బాలలకు సైతం పెద్దవారికి మాదిరిగా హక్కులున్నాయని తెలుసా? హక్కులు, బాధ్యతలు అనేవి చిన్నా, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్నిటిని కల్పించింది. వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. బాలల రక్షణకు సంబంధించి కొన్ని చట్టాలు కుండా ఉన్నాయి. వారి హక్కుల్ని పరిరక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవు. కానీ సాధారణ సమాజంలో బాలల చట్టల గురించి ఎవరికీ అవగాహన లేదు. తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ హక్కులు, చట్టాల గురించి అవగాహన కలగజేస్తే బాగుంటుంది.
మనం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాము. ఈనాడు ఏ ఉపాధ్యాయుడికీ పిల్లల సమస్యల గురించి పట్టదు. కనీసం పసివాడు ఎంత చదవగలడు ? ఎంత రాయగలడు? అన్న వివేచన కూడా ఉండదు. పిల్లవాడు అల్లరి చేయుకుoడా చూడటమే వారి పని. అుదుకే పిల్లలు కదలకుండా, మాట్లాడకుండా కాపలా కాస్తుంటారు. శృతిమించిన క్రమశిక్షణ పిల్లల్లోని సృజనాత్మకతను, సహజ సిద్ధతనూ కోల్పోయేలా చేస్తుంది. ఉత్సాహం, చలనం లొపించిన బాలలు ప్రాణంలేని బొమ్మలతో సమానం. పిల్లల్లోని సహజత్వానికి భంగం కలగకుండా పాఠాలు బోధించాలి సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని కోల్పోయిన పిల్లల్ని బాలలు అనలేము. ఏ వయసు పిల్లలకు ఎంత హోంవర్కు అవసరమో అంతే ఇవ్వాలి. వారి ఆటపాటల సమయాన్ని హరించేసే హోంవర్కులు పిల్లల ప్రగతికి గొడ్డలి వేట్లు.
తల్లి దండ్రులు సైతం పిల్లల పెంపకాన్ని భారంగానే చూస్తున్నారు. తమ్మ చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పైనే శ్రద్ధ పెడుతూ పిల్లల్ని అనవసర భారంగా భావిస్తున్నారు. లక్షల ఫీజులైనా కట్టేసి పెద్ద పెద్ద సూళ్ళలొ చేర్పించేసి చేతులు దులుపు కుంటున్నారు హాస్టళ్ళలో వారి అవస్థలు చెప్పనలవి గాదు. కొంత మంది గడుసు పిల్లలకు సమస్యలేం రాకపోవచ్చు. కొంత మంది సున్నిత మనస్కులుగా ఉంటారు. అటువంటి పిల్లలు తమ సమస్యలను అందరికీ చెప్పుకోలేరు ఇటువంటి పిల్లలు కాన్నిసార్లు తల్లి దండ్రుల వద్ద కూడా నోరు విప్పి చెప్పరు. పెద్ద క్లాసు పిల్లలు, రౌడీ పిల్లలు తమ హోంవర్కుల్నీ, మిగతా పనుల్నీ నెమ్మదస్తులమేత చేయిస్తుంటారు. ఇవి టీచర్ల దాకా వెళ్ళవు. ఒక వేళ వెళ్ళినా గడుసు పిల్లల్నే తెవివగల పిల్లలుగా టీచర్లు మెచ్చుకుంటుంటారు నిదానస్తులకు, నిజాయితీ పరులకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావు.
ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటారని తెలుసా? బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబరు 20వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1954వ సంవత్సరంలో డిశంబరు 14వ తేదిన ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. 1959 వ సంవత్సరం నవంబరు 20వ తేదీని ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. బాలల సంక్షేమం, బాలల హక్కులు కాపాడబడటం కోసం విద్యా సంస్థల అధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తారు. ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తారు.
బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు ఈ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలికస్థాయిలో ఉచితంగా లభించాలి. నిర్భంధం గానైనా బాలలందరికీ విద్యా హక్కు అమలు కావాలి అప్పుడే నవ భారతం లో కాబోయే నూతన పారలు దేశాన్ని రక్షించుకోగలగుతారు.
బాలలు అత్యధికంగా హింసకు గురి అవుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో బాలల గురించి సర్వేలు చేయబడ్డాలు. ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల బాలలు ఎక్కువగా హింసతో పాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. భౌతిక మరియు లైంగిక, మానసిక దాడులకు పిల్లలు బలవుతున్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదు. బాల కార్మికులు ఇంతకు పూర్వం ఇటుక బట్టీలలో, కొండల తవ్వకాలలో, గ్రానైట్ క్వారీరులలో పనిచేసేవారు. ప్రమాద పరిస్థితుల్లో పనిజెసే బాలల్ని బాలకార్మికులు అనేవారు. ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ రూపం మార్చుకుని స్కూళ్ళలో చేరింది. బస్తాల బస్తాల పుస్తకాలు మోయటం, రాత్రనక పగలనక రాసినవే రాయటం, స్లిప్ టెస్ట్ లు , వీక్లీ టెస్ట్ లు, మంత్లీ టెస్ట్ లు అoటూ రకరకాల టెస్ట్ లతో పిల్లలను మనశ్శాంతికి దూరం చేయడం వంటివన్నీ నేటి స్కూళ్ళలో నిత్య కృత్యమై పోయాయి. పెద్ద పేరున్న స్కూళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎంతో మంది బాలలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తల్లి దండ్రులు నిర్లక్యధోరణి, పట్టించుకోకపోవడం కూడా కారణమవుతున్నాయి.
బాలల సంక్షేమం కొరకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యానసేవల చట్టం, నిర్భంద ప్రాధమిక విద్య హక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరిక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లై చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసింది. ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేకమైన నిభందనలు రూపొందించవచ్చు సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 15 ద్వారా వ్యక్తిగత స్వేచ్చ మరియు న్యాయ ప్రక్రియ యొక్క హక్కు ఆర్టికల్ 21 ద్వరా అక్రమ రవాణా నుంచి రక్షించబడే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరచ బడ్డాయి. ఈ విధంగా పిల్లలకు కూడా పెద్ద వారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు ఇవ్వబడ్డాయి. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకాలు బాధ్యత వహించాలి. నేడు ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాని ఆచరణలో సాధ్యం కావటం లేదు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరచబడినవి.
డా.కందేపి రాణీప్రసాద్
డా.కందేపి రాణీప్రసాద్
Dr. kandepi Raniprasad Managing director Srujan children hospital Sircilla Telangana రచనలు:: పూలతోట,నెలవంక,నందివర్ధనం,స్వీటీ,మిల్కీ, ఓ చిలుకా,పూలజడ, Quarantine, botanical zoo. వంటి 40 పుస్తకాల రచన. Hospital waste material తో సుమారు 3000 బొమ్మలు మరియు టీచింగ్ aids తయారీ కు 3 వరల్డ్ రికార్డులు లభించాయి. బాల సాహితీ పూర్ణిమ,బాల సాహితీ కౌముది,కల భారతి, కవితా వాణి,బిరుదులు ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం , తెలంగాణ ప్రభుత్వ జిల్లా ఉత్తమ సాహితీ వేత్త, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ జిల్లా మహిళా రచయిత్రి పురస్కారాలు 100 కు పైగా లభించాయి. రచనలు:: పూలతోట,నెలవంక,నందివర్ధనం,స్వీటీ,మిల్కీ, ఓ చిలుకా,పూలజడ, Quarantine, botanical zoo. వంటి 40 పుస్తకాల రచన. Hospital waste material తో సుమారు 3000 బొమ్మలు మరియు టీచింగ్ aids తయారీ కు 3 వరల్డ్ రికార్డులు లభించాయి. బాల సాహితీ పూర్ణిమ,బాల సాహితీ కౌముది,కల భారతి, కవితా వాణి,బిరుదులు ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం , తెలంగాణ ప్రభుత్వ జిల్లా ఉత్తమ సాహితీ వేత్త, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ జిల్లా మహిళా రచయిత్రి పురస్కారాలు 100 కు పైగా లభించాయి.
అలా స్తబ్దుగా ఉన్నావేమిటి? అవునూ మొహం గoటు పెట్టుకొని ఉన్నావేమిటి? అరే ఏమైంది? మొహం ఉబ్బిపోయింది? అంటూ కదలామెదలక కూర్చున్న మూత్రపిండాన్ని పలకరించింది క్లోమం. క్లోమం అలా పలకరించిందో లేదో మూత్రపిండం ఒక్కసారిగా ఏడ్చేసింది.
“ఊరుకో ఊరుకో ఏడవకు! ఏమైందో చెప్పు! అలా నీరసంగా ఉన్నావేమిటి? మూత్రపిండం వీపు నిమురుతూ ఉరడిస్తూ అడిగింది క్లోమం. ఏం చెప్పమంటావు నా బాధ. నా మొహం ఉబ్బిపోయింది నేనేమీ పని చేయలేకపోతున్నాను. నా కాళ్లు కూడా ఎలా వాచిపోయాయో చూడు”. అంటూ తన కాళ్ళను చూసుకోగానే మాట్లాడడం ఆపి ఏడవడం మొదలు పెట్టింది మూత్రపిండం.
అయ్యో ఏడవకు ఏడవకు, సరే తర్వాతే చెబుదువు గానీ ముందు ఏడవటం ఆపేయ్, ఇలా కూర్చో! కళ్ళు తుడుచుకో అని ఊరడిస్తూ “ఇదిగో కాసిని మంచినీళ్లు తాగు అన్నది క్లోమం. ఆ మాట అనీ అనగానే మూత్రపిండం మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది. అరే మళ్లీ ఏమైంది నీతో ఏం మాట్లాడినా ఇబ్బందిగా ఉన్నదే అని క్లోమం ముందుకు వంగి మూత్రపిండం భుజం తడుతూ అన్నది.
మూత్రపిండం ఏడుస్తూనే “నా ఈ పరిస్థితికి కారణం మంచినీళ్లే కదా! అందుకే నీవు మంచినీళ్లు మాట ఎత్తగానే నాకు ఏడుపు వచ్చింది” వెక్కుతూ వెక్కుతూ చెప్పింది. “అంటే ఏమిటి! మంచి నీళ్ల వలనే నీకీ పరిస్థితి దాపురించిందా! నాకు నీ విషయం వింతగా ఉన్నది నాకేమీ అర్థం కావడం లేదు” అన్నది ఆశ్చర్యంగా క్లోమం.
“నా మొహం కళ్ళు, కాళ్ళు ఇలా వాచిపోయి రోగగ్రస్థమై పోయానంటే ప్రధాన కారణం మంచినీరే. నా కడుపు లోపల రాళ్లు ఏర్పడి బాగా నొప్పి కలిగిస్తుంది. నా ఈ అవస్థలన్నింటికీ కారణం మంచినీరే!” అంటూ మూత్రపిండం చెబుతూ ఉండగానే క్లోమం మధ్యలో అడ్డు తగిలింది. “సకల జీవులకు దాహం తీర్చే మంచినీరు నీకిన్ని కష్టాలను తెచ్చిందా, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. పంచభూతాలలో ఒకటైన స్వచ్ఛమైన మంచినీరు పోయే ప్రాణాలను నిలబెడుతుంది తిండి లేకపోయినా మంచినీటితో కొన్ని రోజులు జీవించవచ్చు అని అంటారు కదా! ప్రాణాన్ని నిలబెట్టే నీరు కాసేపు గొంతు తడపకపోతే ప్రాణం పోవడం ఖాయం అలాంటి మంచినీటిని తప్పుగా మాట్లాడుతావా”? ఆవేశంగా అన్నది క్లోమం.
“నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడతావేమిటి? మంచినీళ్లు తాకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం. నేనొక ఆడపిల్ల కడుపులో ఉన్నాను ఆ అమ్మాయి ఏ రోజూ తగినంత మంచినీరు తాగదు అందువల్లే నాకీ జబ్బులు వచ్చాయి” అన్నవి మూత్రపిండం రోదిస్తూనే!
“ఓహో మంచినీరు తాగకపోవడం వల్ల నీకి జబ్బులు వచ్చాయా! మరి సరిగా చెప్పవేం? నేను మంచినీటి వలనే ఇలాంటి జబ్బులు వచ్చాయనుకున్నాను. అదేమిటి నేను ఎప్పుడూ వినలేదే అనుకున్నాను అందుకే ఆశ్చర్యం అనిపించింది. సరే ఇంతకు మంచినీరు ఎందుకు తాగటం లేదట” ఆరాగా అడిగింది క్లోమం
“అదే నేను ఇందాక చెప్పాను కదా! నేనొక ఆడపిల్ల కడుపులో ఉంటున్నానని. ఆడపిల్లకు చాలా చోట్ల బాత్ రూములు అందుబాటులో ఉండవు. బాత్ రూములు తక్కువగా ఉండటం వలన మూత్ర విసర్జన కష్టం కదా! ఎక్కువసార్లు మూత్ర విసర్జన జరగకుండా ఉండాలంటే మంచినీళ్లు తాగటం మానేయాలి అనుకుంటారు. అందుకే చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటే మంచినీరు తాగరు. వారు మంచినీరు తాగకపోతే నా పని ఎలా జరుగుతుంది. దేహంలోని విసర్జకాలను నేను జల్లెడ బట్టి నీటితో కలిపి బయటికి పంపించే డ్యూటీయే కదా నాది, మరి మంచినీళ్లు లేకపోతే దేహంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను బయటికి ఎలా పంపించాలి దాని వల్లే నాకీ బాధ” బోరు బోరున ఏడుస్తూ తన బాధను వెళ్ల గక్కింది మూత్రపిండం.
“వాళ్లు మంచినీళ్లు తాగకపోతే నువ్వేం చేస్తావు దానికి నువ్వు బాధపడి ఏం ప్రయోజనం. వారి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించకు. వాళ్లకే అనారోగ్యం వస్తుంది. వారి ఆరోగ్యం గురించి వారికి శ్రద్ధ లేదా” అని క్లోమం కొద్ది కోపంతో అన్నది.
వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉంటే నాకీ బాధ ఉండదు. వారికి శ్రద్ధ లేకపోవడం వల్లే నాకీ కష్టాలు వస్తున్నాయి. నేను వ్యర్ధాలను బయటికి పంపకపోతే నాకే నష్టం జరుగుతుంది. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఇల్లంతా దుర్గంధమయం అయినట్లుగా ఈ వర్గాలంతా నా కడుపులోపలే ఉంటే అనారోగ్యం సంభవిస్తుంది. వాళ్లకు డయాలసిస్ అవసరం పడుతుంది. నన్ను ఇబ్బంది పాలు చేసి వారు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏమిటో ఈ తెలివి తక్కువ మనుషులు. “నాగరికత పెంచుకున్నాం, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి” అని విర్రవీగే మనుషులు వారికి వారే సొంతంగా జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. అని మూత్రపిండం వాపోయింది.
“ఓహో అలాగా! చక్కగా సమయం ప్రకారం మంచినీరు తాగితే ఇన్ని సమస్యలు ఉండవు కదా! చిన్న జాగ్రత్త పాటిస్తే పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చు. ఆడపిల్లకు తగినన్ని బాత్ రూములు కట్టించవచ్చు కదా! దీనివల్ల ఎంతో ఉపయోగముందని తెలుసు కదా! తెలిసీ పరిష్కరించకపోవడం ఎంత తప్పు” క్లోమం ఆవేశంగా అన్నది.
“నా బాధ కూడా అదే కదా! ఏం చెయ్యను. ఏమి చేయలేకనే ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతో తెలివిగల మానవులు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? నా బాధలు ఎప్పుడూ తీరతాయో! ఎప్పుడైతే పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడే నా బాధలు మాయమవుతాయి. దానికోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ క్లోమం చెయ్యి పట్టుకుని నడవలేక నడుస్తూ వెళ్ళిపోయింది మూత్రపిండం.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై బయల్దేరింది. షాంఘై నుండి బీజింగ్ కు మరొక విమానమెక్కాలి. విమానం పైకెగరగానే పై నుంచి ఢిల్లీ నగరం పాపిడి బొట్టు, వడ్డాణం, మెడనిండా హారాలు, కాళ్ళకు మువ్వలతో సహా సకల ఆభరణాలనూ ధరించిన నవ యవ్వనవతిలా ఉంది. ఢిల్లీ నగర సోయగాలను ఆస్వాదిస్తూ విమానంలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాను. విమానం పెద్దదిగా 2-4-2 సీటింగ్ ఎరేంజ్మెంట్ తో ఉన్నది. చైనీస్ ఎయిర్ లైన్స్ కాబట్టి ఎయిర్ హోస్టస్ లు చైనీయులే ఉన్నారు. టీవీలో చైనీస్ లాంగ్వేజ్ వినిపిస్తున్నది. వారణాసి, ఢాకా నగరాలను దాటుకుంటూ ఉదయం 5-30కు షాంఘైలోని ‘పుడాంగ్ ఎయిర్పోర్టు’కు చేరుకున్నాం. విమానం నుంచి షాంఘై నగర లైట్లను చూసినప్పుడు ఢిల్లీ కన్నా భిన్నంగా కనిపించింది. అన్నీ ఒకే రంగుతో పసుపు రంగు లైట్లు కనిపిస్తున్నాయి. దాంతో కొన్ని ఎకరాల మేర బంగారం పంట పండినట్లుగా కనపడుతున్నది. ఢిల్లీ నగరమేమో నవరత్నాలతో సర్వాలంకార భూషితంగా ఉంటే షాంఘై నగరం మాత్రం కేవలం బంగారం పంట పండించినట్లుగా ఉన్నది. షాంఘై నుండి బీజింగ్ చేరే సరికి ఉదయం 10-30 అయింది.
బీజింగ్ కేవలం చైనాకు రాజధాని మాత్రమే కాదు. నేషనల్ పొలిటికల్ మరియు కల్చరల్ సెంటర్, మన హైదరాబాదు లాగానే దీనికి కూడా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ సిటీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ శతాబ్దంలోనే చైనా బాగా అభివృద్ధి చెందింది. చైనా దేశం జనాభాలో మొదటిస్థానం, భూ భాగంలో మూడవ స్థానాన్ని ఆక్రమించియున్నది. ఇక్కడి కరెన్సీని ‘యువాన్లు’ అంటారు. మేము వెళ్ళిన రోజు ఒక యువాన్ కు 72 భారతదేశ రూపాయలు. ఇక్కడ ఉష్ణోగ్రత ఈ కాలంలో మైనస్ డిగ్రీలలో ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుందట. రకరకాల నేలలు, పెద్దదైన భూభాగం వల్ల వాతావరణం ఎప్పుడూ నిలకడగా ఉండకపోవడం వల్ల సందర్శనకు ఇది అనువైన సమయమని చెప్పేందుకు లేదు.
యాంగ్జీనది చైనాను ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడగొడుతుంది. చైనా భూభాగంలో మూడింట రెండు వంతులు పర్వతాలే ఉన్నాయి. దీని భూభాగ వైశాల్యం 9.6 మిలియన్ చ.కి. యాంగ్జీనది చైనాలో అతిపెద్దనది. ప్రపంచంలోని అతిపెద్ద నదులైన నైల్, అమెజాన్ల తర్వాతి స్థానం దీనిదే. చైనాలో నాగరికత వెల్లివిరియటానికి దేశంలోని రెండవ అతిపెద్ద నదైన పసుపునది కారణమని చెపుతారు. ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన చైనీస్ భాషకు వర్ణమాల వ్యవస్థలేదు. ఇది చిత్రలేఖనం రూపంలో ఉంటుంది. ఈ భాష స్వర సంబంధిగా ఉండటం వల్ల మనకు అన్ని మాటలూ ఒకే రకంగా వినబడతాయి. చైనా అధికార భాషను ఇంగ్లీషులో ‘మాండరిన్’ అంటారు. చైనా వెళ్ళబోయే ముందే ట్రావెల్స్ వాళ్ళు సాధారణంగా మనకవసరమయ్యే మాటల్ని చైనా భాషలో ఏమనాలో పేపర్ ప్రింటవుట్లు ఇచ్చారు. వాటిని ఎంతసేపు చదివినా పేపర్ దగ్గరుంటే తప్ప ఏదీ గుర్తుండేలా లేదు. బాగా చదివి ‘థ్యాంక్ యూ’ అనే పదానికి ‘జీజీనీ’ అనాలని గుర్తుపెట్టుకున్నాం. ప్రతి చోటా అందరికీ ‘జీజీనీ’ అని చెప్తుంటే వాళ్ళు సన్నగా నవ్వుకుంటున్నారు. ‘ఎలా ఉన్నారు’ అని అడగాలంటే ‘ని హావో మా’ అనాలి. ఏదైనా వస్తువు కొనాలంటే ‘రేటెంత’ అని అడగాలి కదా దానికి ‘డుమో షావో కియాన్?’ అని అడగాలి. ఇలా వాళ్ళ భాష గురించి వివరాలు తెలుసుకున్నాం.
బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి ఊర్లోకి వస్తుంటే ఆకాశాన్నంటే భవనాలు, అద్భుతమైన రోడ్లు కనువిందు చేశాయి. అన్ని ప్లైవోవర్లే. మేం ఎయిర్ పోర్టు నుంచి హెూటల్ కు చేరే వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేనే లేదు. ఏ బిల్డింగ్ చూసినా పది అంతస్థులకు తక్కువ కనిపించలేదు. మేము దిగిన ‘ఫీటియాన్’ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఇరవై అంతస్థుల భవనం. మా రూమ్ నంబరు 805 బీజింగ్ నగరంలో 16,000 కి.మీ మేర ఆరు రింగురోడ్డులు విస్తరించి ఉన్నాయని గైడ్ వివరించింది. అక్కడి పంటపొలాలు కొనుక్కోవటం గానీ, కొనుక్కున్నాక అవి మరల నా పిల్లలకు అని రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవట భూమి ఏదైనా ప్రభుత్వానిదే కావాలంటే 30 లేదా 40 సంవత్సరాలు కిరాయికి ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ తరువాత మరల ప్రభుత్వానికే అప్పజెప్పాలి. వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి వీలు లేదు. పిల్లలు పెద్దవాళ్ళయి వ్యవసాయం చేసుకుంటానంటే మరల ప్రభుత్వం నుంచి కిరాయికి పొలం తీసుకోవాల్సిందే. ఎయిర్ పోర్టు నుండి హెూటల్ కు చేరేదాకా గైడు ఈ విషయాలన్నీ చెపుతూ కూర్చున్నది. బస్సులో ఓ మైకు ఉంటుంది. ఆ మైకు ద్వారా ఆమె ఇవన్నీ మాట్లాడింది. ఆ గైడు పేరు ‘అమీ’. తాను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ జోకులు వేస్తూ విషయాలన్నీ చెప్పింది.
సాయంత్రం 6-30కు జనోషా థియేటర్ లో ‘ఆక్రో బాటిక్ షో’ చూపించారు. ఇది చాలా అద్భుతంగా ఉన్నదిద. దీంట్లో చైనా వాళ్ళ సాంప్రదాయక నృత్యంతో పాటు సర్కస్ ఫీట్లన్నీ ఉన్నాయి. ఒక ఇనుప గోళంలో మోటరు సైకిళ్ళతో స్పీడుగా నడపడం అంటే ఎంత కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చాలా ప్రమాదం. చూడటానికి చాలా ఆనందాన్నీ, సంభ్రమాశ్చర్యాల్నీ కలగజేసినా వాళ్ళ జీవితాలు ఎంత రిస్క్ కూడుకున్నవో తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు పది బంతుల్ని తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు చేతులతో పట్టుకుంటూ ఉండటం, తల మీద టోపీలను పైకెగరవేసి ఒకరిని మరొకరు పట్టుకోవటం వంటివి వారి హస్త నూపుణ్యానికి, ఏకాగ్రతకు నిదర్శనం. కొంతమంది రాజులుగా, జోకర్లుగా వేషాలు వేసుకొనీ, మరికొంతమంది అమ్మాయిలు అందంగా అలంకరించుకొని డాన్స్ చేయటం వారి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇంకొందరు కుర్చీలను కింది నుంచి పైకి వంకరటింకరగా ఒకదానిపై మరొకటి పేర్చుకొని దానిపైకి ఎక్కుతూ, తల మాత్రమే వాటికి ఆన్చి శరీరమంతా గాల్లో తేలేలా చెయ్యటం చూస్తుంటే వాళ్ళు పడిపోతారేమో, పడిపోతారేమో అని మనకు టెన్షన్ అనిపిస్తుంది. ఇలా కుర్చీలపైకెక్కటం, రింగుల్లోంచి దూరి ఒకరిపై మరొకరు పడటం, మోటారు సైకిళ్ళు విన్యాసం- ఈ సర్కస్ ఫీట్లన్నీ ఎంత ప్రాణాంతకమో తెలిస్తే చాలా బాధనిపించింది. ఇలా ఒకసారి కాదు కదా! ప్రతి రోజూ రెండు మూడు షోలు ఇవ్వాలి. స్టేజి షో కాబట్టి తప్పు జరగడానికి లేదు. ఇలా జీవిత కాలం ప్రమాద పరిస్థితితో ఉండటమనే విషయాన్ని ఆలోచిస్తేనే విషాదం అనిపించింది. ఏది ఏమైనా పిల్లలూ, పెద్దలూ ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో నోరు తెరవని వారు లేరు. ఇంకా కుంగ్ ఫూ ప్రదర్శన కూడా ఉంటుందట గానీ మాకు చూడటానికి టైమ్ దొరకలేదు.
ఆ మరునాడు ఫర్ బిడెన్ సిటీ టియాన్మన్ స్క్వేర్ చూడటానికి వెళ్ళాం. ఇవి రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. ఫర్ బిన్ సిటీని 1407లో కట్టారు. దీని నిర్మాణంలో ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది పనివాళ్ళు పాల్గొన్నారు. దీన్లో మింగ్, కింగ్ రాజవంశాలు 500 సం॥ల పాటు నివసించాయి. ఈ భవనం లోపల ఒక రకమైన పసుపు రంగుతో లెక్కకు మిక్కిలిగా అలంకరణలు చేయబడ్డాయి. పసుపురంగు చైనా వారి సాంప్రదాయమైన రంగట. ఈ భవనాలన్నీ వారి వస్తు ప్రకారం కట్టబడినాయట.
టియాన్మన్ స్క్వేర్ యాభై హెక్టార్ల స్థలంలో వ్యాపించబడి ప్రపంచంలోని అతిపెద్ద ఖాళీ ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది. దీనిని 1417లో మింగ్ రాజవంశం స్థాపించింది. సామాన్య ప్రజలంతా తమ రాజులు, రాణుల ఎదుట ఉత్సవాలను జరుపుకోవడానికి వీలుగా ఈ స్క్వేర్ ను ‘ఫర్ బిడెన్ సిటీ’ ఎదురుగా నిర్మించారు. ప్రస్తుతం ఇంకా విశాలం చేసి దాంట్లో ఎక్కువ మంది ప్రజలు పట్టే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు టియాన్మన్ స్క్వేర్ వద్ద ప్రతిరోజూ జెండా వందనం అద్భుతంగా జరుగుతుంది. దీనిని తిలకించటానికి ప్రతిరోజూ వేల మంది ప్రజలు హజరవుతారు. ఇది చూడాలంటే సూర్యోదయం కాకముందే లేచి అక్కడకు చేరుకోవాలి. ఐదు నక్షత్రాలున్న ఎర్రని చైనా జాతీయ జెండా ఈ స్క్వేర్ వద్ద ఆకాశంలోకి ఎగిరే దృశ్యం ప్రతి టూరిస్టు తప్పక చూడవలసినది. మలేసియా, చైనా, హంగ్ కాంగ్ వాసులు ఈ టియాన్మన్ స్క్వేర్ వద్ద మాతో ఫొటోలు తీయించుకున్నారు. హిందూ, హిందూ అంటూ నమస్కారాలు చేశారు. మేం చైనాలో ఉన్నపుడు ఆ దేశ అధ్యక్షుడు ‘హూ జింటావో” భారతదేశ పర్యటనలో ఉన్నారు.
ఆ మరుసటి రోజు బీజింగ్ నుండి బాడాలింగ్ హైవేలో గ్రేట్వాల్ ఆఫ్ చైనాకు బయల్దేరాం. దారిలో జేడ్ ఫ్యాక్టరీ చూపించారు. అవి పెద్ద పెద్ద గ్రానైటు బండల్లా ఉన్నాయి. వాటి నుంచి శిల్పాలు, ఫ్లవర్ వేజ్ లు అలంకారానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేయబడి ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరవుతుంటే అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత, ఈరోజు మనం ప్రపంచ వింతను చూడబోతున్నాం అని బస్సు దిగగానే పైకి చూస్తే మంచు తెరల్లోంచి చైనా మహాకుడ్యం ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకు వంకలు తిరుగుతూ పాక్కుంటూ వెళ్తున్న కొండ చిలువలా కన్పించింది. ఈ గోడ 25.6 ఫీట్ల ఎత్తుతోనూ, 16.4 ఫీట్ల వెడల్పుతోనూ కట్టబడింది. ‘క్విన్ షి హుయాంగ్’ అనే రాజు 220 బిసి నుంచి 200 మధ్యలో ఈ గోడను కట్టారు. మింగ్ రాజవంశం దీన్ని పునరుద్ధరించి 5వ శతాబ్దంలో బండ రాళ్ళతో కట్టారు. ఈ గోడనే మనం ఇప్పుడు చూస్తున్నది. ఈ గోడ పొడవు 6,400 కి.మీ.లు. 2,3 మిలియన్ల మంది సైనికులు వారి జీవిత కాలమంతా ఈ గోడను కడుతూనే ఉన్నారు. మంచూరియన్ల, మంగోలియన్ల దాడిని నివారించేందుకు, వారు చైనాలోకి చొరబడకుండా ఉండేందుకు కట్టారు. ఈ మహాకుడ్య శిఖరాగ్రాన ఒక మిలియన్ సైనికులు కాపలా కాసేవారంట. అక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఓ షాపులో ఇత్తడి ప్లేట్ మీద మన పేరు చెక్కి ఈరోజు చైనా గోడను ఎక్కినట్లుగా చెక్కి ఇస్తారు. మేం కూడా దాన్ని చెక్కించుకున్నాం. ఇది మేం చూసిన రెండవ ప్రపంచ వింత. మొదటిది తాజ్ మహల్. రెండవది ఇది. ఇంకొక షాపు దగ్గర చైనా రాజ వంశీయుల దుస్తులు వేసి ఫొటోలు తీస్తున్నారు. మేం కూడా ఆ ఫొటోలను తీయించుకున్నాం. మనం ఈ మానవ నిర్మితమైన ప్రపంచ వింతను దర్శించినట్లు ఒక సర్టిఫికెట్తో పాటు మన ఫొటోనూ, మహాకుడ్యం యొక్క రకరకాల భంగిమల ఫొటోలనూ ఇస్తారు. దీనికి మనం వంద యువాన్లు చెల్లించాలి. ఇలా చైనా మహాకుడ్య విశేషాలను భద్రపరచుకొని తిరిగి ఇండియా ప్రయాణమయ్యాం.
‘చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా’ అనీ, ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది’ అనీ, ‘కాకీ కాకీ కడవల కాకి’ అనీ మనం చిన్నతనంలో పాటలు పాడుకుంటూ పెరిగాం. నెమలీకలు పుస్తకాల్లో పెట్టుకొని మేతపెట్టడం, తూనీగ రెక్కలకు దారాలు కట్టి ఆడడం బాల్యపు తీపి గురుతులు. తన పిల్లలను తినేస్తున్న పాము పని బట్టడానికి రాణిగారి గొలుసుతెచ్చి పాము పుట్టలో పడేసిన కాకి కథ, గాలి వానకు పిచ్చుక కట్టుకున్న పిడకలిల్లు పడిపోయిందని చెప్పే కథ, వేటగాళ్ళ ఉచ్చులో ఎన్నో పక్షులకు సంబంధించిన కథలు చదువుకుంటూ పెరిగాం. ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు’, ‘ఎంగిలి చేత్తో కాకిని విసరడు’ వంటి సామెతలూ మన జీవితంలో భాగమే. ఇంటి ముందు వసారాలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టడం, ఇంటి చూరులో పిచ్చుకలు, పావురాలు పిల్లల కోసం గూళ్ళు కట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూడటం వంటివి మనకు పక్షులపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. మన జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులు ఆధునిక ప్రపంచంలో అనేకానేక కారణాల వల్ల మనల్ని వీడి మాయమై పోతున్నాయి. పక్షుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
పక్షుల వర్గీకరణను మొదటగా ‘ఫ్రాన్సిస్ విల్లగ్టీ’ మరియు ‘జాన్ రే’ అనే శాస్త్రవేత్తలు చేపట్టారు. 1676వ సంవత్సరంలో ఈ శాస్త్రవేత్తలు ‘ఆర్వితోలాగే’ అనే పుస్తకంలో పక్షుల గురించి వివరించారు. ఈ తర్వాత వచ్చిన ‘కారల్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత్త 1758వ సంవత్సరంలో పక్షుల వర్గీకరణను ఆధునీకరించాడు. ఈ పక్షులు సరీసృపాల వారసులు. సరీసృపాలకు పక్షులకు చాలా దగ్గరి పోలికలుంటాయి. శిలాజాల చరిత్రను గమనిస్తే అతిపెద్ద సరీసృపాలైన డైనోసార్లు ఆహారం దొరకక విలుప్తమైపోయాయి. పాకే జీవులైన సరీసృపాల నుంచి రెక్కలున్న పక్షులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. క్రస్టేషియన్ యుగంలో మొట్టమొదటగా పక్షులు అవతరించాయని తెలుస్తున్నది. క్రస్టేషియస్ యుగమంటే దాదాపు వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమన్న మాట.
పక్షులు ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. రెక్కలు ఉండడం, ఆకాశంలో ఎగరగలగడం ప్రధాన లక్షణాలు. ఇవి నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి. పళ్ళులేని ముక్కులున్న దవడలు గలిగిన జంతువులు ఇంకా ఇవి ఎండోదెర్మిక్ వర్టిబ్రేట్స్. వీటికి చాలా తేలికైన శరీరం, బలమైన అస్థిపంజరం ఉంటాయి. ఇవి గట్టి పెంకు గలిగిన గుడ్లను పెడతాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ కూడా వీటిలో ఎగరడానికి అనుకూలంగా పరిణామం చెంది ఉన్నాయి. ముందున్న రెండు కాళ్ళూ రెక్కలుగా పరిణామం చెందటం వలన, రెక్కలకున్న ఈకల్లో గాలి గదులుండటం వలన ఇవి ఎగర గలుగుతున్నాయి. సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయని అనుకున్నాం కదా! ఇవి అంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరగదు కదా! పరిసరాలు, పరిస్థితులను బట్టి కొన్ని అంగాలను కోల్పోవటం, కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సరీసృపాలకు, పక్షులకు మధ్య వారధిలా ‘ఆర్కియాప్టెరిక్స్’ అనే జంతువు ఉండేది. దీనికి సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉంటాయి. ఇది పూర్తిగా ఆకాశంలో ఎగరలేదు. పళ్ళున్న దవడలు, పొడవైన ఎముకలున్న తోకలు కలిగి ఉంటాయి. ఇది సరీసృపాల లక్షణం.
పక్షులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల జాతులన్నాయని తెలుస్తున్నది. వీటిలో 5 సెం.మీ పొడవున్న అతి చిన్న హమ్మింగ్ బర్డ్ నుంచి 9 ఫీట్ల పొడుగున్న అతి పెద్ద ఆస్ట్రిచ్ వరకు అన్ని రకాల పక్షులున్నాయి. కొన్ని పక్షులు చాలా తెలివి కలవి. అందులో చిలకలు, కొర్విడ్లు మొదలైనవి తెలివైన వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. చాలా జాతుల పక్షులు సంవత్సరానికొకసారి చాలా చాలా దూరాలు వలస పోతుంటాయి. పక్షులు సంఘజీవులు. ఇవి సైగల ద్వారా, అరుపుల ద్వారా, పాటల ద్వారా తోటి పక్షులకు కావలసిన విషయాన్ని చేరవేస్తాయి. పక్షులు ఎంతో శ్రమకోర్చి పుల్లా పుడకా ఏరుకొచ్చి రకరకాల గూళ్ళను అల్లుకుంటాయి. అలా అల్లుకున్న గూళ్ళలో తమ పిల్లలను పెట్టుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్ల పక్షుల్ని తల్లి పక్షులు. పక్షులు మనుష్యులతో కలసి బతుకుతాయి. మానవులకు ఆహారంగా ఉప యోగపడతాయి. వాటిని వేటాడే పిల్లులు, కుక్కల కన్నా పక్షులు మానవుల వల్లే ఎక్కువగా చనిపోతున్నాయి. 17వ శతాబ్దం నుంచి దాదాపు 120 నుండి 130 జాతుల పక్షులు అంతరించిపోయాయి. అంటే మానవుడు అభివృద్ధి బాట పట్టి నాగరికత వైపు అడుగులు వేస్తున్న సమయం నుండీ పక్షులు అంతరించి పోవటం మొదలయిందన్నమాట.
కొన్ని పక్షులు ఆర్థిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కోడి, బాతు వంటి వాటి గుడ్లు, మాంసం మానవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాక పక్షుల ఈకలు కూడా టోపీలు, ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. చిలకలు, పావురాలు వంటి పక్షులు పెంపుడు జంతువులుగా మానవుడితో సహజీవనం చేస్తాయి. పక్షుల పెంటను పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.
1927 వ సంవత్సరం జూన్ ఆరవ తేదీన వేటపాలెం గ్రామంలో అంగలకుదిటి వంశంలో జన్మించారు సుందరాచారి గారు. తల్లి దండ్రులు అంగలకుదిటి శేషమ్మ, అంగలకుదిటి మల్లిఖార్జునా చారి గార్లు. అన్నయ్య అంగలకుదిటి రామేశ్వరాచారి గారంటే సుందరాచారికి ఎంతో ప్రేమ. ఆయన అతి పిన్న వయసులోనే మరణించారు. శివుడంటే వల్లమాలిన ప్రేమ భక్తి ఆయనకు. ఎప్పుడూ అభిషేకాలూ, పూజలు అంటూ శివుడ్ని కోలిచే వారు అన్నయ్య. అన్నయ్య రామేశ్వరా చారి మరణం తర్వాత సుందరాచారి కట్టిన తొలి రైసుమిల్లుకు అన్నయ్య పేరుతో “శ్రీ రామేశ్వరా రైస్ మిల్ ‘ అని పేరు పెట్టుకొని తన భాతృ భక్తిని చాటుకున్నారు. తండ్రి మల్లిఖార్జునా చారి మంచి శిల్ప వైపుణ్యం కలవారు. కులవృత్తి అయిన బంగారు ఆభరణాల తయారీ చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఇద్దరు కోడుకులనూ బాగా చదివించాలనీ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని అనుకునేవారు.

తల్లి శేషమ్మ గాన కళా కోవిదురాలు. నిరంతరం పాటలు పాడుతూనే గడిపేది. ఆమె ఏ పని చేస్తున్నా నోరు మాత్రం పాటను పాడుతూనే ఉంటుంది పొద్దున్నే సూర్య నమస్కారాల దగ్గరుంచి అన్ని మడితో భక్తిగా చేసేది. ఆమెకు కూడా శివపార్వతులు అంటే చాలా ఇష్టం . ఉదయాన్నే బావి దగ్గర తలురా స్నానం చేసి, ఆ తడి బట్టలతోనే ఇంటి పనంతా చేసుకుంటుంది. ఆమె మడితో ఉవుప్పుడు ఎవరన్నా తాకారా ! అంతే సంగతులు! వాళ్ళని కోప్పడి మరల పోయి బావి దగ్గరే స్నానం చేసి వస్తుంది.
సుందరాచారి వేటపాలెం గ్రామంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ గ్రామంలో అప్పటికి ఏడవ తరగతి వరకు మాత్రమే చదుపుకోవటానికి వీలున్నది. ఆ తర్వాతి చదువు చదవాలంటే చీరాలకు వెళ్ళవలసి ఉంటుంది. వేటపాలెం చీరాల రెండూ జంట నగరాల్లా ఉంటాయి. ఆయన చదువుకునే సమయంలోనే ఊర్లో స్వాతంత్రోద్యమం ముమ్మురంగా కొనసాగుతుంది. సుందరాచారి కూడా ఆ ఉద్యమం పట్ల ఆకర్షితుడైనాడు. అప్పట్నుంచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం తద్వారా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం చేసేవారు. అప్పటి వరకు టెరి కాటన్ ప్యాంటు, షర్టులు వేసుకునే సుందరాచారి మొదటగా ఖద్దరు కట్టడం మొదలు పెట్టారు. అప్పుడు మొదలు పెట్టిన ఖద్దరు ఆయన 1992 డిశంబరు లో మరణించే దాకా ఆయనను వీడలేదు. ఖద్దరు పంచె, లాల్చీ ధరించేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యతoగా పనిచేసి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. ఇల్లు, చదువు వదిలేసి ఇలా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూ ఉండడంతో తల్లి దండ్రులు పెళ్ళిచేస్తే కుదుట పడతాడని పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు.
1945 వ సంవత్సరం జనవరి నెలలో చీరాలకు చెందిన సామంతపూడి బ్రమ్మయ్య గారి కుమార్తె అయిన గోవిందమ్మతో వివాము జరిగింది. పెళ్ళి తర్వాత భార్యను కూడా స్వాతంత్ర్య ఉద్యమం దిశగా ప్రోత్సహించాడు. పెళ్ళి సమయానికి భార్య గోవిందమ్మకు పది సంవత్సరాల వయసు అత్త నారింట కాలు మోపిన తరువాత నుంచీ ఆమెను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. ఇంటికి ట్యూషన్ పెట్టించి ఆమెను చదువు వైపు చూపు సారించేలా చేశారు. థర్డ్ ఫారమ్ వరకు చదివించారు. అంతే కాకుండా సంస్కృతం, హిందీ బాషల్లోని అనేక పరిక్షలు రాయించారు. గ్రామంలో ఉన్న లైబ్రరీ అయిన సారస్వత నికేతనంలో మహిళా విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో రకాల విద్యలు నేర్పించారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, విద్య వంటి అన్ని రకాల విద్యలనూ నేర్చుకోవటానికి ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే పెళ్ళైన తరువాత భార్యను చదువుకోమ్మని ప్రోత్సహించిన ఆదర్శమూర్తి సుందరాచారి.
స్వాతంత్ర్యం లభించిన తరువాత కొన్నాళ్ళు కమ్యూనిష్ట్ పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వేట పాలెం గ్రామానికి కొద్ది కాలం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఇష్టం చివరి రోజుల వరకూ కొనసాగింది. గాంధీగారు సారస్వత నికేతనాన్ని సందర్శించినపుడు ఆయన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులంతా నడుస్తూ వెళ్ళారట.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు, తామ్రపత్రం లభించాయి. ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలం కూడా లభించింది. . ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చిన స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ కు మాత్రం అంగీకరించలేదు. అప్పటికి ఆర్థికంగా మెరుగ్గా ఉన్నందున ఆ పెన్షనేను వద్దని చెప్పారు. ఆ విధంగా ఆయన గొప్పదనాన్ని చాటుకున్నారు. సమాజంలో స్వాతంత్ర్య సమర యోధులుగా పేరు ప్రఖ్యాతులు, గౌరదం సంపాదించారు.
ఆ తర్వాత రై సుమిల్లు వ్యాపారంలోకి వచ్చారు. వేట పాలెంలో తోలిసారిగా సొంతంగా రైసుమిల్లును నిర్మించుకోని దానికి తన కీర్తి శేషులైన అన్న గారి అవుగారి పేరును పెట్టుకున్నారు. ఏ ఇంజనీరు సహాయం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వయం ప్రతిభ లో రైసుమిల్లును నిర్మించడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. లోహ యంత్రాలు ఆయన చెప్పినట్లుగా వింటాయని అప్పటి కవులు ప్రశంసించారు . రైసుమిల్లు వ్యాపారంతో పాటుగా, సాహిత్య పిపాస కూడా మొదలయింది. అనేక రకాల సాహితీ పుస్తకాలు చదవడం, ప్రముఖ సాహితివేత్తల ఉప న్యాసాలు వినడం చేసేవారు . అప్పటి నుంచి సాహిత్యం పై విపరీతమైన అభిమానం, మమకారం కలిగి ఉన్నారు. అదే భవిష్యత్తులో కవులకు సత్కారాలు చేయటానికి ఛారిటీస్ సంస్థ నెలకొల్పేలా చేసింది.
1966 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన శ్రీ రామేశ్వర రైసుమిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేక మంది పండితుల్ని ఆహ్వానించారు. అప్పటికే వేద కవులకు సహాయం చేయడం మొదలు పెట్టారు .తోలి సారిగా ప్రారంభోత్సవ సమయంలో కవులను పిలిచి సత్కరించడంతో సుందరాచారి సాహితి పిపాస లోకానికి తెలిసింది. వచ్చిన కవులందరూ ఆయన నిర్మాణాన్ని దానగుణాన్ని కీర్తిసూ పద్యాలు చెప్పారు. వారందరికీ వచ్చిన బాధువులందరితో పాటుగా అతిథి మర్యాదలు చేసి ఘనంగా సత్కరించారు. అప్పటి వరకూ సంతానం లేని సుందరాచారి దంపతులను సంతాన ప్రాప్తిరస్తు’ అని కవి పండితలంతా దీవించారు.
పెళ్ళైన ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు లేక పోవడంతో బాధపడ్డారు. ఎన్నో నోములు ప్రతాలు నోచారు. ఎంతో మందికి అన్నదానాలు చేశారు. వారాలు చేసుకుని చదువు కునే వారికి అండగా నిలిచి అందరిలో పోటు ఏదో ఒక రోజు అన్నం పెట్టడమే కాకుండా వారికి సొంత ఖర్చులతో ఉపనయనాలు చేయించారు. పీటల మీద కూర్చునీ పెళ్ళిళ్ళు చేశారు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. సోముల వ్రత ఫలితమో, డాక్టర్ల చేలి చలవో గాని చివరకు సుందరాచారి భార్య గోవిందమ్మ గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషపడ్డారు.
చీరాలలో 1950-60 ప్రాంతాలలో కంచి కామాక్షి అమ్మవారి గుడిని కొంత మంది కట్టడానికి సంకల్పించారు . ఆ గుడి కట్టాక శాశ్వత పూజల కారకు బంధువులతో పాటుగా సుందరాచారి కూడా కొంత ధనమును ఇచ్చియున్నారు. దసరా నవరాత్రులలో ఆ గుడిలో పూజలు జరుగుతాయి. బంధుగణమంతా ఆ పూజల్లో పాల్గొంటారు.
సుందరా చార్యి భార్య గోవిందమ్మకు నెలలు నిండటంతో చీరాల లోని సాల్మన్ ఆసుపుత్రీ కి తీసుకెళ్ళారు. వారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని చెప్పారు. అవి దసరా రోజులు.అందువల్ల కంచి కామాక్షి అమ్మవారి పూజ చేయించి ఆపరేషన్ కు పంపారు. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయడం చాలా తక్కువ మందికి చేసేవారు. ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అలా దసరా నవరాత్రుల్లో “గోవిందమ్మ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మవారి దయవల్ల అంతా మంచే జరిగిందని ప్రతియేటా మూలా నక్షత్రం రోజే అమ్మకు పూజలు చేసేవారు. అలా అమ్మయి పుట్టిన రోజే శాశ్వత పూజ అమ్మవారికి సీ ఏర్పాటు చేశారు.
అమ్మాయి బారసులకు కవులను సత్కరంచే అవకాశం కలిగింది సుందరాచారికి. అప్పటికి యద్దనపూడి సులోచనారాణి నవలలు ఆంధ్ర దేశమంతా ప్రభంజనం సృష్టిస్తున్నాయి . సుందరాచారి కూడా ఆమె నవలలు చదివి అభిమాని అయ్యారు. అందుకే తన ఒక్కగానోక్క కూతురికి ‘సులోచనారాణి’ అని నామకరణం చేశాడు.
ఆ మహాత్సవానికి తన మిత్రులైన కవులందరినీ పిలిచాడు. వారు పద్యరత్యాలతో ఆశీర్వదించారు. ఆయన తన కూతురు యద్దనపూడి సులోచనారాణిలా పెద్ద రచయిత్రి కావాలని కోరుకున్నాడు. ఆనాడు వేట పాలెం, చీరాల “ప్రాంతాల లోని కవులందరూ హాజరయ్యారు. 1969 వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీ అమ్మాయి పుట్టిన తేది ఆ తరువాత చీరాలకు 20 కీ.మీల దూరంలోని ఇంకోల్లు అనే గ్రామంలో మంగి రైసుమిల్లును నిర్మించ దలిచారు. కుటుంబం అక్కడికి మారింది. అక్కడి రైసుమిల్లుకు ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర రైస్ మిల్లు’ అని పేరు పెట్టారు. దీని ప్రారంభోత్సవానికి చాలా ఎక్కువ మంది కవులను ఆహ్వసించారు. అదే సమయంలో కూతురి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కొండూరి రాఘవాచారి, పులివర్తి, శరభా చారి, మునుగంటి కృపాచారి, విశ్వనాధ సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద కవులు హాజరయ్యారు. ఆరోజు వంగవాలు ఆదిశేషశాస్త్రి గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆ మహా కవుల చేత”అమ్మాయికి అక్షరాలు దిద్దించారు. అప్పటి నుంచి అమ్మాయిని స్కూలుకు పంపకుండా టీచర్లను ఇంటికి పిలిపించి చదువు చెప్పించారు. ఒకే ఒక్క సంవత్సరంలో ఐదు తరగతులనూ పూర్తి చేయించి ఆరు సంవత్సరాల వయసులో హైస్కూలులో జేర్చారు. తక్కవ వయసులో డాక్టర్ చదివించి అమ్మయి పెళ్ళి వేయాలని సుందరాచారి ఆకాంక్ష.
అష్టావధాని వంగవోలు ఆదిశేష శాస్త్రి గారు ‘యశోధర’ అన్న కావ్యాన్ని రాశారు. దానికి ముందుమాట తొలి వెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఈ పుస్తకాన్ని సుందరాచారి ఆర్థిక సాయమందించి ప్రింటింగ్ చేయుంచారు. కావ్యదాత సుందరాచారి కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ దాతృత్వం గురించి నాలుగు పేజీల్లో పద్యాలు రాశారు రచయిత. రైసుమిల్లుల్లోని యంత్రాలు సుందరాంచారి చెప్పినట్లు పని చేస్తాయని కాబోలు “లోహజగల్ చాతుర్య” అని బిరుదునిచ్చారు. పూస పాటి నాగేశ్వర రావు అనే అష్టాదధాని రాసిన “శిల్ప సౌందర్యం” అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. అలాగే వేటపాలెం లోని కవి కడెం వెంకట సుబ్బారావు రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక పుస్తకాన్ని అచ్చు వేయించారు. మరొక వీరబ్రమ్మెంద్ర స్వామి కాలజ్ఞాన తత్వములు అనే పుస్తకానికి ఆర్థిక సహాయాన్నాందించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కవుల వెందరివో పుస్తకాలు సుందరాచారి దాతృత్వం వలన వెలుగు చూశాయి. కళాప్రపూర్ణ కొ౦డూరు రాఘవాచారి, దురిశేటి రామాచారి, చిఱ్ఱావూరి నాగభూషణ శర్మ, నాగశ్రీ, వివియల్ నరసింహారావు, ఎర్రోజు మాధవాచారి, మందరపు సత్యా చార్యులు, రావూరి భరద్వాజ వంటి ఎంతో మంది కవులు సుందరాచారి కూతురి అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. కవులందరి పద్యాల ఆశీస్సులు తీసుకొని వారిని ఘనంగా సత్కరించి పంపారు సుందరాచారి.
1974 లో సుందరాచారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆతర్వాత చీరాలలో మరో రైసుమిల్లు నిర్మించటానికి తలపెట్టారు. కుటుంబం చీరాలకు మారింది. ఆ రైసుమిల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి కుమారుడ్ని బడిలో వేయాలనుకున్నారు. రైసుమిల్లు ప్రారంభోత్సవం తో పాటు కుమారుడి
అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారు. ఈ మహోత్సవానికి వంద మంది కవి పండితులను అహ్వానించి బ్రహ్మాండంగా జరిపించారు. ఈ కవి పండిత సభలో కుమార్తె చేత తెనాలి రామలింగడు మొల్లల మధ్య సంభాషణా పద్యాలున్న కథను చెప్పించారు. కూతురు రాణి చదివిన జట పద్యాలను విన్న కవులు “అమ్మాయికి వేదాలు చెప్పించండి అచారి గారూ” అన్నారు. రాణి ని మంచి రచయిత్రి కావాలని ఆశీర్వదించారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ కార్య క్రమంలో కవి పండిత సభ సుందరాచారికి “వదాన్య శేకర”, “అభినవ సమాజ భోజ” అని బిరుదల నిచ్చి సత్కరించింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పూసపాటి నాగేశ్వర రావు గారితో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఫణి భూషణా చారి తో లలిత సంగీతం పాడించారు. ఇది 1978 ఫిబ్రవరి నెలలో జరిగింది. మార్కాపురం నుంచి కన్నెగంటి రాజమల్లా చారి రావూరి భరద్వాజ, ఉటుకూరి లక్ష్మి కాంతమ్మ, వాసిలి వెంకటలక్ష్మీ
నరసింహారావు వంటి మహా కవులంతా వచ్చారు సుందరాచారి కి చిత్ర లేఖనం పై కూడా ఆసక్తి ఎక్కువ. తన రైసుమిల్లుల్లో మద్రాసు నగర సౌందర్యం, ఫ్లోరల్ డిజైన్, కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటాలను ప్రముఖ చిత్ర కారులతో వేయించారు. ఆయన స్వయంగా ఎన్నో చిత్రాలు వేశారు.
కుటుంబ శుభకార్యాలలో ఇలా కవులను ఆహ్వానించి “సత్కరించడం కాకుండా ప్రతి ఏటా సత్కరించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా ఒక ఛారిటిస్ ను ప్రారంభించారు. “శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్” అనే సంస్థను స్థాపించి తద్వారా ప్రతి సంవత్సరం నలుగురు కవులు కళాకారులను సత్కరించాలని సంకల్పించారు. అంతే కాకుండా పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు అందజేయాలని తలపెట్టారు. ఆ విధంగా 1974 నుండి 1992 లో సుందరాచారి మరణించే దాకా విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కవులందరూ “సుంధరాచారి పురస్కారాన్ని పొందిన వారే. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు చాలా మంది స్కాలర్ షిప్పులను పొందిన వారు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ప్రభుత్వ సేవలందిస్తున్నారు. 1992 లో వారు మరణించిన దగ్గర నుండీ చారిటీస్ సంస్థలు నిలిచిపోయాయి.
మరొక కార్యక్రమం 1988 లో తన కుమార్తె వివాహా సందర్భంగా ఏర్పాటు చేశారు. వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి వారి చేత ఆశీస్సులను అక్షరాల రూపంలో అందజేయడం అంత వరకూ ఎక్కడా జరగలేదు. వివాహ ఆహ్వాన పత్రికలో కవి పండితుల అక్షరాక్షతలు అని ముద్రించారు. వివాహానికి ముందుగానే ప్రముఖ కవులందరికీ ఆహ్వానాలు పంపి వారి ఆశీర్వాద పంచరత్నాలను తెప్పించారు. వాటినన్నింటినీ ఒక పుస్తక రూపంగా ముద్రించారు.
సుందరాచారి తన కుమార్తె వివాహ సమయంలో కవి పండిత గోష్ఠి నిర్వహించారు. దీని కోసం ‘వివాహ ముహూర్తాన్ని ఉదయం పూట వచ్చేలా చూసుకున్నారు. మధ్యాహ్య సమయం నుంచి పండిత గోష్ఠి నిర్వహించాలని తలచారు. ఈ పండిత గోష్ఠి అంతా బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా మాటల రచయిత, కవి నాగభైరవ కోటేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. వివాహ మంత్రాల వైశిష్ట్యం గురించి లక్ష్మీ పార్వతి గారు రెండు గంటల సేపు ప్రసంగించారు. సుమారు ఐదారు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కవితా గోష్ఠి కార్య క్రమంలో ప్రాచీన పుస్తక భాండాగార అధ్యక్షులుగా పనిచేసిన డా॥ వి.వి.ఎల్ నరసింహారావు, కళాప్రపూర్ణ కొండూరు రాఘవాచార్యులు, ఉటుకూరు లక్ష్మి కాంతమ్మ, డాll చేబోలు చిన్మయకవి, సంస్కలత పండితులు మునుగంటి కృపాచారి, అష్టావధానికి వంగవోలు ఆదిశేష శాస్త్రి ఈమని దయానంద, దీవి రంగాచార్యులు, చోడా చంద్రశేఖరరావు, షేక్ అలీ, మాగుతారి రామకోటేశ్వర రావు, నాగశ్రీ, మల్లవరపు జాన్, పూసపాటి నాగేశ్వరరావు, అడుగుల రామయ్య బీరం సుందర్రావు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభ్రుతులు పాల్గొన్నారు. వచ్చిన కవులoతా ఇలా వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి సత్కరించడం ఎక్కడా వినలెదనీ కనలేదనీ కొనియాడారు.
వివాహ సందర్భంగా ముద్రించిన పుస్తకానికి ‘కల్యాణ కౌముది’ అన్న పెరు పెట్టారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రముఖ కవులందరూఆశీ: పంచరత్నాలను అందించారు. ఈ పుస్తకాలను మూడు వేల కాపీలు ముద్రించారు. వివాహానికి వచ్చిన వెయ్యి మందికి ఈ పుస్తకాలను పంచారు. గత ముప్పై సంవత్సరాలుగా అందరికీ ఆ ప్రతులు అందిస్తూనే ఉన్నారు.
ఇదీ సుందరాచారి గారు బతికి ఉండగా చేసిన సాహితీ సేవ. వారి భార్య అంగలకుదిటి గోవిందమ్మ గత సంవత్సరం 2018 లో భక్తిపాటలను ‘పుష్పాంజలి’ పేరుతో ప్రచురించారు. ఆవిడ ఆ భగవతీ గానాలను చక్కగా పాడుతుంది. 2019 వ సంవత్సరంలో ‘టిక్ టాంబుర్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. పూర్వకాలం లోని జానపద కథలన్నింటిని తన కుమార్తె చేత రాయించి వాటన్నింటినీ బాలల కోసం ప్రచురిస్తున్నారు. వాళ్ళ కాలంలో చెప్పుకునే, పిల్లల కోసం చెప్పే కథలన్నీ చెప్పి కుమార్తె రాణీప్రసాద్ చేత రాయించి ప్రచురించారు. ఈ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం వారు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్నందించారు. గోవిందమ్మ గారు కూడా సుందరాచారి సహచర్యంలో సాహితీ పిపాసి గా మారారు. వారిల్లు నిత్యం కవుల కవితా గానాలతో, వచ్చి పోయే కవులతో విలసిల్లటం వల్ల ఆవిడకూ సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది.
సుందరాచారి గారు మరణిoచాక వారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వారి కుమార్తె, కందేపి రాణీప్రసాద్, అల్లుడు గారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా|| కందేపి ప్రసాదరావు గార్లు రెండు లక్షల రూపాయలు తెలుగు విశ్వ విద్యాలయానికి డొనేషన్ ఇచ్చారు. 2011 సంవత్సరం నుంచీ శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్వ పురస్కారాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు రెండు తెలుగు రాష్ట్రాల లోని బాలసాహితీ వేత్తలకు అందిస్తున్నారు. వేదాంత సూరి, పైడిమర్రి రామకృష్ణ, డోకల సుజాతాదేవి, వి.ఆర్, శర్మ, పుష్పాల కృష్ణ మూర్తి, బెలగాం భీమేశ్వర్రావు మొదలగు బాల సాహితీ వేత్తలు ఈ కీర్తీ పురస్కారాన్ని అందుకున్నారు.
కుమార్తె కందేపి రాణీప్రసాద్ ప్రతిభ కలిగిన కవులకు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ అంగలకుదిటి సుందరాచారి ఛారిటీస్ తరుపున పురస్కారాలు, సర్టిఫికెట్లు అందిస్తున్నారు. వారిలో ప్రేముఖులు చాగంటి కృష్ణకుమారి, పత్తిపాక మోహన్, షేక్ అబ్దుల్ హకీం జానీ, చిల్లర భవానీ దేవి, వడలి రాధాకృష్ణ వంటి కవులు, రచయితలు ఉన్నారు. సిరిసిల్ల ప్రాతంలోని డాక్టర్ సీట్లు సంపాదించిన విద్యార్థులకూ సర్టిఫికెట్ల సత్కారాలు అందిస్తున్నారు. 2007 రాష్ట్రం లో ఎమ్ సెట్ లో మొదటి ర్యాంకు సాధించిన సాయిష్ రెడ్డిని సత్కరించారు.
కాలెండర్ గోడకు వేలాడుతోంది ఆ ఇంటి యజమాని కాలెండర్ వంక చూసి “అబ్బా రేపు ఆదివారం హాయిగా ఇంట్లో ఉండవచ్చు” అని సంతోషంగా అనుకున్నాడు. ఆ ఇంటి పిల్లలు కూడా “అమ్మా రేపు ఆదివారం. మాకు స్కూల్లేదు శలవు” అంటూ అరుస్తూ చెప్పారు. అమ్మ వంటింట్లో నుంచి ‘సరే సరే’ అని విసుగ్గా అన్నది.
గోడ మీదున్న కాలెండర్ లోని ఆదివారం, సోమవారం వంటి వారాలన్నీ ఒకదాన్నోకటి పలకరించు కుంటున్నాయి “అబ్బ! ఆదివారం నీ పని హాయి! అన్ని శలవు. ఏ పనీ ఉండదు నీకెంత అదృష్టం” అంటూ శని వారం నిష్టూరంగా అవ్వది “నాకయితే విపరీతమైన పని ఉంటుంది. ఇంటి వాళ్ళు శుభకరమని ఇళ్ళు కడుక్కోవడం, ఆడవాళ్ళంతా తలస్నానాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం వంటి వన్నీ చేస్తుంటారు .నాకైతే అసలు తీరికే ఉండదు ” అంటూ శుక్రవారం తెగ బాధపడుతూ అన్నది.
‘ఊరుకో నీవున్న రోజేనా పూజలు చేసేది. మరినేనా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును నేను. మగ వాళ్ళందరూ నా వారం నాడే గుళ్ళకు వెళతారు. ప్రసాదాలు చేసుకుంటారు. చాలా మంది ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ సుప్రభాతం చదువుకుంటారు అంటూ శనివారం తన గొప్పను చెప్పింది శుక్రవారాన్ని ఎద్దేవా చేసింది.
అప్పుడు సోమవారం ముందుకోచ్చి ఇలా అన్నది “ ఏమిటి ఇందాకట్నుంచి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలు ఆపండి. సోమవారం అంటే ఆఫీసులు, స్కూళ్ళు అన్ని పనిచేసే రోజు. ఏ పని కావాలన్నా ఈ రోజే వస్తారు మరియు వారాలలో మొదటి దాన్ని. ఇంత ప్రాధాన్యం గల నన్ను వదిలి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకున్న ప్రాముఖ్యం గురించి చెప్పడం లేదు. లయకారుడైన శివుడికి ఇష్టమైన రోజును నేను తెలుసా ? అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. మిగతా వారాలన్నీ భయపడి వెనక్కు తగ్గాయి.
కానీ శుక్రవారం మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి “ నేను ఎవరో తెలుసా ? నా షేరేమిటో తెలుసా ? నన్ను లక్ష్మీ వారమని అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు, అండ ఉంటేనే ఏ పనైనా జరిగేది. ఏమిటి, హెచ్చుగా మాట్లాడుతున్నావు ” అంటూ కోపంగా అన్నది.
“ఆగండాగండి! అందరూ ఎవరి గురించి వారే చెప్పుకుంటే ఎలా ? మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా! నా గురించి కూడా తెలుసుకో! నేను కూడా గొప్పనే, నేనేమీ అశుభాల మంగళవారాన్ని కాను. సాయి బాబాకు ఇష్టమైన వారాన్ని సాయంత్రమైతే ఎన్నో భజనలు చేస్తారు ” అంటూ గురువారం ముందుకొచ్చి పరుషంగా మాట్లాడింది.
మంగళవారం ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో అన్నది ” నేను మిమ్మలి ఎవరినన్నా ఏమన్నా అన్నానా? నన్ను అశుభం అంటారా. నా పేరేమిటి మర్చిపోయారా నా పేరు మంగళవారం నేను మంగళకరమైన దాన్నని. నా కా పేరు పెట్టారు. నేను ఎవరినీ కించ పరిచేలా మాట్లాడలేదు మీరు నన్నెందుకు తక్కువగా చూస్తున్నారు? ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఇక మాటలు మాట్లాడలేక గొంతు మూగబోయి ఆగింది.
ఆపండి మాటలన్నీ! ఎవరూ ఎవర్ని అనలేదు అసలు విషయం ఏమంటే ఆదివారానికి పనేమీ లేదని అందరూ ఆనాలనుకున్నాయి. మిగతా వారాలన్నీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాయి. ఆఫీసులు స్కూళ్ళు అంటూ చాలా పనుంటుంది కానీ, ఆదివారానికె ఏమీ పనిలేదు. ఆ విషయం చెప్పాలనుకుని చివరకు మీలో మీరు వాదులాడుకుంటున్నారు. అంతే అంటూ బుధవారం ఆసలు విషయాన్ని తేల్చి చెప్పేసింది.
“అవునవును నువ్వు చెప్పింది నిజం ఆదివారానికి అసలు పనేమీ లేదు. కష్టపడేదంతా మనమే. ఆదివారం అన్నీ సెలవే, ఏపనీ ఉండదు” అంటూ అన్ని వారాలూ మూకుమ్మడిగా అన్నాయి.
అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆదివారం నింపాదిగా ముందుకొచ్చి అన్నది ” ఏమిటీ ఆదివారం సెలవా ! నాకేమీ పనుండదా! మరి వారం రోజులూ వేర బెట్టిన పనులన్నీ ఏ వారం నాడు చేస్తారు. ఇల్లు బూజులూ దులపడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఎప్పుడు చేస్తారు. బంధువులింటికి వెళ్ళాలన్నా , సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా ఏ వారం నాడు వెళతారు ? మీరంతా పనులు చేసే వాడావిడి తప్ప అందులో ఆనందం ఉండదు. అదే ఆదివారం నాడు ఎంత పని చేసినా సంతోషంగా ఉంటారు. నాకు పని లేదని మీరెట్లా అంటారు. చెప్పండి ! అంటూ ఆదివారం ప్రశాంతంగా అన్ని విషయాలూ చెప్పింది.
ఆదివారం చెప్పిన మాటలన్నీ విని మిగతా వారాలన్నీ తల ఆడించాయి. తన మాటలు నిజమని ఒప్పుకున్నాయి. ఆదివారాన్ని అభినందించాయి. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ. చేయి చేయి పట్టుకుని కలిసి ముందుకోచ్చాయి “అసలు మనలో మనకు తగాదాలు ఎందుకుని మనందరం కలసి ఉంటేనే మనుష్యులు మనల్ని గుర్తిస్తారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే వారాలు నెలలు అంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంక ఎప్పుడూ మనలో మనకు అభిప్రాయ భేదాలోద్దు” అంటూ అన్ని కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు నడిచాయి. ఆదివారం నుండి శనివారం దాకా అందరూ కలసికట్టుగా ‘వారాలు’ గా ఉంటున్నారు.
అనగనగా ఒక రాజ్యంలో ఒక ధనికుడు నివసించేవాడు. అతనికి ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురును అతనే పెంచి పెద్ద చేయసాగాడు. కూతురు ఎంతో అందగత్తె మరియు దయా వృదయం గలది. కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె సవతి తల్లి కదా! కూతురు సిండ్రెల్లాను ఏమి బగా చూసేది. కాదు తర్వాత ఆమెకిద్దరు కుమార్తెలు పుట్టారు. సవతి తల్లి ఆమె కుమార్తె లిద్దరూ కూడా సిండ్రెల్లాను ఎప్పుడూ ఏడిపిస్తుండే వారు ఇంటి చాకిరీ అంతా చేయించేవారు. కనీసం ఆమెకు మంచి ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. తండ్రి ఇదంతా చూసి చాలా బాధపడేవాడు. తాను అనవసరంగా రెండో పెళ్ళి చేసుకున్నానని చింతించేవాడు.
ఒకరోజు వ్యాపార పనుల నిమిత్తం తండ్రి పొరుగూరికి వెళ్ళాడు. తండ్రి కూడా లేక పోవడంతో సవతి తల్లి సిండ్రెల్లాను మరింత బాధ పెట్ట సాగింది. కడిగిన పాత్రల్నే మరల కడిగిస్తూ, ఇల్లంతా శుభ్రం చేశాక చెత్త పడేసి మరల శుభ్రం చేయమని చెప్తూ సిండ్రెల్లాను పని మనిషి గా మార్చేశారు. ఎంతో అందంగా ఉండే సిండ్రెల్లాను మసి బొగ్గు లా తయారు చేశారు. వంటలన్నీ వండినా పారబోసేసి మరల వండమని చెపుతూ పొయ్యి దగ్గరే ఉంచేవారు.
ఇలా ఉండగా ఒకరోజు రాజ భటుడు కరపత్రాలతో వీరింటికి వచ్చాడు. “రాజు గారి కోటలో సంబరాలు జరుగుకున్నాయనీ, వాటి కోసం రాజ్యం లోని యువతులందర్ని ఆహ్వానిస్తున్నారని” చెప్పాడు. అంతేకాక తనకు నచ్చిన యువతితో రాజకుమరుడు నృత్యం చేస్తారనీ, ఆమెనే పెళ్ళిచేసుకుంటాడనీ ఆహ్వాన పత్ర సారాంశమనీ చెప్పాడు.
సవతి తల్లి చాలా సంతోషించింది తన కుమార్తెల కోసం మంచి మంచి బట్టలు, టోపీలు, హారాలు ఎన్నో కొన్నది. రాజకుమారుడు తన కూతుళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించింది. అప్పుడు సిండ్రెల్లా వచ్చి “అమ్మా నేను కూడా సంబరాలకు వస్తాను కొత్త దుస్తులు కొనవా నాకు ఈ చినిగిన గౌను తప్ప కొత్తవి లేవుకదా” అన్నది. అప్పుడు ఆమె నవ్వుతూ” పనిమనుషులు రాజభవనానికి రాకుడదు నువ్వు ఇక్కడే ఉండు” అంటూ తన కుమార్తెలతో వెళ్ళిపోయింది.
సిండ్రెల్లా మరేమి చేయలేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. తోటలోని చిలుకలు ఆమెను ఊరడిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవమాత ప్రత్యక్షమయింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చూస్తుండగానే “నువ్వు రాజవనానికి వెళతావా” అని అడిగింది దేవమాత “నేను వెళ్ళాలంటే నాకు సరైన దుస్తులు, వెళ్ళడానికి బండి కూడా లెవు కదా” నిరాశగా అంది సిండ్రెల్లా. వెంటనే దేవదూత తన మంత్రదండంతో సిండ్రెల్లాకు మంచి మెరుపుల బట్టలు, నగలు, గాజు చెప్పులు సృష్టించింది. వారి పెరట్లో ఉన్న ఒక గుమ్మడి కాయను రథంగా మార్చేసింది. అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను గుర్రాలు గా మార్చింది. మరొక ఎలుకను రథ సారధి గానూ, మరొక తొండను ఆమెకు సేవకుడి గానూ మార్చింది.
“ఇప్పుడు నువ్వు రాజభవనానికి వెళ్ళు సిండ్రెల్లా ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్థరాత్రి 12 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలి. ఆ తర్వాత నా మాయ పని చెయ్యదు అన్ని మామూలై పోతాయి” అని చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది.
సిండ్రెల్లా రాజభవనానికి చేరుకుంది. ఆమె అద్భుత సౌందర్యం చూసి అక్కడున్న అందరూ ఆమె తప్పక రాజుకుమారి అయి ఉంటుందని అనుకున్నారు. రాజకుమారుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడై ‘నాతో నాట్యం చెస్తావా’ అని అడిగాడు. సిండ్రెల్లా రాజకుమారుడు నృత్యం చేస్తూ సమయం చూసుకోలేదు హటాత్తుగా సిండ్రెల్లా కు గుర్తువచ్చి ‘నేనిప్పుడే ఇంటికి వెళ్ళాలి’ అని బయటకు నడిచింది. ‘నీపేరు, చిరునామా చెప్పవా’ అంటూ రాజకుమారుడు ఆడుగు తుండగానే ఆమె రథమెక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పాదాలకున్న గాజు చెప్పు అక్కడే పడిపోయింది.
సమయానికి ఇంటికి చేరింది సిండ్రెల్లా. సమయం 12 కాగానే అన్ని మాయమై పోయాయి. రాజ భవనంలో సిండ్రెల్లాను ఎలాగైనా గుర్తించాలని. అనుకున్నారు. ఆమె వదిలిన గాజు చెప్పు సాయంలో సిండ్రెల్లాను గుర్తించాలి అనుకున్నారు. వెంటనే అందరి వద్దకూ వెళ్ళి పరీక్షించారు. అoదులో భాగంగా సిండ్రెల్లా ఇంటికీ వచ్చారు. సవతి తల్లి కుమార్తె లిద్దరూ నాదే ఈ చెప్పు అంటూ ఇద్దరూ చెప్పారు. భటుడితో పాటు రాజకుమారుడూ వచ్చాడు అక్కడకు. చెప్పును తొడుక్కుని చూపమనగా ఒకరికి పట్టనేలేదు, మరొకరికి చాలా పెద్దదైంది. అప్పుడు మసి బట్టలతో దూరంగా నిలుచున్న సిండ్రెల్లానూ చెప్పు తొడుక్కుని చూడమనగా ఆమెకు సరిగ్గా సరిపోయింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై సిండ్రెల్లాకు పూర్వపు దుస్తులను, రూపాన్నీ ఇచ్చింది. రాజు కుమారుడు సిండ్రెల్లాను గుర్తు పట్టాడు ఆమెను తన రథం ఎక్కించుకొని రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు. తన భార్యగా చేసుకున్నాడు సిండ్రెల్లా యువరాణిగా ఎన్నో సుఖాలను పొంది ఆనందంగా జీవించింది.
అడవి అంతా ఒకే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ఆరోజు మృగరాజు నిర్ణయించిన విషయంపై అన్ని జంతువులూ మాట్లాడుకుంటున్నాయి. కాకులన్నీ చెట్టు మీద వాలి వాటిలో అవి చర్చించుకుంటున్నాయి. కోతులు మరోవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ! ఏ జాతి జంతువులు ఆ జాతంతా ఒక చోట కూడి ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
ఆరోజు నిద్రలేవగానే మృగరాజుకు ఒక మిత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా జంతువులన్నింటినీ పిలిచి సమావేశపరిచి తన ఆలోచన చెప్పింది ఆ మాట వినగానే జంతువులకు గుండెల్లో రాయి పడింది మృగరాజు ఏమన్నదంటే “నేను ఈ రాజ్యానికి రాజును కదా! నేను మాట్లాడే భాషనే మీరు కూడా మాట్లాడాలి యదారాజా! తథాప్రజా అన్నారు కదా! రాజు వలె ప్రజలు ఉండాలి. మీరంతా రెపటి నుండి నాలాగా గర్జించటం మొదలు పెట్టండి”
ఈ మాటలు విన్న దగ్గర నుంచీ జంతువులు ఇలా గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ఏనుగులు. ఓ గుంపుగా, పులులు మరో గుంపులా, జింకలు మరోచోట సమావేశమయ్యాయి పెద్ద జంతువులన్నీ ఒక చోట ఉంటే చిన్న జంతువులన్నీ మరో చోట కూర్చున్నాయి. ఏది ఏమైనా గర్జించటం ఎలా నేర్చుకోవాలో అర్థం కాలేదు.
పులులు ఎంత అరిచినా గాండ్రింపే అనిపిస్తున్నది. కానీ గర్జింపులా రావటం లేదు. ఏనుగులు అరుస్తున్నాయి ఘీంకారమే వినిపిస్తోంది కానీ గర్జనలా వినిపించటం లేదు గుర్రాలు, గాడిదలు బాగా గర్జించామనుకున్నాయి. అన్నీ సకిలింపులు, ఓండ్రు పెట్టడాలే అయ్యాయి.
జంతువులన్నీ గొంతెత్తి అరుస్తున్నాయి. గానీ ఏ జంతువు కూడా గర్జించలేక పోతున్నది. సాయంత్రందాకా అరిచి అరిచి అలిసిపోయి చెట్ల కింద కూలబడ్డాయి. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూ చర్చించుకున్నాయి. ఒళ్ళు అలిసిపోవడంతో బుర్రలూ పనిచేయడం మానేశాయి.
ఒక ఏనుగు ఒక ఉపాయం చెప్పింది. మిగతా జంతువులన్నీ తల ఊపాయి. జంతువులన్నీ మూకుమ్మడిగా మృగరాజు దగ్గరకు వెళ్ళారు.
”మహారాజా! మీరు ఆడవికే రాజు కదా! ముందుగా మీరు మా బాషల్లో మాట్లాడితే చూడాలని ఉన్నది. మేమంతా మందమతులం. త్వరగా నేర్చుకోలేక పోతున్నాం. మీరు ఒక్కసారి మా అందరి మాటల్లో మాట్లాడితే విని తరించాలని ఉన్నది ప్రజలందరికీ రాజు గొప్పదనం గురించి తెలియాలి. మీరు గొప్పవారు ఒక్కసారి మీ ప్రతిభను చూపండి” అని జంతువులన్నీ వేడుకున్నాయి.
అన్ని జంతువులు దీనంగా మొహం పెట్టి వేడుకుంటుంటే సింహరాజు గర్వంగా మీసం మెలేసింది. తర్వాత గొంతు సవరించుకొని ఒక్క జంతువు యొక్క అరుపూ వినిపించాలనుకున్నది. ఏనుగుల్లా ఘీంకారం చేద్దామని ప్రయత్నించింది. కానీ నోరు పెగల్లేదు పులిలా గాండ్రిద్దా మనుకున్నది. రాలేదు అదేమిటి ఎంత ప్రయత్నించినా ఏ జంతువు అరుపూ రావడం లేదు చిన్న పక్షులు కాకి, పిచ్చుకల్లా అరుద్దాం. సులభంగా ఉంటుంది అనుకున్నంది ఏముంది కావ్ కావ్ అనటమే కదా అనటమే కదా అనుకుంటే అదీ రాలేడు. గ్రామ సింహం అని నారే పెట్టుకున్నది భౌ భౌ అని చూద్దామంటే, అబ్బె ఏదీ రాదే ఏం చేయడం. సింహానికి పరువు పోయింది. ఏం చేయాలో అర్థం కాక తల దించుకున్నది.
ఏనుగుల నాయకుడు “ఇందులో మీ తప్పేమి లేదు మహారాజా ! సృష్టిలో ఒక్కో జంతువుకు ఒక్కో అరుపు ఒక్కో భాష ఉన్నాయి. అవి అలాగే మాట్లాడగలవు. అందరూ అన్ని అరుపులూ అరిచేస్తే ఆయా జంతువుల ప్రత్యేకత ఎలా తెలుస్తుంది. భిన్నత్యంలో ఏకత్వం ఉంటేనే అడవి ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాషల గోల వదిలేసి అందరం కలిసిమెలిసి ఉందాం” అన్నాడు.
జంతువులన్నీ “మహారాజుకు జై” అని అరిచాయి. సింహం సంతోషంగా తల ఊపింది.
అడవిలో ఒక గున్నమామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టు చాలా గుబురుగా ఉన్నది. చాలా పక్షులు నివాసం ఉంటున్నాయి. ఒక కోయిల కుటుంబం కూడా నివసిస్తోంది. ఉదయాన్నే కోయిలలు కమ్మగా రాగాలు తీస్తుండేది. మిగతా పక్షులన్నీ చక్కని పాటలు వింటూ పనులు చేసుకునేవి. కోయిలలు అంటే అందరికీ ఎంతో ఇష్టం.
కోయిలలు చాలా మంచివి. ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కష్టపడి ఆహారాన్ని తెచ్చిచ్చేవి. వాళ్ళింటి పనులన్నీ చేసి పెట్టేవి.
ఆ చెట్టు మీద ఒక కాకి కుటుంబం కూడా నివసిస్తోంది. చెట్టు మీద అన్ని రకాల పక్షులు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ లాగా రకరకాల భాషలతో కలిసి ఉండేవి.
కోయిలలు ఉదయం లేవగానే అందర్నీ చక్కగా పలకరించేవి. ఎక్కడ కనిపించినా చక్కగా నమస్కారం పెట్టేవి. ఎంతో మర్యాద, మన్నన తెలిసిన కుటుంబమని పేరు పొందాయి. మంచి సంగీత పరిజ్ఞానం గల పక్షులని పేరు తెచ్చుకున్నాయి.
వీటికిలా పేరు రావడం కాకికి అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా కోయిల పేరు వినబడడంతో కాకి మనసు రగిలిపోయేది. కోయిల ఏమీ చేయక పోయినప్పటికీ కాకికి కోయిల నచ్చేది కాదు. కోయిల కన్న అద్భుత గాత్రం చూసి వళ్ళంతా కారం రాసుకున్నట్లుగా ఉండేది. కోయిల కాకికి సహాయం చేసి పెట్టినా ఒక్కసారి కూడా థాంక్యూ అనేది కాదు. అయినా కోయిల ఏమీ పట్టించుకునేది కాదు.కాకి సరిగా మాట్లాడకపోయినా కోయిల మాత్రం ఎంతో ప్రేమగా పలకరించేది.
ఒక రోజు సింహం అడవిలో ఆటాపాటా ఏర్పాటు చేద్దామని అనుకున్నది. పాటాలు పాడేవాళ్ళనీ, నాట్యం చేసే వాళ్ళనీ పిలవమని నక్కకు చెప్పింది. నెమలి బాగా నాట్యం చేస్తుందని అందరూ చెప్పటంతో నెమలిని పిలిచింది. అలాగే “పాటలు ఎవరు బాగా పాడుతారు” అని నక్క వెతకసాగింది. అంతలో కాకి కనిపించింది. “మీ చెట్టు మీద చాలా పక్షులుంటాయి. కదా! ఎవరైనా పాటలు పాడతారా అని వాకబు చేసింది. కాకి గతుక్కుమన్నది. కోయిల సంగతి తెలుసా? అనుకున్నది. అయినా సరే చెప్పకూడదనుకుంది. ‘ఎవరూ లేరు’ అన్నది కాకి వెంటనే. సరేలే అని వెళ్లిపోయింది నక్క. హమ్మయ్య కాకి ఊపిరి పీల్చుకుంది. కోయిలకు పేరు రాకుండా చూశానని సంబరపడింది.
అడవిలో కార్యక్రమం అయిపోయింది. కోయిల పాట పాడలేదు. కాకి మనసులో చాలా ఆనందించింది. అందరూ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చారు. తను అబద్ధం చెప్పిన విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని కాకి మధన పడుతూ ఉంది. ఎవరికైనా తప్పు చేస్తే మనసులో సంతోషం ఉండదు కదా! అదీకాక ఎవరు తెలుసుకుంటారో అని దిగులు. ఈ దిగులు ఆలోచనల వల్ల కాకి సరిగా తినలేకపోయింది.
కోయిల మాములుగానే ఉన్నది. ఇవన్నీ తెలియవు కదా! కాకి మాత్రం సంతోషంగా ఉండలేకపోతుంది. కాకికి లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. సరే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.
అర్దరాత్రికి కాకికి కడుపులో మంట వస్తుందని పించింది. గుండెలో భుజాల్లో నొప్పి పెరుగుతున్నట్లుగా అనిపించి అరుద్దామనుకుంది.నోరు పెగల్లేదు. స్పృహ కోల్పోయింది.
కాకి మరల కళ్ళు తెరిచేసరికి నెమలి గారి వైద్యశాలలో ఉన్నది. పక్కనే భార్య కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ నిలబడి ఉన్నారు. నాకేమైంది? అని కాకి అడిగింది. “అంతా బాగానే ఉంది.ఎక్కువగా మాట్లాడకు” అని నెమలి భుజం మీద చెయ్యేసి అన్నది.
తర్వాత కాకి భార్య విషయమంతా చెప్పింది. అర్దరాత్రి కాకి స్పృహ తప్పగానే వైద్యశాలకు తిసుకేల్లడానికి ఎవరూ రాలేదు. కోయిల ముందుకొచ్చి కాకికి ఆసుపత్రికి తీసుకువచ్చింది. అంతేకాక కాకి కుటుంబానికి ధైర్యం చెబుతూ మనోస్థైర్యాన్ని నింపింది. నెమలిని నిద్ర లేపి విషయమంతా వివరించింది.
కాకి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. తాను కోయిలకు పేరు రాకుడదని ప్రయత్నించినా కోయిల మాత్రం కాపాడింది. ఛీ నా మనసు ఎంతా ఈర్శగా మారిపోయింది. ఈ ఈర్షను వదిలించుకోవాలి. తన మనసు చేస్తున్న ఘోషను వినకుండా ఇలాగే ఉంటుంది.
వెంటనే కోయిలను క్షమించమని అడిగింది. తను చేసిన తప్పును చెప్పి పశ్చాత్తా పడింది. కోయిల క్షమించేసింది. నీవు చేసిన తప్పు తెలుసికున్నావు. అదే చాలు అని కోయిల నవ్వి ఊరుకున్నది. కాకి కోయిలకు నమస్కరించింది.
