“చూడు దేవకి…వాసు నీ ఒక్కదానికే కాదు నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలనేది నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. సౌమ్య…
నీ అన్నకూతురు అనే ఒక్కఅంశం తప్ప ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నా నని తప్పుగా అనుకోకు. నాకు వాసుభవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు నీ మనోభావాలు అంటేఅంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీమాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది.” అన్నాడు భార్గవ. భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మందగ్గర ఏదో అలికిడి అవటంతో అటు తిరిగి చూసింది దేవకి.
ప్రొఫెసర్ రాధాదేవిని చూసి అలానే చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడి పోయింది దేవకి.
అది గమనించిన భార్గవ, అవాక్కయి,ఆపై గుండెల్లో సన్నని మెలితిరుగుతూ నొప్పిరాగా, ” దేవకి….” అంటూ నేలకొరిగిపోయాడు.
★★★
ప్రొఫెసర్ రాధాదేవి గంభీరంగా లోపలికివచ్చి “దేవకి!మంచినీళ్ళు తీసుకురా!” అంది.
మరబొమ్మలా మంచినీళ్ళగ్లాసు తీసుకొచ్చిన దేవకి చేతిలోంచి రాధాదేవి గ్లాసుతీసుకుని వాసుని భార్గవని వడిలోకి తీసుకోమని , భార్గవ మొహాన నీళ్ళు చిలకరించింది. రాధాదేవి.
ఏమాత్రం ఊహించనిది. ఈవిధంగా మళ్ళీ రాధాదేవిని చూస్తాను,కలుస్తాను,అదీ తమఇంటిలో అని కలలో కూడా ఊహించలేదు దేవకి, భార్గవలు.
అంతా సవ్యంగా జరిగితే. వాసు పెళ్ళిచేసి సంఘంలో ఒక మంచితండ్రిగా నిలబడదామనుకున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో ఇప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని అదీ వాసువల్ల సంపాదించుకున్నాడు. ఫలితం చేతికందే సమయానికి ప్రొఫెసర్ రాధాదేవిరాక దేవకి, భార్గవలకి పచ్చి వెలగపండు గొంతులో పడ్డట్టయింది.
★★★
భార్గవ డా||వి.ఎస్.కృష్ణ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవాడు. ప్రొఫెసర్ రాధాదేవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. వృత్తిపరంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ భార్గవని, దేవకిని ఇంటికి టీకి పిలిచేది రాధాదేవి. కాలేజీ పిక్నిక్స్ కి కుటుంబాలతో వెళ్ళటంతో దేవకి రాధాదేవి తో చనువు ఏర్పడింది.
ఎంతో చలాకీగాఉండే దేవకి అప్పుడప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండటంచూసి, “ఎందుకు దేవకి? హఠాత్తుగా ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు.” అంటూ గుచ్చి గుచ్చి అడిగింది రాధాదేవి.
“ఏమీ లేదండీ! అన్నీ ఉన్నాయి కాని ఆడదానిగా నాకు భగవంతుడు తల్లినయ్యే యోగ్యత ఇవ్వలేదు. ఎన్నోపరీక్షలు చేయించుకున్నా కానీ ‘అనోవ్యులేషన్’ అంటే అండాశయం విఫలం కారణంగా నాకు పిల్లలుపుట్టే అవకాశం లేదన్నారు. దానితో నాకు విడాకులిచ్చి మళ్ళీపెళ్ళి చేసుకోమని భార్గవ వైపు వారు బలవంతం చేస్తున్నారు.” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవకి.
ఈవిధంగా తన బాధను పంచుకుని మరింత సన్నిహితురాలయింది దేవకి రాధాదేవికి.
★★★
చదువుకునే రోజుల్లో మాధవ్ అంటే ఎంతో ఇష్టపడింది రాధాదేవి. రాధాదేవి శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో ఐదుగురు సంతానంలో పెద్దాడపిల్ల.
మాధవ్ ఒక్కగానొక్క కొడుకు. కులంవేరు.
రాధాదేవి తల్లిదండ్రులకి మాధవ్ కులం అభ్యంతరం అయితే, మాధవ్ తల్లిదండ్రులకి రాధాదేవి అంతస్తు అభ్యంతరమైంది.
ఇరువురు ఇరుకుటుంబాలకి నచ్చచెప్ప ప్రయత్నించారు.
“ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. ఇద్దరు మగపిల్లల్ని చదివించాలి. ఇంటికి పెద్ద ఆడపిల్లవి నువ్వే తప్పటడుగు వేస్తే, నీ బాటలోనే అందరూ వెళ్తారు. చెల్లెళ్ళకు సంబంధాలు రావు. మత్స్యమాంసాదులు తినే అతనితో కాపురం సజావుగా ఉండదు. ఏ ఆలూమగలకైనా ఎంత ప్రేమ ఉన్నా భోజనం సరిగ్గా లేకపోతే ఆ మగాడు కేవలం ప్రేమని ఆస్వాదిస్తూ బ్రతుక లేడు. అలా అని నువ్వు అవి వండిపెట్టగలవా!” అంటూ రాధాదేవికి అనునయంతో తండ్రి ప్రభాకరశాస్త్రిగారు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ప్రేమపెళ్ళిళ్ళు సాధారణంగా విఫలమవటానికి ముఖ్యంగా ఆహారవ్యవహారాలేనని ఎన్నో ఉదాహరణలు తెలిపారు.
అటు మాధవ్ తల్లిదండ్రులు మాధవ్ ను వారికి అనుకూలంగా నయాన్న భయాన్న లొంగదీసుకున్నారు.
చదువు పూర్తికాలేదు.ఉద్యోగం వస్తుందన్న ఆశలేదు..
జీవితం సినిమా కాదని ప్రస్తుతానికి తల్లిదండ్రులమాటవిని తనకాళ్ళమీద తాను నిలబడ్డాక రాధాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు మాధవ్.
తండ్రి చెప్పిన మాటలు విన్న రాధాదేవి,”నాన్నా! మీరు నా చదువుకి అడ్డం చెప్పకుండా నేను చదువుకోవాలని అనుకున్నంతవరకూ చదివించండి.” అని ప్రాధేయపడింది.
దానికి ప్రభాకరశాస్త్రి రాధాదేవి తల నిమిరాడు ‘సరే’ అన్నట్లు.
ప్రభాకరశాస్త్రి కి మనస్సులో “అయ్యో ఏమీ అడగని నా చిట్టితల్లి అడిగినది కాదన్నానే!” అన్నబాధ, ఏదో తప్పుచేసానన్న భావన దహించి వేయసాగింది.
రాధాదేవి ఎమ్.ఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభాకరశాస్త్రి భయపడుతూనే రాధాదేవి తో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఖచ్చితంగా చెప్పటంతో చేసేదిలేక రాధాదేవి చెల్లెళ్ళిద్దరికీ వివాహం చేసాడు.
మగపిల్లలిద్దరికి శాస్త్రోక్తంగా వడుగులు, పెళ్ళిళ్ళు చేసాడు.
తండ్రిగా పెద్దకూతురుకి అన్యాయం చేసానన్న బాధతో అనుక్షణం ఆలోచించి మాసివ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. భర్త చాటు భార్య అయిన సుశీలమ్మ భర్తమరణంతో అయోమయ స్థితిలోకి వెళ్ళింది. పెట్టింది తినడం శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం,ఉలుకూ పలుకూ లేదు.
రాధాదేవి తమ్ముళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీలో ఇంకొకరు కేరళాలో ఉద్యోగరీత్యా ఉన్నారు. తల్లిని తమతో ఉంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రమూ లేదు.
పైగా పెళ్ళిపెటాకులు లేకుండా ఉన్నఅక్క చూసుకుంటుందిలే అన్న ధీమా.
జీవనస్రవంతిలో మరో మలుపు చోటుచేసుకుంది వారి కుటుంబంలో.
అందరికంటే చిన్నది అయిన చిన్న చెల్లెలు ప్రసవానికివచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డని చూడటానికి వస్తున్న వాణి భర్త, విధివంచితుడై రోడ్ ఏక్సిడెంట్ లో అసువులుబాసాడు. ఆవార్తవిన్నపురిటాలు వాణి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. వాణి భర్త ఒక్కడే సంతానం వారి తల్లిదండ్రులకు. కొడుకే పోయాక తమకు వారికి ఏసంబంధం లేదని వాణి అత్తమామలు చెప్పటంతో రాధాదేవికి ఏంచేయాలో పాలు పోలేదు. పెద్దచెల్లెలుని, తమ్ముళ్ళను బ్రతిమాలింది. ఎవరూ తాత్కాలికంగా కూడా బిడ్డ బాధ్యత తీసుకునేందుకు సిధ్ధంగా లేకపోయారు.
ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో దేవకి, భార్గవలు గుర్తుకొచ్చారు. దేవకి, భార్గవలను పిలిచి విషయం వివరించి “పిల్లవాడిని పెంచుకుంటారా!” అని అడిగింది రాధాదేవి.
అడగకుండానే వరాలిచ్చినంత సంతోషపడ్డారు దేవకి,భార్గవలు.తడుముకోకుండా వెంటనే అంగీకారం తెలిపారు.
పిల్లవాడికి ఆయే ఖర్చు తానేభరిస్తానని, పిల్లవాడి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తనకు తెలియకుండా తీసుకోవడానికి వీలులేదని ఒప్పందం కుదుర్చుకుంది రాధాదేవి. పసివాడికి తానే వాసుదేవ్ అని నామకరణం చేసింది రాధాదేవి.
★★★
రాధాదేవి ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ
కుటుంబంలో అనుకోని పరిణామాలకు మానసికంగా దెబ్బతిన్న రాధాదేవి మార్పుకోరింది. తల్లి కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు తను చెల్లి వాణి.
ఒకరాయివేద్దాం ఏమవుతుందో చూద్దాం మన్నట్టు కెలిఫోర్నియా యూనివర్సిటీకి పి.హెచ్.డి కి అప్లై చేసింది. వెంటనే పి.హెచ్.డి లో సీటు వచ్చింది. చెల్లెలు వాణిని కేరళాలో పెద్దతమ్ముడు వద్ద కేరళా వైద్యానికి ఉంచి తాను కెలిఫోర్నియాకి బయలుదేరింది రాధాదేవి.
వెళ్ళేముందు భార్గవని కలిసి పిల్లవాడికి ఎటువంటి లోపం రాకుండా ఒక ఇరవై లక్షలు బ్యాంకులో పిల్లవాడి పేరును డిపాజిట్ చేసి వాడిని బాగా చదివించాలని, డబ్బుకి వెనుకాడవద్ధని,తనతో కాంటాక్ట్ లో ఉండమని,వాడిని హయ్యర్ స్టడీస్ కి తనతో అమెరికా తీసుకెళ్తానని, వాడితో
తల్లిదండ్రులుగా వారు రావచ్చని చెప్పి కెలిఫోర్నియాకు ప్రయాణమైంది రాధాదేవి.
★★★
వాసురాకతో మోడుబారిన దేవకి, భార్గవల జీవితం కొత్తచిగురులు తొడిగింది. వారిజీవితంలో చైతన్యం వెల్లివిరిసింది. దేవకి ఎంతో అపురూపంగా పసివాడి ఆలనా పాలనా చూడసాగింది. కానీపిల్లవాడికి బాటిల్ పాలు పట్టినప్పుడు దేవకి మాతృహృదయం తల్లడిల్లేది. వారి జీవితం వాసు రాకతో పరిపూర్ణత్వం సంతరించుకుంది.
రాధాదేవి ప్రతీ ఆదివారం వీడియోకాల్లో వాడి ఎదుగుదల చేష్టలు చూసి మురిసిపోయేది. వాసు ఐదవ పుట్టినరోజుకి రాధాదేవి ఇండియాకి వచ్చినప్పుడు వాసు కొత్త లేకుండా రాధాదేవి దగ్గరకు వెళ్ళాడు. అమ్మక్క అంటూ ఆవిడిచ్చిన బొమ్మలు, డ్రెస్సులతో వాసుకి రాధాదేవంటే మరింత ఇష్టం ఏర్పడింది. రాధాదేవి వెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్చాడు తీసుకెళ్ళమని. వాడిని సముదాయించలేక దేవకి సతమతమయ్యింది. రాను రాను వీడియో కాల్ చేసినప్పుడల్లా అమ్మక్క అంటూ కబుర్లు చెప్పటం.దా!దా! అనిపిలవడం దేవకి మనస్సులో రాధాదేవి అంటే ఈర్ష్య, ద్వేషం, భయం ఉత్పన్నం కాసాగింది. అదేవిషయం భర్త భార్గవతో అంది. భార్గవకి గూడా బిడ్డని తాము పెంచుతున్నా రాధాదేవి సూచనలు విసుగ్గా ఉండేది.
రానురాను రాధాదేవి వీడియో కాల్ చేసినప్పుడు ఎత్తకపోవటం, లేదంటే బయట ఉన్నాం తరువాత చేస్తామనటం, పిల్లవాడు పడుకున్నాడని కుంటిసాకులతో, పదిసార్లు చేస్తే ఒక్కసారి మాట్లాడుతూ మరో రెండేళ్లు గడిచాయి.
వాసుకి ఏడేళ్ళు వచ్చాయి. అన్నీ అర్ధమయ్యే వయసు. ఈవయసులో వాడికి రాధాదేవి కానీ వాడి జన్మమూలం కాని తెలియనివ్వకూడదనుకున్నారు దేవకి, భార్గవలు. వాసు వారికి భగవంతుడిచ్చిన మహాప్రసాదం.అది జారవిడుచుకునే ఆలోచన ఏమాత్రం లేదు.
★★★
ముందు ప్రణాళికగా భార్గవ కాలేజికి రిజైన్ చేసాడు. లేని తల్లికి అనారోగ్యం, ఊళ్ళో తోటలు చూసుకోవాలన్న కారణం చెప్పి స్నేహితులని నమ్మించాడు.
తరవాత ఫోనునంబరు మార్చి కొత్తసిమ్ కొత్తఫోను తీసుకున్నాడు.
ఆతరువాత విశాఖపట్నం నించీ హైదరాబాదుకి మకాం మార్చి ఊరిలో కొంతతోట అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఒకవిల్లా కొన్నాడు.
భార్గవ ఎక్స్పీరియన్స్ కి చైతన్యగ్రూప్ఆఫ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాసుని ‘ఐ.జి.సి.ఎస్.ఇ’ సిలబస్ లో జాయిన్ చేసాడు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
జన్మతః తెలివిగలవాడు అవటంతోను,భార్గవ
మార్గదర్శకత్వంతో ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.
బిట్స్ పిలాని విద్యా విహార్ పిలాని రాజస్తాన్ లో సీటు వచ్చింది. దానితో వాసు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది.
కాలం చిన్నప్పటి అమ్మక్కని మరుగున పడేసింది.వాసుదేవ్ కి లోకమంతా తల్లి దేవకి, తండ్రి భార్గవ. బాగా చదువుకో వాలి, పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో చదువుకో సాగాడు.
★★★
రాధాదేవి గత పన్నెండేళ్ళనించీ భార్గవ ఆచూకికోసం ప్రయత్నిస్తూనే ఉంది.ఒక సందర్భంలో పోలీసు కంప్లైంటు ఇద్దామనుకుంది. సహాయం చేసిన భార్గవగురించి తప్పుగా ఆలోచించటానికి మనస్కరించలేదు. దేవకి, భార్గవల మీద రాధాదేవికి ఎంతో నమ్మకం.పొరపాటునకూడా వారి మీద వ్యతిరేక భావన చూఛాయగా కూడా రాలేదు. ఎంతకీ భార్గవ ఏకష్టంలో ఉన్నాడో అనిఆందోళన చెందేది. అలాఅని ఊరుకోకుండా తనకు తెలిసిన మార్గాల ద్వారా భార్గవ్ ఆచూకి తీస్తూనే ఉంది.
తమ్ముళ్ళు, పెద్దచెల్లెలు రాధాదేవిని తప్పుపట్టారు.
” పెళ్ళిపెటాకులు లేవు. తల్లిహృదయం ఏం తెలుస్తుంది? ముక్కుమొహం తెలియని వాడికి ఏదో వస్తువు అప్పచెప్పినట్లు పసిగుడ్డుని ధారాదత్తం చేసింది. ఆమాత్రం ఎవరమైనా పెంచలేక పోయేవాళ్ళమా!” అంటూంటే, ఈ మనుషులేనా ‘మా అత్తవారు ఒప్పుకోరు’ అని పెద్ద చెల్లెలు , ‘మీ మరదళ్ళ వల్లకాదు.’ అని తమ్ముళ్ళు అనటం వల్లనే కదా తాను అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారి మాటలు శూలాల్లాతగిలి బాధపడింది రాధాదేవి.
రాధాదేవి మనస్సుకి ఎప్పటికైనా వాసు అజ్ఞాతవాసం నించీ తనకళ్ళబడతాడని బలమైన నమ్మకంతో ఉంది.
కెలిఫోర్నియా యూనివర్సిటీలో “క్వాంటమ్ కంప్యూటింగ్” మీద పి.హెచ్.డి లో గోల్డ్ మెడల్ సాధించింది రాధాదేవి.అదే యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా నీలినీడలా వాసు కళ్ళముందు కనపడుతూ కంటికి కునుకు కరువైంది రాధాదేవికి. ‘ తనేం అనుకుంది? ఏంజరిగింది? జీవితంలో మధురిమని ఏ చెల్లెళ్ళు తమ్ముళ్ళగురించి త్యాగం చేసిందో వారే తనని దోషిగా నిలబెట్టారు.’ అని మధనపడని రోజులేదు.
★★★
భగవంతుడు దయామయుడు.మనంచేసే ప్రతీపని వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన దృష్టిని ఎవరూ దాటిపోలేదు.
ఆరోజు కాఫీత్రాగుతూ లాప్టాప్ లో హిందూ పేపర్ చదువుతోంది రాధాదేవి. హఠాత్తుగా ఒక న్యూస్ కాలమ్ రాధాదేవిని ఆకర్షించింది.
“వాసుదేవ్ భాగవతుల ఈస్ టాప్ ఇన్ ఏస్ట్రోఫిజిక్స్ అండ్ కాస్మాలజీ ఎట్ బిట్స్ పిలాని. హి ఈస్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్
భార్గవ్ భాగవతుల అండ్ దేవకి. మిస్టర్ భార్గవ ఫాదర్ ఆఫ్ వాసుదేవ్ భాగవతుల ఈస్ రెండరింగ్ హిస్ సర్వీసెస్ ఫర్ చైతన్యాకాలేజ్ ఏస్ ఫాకల్టీ ఇన్ ఫిజిక్స్.హార్టీ కంగ్రాట్యులేషన్స్.”
రాధాదేవి కళ్ళల్లోంచి కన్నీరు జలజలా కారింది. అది ఒక అద్వైత అనుభూతి.
తప్పిపోయిన బిడ్డ దొరికిన ఆనందం…….
పోగొట్టుకున్నానుకున్న పెన్నిధి దొరికిందనిసంతోషం..
వాసు ప్రయోజకుడయ్యాడన్న గర్వం…,
అమ్మక్క రక్తం వాడిలో ప్రవహిస్తోందన్న తృప్తి….
అంతలోనే ఆ ఆనందబాష్పాల ప్రకృతి మారిపోయి విషాదం నెలకొంది.
భార్గవ ఎందుకిలా చేసాడు?
ఎంతో నమ్మకంతో ఒక ప్రాణం లేని వస్తువుని కాదు, ఒక పెంపుడు జంతువునికాదు, తమ ఇంటి ప్రాణాన్ని తన చెల్లెలు బిడ్డని, తనకే హక్కు లేదు అయినా అనివార్య పరిస్థితిలో నమ్మి తాత్కాలికంగా పెంపకానికి ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తాడా!
అంతలోనే రాధాదేవి వివేకం విచక్షణతో ఆలోచించసాగింది.
‘ఔను భార్గవకు తాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పరాయి బిడ్డను తనదిగా చేసుకోవటమే కాక విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలపెట్టినందుకు తాను భార్గవకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు. పురిటిగుడ్డుని భార్గవ చేతిలో పెట్టిన తనకే ఇంత మమకారముంటే, పెంచి పెద్దచేసిన భార్గవ,దేవకిలకి ఇంకెంత ఉంటుంది. అనుకోకుండా దొరికిన అదృష్టం. చేయి జారిపోతుందేమోనన్న భయాందోళనతో తన ఉనికిని మరుగునపెట్టాడు.గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి అజ్ఞాతవాసంలో పిల్లవాడిని ఈ స్థాయికి తేవడం ఒక్కొక్కసారి కన్నతల్లితండ్రులకే సాధ్యంకాదు.’
ఆలోచనలకి విరామచిహ్నంపెట్టి వెంటనే రాజస్థాన్ పిలానికు ఫ్లైట్ బుక్ చేసుకుంది రాధాదేవి.
★★★
యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాధాదేవి వాసుదేవ్ భాగవతుల గురించి అడిగింది. తాను వాసుదేవ్ కి పెదతల్లినని గర్వంగా చెప్పుకుంది.
“కూర్చోండి మేడమ్..” అంటూ రాధాదేవికి లాంజ్ చూపించాడు.ఇప్పుడే కబురు పెడతాను అంటూ బాయ్ ని పంపాడు.
గెస్ట్స్ లాంజ్ లో అడుగుపెడుతూనే, ‘ఎవరై ఉంటారు తనగురించి ఇక్కడికి వచ్చేవారు? అమ్మా నాన్నా అయితే కాదు.’ అనుకుంటూ అడుగుపెట్టిన వాసుకి జ్ఞాపకాల పొరలో అట్టడుగున నీడలాంటి ఒక ఆకారం స్ఫురించింది.
అస్పష్టంగా, ‘ అ….మ్మ …క్కా….’ అన్నాడు.
కట్టలుత్రెంచుకొచ్చిన దుఃఖాతిశయంతో నిలువెత్తు వాసుని సంకోచించకుండా కావలించుకుని వాసు గుండెలమీద సేద తీర్చుకుంది రాధాదేవి.
“ఇన్నాళ్ళు ఏమయ్యావు అమ్మక్కా? నీ గురించి అమ్మనాన్నని అడిగితే తెలియదన్నారు.
ఇండియాలో లేవన్నారు. క్రమేపి నేనుకూడా నిన్ను జ్ఞాపకాల అడుగు పొరల్లో ఖననం చేసాను.న అమ్మక్కా!” అన్నాడు వాసు.
“వాసు నేను డైరక్ట్ గా ఎయిర్పోర్ట్ నించీ ఇక్కడికి వచ్చా ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా! రూముకివెళ్ళిఫ్రష్ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. పన్నెండేళ్ళు గా ఒంటరిగా నేననుభవిస్తున్న మానసిక క్షోభ నీకు చెప్పుకుని నా హృదయం భారాన్ని తగ్గించుకోవాలిరా కన్నా!”
అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాధాదేవి.
వాసుకి అంతా అయోమయంగా ఉంది. ‘ఎందుకు అమ్మక్క ఇంత ఉద్వేగంగా మాట్లాడుతోంది? ఇన్నేళ్ళ తరువాత….’
” సరే అమ్మక్కా! నేను రేపు హైదరాబాద్ వెళ్ళటానికి హాస్టల్ రూము ఖాళీ చేద్దామనుకున్నా. రూము లాక్ చేసి వస్తా.”అంటూ వెళ్ళాడు.
★★★
బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా, ” వాసూ నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి.నేను చెప్పే విషయాన్ని అన్ని కోణాల్నించి ఆలోచించగల వ్యక్తిత్వం నీకుందని తెలుసు. ఇందులో నాతప్పుంటే నాకు నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిధ్ధంగా ఉన్నా తండ్రీ!” అంది రాధాదేవి.
“అదేమిటి అమ్మక్కా! పెద్దదానివి నిన్ను శిక్షించటమేమిటి?”అంటూ రాధాదేవి చేయిపట్టుకున్నాడు.
రాధాదేవి పూసగుచ్చినట్లు వాసు పుట్టటం,అప్పటి పరిస్థితుల్లో తనకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం,తరువాత దేవకి, భార్గవలు ఏవిధంగా తనతో సంప్రదింపులు కోల్పోయారో చెప్పింది. ఒకానొక సందర్భంలో పోలీసు కేసుపెట్టి ఎంక్వయిరీ చేయిద్దామనుకొని వారిని బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నట్లు చెప్పింది.
ఈ పన్నెండేళ్ళు బంధువులతో తాను పడ్డమాటలు వాసుతో చెప్పి ఊపిరి పీల్చుకుంది రాధాదేవి.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత గభాల్న వాసు రాధాదేవి కాళ్ళదగ్గర కూర్చొని వళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చాడు.
“అమ్మ ఎలావుంటుంది? అమ్మ ఇప్పుడెలా ఉంది. నువ్వు ఆ సాహసం చేయకపోతే నేనెలా ఉండేవాడినో! నేనెంత అదృష్టవంతుడివి.అందరికీ ఒక అమ్మ అయితే నాకు ముగురమ్మలు.అమ్మక్కా!ముందు అమ్మని చూడాలి.తర్వాత హైదరాబాద్ వెళ్దాం అంటూ కేరళాకు టిక్కట్లు బుక్ చేసాడు వాసుదేవ్.
★★★
తల్లి,తండ్రితప్ప బంధువులుఎవరూలేరని ఉదాసీనంగా గడిపిన వాసు మనసు అందరినీ కలవాలని ఉవ్వీళ్ళూరింది.
‘మొదటి సారి తనను నవమాసాలు మోసికన్న కన్నతల్లిని చూడబోతున్నాడు.తల్లిని కనిపెట్టుకుని ఉన్న మేనమామని కలువ బోతున్నాను.’ ఆ ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది అనుకున్నాడు వాసు.
గుమ్మంలో అడుగుపెట్టిన వాసు విరబూసిన మల్లె కుదుళ్ళమధ్య పసిపిల్లలాంటి అమాయకమైన మల్లెపూవులాంటి స్వచ్ఛమైన కన్నతల్లిని చూసాడు.
“అమ్మా!”అంటూ కాళ్ళకి నమస్కరించాడు వాసు.
నిర్వికారంగా నిశ్చలంగా ఉన్న వాణి లో ఏదో చలనం. వాసు వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
“నేనమ్మా!నీ బిడ్డని.” అంటూ వడిలో తల పెట్టుకున్నాడు వాసు.
అప్రయత్నంగా తలమీద చేయుంచింది వాణి.
అ దృశ్యం ‘శతమానం భవతి ‘ అని తల్లి వేద ఆశీర్వచనం చేస్తున్నట్లుంది.
మేనమామ కృష్ణమోహన్ కధనం ప్రకారం తన పనులు తాను చేసుకునే స్థాయికి తేగలిచారు గాని మెదడుకు తగిలిన షాక్ నించీ ఇంకా కోలుకోలేదని,ఎవరూ గుర్తులేరని తెలిపాడు.ఆమె లోకం ఆమెది. ఆకలిదప్పులు ఏమీ తెలియవని,తామేమైనా తినమని ఇస్తే తింటుంది. లేకపోతే లేదని కృష్ణమోహన్ వాసుకి రాధాదేవికి చెప్పాడు.
ప్రస్తుతం వాణి ఎమ్నీషీయాలో ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు కృష్ణమోహన్.
“మావయ్యా ‘ఎమెన్షియా’, ‘డిమెన్షియా అంత ప్రమాదకరమైనది కాదు. నాకెందుకో అమ్మని కొంతవరకూ మామూలు పరిస్థితికి తేవచ్చుననిపిస్తోంది.”అన్నాడు వాసు.
“వాసు చెప్పింది నిజమే రా! నువ్వు కష్టపడి దాన్ని ఈ స్థాయికి తెచ్చావు. నేను చెల్లాయిని నాతో పాటే అమెరికా తీసికెళ్ళి వైద్యం చేయిస్తా.అన్నట్లు వాసు ఇంతవాడవటానికి కారణమైన దేవకి భార్గవలకి మనమెంతో ఋణపడి ఉన్నాం. ముందు మనం హైదరాబాదు వెళ్దామని ముగ్గురూ కలిసి హైదరాబాదు వచ్చారు.
. . ★★★
ముందుగా ప్రొఫెసర్ రాధాదేవిని, ప్రక్కనేవాసు, కృష్ణమోహన్ లను చూసిన దేవకి సర్పద్రష్టలా నిలబడిపోయింది.
అది గమనించిన భార్గవ అవాక్కయి సన్నగా గుండె నొప్పితో నేలకొరిగాడు.
“నాన్నా!” అంటూ ఒక్కో ఉదుటున వాసు భార్గవని పొదివి పట్టుకోగా, రాధాదేవి మొహంమీద నీళ్ళు చిలకరించింది.
కళ్ళు తెరిచిన భార్గవ రాధాదెవి కళ్ళలో కళ్ళుపెట్టి చూడలేక దోషిగా తలవంచుకున్నాడు.
ఆపరిస్థితులల్లో దేవకి, భార్గవి ని చూసిన రాధాదేవి వాసుకి కనుసైగ చేసింది. వెంటనే ఒక్క ఉదుటున తల్లిని(దేవకిని) పట్టి ఊపుతూ, “అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా.ఇదంతా మీ ఆశీర్వాదం.” అంటూ దేవకి, భార్గవ కాళ్ళకి నమస్కరించాడు. న్యూస్ పేపర్లో వారిద్దరి పేర్లు చూపించాడు.
“ఎప్పటికీ నేను మీ వాసునే నాన్నా! అందరికీ ఒకే తల్లి.నాకు ముగ్గురు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే ఇంకొకరు మమతానురాగాలు తో పెంచిన తల్లి.మరొకరు నా దశదిశ నిర్దేశించిన తల్లి. ఇంతటి అదృష్టం ఎవరికుంటుంది?” అన్నాడువాసు కంఠం భావోద్వేగంతో పూడుకుపోగా.
భార్గవ మీభయం నాకర్ధం అయ్యింది. మీరు అమితమైన ప్రేమతో చేసిన తప్పు మిమ్మల్ని దోషిని చేయదు.మీరు వాసుని ఇంతటి ప్రయోజకుడిగా చేయటానికి వెనుక మీ ఆలుమగల కృషి అభినందనీయం. మీరు వాసుని ఎంతప్రేమిస్తున్నారన్నది మీరు గవర్నమెంట్ కాలేజీకి రాజీనామా చేయటంలో తెలుస్తోంది.” అంటూ భార్గవని భయం నించీ బయటకుతేవటానికి ప్రయత్నించింది రాధాదేవి.
“కన్నతల్లి కన్నబిడ్డను గుర్తించలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు భయపడతారు భార్గవ గారు.” అన్నాడు కృష్ణమోహన్ నిర్లిప్తంగా.
దేవకి అందరికీ కాఫీ కలుపుకొని తెచ్చింది.వాసు అందరికీ కాఫీ ఇచ్చాడు.
“రాధాదేవి గారు మీది ఎంతో విశాలహృదయం. ఎంతో సంస్కార వంతులు కాబట్టి నా తప్పుని నిలదీసి అడగాల్సిన సందర్భంలో సహితం నాకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీరు గొప్ప మనస్సుతో క్షమించినా, అది అందుకునే అర్హత నాకు లేదని నా అంతరంగం చెపుతోంది.
వాసు మీవైపు మొగ్గు తున్నాడని, మీరు వీడియోకాల్ చేసినప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసి ఈర్ష్య పడ్డాం.మీకాల్ గురించి వాడు ఎదురు చూడటం,ఆతరువాత వాడు నీగురించి పేచీ పెట్టటంతో వాడు మాకు దూరమౌతున్నాడన్న భయంతో ఈ విధంగా ఫోన్ నెంబరు మార్చటం. మా ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఇలా ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ సూర్యుడిని అరచేతితో మూయలేమని ఇప్పుడే తెలుసుకున్నాం.ఇన్నాళ్ళు బిడ్డలు లేని మాకు మాతృత్వపు, పితృత్వపు మధురిమలు ఆస్వాదించడానికి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి అవకాశమిచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.దేవకి కి జన్మించిన కృష్ణుడు యశోదతనయుడుగా నందయశోదలకు ప్రేమ అనే అమృతాన్ని పంచాడు. కానీ శాశ్వతంగాలేడుఅలాగే ఈ వాసుదేవ్ ఈ నందయశోదలకు తన అమృతం తుల్యమైన ప్రేమను పంచి మమ్మల్ని సమ్మోహితుల్ని చేసాడు.దానికి మాకు గర్వంగా ఉంది.ఇక ముందు ప్రయాణానికి రాధాదేవిగారికి సంతోషంగా అప్ప చెప్తున్నాం.” అంటూ వాసు చేతిని రాధాదేవి చేతిలో పెట్టిన నమస్కరించారు దేవకి,భార్గవలు.
రాధాదేవి తో కన్నతల్లి వాణిని తీసుకుని పై చదువులకి అమెరికాకి ప్రయాణమయ్యాడు వాసుదేవ్.
గుండెలనిండా ప్రేమతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు వాసుని దేవకి, భార్గవలు.
★★★
“దేవకీ! దేవకీ!” అంటూ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు భార్గవ.
“ఏమిటండీ ఆ గావుకేకలు!” అని కసురుకుంది.రాధ.
“కేకలేంటి మైకు పెట్టుకుని అరుస్తా! మన వాసు భార్గవ. ఎమ్.ఎస్ పూర్తి అయింది.కెలిఫోర్నియా యూనివర్సిటీలోనే టాపర్. అమెరికన్ గవర్నమెంటు వారి స్వంత ఖర్చుతో వాడికి సర్దార్ ఎడ్యుకేషన్ కి బాధ్యతవహిస్తోంది.
మనల్ని గ్రాడ్యుయేషన్ డేకి రమ్మని ప్రయాణానికి కావలసిన ఫ్లైట్ టికట్టుతో కావలసిన డాక్యుమెంట్స్ పంపించాడు మన వాసు.” అంటూ దేవకిని గిరగిరాతిప్పి ఆనందభాష్బాలు రాల్చాడు భార్గవ.
వాసు మ…న… బి…డ్డే…నండీ అంటూ అస్పష్టంగా గొణిగింది దేవకి.
శుభం.
.సమాప్తం
వ్రజేంద్రా నందన
previous post
