నిజాయితీపరుడైన ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజల హృదయరథాల్లో తెలుగునేల నాలుగు చెరగులా ఊరేగిన పేరు కె.వి. రమణాచారి. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చదివి, ఐ.ఏ.ఎస్. అధికారిగా తలమునకలయ్యే పని భారాలున్నా తన మృదుగంభీర వచస్సుతో సాహిత్యాభిమానుల మనసుల్ని తేలికపరిచే కారంచేడు వెంకట రమణాచారి గారు తన అభిరుచి మేరకు తెలుగులో ఎమ్. ఏ. పూర్తి చేసి, 57 వసంతాల వయస్సులో పిహెచ్.డి. కూడా చేసిన నిరంతర విద్యార్థి.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక సలహాదారుడిగా, దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కమిషనర్ గా, కడప జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు రమణాచారి గారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈఓ)గా చేసిన సేవలే ఆయన మనుసుకు నచ్చిన సేవలని భావించవచ్చు.
2012లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రమణాచారి గారు ఏవో శుభఘడియల్లో తన పాదాలకు ఏదో పసరు పూసుకున్నట్లున్నారు. కాలపు వినువీధిలో వెనుదిరిగి 2007-2009 సంవత్సరాలకు పయనించారు. ఆనాడు టీటీడీ ఈఓ గా నిర్వహించిన విద్యుక్తధర్మాలను సంతృప్తికరంగా పునఃదర్శించుకున్నారు. పాత జ్ఞాపకాలను అక్షరాల్లోకి ఒదిగించి, 2024-25 లో ‘స్వాతి’ మాసపత్రికలో వ్యాసాలుగా వెలువరించారు. ఆ అనుభవాల దొంతరనే ఇప్పుడు ఏప్రిల్ 2025లో ఎమెస్కో ద్వారా ‘హరే శ్రీనివాసా!’ పుస్తకంగా ప్రకటించారు.
22 ప్రకరణలుగా విస్తరించిన ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు అంతర్లీన సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది ఏడుకొండల స్వామి దర్శనాన్ని ప్రజాస్వామీకరించడం – అంటే దేవుణ్ణి ప్రజల వద్దకే తీసుకుపోవడం. తాను ఏది చేసినా, చేయగలిగినా అదంతా దైవానుగ్రహమేనని విశ్వసిస్తూ ‘హరే శ్రీనివాసా’ అని అడుగడుగునా తలచుకోవడం రెండవ అంతఃసూత్రం.
దైవ ప్రజాస్వామీకరణ అన్నప్పుడు అలనాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదివి, స్వాతంత్య్ర సమరయోధుడిగా, చివరకు పరమయోగిగా మారిన అరబిందో ఘోష్ వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది:
“I want to invoke … direct manifestation of the Divine in our entire being and daily life.” (… మన అంతరంగమంతటా, దైనందిన జీవితమంతటా దైవం ప్రత్యక్షంగా ఆవిష్కారం కావాలని దీక్ష వహిస్తాను.) – అరబిందో
దైవచైతన్యం ఈ నేల మీదనే అవతరిస్తుందని అరబిందో విశ్వసిస్తే, కలియుగదైవం సప్తగిరుల మీద అందకుండా ఆగిపోకూడదనీ, సామాన్యప్రజల చెంతకు చేరాలనీ భగీరథ ప్రయత్నం చేసినవారు రమణాచారి గారు. భగీరథ ప్రయత్నమని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఎంత ఐ.ఏ.ఎస్. ఆఫీసరైనా, ఆయన కూడా తన సంకల్పాలకు దేవస్థానం ధర్మకర్తల అనుమతులనూ, ప్రభుత్వనేతల ఆశీస్సులనూ పొందగలగాలి.
దేవస్థానం సంప్రదాయాల ప్రకారం శ్రీవైష్ణవులు మాత్రమే గర్భగుడి లోకి ప్రవేశించగలరు. తిరుమల తిరుపతి దేవస్థానం 75 సంవత్సరాల (1933-2008) చరిత్రలో గర్భగుడి లోకి ప్రవేశించిన తొలి కార్యనిర్వహణాధికారి రమణాచారి గారు. ఆయన శ్రీవైష్ణవుడు. నియమనిష్ఠలతో అర్చకత్వమూ నేర్చుకున్న వారు. తన అదృష్టం సరే! మరి సామాన్యుల మాటేమిటి?
“స్వామీ! నీ భక్తుల కోసం నువ్వే భక్తుల దగ్గరకు పోలేవా?” – ఇదీ రమణార్తి!
ఆయన సంకల్పం వలన ‘భజగోవిందం’ ద్వారా స్వామి గ్రామాలకు వేంచేశారు. ‘దళితగోవిందం’ ద్వారా వాడవాడలకూ చేరుకున్నారు. ఇది దైవ ప్రజాస్వామీకరణ కాక మరేమిటి?
తిరుమలేశుడు సాక్షిగా జరిగే వివాహాలు కలకాలం నిలుస్తాయనే నమ్మికతో ప్రారంభమైనది ‘కళ్యాణమస్తు’. అందుకయ్యే ఆర్థికవ్యయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుంది. ఈ ప్రకరణలో ఒక ఆసక్తికరమైన ఉదంతం కనిపిస్తుంది. బావామరదళ్ళే అయినా కట్నం అడ్డుపడి వివాహం క్లిష్టమైపోయి రమణాచారి గారిని ఆశ్రయిస్తారు రాజేష్, వసంతలు! రమణాచారి గారు ప్రేమికుల పెద్దలతో మాట్లాడడం ద్వారా కళ్యాణం జరిగిపోతుంది!
అత్యంత మహత్వపూర్ణంగా జరిగిన కార్యక్రమం ‘చతుర్యుగ బంధ భక్తిచైతన్య యాత్ర’. కలియుగ దైవసన్నిధి నుండి కృతయుగపు నరసింహ స్థానం సింహాచలానికీ, త్రేతాయుగపు శ్రీరాముడి క్షేత్రం భద్రాచలానికీ, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడి ఆలయం మొవ్వకూ సాగిన మూడురథాల యాత్ర, నాలుగు యుగాల అనుసంధానయాత్ర ఈ ఈ చైతన్యయాత్ర. ఈ యాత్రను సాకారం చేయడానికి రమణాచారి గారు పడ్డ కష్టాలు చదివితీరవలసిందే.
నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన ‘శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్’ కూడా రమణాచారి గారి సంకల్పసిద్ధే. అందుకు అవసరమైన కేంద్రప్రభుత్వ అనుమతులూ, ఆర్థిక వనరులూ, నిర్వహణా నైపుణ్యాలూ – ఆలోచన సులభమే గానీ ఆచరణలో ఎన్ని అవరోధాల్ని అధిగమించాలి!
పిల్లల కోసం పెద్దల కోసం ఆధ్యాత్మిక విషయ ప్రధానమైన ‘పుస్తక ప్రసాదం’, ఆర్థిక స్థోమత లేని ఆడపిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే ‘శ్రీ పద్మావతీ అమ్మవారి పుస్తక ప్రసాదం’ వంటివి ప్రజల వద్దకే దైవం వేంచేసే ఇతర కార్యక్రమాలు!
కాకతాళీయంగా బయటపడ్డ 32,000 అన్నమయ్య కీర్తనలు! 1978 లో పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ప్రారంభించిన ‘అన్నమాచార్య ప్రాజెక్టు’! లల్లాయి పదాలంటూ మొదట తృణీకరించి, పిదప పశ్చాత్తాపపడి, చివరకు అన్నమయ్య కీర్తనలను స్వయంగా స్వరపరచిన మహా సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి గారి వృత్తాంతం! అన్నమయ్య 600వ జయంతి ఉత్సవ సందర్భంగా 2008లో తాళ్ళపాక గ్రామంలో 108 అడుగుల విగ్రహావిష్కరణ! 1,116 మంది సంగీత కళాకారులతో సప్తగిరి సంకీర్తన! హైదరాబాద్ లో అన్నమయ్య అధ్యయన కేంద్రం ఏర్పాటు! అన్నమయ్య వారసులకు నెలసరి జీవనభృతి! సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షగళార్చన! … … … సాయంసంధ్యను అచ్చతెలుగులో ‘దివ్వెలెత్తు పొద్దు’ అని పిలిచిన అన్నమయ్యను తలచుకుంటూ, కొలుచుకుంటూ చాలావరకు తీరిన రమణార్తి రెండు ప్రకరణల్లో విస్తరించి కనిపిస్తుంది.!
చిత్రకారుడు శివకుమార్ చిన్నిలేఖ కలిగించిన గొప్ప ఆలోచన టీటీడీ అమృతోత్సవం! 2008లో టీటీడీ కి 75 సంవత్సరాలు నిండినట్లు ఉన్నతాధికారులెవరూ గుర్తించరు. శివకుమార్ తన లేఖ ద్వారా రమణాచారి గారి దృష్టికి తీసుకువస్తారు. చివరకు అమృతోత్సవం రాష్ట్రపతి చేత ప్రారంభమవుతుంది. అలిపిరిలో అమృతోత్సవ స్థూపావిష్కరణ జరుగుతుంది. ‘అక్షరామృతం’ సంచిక వెలువడుతుంది. ఉద్యోగులకు ‘స్వామివారి బంగారు డాలర్’ బహుమతులు లభిస్తాయి. ఇంత బృహత్కార్యం రూపుదాలుస్తుండగా ఉద్యోగుల మధ్య ‘రూల్ అఫ్ రిజర్వేషన్’ చిచ్చు రగులుతుంది! రమణాచారి గారి సహృదయతతో చల్లని మాటలతో దావానలం శాంతిస్తుంది! ఇదంతా మరొక ప్రకరణ!
“హరే శ్రీనివాసా!” అని వేడుకోగానే “సరే వెంకట రమణా” అంటూ ఎన్నో అభ్యర్థనలను అనుగ్రహించిన అంతటి శ్రీనివాసుడు కూడా దయచూపని సందర్భాలున్నాయి. అందులో ఒకటి ‘దివ్యభారతి’ – తిరుమల కొండ మీద రద్దీని తగ్గించే దిశగా అలిపిరి టోల్ గేట్ వద్ద 12 వరుసల రహదారిని నిర్మించడం లాంటి ప్రయత్నాలు. మరొకటి ‘ఆనందనిలయం అనంత స్వర్ణమయం’ – గర్భగుడి గోడల మీద లోపలా వెలుపలా బంగారు పూత పూయడం. ‘మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది’ అనే నానుడికి కూడా ఉదాహరణలు కావాలి కదా!
“టీటీడీ ఈఓ కన్నా పెద్ద పోస్టులోకి పంపిస్తున్నాను రమణా!” ముఖ్యమంత్రి పలుకులు. మరింత ఉన్నతమైన పదవిని చేపట్టే అవకాశం ఎలా విచారహేతువౌతుందో ‘ప్రాప్తం’ ప్రకరణలో చూస్తాం.
ఇక చివరిదైన ‘వేంకటాద్రి దిగి వేంకటాద్రి ఎక్కి’ ప్రకరణ చదువుతూ చదువుతూ మన హృదయాలు ఉద్విగ్నమవుతాయి. నయనాలు అశ్రుసరస్సులవుతాయి. అసలు ఈ ప్రకరణ శీర్షికే అత్యంత భావుకతతో పరిపుష్టమైనది – దిగినది వేంకటేశ్వరుడి కొండ, ఎక్కినది హైదరాబాద్ వెళ్ళే వేంకటాద్రి రైలు!
రైలెక్కడానికి ముందు ఆయనను కలవడానికి, కరచాలనం చేయడానికి, దూరం నుండైనా కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చిన అశేషజనసమూహాన్ని చూసిన రమణాచారి గారు కన్నీళ్ళ పర్యంతమవుతారు. వనవాసానికి వెళ్ళే రాముణ్ణి సాగనంపిన అయోధ్య ప్రజల కన్నీటి కాలువలు గుర్తొచ్చాయేమో నగరవాసానికి వెళ్తూ తిరుపతివాసుల కళ్ళను చూసిన రమణాచారి గారికి – వనవాసకాండకు సంబంధించిన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు ఈ అశ్రుమయమైన ఘట్టంలో! “శంఖమా! పోయివత్తునా! … చక్రమా! పోయివత్తునా!” అనే అన్నమయ్య పల్లవినీ ఉటంకించి తన కవితాత్మను మరోసారి చాటుకుంటారు. ‘ఉన్నకాలం’ నుండి ‘సన్నకాలం’ లోకి జారిపోయిన స్వామివారి సేవాసౌభాగ్య దినాలను నెమరువేసుకుంటూ తట్టుకోలేక విలవిలలాడుతారు.
2007 ఏప్రిల్ 22 నుండి 2009 జూన్ 19 వరకూ ఏడు కొండల మీద సాగిన తన జీవనప్రస్థానాన్ని రమణాచారి గారు మరచిపోలేరు. చదివితే మనమూ మరచిపోలేం.
“స్వామే భక్తుల దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?” టీటీడీ ఈఓ కాకమునుపే రమణాచారి గారు వేసుకున్న ‘వెర్రిప్రశ్న’తో మొదటి ప్రకరణ చదువరులకు కుతూహలం కలిగిస్తే, వివిధ అంశాల్లో తన ఆలోచనలను ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నారో తదుపరి ప్రకరణల్లో వర్ణిస్తారు రమణాచారి గారు. మనసా వాచా కర్మణా కొలిచిన శ్రీనివాసుడికీ, సహోద్యోగులకూ, ఆత్మీయులకూ వీడ్కోలు పలకడమే చివరి ప్రకరణ.
రెండు నెలల్లోనే మూడు ముద్రణల్లో వెలువడిన ఈ రచన పాఠకుల అశేషమైన ఆదరణకు నిదర్శనం! రమణాచారి గారి ఆధ్యాత్మిక సేవలను ప్రత్యక్షంగానూ, వ్యక్తిత్వాన్ని పరోక్షంగానూ ప్రతిబింబించే ఈ పుస్తకం హస్తభూషణమే కాదు, హృదయపోషకం కూడా!
(‘హరే శ్రీనివాసా’ రచయిత డా. కె.వి. రమణాచారి, ప్రచురణకర్త ఎమెస్కో, పుటలు 192, వెల రూ. 150.)
వ్యాసాలు
చారిత్రక నవలాచక్రవర్తి , చారిత్రక నవలాసమ్రాట్, అభినవ పాల్కుర్కి బిరుదులు పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి కలం లోంచి వెలువడి ఆగస్టు – సెప్టెంబర్,1977 వ. సంవత్సరములో విజయబాపినీడు వారి ‘ విజయ ‘ పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన ‘ఆవాహన ‘ అనే చారిత్రక నవలకు నేను వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం.
ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల తల్లి ఐతే, ఆ తల్లి గర్భంలోంచి పురుడు పోసుకున్న శిశువే నా ఈ రచన.
ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ రచించిన శివప్రసాద్ గారికి ముందుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారే గనుక ఈ రచన చేయకపోయి ఉంటే, ఈ చారిత్రక కథ ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు.
ఈ నవలపై నేను వ్యాసం వ్రాయడానికి గల కారణాలు తెలియాలంటే, నా జీవితంలో విచిత్రంగా జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాల్సి ఉంటుంది.
నాకు దాదాపు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఈ నవలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఇంతకంటే ఆసక్తికరమైన మరో విషయమే మిటంటే, ఇది చదివే సమయంలో మా అక్క (అందరిలో పెద్ద) కు మొదటిసారిగా ప్రసవం జరిగిన రోజులవి.ఇంట్లో పసిబిడ్డ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారు, ముఖ్యంగా ఆమె(బాలింత) తల్లి ఎంతగా పనుల ఒత్తిడిలో ఉంటారో నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మా అక్క, ఊపిరి సలుపని పనుల్లో ఉండి కూడా ఏ కాస్త సమయం చిక్కినా మా అమ్మ, ఇంటికి వచ్చీ రావడంతోనే మా నాన్న ఇలా అందరూ ఆసక్తిగా చదివేవారు.చదవడమేగాకుండా దాని గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆడుకోవడానికి పక్కింటికీ, ఎదురింటికీ వెళ్లినా,అక్కడ కూడా ఇవే చర్చలు సాగుతూ ఉండేవి. వాళ్ళ చర్చల్లో ఎక్కువగా కామసాని, ఆవాహన, నర్తకి , శిల్పి వంటి పదాలు దొర్లుతూ ఉండేవి. ఆ మాటలు అర్థం చేసుకునే వయసు గానీ, కథను గురించి ఆలోచించే శక్తి గానీ నాకు లేకపోయినప్పటికీ, ఎందుకో రెప్ప వెయ్యకుండా వాళ్ళనే చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ ఉండేదాన్ని.
అంతమందిని కదిలించిన ఆ కథ ఏమై ఉంటుందా!? అన్న ఆలోచన నా వయసు తో పాటే పెరుగ సాగింది. కాస్త సమయం గడిచాక ఆలోచిస్తే నాకు అర్థమైన విషయ మేమిటంటే, స్థానికత వాళ్ల ఆసక్తికి ఒక బలమైన కారణమని. మేమ ప్పుడు వరంగల్ జిల్లాలోని ములుగు లో నివాసం ఉండే వాళ్ళం.
పుస్తక పఠనం అనేది నాకు ఒక అభిరుచిగా మారడం, క్రమక్రమంగా కాస్తో,కూస్తో కలాన్ని కదిలించే శక్తి నాకు దైవదత్తంగా అబ్బడంవల్ల ఎందుకో నాకు ఈ కథను తప్పనిసరిగా చదవాలి, విషయమేమిటో తెలుసుకోవాలి, వీలైతే దానిపై వ్యాసం వ్రాయాలి అన్న కోరిక క్షణక్షణానికీ పెరుగసాగింది. విషయం తెలుసుకున్న మావారు పలు పుస్తక విక్రయదారులను సంప్రదించి 30-08-2022 నాడు పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను అదే క్షణంలో మొదలుపెట్టి ఏకబిగిన పూర్తి చేయడం, కథలో లీనమై కళ్ళారా దర్శించిన అనుభూతికిలోనై వర్తమానానికి రావడం జరిగింది. నవల చదివాకగానీ నాకు అర్థం కాలేదు, అది వరంగల్లోని వేయి స్తంభాల గుడికి సంబంధించిన కథ అని.అప్పటి వరకు నేను అది రామప్ప గుడికి సంబంధించినద నుకున్నాను. ఇక చదవడం పూర్తయ్యాక నా మదిలో మెదిలిన భావాలను వ్యక్తపరచాలంటే బహుశా నా రచనాపటిమ సరిపోదేమో అనిపించింది. ఆసక్తీ, ఆశ్చర్యం, ఉద్విగ్నత అన్నీ మిళితమైన అనిర్వచనీయమైన భావన. గతానికీ,వర్తమానానికీ; ఆనందానికీ,విషాదానికీ నడుమ అంతు చిక్కని అవ్యక్తానుభూతి.

మనం ఎన్నో ప్రేమ కథల్ని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందులో కొన్ని ఫలించి ఆనందాల హరివిల్లులైతే మరికొన్ని ఎండమావులకు ప్రతీకలుగా మిగిలిపోతాయి. మనిషి యొక్క ఆత్మ దేహత్యాగం చేసిన మరుక్షణం అందులో ఒదగబడిన ఈ ప్రేమ అనే సుగంధ కుసుమం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. అది సర్వసాధారణం, కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన, గుండెల్ని మెలిబెట్టే అంశమే నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.
కాకతీయ సామ్రాజ్య ఆస్థాన శిల్పి భళ్లాల సోమేశ్వరునికీ, ఆస్థాన నర్తకి కామసానికీ నడుమ విరిసిన ప్రణయ కథ.
వరంగల్ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించిన సోమేశ్వరుడు శైశవ దశలో ఉండగానే తల్లిదండ్రులు కాలం చేయడంతో మల్యాల గుండయ్య, కుప్పమ్మ దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆస్థాన నర్తకి చామకాంబ కూతురైన కామసాని తల్లి వద్ద నాట్యాన్ని అభ్యసించి, తన నాట్యకౌశలంతో సామ్రాజ్య విస్తరణ గావించినందుకుగాను ప్రభువుల మన్ననలందుకొని ఆస్థాన నర్తకి పదవినలంకరిస్తుంది.
ఐతే ఫలించని ఈ ప్రేమ కథకు కారణాలేమిటి ? వేయి స్తంభాల గుడికీ,ఈ కథకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ‘ఆవాహన’ అనే ఈ నవలా వారధిపై 12వ శతాబ్దంలోకి మన ప్రయాణం సాగాల్సిందే.
కళాశాల అధ్యాపకుడైన రామచంద్రరావు, బ్యాంకు ఉద్యోగై న మాధవరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగరీత్యా వరంగల్ బదిలీ ఐన మాధవ్ అంతకుముందే వరంగల్లో నివాసముంటున్న రామచంద్రకు తాము వరంగల్ వస్తున్నామనీ, తమకొక మంచి ఇల్లు అద్దెకు చూసి పెట్టమనీ ఉత్తరం వ్రాయడంతో కథ మొదలవుతుంది.
భార్యను, కూతుర్ని వెంటబెట్టుకొని మాధవ్ కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగడం, రామచంద్ర దంపతులు ఆతిథ్య మివ్వడం మామూలే అయినప్పటికీ, రెండు జంటలూ మొదటి కలయికలోనే స్థానిక దర్శనీయ స్థలాలపై పోటాపోటీగా చర్చించుకోవడం, ఎప్పుడెప్పుడు చూడాలా ?! అని అందరికందరూ ఉబలాటపడటం, అప్పటికప్పుడు పట్టిక రూపొందించుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది.
ఐతే కథనెక్కువగా సాగదీయకుండా, పని వేళలు ముగిసి బ్యాంకు నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో వేయి స్తంభాలగుడి చూడాలన్న ఉత్సు కతతో మాధవ్ లోపలికి అడుగుపెట్టడంతో, గజ్జెకట్టిన కట్టిన కాలికీ,ఉలి పట్టిన చేతికీ నడుమ విరిసిన ప్రణయానికి తెరతీశారు రచయిత.
ఆలయంలోని అణువణువూ నిశితంగా పరిశీలిస్తూ వెళుతున్న మాధవ్ కు పుష్కరిణి, దాని పక్కనే శిలాశాసనం, అక్కడి నుండి పడమరకు మళ్లగా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఉన్న నంది కనిపిస్తాయి. నందిపై చెక్కి ఉన్న శిల్ప సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఎదురుగా ఉన్న శివాలయంలోకి అడుగుపెట్టి, ఆలయ నిర్మాణాన్నీ , ఆలయ స్తంభాల మీద చెక్కబడి ఉన్న డిజైన్లనూ,సన్నటి లతలనూ గమనిస్తూ,పరమేశ్వరుని దర్శించుకొని ఇవతలికి వచ్చి నందీశ్వరుని వెనుక ఉన్న మరో ఆలయంలోకి అడుగు పెడతాడు.

కొంత భాగం శిథిలమై, మరికొంత అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని చూసి , “ఏ కారణం చేతనో కాకతీయులు ఈ మంటపాన్ని పూర్తి చేసినట్లు లేదు, ఆ రోజుల్లోనే ” అని తనలో తాను అనుకుంటూ ఇంకాస్త ముందుకెళతాడు.
వైశాఖ పూర్ణిమనాటి ఆ వెన్నెల మంటపంలోని శిలలు, శిల్పాలు, లతలపై కురుస్తూ ఆ పర్యాటకుని లోని కళాతృష్ణను రెట్టింపు చేస్తోంది.నెమ్మదిగా మరో అడుగు ముందుకేసిన అతనికి ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకో ఆ బొమ్మను చూడగానే అతని శరీరం గగుర్పొడిచి, కాళ్ళు అంగుళం కూడా కదలకుండా, కళ్ళనుండి నీరు కారిపోతూ ఉంటే, ఆ శిల్పాన్నీ,దానిలోని రామణీయక సజీవ చిత్రణను చూస్తూ, ముగ్ధుడై ఆ బొమ్మ ముందు తానూ ఒక రాతి బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోతాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో? ఎందుకు నిలబడ్డాడో తెలియదు (శిల్ప శాస్త్రానికి సంబంధించిన ఏ విధమైన పరిజ్ఞానంలేని, ఉలి మలుపుల్లో ఇమిడిన రసాత్మకతపై ఏ విధమైన అవగాహనలేని వ్యక్తి నీళ్లు నిండిన కళ్ళతో, తన్మయత్వంతో చూస్తూ, దాని ముందు స్థాణువులా నిలబడి పోవడానికిగల కారణమేమై ఉంటుందన్న ఆలోచన పాఠకుల మదిలో మెదులుతుంది). ఇతను మాత్రమే కాకుండా, ఈ కథను చదివే పాఠకులందరిలోనూ ఇదే గగుర్పాటు కలగడానికి కారణం కంచికి చేరని ఈ కథేనా?! లేక రచనా వైదుష్యమా?! అనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరికి వారే శోధించాలి.
ఆ పారవశ్యంలో అతను ఇంకెంతసేపు ఉండిపోయేవాడో గానీ,” ఏమిటి చూస్తున్నావు?” అనే పలకరింపుతో ఉలిక్కిపడి వెనుదిరిగిన అతనికి, కాళ్లు చాపుకొని,మోకాళ్ళపై రెండు చేతులు ఆనించుకొని, రాశిపోసిన సౌందర్యంతో వెలిగిపోతూ స్వర్గలోకం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా కిలకిల నవ్వుల జవరాలు శిథిల మంటపంలో ఓ వారగా కూర్చుని దర్శనమిచ్చింది.
“మీరు ఎవరు ?”అని యాంత్రికంగా అతనడిగిన ప్రశ్నకు “నేను మీ అమ్మగారి సేవకురాలిని” అని వ్యంగ్యంగా సమాధానమి వ్వడం, ఆజ్ఞాపించినట్లున్న కంఠస్వరంతో “కూర్చో” అంటూ ఏకవచన సంబోధన చేయడం, “సోమూ!” అంటూ తనను ఆత్మీయంగా, చనువుగా సంబోధించడం, అప్పుడే కిలకిలా నవ్వుతూ, మరుసటి క్షణంలోనే వలవలా ఏడుస్తూ, తానెన్నడూ చూడని ఆ స్త్రీ , తానెప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాటలను అర్థం చేసుకోలేకా ,ఆమె భావోద్వేగాలను అంచనా వేయలేకా , తికమకపడుతూ ఏం మాట్లాడితే ఎక్కడ తననొదిలి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఆమె కోపాన్ని, వ్యంగ్యాన్ని, బాధను, దుఃఖాన్ని, ఆమెలోని అనుకూల – ప్రతికూల భావాలకు సానుకూలంగా స్పందిస్తూ, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఉండగానే, ఆమె ఏడుస్తూ శిల్పాల చాటుకు వెళ్లి కనుమరుగ వుతుంది. ఎంత వెతికినా ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో, మౌనంగా ఇంటిదారి పట్టి,మరుసటి రోజు సాయంకాలం మళ్లీ అదే చోటుకి వచ్చి ఆమె జాడ కోసం వేచి చూస్తూ ఉంటాడు.
జాబిలి కిరణాల జల్లుల్లో తడుస్తున్నది అతని శరీరం మాత్రమే. నిన్న జరిగిన సంఘటన నిజమా?! కలా?! అన్న సందిగ్ధంలో మనసు అల్లకల్లోలమవుతోంది. మూడోనాటి వరకు సాగిన ప్రయత్నం వృధా ప్రయాసే కావడంతో నిస్పృహకు లోనైన అతని అంతరంగంలో రామచంద్రను చూడగానే కొత్త ఆశ చిగురిస్తుంది. ఆదివారంనాటి ఆ విహారయాత్రలో రెండు కుటుంబాలు కోట చుట్టూ హుషారుగా కలియదిరుగుతూ ఉంటే,గుండెలో రేగుతున్న అలజడి అతడిని మాత్రం ఓ పట్టాన నిలువనియ్యడం లేదు. ఒక్కొక్క రాతినీ తాకుతుంటే , అంతుపట్టని అలజడేదో తరంగాలై అతని నాడీ మండలానికి అజ్ఞాత సందేశాలు అందిస్తూనే ఉంది.
ఇక ఏమాత్రం తమాయించుకునే శక్తిలేని మాధవ్, తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లుగా రామచంద్రకు తెలుపడం, తిరుగు ప్రయాణంలో భద్రకాళి అమ్మవారి గుడిలో మాధవ్ స్పృహ కోల్పోవడంతో సాలోచనలో పడిన రామచంద్ర ఒకనాడు ఒంటరిగా ఆలయానికి వెళ్లి, ఆ పరిసరాల న్నిటినీ జాగ్రత్తగా గమనించి, అక్కడ కనిపించిన భక్తులను మాటల్లోకి దింపి ఏదైనా సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నించి, ఏ విధమైన ప్రయోజనంలేక ఇంటికి తిరిగివచ్చి, ఆమె మాధవ్ తో పలికిన పలుకులను మననం చేసుకుంటూ తన స్టడీ రూమ్ లోనికి వెళ్లి, వరంగల్ కు సంబంధించిన చరిత్ర పుస్తకాలను శోధిస్తూ ఉంటాడు.
స్నేహానికి ప్రాణమిచ్చే రామచంద్ర చరిత్ర పరిశోధకుడు కావడం యాదృచ్ఛికమే అయినా, అదే బలమైన కారణమై ఈ కథను ప్రపంచానికి అందించింది.
తనువు, మనసు అదుపు తప్పిన మాధవ్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తి నందిస్తూ ,ఆమె నోటి నుండి వెలువడిన (చిన్నమ్మ, పెద్దమ్మ, మల్యాల గుండయ్య, త్రిసరాలు, తాటంకాలు) మాటలను ఎప్పటికప్పుడు మాధవ్ నుండి తెలుసుకుంటూ, వాటిని గ్రంథాలయంలో రూఢి పరుచుకుంటూ, శిధిల మంటపం లో భూస్థాపితమైన ప్రణయ ప్రబంధాన్ని వెలికి తీసి, జాతికి అందించిన సాహసి, ప్రేమ పిపాసి(రామచంద్ర).
మొత్తం 10 పున్నములు ఆమె ప్రత్యక్షమవగా, చతుర్దశి నాటి సాయంత్రం అలికిడి ప్రారంభమై, పౌర్ణమి నాడు కనిపిస్తుందంటూ రెండవ కలయికలోనే చెప్పగలిగిన అతని (రామచంద్ర) తెలివితేటలు, గ్రహణశక్తి పాఠకులను ఆశ్చర్యంలో ముంచేస్తాయి.భార్యాబిడ్డలతో మొదటిసారి కాజీపేటలో రైలు దిగిన మాధవ్ తో ” మా చెల్లెలికేం సమస్యలేరా ? నేను లేనా శ్రీకృష్ణుడి లాంటి అన్నయ్యను, ఏదైనా కష్టం వస్తే చక్రం అడ్డువేయనూ ” అనీ,
నీవేం భయపడకమ్మా ! ఊళ్ళో నల్లాలు బందైతే నీకోసం హుస్సేన్ సాగర్ నుంచి తెప్పిస్తాం” అనీ
మంచితనం, మాటకారితనం కలగలిసిన పరిహాసంతో అన్న మాటలే అయినప్పటికీ, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన భర్తను చూసి ఆ ఇల్లాలు(మాధవ్ భార్య) పడే వేదనకు శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేసి వారి అనురాగ బంధాన్ని పువ్వుల్లో పెట్టి వారికప్పగించిన రామచంద్ర ఈ కథకు గుండెకాయ వంటివాడు. ఊళ్లో నా అన్న వారెవరూలేని ఆ ఇల్లాలికి అన్నీ తానై బాసటగా నిలిచిన కాత్యాయిని (రామచంద్ర భార్య) మహిళాలోకానికి ఆదర్శ ప్రాయురాలు. రామచంద్ర కు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన ఆనందరావు గారు ఆవాహన అనే ఈ క్రతువులో శ్రీగంధం వంటి వారు.
కోయిల గానాలు, వీణానాదాలు, సెలయేటి గలగలలు, వలిమిన్న జల్లుల అందాలన్నీ కలబోసిన వెన్నెల బొమ్మ ప్రతి పున్నమి రేయిలో అతడిని కరుణిస్తూనే ఉంది. కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.
మూడవ కలయికైన ఆషాఢ పున్నమినాటి రాత్రి ఆమె మాటలను బట్టి ఆమె పేరు కామసాని అనీ, అతని పేరు సోమేశ్వరుడనీ, కాకతీయ సామ్రాజ్య మల్లెపందిరిపై వాలిన ఈ ప్రేమపక్షులు సామ్రాజ్యకాంక్ష అనే శ రాఘాతానికి నేలరాలిన జంట గువ్వలనే విషయం పాఠకులకు అర్థమవుతుంది.
తమ పూర్వీకుల నిర్మాణకాంక్ష ఐ న సహస్రమంటపం శిల్ప రూపంలో సజీవంగా ఉండాలన్న సంకల్పంతో రుయ్యమ్మ (తన తల్లి, కాకతీయ సామ్రాజ్ఞి ఐన రుద్రమదేవి పేరుమీద ఆజ్ఞాపత్రం రూపొందించి) గోళకీ మఠ నిర్మాణానికై సోమేశ్వరుని మందడ పంపించేస్తుంది.

సోమేశ్వరుని అమరశిల్పిగా మలచాలనీ,కాకతీయ శిల్పం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలనీ, కామసానీ సోమేశ్వరులు వివాహ చట్రంలో ఇమిడితే, వారిరువురి నడుమ ఏర్పడే బంధం అతనిలోని కళాభిని వేషానికి ప్రతిబంధకంగా మారుతుందనీ,అందుకే అతడిని మందడ పంపించడం అనివార్యమైందనేది ఆమె వాదన.
పుత్ర సంతానం లేని గణపతి దేవులవారు తమ కుమార్తె అయిన రుద్రమదేవిని తమ రాజకీయ వారసురాలిగా ప్రకటించడం, వారి నిర్ణయానుసారం ఆమె పురుష వేషాన్ని ధరించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటాన్ని కళ్లారా చూస్తూ ఉండి కూడా, రుయ్యమ్మ వివాహం వీరిద్దరిలోని కళను దూరం చేస్తుందని ఆలోచించడంలో ఏ విధమైన బలం లేదు. ఇకపోతే రుద్రమదేవిగారికి కూడా పుత్ర సంతానం లేదు. వారి కుమార్తెలైన ముమ్మడమ్మగానీ, రుయ్యమ్మగానీ వారి తదనంతరం ఏ క్షణంలోనైనా పాలనా బాధ్యతలు చేబూనడానికి సర్వసన్నద్ధులై ఉండాలి, కానీ ఈ ఇద్దరు సోదరీమణుల్లో ఏ ఒక్కరు కూడా అవివాహితులుగా మిగిలిపోలేదు సరికదా, చక్కని గృహస్థ జీవితంలో ఇమిడిపోయారు.రాజ్యపాలనకు ప్రతిబంధకంకాని వివాహం కళా సాధనకు ఎందుకు ఈమెకు కారణంగా కనిపించిందన్న ఆలోచనకు సమాధానం దొరకడం లేదు.
తనకు అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న రుయ్యమ్మ పరామర్శ అనే మిషతో ఒకనాటి సాయంత్రం తమ ఇంటికి వచ్చి, తనకు(కామసానికి) తీరని అన్యాయం చేశానన్న మాట నిజమేననీ(పేజీ-116), ఒక జంటను తీరని బాధకు గురి చేశానని తనకు తెలుసనీ (పేజీ-118), ఒక స్త్రీ మరొక స్త్రీని కోరకూడనిదే – అయినా కోరుతున్నాను (పేజీ-119) అని అన్నదనీ, ఐనప్పటికీ తామిద్దరూ విడిపోవడానికి, తాను(రుయ్యమ్మ) పూర్తి కారకురాలిని కాననీ,అందులో తన పాత్ర కొంత వరకే పరిమితమై ఉందనీ మిగిలినదంతా దివ్య సంకల్పాలలో భాగమనీ, ఐతే అదంతా తన కోసం కాదనీ,కాకతీయ సామ్రాజ్య క్షేమం కోసం, సోమేశ్వరుని అమరత్వం కోసం ఈ త్యాగం చేయక తప్పదని (పేజీ- 119)తనతో అన్నదని అతనితో చెబుతుంది. దివ్య సంకల్పాల సంగతి దేవుడెరుగు,దివ్య సంకల్పాలలో భాగమే అయితే తాము విడిపోవడం కూడా యాదృచ్ఛికంగా జరగాలేతప్ప ఏ రాజకుమార్తె పనిగట్టుకుని చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది పగిలిన గుండెలోంచి ఎగిసిపడే విస్ఫోటనం, తట్టుకోలేని బాధలు, తీరని వేదనల నుండి పెల్లుబికే కఠిన శిలాద్రవం. అక్కడ తడికి ఆనవాలుగానీ, చెమ్మకు చోటుగానీ ఉండదు. అది బద్దలైన అగ్నిపర్వతం లోంచి వెలువడే లావా, భూమి(గుండె) పొరల్ని చీల్చుకొచ్చే మాగ్మా. ఏ వ్యక్తి అయినా తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, సంతలో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎవ్వరిని అడగడానికైనా, ఎవ్వరికి ఇవ్వడానికైనా. తెర వెనుక సూత్రధారై,తెరమీద పా త్రధారై,చేదు గుళికలకు చక్కెర పూతలద్దినట్లు, మాటలతో మంచు తెరలు కట్టి, ఆమె ఎంత శాంతంగా చెప్పినప్పటికీ, తన గుండెల్లో కుంపటి రాజు కుంటున్నట్టుగానే ఉందనీ చెప్పిన తీరు”పేదల కోపం పెదవికి చేటన్నట్లు………. ప్రకటించారు (పేజీ – 115) అనే మాట ద్వారా పాఠకులకు స్పష్టమవుతుంది.
“నాకు మిగిలింది అదే రాజకుమారి గారూ!” (పేజీ- 114)అనీ,”నన్ను చూడటం కోసం ఏ రాజకుమార్తె రానవసరం లేదు”(పేజీ – 115) అనీ,”ఒక రాజకుకుమార్తెగా కాక ఒక స్త్రీగా ఆలోచించు” (పేజీ-116) అని అనడం వంటివి ఆమె అనుభవించే వేదనను తెలుపడమే గాక, ఆమెలోని ముక్కు సూటితనం, నిక్కచ్చిత్వం, తన సమస్యను ఎదుర్కోవడానికి ఎంత ఘాటుగా నైనా (కోపం, ఆవేశం, దుఃఖం, వ్యంగ్యం, ధిక్కారం అన్నీ కలగలిసిన ప్రవర్తన) స్పందించే మనస్తత్వాన్ని వీరిద్దరి నడుమ జరిగిన ఆనాటి వాగ్వాదం పాఠకులకు అద్దంలో చూపెడుతుంది.
వెంజావళి రవిక, హూని పట్టు చీరలో ముస్తాబై వచ్చిన కొత్త పెళ్ళికూతురు సాటి ఆడపిల్లతో ప్రేమను త్యాగం చేయమనీ, పెళ్లిని విరమించుకోమనీ శాసిస్తోంది. ఆమె ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెలోని రాజనీతికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.
రుయ్యమ్మ చేసిన ధర్మోపన్యాసం(పేజీ -122) ఎంత గొప్పదైనా,ఆదర్శప్రాయమైనదైనా మానసికంగా తాను ఆ స్థాయికి ఎదగలేదనీ,తన స్థానంలో ఆమె ఉంటే ఇలాగే ఆలోచించి ఉండేదా? అనీ అతనితో అంటుంది. కాంచీపురంపై కాకతీయ బావుటా నెగరేసిన అసాధారణ ప్రతిభాశాలి ఐన కామసాని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు.
కాకతీయ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణిగా రుయమ్మనూ, రాజకీయ దురంధరనిగా అన్నయా మాత్యుల వారిని చరిత్రలో సుస్థిర పరచాలని మరెవరైనా పథకం రచించి, అమలు పరిస్తే అప్పుడు గానీ అర్థమయ్యేది కాదు రుయ్యమ్మకు తన ఆదర్శ స్వప్నం సంగతి అన్న ఉక్రోషం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. సామ్రాజ్య క్షేమం కోసం సాంసారిక జీవితంలో పాక్షిక త్యాగాన్ని తాను కూడా చేయగలననీ, కానీ నృత్యానికి అంకితమైన ఒక దేవదాసి లాగా(పేజీ-124), జీవితాంతం ఒక బౌద్ధ సన్యాసినిగా జీవించేందుకు తన మనసు సిద్ధంగా లేదనీ
సోమేశ్వరునితో చెప్పి బాధపడుతుంది (పేజీ – 122).
ఇద్దరూ కాకతీయ సామ్రాజ్య కళాకారులే అయినప్పటికీ, శిథిల మంటపంలోని వారి మొదటి కలయికలో “నేను మీ అమ్మగారి సేవకురాలిని”(పేజీ- 13)అని ఆమె జీవాత్మ మాధవ్ తో వ్యంగ్యంగా అంటుంది.
కాంచీపుర విజయానంతరం వీరిద్దరికీ ఏకాంతం దొరకనివ్వకూడదని తన రాజకుమార్తె స్థాయిని కూడా పక్కనపెట్టి నిరంతరం శిల్పాల వద్ద కూర్చుని సోమేశ్వరునితో శాస్త్రం గురించి చర్చలు జరపడం, గోళకీమఠ నిర్మాణానికై అతడిని మందడ పంపించేయడం, ప్రతాపరుద్రుని నామకరణ మహోత్సవానికి అతడిని రానివ్వకపోవడం వంటి విషయాలతో పథకం ప్రకారమే రుయ్యమ్మ తామిద్దరినీ విడదీస్తుందని తెలిసి కూడా, సామ్రాజ్య విస్తరణలో ప్రజల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేయా లే తప్ప, సామ్రాజ్య కాంక్షకు వాళ్లను సమిధలుగా మార్చకూడదన్న విషయాన్ని ఒక రాజ్యాధినేతగా, ఒక మాతృమూర్తిగా రుద్రమదేవి రుయ్యమ్మకు హితవును బోధించకుండా మౌనంగా ఉండటమే ఆమె గొంతులోని వ్యంగ్యానికి కారణమన్న విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమ వుతుంది.
వారి అసమాన శౌర్య ప్రతాపాలు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దృష్టిని ఏకశిలా నగరం వైపు ఆకర్షించి, చరిత్రలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక ధీరవనిత పేగు తెంచుకు పుట్టిన కుమార్తెను విమర్శించే స్థాయి నాకు లేకపోయినా, బద్దలైన ప్రేమభాండమే నా ఈ స్పందనకు కారణమని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ స్పందన నాకు మాత్రమే పరిమితమైంది కాదనీ, నా వంటి ఎంతో మందిలో ఇవే ఆలోచనలు రేకెత్తాయనడానికి ఈ నవల (ఆవాహన) ప్రచురితమైన తొలినాళ్లలో ఇంటింటా జరిగిన చర్చలే బలమైన నిదర్శనాలు.
కేవలం కళ అజరామరం కావాలనీ, కళాకారులైన కామసానీ, సోమేశ్వరులను కళాతపస్వులుగా మలిచి, అమరత్వం ప్రసాదించాలని రుయ్యమ్మ రాజకీయంగా ఇలా పావులు కదిపి ఉండవచ్చా?, ఆదర్శాలనేవి మనకు మాత్రమే పరిమితమైనవనీ, మరొకరిపై బలవంతంగా వేసేవీ, శాసించేవి ఆదర్శాలనిపించుకోవనే సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగి ఉంటే బహుశా కథ ఈ మలుపు తిరిగి ఉండకపోవచ్చు? ఈ హఠాత్పరిణామాన్ని (ఒకరి కోసం ఒకరు అమరులవడం) ఆమె ఊహించకపోయి ఉండవచ్చా?, ఊహించని ఆ మలుపు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చా?,అంతులేని పశ్చాత్తాపంతో ఆమె హృదయం కలత చెంది ఉండవచ్చా ? కామసాని చాళుక్య పరంపరకు చెందిన వ్యక్తి అయి ఉంటుందా
?, గుండయ్య,కుప్పమ్మల బిడ్డగా పెరిగిన సోమేశ్వరుడు వారికి సమీప బంధువై ఉంటాడా?లీనమై చదివిన పాఠకుల్లో తోడిన కొద్దీ ఊటలై ఊరే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఏ చరిత్రకారుడో కంకణం కట్టుకోవాలే తప్ప, నావంటి సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు.
కార్తీక సోమవారం నాటి ప్రదోషకాలంలో స్వయంభూ దేవాలయం నుండి బయటకు వచ్చి, వెనుక ఉన్న కొత్త నిర్మాణాన్ని చూడాలనిపించి వెళ్లిన కామసాని, పద్మకార శిల్పం మీద తలానించి, ఆకాశం వంక చూస్తూ, ధ్యాన నిమగ్నుడై మునిపుంగవుని ప్రతీకగా ఉన్న సోమేశ్వరుని మొదటిసారిగా చూస్తుంది.
శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి, ముంగర, కమ్మలు భవిరెల అలంకరణలో రత్నదీప కాంతుల నడుమ మెరిసిపోయే కళాభినేత్రి అతనికి తపోభంగం కలిగించ లేకపోయినా, అతని అందమైన ముఖం,కలలుగనే ఆ కళ్ళు మొదటి చూపులోనే ఆమెలో అతని యెడ అనురక్తిని కలిగిస్తాయి. ఆరోజు వారిరువురి నడుమ జరిగిన సంభాషణ, అతనితో ఆమె ప్రవర్తన ఆమెపై గడుసైన సొగసరి అనే భావనను పాఠకుల్లో కలిగిస్తుంది.
శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి ఉన్నానని(అప్పటి రోజులను గురించి) శిథిల మంటపంలో కామసాని మాధవ్ తో రెండు, మూడుసార్లు చెబుతుంది. అది ఆమెకు బాగా నచ్చిన వస్త్ర విశేషమై (ఆ రంగుల కలయిక) ఉండవచ్చు. ఆమె నర్తకి కావడం వల్ల సహజంగానే అలంకరణపై ఆసక్తీ,పట్టు ఉంటుంది.
సోమేశ్వరుని నోటి వెంట ‘గిరిజ ‘ అన్న పేరు విన్నప్పుడు ఆమెలో స్త్రీ సహజమైన ఈర్ష్యను, మాహూరయ్యతో జరిపిన సంభాషణలో చిలిపిదనంతో కూడిన పరిణతిని పాఠకులు గమనిస్తారు. కాంచీపుర యాత్ర గురించి చెబుతూ అతను కూడా వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేస్తుందేతప్ప పులిబోనులో తలదూర్చబోతున్నాననే భయం ఏమాత్రం కనిపించకపోవడం ఆ ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెబుతుంది.
శ్రీదేవి చొక్కనాధుల ముసుగులో కాంచీపురంవైపు సాగింది వారి రాజకీయ యాత్ర మాత్రమే. ఆ ముసుగు మాటున దాగిన కామసానీ సోమేశ్వరులకు మాత్రం అది ప్రేమయాత్ర. దారి పొడవునా పలు క్షేత్రాలు దర్శిస్తూ , నదీ స్నానాలు చేస్తూ అదొక ప్రేమయాత్రగా వెళతారేతప్ప అత్యంత సాహసోపేతమైన ప్రయాణమనీ,ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఎదురయ్యే పరిణామాలను గురించిన ఆదుర్దా గానీ మచ్చుకు కూడా కనిపించక పోవడం మనసున్న వారిని కలిచి వెయ్యకుండా ఉండగలదంటారా?
కాంచీపురంలో తాను నెరప బోయే గూఢచర్యం గురించి సోమేశ్వరునికి వివరిస్తూ,
” అభినయం దాని ముసుగు. విజయ గండనికీ,శ్రీధర స్వామికీ మధ్య విభేదాలు కల్పించడం అంకురార్పణ.
విజయ గండ పతనం ఫలప్రాప్తి – ఇదీ నా కార్యక్రమం ” అని చెప్పడం,
“నా కళ్ళూ, కాళ్ళూ నీ చేతులతో కలిసి కాంచీపురాన్ని పతనం చేశాయి” అనీ,
“శాస్త్రం – శస్త్రం ఒకే చోట దర్శనమిచ్చింది ఆ రాత్రి” అని చెప్పిన తీరు సింధువును బిందువులో ఇమిడ్చగలిగే, బ్రహ్మాండాన్ని పరమాణువులో బంధించగలిగే ఆమెలోని ప్రతిభాపాటవాలను అంచనా వేయడానికి ఇంతకన్నా బలమైన పదాలుంటాయా?
(కళ అనేది కేవలం హృదయాన్ని రంజింపజేసేది మాత్రమే కాదనీ, సామ్రాజ్య విస్తరణలోను కీలకమైన పాత్ర పోషిస్తుందన్న కొత్త విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నానన్న విషయాన్ని పాఠకులతో పంచుకోవాలనిపించి….)
రుయ్యమ్మ,అన్నయల పెళ్లి జరిగిన కళ్యాణ మంటపం (ఈ మంటపాన్ని సోమేశ్వరుడే చెక్కుతాడు) లోనే తమ పెళ్లి కూడా జరగాలని ఉందని సోమేశ్వరునితో అనడం, అదే పెళ్లిలో విశ్వంభర శివాచార్యుల వారికి నమస్కరించి “మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీ” అనడం పద్మాక్షమ్మ కొండపై నుండి నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా మెట్లు దిగి వెళ్ళిపోవడం వంటి విషయాలు తడి ఉన్న గుండెల్ని వడి వెట్టకుండా ఉండగలవంటారా?
కూతురి స్థానంలో ఆస్థాన నర్త కిగా తిరిగి తనను నియమించదలచినట్లు రాజప్రాసాదం నుండి వచ్చిన శ్రీముఖాన్ని చామకాంబ సున్నితంగా తిరస్కరిస్తుంది. కళ్ళ ముందే కృంగికృషించి పోతున్న కూతురిని చూస్తూ ఆ తల్లి మనసు ఎలా అంగీకరించగలుగుతుంది?
“ఆస్థాన నర్తకి ప్రథమాభినయమా” అన్న సోమేశ్వరుని మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం, తనను పరామర్శించడానికి వచ్చిన రుయ్యమ్మతో జరిపిన వాగ్వాదం,
“నీ ముందు నాకీ సామ్రాజ్యమెంత ?” అని సోమేశ్వరునితో అనడం వంటివన్నీ అతని ప్రేమ కంటే విలువైనదేదీ ఆమెకీ ప్రపంచంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది.
తామిద్దరినీ రుయ్యమ్మే విడదీసిందన్న విషయం రుయ్యమ్మ నోటి వెంటే విన్న కామసాని
‘ నాకీ ఆస్థాన నర్తకి పదవీ వద్దు. ఈ సామ్రాజ్యమూ వద్దు’ అనుకుని అక్కడ అరక్షణం కూడా నిలబడకుండా గిర్రున వెనక్కి తిరిగి రావడం, అంతఃపురం నుండి పరిచారికలతో కబురు మీద కబురంపినా, “రుద్రమగారి తర్వాత ఇతనే రాజవుతాడా? ఈ ప్రతాపరుద్రునితోనే ఈ సామ్రాజ్యం ఏమైనా అయిపోతుందా? నా నృత్య ప్రదర్శన లేకపోతే?” అంటూ పరిచారికలను తరిమేయడం, రాజాజ్ఞని కూడా ధిక్కరించిన వైఖరి ప్రేమ పట్ల ఆమెకున్న నిబద్ధతను, అది గెలిపించుకోవడానికి సర్వశక్తులొడ్డి పోరాడిన తీరును తెలుపుతుంది.
కామసాని అతడినెంత గాఢంగా ప్రేమిస్తుందో, అతను కూడా అంతే గాఢంగా, నిజాయితీగా ఆమెను ప్రేమిస్తాడు. కాంచీపుర యాత్రలో భాగంగా సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ, ” కొంగులు ముడి వేసుకొని చేద్దామా ?” అనడం, తిరుగు ప్రయాణంలో “బాలాజీ దర్శనంతో మన వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది” అనడం వంటి మరికొన్ని మాటలను బట్టి ఆ విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తాడేగానీ దానిని పండించుకునే ధైర్యం, స్థైర్యం (ఆమెలో నూటికి నూరుపాళ్ళు ఉంటే) ఇతనిలో మచ్చుకు కూడా కనిపించవు. అవే గనుక ఉండి ఉంటే ఈ కథ విషాదాంతం అయి ఉండేదే కాదు. ఆమెతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మందడ వెళ్లిపోవడం, తిరిగి ఏకశిలకు వచ్చాక కూడా ఆమెకు ఏ విధమైన సమాచారం ఆమెకు అందించకపోవడం, వారి ఆఖరి కలయికైన పద్మాక్షమ్మ కొండపైన ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా(బీద పలుకులు పలుకుతాడేతప్ప) ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం ఇతనిలోని పలాయన వాదానికి నిదర్శనాలు.
కామసానికి ప్రతీకగా యశోదర విగ్రహాన్ని వేయి స్తంభాల గుడిలో చెక్కుతానని అంటాడు. వీరశైవం అధికార మతంగా ఉన్న రాజ్యంలో బౌద్ధ మతపరమైన శిల్పం చెక్కడ మేమిటన్న ఆమె మాటలకు మానవత మతానికి అతీతమైందనీ, అది అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందనీ, సర్వసంగ పరిత్యాగి ఐన బుద్ధుడు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పటికీ , తాను చేసిన త్యాగానికి లక్ష రెట్ల కీర్తిప్రతిష్టల్ని పొంది, లోకానికి ఆదర్శ పురుషుడైనాడనీ, కానీ యశోదర మానసిక సంఘర్షణను ప్రపంచం గుర్తించలేదనీ, అందుకే ఆమెపై తనకున్న అపారమైన గౌరవానికి సూచనగా చెక్కుతానని అంటాడు.
సిద్ధార్థుడు యశోదరను వదిలి వెళ్ళిన విధంగానే తాను కూడా కామసానిని వదిలి వెళుతున్నానని అతని అంతరంగ భావన అయి ఉండవచ్చు. తనలోని కళా నైపుణ్యం శిల్ప రూపంలో కొన్ని యుగాల పాటు నిలిచి ఉంటుందనీ, కానీ కామసాని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన కొద్ది కాలానికి ఆమెలోని మానసిక సంఘర్షణను, ఆమె అందెల రవళులను ప్రపంచం మరిచిపోతుందని కూడా అతడి భావన అయి ఉండవచ్చు.
పైకి యశోదరను ఉదాహరణగా చూపిస్తూ, మాట్లాడుతున్నాడే గానీ అతను చెప్పేదంతా తన గురించేనని క్షణంలో పసిగట్టిన కామసాని అదే మాట అతనితో అంటుంది కూడా. ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా, అతను ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో, నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా కొండ దిగి వెళ్ళిపోతుంది.
శిల్పం కోసం ప్రేమను త్యాగం చేస్తానన్నవాడు మరి ఆ శిల్పానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. గోళకీ మఠ నిర్మాణానికై వెళ్ళినప్పటికీ, శిల్పం పై దృష్టి నిలపలేకపోతున్నాడనీ, ఇటు తాను రోగిష్టినయ్యాననీ, ఇద్దరినీ కళాతపస్వులుగా చేయాలన్న రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదనీ,తన తల్లి ఐ న చామకాంబ తనతో చెప్పిందనీ, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆ విషయం తెలిసి పూర్తిగా కుదేలయ్యాననీ, ఆ తదుపరి సంఘటనలు కలలో జరిగినట్లుగా జ్ఞాపకం ఉన్నాయనీ, ఎందుకో శివాచార్యులవారు వచ్చినట్లు,తనను అభిమంత్రిస్తున్నట్లు ఏదో లీలాగా స్ఫురించిందనీ,ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని చూస్తున్నాననీ చెబుతుంది.
మొత్తం 10 పున్నములుగా జరిగిన ఈ కథలో (శిథిల మంటపంలో) ఇక్కడి వరకే ఆమె మాధవ్ తో చెబుతుంది.
మాధవ్ మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఆయుర్వేద వైద్యులైన వేణుగోపాలాచార్యులవారి సలహా మేరకు వరంగల్ వాస్తవ్యులైన మహామంత్రవేత్త, ఉపాసకులైన ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారిని కలిసి శిథిల మంటపంలో మొదటి నుండి మాధవ్ కె దురవుతున్న అనుభవాలను, అతని ప్రస్తుత పరిస్థితిని వివరించి ఎలాగైనా అతడినీ, అతడి కుటుంబాన్నీ ఈ కష్టం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడతాడు రామచంద్ర.
తన ఆధ్యాత్మిక శక్తి అంత దృఢమైనది కాదనీ, ఇదివరకెన్నడూ ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు లేదనీ మొదట అన్నప్పటికీ, చివరకు అంగీకరిస్తారు జ్వాలాపతిగారు.
రామచంద్ర చెబుతున్న విషయాలన్నిటిని కళ్ళు మూసుకొని పారవశ్యంతో విన్న ఆ మహనీయుడు ఊహాలోకం నుండి వాస్తవానికి వచ్చి, ఈ మాధవరావే ఆనాటి భళ్ళాల సోమేశ్వరుడనీ, కామసాని అతడి ప్రేయసి అనీ, శిథిల మంటపంలో ప్రతి పౌర్ణమికి అతడికి కనిపించి, మాట్లాడుతూ న్నది ఆమె జీవాత్మ అనీ చెబుతాడు.
మరుసటి రోజైన త్రయోదశీ,సోమవారం మాస శివరాత్రి నాడు అఖండం వెలిగించి పూజ ప్రారంభిస్తాననీ, ధ్యానంలో తనకేవైనా కొత్త ఊహలు రావచ్చనీ, ఎల్లుండి వచ్చి కనిపించమని చెప్పి పంపిస్తారు.
వారి మాట ప్రకారం మరుసటి రోజు వెళ్లిన రామచంద్రకు నవ్వుతూ ఎదురొచ్చిన జ్వాలాపతి గారు తమకు ధ్యానంలోస్ఫురించిన విషయాలను రామచంద్రకు చెబుతూ….
మందడ నిర్మాణం పూర్తి చేసి, ఏకశిలకు వచ్చిన సోమేశ్వరుడు మనసు అల్లకల్లోలమవుతుండగా సహస్రమంటపాన్ని చెక్కుతూ ఉంటే, ఒకనాడు చామకాంబ వచ్చి కామసాని ఆఖరి ఘడియల్లో ఉందని తెలుపడంతో వెళ్లి చూస్తాడు. పరిస్థితి ఇలా చేయి దాటి పోతుందని ఊహించని అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తూ,మహామంత్రవేత్త, రాజ గురువైన విశ్వంభర శివాచార్యుల వారినాశ్రయించి, తన గుండెలోని వేదనను, ఆమె కళ్ళలోని ఆవేదనను తన ఉలి మలుపుల్లో బిగించి, ఆమెకు ప్రతీకగా తాను చెక్కిన శిల్పం శిథిల మంటపంలో యశోదర విగ్రహమై ఉందనీ, తిరుపతిలో బాలాత్రిపుర సుందరి సమక్షంలో మానసికంగా తమకు వివాహం జరిగిందనీ,ఆమె ఆత్మను అందులో ఆవాహన చేయమని ప్రాధేయపడతాడు.
“స్వామీ! కామసాని నన్ను అమరుణ్ణి చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణ ప్రతిష్ట చేయండి” అని అర్థిస్తాడు.
(జ్వాలాపతిగారు రామచంద్రకు తెలిపిన ఈ విషయంపై నా స్పందనను పాఠకులతో పంచుకోవాలనిపించి……
కామసాని – సోమేశ్వరులకు సంబంధించిన ఈ కథను నేను ఈ ఒక్క పుస్తకంలోనే చదివాను. ‘క్రీడాభిరామం’ అనే నవలలో కూడా కామసాని ప్రస్తావన ఉందన్న విషయం ఎక్కడో విన్నాను గానీ,ఆ పుస్తకాన్ని మాత్రం నేను చదవలేదు.
అతని ఉన్నతిని అతనికంటే ఎక్కువగా ఆమె కోరుకుందే తప్ప, తన ప్రేమను త్యాగం చేయడానికి గానీ,అతడితో బంధాన్ని వదులుకోవడానికి గానీ ఆమె ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. నవల మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా ఈ విషయం పాఠకులకు కనిపించదు, స్ఫురించదు.మరి సోమేశ్వరుడు శివాచార్యుల వారితో ‘ అమరుణ్ణి ‘ అనే పదం ఎందుకు వాడారో నాకు ఎంత ఆలోచించినా బోధపడలేదు).
మొదట అంగీకరించని శివాచార్యులవారు ఒకనాటి పూర్ణిమనాడు భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మను యశోదర విగ్రహంలో ఆవాహన చేశారనీ, ప్రతిష్ట కాలంలో దుఃఖిస్తూ ఉన్న సోమేశ్వరుడు పూజాదికాలు సక్రమంగా నిర్వహించ లేకపోయాడనీ, ఆ కారణంగా ఆకర్షణ సమయంలో పూజలోనో, మంత్రంలోనో ఏదో లోపం జరిగిందనీ,ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదనీ, ప్రతి పౌర్ణమినాటి చంద్రోదయ కాలంలో కేవలం 15 నిమిషాలపాటు సోమేశ్వరునితో మాట్లాడుతుందనీ, ఆ పదిహేను నిమిషాల కాలమే జీవప్రతిష్ట జరిపిన ముహూర్తమై ఉండవచ్చనీ, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇదేవిధంగా బయటకు వస్తూ, అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి ఉండవచ్చనీ ,ఇంత కాలానికిగానీ ఆమె నిరీక్షణ ఫలించ లేదనీ, ఆనాటి సోమేశ్వర రూపానికీ ,ఈ మాధవరావు రూపానికీ సంపూర్ణ సాన్నిహిత్యం ఉండటమే ఆమె అతడిని గుర్తుపట్టడానికి కారణమై ఉండవచ్చనీ,అతనే సోమేశ్వరుడ వ్వడంవల్ల అతడికి మాత్రమే కనిపిస్తూ, అతనితోనే మాట్లాడుతూ ఉందనీ, ఆమె భౌతికంగా మరణించిన అనంతరం కళాభినివేషాన్ని పూర్తిగా కోల్పోయిన సోమేశ్వరుడు ” దేవీ! దేవీ!” అంటూ కామసాని నామస్మరణలో పిచ్చివాడై, నిరంతరం సహస్ర స్తంభ మంటపంలో తిరుగుతూ, తనువు చాలించి ఉంటాడనీ కామసాని సశేషంగా మిగిల్చిన కథను తన ఉపాసనా బలంతో సంపూర్ణం గావించారు .
ఆ తర్వాత మాధవ్ నూ,అతని కుటుంబాన్ని కాపాడమంటూ అర్థించిన స్నేహశీలి (రామచంద్ర) ఆవేదనకు స్పందించి శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తారు జ్వాలాపతి గారు.
( ఇక్కడ నా మనసులో మెదిలిన మరో విషయాన్ని కూడా పాఠకులతో పంచుకోవాలనిపించి…..
ఎంత గొప్ప శిల్పి ఐనప్పటికీ, అతి సామాన్య మానవుడైన సోమేశ్వరుడు ఆమె తనను వదిలి వెళుతుందనే ఊహను తట్టుకునే శక్తిలేకా,ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయగలిగే పరిజ్ఞానంలేకా ఆవాహన చేయమని అభ్యర్థించి ఉండవచ్చు. కానీ మహా మంత్రవేత్త, తపఃసంపన్నులైన శివాచార్యులవారు ఎలా అంగీకరించగలిగారు? అన్న ప్రశ్న మాత్రం నాలో తలెత్తింది. మరుసటి క్షణంలోనే సాధుసత్పురుషుల ఆలోచనల వెనుక ఏదో అర్థం, వారు వాటిని అమలుపరిచే విధానాల వెనుక మరేదో పరమార్ధం దాగుంటుందని మళ్లీ ఆ (నా) మనసే నాకు హితవును బోధించింది.
రాబోయే కాలంలో ఈ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని వారు భావించి ఉండవచ్చనీ, అందుకే శిల్పంలో ఆవాహన చేసి ఉండవచ్చనీ నాకనిపించింది.
నవల చదవక ముందు అది చదవాలనీ,దానికిపై వ్యాసం వ్రాయాలని మాత్రమే ఉండేది, కానీ ఎప్పుడైతే నేనా నవల చదివానో,ఆ క్షణం నుండే నాలో ఆ శిల్పాన్ని చూడాలన్న కోరిక పెరుగసాగింది. వ్యాసం వ్రాయాలన్న ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడంతో, ఇక ఉండబట్ట లేక 02/07/ 2024 నాడు నేను, మావారు వరంగల్ కు బయలుదేరాం. నేను శిల్పశాస్త్రం, పురాతత్వశాస్త్రం, చరిత్ర వంటి వాటిలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ, ఆ శిల్పం చూసి రావాలనుకోవడానికి కారణం, ప్రత్యక్షంగా చూసి వ్రాస్తే నా రచన ఒకింత బలాన్ని పుంజుకుంటుందనీ, మరికాస్త జీవం పోసుకుని కొంతమందినైనా కదిలించగలుగుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రయాణం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా గమనించాను.
విశాలమైన ఆవరణలో అడుగుపెట్టగానే 3 శివలింగాలు, వాటికి కాస్త దూరంలో పుష్కరిణి, పద్మాకారంలో ఉన్న వేదిక, దానిపై ఆలయ నిర్మాణం (ఈ ఆలయ నిర్మాణమే నాకు వినూత్నంగా కనిపించింది. ఇటువంటి నిర్మాణశైలి నేను ఇది వరకెక్కడా చూడలేదు. బహుశా ఉండి ఉండవచ్చు, కానీ పర్యాటక ప్రదేశాలను చూడటంలో నేను అంత చురుకుగా ఎప్పుడూ లేను, అందుకే నాకలా అనిపించి ఉండవచ్చు) మరోవైపు హనుమంతుడు, నాగదేవతల ప్రతిష్ట కనిపించింది. గుడిలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుని, కాకతీయ సామ్రాజ్యపు ఆలోచనలు తలలో చక్రభ్రమణం చేస్తూ ఉంటే, గోడలను చేతులతో స్పృశిస్తూ, ఆ విషాదగాథను నెమరేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ, నందీశ్వరుని చెంతకు చేరుకొని, ఆవాహన నవలను చేతిలో పట్టుకొని,గుండె దడదడలాడుతూ ఉండగా, నెమ్మదిగా శిథిలమంటపం లోనికి అడుగు పెట్టాను.
800 సంవత్సరాల విషాదాన్ని మోసిన ఆ విగ్రహాన్ని చూడాలన్న తపన నన్ను రోమాంచితం చేస్తూ ఉంది. అంగుళం కూడా వదలకుండా మంటపమంతా కలియజూస్తూ, మధ్య మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తూ, ఒక్కొక్క సంఘటనను సరిచూసుకుంటూ, ఒక్కొక్క అడుగే వేస్తూ, అప్పుడప్పుడు దాని గురించి మా వారితో చర్చిస్తూ, అవసరమైన చోట అతని సలహాలు తీసుకుంటూ, అంగుళం అంగుళం గాలించాను.
ఆ మంటప నిర్మాణమే నాకు సరికొత్తగా అనిపించింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. నవలలో పద్మాకార శిల్పాలు అనే మాట కామసాని నోటి వెంట చాలాసార్లు వస్తుంది. ఈ పద్మాకార శిల్పాలు ఏమిటనే విషయంపై చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రధాన ఆలయంలో, శిథిలమంటపంలో రెండు చోట్లా నాకు పద్మకార చెక్కడాలు కనిపించాయి. ప్రధాన ఆలయంలో కప్పు పైభాగంలో అన్ని పద్మాకారంలో చెక్కిన చక్రాలు కనిపించాయి (బహుశా అవి ఇవే అయి ఉండవచ్చు అనుకున్నాను). శిథిలమంటపంలో 4 వరుసల్లో వరుసకు 6 చొప్పున మొత్తం 24 స్తంభాలు కనిపించాయి. ప్రధాన మంటపానికి నాలుగు వైపులా 4 ఉపమంటపాలు కనిపించాయి. ప్రతి ఉపమంటపానికి నాలుగు వైపులా 11 చొప్పున మొత్తం 44 చిన్న,చిన్న స్తంభాలు కనిపించాయి. కానీ ఎంత వెతికినా నాకు యశోదర శిల్పం జాడ కనిపించలేదు. అప్పుడు నాలో కలిగిన ఆలోచనలనుగానీ,నా గుండెలో రేగిన అలజడినిగానీ కాగితంపై పెట్టాలంటే, నా రచనా శక్తి సరిపోదేమో అనిపించింది. కామసాని మాధవ్ తో మాట్లాడుతూ శిల్పాల చాటుకు వెళుతుందనీ ,అలా వెళుతూ, వెళుతూ అదృశ్యమవుతుందనీ ఉ టంకించారు. యశోదర శిల్పం మాత్రమే కాదు, ఆ మంటపంలో నాకు ఏ ఒక్క శిల్పమూ కనిపించలేదు. రాతి స్తంభాలపై సన్నటి లతలు, చిన్న, చిన్న దేవతా రూపాలు కనిపించిన మాట వాస్తవమేగానీ, స్తంభాలపైగానీ, స్తంభాల చెంతగానీ నాకు ఎటువంటి విగ్రహాల జాడ కనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్లను కొందరిని గైడ్స్ గురించి అడిగితే, గైడ్స్ ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పారు.నలుగురైదుగురు భక్తులను అడిగినప్పటికీ , ఏ విధమైన సమాచారం లభించలేదు. ఆలయ అర్చకులను సంప్రదించమని ఒకరిద్దరు సలహా ఇచ్చారుగానీ నాకెందుకో సమాచారం దొరుకుతుందన్న నమ్మకం కలుగక మౌనంగా ఉండిపోయాను. చివరి ప్రయత్నం గా గోడకు చేరగిలబడి సెల్ ఫోన్ చూసుకుంటున్న ఒక యువకుడి దగ్గరకు వెళ్లి,విషయం తెలియజేశాను. నా చేతిలో ఉన్న నవలను చూపించి కాస్త వివరించమని అభ్యర్థించాను. దానికతడు తాను చరిత్ర తెలిసిన వ్యక్తిని గానని , ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా తనకేమీ తెలియవని, కాకపోతే ఇక్కడ తానొక డాన్సర్ విగ్రహాన్ని చూశానని, దాన్ని (ఆ శిల్పాన్ని) పగులగొట్టి అటువైపుగా పడేశారని మంటపానికి కుడివైపున చేతితో చూపిస్తూ , వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఆ మాత్రం సమాచారమిచ్చిన ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపి, నవలను చేతిలో పట్టుకొని పరుగు లాంటి నడకతో ఇద్దరం ఆశగా వెళ్ళాం. అక్కడ పగిలిపోయిన శిలా ప్రతిమలు కుప్పగా పడవేసి ఉన్నాయి. అందులో ఆత్రుతగా వెతుకుతూనే, అక్కడ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సఫాయి కార్మికులను అడిగితే ఆ విషయాలేవీ తమకు తెలియవని చెప్పారు. కాకపోతే వారిలో ఒక తను నా చేతిలోని నవల ముఖచిత్రాన్ని చూసి , దాన్ని చేతిలోకి తీసుకొని ఇవి రామప్ప దేవాలయంపై చెక్కిన రాగిణి, నాగిని విగ్రహాలనీ, మేమడిగే సమాచారం అక్కడ దొరుకుతుందనీ, చెప్పడంతో ఇక అంతకంటే ఎక్కువ అతనిని అడగడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మౌనం వహించి, మళ్లీ వెదకడం మొదలు పెట్టగా, అందులో ఒక స్త్రీ విగ్రహం నా కంట పడనే పడింది.
దాన్ని నాకున్న అతి స్వల్ప పరిజ్ఞానంతో నఖశిఖ పర్యంతం పరీక్షించాను. ఇది నర్తకి శిల్పమే అయి ఉంటుందా ? అని కళ్లింతలు చేసుకుని చూశాను. అత్యంత బాధాకరమైన విషయమేమంటే ఆ శిల్పం రెండు ముక్కలుగా పగిలి, మోకాళ్ళ కింది నుండి వేరు చేయబడి ఉంది. కాళ్లకు నర్తకీమణులు ధరించే అందెలు ఉన్నాయా ?లేదా? అని గమనించాను. అందెలు ధరించిన నాజూకైన కాళ్లతో అది ఆ శిల్పమేనన్న నిర్ణయానికి వచ్చాను. కింది భాగానికి సరిపోలే మరో శిల్ప శకలానికై మళ్లీ వెదుకులాట ప్రారంభించాను. చక్కని అవయవ సౌష్టవంతో నృత్య భంగిమలో ఉన్న మరో శకలం కనిపించింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తలభాగం మొండెం నుండి వేరైతే పడలేదుగానీ, ఒక వర్తులాకార ఫలకంపై చెక్కిన ముఖ భాగం (తల భాగానికి చెందిన వర్తులాకార ఫలకమేదైతే ఉందో అది మొండానికి అతుక్కునే ఉంది కానీ దానిపై చెక్కిన ముఖభాగం లేదు. పాఠకులకు విషయం స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇంత వివరంగా వ్రాస్తున్నాను) మాత్రం కనిపించలేదు.
ఆ శిల్పం లోని ముద్రనూ, నిలుచున్న భంగిమనూ (ఇంటికి వచ్చాక కాస్త నాట్యశాస్త్రంతో పరిచయం ఉన్న వారిని అన్ని వివరిస్తూ అడిగితే అది ‘ కపిథ’ ముద్ర అని చెప్పడంతో నా ప్రయత్నం మరింత బలపడిందనిపించింది) జాగ్రత్తగా గమనించాను. మోకాళ్ళపై వరకు ధరింపజేసిన ఆ వస్త్రాలను(ఆ మరుసటి రోజు గూగుల్లో నర్తకీమణులు ధరించే వస్త్రాలు అని వెదికితే దానిని ‘ చల్లడం ‘ లేదా ‘చల్లాడం ‘ అని అంటారని తెలిసింది), ఆభరణాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండు భాగాలు ఆ శిల్పానికి సంబంధించినవే అయి ఉండవచ్చని నా మనసు చెబుతూనే ఉంది. ఆ శిల్ప శకలాలను చూడగానే నా గుండె విలవిల్లాడిపోయింది. కామసాని కాళ్ళను ఎవరైనా నరికితే సోమేశ్వరుడు ఎంతగా విలవిల్లాడుతాడో నా మనసు కూడా అంతగా విలవిల్లాడింది. చేతిలోని కామసాని – సోమేశ్వరుల ప్రణయ కావ్యం (ఆవాహన నవల) పుటలన్నీ తెగిపోయి గాల్లో ఎగురుతూ వేయి స్తంభాల గుడి నిండా చెల్లాచెదురై పడిపోతున్నట్టు, వాటిని పట్టుకోవడానికి నేను ఆలయమంతా పరుగులు తీస్తున్నట్టు ఏవేవో భావ చిత్రాలు.
మనసు అల్లకల్లోలమవుతుండగా భారంగా పుష్కరిణి వైపు అడుగులు వేసిన నాకు దాన్నిండా తాబేళ్లు కనిపించాయి. తాబేలు జీవితకాలం సుదీర్ఘమైంది కదా , వీరి ప్రణయానికివి ప్రత్యక్ష సాక్షులై ఉంటాయన్న నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. ఆ శిల్ప శకలాలను చూసి మొదలు నరికిన చెట్టులా చతికిలబడిన నన్ను చూసి మావారు “పర్వతాలే కాలగర్భంలో కలిసిపోగా లేనిది ఒక శిల్పం కోసం అంతగా బాధపడటం అవసరమా ? ” అన్నారు. వారన్నది నిజమే, నేను కాదనడం లేదు, కానీ అది మామూలు శిల్పమా?! కొన్ని శతాబ్దాల గుండె బరువును మోసిన శిల్పం. కొన్ని శతాబ్దాల నిరీక్షణకు వేదికైన శిల్పం. పగిలిన గుండెను తనలో పొదువుకున్న శిల్పం. పగిలిన మరో గుండె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మౌనసాక్షిగా మిగిలిన శిల్పం. స్పందించే విధానంలో గుండె గుండెకూ తేడా ఉంటుంది. పైగా అది నా పసితనంలో (అప్పటి) నాలో నాటుకున్న విత్తనం. మొక్కై, మానై ,శాఖోపశాఖలుగా నా హృదయక్షేత్రంలో విస్తరించిన వటవృక్షం. దాన్ని నేనెలా తేలిగా తీసుకోగలను ? అది నాకెలా సాధ్యం? అంత తేలిగ్గా తీసుకొని ఉంటే నాలోంచి ఈ రచన వెలువడేది కాదు సరికదా, ఒక్క అక్షరం కూడా నా కలం లోంచి వచ్చి ఉండేదే కాదు. మనసు స్పందించిన చోటే భావాల ఊట. ఎద కరిగిన చోటే కన్నీటి పాట. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని నా రచనను నిర్విఘ్నంగా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించి వెనక్కి మళ్ళాం.
తిరుగు ప్రయాణంలో పగిలిపోయిన ఆ శిలామూర్తి ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉలితో పగిలిన శిలలా అయింది నా మనసు. ఆ పగుళ్లలోంచి కామసానీ, సోమేశ్వరుల ప్రణయ కథ ఒక్కొక్క అంకం నా మనోఫలకంపై కదలాడుతూ ఉంది. సన్నటి నీటి తెర నా కళ్ళలో చిప్పిలుతూనే ఉంది.
ఎన్ని ప్రేమ కథలు విఫలం కావు? మరీ ఇంతగా స్పందించడం అవసరమా? అన్న ఆలోచన కొందరిలో తలెత్తవచ్చు, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తులను చూసి అంతగా బాధ పడటం ఏమిటి ? అన్న ఆలోచన కూడా మరి కొందరిలో రావచ్చు. ఇక్కడ స్థాయి, సుఖాంతం, విషాదాంతం అని కాదు.నా బాధకు నాకు 3 కారణాలు కనిపించాయి 1. జాలి 2. జాలి 3. జాలి 800 సంవత్సరాలు ఆ జీవాత్మ అనుభవించిన గుండెల్ని పీల్చి పిప్పి చేసే దుర్భరమైన వేదన. నా వంటి ఎంతోమందిని కదిలించిన యాతన. అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మా నాన్న కళ్ళలోని తడి, మా అమ్మ కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తే.తడి ఉన్న ప్రతి గుండెను ఈ కథ కన్నీరు పెట్టించింది. దానికి నా కళ్ళతో నేను చూసిన ఎంతోమంది నాకు సాక్ష్యం. దానికి నేను ప్రత్యేకమూ కాదు, మినహాయింపూ కాదు.
ప్రేమ కథలు కొన్ని సుఖాంతమౌ వుతాయి, కొన్ని విషాదాంత మౌతాయి. కానీ మనిషి బ్రతికి ఉన్నంతవరకే ఆ మనుషులను అవి స్పందింపజేస్తాయి. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలిపెడితే గనుక అవి (ఆ భావాలు) పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ ఈ కథ వాటన్నిటికీ అతీతమైనది.
ఒక ఆత్మను శిలలో నిక్షిప్తం చేయడం, ఆ దేహం నిస్తేజమై, కట్టె కాలిపోవడం, ఆత్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఆ ఎదురుచూపు ఎంతకూ ఫలించక, ఆ మనసు నలిగిపోవడం, అటు ఆత్మకు మోక్షంలేకా,ఇటు ఎదురుచూపుకు అంతంలేకా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ఆ యాతనే నా ఈ స్పందనకు కారణం.
నా దృష్టిలో అది శిథిల మంటపం కాదు. కామసానీ, సోమేశ్వరుల ప్రేమసామ్రాజ్యం. మోహానికీ, ప్రేమకూ హస్తిమశకాంతరం ఉంది. భూమికీ,ఆకాశానికీ మధ్య ఉన్నంత భేదం ఉంది. అది మోహమే ఐతే నా గుండె లోతుల్లోంచి ఈ భావాల వెల్లువ ఉప్పొంగే కాదు. ఆది కాంక్షే ఐతే నా కలం లోంచి ఒక్క సిరాచుక్క కూడా అక్షర రూపు దాల్చి ఉండేదే కాదు. అది రెండు మధుధారలతో నిండిన అమృతభాండం. రెండు హృదయాల నిర్మల ప్రేమను ఆవాహన చేసిన ప్రణయకలశం. సోమేశ్వరుడు మాధవ్ గా పునర్జన్మ నెత్తి వచ్చినట్లుగానే, కామసానీ, సోమేశ్వరులు పునర్జన్మనెత్తాలి. ఆమె కాలి మువ్వల ఘల్లుఘల్లుల్లో ఆలయ ప్రాంగణం (వేయి స్తంభాల గుడి) సందడించాలి. వారిద్దరూ జంట పావురాలై జావళీలు పాడాలి. మూడు పువ్వులు ఆరు కాయలుగా పిల్లాపాపలతో వర్ధిల్లాలి. వారి నవ్వులన్నీ పువ్వులై ఆ రుద్రేశ్వరునికి పుష్పయాగం చేయాలి.
ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు
పుత్రపౌత్రాభివృద్దిరస్తు
సమస్త సన్మంగళాని భవంతు
స్వస్తి
(విజ్ఞప్తి: ఆ శిల్ప శకలాలు యశోదర విగ్రహానికి సంబంధించినవే అని నేను ఇప్పుడు కూడా అనటం లేదు, బహుశా అయి ఉండవచ్చు అని మాత్రమే అంటున్నాను. విషయ పరిజ్ఞానం లేనప్పుడు నొక్కి చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు. ఒకవేళ ఆ శిల్పానివే అయితే, మన చారిత్రక సంపదైన, కాకతీయుల కళావైభవ చిహ్నమైన ఆ శిల్పాన్ని ఏ కాస్త అవకాశం ఉన్నా, పునర్నిర్మించి, యథాస్థానంలో ప్రతిష్టించి,ముందు తరాలకు అపురూపమైన కానుకగా అందించాలని నేను అన్ని రంగాల ప్రముఖులకు పేరుపేరునా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను).
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు శతాబ్ది అవలోకనం
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు బహుముఖ ప్రతిభాశాలియైన చిత్రకారులు. జనవరి 2024 నుండి జనవరి 2025 వరకు జరుగుతున్న వారి శతాబ్ది వేడుకల సమయంలో శేషగిరిరావు గారి జీవితాన్నీ, వారు కొనసాగించిన చిత్రకళావారసత్వాన్నీ మరొకసారి స్మరించుకుందాం. పురాణగాథల సాంప్రదాయక చిత్రకారులుగా శేషగిరిరావు గారు ప్రసిద్ధులు. కానీ విభిన్న కళారూపాల గురించీ, చిత్రకళాశిక్షణ గురించీ, సాంస్కృతిక పరిరక్షణ గురించీ, చిత్రకళాచరిత్ర గురించీ వారు చేసిన విశిష్టమైన కృషి మరింత ప్రాచుర్యం లోకి రావలసి ఉంది. తెలుగు తోపాటు ఆంగ్లం లోనూ వ్యాసరచన చేపట్టి ఉంటే శేషగిరిరావు గారి కీర్తి మరింత ఇనుమడించి ఉండేది. చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ప్రదర్శింపబడుతున్న వారి అరుదైన స్కెచ్లు, ఆయిల్ పెయింటింగ్స్, ఆక్వాటెక్స్చర్ పెయింటింగ్స్, చిత్రకళపై వారు రాసిన వ్యాసాలూ, పుస్తకాలూ ద్వారా శేషగిరిరావు గారి సమగ్రరూపం ఆవిష్కృతమవుతుందని ఆశించవచ్చు.
1924 జనవరి 27న తెలంగాణలోని మహబూబాబాదు జిల్లా పెనుగొండలో జన్మించిన కొండపల్లి శేషగిరి రావు గారు వరంగల్ లోని రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన దేవాలయాల శిల్పకళా దర్శనం ద్వారా బాల్యదశ లోనే ప్రేరణ పొందారు. ఈ సంక్లిష్టమైన శిల్పాలు వారిలో కళాభిరుచిని మేల్కొలిపి, దక్షిణ భారత సాంస్కృతిక సంపదను పరిరక్షించటమే జీవితలక్ష్యమయ్యేలా పురిగొల్పాయి. అడవి బాపిరాజు, అంత్యాకుల పైడిరాజు, హెచ్.వి. రామగోపాల్ వంటి చిత్రకారులు లేపాక్షి మొదలైన శిల్పాల్లో దేశీయమూలాలను అన్వేషించుకుంటున్న సమయంలో శేషగిరిరావు గారు తెలంగాణ ప్రాచీన శిల్పకళాసంపదలోని కొత్త కోణాలను దర్శించటంలో నిమగ్నమయ్యారు.
కాకతీయ శిల్పకళాదృష్టినీ, తన సహజశైలినీ సమ్మిశ్రమం చేసుకుంటూ శేషగిరిరావు గారు ఒక విభిన్నమైన, ప్రాచీనతా సంకేతమైన, తనదైన చిత్రకళారీతిని ఏర్పరచుకున్నారు. మహాకవుల కలాల నుండి వారి కవితానుడికారం ప్రవహించినట్లే, శేషగిరిరావు గారి కుంచె నుండి ‘శేషగిరీయం’ వారి చిత్రరచనా నుడికారంగా జాలువారింది. మరుగునపడ్డ స్థానిక సంస్కృతిని వెలికితీయటంలో వారికి ఉత్తేజం; ఆ సంసృతిలో దృశ్యమానమయ్యే వైశిష్ట్యాన్ని కనుగొనటం వారికి ఆనందం. ఆయన చిత్రాలలోని భంగిమలు, హావభావాలు కాకతీయశిల్పం గురించి వారికి గల లోతైన అవగాహనను ప్రతిఫలిస్తాయి. శిల్పానుగుణమైన వారి చిత్రాల్లో ప్రాచ్యమైన తాత్వికతా, ఆధ్యాత్మికతా కలగలిసిన ఏవో అతీతభావనలు కనిపిస్తాయి.
ఆయన రచించిన “రూపరుచి” పుస్తకం భారతీయ కళా తత్త్వాలను వివరిస్తూ, ఉత్తర, దక్షిణ భిత్తి చిత్రాలను పోల్చి విశ్లేషిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర చారిత్రకస్థలాల్లోని హంపీ, లేపాక్షి, కాకతీయ శిల్పకళావైభవం శేషగిరిరావు గారి సురేఖ – I, సురేఖ – II గ్రంథాల్లో ప్రతింబింబిస్తుంది. ఈ గ్రంథాలు చరిత్రను నిక్షిప్తం చేయటమే కాకుండా సంప్రదాయాన్ని ఆధునికకోణం నుండి చూపిస్తాయి కూడా.
నకాషీ పటచిత్రకళను (Nakashi Scroll Painting) పునరావిష్కరించడంలో శేషగిరిరావు గారి కృషి చారిత్రాత్మకమైనది. తెలంగాణకు ప్రత్యేకమైన కుల పురాణ ప్రదర్శనా పరంపరతో ముడివడి ఉన్న కళ నకాషీ. ఆయన చేసిన పరిశోధన వలనా, ప్రచారం వలనా కనుమరుగవుతున్న ఈ కళారూపం పునరుజ్జీవితమైంది. తద్వారా ఆయనకు సాంస్కృతిక పరిరక్షకుడిగా గుర్తింపు వచ్చింది.
జానపదకళలను సంరక్షించడంలో శేషగిరిరావు గారు చేసిన ఇటువంటి తొలి ప్రయత్నాలే తెలంగాణ కళా వారసత్వంపై వారి భవిష్యత్ అధ్యయనాలకు పునాదిరాళ్ళయ్యాయి. పరిశోధనపై లోతైన ఆసక్తితో వారు చేసిన అనేక రచనల ద్వారా ఆంధ్ర, తెలంగాణా చారిత్రక పరిణామాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కొన్ని మాత్రమే ఆంగ్లంలో లభ్యమవుతూ, ప్రధానంగా తెలుగు భాషలోనే ఉండటం వలన, ఇతర భాషల పాఠకులకూ పండితులకూ చేరువ కాలేకపోయాయి.
పాఠశాల స్థాయిలో దీన్దయాళ్ నాయుడు గారూ, తరువాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హైదరాబాద్ లో సుకుమార్ దేవ్స్కర్ గారూ శేషగిరిరావు గారికి తొలిగురువులూ, మార్గదర్శకులూ. తదుపరి మెహదీ నవాబ్ జంగ్ బహదూర్ గారి ఆశ్రయంలో, పర్యవేక్షణలో తన కళను తీర్చిదిద్దుకున్నారు. హైదరాబాద్లో మొహమ్మద్ జలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో వాష్ పెయింటింగ్ సాంకేతికతలు నేర్చుకున్న ఆయన, తరువాత శాంతినికేతన్లో నందలాల్ బోస్ వద్ద శిక్షణ పొందారు. ఇందరి శిష్యరికంలో ఆయన చిత్రకళలో పరిపూర్ణత సాధించారు. ప్రాచ్య తత్వశాస్త్రాలు పునాదులైన వారి బోధనలు శేషగిరిరావు గారి కళాప్రస్థానాన్ని అతిగాఢంగా ప్రభావితం చేశాయి. ప్రాదేశిక అస్తిత్వమూ, లోకప్రియత్వమూ ఒక ప్రత్యేకమైన మిశ్రణంగా రూపొంది వారి కళాత్మక హృదయంలో ఇంకిపోయింది. ఈ మిశ్రణ కారణంగానే శేషగిరిరావు గారి కొన్ని లాండ్స్కేప్స్ లో అతిప్రాచ్య శైలి కనిపిస్తే. మరికొన్ని కాన్వాస్లపై జాతీయ, ప్రాంతీయ నిర్బంధనలేవీ లేని సహజత్వం ప్రతిబింబిస్తుంది. ఈ రెండవ శైలి దేవీప్రసాద్ రాయ్ చౌదరి గారి ప్రభావం కావచ్చు.
చిత్రకళా కౌశలాన్ని పెంపొందించటం పట్ల ఉన్న అభిరుచి వలన శేషగిరిరావు గారు సుదీర్ఘకాలంగా జేఎన్టీయూ కళాశాలలో ఆర్ట్ ప్రొఫెసర్గా పనిచేశారు. వర్థమాన కళాకారులైన విద్యార్థులకు సంప్రదాయాన్నీ, సృజనాత్మకతనూ బోధించి రెండిటినీ స్వీకరించేలా ప్రోత్సహించారు. శేషగిరిరావు గారి చిత్రకళా వైదుష్యం తరగతి గదులకే పరిమితం కాలేదు. కళా, సౌందర్యశాస్త్రాల గురించి వారు చేసిన రచనలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రాచ్యమైన శైలీ, ప్రాంతీయమైన ప్రజాజీవితమూ శేషగిరిరావు గారి కుంచె నుండి కలగలిసి ప్రవహించి ఆయిల్ పెయింటింగ్స్ గానూ, వాల్ మూరల్స్ గానూ, ఆక్వా టెక్స్చర్ పెయింటింగ్స్ గానూ అందమైన చిత్రాలుగా ఘనీభవించాయి.
చిత్రకళా ప్రపంచంలో ప్రోగ్రెసివ్ వాదులు రివైవలిస్టు కళనూ, ఫార్మలిజం రూపంలో పాశ్చాత్య ఆధునిక చిత్రకళారూపాలు భారతీయ కళనూ కబళించటం గమనించారు శేషగిరిరావు గారు. అయితే నిజమైన ఆధునికతనూ, జాతీయతనూ ఈ నూతన కళారీతులు సమర్థవంతంగా ప్రతిబింబించలేకపోయాయని అభిప్రాయపడుతూ అదే విషయాన్ని తన వ్యాసాల్లో ప్రకటించారు. బహుశా ఇటువంటి భావనల వల్లనేమో ఆయన ఆనాటి నూతన విచారధారకూ, సౌందర్యదృక్పథానికీ దూరంగా ఉండిపోయినట్లు కనిపిస్తారు. అయితే, ఆయన వ్యాసాలు ఆ కాలంలోని సామాజిక పరిస్థితులనూ, హైదరాబాద్ స్కూల్ చరిత్రనూ, కళాకారుల జీవితాలనూ, పూటగడవని వారి జీవన పోరాటాలనూ వివరిస్తాయి.
పరిశోధనాత్మకమైన శేషగిరిరావుగారికి నాటి ప్రసిద్ధ కవులైన వానమామలై వరదాచార్యులు, దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి మొదలైనవారితోనూ, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి సామ్యవాదులతోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. వారి భావజాలాలూ, ఆదర్శాలూ శేషగిరిరావు గారి చిత్రాల్లో, రచనల్లో, జీవనశైలిలో ప్రస్ఫుటంగానే ప్రతిబింబించాయి. శేషగిరిరావు గారి ‘హరిజనోద్యమం’ పెయింటింగ్ ఇటువంటి ఆదర్శాల ప్రభావంతో సృష్టించబడిందే. ఆనాటి అమానుషమైన సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా సున్నితమనస్కుడైన ఒక కళాకారుడి బలమైన ప్రకటనగా ఈ చిత్రం నిలుస్తుంది.
తనదైన శైలిలో పరిశోధనలు చేస్తూ, కళాభ్యాసం కొనసాగిస్తూ ప్రాచీనతలో నూతనకోణాలు దర్శించిన శేషగిరిరావు రావు గారు తన సంక్లిష్ట దృశ్య నిఘంటువు ద్వారా సామాజిక ప్రయోజనాలను సంకేతిస్తూ ఉధృతమైన చిత్రరచనలు చేశారు. రాజకీయంగా తనకు ప్రీతిపాత్రమైన జాతీయ కాంగ్రెస్ ద్వారా దేశస్వాతంత్య్రం కోసం కృషిచేశారు. ఎందరో ఆత్మీయ సహచరులు గల కమ్యూనిస్టు పార్టీ ద్వారా రజాకార్ల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా విముక్తి లోనూ తన వంతు పాత్ర పోషించారు.
తాను రాసిన నోట్సూ వ్యాసాల ద్వారానూ, జాతీయ, ప్రాంతీయ సాంస్కృతికతను పాన్-ఏషియన్ విశాలతతో సమ్మిళితం చేస్తూ ఒక ప్రత్యేక దృశ్య భాషను అభివృద్ధి చేయడం ద్వారానూ స్వదేశీ చైతన్య స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు. ఈ విధంగా ప్రాంతీయకూ జాతీయతకూ పెద్దపీట వేస్తూ సాగించిన శేషగిరిరావు గారి కళాభివ్యక్తి వారినొక దార్శనికుడిగా, ఆలోచనాశీలిగా నిలబెట్టింది.
చిత్రకారుడిగా విశేష ఖ్యాతిని సంపాదించుకున్న శేషగిరిరావు గారు తన దీర్ఘకాలిక వృత్తిలో పౌరాణిక చారిత్రక సంఘటనలతో, దైనందిన జీవిత ఘట్టాలతో వెయ్యికి పైగా ‘మాస్టర్ పీసెస్’ సృష్టించారు. ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తమైన, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో, ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్నాయి. హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియం, మైత్రీ వనం, భారతీయ విద్యాభవన్, అలాగే వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయం కొన్ని ఉదాహరణలు.
JNAFAU కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ వారూ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారూ, శేషగిరిరావు గారి కుటుంబసభ్యులూ సంయుక్తంగా కొండపల్లి వారి చిత్రప్రదర్శన నిర్వహిస్తున్నారు. కళావిమర్శకుల, చరిత్రకారుల ప్యానెల్ చర్చలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉండబోతున్నాయి. కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు వాష్ పెయింటింగ్ వర్క్ షాప్, చిత్రకళపై పత్రసమర్పణలూ నిర్వహిస్తారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చిత్రకళారంగంలో శేషగిరిరావు గారి పాత్రనూ, స్వదేశీ ఆధునికతలో వారి ప్రాధాన్యతనూ స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.
ఈ శతజయంతి సందర్భంగా, డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారి చిత్రకళా ప్రస్థానాన్నీ, సంస్కృతీపరిరక్షణనూ, సృజనాత్మకతనూ, సామాజిక సంస్కరణల పట్ల వారి నిబద్ధతనూ అక్షరీకరించటంలో భాగస్వాములం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. శేషగిరిరావు గారి చిత్రాల ప్రదర్శన ఒక అసాధారణ కళాకారుడికి నివాళి మాత్రమే కాదు. చిత్రకళా చరిత్రలో ఆయన ప్రాముఖ్యతను మరోసారి స్మరించుకునే అవకాశం కూడా
భారత దేశం లోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. దేనికది విశేషమైన చరిత్ర ను చెబుతున్నాయి. ఈస్ట్రెన్ ఘాట్స్ గా పేరున్న శేషాచలం కొండలు పచ్చని అడవులతో , పక్షి జాతుల తో జంతుసంతతితో అలరారుతున్నాయి. వీటినే తిరుమల గిరులు అంటారు.
తిరుమలగిరుల్లో 1008 తీర్థాలు ప్రధానమైనవి. ఈ తీర్థాల విశిష్టత ను తెలుసుకుందాం…
వీటిలో 108 జ్ఞానప్రదాతలుగా తెలియచేయబడినాయి.
తిరుమల తీర్థాలలో స్నానమాచరిస్తే వారికి ముక్తి కలుగు తుందని చెప్తారు. ఒక్కొక్క తీర్థానికి పేరు పెట్టబడింది.వాటిలో కొన్ని తీర్థాలను గురించి……
కుమార తీర్థం
కుమారస్వామి తారకాసురుడిని సంహరించడం వల్ల బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. కుమారస్వామి బ్రహ్మ హత్యా దోష నివారణకు తగిన పరిహారం చెప్పమని మహేశ్వరుడిని ప్రార్ధించాడు. అప్పుడు శంకరుడు “నువ్వు భూలోకంలోని వేంకటాచల క్షేత్రానికి వెళ్ళు. ఆ ప్రదేశంలో ఉన్న పరమపవిత్రమైన తీర్థంలో నువ్వు ప్రతి రోజూ స్నానం చేసి ఆ పర్వతంపైన వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేయి. ఆ స్వామి నీ దోషాన్ని తొలగిస్తాడు. అని చెప్పి కుమారస్వామిని భూలోకానికి పంపాడు.
జనకుడు ఆదేశించిన ప్రకారంగా చేసి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నాడు కుమార స్వామి. తపస్సుకు ముందు ప్రతిరోజూ కుమారస్వామి ఆ తీర్థంలో స్నానమాచరించడం వల్ల ఆ తీర్థానికి కుమార తీర్థంగా పేరు వచ్చిందని తెలు స్తోంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారు నవయవ్వన వంతులుగా ఉంటారని పురాణ కథ ద్వారా తెలుస్తోంది.
పూర్వం ఒక పండు ముదుసలి ఈ తీర్థంలో స్నానం చేసి బయటకు రాగానే యువకుడిగా మారిపోయాడట. స్వామి వారి ఆలయానికి సుమారుగా ఏడు కిలో మీటర్ల దూరంలో వాయవ్య దిశలో ఈ తీర్థం ఉంది. మాఘ పూర్ణిమ, మఖ నక్షత్రంనాడు మధ్యాహ్న సమ యంలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
తుంబుర తీర్థం
తుంబురుడు తన వీణను వాయిస్తూంటే ఆ వీణను చూసిన నారదుడు నీ వద్ద ఆ కొత్త వీణ ఎక్కడిది అని అడిగాడు. ఒక మహారాజును తాను కీర్తించగా ఆ రాజు ఈ వీణను తనకు బహుమతిగా ప్రసాదించాడని చెప్పాడు తుంబురుడు. దైవాన్ని స్తుతించవలసిన నోటితో మానవుని కీర్తించడమేమిటని ఆగ్రహించిన నారదుడు నువ్వు చేసిన ఈ పనికి దైవత్వాన్ని కోల్పోయి భూలోకం లోనే ఉందువుగాక అని తుంబురుని శపించాడు. నారదుని శాపఫలితంగా తుంబురుడు తిరుమలేశుని కొండ మీద ఘోణ తీర్థంలో భూమి మీద పడతాడు. ఘోణ తీర్ధంలో స్నానమాచరించి ఆ పర్వతం మీదే ఉండి, శ్రీవేంకటేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. అతని భక్తికి, దీక్షకు, ఏకాగ్రతకు మెచ్చిన ఆ స్వామి తన దేవేరితో సహా అతనికి దర్శన మిచ్చాడు. నారదుని శాపం నుంచి తుంబురునికి విముక్తి కలిగించాడు. తాను ఆ ప్రాంతాన తపమాచరించడం వల్ల ఆ తీర్ధం తన పేరు మీద తుంబురు తీర్ధంగా ప్రసిద్ధి చెందాలని తుంబురుడు స్వామిని కోరాడు. అప్పటి నుంచి స్వామి అంగీకారంతో ఘోణ తీర్ధం తుంబురు తీర్ధంగా పిలువబడుతూ ప్రాముఖ్యతను పొందింది. ఫాల్గుణ మాసం, ఉత్తర ఫల్గునీ నక్షత్రం పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో తుంబురు తీర్థంలో స్నానం చేసినట్లయితే వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. వారి కోరికలు నెరవేరుతాయి. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి కోవెలకు సుమారుగా 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఆకాశగంగ తీర్ధం
ఈ తీర్థ ప్రాముఖ్యతను స్కాంధపురాణం తెలిపింది. అంజనాదేవి ఈ తీర్థంలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసి వాయుదేవుడు ప్రసాదించిన ఫలాన్ని తిన్న తర్వాత గర్భంధరించి, ఆంజనేయునికి జన్మనిచ్చిం దని పురాణం ద్వారా వివరిం చబడింది. ఈ కొండ మీద అంజనాదేవి తపస్సు చేయడంవల్ల ఆంజనేయునికి జన్మనివ్వడం వల్ల దీన్ని అంజనాద్రిగా పిలుస్తారు. ఆకాశగంగ తీర్థం గురించి ఒక కథ ఉంది. పూర్వం శ్రీశైలపూర్ణుడు పాపవినాశన తీర్థం నుండి స్వామివారికి అభిషేక జలాన్ని తెచ్చేవాడు. స్వామివారిపై అతనికున్న భక్తిశ్రద్ధలను గుర్తించిన తిరుమలేశుడు ధనుస్సు, బాణాలతో ఒక కిరాతకుని రూపం ధరించి శ్రీశైల పూర్ణుడు ప్రతిరోజూలాగానే పాపవినాశనం నుంచి పవిత్ర తీర్థజలం తెస్తూంటే అతనికి అడ్డు నిలిచి తనకు అమిత దాహంగా ఉందనీ, ఆ నీటితో తన దాహాన్ని తీర్చమనీ ప్రాధేయ పూర్వకంగా అడిగాడు. శ్రీశైలపూర్ణుడు ‘ఆ జలాన్ని పాపవినాశనం నుంచి స్వామి వారి అభిషేకా నికి తీసుకువెళ్తున్నాని, అది మానవుల కోసం కాదనీ, అతనికి నీరు ఇవ్వలేని తన నిస్సహాయతను తెలిపి ముందుకు అడుగులు వేశాడు. వెనుకనే వస్తున్న కిరాతకుని రూపంలో ఉన్న శ్రీనివాసుడు బాణం చేసి మట్టికుండకు రంధ్రం చేసీ, ఆ కుండలోని ఉదకాన్ని తాగేవాడు. ఆ ఘటం బరువు తగ్గడం గమనించిన శ్రీశైలపూర్ణుడు కుండకు రంధ్రం ఉండటం గమనించారు. “భగవంతునికి సమర్పించవలసిన జలాన్ని నువ్వు తాగేసి అపచారం వేశావు” అని బాధ పడుతున్న శ్రీశైలపూర్ణుడితో “దాహాన్ని తట్టుకోలేక ఆ పని చేశాను. అయినా నువ్వు విచారించవలసిన పని లేదు. ఇక్కడకు దగ్గరలోనే ఒక తీర్థం ఉంది. అందులోని జలాన్ని తీసువెళ్ళి స్వామివారి అభిషేకానికి సమర్పించవచ్చు” అన్నాడు. కిరాతకుడు.
కిరాతకుడి మాటలు విన్న అతను ఆ కిరాతకుని వెంట జలం తేవటానికి వెళ్లాడు. అతను శ్రీశైలపూర్ణుడిని ఆకాశతీర్థం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ తీర్థం లేకపోయేసరికి అతను ఒక గడ్డిపోచను తీసి బాణంగా చేసి కొండ మీదకు విసిరాడు. అక్కడ నీరు ఉబికి ధారగా క్రిందకు రాసాగింది. “ఇది ఆకాశగంగానదిలోంచి వచ్చే జలం. ఇక ఈ తీర్థాన్ని ఆకాశగంగా తీర్థం అని పిలుస్తారు. దీన్నే శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రతి రోజూ తీసుకువెళ్ళు. ఇందులోని జలం ఎంతో పవిత్ర మైనదిగా భావించబడుతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడా కిరాతకుడు. ఇక్కడ పితృకార్యాలు కూడా చేస్తారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చిత్తా నక్షరంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థంలో మరికొన్ని తీర్థాలు వచ్చి చేరుతాయి. కనుక ఆ రోజున ఆకాశగంగ తీర్ధంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆకాశగంగ తీర్ధం తిరుమలేశుని ఆలయానికి సుమారుగా అయిదు కిలోమీటర్ల దురంలో ఉంటుంది.
పాండవతీర్థం
ఈ పాండవ తీర్థాన్ని గోగర్భ తీర్థం అని కూడా చెప్తారు. ఇది గోగర్భ డ్యామ్కు కిందగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పాండవులు నివసించినట్లుగా తెలుస్తోంది. పాండవులు రాజ్యాన్ని వీడి ద్రౌపదితో కలిసి శ్రీకృష్ణుడి సలహా ప్రకారంగా ఈ క్షేత్ర తీర్థం వద్దకు వచ్చి ప్రతిరోజూ తీర్థంలో స్నానం ఆచరిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించే వారు. ఇక్కడ వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి రాజ్యాన్ని దక్కించుకున్నారు. పాండవులు నివసించి స్నానమాచ రించిన తీర్థం, స్వామిని వారు కొలిచినందున ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఏర్పడింది. ఈ గోగర్భజలం తిరుమలకు చేరుతోంది. వృషభమాసం, శుద్ధ ద్వాదశి ఆదివారంనాడు లేదా బహుళ ద్వాదశి మంగళవారం నాడు ఈ తీర్థపు జలంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల పరిపూర్ణ నమ్మకం. పాండవ తీర్థ సమీపంలో ఒక రాయి రెండు ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం తీర్థ సమీపంలోనూ, రెండోది ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఉంది. ఈ గుండ్రాయిని దైవంగా భావిస్తూ మొక్కుకుంటే కలహాలు నివారించబడి అపార్థాలు, అశాంతి తొలగిపోతాయి. ఈ తీర్ధం శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ గంగాదేవి ఆంజనేయ స్వామి దేవాల యాలు ఉన్నాయి. పాపవినాశన తీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆ ఆలయాలను దర్శిస్తారు. పేరుకు తగ్గట్టే ఈ తీర్థం పాపాలను హరిస్తుంది. ఆశ్వయుజ శుక్ల పక్షం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన ఆదివారంనాడు. లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన నాడు ఈ తీర్థానికి పర్వదినం. ఆ రోజుల్లో ఇతర తీర్థాలలోని జలం ఈ తీర్థంలోకి చేరుకుంటాయి. అందువల్ల ఆ పర్వదినాల్లో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనారోగ్యాలు, మానసిక అశాంతి, వేదనలు తొలగిపోయి పుణ్యం లభి స్తుంది. ఈ పాపవినాశన తీర్థం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గుడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
శేష తీర్థం
ఈ తీర్థం లోయలో ఉంది. ఈ తీర్థానికి చేరు కోవడమన్నది సాహసోపేతమైన చర్య. ఈ క్షేత్రం ఆది శేషుని తలపిస్తుంది. పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి ఆ మార్గానికి రెండు వైపులా కనిపించే లోయ లను పాచిమడుగు, అవ్వాచారి కోనలు, సున్నపురాతి కోనలు, పోలిగాడి శిలను దాటుకుని ఈ శేషతీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. తిరుమలేశుని గుడికి రామకృష్ణతీర్థం దగ్గర గా ఉంటుంది.
రామకృష్ణుడనే ఋషి శేషాచలం పర్వతం మీద తపస్సు చేసాడు. ఆయన తను స్నానం చేయటానికి ఒక తీర్థాన్ని ఏర్పరచుకున్నాడు. శ్రీనివాసుడు ఆ మహర్షికి దర్శనమిచ్చి ఆయన నిర్మించిన తీర్థం ఆ ఋషి పేరుతో రామకృష్ణతీర్థంగా పిలువబడుతుందని వరమిచ్చాడు. స్వామి ఆ మహర్షిని కరుణించిన రోజు మకరమాసం, పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆ రోజు దేవతలు దిక్పాలకులు వచ్చి ఈ తీర్థంలో స్నానం చేస్తారట. ఈ తీర్థం గురించి స్కాంధపురాణంలో తెలియజేయబడింది. ఆ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తుల నేరాలు, దోషాలు నివా రింపబడుతాయి. గురువులు, తల్లిదండ్రుల అభిమానాన్ని, అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీవారి ఆలయానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం.
జాబాలి తీర్థం
తిరుమల నుంచి ఆకాశగంగకు చేరుకునే మార్గంలో ఈ తీర్థం నెలకొని ఉంది. ఈ ప్రదేశంలో జాబాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి ఆ పేరు వచ్చింది. హనుమంతుని పుట్టుక ఈ ప్రదేశం లోనే జరిగిందని స్థలపురాణ కథల ద్వారా తెలుస్తోంది. బాల్యంలో ఆంజనేయుడు ఇక్కడే ఉన్నట్లు, సూర్యని చూసి అది పండుగా భ్రమించి మింగబోవడం కూడా అక్కడే జరిగిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. రావణుని సంహరించిన రాముడు పత్నీ సమేతంగా అయోధ్యకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంతానికే వచ్చినట్లుగా ఓ ప్రత్యేక కథనం. స్థల మహత్యాన్ని తెలుసుకున్న జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగానూ, అప్పుడు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం తెలియజేసింది. ఇక్కడ బాలాంజనేయస్వామి ఆలయ ఉంది. చైత్రపౌర్ణమి నాడు హనుమజ్జయంతి పర్వదినాన్ని ఇక్కడ జరుపుతారు. తిరుమలేశుని సన్నిధికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్ధం ఉంది. ఈ తీర్థాన్ని జాపాలి, జాడాలి అన్న పేర్లతో పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఆధ్యాత్మిక భక్తి భావనలు పెరుగుతాయి. భగవంతునికి భక్తి మార్గం ద్వారా చేరువై ఆయన అనుగ్రహన్ని పొందుతారని భక్తులు విశ్వాసం. గ్రహబాధలు, గాలి, ధూళి (దెయ్యాలు), భూతాలు) తొలగిపోతాయని చెప్తారు.
కపిల తీర్ధం
పూర్వం భగీరథుడనే చక్రవర్తి శివుని తపమాచ రించి ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. గంగానదిని తెచ్చే ప్రయత్నంలో గంగానది పాతాళలోకానికి భోగవతి’ అన్న పేరుతో చేరుకుంది. ఆ నదీతీరంలోనే కపిల మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజాభిషేకాలను చిత్తశుద్ధితో భక్తిశ్రద్ధలతో చేస్తుండేవాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పాతాళ లోకంలోని శివలింగం పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చేసింది. ఆ లింగం మరింత పెరగకుండా బ్రహ్మ దేవుడు ధేనువు ఆకారం దాల్చి కాలిగిట్టలతో లింగాన్ని తొక్కి పెట్టినట్లు ఆ లింగం పైభాగాన ధేనువు గిట్టల గుర్తులు స్పష్టమవుతాయి. ఈ కపిలేశ్వర మహాలింగం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. భోగవతి గంగ కూడా శివలింగంతోపాటు పైకి ఉబికి వచ్చింది. దాన్నే కపిల తీర్ధంగా చెప్తారు. ఈ తీర్థప్రాంతంలో శ్రీకపిలేశ్వరస్వామి, దేవేరి కామాక్షితో కలిసి భక్తులకు తన దర్శనాన్ని ప్రసా దిస్తారు. ఇక్కడ ఉమాదేవితోనూ, స్కంధునితోనూ కలిసి ఒకే పీఠంలో ఉత్సవమూర్తి ఉండటంవల్ల ఆయనకు సోమాస్కంధమూర్తి అన్న పేరు ఏర్పడింది. ఈ కపిల తీర్థాన్ని గురించి అనేక కథలు ఉన్నాయి. వకుళమాత పద్మావతిదేవిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయాల్సి ఉందిగా ఆమె తండ్రిని కోరాలని వెళ్తూ తన కోరిక నెరవేరాలన్న ధ్యేయంతో ఈ కపిల తీర్ధంలో స్నానం చేసిందట. అగ్నిదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి శివలింగా నికి పూజాభిషేకాలు నిర్వర్తించడంతో ఇక్కడి శివలింగానికి ఆగ్నేయలింగం అన్న పేరు ఏర్పడినట్లుగా పురాణకథనం. ఈశ్వరుడు తాను వేంకటాచలంలో ఉంటానని విష్ణువును కోరాడు.
అప్పుడు విష్ణుమూర్తి వేంకటాచల పర్వతపు ఆగ్నేయమూలగా ఉండమని ఆదేశించారట. విష్ణుమూర్తి ఆదేశానుసారంగా కపిల తీర్థ సమీపాన శివుడు ఇక్కడ ఉండటం వల్ల ఆ లింగం ఆగ్నేయలింగంగా పేరు పొందింది. అలిపిరికి దిగువన ఉన్నది ఈ కపిల తీర్ధం. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల నుండి ఉద్భవించి తిరుమల కొండల మీదుగా ప్రవహించి తిరుపతికి చేరు కుంటుంది. అచ్యుత దేవరాయలు ఈ తీర్థం చుట్టూ నాలుగువైపులా నాలుగు సుదర్శన చక్రాల రాళ్ళను నాటి దానికి చక్ర తీర్థమని పేరు పెట్టారని చరిత్రాధారాలతో తెలుస్తోంది. దీన్నే సుదర్శన చక్రత్తాళ్వార్ తీర్ధం అని పిలుస్తున్నారు. శైవులు ఈ తీర్థాన్ని కపిల తీర్ధంగానూ, వైష్ణవులు ఆళ్వార్ తీర్ధంగానూ చెప్తారు. కపిలతీర్థంలో పితృకర్మలు, పిండ ప్రదానాలు, ఇతర దానాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఆశీర్వ దిస్తారు. కోనేటికి దక్షిణంవైపుగా శ్రీవేణుగోపాలస్వామి దేవేరులు రుక్మిణి, సత్యభామల సమేతంగా ఆలయంలో భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ శ్రీలక్ష్మీ నారాయణుని ఆలయం కూడా ఉంది. కపిల తీర్ధంలో స్నానం చేస్తే ఏడుకొండలను ఎక్కి స్వామిని సునాయా సంగా అలసట లేకుండా దర్శించుకోగలమని భక్తుల నమ్మకం. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందుతారు. కోరికలు మొక్కులు తీరుతాయి.
శక్రతీర్థం:
కపిల తీర్థానికి పైభాగాన ఉంది శక్రతీర్థం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు గౌతమి మహర్షి భార్యతో సంగమించిన పాపాన్ని తొలగించు కోవటానికి గాను ఈ తీర్థంలో స్నానమాచరించాడు. శక్రుడు నివసించిన ఈ తీర్థానికి చక్రతీర్థం అన్న పేరు ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు దోషాలు నివారింప బడుతాయని భక్తుల నమ్మకం.
విష్వక్సేన తీర్ధం
శక్రతీర్ధానికి సమీపంలో ఉంది ఈ తీర్థం. వరుణ దేవుని పుత్రుడయిన విష్వక్సేనుడు ఇక్కడ తపస్సు ఆచరించాడు. అతని భక్తికి ప్రసన్నుడై విష్ణుమూర్తి దర్శన మిచ్చాడు. అతనిని తన సేనాధిపతిగా నియమించి విష్వక్సేనునికి శంఖు, చక్రాయుధాలను ప్రసాదించాడు. ఆ తీర్థం వరుణుని కుమారుని పేరు మీద విష్వక్సేన తీర్ధం అన్న పేరు మీద ప్రసిద్ధి చెందింది.
పంచాయుధ తీర్థాలు
విష్ణుమూర్తి ఆయుధాలయిన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు వేరువేరు ప్రాంతాల్లో శ్రీమహా విష్ణువును గురించి తపస్సు చేశాయి. వాటి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వాటిని అనుగ్ర హించాడు. అవి తపస్సు చేసిన స్థలాలే వాటి పేర్లతో తీర్థాలుగా ఏర్పడ్డాయి. శంఖతీర్థం, చక్రతీర్థం, గదాతీర్థం, నందక తీర్ధం, ధనుస్తీర్థంగా ఆ తీర్థాలు పిలువబడ్డాయి. ఈ పంచాయుధ తీర్థాలలో స్నానం చేసిన భక్తులకు శత్రుభయం ఉండదు. పాపాలు తొలిగిపోతాయి.
అసల తీర్థం
పూర్వం అగ్నిదేవుడు ఉదరంలో నొప్పితో బాధ పడసాగాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోటానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు. అప్పుడు ఆయన బాధ తొలగి పోయింది. అందువల్ల ఈ తీర్థాన్ని అనల తీర్థమనీ, అగ్ని తీర్థమనీ అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి ఆరోగ్యం పెంపొందుతుందని చెప్తారు. అనారోగ్యాలు తొలగిపోతాయి.
సనకసనందుల తీర్థం
బ్రహ్మ మానస పుత్రులు సనకసనందులు. వీరిద్దరే కాక ఎందరో మహర్షులు పరమేశ్వరుని గురించి ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇక్కడ వారు పరమేశ్వరుని అనుగ్రహం పొందటంతో ఈ తీర్థానికి సనకసనందుల మహర్షుల పేరు వచ్చింది. ఈ తీర్థం పాపవినాశనం డ్యామ్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.
బ్రహ్మతీర్థం
అగ్ని తీర్థానికి ఎగువగా ఉంటుంది బ్రహ్మతీర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడు నారాయణుని గురించి తపస్సు చేశాడు. శ్రీహరి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారంగా సృష్టి కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా నిరాటంకంగా కొనసాగేటట్లుగా వరం పొంది నట్లుగా తెలియచేయబడింది. బ్రహ్మదేవుడు తపమాచ రించిన కారణంగా దీనికి బ్రహ్మతీర్ధమనే పేరు కలిగింది. ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తులకు బ్రహ్మహత్యాపాతకం, ఇతర దోషాలు తొలగిపోతాయి.
త్రిమూర్తి తీర్థాలు
కపిల తీర్థానికి వాయువ్య దిశలో పెద్ద గూళ్ళల్లాగా మూడు దొన్నెలు ఉంటాయి. వాటి ద్వారా నీరు ప్రవహిస్తూ ఆ జలం కపిలతీర్ధంలో కలుస్తుంది. ఆ మూడు దొన్నెలను త్రిమూర్తులుగా భావిస్తూ వాటిని బ్రహ్మ గుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండంగా పిలుస్తారు. మూడు దొన్నెలు ఒకే చోట ఉండడంతో ఈ తీర్థానికి త్రిమూర్తుల తీర్థాలు అనే పేరు ఏర్పడింది. కపిలేశ్వరుని అభిషేకించటానికి మహేశ్వర గుండంలోని నీటిని ఉపయోగిస్తారు.
అస్థి తీర్ధం
పూర్వం కృష్ణ శర్మ అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను తీసుకుని గర్భవతి అయిన తన పత్ని, కుమారు నితో కాశీ పట్టణానికి బయలుదేరాడు. గంగానదిలో స్నానం చేసి తండ్రి అస్థికలను ఆ పుణ్యనదిలో కలిపి పితృకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చాలనుకున్నాడు. అతను తొండమాన్ రాజును దర్శించాడు. “మహారాజా! నా భార్య గర్భవతి. నా కుమారుడు చిన్నవాడు అవడం వల్ల వీరు ప్రయాణించడం దుర్భరమవుతుంది. వీరిని వెంట పెట్టుకుని కాశీకి వెళ్ళలేను. అందువల్ల నా భార్యను, పుత్రుడిని మీ వద్ద ఉంచి నేను కాశీకి వెళ్ళి పితృకార్యాలను నిర్విఘ్నంగా నిర్వహించి వస్తాను అంతవరకూ దయ ఉంచి మీరు వారి పోషణ, రక్షణ బాధ్యతలను స్వీకరించ మని ప్రాధేయపడుతున్నాను” అని వేడుకున్నాడు కృష్ణశర్మ, అందుకు తొండమానుడు అంగీకరించి ఆ బ్రాహ్మణుని ఇల్లాలిని, కొడుకును ఒక గృహంలో ఉంచి వారికి ఆరు నెలలకు సరిపడే పచారీ సామానులను వస్తుసామగ్రిని అమర్చాడు. వారిని బయటకు రావద్దని చెప్పాడు. ఆ రాజు రాచకార్యాలతో నిమగ్నుడై బ్రాహ్మణుని భార్య, పుత్రుని విషయాన్ని విస్మరించేశాడు. కృష్ణశర్మ కాశీకి చేరుకుని తన జనకుని అస్థికలను కాశీలోని గంగానదిలో కలిపి గయకు వెళ్ళి శ్రాద్ధము పెట్టి పితృ కార్యాలను నిర్వర్తించాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ రెండు సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూడగానే తొండమాన్ రాజుకు అతని భార్య, పుత్రుడు గుర్తుకు వచ్చారు. కృష్ణశర్మతో అతని భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెప్పాడు. కానీ అతని భార్యాబిడ్డలు మరణించి ఆ గృహంలో వారి అస్థికలు మాత్రమే మిగిలాయి. రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. వారు ఆకలిదప్పులతో మర ణించి ఉంటారని, తాను మహాపాపినని ఎంతో వ్యధతో చిత్తక్షోభను అనుభవించాడు. అతని మానసిక బాధను గుర్తించిన శ్రీవేంకటేశ్వరస్వామి “వారి అస్థికలను తీర్ధంలో ముంచమని” ఆదేశించాడు. స్వామి ఆదేశానుసారంగా ఆలయానికి తూర్పు దిశన ఉన్న తీర్థంలో అస్థికలను ముంచాడు. ఆశ్చర్యంగా ఆ అస్థికలు మాయమై కృష్ణశర్మ భార్య, పుత్రుడు సజీవులయ్యారు. అందువల్ల ఆ సరోవరానికి ఆ తీర్ధమనే పేరు వచ్చింది. శారీ కలియుగంలో ఆ తీర్థం కనుమరుగైంది. నేడు ఆ అస్థితీర్థం కనిపించలేదు.
*స్వామి పుష్కరిణీ తీర్ధం
ఈ తీర్థం శేషపర్వతం మీద ఉంటుంది. ఇది స్వామి వారి ఆలయానికి ఈశాన్నిదేశగా ఉంటుంది. స్వామి ఉండే ప్రదేశంలో నెలకొని ఉండడం పట్ల దీనికి స్వామి పుష్కరిణీ తీర్ధం అనే పేరు వచ్చింది. తిరుసులలోని స్వామి పుష్కరిణీ తీర్ధంలో పవిత్రంగా శక్తి భారంతో స్నానం చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని బ్రహ్మ తెలిపినట్లుగా నామన పురాణంలో లిఖించబడింది. శ్రీవేంకటేశ్వర స్వామి తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలిసి ఈ పుష్కరిణిలో ఎలకాలాకు తాడని చెప్పబడింది. మార్గశిర శుక్ల పక్షంలో ద్వాదశి తిథినాడు ఉదయం సమయంలో ఇక్కడ పర్వోత్సవం జరుపబడుతుంది. ఈ పుష్కరిణికి ఉత్తర దిశగా వరాహ స్వామి కొలువై ఉంటాడు. ఆ ఆలయపు ముందుభాగాన్ని ‘వరాహ పుష్కరిణి’గా చెప్తారు.
కాయరసాయన తీర్థం
తెల్లని ఆకును ఈ తీర్థంలో వేస్తే అది నీలి రంగులోకి మారిపోతుందని చెప్తారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి మునులు, యోగులు తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఆనాటి పెద్దలు విశ్వసించేవారు. ఈ తీర్థం స్వామి దేవాలయానికి సుమారుగా మూడున్నర మైళ్ళు. దూరంలో ఉంటుంది. సనకసనందన తీర్ధం నుంచి అది పాయగా చీలుతుంది. ఇందులో స్నానమాచరిస్తే మానసి శక్తి, దేహారోగ్యం పెరుగుతాయని భక్తుల పరిపూర్ణ నమ్మకం.
ఒక కథా రచయిత, కథ రాయాలని సంకల్పించినప్పుడు అది సమాజపరంగానో లేదా వ్యక్తిపరంగానో
కావలసిన, రావలసిన మంచి మార్పులకు ప్రతిబింబంగా తన కథ ఉండాలని ప్రయత్నం చేస్తాడు అలా చెయ్యాలి కూడా అప్పుడే ఆ కథకు సార్ధకత
ఉంటుంది. కిరణ్ కుమార్ గారి కథలను పరిశీలించినప్పుడు మనిషిలో ఉన్న మంచిని పైకి తెచ్చే ప్రయత్నంతో పాటు, సమాజంలో జరిగే కొన్ని అరాచకాలను ఖండించడంలో తన కథ ప్రతిబింబంగా ఉండాలి అన్న ధ్యేయం మనకు ప్రస్ఫుటమవుతుంది.
“రాధా అరవిందం”ఈ కథకు పేరు కథలోని పాత్రలతో పెట్టబడింది.
కథలోముఖ్యపాత్రులు మూడు రాధ, అరవింద్, నిషా. అరవింద్ ప్రేమించిన వ్యక్తి రాధ. అరవింద్ పెళ్లి చేసుకున్నా వ్యక్తి నిషా.
మానవ తప్పిదాల పరంగా చూస్తే అరవిందుకు ప్రేమ ఒకచోట,పెళ్లి ఒకచోట.
ఇది వివాహ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం అనవచ్చు.
తత్పలితంగా వచ్చే అనర్థాలు తక్కువేమీ కాదు. వాటిని వివరించేదే ఈ కథ అరవింద్ రాధను ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో ఎవరో చేసిన పనికి రాధను అనుమానించి వద్దనుకొని మరొకరిని వివాహం చేసుకోవడం అరవింద్ చేసిన మానవ తప్పిదం. ఇది మన వివాహ వ్యవస్థలో ఉన్న లోపం.
ప్రేమకు నిర్వచనం నమ్మకం, అంకితం.
తనను తాను మరొకరికి ఆర్పించుకోవాలి. పూర్తిగా నమ్మకంతో తన జీవితంలోకి ఆహ్వానించాలి.
ప్రేమించిన వ్యక్తి పైన అపనమ్మకపు నీడ కూడా పడకూడదు.
కానీ తాత్కాలిక ఇష్టాన్ని ప్రేమ అనే పేరుతో భ్రమించడం నాటి నుండినేటివరకు సమాజంలో జరుగుతున్న ఒక దురదృష్టకర విషయం.
వివాహానంతరం భార్యకు అరవింద్ ఇంట్లో చోటు ఉన్నది గాని మనసులో మాత్రం రాధకే ఓటు.
ఇది అరవింద్ చేసినరెండో తప్పిదం.
ఫలితంగా అరవింద్ రహస్య ప్రేమ నిషా ప్రాణాలకు ముప్పు కరిగించేదాకా వచ్చింది. చివరకు రాధ ప్రాణ త్యాగం చేసి తన ప్రేమకు ప్రాణం పోశానని, అరవింద్ నిషాల దాంపత్యం దానివల్ల బాగుంటుందని ఊహించడం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని క్షీణింప చేసి, ఆత్మహత్యలకు ప్రోత్సహించడం లాగ ఉంది.
రాధ లేనంతా మాత్రాన నిషాలో ఏర్పడ్డ శూన్యత మాసి పోతుందా?
తనదైన చోటును మరొకరు ఇంతకుముందే ఆక్రమించి ఉన్నారన్న భావన నిషాలో నిమిషాల మీద ఎగిరిపోవడానికి ఇది తన ఇష్టం వచ్చినట్టు రాయించుకున్న సినిమా కథకాదు. సినిమాలో ప్రజాకర్షణ కోసం ఉండవచ్చు.
కానీ కథరాసే రచయిత అలా చూపించడు చూపించకూడదు.
ఈ కథా రచయిత కిరణ్ కుమార్ గారు ఈ కథ రాసే ముఖ్యోద్దేశం సోషల్ మీడియా చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టాలి అనుకోవడమే.
కానీ దానితో పాటు మరోకొన్ని జీవిత సత్యాలను తన కథలో ఆవిష్కరింపజేశారు. అవి_ స్త్రీ పురుషులిరువురి కి ప్రేమ పెళ్లి రెండు ఒక్కటే. రెండు కాదు.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకో లేకపోతే పెళ్లి మానుకో. రెండు పడవల మీద ప్రయాణం నాలుగు జీవితాలకు అశాంతి.
నమ్మకానికి మరో పేరు ప్రేమ. అన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య కాదు. రాధా లాంటివారు చేయాల్సిన ఆలోచన ఏవిటంటే, తన మంచితనంతో,
నిషా అనుమానాలను, ఆవేదనను అంతం చేయడం రాధ లాంటి వ్యక్తి చేయాల్సిన మంచి మార్గం,తన నిర్ణయాల ద్వారా,
మాటల ద్వారా అరవింద్కు తన హృదయంలో పూర్వ స్థానం తొలగించి సోదర భావన ఆవిష్కరిస్తే ఆ దాంపత్యం ఆరు పువ్వులు పన్నెండు పండ్లుగా. వర్ధిల్లుతుంది.
రాధ ఆత్మహత్య వల్ల అరవింద్ మనసులోని రాధా చనిపోదు కదా. ఆ భావన నిషాను ప్రతి నిమిషం బాధిస్తూనే ఉన్నప్పుడు
వారి దాంపత్యం రాధ కోరుకున్నట్లు హాయిగా జరుగుతుందా?
కథ చెప్పి విధానాల్లో ఇది ఒక పద్ధతి. కలిగే నష్టాలు కళ్ళ ముందు పెడితే మనిషిమారతాడని, మారాలని ఈ కథ రచయిత, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు ఈ పద్ధతిలో మనకు కథను అందించారు.
దానితోపాటు నేడు జరుగుతున్న సోషల్ మీడియా లోని అకృత్యాలను, అఘాయిత్యాలను ఖండిస్తూ వాటి వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి అని ఈ కథ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ గారు. సెల్లులో అసభ్య శృంగారాలు, స్నేహి తాలు, ఆకృత్యాల వల్ల మంచి జీవితాలు మాడిపోతున్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటికైనా గ్రహించి నిగ్రహించాలి. అని కిరణ్ కుమార్ గారి ఈ కథ గొంతెత్తి చెబుతున్నది.
వ్యక్తి పరంగా, సమాజ పరంగా, వివాహ వ్యవస్థ పరంగా ఈ కథ అందరికీ మేలుకొలుపు. చక్కటి కథ మనకు అందించిన కిరణ్ కుమార్ గారు అభినందనీయులు.
అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.
నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.
రచయిత్రి: మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన సాంఘిక నవల . పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలోని వ్యవసాయ కుటుంబాలు వంద సంవత్సరాలలో నాలుగు తరాల జీవిత చిత్రాలను చిత్రీకరించినటువంటి నవలగా మట్టి మనిషి మలచబడింది. ఈ నవల ప్రత్యేకత 14 భారతీయ భాషలలోకి అనువదింపబడడం . దీని యొక్క కథ నేపథ్యం భూస్వామి ధనిక రైతు దళారి వ్యవస్థ మధ్య ఉన్న సంఘర్షణని చిత్రీకరించినటువంటి నవల. ప్రధాన పాత్రధారి సాంబయ్య అనే రైతు . అతని భూమి కుటుంబం అతని తర్వాత వంశం ఎటువంటి సంఘర్షణలకు లోనయ్యారు అన్నది వివరిస్తుంది. ఈ నవల లో సాంబయ్య కు భూమి పట్ల గల ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించారు . భూమి అనేది రైతుకు జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది ఈ నవలలో ప్రస్ఫుటంగా వివరించే ప్రయత్నం చేశారు వాసిరెడ్డి సీతాదేవి గారు.

39కి పైగా నవలలు 100కి పైగా కథలు రచించినటువంటి ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. వీరి మరీచిక నవలను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత అది తొలగిపోయింది. సీతాదేవి గారు 2000 లో మట్టి మనిషి నవలను రచించారు. కొన్ని నవలలు ప్రజానాయకుడు , మనస్సాక్షి, ఆమెకథ , మృగతృష్ణ మొదలైనవి సినిమాలుగా వచ్చాయి.
జవహర్ బాలభవన్ డైరెక్టర్ గాను ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు పని చేసారు. కొన్ని అనువాదాలు కూడా. 5 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయిత్రిగా ప్రత్యేక స్థానం పొందిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.
నాటకీకరణ :
ఈ నవల నాటకీకరణ కు పూనుకున్న రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు. కథా , నాటక రచయితగా సాహితీ లోకంలో విశేషంగా కృషి చేస్తున్నారు . 70 కి పైగా రచించిన కథల్లో 30 కి పైగా బహుమతులు పొందినవి. గత సంవత్సరం వీరు రచించిన కొరివి కథకు అనిల్ కథలపోటీలో 25 వేల బహుమానం అందుకున్నారు. అనేకమైన నాటికలు రచించారు . 25 నాటికల సంపుటిని ఇతర సంపుటులు వెలువరించారు. శ్రీ చక్రం , ఎడారికోయిల, మిస్సెడ్ కాల్స్, ధ్వంస రచన , క్షతగాత్ర గానం, హింసధ్వని వంటి పలు నాటికలు ,నాటకాలు , శ్రవ్య నాటికల సంపుటి వీటన్నింటితో పాటు అరసం ప్రధాన సంపాదకులు గా పలు సంపుటాలను వెలువరించారు . నాటక చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.


దర్శకత్వం:
మట్టి మనిషి నాటకం దర్శకత్వం చేసిన వారు. యస్ యం బాషా గారు . అనేక నాటకాలలో నటించి , దర్శకత్వం వహించిన బాషాగారు స్వయంగా ఈ నాటకంలో కీలకమైన కనకయ్య పాత్రలో నటించి నాటకమంతా తనదైన పాత్రతో హుషారుతనం జోడించారు. నాటకానికి నిండుతనం ఈ పాత్రలోనే అన్నట్లుగా తనదైన నటనను ప్రదర్శించారు.
కథాంశం :
మట్టి మనిషి పెద్ద నవల. కథలో పాత్రలు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా వెంకయ్య పని చేసేవారు . ఆ పాలేరు వెంకయ్య కొడుకు సాంబయ్య. యజమాని అయిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య. బలరామయ్య కూతురు వరూధిని.
సాంబయ్య కొడుకు వెంకటపతి. తండ్రి పాలేరుగా పడిన అవస్థ నుంచి బయటపడి ఏనాటికైనా తనకు కొంత భూమి సమకూర్చుకుని స్వంతంగా వ్యవసాయం చేసి ఆ భూమిని క్రమంగా పెంచుకుంటూ పోవాలని తాపత్రయం సాంబయ్యది . దాని కోసం చాలా కష్టపడి భూమిని కంటికి రెప్పలా చూసుకుని క్రమక్రమంగా కొన్ని ఎకరాల భూమి ఇల్లు సంపాదిస్తాడు.


ఈ క్రమంలో భార్య సహాయం కూడా తీసుకుంటాడు . తీరా భార్య పురిటి నొప్పులతో ఉంటే పంట నూర్పిడి చేయిస్తూ పని కొందరికి అప్పగించి భార్య దగ్గర కు వస్తాడు మగబిడ్డ పుట్టాడని మురిసి పోయాడు. కానీ భార్య అనారోగ్యం తో ఉందని బయట పట్నం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలని నాటు వైద్యుడు చెప్పగానే అయోమయం లో సరైన నిర్ణయం తీసుకోలేక పోతాడు. ఫలితంగా భార్యను కోల్పోతాడు.
పొలం పనుల ధ్యాసలో వేరే వివాహం చేసుకోకుండా కొడుకు వెంకటపతి ని కూడా తన బాటలో నడిపిస్తాడు.
పెంచుకున్న భూమి తనలో ఆశను పెంచింది . ఏ యజమాని దగ్గర తన తండ్రి పనిచేసాడో అదే యజమాని కొడుకైన బలరామయ్య తన కూతురైన వరూధినిని తన కొడుకు వెంకటపతికిచ్చి కాళ్ళు కడిగించాలనుకుంటాడు. వరూధిని కోడలిగా ఇంట్లో అడుగు పెడుతుంది. మొగ దిక్కులేని ఇంటిని అందంగా తీర్చిదద్దినట్లు చేసి ఇంటిని భర్తను తన అధీనంలోకి తీసుకుంటుంది.
మామ గారైన సాంబయ్య కష్టార్జితాన్ని తన ఆలోచనలు విలాసం కోసం వినియోగించి తన స్నేహితుడైన రామనాథం సినిమా థియేటర్ యజమానితో చేతులు కలిపి , మరో డి.ఎస్పీని కలుపుకుని పెట్టుబడులు పెట్టి భర్తను తాగుడుకు బానిస చేసి ఉన్నదంతా కోల్పోతుంది. ఈ ప్రక్రియలో లాయర్లు నమ్ముతుంది. అందుకు తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటుంది. కోలుకోలేని ఎదురు దెబ్బకు బలౌతుంది . భర్త వెంకటపతి తండ్రికి ముఖం చూపలేక కొడుకైన రవిని సాంబయ్య ఉండే చోట వదిలి వెళ్ళిపోతాడు.
మనవడు రవి వచ్చి సాంబయ్య ను చేరగానే సర్వం కోల్పోయిన దుఃఖం లో ఉన్న సాంబయ్య కు ప్రాణం లేచి వస్తుంది. మనవడు తన వారసుడు తిరిగి తనకు పొలం సమకూర్చాలని తాపత్రయంతో బంజరు భూమిని తన దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి కూరగాయలు మనవడికి చూపిస్తూ పని నేర్పుతూ పంట పండిస్తాడు. ఈ క్రమంలో తాతా మనవడు సంభాషణలు రైతుకు పొలం పట్ల మట్టితో ఉన్న అనుబంధం వివరించబడుతుంది.
పంట చేతికి వచ్చే సమయానికి పొలం అప్పచెప్పిన కనకయ్య అది తన భూమి అని పోలీసులను తీసుకొస్తాడు. చేతికొచ్చిన పంట భూమి నీది కాదు అన్న మాట జీర్ణించుకోలేక ఆ మట్టిలోనే ప్రాణం విడుస్తాడు సాంబయ్య. సాంబయ్య చనిపోవడం తట్టుకోలేక చిన్నవాడైన రవి కర్ర తీసుకుని కనకయ్యని కొట్టబోగా అది పక్కన ఉన్న కామందు తలకు తగిలి రక్తం కారుతుంది. హత్యా ప్రయత్నం చేసాడని పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. రవి తిరిగి వస్తా నీ అంతు తేలుస్తా అనడంతో కథ ముగుస్తుంది.
హైదరాబాద్ రంగభూమిలో ప్రదర్శన:
మట్టి మనిషి నాటకీకరణ చేసి మొదట్లో నాలుగు గంటల నాటకం గా గతంలో ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం 3 గంటలకు కుదించిన నాటకాన్ని ఇటీవల రంగభూమి లో ప్రదర్శన మే నెల 31, జూన్ 1 వ తేదీ రెండు రోజులు ప్రదర్శన ఏర్పాటు చేసారు. విజయ వంతంగా రెండు ప్రదర్శనలు జరిగాయి. నాటకం చూసేందుకు సీతాదేవి గారి కుటుంబం నుంచి కృష్ణకుమారి గారు మరి కొందరు వచ్చి పారితోషికం అందజేసారు.
నటీ నటులు:
నాటకం ముందు ప్రస్తావన తో మధ్య మధ్య జరిగే కథనం వ్యాఖ్యానంతో సూత్రధారి గా సురభి నిఖిలేశ్ , సురభి ప్రియాంక అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రధాన పాత్రధారి సాంబయ్య పాత్రను మొదటి దశలో పి. భుజంగరావు గారు , తర్వాత దశలో ఎం వి. రాజర్షి గారు ఇరువురూ తమ పాత్రలకు న్యాయం చేసారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వరూధిని పాత్రలో ఎన్ షణ్ముఖి పూర్తిగా పాత్రలో ఇమిడిపోయే నటనను ప్రదర్శించింది. ఒక రకంగా వరూధిని నాటకంలో నవల పరంగా ఎక్కువ భాగం నాటకం లో తన పాత్రతో చుట్టూ ఉన్న పాత్రధారులు తో తానై నిలిచింది. ఎక్కువ సమయం ఈ సన్నివేశాలలో సాగింది. వాసిరెడ్డి సీతాదేవి గారు భూమి పట్ల పట్టింపు లేక తర్వాత తరాలు వ్యసనాలకు లోనయ్యారని తెలపడం వరూధిని తన భర్త, ఆ తరం ఎలా ప్రవర్తించారో తెలియజెప్పారు.


నాటకం ఆద్యంతం రకరకాల హావభావాలతో సమయానుకూల స్పందనలతో ఆకర్షణీయంగా , ఆకట్టుకునే నటన కనకయ్య పాత్రధారి అయిన నట దర్శకుడు యస్ ఎం బాషా గారు పాత్రౌచిత్య నటనతో నాటకంలో చైతన్యవంతమైన ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నటన దర్శకత్వం రెండు బాధ్యతలను స్వీకరించి తదనుగుణంగా నాటకాన్ని నడిపించారు.
కొడుకు వెంకటపతి గా కె. గోవర్ధన్ రెడ్డి అమాయకంగా ను , రామనాథ బాబు గా ఎస్ . డి. హసన్ మోసకారి గాను చక్కని నటనను అందించారు . నాటకంలో ఇతర పాత్రలలో సోల్జర్ షఫి డి ఎస్ పి గాను, యలమంద గా పి. తిరుమల రావు, ఏసోబు గా డి. సాయికిరణ్, రామి గా బి.సంధ్య, రత్తమ్మ గా సాయి దీపిక , ఆచారిగా , గురునాథంగా ఎం సాంబశివరావు, దుర్గమ్మ పాత్రలో , బుచ్చమ్మ పాత్రల్లో యస్ మాధవి , పాపారావుగా జె. రత్న రాజు, కాంతమ్మ గా డి. చిత్కళ, జూనియర్ వెంకటపతిగా శ్రీకర్, పోలీస్-1గా, ఆఫీస్ బాయ్ , క్లీనర్ పాత్రలలో సాయికిరణ్, పోలీస్ -2 గా దానిష్ అలీ, నటి గా రూపిక , స్త్రీలుగా చిత్కళ, దివ్య, రూపిక, సాయి దీపిక, శేషమ్మ గా సురభి ప్రియాంక , బలరామయ్య గా కె. శేఖర్ రెడ్డి , గుమాస్తాగా సుజిత్, పాపారాయుడు గా మాధవ్ , రాముడు ఎస్ వంశీ, దాసుగా పి. తిరుమలరావు, గోపాలరావుగా బి స్వరాజ్, శివరామ కృష్ణయ్య గా , మంత్రి గా , రామానందం పాత్రలలో వై. వి ఆర్ ఆచార్యులు, కృష్ణయ్య గా సుజిత్, రవి పాత్రలో దేవేష్ నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఇంత పెద్ద నాటకానికి సాంకేతిక నిపుణుల సహకారం ఎంతో అవసరమైనది. ఆహార్యం పచ్చల శివ, సంగీతం సురభి నాగరాజు, కాస్ట్యూమ్ బి . సంధ్య/ ఎస్ వంశీ , కీ బోర్డ్ వై. గంగాధర్, గేయ రచన చింతలపల్లి అనంత్ , గేయ రచన సుద్దాల అశోక్ తేజ , పాటలు వసీం, డప్పు డప్పు అనిల్, లైటింగ్/ సెట్ సురభి ఉమా శంకర్/ అభి అందించగా స్టేజ్ మానేజర్ గా అభి రెడ్డి, ఆడిటోరియం మానేజర్ గా అర్షద్ షేక్, /శివరామ కృష్ణ ఆడిటోరియం అసిస్టెంట్ గా వెంకట్ లక్ష్మన్ వ్యవహరించారు. ఫొటో , వీడియో, పబ్లిసిటీ బి . సాయికిరణ్ చూసుకున్నారు. పి ఆర్ ఓ గా అర్షద్ షేక్/ సాయికిరణ్ ఉన్నారు. వీరందరి సమిష్టి సహకారం నాటకంలో నిండుతనాన్ని తీసుకు వచ్చాయి.

ఇంతమంది కళాకారులను సిద్ధం చేసుకుని సమన్వయం చేసుకుంటూ చేసిన ప్రయత్నం గొప్పది .ఈ విషయం
నాటకంలోని సాంబయ్య రవితో అన్న మాటలతో తెలుస్తుంది.
మనిషికి సంతోషం ఎక్కడుందంటావు? కష్టపడి పని చేయడంలో ఉంది . చెమటోడ్చి భూమి దున్నడం లో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావడంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకి వచ్చే ఆనందం లాంటిది ఈభూమి . దీనిని మించినది మరొక్కటి లేదురా.. అంటాడు రవితో.
బడిలో చదివే విద్యార్థికి పొలంలో పని చేసే రైతుకి సామ్యం చెప్పే ఒక గొప్ప డైలాగ్ సాంబయ్య మనవడితో అనడం . ” ఈ నేల నా పలక. నాగలే నా బలపం . పొలమే నా బడి . భూమి మీద దిద్దాను . రోజుకు ఒక్కొక్క మాట ఈ భూమే నాకు నేర్పింది. నా తల్లి , దైవం, గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పురా మనవడా నీ బడి గొప్పదా నా బడి గొప్పదా? “
పొలాన్ని బడిగా మార్చుకున్న మట్టి మనిషి జీవన రేఖా నాటకమిది.
దళిత చైతన్యం నింపుతూ వస్తాను భూమిని ఆక్రమించే వారి పని పట్టడానికి అని చెప్పడం ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. చివరిగా మట్టిలో పుట్టిన వాడ్ని
మట్టి మీద బతికిన వాడ్ని
మట్టిలో కలిసి పోతున్న వాడ్ని
వంటి మీద మట్టి ఉండక
మరి బంగారం ఉంటుందా !
అని ప్రశ్నించిన పాత్ర మట్టి మనిషి.
మట్టి మనిషి నవల ప్రముఖ నవలలలో 13 వ స్థానంలో నిలిచిన నవలగా పేరొందడమే గాక గొప్ప నాటకంగా వల్లూరు శివప్రసాద్ గారిచే నాటకీకరణ గా మలచబడి యస్. ఎం బాషా గారు దర్శకత్వం లో రూపుదిద్దుకుని మనందరి మనసులలో స్థిరంగా నిస్సందేహంగా నిలిచి ఉండే నాటకం మట్టి మనిషి .
కొన్ని దశాబ్దాల క్రితం ప్రజల అభిరుచులను బట్టి నీతి, ప్రేమ, కార్మికులు, సంస్కరణ ఈ విధంగా కథా వస్తువు కాలక్రమం లో మారుతూ ఉండేది. ఇప్పుడు సామాజిక అవసరమే అత్యంత .ఆవశ్యకమైన కథావస్తువుగా మారింది. నేడు దళితుల ఆత్మగౌరవం, చైతన్యం, సంఘటిత పోరాటాలు, తిరుగుబాటు, తిరస్కారాలు కథా వస్తువులై తెలుగు కథా వస్తువు పరిధిని పెంచాయి. 1920 ప్రాంతం నుండి దళితుల జీవితాలను సానుభూతితో చిత్రించిన రచనలు నేడు సహానుభూతిని కలిగి ఉంటున్నాయి.

“ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరి చేయవచ్చుగాని జీవితం తెలియకపోతే సరిచేయడం ఎవరి వల్లా కాదు… శిల్పమూ భాషా రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అయితే అవి కథారచనకు మూల పరికరాలు. ముడి పదార్థం జీవితం” అంటారు కొడవటిగంటి. సాహిత్యకారుల జీవన గవనంలోని ప్రతి సంఘటన సృజన వైపు మళ్లకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలోని తీవ్రత అది కలిగించే ఒత్తిడి కవిగానో రచయితగానో నిలబెడతాయి. “ఒట్టి చాపలు” కథలు పరిశీలించి రాసినవి కావు. డా మండల స్వామి జీవితంలోంచి అనుభవాల నుండి ఆవిష్కృతమైనవే అని అనిపిస్తుంది. రచయిత వృత్తిపరంగా ఉపాధ్యాయులు వారి జీవన నేపథ్యానికి అనుగుణంగా ఈ సంపుటిలో కొన్ని విద్యాపరమైన పాఠశాలలకు సంబంధించిన కథలు ఉన్నాయి ఈ వైవిధ్యంలోనూ కథల ఇతివృత్తాలు పాత్రలు ఎక్కువగా దళిత జీవితాన్ని, చైతన్యాన్ని చిత్రించినవే కావడం వల్ల “ఒట్టి చాపలు” ను దళితవాద కథా సంపుటి గానే గుర్తించాలి.
ప్రభుత్వ ఉపాధ్యాయుడయినా కులం కారణంగా కిరాయికి ఇల్లు దొరకని పరిస్థితిని చిత్రించిన కథ “ఇల్లు దొరికింది”. “చేతిలో చేయి కలిపిన వెంకటయ్య జై భీములు అనడంతో శీనులో కొత్త ఆలోచన మొదలైంది” అనడంలో రచయిత దళిత సంఘటిత చైతన్య ఆవశ్యకతను స్పష్టం చేసినారు. వెంకటయ్య పాత్ర చేత “ఈ వ్యవస్థ పట్ల, ఈ వ్యవస్థ అందిస్తున్న అవమానాల బహుమతుల పట్ల మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది” అని అనిపిస్తారు. ప్రధాన పాత్ర కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటున్న కొద్ది పాఠకుడు దళితులు పొందుతున్న సామాజిక గౌరవం ఇదేనా అన్న ఘాటు ప్రశ్నను ఎదుర్కొంటాడు.
“సదువుకున్న తెలివి” కథలో ఆత్మగౌరవంతో జీవించడానికి ఆర్థిక స్థోమత అవసరమని తెలిపే పాత్ర ముత్తమ్మది. అసహాయతలో చైతన్యం చెదిరిన తల్లికి ధైర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఇచ్చే విద్యావంతుడైన కొడుకు పాండు. క్లిష్టమైన పరిస్థితులలో మానవ ప్రవృత్తులు సమయానుసారంగా ఎన్ని రకాలుగా మారుతాయో కూడా ఈ కథ తెలుపుతుంది. ఏళ్లుగా వివక్షచూపుతూ శ్రమదోపిడీ చేస్తున్న పటేలమ్మ “పాండూ! నువ్వు సదువుకున్నవురా! నీకన్నీ తెల్సురా!…. నేను పటేలమ్మను కాదు. ఓ మనిషి లెక్క అడుగుతున్న ఈ ఒక్క సాయం చెయ్యి బిడ్డా! నీకు దండం బెడ్తా” అంటుంది కథ ముగింపులో. ఆమెలో పరివర్తన తీసుకురావడంలో చదువుకున్న పాండు సఫలుడవుతాడు. కరోనా నేపథ్యంలో పాండు చదువుకున్న తెలివితో కరోనా నెగిటివ్ ని పాజిటివ్ అని చెప్పి తల్లిని శ్రమదోపిడి నుండి తప్పించడం కొసమెరుపు.
దళితులలో రూపొందిన చైతన్యాన్ని చిత్రించిన కథ “కాలం మారింది”.
దళితుడైన యాదగిరి జనరల్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో సర్పంచ్ అయి నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో పూలు పండ్లు పెట్టుకొని తిరిగి వస్తుండగా యాదగిరి బంధువర్గం ప్రయాణిస్తున్న డీసీఎం ప్రమాదానికి గురవుతుంది. ఆ సందర్భంలో “మన మాల మాదిగోల్లంతా మాటిమాటికి దేవునిగుల్యకు పోతుండ్రంట. అందుకనే ఇట్లయిందని అంటున్నదే! ఈల్ల ఇకమతుల మీద మన్నుబొయ్య!”
వంటి సంభాషణలు గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న వర్గ వైషమ్యాలను, ఆధిపత్య ధోరణులను, రచయితకు గల సామాజిక స్పృహను పట్టి చూపిస్తాయి. కొత్త గుడి గర్భాలయంలో యాదగిరి దంపతులు మొదటి కొబ్బరికాయ కొట్టడంతో కథ పూర్తి అవుతుంది. ఉన్నత విద్య మంచి వ్యక్తిత్వం రాజకీయ ప్రాతినిధ్యంతో సామాజిక గౌరవాన్ని సాధించగలమని నిరూపించిన కథ “కాలం మారింది”.
బాల్య వివాహాలు, లింగ వివక్షత, మూఢ నమ్మకాలు, విద్య ప్రాధాన్యత, శాస్త్రీయ దృష్టి కోణపు ఆవిశ్యకత లను చర్చించిన కథ “ఒట్టి చాపలు”. అండాలు కొడుకు శివ ఎం ఫార్మసీ చదివి ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తొమ్మిదవ తరగతి లోనే చదువు ఆపేయించబడిన కూతురు స్వాతి. చదువుకోవాలని నిగూఢవాంఛ, తనకు జరగబోయే బాల్య వివాహం పట్ల వ్యతిరేకతల వల్ల స్వాతి మానసిక అనారోగ్యానికి గురి అవుతుంది. ఆమెను బాగు చేయించడం కొరకు అండాలు ఆశ్రయించిన పద్ధతులు, మూఢనమ్మకాలు వాటిని వ్యతిరేకించిన కొడుకు, చివరగా తల్లి స్వీయ అనుభవంతో మోసాలను గ్రహించడం “ఒట్టి చాపలు” లోని కథాంశం. శాస్త్రీయ దృక్పథం కొరవడిన కారణంగా ఆర్థికంగా కూడా కొందరు చితికి పోవడాన్ని, తరాల మధ్య అంతరాలను నిలువుటద్దంలో చూపిస్తుందీ కథ.
రచయితగా కథనంలో జోక్యం చేసుకోకుండా పాత్రల మాటలతోనే కథలను నడిపింపచేయడం మండల స్వామి గారి సంభాషణాత్మక శైలి. అనవసరమైన పాత్రలు సంఘటనలు సంపుటిలో ఎక్కడా కనబడవు. గారడీ చేసే శిల్పానికి దూరంగా హంగు ఆర్భాటాలు లేని సహజత్వానికి దగ్గరగా ఉన్న కథలు ఇవి. పాత్రల రూపురేఖల వర్ణనలు ఒక్కచోట కూడా లేకపోవడం, మానవ ప్రవృత్తులకు ప్రాధాన్యత నివ్వడం ఆధునికతగా గమనింపులోకి వస్తాయి. విద్య ఆర్థిక స్థితిగతులలో వెనుకబడిన దిగువ మధ్యతరగతి దళిత బహుజన ప్రజలకు ప్రతీక ఈ ఒట్టి చాపలు. నీతిని తెలిపే ఇతివృత్తాలకు ప్రేమగాథలకు ప్రాధాన్యతనివ్వకుండా మనిషి ముఖ్యం, మనిషి బతుకు గౌరవంగా ఉత్సాహంగా సాగటం ముఖ్యం అనే భావాలను స్పష్టంచేసిన కథా సంపుటి ఒట్టి చాపలు.
మహిళా పత్రిక సంపాదకులు 100 సంవత్సరాల క్రితమే వారి పత్రిక లో ఏంచెప్పాలనుకుంటున్నారో ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా వారు లేవనెత్త బోయే సమస్య గురించిన చక్కని అవగాహన ఉందనడానికి నిదర్శనము అప్పటి సావిత్రి పత్రిక.
1904 లో స్థాపించిన ఈ పత్రిక విదుషీమణి శ్రీమతి పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు, సంపాదకురాలు.
స్వాతంత్ర్యం రాక మునుపు మహిళల పరిస్థితి చాలా దుర్భరంగాను, అధ్వాన్నంగా ఉండేది. అయితే వారికి తమ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చాలామందికి తెలియకపోయేది.చదువులేకపోవడం ఒకటైతే, ఇంట్లోనూ- దేశంలోనూ స్వతంత్రత లేకపోవడం మరో కారణం. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే ఆయా కష్టాలు ఆ బాధలు తమకు వచ్చిన సమస్యలుగా గుర్తించక, నిశ్శబ్దంగా జీవితంలో ఒక అవీ భాగం అనుకొని, అవన్నీ భరించాలి కాబోలు అనుకునే అమాయకులే ఆనాడు ఎక్కువ!
అటువంటి ఆడవారి బాధలు చూడలేక, వారిలో ధైర్యాన్ని పెంచాలని, చైతన్యం తీసుకురావాలని, భాషా -సాహిత్యాల పట్ల వారికి అభిరుచి ఏర్పరిచి, వాటి ద్వారా జీవితమంటే ఇది కాదు! మరోలా ఉంటుందనీ, ఉండేలా ప్రయత్నించాలని ఎరుక కలిగిస్తూ, వారి అస్తిత్వ ఆత్మ గౌరవం నిలుపుకొనే దిశగా ఈ పత్రిక నిర్వహించబడింది.
ఎందుకంటే మహమ్మదీయుల పాలనలో ఉర్దూ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. తెలుగులో ఏ రచనా ప్రక్రియనైనా వస్తే పాలకుల( నైజాము) ఆక్షేపణలకు గురయ్యేవి.
తెలంగాణ నడిబొడ్డులో ప్రజల భాషను ఆక్షేపించడం,మగవారిని కూడా ఆఫీసులకు వారు కట్టుకునే పద్ధతిలోనే వస్త్రధారణ ఉండాలని షరతు పెట్టడం ఇవన్నీ భరించలేక,మహిళలుగా తమకంటూ ఒక పత్రిక ఉండాలని, దాని ద్వారా తమ మనోభావాలు సమాజానికి ఎరుక చేయాలని,
సావిత్రి పత్రిక యజమానురాలు, సంపాదకురాలు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారు మహిళల కంటూ ఒక పత్రిక ఉండాలని భావించారు.
మగవారు స్వేచ్ఛగా పత్రికలకు ఉత్తరాలు రాసుకుంటారు. అదే వారికి చెందిన మహిళలు మాత్రం వారి మనోభావాలు ఎందుకు తెలుపుకోకూడదు? అని గృహిణులుగా ఉన్న ఉద్యోగస్తులైన వారిని రచించమని ప్రోత్సహించేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభవించే కొందరికే తెలుస్తాయి! మరికొన్ని విషయాలు మరికొందరికి తెలుసు… ఇలా వారు- వీరు; వారికి తెలిసిన విషయాలను తెలిపినా మహిళలకు అన్ని విషయాలు తెలుసే అవకాశముంటుంది అనేది ఆమె ఆంతర్యం. అదే ఆమె పత్రికను స్థాపించడానికి కారణం అని కూడా చెప్పారు.
ఆమె ఎందరో రచయిత్రుల రచనలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. 1904లో తాను స్వయంగా ఎన్నో రచించి, తమ పత్రికలో ప్రచురించారు. అలా అని కేవలం మహిళల రచనలే కాదు! మగవారి రచనలు కూడా తమ పత్రికలో అచ్చు వేశారు. కాకపోతే ఈ పత్రికలో ఎక్కువ పాతివ్రత్యం గురించే ఎక్కువ రచనలు వచ్చాయి. ఈ పాతివ్రత్య ప్రబోధాలు పద్య రూపకంగా ఉండేవి.
నీతి పదములు –ఏప్రిల్ 1904;
సత్య ధర్మములు ఫిబ్రవరి ఏప్రిల్ 1904 ;
స్త్రీ నీతి దీపిక 1904 ఆగస్టు;
స్త్రీ నీతి గీతముల ఫిబ్రవరి 1904;
నీతి పదములు ఫిబ్రవరి ,మార్చి, ఏప్రిల్ 1912. ఇలా ఎన్నో రచనలు చేయగా వాటిని తమ పత్రిక లో ముద్రించారు.
ఈ రచనలు స్త్రీలకు సత్యధర్మం చాటు చెప్పాయి.
సంపాదకూరాలి దృష్టిలో స్త్రీ విద్యావంతురాలైతే ఆకుటుంబం అందరూ నీతినియమాలతో ఒక కట్టుబాటులో నడుస్తారని అనుకుని, ఆమె మంచి సంపాదకీయాలు రాసేవారు.
అలాగే ఇంటి పనులు కూడా తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారని, అలానే పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలంటే మహిళలు చదువుకోవాలని,తెలుపుతూ… కాలాన్ని వృధా చేసుకోవద్దని, ఉబుసుకుపోక మాటలు, ఇల్లామల్లి ముచ్చట్లు మాట్లాడవద్దని రాసేవారు.
ఈ పత్రికలో స్త్రీ విద్యా పంచరత్నాలు 1910లో ఉప్పల నరసమాంబ, ర్యాలీ జానకీరామాయమ్మ,ఆత్మూరి అన్నపూర్ణమ్మ,మొదలైన రచయిత్రులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ…. వనితలు చదువుకోవాలని తమకు తెలిసినవి రాసి పత్రికలకు పంపాలని కోరుతూ సంపాదకీయం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయము.
అంతేకాదు స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన కూడా బాగుండాలని అప్పుడే స్త్రీ తన విద్యతో వచ్చిన ఆలోచనలతో చక్కని ప్రణాళికలతో ఆ కుటుంబాలు రాణిస్తాయని, అలా పురుషులు సకల సద్గుణాలు ఆచరిస్తూ, వారింటి మహిళలు ఆచరించాలని విన్నపము అనే శీర్షికతో సెప్టంబర్ (1910) లో రాసారు.
ఆ కాలంలోనే ఆడవారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని దామెర్ల సీతమ్మ అన్నారు.
బొంబాయిలో ఇలా చదివి ఉద్యోగం చేస్తున్న వారెందరో ఉన్నారని, రఖమాబాయి, డాక్టర్ కృష్ణాబాయి,డాక్టర్ కమలాకర్ బాయి, మొదలైన ఎందరో మహిళలు బాగా చదువుకొని ఇటు ఉద్యమం చేస్తూనే, అటు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని రాసారు.
ముఖ్యంగా వితంతువులు చదువుకుంటే వారు ఎలా జీవించాలో తెలుసుకొని,తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే, సమాజానికి కూడా అసరాగా నిలబడతారని రాసారు.
కొందరుకుని అపవాదులేసినట్టు చదువుకున్న మహిళలు వారి ఇష్టా రాజ్యంగా ప్రవర్తించి చెడునడ త అలవర్చుకుంటున్నారనేది అబద్ధమని చెప్పింది. అలా అన్నప్పుడు మగవారు మాత్రం చదువుకొని ఉద్యోగం చేయడం లేదా? వాళ్ళు దుర్మార్గులు అయినారా? అని సమాజాన్ని ప్రశ్నించింది.
ప్రవర్తన అనేది వారి గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కానీ, చదువుకోవడం వల్ల చెడిపోయారని అనడం మూర్ఖత్వం అని రాసింది. ఇంకా చదువుకుంటే సంస్కారం అబ్బి సూఖశాంతులు నెలకొంటాయని రాసారు.
అలా అంటే మనం విదుషీమణులుగా చెప్పుకుంటున్న వారు గానీ, పురాణ స్త్రీలు కానీ పాతివ్రత్యాన్ని పాటించింది బాగా చదువుకోవడం వల్లనే కానీ… మరో విధంగా కాదు!
మైత్రేయి, సులభ మొదలైన వారంతా చదువుకోవడం వల్ల బ్రహ్మజ్ఞానం పొందగలిగారని, వాళ్ల కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని, కాబట్టి మంచి విద్య వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, శ్రీమతి పులిగుర్తి లక్ష్మీ నరసమాంబగారు తన సంపాదకీయంలో వివరించారు. ఆమె దార్శనికత కలిగిన మహిళ.ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఆలోచించి పరిస్థితులను ముటదే పసికట్టి, ముందే హెచ్చరికలు చేసేవారు.
ఎన్నో అభ్యుదయ భావాలతో నిర్వహించిన ఈ పత్రిక మీద కొన్ని అపవాదులొచ్చాయి. బాల్యవివాహాలను వ్యతిరేకించిందీ పత్రిక. అంతే కాదు ఎన్నో సమావేశాలలో ఆ బాల్య విహాలు చేస్తే వచ్చే సమస్యల మీద ప్రసంగించింది.
స్త్రీల కోసం గ్రంథాలయాలు ఏర్పరచి, వితంతువులకు ఆసరాగా నిలిచింది. ఇలా తన పత్రిక ద్వారా మహిళలకు సహాయ సహకారాలు అందించమని 1911 లోనే కోరిందంటే ఎంత ముందు చూపు ఉన్న పత్రికాధిపతో కదా?
1910 స్త్రీల సనాతన మండలి గుంటూరులో మొదటి మహిళా సభ రాష్ట్రస్థాయిలో జరిగింది. విద్యార్థిని సమాజం ఆధ్వర్యంలో రెండవ సభ జరిగింది. ఈ సందర్భాన్ని గురించి తన పత్రికలో పులుగుర్తి నరసమాంబ
ఆంధ్ర మహిళ కార్యదర్శిని పేరుతోఎనిమిది పేజీలలో సంపాదకీయం వివరించింది.
చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా వారందరినీ ఆ సభకు ఆహ్వానించింది. ఇందులో విద్య గురించి చర్చించడానికి ఒక సభ, సమాజంలోని లోటుపాట్లు గురించి మాట్లాడడానికి ఒక సభ, ఇంటికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి మరోసభలు ఉపశీర్షికలు పెట్టి ఇరవైరెండు రకాలైన సమస్యలను చర్చించారు.
చర్చలలో ఒకరి మధ్య మరొకరికి బేధాభిప్రాయాలు వచ్చి కొంతకాలం పత్రిక నిలిచిపోయినా మహిళల గురించి మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది మాత్రం 1904 లోనే… ఆ నాటి నుండే మొదలైంది ఈ పరంపర.
పందిటి వీర రాఘవమ్మ గారు ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించి, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారి అధ్యక్షతన అత్యద్భుతంగా తన ప్రతిభా పాటవాలతో మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేసింది.
అలా చైతన్య వంతులైన మహిళలు, స్వాతంత్య్రం కోసం ప్రజలను మేలుకొలిపారు.
ఇవాళ మనం రాజకీయ,ఆర్థిక, సాంకేతిక,నిర్వహణలలో ఇలా నిలదొక్కుకొని రాణించడానికి ఆనాటి నరసమాంబ వంటి మహిళల ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతోఉంది.
ఎందుకంటే గృహహింస ఎంత ఉన్నా ఇదిలానే ఉంటుందని, దాన్ని భరించాలకునే మనస్తత్త్వం నుండి ఎదురించి, ఆత్మాభిమానంతో బతకాలని నేర్పిన ఆనాటి పత్రికలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండానే నడిపారు.
మరో కారణం రవాణా సౌకర్యాల వసతి అంతగా లేక ఒక విషయం సామాన్యులకు చేరడం వ్యక్తిగతంగా సభలు ఏర్పాటు చేసి, ప్రసంగాల వల్ల కష్టమైయ్యేది. ఆర్థిక వనరులు అడ్డు తగిలేవి. తమకంటూ ఆదాయంలేని మహిళలకు సభా నిర్వహణ తలకు మించిన భారమయ్యేది.
పత్రికలైతే ఇంటింటా చేరి, విషయం అందరికీ చేరుతుందని ఆలోచన చేయడం మరో కోణం.
ఏదేతైనేమి ? సామాజిక స్పృహ ఉండి, అణచబడిన మహిళలలు తలెత్తుకుని జీవించాలన్న వారి ధ్యేయానికి, పత్రిక ప్రజలకూ – ప్రభుత్వానికి నడుమ వంతెనవలె పనిచేయాలనే ఆశయంతో… శాంతి సుస్థిర సమాజాన్ని కాంక్షించే పత్రికలకెప్పటికైనా ఋణపడే ఉంటాం! ఆ నారీ మణులందరికీ
నమోవాకములర్పిస్తూ…
బిట్ల అంజనీ దేవి మనసెందుకో సున్నితం కవిత
కవయిత్రి బిట్ల ఆంజనీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.ఇప్పుడు కూడా ప్రతి రోజు మంచి పుస్తకాలు చదువుతారు. సమాజ అభ్యుదయం కాంక్షించే సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.చదువు పట్ల మక్కువతో ఎంఏ. బీ.ఈడీ.పూర్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు కవితలు,వ్యాసాలు రాయిస్తున్నారు.విద్యార్థుల్లో దాగి వున్న సృజన శక్తికి పదును పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన కొనసాగిస్తున్నారు. కవయిత్రి అంజనీ దేవి కలం నుండి జాలువారిన మనసెందుకో సున్నితం కవితా సంపుటిలోని మనసెందుకో సున్నితం కవిత పై విశ్లేషణా వ్యాసం. ఈ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఈ కవిత మనసు గురించి రాయడం జరిగింది.మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.అందరు చదవాల్సిన కవిత.
“మొదటిసారి వేడి తగిలినపుడు
“వేళ్ళు చురుక్కుమన్నాయి/అని అంటున్నారు.
పొయ్యి మీద వంట చేస్తున్నపుడు గిన్నె వేడిగా ఉంటుంది.వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను గుడ్డను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకుని వేళ్లకు బాధ కలిగింది అనే చక్కని భావాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.
“వయసు పెరిగే కొద్ధీ
“చర్మం ముదిరిందో
“అలవాటయిందో
“తట్టుకునే శక్తి పెరిగిందో
“ఇప్పుడు అమాంతం
“వేడి గిన్నెను దించగలదు/అని అంటున్నారు.
జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది.వయసు పెరిగింది.వయసుతో పాటు చర్మం ముదిరింది.ప్రతి రోజు వంట చేస్తున్నది.వంట చేయడం ఇప్పుడు అలవాటయింది.వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది.ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది.వేడి గిన్నెను పొయ్యి మీదనుండి దింపినప్పటికీ చేతులు కాలడం లేదు.వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని స్పృహ కూడా లేకుండా పోయింది.మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకెళ్లింది.మనిషి మనస్సు ఎంతగా మారి పోయింది.మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి అందించిన భావం అద్భుతంగా ఉంది.

“మొదటి అడుగు సున్నితంగా
” ముళ్ళు తగిలినా రాయి తగిలినా
“నొప్పితో తడబడింది/అని అంటున్నారు.
ఎవరికైనా,ఎప్పుడైనా,మొదటి అడుగు సున్నితంగా ఉంటుంది అని మన అందరికి తెలుసు.మొదటిసారి ముళ్ళు తగిలినా,రాయి తగిలినా నొప్పితో తడబడింది.బాధతో విలవిలలాడింది.ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది.ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది.రాయి తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓర్పుతో భరించింది.
“ఎముక ముదిరిందో
“అవసరాల అనివార్యతో
“ఇపుడు ముళ్ళపై నడవగలను
“కంకరపై పడుకోగలను/అని అంటున్నారు.
నిజమే.వయసు పెరిగిన కొద్ది ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితులు వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం పెరిగింది.ముళ్ళపై నడవగలను అనే ధీమా పెరిగింది.ముళ్ల పై నడిస్తే ఏం జరుగుతుంది? కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి.కంకరపై పడుకోగలను అనే ఆత్మ విశ్వాసం సైతం పెరిగింది.కంకర పై పడుకుంటే శరీరానికి కంకర రాళ్లు ఒత్తుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్య నైనా ఓర్చుకునే లక్షణం అలవడింది.
“అనుభవం పెరిగే కొద్దీ
“అన్నీ తట్టుకున్న ఈ శరీరంలో
“మనసెందుకో అందుకు భిన్నం/అని అంటున్నారు.
జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది.ఈ శరీరం మాత్రం అనుభవం పెరిగిన కొద్ది అన్నిటిని తట్టుకుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. మనసుకు రూపం లేదు.పేరు మాత్రమే ఉంది. దేవుడికి రూపం లేదు.మనసు ఎక్కడ ఉంది?మన లోపల మనసు దాగి ఉంది.మనసు అంటే ఆలోచన అని అర్థం.ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి. మనస్సు అనేది ఎవరికి వారి సొంతం.సంకల్పమే మన మనస్సు.ఇతరుల మనసును ఎవ్వరు తెలుసుకోలేరు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని సాధిస్తుంది.శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మన మనసు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని కోరుకోవాలి.ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి.శరీరం స్వాధీనంలో లేదు.మనసు స్వాధీనంలో లేదు.మనస్సు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు, విచక్షణ,మొదలైన అంశాలు.మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం.ప్రతి మనిషి యొక్క భావాలు,అనుభూతులు,అభిప్రాయాలు,వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.అందుకే ఎవరి ఆలోచనలు వారివే. మనసు గతి యింతే,మనిషి బ్రతికింతే,మనసున్న మనిషికి సుఖం లేదంతే,చలనచిత్రంలోని పాటను మనం విని ఉన్నాం.మనిషి మనసు ఎవరికి అర్థం కాదు.మనసు అంటే నానార్థాలు హృదయం, మానసం,ఇష్టం,తలపు,వలపు,చిత్రం,మది.మనసు గురించి కవయిత్రి మనసెందుకో భిన్నమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“అమ్మ తిట్టినపుడు
“ఏడ్చి మర్చిపోయా
“మళ్లీ అమ్మా అన్నాను/అంటున్నారు. మనం ఏమైనా తప్పు చేస్తే అమ్మ తిట్టుతుంది.అమ్మ తిట్టినప్పుడు మనకు దుఃఖం వచ్చి ఏడుస్తాం.అమ్మ కొట్టినా,తిట్టినా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది.అమ్మ ఆలనలో,లాలనలో అమ్మ కొట్టిన సంగతి,తిట్టిన సంగతి మర్చిపోయి మళ్లీ అమ్మ దగ్గరికి చేరుతాం.అమ్మ ఎవరు?అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మను మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి.అమ్మ కనిపించే దైవం.అమ్మ కని పెంచే దైవం.అమ్మ గురించిన భావన అద్భుతం. కవయిత్రి అమ్మను గుర్తుచేసింది,అమ్మ లోకం గురించి,మనలను ఆలోచించేలా చేశారు.
“దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి
“మరిచిపోయాను
“మళ్లీ ఆడుకున్నాను/అంటున్నారు.
స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.సినీ గీతం ఉంది.ఏవో చిలిపి చేష్టలు,ఏదో అల్లరి,దోస్త్ కొట్టినప్పుడు దెబ్బలాడి మరిచిపోయి మళ్లీ ఆడుకున్నాను.స్నేహితులు కొట్లాడుకుంటారు.అన్నీ మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఆడుకుంటారు.స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు.నిజమైన స్నేహితులు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు.స్నేహం యొక్క ఔన్నత్యాన్ని కవయిత్రి చక్కగా వివరించారు.
“సార్ కొట్టినపుడు
“వెక్కి వెక్కి ఏడ్చిన/అంటున్నారు.
సార్ అంటే ఎవరు?ఉపాధ్యాయుడు.ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచార్యుడు కూడా దేవునితో సమానం.సార్ ఏదైనా తప్పు పని,అల్లరి చేస్తే మరియు చదువుకోకుంటే మందలిస్తారు.సారు కొట్టినప్పుడు వెక్కివెక్కి ఏడ్చాను.పిల్లలు సారు కొడితే ఏడుస్తారు.పిల్లలను తల్లిలాగే సారు కూడా దగ్గరికి తీస్తాడు.సార్ చక్కగా చదువు చెప్పి మనలో జ్ఞాన దీపం వెలిగిస్తాడు.సార్ మనలను సన్మార్గంలో నడిపిస్తాడు.సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది.కవయిత్రి మనలను బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం.
“ఇప్పుడెందుకో
“గుట్టలుగా పేరుకున్న దుఃఖం
“ఉబికి రానే రాదు
“గుండెలో భారం తగ్గనే తగ్గదు/అంటున్నారు.
జీవితంలో మనిషి ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు ఒక్కటొక్కటిగా మాయమై పోతాయి.కష్టాలను సహనంతో ఓర్చుకుంటే గుట్టలు గుట్టలుగా పేరుకున్న దుఃఖం ఆవిరి అయి పోతుంది. కష్టాల నావను ఈదుతున్నప్పుడు గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది?కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది.కవయిత్రి కవితలో దుఃఖం గురించిన భావాన్ని చక్కగా పండించారు.
“మనసు చేతికి దొరికితే బాగుండు/అంటున్నారు.
మనసు చేతికి దొరికే వస్తువు కాదు.మనసు మన ఆలోచనల్లో నిండి నిబిడీకృతమై ఉంటుంది.మనసు చిక్కబట్టిన వాళ్లను మహర్షులు అంటారు.నిత్యం యోగా,ప్రాణాయామాలు చేయడం ద్వారా మనసు స్వాధీనంలోకి వస్తుంది.మనసు స్వాధీనంలోకి తెచ్చుకున్న వాళ్లను స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల గురించి వ్రాయబడింది.
“ముండ్లు గుచ్చో
“సెగ తగిలించో
“రాతితో బాదో
“గట్టి పడేసే దాన్ని/అంటున్నారు.
మనసు మనకి అందదు.మనసుకి ముళ్ళు గుచ్చలేం.మనసుకు సెగ తగిలించలేం.మనసును రాతితో బాధి గట్టి పడేయడం సాధ్యం కాదు. మనసును గురించి కవయిత్రి భావన మనలను ఆలోచింపజేస్తుంది.
“వయసు పెరిగే కొద్దీ
“ఈ మనసెందుకో
“మరింత సున్నితమవుతోంది/అంటున్నారు.
వయసు పెరిగే కొద్ది వయసుతోపాటు ఈ మనసు మరింత సున్నితమవుతోందనే భావం అద్భుతంగా ఉంది.మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి భావాల్లో వాస్తవం దాగి ఉంది.
చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి బిట్ల అంజనీదేవిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
