్టు చెయ్యి ముందు పసుపు బియ్యం లో పావుల నేములు వేసి దేవునికి మొక్కి ముడుపు కట్టు ” అన్నడు
” మర్సే పొయిన వుండే సారయ్య మావ కాళ్ళు చేతులు కడుక్కొని ముడుపన్న కడుత కానీ నీకు ఎరుకేనాయే సాట సకినమ్ సుడరాదే ” లేచి నెత్తి జడ ముడివేసి మొకాన నీళ్లు చల్లుకుంది.
” అది నాకే పెడుతున్నావు ఏది గిన్ని బియ్యం సాట్ల పోసుకొని తీసుక రా ” అని అన్నడు తాత. ఆమె పైట కొంగుతో మొకం తుడుస్తూ సోలతో బియ్యం తీసింది.
అతను దోసెడు బియ్యం సాటలో పోసి సాట ను బొటన వేలు చూపుడు వేలితో మధ్యలో పట్టుకొని
సాటను తిన్నగా ఊపసాగిండు కనురెప్పలు ఆడిస్తూ గుడ్లు మిటకరించి సాట వైపు చూస్తూ
” సొమ్ము ఎక్కడ ఉంది తొవ్వ చూపు, వొస్తదా, వొస్తదా , రాదా రాదా, తూరుపా, ఉత్తరాన, వోయిములా పడమరా, డచ్చినాదా ఎక్కడా ఎక్కడా పెడమర్ల చూపు చూపు ” అంటూ సరాయిస్తు శకునం చూడ సాగిండు ఆమె ఆమె కొడుకు ఇద్దరూ గుడ్లప్పగించి అతడిని చూడ సాగిండ్రు.
అతడు సాట చేతితో పట్టుకొని దానిని పరిచ్చగా చూస్తూ ” ఇవురెనా. ఇరుగపొరుగు లో వుందా ఎటుపక్క ? దొరుకుతదా.. దొరకదా.. చిక్కదా.. అంతేనా.. ” సరాయిస్తు ఆవలిస్తూ డేపులు తీస్తూ దమయంతి వైపు చూస్తూ “వొమ్మా దొరకదు రా ఆశ వదులుకో పెద్ద గద్ద చూపు పడ్డది రా మనది కాదనుకో బిడ్డా ” ఆశ వదులుకో అన్నట్టుగా చేత సైగ చేసాడు.
అతను తిన్నగా అక్కడి నుంచి లేచి బైటికి వచ్చి అటిటు చూసి ” భద్రం రా ” అంటూ ముందుకు కదిలిండు అతని మాట అమెకు బోద పడలె
” అమ్మా మన గొర్రె దొరుకాదా ”
” ఇంకెక్కడి గొర్రె రా ఎవని కన్నో మన ఇంటిమీద పడ్డది మనమూ ఈ ఊరు విడిచి పోవాలె ”
” ఎందుకమ్మా మనది ఈ ఊరు కాదా ” కండ్లు నలుస్తు అన్నడు
” నీకు ఎట్లా చెప్పరా మీ అయ్య జాడల పట్నం పోదాం పండుకో కోడి కుయంగలేచి బాట పడుదాం ” అని కొడుకుకు చెప్పింది కాని రెప్ప మూయలేక కన్నీరు కారుస్తూ కొడుకు పక్కన వొరిగింది. ఆ రాత్రి వారికి కాల రాత్రి
” మన ఇంటి సూట్టు కొలిమి దెయ్యాలు పడ్డయి
బట్ట కాల్చి మిదేసి బదనాం చేస్తరు పొద్దు పొడువక ముందె పోదాం గాని పండుకో రా ” అని తీన్నగా గొనిగింది.
కొడుకు నిద్రలోకి జారుకుండు
ఆమె పరి పరి గా ఆలోచిస్తూ వుంది నడి రాతిరి తలుపు టకటకా చప్పుడు ఉలికి పడి లేచింది ” దమయమ్మో ఓ దమయమ్మా ” పిలిచినట్టు వినపడింది చిన్నగా లేచి గొళ్ళెం తీసింది ఎదురుగా పక్కింటి అతను ఆమెని చూస్తు పిందారా” చేస్తున్నారు రావమ్మా అని పిలిచిండు అలాగే అన్నట్టు తల వూపి తలుపు గడియ పెట్టి నిద్రలోకి జారుకుంది
మునిమాపుజామునలేచి సాటసకినం చూసిన, మిత్తి దీసిన పసుపు కలిపిన బియ్యం పైసలు ఉతికిన గుడ్డలో మూట కట్టి దేవుని పటము దగ్గర వుంచింది
” అమ్మా ఎంకట లచ్చమ్మ నీ బండకు మొక్కుత్తున్న నేనా ఒంటి దాన్ని నేను ఏ పాపం ఎరుగ అన్నెం పున్నెం నీ కెరుకా తప్పు చేసిన వాడు ఏం ఇగురు పెట్టడు , గాని సప్పుడ చేయకుండా నిన్ను తలుస్తున్నా నీదే భారం. తప్పు చేశామన్న వాడు చెంపలు వేసుకొని ముక్కు పట్టుకొని నేల రాయాలే వానికి క్షమాపణ లేదు నేను నిన్ను మల్ల చుస్తనా ఇదే ఆకరా నీదే మాయ ఎలేడు పిలగాని తోడుకొని ఊరు విడిచి ఊరు కానీ ఊరుకు పయనం అయితున్న సెలవు తల్లి ” అంటూ మనసులో దీనంగా కుమిలి కుమిలి విలపిస్తూ ముందుకు బాట సాగబోయి ఆగి అటు ఇటూ చూసింది అక్కడ అందరూ తిరుగుతున్నారు కొందరు వారివారి పనులకోసం పోతున్నారు ఇంటిలో దీపం వెలిగించి బయటికి తొంగి చూసింది దూరంగా దీపపు వెలుగు లో తల తల మెరిసింది ఏమిటది మెరుస్తుంది అని అటుగా నడిచింది తాకి చూసింది గల్లుమని చప్పుడు వినిపించింది దానిని చేతికి తీసుకోని చూసింది అది ఆమె గొర్రె మేడలో తాను ప్రేమగా కట్టిన గజ్జె ఇక్కడకి ఎలా వచ్చింది. ఆమెకు లక్ష చిక్కు ముడుల చిక్కు ప్రశ్న ఆమె పుర్రెను తోలిచింది సమాధానం దొరకని ఆమె అలా తన కొడుకును వెంట తీసుకోని ముందుకు కదిలింది…
రేఖ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో పేరున్న కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాగానే సంపాదిస్తుంది. రేఖ తండ్రి సూర్య ప్రకాశ్ సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కాగా తల్లి సరిత గృహిణి. రేఖ ఇద్దరు తమ్ములు కాలేజి చదువు కొనసాగిస్తున్నారు. సూర్య ప్రకాశ్, సరితలు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిర నివాసం. ముగ్గురు పిల్లల చదువు హైదరాబాదులోనే జరిగింది. గత రెండు సంవత్సరాలుగా సూర్య ప్రకాశ్, సరితలు రేఖ వివాహ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు మాట్రిమొనీలో కూడా రేఖ వివరాలు పొందు పరిచారు. కాకపోతే రెండు నెలలుగా సూర్య ప్రకాశ్ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ప్రయత్నాలకు కొంత విరామం ఏర్పడింది. వృద్ధాప్యరీత్యా వచ్చిన జబ్బుల మూలంగా సూర్య ప్రకాశ్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించ వలసి వచ్చింది. ఆవిడ వయస్సు తొంభై కి దగ్గరగా ఉంది. పదిహేను రోజుల పాటు వైద్యం చేసి, దాదాపు రెండు లక్షల రూపాయలు పిండుకొని తమతో కాదని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటు ఆసుపత్రి వారు సలహా ఇచ్చారు. ఒకటి రెండు రోజులు మించి బ్రతకడం కష్టమేనంటూ డాక్టర్లు వెల్లడించి ఇప్పటికీ నెల పదిహేను రోజులైంది. ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోమా నుండి తేరుకోలేదు. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి సూర్యప్రకాశ్ బాగా కుంగిపోయాడు. తండ్రి చిన్నప్పుడే చని పోవటంతో అన్నీ తానై సూర్య ప్రకాశ్ ను తల్లి బాగా చదివించింది.
********
భరణి నాలుగేళ్లుగా కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఉద్యోగిగా ఐదంకెల జీతం సంపాదిస్తున్నాడు. హెచ్ వన్ బి వీసా ఉంది. అతడి చెల్లెలు స్మిత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇంగ్లాండులో స్థిర పడింది. తండ్రి కృపాకర్ పోలీసు శాఖలో గెజిటెడ్ హోదా ఉద్యోగం, తల్లి రవళి హైదరాబాదు రేడియో కేంద్రంలో మంచి పదవిలో ఉంది. తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి అమెరికా నుండి వారం రోజుల క్రితం హైదరాబాదు వచ్చాడు భరణి.
*******
మాట్రిమొనీలో రేఖ వివరాలు తెలుసుకొని సూర్యప్రకాశ్ కు ఫోను చేశాడు కృపాకర్. తనను తాను పరిచయం చేసుకొని భరణి వివరాలు, తమ కుటుంబ నేపథ్యం వివరించి, “అమ్మాయికి, అబ్బాయికి జాతక రీత్యా తగినన్ని పాయింట్లు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పారు , అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేయగలరా” అంటూ కృపాకర్ అడిగాడు. సూర్య ప్రకాశ్ కి ఏమి చెప్పాలో తోచక కాసేపు సందిగ్ధంలో పడ్డాడు. తన తల్లి కోమాలో ఉండి కొన ఊపిరితో ఉందనే విషయం, తాము కొంత కాలం పాటు అమ్మాయి వివాహం వాయిదా వేసుకున్నట్టు చెప్పకుండా “ప్రస్తుతానికి మేము ఊళ్ళో లేమండి, రావటానికి వారం రోజులు పడుతుంది” అని దాట వేశాడు.
“వారం రోజుల తర్వాత మళ్లీ కాల్ చేస్తానండి” అంటూ ఫోను కట్ చేశాడు కృపాకర్. ఇదే విషయం కృపాకర్ తన భార్య రవళికి చెప్పాడు.
“నెల రోజుల్లో పెళ్లి చేసుకొని భరణి అమెరికాకు వెళ్లాలి కాబట్టి మనకు ఉండే తొందర వారికెందుకు ఉంటుంది” అంటూ నిట్టూర్చింది రవళి.
******
వారం రోజుల పిదప కృపాకర్ సూర్య ప్రకాశ్ కి ఫోను చేశాడు. “నేను కృపాకర్ ను మాట్లాడు తున్నాను. పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేయగలరా” అని అడిగాడు. మరో సారి అబద్దం చెప్పలేక ఏమైతే అయిందిలే అనే ధీమాతో “మంచిరోజు చూసి పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేస్తాను” అంటూ అయిష్టంగానే సంసిద్ధత తెలిపాడు సూర్య ప్రకాశ్.
“ఆ విషయంలో మీకు శ్రమ అక్కర్లేదు. నేను సిద్ధాంతి గారిని విచారించాను. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, వర్జ్యం కూడా లేదు . అదే రోజు ఖాయం చేయండి. ఎందుకంటే మా వాడికి ఎక్కువ సమయం కూడా లేదండి” బ్రతిమిలాడే ధోరణి లో అంటూ సూర్య ప్రకాశ్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెళ్లి చూపుల తేదీ నిర్ణయం చేశాడు కృపాకర్. పెళ్ళి చూపుల కార్య క్రమం యదావిధిగా అనుకున్న సమయానికి సూర్య ప్రకాశ్ ఇంట్లో జరిగింది. రెండో రోజు కల్లా అమ్మాయి, అబ్బాయి తమ అంగీకారం పెద్దలకు తెలియ జేశారు. ఇక మిగిలింది పెళ్ళి ముహూర్తం నిర్ణయించటమే. ఓ ప్రక్క సూర్య ప్రకాశ్ తల్లి చావు బతుకుల్లో ఉంది. మరో వైపు భరణి పెళ్లి చేసుకొని కొద్ది రోజుల్లో కాలిఫోర్నియా వెళ్లాల్సి ఉంది. కృపాకర్ సిద్ధాంతి గారిని సంప్రదించి వివాహ ముహూర్తం తేదీ నిర్ణయించి సూర్య ప్రకాశ్ కు ఫోను చేశాడు. ” సూర్య ప్రకాశ్ గారూ, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. వచ్చే ఆదివారం ఉదయం 10.32 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నట్టు సిద్ధాంతి గారు చెప్పారు. ఆ ముహూర్తానికి పెళ్లి కానిద్దామా” ప్రశ్నించాడు కృపాకర్.
“సుముహూర్తానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ మహా నగరంలో కన్వెన్షన్ హాలు, ఇతర పెళ్లి ఏర్పాట్లు అసాధ్యమేమో” సందేహం వెలిబుచ్చాడు సూర్య ప్రకాశ్.
“మీకు నచ్చిన కన్వెన్షన్ హాలు చూడండి. నేనున్నాను కదా బావ గారూ. అవసరమనిపిస్తే నిర్మొహమాటంగా నా సహాయం తీసుకోండి” ధైర్యం చెప్తున్నట్లుగా సమాధాన మిచ్చాడు కృపాకర్.
వీటన్నిటి కంటే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషమించి మరణిస్తే పెళ్లి ఆగి పోతుందేమో అనే శంక సూర్య ప్రకాశ్ కి ఎక్కువగా ఉంది. భార్య సరిత, కూతురు రేఖను సంప్రదించి పెళ్లి సింహాచల క్షేత్రంలో జరపాలని నిర్ణయించుకున్నాడు. మంచానికే పరిమితమైన తల్లిని హైదరాబాదులోనే పని మనుషుల సంరక్షణలో ఉంచి మిగతా బంధువులతో సింహాచలం వెళ్తే ఎటువంటి టెన్షన్ ఉండదని తన ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు పెట్టాలను కున్నాడు. కృపాకర్ కు ఫోను కలిపాడు .
“బావ గారూ, మీకో విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడ గుర్తు చేసేంత దాకా నాకు ఆలోచన రాలేదు. మా అమ్మాయి సంబంధం నిశ్చయమైతే వివాహం సింహాచల క్షేత్రంలో చేయాలని ఎప్పుడో మొక్కు కున్నాం. మరి ఈ ప్రతిపాదన మీకు సమ్మతమేనా నిదానంగా ఆలోచించి తెలపండి” అంటూ ఫోను పెట్టేశాడు సూర్య ప్రకాశ్.
భరణికి ఈ ప్రతిపాదన నచ్చలేదు. కృపాకర్, రవళి కూడ ఈ విషయంలో ఆసక్తి కనపరచలేదు. అయినా సరే దేవుడి సన్నిధిలో లగ్నం అనేటప్పటికి వ్యతిరేకించ లేని పరిస్థితి వారిది. కేవలం దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తారనే నెపం చేత ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం సుతరామూ వారికి ఇష్టం లేదు. పైగా భరణి మరో పదిహేను రోజుల పాటు మాత్రమే ఇండియాలో ఉండేది, ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మరో రెండేళ్ల దాకా తను ఇండియా వచ్చే అవకాశం లేదు. పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా వేసే ప్రసక్తి లేదు. సూర్య ప్రకాశ్ ప్రతిపాదనకు కృపాకర్ కుటుంబ సభ్యులు కాదనలేక పోయారు. “బావ గారూ మీరు దేవుడి సన్నిధిలో పెళ్లి చేయాలని తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే. త్వరగా ఏర్పాట్లు చేయండి” చెప్పాడు కృపాకర్.
*****
సింహాచలం లోని తన బంధువుకు ముహూర్తం తేదీ తెలియజేసి కావలసిన ఏర్పాట్లు చేయించుకున్నాడు సూర్య ప్రకాశ్. ముహూర్తం తేదీకి మూడు రోజులు ముందుగానే బంధు మిత్ర బృందంతో బయలు దేరడానికి ప్రైవేటు టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నాడు. ముహూర్తం సమయానికి చేరుకునే విధంగా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు మరో టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడి ఆ వివరాలు కృపాకర్ కు అంద జేశాడు. రెండు కుటుంబాల వారు వాయువేగంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ తల్లిని తన ఇంట్లో కొన్నేళ్ల నుండి నమ్మకంగా పని చేస్తున్న శాంతమ్మ, ఆమె భర్త రాగయ్య సంరక్షణలో ఉండే విధంగా శాంతమ్మకు అన్ని జాగ్రత్తలు తెలిపారు. తల్లి ఆరోగ్యం విషమించి కన్ను మూస్తే ఆ విషయం తొందరపడి ఎవరికీ తెలియజేయ వద్దని, కేవలం సూర్య ప్రకాశ్ కు మాత్రమే ఫోను ద్వారా చెప్పాలని శాంతమ్మకు హితవు పలికారు. తమ ఫ్యామిలీ డాక్టరుకు కూడా ముందు జాగ్రత్త గా తల్లిని తన ఇంట్లోనే ఉంచి తాము సింహాచలం వెళ్తున్నట్లు తెలిపాడు. “ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకో సారి ఆవిడ ఆరోగ్యం చూసుకుంటాను. మీరు అధైర్య పడవద్దు. నిశ్చింతగా మీ పనులు పూర్తి చేసుకోండి” అంటూ హామీ ఇచ్చాడు డాక్టరు.
తల్లికి చెప్పకుండా ఎన్నడూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు సూర్య ప్రకాశ్. ఇప్పుడు తల్లి కోమాలో ఉంది. అనుకోని పరిస్థితుల్లో తల్లికి తెలియకుండానే రేఖ వివాహ ముహూర్తం నిర్ణయమైంది. బయలుదేరే ముందు బరువెక్కిన గుండెతో తల్లి కాళ్ళకు మొక్కిన సూర్య ప్రకాశ్ కుటుంబ సభ్యులను, బంధువులను హడావిడి చేసి ముహూర్తానికి మూడు రోజుల ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు సింహాచల క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో బయలుదేర దీశాడు.
*****
సూర్య ప్రకాశ్ తల్లిని తన పర్యవేక్షణలో ఉంచడంతో శాంతమ్మది ఎటూ కదలలేని పరిస్థితి. శాంతమ్మ, రాగయ్యలు మొదటి నుండి సూర్య ప్రకాశ్ కుటుంబానికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు.
“మేము తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉండి వంట చేసుకొని తినండి ” వెళ్ళే ముందు సరిత తన ఇంటిని శాంతమ్మకు అప్పజెప్తూ సలహా ఇచ్చింది.
అదేమిటో గాని గత రెండు నెలలుగా నోటి మాట లేని సూర్య ప్రకాశ్ తల్లిలో పెళ్లివారి బృందం బయలు దేరిన మరుసటి రోజే కదలిక వచ్చింది. “ఒసేయ్ శాంతా ” అంటూ పిలిచింది. అదే గదిలో అమర్చిన టీవీ చూస్తున్న శాంతమ్మ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. “ఎవరబ్బా నన్ను పిలిచింది” అని స్వగతం లోనే అనుకుంటూ కూర్చున్నదల్లా లేచి బయటికొచ్చి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గదిలోకి తిరిగి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.
“ఏమే శాంతా, నేనేనే నిన్ను పిలిచింది” అంది మరోసారి సూర్య ప్రకాశ్ తల్లి. టీవీ లోకం నుండి బయట పడిన శాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి సూర్య ప్రకాశ్ తల్లిని నివ్వెరపోయి చూస్తూ నిలుచుంది.
“అమ్మా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు మాట్లాడే శక్తి వచ్చిందమ్మా మీకు” అంది శాంతమ్మ.
“అబ్బాయి ప్రకాశాన్ని పిలువు” అంటూ హుకుం జారీ చేసింది సూర్య ప్రకాశ్ తల్లి.
“అయ్యగారు వాళ్లు సింహాచలం ఎళ్లారమ్మా, మన రేఖమ్మది లగ్నం ఆడే చేస్తున్నారు, ఇంకో మూడు దినాలే ఉందమ్మా” జవాబిచ్చింది శాంతమ్మ.
“అదేమిటి ప్రకాశం నాకు ఈ విషయం చెప్పలేదే. ఒక సారి ప్రకాశానికి ఫోను కలుపు నేను మాట్లాడతా” అంటూ మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేసింది. సూర్య ప్రకాశ్ తల్లి శాంతమ్మ సహాయంతో లేచి కూర్చుంది. శాంతమ్మ సూర్య ప్రకాశ్ కి ఫోను కలిపింది.
“అయ్యా, పెద్దమ్మ మాట్లాడుతున్నారు, లేచి కూర్సున్నారు. మీతో మాట్లాడుతరంట” అంటూ ఫోను సూర్య ప్రకాశ్ తల్లికి ఇచ్చింది.
సూర్య ప్రకాశ్ తన తల్లి మాట్లాడు తుందన్న విషయం తెలియగానే కొద్ది క్షణాలు నివ్వెర పోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. “హలో” అన్నాడు.
“అరేయ్ ప్రకాశం, నాకు చెప్పకుండానే మనవరాలి కళ్యాణం చేస్తున్నావా, నాకు దాని కళ్యాణం చూసే యోగం లేదా” అంటూ ప్రశ్నించింది.
“అమ్మా, సింహాద్రి అప్పన్న చలవ వల్ల కోలుకున్నావు. చాలా సంతోషం. ఇన్నాళ్లు నీవు కోమాలో ఉండటం మూలాన రేఖ పెళ్లి విషయం నీకు చెప్పలేక పోయాను. అంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది. ఎక్కువగా మాట్లాడకు నీరసించి పోతావు, అన్ని విషయాలు మేము తిరిగి వచ్చినాక మాట్లాడుకుందాం. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ఫోను కట్ చేశాడు. అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే కరుణించి చావుకు దగ్గరగా వెళ్లిన తల్లికి ఎవరూ ఊహించని విధంగా మాట్లాడే శక్తి నిచ్చాడని సూర్య ప్రకాశ్, సరితలు తమ సంతోషాన్ని తమతో పాటు ఉన్న బంధువర్గంతో పంచుకున్నారు.
*****
కృపాకర్ దంపతులు కుటుంబ సభ్యుల సహితంగా ముహూర్తం రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకునే విధంగా హైదరాబాదు నుండి సూర్య ప్రకాశ్ నియమించిన టూరిస్ట్ బస్సులో బయలు దేరారు. పెళ్లికొడుకు తరపు వారికి బస్సు సరిపోనందున అప్పటి కప్పుడు ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. కారులో కృపాకర్ ఇద్దరు బాబాయిలు, మేనమామ టూరిస్ట్ బస్సు వెనకాలే బయలుదేరారు. కృపాకర్ తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితమే కాలం చేశారు.
“బావ గారూ, ఇక్కడ అన్ని పనులు పూర్తయినాయి. ముహూర్తానికి అన్ని సిద్ధం చేశాము” అంటూ సింహాచలం నుండి సూర్యప్రకాశ్ కృపాకర్ కు ఫోను ద్వారా తెలియ జేశాడు. “థాంక్యూ బావ గారూ, ముహూర్త సమయానికి రెండు మూడు గంటలు ముందుగానే మేము అక్కడికి చేరుకుంటాము” అంటూ కృపాకర్ బదులిచ్చాడు.
పెళ్లికొడుకు బృందం బస్సు కేరింతలతో, అంత్యాక్షరి ఆటలతో సాగుతుంది. టూరిస్ట్ వెనకాల కారు భారంగా వెళ్తుంది. విజయవాడ కు పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉండగా బహుశా నిద్ర లేనందువల్ల నేమో అలసిపోయిన కారు డ్రైవర్ కళ్ళు ఒక్క క్షణం మూసుకోవటంతో కారు గతి తప్పి రోడ్డు డివైడర్ కు గుద్దుకుని ఎగిరి రోడ్డుకు మరో వైపు బోల్తా పడింది. కొద్ది దూరంలో వెళ్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ వ్యూ మిర్రర్ లో ఘటన చూసి బస్సును రోడ్డు ప్రక్కన ఆపాడు. డ్రైవరు, కొంత మంది పెళ్ళి వారు పరిగెత్తు కుంటూ ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో చూడగా అప్పటికే వెనుక సీట్లో కూర్చున్న కృపాకర్ ఇద్దరు బాబాయిలు తీవ్ర రక్త గాయాలతో మరణించారు. సీటు బెల్టులు ధరించిన కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న కృపాకర్ మేన మామ ఎయిర్ బలూన్లు విచ్చుకోవటంతో రక్త గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బృందంలోని ఒక సభ్యుడు 108 కి డయల్ చేసి ఘటన విషయం తెలియజేశాడు. పోలీసు వారు కొద్ది సేపట్లో అక్కడకు చేరుకొని వారు చేయ వలసిన విధులను నిర్వర్తించారు. ఘటనాస్థలి పెళ్లి వారి ఏడుపులతో నిండిపోయింది.
కృపాకర్ కాసేపటికి తేరుకొని సూర్య ప్రకాశ్ కు ఫోను కలిపాడు. “బావ గారూ అనుకోని దురదృష్ట కర మైన సంఘటన జరిగింది. మా బస్సు వెనకాలే వస్తున్న కారు ఆక్సిడెంట్ కు గురైంది. అందులో కూర్చున్న మా ఇద్దరు బాబాయిలు మరణించారు. కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న మా మేన మామ గాయాలతో బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో మనం పెళ్లి కార్య క్రమం పెట్టుకోలేము కదా. పైగా మాకు సూతకం ఉంటుంది. సూతకం తర్వాత మిగతా విషయాలు మాట్లాడు కుందాం” అంటూ ఫోను కట్ చేశాడు.
పోలీసు శాఖలో అధికారి కావటం మూలాన కృపాకర్ తన పరపతిని ఉపయోగించి మరణించిన వారి మృత దేహాలు, గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశాడు.
సూర్య ప్రకాశ్ ప్రక్కనే ఉన్న సరిత భర్త ఆందోళన గమనించి “ఏం జరిగింది” అని అడిగింది. విషయం చెప్పిన సూర్య ప్రకాశ్ “సరితా, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆందోళనలో ఉంటే ఇప్పుడేమో ఇలా జరిగింది”.
*****
కర్మ కాండలు సంజీవరెడ్డి నగర్ లోని కృపాకర్ ఇంట్లో జరిగాయి. బాబాయిలకు వారసులు లేనందున తానే ముందుండి వారి కర్మ కాండలు జరిపించాడు. మాశికం కార్య క్రమంతో కృపాకర్ కుటుంబానికి మైల తొలగిపోయింది. ద్వాదశ దిన కర్మ రోజు బంధుమిత్రులు బాగానే తరలి వచ్చారు. బంధుత్వం కలిసింది కాబట్టి సూర్య ప్రకాశ్, సరితలు కూడా హాజరయ్యారు. అనుకోని సంఘటన వల్ల భరణి తన అమెరికా ప్రయాణాన్ని మరో నెల రోజుల పాటు వాయిదా వేసు కున్నాడు. సాయంత్రానికి దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు. సూర్య ప్రకాశ్ అవకాశం కల్పించు కొని పెళ్లి విషయం కృపాకర్ తో ప్రస్తావించాడు. అయితే ఒకే ఇంటి పేరు గల వారు మరణించారు కాబట్టి సంవత్సరం లోపు భరణి పెళ్లి చేయవచ్చునా అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అదే విషయం అక్కడే ఉన్న సిద్ధాంతి గారిని అడిగాడు కృపాకర్.
“అయ్యా, మన సందేహాలు తీర్చటానికేమో సమయానికి ధర్మ సందేహాలు కార్య క్రమం టివి లో ప్రసార మవుతుంది. సర్వదమనశాస్త్రి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. మీ సందేహానికి కూడా సమాధానం దొరక వచ్చు. వినండి.” అన్నాడు సిద్ధాంతి గారు.
“శాస్త్రి గారూ, నల్గొండ నుండి సురేష్ అనే శ్రోత ఈ విధంగా అడిగాడు, తాత చనిపోతే మనవడికి సూతకం ఎంత కాలం ఉంటుంది, వివాహం ఎంత కాలం దాకా చేసుకోగూడదు” ప్రశ్న సంధించింది సంధాన కర్త .
“ఇంటి పేరు గల వారు మరణిస్తే సూతకం లేదా మైల 12 రోజులు, 13 రోజులు,15 రోజులు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో వారి వారి ఆచారం ప్రకారం ఒక్కో రకంగా ఉంటుంది. తండ్రి మరణిస్తే సంవత్సరం పాటు, తల్లి మరణిస్తే ఆరు నెలల పాటు కుమారుడు వివాహం చేసుకోగూడదు. నిత్య పూజలు మాత్రం సూతకం అయిపోయిన తర్వాత నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. కాకపోతే వ్రతాలు, పండుగలు ఏడాది పాటు ఉండవు. అయితే తాత లేదా ఒకే ఇంటి పేరు గల వారు చనిపోతే సూతకం ముగిసిన అనంతరం మనవడి పెళ్లికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అంటూ సమాధాన మిచ్చాడు శాస్త్రి గారు.
“కృపాకర్ గారూ, సర్వదమన శాస్త్రి గారు అంత పెద్ద వారు చెప్పింది విన్నారు కదా, ఇంక మీరు నిరభ్యంతరంగా ప్రొసీడ్ అవ్వండి” అంటూ శలవిచ్చాడు పంతులుగారు.
సూర్య ప్రకాశ్, కృపాకర్ లు తమ రెండు కుటుంబాల సంబంధం బలపరచుకోవడానికి సిద్ధాంతి గారు నిర్ణయించిన పెళ్లి సుముహుర్తానికి ఓకే చెప్పారు.
******
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
F306 HNo 13-10-95,
Vaishnavi Dvivedi Apartments,
Gaddiannaram,
Hyderabad-500060
Ph.9848545970.
సుమన శుభలేఖ ఇచ్చిన మరునాటి నుండే వీడియో మెసేజ్ పదే పదే పెళ్ళికి రమ్మంటూ
ఆహ్వానం పలుకుతుంది.శుభలేకే వాళ్ళ ఆర్థిక హోదాను కొంత మోసుకొచ్చింది.ఇక వీడియో మెసేజ్ సంగతి చెప్పఖ్ఖర్లేదు.కాని సుమనలో ఆ ఆర్థిక డాంబికత్వం కనపడినే లేదు.”మనసుకు
తగ్గ పేరే ఆ అమ్మాయిది.” అనుకుంది వైశాలి.
కాలం నిరంతర వాహిని.ఏ అవరోధాలు దానిని ఆపలేవు.ఆ కాల గమనంలో ఎన్నో సంఘటనలు.మరెన్నో మార్పులు. అవి రాజకీయమో..సామాజికమో..భౌగోళికమో..మంచో చెడో ఆపత్తో..విపత్తో… వేటితో కాలానికి సంబంధం లేదు.దాని మానాన అది తన ప్రయాణాన్ని కొన సాగిస్తుంది తన కొలీగ్ సౌమ్య పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశం నుండి ఇంటికి చేరుకునే సరికే ఆరు కావచ్చింది.ఆ రాత్రే వినోద్ కాంప్ ప్రయాణం.రోజువారి పనులతో పాటు ప్రతి ప్రయాణ సన్నాహం తన చేతులమీదుగా జరగాల్సిందే.”ఎంత మొత్తుకున్నా మానవుడిలో మార్పు లేదు. ఏమంటే ఆఫీసు పని ఒత్తిడి పోజు…తనేమొ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండ ఇంటి పట్టునే ఉన్నట్టు.” తనలో తానే ఉడుక్కుంది వైశాలి. ఉడుక్కుని మాత్రం ఏం చేయగలదు పాపం ..మనసుకీ చేతలకూ సంఘర్షణ తప్ప.ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడ వాళ్ళ ఇంటి చాకిరీకి విముక్తి లేదు.మగ వాళ్ళ ప్రయాణసన్నాహాలు భార్యామణుల చేతిమీదుగా జరిగి తీర్చాల్సిందే .తప్పదు సరే. మరి భార్యామణి కాలు బయట పెట్టాలంటే తన ప్రయాణ సన్నాహం తోపాటు ఇంట్లో పిల్లలకే కాదు పతిదేవుడికి అన్నీ అందుబాటులో ఉంచి కాలు కదుపాలి.”ఏవేవో రకరకాలుగా ఆలోచిస్తూ పెద్దగా నిట్టూర్చింది వైశాలి.ఏ నిట్టూర్పులు..సంఘర్షణలు..అలసటలు వినోద్ ప్రయాణాన్ని అడ్డుకోలేదు.టంచనుగా రాత్రి పదకొండు గంటలకు ముంబాయి ట్రేన్ కాచ్ చేసాడు.పనులకు ముక్తాయింపు పలికే సరికి గడియారంలో డేటు వారం మారిపోయినై.బెడ్ రూంలోకి నడచుకుంటూ పోతుండగా గోడమీది కాలెండరు పలకరించింది ఓ తేదీ దగ్గర రైట్ మార్క తో.దాన్ని చూస్తేగాని సుమన పెళ్ళి మరునాడే అని గుర్తు రాలేదు వైశాలికి.ఆ అమ్మాయి కోసం పెళ్ళికి అటెండెన్స్ వేసుకోక తప్పదు. ఇంకా ఏవేవో ఆలోచిస్తూనే బెడ్ పై వాలిపోయింది. ఆలోచనలను ఏవైనా వాటిని అలసట డామినేటు చేయడంతో నిద్రాదేవత ఆమెను ఆవహిం చింది.
****************
అదే పనిగా మోగుతూ నిద్రాభంగం కల్గించిన గడియారం నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది వైశాలి ఓ అర గంట తర్వాత లేద్దామని.ఈ సారి ఆమెను పాల బ్బాయి కాలింగ్ బెల్ లేపింది .దానర్థం ఏడైందని.నాలిక్కరుచుకుంటూ లేచింది .వారం రోజులుగా పని మనిషి కూడా రావడం లేదు.అంతా భిన్నత్వంలో ఏకత్వమే.ఆమె పాచిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఈదుకొస్తుంది.భర్త మాత్రం పున్నమ అమాసకన్నట్లు కూలికి పోయి తాగి తందనా లాడుతూ కుటుంబానికి భారంగానే మిగిలిపోయాడు.పైగా వారం రోజుల కింద తాగిన మైకంలో ఓ మోరీలో పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. “మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం.మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం.కానీ మద్యానిది మాత్రం ప్రభుత్వ ఆదాయం వైపే మొగ్గు .ఈ విషయాలన్నీ ఆమె ను ప్రతి రోజూ కలత పెడుతున్నవే. పెళ్ళి 8.45కే అని ఉంది. ఊడ్వడాలు తుడువడాలు పనికి నడుం బిగించి యమ స్పీడుగా పూర్తి చేసి స్నానం వగైరాలు ముగించి గోడ వైపు చూస్తే పది హేను నిమిషాలే ఉంది పెళ్ళి టైం సుమా అన్నట్లు గడియారం హెచ్చరించింది.కాఫీ తో తృప్తి పడ మని ఆత్మారాముడికి నచ్చ చెప్పి ఇంటి నుండి బయట పడింది వైశాలి.వెతుకుతున్న కళ్ళకు ఒక్క ఆటో కనపడి చావలేదు .మరో నాలుగడుగులు ముందుకు వేసింది.ఐనా ఆటోలు కనపడలేదు. కన పడ్డా రద్దీతో.చౌరస్తాలో దొరకవచ్చన్న ఆశతో కాళ్లకు పని చెప్పింది.సడెన్ గా పక్కనే ఓ కారు ఆగ డమే కాదు డోరూ తెరుచు కుంది .
“వైశాలీ ఎచటికోయి నీ పయనం” అంటూ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ వైశాలీ స్నేహితురాలు సరళ పలకరింపు.
“ఓ పాత విద్యార్థిని పెళ్ళికి” కొంచెం ఆరాటంగానే సమాధానమిచ్చింది వైశాలి.
“పెళ్ళెక్కడ?”
“లక్ష్మీ గార్డెన్స్. ఒక్క ఆటో దొరికి చాపడం లేదు.”అంది ఆతృతగా.
“నేనూ అటే. అమ్మ వాళ్ళింటికి.కారెక్కేసెయ్.”సరళ. బతుకు జీవుడా అనుకుంటూ కారెక్కింది వైశాలి
“మాఇంటి దారే మరిచిపోయినట్లున్నవ్?”వైశాలి
“మరిచిపోవడమా పాడా? టైం దొరికితే కదా! డిసెంబరంతా తేజస్వితోనే సరిపోయిం దనుకో. తునున్నన్ని రోజులూ చుట్టపక్కాలు ..తన స్నేహితులు….వంటా వార్పులు..షాపింగులు.. ఒకటా రెండా…సమస్తం నామీద దాడి చేసాయనుకో.ఫ్లైటెక్కే వరకు ఊపిరాడలేదనుకో.” సమా ధానం చెప్పింది సరళ.
“అదీ నిజమే. నాకు తెలియందేముంది. తరుణ్ వచ్చినప్పుడు నా కథ కూడా అంతే. ఏమరికానో ఏమో?పిల్లలు వచ్చే వరకు నిరీక్షణ. వచ్చింతర్వాత అదో ఒత్తిడి.తిరుగుముఖం పట్టిం
తర్వాత అదో రంది.”అంటూ వివరణ ఇచ్చింది వైశాలి
“ఆటో దొరకకపోవడం ఒకందుకు మంచిదే ఐంది కదూ!”అన్నది సరళ
“అదీ నిజమే..కాని ఎందుకు దొరకలేదంటవ్?” తన సందేహాన్ని వెలిబుచ్చ్ంది వైశాలి
” తర్వాత మూడాలు వస్తున్నాయట .రెండునెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవట. అందుకే మంచి రోజంటూ ఇవాళ్ళ్టి ముహూర్తంపై అందరి దాడి.” సరళ
“ఏం ముహూర్తాలో ? ఏం మూడాలో? ఏం జాతకాలో? అన్నీ చూసి చేసినా ఎన్నో దురదృష్టాలు.” వైశాలి
“వాటికిచ్చే విలువను మనుషుల వ్యక్తిత్వాలకివ్వడం లేదు. ప్రపంచమంతా డబ్బు మయం ఐపోయింది.” సరళ
“అది సరేగాని మీ అమ్మదగ్గరినుండి వచ్చేప్పుడు మా యింటికి రాకూడదూ? మా ఆయన కూడా ఇంట్లో లేరు “అడిగింది వైశాలి .
” ఐతే మరీ మంచిది. కొంచెం ఫ్రీగా గడపొచ్చు.కానీ నేనొచ్చేవరకు నాలుగవుతుందేమో?” అంది సరళ
“ఐతే ఏంటట? బహుషా ఒంటిగంటకల్లా నేనింట్లో ఉంటాననుకుంట.”వైశాలి
“ఓకే డన్”అంటూ సరళ చెయ్యి కలిపింది.
వాళ్ళ మాటల్లోనే లక్ష్మీ గార్డెన్ వచ్చేసింది .బైబై చెప్తూ కారు దిగిన వైశాలి కాళ్ళు హాలు వైపుగా సరళ కారు వాళ్ళమ్మ ఉండే కృష్ణ కాలనీ దిశగా కదిలినై.వైశాలి లక్ష్మీగార్డెన్స్ ముఖద్వారం చేరుకుంది.పార్కింగ్ ఏరియా రకరకాల కార్లతో నిండిపోయిఉంది ఓ కార్ల ఎగ్స్ బిషన్ లా. ముహూ ర్తం దగ్గర పడుతుండటంతో కొంచెం ఆరాటంగానే అడుగులు వేసింది.ముఖద్వారానికి ఒకవైపు
వధూవరుల ఫొటోలు..మరో వైపు అమ్మాయి తల్లిదండ్రుల ఫొటోలు ఆహ్వానితులుగా. .అన్నిటినీ మించి పౌరాణిక సినిమాల్లో లాగా ఇద్దరు ద్వారపాలకులు అందమైన కట్టెలను ఇంటూ ఆకారంగా పట్టుకొని .ఇదేదో రాచ మర్యాదలా ఉందనుకొని మరో అడుగు ముందుకు వేసింది.కాని ఆ ఇంటూ ఆకారం భీష్మించుకుంది.పోవడానికి వీల్లేదంది.అది వి ఐ పి లద్వారమని తేల్చి చెప్తూ ఓ ద్వార పాలకుని చెయ్యి రెండో గేటుని సామాన్యుల దారిగా చూపిం చింది.వైశాలికి ఆ తీరు అసౌకర్యం గానే కాదు కొంత అవమానంగా కూడా ఫీలైంది. చేసేదేంలేక లోపలికి నడిచింది. పూలవాసనల గుబాళింపు నాసికారంధ్రాలను అదరగొడ్తుంది.తోరణాలు.. డేరాలు..నడిచే దారంతా ఎప్పటి తివాసీలు.. కళ్ళు జిగేల్మంటున్నైడెకరేషన్ అదిరి పోయింది.అది పోస్ట్ హోదాను అద్దం పడు తుంది.హాలంతా అతిథులతో నిండిపోయింది. సీటు ఖాళీగా ఉన్న దాఖలా కనపడలేదు.వైశాలి తన కళ్ళకు పని చెప్పింది సీటు వెతుకమని. ఈ లోగా ఆపద్బంధవిలా సుమన స్నేహితురాలు
మానస ” నమస్కారం” అంటూ పలకరించి ఓ సీటు చూపించింది. “బ్రతుకు జీవి ” అనుకుంటూ వైశాలి ఆ సీటుకు పాత్రత్వం కల్పించింది.
స్టేజ్ వైపు తిరిగిన వైశాలికి వధూవరుల జిలకర బెల్లం కార్యక్రమం కనిపించింది. సమయానికి చేరుకున్నందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది.అదేదో తను చేరకపోయుంటే ఆ కార్యక్రమానికి సార్థకత ఉండేది కాదేమో అన్నంత ఫీలింగ్ తో.ఆ ఆలోచన రాగానే తనలో తానే నవ్వుకుంది.ఒకసారి హాలంతా కలియ చూసింది.సీతాకోకచిలుకలు వచ్చి వాలాయేమో అన్నంతగా మహిళామణుల చీరా జాకెట్లు..గాగ్రాలు..లంగాలకంత ఓణీలు..ఒక దానిని మించి
మరోకటి.ఒళ్ళంతా తాపడం చేసుకున్నారేమో అనే బ్రమను కల్పించే కళ్ళకు మిరుమిట్లుగొలిపే
నగలు .ఒయ్యారాలు ఒలుకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ యువతరంగిణులు.”ఆ అలంకరణలో
అందం చందం సరే.కాని ఈ ఎండల్లో శరీరం వాటిని ఎట్లా తట్టుకుంటుందో పాపం.”వైశాలి తనలో తానే ప్రశ్నించుకుంది వైశాలి తనలో తాను.ఐనా పీత కష్టాలు పీతవి.కందకు లేని దురద
కత్తికెందుకట అని సమాధానమూ తానే చెప్పుకుంది.
మరోసారి వేదిక వైపు దృష్టిని సారించింది. దానికి దగ్గరగా క్రేన్ వంటిదేదో పైకి ..కిందికి…కుడి…ఎడమలుగా కదులుతూ కనిపించింది.కొంచెం గమనిస్తే అది ఫొటోలు తీస్తుందని అర్థమైంది. వేదిక మీదకు చేరి కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళ ఇబ్బంది కొంత తొలగిపోతుందని తృప్తి పడింది.
తెలిసిన తలకాయలేమైనా కనపడుతాయేమోనని హాలంతా కలియచూసింది.ప్చ్..లాభం లేకపోయింది.కాని ఆ కళ్ళకు హాల్లో ఐదారు చోట్ల ప్రొజెక్టర్లు కనిపించాయి.వాటిలో పెళ్ళి తంతును స్పష్టంగా చూడొచ్చన్నమాట.. “అంటే ఏంటన్నట్లు ” తనకు తానే ఓ ప్రశ్న వేసుకుంది.
“పెళ్ళికంటూ వచ్చి ఆ పెళ్లిని స్పష్టంగా చూడలేక ప్రొజెక్టర్ లో పెళ్ళి చూడట మన్నమాట. ”
అనుకుంటుండగానే ఆ ప్రొజెక్టర్ లలో పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు విభిన్న భంగి మలలో దిగిన రకరకాల ఫొటోలు కనపడుతున్నాయి.బహుషా దాన్నే ఫొటో షూటింగ్ అంటారేమొ . ఈ మధ్య పిల్లలు మాట్లాడుకుంటుంటె విన్నాను.కొత్త నాగరికతలు.. సరికొత్త సంప్రదాయాలు. ఎవరి ఆనందం వాళ్ళది.కాని ఈ డబ్బులున్న వాళ్ళు ఎన్ని తతంగాలైనా చేయొచ్చు. కాని పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు సాధారణ జనం సంగతేంటి?”లక్ష ఆలోచనలు వైశాలి మనస్సులో.
“.వైశాలి ఆలోచనలను భంగం చేస్తూ ధన్ ధన్ మంటూ బాండ్ మోత.ఆ గర్జనకు సమాంతరంగా పెళ్ళి కొడుకు సుమన మెడలో తాళి కడుతున్న దృశ్యం మెరుపులా.కాని వేదిక మెట్ల దగ్గర నల్ల సఫారీలతో బలిష్టమైన కండరాలతో కొందరి ఉనికి దాదాల్లా.
.”ఓహో! వీళ్ళనే బౌన్సర్లు అంటార”ని గుర్తుకొచ్చింది వైశాలికి.
“పెళ్లిలో రౌడీలు లేరే..మరి గొడవ చేసే వాళ్ళెవరు.అంతా అతిథులే కదా!”మళ్ళీ తనలో తనే ప్రశ్నించుకుంది వైశాలి.అమ్మాయి మెడలో మంగళసూత్రం పడిందో లేదో…కనీసం వధూవరులకు వేదిక మీద కుర్చీలను వేయనే లేదు. హాల్లో జనమంతా లేచి బిలబిలమంటూ వేదిక వైపు దండెత్తినంత పని చేసారు.వెంటనే బౌన్సర్లు రంగంలోకి దిగారు.కేవలం పదిమంది చొప్పున మాత్రమే వదలడం మొదలు పెట్టారు. కాని ఆ తతంగం ఓ పదినిమిషాలు కూడా సాగ లేదు. ఆ జన వాహినికి బదులుగా రాజకీయ వాహిని కనపడింది.వచ్చిన రాజకీయ ప్రముఖుడు
యం. యల్. ఏ అని అర్థమైంది. కాని వెనుక ఉన్న జనం..నాయకుల హోదాను చూపించడానికి వచ్చే జనమని జగమెరిగిన సత్యమే. “ఆ నాయకుల వెంట ఉన్నప్పుడు సంఖ్య పక్కన సున్నాలు. వాళ్ళే లేకపోతె కేవలం జీరోలు” తనలో తాను నవ్వుకుంది వైశాలి. బహుషా వాళ్ళు వస్తున్నట్టు సుమన తండ్రికి ముందే సమాచారముందేమొ…వేదిక దిగి వాళ్ళను ఎదుర్కొని వచ్చాడు. మందస్మిత ముఖారవిందాలతో అక్షతాశిస్సులు..కరచాలనాలు..ఆత్మీయ ఆలింగనాలు..ఫొటో దిగటాలు..అన్నీ కళ్ళు మూసి తెరిసే లోపె.ఆ వాహిని సుమ వాళ్ళన్నయ్య అసిస్టెన్స్ లో డైనింగ్
హాలు దిశగా సాగింది.మళ్ళీ జనవాహిని మంద్రంగా…బౌన్సర్ల అదుపాజ్ఞల్లో.
వైశాలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి.బ్రేక్ ఫాస్ట్ చేయనందుకు తనను తానే తిట్టుకుంది.లేచి ఆ లైన్లో కలుద్దామనే అనుకుంది . కానీ చీమ కూడా దూరడానికి వీలు లేదన్నట్లు
ఆ లైను కదులుతుంది.” ఇంటి దారి పడితే…” మరో ఆలోచన.”ఉడికే దాక ఉన్న ఓపిక ఉమ్మొగిలే
దాక ఉండాలి కదా! పైగా సుమన ఫీలౌతుంది. లాభం లేదు. ఉండి తీర్చాల్సిందే . ఓపిక పట్టా ల్సిందే” నిర్ణయానికి వచ్చింది.ఆకలిని జయించడానికా అన్నట్లు తన చూపులను వేదిక వైపు తిప్పింది.దానికి కుడి వైపుగా యువతుల గుంపు దాండియా ఆడుతూ..నవ్వుతూ ..తుళ్ళుతూ..
ఆనంద డోలికల్లో. “సరదాకు అవకాశం కల్పంచిన పెళ్ళి సందడి.” అనుకుంది వైశాలి.ఆమె చూపులు వధూవరులను వెతికాయి.కాని ఆ చూపులకు భంగపాటు ఎదురైంది.ఎందుకిలా జరి గిందనుకుంటూ ఎడమ వైపుగా కదిలిన ఆ చూపులకు చప్పుళ్ళతో ఓపెన్ స్పేస్ వైపు పూజారితో సహా పోతున్నట్లు తెలిసింది.” పగలే వెన్నెలలో అబ్బాయి అమ్మాయికి అరుంధతీ (లేని)నక్షత్ర దర్శనం చేయిస్తాడేమొ.తప్పదు మరి ఈ అమ్మాయీ అరుంధంత పవిత్రంగా.. పతి వ్రతగా ఉంటేనే ఆ వరుడి జన్మ సార్థకం. !”గొణుక్కుంది తనలో తను. ఎంతకీ లైనుకు ముక్తాయింపు
కనపడక పోవడంతో కొందరు క్యూ ను క్విట్ చేసి భోజనాల దారి పట్టారు.దాంతో లైను కొంచెం పలుచ పడ్డది. ఒంటిగంటకా వస్తుంది. ఆకలి ఆగలేనంటుంది. వైశాలి లేచింది.లైన్లో కి చొచ్చుక పోయింది.ఆమె వెనుక మరికొందరాడవాళ్ళు.ఆ తర్వాత చాలామంది అచ్చంగా పరీక్ష హాల్లో విద్యార్థుల్లా. మొత్తానికి వైశాలి ఆడవాళ్ళకో దారి చూపించినామె ఐంది.వెనకాల ఉన్న మగ
మహారాజులు మొదట కొంత బిత్తర పోయినా ఆ తర్వాత తమ ఓపికను పరీక్షించే సత్తా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తూ తమ చేతుల్లో ఉన్న అక్షతలను నిలబడిన చోటినుండే (ఉద్యమ కారులు బస్సులపై రాళ్ళు విసిరినంత స్పీడులో )వధూవరులపైకి విసిరి డైనింగ్ హాల్ దారి పట్టారు.
” పెళ్ళి కి వెళ్ళి రావడాన్ని మొత్తంగా ఐదు అధ్యాయాలుగా విభజించ వచ్చేమొ.వెళ్ళడం
మొదటి అధ్యాయం కాగా..పెళ్ళి తతంగం పూర్తయ్యే వరకు నిరీక్షించి వేదిక చేరుకొని వధూవరు లను కలవడాలు రెండు మూడు అధ్యాయాలు కాగా భోజన కార్యక్రమం నాలుగు తిరిగి వాహనం దొరికి ఇంటికి చేరుకోవడం ఏదో అధ్యాయం.దానితో పెళ్ళి తతంగం సమాప్తమన్న మాట.”అని తీర్మా నించుకున్న వైశాలి ఆరాటంతో కదిలి అక్షతలతో ఆశీర్వదించి సుమన చేతిలో తను తెచ్చిన
గంగు నవల ను కానుకగా ఇచ్చింది .తనను చూసిన సుమన సంతోషానికి అవధులు లేవు.ఉబ్బి తబ్బిబైపోయింది .ఉన్నఫళంగా పాదాభి వందనం చేసింది.ఆ అమ్మాయి ఆనందం చూడగానే అంతసేపు వైశాలి పడ్డ యాతన మటు మాయమైంది. పెళ్ళి కొడుకుతో పాటు తన తల్లితండ్రులకు తన టీచర్ ను సుమన పరిచయం చేసినా అవి మొక్కుబడి పలకరింపులే అయ్యాయి. భోజనం తప్పకుండా చేయమని ఆ అమ్మాయి అభ్యర్థన.తప్పదన్నట్లు వైశాలి డైనింగ్ హాలు వైపు దారి తీసింది.
****************
డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతున్న వైశాలికి అక్కడే ఏదో పార్టీషియన్ కనిపించింది.దానిముందూ ధవళ వస్త్రముల వేత్రహస్తులు …వేత్రములను ఇంటూ ఆకారంగా పట్టుకొని.అటువైపు వెళ్లిన వాళ్ళందరిని ఓ ఖద్దరు శాల్తీ జనరల్ డైనింగ్ కు వెళ్ళాల్సిందిగా సూచిస .ఆ సూచన ఓ వృధ్ధదంపతులకూ చేరింది.హాలంతా దోస..పానీ పూరి.. సమోసా చాట్ ..ఐస్ క్రీం..స్వీట్స్ ..ఫ్రూట్స్ వంటి తిను బండారాలతో ముస్తాబై ఉంది .అన్నం..పప్పు ..కూరలు..వంటి కూరలు షరా మామూలే. వైశాలి మనసు భోజనం వైపే మొగ్గు చూపింది .అన్ని చోట్ల ఉన్నట్లు అక్కడా అంతే రద్ది.ఐనా తప్పదు.ఇంట్లో తిండి ఎట్లగూ సిద్ధంగా లేదు.ఇక్కడే
ఇంత ఎంగిలి పడుదామని ముందుకు కదిలింది.ప్లేట్ లో రెండు నాన్ ముక్కలు..ఓ కూర.. పప్పు ..కొంచెం అన్నం పెట్టుకొని పక్కకు జరిగి తినడానికి ఉపక్రమించింది .నాన్ నుండి ఓ చిన్న ముక్క
తీసుకుందామని ప్రయత్నం చేసింది. కాని దాని నుండి ముక్క భీష్మించుకుని చినగను గాక చినగనంది.మొత్తానికి వైశాలి విశ్వప్రయత్నంతో చేతిలోకి ఓ ముక్క చేరింది.కూరను చేర్చి నోట్లో పె
ట్టుకుంది.నోరంతా నూనె మాయమవటమే కాదు ఆ నాన్ ను పళ్ళు నమలలేమని తేల్చి చెప్పు తున్నాయి.తినడానికి మరి కొంత ప్రయత్నం చేసింది . అన్నమైనా తిందామనుకుంటే సరిగా ఉడుకనే లేదు.ఇక లాభం లేదనుకొని ప్లేటును టబ్ లో చేర్చింది.ఆ టబ్ ను చూసి వైశాలి మనసు జాలితో నిండి పోయింది.పాపం దాని నిండా తినకుండా మిగిలిన ఆహార పదార్థాలూ నిండి పోవ
డంతో మా దీనావస్థను చూడండని వేడుకుంటుంటున్నాయి.
చేతులు కడుక్కొని వస్తున్న వైశాలికి ఇందాక కనిపించిన పెద్దవాళ్ళు ప్లేట్ల భారంతో నిలబడక..తినలేక.” డబ్బు దర్పం ఉన్న వాళ్ళకేమొ టేబుల్ ముందు కూర్చొని తినే సౌకర్యవంత మైన ఏర్పాట్లా?ముసలి ముతుక..పిల్లా జెల్లా నానా అగచాట్లు పడాలా? “ఎవరినీ ప్రశ్నించలేక
తనలోతానే గొణుక్కుంది.ఇక ఇంటి దారికై ఎక్సిట్ వైపు పోతుండగా ఆ పెద్దాయన జారి పడబోగా
ఎవరో ఒకాయన గబుక్కున ఆసరా ఇచ్చాడు. లేదంటే పాపం ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుని హాస్పిటల్ కు ఆదాయం పెంచేవాడు.అక్కడంతా నీళ్ళ రొచ్చుందని వైశాలి కళ్ళు గమనించాయి.
“పాపం ముసలాయనచస్తుండే . జర అసొంటిదెవతొ పొయ్యి చేతులు కడుగొచ్చు కదా”
ఓ గొంతు ప్రశ్న.
” సగం తాగిన గిలాసలు సుత ఏడంటె ఆణ్ణే పెట్టవట్టరి.మల్లంత సదివిన మారాజులే.”ఓ పనామె
“కూరనారలు సుత నిలబడ్డకాన్నే ఎయ్యవట్ట్రి. బగ్గ నగలు దిగేసుకొని షోకు షోకు బట్టలేసుకోంగనే సరిపోతాది?”ఇంకో పనామె
వాస్తవాలైన వాళ్ళ మాటలను వింటూ “చదువు వల్ల వివేకం కలిగే రోజులకు కాలం చెల్లి
పోయిందని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడినుంచి నిష్క్రమించింది వైశాలి.
****************
వైశాలి ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుందో లేదో మంచానికి తన శరీరాన్ని అప్పచెప్పింది. పెళ్ళి వాతావరణం కారణంగా ఆమె పై ఆకలి ..అలసట…అశాంతి ముప్పేటలా దాడి చేసాయి. కాని ఆ మూడింటిని నిద్రాదేవత జయించింది.నాలుగింటి వరకు ఆమెకు తోడుగా నిలిచి కాలింగ్ బెల్ చప్పుడు తో బై బై చెప్పి వెళ్ళిపోయింది. తలపు తీసిన వైశాలికి సరళ కనపడటంతో నాల్క కరచుకుంది.
“మంచి నిద్రలో ఉన్నట్టున్నవ్? డిస్టర్బ్ చేసానేమొ?”అంది సరళ
“అదేం లేదు.రెండు గంటలు మాంచి నిద్ర పోయాననుకో రా! రా! .”అంటూ డైరెక్ట్ గా వంటింట్లోకి దారి తీసింది.
“కాసేపు ఇక్కడే కూర్చొని ముచ్చట్లాడుదాం. ఎట్లాగూ మీ ఆయన కూడా లేరు కదా! ఇవాళైనా ఆ వంటింటి గొడవను మరిచిపోదాం. పైగా నువ్వేమొ పెళ్ళి భోజనం …నేనేమొ అమ్మ చేతి వంట.” సరళ.
“పెళ్ళి భోజనమా? మరేమన్నానా? “అంటూ తన ఆకలి ఘోషకు కారణాలన్నిటినీ పెళ్ళి
తతంగాలతో పాటు సరళ ముందు కుమ్మరించింది వైశాలి.
“నిజమే వైశాలీ ! ఈ మధ్య కాలంలో పెళ్ళి పిలుపులకు..కల్పించే సౌకర్యాలకు.. ఏమా త్రం పొంతన ఉండటం లేదు..హోదా ప్రదర్శనలకిచ్చే ఇంపార్టెన్స్ ఆతిథ్యానికి లేదు.”
“ఔననుకో. కాని చిన్న సవరణ. రాజకీయ నాయకులకు …డబ్బును మారాజులకు మంచి ఆతిథ్యమే ఇస్తారు.”సరళ
“అదే కదా! నేననేది.వాళ్ళకేమొ ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా …టేబుళ్ళు.. కుర్చీలు.. వడ్డనలు…మర్యాదలు…సమస్తం.మిగిలిన వాళ్ళేమొ ప్లేట్లను అడుక్కునే చిప్పల్లాగ పట్టుకొని
అన్నం పప్పు ..కూరా ..చారంటూ లైన్లో.”బాధతో అంది వైశాలి.
“ఆ లైనైనా సరిగా ఏడ్చి చస్తుందా అంటే అదీ లేదు.నేను వడ్డించుకుని వెనక్కి తిరుగు తున్నానో లేదో ఓ వీర వనిత నా నెత్తి మీదుగా ప్లేటు పెట్టి కూర వేయించుకోవడంలో నా బ్లౌజు ను కూడా పావనం చేసింది.ఆ బ్లౌజిప్పుడు డ్రై క్లీనింగ్ దర్శనం చేసుకోక తప్పదు.”మళ్ళీ చెప్పుకొచ్చింది వైశాలి .
“జనాన్ని పిలిచి అవమానించడమంటే ఇదేనేమొ.”సరళ
“ఈ పెళ్ళిలో అతిథి దేవో భవ..గురు దేవో భవ..రెండు అభాసుపాలైనై. అఫ్ కోర్స్.. ఇందులో సుమన ప్రమేయం లేదనుకో.” సుమనకు మాట రాకూడదన్నట్లు మాట్లాడింది వైశాలి.
“శిష్యురాలంటే ఎంతభిమానమో..నాకూ ఈ అనుభవాలు చాలానే ఉన్నాయి.”నవ్వింది సరళ.
“అందరి అనుభవాలూ అవేనమ్మా! మార్గాన్వేషణ చేస్తే బాగుండు.”వైశాలి
” ఎవరో ఎందుకు .పిల్లి మెడలో గంట కట్టడంలా.మనింటి పెళ్ళిల్లే నాంది .”
” ఓకే డన్ “అంటూ ఇద్దరు చేతులు కలుపుకున్నారు.మాట్లాడుతూనే వైశాలి వెజిటేబుల్ కమ్ టమాటా బాత్ ను ఆరగించి టీ సేవించారు.ఆపై ఎన్నో సామాజికాంశాలూ వాళ్ళ చర్చలలో వచ్చాయి.గోడ గడియారం ఏడైందని హెచ్చరించడంతో “ఇక నాకు సెలవియ్యి తల్లీ”అనుకుంటూ ఉన్నఫళంగా లేచింది సరళ.
“ఇంకాసేపుడ్డొచ్చు కదా!”బతిమాలింపు ధోరణిలో.
“మా మానవుణ్ణి ఎంత సేపు నిరీక్షణలో పెట్టమంటావు.?”
“మనలాగా నిరీక్షణలు తట్టుకునే శక్తి వాళ్ళకెక్కడిదిలే. “అంటూ సరళను సాగనంపింది
వైశాలి.
****************
ఓ సంవత్సర కాలం గడిచింది.యాదృఛ్ఛికమో …ప్రణాళికో…డిసెంబరు నెలలో తరుణ్
తేజస్వి ఇండియాకు వచ్చేసారు.తామిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామంటూ పెళ్ళి ప్రపోజల్ ను తల్లి కతండ్రుల ముందుంచారు.ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కే కారణాలు కన్పించలేదు. ఒప్పేసు కున్నారు కూడా.రెండు కుటుంబాలు కూచుని రిజిస్టర్ మారేజ్ కమ్ రిసెప్షన్ అరేంజ్ చేసు కున్నా రు. అంటే రిసెప్షన్ హాల్లో నే రిజిస్టేషన్ జరిగేట్టు.మొత్తంగా ఆహ్వానితులను రెండు వందలకు పరిమితం చేసుకున్నారు. వేదికకు ఒకవైపు సుమధురగాన లహరిని ఏర్పాటు చేసారు. అతిథు లంతా హాయిగా టేబుళ్ళ ముందు కూచుని హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించగల్గిన వాతావరణం
కల్పించారు.హాలులో “అతిథి దేవో భవ”. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” “భోజనం న పరిత్యక్త
వంటి బానర్లను ఏర్పాటు చేసారు.వచ్చిన వాళ్ళందరిని పేరు పేరునా పలకరించారు.పసందైన విందునిచ్చి వీడ్కోలునిచ్చారు.ఈ బాట పదుగురికి ఆదర్షం మరేమున్నది.
కాలింగ్ బెల్ మోతతో తలుపు తీశాడు కార్తీక్. ఎదురుగా మూతికి మాస్క్తో, శానిటైజింగ్ చేతులతో, పక్కనే వుంచిన ఓ రెండు బ్యాగులతో కనిపించాడు కార్తీక్ మిత్రుడు రాఘవ.
“రారా రాఘవా చాన్నాళ్లకు బుద్ధి పుట్టింది నీకు!”
మిత్రుణ్ని ఆహ్వానించాడు.
రాఘవ పళ్ళు తీసుకొచ్చే సమయానికి కార్తిక్ భార్య , వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకుకు తల పై తడిబట్ట వేస్తూ వాడిని బుజ్జగిస్తున్నది .
ఏమైందిరా ? అని రాఘవ అడుగుతుంటే , ఉదయం నుండి బాగా జ్వరంగా ఉన్నదిరా అన్నాడు బాధగా కార్తిక్.
“మొన్న ఊరెళ్లాను కార్తీ…. తోటలో బత్తాయిలు, సంత్రాలు తెంపించాడన్నయ్య. నీకు కొన్ని తెచ్చాను.”
“ఈ కరోనా టైమ్ లో ఇమ్యునిటీ ఫ్రూట్స్…. చాలా థ్యాంక్స్ రా!” అంటూ ఆ పళ్ళ బ్యాగులందుకున్నాడు కార్తీక్.
“అమ్మ కనిపించటం లేదురా కార్తీ?” అటూ ఇటూ కలయ చూస్తూ అడిగాడు రాఘవ.
టి.వి.లో కరోనా న్యూస్ వింటూ “ఈ సెకండ్ వేవ్ ముసలోళ్ళ కన్నా వయసు వాళ్లపైనే దాడి చేయడం బాధాకరం రా!” అన్నాడు కార్తీక్.
“అంటే కార్తీక్… ముసలివాళ్ల ప్రాణాలు విలువైనవి కావంటావా?”
“ఎంతైనా కాటికి కాళ్లు చాచుకున్న ముసలోళ్లకన్నా, బాధ్యత, భవిష్యత్తూ వున్న యువత ప్రాణాలు విలువైనవి కద రాఘవా?”
“కాదనటం లేదు…. కానీ పిల్లలను కనిపెంచి పెద్దచేసి, యువతకు దిశా నిర్దేశం చేయగల జ్ఞానసిద్ధులు వృద్ధులు! వారు మమతల కోవెలలు…. గత వైభవాల జ్ఞాపకాలు కదరా పెద్దలంటే!” అన్నాడు స్పందనా స్వరంతో రాఘవ.
“సర్లేరా…. పద భోం చేద్దాం” అంటూ మిత్రుడి చేయందుకున్నాడు కార్తీక్.
“అమ్మ అగుపించడం లేదురా… నేనొస్తే తను బయటికి రాకుండా వుంటుందా? ఒంట్లోగాని బాగా లేదా?”
అంటూ హాల్ కెదురుగానున్న గదిలోకి వెళ్ళి చూశావా రాఘవ.
“కార్తీ…. అమ్మేదిరా ఏమైందిరా?” ఆదుర్దాగా అడిగాడు మళ్లీ.
“ఏం కాలేదుగానీ…. పద భోం చేద్దాం. వడ్డించు పద్మా!” అంటూ భార్యకు చెబుతూ, మిత్రుడి భుజం తట్టాడు కార్తీక్.
“నో… అమ్మను చూడందే… అమ్మను పలకరించందే అన్నం తినను!” సోఫాలో కూర్చుంటూ పట్టుదలగా అన్నాడు రాఘవ.
ఏం మాట్లాడలదు కార్తీక్.
“చెప్పరా అమ్మెక్కడ?” రెట్టించాడు రాఘవ.
“నాన్నమ్మను నాన్న ఓల్టేజ్ హోమ్ కి పంపించాడు!”
కార్తీక్ కూతురు నాలుగేళ్ళ పాప చెప్పింది. ఉలికిపాటుగా చూశాడు రాఘవ.
“కారణం?” కలవరపాటుగా అడిగాడు కార్తీకు నుద్దేశించి.
“అమ్మ తల తిరుగుడే కారణం!”
“అదేంట్రా? ఎంత మంచిది అమ్మ! అంత తల తిరుగుడు పనులేం చేసిందని?”
“పనులు కావురా… రోగం… తల అటూ ఇటూ ఊగుతూ…. అలా…. ఆర్నెల్లయింది!” అదోలా అన్నాడు కార్తీక్.
“అయితే… అంత మాత్రాన…” బాధ రాఘవ గొంతులో.
“ఒరే రాఘవా… అలా ఎప్పుడూ ఆమె తల అడ్డంగా అటూ ఇటూ ఊగుతూ వుంటే, కాదు… కాదు… అంటున్నట్టుగా నాకు నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటే…. భరించలేకపోయేవాడిని!” అసహనంగా అన్నాడు కార్తీక్.
“ఒరే కార్తీక్…. అమ్మ శారీరక వ్యాధి కూడా నీకు…. భరించలేని మానసిక బాధేనా? ఆమె అనారోగ్యాన్ని, బాధనూ కూడా అర్థం చేసుకోలేక వృద్ధాశ్రమం బాట పట్టించిన ఘనుడవు కదరా…..” బాధగా మిత్రుడివైపు చూశాడు.
“ఒరే కార్తీక్…. నీకో సంగతి చెప్పనా?”
“చెప్పరా!” చిన్నగా అన్నాడు కార్తీక్.
“లేక లేక పుట్టిన నిన్ను, మీ నాన్న చేసిన అతిగారాబం నిన్ను మొండివాడిగా మార్చింది! ఏది చెప్పినా ఔనంటే కాదు… కాదంటే ఔనంటూ ప్రతిదానికి తల అడ్డంగా ఆడించేవాడిని గుర్తుందా? నీ చిన్ననాడే మీ నాన్న పోయాక, నీ నెగెటివ్ సమాధానాల భారమంతా అమ్మపైనే పడిందిరా! అమ్మ ఏం చెప్పినా మొండిగా తలటూ ఇటూ ఆడించి సతాయించే నీతో వేగలేకపోయేది. అయినా అన్నీ భరించింది. అప్పట్లో ఒకే ఊళ్ళో, ఒకే స్కూళ్ళో నీతోపాటు చదువుచున్న, అమ్మలేని నన్నెంతో ఆదరించిన ఈ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడేది. నీ స్నేహాన్ని వీడవద్దని వేడుకునేది!”
“రాఘవా!” చిత్రంగా చూశాడు కార్తీక్.
“ఔనా…. అన్నింటికి అడ్డంగా తలాడించే నీ నెగెటివ్ తత్త్వాన్ని ఒంటరిదైన అమ్మెలా సహించిందో…. నిన్ను చదివించి ఇంతవాణ్నెలా చేసిందో…. అమ్మ మాటకు అడుగడుగునా తల అడ్డంగా ఆడించే నీ నెగెటివ్ థాట్స్ ను తన తల్లి తనపు పాజిటివ్ రెక్కలతో నిన్నెలా కాపాడుకున్నదో….. తన ప్రేమతో నిన్నెలా ఓ మనిషిని చేసిందో…. ఆ మాతృమమతనెలా మరచిపోయావురా?”
“ నీ కొడుకు కు జ్వరం వచ్చినట్లే నీకెన్నిసార్లు వచ్చుంటుందో జ్వరం నీ చిన్నప్పుడు “
కంటి చెమరింతతో రాఘవ కంఠం వణికింది.
“రాఘవా!” కార్తీక్ కళ్ళలో పశ్చత్తాపంతో కూడిన తడి కదలాడింది.
“చెప్పరా కార్తీ…. చిన్న నాటి నుండి నీ మనసుకున్న ఇగోతో, నీ నెగెటివ్ తత్త్వంతో…. ఎన్ని వేలసార్లు తల అడ్డంగా ఆడించేవాడివో…. అయినా ఆ తల్లి ఒడి నీకు ఓ బడిగా, గుడిగా ఎలా మారిందో…. ఎన్నడైనా ఆలోచించావా? అదే…. అదేరా అమ్మతనమంటే!” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవ.
ఆలోచనతో కూడిన ఆవేదనతో తలొంచుకున్నాడు కార్తీక్.
“కార్తీ…. ఆఖరుగా ఒక్క మాటరా…. రోగ్రగస్థురాలైన అమ్మ తల ప్రకంపనలనే భరించలేనివాడివి…. నీకు జన్మనిచ్చిన్నాడు అమ్మ ప్రసవ వేదనలో ఎన్ని వందల కాదు కాదు వేనవేల బాధా ప్రకంపనల బరువును ఆ తల్లి ఎలా భరించి వుంటుందో ఒక్కసారైనా ఊహించలేవా?”
“అమ్మా!” అంటూ అప్రయత్నంగా ఒక ఆర్థ్రతా పూరితమైన బాధా ప్రకంపనలతో కూడిన ఓ పిలుపు వెలువడింది కార్తీక్ నోటి వెంట.
“అమ్మతనమంటే ఏంటో అర్థమైందిరా! ధన్యవాదాలు రాఘవా…. పద… అమ్మను ఆశ్రమం నుండి తీసుకొద్దాం!” ఆగని కన్నీళ్ళతో అన్నాడు కార్తీక్.
- కె.వీణారెడ్డి
