



Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120
డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.
శ్రీమచ్ఛ్రీ రత్నగర్భా హృదయ సరసిజాత ప్రభా భాను బింబం
కంపా కంపానుకంపా మృత రసభరితాహ్లాద ప్రహ్లాద డింభం
శుంభ త్సంరంభ గంభీర తనురుచి ప్రాప్ప డంభోదకాండం
వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్!
– శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు

కనువిందు చేయబోయే యాదాద్రి చిత్రం
తాత్పర్యం : శ్రీ మంతురాలైన లక్ష్మీదేవి (రత్నగర్భ) యొక్క హృదయ కమలాన్ని వికసింపజేయగల కాంతిమంతమైన భాను బింబమైనవాడు ; అతివేగంగా కదలగలవాడు – స్థిరమైనవాడు – తన అనుకంపా (కరుణా) మృతరసాన్ని పరిపూర్ణంగా నింపడఁచేత ఆహ్లాదాన్ని (సంతోషాన్ని) కలిగిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు ; ప్రకాశవంతమూ – పరాక్రమశీలమూ అయి గంభీరమైన తన శరీరకాంతి అనే వర్షాకాల మందలి మేఘ సమూహం వంటివాడు; యాదాద్రిపై నెలకొన్న తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్నీ చూపుతున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు : శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దుష్ట (రాక్షస) సంహారం కోసం అవతరించినవాడు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయుడే తన హృదయస్థానంలో నిలుపుకున్నాడు. అటువంటి త్రైలోక్య సామ్రాజ్యలక్ష్మిని దైత్యులు తమ పాదాక్రాంతను చేసి అవమానిస్తే హరి ఊరుకుంటాడా? నృసింహావతారం ఎత్తాడు. రాక్షస సంహారం చేశాడు!
రత్నగర్భా అంటే భూమి. పర్వత, వనాదులతో కూడిన భూమి, రత్నగర్భం అంటే సముద్రం, నదీనదాలు, సరస్సులు కూడా రత్నగర్భాలే! సమస్త సృష్టి స్వరూపిణి అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క హృదయ పద్మాన్ని వికసింపచేసే కిరణాలను ప్రసరింపజేసే భాను బింబం శ్రీ లక్ష్మీ నారసింహుడు! శత్రు సంహార సమయంలో మెరుపు వలె వేగంగా కదిలే లక్షణం (కంపా) ఆయనకుంది. అట్లాగే శ్రతువు ఎంత బలవంతుడైనా చలించకుండా స్థిరంగా నిలబడే (అకంపా) లక్షణం కూడా ఆయనదే! కాని భక్తుల్ని చూస్తే ద్రవించి కరిగిపోయే కరుణాపూరిత హృదయం (అనుకంపా) ఆయన స్వంతమే1 అటువంటి కరుణా, దయా అనే అమృతరసాన్ని కురిపించడంవల్ల పరిపూర్ణమైన ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ పొందిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి!
చైతన్యవంతమైన (శుంభత్) పరాక్రమంతో శత్రువులపై విజృంభించిన గంభీరమైన ఆకారం ఆయనది! ఆ శరీర కాంతి వర్షాకాల మందలి నల్లని దట్టమైన మబ్బుల గుంపు (ప్రావృడం భోద కాండం)వలె ఉన్నదట! శత్రు సంహార సమయంలో తన పటుతర భుజబలవేగాన్ని (పటు భుజారంహ) చూపించిన యాదగిరిపై నెలకొన్న లక్ష్మీనృసింహ స్వామిని నమస్కరిస్తున్నాను అంటాడు కవి. ఈ చివరి పాదంలో “కొండ” అనే అర్థంలో “క్షమాభృత్” శబ్దాన్ని కవి వాడడంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఎంత క్షమామూర్తియో కూడా ధ్వనింపజేయడం కవి హృదయం! చక్కని అర్థవంతమైన పదాలతో సుందర సమాసాలను సృష్టించి కవి కవితానిర్మాణ దక్షత అనన్య సామాన్యమైనది! అటువంటి సత్కవిని కన్న తెలంగాణ నిజంగా కోట రత్నాల వీణ!
(సశేషం)
-శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు
(వ్యాఖ్యానం : బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం)
ఓనాడు చిన్న మావయ్య దోస్తుల యెంట తోట బాయికి ఈతకి పోతుండు. నన్ను గూడ రమ్మన్నడు. ఎంటనే అమ్మమ్మ అన్నది “ఒద్దురా, వాణ్ణి తీస్కపోకు, వానికి ఈత రాదు!” అని. పక్కన్నుంచి పెద్ద మావయ్య సర్రున అన్నడు “ఏ… మా ఊళ్ళ లత్కోర్ పోరగాళ్ళకి గూడ ఈతొచ్చు; పట్నమోళ్ళకి రాదంటె ఇజ్జత్ కా సవాల్! చల్, నీకు ఒక్క దినంల ఈత నేర్పిస్త… నడు!” అన్నడు. నాక్కొంచం రేషం పుట్టుకొచ్చింది! “ఓ…, నాకు భయమనుకున్నవా? ఇట్ల నేర్చుకుంట, చూస్కో!” అని అన్న. ఇజ్జత్ కోసం ఏదో అన్నగాని, లోపల మాత్రం మస్తు గుబులైతుండె! అమ్మమ్మ అన్నది “వారీ, నీకసలే మోటుతనం ఎక్కువ. వాన్కి ఈతొద్దు గీతొద్దు! నా మాట ఇను” అంటె, పెద్ద మావయ్యన్నడు “ఏ…, బద్రంగనే ఉంట లేవే అమ్మా! ఉట్టిగ గాదు లే – లొట్టలు కడ్త!” అని నచ్చజెప్పిండు. “లొట్టలంటె ఏంది మావయ్య?” అన్న. “బాయి దెగ్గర చూపిస్త తీ రాదు? నువ్వైతె నడు” అని తోట బాయికి తోల్కపోయిండు.
________________________________________
తోట బాయి అంటె అదొక పెద్ద దిగుడు బాయి. చిన్న మావయ్య, దోస్తులు లంగోటీలు కట్టుకోని, బాయి గట్టు మీద నిలబడి అంతెత్తు మీంచి దుంకుతున్నరు. నీళ్ళల్ల ఈదుకుంట మస్తు ఆటలు ఆడుతున్రు: ముట్టిచ్చుకునే ఆట, నీళ్ళకింద ఊపిరి బట్టే ఆట, నీళ్ళకింద మట్టి తెచ్చే ఆట…; ఇట్ల దూం మచాయిస్తున్రు. నేను బాయి గట్టున నిలవడి వాళ్ళ ఆటలు చూసి ఒకటే దుంకుడు, అర్చుడు! పెద్ద మావయ్య నా ఎచ్చులు చూసి, నేను తయార్ ఉన్న అని అర్తమైంది! “ఆ…, ఇంకేంది, దుంకు!” అన్నడు. నాగ్గూడ వాళ్ళతోని ఆడాలని ఉంది గాని, గుబుల్ తోని గుండె గుడ్ గుడ్ ఐతుంది! “ఆ, నువ్వు ఏందో లొట్టలు కడ్త అని అమ్మమ్మకు చెప్పినవు, ఏవి?” అన్న. లొట్టలంటె ఏందో తెల్వదు గాని, అవి లేకుంటె బాగుండు, మెల్లగ పిస్లాయించొచ్చు అని లోపల అనుకున్న! పెద్ద మావయ్య అన్నడు “లొట్టలంటె గివి. నడుంకి కట్టుకోని ఈత నేర్చుకుంటరు” అని చూయిన్చిండు. అవి బొంగు కట్టెల్లెక్క ఉన్నై. వాట్ని ఒక కట్ట కట్టి, ఓ చాంతాడు తోని నడుముకి కట్టుకోవాల్నట!
“ఇది కట్టుకుంటె మునిగిపోరా?” అని ఒణుకుడు కుతికె తోని అడిగిన!
“నీకు నమ్మకం లేకపోతె చూడు” అని ఒక బండరాయిని లొట్టల మీద ఉంచి కట్టి, నీళ్ళల్ల ఏసిండు. రాయి లొట్టల తోనే బుడుంగున మునిగి, దన్నుమని ఎంటనే తేలింది! పెద్ద మావయ్య అన్నడు “చూశ్నవా! ఇట్లనే నీ నడుం కి లొట్టలు కడ్త. నువ్వు అట్లనే తేల్తవు! కాల్జేతులు మాత్రం గిట్ల గిట్ల కొట్టాలె” అని గట్టిగ చేతులు, కాళ్ళు ఊపి చూయిన్చిండు! “బస్ గంతే, నీకు ఈత ఒచ్చినట్టే పో!” అన్నడు.
నా మొహం జెర్ర ఇచ్చుకుంది గాని కొంచం గుబుల్ ఇంక ఉండె! “నేను పైనుండి ఐతె దుంక!” అన్న. “ఐతె కిందికి పోదాం పటు!” అన్నడు. బాయి గోడ పొంటి మెల్లంగ మెట్లు దిగి నీళ్ళ పక్కకి ఒచ్చినం. రాంగనె పెద్ద మావయ్య నా నడుంకి చాంతాడు కట్టిండు. కట్టంగనె ఏమైందో గాని “లేడికి లేచిందే పరుగు” అన్నట్టు మస్తు జోష్ లకు ఒచ్చిన! “రెడీ స్టడీ వన్ టూ త్రీ!” అని, ఊపిరి మొత్తం బిగవట్టి, ఉరికి, నీళ్ళల్ల దుంకిన! ఖతం! ఆ మొదటి సారి ఒళ్ళు నీళ్ళల్ల మునుగుడు ఇప్పటికి యాదికున్నది! నోట్ల, ముక్కుల, కళ్ళల్ల, చెవులల్ల ఒక్కటే సారి నీళ్ళు పోయి పై ప్రాణాలు పైన్నే ఎగిరి పోయినట్టైంది! కాళ్ళు చేతులు ఆడలే…, దిమాక్ పనిజెయ్యలే! అంత నల్లగై పోయింది! దగ్గొస్తున్నది గాని అంతట్లనే మొహం నీళ్ళ కిందికి పోతుంది! అరుద్దామని నోరు దెరిస్తె జెరిన్ని నీళ్ళు లోపలి పోయి ఆగమాగమైతుంది! “ఇంగ ఐపోయింది రా దేవుడా” అనుకున్న! అమ్మా నాన్న యాదికోచ్చిన్రు! ఏడ్పొచ్చింది !! ఇంతల, గట్టు వైపు చూస్తె పెద్ద మావయ్య, చిన్న మావయ్య, ఆయిన దోస్తులు అందరు గట్టిగట్టిగ నవ్వుతున్రు. పక్కకు జూస్తె లొట్టలు అక్కడ్నే ఉన్నై! అంటె? నన్ను చిన్న పోరగాన్ని చేశి, లొట్టలు కట్టినట్టే జాదు జేసి, మొత్తం మీద లొట్టల్లేకుండనే బాయిలకు నూకిన్రన్నట్టు! ఇంగ నాకు రేషం పట్టలే! ఎట్లొచ్చిన్నో ఏమో గాని బైటికొచ్చి, గలీజ్ గలీజ్ శాపనార్దాలు ఒర్లుకుంట, పెద్ద మావయ్య పొట్టల గిప్ప గిప్ప గుద్దిన! పెద్దమావయ్యకేమో చీమ కుట్టినట్టు గూడ కాలే గాని, అందరు ఇంకా లాశిగ నవ్విన్రు ! అది చూశి నాకు ఏం జెయ్యాల్నో సమజ్ గాలే! ఏడ్చుదు శురూ చేశ్న!
అప్పుడు పెద్ద మావయ్యకు పాపం అనిపించింది! నన్ను దెగ్గరికి తీస్కున్నడు! “లే లే లే…, ఊర్కో ఊర్కో…, ఇప్పుడేమైంది? బానే ఉన్నవు గద? చిన్న పిల్లల్లెక్క ఏడుస్తరా?” అని బుజ్జగించిండు. నేను ఎక్కెక్కి ఏడ్చుకుంట “నన్ను లొట్టల్లేకుండ బాయిలకి దొబ్బినవు లే? ఉండుండు, మా నాన్నకి చెప్త! నీ లగ్గమైతది తీ!” అని అన్న!
పెద్ద మావయ్య మళ్ళ గట్టిగ నవ్విండు “ఓ…, మీ నాయిన పెద్ద తీస్ మార్ ఖాన్ తీ గాని…! ఒక ముచ్చట చెప్పు! నీకు లొట్టలు కట్టలే గద, బైటికి ఎట్లొచ్చినవు ర?” అన్నడు. నాకు షాగ్గోట్టినట్టైంది! ఆలోచించేంతల్నే మళ్ళీ అందరు నవ్విన్రు! ఈ సారి మాత్రం పెద్దమావయ్య నా తరఫ్ దారీ తీస్కోని, తత్తిమ్మా ఓళ్ళతోని అన్నడు: “ఏం రో?! పండ్లు జోర్ గ ఇకిలిస్తున్రు ! మీరందరు మొదట్ల ఇట్లనే చెయ్యలే?” అని! అప్పుడు వాళ్ళు జెర్ర గప్ చుప్ ఐన్రు! చిన్న మావయ్య దోస్తుల్ల ప్రసాదు అని ఒకడున్నడు. వాడు “మా అందరికి ఈ పంతులు గిట్లనే ఈత నేర్పిండు! ఇట్లైతెనే జెల్ది ఒస్తది, జెబర్దస్త్ గ ఒస్తది” అని అన్నడు. పెద్ద మావయ్య మస్తు షాన్ గ నవ్విండు “నేన్జెప్పలే!! ఒక్క దినంల ఈత నేర్పిస్త అనలే?!” అని అన్నడు. అప్పుడు ఇంగ నేను ఖుష్ “నాకు ఈతొచ్చిందోచ్…!!” అని అమ్మమ్మకి, తాతయ్యకి, అమ్మకి, నాన్నకి, దునియ మొత్తానికి అర్చి చెప్ప బుద్ది ఐంది !
పెద్ద మావయ్య తోని ఎదో అనాలె, కాని ఏమనాలె? షుక్రియ చెప్పుడు గూడ తక్కువ! దెగ్గరికి పొయ్యి, గట్టిగ పట్టుకున్న! మావయ్య నా నెత్తిమీద చెయ్యేసిండు!
మళ్ళ అంతల్నే పరాష్కం లకి దిగిండు. “ఇదంత ఉట్టిగ గాదు బిడ్డా! మీ నాయినకి చెప్పు, దావత్ ఇయ్యాల్నని!” అన్నడు! నేను తగ్గుతనా?! కళ్ళు తూడ్చుకుంట, నవ్వుకుంట, అదే షాన్ తనం తోని అన్న “ఇస్తం ఇస్తం…, మా హైద్రాబాద్ రా! జోర్దార్ దావత్ ఇస్తం!” అన్న! ఎంబడే, నేను చిన్న మావయ్య దెగ్గరికి పొయ్యి, చెయ్యి పట్కోని, గుంజుకుంట అన్న: “చల్, మనం నీళ్ళల్ల ముట్టిచ్చుకునే ఆట ఆడుకుందాం! నాకు ఈత ఒచ్చింది గద? ఇంగ లొట్టలొద్దు కట్టెలొద్దు…”!!
-కస్తూరి గౌతమ్ చంద్ర
Edication: MS (Syracuse University), MBA (UT Austin)
Occupation: Director of Operations at Sentient Energy (Electric Utilities Industry)
+1-972-998-7791
‘‘మొన్న రాత్రి మనం ఫంక్షన్ నుండొచ్చిన తర్వాత ఈ టేబుల్ సొరుగులో పెట్టిన నీ చేతి బ్రాస్లెట్ కనిపించడం లేదు ఏమైంది నాన్నా?’’
పలుకలేదు వరుణ్.
‘‘లాకర్లో పెడదామని చూస్తే లేదు. ఎంత వెతికినా దొరకలేదు.. ఒక్క రోజులోనే ఇంత మటుమాయమా?’’
‘‘ఇంకెక్కడో పెట్టి మర్చిపోయుంటావ్…. మళ్ళీ జాగ్రత్తగా వెతుకు సంధ్యా’’ అన్నాడు భార్యతో… ఎప్పుడూ బిజినెస్తో బిజీగా
వుండే కోటీశ్వరుడు, నగరంలో పేరైన వ్యాపారవేత్త ప్రకాశరావు.
‘‘లేదండీ… ఈ ర్యాక్లోనే ఉంచాను’’ నిర్ధారణగా అంది సంధ్య.
‘‘మరోసారి సరిగా వెతుకు’’ అంటూ హాల్లో కెళ్ళాడాయన.
మేడమీది నుండి ఆయన దృష్టి వీధి గేటువైపు మళ్ళింది.
ఎదురింటి రాజయ్య తన కొడుకుతోపాటు గేటుముందు నిలుచుండడం గమనించి లోపలికి పిలిచాడు.
‘‘ఏం రాజయ్యా ఇలా వచ్చావ్?’’ అంటూ పకరించాడు.
‘‘ఆయ్యగారూ…’’ మెరుపులా ప్రకాశరావు కాళ్ళమీద పడి భోరున విపించాడు రాజయ్య.
‘‘ఏంటిది రాజయ్యా…’’ కంగారుగా వెనక్కి జరుగుతూ అన్నాడు ప్రకాశరావు.
‘‘మమ్మల్ని మన్నించండయ్యా’’ అంటూ ఓ కవర్ తీసి ఆయన చేతిలో వుంచాడు రాజయ్య.
ఆదుర్దాగా అది తీసి చూశాడు ప్రకాశరావు.
అది… అది… గదిలో తన భార్య వెతుకుతున్న రెండు తులాల బంగారు బ్రాస్లెట్!’’
‘‘ఇది…. ఇది… నీకెలా దొరికింది రాజయ్యా?’’
అదోలా అడిగాడు ప్రకాశరావు.
అందుకు సమాధానంగా, తన కొడుకును ప్రకాశరావు పాదాలమీద పడేశాడు.
‘‘అయ్యగార్ని క్షమించమని అడగరా దౌర్భాగ్యుడా!’’ అన్నాడు బాధగా రాజయ్య.
‘‘నా తప్పు కాయండయ్యగారూ…’’ ఏడుస్తూ అంటున్న శంకర్ను లేవనెత్తాడు ప్రకాశరావు.
‘‘ఇంతకూ సంగతేంటి రాజయ్యా?’’
తలొంచుకున్న రాజయ్య పలుకలేదు.
‘‘రాజయ్యా… వరుణ్ కోసం మా ఇంటికొచ్చిన వీడు దీన్ని దొంగిలించాడా?’’
కాస్త కఠినంగానే అన్నాడు ప్రకాశరావు. ఉలిక్కిపడ్డాడు రాజయ్య.
‘‘లేదయ్యా… లేదు… అంతమాటనకండి… కూటికి పేదలమైనా గుణానికి మాత్రం కాదయ్యా…. జరిగిందంతా చెప్తాను!’’
అంటూ అంతా పూసగుచ్చినట్టుగా వివరించసాగాడు రాజయ్య.
*****************************************
‘‘ఒరే శంకర్… ఏమైందిరా? ఎందుకలా వున్నావ్?’’
తోటకూర కాడలా వాడిపోయిన వాడి వదనం, కన్నీటి చారలతో కూడిన శంకర్ చెంపలు చూస్తుంటే వరుణ్కు చెప్పలేని బాధ కలిగింది.
‘‘చెప్పరా… ఏం జరిగిందిరా?’’
వాళ్ళ చిన్న డాబా ఇంటిముందున్న వేపచెట్టు మొదట్లో దీనంగా కూర్చున్న తన మిత్రుడు శంకర్ పక్కనే తాను
కూర్చుంటూ అడిగాడు ఆ ఎదురింటి మేడిoటి అబ్బాయి, శంకర్ మిత్రుడు వరుణ్.
‘‘మా గౌరిని మా నాన్న అమ్మేస్తడంటరా వరుణ్!’’
‘‘ఆ!’’ ఊలికిపాటుగా చూశాడు వరుణ్!’’
అవున్రా! ఏడాది నుండి అంటనే వున్నడు మా నాన్న, ఈ కరోనా కరువు కాలం మన బతుకే మనకు బరువైతుంటే ఈ ఆవు
గౌరమ్మనెలా సాకేదిటరా? అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నడురా!’’
అంటు మిత్రుడి భుజంపై తలవాల్చి బావురుమన్నాడు శంకర్.
‘‘ప్లీజ్రా ఏడవకు!’’ మిత్రుడి కన్నీళ్ళు తుడిచాడు వరుణ్.
‘‘వరుణ్….గౌరి నాకు ప్రాణంరా! నేను తింటేనే అది తినేది. నిన్న పేరంటం అమ్మ తెచ్చిన అరటిపండు పెడితే…
ఆకలితోటున్నాగాని అది తిన్లేదు. నేను సగం పండు తిన్నంకనే గౌరి తిన్నదిరా!’’
అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు శంకర్.
‘‘ప్లీజ్ శంకూ ఏడ్వద్దు! ఎప్పుడూ జోక్లేస్తూ నవ్వించే నువ్వలా వుంటే నేను చూడలేనురా!’’
అంటూ ప్రేమ నిండిన బాధతో పదేళ్ల వరుణ్, తొమ్మిదేళ్ళ శంకర్ను కౌగిలించుకున్నాడు…. తోచిన రీతిలో ఓదార్చాడు. ఆపై,
అంతులేని ఆలోచనతో అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు వరుణ్.
‘అవును… గౌరి గంగిగోవులాంటిదంట! శంకర్కు అది ప్రాణం వంటిది. అది లేకుంటే వాడుండగలడా? చదవగలడా? తనతో ఆడగలడా?’
అనుకుంటూ ఎంతగానో ఆలోచించాడు… తెల్లారగానే ఓ నిర్ణయానికొచ్చి స్థిమితపడ్డాడు వరుణ్.
‘‘శంకూ, ఒరే శంకర్’’ అని పిుస్తూ, శంకర్ వాళ్ళ ఇంటి గేటు తెరుచుకొని లోపలికొచ్చాడు వరుణ్.
స్టూల్ పైన నిల్చొని, ఆవు గౌరి వీపును బ్రష్తో రుద్దుతున్న శంకర్ దగ్గరకు చేరాడు.
‘‘ఒరే వరుణ్… గౌరి వెళ్ళిపోవడం తప్పదంట కదరా!’’
ఏడుపు నడుమనే గౌరి గంగడోలును ముద్దాడుతూ వణికే కంఠంతో అన్నాడు శంకర్.
‘‘నో… నో… శంకర్… నిన్నొదిలి గౌరి వెళ్ళిపోకూడదు… నువ్వు హాపీగా వుండి నాతో ఆడుకోవాలంటే, గౌరి నీతోనే వుండాలి!’’
‘‘అదెట్లా?’’
‘‘అది… అది… ఇట్లా… ఇదిగో ఇది మీ నాన్నకివ్వు! గౌరినమ్మకుండా దీన్నమ్మితే, గౌరి తిండికి సరిపడా డబ్బులొస్తాయి!’’
అంటూ ఉత్సాహంగా ఓ కవరు తీసి శంకర్ షర్ట్ జేబులో వుంచాడు వరుణ్! సంకోచంగా చూశాడు శంకర్.
‘‘ఇది నాదేలేరా!’’ అంటూ శంకర్ భుజం తట్టాడు వరుణ్.
‘‘అయితే వరుణ్…. దీంతో నా గౌరమ్మ తల్లి నాతోనే వుంటదా? నాతోనే తింటదా? నాకు జరమొచ్చి పడుకుంటే ప్రేమగా నా ఒళ్ళంతా నాకుతదా?
సంభ్రమంతో కూడిన అపురూప భావంతో, ఆ కవర్ను జేబుపై నుండే గుండెకు హత్తుకున్నాడు…. ఆనందంగా గౌరినీ
వరుణ్నీ కలిపి కౌగిలించుకొని కోటి సుద్దుతో కూడిన ముద్దులెన్నో పెట్టుకున్నాడు శంకర్.
*****************************************రాజయ్య చెప్పిందంతా కళ్ళతో కన్నట్టుగానే చెవులతో విన్నాడు ప్రకాశరావు.
‘‘వరుణ్’’ అంటూ కొడుకును కేకేశాడు.
అందరూ భయపడ్డారు కొడుకునేం చేస్తాడోనని! భయం భయంగా తండ్రి దగ్గరకొచ్చాడు వరుణ్.
‘‘సారీ నాన్నా!’’ ఏడుస్తూ తండ్రి కాళ్ళకు చుట్టుకు పోయాడు.
‘‘లే…. నాన్నా…లే!’’ అంటూ కొడుకును లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు.
ఆపై అదే సందిటికి శంకర్ను కూడా చేరబిలిచాడు ప్రకాశరావు.
‘‘రాజయ్యా… సృష్టిలో తీయనిది స్నేహమని అంటారు. అది నిజమేనని… ఎల్లలులేని తన స్నేహ ధర్మాన్ని నిరూపించాడు
మా పిల్లవాడు! గోమాతను తల్లిలా భావించి, దానికి దూరం కాలేక తల్లడిల్లిపోయిన మీపిల్లవాడెంత జంతు ప్రేమికుడో నా
కళ్లక్కట్టింది రాజయ్యా… దయకు మించిన ధర్మం లేదని మీవాడు, స్నేహానికి మించిన సిరిసంపదల్లేవని మా వాడు…
తమ తమ ధర్మాల మర్మాు విప్పి చెప్పారు!’’
అంటూ చెమరించిన కళ్ళద్దుకున్నాడు ప్రకాశరావు.
‘‘అయ్యగారూ….’’ ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య.
‘‘రాజయ్యా… మన సంస్కృతిలో గోవుకున్న విలువను ఈ చిన్న పిల్లలు తెలియజేశారు. గోమాత అణువణువు
అమృతప్రాయమని, గోసంబంధిత ప్రతి అంశం అమూల్యమైనదని… శాస్త్రవేత్తలు సైతం నిరూపించిన నిజం. ఎన్ని అనారోగ్యాల
పాలౌతున్నా కూడా జనం ఆ నిజం గుర్తించడం లేదు.
ఇంతెందుకు… పురిట్లోనే తల్లిపోయిన నేను చిన్న నాటి నుండి… మా పల్లెలోనే గోవు తల్లి పాలతోనే పెరిగానన్న సంగతి
ఇప్పుడీ బాలజ్ఞానుల వల్లనే గ్రహించగలిగాను!’’
సన్నగా కంపించింది ప్రకాశరావు స్వరం.
‘‘అయ్యా…!’’ అయోమయంగా చూశాడు రాజయ్య.
‘‘ఎందుకంటే ప్రస్తుతానికి పదీ పాతిక దాకా దేశవాళీ గోవుల్ని కొందాం ఓ గోశాలను నడిపిద్దాం!’’
‘’అయ్యగారూ…’’ రాజయ్య కళ్ళ నుండి ఆనందబిందువులు రాలిపడ్డాయి.
‘‘అంతేకాదు రాజయ్యా… గోవుల్ని కబేళాకు తరలించే పాపపు పనినాపివేసే పనిలో పాల్గొందాం! కడదాకా కాడీకవ్వాలనాడిoపజేసే మన పాలతల్లిని…. జాతి సౌభాగ్యవల్లిని… మన గోమాతను కాపాడుకుందాం! సేంద్రియ ఎరువు పంటతో దేశ
ఆరోగ్య సంపదను సంరక్షించుకుందాం!’’
దృఢచిత్తంతో అంటూ… గోడుకున్న గోవిందుడి చెంతనున్న గోమాత పటానికి దండం పెట్టాడు ప్రకాశరావు!
అదంతా గమనించిన వరుణ్, శంకర్ ఆనందంతో కేరింతలు కొట్టగా…. ఆ శబ్దం విన్న గోవు గౌరి… అందుకు జవాబుగా
‘‘అంబా’’
అని అరవటంతో, ఆవు ఆశీర్వాదం పలికినట్టనిపించింది అక్కడున్న అందరికీ!
-కె.వీణారెడ్డి,
రచయిత్రి – కవయిత్రి
కథా సంపుటులు: కథావిపంచి-1, జీవన్మణులు,
కథావిపంచి-2, నిశాంత కాంతులు!
బిరుదులు: సాహితీ సామాజిక వేత్త,
మహిళా సేవారత్న!
+91-7337058025
సూర్యకిరణంతో పాటు మేలుకుని మొదలయ్యే నా దైనందిన జీవితం ఆ సూర్యకాంతితో పాటే ప్రయాణిస్తుంది. పొద్దున డ్యూటీకి పోతున్నప్పుడు ఉత్సాహంగా… సాయంకాలం ఇంటికి తిరిగిగొస్తూ నీరసంగా. నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలోని ఓ గురుకుల పాఠశాలలో టీచర్ని. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పటం హాయిగానే ఉంటుంది. కాని స్కూలుకు రానూ పోనూ ప్రయాణమే ప్రాణం మీది కొస్తుంది. ఏంజేస్తాం..! నగరాన్ని వొదిలి శివార్లకో లేక గ్రామాలకో వెళ్లిపోలేం. సిటీలో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు. పిల్లల చదువులు. ఇలా ఎన్నో కమిట్మెంట్స్. ఆరోజు మామూలుగానే స్కూలుకు బయలుదేరిన. మా స్కూలుకు పోవాలంటే ముందు పావుగంట నడిచి బస్టాండ్ చేరాలి. నాకు కావాల్సిన బస్సు రావాలి. ఖాళీగా ఉండాలి. నేను ఎక్కగలగాలి. ఆ తర్వాత బస్సు బయలుదేరిన గంటన్నరకు గానీ నేను స్కూలు మెట్లెక్కే అవకాశం లేదు. బస్సును పాయింట్ మీద ఆపేసి డ్రైవర్ ఎటుపోయిండో పత్తా లేడు. స్కూలుకు లేటైపోతున్న ఫికరు పట్టుకున్నది. బస్సెక్కి కూర్చుండి పది నిముషాలైంది. ఆ బస్సు ఏ టైముకు పోవాలో, అసలు దానికో షెడ్యూల్ ఉన్నదో లేదో కూడా తెలియదు. కింద ప్లాటుఫారం మీద నిలుచున్న కండక్టర్ బేరం కోసం అరిచే చిల్లర వ్యాపారిలా ప్రయాణికుల్ని బస్సు ఎక్కమని పిలుస్తున్నడు. ఆర్టీసీలో ఈ కొత్త పద్ధతి ఎప్పుడు పెట్టారోగానీ బస్సు సీట్ల వరకు నిండితేగాని కదుల్తలేదీ మధ్య. నాకో పక్క విసుగ్గానూ ఆందోళనగానూ ఉన్నది. బస్సులోకి ప్యాసింజర్ల కన్నా ఎక్కువగా తినుబండారాలు అమ్ముకునేటోళ్లు వొచ్చిపోతున్నరు. “ సమోసా.. వేడివేడి సమోసా..” చేతిలో చిన్న గంప పట్టుకొని ఒకతను వొచ్చాడు. అతని రాకతో బస్సు సమోసాల వాసనతో ఘుమఘుమలాడి పోయింది. “వాటర్ బాటిల్.. వాటర్ బాటిలండి” మరొకతను. “పేపర్ సార్.. ఈనాడు..సాక్షి.. జ్యోతి..” కిటికీ అద్దం పక్కకు జరిపి బయటకు చూస్తున్నా. డ్రైవరు వస్తున్న జాడలేదు. “అల్లమురబ్బా.. అల్లమురబ్బా.. పైత్యానికి మంచిది అల్లమురబ్బా..” కొందరు కొనేవాళ్లు తమకు కావాల్సినవి కొంటున్నరు. ఇట్లాంటి చిరుతిండ్లు, బయట పదార్థాలు తినడం అలవాటు లేదు గనుక నేను పట్టించుకోలేదు. బస్టాండు చాలా రద్దీగా ఉన్నది. బతుకమ్మ పండుగ, ఆపైన దసరా పండుగ రోజులు. పట్టణాలు సెలవు తీసుకొని పల్లెలకు తరలిపోతున్న సమయం. ఎక్కడెక్కడి దూరప్రాంతాల నుంచో వచ్చిన ఆడా మగా పండుగల కోసం ఉరుకులాడుతున్న హడావిడి కనిపిస్తున్నది. అప్పుడే డోర్ తెరిచి ఒక్క జంపుచేసి స్టీరింగు ముందు కూర్చున్న డ్రైవరు బస్సు స్టార్టు చేశాడు. “రండి.. ఎక్కండి. బస్సు పోతున్నది” కింద కండక్టరు హడావిడి చేస్తున్నాడు. “ ఏంది సార్.. ఎక్కెక్కుమని తొందర జేస్తవు. లోపల ఒక్క సీటన్న ఖాళీ లేదు. ఊరు చేరేటందుకు రెండు గంటలైతది. అంతసేపు ఎట్ల నిలవడుతం” కండక్టర్ బలవంతం మీద బస్సెక్కినోళ్లు చిరాకు పడుతున్నరు. “ ఎందుకట్ల తొందరపడుతవు.. వెనుక సీట్లున్నయి జర సూడు పెద్దమనిషీ..!” కండక్టరు సముదాయింపు. “ ఒక్కటి సూత లేదు. అన్ని నిండినయి” “ ఫర్వాలేదు ఎక్కన్నా. ఎంత.. అర్ధగంట. ప్రజ్ఞాపూర్ల పదిమంది దిగుతరు” మొత్తానికి బస్సు బయల్దేరింది. ఆ టైములో హఠాత్తుగా ఒక అమ్మాయి బాణంలా లోపలికొచ్చింది. ఆమెకు పదేళ్లకు మించి ఉండవు. సన్నగా, అమాయికంగా ఉన్నది. ఆమె రెండు చేతుల్లో రెండేసి చొప్పున కాల్చిన మక్క కంకులున్నయి. వాటిని పట్టుకొని కదులుతున్న బస్సు ఎట్లా ఎక్కిందో అర్థంకాక ఆశ్చర్యపోయాను. “ లేత కంకులు సార్.. గరం గరం కంకులు. ఒక్కటి పది రూపాయెలు” గట్టిగా అంటూ నావైపు వొచ్చింది. ఆమె చేతుల్లో కంకుల్ని పట్టించుకోకుండా నేను తననే చూస్తుండిపోయిన. “ ఒక్కటి తీసుకో అన్నా.. లేత కంకి. మంచిగుంటది” “ ఓ పోరీ.. ఓపక్క బస్సు నడుస్తుంటె నీ బేరాలేంటిదే. దిగు జల్దిన” టిక్కెట్లిస్తున్న కండక్టర్ కోపంగా అరిచాడు. ఆ పిల్ల కండక్టరు అరుపుల్ని పట్టించుకోకుండా “ అన్నా.. తీస్కో అన్నా. లేత కంకులు..” నా దగ్గరే నిలబడింది. ఆ పాపను చూస్తే జాలేసింది. లేత కంకి మీద పెద్దగా ఇంట్రస్టు లేకపోయినా డబ్బిచ్చి కంకి తీసుకున్నా. కదుల్తూన్న బస్సులోంచే పాప దిగిపోయింది. నిజంగానే కంకి లేతగా రుచిగా ఉన్నది. మక్క కంకి ఆరోగ్యానికి మంచిదని కూడా అంటుంటరు. రోజూ సిటీలో పెద్దపెద్ద హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో వందల్లో డబ్బు తగలేసి ఎగబడి తినే జంక్ ఫుడ్స్ కంటే ఎన్నో రెట్లు మంచిదనిపించింది. లేకలేక ఒక మక్క కంకి తింటూ ఆరోగ్య అంశాలు తలపోస్తున్నందుకు లోపల నవ్వుకున్నా. కిటికీలోంచి కదిలిపోతున్న పరిసరాలు చూస్తూ బస్సు సిటీ లిమిట్స్ దాటేసరికి నా కంకి తినడం కూడా పూర్తయింది.
ఒకరోజు సాయంత్రం ఐదు ప్రాంతంలో స్కూలు నుంచి ఇంటికొస్తూ బస్టాండులో దిగాను. పొద్దంతా పనితోనూ, ప్రయాణంతోనూ అలసి ఇంటికి చేరుకొని నాలుగు మెతుకులు మింగి నిద్ర పోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేను. రెండు రోజులుగా జోరుగా వానలు కురిసి అప్పుడే పల్చబడుతున్న తుపాను ప్రభావం. ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి వాతావరణం చలిగా ఉన్నది. అప్పుడప్పుడు కొద్దిగా తెరిపిచ్చినా ముసురుపడుతూనే ఉన్నది. బస్టాండులోంచి బయటికిపోతూ ఆగిపోయిన. రోడ్డుకు ఇరువైపుల వరుసగా కూర్చుని కొందరు కంకులు కాలుస్తున్నరు. చిటపట చప్పుడు. గాలిలో కలుస్తున్న కమ్మని వాసన. ఆ వాతావరణంలో వేడివేడిగా కంకి తినాలన్పించి అటు నడిచాను. జోరతట్టు మీద కూర్చొని దీక్షగా కంకులు కాలుస్తున్న పాపని వెంటనే గుర్తుపట్టిన. నేను రావడాన్ని గమనించి ఆమె ఓమారు చూసి మళ్లా తన పనిలో మునిగింది. మొన్న బస్సులోకి వొచ్చి నాకు కంకి అమ్మిన పాప. ఆమె ముందు ఒక రాతిబండ. దానిమీద ఇనుపతట్ట. అందులో నిప్పుకూ బూడిదకూ నడుమ సన్నటి మంటతో కాలుతున్న బొగ్గులు. విసనకర్రతో విసురుతూ కుడిచేత్తో కంకులు మర్లేస్తున్నది. పక్కన చిన్న ఎలితె బొంగు భూమిలో పాతి దానికి నిలువుగా ఒక పాత చెత్తిరి తాడుతో కట్టింది వాన నుంచి రక్షణగా. ఒక పాత ముక్కాలిపీట మీద చిన్న ఈత తట్టలో అప్పటికే కాల్చిపెట్టిన కొన్ని కంకులు వరుసగా పేర్చి ఉన్నయి. ఆ పిల్ల వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్నట్టు బలహీనంగా ఉన్నది. చటుక్కున నాకు బాలకార్మిక చట్టం గుర్తొచ్చింది. ఏం చేస్తున్నయి ఈ చట్టాలన్నీ? ఆ పాప బాల్యంలోనే అంత బరువు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు? ఆ వయసులో బాలికను ఏ స్కూలుకో పంపకుండా ఆమెచేత చాకిరి చేయిస్తున్నదెవరైనా నేరస్థులే. అట్లా కాకుండా తానుగా చేస్తున్నా అదీ నెరమే. నన్ను పట్టించుకోకుండా తలవంచి కాలుతున్న కంకుల్ని పట్టిపట్టి చూస్తున్నది. బొగ్గుమరకలు నిండిన పాత లంగా మీద అసలు రంగేదో తెలియకుండా వున్న బుషట్ తొడుక్కున్నది. “లేత కంకి ఒకటియ్యి బుజ్జీ.. యెంత..?” అడిగిన. ఆ పిల్ల చప్పున తలపైకెత్తి చూసి “పది రూపాయలన్నా” అనిచెప్పి బొగ్గు కణికెల మీద కాలుతున్న కంకుల్లోంచి ఒకటి తీసింది. దాన్ని చేత్తో శుభ్రంగా తుడిచి పక్కన గిన్నెలో ఉన్న ఉప్పుకారం పొడిలో నిమ్మకాయ బద్దను ముంచి కంకిమీద రుద్దింది. సంతృప్తి పడినంక జొన్నబూరులో ఆ కంకిని భద్రంగా మడత చుట్టి నా చేతికి అందించింది. నేనిచ్చిన పది రూపాయల నోటు తీసుకొని జాగ్రత్తగా జోరబొంత మడతల కింద పెట్టుకున్నది. “ నీ పేరేంది బుజ్జీ” అడిగాను. “నాపేరు నీలమ్మ” అనిచెప్పి తన యజ్ఞాన్ని తిరిగి కొనసాగించే మునిలా కుంపట్లో కంకులు మర్లెయ్యసాగింది. నేను ఇంకేం మాట్లాడకుండా ఇంటిదారి పట్టిన.*****************************************వైరల్ జ్వరంతో బాధపడుతూ నాలుగు దినాలు స్కూలుకు పోలేదు. అయిదో రోజు కొంచెం కోలుకున్న. ఇంకా వెళ్లకపోతే ఉన్న కొలువు ఊడుతదని భయపడి ఓపిక చేసుకొని వలసపక్షి మాదిరి డ్యూటీకి బయలుదేరిన. బస్టాండ్ దగ్గరికి రాగానే మక్కకంకి మీదికి మనసు పోయి నీలమ్మ పెట్టుకునే దుకాణం దిక్కు చూసిన. అదే దృశ్యం. నిప్పులమీద కంకులు తిప్పుతున్న లేత చేతులు. బూడిద దుమ్ముతో మసిబారిన అమాయకమైన మొఖం. దగ్గరకువెళ్లి ఆమెను నవ్వుతూ పలకరించి ఓ కంకి కొనుక్కొని చిల్లరలేక వంద రూపాయల నోటిచ్చిన. నీలమ్మ చిల్లర కోసం జోరతట్టు మడతల్లో కొద్దిసేపు వెతికి బాగా నలిగిన ఎనిమిది పది రూపాయల నోట్లు అందించింది. “అన్నా.. ఇంకో పది రూపాయలు లేవన్నా.. మళ్ళొచ్చినప్పుడు ఇస్తలే” అన్నది అర్థింపుగా. నేను మాట్లాడలేదు. మంటల వేడిలో మోటుతనం పూసుకున్న ఆమె లేత చేతుల వంక చూసి బాధ కలిగింది. ఇంత చిన్న వయసులో అంత బరువు బాధ్యతలు. వెనుదిరిగి నేను వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్న. ఆ విధంగా నా ఉద్యోగానికీ, ఇంటికీ రోజూ నేను జరిపే రాకపోకల నడుమ పాప.. ఆమె కాల్చిఇచ్చే మక్కకంకి నాలో ఒక భాగమైనయి. హఠాత్తుగా ఒక రోజు నీలమ్మ కన్పించలేదు. ఆమె కూర్చునే చోట ఆమెకు ఆదిశేషునిలా నీడపట్టే నల్లచెత్తిరి, పక్కన ముక్కాలిపీట కూడా కనిపించలేదు. ఆవేళ ఎందుకో రానట్టున్నది. అక్కడే కొన్ని నిముషాలు ఆగి చూసిన. పక్కన మక్కబుట్టలు అమ్మేవాళ్ళు కూర్చుని ఉన్నరు. వాళ్ళను అడుగుదామనుకొని అప్పటికే స్కూలుకు ఆలస్యమవుతున్న నేను ఇంక ఆగలేక వెళ్లిపోయిన. మళ్ళా సాయంత్రం తిరిగొస్తున్నప్పుడు చూస్తే పాప కనిపించలేదు. మరి కొన్ని రోజులు గడిచినయి. అయినా ఆమె రాలేదు. ఆ తోవలో పోతున్నప్పుడల్లా జ్ఞాపకమొచ్చేది. నిజానికి ఆ పిల్ల నాకేమీ కాదు. ఏ అనుబంధం మా నడుమ లేదు. కానీ ఎందుకో ఆ పాపను మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులుగా రావడం లేదంటే తనకేమన్నా అయిందా అన్న ఆలోచన. ఏదో వెలితి. మనసులో చిన్న మరక. తనకేదన్నా సాయం చెయ్యలేక పోయానన్న భావన నాలో ఉన్నట్టు అనిపించింది.
కాలం వర్తమానాన్ని భూతకాలంలోకి నెట్టుతూ పోతుంటే నేను నా యాంత్రిక జీవన సరళిలో కదిలిపోయాను. రెండురోజుల సెలవుల తర్వాత ఆదినం సోమవారం అనుకుంటా. బస్సుస్టాండులోకి నడుస్తుంటే హఠాత్తుగా నా దృష్టికి నీలమ్మ కూర్చునే చోట ముక్కాలిపీట కనిపించింది. దాని పక్కనే ఎలితె బొంగుకు కట్టి నిలబెట్టిన నల్లచెత్తిరి. కింద రాతిబండ మీద ఇనుపతట్ట. నిప్పుకణికెల పైన కాలుతున్న కంకులు. స్కూలు లేటవుతున్న హడావిడిలో ఆమె కోసం చూడకుండా లోపలికిపోయిన. చిన్నగా ముసురు పడుతున్నది. బస్సు కదిలింది. గేటుదాటి బస్సు బయటికి పోతుంటే విండోలోంచి అవుతలికి చూస్తే దారిపక్కన చెత్తిరి కింద ఏకాగ్రతగా కంకులు కాలుస్తున్న పాప కనిపించింది. సాయంత్రం తిరిగొచ్చినప్పుడు బస్సు దిగగానే ఆమె దగ్గరకు నడిచి పలుకరించాను. “ఇన్ని దినాలు ఏమైపోయినవు బుజ్జీ .. కనపడలేదు” అన్నాను. నన్ను చూడగానే గుర్తుపట్టి నీలమ్మ నవ్వింది. “ అన్నా.. బాగున్నవా” అని పలుకరించి ఇంకోమాట లేకుండా వెంటనే జోరతట్టు కింది నుంచి పది రూపాయల నోటు తీసి “అన్నా.. మీ పైసలు. మొన్న మీకు పది తక్కువిచ్చినగద” అన్నది. నిజానికి ఆ సంగతి నాకు గుర్తులేదు. పది రూపాయలు పెద్ద మొత్తం కాదు గనుక మరిచిపోవచ్చు. కానీ ఇన్నిరోజుల తర్వాత కూడా పాప గుర్తుపెట్టుకుంది. ఏదో స్పర్శ మనసును తాకినట్టు అనిపించింది. “ఉండనియ్యిలే పాపా.. మరి కంకి తినిపియ్యవా..” అన్నాను నామాటకు ఆ పిల్ల కండ్లు మెరిసినయి. నోటు మళ్ళా జోరతట్టు కింద పెట్టుకొని జోరసంచిల నుంచి లేత కంకి ఒకటి తీసి జాగ్రత్తగ బూరు తీసి కాల్చసాగింది. సవ్యసాచిలా కదులుతున్న ఆమె లేత చేతుల వంక చూసిన. ఎడమ చెయ్యి విసనకర్ర ఊపుతుంటే కుడిచెయ్యి నిప్పుల్లో కంకిని కదిలిస్తున్నది. “ఇన్ని రోజులు యాడికిపోయినవు బుజ్జీ.. కనిపించలేదు” “మా తాత సచ్చిపోయిండన్నా.. అందుకే రాలే” “ ఏమైంది మీ తాతకు” “ చాన దినాల నుంచి పాణం బాగలేదు” “ చిన్న పిల్లవి.. నువ్వీ పని జేస్తున్నవేంది. స్కూలుకు పోవా..” “ మొన్నటిదాక పోయిన. నాలుగో తరగతిల ఉన్న. ఇప్పుడింక పోను” “ అదేంది ఎందుకు” “ గిప్పుడు ఇంక సదువు కల్వదన్నా.. ఏదన్నా పనిజేసుకోవాలె. అందుకే మక్కకంకులు అమ్ముతన్న” “నువ్వమ్ముడేంది పాపా.. మీ అమ్మా నాయనా లేరా?” ఆమె సప్పుడు జెయ్యలేదు. కానీ ముఖంలో దిగులు కమ్ముకొని బొగ్గుమరకల కన్నా చిక్కగా గూడుకట్టింది. “మా నాయిన లేడు. నా చిన్నతనం నుంచే లేడు. ఏమైండో తెల్వది. ఊర్ల అందరేమో నాయిన నా చిన్నప్పుడే సచ్చిపోయిండని అంటరు. కానీ మా అవ్వనేమో ఆయన పనికోసం మస్కట్ పోయి ఇంక రాలేదంటుంది” “ ఎంత కాలమైంది మీ నాయన పోయి” “ అదికూడ నాకు తెల్వది. నాకు బుద్ధి తెల్వకముందే పోయిండట” “ మరి మీ అమ్మేం జేస్తది” “ కూలికి పోతది. మా ఇంట్ల నేను, అవ్వ, చెల్లె, తాత, నల్గురం ఉంటం. ఇంక గిప్పుడు తాత సూత లేడు. మొన్ననే సచ్చిపోయిండు. ఇంతకుముందు ఈ కంకుల దుకుణం ఆయన్నే నడిపిండు. ఎప్పుడన్నా నా బడికి సెలవున్నప్పుడు తాతకు సాయం జేసేటందుకు వొచ్చేదాన్ని. ఇప్పుడు తాత లేడుగద.. ఇగ ఇప్పటిసంది ఈ పని నేనే జేస్త” ఇనుపతట్టలో కంకిని జాగ్రత్తగ మర్లేసి కాలుస్తూనే అన్ని వివరాలు చెప్పింది. నేనేం మాట్లాడకుండా ఆమెనే చూస్తుండిపోయిన. మనసులోంచి సానుభూతి పొంగుకొచ్చింది. ఆ పిల్ల పరిస్థితి నన్ను బాగా కదిలించింది. ఈలోగా నీలమ్మ కంకి బయటికితీసి దానికి అంటిన బూడిది దులిపింది.“ ఉప్పు కారం రుద్దుమంటవా అన్నా” అని అడిగింది. తలూపాను. నిమ్మకాయ ముక్కతో ఉప్పుకారం రుద్ది జొన్నబూరులో చుట్టి అందించింది. పర్సులోంచి పదినోటు తీసి ఇచ్చిన. నావైపు సాదరంగా చూస్తూ అందుకున్నది. పాపతో ఇంకా మాట్లాడుతూ వుండే టైము లేదు. అందుకే తొందరగా పోయి బస్సెక్కిన. బస్సు కదిలిపోయే సమయంలో నీలమ్మ ఎగపోసుకుంట ఎదురునుంచి పరిగెత్తుకొచ్చింది. డ్రైవరు ఏమూడ్ లో ఉన్నాడోగాని ఆమెను చూసి తిట్టుకోకుండా బస్సాపిండు. హడావిడిగా బస్సెక్కి నేను కూర్చున్న సీటు వద్దకొచ్చింది. “అన్నా.. మొన్న నీకు ఇయ్యాల్సిన పదిరూపాయలు” అని పదినోటు నా చేతిలో పెట్టబోయింది. షాక్ తిన్నాను. ఆమె అమాయకత, నిజాయితీ నన్ను కట్టేసినయి. నోరితెరిచి ఒక్కమాటా మాట్లాడలేక పోయాను. ఆమె తిరిగిచ్చే డబ్బులు తీసుకోవాలా? వొద్దులేమ్మని ఉంచుకోమనాలా? లేక ఆమె నిజాయితీకి మెచ్చి ఆ పదికి మరికొన్ని డబ్బులు కలిపి ఆమెకే ఇచ్చి సంతోషపెట్టాలా? ఇవేవీ చేయకుండా మౌనంగా ఉండిపోవాలా? నా ఆలోచనలు సాగుతుండగనే ఆమె డబ్బు నా చేతిలో పెట్టి బస్సు దిగిపోయింది. వెనుక నుంచి చేష్టలు దక్కి బొమ్మలా చూస్తుండి పోయిన. ఒక్కక్షణం ఆ సందర్భంలో.. సన్నివేశంలో నేను లేకపోయివుంటే బాగుండేదనిపించింది. బస్సు వేగం పుంజుకుంది. ఆరోజుకి నీలమ్మా, నేనూ ఎవరి దారుల్లో వాళ్ళం కదిలిపోయాం. ఆ పాప ఏ భావమూ లేకుండా ఎప్పట్లాగే మామూలుగనే వుండవచ్చు. ఎంత అనుకున్నా నేను మామూలుగా ఉండలేకపోయాను. ఎంత అణుచుకున్నా ఏదో గిల్టీనెస్.
కవిత్వాన్ని సమాజమెప్పుడూ గౌరవిస్తుంది. అటువంటి కవిత్వం ఎంత విస్తృతంగా వస్తే, ఎంత మంది వ్రాస్తే అంత మంచిది. కానీ, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా అని యోచించాలి. పోటెత్తుతున్న కవిత్వాన్ని కాలం వస్త్రగాలం పట్టినప్పుడు, నిలువగలగాలి కవిత్వం. నిర్దాక్షిణ్యంగా వడబోసే శక్తి కాలానికి ఉంటుంది. అందుకే కవులు కవిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. కవిత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి కొన్ని విషయాలను స్పృశించుకోవడం అవసరం. కవిత్వ నిర్వచనాలను, ప్రత్యేకతలను, కవిత్వ కళను, నైపుణ్యాలను చర్చించుకుందాం.
కవులు ఎన్నుకోబడని శాసనకర్తలు, “పోయెట్స్ ఆర్ అన్-ఎక్నాలెడ్జెడ్ లెజిస్లేటర్స్”
అంటాడు షెల్లీ. ఎన్నుకోబడని, కవులు మన చుట్టూ ఉంటారు. దాశరథి లాంటి కవి ‘కవిత్వం అంటే నాకొక వెర్రి’ అన్నాడు. ప్రజాసంఘంలో ఉండే కవికి ఎంతో గౌరవమిస్తూ, “ కవిరేవ ప్రజాపతిః” అన్నారు. కవి అనేవాడు బ్రహ్మతో సమానమన్నారు. ఎప్పుడైతే కవిత్వం పలుచగయినా, హీనమైనప్పుడైనా ఎగతాళి కూడా చేయబడుతుందని ఆనాటినుండి ఈనాటివరకు చూస్తూనే ఉన్నాం. ఒకప్రక్క బలమైన కవిత్వం వస్తుంటే, మరోప్రక్కన పలుచనైన కవిత్వమూ వస్తున్నది. పలుచని కవిత్వాన్ని సమాజం నిరసిస్తూనే ఉన్నది. అందుకే కవిత్వం రాయాలంటే తపస్సు చేసినట్టుచేయాలి. “నానృషిః కురుతే కావ్యమ్” ఋషి కానివాడు కవికాడని అన్నారు పూర్వీకులు. ఋషి అంటే, ఒక సుదీర్ఘకాలం తమ శక్తులన్నీ ఒకే విషయంపైన కేంద్రీకరించడమన్నమాట. బహుశా ఆనాడు అడవుల్లో ఈ విధంగా చేసి ఉండవచ్చు. శక్తులన్నీ అన్నప్పుడు, అవి 1.మానసిక శక్తి 2. బౌద్ధిక శక్తి 3. భౌతిక శక్తి అనే ఈ మూడింటికి శక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే కవిత్వాన్ని రాసే ఋుషి అవుతాడు. కవి ఈ మూడు శక్తులకు తోడు వాక్శక్తి కూడా కలిపి ఏకాగ్రతతో ప్రయోగిస్తే రచనా నైపుణ్యం పెరుగుతుంది. సంప్రదాయమైన పదజాలం ఉపయోగిస్తే అది సంప్రదాయవాదమేమీ కాదు. కేంద్రీకరించడం కీలకమైంది. ఆనాడు అడవుల్లో చేసిఉండవచ్చు, ఈ నాడు సమాజంలో ఉండి కూడా చేయవచ్చు. కవిత్వాన్ని నిండుగా, గంభీరంగా, పరిపూర్ణంగా ఉండేలా రాయాలి.
“దర్శనాత్ వర్ణోచ్చాద రూడే లోక కవిశ్రుతిః ” అన్నారు.
దర్శంచినదాన్ని వర్ణించేవాడే కవి. దేన్ని దర్శించాడు కవి? ఆనాడు ఇతిహాసాలు, పురాణాలు దర్శించి ఉంటారు. దర్శించాలంటే జీవితంలోకి వెళ్లాలి. జీవితం వినా మరొక ప్రపంచమేలేదు. ఇవ్వాళ తత్త్వానికిగాని, శాస్త్రానికిగాని, కవిత్వానికిగాని, మూలం ఎక్కడ అంటే జీవితమే భూమిక. ప్రపంచమే భూమిక. కాబట్టి మూలాల్లోకి, జీవితాల్లోకి వెళ్ళాలి. వర్ణించడమంటే ఏమిటి? దర్శించినదాన్ని వర్ణించగలగాలి, సమగ్రంగా రాయాలి. ఏదైతే చూసామో దాన్ని చెప్పడం, ఉన్నది అందమైతే అందంగా చెప్పడం, అందంగా భావించడం. దుఃఖాన్ని ఏడుపొచ్చే విధంగా చెప్పడం! కోపాన్ని అవతలి వాళ్ళకు కోపం వచ్చే విధంగా,ఆశ్చర్యాన్ని మరింత ఆశ్చర్యకరంగా,వికారాన్ని మరింత వికారంగా వర్ణించగలగాలి. అందాన్ని మరింత అందంగా చెప్పగలగాలి. ఉన్నది అందమైతే ఆ అందమంటే ఏమిటి? అని చెప్పడం వర్ణన. వర్ణన చేయగలిగేవాడు కవి అని వాడుక. వర్ణన అంటే ఎక్కువ చేసి చెప్పటం.
వర్ణించడానికి పరికరాలు సమకూర్చుకోవాలి. ప్రాచీన లాక్షణికులు, ఆలంకారికులు కవిత్వాన్ని గురించి నిర్వచిస్తూ “శబ్దార్థౌ సహితౌ కావ్యం” అన్నాడు భామహుడు. శబ్దార్థాలతో కూడుకొని ఉండేదే కవిత్వం అన్నారు. శబ్దాలు,అర్ధాలు రెండూ తప్పనిసరిగా ప్రతిభాషకూ ఉండాలి. అర్ధం లేని మాట అనేది ఉండదు. ఈ రెండు ఉన్నంతమాత్రాన కవిత్వం అంటామా?
అంటే, భామహుడు “కావ్యం అలంకారార్ధం” అన్నాడు. అందంగా, అలంకరించి శబ్దాన్ని చెప్పాలని అన్నాడు. మాట్లాడే మాటలనుండి ఒక అందాన్ని తీసుకురావాలి, ఒక అలంకారాన్ని తీసుకురావాలి. భాషలో ఉండే శబ్దాలను, అర్ధాలను ఉపయోగిస్తూ అలంకారాలను తయారుచేయాలి.
ఉన్నదాన్ని తీర్చిదిద్దాలి, మరింత శోభాయమానంగా అలంకరించగలగాలి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని ఉన్నవి. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేసినపుడు చర్చించవచ్చు.
మాట్లాడే మాటలను అలంకరించి చెపితే చాలా? బాగా అలంకరించుకున్నంతమాత్రాన అందంగా ఉన్నట్టా? ఎక్కువ పౌడర్ మేకప్ వేసుకుంటే అందంగా ఉంటారా? అలంకారాలే కవిత్వమా? కాదు.
అలంకారాలు ఎక్కువవేసినా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత తగుతుందో అంత ఉండాలి. ఏ వస్తువు ఎక్కువ ఉపయోగించవద్దు. ఉచిత రీతిన ఉండాలి. దానినే ‘ఔచిత్యం’ అంటారు, “ఔచిత్యం రససిద్ధస్య స్థిరం” అన్నాడు క్షేమేంద్రుడు. ఇది కీలకం. ‘ఔచిత్యం’ ఉంటేనే రసం సిద్ధిస్తుంది అన్నాడు. “రీతి ఆత్మ కావ్యస్య” అన్నాడు వామనుడు. అంటే పద్ధతి ఉండాలని అర్థం. అర్థం, రీతి ఉంటె కవిత్వం అయిపోతుందా?
రీతి అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, రీతి అంటే,”విశిష్ట పదరచనా రీతిః” అన్నాడు. అంటే మంచి పదాలను, విశేషమైన పదాలను ఏరి కూర్చడమే రీతి. నడవడిక అనేది రీతి, శైలి. అంటే, సరైన పాదాలను ఏర్చి కుర్చాలి అన్నాడు.
శ్రీశ్రీ రీతిని నిర్వచిస్తూ,”సరైనటువంటి మాటల్ని సరైనచోట, సరైనవిధంగా ప్రయోగించడమే కవిత్వరీతి“ అన్నాడు. కాలరిడ్జ్ “బెస్ట్ వర్డ్స్, ఇన్ బెస్ట్ ప్లేస్“ అన్నాడు. మంచి పదాలను మంచి స్థానంలో రచించడమే కవిత్వం. అయితే, మంచి పదాలను మంచిస్థానం దగ్గర రాయడం అనేదాంట్లోనూ సమస్య ఉన్నది. ఏ పదం ఎలాంటి చోట అనే విషయం. మనం ఉపయోగించే పద్ధతిని బట్టి, థాట్ ను బట్టి కూడా మంచిగా రాణించడం కవిత్వం అవుతుంది. చెప్పాల్సిన అంశానికి తగినట్టుగ చెప్పాలి. లేకుంటే అర్థం మారిపోతుంది. ఉదాహరణకు, తప్పుడు ప్రదేశంలో ఉంటె, తాటిచెట్టు క్రింద కూర్చుంటే ఏమంటారో మనకందరికీ తెలిసిందే! మంచి అంటే అర్థం ఏమిటి? లోకం ఒప్పుకునేదే! లోకం సమ్మతించేదే మంచి. లోకం ఒప్పుకునే రీతిలో ఉండాలి. మంచి అనేది నీతికి సంబంధించింది కూడా! గొప్పవైన పదాలను తీసుకొని మంచి స్థలంలో నిర్ణయించి ఉపయోగించి రాయడం అనేది కీలకమైనది. కవిత్వ రచనలో 1. భావాలు, 2. భావోద్రేకాలు (తీవ్రమైన భావాలు), 3. భావోద్వేగాలు (సెంటిమెంట్) అనేవి ముఖ్యమైనవి. అయితే, సాధారణ భావాలు,తీవ్రభావాలు, ఉద్వేగంతో కూడిన భావాలు. ఈ మూడింటిని వరుసగా కూరుస్తే కవిత్వమవుతుందా? అంటే అదికూడా కాదు. ఈ భావాలనూ, భావోద్రేకాలను, భావోద్వేగాలను పేర్చేప్పుడు నైపుణ్యంగా రాస్తూ పోవాలి. ఇక్కడ ముఖ్యవిషయం మరోటున్నది. ప్రాచీనులు ‘రసం’ అన్నారు. “వాక్యమ్ రసాత్మకం కావ్యం” అన్నారు. అంటే రసాత్మకంగా ఉండే రచన మాత్రమే కవిత్వం అవుతుంది. ఇది విశ్వనాథుడు అనే అలంకారికుడు అన్నాడు. ఇది చాలా ప్రాచుర్యం లోకి వచ్చిన మాట. ‘రసం’ అంటే ఏమిటి? అంటే, ఎదుటి వ్యక్తి హృదయాన్ని చ్వలింపచేసేది, ఎదుటి వ్యక్తి హృదయంలో కదలిక కలిగించేది, సంచలనం కలిగించేదిమాత్రమే రసం. ఎదుటి వ్యక్తి హృదయాన్ని కదిలించలేకపోతే ఎంత గొప్ప మాటలు, పదాలు వేసినా అది కవిత్వం కాదు.
కాలాన్నిబట్టి వాళ్ళ హృదయ భావాలూ, స్థాయిలు మారుతుంటాయి. కాబట్టి మారిన హృదయాలకు తగినట్టి భావాలనూ రాయాల్సి ఉంటుంది. కాబట్టి కవికి ఉండవలసిన లక్షణాలలో, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలలో ప్రధానమైనవి నవ్యత, కాలానుగుణ్యత భావాన్ని, భావనాశక్తితో, భావోద్రేకంతో ఇతరుల హృదయాలలో చలనం కలిగింపజేయాలి. శబ్దాలు ఎట్లైతే కవిత్వం కాదో, అట్లే, భావోద్వేగం కలిగించని భావాలు కవిత్వం కాదు. కవి భావాలు ఉద్వేగాన్ని కలిగించేలా ఉండాలి. అందుకే కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉన్నది. జీవితంలో ఉద్వేగాలను పట్టుకోగలిగే శక్తి, కదిలించగలిగే శక్తి కవిత్వానికే ఉన్నది. కథ, నవలలకు కూడా ఈ శక్తి ఉన్నది. అవీ గొప్పవే, కానీ శరీరాన్ని, మనసునీ, రెండూ గగుర్పాటు పరిచే విధంగా, రోమాంచితమయ్యే స్థితి లో రాయగలిగే శక్తి కవిత్వానికి ఉంటుంది. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉండాలి కవిత్వం! కవిత్వాన్ని కళగా భావించగలగే, భావోద్వేగం కలిగించే శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టే సాహిత్యంలో మొదటి స్థానం కల్పించారు
సుదీర్ఘంగా రాసే కథ,నవలా రచయితల ప్రయత్నం కంటే కవితలో నాలుగైదు వాక్యాల్లో జీవితాన్ని చెప్పగలిగే భావం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. అవి ఒక ఎత్తైతే ఇది ఒక ఎత్తు. ఉదాహరణకు, ”కాళ్ళు తడవకుండా సముద్రాలు దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము.”” రెండే వాక్యాలు! విమానాలు, ఓడలూ ఉన్నాయి కాబట్టి కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటి వెళ్ళి పోవచ్చు. కళ్ళు తడవని వారు, ఎంత ధనవంతులైనా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంతోనే కవిత్వం జీవిస్తుంది ! ఇట్లా మనసును కదిలించే భావోద్వేగంతో కవిత్వం రాయాలి.
పాశ్చాత్యకవి, వర్డ్స్ వర్త్ “పొయెట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో ఆఫ్ పవర్ ఫుల్ ఫీలింగ్స్” అన్నాడు. ఆశువుగా, అప్పటికప్పుడు నీలోంచి వెల్లువెత్తే బలమైన అనుభవాలను వ్యక్తీకరించేదే కవిత్వం. ఎప్పుడొస్తది కవిత్వం? మనసు పొంగిపొర్లాలి. చెరువులు పొంగిపొర్లినట్లే, మనసులోని భావాలూ పొంగిపొర్లాలి. ఆ పొంగిపొర్లే పవర్ ఫుల్ ఫీలింగ్స్ తో , అంటే మనసు శక్తివంతమైన అనుభవాలతో, అనుభూతులతో అక్షరమై పొంగిపొర్లాలి. మనం తట్టుకోలేనంత ఉద్వేగం కలగాలి. కృతక ప్రయత్నం వేరు, తెచ్చిపెట్టుకున్న ప్రయత్నం వేరు. స్పాంటేనియస్ కవిత్వం వేరు. దాశరథికి కవిత్వం కోసం కాగితం దొరకకపోతే, ఒక పద్యం మనసులో కలిగితే, తన పైజామా నాడాను ఒక్కో భావం రాగానే ఒక్కో ముడి వేసేవాడట. తెల్లవారి జైలు గోడలమీద బొగ్గుతో రాసేవాడట. భావోద్వేగం కవిత్వంలో కీలకం.
కట్టమంచి రామలింగారెడ్డి “భావోద్రేకమే కవిత్వానికి ప్రాణం“. అన్నాడు. అణచుకున్నా, శాంతంగా ఉండాలన్నా ఉండనీయని భావోద్రేకం కలిగి కవి శరీరంలోంచి, కవి మనసులోంచి, తట్టుకోలేని భావాలు పొంగాలి.. పొంగి పొర్లడమనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ స్థితి ఏంటి? అంటే దాన్నే ‘మూడ్’ అన్నారు. పోయెట్రీ రాయడానికి మూడ్ ఉండాలి. కానీ మూడ్ రాగానే సరిపోదు. భాష, శబ్దాలు కవి మూడ్ కు సహకరించే ఉపకరణాలు. క్రిస్టర్ కాడ్వెల్ “ పొయెట్రీ ఈజ్ హైటెన్డ్ లాంగ్వేజ్ “అన్నాడు. కవిత్వమంటే ఉన్నతీకరించబడిన భాష. అన్నింటికి భాషే ముడిసరుకు. ఉదాహరణకు వజ్రం, రత్నం ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటి కాంతి దేదీప్యమానమవవు. సానబెడితే ధగద్ధగేయమానంగా మెరుస్తాయి. మెరుపును తీసుకురావడం అంటే ఉన్నతీకరించాలి. మన చుట్టూ ఉన్న నిత్యజీవితంలోనూ, కాలప్రవాహంలో దొర్లుతూపోయే ఈ భాషను పట్టుకోవాలి. భరతుడు, “మృదులలిత పదార్థం”అన్నాడు. లలితమైనటువంటి, సుతిమెత్తనైనటువంటి, మృదువైనటువంటి పదాలు నాలుక మీద నడయాడాలి. ఇవి సేకరించుకోవడానికి విస్తృత అధ్యయనం ఒకటే మార్గం.
మార్మికమైన శబ్దాల ప్రయోగం చేస్తే కవిత్వ సోయగం దెబ్బతింటుంది. కవిత్వానికి మూడు శత్రువులు అనీ అన్నారు. 1. పాండిత్యం 2. బౌద్ధికత 3. శాస్త్రం. కవికీ, శాస్త్రకారునికి పొంతన కుదురదు. కవి భావుకతతో పని చేస్తే, శాస్త్రవేత్త సత్యంతో పనిచేస్తాడు. ప్రకృతిని వర్ణించేప్పుడు అది నిరూపణ కావాలంటుంది శాస్త్రం.
“వెన్నెల నన్ను ప్రేయసిలా ఆలింగనం చేసుకున్నది” అంటాడు కవి. శాస్త్రకారుడు, వెన్నెలేంటిది? నిన్ను ఎలా పట్టుకుంటుంది? అంటాడు. నండూరి సుబ్బారావు ఎంకిపాటలు రాస్తూ, “ఎన్నెలంతా మేసి యేరు నెమరేసింది” అన్నాడు. అద్భుతమైన పంక్తులు. సెలయేరు మీద వెన్నెల కురిసినప్పుడు మొత్తం ఆ ఏరు వెన్నెలను స్వీకరించి నెమరేసుకున్నట్లున్నది అంటాడు. వెన్నెల గడ్డా? ఏరు గొడ్డా? అంటూ విమర్శిస్తాడు శాస్త్రకారుడు. కవిత్వం భావోద్వేగంతో కూడి ఉంటుంది కాబట్టి లోలోపలినుండి తన్నుకువస్తుంది. కవిత్వం రాసే కవి హృదయావిష్కారమది. ఇందులో ఉప్పొంగేవి భావాలే! మన హృదయమే, మన మనసే సాక్షి. కవిత రాసాక మనసు తేలికపడితే గొప్ప కవి అన్నట్టు. కవితగా వచ్చేస్తే మానసికమైన ఒత్తిడులు తగ్గి హాయి ఉంటుంది. లేకుంటే అశాంతిగా ఉంటుంది. ఇట్లా భావాన్ని వ్యక్తీకరించే శక్తి కూడా ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డిగారు జ్ఞాపకశక్తి గొప్పదా, మనశ్శక్తి గొప్పదా అని చర్చించినప్పుడు మనశ్శక్తే గొప్పదన్నాడు. ఇప్పుడు వేరుగాని గతంలో కృష్ణశాస్త్రి, రాయప్రోలు అవధానాలను కవిత్వంగా ఒప్పుకోలేదు. అవధానులది అంతా పాండిత్యం. ధారణ అది. అంటే జ్ఞాపకశక్తి. వారు పండితులు. మనశ్శక్తి కొత్తది సృష్టిస్తుంది. జ్ఞాపకశక్తి ఉన్నదాన్ని గుర్తుకుపెట్టుకుంటుంది. కొత్త సృష్టి చేయదు. విలక్షణమైన, లక్షణమైనకవిత్వం ‘మహాప్రస్థానం‘. ‘మరో ప్రపంచం ‘ అన్నాడు శ్రీశ్రీ. మనం నిజంగానే మరోప్రపంచం ఊహించాము. అలా కవిత్వం వర్ణించాలి,అందంగా ఉండాలి,ఔచితీమంతంగా ఉండాలి . కవిత్వంలో నచ్చిన పంక్తులు పదేపదే గుర్తొచ్చే పంక్తులు ఎవరైతే రాస్తారో అదే కవిత్వం.
“నిరంతరం జ్ఞాపకం ఉండేది కవిత్వం “ అన్నారు తిరుపతి వేంకట కవులు. వెంటాడేది,భావోద్వేగాలతో మనసును ఆవహించేలా ఉండాలి కవిత్వం. భాష పట్టుబడాలి. కవిత్వం మీద ఉండే ప్రేమ ఖచ్చితంగా భాష మీద ఉండాలి. వరవరరావ్ “నా ఫస్ట్ లవ్ కవిత్వం” అన్నాడు. భాష ద్వారానె కవిత్వ కళ సిద్ధిస్తుంది, ఆకట్టుకుంటుంది. అభ్యాసం తో కళ వస్తుంది. కవిత్వాన్ని ప్రేమించగలిగే అభ్యాసం కావాలి. దండి, ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కవిత్వం’ అన్నాడు. ఇష్టముతో కూడిన అర్దాలను ఇష్టం తో నే పట్టుకోగలము. కవిత్వ ఆత్మను పట్టుకోవాలి. పదాలు, మాటలు, వాక్యాలు మన పక్కనించే పోతుంటవి. మనం గుర్తించకుంటే కవిత్వం రాదు. భాష లో ఉండే సౌందర్యాన్ని ఆవాహన చేసుకోవాలి. ప్రతిభావంతుడు కూడా బాల్యం నుంచి నైపుణ్యాల కోసం కృషిచేయాల్సిందే. ఈ కాలానికి అన్వయించుకుంటే , సెల్ఫోన్ కు సిగ్నల్స్ అందినట్టు ఉండాలి కవిత్వం. అప్పుడే కళ ఆవిష్కారమవుతుంది. కవికీ పాఠకునికీ కనెక్ట్ కావాలి.ఆ సిగ్నల్స్ ద్వారానే కళ ఆవిష్కారమవుతుంది. ఇది ప్రత్యేకమైన కళ. అలవోకగారాదు. నేర్చుకోవాలన్న తపన ఉండాలి. జిజ్ఞాస ఉండాలి. నేర్చుకున్నాక కళగా మారే అవకాశం వుంది.
పోయెట్రీ ఈస్ ఆర్ట్ అఫ్ ఎక్స్ప్రెషన్. జీవితం లో ముంచి తీయాలి. రగులుతున్న భావం లో కాలినటువంటి భాష కావాలి. జీవితం తో ఉండే గాఢమైన అనుబంధంతో పరిశీలనతో కవిత్వం వస్తుంది. ఏ కళ అయినా భావోద్వేగం తో నే ముడిపడింది ఉంటుంది. మొండివారిపోయిన యాంత్రికమైన మనసుకు కవిత్వం అంటదు. భావాలని స్వీకరించ గలగాలి.
ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ , అనేది లైఫ్ లాంగ్ క్రాఫ్ట్ . అంటే చెక్కడమే! ఇది క్రాఫ్టే! నిపుణత్వం ! జీవితకాలం నేర్చుకోవాల్సిన నైపుణ్యం . కవిత్వం జీవితకాలం అభ్యసించాల్సిన కళ కవిత్వకళ . హృదయంతో ఆస్వాదన చేసుకోవాల్సింది . దాశరథి “ అన్ని ఇజాల వాళ్ళు చాపకూడు కుడువడానికి సరిపోయే అద్భుతమైన వేదిక కవిత్వం” అన్నాడు. అన్ని ఇజాలు, భావకవిత్వం, రివెల్యూషనరీ పోయెట్రీ , ప్రోగ్రెసివ్ పోయెట్రీ , దళిత, వుమెన్ , మైనారిటీ పోయెట్రీ, అనుభూతి వాద , సర్రియలిస్టిక్ పోయెట్రీ -అన్ని,అన్నీ ఉంటాయి. ఇన్ని ఇజాలవారు ఎక్కడ కలుస్తారూ అంటే కవిత్వం దగ్గర కలుస్తారు. ఒక కవికి మరో కవి అంటే అభిమానం ఉంటుంది ఉండాలి. ఇదే కవిత్వ శక్తి, ఇదే కవిత్వ కళ!
కవిత్వం మరింత గొప్పగా రాయడానికి మనశ్శక్తి, బౌద్ధిక శక్తి,శరీర శక్తి అన్నీ కలిసి, కలిపి రాస్తే ప్రాణశక్తి వస్తుంది. పరవశాన్ని కలిగించే కవిత్వం వస్తుంది. వర్తమానానికి అనుగుణంగా కవిత్వాన్ని మలుచుకుంటూ రాయాలి. నిన్న కోత కోసిన కొడవలి ఇవ్వాళ తెగదు. మళ్ళీ సాన పెట్టుకోవాలి. అట్లాగే కవి తనను తాను సాన పెట్టుకోవాలి. సీతాకోక చిలుకనో, దువ్వెననో తూనీగనో పట్టుకోవాలంటే చిన్నతనంలో ఎట్లైతే ఎంత నిశ్శబ్దంగా , జాగ్రత్త పడేదో ఒదిగి, ఒడిసి పట్టుకునేదో అట్లా! అట్లా జాగ్రత్తవహిస్తే దొరుకుతుంది. మనల్ని మనం అంతగా ఒదిగించుకోవాలి. పట్టుకోవాలి. నేర్పుగా కవిత్వ రెక్కల్ని పట్టుకోవాలి. కవిత్వాన్ని అందుకుందాం. కవిత్వ కళలు లోకం కోసం వినియోగిద్దాం!!
-నందిని సిధారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు
+91-94403 81148
భారత ఉపఖండంలో ఒకప్పటి భాగం బర్మా దేశం. బాలగంగాధర తిక్ లాంటి దేశభక్తులు బర్మాలోని మాండలే జైల్లో కారాగారవాస శిక్ష అనుభవించారు. తమిళ కంబ రామాయణం 1800లో బర్మాలోకి అనువాదమైంది. 1874లో యూట్ అనే కవి రాసిన ‘రామయోగిన్’కు బర్మా దేశంలో ఎంతో పేరు వచ్చింది. బర్మా రామాయణంలో దశరథుడు పుత్రకామేష్ఠి చేయడు. త్రిశూలుడు అనే మహర్షి ఇచ్చిన మంత్రపూరితమైన ఫలాల వలన సంతానం కలుగుతుంది. మారీచునకు బదులుు ‘బంబి’ అనబడే శూర్పణఖ మాయామృగంగా మారుతుంది. అవాల్మీకంగా తెలుగునేలపై ప్రసిద్ధమైనట్లే పర్ణశాల చుట్టూ మూడు గీతలు గీసి సీతాదేవిని దాటి రావద్దని ఆదేశించి లక్ష్మణుడు రాముని కోసం వెళ్తాడు.
బర్మా రామాయణంలో రావణుడు తనను క్షమించమని రాముని ప్రార్థించడం విశేషం. రాముడు అంగీకరించకుండా ‘నీ దుష్టకర్మ ఫలితమే నిన్ను చంపుతుంది’ అని సంహరిస్తాడు. భూటాన్ రామాయణంపై బౌద్ధమత ప్రభావం అధికంగా గోచరిస్తుంది. కార్తవీర్యార్జునుని కథ దశరథుని కథ కలగాపులగమై చిక్కు విడదీయరానంతగా కలిసిపోయాయి. దశరథుని కుమారుడు సహస్ర బాహువు. అడవిలో పరశురాముని తండ్రి ఆతిథ్యాన్ని స్వీకరించి అతనే కామధేనువుని లాక్కోబోతాడు. అతడు తిరస్కరించేసరికి సహస్రబాహువు అతన్ని చంపేస్తాడు. పరశురాముడు ప్రతీకారంతో సహస్రబాహుని చంపేస్తాడు. సహస్ర బాహువు కొడుకులే రామలక్ష్మణులు. రాముడు పెరిగి పెద్దవాడై తండ్రిని చంపిన పరశురాముని సంహరిస్తాడు. ఇది కథ. ఈ భూటాన్ రామాయణంలో దశరథుని మనుమలుు రామలక్ష్మణులన్నమాట. రాముడు చిన్నవాడు. లక్ష్మణుడు పెద్దవాడు. రామక్ష్మణుల్లో సీతాదేవిని ఎవరు పెళ్ళాడుతారో స్పష్టంగా లేదు. కథాంతంలో బుద్దుడే రాముడని చెప్తారు.
కాంబోడియాలో 17వ శతాబ్దం నుంచి రామాయణం వ్యాప్తిలో ఉన్నట్లు తోస్తుంది. కాంబోడియా రాజధానిలో వున్న బౌద్ధారామంలో రెండువేల తాళపత్ర గ్రంథాలున్నట్లు అందులో ఎన్నో రామాయణ సంబంధమైన పుస్తకాలున్నట్లు వినికిడి. కాంబోడియా రామాయణంలో విశ్వామిత్రుని యాగాన్ని తాటక మారీచులకు బదులు కాకాసురుడు ధ్వంసం చేస్తాడు. సంజీవని కోసం వెళ్ళిన ఆంజనేయుడు సంజీవనితోపాటు నంది మూత్రం, దేవగంగా జలాలను కూడా తెస్తాడు.
చైనాలో ప్రధానమైన మతం బౌద్ధం. రామునకు మారుగా బోధిసత్వుడు కనిపిస్తాడు. బోధిసత్వుడు ప్రజారంజకుడైన పాలకుడు. ఆయన భార్య అపురూప సౌందర్యవతి. ‘నాగుడు’ అనే వ్యక్తి బోధిసత్వుని రాణిని వశపరచుకోవాలనే దురూహతో బోధిసత్వుని సేవించి విశ్వాసాన్ని చూరగొంటాడు. ఒకనాడు బోధిసత్వుడు అడవికి వెళ్ళగా మహారాణిని ఎత్తుకొని పోతాడు. తర్వాత జటాయువుతో యుద్ధం `వానర సాయం` బోధిసత్వుడు యుద్ధంలో మూర్ఛపోతే సంజీవనితో బతికిస్తారు. తర్వాత బోధిసత్వుడు నాగుడిని సంహరించి మహారాణిని తెచ్చుకుంటాడు. వాల్మీకి కథకు ప్రతిధ్వనిలా బోధిసత్వుని పరంగా చైనా రామాయణం మలచబడిందిి.
టిబెట్ రామాయణంలో కైకేయి భరత శత్రుఘ్నుల పాత్రలు వుండవు. ఒకసారి దశరథుడు రాక్షసునితో యుద్ధంలో గాయపడి మంచం పాలై రాజ్యాన్ని పాలించలేని స్థితిలో వుండి రామునకు పట్టాభిషేకం చేయాని నిర్ణయించుకుంటాడు. రాముడు తన తండ్రి మాత్రమే రాజ్యమేలాలని వాదించి అడవికి వెళ్ళిపోతాడు. రాముని పాదుకలను వుంచి ప్రతినిధిగా లక్ష్మణుడే పాలిస్తాడు. ఈ రామాయణంలో రాముని భార్య పేరు సీత కాదు లీలావతి. రావణుడు లీలావతిని ఎత్తుకుపోతాడు. విభీషణునితోపాటు కుంభకర్ణుడు కూడా రావణుని తిరస్కరించి రాముని శరణు కోరుతాడు.
వియత్నాంలో ఎన్నో సంస్కృత శాసనాలు బయటపడ్డాయి. రాముని వంశం వారమని రామునిలాగా పరిపాలిస్తామని రాజులు తమ శాసనాల్లో చెప్పుకొన్నారు. వాల్మీకికి ఒక దేవాలయం కట్టిస్తున్నట్లు ఒక శాసనంలో పేర్కొనబడిరది.
రామాయణంలోని లంక నేటి శ్రీలంక అనీ కాదనీ వాదోపవాదాలున్నాయి. 7వ శతాబ్దిలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీలంక రాజవంశానికి చెందిన కుమార దాసుడు ‘జానకీహరణం’ అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు. భారవి కాళిదాసు స్థాయిలో రాయబడిన ఈ కావ్యం 12వ శతాబ్దిలోనే సింహళ భాషలోకి అనువాదమైంది. శ్రీలంకలోని సువార ఏలియా అనే జిల్లాలో ఒక ప్రదేశాన్ని రావణుని అంతఃపురమని చెప్తారు. వాలి కలలో ప్రవేశించి అశోకవనాన్ని, లంకను దహించి సీతాదేవిని తన వీపుమీద కూర్చోబెట్టుకుని శ్రీరామునకప్పగిస్తాడు. కొంత కాలమయ్యాక పార్వతీదేవి సీతాదేవిని చూడడానికి వస్తుంది. ఆమె మాటల సందర్భంగా రావణుడెలా వుంటాడని అడుగుతుంది. సీతాదేవి రావణుని బొమ్మ గీసి చూపెడుతుంది. ఆ సమయంలో రాముడు మందిరానికి రావడంతో హడావుడిగా సీత తన పరుపు కింద బొమ్మను దాచిపెడుతుంది. రామునకు పాన్పు కదులుతున్నట్లు తన నెవరో పడదోస్తున్నట్లు అనిపించడంతో పాన్పును పక్కకు జరిపి చూస్తాడు. రావణుని చిత్రపటం కనిపిస్తుంది. దానితో గర్భవతి అని కూడా దయ దల్చకుండా సీతాదేవిని అడవిలో వదిలిపెడ్తాడు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఒక కుమారుని కంటుంది.
ఒకరోజు సీతాదేవి స్నానానికి వెళ్ళగా కుమారుడు దోగాడుతూ పక్కనున్న పొదల్లోకి వెళ్తాడు. వాల్మీకి సీతాదేవి వచ్చేలోగా మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. తాను కన్న శిశువు ఇతడే అని ఎత్తుకుంటున్నప్పుడు దోగాడుతూ బయటికి వెళ్ళిన అసలు శిశువు వస్తాడు. సీతాదేవి ఆశ్చర్యపోగా వాల్మీకి జరిగిన సంగతి చెప్తాడు. అప్పుడు సీతాదేవి నీకు అంత శక్తి నిజంగా ఉంటే నా ముందు ప్రదర్శించమంటుంది. అప్పుడు వాల్మీకి మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. సీతాదేవి సంతోషంతో ముగ్గురు పిల్లలను పెంచుతుంది.
పిలిప్పైన్స్లో ఇస్లాం మత సంస్కృతి ప్రాచీన భారతీయ సంస్కృతీ కలిసి వారిదైన ఒక సంస్కృతి ఏర్పడింది. ఈ దేశంలో రామాయణాన్ని ‘మహారాజ రావణ’ అని వ్యవహరిస్తారు. రామలక్ష్మణులు సీత స్వయంవర వార్త విని స్వయంవరం జరిగే ప్రాంతానికి సముద్ర మార్గాల గుండా వెళ్ళి మధ్యలో ఆపద పాలవుతారు. ‘కబైమాన్’ అనే ఒక స్త్రీ చూసి సముద్రంలోకి దూకి రామక్ష్మణులను రక్షించి స్వయంవరం జరిగే చోటికి చేరుస్తుంది. శివధనుర్బంగానికి బదులు ఒక పెద్ద బంతిని కాలితో తంతే అది వెళ్ళి సీత వున్న గది ముందు పడాలన్నది నియమం. శ్రీరాముడు నెగ్గుతాడు. మరికొన్ని పరీక్షలు వుంటాయి. కావ్యమంతటా దశరథుని సుల్తాన్ అని సంబోధిస్తారు. రావణుని పడగ్గదిలో ఉన్న ఒక వజ్ర పాషాణంమీద ఖడ్గాన్ని పదునుపెట్టి ఆ ఖడ్గంతో రావణుని చంపితే చస్తాడు.
థాయ్లాండ్ దేశ రాజధాని అయోధ్య. 420 సంవత్సరాలు 37మంది రాజులు ఆ దేశాన్ని పాలించారు. రాజు పేర్లు అన్నీ రామనామంతో ముడిపడి వున్నవే. 1737లో థాయ్లాండ్ను పాలించిన రామచక్రవర్తి ‘రామకీన్’ పేరుతో రాసిన రామాయణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగాయి. థాయ్లాండ్లో రామాయణ పాత్రలు ఎలా రూపాంతరం చెందాయో చూడండి. తోనరట్ – దశరథుడు, కౌసూర్య – కౌస్య, కయకశి – కైకేయి, రామ – రాముడు, లక్ – లక్ష్మణుడు, బ్రోత్ – భరతుడు, శత్రూట్ – శత్రుఘ్నుడు, సీదా – సీత, సుక్రీవ్ – సుగ్రీవుడు, రావన – రావణుడు, సమ్మనక్క – శూర్పణఖ.
థాయ్లాండ్ రామాయణంలో సీతారాములిరువురు వివాహానికి ముందే పరస్పరం ఆకర్షితులవుతారు. అంతఃపుర గవాక్షం దగ్గర సీతను చూసి రాముడు రహస్యంగా మాట్లాడుతాడు. సీత కలలో వున్నప్పుడు ఆంజనేయునకు ఆ మధుర సంభాషణను తన గుర్తుగా సీతకు చెప్పమంటాడు. చిన్నప్పుడు మంధర కాలు లాగి పడవేసినందుకు ప్రతీకారంగా రాముని పట్టాభిషేకం చెడగొడుతుంది. థాయ్లాండ్ రామాయణంలో మూలానుసారంగా వుంటూనే మైరావణుని కథలాంటి విశేషాలున్నాయి. రావణుడు విభీషణుని కూతురును ‘సీత రూపంలో వెళ్ళి రాముని సైన్యమున్న చోట నదిలో చనిపోయినట్లు శవంలాగ తేలియాడుతున్నట్లు వుండు. నిన్ను చూసి రాముడు సీత చనిపోయిందన్న దుఃఖంతో అయోధ్యకు వెళ్లిపోతాడు’ అని ఆదేశిస్తాడు. కాని విభీషణుడు రాక్షస మాయగా గుర్తుపట్టి తన కూతురు అని కూడా దయదల్చకుండా రామునితో చెప్పి మరణశిక్ష విధించమని చెప్తాడు. ఇలా వాల్మీకి కవికోకిల గానం భారతదేశం దాటి దిగంతాల దాకా వ్యాపించింది. ఇంకా ఆ గానం నిరంతరం సాగుతుంటుంది.
(మాన్య శ్రీ జె.వి.సుబ్బారాయుడి విదేశాల్లో రామకథ ఆధారంగా ఆకాశవాణి ప్రసారం) – ఆంధ్రభూమి (దినపత్రిక) 30-3-2004
-డా॥ వెలుదండ నిత్యానంద రావు
ప్రొఫెసర్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ.
+91-9441666881
* * *
‘కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి’ (క ష్టజీ వి)అని అల్పాక్షరాలలో అనల్పమైన సత్యాన్ని చెప్పిన మహాకవి, ప్రజాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ జన్మించింది 1910లో విశాఖపట్టణంలో. అస్తమించింది 1983లో చెన్నైలో. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించి 38 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ జనాన్ని -ముఖ్యంగా కార్మికులకు, కర్షకులకు,అనేకానేకులైన చేతివృత్తులవారికి, వారిపట్ల సానుభూతి గల, వారితో తాదాత్మ్యం చెందే మేధావులకు, కవులకు, కళాకారులకు తన కవితలతో నిరంతరం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉన్నాడు. కవితలను అల్లడం ప్రారంభించిన కాలంలో కవితా లోకంలో ఆనాటి దిగ్గజాలు అయిన విశ్వనాథ సత్య నారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారల ప్రభావంతో ప్రకృతి, ప్రేమ, తాత్వికత వంటి అంశాలపై ‘ప్రభవ’ మొదలైన శీర్షికలతో చక్కని పద్యాలు రచించిన శ్రీశ్రీ త్వరలోనే వారి ప్రభావం నుండి బైటపడి, సామాజిక సమస్యల పరిష్కారానికి 1934లో సాహితీరంగంలో సుదీర్ఘ యాత్ర(లాంగ్ మార్చ్)ను ‘మహా ప్రస్థానం’ కవితతో ప్రారంభించాడు. ఈ గీతంలో ‘ఎర్రబావుటా నిగనిగల’ను, ఒక మనిషిని వేరొక మనిషీ- ఒక జాతిని వేరొక జాతీ- పీడించే సాంఘిక ధర్మం చెల్లని ‘మరో ప్రపంచా’న్ని ప్రస్తావించాడు. ఈ మహాప్రస్థానానికి ప్రారంభ సూచనగా 1933లోనే ‘జయభేరి’ని మోగించాడు. ”నేను సైతం ప్రపంచాగ్నికి- సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని ప్రారంభమైన ‘జయభేరి’ కవిత ”నేను సైతం భువన భవనపు- బావుటాన్నై పైకి లేస్తాను” అనే ఉన్నత ఆశయ వ్యక్తీకరణతో ముగుస్తుంది. ‘మహాప్రస్థానం’ కవితల సంపుటిని అకాలమరణం పాలైన తన సన్నిహిత మిత్రుడు కొంపెల్ల జనార్దన రావుకు ‘అంకితం’ ఇస్తూ ”నిరుత్సాహాన్ని జయించడం- నీవల్లనే నేర్చుకుంటున్నాము” అన్న వాక్యం ప్రజా ఉద్యమాలలో ఉన్న మనం అందరం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట. సమాజంలోని అనేకానేక సమస్యలను ప్రస్తావించి, వాటికి గల కారణాలను విశ్లేషించి, పరిష్కారాలను సూచించిన శ్రీశ్రీ ‘బాటసారి’ లో వలస బతుకును,’భిక్షవర్షీయసి’ లో అనాథ వృద్ధ స్త్రీల పరిస్థితిని, ‘ఆకాశదీపం’ లో నిరాశోపహతుడైన నిరుద్యోగ యువకుడినీ చిత్రించాడు.
తన కవితలను “కార్మికలోకపు కల్యాణానికి- శ్రామికలోకపు సౌభాగ్యానికి- సమర్పణంగా,సమర్చనంగా” విరచించిన శ్రీశ్రీ ‘పొలాల్లో బంగారం పండుతుంది’ అనే సామెతను “పొలాలనన్నీ హలాల దున్నీ-ఇలాతలంలో హేమం పండగ-జగానికంతా సౌఖ్యం నిండగ..” అని కవితగా మలిచి తన ఆకాంక్షను వ్యక్తీకరించాడు. “కమ్మరి కొలిమీ,కుమ్మరిచక్రం” వంటి అనేకానేకాలైన చేతివృత్తుల వారి సాధనాలను ప్రస్తావించి, అవే “నా వినుతించే- నా విరుతించే-నా వినిపించే- నవీనగీతికి భావం,భాగ్యం- ప్రాణం,ప్రణవం..”అన్న శ్రీశ్రీ నిస్సందేహంగా శ్రామిక జన పక్షపాతి. వారికి నిరంతర స్ఫూర్తి ప్రదాత. స్వయం ప్రకటితమేధావులు కొందరు మెట్టవేదాంతాన్ని వల్లిస్తూ దోపిడీ వర్గాలకు వత్తాసు పలకడాన్ని ‘మిథ్యావాది’ కవితలో చీల్చి చెండాడాడు శ్రీశ్రీ. “జమీందారు రోల్సు కారు- మాయంటావూ? బాబూ!ఏమంటావు?.. మహారాజు మనీపర్సు- మాయంటావూ?- స్వామీ! ఏమంటావు?- పాలికాపు నుదుటి చెమట- కూలివాని గుండె చెరువు- బిచ్చగాడి కడుపు కరువు- మాయంటావూ?.. ఏయ్!ఏమంటావు?” అని మిథ్యావాదులను గద్దించి, నిలదీసి, వారికి చెమటలు పట్టించాడు. అభివృద్ధి కాముకులను , అవకాశ వాదులను/తిరోగమన వాదులను స్పష్టంగా విడదీసి చెప్తూ “అలజడి మా జీవితం- ఆందోళన మా ఊపిరి- తిరుగుబాటు మా వేదాంతం- ముళ్ళూ రాళ్ళూ అవాంతరాలెన్ని ఉన్నా- ముందు దారిమాది… ముందుకు పోతాం మేము- ప్రపంచం మావెంట వస్తుంది- అభిప్రాయాల కోసం- బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు- మాలోకి వస్తారు- అభిప్రాయాలు మార్చుకొని- సుఖాలు కామించే వాళ్ళు- మీలోకి పోతారు..” అనగలగడమే శ్రీశ్రీ విశిష్టత. “కొంతమంది కుర్రవాళ్ళు- పుట్టుకతో వృద్ధులు- తాతగారి నాన్నగారి- భావాలకి దాసులు- ఉత్తమొద్దు రాచ్చిప్పలు- నూతిలోని కప్పలు- నేటి నిజం చూడలేని- కీటక సన్యాసులు” అంటూ పక్కదారి పడుతున్న యువతపై కొరడా ఝళిపించిన శ్రీశ్రీ భగత్ సింగ్ వంటి దేశభక్తియుత యువ కిశోరాల వారసులైన వారిని- “మరికొంతమంది యువకులు రా- రాబోవు యుగం దూతలు- పావన నవజీవన బృం దావన నిర్మాతలు- బానిసభావాలను తల- వంచి అనుకరించరు- పోనీ అని అన్యాయపు- పోకడలను సహించరు- వారికి నా ఆహ్వానం- వారికి నా సాల్యూట్”- అని అభినందించాడు,వీపు తట్టాడు.
సహజంగా అభ్యుదయ,విప్లవ కవి అయిన శ్రీశ్రీ ‘శైశవగీతి’ ని ఎంతో మార్దవంగా రాయడం ఆశ్చర్యం అనిపించినా ఆయన దృష్టి ఎంతమాత్రమూ పాక్షికం కాదు-అది బహుముఖీనం- అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. “వాన కురిస్తే- మెరుపు మెరిస్తే- ఆకసమున హరివిల్లు విరిస్తే- ఇవి మాకే అని ఆనందించే పాపల్లారా!” అనడంలో శ్రీశ్రీ బాల బాలికలలో తానూ ఓ బాలుడై పోయినట్టుగా అనిపిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’తోపాటు ‘ఖడ్గసృష్టి’, ‘మూడు యాభయిలు’ , ‘మరో మూడు యాభయిలు’ వంటి కవితా సంపుటాలతోపాటు అనేక వ్యాసాలను,నాటికలను,’నా చైనా యానం’అనే యాత్రా చరిత్రనూ రచించాడు. ‘ఖడ్గసృష్టి’ ని ప్రారంభిస్తూ “రెండు రెళ్ళు నాలుగన్నందుకు- గూండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో- క్షేమం అవిభాజ్యం అంటే- జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో- …ఆశయం ఉండడం మంచిదే కాని- అన్ని ఆశయాలూ మంచివి కావు- ఆశయాలు సంఘర్షించేవేళ- ఆయుధం అలీనం కాదు-.. అందుకే సృష్టిస్తున్నాను- అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని- కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది- జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది- ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది- నవీనమార్గాన్ని చూపిస్తుంది- ఇది నిజం- నవధర్మం మానవధర్మం- ఆణుశక్తి కన్న- మానవశక్తి మిన్న….” అన్న శ్రీశ్రీ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి శ్రీశ్రీ చెప్పిన చిరుకవితలు అనేకం నినాదాలుగా మారి, గోడలపైకికూడా ఎక్కాయి. “న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే.కాని గెలిచేదంతా న్యాయం కాదు”. “దొంగనోట్ల దొంగ ఓట్ల- రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి సాక్షులిచ్చు- సాక్ష్యం ఒక సాక్ష్యమా?” జీవికను వెతుక్కుంటూ మదరాసుకు చేరిన శ్రీశ్రీ చలన చిత్రం రంగంలోనూ తన ప్రత్యేక ముద్రను నిలుపుకున్నాడు. ఎంతగా?అంటే “కారులో షికారుకెళ్ళే- పాలబుగ్గల పసిడీదానా- బుగ్గమీది గులాబిరంగు- ఎలా వచ్చెనో చెప్పగలవా..?” అనే ఆత్రేయగారి గీతాన్ని ‘అది శ్రీశ్రీదే’ అని అత్యధికులు భావించేంతగా. 60 ఏళ్ళ నాటి శ్రీశ్రీ గీతం ”పాడవోయి భారతీయుడా..” లోని పరిస్థితులే దేశంలో నేడూ ఉన్నాయి-ఇంకా తీవ్రంగా. “ఆకాశం అందుకొనే- ధరలొక వైపు- అదుపు లేని నిరుద్యోగ- మింకొక వైపు- అవినీతి బంధు ప్రీతి- చీకటి బజారు- అలముకొన్న నీ దేశం- ఎటు దిగజారు? కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి..” ఎదిరిస్తున్నాం.మరింత బలాన్ని పుంజుకొని పాలకుల దుర్మార్గాలను ఎదిరించక తప్పదు. “కల కానిది-విలువైనది..’ గీతంలో ఓదార్చి, ధైర్యం చెప్పిన శ్రీశ్రీ “తెలుగువీర లేవరా- దీక్షబూని సాగరా- దేశమాత స్వేచ్ఛ కోరి- తిరుగుబాటు సేయరా” అని జనాన్ని ఉత్తేజపరిచిన శ్రీశ్రీ “తెల్లవారి గుండెల్లో- నిదురించినవాడా- మా నిదురించిన పౌరుషాగ్ని- రగిలించినవాడా..” అని చమత్కరించి, మన్యం వీరుడు అల్లూరిని మన కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేసి, మనలో దేశభక్తిని రగుల్కొల్పాడు. ఈ గీతం జాతీయస్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారం పొందగా శ్రీశ్రీ ‘జయభేరి’ లోని “నేను సైతం” చరణాలతో ప్రారంభమైన సుద్దాల అశోక్ తేజ గీతం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారాన్ని పొందగలగడం శ్రీశ్రీ వేసిన దారి రహదారిగా మారిందని చూపుతున్నది. పాలకులు మతం, కులం, ప్రాంతం, భాష, తినే ఆహారం, ధరించే వస్త్రాల పేరుతో ప్రజలలో-ముఖ్యంగా యువతలో పరస్పర విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో “మనుష్యుడే నా సందేశం- మానవుడే నా సంగీతం” అన్న శ్రీశ్రీ కవితల ప్రాసంగికత (రెలవెన్స్) ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. శ్రీశ్రీ కలలుగన్న, ప్రయత్నించిన సమసమాజ స్థాపనకోసం దీక్షతో అలుపు లేకుండా కృషి చేయడమే ఆ మహాకవికి మనం అర్పించే నిజమైన నివాళి.
ఏప్రిల్ 30, 1910
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా
-మోతుకూరి నరహరి
విశ్రాంత ప్రధానాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్),
సారస్వత పరిషత్తు ప్రాచ్య (ఓరియంటల్ పిజి)కళాశాల,
హైదరాబాదు.
+91-8464980540
ఇతివృత్తం
The Insider 1998లో విడుదలయింది. ఇందులోని విషయమంతా రాజకీయమే. సంధికాలపు విషయాలను లక్ష్యంగా రాయకపోయినప్పటికీ స్వాతంత్ర్యానంతరపు తొలి, మలి దశల రాజకీయాల్ని చిత్రించిన రాజకీయ నవల ఇది. కుష్వంత్ సింగ్ A Train to Pakistanలో, సల్మాన్ రష్దీ Midnight Childrenలా చిరకాలం గుర్తుంచుకోదగిన రచన. అయితే ఇది పూర్తి వాస్తవిక సంఘటనలతో రాసిన నవల అని చెప్పలేం. కానీ పాఠకుడికి ఆ కాలపు రాజకీయ వాస్తవాలు అర్థం అవుతూ ఉంటాయి. శాతాల్లో చెప్పలేం కానీ పాత్రలు, ప్రదేశాలు పేర్లు మార్చుకోబడ్డ వాస్తవం ఇందులో ఉంటుంది. దీన్ని స్వయంగా పీ.వీ. ఇట్లా చెప్పాడు. ‘ఇది కల్పనాయదార్థాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి, కథాకారుడు, విమర్శకుడు, రచయిత ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాత్రలు నూటికి నూరుపాళ్ళు కాల్పనికం కాదు, నూటికి నూరుపాళ్ళు వస్తుతః శల్య మాంసయుక్తులైన వ్యక్తులూ కాదు. రకరకాల మనుషులు, రచయితకు కానవచ్చిన రకరకాల ప్రవృత్తుల సమ్మిశ్ర (సింథటిక్) సృష్టిజనితులు. ఒక్క ప్రధాన మంత్రులలో కాల్పనికత లేదు.’ దీన్నిబట్టి ఈ నవలేతివృత్తం పేర్లకు పరిమితం కాని వాస్తవం. ప్రధానమంత్రి విషయంలో పేర్లు కూడా వాస్తవమే. నవలలో ప్రధానంగా నాలుగు భాగాల ఇతివృత్తం ఉంది. ఆనంద్ బాల్యం యవ్వనారంభంలో భాగంగా నడిచిన భారత స్వాతంత్ర్యోద్యమం, అఫ్రోజాబాద్ విలీనోద్యమం ఒక భాగం. తొలి స్వాతంత్ర్యపు ప్రజాస్వామ్య పోకడలలో భాగంగా ఎన్నికల అపసవ్యత; మహేంద్రనాథ్-చౌదరిల మధ్య అసమ్మతి, కుర్చీ పోరాటంలో కుట్రలు, కుతంత్రాలు రెండవ భాగం. నెహ్రూ, ఇందిరల స్పూర్తితో, గట్టిపట్టుదలతో ఆనంద్ ముఖ్యమంత్రి కాగానే చేపట్టిన భూసంస్కరణలు, భూస్వామ్య వర్గం కక్ష, ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం మూడవ భాగం. ఢిల్లీలో అధిష్టానం అభిప్రాయాన్ని ప్రభావితం చేసే బ్రోకర్లు, అసమ్మతి శిబిరాలు, వాళ్లకు ఉండే పరస్పర సంబంధాలు, వాటి పర్యవసానాలు ఈ నవలలోని ప్రధానమైన మరొక భాగం. 750పేజీలకు పైబడిన, విస్తారమైన నిడివి గలిగిన ఈ నవలను కల్లూరి భాస్కరం నవల ఇతివృత్తాన్ని ఇట్లా చెప్పారు. “ఆనంద్ తలపడింది ఒక త్రికోణ నిర్మిత స్థితిలో. దాని అట్టడుగున ఉన్నది, ఎన్నికల్లో ఓటర్లుగా తప్ప ఇంకెలాంటి గుర్తింపూలేని, నోరూవాయీ లేని అసంఖ్యాక ప్రజానీకం. మధ్యలో ఉన్నదీ సిద్ధాంత జ్ఞానం కానీ, నిబద్ధత కానీ, ప్రజాహిత దృష్టి కానీ లేని రాజకీయ దళారుల ప్రపంచం. ఆ త్రికోణ స్థితి పైన ఏకాకిగా నిలబడిన ఒక స్వాప్నికుడు, ఒక తాత్వికుడు, ఒక ప్రజాహితైషి ఆనంద్. అట్టడుగువైపుకు రాజకీయ, శాసనగతిని మళ్ళించడానికి అతడు చేసిన నిర్విరామ, విఫల యత్నాల విషాద గాథే లోపలి మనిషి”. కల్లూరి భాస్కరం అనువాదం తెలుగులో ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. 2002లో అక్టోబర్ లో ‘లోపలి మనిషి’ పేరుతో ప్రింటయింది. ఎమ్మెస్కో ప్రచురించిన ఈ నవలకు స్వయంగా పీ.వీ. ఎడిటింగ్ కూడా ఉండడంతో ఇది ఒక రకంగా స్వతంత్ర రచన కిందే లెక్క.
కథాగమనం
నవల 60 అధ్యాయాలుగా నడుస్తుంది. ఇందులో వచ్చే పేర్లను అవగాహన చేసుకోవడం కోసం ఈ కింది సంకేతనామాలను తెలుసుకోవాలి. అఫ్రోజాబాద్-హైదరాబాద్ నాసిర్ జాషీ-అసఫ్ జాహీ ఖాదీమాన్-రాజాకార్ హషీం అలీ-లాయక్ అలీ రహీం అల్వీ-రాజ్వా ఖాసీం ఆనంద్-పీవీ 10వ నాసిర్ జా పాలిస్తున్న అఫ్రోజాబాద్ లోని అనంతగిరి గ్రామాధికారి కొడుకు ఆనంద్. చదువుకోసం ఆనంద్ ను షెగావ్ లో ఉంటున్న చిన్నాన్న మారుతి ఇంటికి పంపిస్తారు. చిన్నాన్న, చిన్నమ్మ మనోరమాదేవి, వాళ్ళ పిల్లలు రాజు, కమలలతో కలిసి గుల్షన్ పూర్ లో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆనంద్ మొదటిసారి బస్సు ఎక్కి ఆశ్చర్యానికి గురవుతాడు. పాఠశాలలో చురుకైన విద్యార్థిగా రాణిస్తాడు. ఆనంద్ కు పెళ్ళవుతుంది. అనల్ మాలిక్ ఉద్యమం ప్రారంభమవడం వల్ల ఆనంద్ పాఠశాలలో కృష్ణుడి వేషం వేసినా చూడడానికి కరీం రాడు. హఫీజ్, సుదర్శన్ లు ఆనంద్ కు స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్నిచ్చి ప్రేరేపిస్తారు. క్విట్ ఇండియా కాలంలో ఆనంద్ బ్రిటీష్ ఇండియా భూభాగాలలోకి వెళ్లి ప్రేరణ పొందుతాడు. వీరాపురంలో ఖాదీమాన్ (రజాకార్) మూకలు, పోలీసులు చేసే దాడుల్నుండి రక్షించే వాలంటీర్లలో ఆనంద్ పాల్గొంటాడు. భారత్ లో అఫ్రోజాబాద్ విలీనం జరిగిపోతుంది.
మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ కమిటీ చైర్మెన్ రాఘవ్, అరుణ టిక్కెట్ ఆడిగితే పక్కలోకి రమ్మంటాడు. ఆమె ఆనంద్ ను ఆశ్రయించడంతో ఆనంద్ కు గెలవలేని నియోజకవర్గం ఇస్తాడు. అయినా శ్రీరాంపూర్ నుండి ఆనంద్ గెలుస్తాడు. మహేంద్రనాథ్ ముఖ్యమంత్రి అయితే, చౌదరి మంత్రిగా అసమ్మతి పాత్ర పోషిస్తాడు. చౌదరి శిబిరం మనిషి శేఖర్ మహేంద్రనాథ్ పక్షం చేరి కథ రక్తికట్టిస్తాడు. మహేంద్రనాథ్ చేత జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చేయించి చెడ్డపేరు వచ్చేట్లు చేసి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడానికి కారణమవుతాడు. చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు. తటస్తుడైన ఆనంద్ కు మంత్రి వర్గంలో చోటు లభిస్తుంది. అరుణతో ఆనంద్ ప్రేమాయణం నడుస్తుంది.
నెహ్రూ భూసంస్కరణలు చేపట్టమని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తాడు. ఇది ఇష్టంలేని చౌదరి తలపట్టుకుంటాడు. మరో మంత్రి శేఖర్ ఆ శాఖను ఆనంద్ కిమ్మని ఓ పాచిక వేస్తాడు. ఆనంద్ భూసంస్కరణల మంత్రి అవుతాడు. నెహ్రూ మరణానంతరం మొరార్జీ-ఇందిరల మధ్య నాయకత్వ యుద్ధంలో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఇందిర ప్రధాని అవుతుంది. అనేక అంతర్జాతీయ, జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య చౌదరిని దించేస్తుంది ఆధిష్టానం. ఆనంద్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆనంద్ సీ.ఎం. గా భూసంస్కరణలను చర్చకు పెడతాడు. భూసంస్కరణలు చర్చల దశలోనే ఉండగానే కమ్యూనిస్టులు భూ ఆక్రమణలకు పాల్పడతారు. భూ సంస్కరణల చట్టం ఆమోదించబడుతుంది. ఇందుకు పర్యవసానంగా ఇందిరను అశ్లీలంగా చిత్రిస్తూ గోడరాతలు వెలుస్తాయి. అవి ఇందిర దాకా వెళ్తాయి. ఆనంద్ రాజీనామా సమర్పిస్తాడు. ముఖ్యమంత్రి పదవి పోతుంది. కథా గమనంలో మరొక ప్రధానమైన అంశం ఢిల్లీలోని అధిష్టానం. రంజన్ బాబు, లాలా గోపీ కిషన్ లాంటి పవర్ బ్రోకర్లు, జాతీయ పత్రికల కరస్పాండెంట్ల ప్రభావాలతోనే రాష్ట్రంలో నరేంద్రనాథ్, చౌదరి, ఆనంద్ ముగ్గురూ పదవులు కోల్పోతారు. పవర్ బ్రోకర్లను, పత్రికలను ప్రభావితం చేసేది అసమ్మతి. మాధ్యమం-డబ్బు, విలాసాలు.
సామాజిక చిత్రణ
కేవలం 2 శాతం మాత్రమే అక్షరాస్యులున్న 1948కి పూర్వపు హైదరాబాద్ సంస్థానపు స్థితిగతులు మొదటి పది అధ్యాయాలలో వివరంగా పీ.వీ. వివరించాడు. భూ పరిపాలనతో సంబంధమున్న కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి రాజకీయాలకు భూమికి సంబంధాలను సరిగ్గా అంచనా వేయగలిగాడు, సజీవంగా చిత్రించగలిగాడు. ఆనంద్ వాళ్ళ ఊరికే కాకుండా మిగితా గ్రామాలకు కూడా నిర్నీతమైన సరిహద్దులేవీ లేని సంగతి చెబుతాడు. రచయితకు సైకిల్ కూడా అపురూపమే. సినిమా ఆ కాలంలో అరుదుగా దొరికే అవకాశం. హైద్రాబాద్ లో సినిమా ఉందేది కాని, పల్లెటూరి వాళ్ళు సినిమా చూడడం అనేది జీవితకాలపు వింత. ఆనంద్ బండి, గిర్దావర్ బండికి ఎదురైతే ఆనంద్ వెనక్కి వెళ్ళిపోవాలని ఊరంతా హితబోధ చేయడం ద్వారా సర్కారు ఊద్యోగులంటే ఉండే భయభక్తులను తెలియజేస్తుంది. పసిపాపకు పాలివ్వడానికి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొస్తానన్న ఒక కూలీ స్త్రీని జాగీర్దార్ గుమస్తా అత్యంత దారుణంగా హింసించే సంఘటన చూసి ఆనంద్ చలించిపోతాడు, అడ్డుకుంటాడు. ఆ సందర్భంలో రచయిత చిత్రించిన సన్నివేషాలు ఆనాటి తెలంగాణలో ఊరూరా జరుగుతూనే ఉండేవి. చదువుల కోసం బంధువుల ఇండ్లలో పిల్లల్ని సంవత్సరాల తరబడి ఉంచడం అప్పటి మధ్యతరగతి కుటుంబంలో సాధారణమైన విషయం. ఎడ్లబండి ప్రయాణంలోని దర్పం, ఆనందం నవలా నాయకుడి జ్ఞాపకాలుగా ఇందులో చిత్రించబడ్డాయి. పట్నంలో అప్పటికే అమ్మాయిల స్కూళ్ళుండేవి. అబ్బాయిలు అమ్మాయిల్ని బనాయించడం, వెంటబడడం కూడా ఉన్న వాస్తవాల్ని ఇందులో పీ.వీ. చిత్రించాడు. ఇంకో హాస్యస్ఫోరకమైన విషయాన్ని కూడా పీ.వీ. ఇందులో చిత్రించాడు. రాజుకు కొడుకు పుట్టినప్పుడల్లా స్కూలుకు సెలవిచ్చేవారట. అందువల్ల రాజుకు తరచూ కొడుకులు పుడితే బాగుండేదని అందరూ జోక్స్ వేసుకునే వారట, ఎందుకంటే రాజుకు అనేకమంది భార్యలుండేవారని.
మత పరిస్థితులు
ఆనంద్, కరీం సన్నిహిత మిత్రులు. వారి వారి కుటుంబాలు కూడా ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉండేవి. ఆనంద్ పాఠశాల విద్య చదువుతున్న రోజుల్లో కృష్ణాష్టమి, మొహర్రం రెండు మతాల వాళ్ళు కలిపి చేసుకునేవారు. సరిగ్గా అప్పుడే ముస్లిం పెద్దలు ‘అనల్ మాలిక్’ (మనం రాజులం) అనే నినాదం పుట్టించారు. అప్పటిదాకా కలిసి ఉండే ప్రజలు హిందూ, ముస్లిం మతస్తులుగా విడిపోయారు. స్కూల్లో కృష్ణాష్టమి రోజున ఆనంద్ శ్రీకృష్ణుడి వేషం వేసాడు. వేషం టైంకి వస్తానన్న కరీం రాడు. ఎందుకు మాట తప్పాడో కనుక్కుందామని ఆనంద్ కరీం వాళ్ళింటికి వెళ్తాడు. తీరా వెళ్ళే సరికి కరీం ఇంట్లో లేడు. నగరం నుండి వచ్చిన అఫ్జల్ చాచా కనిపించాడు. ‘కరీం ఎక్కడికెళ్ళాడో నాకు తెలియదు. అయినా వాడితో మీకేంపని. అది మీ పండుగ. హిందువులే ఆ పండుగ జరుపుకోవాలి’ అన్నాడు. అలా వచ్చిన మత విభజనకు వెనక రాజకీయ కారణాలే ఉంటాయి. రాజకీయ కారణాలు లేనంతవరకు మతం ఒక అడ్డుగోడగా ఎప్పుడూ నిలవలేదనడానికి కూడా ఈ నవలలో సాక్ష్యాలు చూపించాడు పీ.వీ. కూలీ మహిళను పాలివ్వడానికి పోనివ్వకుండా హింసించిన జాగీర్దార్ గుమస్తా గొప్ప సంప్రదాయం ఉట్టిపడేలా మూడు నిలువుబొట్లు పెట్టిన హిందువే. సంస్థానంలో మతం అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం రానుందనే ప్రచారం తర్వాత మాత్రమే ప్రారంభించబడింది. స్వాతంత్ర్యం, వెనువెంటనే విలీనం అనే స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ ప్రచారానికి మరో ప్రతిఫలనంగా అనల్ మాలిక్, అంజుమన్ తబ్లిగిస్లాం తెరమీదికొచ్చాయి. అయితే పురోగామి వాదులు దీనికి అతీతంగా ఆలోచించడం కూడా ఈ నవలలో చిత్రించబడింది. ఆనంద్ కు ఖవ్వాలి బాక్స్ నెపంతో భగత్ సింగ్ లేఖనూ, దేశభక్తి గీతాలను ఇచ్చిన విప్లవకారుడు హఫీజ్ అనే ముస్లిం. ఆనంద్ లోని పురోగామి భావాలను ప్రోత్సహించే ప్రిన్సిపల్ కూడా ముస్లిం.
ఎన్నికలు, రాజకీయాలు
స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నికలు రాజకీయాలు విడదీయరానివిగా మారిపోయాయి. అప్పటిదాకా ఉన్న త్యాగశీలత, ప్రజలపట్ల ప్రేమ మచ్చుకైనా కనిపించకుండా పోయిందనే అభిప్రాయాన్ని పీవీ అనేక సంఘటనల ద్వారా చిత్రించాడు. మొదటి ఎన్నికల్లోనే టిక్కట్ల పంపిణీలో వర్గాలు ఏర్పడతాయి. గెలిచే సీట్లను తన మనుషులకు ఇప్పించుకోవడం, ఓడే సీట్లు పార్టీలో వ్యతిరేకులకు ఇచ్చుకోవడం మొదలయింది. రాజకీయాల్లో స్త్రీలను ఎలా వాడుకోవచ్చో రాఘవ్ పాత్ర కళ్ళకు కడుతుంది. అరుణ అనైతిక సంబంధానికి ఒప్పుకోకపోవడంతో ఓడిపోయే సీటిస్తాడు రాఘవ. ఆమెకు అండగా ఉండే ఆనంద్ కూ ఓడిపోయే సీటు ఇస్తాడు. డబ్బులు ఖర్చుపెట్టనిదే, సారా పంపిణీ చేయనిదే ఎన్నికల్లో గెలవలేమని మొదటి సాధారణ ఎన్నికల్లోనే నిరూపించబడిందని ఆనంద్ గ్రహిస్తాడు. సిన్హా, రాం కుమార్, అజిత్ సింగ్ లు ఆనంద్ ద్వారా పని మంజూరీ చేయించుకుందామని పైరవీ చేస్తే ఆనంద్ అందుకు ఒప్పుకోడు. అందువల్ల వాళ్ళు ధర్మకార్యం నెపంతో అరుణ ద్వారా పైరవీ సాధించుకుంటారు. ఆమె నిజాన్ని గ్రహించి దూరం పెట్టడంతో అరుణను బండ బూతులు తిట్టడానికి కూడా తెగిస్తారు. అధిష్టానం దూతగా రంజన్ బాబు అఫ్రోజాబాద్ వస్తాడు. ఆయన పర్యటనలో ఆయనను ప్రభావితం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తారు. ఆ ఎత్తులన్నీ అనైతికమైనవే. కానీ పవర్ బ్రోకర్లకు అవే కావాలి. నరేంద్రనాథ్ అన్ని మర్యాదలూ చేసాక కూడా ‘సూట్ కేసు’ ఇవ్వకపోతే లాభం లేదనుకొని తెలుసుకుంటాడు. ఎక్కడ సూట్ కేసు ఇచ్చినా బహిరంగం అవుతుందని భయపడి విమానంలో బోర్డ్ అవుతుండగా ఒక సహాయకుడి ద్వారా ‘సర్! మీరు సూట్ కేసు మర్చిపోయారు’ అంటూ అందజేయిస్తాడు. ఢిల్లీకి వెళ్తే ముఖ్యమంత్రికి ఏం విలువ ఉండదు. పవర్ బ్రోకర్లను, జాతీయ దినపత్రికల విలేఖరులను ‘మేనేజ్’ చేసుకుంటేనే ఢిల్లీ వర్గాల్లో మంచి పేరుంటుంది.
అదే అధిష్టానం దగ్గర ప్రతిఫలిస్తుంది. ఇలాంటి అభిప్రాయాలను బలపరిచే అనేక సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఆనంద్ కు ముఖ్యమంత్రి పదవి ఎంత నాటకీయంగా వచ్చిందో అంతే నాటకీయంగా పోతుంది. ఈ రెండు సందర్భాలలోనూ రాజకీయ వివేచనతో కాకుండా ఢిల్లీ మేనేజ్ మెంట్లతోనేనని చెప్పవచ్చు. ఆనంద్ కు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చిందీ, తొలగించినదీ ఇందిరా గాంధే కనుక ఈ నవల ద్వారా ఇందిరను బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాడని, కొందరంటారు కానీ నవల మొత్తం ఇలాంటి సంఘటనలే ఉన్నాయన్న సంగతి గమనించినప్పుడు ఆ విమర్శలో పసలేదు. లోపలి మనిషి విపులమైన నవల. ఇందులో కేవలం అఫ్రోజాబాద్, ఢిల్లీ ముచ్చట్లే కాకుండా తమిళ, అసోం తదితర భాషా ఉద్యమాలు; ఇతర రాష్ట్రాల రాజకీయాలు, ముఖ్యమంత్రుల వ్యవహారాలూ చర్చించబడ్డాయి. బంగ్లా భాషోద్యమం దేశం ఏర్పాటుగా పరిణమించిన వైనాన్ని, పాక్, చైనా యుద్ధాలను సందర్భానుసారంగా చెబుతూ వచ్చారు. పాటలను, ఒప్పందాలను, నిబంధనలను చాలా చోట్ల చరిత్ర గ్రంథంలో ఉటంకించినట్లు రాసాడు పీ.వీ. ఇంత విపులంగా రాసిన లోపలి మనిషి పీవీ జీవిత గమనంలో అర్థభాగం మాత్రమే. తర్వాత కాలంలో ప్రధానిగా, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడుగా ఎదుర్కొన్న ఆటుపోట్లు చిత్రిస్తే తన ఆత్మకథాత్మక నవల సంపూర్ణమయ్యేది.
స్వతహాగా ఇది ఇంగ్లీషు నవలకు తెలుగు అనువాదం అయినప్పటికీ కల్లూరి భాస్కరం అనువాదం సూటిగా, ఒరిజినల్ రచనలాగానే ఉండడం విశేషం.
-డా. ఏనుగు నరసింహారెడ్డి
ప్రముఖ కవి, రచయిత
అదనపు కలెక్టర్, కరీంనగర్
+91-8978869183
