ప్రముఖ సాహితీవేత్త రూప్ కుమార్ డబ్బికార్ గారు వివిధ సాహిత్య ప్రక్రియలతో సాహితి కృషి చేస్తున్నవారు. ఇటీవల వారి లేఖిని నుండి
వెలువడిన నవల భానుమతి.నవలా శీర్షిక చదవగానే ఎవరీ భానుమతి ఏమా కథ అన్న ఆసక్తి సహజంగానే పాఠకులకు కలుగుతుంది.
మహాభారత కథ ఆధారంగా ఎక్కడ గుర్తింపబడని,అంతగా ప్రాధాన్యత లేనికురువంశపు కుల వధువు, దుర్యోధనుడి భార్య అయిన భానుమతిని ప్రధానపాత్రగా మలచి ఉదాత్తంగా ఆమెను ఈనవలలో ఆవిష్కరించారు రచయిత.స్త్రీ పక్షపాతిగా, స్త్రీవాద దృక్పథంతో అనేక విషయాలను ఈ నవలలో చర్చించారు. నవలా విషయానికి వస్తే దుర్యోధనుడు స్వయంవర సభ నుండి భానుమతిని బలవంతంగా ఎత్తుకొని వస్తాడు. ఆ సందర్భంగా రాజసభలో పెద్దలు, గురువులు ఆక్షేపించడం, కర్ణుని శౌర్య పరాక్రమాలను అడ్డుపెట్టి కన్యను ఎత్తుకు రావడం తప్పు అన్నారు అప్పుడు దుర్యోధనుడు తాత భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను స్వయంవర సభ నుండి తీసుకొని రావడం ఉదాహరణగా చూపి తన చర్యను సమర్ధించుకున్నాడు.
నవలా నాయిక భానుమతి అతి సౌందర్యవతి. సుగుణరాశి. సున్నిత హృదయాంతరంగి. యోధురాలు. ఈ స్త్రీ మూర్తి మానసిక సంఘర్షణలను, వేదనలను అనేక కోణాలుగా దర్శించి, స్పర్శించి, ఊహించి చక్కగా విశ్లేషిస్తూ వాస్తవిక కల్పనా రమ్యతగా ఈ నవలను తీర్చిదిద్దారు రచయిత డా. రూప్ కుమార్ డబ్బీ కార్.ఇక కథలోకి వెళితే కళింగ రాకుమారి భానుమతిని సుయోధనుడు పరిణయమాడడంతో కథ మొదలై, కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు కొనసాగుతుంది.
తన పుత్రుడు దుర్యోధనుని భానుమతి భర్తగా స్వీకరించేలా గాంధారి ప్రయత్నిస్తుంది. ఆమె మాటలు భానుమతి పై చాలా ప్రభావం చూపాయి. భానుమతిని కూతురిలా చూసుకుంటానంటుంది. రాజవంశంలో మగవారి మనస్తత్వాలు మనకు అంతుచిక్కవు. వారి
ఆధిపత్య ధోరణులకు అంతు ఉండదు. నాతో పోల్చుకుంటే నీవు అదృష్టవంతురాలివే కదా! అని తనను తాను ఓదార్చుకుంటూ, భానుమతిని సమాధానపరుస్తుంది. ఇక్కడ రచయిత గాంధారి తల్లి మనసును పుత్ర ప్రేమను,

ఇద్దరి మధ్య సంభాషణను అత్యంత ఆసక్తికరంగా చిత్రించారు.భానుమతి తన మనసుకు నచ్చచెప్పుకుని దుర్యోధనుని భర్తగా
స్వీకరిస్తుంది.అయినా ఆమె విరహవేదననే అనుభవించినట్లు
ఈ నవల వల్ల మనకు తెలుస్తుంది. “యువరాజు దుర్యోధనుడు పాండవ ద్వేషియై అడవిలో కాలిన కట్టెలా తన రాణి పట్ల నిరాశక్తుడై తిరుగాడుతున్న గుడ్డివాడు”
చంద్రవంశంలో పుట్టిన రసికత్వం లేని వాడు.
“పతిసాంగత్యం లేని సతికి శశికాంతులతో పని యేమి” అని తన ఇష్ట సఖి కుముద్వతితో చెప్పుకొని బాధపడుతుంది. విలువైన సంపదను ధనాగారంలో పడేసినట్లు తనను తెచ్చి అంతఃపురంలో వదిలిపెట్టాడని వాపోతుంది. ద్రౌపదికి చెప్పకుండా ఆమె సలహా తీసుకోకుండా పాండవులు ఏ పని చేయరని భానుమతి విన్నది.భానుమతి సలహా కాదు కదా కనీసం ఆమె ఉనికిని కూడా గుర్తించడు దుర్యోధనుడు. ఒక సందర్భంలో ‘ స్త్రీ ఉనికి కూడా పురుషుడి నడత ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది? ఆత్మగౌరవం లేని భార్య బతుకు వైధవ్యం కన్నా ఘోరమైనది కదా! అది నేను తప్ప ఇతరులు అనుభవించలేని దుస్థితి, తెలుసుకోలేని సత్యం’ – అంటుంది. ఒక స్త్రీ యొక్క మానసిక వేదనా తీవ్రతను తెలిపే ఈ మాటల వల్ల
హస్తినాపుర యువరాణిగా ఆమె ఎలాంటి స్థితిని పరిస్థితిని అనుభవిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
పాండవులు కూడా కురువంశ వారసులని భావించిన సహృదయ ఆమె. కర్ణుని జన్మ రహస్యం తెలిసి కుంతీ పుత్రుడని ఆనందించింది.
ద్రౌపది వస్త్రాపహరణలో ఆమెకు జరిగిన అవమానం సమస్త స్త్రీ జాతికి అవమానమని, ఆ చర్యకు కారణమైన తన భర్తను తలుచుకొని అసహ్యించుకుంటుంది. అంతఃపుర స్త్రీ జనానికి మొహం చూపలేని స్థితికి తెచ్చాడని భావిస్తుంది. వికర్ణుడు మాత్రం బాధ్యతతో దుర్యోధనుని ప్రశ్నించి, ద్రౌపది మర్యాద కాపాడే ప్రయత్నం
చేశాడని, అతని భార్య మృదుల అదృష్టవంతురాలనీ, స్త్రీ లోకంలో ఆమెకు గౌరవం దక్కిందని భావిస్తుంది.
సంధి రాయబారానికి వచ్చిన కృష్ణుడు
భానుమతిని కలిసినప్పుడు ఆమెలో ఎలాంటి కోరికలు కనపడలేదు. ‘ కాలంలో కదిలిపోతున్న ప్రకృతి కాంతలా ఉంది’. హస్తినకు కాబోయే మహారాణిని అన్న ఆశ కాని అహంకారం కానీ ఆమెలో ఏమాత్రం కనిపించలేదు. యుద్ధం
ముగిసిన తర్వాత యుయుత్సుడు (దృతరాష్ట్రుడికి గాంధారి దాసి సుఖద వలన కలిగిన పుత్రుడు) గాంధారిని కలవడానికి వచ్చినప్పుడు గాంధారి అతన్ని తప్పుపడుతుంది. భానుమతి మాత్రం పాండవుల పక్షం చేరి, కురువంశ చరిత్రలో కీర్తిని నిలబెట్టుకున్నావని మెచ్చుకుంటుంది. నీలాంటి భర్తను పొందిన నీ భార్య మాధురి అదృష్టవంతురాలంటుంది. ఈ సందర్భంగా భానుమతి మాటలు అన్యాపదేశంగా తనపై చేస్తున్న అభియోగాలని గాంధారి మనసు బాధపడినా, నిజమే కదా అన్న సత్యాన్ని గ్రహిస్తుంది. తల్లిగా తాను పూర్తిగా విఫలమైనానని, ప్రజలు సమాజం తన గురించి ఎంత వక్ర భాష్యం చెప్తుందో కదా! అన్న బాధ కూడా ఆమెలో కలుగుతుంది.
యుద్ధం ముగిసింది “భర్త లేడు అన్న బాధ తప్ప అలవాటైన ఒంటరితనం ఆమెను బాధించడం లేదు” పరాధీన భావన మాత్రం ఆమెను దహించి వేస్తుంది. దానిని కూడా ఆమె అలవాటు చేసుకుంటుంది. కుముద్వతి
తెచ్చిన గంగా జలాన్ని మండుతున్న తన గొంతులోకి వంపుకుంది భానుమతి. ‘గొంతును తడుపుతూ గంగాజలం, హస్తిన నగర భూమిని తడుపుకుంటూ గంగానది ప్రవహిస్తూనే ఉంది’ అని నవల ముగుస్తుంది. మన మనసులను కదిలించి వేసే భానుమతి కథ ఇది.

గాంధారి తన అభిప్రాయాలను సూటిగా చెప్పగలిగిన ధీరవనిత శివ భక్తురాలు. ధర్మాచరణ కలిగినది. అన్నీ ఉన్నా భర్తను కొడుకును ఏ విధంగానూ మార్చలేకపోయిన అసమర్ధురాలుగా, నిస్సహాయురాలుగా ఉండిపోయింది. భార్యగా తల్లిగా ఆమె పూర్తిగా విఫలమైంది. రాజభోగాలు ఉన్నా తాను ఒంటరినేనని, శివుని ఆరాధనలోనే గడుపుతున్నానని భావిస్తుంది. ధృతరాష్ట్రుడు తమ్ముని కోసం తాను కోల్పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి తన సంతానం ద్వారా సాధించుకోవాలన్నా ఆకాంక్షతో, సమయానికి సంతానాన్ని కనలేని గాంధారిని తీవ్రంగా అవమానించాడు. కోపం పై నియంత్రణ లేక సంతు కావాలని గాంధారి అంతరంగ దాసి సుఖదను కోరుకున్నాడు. గాంధారి అసహనానికి గురైంది. అతని కోరిక పట్ల అసహ్యం జుగుప్సా కలిగాయి. కానీ ఆ చర్యను ఆమె ఆపలేకపోయింది. కృష్ణుడు రాయబారిగా హస్తినకు వచ్చినప్పుడు అతనితో సంభాషిస్తూ, తన మనసులోని మాటను అప్రత్యక్షంగా వ్యక్తపరుస్తుంది. దుర్యోధనుని స్వార్థం లో తప్పులేదంటుంది. అతడు వారసత్వాన్ని కోరుకుంటున్నాడని, తండ్రిలా అంధుడా? అంగవైకల్యమా? మానసిక వైపల్యమా?అన్ని విధాల సమర్థుడని అపారమైన పుత్ర ప్రేమను వ్యక్తం చేస్తుందే తప్ప శాంతి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయదు. భానుమతిని ఎత్తుకు వచ్చినప్పుడు కూడా అతన్ని తప్పు పట్టలేదు. ధృతరాష్ట్రుడిలాగానే ఆమె కూడా పుత్ర ప్రేమలో మునిగిపోయి తల్లిగా దుర్యోధనుని సరియైన దారిలో నడిపించలేదన్నది వాస్తవము. అలాగే ఆమె తన సోదరుడు శకుని ‘శత్రువునైన నవ్వుతోనే పలకరించి తన పగను తీర్చుకోగల కుటిల నీతిజ్ఞుడు’ అని తెలిసి
అతని దుష్టపన్నాగాలను నిరోధించలేకపోయింది.
రూప్ కుమార్ గారి రచనాశైలి ప్రత్యేకమైంది. కాలానుగుణమైన, పాత్రనుగుణమైన, కథానుగుణమైన భాషను ఉపయోగించడం ఒక నైపుణ్యం. వీరు రచించిన ‘లచ్చుంబాయి’ కథా సంపుటిలోని కథల్లో పాత్రోచితమైన వ్యవహారిక భాష సొగసును చూడవచ్చు. ప్రస్తుతం భానుమతి నవలలో సరళ సుందరమైన గ్రాంథిక భాషతో కూడిన కవితాత్మకమైన ప్రవాహ శైలి మనం గమనించవచ్చు. రూపు కుమార్ గారు కవి కూడా కావడం వలన ఇందులో అద్భుతమైన వర్ణనలు కూడా చేశారు.
ఈ నవలలో మరో విశేషం ఏమిటంటే,
సైన్స్ ను జోడిస్తూ
క్షేత్రం బీజంపై
భానుమతి సందేహాల పరంపరగా అనేక విషయాలు
చర్చించడం.ఈ చర్చ వలన మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది. క్షేత్రస్థానీయులైన తల్లి యొక్క పాత్ర బిడ్డల గుణగణాలపై అధికంగా ఉంటుంది.అందువల్లనే మన సంప్రదాయంలో కూడా గర్భిణిగా ఉన్న స్త్రీని ప్రత్యేక శ్రద్ధతో చూస్తారు. సీమంతం లాంటి వేడుకలు చేస్తారు కదా! డాక్టర్లు కూడా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తారు.
ఇక ఈ నవలలో కృష్ణుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ధర్మరక్షణార్థం కించిత్
అధర్మమార్గమైనా సరే అంటాడు. ముల్లును ముల్లుతోనే తీయాలనే రాజకీయ రహస్యం తెలిసినవాడు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. ధర్మసంస్థాపనయే లక్ష్యంగా సాగిన మహాభారతాన్ని ముందుండి నడిపే లక్ష్యాన్ని నెరవేర్చాడు. కావున విజేత కృష్ణుడే అన్నది రచయిత అభిప్రాయం.
కథ ప్రారంభం నుంచి గంగా యమునా నదుల ప్రస్తావన కథ మొత్తంగా ప్రవహిస్తూనే ఉంటుంది. భారతీయ నవలా సాహిత్యంలో మహాభారతంలోని స్త్రీల పాత్రలను ఆధారంగా చేసుకుని వచ్చిన నవలలు చాలా తక్కువ. వచ్చిన వాటిలో ద్రౌపది గాంధారి కుంతి పాత్రలపై వచ్చాయి. కానీ, దుర్యోధనుడి భార్య హస్తిన యువరాణిగా భానుమతిని నవలగా చిత్రించిన ఆనవాళ్లు లేవు. తెలుగులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన ద్రౌపది నవల వచ్చింది. ఒక కొత్త కోణంలో భానుమతి పాత్రను రూపు కుమార్ డబ్బీకార్ గారు ఈ నవలలో ఆవిష్కరించారు. ప్రతి స్త్రీ కథలోనూ నిశ్శబ్దంగా దాగిన జీవిత సత్యాలను భానుమతి అంతర్మథనంగా వివరించే ప్రయత్నం ఈ నవల మొత్తంలో మనకు కనిపిస్తుంది. అనేక ఆలోచనలను రేకెత్తిస్తుంది. మళ్ళీ కొత్తగా భారతాన్ని మొత్తం మననం చేసుకుంటాము. ఈ నవల చదువరులను ఆసక్తికరంగా చదివిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వివేచనాత్మకంగా భానుమతి పాత్ర ఔచిత్యాన్ని దర్శింపజేస్తూ, మహాభారతంలోని ముఖ్యమైన స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలను విమర్శనాత్మకంగా విశ్లేషించిన తీరు అభినందనీయం.



