Home వ్యాసాలు కాకతీయులు – పద్మనాయకులు (వెలమలు)

కాకతీయులు – పద్మనాయకులు (వెలమలు)

                   సుదీర్ఘమయిన, సుప్రసిద్ధమైన కాకతీయుల పాలనలో అత్యంత ప్రధానమైన పాత్రను నిర్వహించినవారు నాయంకరులు. వీరికి నాయకులు అనికూడా పేరు. ఈ నాయకులు కాకతీయ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడంలో, అనేక దండయాత్రలలో విజయం సాధించి పెట్టడంలో ప్రధానమైన పాత్రలను నిర్వహించారు. ధైర్యసాహసాలకు, విశ్వాసపాత్రతకు వీరు మారుపేరుగా నిలబడ్డారు. వీరి శౌర్యధైర్యాలను , విశ్వసనీయతను గమనించిన కాకతీయ ప్రభువులు రుద్రదేవుడు మొదలుకొని గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన రాజులందరు ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చి ప్రశంసించారు.

                    రేచర్ల బేతిరెడ్డి లేదా బేతాళనాయకుడు ప్రథముడుగా కనిపిస్తాడు.  రేచడు అనే మాలవాడు చేసిన త్యాగానికి గుర్తుగా రేచర్ల అని వంశానికి పేరుపెట్టుకున్నట్లుగా వెలుగోటి వంశావళి అనే కావ్యం ద్వారా తెలుస్తున్నది. రేచర్ల బేతాళనాయకుని  ధైర్యసాహసాలను గురించి తెలుసుకొని గణపతి దేవుడు రాజధానికి పిలిపించి ఉన్నతోద్యోగం ఇచ్చిఆదరించాడు

                   చెవ్విరెడ్డిని చూడ చేకొని పిలిపించి / యాదరంబొదవంగ నతని జూచి

                   అసహాయ శూరుడౌ నని యాత్మ దలపోసి / చెన్నుమీరగ లక్ష సీమ నిచ్ౘ్ె

                   డాలు డమారంబు తాళిచేపట్లును / గజహయంబుల నిచ్ౘ్ె ఘనత తోడ

                   హెచ్ౘ్ుగా నాతని మెచ్ౘ్ి పిల్లల మఱ్ఱి / బేతాళ రావని పేరొసంగ

                   అదియు మొదలుగ జనులెల్ల నబినుతింప

                   రమణతోడుత విలసిల్లె రావు పేరు

                   వాసికెక్కిన రేచర్ల శాసనుండు

                   దనరె పిల్లలమఱ్ఱి బేతాళుడనగ  ( వెలుగోటి వారి వంశావళి )

         అప్పటి నుండి ఆతని వారసులు కూడా కాకతీయ రాజుల వద్ద అనేక రకాల పదవులు నిర్వహించి రాజ్యసుస్థిరతకు రాజుల రక్షణకు కారకులయ్యారు.

          గణపతి దేవుని తండ్రి మొదటి ప్రతాపరుద్రుడు అనుమకొండకు చుట్టుపట్లగల మండలాదీశ్వరులను జయించి అప్పటి తన విజయమును తన తండ్రి రెండవప్రోలరాజు జయముల నుల్లేఖించుచు తాను తనపేర నిర్మించిన రుద్రేశ్వరాలయమున శాసనము( శా.శ.1084 చిత్రభాను సం.మాఘ శు త్రయోదశి, శనివారం) ను వేయించిన శాసనం ప్రకారం తన సైన్యమునందు సేనాపతుల ధైర్యసాహసకార్యముల వినుతించుచు ఉన్నత పదవులందు పద్మనాయకులు కలరని, తన తండ్రి సేనాని రేచర్ల కామయ తనకు బాసటగా నిలచినాడని పేర్కొన్నారు.” ( పద్మనాయక చరిత్ర , కోటగిరి వేంకట నరసింహ సత్యనారాయణరావు . పుట 75). దీనిని బట్టి గణపతిదేవునికన్న అప్పుడు బేతాళరావు అనే పేరు రేచర్ల అని రేచడి కారణంగా వచ్చిన పేరు గణపతిదేవుని కాలమందే కాక ముందే ఉన్న జరిగిన సంఘటన  అయి ఉండాలి. ముందునుంచి రేచర్ల వారు కాకతీయులతో కలిసి ఉన్నారని తెలుస్తున్నది. 

                   రేచర్ల బేతాళరావు కుమారులు ముగ్గురు. దామా, ప్రసాదిత్యుడు, రుద్ర. వీరు ముగ్గురు వీరాదివీరులై కాకతీయ రాజుల వద్ద గొప్ప పదవులను నిర్వహించారు.   గణపతి దేవుని తదనంతరం రుద్రమ దేవి రాజసింహాసనం అదిష్టించవలసి వచ్చింది. కాని స్త్రీలు రాజ్యపాలనకు యోగ్యులు కారనే నెపంతోను, రాజకుటుంబాలలోని అంతఃకలహాలకారణంగాను, సామంతుల వ్యతిరేకత కారణంగాను ఆమెను సింహాసనం అదిష్టించకుండా అవరోధాలు ఏర్పడ్డాయి. అందులో రేచర్ల బేతిరెడ్డికి ముగ్గురు కుమారులు. దామా, ప్రసాదాదిత్య, రుద్ర. వీరిలో ప్రసాదాదిత్యుడు రుద్రమదేవి సింహాసనానికి వచ్చిన కాలనికి వీరుడుగా రూపొంది ఉన్నాడు. ఆనాటి పరిస్థితులను గమనించి ప్రసాదాదిత్య ఈ అలజడులకు కారణమైన సామంతులను, అంతఃపుర కలహాలకు కారణమైన వారిని తన నైపుణ్యంతోను, శూరత్వంతోను కొందరిని బుజ్ౙగించి, కొందరిని ఒప్పించి , కొందరిని బెదరించి రుద్రమ దేవికి ఆటంకం రాకుండా చూశాడు. రుద్రమదేవి సింహాసనం అదిష్టించడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు ప్రసాదాదిత్యుడు. అందుకే అతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాజ్యపితామహాంక వంటి బిరుదులు రుద్రమదేవి ప్రదానం చేసి సత్కరించింది.అంతే కాదు విజయ సూచకంగా అతని కాలికి విజయఘంట వలె అందె వేసి గౌరవించింది.“ ఆ ప్రసాదాదిత్యుండు కాకతి గణపతి దేవరాయలు చనిన, నతని కొమరిత రుద్రము దేవని బట్టము గట్టి కాకిత రాజ్యస్థాపనాచార్య బిరుదును, రాయపితాంక మహా బిరుదును పొంది డెబ్బడి యేడ్గురు నాయంకరుల దానొనర మించి భైరవ ప్రసాదలబ్ధంబగు పచ్చధరియించి నెగడె”  – వెలుగోటి వారి వంశావళి.

           ప్రసాదాదిత్యుని కారణంగానే రుద్రమ దేవి పాలనలో 77 గురు నాయంకరులను  రాజ్య రక్షకులుగా ఏర్పాటుచేసింది. నాయంకరులు అనేది నాయకుడు వంటిది. ఆయా ప్రాంతాలకు నాయకులుగా నియమించడం కావచ్చును. మరొక అబిప్రాయం ప్రకారం కాకతీయ కోటకు 77 బురుజులుండేవని ఒక్కొక్క బురుజునకు ఒకరు చొప్పున 77 గురు రక్షకులను నియమించింది. అయితే ఈ 77 గురు పద్మనాయకులే. పద్మనాయకులకు వెలమ అనే పేరుకూడా స్థిరపడింది. వెలమనాయకులు అని కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే వెలి మల నుండి ( వింధ్యపర్వతం అవతలి నుండి వచ్చిన వారు) అనే అర్థంలో ఈ పదం వచ్చిందని, వెలుగోటి వారు అనే వంశం పేరుతో వెలమ అని ఏర్పడి ఉండవచ్చుననీ, అబిప్రాయాలున్నాయి. పద్మనాయకులు, వెలమలు పర్యాయ పదాలుగానే అప్పుడు ఇప్పుడు వ్యవహారంలో ఉంది.

                   77గురు నాయంకరులు కెోట రక్షకులైనా, రాజ్యరక్షకులుగానే తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ నాయంకర వ్యవస్థను ప్రతాపరుద్రుడు క్రీ.శ.1279 ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు ప్రతాప చరిత్ర వల్ల తెలుస్తున్నది.సిద్ధేశ్వర చరిత్రకు పీఠిక రచించిన ఖండవల్లి బాలేందుశేఖరం గారు ఇచ్చిన వివరాలు,

పద్మనాయకులు 77, ఒక్కొక్క నాయకునకు సైన్యం 1500, ఉత్తమాశ్వములు 100, ఏనుగులు 10 , రాజ్యభవన సంరక్షణకు సుశిక్షితులైన సైనికులు 9000, మొత్తము అశ్వములు 24000,ఏనుగులు  2500 ఈ సేనావాహినులకు డెబ్బదియేడుగురు పద్మనాయకుల నాయకుల గావించినట్లు సిద్ధేశ్వర చరిత్ర, వచన సోమరాజీయము మొదలగు గ్రంథములందు చెప్పినారు ”. రుద్రమ దేవి కాలంలో కోట రక్షకులుగా ఉన్న నాయకులు ప్రతాపరుద్రుని కాలంలో నాయక వ్యవస్థ ను నిర్వహించి ఉండవచ్ౘ్ునని ఊహించవచ్చును. ప్రసాదాదిత్యుని అన్న దామ నాయకుడు, తమ్ముడు రుద్రనాయకుడు కూడా వీరి పాలనలో యుద్ధాలలో పాల్గొన్నారు.

                   గణపతి దేవుని తండ్రి మహాదేవుడు మరణించినపుడు గణపతి దేవుడు చిన్నవాడని, అంతఃకలహాలు చెలరేగి గణపతిదేవుని రాజును కాకుండా  చేసే ప్రయత్నాలు జరిగాయని అయితే రేచర్ల రుద్రుని రాజనీతిజ్ఞత , మల్యాల చౌండ సేనాపతి సహాయంతో గణపతి దేవుని కాకతీయ సింహాసనం అదిష్టింపజేసిందని, అందుకు గణపతి దేవుడు అతనికి మాండలిక హోదానిచ్చి తగిన రాజచిహ్నాలు, జతకౌడీలు మొదలైనవి ఇచ్చి గౌరవించాడని  తెలుస్తున్నది. అంతేకాదు రేచర్ల రుద్రుడే చాళుక్యరాజులలో ఒకరైన నాగతిరాజును భ’ద్రాచలం ప్రాంతానికి తరిమివేసి ఆ భాగాన్ని కాకతీయ సామ్రాజ్యం లో కలిపివేశాడని అతనికి కాకతి రాజ్య సమర్థ, కాకతీయ రాజ్య భార ధౌరేయ అనే బిరుదులున్నాయని రుద్రసేనాని మంత్రి అయిన రాజనాయకుడు వేయించిన ద్రాక్షరామ, ఉప్పరపల్లి శాసనాలు పేర్కొన్నాయి . ( కాకతీయులు.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి ). అయితే ఈ రుద్రుడు చెవ్విరెడ్డి కుమారుడైన రుద్రుడా? లేక రేచర్ల రెడ్డి రుద్రుడా అనే విషయంలో కొంత అస్పష్టత ఉంది. పరబ్రహ్మ శాస్త్రి గారి విశ్లేషణ ప్రకారం రేచర్ల  రెడ్డి వంశీయులు, రేచర్ల వెలమ వంశీయులు ఉన్నారని చూపారు. రేచర్ల అన్న పేరు వంశనామంగా బేతాళనాయకునికే ( చెవ్విరెడ్డి) అతని దగ్గర పనిచేసే రేచడు అనే అతడు తనకు భూమిలో దొరికిన నవలక్ష ధనరాశిని పొందడానికి  స్వయంగా బలిదానం చేశాడని, ఆకారణంగానే చెవ్విరెడ్డి వంశం పేరు అతనికి కృతజ్ఞతగా రేచర్ల అని పెట్టుకున్నారని వెలుగోటి వారి వంశావళి స్పష్టంగా తెలుపుతున్నది. రేచర్ల వంశనామంతో రెడ్డి కులస్తులు కాక చెవ్విరెడ్డికి రెడ్డి అని ఉన్నట్లుగా రావు బిరుదు రాకముందు రెడ్డి అనే వ్యవహారం ఉండి ఉండవచ్చునని భావిస్తే రేచర్ల వంశంలో వెలమ, రెడ్డి అనే వారిద్దరు ఉండరు. అయితే పరబ్రహ్మశాస్త్రిగారు రెండు వంశ వృక్షాలు కూడా చూపించారు. రేచర్ల వారిలో రెండు కుటుంబాలు క్రమంగా పెరిగి రెండు వంశవృక్షాలు కావచ్చును. రావు బిరుదు అందరూ ఒకసారి వాడుకొని ఉండకపోవచ్చు. అంతమాత్రాన రేచర్ల వారు రెడ్లు వెలమలు అని వేరు వేరు లేరు. ఇప్పటికీ వెలమ వారే రేచర్ల గోత్రంతో సుప్రసిద్ధులుగా ఉన్నారు. ఇది మరింతగా పరిశోదించవలసిన అంశం.

                             “ వా లని బెఱకిన పరభూ

                               పాలస్త్రీభూషణములు పాసి పడును నీ

                               వా లావనితల తొడవుల

                               కీలా? రేచర్ల రుద్ర కీర్తి సముద్రా!” -వె.వం.19 వ పద్యం

శత్రువుల భార్యల భూషణములు తొలగించువాడనగా వారి భ’ర్తలను వధించువాడని అర్థంలో రేచర్ల రుద్రుని వీరత్వాన్ని గురించి పొగిడిన పద్యం ఇది. ఈ రుద్రుడు ప్రసాదాదిత్యుని సోదరునిగురించియే ఉన్నది.

          ప్రసాదాదిత్యుని అన్న దామ కుమారులు వెన్నమనాయుడు, సబ్బినాయుడు. 14 వ శతాబ్దం మొదటి పాదంలో వీరు చాలా ప్రశస్తిని పొందినారు. మహమ్మదీయులు జరిపిన దాడుల సందర్భంగా వెన్నమనాయుడు ఎదురొడ్డి మట్టి కరిపించాడు. ఢిల్లీ సుల్లానులు ఖిల్జీ, తుగ్లక్‌లు కాకతీయులపై ఎన్నో మార్లు దండయాత్రలు జరిపించారు. చరిత్ర ప్రకారం ఐదుసార్లు జరిపిన వివరాలు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిసారి పూర్తిగా విఫలం చెంది వెనుతిరిగినారు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, మరియు మాలిక్ జకరా, అనే వారి నాయకత్వంలో సైన్యాన్ని కాకతీయుల పైకి పంపించాడు. ² అల్లాఉద్దీన్ ఖిల్జీ. క్రీ.శ.1303 లో జరిగినట్లు చరిత్రకారుల అంచనా. ఇందులో వెన్నమనాయుడు వారిని ఎదిరించి పోరాడినా విజయం సాదించలేదనే అబిప్రాయం ఉంది. అప్పుడు ప్రకృతి అనుకూలించలేదు. వర్షాలు కురవడం యుద్ధానికి భంగం ఏర్పడింది. అయినా శత్రువులు కాకతీయ సామ్రాజ్యంలోకి అడగుపెట్టకుండానే వెనుదిరిగిపోయారు. ఇది విజయంగానే భావించాలి.

                   వెన్నమనాయుడితో పాటు పద్మనాయకులలో పైశాల వంశీయుడైన పోతుగంటి మైలి ( మల్లి ) ఉప్పరిపల్లి వద్ద మాలిక్ కాఫర్ జరిపిన దండయాత్రలో బీకర పోరాటం చేసి వారిని తరిమికొట్టినాడు. ఉప్పరపల్లి కరీంనగర్ జిల్లాలో ఉంది. మాలిక్‌కాఫర్ సైన్యం ఇక్కడిదాకా చొరబడింది. అయినా విజయం సాదించలేదు మాలిక్‌కాఫర్. ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేదు. క్రీ.శ.1309లో మాలిక్‌కాఫర్ తిరిగి దండయాత్ర చేశాడు. ఈ సారి ప్రతాపరుద్ర చక్రవర్తి పదే పదే దాడుల వల్ల విసిగిపోయి కావచ్చు ,ఢిల్లీ సుల్తానులతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అది ఆయన మరణాంతం వరకు కొనసాగింది. అయితే ఒక సారి ఢిల్లీ సుల్తాన్ సమక్షంలో పోతుగంటి మైలికి, తెలుంగు బిజ్ౙలుడు అనే అతనికి ద్వంద్వయుద్ధం ఏర్పాటు చేశారు. అక్కడ కాకతీయుల 77గురు నాయకులు కూడా ఉన్నారని ఈ ద్వంద్వయుద్ధంలో పోతుగంటి మైలి విజయం సాదించి 77గురు నాయకులతో తిరిగి వచ్ౘ్ాడని తెలుస్తున్నది. డిల్లీ సుల్తానుకు కప్పము చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటుందని చరిత్రకారుల అబిప్రాయం.ఈ పోతుగంటి మైలికి ‘ వైరి గజబీమ, తెలుగుబిజ్ౙలు మణిమూపుర తలాట రాయా” అనే బిరుదులతో కాకతీయ రాజులు సత్కరించారు.

                   వెన్నమనాయకునికి ఎఱదాచ, సబ్బినాయనికి నలదాచ కుమారులు. ఇందులో  ఎఱదాచ ప్రతాపరుద్రుని ఆదేశంతో కంచి సమీపంలో పాండ్యులతో తలపడి కంచిని కాకతీయుల వశమయేటట్టు చేశాడు. పాండ్యరాజుల 9 లక్షల సైన్యాన్ని ఎదిరించి, వీరపాండ్య, విక్రమపాండ్య, పరాక్రమ పాండ్య, సుందరపాండ్య, కులశేఖర పాండ్య అనే అయిదుగురిని ఓడించినాడు. ఈ విజయాలపట్ల సంతసించిన ప్రతాపరుద్రుడు ఎఱదాచను అమితంగా గౌరవించి ‘ పాండ్యదళ విƒ’వ’ పాండ్య గజకేసరి; అనే బిరుదులతో సత్కరించాడు. కంచిలో అంతకుముందునుంచి ఉన్న పాండ్యులు చాలాకాలం గణపతి మహారాజుకు సామంతులుగా కప్పం చెల్లించేవారు. కాని క్రమేణా స్వతంత్రించారు. నెల్లూరు (విక్రమసింహపురి) చోళులకు వీరికి తరచు యుద్ధాలు జరుగుతుండేవి. బహుశ వీరినుండి కాపాడడానికే మహాకవి తిక్కన గణపతి మహారాజుదగ్గరకు రాయబారానికి వచ్ౘ్ి ఉంటాడు. తదనంతర కాలంలో ప్రతాపరుద్రుడు నెల్లూరుకు అదిపతిగా పరిపాలన కొనసాగిస్తున్న ముప్పిడినాయకుని కంచిపాండ్యులపైకి పంపించాడు. కంచి ని వశం చేసుకోవడానికి ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్న తిరుగుబాటు నాయకులలో ఒకరైన కోటతిక్క అనే అతడు , కొద్దిరోజులు మాత్రమే తనకు తాను రాజుగా ప్రకటించుకున్న కేరళ రాజు  రవివర్మ లు పాండ్యుల దాడులలో ఓడిపోతూనే ఉన్నారు. ముప్పిడి నాయకుడు తోడుగా పద్మనాయకుల సైన్యంతో దాడి చేసి కోటతిక్కను తరిమికొట్టారు. క్రీశ.1322 నాటి ద్రాక్షారామంలో దొరికన  ప్రచురితం కాని ఒక శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఈ శాసనాన్ని ముప్పిడి నాయకుని కుమారుడు పెద్ద రుద్ర వేయించినట్లుగా ఉంది.

                   చిత్తూరు జిల్లా నారాయణ వనంలో హోయసల భ’ల్లాణుడు అనేవాడు, పాండ్యులపై తిరుగుబాటు చేసే కోటతిక్క ఒక్కటై నారు. పాండ్యులు కూడా కాకతీయులను తరిమివేయడం కోసం మారురూపాలలో సైన్యాన్ని ప్రవేశపెట్టింది. కాని ఈ విషయాలను పసిగట్టిన కాకతీయులు ముప్పిడినాయకునికి ఆదేశాలు ఇచ్ౘ్ారు. ఆయన ఎఱదాచను ససైన్యంగా పంపించారు. పాండ్యులు పంపిన మారురూపంలో ఉన్న సైన్యాన్ని , హోయసల భల్లాణుడి, కోటతిక్కను అందరినీ ఓడించాడు. పాండ్యులకు చెందిన గజదళాలను కైవసం చేసుకున్నాడు. ముప్పిడినాయకుడు, ఎఱదాచలు కంచిపట్టణానికి కాకతీయుల ప్రతినిదిని పాలకునిగా నియమించి ఓరుగల్లుకు చేరుకున్నారు.

                   ఎఱదాచకు ముగ్గురు కొడుకులు.సింగమ, వెన్న, ఏచ. వీరు కూడా కాకతీయులకాలంలోను తదనంతరం కూడా 14 వ శతాబ్దంలో గొప్పవీరులుగా ప్రఖ్యాతి గడించారు.మహమ్మదీయులు కాకతీయులపైకి దండయాత్రలను జరపడం మానలేదు. క్రీ.శ.1321లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పక్షాన ఉలూఖ్ ఖాన్ ముందుగా తమ ఏలుబడిలోని కొన్ని ప్రాంతాలను కొల్లగొట్టిన గోసంగీయులను తరిమి తదనంతరం కాకతీయుల ఏలుబడిలోకి వచ్చినారు. అక్కడ ఎఱదాచానాయకుడి కుమారుడు ఏచ అనే అతను అడ్డగించాడు. ఆయనను ఎన్నోమార్లు మహమ్మదీయులు వేధించారు. కొలచెలమ వద్ద ఏచ నాయకుడు ఉలూఖ్ ఖాన్ సైన్యాన్ని ఎదిరించాడు. విజయం సాధించాడు.

                   క్రీ.శ.1323లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పెద్దసైన్యంతో ఓరుగల్లుపై దండయాత్రచేసి ప్రతాపరుద్రుని బందీగా తీసుకొని పోయాడు. క్రమంగా కాకతీయ సామ్రాజ్యంలో చిన్న చిన్న అంతఃకలహాలు బయలు దేరాయి. వాటిని అణచివేసే ప్రయత్నం సింగమనాయకుడు చేశాడు. అంతవరకు కృతకృత్యుడయ్యాడు. అయితే మహమ్మదీయులు పాలకులుగా నియమింపబడటం దానిని సహించని హిందువులు తిరుగుబాటు చేయడం, కాపయనాయకుడు ముసల్మానుల నెదిరించడం వంటి సంఘటనలు జరిగినా కాకతీయ సామ్రాజ్యం పటిష్టం చేయడం జరుగలేదు. ఫలితంగా సింగమనాయకుడు రాచకొండ రాజ్యస్థాపనకు పూనుకొనవలసి వచ్చింది. అంతకు ముందు సింగమ మత్స ముఖ్యులతో పోరాటం చేసి జీలుగుల వద్ద మత్స కొమ్మ ను మగతుల వద్ద రుద్రను తరిమి వేశాడు. ఇటువంటి సందర్భాలనేకం చూసిన ప్రతాపరుద్రుడు అతనికి అనేక బిరుదులు సత్కారాలు వరాలు ఇచ్చాడు. ఆసీతి వరాల సింగమనాయకుడు అనికూడా పిలిచేవారు.

                   సింగమనాయకుడు తప్పని స్థితిలో రాచకొండ రాజ్యమును స్థాపించాడు. ఈ స్థితిలోనే శత్రువులు జల్లపల్లికి తన బావ చింతలపట్ల సింగమనాయకుని బందించినారని తెలిసి వారిపై దండయాత్రకు బయలు దేరాడు. సింగమనాయని కుమారులు అనపోతానాయకుడు, మాదానాయకులు అప్పటికే చేజర్ల వద్ద జరుగుతున్న ఒక యుద్దంలో ఒకరు మొగళ్ళూరు వద్ద జరుగుతున్న యుద్దంలో మరొకరు ఉన్నారు. జల్లపల్లి వద్ద పైశాల వంశ గన్నమనాయకుడు కోటనుండి శత్రువులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లపల్లికి సింగమనీడు తన కుమారుల సహాయం తీసుకొనని పరిస్థితులలో సైన్యాన్ని పంపించి తాను కృష్ణాతీరంలో గుడారం లో సైన్యంతో పాటు ఉన్న సందర్భంలో శ్రీశైలానికి చెందిన తంబళ్ళ కృష్ణాజీ బొమ్మ జియ్యరు అను అతని చేత రాయబారం పంపించే నెపంతో గుడారం లోపలికి పంపించి మాట్లాడుతుండగా వెనుక చాటుగా కత్తితో సింగమనాయకుడిని పొడిచి వేశాడు. ఈ వార్త వెంటనే తమ కుమారులకు చారుల ద్వారా తెలిసింది. అక్కడ ఉన్న నాయకులు, ఇతర సామంత రాజులందరూ చేరి ఆ వీరునికి పాదరక్షలు విడిచి వందనాలు సమర్పించారు. చివరి దశలో చేరుకున్న కొడుకులకు శత్రువులను నిర్జించె హితబోధ చేశాడు సింగమనాయకుడు. తండ్రి శరీరాన్ని జల్లపల్లి క్షేత్రంలో ఆసనంపై ఉంచి అప్పటికే అక్కడ ఉన్న నాగన్ననాయకుడితో కలిసి తమ వెంట ఉన్న సైన్యమే కాక నాయకులపై అబిమానం గల ప్రజలెందరో వీరోత్సాహంతో జల్లపల్లికి చేరుకొని యుద్ధంలో పాల్గొన్నారు. విజయమో వీర స్వర్గమే అని ప్రజలందరూ రావడం అనపోతానాయకునికి ఊహించని బలమే అయింది. ఆనాడు జల్లపల్లి వద్ద చేరిన శత్రురాజులు, క్షత్రియులు, రెడ్లు , కళింగ ప్రాంతపు రాజులు అప్పటికి వెలమలకు కాకతీయులు ప్రాధాన్యతనివ్వడం నచ్చని ఎందరో అంతర్గత శత్రువులు అదను చూసుకొని ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే అనపోతానాయకుడు ఈ యుద్ధంలో వీరసింహం వలె విజృంబించాడు.ఈ యుద్దంలో క్షత్రియులకు రాజ్యకాంక్ష ప్రద¥నం కాగా వెలమలకు ఆత్మాబిమానం ప్రద¥నంగా యుద్ధం జరిగింది.  దొరికిన శత్రువులనందరినీ వదించాడు.వెలమ వీరులకు దొరికిన శత్రువులను చిత్రహింసలు పెట్టి చంపివేశారు. కొన్ని తలలను గానుగలాడించారట, కొన్ని తలలను శూలాలకు గుచ్చి పైకెత్తి వీరహుంకారాలు చేశారు.పూర్తిగా విజయాన్ని సాధించి క్షత్రియుల తలలతో రక్తంతో అన్నం కుడిపి భూతపిశాచాలకు కుడుపుగా పెట్టి తండ్రికి వారి రక్తంతో తర్పణలు విడిచారట. ఈ జల్లపల్లి యుద్ధంలోనే ‘ రణము కుడుపు’ చేశారు.శాలివాహన శకం 1273 ( క్రీ.శ.1361) శార్వరి నామ సంవత్సర కార్తీక శు. దశమి నాడు అనపోతానేడు రణము కుడిపెను’ అని చరిత్ర చెపుతున్నది.  మెగలూరు, ఇనుగుర్తి, జల్లపల్లి, మొదలైన ఎన్నో యుద్ధాలు వీరికి విజయాలను కలిగించాయి.క్రీ.శ.1369 ప్రాంతంలో ఓరుగల్లు, భువనగిరి కూడా అతని కైవసంలోకి వచ్సాయి. ఆంధస్రురత్రాణ, అనమనగంటి పురవరాదీశ్వర, మొదలైన బిరుదులు పోందాడు.  తండ్రిగారి ఆలోచన ప్రకారం అనపోతానాయడు రాచకొండ రాజ్యాన్ని సుస్థిరం చేసి ఎంతో వైభ’వంగా పాలించాడు.రాజ్యాన్ని రెండు భాగాలు చేసి రాజకొండ దుర్గం కేంద్రంగా ఉత్తరప్రాంతానికి అనపోతానాయకుడు, దేవరకొండ దుర్గాన్ని తానే నిర్మించి రాజద¥నిగా దక్షిణ ప్రాంతానికి తమ్ముడు మాదానాయకుని రాజుగా చేసి  పరిపాలించారు. వీరిరువురు ఒకే వృక్షానికి శాఖలవలె పరస్పరం తోడుగా ఉంటూ రెండు రాజ్యాలైనా ఒకే రాజ్యం మాదిరిగా పరిపాలించి వెలమలకు అశేషమైన కీర్తిని సమకూర్ౘ్ారు. వీరి తరువాత రెండవ సింగమ, రెండవ అనపోత, రావుమాదÎవ, మూడవ సింగమ వరుసగా రాజ్యాలను పాలించారు.

                   కళింగులపై గెలిచిన సందర్భంగా( క్రీ.శ.1367 ) విజయాన్ని సాదించి సోమకుల పరశురామ బిరుదాన్ని పొందాడు.  రెడ్డిరాజులతోను, బహమనీ రాజులతోను యుద్ధాలు చేశారు. కొన్ని సందర్భాలలో బహమనీయులతో సందికి ఒప్పుకున్నారు. క్రమంగా రాచకొండ, దేవరకొండ సామ్రాజ్యాలు అంతరించాయి.

                   అనపోతానాయకుని పెద్ద కుమారుడు రెండవ సింగమనాయకుడు కళ్యాణ దుర్గాన్ని జయించాడని విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక వల్ల తెలుస్తున్నది. పెదవేగి బెండపూడి మొదలైన దుర్గాలను కూడా ఇతడు జయించాడు.

                   క్రీ.శ.1399 -1421 వరకు పాలించిన రెండవ అనపోతానాయకుడు అద్దంకి కొండవీడు రెడ్డి రాజులతో తరచు యుద్ధాలు చేశాడు. పెదకోమటి వేమారెడ్డిని ఓడించి వదించాడు. తమ్ముడు మాదానీడు 1421- 30 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే బహమనీయులు బలపడ్డారు. రాజ్యాదికారం సన్నగిల్లింది. ఈతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో నాగారం వద్ద నాగసముద్రమనే గొప్ప చెరువును తవ్వించి శాసనం వేయించింది.

          రెండవ అనపోతానాయకుని కుమారుడు మూడవ సింగమనాయకుడు క్రీ.శ.1430- 75 వరకు పాలించాడు. 

ఈతని కాలంలోనే చివరి దశలో రాజ్యం బహమనీయుల వశమైంది. అయితే కళింగ హంవీరుడనే అతని కారణంగా మరల బహమనీయులు తదితరులతో జరిగిన యుద్ధాల వల్ల రాచకొండ కొంతకాల మరల పద్మనాయకుల అదీనంలోకి వచ్ౘ్ింది. కాని విజయనగరరాజులు కూడా విజృంబించడం వల్ల వీరి పాలన ముగిసింది.

తరతరాలుగా వెలమలు వీరత్వానికి సాహసానికి త్యాగానికి ప్రతినిధులుగా ప్రతీకలుగా నిలిచారు.

                   పద్మనాయకులు ఎంత వీరులో అంతగొప్ప కళాకారులు. సంగీత, సాహిత్య, నృత్యశాస్త్రములందు పాండిత్యములు గలవారు. స్వయంగా అనేక కృతులు వెలార్ౘ్ినవారు. కవిపండితులను పోషించినవారు. దైవ భక్తులు ఆలయాలు నిర్మింపచేశారు. చెరువులు తవ్వించారు. శిల్పాలు చెక్కించారు. అనేక రంగాలలో వారికి గల ప్రజ్ఞాపాటవాలే ప్రజలు ఆదరించడానికి కారణమయ్యాయి.

                   శ్రీశైలం వద్ద కృష్ణానదికి సోపానములు కట్టించారు. రాచకొండలో అనేక ఆలయాలు నిర్మించారు.

మొదటి అనపోతానాయకుడు స్వయంగా అబిరామ రాఘవం అనే నాటకం రచించాడు.

పశుపతి నాగనాథుడు సంస్కృతంలో ‘ మదన విలాసం’ అనే భాణమును, తెలుగులో విష్ణుపురాణమును రచించిన కవి మొదటి అనపోతానాయని ఆస్థానంలో ఉన్నవాడే. పద్మనాయక చరిత్రకు ప్రధాన ఆధారం వంటిదైన ‘ అయ్యనవోలు శాసనం ’ రచించింది కూడా ఈతడే.

రెండవ సింగభూపాలునికి సర్వజ్ఞ బిరుదముండేది. ‘ సర్వజ్ఞనామదÍయము, శర్వునకే రావుసింగభూపాలునకే, ఉర్వింజెల్లును, తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే’ అనే పద్యం శ్రీనాథుని చాటువుగా ప్రసిద్ధిపొందింది. రసార్ణవ సుధాకరం, సంగీత రత్నాకరం, రత్న పాంచాలిక, కందర్ప సంభ’వం అనే సంస్కృత గ్రంథాలను రచించాడు. చమత్కార చంద్రిక , వీరభ’ద్ర విజయం అనే డిండిమం రచించిన కవి విశ్వేశ్వరుడు ఇతని ఆస్థానంలో ఉన్నారు. బొమ్మకంటి అప్పయాచార్యుడు అమరకోశానికి వ్యాఖ్యాన రూపం అమర పారిజాతము రచించిన కవి కూడా ఈతని ఆస్థానంలోని వాడే. మరొక కవి హరిహరుడు అనర్ఘ రాఘవం రచించారు.

రావు మాధవనాయకుడు ‘ రాఘవీయం ’ పేరుతో క్రీ.శ.1427లో ఒక రామాయణ వ్యాఖ్యానాన్ని రచించి శ్రీరామున కంకితమిచ్చినాడు.

                   శాకల్యమల్లభట్టు, శాకల్య అయ్యలార్యుడు, వేదాంతదేశికుడు, మల్లినాథ సూరి, కొలిచెలమ పెద్దిభ’ట్టు, బమ్మెర పోతన మొదలైన వారు మూడవ సింగమనాయకుని ఆస్థానాన్ని అలంకరించినవారే. పోతన భోగినీ దండకం ఈయన ఆస్థానంలో నాట్యాన్ని చూసి రచించాడు. సర్వజ్ఞసింగభూపాలుడు అనే బిరుదం ఇతనికి కూడా ఉంది. పోతన ఆక్షేపించిన కర్ణాట కిరాత కీచకులు అనే పదంలో పద్మనాయక రాజులైన సింగమనాయకులకు వర్తించదు. వీరు కర్ణాట నాయకులు కారు. స్వయంగా కవిపండితులైనందున కవిని హింసించే లక్షణం లేదు. పైగా పోతన భాగవతాన్ని పాతిపెట్టిన విషయం తెలుసుకొని

                   అనవిని సింగభూపతియ యప్పుడు భూమిని పాతిపెట్ట జే

                   సిన కృతి బెల్లగించి కవశేఖరులెల్ల పఠింపజేసి, చి

                   క్కిన కృతి భాగమున్ నిలిపి కేవల మప్రతి దృశ్యమైన దా

                   నిని తనుగొల్చె సత్కవులు నింపగజేసె దయారసంబుగన్…..అని ఆయన ఖిలభాగములు పూర్తిచేయించినారు.

                   శ్రీనాథమహాకవి “ ఎటుల మెప్పింతువో నన్ను నింకనీవు,

                                      రావు సింగమహీపాలు దీవిశాలు

                                      నిండుకొలువున నెలకొని యుండినీవు

                                      సకల సద్గుణ నికురుంబ శారదాంబ” అని ఆయన సభామధ్యంలో ఉన్న సరస్వతిని ప్రార్థించినాడు. భువనవిజయాన్ని స్థాపించిన శ్రీకృష్ణదేవరాయల కంటే ముందుగా సభామధ్యంలో సరస్వతిని స్థాపించిన ఘతన సింగభూపాలునిదే. సింగభూపాలుడు సాహితీకళాయుద్ధరంగాలలో శ్రీకృష్ణదేవరాయలకు ఆదర్శం కూడా కావచ్చును.

                   పద్మనాయకుల కాలం నాటి శాసనాలు, కట్టడాలు, శిల్పాలు, రచనలు, శాస్త్రగ్రంథాలు, ఎన్నో శోదించడానికి అవకాశం ఉన్నాయి. తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకుల ముద్ర చారిత్రకమైనది. చెరగనిది. దాని చాయలు ఇప్పటికీ ఈ కులస్థులలో ఉండడం గమనిస్తున్నాం. వీరిది ఆనువంశికమైన ధర్మవీరము.

                             అకలంకంబై శౌర్యధైర్యమయి శౌర్యంచద్దయాదైన్యమై

                             కకుభావేల్లిత కీర్తి పూర్తియయి రంగద్వైరి పాళీ భయా

                             నకమై విద్యకు దావలంబయి వదాన్యస్ఫీతమై పద్మనా

                             యక వంశంబు ధరిత్రి పెంపెసగు వెల్మాఖ్యాతకంబై కడున్….( చంద్రహాస విలాసము)

ఆధార గ్రంథాలు.

కాకతీయులు – పి.వి. పరబ్రహ్మ శాస్త్రి

వెలుగోటి వారి వంశావళి, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురితం, 1939

వెలుగోటి వారి వంశావళి ఆంగ్ల పీఠిక – నేలటూరి వేంకటరమణయ్య

పద్మనాయక చరిత్ర -కోట వెంకట నరసింహ సత్యనారాయణ రావు ( బుచ్చినాయన)

రాచకొండను కాపాడుకుందాం -క్షేత్రపర్యటన నివేదిక వ్యాసాలు, –

ద్యావనపల్లి సత్యనారాయణ, సంగనభట్ల నరసయ్య, తంగెడ కిషన్‌రావుగారు

క్రీడాబిరామము చాటువులు

You may also like

Leave a Comment