పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై బయల్దేరింది. షాంఘై నుండి బీజింగ్ కు మరొక విమానమెక్కాలి. విమానం పైకెగరగానే పై నుంచి ఢిల్లీ నగరం పాపిడి బొట్టు, వడ్డాణం, మెడనిండా హారాలు, కాళ్ళకు మువ్వలతో సహా సకల ఆభరణాలనూ ధరించిన నవ యవ్వనవతిలా ఉంది. ఢిల్లీ నగర సోయగాలను ఆస్వాదిస్తూ విమానంలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాను. విమానం పెద్దదిగా 2-4-2 సీటింగ్ ఎరేంజ్మెంట్ తో ఉన్నది. చైనీస్ ఎయిర్ లైన్స్ కాబట్టి ఎయిర్ హోస్టస్ లు చైనీయులే ఉన్నారు. టీవీలో చైనీస్ లాంగ్వేజ్ వినిపిస్తున్నది. వారణాసి, ఢాకా నగరాలను దాటుకుంటూ ఉదయం 5-30కు షాంఘైలోని ‘పుడాంగ్ ఎయిర్పోర్టు’కు చేరుకున్నాం. విమానం నుంచి షాంఘై నగర లైట్లను చూసినప్పుడు ఢిల్లీ కన్నా భిన్నంగా కనిపించింది. అన్నీ ఒకే రంగుతో పసుపు రంగు లైట్లు కనిపిస్తున్నాయి. దాంతో కొన్ని ఎకరాల మేర బంగారం పంట పండినట్లుగా కనపడుతున్నది. ఢిల్లీ నగరమేమో నవరత్నాలతో సర్వాలంకార భూషితంగా ఉంటే షాంఘై నగరం మాత్రం కేవలం బంగారం పంట పండించినట్లుగా ఉన్నది. షాంఘై నుండి బీజింగ్ చేరే సరికి ఉదయం 10-30 అయింది.
బీజింగ్ కేవలం చైనాకు రాజధాని మాత్రమే కాదు. నేషనల్ పొలిటికల్ మరియు కల్చరల్ సెంటర్, మన హైదరాబాదు లాగానే దీనికి కూడా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ సిటీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ శతాబ్దంలోనే చైనా బాగా అభివృద్ధి చెందింది. చైనా దేశం జనాభాలో మొదటిస్థానం, భూ భాగంలో మూడవ స్థానాన్ని ఆక్రమించియున్నది. ఇక్కడి కరెన్సీని ‘యువాన్లు’ అంటారు. మేము వెళ్ళిన రోజు ఒక యువాన్ కు 72 భారతదేశ రూపాయలు. ఇక్కడ ఉష్ణోగ్రత ఈ కాలంలో మైనస్ డిగ్రీలలో ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుందట. రకరకాల నేలలు, పెద్దదైన భూభాగం వల్ల వాతావరణం ఎప్పుడూ నిలకడగా ఉండకపోవడం వల్ల సందర్శనకు ఇది అనువైన సమయమని చెప్పేందుకు లేదు.
యాంగ్జీనది చైనాను ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడగొడుతుంది. చైనా భూభాగంలో మూడింట రెండు వంతులు పర్వతాలే ఉన్నాయి. దీని భూభాగ వైశాల్యం 9.6 మిలియన్ చ.కి. యాంగ్జీనది చైనాలో అతిపెద్దనది. ప్రపంచంలోని అతిపెద్ద నదులైన నైల్, అమెజాన్ల తర్వాతి స్థానం దీనిదే. చైనాలో నాగరికత వెల్లివిరియటానికి దేశంలోని రెండవ అతిపెద్ద నదైన పసుపునది కారణమని చెపుతారు. ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన చైనీస్ భాషకు వర్ణమాల వ్యవస్థలేదు. ఇది చిత్రలేఖనం రూపంలో ఉంటుంది. ఈ భాష స్వర సంబంధిగా ఉండటం వల్ల మనకు అన్ని మాటలూ ఒకే రకంగా వినబడతాయి. చైనా అధికార భాషను ఇంగ్లీషులో ‘మాండరిన్’ అంటారు. చైనా వెళ్ళబోయే ముందే ట్రావెల్స్ వాళ్ళు సాధారణంగా మనకవసరమయ్యే మాటల్ని చైనా భాషలో ఏమనాలో పేపర్ ప్రింటవుట్లు ఇచ్చారు. వాటిని ఎంతసేపు చదివినా పేపర్ దగ్గరుంటే తప్ప ఏదీ గుర్తుండేలా లేదు. బాగా చదివి ‘థ్యాంక్ యూ’ అనే పదానికి ‘జీజీనీ’ అనాలని గుర్తుపెట్టుకున్నాం. ప్రతి చోటా అందరికీ ‘జీజీనీ’ అని చెప్తుంటే వాళ్ళు సన్నగా నవ్వుకుంటున్నారు. ‘ఎలా ఉన్నారు’ అని అడగాలంటే ‘ని హావో మా’ అనాలి. ఏదైనా వస్తువు కొనాలంటే ‘రేటెంత’ అని అడగాలి కదా దానికి ‘డుమో షావో కియాన్?’ అని అడగాలి. ఇలా వాళ్ళ భాష గురించి వివరాలు తెలుసుకున్నాం.
బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి ఊర్లోకి వస్తుంటే ఆకాశాన్నంటే భవనాలు, అద్భుతమైన రోడ్లు కనువిందు చేశాయి. అన్ని ప్లైవోవర్లే. మేం ఎయిర్ పోర్టు నుంచి హెూటల్ కు చేరే వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేనే లేదు. ఏ బిల్డింగ్ చూసినా పది అంతస్థులకు తక్కువ కనిపించలేదు. మేము దిగిన ‘ఫీటియాన్’ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఇరవై అంతస్థుల భవనం. మా రూమ్ నంబరు 805 బీజింగ్ నగరంలో 16,000 కి.మీ మేర ఆరు రింగురోడ్డులు విస్తరించి ఉన్నాయని గైడ్ వివరించింది. అక్కడి పంటపొలాలు కొనుక్కోవటం గానీ, కొనుక్కున్నాక అవి మరల నా పిల్లలకు అని రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవట భూమి ఏదైనా ప్రభుత్వానిదే కావాలంటే 30 లేదా 40 సంవత్సరాలు కిరాయికి ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ తరువాత మరల ప్రభుత్వానికే అప్పజెప్పాలి. వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి వీలు లేదు. పిల్లలు పెద్దవాళ్ళయి వ్యవసాయం చేసుకుంటానంటే మరల ప్రభుత్వం నుంచి కిరాయికి పొలం తీసుకోవాల్సిందే. ఎయిర్ పోర్టు నుండి హెూటల్ కు చేరేదాకా గైడు ఈ విషయాలన్నీ చెపుతూ కూర్చున్నది. బస్సులో ఓ మైకు ఉంటుంది. ఆ మైకు ద్వారా ఆమె ఇవన్నీ మాట్లాడింది. ఆ గైడు పేరు ‘అమీ’. తాను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ జోకులు వేస్తూ విషయాలన్నీ చెప్పింది.
సాయంత్రం 6-30కు జనోషా థియేటర్ లో ‘ఆక్రో బాటిక్ షో’ చూపించారు. ఇది చాలా అద్భుతంగా ఉన్నదిద. దీంట్లో చైనా వాళ్ళ సాంప్రదాయక నృత్యంతో పాటు సర్కస్ ఫీట్లన్నీ ఉన్నాయి. ఒక ఇనుప గోళంలో మోటరు సైకిళ్ళతో స్పీడుగా నడపడం అంటే ఎంత కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చాలా ప్రమాదం. చూడటానికి చాలా ఆనందాన్నీ, సంభ్రమాశ్చర్యాల్నీ కలగజేసినా వాళ్ళ జీవితాలు ఎంత రిస్క్ కూడుకున్నవో తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు పది బంతుల్ని తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు చేతులతో పట్టుకుంటూ ఉండటం, తల మీద టోపీలను పైకెగరవేసి ఒకరిని మరొకరు పట్టుకోవటం వంటివి వారి హస్త నూపుణ్యానికి, ఏకాగ్రతకు నిదర్శనం. కొంతమంది రాజులుగా, జోకర్లుగా వేషాలు వేసుకొనీ, మరికొంతమంది అమ్మాయిలు అందంగా అలంకరించుకొని డాన్స్ చేయటం వారి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇంకొందరు కుర్చీలను కింది నుంచి పైకి వంకరటింకరగా ఒకదానిపై మరొకటి పేర్చుకొని దానిపైకి ఎక్కుతూ, తల మాత్రమే వాటికి ఆన్చి శరీరమంతా గాల్లో తేలేలా చెయ్యటం చూస్తుంటే వాళ్ళు పడిపోతారేమో, పడిపోతారేమో అని మనకు టెన్షన్ అనిపిస్తుంది. ఇలా కుర్చీలపైకెక్కటం, రింగుల్లోంచి దూరి ఒకరిపై మరొకరు పడటం, మోటారు సైకిళ్ళు విన్యాసం- ఈ సర్కస్ ఫీట్లన్నీ ఎంత ప్రాణాంతకమో తెలిస్తే చాలా బాధనిపించింది. ఇలా ఒకసారి కాదు కదా! ప్రతి రోజూ రెండు మూడు షోలు ఇవ్వాలి. స్టేజి షో కాబట్టి తప్పు జరగడానికి లేదు. ఇలా జీవిత కాలం ప్రమాద పరిస్థితితో ఉండటమనే విషయాన్ని ఆలోచిస్తేనే విషాదం అనిపించింది. ఏది ఏమైనా పిల్లలూ, పెద్దలూ ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో నోరు తెరవని వారు లేరు. ఇంకా కుంగ్ ఫూ ప్రదర్శన కూడా ఉంటుందట గానీ మాకు చూడటానికి టైమ్ దొరకలేదు.
ఆ మరునాడు ఫర్ బిడెన్ సిటీ టియాన్మన్ స్క్వేర్ చూడటానికి వెళ్ళాం. ఇవి రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. ఫర్ బిన్ సిటీని 1407లో కట్టారు. దీని నిర్మాణంలో ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది పనివాళ్ళు పాల్గొన్నారు. దీన్లో మింగ్, కింగ్ రాజవంశాలు 500 సం॥ల పాటు నివసించాయి. ఈ భవనం లోపల ఒక రకమైన పసుపు రంగుతో లెక్కకు మిక్కిలిగా అలంకరణలు చేయబడ్డాయి. పసుపురంగు చైనా వారి సాంప్రదాయమైన రంగట. ఈ భవనాలన్నీ వారి వస్తు ప్రకారం కట్టబడినాయట.
టియాన్మన్ స్క్వేర్ యాభై హెక్టార్ల స్థలంలో వ్యాపించబడి ప్రపంచంలోని అతిపెద్ద ఖాళీ ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది. దీనిని 1417లో మింగ్ రాజవంశం స్థాపించింది. సామాన్య ప్రజలంతా తమ రాజులు, రాణుల ఎదుట ఉత్సవాలను జరుపుకోవడానికి వీలుగా ఈ స్క్వేర్ ను ‘ఫర్ బిడెన్ సిటీ’ ఎదురుగా నిర్మించారు. ప్రస్తుతం ఇంకా విశాలం చేసి దాంట్లో ఎక్కువ మంది ప్రజలు పట్టే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు టియాన్మన్ స్క్వేర్ వద్ద ప్రతిరోజూ జెండా వందనం అద్భుతంగా జరుగుతుంది. దీనిని తిలకించటానికి ప్రతిరోజూ వేల మంది ప్రజలు హజరవుతారు. ఇది చూడాలంటే సూర్యోదయం కాకముందే లేచి అక్కడకు చేరుకోవాలి. ఐదు నక్షత్రాలున్న ఎర్రని చైనా జాతీయ జెండా ఈ స్క్వేర్ వద్ద ఆకాశంలోకి ఎగిరే దృశ్యం ప్రతి టూరిస్టు తప్పక చూడవలసినది. మలేసియా, చైనా, హంగ్ కాంగ్ వాసులు ఈ టియాన్మన్ స్క్వేర్ వద్ద మాతో ఫొటోలు తీయించుకున్నారు. హిందూ, హిందూ అంటూ నమస్కారాలు చేశారు. మేం చైనాలో ఉన్నపుడు ఆ దేశ అధ్యక్షుడు ‘హూ జింటావో” భారతదేశ పర్యటనలో ఉన్నారు.
ఆ మరుసటి రోజు బీజింగ్ నుండి బాడాలింగ్ హైవేలో గ్రేట్వాల్ ఆఫ్ చైనాకు బయల్దేరాం. దారిలో జేడ్ ఫ్యాక్టరీ చూపించారు. అవి పెద్ద పెద్ద గ్రానైటు బండల్లా ఉన్నాయి. వాటి నుంచి శిల్పాలు, ఫ్లవర్ వేజ్ లు అలంకారానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేయబడి ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరవుతుంటే అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత, ఈరోజు మనం ప్రపంచ వింతను చూడబోతున్నాం అని బస్సు దిగగానే పైకి చూస్తే మంచు తెరల్లోంచి చైనా మహాకుడ్యం ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకు వంకలు తిరుగుతూ పాక్కుంటూ వెళ్తున్న కొండ చిలువలా కన్పించింది. ఈ గోడ 25.6 ఫీట్ల ఎత్తుతోనూ, 16.4 ఫీట్ల వెడల్పుతోనూ కట్టబడింది. ‘క్విన్ షి హుయాంగ్’ అనే రాజు 220 బిసి నుంచి 200 మధ్యలో ఈ గోడను కట్టారు. మింగ్ రాజవంశం దీన్ని పునరుద్ధరించి 5వ శతాబ్దంలో బండ రాళ్ళతో కట్టారు. ఈ గోడనే మనం ఇప్పుడు చూస్తున్నది. ఈ గోడ పొడవు 6,400 కి.మీ.లు. 2,3 మిలియన్ల మంది సైనికులు వారి జీవిత కాలమంతా ఈ గోడను కడుతూనే ఉన్నారు. మంచూరియన్ల, మంగోలియన్ల దాడిని నివారించేందుకు, వారు చైనాలోకి చొరబడకుండా ఉండేందుకు కట్టారు. ఈ మహాకుడ్య శిఖరాగ్రాన ఒక మిలియన్ సైనికులు కాపలా కాసేవారంట. అక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఓ షాపులో ఇత్తడి ప్లేట్ మీద మన పేరు చెక్కి ఈరోజు చైనా గోడను ఎక్కినట్లుగా చెక్కి ఇస్తారు. మేం కూడా దాన్ని చెక్కించుకున్నాం. ఇది మేం చూసిన రెండవ ప్రపంచ వింత. మొదటిది తాజ్ మహల్. రెండవది ఇది. ఇంకొక షాపు దగ్గర చైనా రాజ వంశీయుల దుస్తులు వేసి ఫొటోలు తీస్తున్నారు. మేం కూడా ఆ ఫొటోలను తీయించుకున్నాం. మనం ఈ మానవ నిర్మితమైన ప్రపంచ వింతను దర్శించినట్లు ఒక సర్టిఫికెట్తో పాటు మన ఫొటోనూ, మహాకుడ్యం యొక్క రకరకాల భంగిమల ఫొటోలనూ ఇస్తారు. దీనికి మనం వంద యువాన్లు చెల్లించాలి. ఇలా చైనా మహాకుడ్య విశేషాలను భద్రపరచుకొని తిరిగి ఇండియా ప్రయాణమయ్యాం.
వ్యాసాలు
ముదిగొండ ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.భారతదేశం పసిడి పంటలకు నిలయం.ఎందరో మహర్షులకు జన్మ నిచ్చిన తపో భూమి.భారతదేశం వేదాలు, ఉపనిషత్తులు,పురాణాలు,కావ్యాలు,రామాయణ, మహాభారత,భాగవతాదులు వ్యక్తుల జీవనాడులలో విజ్ఞానవాహినులుగా ప్రవహించిన పుణ్యభూమి. పూలు,పండ్లతో,పక్షుల కిలకిలరావాలతో అలరారే ఉద్యానవనంలోనికి గుడ్లగూబలు చొరబడి తోట విధ్వంసమైనట్లుగా మన దేశంలోకి విదేశీయులు అక్రమంగా అడుగు పెట్టడంతో దేశ పూర్వ వైభవమంతా నశించింది.పూర్వపు ప్రాభవంతో విలసిల్లుతున్న మన దేశ గడ్డ పై విదేశీయులు అడుగు పెట్టి మన సంస్కృతిని,మట్టిలో కలిపిన తీరునకు ప్రతీక ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.జాతికి గ్రహణం పట్టడం అనే పదం ఒక వ్యక్తి లేదా సమాజంలో జరిగిన ఒక కీలకమైన సంఘటనను సూచిస్తుంది.గ్రహణం అంటే ఒక మార్పు వచ్చే సమయంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన రోజులలో జాతికి అత్యంత ముఖ్యమైన మార్పులు లేదా సంఘటనలు జరుగుతాయి.బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి వీడి భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో జాతికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.దేశంలో సాంఘిక,రాజకీయ పరిణామాలు సంభవించి సమాజము మరియు జాతిలో మార్పులు కలిగినాయి.సమాజంలో కొనసాగుతున్న అన్యాయాలు,అసమానతలకు సంబంధించి ప్రజలలో కలిగిన మౌలికమైన చైతన్యం,దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం,అభివృద్ధి వంటి అంశాలు జాతి ప్రగతిని ప్రభావితం చేస్తాయి.జాతికి గ్రహణం పట్టిన రోజున జరిగే సంఘటనలు,జరగవలసిన మార్పులు అనేకం ఉంటాయి.జాతికి గ్రహణం పట్టడం అనేది సమాజానికి సంబంధించిన ప్రతి అంశంలో చోటు చేసుకునే మార్పుల సమాహారాన్ని సూచిస్తుంది.ఇది జాతిలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేయ గల సందర్భంగా చెప్పవచ్చు.

జాతికి గ్రహణం పట్టిన రోజు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.అందమైన ఆ రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.గతించిన ఆ అందమైన రోజును మరువ లేకున్నాం.అది ఇప్పటికే మనసులో మెదులుతూనే ఉంది.అందమైన ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉన్నది.అందమైన ఆ రోజు సాంప్రదాయికంగా ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన సంఘటనల సందర్భాన్ని సూచిస్తుంది.అందమైన ఆ రోజు భావోద్వేగాలతో కూడిన జ్ఞాపకాలను మరియు వ్యక్తిగత అనుభవాలను అందిస్తుంది.ఆ రోజు నూతనమైన ఆరంభాలను అనుభవాలను, విజయాలను గుర్తు చేస్తుంది.అందమైన ఆ రోజు ఒక రకమైన సంతోషాన్ని,మనసుకు శాంతిని కలిగించేది. అందమైన ఆ రోజు సాహిత్యం,కళలు మరియు సాంస్కృతిక రంగాలలో కలిగిన గొప్ప మార్పును ప్రతిబింబిస్తుంది.భారతీయ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,పండుగలు, వివాహాలు,వేడుకలు,అందమైన రోజులుగా గుర్తించబడతాయి.అందమైన ఆ రోజు అనేది కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.జాతి జనులకు ఆ రోజు అందించిన అనుభూతులను,జ్ఞాపకాలను, ఆలోచనలను,కదిలించే సందర్భం.అందమైన ఆ రోజు జీవితంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక,భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. అందమైన ఆరోజు అనగానే మనసులో ఒక మధురమైన జ్ఞాపకం మిగిలినట్లు ఉంటుంది.ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది.అందమైన ఆ రోజు ఒక పండుగలా మన హృదయాన్ని గులాబీల పరిమళాలు తాకినట్లుగా,సంతోషాన్ని నింపినట్టుగా, మనసుకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని పంచుతుంది. అందమైన ఆ రోజుకు చెందిన జ్ఞాపకం మనలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.మన జీవితంలో ఒక మధురమైన కథలా,అద్భుతమైన చిత్రంలా మన హృదయంలో నిలిచి ఉంటుంది.నీలి జలతారు నీడల్లో/నింగి దోబూచులాడిన రోజు/అంటున్నారు. నీలి రంగు బంగారు అంచు కలిగిన వస్త్రపు నీడలో నింగి దాగుడుమూతలాడిన దినం.మనసులోని అనుభవాలను ప్రతిబింబించే జ్ఞాపకాలను చూపించడానికి కవి తమ కలం నుండి వివిధ రకాల పద చిత్రాలను ఉపయోగిస్తాడు.నింగి జలతారు నీడల్లో అనేది ఆకాశంలోని నీలిమతో కూడి ప్రకృతిలోని సౌందర్యాన్ని సూచిస్తుంది.నింగి దోబూచులాడిన రోజు అంటే ఆకాశం ఉల్లాసంగా కదులుతూ ఆడి పాడిన రోజు.ఆ రోజున ప్రకృతిలోని సొగసైన అందాన్ని వర్ణిస్తూ ఆకాశంలో మబ్బులు కదులుతూ చూడ ముచ్చటగా అందంగా అలంకరించినట్టుగా ఉన్నాయి.వాన చినుకులు పడే ముందర ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం,వాన వెలిసిన తర్వాత మబ్బులు తేలిపోవడం వంటి ప్రక్రియను అందమైన దృశ్యాన్ని తెలుపుతుంది. చుక్కల కాటుక కన్నుల్లో/ముత్యాలు/తళతళలాడిన రోజు/అంటున్నారు.నక్షత్రాల కాటుక కనులలో ఆనందం కారణంగా కన్నీటి ముత్యాలు తళతళ మెరిసిన రోజు.ఒక అందమైన అనుభవాన్ని చెబుతున్నారు.ఒక మనిషి కన్నుల్లో కాటుకను పెట్టుకున్నప్పుడు కళ్ళు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అప్పుడు కళ్ళు తళతళలాడతూ ముత్యాల వలె ప్రకాశిస్తాయి. చుక్కల కాటుక కన్నుల్లో ఆనంద భాష్పాలు అనే ముత్యాలు తళ తళ లాడిన రోజు.చుక్కల కాటుక కన్నుల్లో ముత్యాలు ధగధగ మెరిసిన రోజు.ఇది ప్రకృతిలోని ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,కొత్తగా వెలువరించే సందర్భాన్ని తెలుపుతుంది.ఇది ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించేందుకు చేసిన ఒక ప్రయత్నం. ఇది మనసులో దాగి ఉన్న అందమైన జ్ఞాపకాలను సృజించగల సామర్థ్యానికి ప్రతీక.ప్రకృతిలోని దృశ్యాలు మనసులోని నిశ్శబ్దతను ఉత్తేజితం చేస్తాయి.కమ్మ తెమ్మెరలు/విందుగా పసందుగా/ కితకితలు పెట్టిన రోజు/కన్నె మబ్బులు/మెల్లగా చల్లగా/తేలిపోయిన రోజు/అంటున్నారు.తీయనైన కమ్మని ఇంపైన పిల్లగాలులు,రుచికరమైన,పసందైన విందును సమకూర్చినట్టుగా గిలిగింతలు పెట్టిన రోజు.కన్నె మబ్బులు మందగమనంతో చల్లదనాన్ని కూర్చుతూ ఆకాశమున తేలిపోయిన దినం.ఈ కవితా పంక్తులు ప్రకృతి అందాన్ని మరియు అనుభూతుల మేళవింపును బలంగా పాఠకుడికి అందిస్తున్నాయి.కమ్మ అంటే అందమైనది, ఆకర్షణీయమైనది.కమ్మ తెమ్మరలు అంటే ఇంపైన పిల్ల గాలులు.ప్రకృతి యొక్క అందాన్ని,సుందరమైన దృశ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి ఉపయోగపడతాయి.ఇది ఒక పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.విందుగా పసందుగా అనేది సంతోషకరమైన మాధుర్యమైన అనుభూతిని అందిస్తున్నది.ఇది ప్రాతః కాలంలో ఒక శుభ సమయంలో జరుగుతున్న సన్నివేశాన్ని మరియు పండుగలు,వేడుకల వంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది.కితకితలు హాస్యానికి లేదా ఆహ్లాదానికి సంకేతంగా చెప్పవచ్చు.పండుగ వేడుకల్లో జరిగే సంఘటనలు,ఆటలు,పాటలు, సంబరాలు ఒక గొప్ప అనుభవాన్ని,ఆనందాన్ని, సందడి వాతావరణాన్ని కల్పిస్తాయి.కన్నె మబ్బులు అనగా మెల్లగా ఆకాశంలో కదలుతున్న మబ్బుల దృశ్యం,నిశ్శబ్దమైన ప్రకృతిని,ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.మబ్బులు ఆకాశాన్ని కమ్ముకొని కదులుతూ ఉంటే వాతావరణంలో ఒక రకమైన ప్రశాంతత వ్యాపిస్తుంది.తేలిపోయిన రోజు అనేది ఆ దినం గడిచినట్లుగా లేదా ఉత్సవ సమయంలో ఘనంగా జరిగే వేడుకలు,ఒక శ్రేష్టమైన అనుభూతిని వ్యక్తపరుస్తుంది.ఇది వాతావరణంలోని ఉత్సాహం మరియు ఆనందాన్ని,ప్రకృతి అందాన్ని,ఆనందాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.పూల బాలలు/కాళ రాత్రి కరిగిందని/మురిసి మురిసి విరిసిన రోజు/ అంటున్నారు.పూల బాలికలు భయంకరమైన రాత్రి గడిచిందని ఎంతో ముద్దుగా మురిపంగా వికసించిన రోజు.ప్రకృతి అందం చేత మరియు పుష్పంల ద్వారా కవికి కలిగిన అనుభూతి దృశ్యాలు భావాల ద్వారా వ్యక్తమవుతున్నాయి.పూల బాలలు అనేది పువ్వులు లేదా మొగ్గలు అంటే ప్రకృతిలోని సౌందర్యాన్ని,కొత్త జీవనాన్ని సూచిస్తుంది.పూలు తేటగా అందంగా ఉండడం,నవ జీవనాన్ని సూచిస్తుంది.కాళ రాత్రి అనేది భయంకరమైన రాత్రి. రాత్రి వేళలో వికసించే పుష్పాలు రాత్రి సంస్కృతికి సంబంధించిన ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,సంబరాల విశేషాలను వివరించడంలో సహాయపడతాయి. మురిసి మురిసి అనేది అనంతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.మురిసి మురిసి విరిసిన రోజు అనేది మనసులో ఒక రకమైన కొత్త దనాన్ని,ఉత్తేజాన్ని, పూసిన పువ్వుల సౌందర్యాన్ని,కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది.ప్రకృతిలోని పువ్వుల అందాన్ని,

ఆనందాన్ని,సజీవంగా చిత్రిస్తుంది.ప్రకృతి యొక్క రమణీయతను,పుష్పాల పరిమళాల్ని, ఆత్మీయ అనుభూతుల్ని అందిస్తుంది.ఆకసానికి సింధూరం పూసి/చీకటి గుయ్యారం చీల్చుకొని/ సూర్యుడి బింబం చొచ్చుక వచ్చిన రోజు/ అంటున్నారు.ఆకాశానికి సింధూరపు ఎరుపు రంగును పులిమి చీకటి గుహ నుండి చీల్చుకొని సూర్యబింబం లోకములోనికి చొచ్చుకు వచ్చి తన దివ్య తేజస్సుతో లోకాన్ని వెలిగించిన రోజు. ప్రకృతి,సూర్యుడు ప్రజల ఆనందాన్ని,అనుభూతుల సౌందర్యాన్ని,ప్రభావశీలంగా వ్యక్తపరుస్తున్నాయి. సింధూరం అనేది ఎరుపు రంగు.ఉదయ కాంతి రావడంతో ఆకాశం ఎరుపు రంగు పులుముకొని మెరుస్తున్నది.ఉదయం పూట సూర్యుడు తన కాంతితో చీకటిని తొలగించి వెలుగును ప్రసరింప జేస్తున్నాడు.సూర్య కాంతి ఒక అందమైన ఉదయాన్ని,జీవన శక్తిని ప్రతిబింబిస్తుంది.చీకటి గుయ్యారం అనేది రాత్రి పుడమిలో అలుముకొన్న చీకట్ల ఆధిక్యతను సూచిస్తుంది.సూర్యుడి కాంతి చీకట్లను చీల్చుకుంటూ పుడమిపై వ్యాపిస్తుంది. సూర్య శక్తి మానవులకు జీవనాన్ని,బతుకు పట్ల ఎనలేని ఆశను కలిగిస్తుంది.సూర్యుడు జీవం కలిగించే శక్తిగా నిత్యం కొత్తదనాన్ని అందిస్తాడు.ఇది మానవుని దిన చర్యలో కొత్త అనుభూతిని, ఆనందంతో కూడిన చైతన్యాన్ని నింపే రోజు.సూర్య కాంతి ప్రకృతిని,జీవుల జీవితాన్ని,వాటి ఆశను అత్యంత మనోహరంగా పునరుత్తేజాన్ని కలిగిస్తున్నాయి.అంతేగాక ప్రకృతిలోని అందాన్ని, మార్పులను,కవితా పంక్తులు అద్భుతంగా వివరిస్తాయి.కాషాయపు రోచిస్సులు/కాంతి రేఖలు/ క్రాంతి రేఖలు/నింపిన రోజు/ఆ రోజు/అందమైన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు. కాషాయపు అందమైన కిరణ సముదాయపు కాంతులు విరజిమ్మి అభ్యుదయపు వెలుగులను జగమంతా నింపిన రోజు.ఇంకా మనసులో కదలాడుతూనే ఉంది.ఆ అందమైన రోజు ఎంతో ప్రత్యేకమైనది.మనసులో ఎంతో హాయిగాను, సంతోషంగాను గుర్తుండి పోయింది.ఆ రోజులో జరిగిన సంఘటనలు,ఆ అనుభవాలు,అందమైన జ్ఞాపకాలు,మనసును ఆహ్లాదపరుస్తాయి.మనసుకు జ్ఞాపకాల రుచి చూపిస్తూ ఎప్పటికీ గుర్తుండి పోతాయి.ఒక మహోన్నతమైన భావజాలాన్ని,ఒక గొప్ప చైతన్యాన్ని మరియు మన దేశ సాంస్కృతిక, రాజకీయ చరిత్రను ప్రతిఫలిస్తుంది.కాషాయపు రోచిస్సులు సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు అందించే ప్రకాశాన్ని ప్రకృతిలో కనిపించే అందాన్ని సూచిస్తాయి.ఈ సూర్యకిరణాలు జీవ చైతన్యానికి,ప్రకృతి సౌందర్యానికి ఒక చిహ్నంగా ఉంటాయి.కాషాయపు రోచిస్సులు అనేది త్యాగానికి,ధైర్యానికి మరియు సంకల్పానికి సంకేతం.దేశ భక్తితో ప్రణాళికలు,లక్ష్యాలు ఏర్పర్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న భౌగోళిక,సాంఘిక,రాజకీయ పరిణామాలను సూచిస్తుంది.మన దేశ అభివృద్ధిని సుఖ శాంతులతో కూడిన జీవన సౌభాగ్యాన్ని ఈ కవితా పంక్తులు నిరంతరం గుర్తుచేస్తాయి.ఆ రోజు/అందం కుసుమించిన రోజు/అంటున్నారు. అందం పుష్పించిన రోజు.పువ్వు ఎప్పుడు వికసిస్తుందో,ఆ రోజు ప్రత్యేకమైనది.అన్ని రంగాలలో విస్తరించిన దేశ సౌందర్యం,ప్రకృతి యొక్క అందచందాలు చక్కగా విలసిల్లిన రోజు.ప్రతి రోజు పూసే పువ్వుల వలె దేశవాసుల జీవితం సౌందర్యంతో ప్రకాశించిన రోజు.అందం కుసుమించిన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన దినంగా భావించబడినది.ఆనందం పల్లవించిన రోజు/అంటున్నారు.ఆనందం అనే చెట్టు చిగురించి కొత్త ఆకులతో విలసిల్లిన రోజు.ఆనందం పల్లవించడం అంటే ఆనందం వెల్లి విరిసిన రోజు. మన జీవితంలో ఒక ముఖ్యమైన అద్భుతమైన క్షణాన్ని కొత్తకోణంలో అనుభవిస్తున్నప్పుడు ఆ రోజును ఆనందం పల్లవించిన రోజు అని చెప్పవచ్చు.మన హృదయంలో పల్లవించిన సంతోషాన్ని,సున్నితత్వాన్ని,సౌందర్యాన్ని ఈ కవితా పంక్తి సూచిస్తుంది.స్వచ్ఛంగా స్వచ్ఛందంగా/ మెరుస్తున్న సూర్యున్ని చూచి/కళ్ళు మండి రాహువు/దుమ్మెత్తి పోసిన రోజు/అంటున్నారు. కల్మషం లేని రీతిలో స్వతంత్రంగా మెరుస్తున్న సూర్యుని చూసి కళ్ళు మండిన రాహువు(తాము దేవతల పంక్తిలో కూర్చుండి అమృతం తాగుతున్న రాహువు కేతువులను అమృతం తాగకుండా చేసిన సూర్యచంద్రులను పగతో మింగ ప్రయత్నిస్తుంటారు, దాన్నే గ్రహణం పట్టడం అంటారు).సూర్యునిపై పగతో దుమ్మెత్తి పోసిన రోజు అంటే చక్కగా సుఖ సంతోషాలతో శాంతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సుసంపన్నమైన సుభిక్షమైన మన భారతదేశంపై విదేశీయులనే రాహువుల ఆక్రమణ మొదలైన రోజు అది.సూర్యుడు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మెరుస్తున్నాడు.సూర్యుడు శక్తిని, వెలుగును,జ్ఞానాన్ని అందించి లోకాన్ని ప్రకాశింప జేస్తున్నాడు.సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ లోకానికి ప్రశాంతతను,విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. సూర్యుడు ఎవరో కాదు భారతదేశం కళ్ళు మండటం అంటే ఆ వెలుగును,సత్యంను, విజయంను చూడలేని శత్రువులైన విదేశీయుల స్థితిని సూచిస్తుంది.కళ్లు మండడం అంటే అసూయ, ద్వేషం లేదా ఇతరుల విజయాన్ని చూడ లేని మనసులోని నెగటివ్ భావాలను తెలుపుతుంది. రాహువు దుమ్మెత్తి పోసిన రోజు అంటే భారతదేశపు విజయాన్ని,శోభను దెబ్బ తీసిన రోజు అని చెప్పవచ్చు.ఒకప్పుడు అత్యంత శోభతో వెలుగుతున్న దేశ సౌభాగ్యాన్ని ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించిన రోజు.చీకటితో చేయి కలిపి/ మసి బూసిన రోజు/అంటున్నారు.చీకటితో స్నేహం చేసి మసిబూసి మాయలు పన్నిన రోజు.చీకటి అనేది అజ్ఞానానికి,చెడు మరియు పాపపు చింతనకు ప్రతీక.అనైతికంగా తప్పుడు మార్గంలో పయనించడాన్ని చీకటి శక్తులకు లోబడినట్లుగా తలచవచ్చు.కట్టెలు కాల్చగా ఏర్పడిన బూడిద మసి.మసి బూయడమంటే విదేశీ శత్రువులు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి వాస్తవానికి మసి బూసి పౌరులను బలహీనులుగా చేసిన రోజు.ఒక వ్యక్తి, సమాజం సత్యంపై నడకలు సాగిస్తున్నప్పుడు తర్వాత అట్టి చక్కగా విలసిల్లుతున్న సమాజం చీకటి లేదా చెడు శక్తుల ప్రభావానికి లోనై స్వచ్ఛతను కోల్పోయి అనైతిక మార్గాలకు అలవాటైన ఆ రోజును మసి బూసిన రోజుగా భావించవచ్చు.కోటి కోటి రావాలు/కుమిలి కుమిలి/ రోదించిన రోజు/అంటున్నారు.కోట్ల కొలది మంది భారతీయులు తమకు కలిగిన బానిసత్వపు దుర్దశకు కుమిలి కుమిలి దుఃఖించిన రోజు.ఇది గంభీరమైన భావనతో కూడుకొని ఉన్నది.మనసులో అణిచివేయబడిన బాధ,దుఃఖం మరియు తీవ్రమైన వేదనను ప్రతిబింబిస్తున్నది.కోటి కోటి అనేది సంఖ్యాపరంగా ఎంతో ఎక్కువ అనేక కోట్లు.రావాలు అంటే వేదనతో కూడిన జీరవోయిన కంఠ ధ్వనులు. కోటి కోటి రావాలు అంటే దుఃఖపూరితమైన కోట్ల కొలది వ్యక్తుల కంఠ ధ్వనులు అసహనం,వేదన యొక్క పరాకాష్టను సూచిస్తుంది.ఇది వ్యక్తులను, సమాజం యావత్తును అణిచివేయబడిన తీరును ప్రతిబింబిస్తుంది.కుమిలి కుమిలి అనే పదం శరీరం బాధతో,దిగులుతో విపరీతంగా విచారం చెందడం వల్ల కలిగే వేదనను తెలుపుతుంది.దీర్ఘకాలంగా అణిచివేయబడిన వారి బాధ,దుఃఖం,మనస్సును ఎలా కలవరపరచినాయో ప్రతిబింబిస్తుంది.ఆ రోజు/మనిషి చచ్చిన రోజు/మనసు చచ్చిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.ఆ రోజు మనిషి చచ్చిన రోజు అంటే మనిషిలో మానవత్వం నశించి రాక్షసత్వం విజృంభించిన రోజు. అసాధారణమైన ఒక ప్రత్యేకమైన రోజు.జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు.ఆ రోజు జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అనుభూతిని కలిగిస్తుంది.మనిషి చచ్చిన రోజు.ఇది భౌతిక మరణాన్ని సూచించే వాక్యం. మనిషి మరణించడం అంటే ఆ వ్యక్తి శరీరం మాత్రమే కాదు,అతని ఆలోచనలు,స్వభావం, అనుభవాలు అన్ని హరించబడతాయి.మనసు చచ్చిన రోజు అంటే మంచి మనసు చచ్చిన రోజు. మనిషి జీవితం సంక్లిష్టమైనది,మనసు బాధకు లోనవడం యాదృచ్ఛికం.ప్రతి వ్యక్తికి మరణం అనేది చెట్టుకు పూసిన పువ్వు రాలినట్లుగా సహజమైనట్టిది.మరణం అనేది శరీరంతో పాటు మనసును కూడా చంపుతుంది.ఇక్కడ మనసు చచ్చిపోవడం అనే వాక్యం మరణం కన్నా ఎక్కువ బాధను వ్యక్తం చేస్తుంది.ఒక వ్యక్తి యొక్క ఆశయాలకు,ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలడం, విలువలు విధ్వంసం కావడాన్ని తెలియజేస్తుంది. మనిషి మనస్సులో పొడముతున్న భావోద్వేగాలు పతనం అవుతున్న సామాజిక విలువల్ని గుర్తు చేస్తుంది.ఇంకా జ్ఞాపకం ఉన్నది అంటున్నారు.ఆ సంఘటన గాఢంగా మనసులో నిలిచిపోయి ఎన్నటికీ మరిచిపోలేని ఒక భయంకర అనుభవంగా మిగిలిపోయింది.సమాజంలో జరిగిన దుష్ట సంఘటనల వల్ల సంక్రమించిన బాధ,దుఃఖం, అంతరంగంలో వేదనను ప్రతిబింబించడం సహజం.మనిషి చచ్చిన రోజు,మనసు చచ్చిన రోజు అనేది కేవలం శారీరక మరణం మాత్రమే కాదు. మానవ విలువలు లుప్తమై భవిష్యత్తు పట్ల ఆశలు అడుగంటిన రోజు అని చెప్పవచ్చు.ఆ రోజు/ అందాన్ని హత్య చేసిన రోజు/ఆనందాన్ని అణగార్చిన రోజు/అంటున్నారు.ఆ రోజు దేశ సౌభాగ్య సౌందర్యాన్ని హత్య చేసిన రోజు.దీనిలోని భావం ఎంతో సున్నితమైనది.కవి భావోద్వేగపూరితమైన సంఘటన గురించి వ్యక్తీకరిస్తున్నాడు.అందాన్ని హత్య చేసిన రోజు అలంకారంతో కూడిన వాక్యం.అందం లేదా అందమైన క్షణాలను,స్నేహాన్ని,ప్రేమను, సృజనాత్మకతను నాశనం చేసిన ఒక సంఘటనను సూచించవచ్చు.సమాజంలో నెలకొన్న దారుణమైన సంఘటనల కారణంగా అందమైన దృశ్యాలను, అనుభూతులను కోల్పోవడం జరుగుతుంది.అందం అంటే మిరిమిట్లు గొలుపుతూ కనులకు గోచరించేది మాత్రమే కాక.మనసునకు శాంతిని,సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి.అందమైన ఆనందాలకు ఆటంకం కలిగితే,జీవితంలో సుఖ సంతోషాలు కరువు అవుతాయి.అందం అంటే మన చుట్టూరా అల్లుకున్న సంతోషాల వెల్లువని,శాంతిని తెలియ జేస్తుంది.ఆ రోజు జరిగిన సంఘటనలు,దుర్ఘటనలు, సంతోషాన్ని నశింపజేసినాయి.ఆనందాన్ని అణగార్చిన రోజు.ఆ రోజు ఎదుర్కొన్న కష్టాలు,చేదు అనుభవాలు,భావోద్వేగాలను పెంచినాయి.బాధలో ఉన్నప్పుడు మనిషికి ఆనందం ఉండదు.గడ్డు సమయం ఎదురైనప్పుడు మనిషికి మనో ధైర్యం,శక్తి అవసరం.ఒక్కో సారి మనిషి జీవితం నిరాశ అనే చిక్కు ముళ్ళలో కూరుకుపోతుంది.మనిషికి ఎదురైన నిరాశ కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది.నిరాశ నుండి తేరుకుంటేనే మనం మరింత బలంతో ముందుకు సాగగలం.ఆనందం అంటే సంతోషం,ప్రశాంతత.ఆ రోజు జరిగిన సంఘటనలు,ఆనందాన్ని అణగార్చినాయి.ఆ రోజు అందాన్ని హత్య చేసిన రోజు,ఆనందాన్ని అణగార్చిన రోజు అంటే అందరి ఆనందాలను రూపుమాపిన రోజు అని భావం.సూర్యుడికి గ్రహణం పట్టిన రోజు/రాహువు నెత్తిన/చీకటి మొత్తిన రోజు/ అంటున్నారు.దేశంలోని వికాసం అనే వెలుతురును సకల సంపదను దోచుకుని వెళ్లి మన దేశం బయట మనవి కాని దేశాలలో విదేశీయులు సంపదను భద్రపరుచుకున్నారు.సూర్యుడు చుట్టు తిరిగే చంద్రుడు,సూర్యునికి మరియు భూమికి మధ్యలో అడ్డుగా వచ్చి సూర్య కాంతిని అడ్డుకోవడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది.ఈ సమయంలో సూర్యబింబంలోని ఒక భాగం లేదా మొత్తం కాంతి భూమి మీది కనిపించదు.దాన్ని గ్రహణంగా చెప్పుకుంటాం.పూర్వ కాలంలో ఇది ప్రజల్లో భయాన్ని కలిగించేది.గ్రహణం ముగిసిన తర్వాత సూర్యుడి ప్రకాశం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. సూర్యుడికి గ్రహణం పట్టడం అంటే ప్రజల, సంతోషాన్ని,జీవితంలోని చైతన్యాన్ని,చీకటి ఆక్రమించుటకు ప్రతీక.జీవితంలో ఎదురైన ఏదో ఒక అడ్డంకిని కష్టాన్ని సూచిస్తుంది.రాహువు వల్ల జీవితంలో సమస్యలు,అంతరాయాలు, ఏర్పడతాయని ప్రజల విశ్వాసం.భారతీయ పురాణాలలో రాహువు ఒక చీకటి,అధర్మానికి, అపశకునానికి ప్రతీక.రాహువు సూర్యుడిని మింగడం వల్ల దుష్ట శక్తులు విజయం పొంది జీవితాలను కష్టాలలోకి నెట్టుతుంది.ఆ రోజు జరిగిన సంఘటనల వల్ల దేశం ఒక పెద్ద సంక్షోభాన్ని,గడ్డు స్థితిని ఎదుర్కొవాల్సి రావడాన్ని,రాహువు,చీకటి వంటి ప్రతీకల ద్వారా కవి వ్యక్తపరిచారు.దిగంతాల కావల/వెలుతురు విశ్రమించిన రోజు/మింగలేక కక్కలేక/గొంతు మూగ వోయిన రోజు/జాతి బుద్ధిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.వెలుతురు దిగంతాల బయట విశ్రాంతి తీసుకుంటుందని, తమకు కలిగిన బాధలను క్రక్క లేక మింగలేక దేశ ప్రజల గొంతులు మూగవోయినవని,కవితలోని పంక్తులు గాడమైన భావాలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ కవితలోని వెలుగు దేశం యొక్క అనంతమైన సంపద.దీనిని విదేశీయులు కొల్లగొట్టి తమ దేశాలకు తరలించి భద్రపరచుకోవడం అనేది వెలుగులు దిగంతాల ఆవల విశ్రాంతి తీసుకుంటున్నాయని ప్రతీకగా కవితలో చెప్పబడినది.జాతి సిగ్గుతో తలవంచిన రోజు/అంటున్నారు.సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల జాతి గౌరవాన్ని,ప్రతిష్ఠను కోల్పోవడం,ఆందోళనను,ఆవేదనను కలిగిస్తుంది. జాతి సిగ్గుతో తలవంచిన రోజు అంటే మన దేశం స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన రోజు.విదేశీయుల పాలనలో భారతీయులు బానిస బ్రతుకులు గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.భారత జాతి ప్రజల స్వాభిమానం దెబ్బతినడం,సిగ్గును కలిగిస్తుంది.అది ఒక భయంకరమైన సంఘటనకు నిదర్శనం.ఆ రోజున భారత జాతి గౌరవం మంట కలిసి పోయింది.భారత జాతి సిగ్గుతో తలవంచుకున్నది. మన దేశంలో ఆ రోజు జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనలు,జాతిని సిగ్గుపడునట్లు చేసినాయి. మన దేశంలో స్వాతంత్ర్యానంతరం,ఇలాంటి సంఘటనలు తరచుగా జరిగి మానవతా విలువలు మంట కలవడం,దేశానికి ఒక మచ్చగా నిలుస్తున్నది. మన దేశ ప్రజలు నైతిక విలువల పరిరక్షణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.జనం బుద్దిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.జనం బుద్ధిగా అంటే నిస్సహాయ స్థితిలో చేరి చేతులెత్తిన రోజు. సమాజంలో మనిషి తనకు తానే ఆత్మ వంచన చేసుకోవడం,నిర్లిప్తతను సూచిస్తుంది.బుద్ధిగా చేతులు ఎత్తడం అంటే పోరాటం లేకుండా స్థబ్దంగా ఉండడం అని అర్థం.ప్రజలు తమ కర్తవ్యాన్ని మరిచి పోవడం,సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం,బాధని కలిగిస్తుంది.తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలు,ప్రకృతి, సమాజం అన్ని ఎలా ప్రభావితమవుతాయో, మనిషిలో తెలియని నిర్లిప్తత,నిస్సహాయత ఎలా వ్యాప్తి చెందుతుందో కవి భావాల్లో అద్భుతంగా వెల్లడించారు.ఆ రోజు/చీకట్లు ముసిరిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.చీకట్లు ముసిరిన రోజు అంటే దేశం యావత్తు స్వాతంత్రం కోల్పోయి పరాయిపాలనలోకి జారుకున్న ఆ దుర్ధినాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నాం.ఆ రోజు జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు,జ్ఞాపకాలు,అనుభవాలు, జాతిని ఎంతగానో ప్రభావితం చేసినాయి.ఆ రోజు జరిగిన తీవ్రమైన సంఘటనలు,మనిషికి అనుభవాన్ని,సామూహిక చైతన్యాన్ని కలిగింప జేసినవి.ఆ రోజు జరిగిన సంఘటన వల్ల సమాజంలో ఆనందపు వెలుగులు అన్నీ మాయమై చుట్టూ చీకటి కమ్ముకున్నది.మనిషి జీవితంలో జరిగిన దుర్భరమైన,బాధాకరమైన సంఘటనలు మనసును గాయపరిచిన విధానం ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఇంకా జ్ఞాపకం ఉన్నది/ అంటున్నారు.ఆ రోజు సంఘటన గడిచిపోయింది. అయినప్పటికీ,ఆ రోజు సంఘటనకు సంబంధించిన అవశేషాలు ఇంకా మనసులో నిలిచి ఉన్నాయి.ఆ అనుభవం ఎంతో ప్రభావాన్ని చూపింది.ఆ రోజును పూర్తిగా మరిచిపోలేని విధంగా మనసులో నిలిచిపోయింది.బంగారు భారతదేశం పరాయి పాలనలోకి వెళ్లి అన్ని విధాల దుర్దశను పొంది మ్రగ్గిపోయిన ఆ రోజును తలుచుకుంటూ జాతికి గ్రహణం పట్టిన రోజుగా ఎంతో మధనపడి కవి ఈశ్వర చరణ్ తన మానసిక క్షోభనంతా ఈ కవితలో వ్యక్తం చేశారు.కవి ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవితలోని భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.కవి ఈశ్వర చరణ్ భౌతికంగా లేరు.కాని వారు అందించిన జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
ముకుంద రామారావు . వలస పోయిన మందహాసం కవిత ప్రముఖ కవి,అనువాదకుడు,ముకుంద రామారావు కలం నుండి జాలువారిన వలస పోయిన మందహాసం కవితా సంపుటిలోని వలస పోయిన మందహాసం కవిత పై విశ్లేషణా వ్యాసం.వలస పోయిన మందహాసం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.కవిత శీర్షిక పేరు వలస పోయిన మందహాసం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది.మందహాసం వలస పోతుందా? మనం ఎన్నడు కని విని ఎరుగం.అంతా ఏదో కొత్త కొత్తగా వింత వింతగా అనిపించింది.విలక్షణమైన భావాలు హృదయానికి తాకేలా ఉన్నాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు.కరువు కాటకాలకు నిలయాలుగా మారినాయి.కరువు తాకిడికి పల్లెలు విలవిలలాడుతున్నాయి.పల్లెలో జనాలకు ఉపాధి కరువై పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి.కొందరు జనాలు పల్లెలో ఉపాధి లేక విదేశాలకు వలస వెళుతున్నారు.మన దేశంలో విద్యార్థులు చదువుకున్న చదువుకు సరైన ప్రోత్సాహం లేక ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తూ బతుకు గడుపుతున్నారు. అడవుల్లో స్వేచ్ఛగా జీవించే పశువులు,పక్షులు, జంతువులు అడవుల నరికివేత వల్ల వాటి మనుగడ కరువై జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.ముకుంద రామారావు కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన సందర్భంగా అతనిలో కలిగిన భావాలు ప్రేరణగా నిలిచాయి. గుండె లోతుల్లో నుండి పొంగి పొరలే భావాలతో కవిత అక్షర రూపం దాల్చింది.ఇది కూతురు వివాహం చేసి అల్లునితో వియ్యంకుని ఇంటికి సాగనంపుతు కలిగిన దుఃఖము,వేదన నుండి జాలువారిన కవిత.వేదన నుండే కవిత్వం పుడుతుంది అంటారు.కవి ముకుంద రామారావు అనుభవించిన తీయని వేదనగా తోస్తోంది. కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసి భర్తతో పంపించడం తల్లిదండ్రుల బాధ్యత.తండ్రిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినాడు.మనుషులు వలస పోవడం తెలుసు.పక్షులు,జంతువులు వలస పోవడం తెలుసు.మందహాసం వలస పోవడం ఏమిటి? అని మనలో సందేహాలు రేకెత్తవచ్చు.వలస పోయిన మందహాసం కవితా సంపుటిలో సుప్రసిద్ధ విమర్శికుడు చేకూరి రామారావు చేరా గారి ముందు మాటలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో అచ్చయిన వలస పోయిన మందహాసం అనే కవిత ఖండిక ద్వారా తెలుగు కవితాభిమానుల దృష్టిని ఆకర్షించిన వై. ముకుంద రామారావు గారు ఈ దశాబ్దంలో గొంతు విప్పిన కొత్త కవి.తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం.ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు.సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు.భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది.పారదర్శకత్వం ఉండదు.పదౌచిత్యం ఉంటుంది.పదాడంబరం ఉండదు.భావ గాంభీర్యం ఉంటుంది.భాషా క్లిష్టత ఉండదు.పురోగమన శీలత ఉంటుంది.

సిద్ధాంత వలయం ఉండదు.అనుభవం వైయుక్తికమే. దృక్పథం విశ్వజనీనం.ఇది ఈయన తొలి కవిత సంకలనమే కాని తొలి నాటి కవితల సంకలనం కాదు అని చక్కటి ముందుమాట రాశారు.వలస పోయిన మందహాసం కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే కవి ముకుంద రామారావు వలస పోయిన మందహాసం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి/నాకే వీడ్కోలిస్తున్నప్పుడు/ ఇన్నాళ్లు/గుండె గదిలో వొదిగి వొదిగి/కళ్ళకేదో మంచు తెర కప్పి/చూస్తూ చూస్తూనే/గువ్వలా ఎగిరిపోయినట్టుంది/అంటున్నారు.వీడ్కోలు మరియు సంతోషకరమైన సమయాల్లో మనం మళ్ళీ కలుద్దాము అని విడిపోతున్నప్పుడు చెప్పుకుంటాం. విడిపోతున్నప్పుడు శుభాకాంక్షల వ్యక్తీకరణ వీడ్కోలు.ఇది అభిమాన పూర్వకంగా ఉంటుంది. వీడ్కోలు అంటే ఎవరైనా బయలుదేరడం.సుదీర్ఘ ప్రయాణం,పదవీ విరమణ సందర్భంలో వీడ్కోలు చెప్పబడుతుంది.అతడు ఆమె ఆనందాల కలయికకు ప్రతిరూపంగా చైతన్యం వెల్లి విరిసి అద్భుతమైన ఒక పాప రూపం దాల్చింది.అతని భార్య నవ మాసాలు మోసి ఓ సుందర చైతన్య రూపం గల పాపకు జన్మనిచ్చింది.అతని కూతురు పెరిగి పెద్దయి వివాహం జరిగిన సందర్భంగా తండ్రి అయిన తనకు వీడ్కోలు చెబుతూ భర్త వెంట బయలుదేరడం చూసి తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.చిన్నారి పాపాయి ఇన్నాళ్లు ఈ ఇంట్లో బుడిబుడి నడకలతో మెదిలి తన హృదయపు గదిలో ఒదిగి ఒదిగి ఉన్నది.ఆ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.పెళ్లి సందడితో భాజా భజంత్రీలతో రంగు రంగుల తోరణాలతో ఆ ఇల్లు ఆనందంతో బంధు,మిత్రుల సందడి సమాగమంతో ఒక రకమైన హడావుడి కొనసాగుతుంది.ఒక పక్క సంతోషం మరొక పక్క ముప్పిరిగొన్న బాధ ఆ తండ్రిలో కనబడుతుంది. రేపటి నుండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి కనిపించదు. తన కళ్ళకేదో మాయ కమ్మినట్లు మంచు తెర కప్పినట్లుంది.చూస్తూ చూస్తూ ఉండగానే తన ముందు నుండి గువ్వలా రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుంది.తన కళ్ళను తాను నమ్మలేక పోతున్నాడు.అమ్మాయి గువ్వవలె ఎగిరిపోయినట్లుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.“తెలిసి తెలిసి/సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది/సందడిని సంబరాన్ని మూట కట్టుకు పోయిందేమో!/అంటున్నారు.వలసను ఆంగ్లంలో Migration అంటారు.అనగా రుతుక్రమంగా,జంతువులు పక్షులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం చూస్తుంటాము.గుడ్లు పెట్టే స్థలాల కోసం,ఆహార సేకరణ కోసం వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పక్షుల వలసలు జరుగుతాయి.చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైన మార్గాలలో వలస పోతాయి.వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలస పోయి గుడ్లను పెట్టి పొదిగి పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగి వస్తాయి.సైబీరియన్ పక్షులు,పొడవాటి ముక్కు, భారీ రెక్కలు,అందంగా,ఆకర్షణీయంగా కనిపించే ఈ కొంగలు వచ్చి చెట్లపై విడిది చేస్తాయి.5000 వేల కిలోమీటర్ల దూరం నుండి జనవరి మాసంలో వచ్చి జూన్ చివరి నాటికి వెళ్లిపోతాయి.ఈ సైబీరియన్ పక్షులు ఒంటరిగా వచ్చి గుడ్లు పెట్టి పిల్లలతో పాటే తిరిగి సైబీరియాకు వెళ్లిపోతాయి.ఇది అందరికీ తెలిసిన సంగతి.వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతో వెళ్లడం కొత్తది ఏమీ కాదు.ఆ విధంగానే అమ్మాయి వివాహం చేసుకొని అత్త వారింటికి వెళ్లడం,సుదూర ప్రాంతాలకు సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది.తమ ఇంట్లో మెదులుతూ తన మాటలతో ఆటలతో పాటలతో మందహాసంతో అలరించిన అమ్మాయి సందడిని సంబరాన్ని మూటగట్టుకొని వెంట తీసుకొని పోయింది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.“ఇంతలోనే మేము మనుష్యుల మధ్యే లేనట్టుంది/ అనుభవానికొస్తేగాని/ఏ వేదనైనా అర్థం కాకుండా ఉంది/అంటున్నారు.వేదన అనగా తీవ్రమైన మానసిక బాధ.ఆవేదన అనగా తీవ్రమైన బాధ.పెళ్లి కాగానే అమ్మాయి అత్త వారింటికి వెళ్ళింది. అమ్మాయి ఇంట్లో లేక పోవడం వల్ల మేము మనుషుల మధ్య లేనట్లుగా తోస్తుంది.అమ్మాయి లేని వెలితి మా ఇంటిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.వివాహ బంధం వల్ల అతనితో అమ్మాయి వెళ్లిపోవడం చేత తీవ్రమైన మానసిక బాధ ఏర్పడింది.అమ్మాయి ఇంట్లో కనిపించక పోవడం వల్ల తీవ్రమైన బాధ కలిగింది.ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి లేని లోటు అనుభవం ద్వారా తెలిసింది.పెళ్లిలో అప్పగింతల కార్యక్రమం చేసి అమ్మాయిని పంపించిన తర్వాత అనుభవం ఏర్పడింది.తీవ్రమైన మానసిక బాధ,అనుభవం ద్వారా తనకు తెలిసింది. ఇది అంతా అయోమయంగా అర్థం కాకుండా ఉంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.”చెంగు చెంగున గెంతులు/చిన్నప్పటి గుజ్జెన గూళ్ళు/చిలిపి చేష్టలు/ఇళ్ళంతా నింపిన అలంకరణలై/ఇంటందరికీ గుర్తు చేస్తూనే ఉంది/అంటున్నారు.గుజ్జన గూళ్ళు దీనిని బువ్వలాట అని కూడా అంటారు. బువ్వలాటను పూర్వము ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు కలిసి ఆడుకునే వారు.పిల్లలు ఇంటిలో తమ పెద్ద వాళ్లను అడిగి బియ్యము,పప్పులు,బెల్లం, చక్కెర తెచ్చుకొని వాటిని పొయ్యి మీద పెట్టినట్లు నటిస్తూ వంట తయారు కాగానే పొయ్యి మీద నుంచి దించినట్లు నటిస్తూ కొంత సేపటికి అందరు కలిసి తింటారు.గుజ్జన గూళ్ళు ఆటను ఆడినప్పుడు బొమ్మల పెళ్లి చేసి రెండు జట్లుగా ఏర్పడి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు.బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దాని గుజ్జును గుల్ల చెడకుండా పూర్తిగా తీసివేసి ఆ గుల్లలో బియ్యం పోసి దానిని మండుచున్న పొయ్యిలోకి కుమ్ముతోనే పెట్టి ఉడికిన తర్వాత పిల్లలు గుజ్జన గూళ్ళు అని వేడుకగా తింటారు.పిల్లలు ఇల్లంతా తిరుగుతూ చెంగు చెంగున గెంతుతారు.తోటి పిల్లలతో కలిసి గుజ్జన గూళ్ళు బొమ్మల ఆటలు ఆడతారు.పిల్లల చిలిపి చేష్టలతో కోతుల వలె ఇల్లంతా గెంతుతూ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ అలరిస్తారు.

అమ్మాయి ఆడిన బొమ్మలు ఇంటిలో అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.అమ్మాయి నడయాడిన ఇల్లు ఆడిన బొమ్మలతో ఆ నేల అంతా ఒక రకమైన పరిమళంతో నిండి ఉంది.అమ్మాయి ఇంటి వారందరికీ అనుబంధాలను గుర్తు చేస్తూనే ఉంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. “ఎగిరిపోయిన ఛాయా లెక్కడా లేవు/కనిపించక కలవరం తప్ప/లేకుండా ఉండలేని నిర్లిప్తత తప్ప/ నువ్వైనా నేనైనా/మొలకెత్తిన చోటే మొక్కలన్నింటిని ఉండనీయం/పూచిన పూలనీ,పండ్లనీ,చెట్టుకే వదిలేయం/ఎంత లేదన్నా కాదన్నా/విడిచిపోలేని బాధ/విడదీస్తున్న చేతులకంటదు/అంటున్నారు. అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా జీవితం గడపడానికి అత్త వారింటికి వెళ్లిపోయింది.
అమ్మాయి గువ్వవలె ఆకాశంలోకి ఎగిరిపోయిన ఛాయలు ఎక్కడ కనిపించడం లేదు.అమ్మాయి పెళ్లి చేసుకుని కన్న వారిని వదిలి అత్తవారింటికి వెళ్ళిపోయింది.ఇక కన్న వారి ఇంటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి జాడ కనిపించదు.కాబట్టి తండ్రికి ఆ కుటుంబంలో అమ్మాయి లేదనే కలవరం ఏర్పడింది.అమ్మాయి కన్నవారి ఇంటిలో లేదు. అమ్మాయి లేకుండా ఉండలేని ఒక రకమైన నిర్లిప్తత ఇంటిల్లిపాదికి ఏర్పడింది.నువ్వు,నేను,ఎవరు అయినప్పటికీ మన ఇంటి పెరట్లో మొలకెత్తిన మొక్కలు అన్నింటిని ఒక్కచోట ఉండనీయం. మొక్కలను మన ఇంటి పెరట్లో అనువైన చోట నాటుతాం.మన ఇంటి పెరట్లో కాసిన కాయలను పక్వం రాగానే పండ్లను తెంపుతాం.చెట్టుమీద కాచిన పండ్లను చెట్టుకే వదిలి వేయడం జరగదు.ఎంత లేదు కాదు అని చెప్పినప్పటికీ అమ్మాయిని విడిచి ఉండలేని ఒక రకమైన బాధ ఆ ఇంటిలో కొనసాగుతుంది.అమ్మాయిని అత్త వారింటికి పంపించిన బాధ కన్నవాళ్ళ చేతులకు అంటదు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.లేదంటే చూడు/ పోగొట్టుకున్న వాడి ముందు/గెల్చుకున్న వాడి గర్వంలా/ఆ చేతిలో చేయి అభయ హస్త మవునో కాదో/మందహాసమై మెరుస్తోంది/సరిగ్గా ఒకప్పటి నాలాగే/అంటున్నారు.నవ్వు,మందహసం,దరహాసం ఒక విధమైన ముఖ కవళిక.నవ్వుతో ముఖంలోని వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండేవి సంకోచిస్తాయి.మానవులలో నవ్వు, సంతోషం,ఆనందానికి బాహ్య సంకేతం. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో,ఉత్తేజాన్ని కలిగిస్తుంది నవ్వు. ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది నవ్వు. అనేక రోగాలను దూరం చేసే టానిక్ నవ్వు.
నవ్వు శారీరకంగాను,మానసికంగాను,ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.నవ్వు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నవ్వడం వల్ల బాధను మరిచిపోతాం.నవ్వు శారీరక మానసిక రుగ్మతులను దూరం చేసి ప్రశాంతతను పోషిస్తుంది.చిరునవ్వు,మందహాసం అనగా పళ్ళు కనిపించకుండా పెదవులు విరిసి విరవకుండా నవ్వడం.అతనితో పెళ్లి చేసి పంపించి అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రిలో వేదన కనబడుతుంది. అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రి ముందు వివాహం చేసుకొని అమ్మాయిని గెలుచుకున్న అతనిలో ఒక రకమైన గర్వం కనబడుతుంది. అమ్మాయికి అతను చేతిలో చెయ్యి వేయడం చూసినాడు.అమ్మాయికి అతను రక్షణగా ఉంటాడో లేదో అనే సందేహం కలిగింది.పెళ్లి చేసుకుని అమ్మాయిని వెంట తీసుకొని పోతున్న అతని ముఖంలో చిరునవ్వు వలె మెరుస్తోంది.అమ్మాయి తండ్రి కూడా వివాహం చేసుకొని తన భార్యను తన వెంట తీసుకు వచ్చాడు.అమ్మాయి తండ్రి తన వివాహం రోజు నాటి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉన్నాడు.ఒకప్పటి తనలాగే అమ్మాయి వివాహం జరిగింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వలస పోయిన మందహాసం అనే చక్కటి కవిత రాసిన ముకుంద రామారావును అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
యల్లపు ముకుంద రామారావు తేది 09 – 11 – 1944 రోజున పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్ లో జన్మించాడు.తల్లి ఎరుకలమ్మ,తండ్రి యెల్లయ్య. తండ్రి రైల్వే ఉద్యోగి.ముకుంద రామారావు ఎమ్మెస్సీ మ్యాథ్స్, డి.ఐ.ఐ.టి., పి.జి.డి.సి ఎస్. ఖరగ్పూర్ లో చదివారు.వీరు రైల్వే శాఖ లో కంప్యూటర్ రంగంలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి భార్య పేరు సుభాషిణి.ముకుంద రామారావు, సుభాషిణి దంపతులకు ముగ్గురు సంతానం;1) లావణ్య 2)చైతన్య, 3)కళ్యాణ చక్రవర్తి.
వీరు రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభించి కవిగా స్థిరపడ్డారు.వీరు అనువాదకుడిగా రాణించారు.
ముకుంద రామారావు వెలువరించిన గ్రంథాలు స్వీయ కవిత్వం.
1) వలస పోయిన మందహాసం – 1995/2) మరో మజిలీకి ముందు – 2000./3) ఎవరున్నా లేకున్నా – 2004/4) నాకు తెలియని నేనెవరో – 2008/5) నిశ్శబ్దం నీడల్లో – 2009/6) విడని ముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – 2013./7) ఆకాశయానం – 2014/.8) రాత్రి నదిలో ఒంటరిగా – 2017/9) నిశ్శబ్దంలో శబ్దం – 2024.
ముకుంద రామారావు వెలువరించిన స్వీయ అనువాద రచనలు :1) అదే ఆకాశం – 52 మంది కవుల పరిచయం,70 కవితలతో 23 దేశాల అనువాద కవిత్వం.తొలి ప్రచురణ – 2010.మలి ప్రచురణ – 2023/ 2)అదే గాలి (2000 మంది కవుల పరిచయం,500 కవితలు,560 పేజీలు, వందకు పైగా ప్రపంచ దేశాల కవిత్వం – నేపథ్యం) – 2016/3)అదే నేల (3000 మంది కవుల పరిచయం, 700 కవితలు,900 పేజీలు,నలబైకి పైగా భారతీయ భాషల కవిత్వం – నేపథ్యం)2019/ 4)అదే కాంతి (210 మంది కవుల పరిచయం,1200 కవితలు,750 పేజీలు,మధ్యయుగంలో భక్తి కవిత్వం సామాజిక నేపథ్యం) – 2022/ 5) అదే నీరు – వంద మంది కవుల 700 కవితల జాతీయ అంతర్జాతీయ కవుల కవిత్వం,పరిచయం విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురితం) – 2023.
6)శతాబ్దాల సూఫీ కవిత్వం – 52 మంది కవుల 121 కవితలు -2011./7)1901 నుండి నోబెల్ కవిత్వం (37 మంది కవుల 171 కవితలు, 320 పేజీలు, నోబెల్ కవుల కవిత్వ – జీవితవిశేషాలు) – 2013/ 8)1901 నుండి సాహిత్యంలో 13 మంది నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015)/ 9) భరత వర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం – (2017)/ 10) చర్యా పదాలు – 23 మంది కవుల 50 కవితలు (అనేక భాషల ప్రథమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) -2019/ 11) మిణుగురులు ( టాగూర్ Fireflies కు తెలుగు అనువాదం) కినిగె ఈ – బుక్ – (2022)/ 12)ఇసుక నురగ (ఖలీల్ జిబ్రాన్ Sand and Foam కు తెలుగు అనువాదం) – కినిగె ఈ బుక్ – (2022./13) మియా కవిత్వం – అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం (2022)./
14)బెంగాలీ బౌల్ కవిత్వం – 80 మంది బౌల్ కవుల 170 బౌల్ కవితలు – (2023)/వీరి కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదాలు :1)వలస హోద మందహాస – మొదటి రెండు కవిత్వ సంకలనాల్లోని కవితల కన్నడ అనువాదం (2005)/2)The Smile That Migrated And Other Poems – మొదటి మూడు కవిత్వ సంకాలనాల్లోని కవితల ఆంగ్ల అనువాదం – (2011/).వీరు రచించిన కథలు/ ఇతరాలు : (విశాలాంధ్ర/ నవచేతన ప్రచురణలు) :1) దేశ దేశాల కప్పల కథలు – (2010)./2) నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015)/3) వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) -(2018)/4) అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019).
వీరు రాసిన పుస్తకాలు ప్రచురణలో ఉన్నవి/ 1) నిశ్శబ్దంలో శబ్దం – స్వీయ కవిత్వ సంకలనం./2) నా ఇల్లెక్కడ? – కథల సంకలనం./3) ఆసక్తి – వ్యాస సంకలనం./ 4) విశ్లేషణ – సమీక్షలు సమాలోచనలు./5) అనామక ప్రతిబింబాల ప్రవాహం (టాగూర్ చిత్రాల కవిత్వం కు తెలుగు అనువాదం)
వీరు పొందిన పురస్కారాలు :1) వలస పోయిన మందహాసం కవితా సంకలనానికి శ్రీ రమణా సుమన శ్రీ పురస్కారం – (2000)./2) వచన కవిత్వానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం – (2009)/.3)C.P. బ్రౌన్ పండిత పురస్కారం (హ్యూస్టన్ USA లో) – (2015)./4) అదే గాలి ఉత్తమ సాహిత్య గ్రంధానికి గంగిశెట్టి స్మారక మహాంద్రభారతి పురస్కారం (2017)./ 5) నోబెల్ కవిత్వ గ్రంథానికి అనువాద ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – (2017)6) అదే నేల (భారతీయ కవిత్వం – నేపథ్యం) గ్రంథానికి తాపీ ధర్మారావు పురస్కారం – (2020)./ 7) కవి సంధ్య ప్రతిభ పురస్కారం (అనువాదానికి) – 2021/.8) అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం,సామాజిక నేపథ్యం) గ్రంథానికి పెమ్మరాజు లక్ష్మీపతి గారి స్మారక పురస్కారం – 2022/.9) మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కారం – 2022/.10) కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ వేములపల్లి కేశవరావు, శ్రీమతి విశాల గార్ల అనువాద ప్రతిభా పురస్కారం – 2022/.11)అజో- విభో -కందాళం ఫౌండేషన్ వారి 2024 ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం/12) విజయనగరం విజయ భావన 2024 ఉగాది పురస్కారం/.వీరు రాసిన ఇతరాలు :
1) ఆంగ్లం పోలిష్,హిందీ,ఉర్దూ,బెంగాలీ,కన్నడం, తమిళం,మలయాళం,ఒడియా,సంతాలీ, మరాఠీల్లో కి ఎన్నో కవితల అనువాదాలు./2) వివిధ సంకనాల్లో,కవిత వార్షికల్లో,కవితా దశాబ్ది సంచికల్లో,/అనేక వెబ్సైట్లలో కవితలు/ 3) ప్రతిష్టాత్మక the little magazine సంకలనం India in Verse – Contemporary poetry from 20 Indian Languages and 167 Poets సంకలనంలో అనువదించబడ్డ కవిత ప్రచురితం./4) మధురై నుండి ప్రచురితమయిన Kavya Bharathi 2008 -Study Centre for Indian Literature in English and Translation,American College సంకలనంలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం. 5) ఈ క్రింది సంకలనాలలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం./ I)Pride of Place – An anthology of Telugu Poetry. 1981 -2000 with 117 Poets – K.Damodhar Rao/.ii)Voices on the Wing – Telugu Free Verse – 1985 – 95 – V.V.B.Ramarao/iii)VIRTUOO -A refereed Transnational Bi -Annual Journal of Language and Literature in English /iv)San Diego Poetry Annual 2011 – 12,2015 -16 (The Best Poems from every corner of the Region)/v)Wakes on the Horizon – A Selection of Poems translated from Telugu – N.S.Murthy./6) వలస పోయిన మందహాసం కవితా సంకలనం మీద వార్త దినపత్రికలో సంపాదకీయం./7) కేంద్ర సాహిత్యఅకాడమీ,తెలుగు విశ్వవిద్యాలయం/,Hyderabad Literary Festival లాంటి సంస్థల్లో పత్ర సమర్పణ, కవిత్వ పఠనం. 8) ఆకాశవాణి రేడియో కేంద్రాలలో, టీవీలలో,కవితల ప్రసారం, పరిచయ ప్రసంగాలు/9) కేరళ తుంజన్ 2013 కవితోత్సవాలకు తెలుగు కవిగా ప్రత్యేకాహ్వానం./10)”రాత్రి నదిలో ఒంటరిగా” కవిత్వ సంకలనం మీద మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్. పట్టా ప్రదానం – 2018./వివిధ గ్రంథాలలో వీరు రాసిన పరిచయ వ్యాసాలు :/1)Modern Poetry in Telugu – వడలి మందేశ్వర రావు./2) సాహిత్య మహిళావరణం, కవిత్వానుభవం – చేరా/.3) సాహిత్యకీయాలు – ఏ.బి.కె/.4) అభివ్యక్తి – గుడిపాటి/.5)సాలోచన – గోపి./6) గుండెతడి – జింబో/.7) ఈ కాలం కవులు – సౌభాగ్య./8) సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు – మునిపల్లె రాజు./9) తెలుగులో ఆధునిక నవల – ఇతర వ్యాసాలు – అంపశయ్య నవీన్.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
“నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
“జీవితమా …
“ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
“ఎంత గారాల బిడ్డనో నేను ? “
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది.అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది. స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు,బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి.స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు. మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది. ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం.మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు.జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది.తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (17)
తెలుగులోకి అను సృజన ;గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఎందుకు ఎప్పుడు నా వెంటే
“నడుస్తుంటావని నా నీడను అడిగాను
“మరి ఇంకెవరున్నారు నీకు తోడుగా
“ చెప్పు .. అంటూ చిన్నగా నవ్వేసింది నా నీడ !
నీడ ఇది ఒక మూల పదం.నీడ లేదా ఛాయకు ఆంగ్లంలో Shadow అని అర్థం.మనం నీడ కోసం గొడుగులు వాడతాము. ఇవి వేసవి కాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.కాంతి ప్రసారాన్ని వస్తువు అడ్డగించినప్పుడు,అడ్డగించిన ఆకారాన్ని పోలిన నల్లటి ఆకారం నీడ.పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడను ఉపయోగించి సమయాన్ని కనుగొనేవారు.తోలుబొమ్మలాటలు బొమ్మల నీడలను ఉపయోగించి జన రంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో ఉంది.ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి.సూర్యుని వెలుతురు పడని స్థలం నీడ.సూర్యుని ప్రకాశానికి ఏదైనా వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది. ఎండా కాలంలో బాటసారి చెట్టు నీడలో చేరి సేద తీరుతాడు.ఒక వస్తువు యొక్క ప్రతిబింబం కనిపించుట నీడ.వెలుతురు ఉన్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి కనిపిస్తుంది.అది నీడ.ఈ కవిత ఒక భావోద్వేగంతో కూడిన భావనను ప్రతిబింబిస్తుంది.ఇందులో కవి తనకు నీడతో ఉన్న అనుబంధాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరిస్తాడు.వ్యక్తి తన నీడను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ”ఎప్పుడు నా వెంటే నడుస్తుంటావు ఎందుకు?దానికి నీడ సమాధానం ఇస్తుంది.నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చిన్నగా నవ్వుతూ అంటుంది.ఈ వాక్యం మనుషుల జీవితాలలో తోడుగా ఉండే ఒంటరితనాన్ని,అనుబంధాలను ప్రతిబింబిస్తుంది.నీడ ఇక్కడ కేవలం శారీరకంగా ఉండే దృగ్విషయం మాత్రమే కాదు.మన జీవన ప్రయాణంలో నీడ అణుకువగా ఉన్న తోడు అని భావించవచ్చు.నీడను అడగడం ద్వారా తనను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా?అనే ఆలోచనను వ్యక్తం చేస్తాడు.ఇది మనిషి జీవితంలో సహజంగా ఎదుర్కొనే ప్రశ్నలను ప్రతిబింబిస్తుంది.నీడ సమాధానం చెబుతూ నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం ద్వారా వ్యక్తికి సానుభూతిని కలిగిస్తుంది.నీడతో చెప్పిన మాటలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి.ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది.ఒంటరిగా ఉన్న సమయంలో మనిషి తనకు తానే తోడుగా నిలుస్తాడు.నీడ ఎక్కడైనా నవ్వుతుందా?అనే ప్రశ్నలు మనలో చెలరేగుతాయి.
నీడ చిన్నగా నవ్వడం అనేది కవితలో ఒక తేలికపాటి దార్శనిక భావనను సూచిస్తుంది.ఇది మనం సాధారణంగా చూసే విషయాలను ప్రత్యేక దృక్పథంలో పరిశీలించవల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.ఈ కవితలోని భావనలు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి.మన జీవిత ప్రయాణంలో కొన్ని సార్లు మనకు మనమే తోడుగా నిలవాలి.నీడ మనకు స్నేహం,నమ్మకం,ధైర్యం కలిగిస్తుంది.నీడ మనకు ఎప్పుడు తోడుగా మన వెన్నంటి ఉంటుంది.నీడ ఎప్పుడు మనలని వదిలి పెట్టదు.మనుషుల ఒంటరితనం అలాగే మన ఆత్మ బలాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ వ్యక్తం అవుతున్నది.ఇందులో జీవితంలోని సహజమైన అనుబంధాలను చక్కగా తెలియజేసిన తీరు బాగుంది.ఈ కవిత మన జీవితంలో నీడ వలె ఉండే వ్యక్తుల గురించి చెబుతుంది.నీడ ఎల్లప్పుడు మన వెంట ఉంటుంది.అదే విధంగా మన జీవితంలో నీడ వలె కొంత మంది వ్యక్తులు ఎల్లప్పుడు మన వెంట ఉంటారు.ఈ కవిత మనల్ని మన జీవితంలోని వ్యక్తుల గురించి ఆలోచింపజేస్తుంది.మన జీవితంలో వారి పాత్రలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ కవితలో నీడ ఒక ప్రతీకగా ఉపయోగించబడింది. నీడ అనేది మన జీవితంలో ఎల్లప్పుడు మన వెంట ఉండే వ్యక్తులను సూచిస్తుంది.ఈ కవితలో భాష సరళంగా ఉన్నందు వల్ల అర్థం చేసుకోవడం సులభం.గుల్జార్ షాయరీ కవితలోని శైలి ప్రత్యేకతను కలిగి ఆకర్షణీయంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసం కలిగిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (18)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రతీ సంధ్య వేళలో నా కుశలం
“కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా …
“లేక … మీ ఊర్లో అసలు సాయంత్రమే “కాదా ఏంటి?”
రాత్రి ముగిసి సూర్యోదయం అయ్యే మధ్య కాలాన్ని అలాగే సాయంత్రం ముగిసి సూర్యాస్తమయం అయ్యే మధ్య కాలాన్ని సంధ్యా సమయం అంటారు. రాత్రి వేళ చలి మంట కాచుకుంటూ చంద్రుని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తుంటే ఎంతో కను విందుగా ఉండేది.ఆ సంధ్య వేళ వీచే చిరు గాలి చుట్టూ ఉన్న మొక్కల నుండి మోసుకొచ్చే పరిమళాలు ఇంపుగా ఉండేవి.సాయంత్రం అనేది పగటి పూట ముగింపుతో ప్రారంభమయ్యి మరియు రాత్రి మొదలు కావడంతో ముగుస్తుంది.ఈ కవిత ఒక వ్యక్తి తన స్నేహితుడితో సంభాషించడం గురించి చెబుతుంది.కవితలోని భావం హృదయానికి తాకేలా ఉంది.”ప్రతీ సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా?మర్చి పోయావా? లేక మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా? ఏంటి?అని కవితాత్మకంగా అడుగుతున్నాడు.ఈ కవిత మన జీవితంలోని స్నేహ ప్రాధాన్యతను వ్యక్తం చేస్తుంది. స్నేహితులు మన జీవితంలో ఎల్లప్పుడు మన వెన్నంటి తోడుగా రక్షణ కవచంలా నిలుస్తారు. స్నేహితులు ఎప్పుడు మన యోగ క్షేమాలపై దృష్టి సారిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైంది.స్నేహితులు మనల్ని సరి అయిన గమ్యంలో నడిపిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది.ఈ భావన స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని తెలుపుతుంది.స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయతతో అడగడం,సమాధానం ఇవ్వడం వంటి విషయాలు మనం ఎరిగినదే.ఇది స్నేహితుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.వారు పరస్పరం మరిచిపోని వారై ఒకరిపై ఒకరి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు.సాయంత్రం అనే కాలమానానికి మానవ సంబంధాలను అన్వయిస్తూ మనసులోని వ్యధను ఈ విధంగా వ్యక్తీకరించడం బాగుంది.ఈ కవిత ఒక వ్యధతో కూడిన ప్రేమను, ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేమ,దూరం కావడం మరియు మరిచిపోవడంపై కవి గుండెలో చెలరేగుతున్న అనేక అనుభూతులను వ్యక్తీకరిస్తుంది.ఈ కవితలోని ప్రతి పంక్తి లోతైన భావాలతో నిండి ఉంది.ప్రతి సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా? ప్రతి సాయంత్రం తనను గుర్తు చేసుకుంటున్నావా అని కవి ప్రేమతో,ముద్దుగా మనసులో నెలకొన్న సందేహంతో ప్రశ్నిస్తున్నాడు.మర్చిపోయావా అనే ప్రశ్న వేదనతో కూడిన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది ప్రేమలో ఉన్న అపార్థాలను అంతర్గత భయాన్ని సూచిస్తుంది.లేక,మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా ఏంటి? అని కవి ప్రశ్న ద్వారా సార్వజనీనమైన ప్రకృతిని కూడా వ్యక్తిగతంగా అన్వయిస్తున్నాడు. సాయంత్రం అనే సమయాన్ని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి తన గురించి ఆలోచించడం లేదని భావించి,అది నిజమా?కాదా?అని ప్రశ్నిస్తున్నాడు.ప్రేమికుల మధ్య ఎడబాటు మరియు దూరం వల్ల ఉత్పన్నమైన ఆత్మీయతను కోల్పోవడం మరియు ప్రేమలో కలిగే నిరాశకు ప్రతీకగా ఉంది.ఈ కవితలో ప్రేమికుల మధ్య పెరిగిన దూరం,సాయంత్రం వంటి ప్రత్యేక సమయాలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నాడా?లేదా?అనే అనుమానాన్ని, మరిచిపోయాడేమో అనే బాధను ప్రతిబింబిస్తుంది. ఇది వేదనతో కూడిన భావన.మీ ఊర్లో సాయంత్రమే కాదా ఏంటి?అనే ప్రశ్న ద్వారా కవితలో గంభీరతతో కూడిన భావన మరింతగా హృదయాన్ని తాకుతుంది.ఈ పంక్తి గుండెలో నెలకొన్న బాధను, అసహనాన్ని మరియు ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది.కవి ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని లేదా స్పందన లేకపోవడాన్ని గమనిస్తున్నాడు. సాయంత్రమే లేక పోతే అని రూపకాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి జీవితంలో ప్రేమను, ఆత్మీయతను తాను కనుగొనలేక పోతున్నట్లు భావిస్తున్నాడు.ఇది ఆ వ్యక్తిలోని అజాగ్రత్తను, స్పందన లేనితనాన్ని ప్రతిబింబిస్తుంది.సాయంత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని,ప్రశాంతతను, ఒక ప్రత్యేకతను గుర్తు చేస్తుంది.అయితే మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనే ప్రశ్న ద్వారా కవి ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయతకు చోటు లేదని పేర్కొంటున్నాడు.అది వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం వల్ల వచ్చిన కోపాన్ని,నిరుత్సాహాన్ని సూచిస్తుంది.మీ ఊర్లో సాయంత్రమే కాదా? అనే ప్రశ్న వ్యంగ్యంగా ఉంది.ఇది ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే పద్ధతిగా భావించ వచ్చు.అది నిజంగా సాయంత్రం లేక పోవడం గురించి కాదని, అతను సాయంత్రం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేస్తున్నాడు.ఈ పంక్తి ప్రేమలో నిర్లక్ష్యం లేదా మర్చిపోవడాన్ని సూచిస్తుంది.మనం మన ప్రియమైన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడం మరియు వారి కోసం ఆలోచించడం మన సహజమైన బాధ్యత. సాయంత్రం ప్రకృతిలో నిరంతర చక్రం కాగా అది వారిలో ఉండకపోవడం అంటే ప్రేమ,ఆత్మీయత లోపించినట్లు కవి భావిస్తున్నాడు..మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనేది వ్యక్తిగత బాధను, అపేక్షను మరియు అంతర్మధనాన్ని వ్యక్తీకరించే అద్భుతమైన ప్రశ్న.ఇది ప్రేమలో గోచరమయ్యే దూరం,నిజమైన భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను అద్భుతంగా వ్యక్తీకరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగిన వాడు.షాయరీ కవితలో పొందుపరిచిన భావాలు పాఠకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
“అనగనగా ఒక పెద్ద చెట్టు , చెట్టు తొర్రలో ఒక పెద్ద పక్షి…,”” ఆకు వేసి నీళ్లలో మునిగి పోతున్న చీమను కాపాడిన పావురం…” ఇవి ప్రపంచం గురించి తెలిపిన పంచతంత్రం కథలు, “ఏక్ కవ్వా ప్యాసా థా…”, బళ్ళో హిందీ సారు మొదటి కథా పాఠం, “ఊ ఊ .. ఆయమ్మ్మా ..పిట్ట రావే పిట్ట .. పిల్లల్ల తల్లి ” అని తమ్మునెత్తుకొని అమ్మమ్మలు తీసే రాగం, అలిగి విస్తట్లో మెతుకు ముట్టని కాకిలా నానమ్మ… బేరమాడి కొన్న కంజు పిట్టలు వండక ముందే ఎగిరి పోయినప్పుడు ఇంట్లో జరిగిన కొట్లాట…గంప కింద కమ్మి కాపు గాసిన కోడి పిల్లలు..సివంగిలా దూకే పిల్లల కోడి పెట్ట …ఇలా ఏ కార్టూన్ పాత్రలు కబ్జా చేయని చిన్నతనంలో పక్షులే గొప్ప హీరోలు.
భూతల జీవులు స్థానువులు అంటే వృక్షాలు, జంగామలు అంటే ఒకచోట నుంచి మరో చోటకి వేల్లగలిగేవిమనకు తెలుసు. భూమి మీదనే ఉంటూ గగనతలంనుంచి తన జీవితాన్ని కొనసాగించే మరో వర్గం జీవులు విహంగాలు.పక్షులకు మనకు అవినాభావ సమ్భంధం ఉంది. మన సాహిత్యంలోనూ వాతిక్ తగిన స్థానం ఉంది. సోహం కాస్తా హంసగా ఓం కారంగా మనం గుర్తుచేసుకునేది పక్షినే. ప్రసిద్ద ఇతిహాసం రామాయణం పక్షివేటతోనే మొదలౌతుంది. పక్షులు మన ఆహారంగానూ, వార్తహరులుగానూ, ఆహ్లాదం పంచె సాధుజీవులుగానూ మన జీవనాన్ని సులభాతరాన్ చేసాయి. అయితే ప్రాచీన పక్షిశాస్త్ర పరిశోధనలు,అన్వయాలు, స్వభావ పరిశీలనలకు చెందిన వివరాలు ఉన్నప్పటికీ ఆధునిక కాలానికి తగిన పరిశోధనలు చేసి, విలువైన సమాచారమేంతో నిబద్దతతో సేకరించి అందించిన సలీంఅలీ మనదేశపు పక్షి శాత్రవేత్తలలో అగ్రగణ్యుడు.పక్షుల చెలికాడు, అలుపెరుగని యాత్రికుడు.సలీం అలీ గురించీ ఆయన చేసిన అపూర్వ పరిశోధన గురించి తెలుసుకొనే ప్రయత్నంలో ఆరేళ్ల క్రితం ఆయన తన ఎనభై ఏడేళ్ల ఏళ్ల వయసులో రాసుకున్న ఆత్మ కథ The Fall a Sparrow చదివాను. ఈ మధ్య వచ్చిన రోబో 2.0 సినిమాలో సూటిగా మన మీద వదిలిన ప్రశ్న ‘యాభై గ్రాముల పక్షి నీతో కలిసి జీవించలేనప్పుడు నీదేమి అభివృద్ధి ..?’మరొక్క సారి సలీం అలీని గుర్తుచేసింది. పక్షులే జీవితంగా తొంభై ఏళ్ళ తన జీవితంలో దాదాపు ఎనభై ఏళ్ల జీవితాన్ని ధారపోసి భారతదేశంలో ఉన్న పక్షి జాతుల వివరాలను గ్రంథస్థంచేసి భారతీయ పక్షి పితామహుడిగా పేరుగాంచిన సలీం అలీ ఆత్మ కథ అది.
సలీమ్ అలీ 1896లో ప్రస్తుత ముంబై లో మొయిజుద్దీన్ , జీనత్ ఉన్నీసా దంపతులకు 9 వ సంతానం. సలీం పుట్టిన ఏడాదిలో తండ్రినీ మూడేళ్ల వయసులో తల్లినీ కోల్పోతే తల్లి తరపు మేనమామ అమీరుద్దీన్ త్యా బ్జి వద్ద మిగిలిన నలుగురు అన్నలు , నలుగురు అక్కలతో పాటు పెంపు చేయబడతాడు. మేనమామ నిస్సంతు కాగా ఆయన చేరదీసిన పిల్లలు చాలా మంది వీరితో పాటు ఉండేవారు. సాంఘికంగా ఉన్నతంగా ఉన్న నవాబుల కుటుంబం వారిది. ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ఆటపాటలతో గడిచేది. సంప్రదాయ ముస్లిమ్ కుటుంబపు ఆచారం ప్రకారం ఆహారంగా స్వీకరించ దగిన పక్షులు, జంతువుల్ని మాత్రమే హలాల్ చేసేవారు. పిచ్చుకలను తినడం ఇస్లాం ప్రకారం అనుమతించి బడింది కనుక చాలా సార్లు వాటిని వండడం అతనికి తెలుసు .కనుక అతని పాటు ఉండే పిల్లలు పిచ్చుకల్ని, ఇతర పక్షుల్ని, గుడ్లని వెతుక్కుంటూ వాటిని గమనిస్తూ గడిపేవారు.
సలీం తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ మేన మామ అతనికి ఒక వేటకు ఉపయోగించే తుపాకీని బహుమతిగా ఇస్తాడు. ఆ కాలంలో వేట అతి సాధారణమైన ఆటవిడుపు. కనుక పిల్లలు పిచ్చుకల్ని వేటాడుతూ వెంబడిస్తూ గడిపేవారు. ఒకసారి పొదల్లో ఉన్న పిచ్చుక గూడు వైపు గురిపెట్టి గూడు ముందు కాపలా ఉన్న మగ పిచ్చుకను కాల్చేస్తాడు. అప్పటికి గూడులోపల ఆడ పిచ్చుక గుడ్లను పొదుగుతోంది. మగ పిచ్చుక చనిపోయిన వెంటనే ఆడ పిచ్చుక ఎగిరిపోయి మళ్లీ వస్తుంది. చనిపోయిన మగ పక్షికి బదులు మరో మగ పక్షి గూటికి కాపలాగా వస్తుంది.సలీం మళ్లీ ఈ మగ పక్షిని కూడా కాల్చేస్తాడు. ఆడ పక్షి మళ్లీ ఇంకో మగ పక్షిని వెంటనే కాపలాకి తెస్తుంది. ఇలా ఎనిమిది పక్షుల్ని సలీం కాల్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు.తాను చంపిన ప్రతి సారీ మరో మగ పక్షి గూటికి కాపలా ఉంటోంది. ఇంత చిన్న పక్షి గూటికి కాపలా కోసం ఎంత పట్టుదలతో ఉందని.ఇది మొదటి సంఘటన.
మరో సారి వంట కొరకు తెచ్చిన పక్షుల్లో పసుపురంగు మెడ కలిగిన పిచ్చుక కనిపిస్తుంది. సలీం మనసులో ఒక అనుమానం .ఇది ఎప్పుడూ వండే పిచ్చుకలా లేదు .మెడ కింద పసుపురంగుతో ఉంది. దీన్ని తినడానికి ఇస్లాం అనుమతించిందా లేదా తెలుసుకోవాలని మేనమామ వద్దకు వెళ్తాడు. ఇది రెండో సంఘటన. ఆయన పక్షిని బాగా పరిశీలించి దీన్ని తినడానికి వీలులేదని తేల్చి బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ వద్దకు వెళ్ళమని చెపుతాడు. సలీం మేనమామ BNHS స్థాపించిన సభ్యుల్లో ఒకరు. కనుక బ్రిటిష్ వారు తమను తాము గొప్పగా ప్రకటించుకొని ఏర్పరచుకున్న మిథ్యా కుడ్యాలను దాటి అంత చిన్న వయసులో మిల్లార్డ్ ని కలుసుకునే అవకాశం దొరుకుతుంది. అది మొదలు సలీం పక్షుల గురించీ, వాటిని ఈ విధంగా సేకరించాలి అనీ, దాని చర్మం ఒలిచి శాస్త్రీయ అవసరాలకోసం భద్ర పరచడం , వాటి ఆవాసాలను, అలవాట్లను, జీవన విధానాన్ని గ్రంధస్తం చేయడం ఇలా పక్ష్షులకు చెందిన అనేక విషయాలలో నేర్పరి అవుతాడు.
సలీం 1914 నుంచి 1917వరకు బర్మాలో దగ్గరి బంధువుల వద్ద ఉంటాడు. 1918లో తెహ్మినా ను వివాహం చేసుకొని ముంబైలో కాపురం ఉంటాడు. 1924లో అప్పటికి BNHS ద్వారా కొత్తగా మొదలైన నాచురల్ హిస్టరీ మ్యూజియంలో గెస్ట్ లెక్చరర్ గా అవకాశం వస్తుంది. ఆ తర్వాత పక్షుల అధ్యయనాన్ని కొనసాగించడానికి మెరుగైన శిక్షణ కోసం బెర్లిన్ వెళ్తాడు.అక్కడ ఎర్విన్ స్ట్రెస్ మన్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతాడు.
1930లో ఇండియాకి తిరిగి వచ్చాక BNHS ద్వారా పక్షుల సర్వే చేయాలని నిర్ణయించి అప్పటివరకు పక్షులకు సంబంధించినటువంటి విషయాలలో తక్కువ తెలియబడిన హైదరాబాద్ సంస్థానాన్ని ఎంచుకొని హైదరాబాద్ స్టేట్ ఓర్నితోలోజికల్ సర్వే నిర్వహిస్తాడు.అందుకు గాను అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి అక్బర్ హైదరి మూడు నెలల కాలానికి మూడువేల రూపాయలు గ్రాంటుగా మంజూరు చేస్తాడు. ఆదిలాబాదు జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో వీరి బృందం బస చేసింది. 1931లో ఇప్పటి మహబూబ్నగర్ మన్ననుర్ ప్రాంతంలో కూడా బస చేసింది. 1897 వరకు వేటకు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ 1914లో నిజాం ఇచ్చిన నియమాల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ వన్యప్రాణులను వేటాడడానికి వీలు లేదు. నిజాం ప్రభువుకు అతని కుటుంబీకులకు, జాగీ ర్థార్లకు ఇందుకు మినహాయింపు. 1931 నుంచి సలీం అలీ హైదరాబాద్ సంస్థానంలో చేసిన పరిశోధనలను BNHS వారు ప్రచురించారు. హైదరాబద్ సంస్థానం అప్పట్లో పులుల వేటకు ప్రసిద్ది చెందింది. అమ్రాబాద్, ఉట్నూర్, పాకాల్ , ములుగు ఎక్కువగా వేటాడే ప్రాంతాలు.1930 లో గిజిగాడు లేదా వీవర్ బర్డ్ మీద రాసిన ఆర్టికల్ సలీం కి ఎంతో పేరు తెచ్చింది.
సలీం తర్వాత 1935 నుంచి 1939 వరకు డెహ్రాడూన్ లో ఉంటాడు. 1939 లో భార్య అనారోగ్యంతో మరణిస్తుంది. డెహ్రాడూన్ వెళ్ళేటప్పటికి చేతిలో ఉన్న Economic Ornithology ప్రాజెక్టును విరమించు కుంటాడు. పక్షుల ఆవాసం, ఆహారపు అలవాట్లు , అటవీ మరియు వ్యవసాయం మీద వాటి ప్రభావం పరిశోధించాలని భావిస్తాడు. ఆ తరవాత ఆఫ్ఘనిస్తాన్ ,మానస సరోవరం , కచ్ ప్రాంతం, భరత్ పూర్, బస్తర్, ప్రాంతాలలో పరిశోధనలు కొనసాగిస్తాడు.తన పరిశోధనల సారాన్ని 1941 లో బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ను , పది సంపుటాలు కలిగిన హ్యాండ్ బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్థాన్ ను, 1967 లో కామన్ బర్డ్స్ అన్న ఫీల్డ్ గైడును , 1985లో తన జీవిత చరిత్రను రాశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నకాలంలో అంతరించిపోయిందని అనుకున్న కలివికోడిని తిరిగి గుర్తించిన కడప జిల్లాలో ఆ పక్షిని పరిశీలించడానికి అయన స్వయంగా వచ్చారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి బతకకపోయినా దానిని గుర్తించడం ప్రపంచం మొత్తం మన దేశంవైపు చూసే పరిస్థితి కల్పించింది. ఆప్రాంతం ఇప్పుడు లంక మల్లెశ్వర అభయారణ్యంగాప్రకటించి సంరక్షణ చేస్తున్నారు. ఇలా పసితనం నుంచి చివరిదాకా ఆయన పక్షుల్తోనే సహజీవనం చేసాడు. చిరకాల చెలికాడయ్యాడు.
సలీంఅలీ విలువైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1958లో పద్మ భూషణ్ ను, 1976లో పద్మ విభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. ఈ మహనీయ పరిశోధకుడు తన తొంభై ఏళ్ళ వయసులో 1987 జూన్ మాసంలో మరణించాడు.సలీం అలీ పేరు మీద తమిళనాడులోని అనైకట్టిలో భారత పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ , BNHS ఆధ్వర్యం లో SACON సలీం అలీ సెంటర్ ఫర్ ఓర్నితొలజీ అండ్ నాచురల్ హిస్టరీ అన్న సంస్థను 1990 లో నెలకొల్పారు.అతనిని మొదటి సారి పరిశోధనా రంగానికి పరిచయం చేసిన యెల్లో త్రోటెడ్ స్పారో / పసుపు రంగు మెడ కలిగిన పిచ్చుక “సలీం అలీ ” పక్షిగా పిలవబడుతుంది. అంతే కాదు సలీం అలీ ఆంగ్లంలో మంచి పట్టుగల వ్యక్తి.అతను రాసిన వ్యాసం అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ప్రచురించిన ఇండియన్ మాస్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సంకలనంలో ప్రఖ్యాత రచయితలు రవీంద్రనాథ్ టాగోర్, సరోజినీ నాయుడుల సరసన చోటు సంపాదించుకున్నది.
ఈనాటికీ పక్షుల గురించిన ఏ సమాచారం కొరకు అయినా సలీం అలీ పుస్తకాలు ఎంత ప్రామాణికమైనవో , నేటి విద్యార్థి లోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే అతని జీవిత చరిత్ర అంతే తలమానికమైనది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది. అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు.మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది.స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు, బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు.మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది.ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం. మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు. జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది. తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.
ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని కవి మల్లారెడ్డి తమ తండ్రి లింగారెడ్డికి అంకితం ఇవ్వడం ముదావహం.ఈ పుస్తకానికి వి.లక్మి నారాయణ చారి చక్కటి ముఖచిత్రం అందించారు.కవి మల్లా రెడ్డి ఈ పుస్తకానికి ఒక మాట – కవి బాట అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు.కవిత్వం ఇలా ఉండాలని నిర్వచించను నేను.దానికి హద్దు ఉంటుందని అనుకోను.అది వివిధ కళారూపాలలో ఉంటుందని నమ్ముతాను.కవిత్వానికి పరమార్థం ఉండాలని నమ్మే వాళ్ళలో నేను ఒకన్ని.

ఈ చిన్న పుస్తకములో ప్రచురించిన గేయాలు,కవితలలో ఉన్నది కవిత్వమో,కాదో సహృదయులైన పాఠక మిత్రులు,కవులు,రచయితలు,విమర్శకులే నిర్ణయించాలి.నా గుండె చేస్తున్న లయకి,మనస్సు కంపనాలకి,సమాజములో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలకి నాకు తెలిసిన పదాలలో రూపకల్పన చేశాను.ఇవన్నీ నా అనుభూతి గీతికలు.నా కళ్ళు చూసిన నిజాలు,మనస్సు కనే కలలు.కవిత్వానికి సామాజిక స్పృహ,మానవతా దృక్పథం ఉండాలని, సమస్త మానవజాతి కళ్యాణం కోసం,సుఖ శాంతుల కోసం మానవున్ని కార్యోన్ముఖున్ని చేయాలని ప్రగాఢంగా వాంఛిస్తాను. ఉపనిషత్తులలో మన పూర్వీకులు నుడివినట్లుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతం గమయ అనే నానుడి కవిత్వానికి ఊపిరి కావాలి. మానవుడు అనంతంగా దోపిడీ చేయబడుతూనే ఉన్నాడు.దోపిడీ నశించాలి.మనుషులందరు స్వతంత్రులై ఆర్థిక,రాజకీయ,సాంఘిక,సమానత పొందాలని ఎన్నో కలలతో,ఆశలతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము.కాని జరిగింది ఏమిటి? సమానత్వం వచ్చిందా?రూల్ ఆఫ్ లా దేశములో పాటించబడుతుందా?దేశములో పోలీసులు,కోర్టులు ఆలోచనాసరళి,నడవడి ఏ విధంగా ఉంది?అని తోటి మనుష్యుల్ని ఆలోచింపజేయాలని ఈ కవితా సంపుటిని ప్రచురిస్తున్నాను.ఈ పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిని ఆదరించగలరని సహృదయులైన పాఠక మిత్రులను కోరుకుంటాను.ఇందులో ప్రధానంగా సామ్యవాదం,చైతన్యం గూర్చి చెప్పబడిన గేయాలే అధికంగా యున్నవి. ఇందులో కనిపించే ఇజం మానవ నైజం.మానవత అదే నా అంతరాంతరాలలో అనునిత్యం పారాడే అనుభూతి.ఈ చిన్న కవితా సంపుటిని ఆదరించగలరని కోరుకుంటూ సహృదయులైన పాఠకులను సాహితీ మిత్రులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అని కవి మల్లారెడ్డి అన్నారు. కవి మల్లారెడ్డి రచించిన విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి అంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం ఈ కవిత్వంలో చూడొచ్చు. దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హాలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు.వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్ట పడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్టపడే వాళ్ళు ఎవరు?అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా?లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.పల్లె పొలిమేరల్లోకి కవితలో నా వాళ్లంతా/నాగళ్లకు సిలువ వేయబడి/తరతరాలుగా/నెత్తురుని/నెత్తురు కంటే అమూల్యమైన చెమటని/సమాజం కోసం ధారపోస్తున్నప్పుడు/అంటున్నారు.మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటు పడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం.భారతదేశంలో రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధారపోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో నలభై సంవత్సరాల కింద రాయబడింది.ఇది కవితా సంపుటిలోని మొదటి కవిత.దేశంలో రైతులను నాగళ్ళకి సిలువ వేసినప్పటికీ దుక్కి దున్నడం మాన లేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండిని పెడుతున్నాడు.రైతే రాజు,జై కిసాన్, అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్లుగా ఉంది.వర్తమాన గీతం కవితలో గాలిలా/ సూర్యరశ్మిలా/విశాల విశ్వములో/నీలాల నింగిలా/ నేలా/నీరు/అందరిది/భౌగోళిక హద్దులు లేవు/స్వంత పద్దుల ఆలోచనే లేదు/అప్పుడు మనిషంటె/సమిష్టి మానవ సంఘంలో/ఒక అంగం – అంతర్భాగం/ నేడు/మనిషంటె/కులం/మతం/వర్గం/దేశం/ఖండం అంటూ/విశ్వ మానవాత్మని/ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు/మానవతని సమూలంగా హత్య చేస్తున్నారు/చీ!చీ!/ఏం దుర్గతి పట్టింది మానవ జాతికి/చీదరించుకుంటున్నవి/మిగతా నోరులేని విగత జీవులు/విప్పి చెప్పలేని సత్యాన్ని/విడమరిచి ముచ్చటించుకొంటున్నవి/మరి మనసున్న/ మనకెందుకు రాదు?/ఆ మంచి ఆలోచన/రండి కూర్చుందాము/తీరికగా చర్చిద్దాము/విశ్వ మానవ తత్వాన్ని/మంచి చెడుల/వెలుగునీడల/జాడల్ని వాడల్ని/గుండె మూలల్లో వెదుకుదాము/ అంటున్నారు.విశాల విశ్వంలో పంచ భూతాలు అందరివి.ఆ రోజుల్లో మనుషులందరు సమిష్టిగా కలిసి మెలిసి ఉండే వారు.నేడు మనిషి కుల మతాల పేరిట వర్గ విభేదాలను సృష్టిస్తున్నాడు. అధిపత్యం పేరిట దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి.మానవతను సమూలంగా హత్య చేస్తున్నారు.ఈనాటి మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది?మనుషులు విశ్వ మానవ తత్వాన్ని ఎరిగి మసులుకోవాలి అనే భావన అద్భుతంగా ఉంది. ఎంత హాయి కవితలో ఇప్పుడు రోజు పాడుతున్నాను/అదే పాట/జైల్లొ – రైల్లొ/బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి/అంటున్నారు.తెలంగాణలో ధనవంతులైన ఆసాములకు పోలీసులు దాసులుగా పని చేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి.ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు,జడ్జీల ముందు, ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కత్తి – డాలు కవితలో కాలం ఒక్కటే నాకున్న డాలు/నిజం ఒక్కటే నాకున్న కత్తి/నీకు ఎన్నెన్ని ఆయుధాలు/ అయినప్పటికి/గెలుపు నీకు సందేహమే?/ఎందుకో తెలుసా?/నా డాలు మానవత్వపు లోహపు ముద్ద/ నా కత్తి కమ్యూనిజంలో పదును పెట్టింది/ అంటున్నారు.డాలు పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించే ఆయుధం.వర్తులాకారంగా ఉండి మధ్యలో వుబ్బెత్తుగా ఉండును.వెనుక పక్కన చేతితో పట్టుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు కత్తి వేటును అడ్డు కొనుటకు డాలును అడ్డుగా ఉంచెదరు.కత్తి – డాలు జంట పదాలు.ఈ కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నేనెవరో తెలుసా?కవితలో ఇంతకి నా పేరు చెప్పనేలేదు/గౌతముడు నా రూపమే/జీసస్ నా ప్రతిరూపమే/గాంధీ నా వారసుడే/పేరు మానవత/ ఊరు విశాల విశ్వం/అంటున్నారు.సర్వ మానవాళి సుఖశాంతులు కాంక్షించడం,గౌతముడు,జీసస్, గాంధీ నా వారసుడే అని పేర్కొనడం,పేరు మానవత,ఊరు విశాల విశ్వం అని వ్యక్తపరిచిన భావాలు నిజాయితీని చాటుతున్నాయి.నేనెవరో తెలుసా?అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెప్పిన తీరు చక్కగా ఉంది.నిజం కవితలో ఇవాళ్ల పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ఎందుకో తెలుసా?/నేను అక్కపల్లిలో పుట్టినందుకు/అక్కపల్లిలో ఇరవై సంవత్సరాలు నుండి పెరిగినందుకు/స్వేచ్ఛగా గాడుపు పీల్చి నందుకు/దొరల మాట విననందుకు/అంటున్నారు.అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్ళతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా మలిచారు.దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పుకుంటారు.దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు అవునా?కాదా?అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందువులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపుదిద్దుకున్నాయి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.నడవడి కవితలో అయితె నేమి ఆ కామ్రేడు నడవడి/భావితరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమదూతల ఒరవడిలో/అంటున్నారు.సమాజంలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు కొనసాగుతున్నాయి. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగిపోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు.అత్యాచారాలు,అరాచకాలు,దోపిడీల గురించి ప్రశ్నించినందుకు,పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు.పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు.సమాజం కోసం పాటుపడుతున్న ఆ కామ్రేడు నడవడి,భావితరాలకి రహదారి,పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి?అని అడుగుతాడు.తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఎంత వరకు సబబు,ఏ శిక్షా స్మృతిలో ఉంది. పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మ శోధనలేని బతుకు అది ఏమి బతుకు?పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు,కళాకారులు ప్రజలను సరైన నడవడి కల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చేదు మాత్ర కవితలో ఏదో అన్యాయం జరిగి/వాడిలో ఆవేశం పెరిగి/ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమటని వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/ఆని పోకడేంది?/పటేలు ఎవ్వడు?/ ఆని పటాటోపం ఏంది?/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు?/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి?/కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను/అంటున్నారు.ఈ కవితను వ్రాసిన మల్లారెడ్డి న్యాయవాది,మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచేవాళ్లు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి. దొరలకి,పటేండ్లకి, పెండ్లిండ్లకు మరియు పేరంటాలకి జీవాలు ఇనాంగా ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై, పటేండ్లపై మరియు పోలీసులపై కక్ష ఎందుకు ఉంటుంది?ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి?అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం,దొరలు,పటేండ్ల ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి శిక్ష వేయడం ఎంత వరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కానీ తీరా శిక్ష పడ్డాక జడ్జీలలో కూడా పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర.జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జీలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదుమాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.ఖైది సంకల్పం కవితలో ఖైది కళ్ళలో/తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది/ అంటున్నారు.జైలులో ఉన్న ఖైదీ కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖశాంతులు లభించడం లేదు.ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది. పాలకవర్గాలు చేస్తున్న దోపిడీని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదీలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్ళలో కవి మల్లారెడ్డి ఒకరు. అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైదీ సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 164 Cr.P.C. STATEMENT (స్టేట్ మెంట్) కవితలో కాని/నిరాశ వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/ మర్మ సిద్ధాంతాన్ని/మాయ సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి వున్న/చీమలకు మాత్రం/చస్తే చెప్పలేను/ అంటున్నారు.చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య, నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను,గళాలను చంపుతున్నారు.

అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని,మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను.చీమలను ఉదాహరణగా చెబుతూ 90% ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద,తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షించే వారిలో ఒకరని కవిత చదివితే తెలుస్తుంది.కవి మల్లారెడ్డి ప్రజలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే కవితను అందించారు. ఇదెక్కడి న్యాయం కవితలో పాలకవర్గమా!/చట్టం, నువ్వు/ఇద్దరు నా శత్రువు చుట్టాలే అని చెబుతున్నా/చట్టం చెప్పినట్టు వింటామంటావేమిటి?/ఇదెక్కడి న్యాయం?/ అంటున్నారు.సాధారణంగా అన్యాయమును ప్రశ్నించే సందర్భంలో ఇదెక్కడి న్యాయం అని ఉపయోగిస్తాం.న్యాయం అనేది సమానత్వం, సత్యం,ధర్మం మీద ఆధారపడినది.కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో అన్యాయం చోటు చేసుకుంటుంది.అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా సమాజంలో ఇతరుల పట్ల జరగడం కావచ్చు.
అన్యాయం జరిగినప్పుడు మనలో ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి.కోర్టు వ్యవస్థలో ఆలస్యాలు మరియు న్యాయం ఆలస్యం కావడం వలన బాధితులకు న్యాయం దక్కడం లేదు.సత్వర న్యాయం జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.సమాజంలో ధర్మంపై న్యాయంపై ఆలోచింప జేస్తుంది.చట్టం,పాలకులు,సామాన్య మనిషి మధ్య ఉన్న విరోధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కవి న్యాయ వ్యవస్థ మరియు పాలకులపై ప్రశ్నలు లేపుతున్నాడు.ఇదెక్కడి న్యాయం?అని ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు.అన్యాయానికి గురి చేసిన పరిస్థితిని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలకు న్యాయం అందడం లేదు.సామాన్య ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అనే భావనను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.చట్టాలు తయారుచేసి అమలు చేసే పాలకులను ఉద్దేశించి పాలకవర్గమా?అని ప్రశ్నిస్తున్నాడు.పాలకులు సామాన్యుల అవసరాలను పట్టించుకోవడం లేదు. పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారనే భావం వ్యక్తం అవుతుంది.చట్టం మరియు పాలకులను శత్రువులుగా చూపించారు.చట్టం దుర్వినియోగం చేస్తున్నారు.పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు.ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.ఈ దేశంలో సామాన్యులకు న్యాయం అందుబాటులో లేదు.ఇది ఎలాంటి చట్టం?చట్టం వల్ల సామాన్యులకు మేలు జరగడం లేదు.ప్రజలు చట్టాలను గౌరవించడం తప్పనిసరేనా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు న్యాయస్థానాలు నిరాశను, పాలకుల తీరుపై వేదనను కలిగిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటూ కవి మల్లారెడ్డి న్యాయం గురించి ఆలోచింపజేస్తున్నారు.తేడా కవితలో చెలీ!/అప్పుడు నీవు నవ వసంత యామినివి/నాడు కనిపించినవన్ని/మల్లియలు – గులాబీలు/నేడు కనిపిస్తున్నవన్ని/పల్లేరులు – జిల్లేడులు/ ఎండమావులు – బండ బతుకులు/కన్నీళ్లు కష్టాలు/ పంతాలు సాధింపులు/నేడు వినిపిస్తున్నవన్ని/పిల్లల రోగాల గానం/దైనందిన జీవిత నిశ్శబ్ద భయంకర రావాలతో/నీవు నాడు అంది అందని ప్రేయసివి/ కలల ఊర్వశివి/నేడు అందిన యిల్లాలివి/నిరాశల నీడవి/నిట్టూర్పుల జాడవి/అంటున్నారు.చెలీ నీవు కనిపించినప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంది.నాడు అంది అందని ప్రేయసివి.నేడు అందిన ఇల్లాలివి,నిరాశల నీడవి నిట్టూర్పుల జాడవి అంటూ జీవితాన్ని కాచి వడబోసినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మానవుడే మరో దేవుడై గేయంలో మానవుడే మరో దేవుడై భూతలమ్మున స్వర్గము సృష్టించే/దేవుని మించిన దేవుడై సకల చరాచర జగతిని పాలించే/ కులాల గోడలు కూల్చి – మతాల ముళ్లను కాల్చి/మానవులందరికి మానవతయే గొప్ప మతమని చాటెను/శాంతి అమృతం పంచుతూ లోకమంత స్వర్గము చేయ తలంచే మానవుడు/అంటున్నారు.మానవుడే మరో దేవుడై అనే గేయ వాక్యం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.మానవుడు దేవుడితో సమానమైన వ్యక్తిగా భావించబడుతున్నాడు.భూమి మీద స్వర్గాన్ని సృష్టించగల సత్తా మానవునికి ఉన్నది. మానవుని ఆలోచనలు గొప్పవి.మానవుడు సృష్టికి శాంతిని,సంతోషాన్ని ప్రపంచానికి అందించగలరని చెప్పబడింది.మానవుడు దేవుని కంటే గొప్ప శక్తిపరుడు,సమస్త చరాచర జగతిని పాలించగలవాడిగా చూపబడ్డాడు.కులాల మధ్య ఉన్న గోడలు,మతాల మధ్య ఉన్న విభేదాలు తొలగించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కవి ఆశిస్తున్నాడు.మానవుడు శాంతి,సామరస్యం, సహనం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఈ లోకాన్ని స్వర్గంగా మార్చాలని తలుస్తున్నాడు.ఈ గేయంలో మానవతా విలువల్ని ప్రోత్సహించి సమాజం అంతట శాంతిని వ్యాప్తి చేయాలనే భావన వ్యక్తం అవుతుంది.మానవుడిని మహోన్నతునిగా గేయంలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. మనుష్యులారా! కోయిలలై గేయంలో మనుష్యులారా కోయిలలై/యిలపై వసంత గానం చేయండి/సమ సమాజానికి ఊపిరి పోయండి/ ఓరిమి పంచి కూరిమి పెంచి/మనిషి అంటే మంచి తనమని చాటుతూ/నవ వసంత గానం చేయండి/ అంటున్నారు.మనుష్యులను కోయిలలతో పోలుస్తూ సమాజంలో వసంతాన్ని తీసుకురావాలని వసంతం కొత్త ఆశలకి సంతోషానికి చిహ్నం. మనుష్యులు కోయిలలా మారి ప్రేమతో ఐకమత్యంతో జీవించాలని కోరుతున్నారు. సమాజంలో అందరికీ న్యాయం,సమానత్వం, అందరు స్నేహంతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ సమాజాన్ని మంచి దిశలో నడిపించాలని సూచిస్తున్నారు.మనుష్యుల మధ్య ప్రేమను, ఆత్మీయతను,సౌభ్రాతృత్వం భావనను, మంచితనాన్ని పెంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండి సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని కోరుతున్నారు.మనిషి అంటే మంచితనానికి మారు పేరు.మనిషి నిరంతరం కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి.కొత్త మార్పులకు స్వీకారం చుట్టాలి. మంచితనాన్ని చాటాలి.నవ వసంతాన్ని గానం చేయాలి అంటూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.రెండు తరాలు కవితలో నేను నా చుట్టూరా పల్లె జనమంతా/పట్టుకూడుపు పిల్లలం/పొట్ట పోసుకోని దరిద్రులం/ఓరిమితో ఊరుకోవడం అలవాటె మాకు/ కాని మా పిల్లలు పొట్ట పోసుకోని దరిద్రులు కాదు/ పోరంటే,వెను తిరిగని పొట్టేళ్లు వాళ్ళు/గమ్యం తప్పా గతులు తెలియని సూర్యుళ్లు వాళ్ళు/అంటున్నారు. మొదటి తరం వాళ్లు బానిస బతుకులు బతికారు. రెండవ తరం వాళ్ళు వెను తిరుగకుండా పోరు బాటలో సాగే పొట్టేళ్లు వాళ్ళు.తరాల మధ్య మార్పును వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. ఎవరన్నారు కవితలో ఎవరన్నారు మీరు మంచి వారు కాదని?/అంటున్నారు.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది?ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడిపోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.గది – హృది కవితలో ఆ గది/ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/ బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/అమృత లోకాల కోసం బాణం సంధిస్తా/అంటున్నారు.విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసమానతలకు చరమ గీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లో దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు.కొందరు విద్యార్థులు భారతమాత ముద్దుబిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు.ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం. పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతాం.ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది.ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు.దొరలు పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.ప్రేయసీ! కవితలో నిన్ను చూశాక తెల్సింది నాకు/అజంతా అడుగులేస్తుందని/ఎల్లోరా కదలాడుతుందని/హంపీ స్వరం విప్పుతుందని/మల్లియలు మాట్లాడగలవని/ వాడని గులాబీలు ఉంటాయనీ/అంటున్నారు.కవి తన ప్రేయసిని చూసిన తర్వాత తనలో పొంగిపొరలే భావాలను అనుభూతులను కవితగా మలిచిన తీరు బాగుంది.ప్రేయసి అందాన్ని,మనసుని కవి భారతీయ సాంస్కృతిక సంపదలైన అజంతా, ఎల్లోరా,హంపీల శిల్ప సౌందర్యంతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలు,గులాబీ పూలతో పోల్చడం అద్భుతంగా ఉంది.అజంతా అడుగు లేస్తుందని అంటే అజంతా గుహల నైపుణ్యాన్ని సూచిస్తుంది.ప్రేయసిని అజంతా లాంటి అపూర్వమైన శిల్ప కళారూపంతో పోలుస్తున్నాడు. ఆమె సౌందర్యం అజంతా శిల్ప సౌందర్యంలా అద్భుతంగా ఉంది.ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి.ప్రేయసి నడకను, సొగసును ఎల్లోరా శిల్పాలతో పోలుస్తున్నాడు. హంపీ అపూర్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందినది.
ప్రేయసి మాటలు స్వరం హంపి శిల్పాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నాడు.సువాసనలు వెదజల్లే మల్లెపూవులను ప్రేయసి మాటల మాధుర్యంతో పోలుస్తున్నాడు.ఆమె మాటలు సుగంధాలు వెదజల్లుతాయి అని సూచిస్తున్నాడు. తన ప్రేయసి అందం వాడని గులాబీ వలె ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని అంటున్నాడు.తన ప్రేయసి ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గులాబీ వలె అందంతో మెరుస్తూ ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నాడు.ప్రేయసి అందాన్ని భారతీయ సాంస్కృతిక సంపదలతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలతో,గులాబీలతో పోలుస్తూ తన ప్రేమను సున్నితంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. మల్లారెడ్డి ABOUT MY BETTER HALF అని ఆంగ్లంలో రాసిన కవిత గొప్పగా ఉంది. సర్వాంతర్యామితో మనవి కవితలో ప్రజాకంటకులు/ జాతి ద్రోహులు/స్వార్థం మోసం పెంచుకున్న వాళ్లు/ అధికారాన్ని పంచుకుంటున్న వాళ్ళు/అందలాలు ఎక్కుతున్నారు/ఇదెక్కడి న్యాయం ప్రభూ!/ అంటున్నారు.బాధలో ఉన్నప్పుడు భరించలేక గిలగిలా కొట్టుకుంటాం.మన ఆత్మ తృప్తి కొరకే దేవునికి మొర పెట్టుకుంటాం.దేవుడు మన మొరలు ఆలకిస్తాడా?అనేది ప్రశ్నగానే తోస్తుంది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను,ఇబ్బందులను సర్వాంతర్యామితో కవిత ద్వారా మనవి చేయడం చక్కగా ఉంది.సత్యము స్వప్నము కవితలో కలల సౌధంలో – కళ్యాణమందిరం/అంటున్నారు. విద్యార్థులు కంటున్న కలలో కలలసౌధం ఉంది. అందులో కళ్యాణమందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాటను ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా?ఇప్పుడు లక్షల రూపాయలు కల్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా?అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త, మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వరకట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురి చేస్తున్నారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు.స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది. సుప్రభాతం ఆగుతుందా?కవితలో ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని,కుట్రని/మా కలాలకు – చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం ఆగుతుందా?అంటున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వాళ్ళ హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజా క్షేమం కాంక్షించి పాటల ద్వారా,కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు,కళాకారులు,ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు.ప్రజల కోసం పాటుపడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు,చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా?సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు,దీక్షలు ఏనాడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపథంగా చెబుతున్నాడు.జంపాల ప్రసాద్ కవితలో నేస్తం/క్యాంపస్ విద్యార్థివైన నీవు/ కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/మూఢ సంస్కృతిపై నీవు పురోగమించి/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా/చెట్టుకు కట్టి/బందూకు గురి పెట్టినపుడు/కొండల గుండెలు జాలువారినవి/కన్నీటి జాలువారినవి/చెట్ల కొమ్మలు – ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకి గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది/అంటున్నారు.జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం. ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు. అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు.నీవు పుట్టిన నేల కూడా పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు,విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు,సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి.శిఖరంగా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు, కొమ్మలు,ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో మాట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవము లేని బొగ్గుగా మారింది.ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవితలో ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/ నూతన నవ వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు/అంటున్నారు.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.ఎక్కడిది చైతన్య సమీరం కవితలో ఎక్కడిదీ చైతన్యపు సమీరం?/ఎక్కడిదీ ప్రభంజనం హోరు?/ఎక్కడిదీ ఝం,ఝం తుఫాను/ దీనికి మొదలెక్కడ?తుది యెక్కడ?/ఏ దూర తీరాల నుండి వీస్తుందీ ప్రభంజనం/ఏ దెస నుండి వీస్తుంది/ ఏ కొస నుండి వీస్తుంది/ అంటున్నారు.ఇది ప్రకృతి మరియు జీవితం యొక్క అంతర్లీన శక్తి చైతన్యాన్ని ప్రశ్నిస్తూ రాయబడిన కవిత.కవి తన ప్రశ్నల ద్వారా చైతన్యపు మూలాన్ని దాని ఆరంభాన్ని,అంత్యాన్ని విశ్లేషించడాన్ని తెలుపుతుంది.చైతన్యపు సమీరం అంటే జీవన శక్తి, ప్రాణ శక్తి.ఈ జీవన శక్తికి మూలం ఎక్కడుంది?ఇది ఎక్కడినుండి ఉద్భవించింది? ప్రభంజనం హోరు అంటే గొప్ప గాలుల తుఫాను. ప్రభంజనానికి పుట్టుక ఎక్కడ ఉంది?ఝం ఝం తుఫాను అంటే ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది.జీవితం మరియు ప్రకృతి శక్తుల ఆరంభం,ముగింపు ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభంజనం ఎక్కడి నుండి మొదలైంది?అది ఏ సుదూర ప్రాంతాల నుండి ఉద్భవించింది?జీవన శక్తి ఎటు నుండి వీస్తుంది?దాని ప్రయాణం ఏమిటి? అంటూ కవి వ్యక్తికరించిన భావాలు చక్కగా ఉన్నాయి.శిల్ప సుందరి కవితలో చూడాలి నా దేవి!నీ చూపు వాడి/కనికరించి కడవ దించి కాలు కదిలించి/మెరుపుతీగవై – వెలుగు రేఖవై/పూల బాణమై – విద్యుల్లతవై/కోడె నాగిణివై – రస రాగిణివై/భువన మోహినివై – నవమోహన నాట్యంల తేలించు/లాలించు పాలించు ఓ శిల్ప సుందరీ!/ ఇదిగో!నీ పాదపద్మాల ఉండనీ/నా కవితా మంజరీ/ అంటున్నారు.శిల్ప సుందరిపై వ్యక్తీకరించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.జ్ఞాపకాలు కవితలో నీ జ్ఞాపకాల వాకిట/నీ గుండె లోగిలిలోనే/దోసిట మల్లియలతో/మజ్నునై నిలుస్తాను/అందినట్టే అంది/అందకుండా – అందే అంత దూరములోనే ఉంటూ/మల్లియలా – మౌనంగా నిలచిన/నా జీవన నెచ్చలి – కలల ఊర్వశికి/బతుకంతా నైవేద్యం/ అంటున్నారు.కవి జ్ఞాపకాలను పంచుకొని ఆమెను సజీవం చేసిన తీరు బాగుంది.సాగువాటు కవితలో నా దీన జనావళీ కన్నీళ్లను మాటి మాటికి తుడవ లేక/నేను సామ్యవాద పద్ధతిలో సాగువాటు చేద్దామనుకుంటున్నాను/తిరుగుబాటు చేసి అయినా సరే/భూముల్ని కబ్జా చేసుకుంటాను/ ప్రాణమే ఆయుధంగా బయలుదేరుతున్నాను/ కృత్తిక ఎండలు మండి/కుటిల విషం కక్కినా సరే/ రోహిణి వడలు తడలు/పెడబొబ్బలు పెడుతూ/ కబలించాలని వచ్చినా సరే/తిరుగుబాటు చేస్తాను/ సామ్య వాదం కోసం సాగువాటు చేస్తాను/నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను/మరో స్వర్గం సృష్టిస్తాను/అంటున్నారు.సమాజంలో అన్యాయాలు, అక్రమాలు,అసమానతలు మనసును కలవరపెడుతున్నాయి.దీన జనావళి కన్నీళ్లను తుడవడం అనేది ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించడం.సామ్యవాద పద్ధతి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరి అవకాశాలు తీరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం అవుతుంది.నందన కేదారవనం ఇది ఒక ప్రకృతి అందాల పూతోట.ఇది శాంతి,సౌందర్యం,న్యాయం, సమాజానికి చిహ్నంగా నిలుస్తుంది.సమాజాన్ని నందన కేదార వనం లాంటి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.మరో స్వర్గం సృష్టిస్తాం అంటే ప్రపంచాన్ని మార్చేందుకు అందరి శ్రేయస్సు కలిగించే సమాజం నిర్మించేందుకు దోహదపడతానని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సామాజిక మార్పును సమానత్వం మరియు ప్రజలకు శ్రేయస్సును అందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేరణ కలిగించేది.ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది.నగరంలో కన్నెలు కవితలో కన్నెలు .. కన్నెలు . నగరమంతా వన్నె వన్నెల కన్నెలు/సాయం సమయంలో నగరమంతా/ కన్నెల మేని కాంతితో ఎరుపెక్కుతుంది/ఎరుపెక్కిన సంధ్యలో రాగ రంజిత వేళలో/వెచ్చవెచ్చని చల్లగాలి సైక్లోనొకటి/ఆ గుమ్మల ఆ అమ్మల ఆ బొమ్మల/ఆ కొమ్మల పైట చెంగుల విసరులోయన/ముచ్చటగా ముద్దిడుతుంది/గిలిగింతల కవిత్వాన్ని వ్రాయమంటుంది/అంటున్నారు.నగరంలో కన్నెలను కవితామయం చేయడం అద్భుతంగా ఉంది.ఇది నా దేశం గాథ కవితలో ఇక నా దేశం నాగరికత/ఇక్కడ పార్టీకి క్యాడర్ కాని వాడు లీడరు/ఆశయాలు చంపుకున్నవాడు/ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు/మానవత్వం ఎరువు తెచ్చుకున్నవాడు/ తోకవాల్చడం నేర్చుకున్నవాడు/ బట్రాజుగా మారినవాడు/వందిమాగధిగా ఎదిగిన వాడు/కాకా పట్టేవాడు/బాకాలూదేవాడు/నా దేశ ప్రజా ప్రతినిధి/నా దేశ నాయకుడు/అంటున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న నాయకుల దిగజారుడుతనాన్ని ఎండగట్టుతున్నాడు.నా దేశంలో ప్రజా ప్రతినిధి మరియు దేశ నాయకుడు ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన వాళ్ళు స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరును చూసి కవి తీవ్రమైన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని కవితలన్ని అభ్యుదయ భావాలతో అలరారుతున్నాయి. మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు పొంగిపొరలే భావావేశం అద్భుతమైన కవితలుగా రూపు దాల్చాయి.కవితలను హాయిగా చదువుకోవచ్చు. ఇవి పాఠకుల హృదయాలను రంజింప జేస్తాయి. చక్కటి కవితలు రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
వడ్డెర చండీదాస్
1937 నవంబర్ 30న పెరిచేపల్లి గ్రామము వ్యవసాయదారుల కుటుంబాల్లో జన్మించారు ఇది పామర్రు మండలం కృష్ణాజిల్లా కిందకు వస్తుంది వీరి పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు. పేద వృత్తి శ్రామికుల వడ్డెర ప్రజల నుండి వడ్డెరను 15వ శతాబ్దపు ఓ విప్లమాత్మక శాక్తేయ బెంగాలీ పేరు చండీదాసు తీసుకొని దగ్గర చేర్చి వడ్డెర చండీదాసుగా తన కలం పేరు చేసుకున్నాడు వీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు వడ్డెర చండీదాస్ గారి రచనలలో నవలలు కథలు లేఖలు తత్వశాస్త్రము ఉన్నాయి .

హిమజ్వాల అనుక్షణికం నవలలు చీకట్లోంచి చీకట్లోకి అనేది సంపుటి డిజైర్ అండ్ లిబరేషన్ తాత్వికం ప్రేమతో అనేది లేఖా సాహిత్యం . 2007లో గ్రంధ రూపం లేఖా సాహిత్యం . జనవరి 1984 నుండి 21 డిసెంబర్ 1991 వరకు చండీదాస్ గారు శ్రీ అడ్లూరి రఘురామరాజుకు రాసిన లేఖలు . వీరి రచనలన్నీ చైతన్య స్రవంతి కథని నడిచేవే మనో విశ్లేషణ చేస్తే చాలా పెద్ద థీసిస్ లే అవుతాయి. ఈయన వ్రాసిన సాహిత్యం దాదాపు 2000 పేజీలపైగా ఉంటుంది. 67 ఏళ్లు జీవించిన ఈ తాత్విక తపస్వి జనవరి 30, 2005న విజయవాడలో కన్నుమూశాడు దాదాపు 15 ఏళ్ల పాటు మౌనంగా నాలుగు గోడల మధ్య ఉండి పోయాడు ఆయన ఒకచోట తన గురించి వ్రాసుకున్న సుదీర్ఘ వ్యాఖ్యము “యాశ్వద కార్తీక కవోష్ణంలోంచి పుట్టుకొచ్చి కృష్ణ వరి పైరుల్లో సుషుప్తించి నిజామాబాద్ ప్రాంతపు పచ్చిక మైదానాల్లోంచి ఎదిగి హైదరాబాద్ వెన్నెల్లో తడిసి తిరుపతి వేడిలో కాగుతూ సంస్పందనాకాశంలో ఎగిరి, మూర్ఖత్వపు పంజరంలో పొడి, నిర్లిప్తనిరీక్షణావడిలోకి విముక్తమై అనురాగరసరాగ సౌందర్యంలో పునర్జన్మించాను కానీ అంతలోనే ఆ సౌందర్య అనురాగపు నా ఊపిరి శిలా వాల్మీకమైపోతే అందులో సమాధి అయి ఏకాంతిస్తున్నాను “వడ్డెర చండీదాస్ గారి రెండు నవలలు . హిమజ్వాల మరియు అనుక్షణికం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికలుగా వచ్చాయి . హిమజ్వాల నవలను తెలుగు తనపు కూపం లో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్వి బుచ్చిబాబు గారికి అంకితం చేశాడు . హిమ జ్వాల అనుక్షణికం నవలలను సీరియలించ్చి కీర్తిని అపకీర్తిని మూటగట్టుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మకు అంకితం చేశాడు వడ్డెర చండీదాస్ వ్రాసిన కథలన్నీ విజయ అనుబంధం చీకట్లోంచి చీకట్లోకి గా విజయ అనుబంధమాలికగా వెలువడ్డాయి. ఇది విజయం అనుబంధ 24వ నవలగా వచ్చింది. ఇది ఫిబ్రవరి 1978లో వచ్చింది దీనిని ఆమెః ఆమరణ నిర్బంధమాలిని ,మాతృభాల మలిన మందార ధార జగద్ధార మూలాధార నయన జ్వాలకు యివతలగా ,తన చీకటి కడుపున దాచిన , కాంతి నిస్వనపు సవ్వడి —-ఆమెకుఅంకిత మిచ్చారు .
ఇందులో ఏకథకు ఆ కథ గా ఉంటుంది .కానీ అన్ని కథలకు అంత సూత్రం అంటే గొలుసుకథగా ఉంటుంది. దీని గురించి ఈ విజయం అనుబంధంలోనే “సమర్పణ” పేరుతో దాదాపు 15 పేజీల సమీక్షాత్మక వివరణ విశ్లేషణ శ్రీ గుత్తికొండ నాగేశ్వరరావు వ్రాశాడు . డిసెంబర్ 1977గా అందులోనేప్రచురింపబడింది.
వీరి సాహిత్య వ్యాసంగాన్ని నిష్టతో నిష్పాక్షికంగా అధ్యయనం చేసిన వారు వైట్ హెడ్ సాత్రే జంగ్ లాంటి స్వతంత్ర ఇతివృత్తాలతో ” గమనాన్ని యానాన్ని ప్రవాహాన్ని అక్షరాలలో చిత్రించి ఉండే గొలుసు పొరలు చిరగకుండా ఒక్కొక్కటి విప్పి ఏదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కెతో రాసిన అతని వైజ్ఞానిక చైతన్య స్రవంతులు ,రచనా పటిమకు ” అబ్బురపడ్డారు హిమజ్వాల నవల రెండు ప్రధాన పాత్రల అంతరంగ బహి ప్రయాణ చైతన్య స్రవంతి మార్గ నిర్ధారణ ఇది ఒక మనో వైజ్ఞానిక నవల. కృష్ణ చైతన్య గీతాదేవి, ఈ రెండు ప్రధాన పాత్రలతో పాటు కృష్ణ చైతన్య తండ్రి , స్నేహితుడు శశాంక్ , గీతాదేవి భర్త శివరాం , అనారోగ్యపరుడైన చిదంబరం భార్య మాధురి దేవి మరియు కృష్ణ చైతన్య బంధువులు. తెలియకుండా మనసును మనిషిని కోసేసే జ్వలన ధ్వనితమైన జ్వలన జ్వలితమైన ప్రత్యేక జీవుల ఆ రెండు పాత్రలు హిమ జ్వాల నవల. సాంద్రత గాఢ వాక్యాలు . “తడిసి ముద్దయిపోయిన ప్రకృతి ఆమె శరీరంలోంచి ఎగిసే ఆవిరికి తేరుకుంటోంది .”
“మాటాడే తీరులో, సెలయేటివేగం , స్పటత ఉన్నాయి. ” ” పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగ కొద్దీ కాల్చి , అక్కడికి కసి తీరక దోససిల్ళ్ళతో మసి ఎత్తి గాల్లోకి తెగ పోసి వెళ్లిపోయాడు సూర్యుడు.”
ఈ నవలలో అధ్యాయాల పేర్లు వెలుగు మరక , మూగబోయిన వీణ , ఉప్పొంగిపోనాది గోదారి , అనుభూతి సిగ్గెరుగదట, ప్రేమ వెర్రిబాగులదట , మరీచి కాన్వేషణ , సశేషం జీవితం . ఈ పేర్ల ద్వారా ఆయాభాగాల్లో వచ్చే కథను క్లుప్తంగా చూపించాడు రచయిత నవల చివరన అర్ధాను స్వారంలో రచయిత తన భావాలను వెల్లడించారు.
వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం నవల క్లుప్తంగా శ్రీపతి , స్వప్న రాగలీన, అనంతరెడ్డి , గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి ,రవి ,సీత ,కనకదుర్గ, విజయకుమార్, నళిని ,అంకినీడు, జయంతి, వెంకటావధాని ,రంగారెడ్డి ఇవన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు , స్రవంతి ,విమల ,ప్రసాద్ ,రాములు చారుమతి తండ్రి , చారుమతి , రమణి ,రంగారెడ్డి సూర్యప్రకాష్ ,రామ్మూర్తి ,సుబ్రహ్మణ్యం ,వేదవతి దురదృష్టవంతురాలు సీత , నిరంజన్ రావు , ప్రత్యేక పాత్ర వందన ,వరాహ శాస్త్రి ఇంకా ఉస్మానియా కిచిడి మిక్సర్ పాత్రలు .ఒక తరం నుండి ఇంకొక తరానికి నాటి సబ్జెక్టు విషయ సామాజిక మానసిక ఆర్థిక నేపద్యాల పది సంవత్సరాల గమనాన్ని రాజకీయ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విశ్లేషణాలన్నీ మేళ నుంచి ఏ పాత్ర ఎదుగుదల గమనం నిష్క్రమణం దానిదే ఇంతటి సంక్లిష్ట సందిగ్ధం భీభత్స వేళా విశేష రచన ఇప్పటిదాకా తెలుగులో రాలేదు ఏదో ఒక ఇజం సంబందించిందో కాకుండా చారిత్రకతపై సామాజిక గమనంపై ఎక్కడ రచయిత అనవసర జోక్యం లేకుండా దేని వలయం విస్తరణ నిర్వాణం దానికదేగా నిర్వహించడం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఇది ఒక 10 సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల .ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదిక విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేష నవల .
వివిధ ఆంధ్రజ్యోతి సోమవారం 26 నవంబర్ 2018 నాటి తన వ్యాసంలో శ్రీ వల్లూరి రాఘవరావు గారు “అతీత వాద సాహితీ జలపాతం” శీర్షికతో వడ్డెర చండీదాస్ గారి సాహిత్య సమీక్ష చేశారు. ” ఓం వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ “అని పేర్కొంటూ శ్రీ కొడవళ్ళ హనుమంతరావు గారు విపులమైన సాహితీ సమీక్ష చేశారు.
http://eemata.com/ em/ issues/200507/ 177.html
“తెలుగు సాహితి వినీలాకాశంలో ఓ ధ్రువతార అనుక్షణికం” డి. రామచంద్ర రాజు., సంచిక -ఏప్రిల్ ఒకటి 2018.
“విరసాన్ని బోనెక్కించిన అనుక్షణికం ” ఫేస్బుక్ పోస్ట్ 22 ఫిబ్రవరి 2022.
రచన శృంగవరపు గారి ఫేస్బుక్ పోస్ట్ నాలుగు ఆగస్టు 2023 నుండి “చండీదాసు గారు -గొప్ప రచయితే కానీ!”ఇతర సమకాలీన రచనలతో పోల్చి తన అభిప్రాయం తెలుపుతారు .
ఇక వడ్డెర చండీదాస్ గారి సాహితీ ప్రయాణం లో అత్యంత ప్రత్యేకమైనది తాత్విక రచనా వెలుగు చూడడం. డిజైర్ అండ్ లిబరేషన్ అనే వీరి సూత్రప్రాయ రచన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని విషయంలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు చాలా విపులమైన వివరణ తన ఫేస్బుక్ మాధ్యమం లో వివరించారు. అబ్ధుల్ రాజా హుస్సేన్ గారు కూడా చండీదాస్ గారిపై విపులమైన వివరణలు ఫేస్బుక్ మీడియా ద్వారా దృశ్యమానం చేశారు.
కాశీభట్ల వేణుగోపాల్
వేణుగోపాల్ జనవరి 2 1954లో కర్నూల్ లో జన్మించాడు. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలు. 9 నెలలప్పుడే స్పష్టమైన పలుకులకు ముచ్చటపడి వీరి తల్లి వీరికి కాళిదాసు శ్లోకాలు పద్యాలు అమర కోశం నేర్పించింది. ఆ విధంగా వీరు చిన్నప్పటినుంచే జిజ్ఞాసతో అన్నలు అక్కలతో గ్రంథాలయానికి వెళ్తూ చదవడం అలవాటు చేసుకున్నాడు కాలేజీల చదువు అబద్ధం అని నమ్మి దృవపత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు చాలా చాలా విస్తృతంగా అధ్యయనం చేశాడు శ్రోత్రియ నియమాలను మిగతా అన్ని మానవ నిర్మిత నిబంధనలన్నీ విలువల్ని ఒప్పుకోడు. మొదట మల్లాది బుజ్జిబాబు శ్రీశ్రీల ప్రభావం లో ఉన్న త్వరలోనే బయటపడి సొంత ఒరవడికై కృషి చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మకు మంచి అభిమాని. ఈయన అవివాహితుడు .మంచి పద్యం మద్యం రెండింటికి ప్రీతిపాత్రుడు. హరిప్రసాద్ చౌరాసియాలను బాగా ఇష్టపడతాడు. మూడుసార్లు దేశాటనం చేశాడు . గాఢమైన అనుభూతుల్ని ఒడిసి పట్టుకోవడంలో ఈ పర్యటన వల్ల ,అధ్యయనం వల్ల , అమ్మ చెప్పిన శ్లోకాల వల్ల వచ్చిందంటాడు . జీవితంలోని గందరగోళాన్ని అస్థిరత్వాన్ని రచనలోని ముగింపుకై పాఠకుడిలో ఏర్పడే అవగాహనను చిన్నాభిన్నం చేయడం ద్వారా అనేక ప్రశ్నల్ని గాడతల్ని బరువుల్ని పాఠకుడి పై మోపుతాడు . సమకాలీన జీవన సంఘర్షణ బీభత్సాన్ని వైరుధ్యాలని ఒకింత చిక్కగా ప్రశ్నార్ధకం చేస్తాడు ..ఒక ప్రత్యేకమైన రచనా ఒరవడిని ముంచెత్తి పాఠకుడ్ని ఆశ్చర్యల్లో ముంచెత్తి ఆలోచింప చేస్తాడు . ఈయన నాలుగు కథా సంకలనాలు మూడు కవిత్వం పుస్తకాలు ఎనిమిది నవలలు ఒక నవలిక రచించాడు. దిగంతం ,తపన, నేను చీకటి , మంచు పువ్వు , తెరవని తలుపులు , నిషకం, అసత్యానికి ఆవల , అసంగత నవలలు రంగులు అనే నవలిక . నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశాడు

అసంగతం నవలపై శివా అయ్యల సోమయాజులు పుస్తకం డాట్ నెట్ లో విప్లమైన సమీక్ష వ్రాశాడు. వెంకట సిద్ధారెడ్డి సారంగ సంచిక 15 డిసెంబర్ “వేణుగోపాల్ మరియు ఒక సామాన్యుడు ” శీర్షికగా కాశీ భట్ల వేణుగోపాల్ తపన నవల తనపై ఎంత ప్రభావం చేసిందో చూపిందో విపులంగా వివరిస్తాడు . కాశీభట్ల వేణుగోపాల్ చెప్పిన కవిత యూట్యూబ్లో స్టేట్మెంట్ పేరుతో ఉంది రెండు నిమిషముల 50 సెకండ్లు ఇందులో ఆయనకు సంబంధించిన ఒక కృత్యా ద్యవస్థ వివరిస్తాడు .” కుర్చీ మై చైర్ ఓ పారాభౌతిక భావన ఒక సమ్మోహకర ప్రార్థన కేంద్రం . ముందు నన్ను రూపంగా మార్చి ఈ కుర్చి ఓ పారాభౌతిక భావన .ఎండలో మెరిసే వాన వానలో తడిసే ఎండ నన్ను చీల్చుకు వచ్చే చిగురు కోసం ఎండ వానల్లోని నన్ను మార్చే కుర్చీ సాంతం కాళ్లు చేతులు ఉన్నాయంటూ లేకున్నా ఉన్నాయంటూ మట్టిని కౌగిలించుకోవడానికి మట్టైన నేను (కుర్చీలో) ఇంకో మెరిసే వాన కోసం తడిసి ఎండ కోసం .” ఈ విధంగా చాలా సంక్లిష్టమైన భావనలను ఆలోచనలని పాఠకునిలో రేకెత్తించిమనసులోకి దించి వదిలేస్తాడు కాశీభట్ల వేణుగోపాల్ వేణుగోపాల్.
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
ప్రపంచంలోని బాధలలో కన్నీళ్ళను చూసి కవిగా కాళోజీ హృదయం స్రవించి ఆ హృదయ ప్రకంపనలకు అక్షర రూపం కలిస్తూ నూతన పోకడలతో కవిత రూపంలో …
“అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు…?
పరుల కష్టము చూసి కరిగిపోను గుండెను
మాయ మోసం చూసి మండి పోను ఒళ్ళు
పతిత మానవుని జూసి చితికి పోవు మనస్సు
ఎందుకో ఇన్ని ఆవేశం నా హృదిని ఇన్ని ఆవేదనలు?….” అంటూ
ఆత్మశ్రయ ధోరణితో వ్యక్తపరిచాడు .

“ఉత్తమాటలు కట్టిపెట్టి
పెత్తనాలకు దేవులాడక
చిత్తశుద్ధిగా చేయబూనిన
చేతలెల్ల ఘటించినట్లె “
అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ , ఐక్యతను కోరుకుంటూ కాళోజీ కవితలు రాయటం జరిగింది.
వరంగల్ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నేలపై ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, సామాన్య వ్యక్తికి కూడా ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కవి కాళోజీ నారాయణ గారు.
ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను ఆయన వేసుకోలేదు. కానీ,ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో , ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించి 2002 నవంబర్ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం
తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవిత్వం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ను
పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.
అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలైన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే….
కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి.
నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.
అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.
చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు. పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.
పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.
గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.
“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో ఆక్షేపిoచారు.
నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రజల హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు మన కాళోజీ!