మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

భారతీయుణ్ణి

by Samala Kiran August 25, 2021
written by Samala Kiran
నేను భారతీయుణ్ణి-విశ్వ బంధువుని
సత్యసనాతన ధర్మవారసుడిని
నేను భారతీయుణ్ణి-సుగుణజల సింధువుని
శాంతికాముక సమర వారసుడిని
నేను భారతీయుణ్ణి-ప్రకృతి ఆరాధకుణ్ణి
ఘనమాతృ సంస్కృతి వారసుడిని
నేను భారతీయుణ్ణి -సృష్ఠిరహస్యకుడిని
శాస్త్ర విజ్ఞాన చరిత్ర వారసుడిని
నేను భారతీయుణ్ణి -సౌబ్రాతృత్వ వారధిని
సామరస్య యోగ వారసుడిని
నేను భారతీయుణ్ణి-ఆధునికతపు ఆర్యుడ్ని
ప్రాచీనతత్వమూల వారసుడిని
నేను భారతీయుణ్ణి-ఏకతా మంత్ర సారథిని
విశ్వకుటుంబ విలువల వారసుడిని
నేను భారతీయుణ్ణి-మార్పుకు మారుపేరుని
మానవత్వ సందేశ వారసుడిని
August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

రీఛార్జ్

by Ramesh August 25, 2021
written by Ramesh

మనసెందుకోఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవుతుంది
ఎడదలో సంతోషానికి సడెన్ గా లాక్ పడుతుంది
మెదడులో ఎందుకో మెర్క్యూరీ మెరుపు బ్లాక్ అవుతుంది
మనిషికెందుకో ఓసారోసారి ఉషారుతనం  ఎస్.ఎమ్.ఎస్ అందదు
దయాగుణం ఓటిపి  రానేరాదు
మమతల   అలకబూనినందుకా
కోరుకున్నది నెరవేరనందుకా
ఆశించింది అందనందుకా
చెలిమియో చెలియో చేరువకానందుకా
ఎందుకో ఏమో తెలియదు మనిషికి
ఎదురుగా కుదురుగా మూడుబార్ల  సిగ్నలున్నా
ఎదుటి మనిషితో మాట్లాడ మూడు ఉండడెందుకో
మనిషి ఓన్లీ ఇన్ కమింగ్ సిమ్ గా బహశా అయ్యాడా
డబుల్ సిమ్మ్లున్నా కొమ్మమీది ఒంటరి గుబుల్ పిట్ట అయ్యాడా
అరవైనాలుగు కళల బ్యాటరీ రీచార్జ్ అలాగే వున్నా
దేవులపల్లి  భావకవితగా 4Gసెల్ దేహమై వున్నా
ఆలోచనల ఆప్షన్ లు ఎరకవున్నా
అరిషడ్వర్గాల ఐకాన్ లు  ఎదుటనున్నా
గూగుల్ లాంటి గురువు 24×7గంటలు వెంటవున్నా
మెలోడి కోకిలా ఫేవరేట్  సాంగ్ వినిపించవున్నా
ఇష్టమైనపాట రింగ్ టోన్ గా మోగనున్నా
అనంతమైన ధీర్ఘదృష్టిలాంటి  కాంటాక్టులిస్ట్ సేవ్డై   వున్నా
ఒక్కోసారి మనిషి కాల్ రాంగ్ నంబరవుతుంది…
టచ్ స్క్రీన్ కీ ప్యాడ్ పాడై డల్ మబ్బులుకమ్మిన  అంబరమవుతున్నాడు
జీవితంలో ఆనందక్షణాలకు సైతం మిస్  అవుతున్నాడు
నెట్వర్క్ వున్నా నేనై నెర్వెసై   మిస్ కాల్   అవుతున్నాడు
ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ లు  వున్నా  ఇదైపోతున్నాడు ఎందుకో మనిషి
అయినవాళ్ల అనురాగానికి లిఫ్ట్ అవటంలేదు
బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్  చేయడంలేదు
ప్రేమల ప్లాన్ గడువు గుర్తుండటంలేదు
ఎందుకో ఏమో
మనిషి అదో మాదరైపోతున్నాడు
కలికికష్టాలు కన్ఫాం ఐ వున్నాడు
ఈ లోకంలో
అయితేనేం
నిలబడ్డ నగం
ఎగసిపడే తరంగం
ఎగిరిపోయే విహంగం
ఉదయించే సూర్యబింబం
తెరిచిన బతుకు పుస్తకం
అనుభావాల మస్తకం
కనిపించి కదలిస్తుంది
అలసిన మనిషిలో
ఆగిన మమతను
మట్టి తత్వాన్ని
మానవత్వాన్ని
మరలా ప్రవహింపజేస్తుంది.

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

*కవిత్వం..!*

by Ayitha Anitha August 25, 2021
written by Ayitha Anitha
కదనరంగాన
కాలుదువ్వే సైనికునిలా
కవనం విప్లవమై వర్థిల్లాలి!
కిన్నెరసాని హొయలతో
ఆహ్లాదమూ కలిగించాలి!!
కీచకుల తలలు నరికేలా
కుయుక్తుల ఆటకట్టించేలా
క్రూర మృగాల తోలు ఒలిచేలా
కవనం కరవాలమై కదలాడాలి!
కుసుమ పరాగమై
మనసును ఓలలాడించాలి!!
కెరటమై నింగికెగరాలి
కేతనమై రెపరెపలాడాలి
కైతలెప్పుడూ స్ఫూర్తిదాయకమవ్వాలి!
కరుణామృతమునూ వర్షించాలి!!
కొమ్మన కూసే కోయిల పాటలా
కోనల అందాల వయ్యారిభామలా
కౌముది రాత్రుల చల్లదనంలా
కమనీయమై రమణీయమై రసఝరులు పారించాలి!
కలం సందేశాత్మక బాట నడవాలి!!
కూనిరాగాల కూనలమ్మై
కీరవాణి స్వరమధురిమై
కుహుకుహు రాగాల చక్కెరపాకమై
కలకాలం జీవించాలి!
కాదేది
కవితకు అనర్హమని
స్పందించే ప్రతిహృదయం
కవన సరిగమలను మీటాలి
హృదయాలనేలాలి!!
August 25, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

కరోనా విలయ తాండవము

by డాక్టర్ అడిగొప్పుల సదయ్య August 25, 2021
written by డాక్టర్ అడిగొప్పుల సదయ్య

జడలు విప్పెనుకదా జగతిపై విషక్రిమి

విస్ఫులింగం విసరి యూపిరి తీయ

శ్వాసకోశములపై పాశసర్పము చుట్టి

మహిషవాహనుడల్లె మహిని విజృంభించె

ముళ్ళ నాలిక జాపి మెల్లగా మనుజులను

కాలగర్భములోకి కలుపుతూపోతోంది

ప్రాణవాయువు నాపి ప్రాణముల హరియిస్తు

పసిడి తరువులలోటు పరిహసించుతు చెప్పె

ముక్కు మూతుల రెండు మూసి మాస్కుల తొడుగు

కరములను గడిగడికి కడిగి లేపనమద్దు

కళ్ళనూ, ముక్కునూ కలియతిప్పకు నెపుడు

కాచుకొని కూచుండె కరోనా వాటిలో

ఆరునడుగుల దూరమవలంబనము చేసి

విషవాయు వలయమును విరిగేట్లుజేయాలి

భద్రతలు పాటించ పారిపోవును క్రిమి

మన బతుకు కలదిపుడు మన చేతనే సుమి

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

గురుపౌర్ణమి

by Mukka Srinivas August 25, 2021
written by Mukka Srinivas

సద్గురువే దైవసమానం
ఓంకారనాద బీజాక్షర రూపం
అతని వాక్కే
కాలగమన ప్రబోధం
చీకటిని చీల్చేటి జ్ఞానదీపం
బ్రతుకుబాటకు గీతోపదేశం
కలల సాకారపు కర్తవ్యగీతం.
//సద్గురువే//
వ్యాస సాందీప సప్తఋషి మునిజనులు
బుద్ధ రాఘవేంద్ర సాయిబాబాలు
నిదురించే పెదవులకు కీర్తనలయ్యారు
శంకరాచార్య వివేకానంద రవీంద్రనాథాదులు
సత్యశోధక భక్తియోగ ప్రాణమయ్యారు
సద్గురువులే
నవజీవన రాగపు ఆరాధనా గీతికలయ్యారు
కర్మఫలాన్ని ప్రక్షాళనచేయు సహజదేవుళ్లయినారు.
//సద్గురువే//
అక్షరాల నీడలలో కనిపించేదే గురు మంగళరూపం
కంటిపాప తానై చేర్చుకునే సహజ లక్ష్యం
అమావాస్య నిశిలోనూ
గురువే పౌర్ణమి తేజం
నడతలలోనూ నడకలలోనూ
సద్గురువే మనకు ఆదర్శం
తస్మై శ్రీ గురవే నమః

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓ గణనాథా… ( గణేశ ప్రార్థన )

by రసస్రవంతి& కావ్యసుధ August 25, 2021
written by రసస్రవంతి& కావ్యసుధ

కం!

వేదండ తొండ మండిత
కైదండగమారి మమ్ము కాపాడు మయా
వేదాంత భూషణోజ్వలమా దండి మహాత్మ శరణమయ్య గణేశా!

కం!

శ్రీ బుద్ధి సిద్ధి సేవిత
మా బుద్ధి వృద్ధి చేయ మా గృహమునకున్
రా బుద్ధి గలిగి రావయ
పో బుద్ధిని మాని తిరిగి పోకు గణేశా!

కం.

నీ కన్న తల్లిదండ్రులె
లోకులకును తల్లిదండ్రులో గణనాథా
మా కుల పెద్దవు నీవై
సాకుము మమ్మెల్లవేళ సంతస మిడుతున్!

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

 చెలీ

by Arutla Sridevi August 25, 2021
written by Arutla Sridevi
మన స్నేహం ఎంత మధురం
చక్కలి గిలి పెట్టినంతగా
నవ్వు ల పువ్వులు పూయించిన
దారులేమయినాయో
ఇంట్లో బాధలు గుండెలు పిండినా
ఈటెల మాటలు మంటలు మండి నా
మన చిరు.నవ్వు పరదాల వెనుక
వాటిని దాచి దాచి చందామమలా
సాగిపోయిన వెన్నెలేది
కళాశాల పూదోటలో
సీతాకోక చిలుకల్లా
విహరించిన స్నేహబృందాలేవి
ఒగరు ఒగరు గా
మనను కసురు కున్న
అధ్యాపక తోటమాలులేరి
మన ముఖ చంద్ర బింబాల
వెన్నెల కోసం
మన కలువ రేకు కాటుక కన్నుల కోసం
పోటీ పడే చకోర పక్షుల
రెక్కల సవ్వడిలో
తుమ్మెద ఝంకార అల్లరిలో
నీవో కథానాయిక నేనో కథానాయిక
ఒక్క మార్కు తేడాతో
అలకలు అలజడులు
మూతి విరుపులు మనస్పర్ధలు
రెండు రోజుల నిశ్శబ్ద నిడివిలో
బెంగతీరగా కలిసిన కలయికలో
కలల పాటలెన్నో
సఖీ
మనతియ్యని స్నేహాన్ని
వివాహం విడదీసింది
బాధ్యత ల పేరుతో
బాసిగాలు కట్టి
పచ్చగాజుల సంకెళ్లు వేసి
నీవాళ్ళు నిన్ను
నా వాళ్ళు నన్ను
శాశ్వత బందీలుగా చేసు
కున్నారు
అయితేనేం
పసిపాపాల నవ్వుల్లో
వికసించిన పువ్వుల్లో
నిన్ను చూసుకుంటానునే
చెలీ
August 25, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా

by Tellapuri Sudheerkumar August 25, 2021
written by Tellapuri Sudheerkumar

అప్పుడప్పుడు నాతో

రాత్రి వేళాకోలమాడాలనుకుంటుంది –

ఎంతకీ నిద్రపట్టనీయకుండా

నన్ను ఆటపట్టించాలనుకుంటుంది –

రెప్పలు మూయనీయకుండా

ఎన్నో తిప్పలు పెట్టాలనుకుంటుంది –

పట్టుబట్టి నన్ను ఓడించాలని

కుట్రలు పన్నుతూనే ఉంటుంది –

పిచ్చిపిచ్చి ఆలోచనలతో నన్ను

ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటుంది –

కునుకు పట్టకపోతే

అటూఇటూ పక్కదొర్లుతూ

ఆకాశంలోని చుక్కలను

లెక్కిస్తూ ఉంటాననుకుందేమో ?

కాలాన్ని సైతం మరిపించే

కమ్మని కవిత్వంతో కరచాలనం

చేస్తానని దానికి తెలీదు కాబోలు –

పరాజయం పొందినవాడిలా

నిశీధిముందు చేతులు కట్టుకొని

నిర్దయగా లొంగిపోతాననుకుందేమో ?

ఆయుధాన్ని ఎక్కుపెట్టిన సైనికుడిలా

పుస్తకాన్ని చేత పట్టుకొని

కవిత్వపు తీరంవెంట పహారా కాస్తా –

కంటిమీద కునుకు పట్టనీయకుండా

నిశి నాతో తమాషాలాడుతున్నపుడు

అంధకారాన్ని ఉరితీసే వాక్యాల్ని ఆరగిస్తూ

తిమిరాన్ని తరిమేసే కవిత్వాన్ని

తిరగేస్తూ

రేయి చెంప ఛెళ్లుమనిపిస్తా –

సీసాలో దెయ్యాన్ని బంధించినట్టు

విర్రవీగుతున్న నడిరేయి భూతాన్ని

చెలరేగుతున్న కవితా పాదాల నడుమ

ఊపిరాడనివ్వకుండా చేస్తా –

ఆయువు తీరినవాడిని

అట్టడుగు మట్టిపొరల్లో పాతిపెట్టినట్టు

నాతో నాటకాలాడే నిశీధిని

కవన సౌధంక్రింద సమాధి చేసి

నడిరాతిరి నడిబొడ్డున నిలబడి

కవిత్వపు జెండాను ఎగరేస్తా

రేపటి ఉషోదయానికి

సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా ..!

 

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ August 24, 2021
written by కొరుప్రోలు హరనాథ్

పె (ప)ంట కుప్ప

 

కొందరికి

అది చీదరించుకునే

పెంటకుప్ప

కాని –

అందరికీ

అది ఆకలిదప్పులు తీర్చే

ప్రాణప్రదమైన

పంట కుప్ప!

 

 

ఒకటే…

 

శ్మశానంలో

కాకుల అరుపులు….

వేదికలపై

నాయకుల వాగ్ధానాలు…

కాకపోతే

అవి ఎంగిలి మెతుకుల కోసం

ఇవి తిన్నది

అరగటం కోసం!

 

స్వాతంత్య్రం

 

అర్థరాత్రి

స్వాతంత్య్రం

వచ్చిందన్నమాట నిజం!

నా దేశానిక్కాదు

ఈ దేశాన్ని

దిగమింగే

దేశ దిమ్మరులకు!

 

వ్యత్యాసం

 

ఒక్క

(రా) బంధువుకన్న

వందమంది

శ్రతువులు మిన్న!

వందమంది

(రా) బంధువులకన్న

ఒక్క

స్నేహితుడు మిన్న!

 

– కొరుప్రోలు హరనాథ్
ఫ్రీలాన్సర్ పోయెట్ కాలమిస్ట్
+91-9703542598

 

August 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కవి యాత్ర సాహితీ చరిత్రలోనే ఓ సంచలన యాత్ర

by karamshanker August 21, 2021
written by karamshanker

ఒకానొక సందర్భంలో కవి యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన తట్టింది  ఆలోచనకి అప్పుడే బలమైన బీజాలు పడ్డాయి అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకునే హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలోకి  వెళ్లానుఅప్పటికే ఎంతో బిజీగా ఉన్న అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించి కవితకు ఇస్తానని హామీ ఇచ్చారు తేదీ ఖరారు చేయనున్నారు చివరికి వారు ఇచ్చిన తేదీనే మార్చి 24 2019 ఖరారైంది డాక్టర్ నరసింహ రెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి తమ సమ్మతిని తెలిపినప్పటికీ ఎలక్షన్ డ్యూటీ ఉన్నందున రాలేకపోయారు నేటి నిజం సంపాదకులు యాత్ర ప్రారంభ సభకు విశిష్ట అతిథిగా హాజరు కావాల్సి ఉండగా వారి స్వల్ప అనారోగ్య కారణంగా రాలేకపోయారు అయితే కవి యాత్రకు ముందు ఒక వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాను కవి యాత్ర అనే శీర్షిక పై ఈ వాట్సప్ సమూహంలో చాలా చర్చ జరిగింది కవి యాత్ర అనడంకంటే కవుల యాత్ర అ అంటేనే సరైనదని కవిమిత్రుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఎంతో చర్చ మొదలైంది. కవి యాత్ర అంటే కవి చేసే యాత్ర ఇది ఏక వచనం కవుల యాత్ర అంటే కవులు చేసే యాత్ర ఇది బహు వచనం కవి యాత్ర షష్టి తత్పురుష సమాసము. కవుల యాత్ర  ఇది కూడా షష్టి తత్పురుష సమాసము అవుతుంది ఇక్కడ సమాసము మారలేదు . అయితే కవి యాత్రలో ధ్వనించిన శబ్ద సౌందర్యం దానిలో ఉన్న శక్తివంతమైన ప్రకంప

నలు కవుల యాత్రలో ధ్వనించదు అందుకే కవి యాత్ర అనడమే సరైనది కొన్ని పదాల్లో ఏకవచనం బహువచనం నిక్షిప్తమై ఉంటుంది బహువచనం లేక ఏక వచనం ఉంటుంది. అందుకే కవి యాత్ర ఆనడమే మంచిదని అంతిమంగా నిర్ణయించడమైనది. అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి యాత్రకి కొంత ఇబ్బందిగా మారింది పోలీస్ పర్మిషన్ కావాల్సి వచ్చింది అందుకు డాక్టర్ కృష్ణంరాజు కవి నేత్ర వైద్య నిపుణులు ముందుకొచ్చి కవి యాత్రకు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. కవి యాత్రకు ముందు కూడా ప్రతులు కరపత్రాలు ఆవిష్కరించడం, ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కవి యాత్ర గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది. ఈ కవి యాత్రలో కవి బి. వెంకట్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించి ముందు నడిచారు యువకవి ,శిల్పి పోలీస్ భీమేష్ తనవంతుగా శ్రమించాడు  ఏళ్ల తరబడి నా ఆలోచనలు రగిలి రగిలి కవిత్వమై అక్షరాలు అక్షరాలుగా ప్రవహించి నప్పటికీ కవిత్వమొక తీరని దాహం ఒక దశాబ్ద కాలంగా నిశ్శబ్దంగా రగులుకున్న కొలిమి నిత్య చైతన్యమై ప్రభవించాలను కొన్నది అదే సంకల్పం కవియత్రగా ఈ తెలంగాణా మట్టిపై అంకురించింది. ఎంతకాలమని ఈ నాలుగు గోడల మధ్య కవిత్వం వినిపిస్తాం ప్రజల వద్దకే వెళ్ళాలనిపించింది అందుకే బస్సు కే స్పీకర్లు కట్టాం దాదాపు 50 మంది కవులం నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాంతెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి గారిని కలిసి ఆహ్వానించగా అనే వారు ఎంతో ప్రేమపూర్వకంగా స్పందించడం వల్ల మా మొట్టమొదటి విజయం ప్రారంభమైంది. నా ఆలోచనల్ని కందుకూరి శ్రీరాములు గారితో పంచుకోగా అనే కవి యాత్రను జై కొట్టి నన్ను ఎంతో ప్రోత్సహించడంతో నా రెండో విజయాన్ని సాధించాను నేను తీసుకున్న నిర్ణయం ఎంతో విశిష్టమైనదని విలక్షణమైనది అని సుప్రసిద్ధ కథా రచయిత కాలువ మల్లయ్య చింతపట్ల సుదర్శన్ లాంటి  ఎంతోమందిసాహితీవేత్తలు నేను చేపట్టిన కవియాత్ర ప్రక్రియకు ప్రోత్సహించడం నాలో నూతన ఉత్తేజాన్ని నింపింది, తేదీ 24 .03 .2019 న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు కళలకు పుట్టినిల్లు నిర్మల్ నుండి మొట్టమొదటి యాత్రకు శ్రీకారం చుట్టడంతో శ్లాఘనీయం నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నారాయణ ధర్మసాగర్ చెరువు అక్కడే టెంట్ వేసి ప్రారంభ సభను ఏర్పాటు చేశాను నందిని సిద్ధారెడ్డిగారితో పాటుగా కందుకూరి శ్రీరాములు , శ్రీమతి చీదెళ్ళ లక్ష్మి అతిథిగా విచ్చేసి సభను విజయవంతం చేశారుసమాజాన్ని చైతన్య పరిచే అనేక యాత్ర అంటూ కవి యాత్ర లక్ష్యాన్ని ప్రాముఖ్యతను గురించి ఎంతో స్పూర్తివంతమైన ఉపన్యాసం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది రెండు బస్సులకు ముందు భాగంలో పచ్చని అరటి కొమ్మలు కవి యాత్ర బ్యానర్ కట్టుకొని ఆ బస్సులకు స్పీకర్లు కట్టాం ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా మారింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నందిని సిద్ధారెడ్డి గారు పూలమాలవేసిన అనంతరం కవుల సమక్షంలో లో కవి అతను నందిని సిద్ధారెడ్డి గారు ప్రారంభించారు కవి యాత్ర వర్ధిల్లాలి ఇలాంటి స్లొగన్స్ తో కవులు గొంతు చించుకొని నినదించారు మొట్టమొదట నిర్మల్ ప్రధాన కూడళ్ళలో బస్సును ఆపి రోడ్లపైనే కవులు కవిత్వం చదివారు దిలావర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపై ఆగి కవులు కవిత్వం చదివారు అదో వినూత్నమైన ప్రక్రియ బస్సు చైతన్యరథమే బాసర వైపు కదిలింది మాతో పాటుగా బస్సులో బాసరకు నందిని సిద్ధారెడ్డి గారు రావడం కవులలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది మార్గ మధ్యలో నర్సాపూర్ జి లో ఊరవతల రామాలయం ఆవరణలో   అప్పటికే తెచ్చుకున్న వంటకాలతో చెట్లకింద భోజనం చేసాము అనంతరం డీలర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపైన ఆగి కవులు కవిత్వం చదివారు పాటలు పాడారు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్  జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో ఈ కవి ఎంతో చైతన్య రగిలించింది తద్వారా సాహితీ చరిత్రలోనే ఓనూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ఈ కవి యాత్ర ఎంతో విలక్షణమైనది అని విశిష్టమైనదని నవ్య పదంలో నడుస్తూ ఆలోచనా బీజాలు నాటుతున్నదని ప్రజలు కొనియాడారు నాలుగు గోడల మధ్యకవిసమ్మేళనాలు నిర్వహించే సంప్రదాయం నుంచి  నాలుగు రోడ్ల కూడళ్ళలో సామాన్య ప్రజల వద్దకు వెళ్లి కవిత్వం వినిపించే సరికొత్తత ఆలోచనలతో కవి యాత్ర ముందుకు సాగింది. భైంసా కు చేరుకోగానే గానే అక్కడి సాహితీమిత్రులు కవి యాత్రకు స్వాగతం వంటి బ్యానర్లు కట్టి స్వాగతం తెలిపారు, ముధోల్ లో ఊహించ కుండానే కవి యాత్రకు ఘనమైన స్వాగతం లభించింది రవీంద్ర భారతి హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికి అనంతరం కవులను శాలువాలతో సన్మానించారు అనంతరం బాసర అమ్మవారి ముఖద్వారం ఎదుట జనం మధ్యలో కవులు కవితా గానం చేసారు తిరుగు ప్రయాణంలో బైంసా కు చేరుకునేప్పటికి సమయం తొమ్మిది దాటింది బస్టాండ్ ఎదుట కవులు కవితా గానం చేశారు ప్రఖ్యాత హిందీ కవి మధు భావల్కర్ తన కవిత పఠనంతో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించారు, అనంతరం ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇందులో నా శ్రీమతి కె నివేదిత, మరియు చెల్లెలు కమల తమ వంతు కృషి చేశారు.

నాలుగవ విడత కవియాత్రలో ప్రముఖులు

నాలుగవ విడత కవియాత్రలో ముఖ్య అతిథిగా ప్రసిద్ధ కవివర్యులు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు, సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకట స్వామి నాయుడు గారు, నల్గొండ సిలివేరు సాహితీ కళాపీఠం అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి గారు, ఆసిఫాబాదు కవుల సంఘం అధ్యక్షులు గుర్రాల వేంకటేశ్వర్లు గారు ,కార్యదర్శి డా తిరుపతి గారు ,మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షులు బొడ్డు మహేందర్ గారు, ముధోల్ లోని రబీంద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ గారు ,తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి యం సి లింగన్న గారు ,కవులు -కవియాత్ర ఉపాధ్యక్షులు డా. కృష్ణం రాజు గారు, డా. వేణుగోపాల కృష్ణ గారు, జీ ఆర్ కుర్మే గారు, జాదవ్ పుండలీక్ రావు పాటిల్ గారు ,కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు ,చైర్మన్ కారం నివేదితగారు , ప్రధాన కార్యదర్శి మరియు వ్యాఖ్యాత బి వెంకట్ గారు ,కుర్మేహరికృష్ణగారు, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారపు నాగరాజు గారు లు నిర్మల్ నుండి నిజామాబాదు వరకు జరిగిన కవియాత్రలో పూర్తిగా పాల్గొని విజయవంతం జేశారు .

కారం ప్రణయ,కారం ప్రణతి,కారం రాజ్ ప్రసేన్ జిత్ లు పాల్గొనడమేగాక కవియాత్రకు చేదోడువాదోడుగా నిలబడి ,పూర్తిగా అంకితమైనారు చిన్నారులకు అభినందనలు.

నాలుగవ విడత కవియాత్ర

( నిర్మల్ నుండి నిజామాబాదు వరకు)

కవియాత్ర 3 వ వార్షికోత్సవము

అంతర్జాతీయ కవితా దినోత్సవము

  1. 03.2021, ఆదివారము

నాలుగవ విడత కవియాత్ర నాలుగు కూడళ్లకే పరిమితం కాలేదు. ఈ యాత్ర క్రొత్త సమాజం వైపు దూసుకెళ్లింది. ప్రేమను పంచింది .శాంతిని విస్తరించింది .జ్ఞానాన్ని వెదజల్లింది .కారణం ప్రముఖ కవి సద్విమర్శకులు కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు తలపెట్టడమే .ప్రముఖ లాయర్ ,కవియాత్ర చైర్మన్ కారం నివేదిత సహృదయం సమాజం పట్ల, కవులపట్ల ,ప్రేమను కురిపించడం ఒక ఉదాహరణం .కవియాత్ర ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యాత బి వెంకట్ సదుక్తుల వ్యాఖ్యానంతో కవియాత్ర బస్సు కదలడమే .నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభ కు ముఖ్య అతిథి మాన్యులు తెలంగాణ రాష్ట్ర దేవదాయ, అటవీ ,న్యాయ శాఖా మంత్రివర్యులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డిగారు ఆకుపచ్చ జెండా ఊపి, కవియాత్ర బస్సును ప్రారంభించడము అదొక మధుర జ్ఞాపకము .ప్రజల్లో నవ చైతన్యము కలగడము అనేది కవియాత్రకు బలము చేకూర్చిందని చెప్పవచ్చును. మంత్రిగారి మాటల్లోనే చూద్దాం– – ప్రముఖ కవి కారం శంకర్ గారు తలపెట్టిన కవియాత్ర ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుంది .ప్రజలు చైతన్యమవుతారు. కవియాత్ర ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి కవిత్వం వస్తుంది .కవులు, కవయిత్రులు క్రొత్త చైతన్యమును వారి వారి కవిత్వం ద్వారా నింపుతారు. ప్రజల గుండెల్లో కవియాత్ర కవిత్వం చిరస్థాయిగా నిలుస్తుంది .అని నాలుగవ కవియాత్ర ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రివర్యులు అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడంలో అతిశయోక్తి లేదు.

https://mayuukhathemagazine.com/wp-content/uploads/2021/08/WhatsApp-Video-2021-08-23-at-1.09.22-AM-1.mp4

నాలుగవ విడత కవియాత్రకు ముఖ్య అతిథి

ఏనుగు నరసింహా రెడ్డి గారు,

ప్రసిద్ధకవి ,సాహితీవేత్త, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.

అంతర్జాతీయ స్థాయి లో ప్రసిద్ధి పొందిన ,నిర్మల్ కొయ్యబొమ్మల నెలవైన, నిమ్మనాయుడేలిన, చారిత్రకపరమైన నిర్మల్ ప్రధాన పట్టణం నడిబొడ్డులోగల తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం సమావేశ హాల్లో కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభకు ప్రముఖ సాహితీవేత్త ,కవి, రచయిత, కరీంనగర్ అదనపు పాలనాధికారి ఏనుగు నరసింహా రెడ్డి గారు మరో ముఖ్య అతిథిగా హాజరై. అమూల్యమైన సందేశమును ఇచ్చారు. కవియాత్ర వల్ల లాభమున్నదా? అనే ప్రశ్నను ఉత్పన్నం జేసి .చక్కని సమాధానాలను ఇచ్చారు. కవియాత్ర తప్పక చేయాలనీ అన్నారు . కారం శంకర్ గారు తలపెట్టిన ఈ యాత్ర ఉపయోగకరమైనది అన్నారు. ఈ కవియాత్రలో కవులు కవిత్వమును క్రొత్తగా ఆవిష్కరించి ,ఆ కవితలను ప్రజలమధ్యలో ఆలపించడం వల్ల ప్రజల్లో నూతన ఉత్సాహం, కవిత్వం వ్రాసే శక్తి, భాషాపరమైన నూతన నానుడులు పుడుతాయని అన్నారు .కవియాత్ర ప్రత్యేకముగా ప్రజలు తిరుగాడే కూడళ్లలో కొనసాగుతూ ప్రజలకు మైకు ద్వారా ప్రేమ శాంతి జ్ఞానం వినిపించడం ద్వారా ,కవిత్వరూపంలో ,పాట రూపంలో వినిపంచడం ద్వారా ప్రజల్లో నవ చైతన్యం కలుగుతుందని అన్నారు. ప్రజలందరికి స్ఫూర్తిగా నిలుస్తూ క్రొత్త కవులు తయారవుతారని అన్నారు. నవ్యకవిత్వం తో కవులు పుట్టుకొస్తారని అన్నారు .ప్రేమ శాంతి జ్ఞానం అను సమాజమును ప్రతిబింబించే పదాలను తీసుకొని కవియాత్ర అనే పేరుతో యాత్రను చేయడం కారం శంకర్ గారు, వారి సతీమణి కారం నివేదిత ధన్యులని అన్నారు. ఈ దంపతులు చేపట్టిన ఈ కవియాత్ర చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. కవియాత్రను చేపట్టిన కారం శంకర్ గారు చైర్మన్ నివేదితగారు , వ్యాఖ్యాత, ప్రముఖ కవి బి. వెంకట్ లు అభినందనీయులని అన్నారు.

తదనంతరము కదిలిన కవియాత్ర బస్సులో సామాన్య జనునివలె కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డిగారు ప్రయాణం చేశారు .మధ్యలో కవియాత్ర ఆగినచోట ఉత్సాహాన్ని నింపే ప్రసంగాలను చేశారు .బాల్కొండ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.మాట్లాడారు. అక్కడినుండి ఆర్మూర్, నిజామాబాదు సభల్లో సందేశమిచ్చారు .నిజామాబాద్లో కంఠేశ్వర్ లోని ప్రాచీన శివాలయం ప్రాంగణంలో నిజామాబాదు కవులు స్వాగతం పలికారు .తర్వాత మహా శివున్ని అర్చించారు. తర్వాత గీతాభవన్లో జరిగిన కవియాత్ర జ్ఞానజ్యోతి సభలో సందేశమిచ్చి, కవియాత్రలో పాల్గొనిన ప్రతి కవిని సన్మానించారు .కవియాత్రకు ఒక రోజంతా పూర్తి సమయాన్ని ఇచ్చి ,కవియాత్ర సాహిత్యలోకానికి స్ఫూర్తిని నింపారు.

నిర్మల్ నుండి నిజామాబాదు వరకు కవియాత్ర లో కవితాగానం

కవియాత్రకు విశిష్ఠ అతిథిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రముఖ కవి డా ఉప్పు కృష్ణం రాజు గారు చక్కని సందేశాన్ని అందించారు తనదైన శైలితో కవిత్వమును రచించి కవితను గానం చేశారు కవియాత్రకు వెన్నుదన్నుగా నిలిచి పోలీసుల అనుమతిని తీసుకున్నారు అంతేగాక కవియాత్రకు సహకారాలను అందించారు ఆయా తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది దాక కవయిత్రులు కవులు పాల్గొన్నారు ఆయా కూడళ్లలో కవిత్వమును వినిపించారు. పాటే మా ప్రాణం సంగీత అకాడమీ చెనిగారపు నాగరాజు గారు వారి కళాకారుల బృందంతో పాటలను పాడించారు ప్రముఖ జానపద కళాకారిణి కళ్యాణి రాగయుక్తంగా పాడిన పాటలు అలరించాయి .నాగరాజు పాడిన అమ్మానాన్నల పాట హృదయాలను రంజింపజేసింది .నిర్మల్లోని ప్రారంభమైన కవియాత్ర అమరవీరుల స్తూపం, కలెక్టర్ చౌరస్తా. శివాజీ చౌక్ .చైన్ గేట్, కంచెరోని చెరువు సమీపంలోని ప్రాచీన కట్టడం కోట శ్యాం ఘడ్ లలో కవులు కవితాగానం చేశారు .తర్వాత సోఫీనగర్, కడ్తాల్ ,గంజాల్ ,సొన్, పోచంపాడ్ ,ముప్కాల్ మీదుగా బాల్కొండ చేరింది. కవియాత్ర ఆయా కూడళ్లలో అక్కడి కవులు కవియాత్రకు స్వాగతం చెప్పారు .ఇలా నిజామాబాదువరకు కవియాత్ర వెళ్ళింది.

బాల్కొండలో కవియాత్రకు బ్యాండు మేళాలతో ఘనస్వాగతం

మండలోజు నరసింహ స్వామి , నాగుల రాజేందర్ అను కవులు బ్యాండు మేళాలతో ,పాఠశాల విద్యార్థులతో ఘనస్వాగతమును పలికారు. బాల్కొండ ప్రవేశ ద్వారము నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సద్భావన యాత్రగా తీసుకెళ్లారు .తెలంగాణ తల్లికి పూలమాలలను సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహ రెడ్డి చేతులమీదుగా వేయించారు. కవియాత్ర అధ్యక్షులు కారం శంకర్, చైర్మన్ నివేదిత, వ్యాఖ్యాత బి. వెంకట్, డా యు. కృష్ణంరాజు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. తర్వాత అక్కడి చిన్న దుకాణ కూడలిలో చెట్ల నీడన ప్రముఖ కవులను సన్మానం చేశారు. పాటలు పాడిన కళ్యాణి బృందానికి కవితాగానం చేసిన కవులకు తాను స్వతంత్రంగా రచించిన రుబాయిలు పుస్తక సంకలనాలను బహుమతిగా అందించారు. బాల్కొండ కవితాగానంలో ప్రజలు ఆసక్తిగా కవితలను విన్నారు.

కవియాత్రకు ప్లెక్సీలతో స్వాగతం చెప్పిన ఆర్మూర్ కవులు

బాల్కొండ నుండి బయలు దేరిన కవియాత్రకు అక్కడి కవులు ప్లెక్సీలతో స్వాగతం చెప్పారు .అష్టావధాని డా బోచ్కర్ ఓంప్రకాష్ రామకృష్ణ ,సాయినాథ్, గణపురం రాజేందర్ ,పీరి గంగాధర్ లు స్వాగతం చెప్పారు .శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి గుడిలో కవియాత్ర కవులకు లిల్లీపుట్ స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు .తర్వాత జరిగిన సాహిత్య సభలో కవులకు సన్మానం చేశారు. చిన్నారి అభిజ్ఞ చేసిన శాస్త్రీయ నృత్యం సభను అలరించింది .అక్కడి నుండి ఆర్మూర్ కూడళ్లలో కవితాగానమును కవులు చేస్తూనే కవియాత్ర నిజామాబాదు వైపు సాగింది.

నిజామాబాదు కంఠేశ్వర్ లో కవియాత్రకు వేదమంత్రాలతో స్వాగతం

నిజామాబాదులోని భావన సాహితి సంస్థ అధ్యక్షులు పడాల రామారావు గారు సభ్యులు సురేశ్ వివిధ ఇందూరు సాహితిసంస్థలు కలిసి కవియాత్రకు స్వాగతం పలికినవి .అచటి ప్రాచీన శివాలయం లోనికి పూజారుల వేదమంత్రాలతో స్వాగతం పలికారు .శివునికి అర్చనలు చేయించారు .తర్వాత ప్రముఖ కవులకు సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి గారికి పరమేశ్వరుని వస్త్రాలను అందించి, తీర్థప్రసాదాలను అందించారు .అచటి ప్రాంగణంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవులు కవితాగానం చేశారు .వేసవి తాపమును నివారించే చల్లని మజ్జిగను కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదితలు అందించారు తర్వాత నిజామాబాదు లోని ప్రధాన కూడళ్లలో కవియాత్ర సాగింది గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కవియాత్ర  చైర్మన్ కారం నివేదిత, ప్రధాన కార్యదర్శి బి వెంకట్ లు పూలమాలలను వేశారు అక్కడినుండి కవితాగానం చేస్తూ ,కవియాత్ర గీతా భవన్ కు చేరుకుంది .అచటి సాహిత్య సభలో ముఖ్య అతిథులుగా ఏనుగు నరసింహారెడ్డి గారు డా కావేరి ఫౌండేషన్ చైర్మన్ డా అప్పాల చక్రధారి పాల్గొని ,కవియాత్రను కొనియాడారు .కవియాత్ర కొనసాగడం చాలా విభిన్నమైనదని అన్నారు. కవియాత్ర సామాన్యప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారు. తర్వాత నిజామాబాదు కవులు కవితాగానం చేశారు .యూత్ అసోషియేషన్ అధ్యక్షులు సాయిబాబా మాట్లాడారు నిర్మల్ నుండి నిజామాబాద్ వరకు బస్సులో ప్రయాణం చేసిన కవితాగానం చేసిన కవయిత్రులకు .కవులకు,నిజామాబాదుకవులకు ముఖ్య అతిథుల చేతులమీదుగా సన్మానం చేశారు . వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ చైర్మన్ కారం నివేదిత లు ఈ కార్యక్రమాన్ని పరిశీలించగా వ్యాఖ్యాత బి వెంకట్ వ్యాఖ్యానం చేశారు. చెన్నూర్ నుండి తీసుకొచ్చిన కవియాత్ర జ్ఞాన జ్యోతిని నిజామాబాదు కవులు పడాల రామారావు సురేశ్ తదితర కవులకు బొడ్డు మహేందర్ .గుర్రం వెంకటేశ్వర్లు,డా తిరుపతి లు అందజేశారు.తర్వాత ధన్యవాద సమర్పణతో, చివరగా కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదిత లు కవులెల్లరకు భోజనాలను పెట్టించారు. త్వరలో హైదరాబాదుకు కవియాత్ర వెళ్ళనుంది. కవియాత్రకు ముగింపులేదు.

గీతాభవన్ లో

పుస్తకాల ప్రదర్శన కవియాత్ర సన్మానం ప్రాంగణంలో నవతెలంగాణ వారు పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. నిర్మల్ నుండి నిజామాబాదు వారికీ సాగిన కవియాత్రను లైవ్ చూపించడం కోసం వివిధ చానళ్ళు ప్రోత్సాహమును ఇచ్చాయి. ప్రింట్ మీడియావాళ్లు చక్కని కథనాలను అందించారు. అందరికి కవియాత్ర పక్షాన ధన్యవాదాలు.

కవియాత్రలో కవితాగానం చేసిన కవులు

ప్రముఖ కవి ఏనుగు నరసింహ్మా రెడ్డి ,కారం శంకర్ ,బి వెంకట్,డా. అప్పాల చక్రధారి, కారం ప్రణతి ,డా కృష్ణంరాజు,డా వేణుగోపాలకృష్ణ, పత్తి శివప్రసాదు, నేరెళ్ళ హన్మంతు, పొలీస్ భీమేశ్, అంబటి నారాయణ ,జి ఆర్ కుర్మే ,సాధనాల వెంకట స్వామి నాయుడు ,జాదవ్ పుండలీక్ రావు పాటిల్, సిలివేరు లింగమూర్తి ,కుర్మే హరికృష్ణ, అసంవర్ సాయినాథ్ ,గుర్రాల వెంకటేశ్వర్లు ,డా తిరుపతి, సిలివేరు లింగమూర్తి ,డా కోవెల శ్రీనివాసా చార్య ,అరుణ బట్టువార్ ,చంద్రకళ ,చెనిగారపు నాగరాజు ,ధర్మపురి, రాఘవులు, శేషుకుమార్ ,బి విజయలక్ష్మి ,సుమతి, మామిడాల దశరథ్ ,రాజేశ్వర్, పీరి గంగాధర్ ,కిరణ్మయి ,కారం ప్రణయ, ఓంప్రకాశ్ ,పడాల రామారావు,సురేశ్ ,సాయిబాబా, నిజామాబాదు కవులు,తదితరులు .పాల్గొని కవితాగానం చేశారు.

కళాకారులు -కళ్యాణి, సాయికృప ,దీపిక ,కావ్య, సుప్రియలు పాల్గొని అందమైన పాటలను పాడారు.

 

August 21, 2021 2 comments
5 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us