“చూడు దేవకి…వాసు నీ ఒక్కదానికే కాదు నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలనేది నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. సౌమ్య…
నీ అన్నకూతురు అనే ఒక్కఅంశం తప్ప ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నా నని తప్పుగా అనుకోకు. నాకు వాసుభవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు నీ మనోభావాలు అంటేఅంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీమాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది.” అన్నాడు భార్గవ. భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మందగ్గర ఏదో అలికిడి అవటంతో అటు తిరిగి చూసింది దేవకి.
ప్రొఫెసర్ రాధాదేవిని చూసి అలానే చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడి పోయింది దేవకి.
అది గమనించిన భార్గవ, అవాక్కయి,ఆపై గుండెల్లో సన్నని మెలితిరుగుతూ నొప్పిరాగా, ” దేవకి….” అంటూ నేలకొరిగిపోయాడు.
★★★
ప్రొఫెసర్ రాధాదేవి గంభీరంగా లోపలికివచ్చి “దేవకి!మంచినీళ్ళు తీసుకురా!” అంది.
మరబొమ్మలా మంచినీళ్ళగ్లాసు తీసుకొచ్చిన దేవకి చేతిలోంచి రాధాదేవి గ్లాసుతీసుకుని వాసుని భార్గవని వడిలోకి తీసుకోమని , భార్గవ మొహాన నీళ్ళు చిలకరించింది. రాధాదేవి.
ఏమాత్రం ఊహించనిది. ఈవిధంగా మళ్ళీ రాధాదేవిని చూస్తాను,కలుస్తాను,అదీ తమఇంటిలో అని కలలో కూడా ఊహించలేదు దేవకి, భార్గవలు.
అంతా సవ్యంగా జరిగితే. వాసు పెళ్ళిచేసి సంఘంలో ఒక మంచితండ్రిగా నిలబడదామనుకున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో ఇప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని అదీ వాసువల్ల సంపాదించుకున్నాడు. ఫలితం చేతికందే సమయానికి ప్రొఫెసర్ రాధాదేవిరాక దేవకి, భార్గవలకి పచ్చి వెలగపండు గొంతులో పడ్డట్టయింది.
★★★
భార్గవ డా||వి.ఎస్.కృష్ణ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవాడు. ప్రొఫెసర్ రాధాదేవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. వృత్తిపరంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ భార్గవని, దేవకిని ఇంటికి టీకి పిలిచేది రాధాదేవి. కాలేజీ పిక్నిక్స్ కి కుటుంబాలతో వెళ్ళటంతో దేవకి రాధాదేవి తో చనువు ఏర్పడింది.
ఎంతో చలాకీగాఉండే దేవకి అప్పుడప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండటంచూసి, “ఎందుకు దేవకి? హఠాత్తుగా ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు.” అంటూ గుచ్చి గుచ్చి అడిగింది రాధాదేవి.
“ఏమీ లేదండీ! అన్నీ ఉన్నాయి కాని ఆడదానిగా నాకు భగవంతుడు తల్లినయ్యే యోగ్యత ఇవ్వలేదు. ఎన్నోపరీక్షలు చేయించుకున్నా కానీ ‘అనోవ్యులేషన్’ అంటే అండాశయం విఫలం కారణంగా నాకు పిల్లలుపుట్టే అవకాశం లేదన్నారు. దానితో నాకు విడాకులిచ్చి మళ్ళీపెళ్ళి చేసుకోమని భార్గవ వైపు వారు బలవంతం చేస్తున్నారు.” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవకి.
ఈవిధంగా తన బాధను పంచుకుని మరింత సన్నిహితురాలయింది దేవకి రాధాదేవికి.
★★★
చదువుకునే రోజుల్లో మాధవ్ అంటే ఎంతో ఇష్టపడింది రాధాదేవి. రాధాదేవి శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో ఐదుగురు సంతానంలో పెద్దాడపిల్ల.
మాధవ్ ఒక్కగానొక్క కొడుకు. కులంవేరు.
రాధాదేవి తల్లిదండ్రులకి మాధవ్ కులం అభ్యంతరం అయితే, మాధవ్ తల్లిదండ్రులకి రాధాదేవి అంతస్తు అభ్యంతరమైంది.
ఇరువురు ఇరుకుటుంబాలకి నచ్చచెప్ప ప్రయత్నించారు.
“ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. ఇద్దరు మగపిల్లల్ని చదివించాలి. ఇంటికి పెద్ద ఆడపిల్లవి నువ్వే తప్పటడుగు వేస్తే, నీ బాటలోనే అందరూ వెళ్తారు. చెల్లెళ్ళకు సంబంధాలు రావు. మత్స్యమాంసాదులు తినే అతనితో కాపురం సజావుగా ఉండదు. ఏ ఆలూమగలకైనా ఎంత ప్రేమ ఉన్నా భోజనం సరిగ్గా లేకపోతే ఆ మగాడు కేవలం ప్రేమని ఆస్వాదిస్తూ బ్రతుక లేడు. అలా అని నువ్వు అవి వండిపెట్టగలవా!” అంటూ రాధాదేవికి అనునయంతో తండ్రి ప్రభాకరశాస్త్రిగారు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ప్రేమపెళ్ళిళ్ళు సాధారణంగా విఫలమవటానికి ముఖ్యంగా ఆహారవ్యవహారాలేనని ఎన్నో ఉదాహరణలు తెలిపారు.
అటు మాధవ్ తల్లిదండ్రులు మాధవ్ ను వారికి అనుకూలంగా నయాన్న భయాన్న లొంగదీసుకున్నారు.
చదువు పూర్తికాలేదు.ఉద్యోగం వస్తుందన్న ఆశలేదు..
జీవితం సినిమా కాదని ప్రస్తుతానికి తల్లిదండ్రులమాటవిని తనకాళ్ళమీద తాను నిలబడ్డాక రాధాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు మాధవ్.
తండ్రి చెప్పిన మాటలు విన్న రాధాదేవి,”నాన్నా! మీరు నా చదువుకి అడ్డం చెప్పకుండా నేను చదువుకోవాలని అనుకున్నంతవరకూ చదివించండి.” అని ప్రాధేయపడింది.
దానికి ప్రభాకరశాస్త్రి రాధాదేవి తల నిమిరాడు ‘సరే’ అన్నట్లు.
ప్రభాకరశాస్త్రి కి మనస్సులో “అయ్యో ఏమీ అడగని నా చిట్టితల్లి అడిగినది కాదన్నానే!” అన్నబాధ, ఏదో తప్పుచేసానన్న భావన దహించి వేయసాగింది.
రాధాదేవి ఎమ్.ఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభాకరశాస్త్రి భయపడుతూనే రాధాదేవి తో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఖచ్చితంగా చెప్పటంతో చేసేదిలేక రాధాదేవి చెల్లెళ్ళిద్దరికీ వివాహం చేసాడు.
మగపిల్లలిద్దరికి శాస్త్రోక్తంగా వడుగులు, పెళ్ళిళ్ళు చేసాడు.
తండ్రిగా పెద్దకూతురుకి అన్యాయం చేసానన్న బాధతో అనుక్షణం ఆలోచించి మాసివ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. భర్త చాటు భార్య అయిన సుశీలమ్మ భర్తమరణంతో అయోమయ స్థితిలోకి వెళ్ళింది. పెట్టింది తినడం శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం,ఉలుకూ పలుకూ లేదు.
రాధాదేవి తమ్ముళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీలో ఇంకొకరు కేరళాలో ఉద్యోగరీత్యా ఉన్నారు. తల్లిని తమతో ఉంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రమూ లేదు.
పైగా పెళ్ళిపెటాకులు లేకుండా ఉన్నఅక్క చూసుకుంటుందిలే అన్న ధీమా.
జీవనస్రవంతిలో మరో మలుపు చోటుచేసుకుంది వారి కుటుంబంలో.
అందరికంటే చిన్నది అయిన చిన్న చెల్లెలు ప్రసవానికివచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డని చూడటానికి వస్తున్న వాణి భర్త, విధివంచితుడై రోడ్ ఏక్సిడెంట్ లో అసువులుబాసాడు. ఆవార్తవిన్నపురిటాలు వాణి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. వాణి భర్త ఒక్కడే సంతానం వారి తల్లిదండ్రులకు. కొడుకే పోయాక తమకు వారికి ఏసంబంధం లేదని వాణి అత్తమామలు చెప్పటంతో రాధాదేవికి ఏంచేయాలో పాలు పోలేదు. పెద్దచెల్లెలుని, తమ్ముళ్ళను బ్రతిమాలింది. ఎవరూ తాత్కాలికంగా కూడా బిడ్డ బాధ్యత తీసుకునేందుకు సిధ్ధంగా లేకపోయారు.
ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో దేవకి, భార్గవలు గుర్తుకొచ్చారు. దేవకి, భార్గవలను పిలిచి విషయం వివరించి “పిల్లవాడిని పెంచుకుంటారా!” అని అడిగింది రాధాదేవి.
అడగకుండానే వరాలిచ్చినంత సంతోషపడ్డారు దేవకి,భార్గవలు.తడుముకోకుండా వెంటనే అంగీకారం తెలిపారు.
పిల్లవాడికి ఆయే ఖర్చు తానేభరిస్తానని, పిల్లవాడి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తనకు తెలియకుండా తీసుకోవడానికి వీలులేదని ఒప్పందం కుదుర్చుకుంది రాధాదేవి. పసివాడికి తానే వాసుదేవ్ అని నామకరణం చేసింది రాధాదేవి.
★★★
రాధాదేవి ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ
కుటుంబంలో అనుకోని పరిణామాలకు మానసికంగా దెబ్బతిన్న రాధాదేవి మార్పుకోరింది. తల్లి కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు తను చెల్లి వాణి.
ఒకరాయివేద్దాం ఏమవుతుందో చూద్దాం మన్నట్టు కెలిఫోర్నియా యూనివర్సిటీకి పి.హెచ్.డి కి అప్లై చేసింది. వెంటనే పి.హెచ్.డి లో సీటు వచ్చింది. చెల్లెలు వాణిని కేరళాలో పెద్దతమ్ముడు వద్ద కేరళా వైద్యానికి ఉంచి తాను కెలిఫోర్నియాకి బయలుదేరింది రాధాదేవి.
వెళ్ళేముందు భార్గవని కలిసి పిల్లవాడికి ఎటువంటి లోపం రాకుండా ఒక ఇరవై లక్షలు బ్యాంకులో పిల్లవాడి పేరును డిపాజిట్ చేసి వాడిని బాగా చదివించాలని, డబ్బుకి వెనుకాడవద్ధని,తనతో కాంటాక్ట్ లో ఉండమని,వాడిని హయ్యర్ స్టడీస్ కి తనతో అమెరికా తీసుకెళ్తానని, వాడితో
తల్లిదండ్రులుగా వారు రావచ్చని చెప్పి కెలిఫోర్నియాకు ప్రయాణమైంది రాధాదేవి.
★★★
వాసురాకతో మోడుబారిన దేవకి, భార్గవల జీవితం కొత్తచిగురులు తొడిగింది. వారిజీవితంలో చైతన్యం వెల్లివిరిసింది. దేవకి ఎంతో అపురూపంగా పసివాడి ఆలనా పాలనా చూడసాగింది. కానీపిల్లవాడికి బాటిల్ పాలు పట్టినప్పుడు దేవకి మాతృహృదయం తల్లడిల్లేది. వారి జీవితం వాసు రాకతో పరిపూర్ణత్వం సంతరించుకుంది.
రాధాదేవి ప్రతీ ఆదివారం వీడియోకాల్లో వాడి ఎదుగుదల చేష్టలు చూసి మురిసిపోయేది. వాసు ఐదవ పుట్టినరోజుకి రాధాదేవి ఇండియాకి వచ్చినప్పుడు వాసు కొత్త లేకుండా రాధాదేవి దగ్గరకు వెళ్ళాడు. అమ్మక్క అంటూ ఆవిడిచ్చిన బొమ్మలు, డ్రెస్సులతో వాసుకి రాధాదేవంటే మరింత ఇష్టం ఏర్పడింది. రాధాదేవి వెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్చాడు తీసుకెళ్ళమని. వాడిని సముదాయించలేక దేవకి సతమతమయ్యింది. రాను రాను వీడియో కాల్ చేసినప్పుడల్లా అమ్మక్క అంటూ కబుర్లు చెప్పటం.దా!దా! అనిపిలవడం దేవకి మనస్సులో రాధాదేవి అంటే ఈర్ష్య, ద్వేషం, భయం ఉత్పన్నం కాసాగింది. అదేవిషయం భర్త భార్గవతో అంది. భార్గవకి గూడా బిడ్డని తాము పెంచుతున్నా రాధాదేవి సూచనలు విసుగ్గా ఉండేది.
రానురాను రాధాదేవి వీడియో కాల్ చేసినప్పుడు ఎత్తకపోవటం, లేదంటే బయట ఉన్నాం తరువాత చేస్తామనటం, పిల్లవాడు పడుకున్నాడని కుంటిసాకులతో, పదిసార్లు చేస్తే ఒక్కసారి మాట్లాడుతూ మరో రెండేళ్లు గడిచాయి.
వాసుకి ఏడేళ్ళు వచ్చాయి. అన్నీ అర్ధమయ్యే వయసు. ఈవయసులో వాడికి రాధాదేవి కానీ వాడి జన్మమూలం కాని తెలియనివ్వకూడదనుకున్నారు దేవకి, భార్గవలు. వాసు వారికి భగవంతుడిచ్చిన మహాప్రసాదం.అది జారవిడుచుకునే ఆలోచన ఏమాత్రం లేదు.
★★★
ముందు ప్రణాళికగా భార్గవ కాలేజికి రిజైన్ చేసాడు. లేని తల్లికి అనారోగ్యం, ఊళ్ళో తోటలు చూసుకోవాలన్న కారణం చెప్పి స్నేహితులని నమ్మించాడు.
తరవాత ఫోనునంబరు మార్చి కొత్తసిమ్ కొత్తఫోను తీసుకున్నాడు.
ఆతరువాత విశాఖపట్నం నించీ హైదరాబాదుకి మకాం మార్చి ఊరిలో కొంతతోట అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఒకవిల్లా కొన్నాడు.
భార్గవ ఎక్స్పీరియన్స్ కి చైతన్యగ్రూప్ఆఫ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాసుని ‘ఐ.జి.సి.ఎస్.ఇ’ సిలబస్ లో జాయిన్ చేసాడు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
జన్మతః తెలివిగలవాడు అవటంతోను,భార్గవ
మార్గదర్శకత్వంతో ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.
బిట్స్ పిలాని విద్యా విహార్ పిలాని రాజస్తాన్ లో సీటు వచ్చింది. దానితో వాసు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది.
కాలం చిన్నప్పటి అమ్మక్కని మరుగున పడేసింది.వాసుదేవ్ కి లోకమంతా తల్లి దేవకి, తండ్రి భార్గవ. బాగా చదువుకో వాలి, పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో చదువుకో సాగాడు.
★★★
రాధాదేవి గత పన్నెండేళ్ళనించీ భార్గవ ఆచూకికోసం ప్రయత్నిస్తూనే ఉంది.ఒక సందర్భంలో పోలీసు కంప్లైంటు ఇద్దామనుకుంది. సహాయం చేసిన భార్గవగురించి తప్పుగా ఆలోచించటానికి మనస్కరించలేదు. దేవకి, భార్గవల మీద రాధాదేవికి ఎంతో నమ్మకం.పొరపాటునకూడా వారి మీద వ్యతిరేక భావన చూఛాయగా కూడా రాలేదు. ఎంతకీ భార్గవ ఏకష్టంలో ఉన్నాడో అనిఆందోళన చెందేది. అలాఅని ఊరుకోకుండా తనకు తెలిసిన మార్గాల ద్వారా భార్గవ్ ఆచూకి తీస్తూనే ఉంది.
తమ్ముళ్ళు, పెద్దచెల్లెలు రాధాదేవిని తప్పుపట్టారు.
” పెళ్ళిపెటాకులు లేవు. తల్లిహృదయం ఏం తెలుస్తుంది? ముక్కుమొహం తెలియని వాడికి ఏదో వస్తువు అప్పచెప్పినట్లు పసిగుడ్డుని ధారాదత్తం చేసింది. ఆమాత్రం ఎవరమైనా పెంచలేక పోయేవాళ్ళమా!” అంటూంటే, ఈ మనుషులేనా ‘మా అత్తవారు ఒప్పుకోరు’ అని పెద్ద చెల్లెలు , ‘మీ మరదళ్ళ వల్లకాదు.’ అని తమ్ముళ్ళు అనటం వల్లనే కదా తాను అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారి మాటలు శూలాల్లాతగిలి బాధపడింది రాధాదేవి.
రాధాదేవి మనస్సుకి ఎప్పటికైనా వాసు అజ్ఞాతవాసం నించీ తనకళ్ళబడతాడని బలమైన నమ్మకంతో ఉంది.
కెలిఫోర్నియా యూనివర్సిటీలో “క్వాంటమ్ కంప్యూటింగ్” మీద పి.హెచ్.డి లో గోల్డ్ మెడల్ సాధించింది రాధాదేవి.అదే యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా నీలినీడలా వాసు కళ్ళముందు కనపడుతూ కంటికి కునుకు కరువైంది రాధాదేవికి. ‘ తనేం అనుకుంది? ఏంజరిగింది? జీవితంలో మధురిమని ఏ చెల్లెళ్ళు తమ్ముళ్ళగురించి త్యాగం చేసిందో వారే తనని దోషిగా నిలబెట్టారు.’ అని మధనపడని రోజులేదు.
★★★
భగవంతుడు దయామయుడు.మనంచేసే ప్రతీపని వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన దృష్టిని ఎవరూ దాటిపోలేదు.
ఆరోజు కాఫీత్రాగుతూ లాప్టాప్ లో హిందూ పేపర్ చదువుతోంది రాధాదేవి. హఠాత్తుగా ఒక న్యూస్ కాలమ్ రాధాదేవిని ఆకర్షించింది.
“వాసుదేవ్ భాగవతుల ఈస్ టాప్ ఇన్ ఏస్ట్రోఫిజిక్స్ అండ్ కాస్మాలజీ ఎట్ బిట్స్ పిలాని. హి ఈస్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్
భార్గవ్ భాగవతుల అండ్ దేవకి. మిస్టర్ భార్గవ ఫాదర్ ఆఫ్ వాసుదేవ్ భాగవతుల ఈస్ రెండరింగ్ హిస్ సర్వీసెస్ ఫర్ చైతన్యాకాలేజ్ ఏస్ ఫాకల్టీ ఇన్ ఫిజిక్స్.హార్టీ కంగ్రాట్యులేషన్స్.”
రాధాదేవి కళ్ళల్లోంచి కన్నీరు జలజలా కారింది. అది ఒక అద్వైత అనుభూతి.
తప్పిపోయిన బిడ్డ దొరికిన ఆనందం…….
పోగొట్టుకున్నానుకున్న పెన్నిధి దొరికిందనిసంతోషం..
వాసు ప్రయోజకుడయ్యాడన్న గర్వం…,
అమ్మక్క రక్తం వాడిలో ప్రవహిస్తోందన్న తృప్తి….
అంతలోనే ఆ ఆనందబాష్పాల ప్రకృతి మారిపోయి విషాదం నెలకొంది.
భార్గవ ఎందుకిలా చేసాడు?
ఎంతో నమ్మకంతో ఒక ప్రాణం లేని వస్తువుని కాదు, ఒక పెంపుడు జంతువునికాదు, తమ ఇంటి ప్రాణాన్ని తన చెల్లెలు బిడ్డని, తనకే హక్కు లేదు అయినా అనివార్య పరిస్థితిలో నమ్మి తాత్కాలికంగా పెంపకానికి ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తాడా!
అంతలోనే రాధాదేవి వివేకం విచక్షణతో ఆలోచించసాగింది.
‘ఔను భార్గవకు తాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పరాయి బిడ్డను తనదిగా చేసుకోవటమే కాక విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలపెట్టినందుకు తాను భార్గవకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు. పురిటిగుడ్డుని భార్గవ చేతిలో పెట్టిన తనకే ఇంత మమకారముంటే, పెంచి పెద్దచేసిన భార్గవ,దేవకిలకి ఇంకెంత ఉంటుంది. అనుకోకుండా దొరికిన అదృష్టం. చేయి జారిపోతుందేమోనన్న భయాందోళనతో తన ఉనికిని మరుగునపెట్టాడు.గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి అజ్ఞాతవాసంలో పిల్లవాడిని ఈ స్థాయికి తేవడం ఒక్కొక్కసారి కన్నతల్లితండ్రులకే సాధ్యంకాదు.’
ఆలోచనలకి విరామచిహ్నంపెట్టి వెంటనే రాజస్థాన్ పిలానికు ఫ్లైట్ బుక్ చేసుకుంది రాధాదేవి.
★★★
యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాధాదేవి వాసుదేవ్ భాగవతుల గురించి అడిగింది. తాను వాసుదేవ్ కి పెదతల్లినని గర్వంగా చెప్పుకుంది.
“కూర్చోండి మేడమ్..” అంటూ రాధాదేవికి లాంజ్ చూపించాడు.ఇప్పుడే కబురు పెడతాను అంటూ బాయ్ ని పంపాడు.
గెస్ట్స్ లాంజ్ లో అడుగుపెడుతూనే, ‘ఎవరై ఉంటారు తనగురించి ఇక్కడికి వచ్చేవారు? అమ్మా నాన్నా అయితే కాదు.’ అనుకుంటూ అడుగుపెట్టిన వాసుకి జ్ఞాపకాల పొరలో అట్టడుగున నీడలాంటి ఒక ఆకారం స్ఫురించింది.
అస్పష్టంగా, ‘ అ….మ్మ …క్కా….’ అన్నాడు.
కట్టలుత్రెంచుకొచ్చిన దుఃఖాతిశయంతో నిలువెత్తు వాసుని సంకోచించకుండా కావలించుకుని వాసు గుండెలమీద సేద తీర్చుకుంది రాధాదేవి.
“ఇన్నాళ్ళు ఏమయ్యావు అమ్మక్కా? నీ గురించి అమ్మనాన్నని అడిగితే తెలియదన్నారు.
ఇండియాలో లేవన్నారు. క్రమేపి నేనుకూడా నిన్ను జ్ఞాపకాల అడుగు పొరల్లో ఖననం చేసాను.న అమ్మక్కా!” అన్నాడు వాసు.
“వాసు నేను డైరక్ట్ గా ఎయిర్పోర్ట్ నించీ ఇక్కడికి వచ్చా ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా! రూముకివెళ్ళిఫ్రష్ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. పన్నెండేళ్ళు గా ఒంటరిగా నేననుభవిస్తున్న మానసిక క్షోభ నీకు చెప్పుకుని నా హృదయం భారాన్ని తగ్గించుకోవాలిరా కన్నా!”
అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాధాదేవి.
వాసుకి అంతా అయోమయంగా ఉంది. ‘ఎందుకు అమ్మక్క ఇంత ఉద్వేగంగా మాట్లాడుతోంది? ఇన్నేళ్ళ తరువాత….’
” సరే అమ్మక్కా! నేను రేపు హైదరాబాద్ వెళ్ళటానికి హాస్టల్ రూము ఖాళీ చేద్దామనుకున్నా. రూము లాక్ చేసి వస్తా.”అంటూ వెళ్ళాడు.
★★★
బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా, ” వాసూ నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి.నేను చెప్పే విషయాన్ని అన్ని కోణాల్నించి ఆలోచించగల వ్యక్తిత్వం నీకుందని తెలుసు. ఇందులో నాతప్పుంటే నాకు నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిధ్ధంగా ఉన్నా తండ్రీ!” అంది రాధాదేవి.
“అదేమిటి అమ్మక్కా! పెద్దదానివి నిన్ను శిక్షించటమేమిటి?”అంటూ రాధాదేవి చేయిపట్టుకున్నాడు.
రాధాదేవి పూసగుచ్చినట్లు వాసు పుట్టటం,అప్పటి పరిస్థితుల్లో తనకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం,తరువాత దేవకి, భార్గవలు ఏవిధంగా తనతో సంప్రదింపులు కోల్పోయారో చెప్పింది. ఒకానొక సందర్భంలో పోలీసు కేసుపెట్టి ఎంక్వయిరీ చేయిద్దామనుకొని వారిని బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నట్లు చెప్పింది.
ఈ పన్నెండేళ్ళు బంధువులతో తాను పడ్డమాటలు వాసుతో చెప్పి ఊపిరి పీల్చుకుంది రాధాదేవి.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత గభాల్న వాసు రాధాదేవి కాళ్ళదగ్గర కూర్చొని వళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చాడు.
“అమ్మ ఎలావుంటుంది? అమ్మ ఇప్పుడెలా ఉంది. నువ్వు ఆ సాహసం చేయకపోతే నేనెలా ఉండేవాడినో! నేనెంత అదృష్టవంతుడివి.అందరికీ ఒక అమ్మ అయితే నాకు ముగురమ్మలు.అమ్మక్కా!ముందు అమ్మని చూడాలి.తర్వాత హైదరాబాద్ వెళ్దాం అంటూ కేరళాకు టిక్కట్లు బుక్ చేసాడు వాసుదేవ్.
★★★
తల్లి,తండ్రితప్ప బంధువులుఎవరూలేరని ఉదాసీనంగా గడిపిన వాసు మనసు అందరినీ కలవాలని ఉవ్వీళ్ళూరింది.
‘మొదటి సారి తనను నవమాసాలు మోసికన్న కన్నతల్లిని చూడబోతున్నాడు.తల్లిని కనిపెట్టుకుని ఉన్న మేనమామని కలువ బోతున్నాను.’ ఆ ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది అనుకున్నాడు వాసు.
గుమ్మంలో అడుగుపెట్టిన వాసు విరబూసిన మల్లె కుదుళ్ళమధ్య పసిపిల్లలాంటి అమాయకమైన మల్లెపూవులాంటి స్వచ్ఛమైన కన్నతల్లిని చూసాడు.
“అమ్మా!”అంటూ కాళ్ళకి నమస్కరించాడు వాసు.
నిర్వికారంగా నిశ్చలంగా ఉన్న వాణి లో ఏదో చలనం. వాసు వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
“నేనమ్మా!నీ బిడ్డని.” అంటూ వడిలో తల పెట్టుకున్నాడు వాసు.
అప్రయత్నంగా తలమీద చేయుంచింది వాణి.
అ దృశ్యం ‘శతమానం భవతి ‘ అని తల్లి వేద ఆశీర్వచనం చేస్తున్నట్లుంది.
మేనమామ కృష్ణమోహన్ కధనం ప్రకారం తన పనులు తాను చేసుకునే స్థాయికి తేగలిచారు గాని మెదడుకు తగిలిన షాక్ నించీ ఇంకా కోలుకోలేదని,ఎవరూ గుర్తులేరని తెలిపాడు.ఆమె లోకం ఆమెది. ఆకలిదప్పులు ఏమీ తెలియవని,తామేమైనా తినమని ఇస్తే తింటుంది. లేకపోతే లేదని కృష్ణమోహన్ వాసుకి రాధాదేవికి చెప్పాడు.
ప్రస్తుతం వాణి ఎమ్నీషీయాలో ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు కృష్ణమోహన్.
“మావయ్యా ‘ఎమెన్షియా’, ‘డిమెన్షియా అంత ప్రమాదకరమైనది కాదు. నాకెందుకో అమ్మని కొంతవరకూ మామూలు పరిస్థితికి తేవచ్చుననిపిస్తోంది.”అన్నాడు వాసు.
“వాసు చెప్పింది నిజమే రా! నువ్వు కష్టపడి దాన్ని ఈ స్థాయికి తెచ్చావు. నేను చెల్లాయిని నాతో పాటే అమెరికా తీసికెళ్ళి వైద్యం చేయిస్తా.అన్నట్లు వాసు ఇంతవాడవటానికి కారణమైన దేవకి భార్గవలకి మనమెంతో ఋణపడి ఉన్నాం. ముందు మనం హైదరాబాదు వెళ్దామని ముగ్గురూ కలిసి హైదరాబాదు వచ్చారు.
. . ★★★
ముందుగా ప్రొఫెసర్ రాధాదేవిని, ప్రక్కనేవాసు, కృష్ణమోహన్ లను చూసిన దేవకి సర్పద్రష్టలా నిలబడిపోయింది.
అది గమనించిన భార్గవ అవాక్కయి సన్నగా గుండె నొప్పితో నేలకొరిగాడు.
“నాన్నా!” అంటూ ఒక్కో ఉదుటున వాసు భార్గవని పొదివి పట్టుకోగా, రాధాదేవి మొహంమీద నీళ్ళు చిలకరించింది.
కళ్ళు తెరిచిన భార్గవ రాధాదెవి కళ్ళలో కళ్ళుపెట్టి చూడలేక దోషిగా తలవంచుకున్నాడు.
ఆపరిస్థితులల్లో దేవకి, భార్గవి ని చూసిన రాధాదేవి వాసుకి కనుసైగ చేసింది. వెంటనే ఒక్క ఉదుటున తల్లిని(దేవకిని) పట్టి ఊపుతూ, “అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా.ఇదంతా మీ ఆశీర్వాదం.” అంటూ దేవకి, భార్గవ కాళ్ళకి నమస్కరించాడు. న్యూస్ పేపర్లో వారిద్దరి పేర్లు చూపించాడు.
“ఎప్పటికీ నేను మీ వాసునే నాన్నా! అందరికీ ఒకే తల్లి.నాకు ముగ్గురు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే ఇంకొకరు మమతానురాగాలు తో పెంచిన తల్లి.మరొకరు నా దశదిశ నిర్దేశించిన తల్లి. ఇంతటి అదృష్టం ఎవరికుంటుంది?” అన్నాడువాసు కంఠం భావోద్వేగంతో పూడుకుపోగా.
భార్గవ మీభయం నాకర్ధం అయ్యింది. మీరు అమితమైన ప్రేమతో చేసిన తప్పు మిమ్మల్ని దోషిని చేయదు.మీరు వాసుని ఇంతటి ప్రయోజకుడిగా చేయటానికి వెనుక మీ ఆలుమగల కృషి అభినందనీయం. మీరు వాసుని ఎంతప్రేమిస్తున్నారన్నది మీరు గవర్నమెంట్ కాలేజీకి రాజీనామా చేయటంలో తెలుస్తోంది.” అంటూ భార్గవని భయం నించీ బయటకుతేవటానికి ప్రయత్నించింది రాధాదేవి.
“కన్నతల్లి కన్నబిడ్డను గుర్తించలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు భయపడతారు భార్గవ గారు.” అన్నాడు కృష్ణమోహన్ నిర్లిప్తంగా.
దేవకి అందరికీ కాఫీ కలుపుకొని తెచ్చింది.వాసు అందరికీ కాఫీ ఇచ్చాడు.
“రాధాదేవి గారు మీది ఎంతో విశాలహృదయం. ఎంతో సంస్కార వంతులు కాబట్టి నా తప్పుని నిలదీసి అడగాల్సిన సందర్భంలో సహితం నాకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీరు గొప్ప మనస్సుతో క్షమించినా, అది అందుకునే అర్హత నాకు లేదని నా అంతరంగం చెపుతోంది.
వాసు మీవైపు మొగ్గు తున్నాడని, మీరు వీడియోకాల్ చేసినప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసి ఈర్ష్య పడ్డాం.మీకాల్ గురించి వాడు ఎదురు చూడటం,ఆతరువాత వాడు నీగురించి పేచీ పెట్టటంతో వాడు మాకు దూరమౌతున్నాడన్న భయంతో ఈ విధంగా ఫోన్ నెంబరు మార్చటం. మా ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఇలా ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ సూర్యుడిని అరచేతితో మూయలేమని ఇప్పుడే తెలుసుకున్నాం.ఇన్నాళ్ళు బిడ్డలు లేని మాకు మాతృత్వపు, పితృత్వపు మధురిమలు ఆస్వాదించడానికి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి అవకాశమిచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.దేవకి కి జన్మించిన కృష్ణుడు యశోదతనయుడుగా నందయశోదలకు ప్రేమ అనే అమృతాన్ని పంచాడు. కానీ శాశ్వతంగాలేడుఅలాగే ఈ వాసుదేవ్ ఈ నందయశోదలకు తన అమృతం తుల్యమైన ప్రేమను పంచి మమ్మల్ని సమ్మోహితుల్ని చేసాడు.దానికి మాకు గర్వంగా ఉంది.ఇక ముందు ప్రయాణానికి రాధాదేవిగారికి సంతోషంగా అప్ప చెప్తున్నాం.” అంటూ వాసు చేతిని రాధాదేవి చేతిలో పెట్టిన నమస్కరించారు దేవకి,భార్గవలు.
రాధాదేవి తో కన్నతల్లి వాణిని తీసుకుని పై చదువులకి అమెరికాకి ప్రయాణమయ్యాడు వాసుదేవ్.
గుండెలనిండా ప్రేమతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు వాసుని దేవకి, భార్గవలు.
★★★
“దేవకీ! దేవకీ!” అంటూ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు భార్గవ.
“ఏమిటండీ ఆ గావుకేకలు!” అని కసురుకుంది.రాధ.
“కేకలేంటి మైకు పెట్టుకుని అరుస్తా! మన వాసు భార్గవ. ఎమ్.ఎస్ పూర్తి అయింది.కెలిఫోర్నియా యూనివర్సిటీలోనే టాపర్. అమెరికన్ గవర్నమెంటు వారి స్వంత ఖర్చుతో వాడికి సర్దార్ ఎడ్యుకేషన్ కి బాధ్యతవహిస్తోంది.
మనల్ని గ్రాడ్యుయేషన్ డేకి రమ్మని ప్రయాణానికి కావలసిన ఫ్లైట్ టికట్టుతో కావలసిన డాక్యుమెంట్స్ పంపించాడు మన వాసు.” అంటూ దేవకిని గిరగిరాతిప్పి ఆనందభాష్బాలు రాల్చాడు భార్గవ.
వాసు మ…న… బి…డ్డే…నండీ అంటూ అస్పష్టంగా గొణిగింది దేవకి.
శుభం.
.సమాప్తం
కథలు
ఎనిమిదేళ్ల అమ్మాయికి
చాక్లెట్ ఆశ చూపి లైంగికంగా, అత్యాచారం చేయబోయిన పదిహేడేళ్ల అబ్బాయి.
ప్రేమించిన వ్యక్తిని
తన తల్లిదండ్రులు వద్దన్నారని,
కూతురు ఆత్మహత్య.
అబ్బా..పొద్దున లేచి పేపరు చూస్తే చాలు ప్రతిరోజు ఇలాంటి వార్తలే ఎక్కువయ్యాయి.
అనుకుంటున్న ధరణికి
ధరణీ…!
అన్న భర్త పిలుపుతో
ఏంటండీ..! అన్నది చికాకుగా ధరణి.
ఏందిరా! పొద్దున్నే వేడి వేడిగా కనిపిస్తున్నావు అన్నాడు భర్త మధుకర్.
ఏంటో..? చెప్పండి !
మీకు వేడివేడిగా టీ ఇవ్వాలి. అంతేగా.. వస్తున్నా అంటూ పేపర్ అక్కడ టీపాయ్ పై పడేసి కిచెన్ లోకి వెళ్లి భర్తకు అల్లం టీ ఇష్టం కాబట్టి అల్లం వేసి, టీ..కాచి తీసుకొనివచ్చి మధుకర్ కి ఇచ్చింది ధరణి.
నీ చేతితో చేసిన చాయ్ అమృతమోయ్ అన్నాడు మధుకర్.
అవును మరి అమృతం తాగుతూ వెయ్యిళ్లు బతుకుదాం ఈ కలియుగంలో జరిగే అరాచకాలను చూస్తూ అన్నది ధరణి చిరు కోపంతో..
నిజంగా నీవు పేరుకు తగ్గట్టే నా పాలిటి వరం ధరణి. భూదేవి అంత ఓర్పు, సహనం కలిగిన భార్యను నాకు అందించాడు ఆ దేవుడు. ఎన్నడూ లేనిది
ఎందుకో నా శ్రీమతి ఈరోజు చిటపటలాడుతుంది అన్నాడు ఓరకంట ధరణిని చూస్తూ మధుకర్.
ఏం లేదండి ! మీ అమృతం చల్లారిపోతుంది ఆస్వాదించండి అన్నది ధరణి.
టీవీ ఆన్ చేసి టీ తాగుతున్నాడు మధుకర్.
టీవీ లో కూడా పేపర్లో వచ్చిన న్యూస్ లే రిపీట్ గా వస్తున్నాయి.
టీవీ లో కూడా అవే న్యూస్ లు మనసుకు బాధగా ఉంది. చానెల్ మార్చండి అన్నది ధరణి.
ఏందిరా? ధరణీ!
ఈరోజు డిసప్పాయింట్ గా ఉన్నావ్ ఏంది సంగతి అన్నాడు మధుకర్.
ఏముందండీ…!
ఏ పేపర్ వార్తలు చూసినా, ఏ ఛానల్ న్యూస్ విన్నా, ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం
అత్యాచారాలు, ఆత్మహత్యలు.. మానవత్వాలను మరిచి
మనసును తొలిచే వార్తలు
అన్నది ధరణి.
వాహ్వ వాహ్వ సూపర్ రా!
వార్తలపై కూడా కవిత్వం
చెప్తున్నా ఓయ్ నువ్వు అన్నాడు ధరణిని నవ్వించాలని మధుకర్.
మీ పరిహాసం చాలు కానీ,
ఈరోజు నాకు శ్రీ శారద కళాశాల వాళ్ళ వార్షికోత్సవం ఇన్విటేషన్ ఉంది. త్వరగా వెళ్లాలి. మీరు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేసి సచివాలయానికి వెళ్ళండి అన్నది ధరణి.
నీవు నీ కారు తీసుకుని రాముని తీసుకొని వెళ్ళు అన్నాడు మధుకర్.
ఎందుకండీ! మీరు వెళ్ళే దారిలోనే కదా ఆ కాలేజ్ వున్నది.ఇంధనం ఖర్చు దండగ చేయడం. రోడ్డుపైన మన రెండవ వెహికిల్ వల్ల ట్రాఫిక్ ,పొల్యూషన్ చేసుకుంటున్నాము.
అత్యవసరం లేకున్నా బయటికి వెళ్లడం వల్ల రోడ్డు పైన వాహనాలు ఎక్కువై, మనిషి నడిచే దారి కూడా లేకుండా వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అన్నది సామాజిక బాధ్యత గల ధరణి.
వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు అన్నాడు మధుకర్.
ఏదో ఒక ఆటో లో వస్తాను.
నేనిచ్చే ఆటో డబ్బు వల్ల
ఆటో వాడి కుటుంబ అవసరాలకైనా
డబ్బు ఇచ్చినదాన్ని అవుతాను అన్నది.
నేను అందుకే చెప్పాను. ఇంట్లో ఒక కారు ఉంటే చాలు రెండవ కారు వద్దు అని.
ఒక ఇంట్లో రెండు మూడు కార్లు కొనుక్కొని, మన పర్యావరణాన్ని రోడ్లను, ఇంధనాన్ని పాడు చేసుకుంటున్నాము. వాయి కాలుష్యాన్ని మనకు మనమే పెంచుకుంటున్నాం అన్నది ధరణి.
అందరూ నీలాగే ఆలోచిస్తే బాగానే ఉంటది. కానీ, వాళ్ళ స్టేటస్లు
వాళ్ళ అవసరాలు, డబ్బుంది కదా అని కారు కొనడం జరుగుతుందేమో అన్నాడు మధుకర్.
ఇట్లానే ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లనే మన ఇండియాలో రోడ్లు చిన్నవిగా వాహనాలు ఎక్కువగా అయ్యాయి. రోడ్లు పాడైతే బాగుచేసే నాధుడే లేడు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా వాళ్లు బాగుపడడం తప్ప, మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది అన్నది ధరణి.
వాచ్ వైపు చూసి
అమ్మో టైం అవుతుంది. మనం వెళ్ళాలి పదండి.త్వరగా
రెడీ అవ్వండి అన్నది ధరణి.
మధుకర్ వెళ్లే దారిలో
శ్రీ శారద కళాశాలలో
ధరణిని డ్రాప్ చేసి వెళ్ళాడు మధుకర్.
శ్రీ శారద జూనియర్ కళాశాల ప్రోగ్రాం స్టార్ట్ అయింది.
ఆ కళాశాల మేనేజ్మెంట్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ
మా విద్యార్థిని, విద్యార్థులకు
మీ యొక్క అమూల్యమైన సలహాలు, వారి యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకాలు ఇస్తారని ఆశిస్తూ ప్రముఖ సైక్రియాటిస్ట్
ఎన్నో అవార్డులను పొందిన
డాక్టర్ ధరణి మధుకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు.
డాక్టర్ ధరణి గారు లేవడంతో అక్కడ ప్రదేశమంతా, కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.
డాక్టర్ ధరణి మాట్లాడుతూ
చదువులతల్లి, జ్ఞానజ్యోతి అయిన సరస్వతీ దేవి పేరు మీద శ్రీ శారద జూనియర్ కళాశాల వారు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతానికి విచ్చేసిన శ్రీ శారద కళాశాల డైరెక్టర్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారికి,
గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ గారికి టీచింగ్ స్టాఫ్ అందరికీ
నా నమస్కారాలు.
శ్రీ శారద కళాశాలకి వన్నె తెస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు
నాయొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇక్కడి వేదిక అంతా చూసిన తర్వాత కొంతమంది ప్రసంగాలు ఇచ్చారు.
నేను అంత గొప్పగా మెసేజ్ లు ఇచ్చేదాన్ని కాదు అనుకుంటున్నాను.
నేను ఏడవ క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఆర్టీసీ బస్సులో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చొనిద్దాం.
అని బస్సులో రాసిన దానికి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని. ఇక్కడ కూడా అలాంటి
సత్ సంప్రదాయమే చూపించిన మగపిల్లల అందరికీ హ్యాట్సాఫ్ టు యు.
అప్పటినుండి మీ అందరిని చూస్తూనే ఉన్నాను. టూ అవర్స్ నుండి అబ్బాయిలు అందరు నిల్చున్నారు. అమ్మాయిలు అందరూ హ్యాపీగా కూర్చున్నారు.
స్టేజ్ పైన అబ్బాయిలు, అమ్మాయిలు ప్రదర్శించిన ప్రోగ్రామ్స్ ని,
పెద్దవాళ్లు ప్రసంగించిన ప్రసంగాలను వింటూ.. ఎలాంటి కామెంట్స్ లేకుండా ఎక్సలెంట్ డిసిప్లేన్ గా ఉన్న
శ్రీ శారద జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
“విద్య దదాతి వినయం” అంటారు.
ఆ వినయ విధేయతలు ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శిస్తే మన సమాజము చాలా బాగుపడుతుంది.
ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను.
మీ ముందుండే భవిష్యత్తుకి ఆలోచన చేయాలని ఈ స్టోరీ చెప్తున్నాను చెప్పమంటారా అన్నది ధరణి.
స్టేజి ముందు నుండి పిల్లలందరూ ఏకధాటిగా చెప్పండి మేడం అన్నారు.
ఒక ఊరు ఉందంట. అందులో చుట్టూ ప్రకృతి అందాలతో కూడిన చెట్లు
వాటి మధ్య నదులు, అన్ని వనరులతో కూడిన స్థలాలు ఉన్నాయి.
ఆ ఊరిలో భారతమ్మ అనే మహిళ ఉంది. ఆ భారతమ్మ స్థలాన్ని కబ్జా చేయాలన్న ఆలోచనతో ఒక దొర
ఆ భారతమ్మ దగ్గర ఉన్న ఆ వూరి మనుషులను తనవైపు తిప్పుకొని
స్వార్థంతో ఆ స్థలాన్ని కబ్జా చేశాడు.
కానీ, భారతమ్మ పట్టుదలగల మనిషి. తన పిల్లలను చూసుకోవాలి.
తాను పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంది.
తన ఆస్తిని కాపాడుకోవాలని, ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి ఎంతో ధైర్యంతో కష్టపడి పోరాడి మొత్తానికి ఆ కబ్జా చేసిన దొరని
బయటికి పంపింది. తన స్థలాన్ని తాను కాపాడుకోగలిగింది.
ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుళ్ళని పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని ఇచ్చి గొప్ప వాళ్ళను చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు భారతమ్మ స్వర్గస్తురాలయింది.
పెద్ద కూతురు పిల్లలు పెద్ద కుటుంబంలో ఉంటూ.. మంచి సాంప్రదాయాలతో.. వినయవిధేయతలతో… భారతమ్మ కుటుంబానికి వన్నె తెచ్చే విధంగా
పెరిగి పెద్దవాళ్ళు అయ్యి బాగా చదువుకొని మానవత్వంతో.. మెదులుతూ.. గొప్పగా ఎదిగి భారతమ్మ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు.
చిన్న కూతురు పిల్లలు మాత్రం కొత్త పోకడలకు అలవాటు పడి మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలై, కొత్తగా వచ్చే వింత రోగాలు తెచ్చుకొని మానవత్వపు విలువలను మరిచి అక్రమాలు, అత్యా చారాలు చేస్తూ భారతమ్మ కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే దశలో ఉన్నారు.
పైనున్న భారతమ్మ ఆత్మకి
పెద్ద కూతురు పిల్లలను చూసి ఆనంద పడాలో… చిన్నకూతురు పిల్లలను చూసి బాధపడాలో..అర్థం కాలేదట.
ఎప్పుడు కూడా తల్లి తన పిల్లలు ఆనందంగా, సుఖంగా ఉన్న పిల్లలను చూసి సంతోష పడడం కన్నా..,చెడుదారిలో తిరిగి చెడ్డపేరు తెచ్చుకుంటున్న పిల్లలను చూసి బాధ పడడమే ఆ తల్లి యొక్క లక్షణం.
కాబట్టి పైనున్న భారతమ్మ ఆత్మకు పెద్దకూతురు పిల్లలు చేసిన మంచి పనులకన్నా..,
చిన్నకూతురు పిల్లలు చేస్తున్న చెడ్డ పనులకు.. ఆమె ఆత్మ ఎప్పుడు క్షోభిస్తుందంట.
ఆ భారతమ్మ మరెవరో కాదు. మన భారతమాత.
అని డాక్టర్ ధరణి గారు మాట్లాడుతూ వుంటే
వెంటనే అక్కడి వాళ్ళందరూ
తమ చేతులతో చప్పట్లు కొట్టారు.
విద్యార్థిని ,విద్యార్థులకు మిగతా సందేశాన్ని అందించాలని తిరిగి మళ్ళీ మాట్లాడింది ధరణి.
భరతమాత మొదటి పిల్లలు ఇంత కష్టపడి తెచ్చుకున్నదే స్వాతంత్ర్యం.
ఆ స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత చాలా మంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకువస్తే…
రెండో పిల్లల వారసులుగా ఉన్నటువంటి కొంతమంది కొత్త తరహా పోకడలకు బానిసలై భరతమాతని అవమానించేలా… అత్యాచారాలు ,హత్యలు అక్రమాలు చేస్తూ మానవ విలువలను మరిచి
ఆ తల్లిని బాధ పెడుతున్నారు.
ప్రతి విద్యార్థిని, విద్యార్థులు
ఆ భారతమ్మ పెద్ద కూతురు పిల్లలుగా ఉండి భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి.
మీరు ఎంచుకున్న రంగంలో..
ఆ రంగం ఏదైనా కానివ్వండి…
పాలిటిక్స్ కావచ్చు.. స్పోర్ట్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు.. టీచర్స్ కావచ్చు…వాట్ ఎవర్..?
ఇట్ ఇస్.. మీరు ఎంచుకున్న రంగంలో ముందుగా..మీ కుటుంబానికి… సమాజానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకువచ్చేటటువంటి స్టేజీలో మీరందరూ ఉండాలి.
ఇంటర్మీడియట్ అంటేనే ముందువచ్చే మీ భవిష్యత్తుకి ఒక బ్రిడ్జి లాంటిది.
ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా…
మంచి అనే గట్టి పునాదులు ఉండాలి.
అట్లా ఉన్నప్పుడే సమాజానికి
మీరు బంగారు బాటలు వేయగల దిశలో ఉంటారు .
ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే..
ఈ సమాజంలో జరిగే చెడు విషయాల పై ఒక తల్లి పడే ఆవేదన ఇది.
ఇండియా ఇస్ ఏ ల్యాండ్ విచ్ యాజ్ రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నాలెడ్జి లో మనం నెంబర్ వన్.రిసోర్స్ లో మనం నెంబర్ వన్. నేచురల్ రిసోర్స్ లే కాకుండా.. హ్యూమన్ రిసోర్స్ కూడా..
ఇండియా ఇస్ ది బెస్ట్ కంట్రీ.
ఆ హ్యూమన్ రిసోర్స్ లో పెద్ద స్థానం వహిస్తున్న వారెవరో.. కాదు.అది మీరే..
విద్యార్థినీ, విద్యార్థులు.
అందుకే మీకంటూ.. ఒక విశిష్టమైన స్థానం ఉంది.
ఈ స్టేజ్ లో మీరు నడిచే మంచి మార్గంలో.. రేపు మీ కుటుంబమే, కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా..
మీ పై ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని సెల్ ఫోన్ ద్వారా మిస్ యూజ్ చేసుకుంటున్నారు.
ఒక రాయిని ఇద్దరికీ చెరోకటి ఇస్తే..
తెలివైన విజ్ఞత కలిగినవాడు దానిని శిల్పంలా చెక్కి.. అతని విజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకుంటాడు.
అదే తెలివిలేనివాడు ఆ రాయిని
ఏం చేయాలో తెలియక ఎవరి తల పలగొట్టాలా..అని ఆలోచిస్తాడు.
అట్లా ఉంది ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ.
మీ వయసు నుండి ఆ సెల్ఫోన్ అనే విప్లవాన్ని మంచి దారిలో పెట్టి
మీరు సమాజంలో మంచి బాటలో నడవాలి.
నేను చెప్పే ఈ సెల్ ఫోన్ మిస్ యుజ్ గురించి… మీరు.. నన్ను అడగొచ్చు.
ఏంటి..? మేడం..!
సైంటిఫిక్ అనే టెక్నాలజీనీ అందరూ.. మిస్ యూజ్ చేసుకుంటున్నారా..? అని…
అందుకే నేను ముందే చెప్పాను మీకు.
ప్రతి తల్లికి బాగుపడిన కొడుకు,కూతురు కంటే చెడిపోయిన వారి గురించే ఎక్కువగా.. ఆవేదన చెందుతుందని.
సాంకేతికంగా మన భారతదేశం
చాలా ముందడుగు వేస్తుంది.
మేము మా జనరేషన్ లో చూసిన దానికన్నా.. మీరు మీ జనరేషన్లో
చూసే సాంకేతిక పరిజ్ఞానాలు చాలా ఉన్నాయి.
నేను చిన్నప్పుడు ఒక ఎస్సై రైటింగ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ కావాలంటే..
గ్రామం నుండి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి లైబ్రరీ బుక్స్ చదివి తెలుసుకునే వాళ్లం.
ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ ఆన్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈజీగా వెళ్లగలిగే పరిస్థితి ఉంది.
అంటే మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నారో.. ఆలోచించండి.
మేము లైబ్రరీలో బుక్స్ అన్నీ చదివి
ఒక రోజంతా కష్టపడి ఒక పేజీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే వాళ్ళం.
అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకుని వచ్చాం.
మీరు కేవలం ఒక క్లిక్కుతో…
మీ కళ్ళ ముందు పెట్టుకొనే, అద్భుతమైన పరిస్థితి ఉంది.
ఈ అద్భుతమైన స్థానాన్ని ఎంతవరకు మనము మంచికే.. ఉపయోగించాలి. అని మీరు మీ..మనోభావాలకు వేసుకునే ప్రశ్న…?
దాన్నే.. ఇంట్రాస్పెక్షన్ అంటారు.
అంటే అంతర్మధనం అన్న మాట.
మన ప్రకృతికాని సమాజంగాని
దేశంకానీ, తల్లిదండ్రులుకానీ,
అందరూ ఇచ్చినటువంటి అవకాశం మనం ఏవిధంగా సద్వినియోగం
చేసుకుంటున్నాము.
అనేది ఈ రోజు మీరంతా ఆలోచనచేసి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మన సమాజంలో చెడు అనేది జరగకుండా ఉంటుంది అనేది
నా భావన.
నేను ఎందుకు మీకు..
ఇట్లా.. చెప్తున్నానంటే..
నా దగ్గరికి ఒక పేరెంట్స్ తన కూతుర్ని తీసుకొని వచ్చారు.
ఆ అమ్మాయి చిన్నప్పట్నుండి చాలా బాగా చదువుకున్న తెలివికల అమ్మాయి.
ప్రతి దాంట్లోనూ.. మెరిట్ గా
ఉండేదంటా..
అలాంటి అమ్మాయి యుక్తవయస్సు వచ్చినాక,..సాంప్రదాయాలను మరిచి విదేశీ స్టైల్లో… దాచుకోవలసిన శరీర భాగాలను దాచుకోకుండా..
డిగ్నిటీ అనే పదాన్ని మరిచి వస్త్రధారణ చేసుకుంటూ…
అదో ట్రెండ్ గా స్నేహితులతో
చెడు మార్గంలో పడింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు వద్దని వారించినా… వినకుండా..
నా రైట్స్ నాకు ఉన్నవి.
నా స్వేచ్ఛను, నా నిర్ణయాన్ని నేను తీసుకోగలను. అంటూ.. సెల్ ఫోన్ తోనే గడిపేదంటా.
సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయికి దూరంగా ఉంచితే..
నేను మేజర్ ని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.నాకు కొన్ని హక్కులు వున్నాయి. అంటూ తల్లిదండ్రుల్ని ఎదిరించి చెడుబాటలో పయనించింది.
పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న వాడితో ప్రేమ పేరుతో మోసపోయి డ్రగ్స్ కి బానిసై డిప్రెషన్లోకి వెళ్లి పోయింది.
ఆ పరిస్థితుల్లో ఉన్న కూతురిని చూస్తూ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంమై వాళ్లు ఏడ్చుకుంటూ.. వచ్చారు.
ఇది ఎందుకు చెప్పానంటే..
ఈ రోజుల్లో వందకి యాభై శాతం మంది పిల్లలు వాళ్ళ బాధ్యతలను మరిచిపోయి హక్కులకోసం పోరాడుతున్నారు.
మీకు సోషల్ జస్టిస్,మోరల్ జస్టిస్
మీ దగ్గరే ఉంటాయి.
హక్కులకోసం ఎట్లా..? అయితే కొట్లాడుతున్నారో… అట్లాగే బాధ్యతలు కూడా ఉంటాయి అనేది గ్రహించాలి.
ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చిందో… అదే రాజ్యాంగం మనకు బాధ్యతలు కూడా ఇచ్చింది.
ఈ రోజు మీరు ఉండే విధానమే,
మీ ముందు తరానికి ఆదర్శం కావాలి.
తల్లిదండ్రుల పైన బాధ్యత,
సమాజం పైన బాధ్యత,
దేశం పైన బాధ్యత..
డిగ్నిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ…
మీరు చేస్తూ.. మంచి బాటలో పయనించాలి.
మన ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.
అని చెప్పింది డాక్టర్ ధరణి.
డాక్టర్ ధరణి గారు చెప్పిన అమూల్యమైన వాక్యాలకు
అక్కడ ఉన్న పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు వాళ్ల కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
“మీరెన్ని చెప్పండి. మీ అమ్మగారిని యిక్కడికి తీసుకురావడానికి నేనొప్పుకోను. అలవాటైన ఊరు. అలవాటైన పరిసరాలు. అయినా కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి కదా! కాలు చెయ్యి పడిపోయినప్పుడు ఆలోచిద్దాంలెండి”.
“అదేమిటి సరసూ! అంత మాటన్నావు?”
“ఆవిడ అత్తగారి గురించి మీ అమ్మగారన్న మాటలే కదా! నేనేమైనా కొత్తగా అన్నానా ఏమిటి?” “ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?”
“ఎందుకంటే, అది ఆవిడ చూపిన త్రోవే కదా! నేను అనుసరిస్తున్నానంతే!”
“అది తప్పని నీకు తెలియదా?” “మీకు తెలియదా?”
“తెలుసు కాబట్టే, అమ్మను యిక్కడకు తీసుకొద్దానుకుంటున్నాను”.
“కాలానుగుణంగా మనుషులను బట్టి మీ తప్పొప్పులు మారిపోతాయంటే నేను లెక్కచెయ్యను”
“సరసూ దయచేసి అర్థం చేసుకో! అప్పుడు మా అమ్మ చేసినది తప్పే. కాని ముప్పయ్యేళ్ళ క్రిందట జరిగిన దానికి యిప్పుడు నేనేం చెయ్యగలను?” నాన్న అమ్మను బ్రతిమలాడుతున్నారు.
“ఇప్పుడూ అలాగే అనుకొని ఊరుకోండి. మీకు అమ్మ అయితే అవ్వచ్చు. గాని ఆవిడ మా అమ్మమ్మకు చేసినదానికి, ఆవిడ క్షమించినా నేను క్షమించలేను. కొడుకుగా మీరేం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ ఒక కోడలుగా ఆవిడ ఎంతవరకు చేశారో, నేనూ అంతవరకే చేస్తాను. నన్ను ఎక్కువగా బలవంత పెట్టవద్దు” అమ్మ నిష్కర్షగా చెప్తుంది నాన్నతో.
అమ్మానాన్నల సంభాషణను పక్కగదిలో ఉన్న నేను పూర్తిగా విన్నాను. నేను గదిలో లేననుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో, ఉన్నా ఫరవాలేదు అనుకొని మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ వారం రోజులనుండి అమ్మానాన్నల మధ్య ఈ ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే ఉంది నాన్నమ్మ విషయంలో. ఈరోజు ఇద్దరూ బయటపడ్డారు.
అమ్మ, నాన్నకు అత్త కూతురే. తాతమ్మ నాన్నకు నాన్నమ్మ అయితే అమ్మకు అమ్మమ్మ అవుతుంది. నాన్నమ్మ తాతమ్మను బాగా చూసుకోలేదని అమ్మకు కోపం. ముత్తాత చనిపోయాక, తాతయ్య వాళ్ల అమ్మ… అదే తాతమ్మను ఇంటికి తీసుకువస్తానంటే నాన్నమ్మ ఒప్పుకోలేదంట. చివరకు ఆ పల్లెటూరిలోనే తాతమ్మ చనిపోయిందంట. అప్పటికి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా తాతమ్మ విషయంలో ఏమి చేయలేదని అమ్మకు కోపం. అందుకని ఇప్పుడు తాతగారు చనిపోయాక నాన్నమ్మను తీసుకువస్తానంటే ఒప్పుకోవడం లేదు.
దానికితోడు… మనలో మనమాట… నాన్నమ్మ ఎప్పుడూ అమ్మను కూడా బాగా చూసుకోలేదు. నాన్నమ్మకు ఇష్టం లేకుండా, తాతమ్మ బలవంతంతో అమ్మానాన్నల పెళ్లి జరిగిందని ఒక కారణం. ఏదైతేనేం నాన్నమ్మ, అమ్మల మధ్యలో సయోధ్య ఎప్పుడూ లేదు. నాన్నమ్మ అటు ఆవిడ అత్తగారి విషయంలోనూ, ఇటు కోడలి విషయంలోనూ తన మాటే నెగ్గేటట్లు చూసుకుంది. అధికారం చలాయించింది. ఆ విషయం జగమెరిగిన సత్యం.
ఒకప్రక్క తన అమ్మమ్మకు అన్యాయం చేసిందని, ఇంకొక ప్రక్క తనను ఏ రోజూ ప్రేమగా చూసుకోలేదని అమ్మకు, నాన్నమ్మ అంటే కోపం. ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది. అందరి విషయంలో మంచిగా ఆలోచించే అమ్మ, నాన్నమ్మ విషయంలో మాత్రం తన గతంనుండి బయటపడలేక పోతుంది. మధ్యలో నాన్న నలిగిపోతున్నారు.
ఇప్పుడు పరిస్థితి యిలా ఉంటే…. మరో పాతికేళ్ల తర్వాత…. ఇదే పరిస్థితి నేనూ ఎదుర్కోవలసి వస్తుందా? మీ నాన్నమ్మ గారిని మీ అమ్మగారు చూశారా, నేను మీ అమ్మగారిని చూడడానికి? అని నా భార్య అంటే నేనేమి చెయ్యాలి? నా భార్య మా అమ్మల మధ్య నలిగిపోవాలా! అమ్మో! నా వల్ల కాదు. ఆ పరిస్థితి నాకు ఎదురవ్వకూడదంటే ఇప్పుడే నేను సరైన దిశగా ఆలోచించాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాను.
“అమ్మా! నీ బాధను, మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. గాని కొత్తవారికి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. పాతికేళ్ల తర్వాత ఇదే పరిస్థితిలో నేనూ వుంటానేమోనన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేయమంటావు నన్ను?” ఆ రాత్రి అమ్మ చరవాణికి ఒక సందేశం పంపించాను.
*
“సరసూ! తలుపేసుకో” వేకువజామునే నాన్న మాటలు.
“రేపు పెందరాళే బయలుదేరండి. ఎండ పడ్డాక బయలుదేరవద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం” అమ్మ నాన్నకు చెప్తుంది.
నాన్నమ్మను తీసుకురావడానికి ఊరికి బయలుదేరినట్లున్నారు.
నాకు తెలుసు. మా అమ్మ వివేకవంతురాలు. అర్థం చేసుకోగలదు.
ప్రతీ రోజూ నరకమే నాకు..పొద్దు లేదు మాపు లేదు…దుక్కమొస్తుంది…
ఎందో పడి పోయినట్టు గా ఇంటామే 5 గొట్టంగ లేస్తది…లేసుడు తోనే పండ్లు తోమి వంటింట్ల కొచ్చి నా కోసం ఎతుకుతది…. ముద్దుగ కోపెడు చిక్కగ చాయ వెట్కొనీ కుర్షి ల గుసోని బుర్ర బుర్ర తాగుతది….
ఇగ తానాని కి వొయ్యి వచ్చే వరకు వాళ్ళాయన లేషి పేపరు సదువు కుంట ” ఇగో గింత శాయ వెట్టు” అంటడు.
” ఆ ! గట్లే పెడ్తున్న..అని మల్ల నన్ను పీసు వెట్టి తోమి చాయ్ వెట్టి.. కోపేడు ఆయనకు..మిగిలింది మల్ల తాగుతది గుట్ట గుట్ట….
ఇగ గా పోరగాండ్లు లేశీ…” అమ్మా ! చాయ్ వెట్టినవా ” అంటరు…
” పెడ్తున్న ” అని మల్ల తోముతది నన్ను….
” అమ్మయ్య ! ఇగ రెస్ట్ దీసుకుంట అని అనుకునే వరకు…
” అమ్మ గారు! గింత శా వట్టు వొయ్య రాదు నెత్తి బాగ నొ స్తంది” అనే…పని మనిషి..
నీ పాడు గాను నన్ను బత్క నియ్యరా ఉల్లో!
మల్ల నన్ను పొయ్యి మీద వెట్టుడే…
ఇగ ఇంట్ల అందరు ఏటోల్లు అటు వోయింరు…. గూట్లే వోయ్యి పంట..
” ట్రింగ్..ట్రింగ్…”
ఎవలో ఫోన్ జేశిరి…
ఇంటామె” అలో! ఎవలు….కిందింటి పంకజమా! వొస్తావు..దా! గట్ల అడుగుడు ఎందుకు! రావాలే బాజాప్తగ…చాయ వెట్కోని తాగుదాము”..
వామ్మో! నన్ను చంపుతావే! నీ చాయ్ పాడు గాను..
రానే వచ్చే గామే! ముద్దుగ సోపాల గుసొని ఇక ఇకలు..పక పకలు…ఎల్లి మీద బల్లి వడే..బల్లి మీద ఎల్లి వడే అని…నన్ను గుంజుకొచ్చి పొయ్యి మీద వెట్టి చాయ్ వెట్కోనీ తాగిరి…
గిట్ల నన్ను తోమి తోమి సంపుతున్నరు…బ్రమ్మ తానికి వొయిన కష్టం జెప్పుకో నీకి…
అయ్యా! అనంగనే….
ఎవరక్కడ ఇగో చాయ గిన్నె వొచ్చింది..నాలుగు తలకాయలు నొస్తున్నయి…పెద్ద కోపెడు చాయ వేట్టుం డి అన్నడు….ఇగ ఎవలకూ జెప్పాలే…
సంతోష మొచ్చినా దుక్క మొచ్ఛినా చాయ నే నట..పొర గాండ్లకు పరిచ్చలు వొస్తే నిద్ర రాకుం ట చాయ నే…
గీతలు వడ్డయి పెయ్యంత…పొయ్యి మీద పెట్టి పెట్టీ.. ముడ్డి మండుతుంది….
జెర్ర న్యాయం జెప్పుర్రి !
పల్లె పరిచయం
పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు… అప్పుడైనా.. ఇప్పుడైనా .. ఎప్పుడైనా..కాకపోతే నేడు పల్లెలను కుళ్లు రాజకీయం పట్టి పీడిస్తోంది.‘మనీ‘ విషవలయంలో మానవ సంబందాలనూ చిక్కి శల్యం చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే పల్లె వాతావరణం పట్టణీకరణ అయిపోయింది. అయితే 70వ దశకంలో పల్లెలు స్వచ్ఛమైన అమాయకత్వానికి, ఐకమత్యానికి అద్దం పట్టేవి. పల్లె వాతావరణం ఉమ్మడి కుటుంబాన్ని తలపించేవి. కష్టసుఖాలను , ఒకరికి ఒకరు కలిసి పంచుకునేవారు. పశు, పక్షాదులతో సహజీవనం చేసేవి పల్లెలు. పల్లెప్రజలు ప్రకృతి ఒడిలో సేదదీరేవారు. అందుకే పల్లె ప్రజలు ఆరోగ్యంగా జీవించే వారు. అనారోగ్యం వారి దరికి చేరేది కాదు. జలుబు, జ్వరం లాంటి వాటికి అమ్మలే డాక్టర్లు. వంటింటి వైద్యం చాలా రోగాలకు పరిష్కారం.
నేటి తరానికి నాటి పల్లెల మట్టి వాసనలు, మంచితనం, అమాయకత్వం, సమైక్యత , సహృదయత గురించి తెలియవు…అందుకే నేటి యువతరానికి నాటి గ్రామీణ వాతావరణాన్ని,గ్రామీణ భారతాన్ని పరిచయం చేయాలన్నదే.. “మా ఊరి కథలు”ఉద్దేశం!
( ప్రతి మయూఖ సంచికలో ఈ ” మా ఊరి కథలు ” శీర్షిక తో ఒక్కో విషయాన్ని రచిస్తారు రచయిత . చాలా ఆసక్తికరంగా సాగింది ఈ రచన . పల్లెలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక అవగాహన అవసరం. మీరు తప్పక చదవాలి రచనను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను.
– మయూఖ పత్రిక సంపాదకులు.
వరంగల్ వైపు కారు దూసుకెళ్తోంది. ఒక మీటింగ్ లో పాల్గొనేందుకు మిత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ బయలు దేరాను. రహదారి పై మా ప్రయాణం . డ్రైవర్ కు మంచి అనుభవం ఉన్నట్లుంది. మనసే విహంగమా అన్నంత జోరుగా దూసుకెళ్తోంది కారు. హైవే సైడున ఉన్న కీలోమీటర్ రాళ్ళు వెనక్కి పరుగెడుతన్నాయి. అంటే వేగం వంద క్రాస్ అయింది.
“మల్లేషన్నా..కారు స్పీడు తగ్గించే..మీటింగ్ కు కాస్త లేటయినా ఫరక్ పడదే” అన్నా డ్రైవర్ తో..! మెల్లగ కారువేగం తగ్గించాడు డ్రైవర్. రోడ్ పక్కన ఉన్న సైన్ బోర్డులు స్పష్టంగా కనబడుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే జనగామ అనే సైన్ బోర్డ్ కనిపించింది.. జనగామ వెళ్ళాలంటే హై వే దిగి లోనికి వెళ్ళాలి.. ఇక్కడ జనగామ ప్రస్థావన ఎందుకంటే… ఆ సైన్ బోర్డు చూడగానే అందరి మదిలో ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి మెదిలాడు. ఎందుకంటారా …
జనగామకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ అధికారి స్వగ్రామం. అంతే కాదండోయ్ తాను పుట్టి పెరిగిన ఊరు, జన్మ నిచ్చిన తల్లి రుణం తీర్చుకున్న ధన్యజీవి ఆ ఐఎఎస్ అధికారి. అందుకే జనగామ బోర్డు చూడగానే ఆ ఐఎఎస్ అధికారి, ఆయన స్వగ్రామంమం ఓబులకేశవ పురం మదిలో మెదిలాయి. గతంలో ఆయన గురించి, ఊరుగురించి విన్నాను కాబట్టి ఓబులకేశవ పురం గ్రామాన్ని , అధికారి కట్టించిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం చడాలనిపిన్చింది.. అదే మాట కార్లో ఉన్న మితృలతో చెప్పా. వాళ్లు సరే అన్నారు.. కాకపోతే తిరుగు ప్రయాణంలో వెళ్దాం అన్నారు..సాయంత్రం లేటు అయితే ఎట్లా ? .. అనే సందేహం కలిగింది… వెంటనే ..”మల్లేశన్న కారు వేగం పెంచే.. వచ్చేప్పుడు ఓబులకేశవ పురం చుసివెళ్ళాలి అన్నాను … అంతే మల్లేశన్న కారు స్పీడు పెంచిండు.. ..”గాల్లో తేలి నట్లుందే…అన్నట్లు ముందుకు దూసుకుపోయిందీ.
గంటల్లో గమ్యస్థానం చేరుకొని, పని ముగించుకొని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయనమయ్యాము. నేను కారు కిటికీల్లోంచి బయట ప్రకృతిని చూస్తూ కూర్చున్నా. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, చేలు …వాతావరణం ఆహ్లాదంగా మారింది. . అంత వరకు తీక్షణమైన ఎండ… అంతలోనే మేఘాలు కమ్ముకున్నాయి. అంతే వాతావరణం చల్లబడింది. అంతలో కారు వేగం తగ్గి హైవే దిగి కుడివైపు టర్న్ తీసుకుంది. మేము వేరే ఆలోచనలో ఉన్నా డ్రైవర్ మర్చి పోలేదు..ఓబుల కేశవపురం వెళ్ళాలని అనుకున్న విషయం. అందుకే జనగామ బోర్డ్ కనిపించగానే టర్న్ తీసుకుండు… నేను ఆలోచిస్తుండగానే జనగామ వచ్చేసింది.. టౌన్ మధ్యలోంచి కారు ఓబుల కేశవపురం వైపు పరుగు పెడుతోంది. ఆ ఊరు చిన్నదే అయినా రోడ్డు మాత్రం బాగుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చేలు..మధ్య మధ్యలో గుట్టలు.. నల్లని తారు రోడ్డు..జవ్వని వాల్జడలా ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతోంది. అలా కొంతదూరం వెళ్ళాక కారు లెఫ్ట్ టర్న్ తీసుకుంది,, కారు మళ్లిన దగ్గర ప్రసన్న వెంకటేశ్వర స్వామీ దేవాలయం, ఓబుల కేశవా పురం అని సైన్ బోర్డు ఉంది.. అంటే ఒక పదినిమిషాల్లో గమ్యస్థానం చేరుతమన్న మాట. అంతవరకు ఎవరి ఆలోచనల్లో వారుగా ఉన్న మిత్రులం అలర్ట్ అయ్యాము. ముందుసీట్లో కూర్చున్న ప్రియ మేడం మరింత అలర్ట్ అయింది . లోకేషన్ మ్యాప్ ఆన్ చేసింది.. రూట్ మ్యాప్ సాయంతో సాఫీగా సాగున్న కారుకు ఒక్కసారి బ్రేకులు పడ్డాయి. అప్పుడే గుడి వచ్చిందా అని చూస్తే.. ఎడమ వైపున గ్రామపంచాయతి కార్యాలయం, కుడి వైపున పెద్ద చెట్టు.. దానికింద ఆంజనేయస్వామి గుడి.
లోకేషన్ మ్యాప్ ఎడమ వైపు దారి చూపుతోంది. రోడ్ మాత్రం ఫర్లాంగ్ దూరంలో కుడివైపునకు మళ్ళింది. ఎడమవైపున పంచాయతి కార్యాలయం కంపౌండ్ వాల్ ఆనుకోని చిన్న సందు ఉంది. అతికష్టం మీద కారు వెళ్ళొచ్చు. కాని కారు దిగి చూస్తే ఎదురుగ ఒక ఇల్లు కనిపిస్తుంది. అవతలకు కారు వెళ్ళే చాన్స్ లేదు. దీంతో గుడికి వెళ్ళాలంటే ముందుకెళ్ళి కుడివైపు వేళ్ళలా? లేక పంచాయతి ఆఫీసు పక్కెంట ఎడమవైపు వెళ్ళాలా అనే మీమాంసతో డ్రైవర్ కారు ఆపిండు, కార్లో ఉన్న వాళ్ళందరం కొత్తోళ్ళమే కింకర్తవ్యం? ప్రియ మేడం గారు ఆ వూరి వ్యక్తికి కాల్ చేయక తప్పింది కాదు. ఆ కాల్ తో లోకేషన్ మ్యాప్ చెప్పిందే కరెక్ట్ అని తేలినది. మల్లేష్ కారును కంపౌండ్ వాల్ పక్కెంట ముందుకు పోనిచ్చాడు. కొద్ది ముందుకు వెళ్ళగానే ఎదురుగ ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళక ముందే కుడివైపున ” ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ” అని రాసిఉన్న ఆర్చ్ దర్శనం ఇచ్చింది.
ఆర్చ్ కింది నుంచి ఆలయం వద్ద వెళ్లి ఆగింది.. అంతకు ముందే ఓక వాహనమ ఆగి ఉంది అక్కడ . అయితే అది మోడిఫై చేసిఉంది. చాన్నాళ్ళుగా అది అక్కడే ఉందన్న సంగతి ఆ జీప్ ను చూస్తే అర్ధమైంది. దాన్ని ఉత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కు వినియోగిస్తారని గుడికి కాపలాగా ఉండే వ్యక్తి ద్వారా తెలుసుకున్నాము. కార్ పార్క్ చేసి గుడిలోకి వెళ్లేందుకు మున్దుకు కదిలాము.అయితే గుడి ప్రాంగణంలోకి వెళ్లేందుకు అక్కడ ఒక చెక్క గేటు ఉంది. ప్రాంగణం చుట్టూ కంచే. గేటు తీసుకొని లోపలి వెళ్తుంటే గుడి వరకు నాపరాతి బండలతో దారి ఉంది.. ఆ దారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా కుడా ఏర్పాటు చేసారు. లోనికి వెళ్తుంటే..కుడివైపున ఒక కట్టడం ఉంది. దాని పైకప్పు పిరిమిడ్ లా ఉంది. కింద నాపరాతి బండలతో ఫ్లోరింగ్ . చుట్టూ కూర్చునేందుకు వీలుగా రెండు ఫీట్లంత గోడ, మధ్యలో హోమాలు, యజ్ఞాలు చేసుకునేందుకు వీలుగా ఆ నిర్మాణం ఉంది.. అదే విషయాన్ని కాపలాదారు ధ్రువీకరించారు. గుడిలోకి ప్రవేశించకముందు కనిపించిన మోడిఫై చేసిన వాహనం, హోమాలకోసం చేసిన నిర్మాణం నిర్మించిన నిర్మాత ముందు చూపు అద్దం పడుతోంది.
ఇంకాస్త ముందుకు వెళితే యజ్ఞ మండపం వెనకాల ఒక కోనేరు. మధ్యలో చక్రతల్వార్ శిలా విగ్రహం.. అంటే ఉత్సవాల చివరిరోజు చరస్నానం కోసం దీని నిర్మించారు. కోనేరు ఏడు అడుగులు ఉంటుందనుకుంట.. ఆలయం లోకి ప్రవేశించే దారికి ఎడమ వైపున చక్కని పూదోట. తోటకు మధ్యలో మరో కోనేరు.. దాని మధ్యలో కాళీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని శిల్పం చూడ ముచ్చటగా ఉంది. అందులో జీవకళ ఉట్టిపడుతోంది. రెండు కోనేర్లు దాటుకొని ముందుకు వెళ్తే ఆలయ ముఖమండపం. ఎదురుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గర్భాలయం. స్వామి గర్భాలయానికి ఇరువైపులా శ్రీ దేవి, భూదేవిల అనుబంధ ఆలయాలు. మేము వెళ్ళే సమయానికి పూజారి లేడు . కాకపోతే ఆలయం తలుపులు తీసి ఉన్నాయి. కాని ఇనుప సువ్వలతో చేసిన జాలి వేసి ఉంది.. జాలి రంధ్రాల్లో నుంచి స్వామిని దర్శించుకున్నాము. స్వామీ నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే ఏదో ఆధ్యాత్మిక భావన. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ప్రణమిల్లి ముఖ మండపంలో కూర్చున్నాము. ఇంతలో ఆలయ కాపలాదారు వేడి వేడి కాఫీ అందించారు. అప్పటికి అదే ప్రసాదం అనుకొని ..హాయిగా సేవించాం.
చెప్పడం మరిచాను .. ఆర్చ్ నుంచి లోనికి వచ్చేప్పుడు ఎడమ వైపున ఒక గది ఉంది. అది కాపలా దారుని కోసం నిర్మించింది. కాస్త ముందుకెళితే ఒక పాక. అది నిర్మాణంలో ఉన్న గోశాల అని చాడు కాపలా దారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక కళ్యాణ మండపోం నిర్మాణంలో ఉంది. ఇక ఆర్చి నుంచి లోనికి వచ్చేప్పుడు.. కుడివైపున ఒక పార్కు. పిల్లలు ఆడుకోడానివీలుగా… ఇక పార్క్ కు వెంక భాగంలో విశాలమిన్ స్థలం. అందులో ఒక అందమైన ఇల్లు.. గుడి లోంచే అందులోకి వెళ్లేందుకు మార్ఘం ఉంది.. అది ఐఎఎస్ అధికారి గెస్ట్ హౌస్ అని చెప్పాడు. మాకు సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ. మేము గుడికి వస్తున్నామని తెలిసి బుర్రా వెంకటేశం గారు అతన్ని మాకు తోడుకోసం పురమాయించారు. . సదరు అధికారి చిన్నప్పుడు ఇక్కడే పెరిగాడా అని ఆరాతీస్తే.. ఆ స్థలం సారు చిన్నప్పుడు ఆడుకున్న పొలాలు. గుడికోసం అక్కడ దాదాపు ముడు ఎకరాలు సేకరించి గుడితో పాటు గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్న మాట. ఈ విషయం తెలియడంతో బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇల్లు చూడాలన్న ఆత్రుత. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఊరిలో ఉన్న సార్ ఇంటికి తీకేళ్ళా రు.
ఇంటితో పాటు ఊరు చుదోచ్చన్న ఆలోచనతో కారును గ్రామపంచాయతి ఆఫీసు వద్దకు తీసుకు రమ్మని మల్లేష్ కు చెప్పి.. నడుచుకుంటూ బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇంటికి వెళ్ళాము.. మేము వెళ్ళిన దారి ఎక్కువగా చిన్న చిన్న సందులు. బుర్రా వెంకటేశం గారి ఇల్లు న్ముదర్రాలు ఉంది అయితే దాన్ని మోడిఫై చేశారు. ఇంటిముందు రేకులతో వసార.. లోనికి వెళితే ఎవరయినా వస్తే కూర్చునేందుకు హాలు.. దానికి వెనకాల వంట గది.. పక్కనే బెడ్ రూం ..బొత్ రూ కూడా కలిప[ఐ ఉంది.. బొత్ రూం ముందు డ్రెస్సింగ్ రూం.. ఇదంతా వింటుంటే ఒక భవనం లా అనిపిస్తది. కాని ముడు అర్రాల విస్తీర్ణం లోనే చాలా పొందికగా తల్లి కోసం నిర్మించారు. ఇంటి ముందు బాతుంది పైకి వెళ్లేందుకు.. ఇంటి ముందు మాత్రం చెలక ఉంది, అందులో రెండు చింత మానులు ఉన్నాయి. ఎదయినా ఫంక్షన్ జరిగోఇతే చెట్ల కింద శుబ్రం చేసి ..షామియానాలు వేస్తే ఒక వందమందికి ఒకేసారి భోజనం వద్దిన్చెంత ఖాళి స్థలం అది. బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూసి బయటకు రాగానే ఇల్లు కుడివైపున ఉన్న వాళ్ళ దాయాదుల ఇల్లు చూసాము. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది. ఎందుకంటే తస్న పెళ్ళయిన దగ్గర నుంచి, కొడుకు పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న మూడు అర్రల మిద్దెను వదిలి విశాలమైన ఇంట్లోకి కొడుకుతో పాటు వెళ్లేందుకు తల్లికి ఇష్టం లేదు. అందుకే తల్లి కోసం గెస్ట్ హౌస్ కట్టించినా.. తాను పుట్టిపెరిగిన ఇంటిని తల్లి కోసం మోడిఫై చేయిన్చారు బుర్రా వెంకటేశం గారు. అంతే కాదు తాను ఐఎఎస్ అధికారి అయినప్పటికీ ఊరికి వస్తే ఆ చిన్న ఇంటిలోనే తల్లి తోపాటు భోజనం చేసేవాడట… ఢిల్లీ కి రాజయినా ఆ తల్లి కొడుకే కదా.
బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూశాక ఆయన చదువుకున్న బడి చూడాలని ఆకాంక్ష. కారు దగ్గరకు వెళ్లి అందులో బడి వద్దకు వెళ్ళాము. ఆ రోజు బడికి సెలవి. బుర్రా వెంకటేశం గారు చదివినప్పుడు అది ప్రాధమికోన్నత పాత శాల. ఇప్పుడు ఉన్నత పాటశాల. ఇపుడు బిల్డింగులు బాగానే ఉన్నాయి.. అప్పట్లో మాత్రం ఒకే బిల్డింగ్.. బుర్రా వెంకటేశం గారు అక్కడ ఐదు వరకే చదివారు. ఆ తర్వాత ఆరు నుంచి సర్వేలు గురుకులంలో చదివారు.. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ చెప్పే కొన్ని విషయాలు విన్నాక పల్లెటూరి కబుర్లు తెలుసు కోవాలన్న ఉత్సుకతను నాలో పెంచాయి.. అంతే మాకు హెల్ప్ చేసేందుకు వచ్చిన వ్యక్తికీ చెప్పి అరవై ఎండ్ల వయసున్న వ్యక్తితో మాట్లాడుతాను ఎవరైనా ఉంటె పిలిపించమని అడిగాను. అతను సరే అని ఒక అరవై యేండ్ల పెద్దమ్మను బడి దగ్గరకు తీసుకోచ్చాడు .
ఆమె వచ్చే వరకు నేను తరగది ముందున్న అరుగు మీద కూర్చొన్నా.. ఆ పెద్దమనిషిని చూసి ..పెద్దమ్మా దా ..అంటూ పిలిచా. ఆమె ఎలాంటి అరమరికలు లేకుండా వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమెది పుట్టిన ఊరు అది కాదు. పదవ ఏట పెళ్ళయి అత్తగారింటికి వచ్చింది. అంటే ఓబుల కేశవాప్పురంతో పెద్దమ్మ అనుబందం యాబై ఏళ్లు. ఆమె యాబై ఏళ్లుగా ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు పూసగుచ్చి నట్లు చెబుతోంది. నేనే కాదు మా మిత్రులు కూడా ఆశ్చర్యంగా వింటున్నారు.
ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ. అందుకు పెద్దమ్మే సాక్ష్యం. ఇక గ్రామాల్లో పెళ్ళిళ్ళు పెరంటాల్లప్పుడు తప్ప పెద్దగ కు;లం పట్టింపులు లేవు. పైగా చిన్న పెద్ద అని లేకుండా వరసలు పెట్టి పిలుచుకోవడం వళ్ళ ప్రజల మధ్య వారికే తెలియకుండా ఆత్మీయతతో కూడుకున్న అనుబంధం ఉండేది. అక్క , చెల్లి, చిన్నమ్మ, పెద్దమ్మ , మామయ్య, చిన్నాన్న, పెద్దమ్మ ,ఇలా వరుసలు పెట్టి పిలిచుకోవడం మూలంగా ఊరంతా ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది . అంతెందుకు నేను ఆ పెద్ద మనిషి పేరు అడగలేదు. పెద్దమ్మ అని పిలువగానే వచ్చి సాంత్కొడుకు;లా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ముందు, వెనుక ఆలోచించకుండా సమామాదానాలు చెప్పింది. అప్పట్లో జానపదులు మనస్సుల్లో కల్మషం ఉండేది కాదు. ఆ పిల్లోడయితే చిన్నప్పుడు ఎలా పలుకరించేవాడో..ఇప్పుడు కలెక్టరు అయ్యాక కూడా అంతే అప్యాయంగా పలుకరిస్తాదంటు… బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారి గురించి చెప్పిన తీరు అందుకు అద్దం పడుతోంది. యాబై ఏళ్ళ క్రితం ఊరిగురించి, ఊళ్ళల్లో జరిగే పండుగలు , శుభకార్యాలు, వ్యక్తుల గురించి పెద్దమ్మ చెబుతుంటే చెవులు రిక్కించి వినడం మా వంతయింది.
_**
ఆరోజు భరత్ భర్త్ డే!
“గుడ్ మార్నింగ్ అండ్ హాపీ భర్త్ డే డాడీ” అంటూ పిల్లలు వరుణ్, పవన్ ,
“మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ అతడి భార్య దివిజ అభినందనలు తెలిపారు.
“థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ”అంటూ ఆనందంగా అందరినీ హగ్ చేసుకున్నాడు భరత్.
భర్త్ డే ఆదివారం కావడంతో ఇంట్లో అందరూ ఎంతో ఉత్సాహంగా వున్నారు.
“ఈరోజు నా భర్త్ డే సందర్భంగా..ఇంట్లో అమ్మకు వంటపని లేకుండా కేక్ తో పాటు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము ఓకేనా?”
“ఓకే డాడీ.. అలాగే చేద్దాం” అంటూ సంబరంతో ఎవరికేది ఇష్టమో ఆ లిస్ట్ మెన్షన్ చేశారు పిల్లలు!
టిఫిన్ కార్యక్రమం తర్వాత, ముందురోజు ఆల్టరేషన్ కని ఇచ్చిన తన కొత్త డ్రస్ తెచ్చుకుందామని వెళ్లి తిరిగొచ్చేటపుడు, గేటుదాకా వచ్చిన భరత్ వర్షం చినుకుల కారణంగా ర్యాంప్ మీద కాలు జారి కింద పడిపోయాడు!
“అయ్యో డాడీ” అంటూ ఆందోళనగా తండ్రిని పట్టుకొన్న పిల్లలు “మమ్మీ.. డాడీ కింద పడ్డాడు” అంటూ కేకేశారు. ఆదుర్దాగా అటువచ్చిన దివిజ పిల్లల సాయంతో భర్తను లేవనెత్తింది. కుడికాలికి గేటు దిమ్మె తగిలి బాగా నొప్పి కావడంతో, భార్య భుజంపై వేసి, పిల్లల ఆసరాతో ఇంట్లోకి నడిచివచ్చి మంచంపై వాలిపోయాడు భరత్. కదలనీయని కాలిబాధతో “అమ్మా..అబ్బా” అంటూ తల్లడిల్లిపోతున్న భరత్ ను, పక్కింటాయన సాయంతో క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్కానింగ్ చేసి, కాలి మడమ దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి కాలికి బ్యాండేజ్ వేశారు హాస్పిటల్లో!
*********
“ఎలా వుంది భరత్ ? నీవు కిందపడ్డావని, కాలికి లైట్ ఫ్రాక్చర్ అని తెలిసి వచ్చాను. డాక్టర్ ఏమన్నాడు?” అని అడిగింది పక్క కాలనీలో వున్న, అప్పుడే అక్కడికొచ్చిన భరత్ మేనత్త మీనాక్షి.
“రెండు నెలలు రెస్టు తీసుకొమ్మని చెప్పి, క్యాల్షియం టాబ్ లెట్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇంటికి పంపించారత్తమ్మా” అన్నాడు భరత్ నీరసంగా.
“కాలు బాగా బాధ పెడుతోందా?” ఆర్తిగా అడిగింది మీనాక్షి.
“బాగానే బాధపెడుతోంది.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తప్ప నిన్నటినుండీ నిదురకూడా పట్టడంలేదు!” మూలుగుతూనే అన్నాడు భరత్.
“పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం అంత మంచిదికాదు కదా.. నొప్పికలవాటుపడుతూ మెల్లమెల్లగానూ సహజంగానూ కంట్రోల్ కావడమే కరేక్టేమో కదా”
“అమ్మో అత్తమ్మా అది నావల్ల కావడం లేదు.. పెయిన్ కిల్లర్ వేసుకోకుంటే పెయిన్ నన్ను కిల్ చేసేలా వుంది!”
బాధగా మూలుగుతూనే అన్నాడు భరత్ .
“అయ్యో భరత్ నీ భర్త్ డే నాడే ఇలా జరగడం బాధగా అనిపిస్తుందిరా!”
” నా సగం అదనపు బాధంతా అదేకదా అత్తమ్మా.. ఎంతో ఉత్సాహంగా వున్న ఇంట్లోని వాళ్లనంతా నిరుత్సాహపరిచిన ఫీలింగ్ నన్ను అంత తొందరగా హీలింగ్ కానివ్వదేమోననిపిస్తుంది!”
“బాధపడకు భరత్.. వాళ్లు నీ ఫ్యామిలీ మేంబర్సేగా.. కష్టం సుఖం కలిసి పంచుకోవలసిన వాళ్లేకదా! అవునూ ఇంతకూ నీ పుట్టినరోజుకు ఎవరెవరిని ఆహ్వానించివుండిన్నవు?”
“ఎవరినీ లేదు.. ఓన్లీ ఫ్యామిలీమెంబర్స్ అంతే!”
మూలుగుతూనే అప్సెట్ మూడ్ తోనే అన్నాడు
” అన్నట్టు నేనోమాటడుగుతాను బాధపడవుగా భరత్ ?”
“బాధెందుకత్తమ్మా.. మొదటినుండీ నువ్వు నాకు ఎన్నో చెప్పేదానివి.. వెల్ విషర్ వే కాదు నాకు రోల్ మోడల్ వి కూడా! నువ్వంటే నాకెంతో గౌరవం అభిమానం!”
“థ్యాంక్యూ భరత్.. అదే చనువుతో అడుగుతున్నాను.. నిన్నటి నీ జన్మదిన సందర్భం లో పాల్గొనేది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అన్నావు.. ఎవరెవరి గురించి అన్నావు?”
“ఇంకెవరు ఫ్యామిలీ అంటే భార్య దివిజ, పిల్లలు వరుణ్ పవన్ లు.. అంతేకదా అత్తమ్మా!”
” అంతేనా భరత్.. నీ జన్మదిన పర్వంలో ప్రధానంగా పాల్గొనవలసినవాళ్లింకెవరూ లేరా?”
“అంతకన్నా ముఖ్యమైనవాళ్లింకెవరుంటారు?”
“వుంటారు.. వున్నారు భరత్.. నీ జన్మదినవేడుకల్లో పాల్గొనవలసిన వాళ్లలో అందరికన్నా అతిముఖ్యమైన వ్యక్తి ఎవరంటే.. నీకు జన్మనిచ్చి, నీకోపుట్టినరోజును కల్పించిన మీ అమ్మ శాంతమ్మ!”
“అత్తమ్మా” ఆశ్చర్యం కలవరం కలగలిసిన స్వరంతో అన్నాడు భరత్ .
” అవును భరత్ ఆలోచించు.. నీవు కడుపున పడిననాటినుండీ తొమ్మిది నెలలు గర్భవికారాలను భరించిమరీ నీబరువును మోసిన భూమాతకాదా నీ జన్మదాతగా మీ అమ్మ?”
అవును అన్నట్టు తలాడించాడు అంతలోనే కదిలిన కాలి బాధతో “అమ్మా” అని మూలిగాడు భరత్.
“చూడు భరత్ నీ కాలికి అయిన చిన్న హెయిర్ లైన్ క్రాక్ కే ఇంతలా ఇబ్బంది పడుతున్నావ్.. కానీ.. కానీ.. నీ తల్లి తన ప్రసవవేదన సమయంలో ఎంతబాధ భరించివుంటుందో ఊహించనైనా ఊహించివుంటావా?” అంటున్న మీనాక్షి కంఠం వణికింది. వింటున్న భరత్ భారంగా బాధ వ్యక్తపరుస్తూనే అయోమయంగా చూశాడు.
“భరత్.. నేనీమధ్యే ఒకలేడీ డాక్టర్.. అందునా ప్రసవానుభవంవున్న గైనకాలజిస్ట్ చెప్పగా విన్నాను.. ప్రసవ సమయంలోని నొప్పి స్థాయిని అంచనావేసేది, జీరో టు టెన్ పాయింట్ ఫైవ్ దాకా వుండేది డోల్ స్కేల్ అనేదాని మెజర్ మెంట్ ప్రకారం.. దాదాపు దాని చివరి సంఖ్య దాకా తాకే బాధ ప్రసవవేదనేనట! అలాగే మరో అంచనా ప్రకారం, సగటున మానవశరీరం భరించగలిగేది 45యూనిట్ల బాధ మాత్రమేనట! కానీ.. కానీ.. పురిటినొప్పుల్లో మాత్రం ఆ మాతృమూర్తి భరించే బాధస్థాయి 57యూనిట్లదాకా వుంటుందట.. అంటే అది మామూలు బాధకాదుకదా భరత్ ?”
“అత్తమ్మా” చిన్నగా భరత్ కంఠం కంపించింది.
“అవును భరత్.. బాధయొక్క ఆఖరి అంచుకు చేరిన ఆపురిటినొప్పి స్థాయిని అంచనావేయగలమా? ఒకేసారి 20 ఎముకలు విరుగుతున్నంత బాధ వుంటుందట! చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కే నీవింత హైరానా పడుతున్నావ్ .. కానీ.. నీకు జన్మనిచ్చిన, నీ జన్మదినానికి కారణమైన నీతల్లి నీకు జన్మనిచ్చేవేళ, అంతటి ఆ పురిటినొప్పులనెలా భరించి నిన్నీలోకంలోకి తీసుకొచ్చిందో అర్థంచేసుకోగలవా?”
“అమ్మా” అప్రయత్నంగా భరత్ కంటివెంట నీటితోపాటు నోటివెంట ఆమాట వచ్చింది.
“భరత్ దీన్నిబట్టి నీకింకా ఏమర్థమవుతుంది.. ప్రసవ సమయంలోని మరణావస్థను దాటి నీకు జన్మనిచ్చిన తల్లికూడా మరోజన్మ ఎత్తిందన్న సత్యం అందులో వెల్లడి కావడం లేదా? నీ పుట్టినరోజు నీ ఒక్కడిదేకాదు, అది నీతల్లి మళ్లీ పుట్టినరోజు అని గుర్తించలేకున్నావా?”
భారమైన, సంచలనాత్మకమైన భావాలతో క్షణం కళ్లు మూసుకున్నాడు భరత్.
“నీ పుట్టుకకు ఆధారమైన, నీ పుట్టినరోజు వేడుకకు కారణమైన, అందరికన్నా ముందు నువ్వు నీ తల్లిని తలచుకోవలసిన రోజు.. నీ తల్లితో కలిసి నీ జన్మదినాన్ని నీ జనని జన్మదినంగా కూడా జరుపుకోవలసిన దినం.. అలా ఎలా మరిచిపోయావు మీ అమ్మ శాంతమ్మను?”
హితవైన మందలింపుతో కూడిన ఆ ప్రశ్నతో , ఎంతో ఆవేదన, అంతులేని ఆర్ద్రతా భావం కలిగింది భరత్ లో!
“అమ్మా.. నన్ను మన్నించమ్మా” అంటూ అమ్మను తలుచుకుని, అమ్మ యొక్క తనజన్మ భారాన్ని తెలుసుకొన్న ఆ వేదనాస్పందన అనేది తన హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బాధను తేలికపరిచినట్టనిపించి, పెయిన్ కిల్లర్స్ తో పనిలేదనిపించింది భరత్ కు!
తన తల్లికి కొత్త జన్మనిచ్చిన తన జన్మదినం.. తన జనని జన్మదినం అనికూడా అనిపించి తన మాతృమూర్తి పట్ల ఒక అమృత భావన కలిగిందతడిలో!
“అత్తమ్మా.. అమ్మను మరిచి జరుపుకున్న ఇన్నేళ్ల నా జన్మదినాలన్నీ నిరర్థకమైనవే! ప్రసవవేదన అనే మరణావస్థను కూడా మధురబాధగా భరించి నాకు జన్మనిచ్చి తాను మళ్లీ జన్మించిన నాతల్లితోనే ఇకపైన నా జన్మదినాలన్నీ! కొత్తగా నాకు మాతృదర్శనం కలిగించి, సత్య సందర్శనం గావించిన నీకు వేనవేల ధన్యవాదాలత్తమ్మా!” అంటూ మేనత్త చేతుల్ని తన చెమరించిన కళ్లకద్దుకున్నాడు భరత్!
*********
కె. వీణారెడ్డి,
హైదరాబాద్.
7337058025
అమ్మగారు ఓ అమ్మగారు! అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది కుమారి.
లోపలికి వచ్చిన కుమారికి హాల్లో ఎవరు కనిపించలేదు.
“అదేంటి ఈపాటికి పెద్దమ్మ గారు వంట చేస్తూ, వంటింట్లో కనిపిస్తారు. ఈరోజు చడీ, చప్పుడు లేదు. ఆరోగ్యం బాగాలేదా ఏంటి?”అని అనుకొని పెద్దమ్మ అనబడే దమయంతి గదిలోకి వెళ్ళింది.
అప్పటికే దమయంతి స్నానం చేసి, పూజ చేసుకున్నట్లు కనిపించింది. కానీ రోజు వంటింట్లో ఉండే బదులు ఈరోజు గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చునిఉంది.
“ఇక్కడ ఉన్నారామ్మా! వంట అయిపోయిందా? లోపల లేకుంటే ఒంట్లో బాగా లేదేమో అనుకొని వచ్చానమ్మా”అన్నది కుమారి.
“ఒంట్లో బాగానే ఉంది. రోజు వంటింట్లో పని చేసి, చేసి చిరాకు వచ్చేసింది. ఎవరికి బాధ్యత లేదు
నేను చేసి పెట్టడం అందరూ కూర్చొని తినడం”అనీ దమయంతి కొంచెం కోపంగా అన్నది.
“అదేంటమ్మా? ఎప్పుడు సంతోషంగా పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు అంత మాట అనేసారు”అన్నది కుమారి.
“నువ్వు వెళ్లి పని చేసుకో కుమారి”అంటూ పుస్తకం చదవటంలో నిమగ్నం అయ్యింది దమయంతి.
“కోడలమ్మ ఏం చేస్తుందో చూస్తాను. అయినా ఆ అమ్మాయి ఆలస్యంగానే లేస్తుంది కదా”అనుకుంటూ కోడలు వినీల గదిలోకి వెళ్ళింది.
అప్పటికే లేచి కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది వినీల.
“వినీలమ్మ కూడా పని చేసుకుంటూ ఉంది. ఆలస్యంగా లేచినా, వినీలమ్మ తాను మొదటిసారి టీ తాగుతూ, అత్తగారికి ఓ కప్పులో ఇస్తుంది. ఇద్దరు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. ఈరోజు ఏంటి! చెరొక గదిలో కూర్చున్నారు”అనుకుంటూ..
“వినీలమ్మ! ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే ఏం చేస్తున్నారో అని ఇక్కడికి వచ్చాను. చాయ్ తాగారామ్మ! మీఅత్తమ్మ నువ్వు ఇద్దరు కూర్చుని తాగుతారు కదా”అన్నది కుమారి.
“నాకు చాయ్ పెట్టుకునే ఓపిక లేదు. అవసరమనుకుంటే ఆమె పెట్టుకొని తాగుతుంది”అన్నది వినీల.
ఇదేంటబ్బా? ఎప్పుడూ లేనట్లుగా వీళ్ళిద్దరూ ఎడ ముఖం పెడ ముఖం గా ఉన్నారు” అనుకున్నది.
తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టింది కుమారి.
కుమారి ఇలా ఎందుకు ఆలోచించిందో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మనకి అర్థం అవుతుంది.
పొద్దున్నే కాలింగ్ బెల్ మోగ గానే దమయంతి తలుపు తీస్తుంది.
” కప్పులో టీ పోసి పెట్టాను. తాగి పని చేసుకో కుమారి”అని నవ్వుతూ చెప్పింది దమయంతి.
“నాకు చాయ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవు నువ్వు ఎన్ని పనులున్నా, రోజు ఇక్కడే టీ తాగి వెళ్తానమ్మ”అన్నది కుమారి టీతో పాటు దమయంతి ఇచ్చిన బిస్కెట్ టీలో ముంచుకుని తింటూ.
“ఒక్కదానివే పని అంతా చేస్తావు. నీకు కష్టం అనిపించదా అమ్మా” అన్నది కుమారి.
“మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కష్టమంటే ఎలా? అయినా ఎవరికి చేస్తున్నాను? నా కొడుకు ,కోడలు మనవళ్ళుకే కదా”అన్నది దమయంతి సాంబార్లో పోపు వేస్తూ..
“మా అత్తయ్య అయితే ఒక్క నాడు ఇంత పని చేయదమ్మ. నేను ఇళ్లలో పనిచేసే ఇంటికి పోయి, నేనే చేసుకోవాలి. తిని బిడ్డ ఇంట్లో పోయి కూర్చుంటది. నా పిల్లలు మాత్రం తన మనవళ్లు కాదా? అన్నం అయినా తినిపించవచ్చు కదమ్మ! మీరు చేసేది మంచి పని. కోడలును ఇలా చూసుకోవాలి”అన్నది బాధగా.
“అయ్యో! చేస్తే ఏమైంది ?రెక్కలు ఏం కట్టుకుపోతామా? నలుగురికి చెయ్యని చేతులు ఏం చేతులు?”అన్నది దమయంతి.
ఎనిమిది గంటల వరకు రోజు స్నానం పూజ వంట ముగించేది.
నెమ్మదిగా లేచిన కోడలు, తాను చాయ్ పెట్టుకుని, అత్తగారికి ఒక కప్పు ఇచ్చి, తాను కూడా పక్కనే కూర్చుంటుంది.పిల్లలకు బాక్సు లు కూడా దమయంతి పెడుతుంది.
ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఇంట్లోకి కావలసిన సరుకులు, పిల్లల బట్టలు, చదువులు ఇలా ఎన్నో.
ఆ తర్వాత వినీల కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. పనిమనిషి పని అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత తోచిన పారాయణం చదువుకొని, పిల్లలకి వచ్చే వరకు ఏదైనా చేద్దామని ఆరాటంలో ఉంటుంది దమయంతి. ఊరికే ఉండడం అంటే అసలే నచ్చదు. భర్త పోయి దాదాపు నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఊరు విడిచి ఉన్న ఒక్క కొడుకు దగ్గరే ఉంటుంది వీలైనప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉంది.
కొడుకు, కోడలు కూడా దమయంతికి బాగా గౌరవం ఇస్తారు. గౌరవంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు.
అన్ని విధాల అమర్చిపెట్టే అత్తగారంటే దమయంతికి ఎనలేని అభిమానం. తాను వర్క్ చేసుకుంటుంటే టీ తెచ్చి పెట్టడం, స్నాక్స్ ఇవ్వడం చేస్తుంది దమయంతి.
“నేను వచ్చి చేస్తాను కదా అత్తయ్య! ఎందుకు మీరు కష్టపడతారు”అని అన్నది వినీల.
“ఈ పనులు నేను చేయగలనమ్మ! నీ ఉద్యోగం నేను చేయగలనా? అందుకే నాకు వచ్చిన పనులు నన్ను చేయని, ఊరికే కూర్చొని మాత్రం ఏం చేస్తాను? మీకు ఏదైనా చేసి పెడితే నాకు సంతోషంగా ఉంటుంది. మీ మామయ్యకి కూడా అంతే, ఎప్పుడూ మీ గురించే ఆలోచించేవాడు”అన్నది కొంచెం బాధగా దమయంతి.
నవ్వుతూ టీ కప్పు అందుకున్నది వినీల.
సెలవులు ఉన్నప్పుడు మాత్రం దమయంతిని ఒక్క పని చేయ నీయకుండా అంతా తానే చేసుకునేది వినీల. బయటకు వెళ్తే తప్పకుండా దమయంతి రావాల్సిందే.
“వాళ్లకి ప్రైవసీ లేకుండా తాను వెళ్లడం ఎందుకు” అని ఎన్నోసార్లు వద్దని చెప్పినా, వినకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు.
అత్తగారికి కావలసిన వస్తువులు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు కొనుక్కొని వస్తుంది వినీల.
దమయంతి ఎప్పుడైనా బయటకు వెళ్తే, కోడలు కోసం ఎన్నో వస్తువులను తెస్తుంది.
అప్పుడప్పుడు వీళ్ళతో కొడుకు రాకున్నా,వీళ్ళిద్దరూ మాత్రం వెళ్లడం పక్కగా ఉండేది.
ఇలా ప్రశాంతంగా సాగుతున్న కుటుంబంలోకి ఒక చిన్న రాయి అడ్డంగా వచ్చింది. అంతే పరిస్థితి అంతా తారుమారు అయ్యింది.
ఒక రోజు ఇంటికి ఒక దూరం బంధువు వచ్చింది. ఇక్కడ నగరంలో ఏదో పని ఉందని, వారం రోజులు ఉండిపోయింది. ఉన్న మనిషి తిని ఊరికే ఉండక, ఇటు దమయంతి మనసు, అటు వినీల మనసును పాడు చేసింది.
పొద్దున్నే వంటింట్లో హడావుడిగా ఉన్న దమయంతి దగ్గరికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన దయ్యపు మనిషి.
“దమయంతి వదినా! ఇంత వయసు వచ్చినా, నీకు వంటింటి పని తప్ప లేదన్నమాట. హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపే వయసులో, ఈ పనులన్నీ చేసుకోవలసి వచ్చింది”అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ.
“నా చేతుల్లో శక్తి ఉంది చేస్తున్నాను. అయినా ఎవరికి చేస్తున్నాను? నా పిల్లలకే కదా”అన్నది దమయంతి.
“నీ పిల్లలు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ వచ్చిన కోడలు అనుకోవద్దు ఇంత సేపైనా లేవలేదు. అత్తగారి వయసు అయిపోయింది .కాస్త యినా సహాయం చేద్దాం అనేది ఉందా? అదే నీకు కూతురు ఉంటే ఇలా చేసేదా వదిన! నువ్వే ఆలోచించుకో”అన్నది చుట్టపు దయ్యం.
ఇలా మూడు రోజులుగా ప్రతి దాంట్లో తాను వేలు పెట్టి, తాను ఎంత కష్ట పడుతుందో అనేది దమయంతి మనసులోకి బాగా ఎక్కించేసేది.
ఇక దమయంతి మధ్యాహ్నం పడుకున్న సమయంలో వినీల దగ్గరకు వెళ్లి..
“ఎంత కష్టపడి పోతున్నావు తల్లి! ఇటు ఆఫీసు పని, మళ్ళీ ఇంటి పని. అందులో మీ అత్తగారు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందాయే! మరో కొడుకు ఉంటే అక్కడికి నాలుగు రోజులు వెళ్లి వచ్చేది. మీకు ఇబ్బంది కదా! మీ భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెను తీసుకొని వెళ్లాల్సిందే, పాపం ఈరోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరున్నారే పిచ్చి తల్లి”అని వినీల దగ్గర మరో రాగం అందుకుంది.
“అదేంటి మా అత్తయ్య గురించి అట్లా అంటారు. పొద్దున వంటంతా తానే చేస్తుంది. బయటకు వెళ్తే మాతో వస్తుంది తప్పేంటి? బయట మేమిద్దరమే ఉంటామా ఏంటి? వేరే జనం ఉండరా”అన్నది వినీల చిరాగ్గా.
“మీ అత్తయ్య అంటే నీకు ఎంత ప్రేమనే తల్లి! కానీ ఆమె అలా అనుకుంటుందా? కష్టపడి నేనే పని చేస్తున్నాను అని పొద్దున్న అంటూనే ఉంది. పనిమనిషి తో కూడా నీ మీద ఏదేదో చెప్పడం నేను విన్నానమ్మ”అన్నది చుట్టపు దయ్యం.
“అదేంటి నేను అత్తయ్యను సొంత తల్లి లాగా చూసుకుంటే, ఇలా నామీద చెప్తోందా? వంట తానిష్టంతోనే చేస్తాను అన్నది కదా? లేకుంటే నేను చేసుకో లేనా?”అనీ బాధపడ సాగింది.
ఇటు దమయంతికి కూడా బాధ పెరిగింది. “ఇంటెడు పని నేనే చేస్తున్నాను. పోనీ చేస్తున్నాను అనే సానుభూతి కూడా ఎవరికీ లేదు. ఈ వయసులో నేను ఎందుకు చేయాలి? మా అత్తయ్య నాకు చేసి పెట్టిందా “?అంటూ ఆలోచించసాగింది.
చుట్టపు దయ్యం నాటిన విషపు బీజాలు ఇద్దరిలో మొలకలై, వృక్షాలై పెరిగిపోయాయి. అంతే ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి.
దమయంతి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది.
వినీల కూడా లేచిన తర్వాత తన టీ కప్పు తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
ఎప్పుడో మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి అన్నం ఒక కూర చేసి తాను ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది.
వినీల చేసిన కూర సహించని దమయంతి తాను ఏదో పచ్చడి ఒకటి చేసుకుని తినేస్తుంది. కొడుకు ఎక్కువగా ఆఫీస్ లో తింటాడు కాబట్టి ఈ కోల్డ్ వార్ అతనికి అర్థం కాలేదు. ఒకసారి వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి. కొడుకుకి విషయం అంత అర్థమయింది. “ఇద్దరు మాట్లాడుకోవటం లేదు కానీ కారణం తెలియదు.ఎలా ఈ సమస్యకు పరిష్కారం?” అనుకున్నాడు.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇల్లంతా అశాంతిగా ఉంది. మునుపటి సంతోషం లేకుండా పోయింది.
ఒకరోజు వినీల ఆఫీసుకు వెళ్లింది. అప్పుడు కుమారి వచ్చి దమయంతి దగ్గర కూర్చుంది.
“అమ్మగారు ఒక మాట చెప్తా. మీ అత్త కో డళ్ళిద్దరూ, తల్లి కూతుర్ల లాగా ఉండేవాళ్లు. ఎందుకు అమ్మ ఈమధ్య ఇలా అయిపోయారు?”అని అడిగింది.
“మీఅమ్మని అడగాల్సింది నన్ను ఎందుకు అడుగుతున్నావ్?”అన్నది దమయంతి.
“నాకు అర్థమైంది ఒకటి ఉందమ్మా! ఈ ఇంటికి ఒక చుట్ట పామే వచ్చింది. దయ్యం లాగా మీ మధ్య ఏదో పెట్టింది. అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వంటింట్లో ఉన్నంతసేపు మీతో ఏదో మాట్లాడేది. తర్వాత మీరు పడుకున్నప్పుడు వినీలమ్మ గదిలోకి వెళ్లి గుసగుసగా చెప్పేది. నాకు ఎలా తెలుసు అంటే, ఒకరోజు మధ్యాహ్నం పనికి వచ్చాను నేను. మీరు పడుకొని ఉన్నారు. ఆ గది ఊడుస్తుంటే ఆమె ఏదేదో చెప్తుంది. అప్పుడే అనుకున్నాను ఈవిడ ఏదో చిచ్చు పెడుతుంది అని ,అదే నిజమైందమ్మ. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి మీపచ్చని కుటుంబాన్ని అశాంతిపాలు చేసుకోవద్దమ్మ! నేను చదువుకోని దాన్ని. కానీ ఎన్నో ఇళ్లల్లో చూస్తున్నాను మీ ఇంట్లో ఉన్నంత మంచిగా ఎక్కడ ఉండరు .కలిసి ఉండండి అమ్మ”అని చెప్పింది.
దమయంతికి ఒక్కసారిగా విషయం అర్థమైంది.” అవును, ఆ చుట్టం వచ్చినప్పటి నుండి మనశ్శాంతి కరువైంది. ఆమె ఇవన్నీ చెప్పడం వల్లనే కదా నేను ఇలా చేస్తున్నాను” అనుకుంది.
దమయంతి మధ్యాహ్నం పడుకున్నప్పుడు, ప్రత్యేకంగా కుమారి ఇంటికి వచ్చి వినీల గదిలోకి వెళ్ళింది..
“చిన్నమ్మ నేనొక మాట చెప్తాను విను. మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఆ చుట్టపామేనమ్మ. పొద్దున పెద్దమ్మకి మీ గురించి ఏదేదో చెప్పేది. మధ్యాహ్నము ఆమె గురించి మీకేదో చెప్పింది. అప్పటినుండి మీ కుటుంబం లో కలతలు మొదలయ్యాయి. మీ ఇద్దరు మీదికి గొడవ పడకున్నా,మనసులో ఏదో దిగులు ఉన్నారు. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ఎప్పటిలాగా ఉండండమ్మ,! నా మాట వినండి”అని చెప్పి వెళ్ళిపోయింది.
వినీల కూడా ఆలోచించసాగింది. ఇంత చదువుకొని ఎవరో చెప్పిన మాటలు విని, నేను ఇలా అవడం ఏంటి? వెళ్లి అత్తయ్యను క్షమించమని అడుగుతాను” అని గదిలో నుండి బయటకు వచ్చింది.
అప్పుడే దమయంతి కూడా “నా వయస్సు, నా జ్ఞానం ఏమైపోయింది? ఎవరి మాటనో పట్టుకొని ఇలా అయ్యాను. చిన్నదైనా కోడలికి నేను క్షమాపణ చెప్తాను” అంటూ బయటకు వచ్చింది ఇద్దరూ ఒక్కసారిగా ఎదురుపడ్డారు.
ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరు ముఖాలలో బాధ కనిపిస్తుంది. మాటల్లో ఏమి చెప్పకుండా ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఒకరి మనసు ఒకరికి అర్థమయిపోయింది ఇద్దరి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. .తేరుకున్న దమయంతి,
“వినీల! మంచి టీ తయారుచేసి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్లే పని చేసుకో”అన్నది దమయంతి.
“మీరెళ్ళి హాల్లో కూర్చోండి. నేనే టీ పెట్టుకుని అలాగే ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాను”అన్నది వినీల.
సరే ఇద్దరం వంటింట్లోకెళ్లి చేసుకుందాం పద” అంటూ నవ్వుకుంటూ ఇద్దరు వంటింట్లోకి వెళ్లిపోయారు. మాటల్లో చెప్పలేని భావం వాళ్ళ మనసుల్లో కలిగింది. ఇకముందు ఏ చుట్టపు దయ్యాలకి వాళ్లు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు ఇద్దరిని చూసి సంతోష పడ్డాడు.
చిట్టి కథ
చైనీస్ బ్యాoబు అని ఒక చెట్టు యొక్క విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల కనిపించదు. కానీ ఓపికగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఐదవ సంవత్సరము కూడా ఆ నాటిన విత్తనాలకు నీళ్లు పడుతూ ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఆరువారాలలోనే 90 ఫీట్ ఎత్తు ఎదుగుతుంది. చూసేవాళ్ళందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తారు. అరే!!!! ఇన్ని రోజులు ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగే ఉన్నది ఇది. ఆరు వారాల్లో ఎంత ఎత్తు ఎదిగిపోయింది అని. కానీ చూసే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అది స్తబ్దుగా ఉంది కాదు కాదు ఉన్నట్లు కనిపించింది కానీ అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. వేర్లను బలంగా భూమిలోకి పాతుకపోయింది. పైన దాని యజమాని ఎంత కష్టపడ్డాడో, అది అంతకు రెట్టింపు భూమిలోనికి పాదుకొని పోయింది. దేనికైనా ఒక సమయం అంటూ వస్తుంది కదా!!!! అదే విధంగా దానికి కూడా సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా ఆకాశానికి ఎదుగుతుంది. దాని యజమాని నిరాశ పడి ఇది పెరగట్లేదు అని దానికి నీరు పట్టడం ఆపేస్తే ఆ మొక్క ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండేదేమో.!!! కానీ ఆయన అలా చేయలేదు .ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దానికి నీళ్లు పట్టేవారు .పోషణ అందించేవాడు. యజమాని ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఆ మొక్క కూడా భూమి లోపల తన పని తాను చేసుకుని అకస్మాత్తుగా అందరు ఆశ్చర్యపడే విధంగా ఆకాశానికి ఎదిగింది.అదేవిధంగా మనిషి కూడా అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకుని పనిని కల్పించుకొని నమ్మకంతో మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యేవరకు ఎదురు చూడగలిగితే అది తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు అంటారు కష్టేఫలి అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వండకుండా నోట్లోకి ముద్ద రావాలి అనుకునే అంత మూర్ఖత్వం. నిజాయితీగా కష్టపడితే ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక రోజుఫలితం తప్పకుండా దక్కుతుంది . ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సినవి ప్రకృతి మనకు నేర్పించేవి చాలా ఉంటాయి. సరిగ్గా శ్రద్ధ పెడితే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదిగానే కనిపిస్తుంది. తదనుగుణంగా మనం మసలగలిగితే అది మన ఎదుగుదలకు సహకరిస్తుంది. చిట్టి కథ గొప్ప సందేశం. నాకైతే బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనిపించి రాశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు
డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తెరిచిన జయప్రదకి బయట జయసుధ నిలబడి ఉండటం చూసింది.
“ఏంటి జయా! ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఉరుములేని పిడుగులా ” అన్నది నవ్వుతూ.
” లోపలికి రానిస్తావా లేదా?”అంటూ లోపలికి తోసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది.
ఫ్రిజ్లో నుండి చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్ తెచ్చి పెట్టింది జయప్రద.
చల్లగా గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమిత పడింది.
“ఇప్పుడు చెప్పు. ఈ అకాల ఆగమనానికి కారణం?”అన్నది జయప్రద.
“ఏమీ లేదే, మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది. అందంగా దమడమ ఇల్లు లాగా ఉంటుంది అనుకున్నాను”అన్నది జయసుధ ముఖం చిట్లిస్తూ.
“ఏంటి అద్దంలా మెరుస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది? పిల్లలు, ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి. రోజంతా తుడిచినయే తుడవటం కడిగినవే కడగటం చేయలేం కదా!”అన్నది జయప్రద ఆయాసంగా.
” మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను. ఇంతలో మా అత్తయ్య పిలిచారు.
తీరా ఎందుకు పిలిచారు, అని వస్తే యూట్యూబ్ లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి, మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు? అని పెద్ద క్లాసు. ఇలా రోజూ నస తో చంపేస్తుంది .ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను”అన్నది జయసుధ.
ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ చప్పుడు అయింది.
తలుపు తీసి చూసిన జయప్రదకు బయట శ్రీదేవి నిలబడి ఉంది.
“ఒసేయ్ శ్రీ, నువ్వేంటే ఇలా వచ్చావు. ఇప్పుడే జయసుధ వచ్చింది”అన్నది నోరు 70mm సైజ్ చేసి.
శ్రీదేవి కూడా లోపలికి వచ్చి కూర్చుంది. మంచినీళ్లు, కూల్ డ్రింక్ తాగింది.
తనది కూడా అదే సమస్య. ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి, “నువ్వు అలా ఎందుకు సర్దుకోవు?ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయి” అని అరుస్తున్నాడు.
“నా సంగతి అంతేనే! మా ఇంట్లో కూడా అదే గోల. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ..
“ఇది మాహాలు. ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి. ఇది సోఫా, సోలాపూర్ నుంచి తెప్పించాము. ఆర్డర్ చేసిన నెలకి వచ్చింది.
ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుంచి తెచ్చాము. దీన్ని ఇలా నీట్ గా సర్దితేనే నాకు ఇష్టం. ఇదిగో చూసారా దీనిమీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్స్లో అందంగా పెట్టాను. ఈ బాస్కెట్ బాంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇదిగో కిచెన్ చూడండి. ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా పెట్టుకున్నానో !ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుంచి పంపించింది. నాకు అన్ని డబ్బాలు నీట్ గా ఉండి, వాటిలో సామాను కూడా సర్దేసి ఉండాలి. కొంచెం డస్ట్ ఉన్నా నాకు అసలు నచ్చదు.
ఇప్పుడు మా బాత్రూంలోకి రండి. టట్టడాయ్! ఎంత బాగుందో చూసారా? అసలు ఎంత పరిమళం! ఎప్పుడు మా బాత్రూం ఇలాగే ఉంటుంది.
ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను. ఇదిగో ఈ షాంపు కంపుల సైట్ లో ఆర్డర్ చేశాను.
ఇదేమో వాష్ బేసిన్. అదేమో కమోడ్ దానిమీద కూర్చుంటాం అన్నమాట. మరి మీరు ఎలా కూర్చుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి”ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది. చివరికి బెడ్ రూమ్ లు కూడా వదలలేదు. ఆమె పెట్టుకునే ఇన్నర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది.
అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది. నువ్వు అస్సలు శుభ్రంగా పెట్టవు అంటూ.
అయితే మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలి. ఈ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందట. మనం ఒకసారి వెళ్లి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగి వద్దామా”అన్నది జయప్రద.
“నిజమా? ఈ కాలనీలో ఉంటుందా? వెళ్లి కలుద్దాం,ఆమె పేరు డమడమ”అన్నది జయసుధ.
“అయితే మరి వాళ్ళ ఇంటికి వెళితే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో! లేదో! ఏం చేద్దాం”అన్నది శ్రీదేవి.
“ఆమె చూడటానికి కూడా చాల అందంగా ఉంటుంది”అన్నది జయప్రద.
“ఆమె కోసం కొన్ని గిఫ్ట్ లు కొనుక్కొని వెళ్దాము. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు” అని అనుకోని, ముగ్గురు షాపులో ఖరీదైన గిఫ్ట్ లు కొనుక్కొని, వాళ్ళ ఇంటికి వెళ్లారు. గేటు దగ్గర ఎవరూ లేరు. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే, యూట్యూబ్ లో చూపినంత అందంగా ఏమీ లేదు. ఎక్కడి చెత్త అక్కడ పేరుకొని ఉంది. యూట్యూబ్లో వీడియో లో చూపించినప్పుడు, అందమైన పెద్ద రంగు రంగుల ముగ్గు కనబడింది. ఇప్పుడు కనీసం పాచి ఊడ్చినట్లు కూడా లేదు.
చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. నీళ్లు పోసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి. అన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టినట్లు ఉంది.
బెల్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. మురికి పట్టిన పాత నైటీ, ముఖమంతా ముడతలు, జుట్టంతా రేగిపోయి ఉంది.
“ఎవరు కావాలి” అని అడిగింది.
“డమడమ గారు కావాలండి”అన్నారు ముగ్గురు.
“నా పేరు డమడమ మీరు ఎందుకు వచ్చారు”? అని అడిగింది.
ముగ్గురు షాక్ తిన్నారు. ఈమె ఏంటి ఇలా ఉంది? ఎంతో అందంగా ఉంటుంది కదా వీడియోలో” అని అనుకొని మనసులో భావాలు బయట కనబడకుండా నవ్వుతూ..
“మీరంటే మాకు చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము. అని గిఫ్ట్ లను చూపించారు.
అవి చూడగానే నోరు తెరిచి పార పండ్లతో నవ్వింది.
లోపలికి రమ్మని పిలవగానే వెళ్లి సోఫాలో కూర్చున్నారు.
అందంగా ఉండనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది. సోఫాలో కుక్క పడుకుని ఉంది .కుక్క జుట్టు అంతా సోఫాల నిండా ఉంది. ఇల్లంతా దుమ్ము .ఎక్కడ సామాను అక్కడే ఉంది. అందంగా కనిపించే ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది.
యూట్యూబ్లో అందంగా కనిపించే ఆ ఇల్లు బూత్ బంగ్లా లాగా ఉంది.
ముగ్గురు ముఖా ముఖాలు చూసుకున్నారు.
“డమడమ గారు! మీ ఇల్లు చూడవచ్చా?”అని అడిగారు.
“దానికేమి భాగ్యం రండి” అని లోపలికి తీసుకెళ్ళింది.
ఘోరాతి ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు. వంటిల్లు అయితే చెప్ప తరం కాదు .అక్కడి వంట ఎవరు తిన్నా, తిన్నగా హాస్పిటల్ కి వెళ్లడమే.
హాల్లో ఉన్న వాష్ బేసిన్ నిండా మరకలు నిండి అసహ్యంగా ఉంది. ఇక బాత్రూం ఏ లెవెల్ లో ఉంటుందో అనుకున్నారు.
“టీ పెడతాను. అక్కడి నుండి నాకోసం వచ్చారు మీరు”అన్నది డమడమ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ లని ఊహించుకొని.
“వద్దు వద్దు” అని ముగ్గురు ఒకటేసారి అరిచారు.
మేము ఇక వెళ్తామండి. చాలా థాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు. అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు” అని చెప్పి ఉరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు.
“ఆ ఇల్లు ఏంటి అంత చెండాలంగా ఉంది? ఒక్కసారి మనవాళ్ళకి చూపిస్తే అర్థం అయ్యేది. యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని? అయినా 24 గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా? పిల్లలు ఉన్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా? వీలైనంతవరకు శుభ్రంగా అమర్చుకుంటాము. మన ఇళ్లే నయం ఆమె ఇంతకన్నా.క అద్దంలా పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా? ఎవరి ఇల్లు అయినా ఓ మోస్తారు గా ఇలాగే ఉంటాయి. మన వాళ్ళకి ఒకసారి ఆ ఇల్లు చూపిద్దాము. అప్పుడు గాని నోళ్లు మూసుకోరు”అని ముగ్గురు అనుకున్నారు. కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది. యూట్యూబ్ లో చూపించే ఇళ్ళు నిజంగా రోజంతా ఇలా ఉండవని.
ఇంట్లో వాళ్లకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలని ముగ్గురు ఆలోచించనలో పడ్డారు.
ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా! అని తలబాదుకున్నారు ముగ్గురూ!!
మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కాక ఉండరు. దేవుడికి కూడా ఇష్టమైన పండు మామిడి పండే. కావాలంటే రోజు ఒక పండు నైవేద్యం పెడతారు కదా? మామిడిపండు పెట్టిన రోజు మందిరంలో ఉన్న దేవుడి ముఖం చూడండి. ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటారు స్వామి. అదన్నమాట మామిడిపండు మహిమ.
మామిడి పండు అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలియా లంటే ఈ మామిడిపండ్లు ఏం మాట్లాడుతున్నాయో వినండి!
ఒక తోటలో బోలెడన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు కాసిన కాయలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.
“మనము ఇప్పుడే పిందెలుగా మారాము. ఇప్పటి నుండే మనకు కష్టాలు మొదలు”అన్నది బంగి నపల్లి.
“అవునే! కసి పిందెలమని కూడా చూడకుండా, కసా కసా కోసి, ఉగాది పచ్చడితో మొదలుపెడతారు. తర్వాత కోసి ఉప్పు కారం పెట్టుకొని ఓ కన్ను మూసుకొని, ఓ కన్ను తెరిచి లొట్టలు వేసుకుంటూ తింటారు”అన్నది తోతాపురి.
“ఏంటో నే సంవత్సరానికి ఒకసారి వస్తామా? మనల్ని పీల్చి పీల్చి పెడతారు ఈ మనుషులు”అన్నది రసాలు.
“పిందే నుండి కాయగా మారుతామా! అప్పటినుండి మొదలు లేతావకాయ అని రోజు ఉప్పు, కారం వేసి మనల్ని ముక్కలుగా తరిగి, వాటిని ఊరబెట్టుకొని రోజు వేడన్నంలో తింటారు”అన్నది మల్లిక.
“ఇంకా ముందుంది! కాయ పాకం పట్టిన తర్వాత ఇక అసలైన ఆవకాయలు మొదలు. ముక్కలు కొట్టి రకరకాల ఆవలు పెట్టుకుంటారు. వాళ్ల ముఖాలు మండ! ఒళ్లంతా మంట పుడుతుంది. ఆ కారంతో సంవత్సరం పొడుగునా ఆ జాడీలల్లో మనల్ని మగ్గబెడతారు”అన్నది నూజివీడు.
“ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్లీ కాయలు మిగిలాయని, తొక్క తీసి ఉప్పు కారం చల్లి, ఎండలో పెట్టుకుని సంవత్సరమంతా తింటారు”అన్నది రసాలు.
“ఇవన్నీ అయిపోయాక అసలు ముచ్చట ఉంటుంది. మనల్ని తీసుకెళ్లి ఓ రూమ్ లో పడేసి, ఆకులు కప్పేసి తలుపులు గట్టిగా బిగించి పెట్టేసి, మగ్గబెడతారు .అసలు ఊపిరాడుతుందా”అన్నది ఆల్ఫాంజా.
“నాలుగు రోజుల తర్వాత తలుపులు తీసి, మెత్తబడ్డ మనలని గొర గోరా తీసుకొని వచ్చి ,నీళ్లలో పడేస్తారు” అన్నది దశేరి.
“ఆ తరువాత చక్కగా వేడి అన్నం కంచాలలో వడ్డించుకుని, మనతోనే పెట్టుకున్న ఆవకాయను వేసుకొని, మనల్ని పిండి తింటారు. లొట్టలేసుకుని వాళ్లు తింటుంటే నాకైతే చిరాకు వస్తుంది” అన్నది కేసరి.
“అదంతా సరే ఎన్ని పండ్లను తిన్నా వీళ్ళకు అగడు తీరదా? వత్తి వత్తి రసమంతా పీల్చేస్తారు కదా? అయినా వాళ్లకు తనివి తీరదు. పీచును పట్టి చీకేసి ,నాకేసి గట్టిగా కొరికేస్తుంటే ఒ ళ్ళంతా నొప్పులు. వీళ్ళకి ఏం పోయేకాలం ?అన్ని పండ్లు తిన్న కడుపునిండదా “అన్నది సువర్ణ రేఖ.
“నన్నయితే వాళ్ళ పిల్లలు బయట అరుగు మీద కూర్చొని, నా లోపల ఉన్న పీచుని అసలు నేనేనా అనిపించేంత ఘోరంగా మార్చివేశారు .తెల్లగా అయిపోయింది. జుట్టంతా పోయింది. ఇంకా నాకుతూనే ఉన్నారు. పిల్లలా పిశాచాలా?”అన్నది నీలం.
ఇలా పండ్లన్ని వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉన్నాయి.
“మరి మనమంతా ఏం చేద్దాం? మన బాధకు విముక్తి లేదా?”అని బాధ పడ్డాయి.
అందులో నుండి ఒక మామిడికాయ చెప్పింది “మనం బ్రహ్మ దగ్గరికి వెళదామా? మన సమస్యకు పరిష్కారం అడుగుదాము. అందర్నీ పుట్టించింది ఆయననే కదా?” అన్నది.
“వద్దు, వద్దు పోయినసారి మన చాయ గిన్నె ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అటు ఉంచు ,మళ్ళీ ఆ గిన్నెలో చాయ్ పెట్టమని అడిగాడు.( నా కథ చాయ్ గిన్నె లో )”అన్నది మరో మామిడి.
“పోనీ ఈసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము”అని అన్ని అనుకొని మామిళ్ళన్ని కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయి.
హాయిగా పాలసముద్రంలో శేష శాయి పై పడుకొని లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంటే, కళ్ళు మూసుకొని ఇళయరాజా గారి పాటలు వింటున్నాడు. మామిళ్ళు మెల్లగా వైకుంఠపురం చేరుకునేసరికి మామిడిపండ్ల వాసన స్వామికి విపరీతంగా వచ్చింది.
“లక్ష్మి! చక్కని మామిడి పండ్ల వాసన వస్తున్నది .ఎక్కడ నుండి?”అన్నాడు కళ్ళు తెరిచి.
“ఏమో స్వామి నాకు కూడా వచ్చుచున్నది”అన్నది లక్ష్మి పాదాలు వత్తడం మానేసి.
ఇంతలో మామిళ్లన్ని కట్ట కట్టుకొని విష్ణుమూర్తి చెంతకు చేరాయి.
అన్ని మామిళ్ళను ఒక్కసారి చూడగానే విపరీతమైన ఆశ్చర్యం వేసింది విష్ణుమూర్తికి. లక్ష్మీదేవి కూడా అపురూపంగా చూడ సాగింది.
“ఏంటి ఇలా వచ్చారు”అని స్వామి అడిగాడు.
“ఏం చేయమంటారు స్వామి !మా కష్టాలు ఎలా చెప్పమంటారు? సంవత్సరానికి ఒకసారి కాస్తామా? మమ్మల్ని ఈ మనుషులు పీక్కొని తింటున్నారు. రకరకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. ప్రతి వంటలో వాడుతున్నారు .పప్పని, ఉప్పని ఇలా అన్నింట్లోనూ మమ్మల్ని వేసేస్తున్నారు. అదీ గాక సంవత్సరం పొడవున నిలువ కూడా ఉంచుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మా సమస్య తీర్చండి స్వామి”అంటూ మామిడిలన్నీ మొరపెట్టుకున్నాయి.
“ఆహా కమ్మటి సువాసన వస్తుంది”అంటూ లక్ష్మీదేవి వైపు తిరిగాడు.
“వాళ్ళు ఏదో చెప్తున్నారు. నాకైతే ఏమీ వినపడటం లేదు. నువ్వు వెళ్లి ఒక డజన్ పూరీలు చెయ్యి. అందులోకి ఈ మామిడి పండ్లను రసం చేసి పెట్టు. నేను రాత్రికి మామిడిపండ్ల రసం నంచుకుంటూ పూరీలను తింటాను. ఇంతకు వాళ్ళు వచ్చిన పని ఏంటో అడుగు. నాకు నిద్ర వస్తుంది “అంటూ కళ్ళు మూసుకొని పడుకున్నారు.
లక్ష్మీదేవి మెల్లగా లేచి..
“స్వామి ఏమంటున్నారో విన్నారు కదా! స్వామికి రాత్రి నైవేద్యం మీతోనే రండి మరి” అని దగ్గరికి రాసాగింది.
అంతే! మామిడిలన్నీ కట్టకట్టుకొని ,మనకి ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. పదండి మన కర్మ ఇంతే !మానవులకు పంటికింద ఆహారమై ఉండవలసిందే. ఇప్పుడు స్వామి కూడా మనల్ని ఆరగిస్తే,మన జాతులు మళ్లీ చిగురించవేమో! పదండి పోదాం”అంటూ పరిగెత్తి భూలోకం కి వెళ్ళిపోయాయి.
