రఘుపతి లోపలికి రాగానే ఆయన చేతిలో ఉన్న వస్తువులను అంది పుచ్చుకుంది రాగిణి. మెత్తని సిల్కు శాలువా! అందమైన కుచ్చులతో జరీ దారాల మెరుపులతో ఖరీదును చాటుతోంది. శ్రీ కృష్ణ దేవరాయల వెండి అచ్చు బొమ్మతో సభను ఏర్పాటు చేసిన వారి నామ ఫలకం తో జ్ఞాపిక స్వర్ణోత్సవం జరుపుకుంటోన్న సంస్థ వైభవాన్ని తెలుపుతోంది.
రఘు పతికి రోజూ సభలలో పాల్గొనడం తప్పని సరి అయిపోయింది. సభ లో అధ్యక్షుని గానో పుస్తక ఆవిష్కర గానో, లేదా సాహిత్య ప్రసంగ కర్త గానో ఆహ్వానాన్ని అందుకోడం పరి పాటిగా మారింది. రఘుపతి ప్రసంగం ఉన్న సభ ఒక వేడుకగా మారుతుంది. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి ఆద్యంతం ఆసక్తి కరం గా ఉపన్యసించి రఘుపతి సాహిత్య సభలకు జన ప్రియతను కలిగించాడు.
రఘుపతి సభా పరిశ్రమను చేసి సంపాదించిన శాలువలను రాగిణి జాగ్రత్తగా భద్ర పరుస్తుంది. జ్ఞాపికలను ప్రత్యేకమైన గాజు బీరువాలో అలంకరణగా ఉంచుతుంది
రఘుపతి ఆ రోజు పొందిన సత్కార శాలువాను మడత పెడుతూ, “నారాయణకు రమ్మని చెప్పండి, మంచి నమూనాలను సిద్ధం చేసాను. ఈ సారి నారాయణ జాతీయ స్థాయిలో ప్రశంసను పొందవలసినదే “అంది
నారాయణ ఇప్పుడు దర్జీ గా పేరు సంపాదించాడు. నారాయణ జీవితం బాగు పడింది. కష్ట పడి పని చేస్తాడు. సమయానికి బట్టలు కుట్టి అందజేస్తాడు….
మీరు చెప్పినదంతా నిజమే .. కాని నారాయణ బాగుపడినదంతా మన చలవే ! మన సహాయం వల్లనే తాను పేరు తెచ్చుకోవడం జరిగిందని వచ్చి నప్పుడల్లా కృతజ్ఞతలతో ముంచి వేస్తాడు.
సరేలే !అది వాడి అభిమానం –
మొత్తానికి మీకు మంచి మిత్రుడు దొరికాడు.
నారాయణ వచ్చినప్పుడు ఇవ్వవలసిన, సూచనలు, డిజైన్లు ప్రింట్ అవుట్ తీసి పెట్టాలి అనుకుంటూ కంప్యూటర్ తెరిచింది రాగిణి.
—
రఘుపతి ఉద్యోగం లో చేరడానికి వచ్చినప్పుడు కళాశాలకు దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గది గాలి వెలుతురు తో మనసుకు హాయినిచ్చేటట్లుగా ఉంది. ఊళ్ళో అతి కష్టం తో జీవన భత్యం గడుపుకుంటున్న టైలర్ నారాయణకు గదికి ఆనుకుని ఉన్న వసారాలో కుట్టు పనికి చోటును కల్పించాడు. తాము ఉండే గది కొంచం ఎత్తుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళ దృష్టికి ఆనుతూ ఉండడం వల్ల దర్జీ నారాయణను వినియోగ దారులు గుర్తించడం జరిగింది. నారాయణకు మంచి దర్జీ అని చుట్టు పక్కలవాళ్ళ మౌఖిక ప్రచారం ద్వారా చేతి నిండా పని దొరికింది.
నారాయణ తోడుగా ఉండడం రఘుపతికి సహాయకారి లభించినట్లయింది. నారాయణ కుట్టి ఇచ్చిన లాల్చీని వేసుకుని కళాశాలకు వెళ్ళిన రఘుపతి హుందాతనం పెరిగింది. తెలుగు ఉపన్యాసకునికి అభిమానులు అధికం అయ్యారు.
తరగతి గదిలో గంభీరంగా స్పష్టమైన ఉచ్ఛారణతో వివరంగా బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులతో గురు శిష్య అనుబంధానికి గల ప్రమాణాన్ని పెంచింది.
అంత చిన్న వయసులోఅతడుసంపాదించినపాండిత్యానికి,విషయపరిజ్ఞానానికి,వాక్చాతుర్యానికి . రఘుపతి కి వక్తగా పరంపరల ఆహ్వానాలు మొదలయ్యాయి.
సభ వాళ్ళు ఇచ్చిన శాలువాలకు సత్కార సామాగ్రికి, గదిలో ఉన్న చిన్న చెక్క బీరువా సరిపోలేదు.
రఘుపతికి వివాహం అయింది. భార్య రాగిణి దుస్తుల నమూనా లలో డిప్లొమా కోర్స్ చేసింది. చాలా చురుకుగా ఉంటుంది. ఆమెకు గృహ అలంకరణ నిర్వహణలలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
పెళ్ళి కాగానే రఘుపతి పెద్ద ఇంట్లోకి మారాడు. అతని కి ఆచార్య పదవి వచ్చింది. నగరం లో ప్రముఖ సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధి పొందాడు. స్వంత ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ పని కూడా . సంతృప్తికరంగా సాగుతోంది. .
కాల గడచిన కొద్దీ రఘుపతి నారాయణల స్నేహం మరింత దృఢమవుతూ వచ్చింది. నారాయణ కుట్టిన లాల్చీ ధరిస్తే రఘుపతికి మిత్రుడు భుజం మీద చేయి వేసి నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి కుటుంబం పెరిగింది. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. కుటుంబ వ్యయం పెరిగింది.
నారాయణ కూతురు డాక్టర్ కోర్సు చదవాలని. గట్టి పట్టుదలతో ఉంది. తన సంపాదనతో కొడుకు ఇంజనీరింగ్,కూతురు మెడిసిన్ లను చదివించ గలనా? అని సందేహించాడు నారాయణ. కష్ట సుఖాలను ముచ్చటించుకుంటున్న సమయం లో పిల్లల చదువులను గురించి ప్రస్తావించాడు నారాయణ
నారాయణ సమస్యను విని పూర్తిగా అర్థం చేసుకుంది రాగిణి. బాగా ఆలోచించింది.
—
మర్నాడు తను పిలిచిన వెంటనే వచ్చిన నారాయణ ను కూచోమని కాఫీ ఇచ్చింది.
ఇప్పుడే వస్తాను ఉండు అంటూ బీరువాలలో ఉన్న శాలువలను. కొన్నింటిని తెచ్చింది
నారాయణా ఇవన్నీ రఘుపతికి సభా కార్య క్రమాలలో సత్కారానికి వచ్చినవి, ఇంకా చాలా ఉన్నాయి
ఇందులో కాశ్మీరు నుండి ఖద్దరు వరకూ, అనేక రకాలున్నాయి. వాటిని బట్టి నేను నమూనాలను గీసి ఇస్తున్నాను. వాటిని నువ్వు చూసి నేనిచ్చిన డిజైన్ లకు అనుగుణం గా కత్తిరించి దుస్తులను తయారు చేయి.. బ్లౌజులు, కుర్తీలు, బ్రైడల్ దుస్తులను తయారు చేయి.అందమైన దుపట్టాలు, స్కార్ఫ్ ల నమూనాలను కూడా ఇచ్చాను.
అవన్నీ ఆధునిక యువతీ యువకులకు నచ్చే టట్లుం డాలి. ఇక వయసు పై బడిన వారికి భుజాల మీదనుండి జారిపోకుండా చేతులకు పట్టి వుండేటట్లు, ధారణకు అనుకూలంగా కుట్టాలి. అందమైన రంగుల దారాలను ఉపయోగించి ధరించే వారి విలువను పెంచాలి ..
ఇలా ఆమె రూపొందించిన నమూనాలకు నారాయణ నైపుణ్యం జోడించి తయారు చేసిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి.
ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా నారాయణ, అతని భార్య అహర్నిశలు కావించిన శ్రమ కు ఫలితం లభించింది.
కుట్టిన వెంటనే దుస్తుల కొనుగోళ్ళు జరిగాయి. నారాయణ ఎప్పటికప్పుడు రాగిణికి సమాచారం అందించడం తో ఆమె పేర్చి ఉంచిన శాలువాలు అన్నింటినీ విడతల వారీగా నారాయణకు అందించడం , అతడు తయారు చేసిన వస్త్రాలు స్థానికం గానే కాక ,వివిధ దేశాలకు ఎగుమతి కావడం తటస్థించింది.
నారాయణ తాను రూపొందించిన దుస్తులు ఎప్పటికప్పుడు కొనుగోళ్ళు కావడానికి కారణం రాగిణి గారు అని, ఆ శాలువాలను తమ బుద్ధి పరిశ్రమ తో సంపాదించిన వారు ఆచార్య రఘుపతి గారని, తాను సంపాదించిన డబ్బును వారికి చెల్లించ బోతాడు.
రాగిణి, రఘుపతి ఆ మాటను నవ్వుతూ తిరస్కరిస్తారు.
మాది ఆలోచన మాత్రమే! నీది ఆచరణ. మాది కొంత ఔదార్యం ,నీది ఔపచారికం ,జీవితావసరం, నీ సంతాన భవిష్యానికి సోపానం. నీ కూతురు డాక్టరయితే అనేక మందికి ఆమె సేవా భాగ్యం కలుగుతుంది. కొడుకు దేశ ప్రగతికి దోహదం చేస్తాడు. మా ఔదార్యం వల్ల ఇంతగా మేలు జరుగుతే అంతకంటె మాకు ఇతర కానుకలు ఎందుకు? అంటారు.—
ఆ రోజు రాగిణి డిజైనర్ షాపు ఆరంభ దినోత్సవం . అధునాతనమైన దుస్తుల తయారీలో సాటి లేని ప్రతిభను చూపిన రాగిణీ డిజైనర్ షాపు యజమాని రాగిణి ని చూడాలని వచ్చిన అతిథులు ఎదురు చూసారు.
ఆవిష్కరణ రఘుపతి చేతుల మీదుగా జరిగింది.
రాగిణి ఎవరు అన్న ప్రశ్న మిగిలింది.
విలువ ఇంత అని చెప్పలేని గౌరవం, ఆప్యాయత, మరియు సత్కారానికి ప్రతిబింబమే రాగిణి అని, ఈ దుస్తులను ధరించిన వారు సంప్రదాయానికి, ప్రత్యక్ష సాక్షులు గా ఉండాలన్నదే రాగిణి డిజైనర్స్ ధ్యేయం “అత్యుత్తమ మైన భారతీయ సంస్కృతి కి ఆధిపత్యం వహించిన శాలువా సభా గౌరవాలకు పరిమితం కాకుండా బీరువాలలో నలిగి ఉక్కిరి బిక్కిరి కాకుండా, సర్వ జన గణ వినుత మాధ్యమం లో విస్తృత విలువలను అందుకోవాలన్నదే రాగిణి ఆశయం” అంది సభలో అప్పటి వరకూ మౌనంగా రాగిణి గారిని ఆరాధిస్తున్న డా చంద్రిక , నారాయణ గారి కూతురు……రాజేశ్వరి దివాకర్ల
Divakarla Rajeshwari
Divakarla Rajeshwari
-డా. రాజేశ్వరీ దివాకర్ల బెంగళూరు ఆర్ట్స్ కళాశాలలో తెలుగు విభాగం లో ఆచార్య వృత్తిని నిర్వహించాను. కవిత్వం విమర్శ,కథానికలు అనువాద రంగాలలో కృషిని కావించాను.
మేడారం జాతరకు
తరలి వస్తున్నారు సాగరం లా జనం.
ముడుపు లు చెల్లించేందుకు
సమ తూకం బంగారం బెల్లం దిమ్మెలు
తలకెత్తుకున్నారు,
భక్తి పాటల సంబురాలతో
సంతోషం పంచుకున్నారు.
గిరి ఝరుల అందాలకు
పరమార్థ జ్ఞానం కలిగినట్లు
చింతలన్ని మరచారు.
ఆదివాసులకు శ్రమ సేద్యం ,
వేట వృత్తి జీవనం.
కోయ దొరకు పుట్ట వద్ద కనిపించిదొక శిశువు.
పులులు, సింహాలు, కాపలా, చుట్టూ.
దైవాంశమున్న పాపను గూడానికి తెచ్చాడు.
సమ్మక్క అని పిలిచి ఒడిని చేర్చాడు.
అయోనిజ ఆ బిడ్డ చూపింది మహిమ.
గిరి జనుల రుజలన్నింటికి
ఆకు పసరు లిచ్చింది.
కష్టాలను తీర్చింది.
యుక్త వయసున పగిడిద్ద రాజును పెండ్లి యాడింది.
కన్న బిడ్డలకు తల్లిగా మన్ననలను పొందింది
సమ్మక్క సారలక్కలు,
తల్లీ కూతుళ్ళు వాళ్ళు
దివ్య కాంతలు, ధీర వనితలు
స్త్రీల ఆత్మ గౌరవానికి
సాక్షి ప్రమాణాలు.
మట్టి జనుల స్వేచ్ఛకు గాను
గట్టిగ పోరాడారు.
ప్రాణాలకు తెగించారు.
వన దేవతలు వారు
ప్రకృతి రక్షణకు
మనుగడల రూపమెత్తారు.
గిరి జనుల సంస్కృతిలో
జాతర జాతి సమైక్యతకు మూలం
సమ్మక్క ధైర్యం చరిత్ర లో అతి ఘనం.
దేవతా తరుణి ఆమె
రక్తం పడకూడదు నేల మీద
వెన్ను పోటు బల్లెం దిగిన గాయానికి
కట్టు కట్టుకుని పోరాడింది.
శత్రువులను చెండాడింది.
తూరుపు చిలుకల గుట్ట వంకకు మరలి
కంటికి కనుపించక ఎవ్వరికి
నెమలి నారచెట్టు కింద
నిండు పసుపు” కుంకుమ బరిణ” గా మెరిసింది.
మాఘ శుద్ధ పున్నమి నాటికి
గద్దె మీద కొలువుకొచ్చిన
సమ్మక్క సారలక్కలు
హారతులందే వేళకు
డప్పుల చప్పుళ్ళు, , శివసత్తులు పూనకాలు
మేళాలు తాళాలు,
ఇప్పుడు మొదలయ్యాయి
గిర్రున దిగి వచ్చే హెలికాఫ్టర్ ఏర్పాట్లు,
సంప్రదాయాలకు
శాస్త్ర విజ్ఞానం తోడు,
భక్తుల కందరికి ఫలించాలికోరికలు.
జానపద వినోద గాన కళా ప్రక్రియగా బుర్రకధ ఉత్తమ ప్రచారసాధనం. సంగీతం, నృత్యం, అభినయాలతో కూడిన జన ప్రియమైన ప్రదర్శన కళ బుర్ర కథ. ప్రజలకు వినోదంతో పాటు
విజ్ఞానాన్ని ప్రసాదించి, ఉత్తేజ పరచిచైతన్య వంతులను చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ.
బుర్రకథ లో ప్రధాన కథకుడు, భుజం మీది తంబురా మీటుతూ, ఎడమ చేతివ్రేళ్ళలోని అందెల్ని మ్రోగిస్తూ తంబురా శృతిలో కథా గానం చేస్తాడు. షరాయి, నిలువుటంగీ, తలపాగ ధరించి, కాళ్ళకు గజ్జెలు ధరించి, రసానుగుణంగా చిందులు తొక్కుతూ, గంతులు వేస్తూ, అభినయిస్తాడు. అతని గానాలాపనలకు సహకరిస్తూ ఇద్దరు లేక ఒక్కరు గుమ్మెటలు ధరించి, తందాన తాన వంత పాడుతూ, కథాకథనంలో తాళరీతిని అందిస్తారు.
బుర్ర కధలుగా స్వాతంత్ర్య వీరుల గాథలు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగిస్తాయి.భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర ప్రత్యేక మైన అధ్యాయం.

ఓడిపోతానని తెలిసి కూడా/ కడదాకా పోరినెత్తురోడి పడిపోవడం/ సాధారణ యోధ కథప్రజల మీది ప్రేమతో/ ప్రజల్ని గట్టెక్కించాలనిఆత్మార్పణ చెయ్యడం/ అసాధారణ వీరగాధ!…
అటువంటి అసాధారణ యోధుడు అల్లూరి సీతారామరాజు గాధను వచన కవితా కథా కావ్యంగా మలిచారు ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావుగారు. అల్లూరి సీతారామరాజు గారి వీర గాథ తెలుగులో అనేక ప్రక్రియలుగా వెలువడింది. వీరగాథా వాజ్ఞ్మయంపై లోతైన పరిశోధన చేసిన డా.తంగిరాల సుబ్బారావు గారి కోరిక మేరకు డా.మల్లెల గురవయ్య 1995లో ‘సీతారామ రాజీయము’ పేరుతో సుమారు 2000 పద్యాల్లో ఒక మహా కావ్యాన్ని రచించారు. దాన్ని అల్లూరి శతజయంతి సందర్భంగా 1997 జూలై లో ముద్రించారు.
జానపదులు అల్లుకున్న వీర గాథల్లో మిక్కిలి జనప్రియమైన కథ అల్లూరి సీతా రామ రాజు. శ్రీ సుంకర సత్యనారాయణ గారు ఈ వీరుని స్వాతంత్య్ర సమరాన్ని ఒక ఉత్తేజపూరిత మైన బుర్రకథగా రూపొందించారు. బుర్రకథా పితామహులుగా పేరు పొందిన శ్రీ నాజరు గారు ఈ వీరుని కథను ఊరూరా ప్రదర్శించి ప్రచారం చేసారు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం శ్రీ నాజరు గారితో ప్రారంభమయింది.
శ్రీ అల్లూరి సీతారామ రాజు ను విప్లవ జ్యోతిగా కీర్తిస్తూ శ్రీ పి. దుర్గా రావు ఎం ఒ ఎల్ గారు బుర్రకథను రాసారు. (1955 ). దుర్గా రావు గారు భారత కోకిల సరోజినీ దేవి. నవయుగ నిర్మాత శ్రీ కందుకూరి, వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాలను గూర్చి చిన్న చిన్న బుర్ర కథలను రాసినట్టు తెలిపారు. పూర్వం వారు రావుల పెంట పాఠశాల విద్యార్థులు ప్రదర్శించడానికి రాసిన కథను విస్తృత పరచి ప్రస్తుత బుర్ర కథను బాలలందరికి ఉపయోగార్థం గా ప్రచురించారు. (1984 మే ). పుస్తక ప్రతిని బట్టి వారు చెరుకు పల్లి పోస్ట్,నక్రేకల్, నల్లగొండ జిల్లా వాస్తవ్యులని తెలుస్తుంది.
దుర్గా రావు గారు తాము ఈకథను బాలల కోసం రాసినట్లుగా ప్రకటించినా,అల్లూరి
సీతారామరాజుకథ ఆబాల గోపాలానికి అచంచలమైన దేశ రక్షణా ధ్యేయాన్ని కలిగిస్తుంది.
తమ రచనకు అల్లూరి సీతారామ రాజు చరిత్ర పరిశోధకులు, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు. శ్రీ పడాల రామారావు గారు రాసిన “ఆంధ్రశ్రీ “మొదలైన గ్రంధాలు ఆధారమని తెలిపారు. దుర్గారావుగారు బుర్రకథ ఆరంభం లో అమర వీరులందరకూ, దేశభక్తులకూ జోహారులను అర్పించారు. ప్రార్థన గా “అంబవైన నీవేనమ్మా! జగదాంబవైనా నీవేనమ్మా! అని భారతాంబను స్తుతించారు.
బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత, “భళా భళానోయ్ తమ్ముడా! సై భాయి భళానోయ్ తమ్ముడా!” అంటూ ఈ బుర్ర కథలో వంత కథకునికి తోడుగా తమ్మునిగా సహకరించాడు.
వంత అడిగిన ప్రశ్నలకు సందేహాలకు జవాబు చెబుతున్నట్లుగా కథకుడు విశాఖ జిల్లా పాండ్రింగిలో 1897 జులై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు పుట్టుక నుంచి 1924లో జరిగిన బలిదానం వరకూ జరిగిన ఏ సంఘటననూ విడవకుండా అన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించాడు.
వినరా భారత వీర కుమారా !-విజయము మనదేరా! అంటూ పల్లవి తో ఆరంభం అయిన కథ, రగడలతో, కీర్తనలతో, పల్లె పదాలతో, సందర్భానికి తగిన బాణీలతో, రసావేశం చిందే పదాలతో రక్తి కట్టింది.
రచయిత తాము బాలలకోసం ఉద్దేశించి రాసారు కాబట్టి, ప్రతి గీతాన్ని పాడిన తరువాత తమ్ముడు అని సంబోధించిన వంతకు సంభాషణలో మరల కథను వివరించారు.
“పదునేడవ శతాబ్దిరా
పడవల పైనే వచ్చిరి” …ఈస్టిండియా పేరుతో వాణిజ్యానికని వచ్చిన ఆంగ్లేయులు “నెత్తిన టోపీ
పెట్టుక, మెత్తని మాటలు నత్తుచు, ఒకచే త్రాసునుబట్టుక, ఒకచే కత్తినిబట్టుక ” “భారత దేశము నాక్రమింపగా
పన్నాగమునే పన్నిరి దొరలు”. …అని కథకుడు ద్రుత తాళ గతులతో పాడుతూ,
“భారత ప్రజలే ముందుకొచ్చిరి పగతురనెదిరింపా. ..
అంటూ ఆవేశం కనబరుస్తూ” “బుసలు కొట్టెడి నాగుబాములా
కెరటాల్ చిందేసముద్రంబులా
గిర గిర తిరిగేసుడిగుండములా ..దేశ ప్రజలలో రగులుకున్న జ్వాలను ఉపమానం కావించాడు.
ఆ ప్రజా విప్లవం తిరుగుబాటును ఆంగ్లేయులు అణచి వేసారని ఆ ఆరంభ సంగ్రామ మే స్వాతంత్ర్య దీక్షకు ప్రేరణమని కథకుడు…తందాన తాన, క్రమం లో కథను సమ తులగతుల తో నడి పించాడు.
తరువాత గాంధీజీ నాయకత్వం లో స్వాతంత్రోద్యమం జరుగుతున్నా సాయుధం గా పోరాడి రక్తం చిందినప్పుడే స్వాతంత్ర్యం పొందగలమని మన్యంలో పోరాటం జరిపాడు అల్లూరి సీతారామరాజని కథా సూత్రాన్ని బిగించాడు.
విశాఖ లో సుభాష్ చంద్రబోసు ఉపన్యాసం ద్వారా దీక్షా కంకణ బద్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సీతారామరాజు సంగ్రామానికి దూకాడని ఆ యువకుని లో జాగృత చైన్యానికి నాందిని తెలిపాడు.
మహాత్మా గాంధీ గారు ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించిన సందర్భం లో “నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించ లేను, కాని శ్రీ రామ రాజు వంటి ధైర్య వంతుడు, త్యాగి, నిరాడంబరుడు, ఉత్తమ శీలుడునగు యువకునికి జోహారులు అర్పింపకుండ ఉండలేను “(యంగ్ ఇండియ పత్రిక 1926.) అని గాంధీ గారు సీతా రామ రాజును గురించి రాసారు.
సీతా రామరాజు ,స్వాతంత్ర్య దీక్షను వహించడానికి ముందుగా దేశమంతా పర్యటన కావించాడని, తాను నిర్వహించ వలసిన కర్తవ్యాన్ని గురించి పరి పరి విధాల ఆలోచించాడని తెలుపుతూ కథకుడు సంభాషణా లౌల్యం లో మునిగిపోయినప్పుడు, వంత అతడు ఉపన్యాస ధోరణి లోకి మళ్ళాడని చనువుగా చెప్పడం రచయిత తనకు తానే హెచ్చరించు కున్నట్లు కనిపిస్తుంది.
రౌలటు ఆక్టు, తీవ్ర నిర్బంధాలు, జలియన్ వాలాబాగు హత్యలు, డయ్యరు సేనాని దురంతాలు సీతా రామ రాజు మనస్సును కలచి వేశాయి.
మన్య ప్రాంతం లో ఆంగ్లేయుల ఘోర పైశాచిక కృత్యాలు కనబడ్డాయి. కోయ ప్రజల దీనావస్థలను కళ్ళారా తిలకించాడు.
నిర్దాక్షిణ్యం గా హింసిస్తున్న తీవ్ర శక్తులతో పోరాడాలని బహిరంగంగానూ, రహస్యం గానూ, పోరాడి చావు దెబ్బ కొట్టాలని నిశ్చయించాడు.
ఇక్కడ రచయిత రామరాజు వ్యక్తిత్వాన్ని చక్కాగా నిరూపించారు. వ్యక్తిగతంగా ఆ వీరుడు హింసావాది కాదని, తీవ్ర శక్తులను అంత చేయడమే ఆతని ధ్యేయం అనీ స్పష్టం చేసారు. ఆ ఆశయం కోసం నిప్పు రవ్వగా రాజుకొని జ్వాలగా ప్రజ్వరిల్లిన ఆతన భావ తీవ్రతను బాలలకు తగిన పదాలతో వివరించారు.
పరదేశీయులతో జరిగే పోరాటం లో సమిధగా కావాలనీ, దేశమాత చరణాలకు పూజా పుష్పం గా ఆత్మార్పణ కావించు కోవాలని ఎంచినట్లు సీతారామరాజు త్యాగ గుణాన్ని తెలిపారు.
మన్య ప్రాతం మధ్య ప్రదేశ్ ఒరిస్సాలకుమధ్య -ఇటు ఉభయ గోదావరులను ఆనుకుని కొండలతో, కోనలతో, అడవులతో నిండి ఉందని మన్య ప్రాంతాన్ని బాలలకు భౌగోళిక పటం గీసినట్లు తెలిపారు.
మన్య ప్రాంత ప్రజలు “చేతులు రెండు -చక్కన ఉంటే -చల్ల కదలనీ -చల్లని బ్రతుకు -ఎల్లారే ఎల్లల్ల పిల్లా!” అంటూ జానపద రీతులలో ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఉన్న జన జీవన రీతికి తంబురను మీటారు.
అల హాయిగా సాగే మన్యం లో జొరబడి క్రూరమైన దమన నీతితో ఆంగ్లేయులు
అమాయకులను హింసించారు. వాళ్ళ భూములను ముఠా దార్లకు అప్పగించారు.
ఇక్కడ రచయిత కథకు కొంత విరామాన్ని కల్పిస్తూ కథకుని ద్వారా
మన్య ప్రజలను కాపాడ దలచిన సీతారామరాజు తలిదండ్రలు, జననము. బాల్యము లను గురించి వినరా భారత వీర కుమారా! అని వినిపించారు. ‘ప్రాణాలకు తెగించి పోరాడుట, ప్రాణాలిచ్చి యితరుల్ని రక్షించుట, అతనికి పుట్టుక నుంచి కలిగినగుణాలు.. అందుకు ఉదాహరణగా బాల్యంలో గోదావరిలో కొట్టుకుపోతున్న మిత్రుణ్ణి తనకు ఈత రాక పోయినా సంకల్ప బలంతో గోదావరిలో దూకి అతన్ని ఒడ్డుకు లాగి రక్షించడాన్ని విన్నవించారు.
సీతా రామ రాజు మన్యానికి సింహ ద్వారం అయిన కృష్ణ దేవు పేట నీలకంఠేశ్వరాలయం లో సన్యాసిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. అక్కడ రాజుకు చిటెకెల భాస్కర రావు గారు ఆశ్రయం ఇచ్చారు.
ఇక మన్యం కోయలను బాష్టియన్ అనే తహసిల్దారు క్రూరంగా హింసించిన రీతి ఆనాటి దీనావస్థను ధ్వనించింది.
కోయలను కూలెద్దులుగా చేసి, వాళ్ళ శ్రమను దోచుకున్న విధానాన్ని తెలుపుతూ, “భద్రాద్రి రాముడా!బాధలికెన్నాళ్ళు! ఐలేసా!ఓ ఐలేసా అంటూ శ్రామిక గీతాలను చేర్చారు. అతని బాధలు తట్టుకోలేక కోయలు ఎదురు తిరిగారు. సీతారామరాజు వారికి అండగానిలిచాడు. సమీపాన ఉన్న గట్టు పొణకల గ్రామం మునసబు గంటు దొర,అతని తమ్ముడు మల్లుదొరలు కూడా తోడయ్యారు. వారితో బాటుగోవిందు రత్తి దంపతుల పరిచయం కలిగింది. మరికొంతమందితో కలసి సీతా రామరాజు సామ్రాజ్య వాద శక్తులను, వారి తాబేదార్లను ఎదుర్కొనడానికి ప్రణాళికను సిద్దం చేసాడు.
ముందుగా సీతా రామరాజు కోయ చెంచులలో ఐకమత్యం కలిగించడానికి కృషి చేసాడు.
తాగుడు మానమని ప్రబోధించి, మల్లు దొర వంటి వారిచే కూడా మాని పించాడు.
అంతా ఒక్కటే కులం కర్మజీవులం శ్రమజీవులం అని బోధించాడు. వారిని మట్టి నుండి మహావీరులను కావించాడు. ఇత్తడిని పుత్తడి గా మలచాడు. 24 సంవత్సరాల వయసులో (1921) లోమన్యం తిరుగు బాటు సాయుధ పోరాట లక్ష్యం స్వాతంత్ర్య సాధనగా ఏర్పరచాడు.
సీతా రామ రాజు గాము కొండ ధార కొండల నడుమ విప్లవ పొరాట యొధులకు గెరిల్లా పద్ధతులను ప్రబోధించాడు. గెరిల్లా పద్ధతులను గురించి
“ప్రక్క పోటు పొడవండి
పక్షి వోలె యెగరండి
చుక్కలు తెగి పడి నట్టులుగా
సూటిగ శత్రువు పై బడుడీ
వెనక నుండి పై బడదాము వేగమె
కను మరుగవుదాము భారతీయ వీరులు అనగా
భయము తోడ పరుగిడవలెరా” అంటూ కథకుడు పోరాట పటిమకు తగిన అభ్యాస నైపుణ్యాన్ని విశదం చేసాడు.
ఇక తుపాకులు ఫిరంగులు మారణాయుధాలు కలిగిన ఆంగ్లేయులతో రామరాజు “విల్లమ్ములతో వచ్చి చేరుకొను వేయి కనులతోడా ..
అమ్ముకు కట్టీ మిరపకాయలను
అంపును లేఖల శత్రు శిబిరముల,
ఇన్ని గంటలాకు-ఇన్ని దినములకు
వచ్చెద కాచుకొమ్మనుచు …అంటూ మిరప కాయ టపా ను గూర్చిన విశేషాన్ని తెలిపినప్పుడు
ఒక అమ్ముకు మిరపకాయను చీటీని గుచ్చి తాము దాడి చేయ బోయే ప్రదేశానికి దగ్గర చెట్టుకో తలుపుకో ప్రయోగించేవారని బాలలకు విశదం అవుతుంది
అల్లూరి సీతా రామ రాజు మెరుపు దాడి చేసిన స్టేషను లను వరుస గా తెలుపుతూ, ఆ దాడులలో పట్టుబడిన ఆయుధాల వివరాలను ఎప్పటికి అప్పుడు రికార్డు పుస్తకాలలో దాఖలా చేసినట్లు, అల్లూరి సీతా రామ రాజు పోరాట నిబద్ధతను కథకుడు వెల్లడించాడు.
అలాగే లాగరాయి పితూరియోధుడు వీరయ్య ను గురించి చెప్తూ. పితూరీలు అంటే ఉద్యమాలు, తిరుగుబాట్లు అనీ. వాటిని వైరులు అణచి వేసానీ తెలిపాడు.
ఇలా కొనసాగి పోతుంటే
ఆ వెల్లువ నాపే శక్తి లేదని బాష్టియను బ్రేకను దొరకు వినతి చేసాడు.
ఇక్కడ హాస్యాన్ని జోడించారు రచయిత. బ్రేకను హల్లో హల్లో అని ఆర్తనాదం చేస్తూ మన్యం వీరుని చిత్ర గాథలను మద్రాసు గవర్నరు వెల్లింగ్టన్ కు ఫోనులో గోడు చెప్పుకున్నాడని అల్లూరి సీతారామ రాజు పరాక్రమాన్ని అన్యాప దేశం గా నిరూపించారు.
మన్యం విప్లవాన్ని అణగ ద్రొక్క డానికి
జర్ జర్ మనుచు లారీల నిండా కాకినాడ రిజర్వు దళాలు కదిలి వచ్చాయి,
జయపురం నుండి ఏనుగులు వచ్చాయి.
తిరుగుబాటును అణచి వేయడానికి గవర్నరు ప్రపంచ యుద్ధం లో పేరు పొందిన మేజర్ జనరల్ గుడాల్ ను పంపించాడు. కాని
అతని వల్లకూడా సాధ్యం కాలేదు.
“కుయ్యో మొర్రో అని కూత పెట్టాడు….
గుడాలు వినతికి పై అధి కారులు
పంపిరి వేలాది సైనిక భటులను,
గూర్ఖాదళమును గూర్చి పంపిరీ
మలబార్ పోలీసు మందిని దెచ్చిరి మన్యం భూములకూ” …రామరాజు తో తామిక చాల లేమని స్పెషల్ ట్రయిను లో దిగిన అస్సాము, మలబారు, గూర్ఖా దళాల తో మన్యం నిండి పోయింది.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు బ్రేకను దొరకు బదులు రూథరు ఫర్డ్ వచ్చాడు. ఈ రూథర్ ఫర్డ్ పన్నుల నిరాకరణోద్యమం సాగించిన పల్నాటి వీర హనుమంతుని చంపిన వాడు. ప్రపంచ
యుద్ధం లో ఎడారి యుద్ధ యోధుని గా పేరు పొందిన కవర్టు హైటరులు కూడా గుడాలుకు సహాయకులుగా వచ్చారు.
వారు ఇక విప్లవ జ్యోతిని మోసం తో ఆర్పివేయడమే శరణ్యం అని తలచారు,
వారి క్రూర నీతి నెరుగక భాస్కర రావు గుడాలు తో సంధి చేసుకోడానికి వెళ్ళ మని అల్లూరి సీతా రామ రాజుకు సలహాను ఇచ్చారు.
అల్లూరి సీతా రామ రాజు ఆంగ్లేయులకు దొరికి పోవడం, ఆ వీరుని మరణాలను గురించి, వేర్వేరు వివరణలున్నాయని, బుర్రకథా రచయిత తెలిపారు.
కొన్ని గ్రంథాలలో ఆశ్రయాన్నిచ్చిన చిటికెల భాస్కర రావు గారి సలహాను అనుసరించి అల్లూరి సీతా రామ రాజు ఆంగ్ల సేనాని గుడాలు దగ్గరకు వెళ్ళడం, అతడు మోసంతో అల్లూరిని బంధించి కాల్చివేసినట్లు ఉందని , శ్రీ పడాల వారు రాసిన ఆంధ్ర శ్రీ లో శ్రీ రాజు రక్త సిక్తమైన తన దేహాన్ని యేటిలో కడుగు కొని అర్ఘ్యం ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యానికి తెలిసి, శ్రీ రాజును బంధించి చెట్టుకు కట్టి కాల్చారని ఉందని దుర్గా రావు గారు తెలిపారు.
దుర్గా రావు గారు తమ బుర్ర కథలో సీతా రామరాజు భాస్కర రావు గారి సలహాను విని ఒక్క క్షణం చ లించినట్లు, తరువాత చిన్న తనం లో తడ్రి పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చి ఆంగ్లేయులతో పోరాడడానికే నిశ్చయించినాట్లు రాసారు. రక్త సిక్తమైన దేహాన్ని నదిలో కడుగు కొని సంధ్యార్కునికి అర్ఘ్యాన్ని ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యం చుట్టు ముట్టి, సేనాని గుడాలు దగ్గరకు తీసుకుని పోగా అతడు సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చాడని రాసారు.
అల్లూరి సీతారామ రాజు అనుచరుల పేర్లు, శత్రువులైన దొరలపేర్లు, అధికారుల పేర్లు, ఇలా అందరి పేర్లూ రచయిత పొందుపరిచారు. ఒక ప్రజాయోధుడు, ఒక మహా విప్లవకారుడు
మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వెలుగుబాట వేసిన త్యాగధనుని అమరగాధ ను అతి సరళం గా బుర్ర కథగా రచించిన పి. దుర్గా రావు గారు అభినంద నీయులు రాజేశ్వరి* దివాకర్ల .
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో
జరిగే జయంతి (జూలై 4)కార్యక్రమానికి ప్రధాని మోదీ భీమవరాన్ని సందర్శించారు.
అలారం మోగింది . నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది . మొహం మీద నీళ్ళు జల్లుకొని పుస్తకం తెరవబోతుంటే పావని వచ్చింది. గుడ్ లేచావా! ఓ గంట సేపు చదువుకో. ఆరుగంటల కల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. . కిందకెళ్ళు , అటు తరువాత ..అని పావని ఇంకా ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి …అంతేగా! అమ్మా! విసుగ్గా అంది.
కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు .అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి . నేనొచ్చి తీసుకొస్తాను తరువాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని చదువు కుందువుగాని అంటూ, ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది పావని
నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో,
అమ్మా!…
ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి. పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితు లందరూ తరగతి లో మంచి పర్సెంటేజ్ రావాలని కొచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. .అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే
అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము . అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారుకదా ! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ క్లాసులకు వెళ్ళే టైములో ఏ యోగా క్లాస్ కో వెళ్ళావనుకో , ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది పావని.
చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక . లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రై వింగ్ నేర్చుకోడా నికి వెళ్తున్నావా? కొచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో , నీకేం , తెలివైన దానివి.. .వాళ్ళు అలా అంటుండ గానే
లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్లో ఉండే స్త్రీలు కొంతమంది కూచుని మాట్లాడుతూ ఉన్నారు . వాళ్ళు నేత్రికను చూడగానే, పావని తో
మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు.
తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ. మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ, మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు,అంటుంటే, . మీరు నేర్పించిన తెలుగు “అచార్” ను మాఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్.
అది సరేకాని రేపు హోళీ పండుగ కదా! మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేసాంకదా! ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం! సాయంత్రం అందరం కలసి కమ్యునిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది, అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలగూ సెలవేకదా,! వాళ్ళ తో కలసి రోజంతా హాయిగా గడుపుదాం అంది పావని.
హోలీ గురించిన కథలను పిల్లలకు నేను చెప్తాను అంది, పురాణ కథలను చదివిన కస్తూరి.
అదే ప్రహ్లాదుడు ఆతని సోదరి హోలిక, శివుని తపో భంగాని కొచ్చిన కాముని దహనం ..ఈకథలేనా? మంచిది …..సంక్షిప్తంగా చెప్పు అంది పావని.
హోలీ పున్నమ స్వచ్ఛతను ప్రసరించే పండుగ. ఈ పండుగ రోజున, వెన్నెల వెలుగు లోని వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణం లో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని పొందుతుంది. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ వ్యాధులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధాలుగా పనిచేస్తాయి. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు,బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్య విధానం లో, తయారు చేస్తారు.
తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పాలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగు లోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. కొన్నిసార్లు బట్టి పట్టి ముఖ్యమైన పానీయాన్ని తండై లేదా భంగు ను తయారుచేస్తారు …తనకు తెలిసిన విషయాలను చెప్పింది జ్ఞాన ప్రభ.
నొ ,నొ, పిల్లలను సమయం వేస్ట్ చేయ నీయరు. మాఅయన ఒప్పుకోరు. పరీక్షల రోజులు కదా! చదువుకోవాలంటారు… అంది కనక మహాలక్ష్మి
ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, అందరితో కలిసిమె లిసి ఉండటం అలవాటు చెయ్యాలి….అంది పావని.
అందరూ రేపటి సన్నా హా లను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.
రాత్రి 11 పదకొండు గం టలయింది నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో .మళ్ళీ రేపు చదువు కోవాలంటూ పొద్దున్నే లేస్తావు, అంటూ గదిలో కొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయ టికెళ్తూ . …
పావని భర్త ఈశ్వర్ “పావని ధోరణి తనకలవాటే కనుక “ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకొమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు ,”అన్నాడు అర్థం కానట్టు.
అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందే మీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే . చదువు జీవితానికి వెలుగు ,కాని ఆవెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆరంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి .ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, రక రకాల రంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి . అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ కదా!
ఆమనీ సుమడోలగా, రాసలీలగా, వసంతోత్సవ హేలగా, అలలారే ‘హోలీ’ మానవాళిలో సమైక్యతనీ, సంఘటిత శక్తినీ, సమాజ చైతన్య స్పృహనీ కలిగిస్తుంది. అందరిలో కొత్త ఉత్సాహం నింపడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా విశ్వకవి రవీంధ్రనాధ్ టాగూర్కి వసంతాగమన సమయానికి సుస్వాగతం పలికే హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం.శాంతి నికేతన్ లో చదువు కున్నారు. “ఒరె భాయి ఫగూన్ లగచె బొనె బోనె …దాలె దాలె ఫులె ఫులె, పతే, పతే రె,
ఆరలె ఆరలె కొనె కొనె” అని పాడే వారు కదా… రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.
