మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వ నైపుణ్యాలు: ‘కవితా శిల్పం’

by నందిని సిధారెడ్డి October 24, 2021
written by నందిని సిధారెడ్డి

ఈరోజు కవిత్వం నైపుణ్యాలలో నాలుగవ అంశం ‘కవిత్వం – శిల్పం’.

కవిత్వమనేది జీవితకాలమంతా అభ్యాసం చేయవలసినటువంటి కళ. నేర్చుకోవలసినటువంటి కళ. సాధించవలసినటువంటి కళ. అందువల్ల ఈ రూపంలో, కరోనా ఇవాళ మనని ముందుకు తీసుకొచ్చిన ఈ కాలం, ఈ వేదిక ద్వారా దీని కోసం నేను మళ్ళా చదవడం వల్ల నన్ను నేను పునః సమీక్షించుకున్నట్లు ఉన్నది. ఇది మంజీరా రచయితల సంఘం ద్వారా వీలవుతున్నది. మీ అందరితో చర్చించడం వల్ల కవిత్వానికి సంబంధించినటు వంటి ఈ అంశాలు కదన కుతూహలమే అంటాం అట్లా, నాకు కవన కుతూహలం కలిగించడానికి ఇట్లా మీరందరూ తోడ్పడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మన అంశం ‘కవిత్వం – శిల్పం’

గత ప్రసంగంలో “కవిత్వం, వస్తువు” అనేది చెప్పుకున్నాం. ఏ వస్తువును ఎట్లా ఎన్నుకోవాలో మాట్లాడుకున్నాం. ఏ కవితా వస్తువును ఎంత జాగరూకతతో, ఎంత సమకాలీకతతో ఎంచుకోవాలో చెప్పుకున్నాం. ఇవాళటి సమావేశంలో మనం శిల్పం గురించి మాట్లాడుకుందాం. వస్తువును ఎన్నుకోగానే సరిపోదు. వస్తువు దొరుకుతుంది. రచనకు చెంది ఎవరికి అభ్యాసమైన రూపనిర్మాణం వారికి ఉంటుంది. ఇక ఉన్న సమస్యంతా శిల్పం. వస్తువును కవిత్వంగా మలిచేప్పుడు, వస్తువుకు సంబంధించిన రూపురేఖలు సవ్యంగానే ఉన్నాయి. కానీ శిల్పానికి సంబంధించినటువంటి రూపురేఖలు ప్రత్యేకంగా మనం అన్వేషించి నిర్ధారించినవి కొన్ని ఉండవచ్చును. కానీ, ఎవరూ కచ్చితంగా ఇదే కవిత్వం, ఇదే నిర్ణీత శిల్పం అని చెప్పడానికి ఉండదు. ప్రత్యేకంగా ఇవే కవిత్వానికి సంబంధించిన శిల్పం అని చెప్పడానికి మనకు వేల సంవత్సరాలనుంచి చర్చ జరిపినా ఇప్పటివరకూ కరెక్ట్ గా ఇదే శిల్పం అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. లేవన్నంతమాత్రాన మరి ఏం లేదా !? చాలా చర్చలు జరిగినవి. ఒక వస్తువుకు రూపం ఉంటుందన్నది అనుకున్నాం. ఆ రూపానికి శిల్పం వల్లనే కవిత్వంగా మారేటటువంటి దృష్టి ఏర్పడ్డటువంటిదవుతుంది. శిల్పం ఒనగూరినప్పుడు మాత్రమే అది ఆ స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని శిల్పం ఒనగూర్చడమనేది చాలా కీలకం. అందువల్ల ఉన్న సమస్య అంతా ఎక్కడున్నది? కవిత్వం అవునో కాదో చాలామందికి తెలియదు. మంచి కవిత్వమేదో చెప్పగలం, కవిత్వం కానిదేదో చెప్పగలం. కాని కవిత్వం ఇలానే ఉండాలి, ఉంటుంది అని చెప్పలేం కదా! మహా మహా కవుల దగ్గరి నుంచి మామూలు కవుల వరకు కూడా! ఒక కవిత్వానికి , కవిత్వం కానిదానికి మధ్య ఉండే భిన్నమైన వికాసం లేదా గుర్తింపు ఏమిటీ అంటే శిల్పం అనేది అని రూఢిలో ఉంది. శిల్పం ద్వారానే కవిత్వం రాణింపుకు వస్తుంది. అందుకని, శిల్పం అంటే ఏంటీ అని అన్నప్పుడు అందులో ఆంగ్ల పదంలోకి వెళితే ‘టెక్నిక్’ అన్నారు. రూపానికేమో ‘ఫామ్’ (Form) అన్నారు. శిల్పానికేమో టెక్నిక్ అన్నారు. ఇదిగో ఇది ఈ టెక్నిక్ ను పట్టుకోవడమన్నది చాలా కీలకం. అంటే శిల్పం పట్టుకోవడం చాలా కీలకం. అంటే వస్తువు అందరి దగ్గరా ఉంటుంది. వస్తువుకు చెందిన రూపాన్ని మరింత కళాత్మకంగా మలిచేదే శిల్పం. శిల్పం అంటే ఒక్కమాటలో చెప్పవలసి వస్తే, వస్తువును ఆకట్టుకునే విధంగా మలచడమే శిల్పం. శిల ఉంటుంది. దాన్ని శిల్పి మాత్రమే అద్భుతమైన శిల్పంగా మార్చగలడు, తయారు చేయగలడు. ఆ శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పి శిల్పాన్ని చేసే క్రమంలో కూడా కొన్ని చెడిపోవచ్చు. కొన్నిసార్లు ఎక్కడైనా చెక్కడంలో లోపం ఏర్పడితే ఆ రాయి మొత్తం వృథా అవుతుంది. శిల్పం తయారు కాదు. అందుకని చాలా ఆలోచనతో కష్టపడి చెక్కాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ ఉలితో చెక్కేటప్పుడు ఉలిని ఎంత సున్నితంగా వాడాలో అంత సున్నితంగా వాడుతాడు, ఒక కన్ను దగ్గర, ఒక పెదవి దగ్గర ఏ రేఖమైతే రావాల్సి ఉంటుందో ఆ రేఖను చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా నిర్మిస్తాడు, చెక్కుతాడు. అప్పుడు మాత్రమే అందులో శిల్పం జీవకళ ఉట్టిపడుందన్నట్లు ఉన్నదని అంటాం. సులువుగా, సున్నితంగా, మృదువుగా డీల్ చేయాల్సినటు వంటి క్రమంలో హార్డ్ గా డీల్ చేస్తే రాయి ఎగిరిపోతుంది. అందుకే అంతవరకు చేసింది, అంటే ఒక పెదవిని చెక్కుతుంటే చెడిపోయిందనుకోండి ఇక అంతే. కొత్త దానికోసం ప్రయత్నించాలి. అంతే తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని సున్నితంగా వర్తించవలసిన చోట సున్నితంగా వర్తించాలి. కటువుగా వర్తించవలసినచోట కటువుగా, ఇంకా కటువుగా తయారుచేయాలి, పటువైన విధంగా ఆకర్షణీయంగా తయారు చేయవలసిన చోట చాలా జాగ్రత్తగా చెక్కాలి.

ఒక రాయిని ఎంత చెక్కాల్సినచోట అంత చెక్కాల్సిందే. ఒక రాయిని శిల్పంగా, కళాత్మకంగా మలచాల్సిన చోట ఆ అవసరముంటుంది. శిల్పాన్ని సరళీకరించాల్సినట్లు, కవిత్వంలో ఎట్లా, ఎక్కడ శిల్పం ఉంది అంటామంటే, వ్యక్తీకరించే పద్ధతి, చెప్పే పద్ధతిలో శిల్పం ఉందని అంటాం. చెప్పేచోట ఎట్లా చెప్తున్నామో, ఎట్లా వ్యక్తీకరిస్తున్నామో దాన్ని శిల్పం అంటాం. ‘మెథడ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్’ వ్యక్తీకరణ. అభివ్యక్తీకరించడ మనేది చెక్కే పద్ధతిని శిల్పం అంటాం. చెప్పే పద్ధతిలోని సమగ్రతను శిల్పం అంటాం. ఈ విధమైన శిల్పం ఆ భాషలో ఆ వస్తువుకు చెంది సరియైన అభివ్యక్తి రూపం అవుతుంది.

చెప్పే ఇతివృత్తం వస్తువు అయితే, చెప్పే పద్ధతి శిల్పం. ఒక వస్తువును కళాత్మకంగా మలచాలి. ఈ కళాత్మకంగా మలిచేప్పుడు ఈ శిల్పమనేటువంటిది ఏంటిది శిల్పం అంటే మనం చేసే పనిలో నైపుణ్యం సాధించడమే శిల్పం. ఏ పని చేస్తున్నామో, కవిత్వం రాసేప్పుడు కవిత్వంలో మనం నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. కథ రాస్తున్నాం అనుకోండి. కథ రాసేప్పుడు మన రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించడం అన్నట్టు. అదే ఒక రాయిని శిల్పంగా మలిచేప్పుడు అక్కడ ఒక శిల్పకారుని నైపుణ్యమే బలమైన రూపాభివ్యక్తికి ప్రధానం అవుతుంది కాబట్టి ఇది కీలకం అంటే ఒక వస్తువుకు రూపం ఉంటుంది, ఆ రూపాన్ని ఒక శిల్పంగా మార్చేటువంటి ఒక క్రమం ఉంటుంది. అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. అది మాత్రమే శిల్పం. కాబట్టి రూపాన్ని కళాత్మకంగా మలిచేదే శిల్పం. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏ ప్రమాణాలు ఏమీ లేవు. ఒకటే ఒకటంటే హృదయాన్ని ఆకట్టుకునేట్టుగా చెప్పటం. ఎప్పుడు హృదయాన్ని ఆకట్టుకుంటాం? అంటే – మన రచనా నైపుణ్యం మన యొక్క వ్యక్తీకరణ నైపుణ్యం చాలా అందంగా, చాలా బలంగా ఉంటే దాన్ని శిల్పం అంటాం అన్నమాట. అందుకని శిల్పమనేది కేవలం ఒక్కమాటకు సంబంధించింది కాదు.

చూసే పద్ధతి, చూయించే పద్ధతి వీటన్నింటి వెనకాల ఉన్న ప్రమాణం ఏదైతే ఒక విధానం, ఒక పద్ధతి ఏదైతే ఉందో మీరు ఏ పని చేయాలన్నా ఆ పనిలో ఉండే నైపుణ్యం, ఆ పద్ధతి, ఆ నేర్పరి తనం తెలంగాణలో ఒకమాట

చెక్కణమా? కుందనమా అంటారు. “నాగూడ తెలుసు”. అన్నట్టు ‘చెక్కడమా? కుందనమా?” అనేటువంటిది. అంటే మామూలుగా చేసేటువంటి ఈ పనికి సంబంధించిన మటుకే ఇట్లా అంటారు.

బంగారాన్ని నగగా తయారుచేసే పద్ధతి ఒకటున్నది. కుందనం అంటే మనందరికీ తెలిసిందే. కుందనం అంటే బంగారం. చెక్కణమా? కుందనమా అన్నారు. అంటే బంగారాన్ని నగగా అందమైన ఆభరణంగా మలిచేది ఒక స్వర్ణకారునికి మాత్రమే తెలుస్తుంది. బంగారాన్ని నగగా మలచడం, ఆభరణంగా చేయడం అది శిల్పం. మంచి శిల్పకారుడైనటువంటి స్వర్ణకారుడు మాత్రమే మిమ్ముల్ని ఆకట్టుకునేటువంటి నగను తయారు చేయగలడు. ఆమె ధరించి చూపరులను అందరినీ ఆకట్టుకునేటు వంటి ఆ నైపుణ్యం ఆ నగలో ఉన్నది. కాబట్టి ఈ అందరినీ ఆకట్టుకోవటం, తనని ఆకట్టుకోవటం అనేది చెక్కణమా, కుందనమా అనేది ఎందుకన్నారు? చెక్కితే కళాత్మకంగా మారిందని అనడం శిల్పం అనేటువంటిది. రాయిని శిల్పంగా మార్చేప్పుడు ఉలితో చెక్కాల్సిందే. మనకందరికీ తెలిసిందే. ఒకనికి ఒక కర్రని అద్భుతమైన బొమ్మగా మలిచే ఒక శక్తి ఉంటుంది. మామూలుగా చేయడం వేరు. చాలా కళాత్మకంగా చేయడం వేరు. మనందరికీ తెలిసిందే. మన చిన్నప్పుడు చూసిందే. బొంగరాలు వండ్రంగులు చేస్తారు. మనమందరం ఆడుకున్నం. ఆ బొంగరంలో సంగడి బొంగరం ఉంటుంది. అంటే దాని సంగడి బట్టి చాలా అందంగా తయారు చేస్తారు. ఈ సంగడి బొంగరం చేసేటువంటి శక్తి అనేది కొందరికే ఉంటుంది. అందరికి రాదది. ఈ సంగటి బట్టి చేసేది సంగటి బొంగరం. చక్రంతోని ఒక అద్భుతమైన ఒక చెక్కబొమ్మను చేయడం అనేదే శిల్పం. ఒక స్వర్ణకారుడి చేతిలో, ఒక వడ్రంగి చేతిలో ఏదైతే నైపుణ్యం ఉన్నదో అదే శిల్పం. ఆ నైపుణ్యమే శిల్పం అది కవి చేతిలో ఉన్నప్పుడు కవిత్వానికి సంబంధించిందై ఉంటుంది అని శిల్పం గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే కవి చేతిలో ఉంటుందో, అది చెప్పేటువంటి పద్ధతిలో, చూపెట్టేటువంటి ఎక్స్ ప్రెషన్ అద్భుతమైన పద్ధతి, నైపుణ్యం. అందుకని ఈ నైపుణ్యం ప్రతి వస్తువు అందంగా కనబడాలని చేస్తారు. ఒక వస్తువును తీసుకొని మలచడం. అది కేవలం ఉపయోగానికే అంటే సరిపోదు. మనందరికి తెలిసిందే, చెప్పులు మనం షాపులో కొంటాం. కానీ అందమైన చెప్పుల కోసం మనం వెతుకుతాం. ఏదైతేనేం చెప్పులకు అని ఊరుకోలేం. ఆ చెప్పు కూడా అందంగా ఉండాలి. మనకు నచ్చాలి. చెప్పులు వేసుకోగానే, ఎవరేమన్నంటరేమోనని అంటే మళ్ళీ వీటిని నేనేసుకున్న తర్వాత నా కాలికి బాగుందో లేదో అని, అందరినీ ఆకట్టుకోవాలని ఈ రెండు ప్రయోజనాలు నెరవేరాలి. ఒకటి వేసుకునే వాడికి నచ్చాలి, రెండవది వేసుకున్న తర్వాత మన కాలి యొక్క అందం పెరిగి, ఎదుటివాళ్ళకి కూడా నచ్చాలి. అందం వ్యక్తిది పెరగాలి. వెనకట మాదిగ కళాకారుడు, చెప్పులను చేసే కళాకారుడు. మరి దాంట్లో ‘కిర్రుచెప్పులు’ అని మన కథలల్లో చదువుతుంటాం. కవిత్వంలో చదువుతుంటాం. “కిర్రు చెప్పులతో వచ్చాడు” అని. ఈ కిర్రుచెప్పులు అందరు చెయ్యలేరు. అట్లాగే మళ్ళీ ఆ చెప్పుల మీద అద్భుతమైన పోతబోసేటువంటి వాళ్ళు. అంటే నల్లగా ఉండేటువంటి తోలుమీద తెల్లగా ఉండేటువంటి దానితో రుద్ది, అంటే పోతబోసినట్లుగా వాటిని కుట్టి ఒక అందమైన చెప్పులను తయారు చేసే పద్ధతి. పాతకాలం పద్ధతి అది. అయితే షాపుకు పోయి చూసినప్పుడు దుకాణంలో కూడా చూసేవాళ్ళం మనం. ఏ కళాకారుడైనా సరే, ఏ పని చేసేవాడైనా సరే, ఆ పనిలో నైపుణ్యం ప్రదర్శించాలి. అప్పుడే కళాకారుడవుతాడు. మనం నైపుణ్యం ప్రదర్శించకపోతే కేవలం పనే అది! పనిలో నైపుణ్యం ప్రదర్శించక పోతే ఆ పని యొక్క ‘పనితనం’ రాణించనట్లే. Skillfulness అంటామే అదే ఇది.

ఏమంటడంటే “యు ఆడ్ యువర్ లైట్ దట్ ఆఫ్ లైట్ – నీ కాంతిని దాని మీద విస్తరింప జేయి. ఎట్లా? దాంట్లో

అంతకుముందున్న కాంతి మరింత ప్రకాశవంతం అయేట్లు చెయ్యి” అని.

యు ఆడ్ యువర్ లైట్. నీ కాంతిని వస్తువు మీద ప్రసరింప జేయు. వస్తువులో అంతకుముందే ఒక కాంతి ఉంది. అది నువ్వు గుర్తుపట్టి ఈ కాంతిని, అందులోని కాంతి, నీకాంతి కలిసి దేదీప్యమానంగా నిరంతరాయంగా పెరిగేటువంటి అవకాశమున్నది. అంటే “అంతకుముందే ఉన్న కాంతిని నీ కాంతి ద్వారా ప్రకాశింపజేయి. చాలా

సులువైనటువంటి నిర్వచనం ఇది. సాహిత్య శిల్పానికి సంబంధించింది ఇది ఎట్లా చేస్తావు?

నిజానికి ఒక వస్తువు కళాత్మకంగా ఉందా లేదా అనేటవంటి దానికి దీన్ని బట్టి చూస్తారు కవితకు అంటే –

కవితను కళాత్మకంగా చూపేది శిల్పమే. అందుకని శిల్పం ముఖ్యం. ఈ శిల్పంతోనే కొందరు గొప్పకవులు అయినారు. ఈ శిల్పం అందుకోవటం కోసం కవులు నిరంతరం తపించారు. ఈ శిల్పం కొరకు ఇంగ్లీష్ లో చెప్పేమాట ఒకటి క్రాఫ్ Craft / Craftmanship అన్నారు. ఈ చెక్కడాన్ని క్రాఫ్ట్ అనడానికి… ఆ చెక్కే విధానం గనక తెలియకపోతే ఇందాక చెప్పుకున్నట్లే శిల్పం చెక్కుతుంటే రాయి ముక్క ఎగిరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెక్కేటప్పుడే సున్నితంగా, కళాత్మకంగా, మెళకువగా చెక్కినట్లైతే, శిల్పం నైపుణ్యంగా చెక్కితే బాగా వస్తుంది. ఈ చెక్కడం కోసం మనకు కావాల్సింది ఏమిటంటే, భావుకత ఉండాలి. భావుకతతో రాయాలి. ఈ శిల్పం సాధించడానికి ఇన్ని నిర్వచనాలు చేస్తారు. ఈ శిల్పం చెక్కడానికి, తయారు కావడానికి లేదా శిల్పాత్మకంగా, నైపుణ్యంగా చెక్కడానికి కావలసింది ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే అది : భావుకత. భావుకత అనేది ఒకటి ఉండాలి. ఇమాజినేషన్ సరిగ్గా, ఎట్లా చేస్తే అందంగా వస్తుందో దాన్నే, అట్లా చేయడాన్నే భావుకత కన్పిస్తున్న శిల్పం అంటారు. శిల్పానికి భావుకత అనేది ఒకటి ఉంటే అందంగా వస్తుంది. ఈ శిల్పకారునికి, ఈ కవికి ఉండాల్సింది ఏంటిది? ఇమాజినేషన్ (Imagination) అనేది ఉండాలి. ఎట్లాగైతే ఒక మాదిగ కళాకారునికి ఇది పోతబోస్తే చాలా అందంగా ఉంటుందని ఎట్లా పోత బోసి సిద్ధం చేస్తాడో, ఒక స్వర్ణకారునికి ఇందులో రాయిని, రత్నాన్ని పొదిగితే అందంగా ఉంటుందని చేస్తాడో, ఒక వడ్రంగి ఈ కర్రకు సంగటి బెడితే అది ఎంత అందంగా తయారవుతుందని అనుకుంటాడో ఇవ్వన్నీ ఈ అనుకోవడమనేది భావుకత. భావనాత్మకత. దీనినే ఇమాజినేషన్ అంటారు. ఇట్లా జేస్తే అందంగా ఉంటుంది, ఇట్లా రాస్తే భావుకత బావుంటుందని కళాత్మకంగా ఆలోచిస్తాడో, తయారు చేస్తాడో అదే శిల్పం.

రామప్ప శిల్పంలో నాగిని గొప్ప శిల్పం. దానికి దగ్గరల్లో మరొక ఆమెని పెట్టి, కాలికి విరిగిన ముల్లును తీసే ఇంకో శిల్పాన్ని చెక్కాడు శిల్పకారుడు అద్భుతంగా శిల్పంగా చెక్కాడు. అది అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైన శిల్పం. అందరినీ ఆకర్షించే శిల్పం. కాలుకు ముల్లు విరిగితే, ఆ ముల్లు తీసే శిల్పం మరొకటి ఉంటుంది. అద్భుతంగా వచ్చింది. ఇది ఎక్కడినుంచి వచ్చింది? కాలుకు ముల్లు విరగడమేమిటి? కాలుకు ముల్లు విరగడమనేది జీవితంలో చూసాడు. పనిచేసే వారికి ముల్లు ఇరిగే అవకాశం ఉంటుంది. కాని అక్కడ నాగినికి అట్లా చెక్కాడు. కాలికి ముల్లు తీసే శిల్పాన్ని అత్యంత సున్నితమైన సన్నివేశాన్ని శిల్పంగా చెక్కాడు, రామప్ప అనే శిల్పి. ఆ గుడి పేరు రామప్ప గుడి. అతని పేరుతో ఉన్న గుడి. కాని గుడిలో వున్న దేవుడు రామలింగేశుడు. ఆ కళాకారుని పేరు మీద ఆ గుడి వున్నది. ఆ శిల్పం అంత గొప్పగా రావడానికి కారణం ఏమిటి? అంటే ఆయనలో భావుకత ఉన్నది. ఊహారేఖ రూపరహితమైన మాట. ఈ భావుకత అనేది ఎట్లుంటే అట్లా, ఈ హృదయం యొక్క ఉన్నతి.

ఈ భావుకత, ఇమాజినేషన్ ఎట్లా అలవడాలి? ఒక రూపరహితమైన ఈ భావం ఎట్లా కనబడుతుంది అంటే ఈ ఊహ, ఈ హృదయం యొక్క ఉన్నతి యొక్క సంస్కార వ్యక్తీకరణలో భావుకత. ఇక్కడ ఈ హృదయం యొక్క భావసంస్కరణమే కౌలశం. కవిత్వం రాస్తున్నాను. ఇది ఇట్లా రాస్తే చాలా అందంగా వస్తుంది అనే ఒక ఊహ రావాలి. భావం రావాలి. భావనాశక్తి, భావుకత, భావనాత్మకత, ఇమాజినరీ అనేవి ఉండాలి. కాబట్టి ఇమాజినేషన్ అనేది కీలకమైనది. మహా వైజ్ఞానిక మేధావి ఐన్ స్టీన్ కూడా Imagination యొక్క ప్రాధాన్యతను ఉగ్గడించాడు. ‘వైజ్ఞానిక సత్య’ ఆవిష్కరణకు కూడా Imagine చేయగలగడం అవసరమన్నట్లే కదా!

భావుకత ఎవరికి ఉంటుంది? మళ్ళీ మరల ఇంకోమాట మాట్లాడారు. మనలో అది, ఒక మాట చెప్పటానికి ఇంకోమాట మాట్లాడగలగడం. అంటే మరోమాట అనేది నైరూప్యంగా కవి సూత్రతలాగా ఉంటుంది. ఒక కవికి భావుకత రావడానికి ఏంగావాలి? ప్రతిభ గావాలి. ఈ నైపుణ్యానికి, ఈ భావుకతకు నీ దగ్గర ఉండవలసిందేమిటి అని అంటే, ప్రతిభ ! ప్రాచీన ఆలంకారికులు ఏమన్నారంటే “ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము” అనే మూడు అంశాలను “కవితా సామగ్రి”గా చెప్పారు, అన్నారు. కవిత్వం రాయడానికి, ఈ భావుకతను ఆవిష్కరించడానికి, వస్తువును ఆవిష్కరించడానికి కవికి ఏంగా వాలంటే తప్పనిసరిగా పై కవితాసామాగ్రి ఉండాలి. కవిత్వానికి ఈ మూడు విషయాలు గావాలి. ఇవి కావ్యహేతువులు అన్నారు. కవితా సామాగ్రి అన్నారు. నైపుణ్యంతో కవితను రాయాలి అంటే కవికి ఈ మూడు ఉండాలి అన్నారు. ఏవి అంటే మొదటిది ప్రతిభ, రెండవది వ్యుత్పత్తి, మూడవది అభ్యాసము. వీటిలో ప్రతిభ ఎట్లా ఉంటుంది మరి? ప్రతిభ అనేది నీ యొక్క భావుకతను బట్టి, నీ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. నీ భావనాత్మక సంస్కారాన్ని బట్టి నీ పుట్టుక సంస్కారం, సాంస్కృతిక సంస్కారం, నీ సామాజిక సంస్కారం అనేవి కలిపి ఉంటాయి. ఎవరికి ఉంటుంది అంటే అది పుట్టుకతో రావాలి అంటారు. కాని, అదొక విశ్వాసమైతే, నాలాంటి వాడిని ఏమనుకుంటానంటే, మూడు సంస్కారాల వల్ల ప్రతిభ మనకు వస్తుంది, ఉంటుంది అని. మూడు సంస్కారాలేంటీ అంటే ఒకటి కుటుంబ సంస్కారం, రెండవది సామాజిక సంస్కారం. సమాజం నీకు కొంత సంస్కార మిచ్చింది. నువ్వు తిరిగిన నువ్వు పెరిగిన వాతావరణం కావచ్చు. గ్రామం కావచ్చు. నువ్వు తిరిగిన పట్టణం కావచ్చు, నువ్వు తిరిగిన దేశాలు కావచ్చు. ఇది రెండవది అయితే, ఇక మూడవది నీవు చదివిన కవిత్వమూ, నువు చదివిన పుస్తకాలదీ కావచ్చు. ఈ మూడు సంస్కారాలు నీ ప్రతిభను ఇనుమడింప జేస్తాయి. అయితే, దీనికే వాళ్ళేం చెబుతారంటే,

“శక్తి ర్నిపుణతా లోకశాస్త్రా ద్యవేక్షణాత్” అన్నారు. “శక్తిరి పుణత!” నీ భావనాశక్తి, నీ రాసేటు వంటి శక్తి రావాలంటే, అందుకు మూడు విషయాలుంటాయి అన్నారు.

లోకానికి సంబంధించిన, జీవితానికి సంబంధించినది జీవన జ్ఞానం ఉండాలి. లోకజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆ కాలంలో ఉండేటువంటి రాజకీయ శాస్త్రం గావచ్చు, సామాజిక శాస్త్రం గావచ్చు, ఆర్థికశాస్త్రం గావచ్చు, మానవశాస్త్రం గావచ్చు ఏదైనా తీసుకోండి. శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. కావ్యాలకు సంబంధించిన జ్ఞానము, సంస్కారమూ ఉండాలి. ఈ మూడింటికి సంబంధించిన నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది – దీన్ని ప్రాచీన ఆలంకారికులు చెప్పింది. ప్రతిభ, వ్యుత్పత్తి, సామర్థ్యం. ప్రతిభ అనేది నీలోనే ఉంటుంది. “యూ ట్రై యువర్ టాలెంట్” అని అంటారు. అది నీలోనే ఉంటుంది. నీయొక్క కాంతిని ప్రసరింపచేయడం. ప్రకృతిలో ఒక కాంతి ఉంటుంది. నీలో ఒక కాంతి ఉంది. నీలో ఒక తేజస్సు ఉంది. కవి అనేవాడు మామూలువాడు కాదు. కవిలో తేజస్సుంటుంది. ఒక ప్రతిభ ఉంటుంది. ఒక సంస్కారముంటుంది. ఆ తేజస్సు సంస్కారం ఉన్నవాళ్ళు అనివార్యంగా తనలో ఉన్నటువంటి ప్రతిభను ప్రదర్శిస్తుంటారు.

ఒకటి వ్యుత్పత్తి, మరోటి ప్రతిభ కావాలి, ఉండాలి అన్నారు.

ఇందాక చెప్పినటువంటి వాటిల్లో లోకాన్ని చదవడం ద్వారా, శాస్త్రాల్ని చదవడం ద్వారా, కావ్యాల్ని చదవడం ద్వారా అందేది వ్యుత్పత్తి, పాండిత్యం.

అభ్యాసము – దాన్ని మనం తరచుగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి శిల్పం అనేది కవి యొక్క భావనా శక్తిని ఆవిష్కరించాలి. ఇవి ప్రాచీన ఆలంకారికులు చెప్పిన సూత్రాలు. అట్లానే, ఇవి మన దగ్గర చెప్పినవైతే, పాశ్చాత్యులు కూడా చెప్పింది చూస్తే, పాశ్చాత్యులు కూడా శిల్పం మీద చాలా చర్చలు చేశారు. ఉన్న సమస్యంతా శిల్పంలోనే ఉంటుంది కాబట్టి ఈ శిల్పం అనేది ముఖ్యమని ఇక్కడి ప్రాచీన భారతీయ ఆలంకారికులు చర్చ చేసారు, అట్లాగే పాశ్చాత్య విమర్శకులైనా చర్చ చేశారు.

వస్తువు కవిత్వం కావడానికి కారణం శిల్పమే, కాకపోవడానికి కారణం శిల్పమే. ఒక వస్తువు సార్వకాలికంగా మంచి కవిత్వం కావడానికి కూడా శిల్పమే కారణం కావచ్చు. ఇప్పుడు ఆ వస్తువు లేకున్నా కూడా అది నిలిచి

ఉండటానికి కారణం సాహత్యంలోని ఈ శిల్పమే. ఆ రచనలో ఉన్న అసామాన్యమైన నైపుణ్యం వల్ల నిలుస్తుంది.

సార్వకాలీనమవుతుంది. శాశ్వత స్థాయీ వస్తుంది. సార్వకాలం కావాలన్నా, శాశ్వతం కావాలన్నా సామాజిక సమస్యను రాయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక సమస్య అంతరించినా కూడా శాశ్వతంగా ఉంటుంది. ‘కన్యాశుల్కం నాటకం’ ఉందనుకోండి. గురజాడ అప్పారావు రాసిన నాటకం. ‘కన్యాశుల్కం’ ఇప్పుడు లేదు. ఇప్పుడంతా వరశుల్కం. వరకట్నం ఉన్నది కన్యాశుల్కం అంతరించింది. అదే సమయంలో ‘వరవిక్రయం’ అని కాళ్ళకూరి నారాయణరావు రచన, కన్యాశుల్కం నాటకం గురజాడది. ఈ రెండు నాటకాలలో ఉన్న కన్యాశుల్కం ఇప్పుడు లేదు. కాని, నాటకంగా సాహిత్యంలో నిలదొక్కుకున్నది. అది దురాచారంగా ఇప్పుడు లేకపోవచ్చు. కాని ‘వరవిక్రయం’లా ‘వరశుల్కం’ దురాచారంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ నాటకం చాలా మంచి నాటకం. వరవిక్రయం కూడా మంచి నాటకమే. కాని ‘కన్యాశుల్కం’ నాటకానికి వచ్చినంత పేరు రాలేదు. దీనికి కారణం కేవలం గురజాడ అప్పారావు సాధించి పాటించిన నాటక శిల్పం వల్లనే. ఆ నాటక శిల్పం వల్లనే ఆ నాటకస్థాయి, ఆ సాహిత్య స్థాయీ వచ్చింది. దానికి శాశ్వతం కలిగింది. వంద సంవత్సరాలైనా ఇప్పటికీ సాహత్యంలో శాశ్వతంగా ఉంది. సాహిత్యంలో అట్లా నిలదొక్కుకున్నది, పేరు వచ్చింది. ఆ దురాచారం ఇప్పుడు లేకున్నా ఇవ్వాళటికీ ప్రదర్శింపబడుతున్నది. కేవలం నాటక శిల్పం వల్లనే.

మరి అదే వరవిక్రయం నాటకంలోని వరశుల్కం ఇప్పుడున్నా అంతగా ప్రాచుర్యంలో లేదు. ఈ తేడా ఉండేది కేవలం శిల్పం వల్ల. ఆ వస్తువు ఒక గొప్ప కళగా గొప్ప కళాత్మకమైన సృష్టిగా నిలిచి పోతుంది.

తిక్కన ఏమన్నాడంటే “యేను ఉభయ కావ్యప్రౌఢి పాటించు శిల్పంబునన్ పారగుడన్” అంటే తీరం చేరిన కృతార్థుడిని అన్నాడు. ఏమన్నాడు. “రెండు రకాల కావ్యశిల్పాన్ని పాటిస్తునన్నాడు. ఏమిటా రెండు శిల్పాలు అంటే, ఒకటి దృశ్యకావ్య శిల్పం, రెండోది శ్రవ్యకావ్య శిల్పం. అంటే వినడానికి అందంగానే చెప్పడం, చెప్పేప్పుడు అందంగా చెప్పడం. నా కవిత్వం చదివితే కావ్యంలోని పాత్రలు నీ కళ్ళముందు బొమ్మకత్తాయి. అట్లా చెప్పగలుగుతాడు కవి.

కథ చాలా ఆసక్తి కలిగించేటట్లు చెప్పడం. అట్లా ఆసక్తి కలిగేలా చెప్పడమన్నది శ్రవ్యశిల్పం. వినే శిల్పం. అదేవిధంగా కండ్లకు బొమ్మ కట్టించేటట్లు రాయడం దృశ్యశిల్పం. మీ మనసును రంజింపచేసేటటువంటి శక్తి, విషయమూ నాకు తెలుసు అని తిక్కనగారు భారతాన్ని అనువాదం చేసేప్పుడు అన్నాడు. ఆంధ్రావళి మొదముంబొరయ – తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నంతవరకూ తిక్కన కావ్యశిల్పం నిలిచే ఉంటుంది. అదీ తిక్కన “నేర్చిన భంగి” కావ్యరసముంగాని యాడుచు ఉండే కావ్య శిల్పం.

“ఉభయకావ్య ప్రౌఢిమను..” ఈ రెండింట్లో కూడా ఒక గొప్పదనం ఒక ప్రౌఢిమను, గర్వాన్ని కలిగి ఉన్నాన్నేను అనడం. కాబట్టి ఏది శిల్పం అనేప్పుడు భావుకత ఉండాలన్నా, ఇందాక అన్నట్లు నాటకీయత ఉండాలన్నా, ఆ ప్రతిభ కావాల్సి ఉండాలన్నా ఉత్పత్యభ్యాసాలు, నాటకీయత అనే శిల్పం తెలిసి ఉండాలి. పాశ్చాత్య ఆలంకారికులు చెప్పిన మాటలేమంటే ‘ఇమాజినేషన్’ దేనివల్ల కలుగుతుందనటువంటింది. దాన్ని ఆవిష్కరించడానికి మన దగ్గర ఈ కవితా సామాగ్రి మాత్రమే ఉండాలన్నారు.

వాళ్ళు కొన్ని కొలమానాలు పెట్టారు. అంటే సింబల్స్ ద్వారా చెప్పడం. అట్లానే ఇమేజినరీ, పదచిత్రాల ద్వారా చెప్పటం, పదచిత్రాల ద్వారా ప్రతీకల ద్వారా, రెగ్యులర్ పదాలను ఒకటి మీద ఒకటి చాలా అందమైన భావనీయమైన పదాలను వాడటం ద్వారా కూడా శిల్పాన్ని సాధించడం సాధ్యం అవుతుంది. అటువంటి అవకాశమున్నది.

ఇంకొకటి సిమిలీ. సిమిలీ అనేది ఉపమానం. భారతీయ ఆలంకారికులు చెప్పిన ఉపమాలంకారము. ఉపమ- దాన్ని సిమిలీ అన్నారు సిమిలీ అంటే పోలిక. పోలిక లేకుండా భాష లేదు. పోలిక లేకుండా కవిత్వం లేదు. ఒక అలీగరీ.. రెండు ఇమేజినరీ మూడు జగ్లరీ నాలుగు సిమిలీ ఐదు మెటబాలి. ఈ మాటలు వాళ్ళు చెప్పినపుడు ఆ మాటల యొక్క సారాంశమంతా, సిమిలీ, ఇమేజినరీ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. తర్వాత చర్చలో తెలుసుకుందాం, తెలుసుకొనే అవకాశముంది.

అట్లానే మన వాళ్ళే చెప్పినటువంటివి, సాహిత్యంలో ప్రముఖమైనవి కొన్ని చెప్పారు. శిల్పమయంగా శోభించడానికి, కవిత్వం అందంగా ఉండడానికి, కవిత్వమయంగా చెప్పడానికి ఏమేమి ఉండాలో మనవాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఐదు లక్షణాలు చెప్పారు. అవి ఏమంటే, ఒకటి క్లుప్తత, అంటే ‘బ్రెవిటీ’గా ఉండాలి. కొందరు చాలా ‘లెంథీ’గా, చాలా పొడుగ్గా రాస్తుంటారు. రాస్తేనేమో విరివిగా రాస్తూనే ఉంటారు. అది 4,5 పేజీలు వరుసగా పోతూనే ఉంటుంది. టైప్ కొట్టి కొట్టి అలసట రావాలి. ఇప్పుడు వాట్సప్ ల్లో రీడ్ మోర్ అని వస్తుంది. టచ్ చేసి చదివాక మళ్ళీ రీడ్ మోర్ వస్తుంది. మళ్ళీ టచ్ చేసి చదవాలి. అట్లా రెండు మూడు ప్రయత్నాలు చేయాలి. అంటే పొడుగ్గా ఉండటం తప్పని కాదు నా ఉద్దేశ్యం. ఎక్కడైతే క్లుప్తత ఉంటుందో అది చాలాకీలకం. బ్రివిటీ అనేది చాలా కీలకం. ఇదే సంక్షిప్తత అనేది. రెండోది క్లుప్తత. అంటే అన్నీ విప్పి చెప్పక్కరలేదు. క్లుప్తత అంటే దాచిచెప్పు. ప్రతిదీ వివరించి చెప్పవద్దు. వివరించి చెప్తే వ్యాసమవుతుంది. సి.నారాయణరెడ్డి గారు “కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ”అని అన్నారు. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. గుప్తతతో క్లుప్తంగా చెప్పడమనేది ఒక రహస్యమనేది ఏదో ఒకటి అందులో ఉండాలి. ఎదుటివారిని ఎట్లా ఆకర్షిస్తావు? ప్రతీక ఒకటి వేస్తామనుకోండి. ఈ ప్రతీక ఏమిటి అనేది చదివేవారికి ఆలోచన ఇవ్వాలి. అతనికి ఆలోచనకు కొంత ఆస్కారముంటుంది. అందుకే “ఆలోచనామృతం” అన్నారు సాహిత్యాన్ని, మూడోది ఆప్తత. గుప్తత తర్వాత ఆప్తత. ఆప్తత ఏంటిది? అది దగ్గరతనము. మన హృదయానికి దగ్గరగా ఉండాలి. ఆత్మీయత అన్నాం. ఆత్మీయంగా ఉండేదే ఆప్తత. మనకు చాలా దగ్గరిదై ఉండాలి. మనకు తెలిసిన వస్తువై ఉండాలి. హృదయానికి హత్తుకునేలా ఉండాలి. ఆత్మీయత ఉండాలి. ఆ ముల్లు దీసే అమ్మాయిని ఎందుకు చెక్కాడంటే ముల్లు చాలామందికి విరుగుతుంది. ఆ ముల్లు విరికిన బాధ తెలిసేలా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆప్తత అయ్యింది. ఇంకోటి కీలకమైంది. నాలుగోది వక్రత అన్నారు. సూటిగా చెప్పకూడదు. “నేను నవ్వాను. ఈ లోకం ఏడ్చింది” అన్నాడాయన. నేను నవ్వితే ఈ లోకం ఏడ్చింది. ఆ పాటలో ఏదైతే వక్రత ఉన్నదో అది కొంచెం వంకరగా, కొంచెం శోభాయమానంగా ఉండేటట్లు చెప్పాలి. వక్రత, వంకరగా చెప్పడం అంటే దాన్ని విమర్శించడం కాదు. కొంచెం దాన్ని వేరుగా చెప్పాలి. గుంభనంగా చెప్పాలి. కొంచెం విప్పి చెప్పాలి. ఒకసారి మన కనుబొమ్మలుంటాయి. అన్నీ సూటిగానే ఉండవు. కనుబొమ్మలు ఎప్పుడు అందంగా ఉంటాయి? కొంచెం వంకరగా ఉండి ఉంటేనే అందంగా ఉంటాయి. ముక్కు ఎప్పుడు అందంగా ఉంటుంది? కొంచెం సాఫ్ట్ గా ఉండాలి జారినట్లు ఉండాలి. ఎక్కువగా జారినట్టు ఉన్నా అందంగా ఉండదు. ఎక్కువ జారగూడదు, కొంచెం జారినట్లుండాలి. వక్రత ఉండాల్సిందే. వక్రత ఉంటుంది. కానీ ఎక్కువ వక్రత ఉంటే చెడిపోతుంది. కాని వక్రత లేకపోతే, సరళరేఖలాగా ఉంటే అందంగా ఉండదూ. సరళరేఖ అనేది అందంగా ఉండదు? వంకర ఉండాల్సిందే. మనం బొమ్మ గీయాలన్నా గూడా తప్పనిసరితనం కొంతైనా వక్రం ఉండాలి. కన్నుగీయాలంటే వక్రం ఉండాలి. ముక్కు గీయాలంటే వక్రం ఉండాలి. ఏ బొమ్మ గీయాలన్నా వక్రరేఖలుండాలి తప్పదు. అందుకని ఈ వక్రత అనేది వాడారు. సాహిత్యంలో ఈ వక్రతనే వక్రోక్తి అన్నాడు కుంతకుడు. “వక్రోక్తి కావ్యస్య జీవితం” అని అన్నాడు. కావ్యానికి ఏది జీవనం అంటే ఏది ప్రాణం పోస్తుంది అంటే “వక్రోక్తి జీవనం” అని అన్నాడు. వక్రోక్తి అనేది చాలా కీలకం. ఇది నాలుగవది. ఇక ఐదవది గాఢత. చిక్కదనముండాలి. మన వాళ్ళంటుంటారు. కవిత్వం కొంచెం పలుచగయ్యింది. కొంచెం చిక్కగ ఉంటే బాగుండు అంటుంటారు. ఈ పలుచన చిక్కదనమూ అనేవి చిక్కగెందుకో చెప్పలేం కాని ఇది పలుచగైంది అని చెప్పగలం. ఇది కొంచెం చిక్కగ ఉండే దుండె. ఇంకొంచెం నున్నగ చెక్కాల్సి ఉండె అంటారు.

ఇంకోసారి చెక్కడం, గాఢపరచడం ఇవి కొంచెం శక్తివంతంగా తయారు చేయడం అనే ఈ అంశాలన్నీ మనం తరచుగా చెప్తుంటాం. కాబట్టి అటు భారతీయ ఆలంకారికులు చెప్పినటువంటి మాటలు, ఇటు పాశ్చాత్య విమర్శకులు చెప్పినటువంటి మాటలు క్రోడీకరించికొని చూసినట్లయితే మనం కవిత్వాన్ని కళాత్మకంగా సృష్టి చేసి చూసినపుడు చాలా నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ చాలా నైపుణ్యం, నిపుణత్వం ప్రదర్శించేప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ నిపుణత్వాన్ని దేని ద్వారా సాధిస్తాం, ప్రదర్శిస్తాం అంటే సాధన ద్వారానే. ఇవన్నీ కొలమానాలు. ఇంకొకాయన ఏమన్నాడంటే “వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్” అన్నాడు. శిల్పం అంటే ఏంటిదంటే “వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్’ అని అంటే ‘వర్డ్స్ ని అందంగా పేర్చడమే శిల్పం’ అన్నాడు మాటలు అందంగా పేర్చడం, కవితా శిల్పం అంటే వేరే ఏం గాదు. మాటలు మంచి క్రమంలో కూర్చడం పేర్చాలి. వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్. ఏ పదం తర్వాత ఏది పేరిస్తే అక్కడ అందం ఇనుమడిస్తుందో అది చేర్చాలి అని. మార్చడానికి వీలులేదు. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ పెట్టడానికి వీలులేదు.

అట్లాంటి మాటే ఇంకోటి ఉంది. “పొసగ ముత్యపు సరుల్ పోహళించిన రీతి ” ముత్యాల పేరులో ఒక ముత్యం తర్వాత ఇంకో ముత్యం ఎట్లయితే పేరుస్తారో, అన్నీ తెల్లటి ముత్యాలే అయితే మన కళ్ళకు ఇంప్రెషన్ కలుగకపోవచ్చు. అంత నచ్చకపోవచ్చు. మళ్ళీ మార్చినపుడు అందంగా ఉండాలి అంటే ఒక మూడు ముత్యాలు గుచ్చి తర్వాత రత్నంవేసి అందంగా దృష్టిని ఆకర్షించాలి. ఇంకొక రంగు రాయి వేయాలి. గ్రుచ్చాలి. రత్నమన్నా వేయాలి. ఒక రాయైనా వేయాల్సి ఉంటుంది. ఒక రత్నమూ, ఒక రంగురాయి వేస్తే ఆ హారానికి విలువొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎవరేస్తరు? ధరించేటువంటి ఆమె ఇష్టం. రెండవది చేసేటటువంటి కళాకారుడి ఇష్టం. మనకు కూడా, ధరించేటువంటి ఆమె అంటే కళాకారుడిలా పాఠకుడిలా అన్నట్టు. పాఠకుల ఇష్టం ఒకటి ఉంటుంది. ఇందులో సృష్టించిన శిల్పం తీర్చిదిద్దడం కనుక శిల్పం తీర్చిదిద్దడం వెనకాల తప్పని ఆనాటి పాఠకుల యొక్క అభిరుచి అనేది ముఖ్యం. అట్లనే ఈ కవి యొక్క అభిరుచి కూడా కీలకమే. అంటే కవి యొక్క అభిరుచీ కీలకంగానే ఉంటుంది. పాఠకుల యొక్క అభిరుచీ కీలకంగానే ఉంటుంది. ఈ రెండింటిని కలిపేటటువంటిది శిల్పము. కాబట్టి ఈ రెండింటిని కలిపేటటువంటి శిల్పమనేది “పొసగ ముత్యపు సరుల్”. ముత్యాల వరుస ఎట్లా పేరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అది తెలుసుకునేటువంటి నైపుణ్యమే శిల్పము. కాబట్టి శిల్పం కీలకమైంది అని భావించాల్సి వస్తుంది. అయితే శిల్పం గురించి మాట్లాడేప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తాయి గాని, ఆ మాటలలో ఆ శిల్పం ఎందుకు అందంగా ఉంది అని తెలుసుకునే దానికి ఉపయోగపడుతుంది.

“సురకన్య కాబోలు సురకన్య యయ్యెనే యీ రేయి రెప్పలాడించు టేమి”

ఆమె సురకన్యలాగా అందంగా ఉంది అన్నాడు. ‘సురకన్య కాబోలు’ అనే అనుమానం వచ్చింది. ఒక వేళ నిజంగానే సురకన్యే అయితే ఆమె రెప్పలు కొడుతున్నది కదా! మనుషులే రెప్పలు కొద్దరు కదా. దేవతలు రెప్పలు కొట్టరు కదా! అందుకని సురకన్య అని అనుమానమొస్తుంది గాని సురకన్యలు రెప్పలు కొట్టరు గనుక సురకన్యగాదు మానవకన్యనే! మానవకన్యే! !

మానవకన్యనే గాని దేవకన్యలాగా ఉన్నది. అది చెప్పడానికి ఏమన్నాడు ‘సురకన్య కాబోలు సురకన్య అయితే “పుత్తడి………..కాబోలు” బంగారుదే కావచ్చు. ఆమె బంగారుదే అనుకుందామనుకుంటే హంసలా నడుచుకుంటూ పోతున్నది కదా! మరి బంగారం అయితే నడవదు కదా! బంగారం నడువనపుడు దాన్ని.. మరి హంసలాగా నడుచుకుంటూ పోతున్నది కదా! అంటే ఆమె బంగారంలా ఉన్న మానవకన్య. దేవకన్యలాగా ఉన్న మానవకన్య. రెప్పలు కొడ్తుంది కనుక. రెప్పలు కొడుతుంది గనుక, హంసవలె నడుస్తుంది గనుక ఆమె అందమైంది అని – ఇట్లా విప్పి చాలా అందంగా చెప్పేటు వంటి పద్ధతి “సురకన్య కాకపోతే” ఒక్కటే అనుకుందామంటే, “హంసగతుల నడయాడే” హంసలాగా నడుచుకుంటూ బోతుంది గనుక అని చెప్పే ఈ వ్యక్తీకరణ ఈ ఎక్స్ ప్రెషన్ ఏదైతే ఉన్నదో అది కవిత్వీకరణంపై ఉంటుంది. మనసాకర్షించేలా ఉంటుంది అని.

అదే వచన కవిత్వంలోకి వస్తే, మీరుగూడా వినే ఉంటారు ఇది. దాసరాజు రామారావు రాసిన కవిత నేను మీ ముందు ఉంచుతున్నాను. శిల్పానికి ఉదాహరణగా చెప్తాను. “అయ్య చేతిలో అమ్మాయిని పెట్టినపుడు చేతులతో బాటు మనసూ వణికింది” కూతురు పెళ్ళి చేసాడు. సాగనంపు తున్నాడు, సాగనంపేటప్పుడు కవి రాస్తున్నాడు “అయ్య చేతిలో అమ్మాయిని పెట్టినప్పుడు చేతులతో బాటు మనసూ వణికింది” అంటాడు. చేతులు వణికేది అందరికీ తెలుసు. కాని మనసు వణికేది! ఇదే కవిత్వం. ఇదే కవిత్వానికి సంబంధించిన శిల్పం. “చేతులతో బాటు మనసు వణికింది” అంటే చేతులు వణకటం అందరం చూస్తాం గాని ఇప్పుడు తెలిసింది మనసూ వణుకుతుందని. తర్వాత ఏమవుతుందో అమ్మాయి జీవితం ఎలా గడుస్తుందో అని  చేతులూ వణుకుతాయి. కానీ చేతులతో బాటు మనసూ వణికింది. ఇక్కడ ఈ అంశం మన మనసును ఆకర్షిస్తుంది. అరుంధతీ నక్షత్రం చూపించినప్పుడు, “అరుంధతీ నక్షత్రం చూపించి, అమెరికాకు రమ్మంటున్నం” అంటాడు. ఇక్కడ అరుంధతీ నక్షత్రం చూపించడం అనేది ఒక ఆకర్షణీయమైన విషయం. పెళ్ళిల్లో అదొక తంతు. అరుంధతీ నక్షత్రం చూపెట్టడం, అట్లా చూపించినప్పుడు. ఇప్పుడేమంటున్నాడంటే ఇక్కడ గాదు చూపేది, అరుంధతీ నక్షత్రం ఇక్కడ లేదు అమెరికాల ఉన్నదని అనడం అని చెప్పడం అనేది శిల్పం. కనిపెంచిన ఋణం తీర్చుకొని అమ్మాయి వెళ్తుంది అనేది బలాన్ని చేకూర్చేటటువంటిది. ఋణాలను తీర్చుకోవచ్చు ప్రేమలను తీర్చుకోవటమెలా? చూడండి ఇక్కడ, ప్రేమ పెంచుకోవచ్చు. ఋణం దీర్చటడం, ప్రేమను ప్రేమతోనే తీర్చగలది. ప్రేమలను తెంచుకోవటం రెండూ ఎట్లా చెప్తున్నాడో చూడండి ఇక్కడ, ఋణాలనైతే తీర్చుకోవచ్చు గాని, అప్పుకు తిరిగి కట్టడమనేది ఉంటుంది. కానీ ప్రేమకు? అప్పు దీర్చుకోవచ్చు కానీ పెంచిన ప్రేమ మనం తీర్చుకోలేము. ప్రేమను ప్రేమతో తప్ప తీర్చుకోలేము. అది తీర్చుకోవడమనేది ఉండదు. అందుకని అప్పుకు తీర్చుకోవడమనేది ఉంటుంది కాని, ప్రేమకు తీర్చుకోవడం ఏముంటుంది? అని ఋణాలనైతే తీర్చుకోగలం గాని, ప్రేమలను తీర్చుకోవడం ఉంటుందా? అంటూ ఇది ఇట్లా ఒక భావశబలత, భావుకతతో చూపుతూ ఆ సన్నివేశాన్ని, పోతున్నటువంటి సన్నివేశాన్ని రూపుగట్టేటువంటిదిగా, మనసు చెదిరేటువంటి విషయంగా, మనసు కల్లోలమయ్యేట్టుగా, మనసు ఆలోచనల్లో పడేట్లుగా రాయడమన్నదే శిల్పం. అట్లగాకుంటే అది కృత్రిమ కవిత్వం అవుతుంది. అది శిల్పంగాదు అని. అట్లా మనసుకు పట్టుకునేట్టుగా చెప్పడమనేదే శిల్పం.

అందుకని ఈ శిల్పం అనేదానిని మనం సులువుగా అర్థం చేసుకునేటప్పుడు, ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ, కవిత్వ కళ, ఇది క్రాఫ్ట్ ఆఫ్ పోయెట్రీ కవిత్వం రాసేటువంటి కళ. రచనా నైపుణ్యం, ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ ఈ మూడు మాటలు

వాడుకలో ఉన్నాయి. 1. ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ, 2. క్రాఫ్ట్ ఆఫ్ పోయెట్రీ, 3. ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ. కవిత్వ అభ్యాసము. ఇది దేనివల్ల వస్తుంది? దీనికి భావుకత ఉండాలి. అంతకుముందనుకున్నట్లుగానే భావుకతను ఆవిష్కరించడానికి ప్రతిభ కావాలి. ప్రతిభ ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రతిభ ఉంటుంది, కానీ పని తనకు  ఉండదు. అభ్యాసమనేది ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా కవిగా నిలబడలేరు. ఆయనలో మంచి ప్రతిభ ఉంది అంటాం. ప్రతిభ వున్నా, మంచి ప్రతిభావంతుడైనా గాని ఆయన దురలవాట్లకు లోనయ్యాడు అంటాం. అప్పుడెట్లా ఉంటుంది? మంచి ప్రతిభావంతుడే, పాటలు మంచి ప్రతిభావంతంగా రాస్తాడు. రాస్తే బాగా రాస్తాడు కాని రాయడు, బాగానే రాస్తడు దానివల్ల ఏదీ ప్రయోజనముండదు. ఇది గూడా చాలా కీలకమైన విషయం. రాయగలడు కానీ రాయడు. దానివల్ల ఏమి ఉపయోగం? ఉపయోగం ఉండదు. అందుకే, దీన్నే ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ అంటారు. కవిత్వాన్ని నిత్యం అభ్యసించాలి. ఎందుకూ అంటే ఇది లై లాంగ్ క్రాఫ్ట్. జీవితాంతం అభ్యసించాల్సినటువంటి ఒక పనితనం, ఒక కళ. కాబట్టి దీనికి ఒకసారికి అయిపోవడమనేది ఉండదు. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు చదవాలి. ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి | ఎప్పటికప్పుడు అన్వయిస్తూ అభ్యసించాలి, రాయాలి. అధ్యయనం, అభ్యాసం ఈ రెండిటితో పాటు కూడ అన్వయం కూడా చేయాలి. అంటే మనం నేర్చుకున్నదంతా కూడా మన రచనలో శిల్పానికి అన్వయించుకొని, కొత్త కొత్త శిల్పాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కవిత్వానికి సంబంధించి శిల్పాన్ని మెరుగు పరుచుకొని అభ్యాసం చేయాల్సిన అవసరమూ ఉంటుంది.

ఈ శిల్పాన్ని ఒనగూర్చుకోవడానికి ఇంకా ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడి నుండి

మనం సేకరించుకోవాల్సి ఉంటుంది అన్నది ప్రతిభ కావచ్చు, జ్ఞానంగావచ్చు లేదా అనుభవం కావచ్చు. నైపుణ్యం గావచ్చు, మెళకువలు గావచ్చు. మనం తప్పకుండా జానపద సాహిత్యం తెలుసుకోవాలి. జానపద సాహిత్యంలో కూడా చాలా గొప్పనైనటువంటి మాటలు, ఆ మాటల్లో ఉండే శిల్పాన్ని మనం, చాలావరకు మనకు జానపద సాహిత్యమనగానే చాలా తక్కువ అభిప్రాయముండొచ్చు. కానీ దాంట్లో కూడా అద్భుతమైనటువంటి భావుకత ఉన్నది. సృజనాత్మకత ఉన్నది. ఒక పాట… నాకు చాలా ఇష్టమైనటువంటి పాట జానపద గేయం “పొడుస్తున్న భానుడు, పొన్నపువ్వు ఛాయ, పొన్నపువ్వు మీద, పొగడపు ఛాయ” – పొడుస్తున్న సూర్యుడు ఎట్లా ఉన్నాడంటే చూడండి. ఇక్కడ, పొన్న పువ్వు ఛాయ అన్నాడు. పొన్నపువ్వు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. పొన్నపువ్వు ఛాయ. ఆ పొన్న పువ్వూ మీద పొగడ పూవూ ఛాయ. పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ నీడ గనక బడితే ఎట్లా ఉంటుందో అట్లా సూర్యుడు అందంగా ఉన్నాడు

అని వర్ణించుకుంటూ పోతాడు. “ఉదయ సూర్యఛాయ ఉల్లిపొర ఛాయ. ఉల్లిపొర రంగు మీద బీరపువ్వు పొడి చాయ” అని పూల సొగసులతో వరుసగా చెప్తూ పోతాడు. “గుడి యెక్కి బాలుడు, గడి యెక్కి బాలుడు”. “కంబపువ్వూ ఛాయ, కంబ పువ్వు మీద కాకరపూవు ఛాయ”. గడి యెక్కి భానుడు అంటే బాల భానుడు. గుడి యెక్కి భానుడు కనబడుతున్నాడు. గడి మీద కనబడుతున్నాడు. ఎట్లున్నాడు అంటే కంబపువ్వూ ఛాయ. ఆ కంబపువ్వు మీద తాటాకు ఛాయ. ఇక్కడ ఎట్లున్నాడంటే, ఇక్కడ రూపకాలంకారమున్నది, శబ్దాలంకారమూ ఉన్నది. శబ్దాలంకారంతో బాటు అర్థాలంకారమూ ఉన్నది. అది ఆయన సాధించినటువంటి అలంకారాలు. ఆ జానపద గేయంలో ప్రతీకలు. అట్లా ఒక శిల్పాన్ని ఉచ్ఛారణ చేయడమనేది ప్రత్యేకం. ఈ పాట – మన బాలమురళీకృష్ణ పాడినటువంటి పాట. ఒక గీతంలో “గంగ ఉదకముతెచ్చి, నీకు లింగపూజను చేతమంటే” భక్తికి సంబంధించింది అనుకోవద్దు, కవిత్వానికి సంబంధించింది. గంగ ఉదకము తెచ్చినీకు లింగపూజను చేతమంటే “గంగ నుంచి నీరు తెచ్చి లింగాన్ని కడిగి పూజ చేద్దామని అనుకుంటే, “గంగలోని చేప, కప్ప ఎంగిలంటున్నాయి లింగా” ఈ ఊహ ఎట్లా వచ్చిందో చూడండి. నేను గంగలోనుండి నీళ్ళు తెచ్చి నిన్ను కడుగుదామనుకున్నాను. కాని, ఓ శివుడా!, ఓ లింగా! ఆ గంగలో ఉండే మేము ఇంతకుముందే ఈ నీళ్ళు తాగి ఉన్నాం కదా. ఈ ఎంగిలి నీళ్ళతోని ఎట్లా లింగాన్ని కడుగుతావని? చేప, కప్పలు నన్ను వెక్కిరిస్తున్నాయి అన్నాడు. ఎంత ఊహ కావాలి దీనికి? గంగ పవిత్ర జలమంటారు. గంగలో ఉన్న చేప, కప్ప ఎంగిలంటున్నాయి లింగా అని. అంటే గంగనీళ్ళు తెచ్చి పూజ చేయడమనేది. గంగ నీరు చాలా పవిత్రమంటున్నం కాని ఇక్కడ అవి ఎంగిలి చేసినామంటున్నవి. గంగ నీళ్ళు కూడా ఎంగిలి నీళ్ళు అన్నాడు. ఎందుకు ఎంగిలి నీరయ్యాయి అంటే దాంట్లో ఉన్న చేప, కప్ప ఇలాంటి వాటివల్ల అని అర్థం.

ఇక కావ్యశిల్పం గురించి చెప్పుకుంటే, పోతన గారి పద్యాలలో ఒకటి మచ్చుకు

రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,

శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై,

ఛవిమత్కంకణమై, కటి స్థలి నుదచదంటయై, నూపుర

ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్ !

బలి చక్రవర్తి దగ్గరికి వటుని రూపంలో విష్ణువు, వామనుడుగా వచ్చిన సందర్భంలోని ఈ పద్యంలోని శిల్పాన్ని గమనిద్దాం. సూర్యుడు పైన ఉన్నపుడు నెత్తిన గొడుగులాగా ఉన్నదీ, తర్వాత కొంచెం క్రిందికి వచ్చాక ‘శిరోరత్నం’లాగా అది తర్వాత క్రిందికి అట్లా తగ్గడం సువర్ణ కేయూరాభరణం లాగా అవడం అంటే ఒక వస్తువును స్థిరంగా ఉంచి, దానికి సంబంధించిన వాటితో ఎదుగుతున్న క్రమాన్ని పోలికలతో చెప్పడమన్నమాట. ఈ దృశ్యీకరణలో సూర్యబింబం చిన్నగెట్లయ్యిందంటే ముందు ఈ వామనుని మీద ఛత్రీలాగా ఉండేవాడు సూర్యుడు. ఆ తరువాత చెవికుండేటువంటి ఆభరణంలాగా అయ్యాడు సూర్యుడు. అంటే వామనుడు పెరుగుతున్నాడు సూర్యుడు క్రిందికి వస్తున్నాడు. ప్రకాశించే కంకణం లాగా, కాలి అందె లాగా అయ్యాడు. అంటే ఇక్కడ ఒక నగలాగా అయ్యిండు.

అట్లా చిన్నగా అయ్యి ఎట్లా అయ్యిండన్నాడంటే పాదం లాగా అయ్యాడు. పాదాలను అలంకరించి నటువంటి గీతలాగా అయ్యాడు. అంటే మొదట ఛత్రి దగ్గర మొదలుబెట్టి పైన గొడుగులాగ ఉన్నది అంటాడు, క్రింద అదే సూర్యుడు పాదాల దగ్గర, పీఠంగా చేరిండు అని, క్రమాలంకారం వేసినాడు. క్రమాలంకారంతో ఉన్న చాలా మంచి పద్యం ఇది. అట్లా ఆ అలంకారాల గమనిక అటు పద్యసాహిత్యంలో ఉన్నది, ఇటు జానపదంలోనూ ఉన్నది.

ఇలా పోలికల ఆధారంగా చెప్పేటువంటి, ప్రతీకల ఆధారంగా చెప్పేటు వంటి శిల్పం ఏదైతే ఉందో ఆ శిల్పం కోసం మనం కొంచెం, కొన్ని వస్తువులను వరుసగా ఎన్నుకున్నం. ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం చూసుకున్నట్లయితే ఏమిటిది? మనకు కావలిసింది ఇదీ అని మనం అనుకున్నప్పుడు ఈ భావుకతనావిష్కరించడానికి, లేదా శిల్పాన్నావిష్కరించడానికి మనకుండాల్సింది కవితా సామాగ్రి అని అనుకున్నాం. దాంట్లో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసమని మూడింటిని చెప్పుకున్నాం. కాని అసలైతే ఏ కవిత్వమైతే రావాలో దాని కవితా వస్తువు ఏదైతే ఉన్నదో దానికి కావలసిన మొట్టమొదటి పరికరం భాష. మనకు దేనిమీద అనుభవం గావాలి, దేనిమీద అభ్యాసం గావాలి అంటే మొదట భాష మీద కావాలి. దేనితోని భావాన్ని ప్రకటిస్తావు నీవు అంటే, ఒక శిల్పాన్ని నువ్వు ఎక్స్ ప్రెస్ చెయ్యాలి అంటే వ్యక్తీకరించాలి అంటే నువ్వు దేనితోని వ్యక్తీకరిస్తావు అంటే భాషతోని. భాష చాలా కీలకం. భాష లేకుంటే ఏం చేయలేం. అంటే భాష తప్పనిసరి వచ్చి ఉండాలి. భాషలో ఏమున్నది అంటే భాషలో పదజాలం ఉన్నది. మాటలు బాగా తెలిసి ఉంటే రాస్తావు. ఒక్కోసారి మనకు మంచిమాట దొరుకుత లేదంటాం. మంచిమాట దొరకలేదంటే మనకు పదజాలం లేదు. అందుకే పదం అక్కడ వస్తలేదన్నట్టు. అందుకనే పదజాలం బాగా తెలుసుండాలి. విస్తృతంగా చదవాలి. నీకు కరెక్ట్ వర్డ్ రావాలి అంటే, ఇందాక కవిత్వానికి శీర్షిక చెప్పేప్పుడు Best words in Best Order. మంచి మాటను, మంచి క్రమంలో అలంకరించడమే కవిత్వం అన్నారు. అందుకని ఈ మంచిమాటను రాయాలంటే విస్తృతంగా తెలిసి ఉండాలి. ఏయే పువ్వు ఏఏ ఋతువులో పూస్తుంది. ఏ ఏ పూవురంగు ఏంటిది. ఏయే పూవులను ఏరుకుంటావు, ఏయే మాటల పూవులను ఏరుకుంటావు. అసలు నీ దగ్గర పూవే లేకుంటే, ఉన్నదొకటే పూవైతే? ఏరుకోవడానికి ఎట్ల వీలవుతుంది. అట్లే మాటలు, నీ దగ్గర మంచి మాటలు చాలా లేకుంటే ఎట్లా? పూలగంపలాగా మాటల గంప కావాలి. ఆ మాటలన్నీ ఒకచోట చేర్చగలిగే నేర్పు కావాలి. అట్లాగే, అందులో ఏం గావాలి అంటే పలుకుబడులు కావాలి. ఈ పలుకుబడులు కూడా చాలా కీలకమైనవి. పలుకుబడులు వెంటనే చాలా ఆకర్షిస్తాయి. ఇవి సంస్కృతిని చెప్పేవి. ఒక జాతి యొక్క జీవితాన్ని చెప్పేవి పలుకుబడులు. కనుక ఈ పలుకుబడులను తరచుగా కవిత్వంలో వాడటం వలన, నుడికారం వాడటం ద్వారా మీకు ఒక జీవం వచ్చేటటువంటి అవకాశమున్నది. ప్రాణం వచ్చే అవకాశముంది. ఒక బలం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఇవన్నీ కలిసినప్పుడు ఇంకొకమాట వాడుతుంటాం. మనం కవిత్వంలో సాధారణంగా శైలి ఉండాలి అని. ఈ శైలి అనేది కూడా తర్వాత చెప్పుకుందాం. ఈ పదగుంఫనలు, ఈ భాష ఇవి ఉపయోగించేటువంటి పద్ధతి, శైలి కవికి ఉండాలి. శైలి ఎలా ఉండాలి? ఈ భాష, పలుకుబడులు పదజాలం వల్ల ఈ శైలి ఉండాలి. శైలి తర్వాత ఉండాల్సింది అలంకారాలు. చాలా అలంకారాలున్నాయి. ఆలంకారికులు చెప్పినదాని ప్రకారం శబ్దాలంకారాలున్నాయి, అర్థాలంకారాలున్నాయి.

మనం తరువాత అలంకారాల గురించి చెప్పుకుందాం. అలంకారాల మీద కూడా మాట్లాడుకుందాం. అలంకారమంటే భాషను అలంకరించడం. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలతో భాషకు కూడా అలంకారాలవసరం

ఉంది. అలంకారాలున్నప్పుడే భాష అందంగా కనిపిస్తుంది. అవి ఎన్ని రకాల అలంకారాలున్నవి అనేది మరోసారి తెలుసుకుందాం. కవిత్వ సామాగ్రిలో ఇంకొక పనిముట్టు ఏంటంటే పదచిత్రాలు.

కవిత్వంలో అలంకారాలతో పాటు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషించే పదచిత్రాలు, భావ చిత్రాలు చాలా కీలకం. అట్లనే ఇంకొకటి శిల్పమయం కావడానికి కవిత్వ శిల్పం చెక్కటానికి కావలసినవి ప్రతీకలు. ప్రతీక అంటే SYMBOL. అవి కూడా అవసరం.

అట్లనే ఇవన్నీ చర్చలు చేస్తున్నాం. ఇవన్నీ ఉంటేనే అది మంచి కవిత్వమవుతుంది అంటున్నాం. ఈ ఎంపిక చేసుకొని రాసి రక్తి కట్టిస్తాం అనేప్పుడు, రక్తి కట్టించడం అనేది కీలకం. అది రసాత్మకంగా ఉండాలి. ఇందులో ఏదివాడితే రక్తి కడుతుంది? అవతలివారిని ఆకట్టుకోవడం జరుగుతుంది? ఎదుటివ్యక్తి హృదయాన్ని ఆకట్టుకోవడానికి?

ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఆకట్టుకోవడం. దీనికి ఒకటి ధ్వని అయితే ఇంకోటి రసం. అలాగే “వాక్యం రసాత్మకం కావ్యం” అన్నారు. కావ్యం అంటే ఏమిటి? అంటే రసాత్మకమైన వాక్యం కావ్యానికి కావాలని. రసాత్మకంగా ఎట్లా చేయాలి అని తెలుసుకోవాలి. అందుకే రసం అనేది రససిద్ధాంతం అనేది ప్రవేశపెట్టారు. ఆ రసమనేది వచ్చింది. కాబట్టి ఒక శిల్పం వెనుక కరెక్ట్ గా ఆకట్టుకోవడానికి పనిముట్లను చాలానే వేసారు. ఇవన్నీ చుట్టూ ఉన్నవే  ఏరుకొని వేసేటువంటి ఈ నైపుణ్యం ఉండాలి. ఆకట్టుకునేలా రాయడం : అది శిల్పం. ఆకట్టుకోవడానికి ఈ పనిముట్లు, ఈ వస్తువులు ఇవన్నీ కావాలి. ఈ పనిముట్లలో ఏది ఉపయోగిస్తావు? ఎట్లా ఉపయోగిస్తావు? ఏది వాడతావు? దేనిద్వారా హృదయాన్ని ఆకట్టుకుంటావు అనేది అటు పాఠకుడు ఇటు నీవు ఇద్దరూ కలిసి నిర్ధారణ చేసుకోవాలి. శిల్పాన్ని మరింత మెరుగు పెట్టుకోవడం అవసరం. అప్పుడే కవిత్వం కవిత్వస్థాయికి చేరుతుంది. ఒక వస్తువు కవిత్వ శిల్పానికి చేర్చాలంటే శిల్పం, శైలి అవసరం.

ఒక మామూలు వస్తువు. దానికి రూపం తప్పకుండా ఉంటుంది. ఆ రూపాన్ని మెరుగు పరచడమన్నది శిల్పం. రూపానికి వన్నె బెట్టడమన్నది. వన్నెబెట్టటమంటే మెరుపు ఎట్లా వస్తుంది? సాన బట్టాలి, వన్నె బెట్టాలి. సరిగ్గా ఒక నగ చేసేప్పుడు ఒక స్వర్ణకారుడు ఎట్లాగైతే వన్నె తేవడానికి, ఎక్కడ ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అంత జాగ్రత్తగా పనితనంతో చెక్కుతాడు. అప్పుడే ఆ నగకు వన్నె వస్తుంది. ఆ పనితనమే శిల్పం. కాబట్టి రూపానికి వన్నె వచ్చేంతదాకా అతడు ఎట్లా శ్రమ చేస్తాడో అట్లా మీరు కవిత్వ శిల్పం బాగా వచ్చేవరకు ప్రయత్నించాలి. రంగు వేస్తాడా? అక్కడ గీత గీస్తాడా? చుక్క పెడతాడా? రాయిని చేరుస్తాడా? ముత్యం అద్దుతాడా? అనేది ఎట్లా కీలకమో అట్లా అది మీ ఇష్టం. కాబట్టి ఏమి పెడితే అక్కడ శిల్పం బాగుంటుందో తెలిసిపోయేదే భావుకత. భావుకత దగ్గరికే మళ్ళీ వస్తే ఏది బెడితే అందంగా ఉంటుందో అది పెట్టే నైపుణ్యం ఉండాలి. అది ప్రతి కళాకారుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. భావుకత ద్వారా శిల్పం అనేది సాధ్యం. ఇట్ల చేస్తే అట్లు బాగుంటుందన్న ఒక ఊహ రావాలి. భావుకతకు వన్నె కూర్చడం అనేది కూడుకుని ఉంటుందని తెలియాలి. భావుకతకు శిల్పం ఉంటే రాణించి మరింతగా పరిఢవిల్లే అవకాశం ఉంటుంది. చిక్కని కవిత్వం వచ్చే అవకాశం ఉన్నది. “ఔనౌను శిల్పమనర్ఘం” అన్నాడు శ్రీశ్రీ. శిల్పం చాలా గొప్పది అని అన్నాడు. వస్తువును గురించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు వస్తువు ఎంత గొప్పదో ఔనౌను శిల్ప మనర్ఘం అనేలా వస్తువు కొనియాడబడిందో తెలుస్తుంది. ఈ శిల్పం వల్లనే ఒక తిలక్ నిలబడ గలిగాడు. ఈ శిల్పం వల్లనే ఒక బైరాగి నిలబడ్డాడు, ఈ శిల్పం వల్లనే పోతన కవిత్వం చదువుతాం. ఆ శిల్పం వల్లనే ఒక ‘మహాస్వప్నం’ చదువుతాం. ఈ శిల్పం వల్లనే ఒక శివ సాగర్ ను చదువుకున్నాం. అట్లా జాషువాను మీరంతా ఇష్టపడటం వెనకాలా ఆ శిల్పమే దాగున్నది. అయితే వస్తువు ఆకర్షించలేదా అంటే, వస్తువుకు శిల్పం జత కూడినప్పుడే కవిత్వం నిలుస్తుంది. వస్తువుకు శిల్పం గనుక జత కూడకపోతే వస్తువు పేవలమవుతుంది.

సమాజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఒక మాట, ఒక వస్తువు ఎంత గొప్పదైనప్పటికీ శిల్పం లేనిదే రాణించదు. శిల్పం ఎంత గొప్పగా ఉన్నా వస్తువు ప్రజలకు సంబంధించింది కాకుంటే రాణించదు. ప్రజా ప్రయోజనమైనటువంటి వస్తువు శిల్పం లేకపోతే రాణించదు. చాలా అద్భుతమైన కవిత వస్తుంది. కాని అద్భుతమైన పనితనంతో ఉండే శిల్పం లేకుంటే అది రాణించదు. శిల్పం తెలిసీ, భావుకత ఉన్న రచయిత గూడా మంచి వస్తువును ఎన్నుకోకపోతే ఆ శిల్పమూ రాణించదు. వెనకటి నుండి మనకొక మాట ఉన్నది. “మన బంగారం మంచిదైతే మందినెందుకంటం” అని మన బంగారం మంచిది కావాలి. నగ బాగుండాలంటే మన బంగారం కూడా మంచిదయి ఉండాలి. ఒరిజినల్, దాన్నేమంటారు, చొక్కం బంగారం కావాలి. 24 కారెట్ల బంగారం గావాలి. కనుక వస్తువూ చొక్కం బంగారం కావాలి. వస్తువును నగ చేసే శిల్పకారుడు కూడా మంచి భావుకత కలిగి ఉండాలి. అదే సమయంలో అతని అభిరుచికి తగిన విధంగా నగ చేయించుకునేవారూ గావాలి. అంటే మంచి పాఠకులూ కావాలి. అంటే పాఠకుల అభిరుచి, కవి అభిరుచి, సామాజిక అభిరుచి కూడా మంచిగా ఉన్నప్పుడు, కలిసినప్పుడు మాత్రమే శిల్పం కూడా ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఈ శిల్పాన్ని మనమందరం కూడా మెరుగు బెట్టుకుందాం. శిల్పాన్ని నిలుపుకునేటువంటి పనిలో మనమెంత కృషి చేస్తే అంత మంచిగా రాణిస్తుంది. ఆ కవిత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. ఆ కవిత్వానికి ప్రాణం వస్తుంది. నలుగురి నాలుకలపై కలకాలం నడయాడే శక్తి వస్తుంది. ఇది శిల్పం వల్లనే వస్తుంది.

xxxxxxx

కాబట్టి శిల్ప ప్రాధాన్యతను గుర్తించి మన కవిత్వం కూడా సార్వకాలికంగా, సామాజికంగా ఉండేలా రాయాల్సి ఉంటుంది. వస్తువు అవసరాన్ని గురించి మనం శిల్పం అవసరాన్ని మెరుగు పరిచి రాయాలి. మన కవిత్వం కూడా సార్వకాలీనమైనదై ఉంటే శాశ్వతత్వాన్ని ఆపాదించుకొని నిలిచిపోతుంది. కాబట్టి మన కవులందరూ మంచి శిల్పంతో గొప్ప కవిత్వాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాను.

 

October 24, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖా సాహిత్యం- సాంస్కృతిక సాహిత్య ఉద్దీపకుడు కందుకూరి వీరేశలింగం పంతులు..

by Cheedella Seetha Lakshmi October 24, 2021
written by Cheedella Seetha Lakshmi
నాటి కాలంలో ఉత్తరాలకు చాలా ప్రాధాన్యముండేది.భావాలను పంచుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయి.సుఖదుఃఖాలు, సంతోషాలు ,అనుభూతులు ఎన్నో విషయాలను పంచుకోవడమే కాక దాచుకొని మళ్లీ మళ్లీ చూసుకొని మురిసిపోయేవారు.
ఎదలో దాచుకుని అనుభవించే ఉత్తరాలు సాంకేతిక ప్రభావం వల్ల కనుమరుగైనాయని చెప్పవచ్చు.
ఎన్నో సాహిత్యంశాలు,నాటి సంస్కృతి సంప్రదాయాలు,సామాజిక పరిస్థితులు కూడా లేఖల్లో ప్రస్ఫుటమౌతాయి.
కందుకూరి వీరేశలింగం పంతులు గారు  1848 సంవత్సరం 16 వ తేదీ ఏప్రిల్ నెల రాజమండ్రి లో సుబ్బారాయుడు పున్నమ్మ దంపతులకు జన్మించారు.భార్య రాజ్యలక్ష్మమ్మ.
రావుబహద్దూర్ అనే బిరుదముంది.ఎన్నో ప్రక్రియలలో రచనలు చేసిన పంతులు 1919 సంవత్సరం మే నెల 27 వ తేదీన తన 71 సంవత్సరాల వయసులో తనువు చాలించి మనకు ఎంతో జ్ఞాన సంపదను మిగిలించి వెళ్లారు.
కందుకూరి వీరేశలింగం గారు ప్రముఖ కవి,సాంఘీక సంస్కర్త,బాల్య వివాహాలను రూపుమాపి,వితంతు వివాహాలను ప్రోత్సహించి,స్త్రీ విద్యా వ్యాప్తికై పాటుపడిన సంఘ సంస్కర్త.
సాహిత్యంలో  ఈయన చేపట్టని ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహిత్యంలో
నవల,కథ,స్వీయ చరిత్ర,  జీవిత చరిత్ర,ప్రహసనాలు,
నాటకాలు,
ఖండకావ్యాలు మొదలైన  వివిధ ప్రక్రియలే కాక అనువాద ప్రక్రియను కూడా చేపట్టి తనదంటూ  ఒక ప్రత్యేక బాటను ఏర్పరచి  అందరికీ మార్గదర్శకుడై
యుగపురుషుడుగా,
శతాధిక గ్రంథకర్తగా కీర్తింపబడిన మహోన్నత వ్యక్తి.
వీరేశలింగం గారు సాహిత్య విషయపరంగా గానీ,సంఘ సంస్కార విషయపరంగా గానీ చేసిన అవిరళ కృషి.,కష్టనష్టాలు ఆయన తన సమకాలికులకు రాసిన లేఖల ద్వారా  తెలుసుకోవచ్చు.
    రాయసం వేంకట శివుడు గారికి రాసిన లేఖ ద్వారా స్నేహితులు పట్టుబట్టుట చేత  “సంఘ సంస్కరణ మహాధ్యక్ష పదవి” ని అలంకరించినట్లు తెలుస్తుంది.వీరేశలింగం గారి జీవితచరిత్రను గ్రంథరూపములో ప్రచురిస్తారని”సంఘ సంస్కారిణి” పత్రికలో  ప్రకటించినట్లు కూడా ఈ లేఖలో రాశారు. ఆయనకే రాసిన వేరొక లేఖలో వితంతు శరణాలయం గురించి తెలుపబడింది. ” నాకు గల స్వల్పధనము నేనిచ్చట వితంతు శరణాలయమునకై వెచ్చించుచుంటినని  మీకు బహుశ తెలిసియే యుండును. నెలకు 15 రూపాయలు అద్దె వచ్చు గృహమును నేను వితంతు శరణాలయమునకు ఇచ్చినాను.ఈ యద్దె వలన వచ్చు రాబడి శరణాలయమందలి  బాలికలపై  వెచ్చింపబడుచున్నది.
ఈ  బాలికలిప్పుడు  నా గృహముననే యున్నారు.ఇప్పటి ఏర్పాటును బట్టి ఇది నాకును వారికిని గూడా  సదుపాయముగ లేదు.
అందువలన పక్క వీధిలో
ఆర్ద యకరము స్థలమును అందులో వితంతు శరణాలయమును గట్టించుటకై  నేను కొని ఆ స్థలమునకు నాలుగు వైపుల ఇటుకతో ప్రహరీగోడల
బెట్టించితిని.
వితంతువులచ్చట నివాసముగా నుండుటకై ఈ క్రొత్తగా కొన్న స్థలములో  వంటగదులను కొన్నింటిని గట్టించినాను.దీనికొఱకై
ఇప్పటివరకు నేను రూ.2000/- వ్యయపరిచినాను.మరియొక 2000/- రూపాయలు వెచ్చించి
మధ్యమ హాలు కట్టించవలెనని యున్నది.చెన్నపురికి నేనొసంగు కానుకలలో బహుశ ఇది కడపటిది కావొచ్చును. ఇందుకై నేను రూ.400/- ఋణము చేసినాను. పని చేయుచున్న కూలివాండ్రు ఏ దినము కూలీ దినమే అడుగుచున్నారు.సంవత్సరం తరువాత సంవత్సరం నా ఆరోగ్యం పాడై పోవుచున్నది.రాబోవు ఏప్రిల్ నుండి నేను ఉద్యోగము నుండి విరమింప అభిలాషించు
చున్నాను.పరిపూర్ణ దయాద్వారూపుడగు
సర్వేశ్వరుడు నాకాయుర్దాయము నారోగ్యము ననుగ్రహించిన యెడల
నేనుద్యోగము  నుండి విరమించిన తరువాత నా దేశమునకు గొంత సేవ  జేయకలుగుదునని
యాశించుచున్నాను.  వీరేశలింగం గారి సంఘ
సంస్కరణాభిలాష వితంతువుల కోసం ఆయన పడే పాట్లు,నిస్వార్థంగా,
ధారాళంగా వితంతు శరణాలయం కోసం ఖర్చు పెట్టడం,ఉద్యోగ విరమణ తర్వాత కూడా దేశసేవ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం,పరోపకారేచ్ఛ
హృదయంలో అణువణువునా దేశసేవ,సంఘసేవా తత్పరతే ప్రధాన ధ్యేయంగా కలిగిన గొప్ప మానవతావాదిగా  గోచరిస్తారు.
         ఇదే లేఖలో” కృష్ణామండల సాంఘీక సభాధ్యక్ష పదవిని  ఉపన్యాసమివ్వక్కరాలేదనే షరతు మీద అంగీకరించినప్పటికీ సమావేశమైన ప్రజల ఉత్సాహానికి అనుగుణంగా తప్పనిసరిగా ఉపన్యాసమివ్వ
వలిసి వచ్చిందన్నారు. ఇలా వీరేశలింగం గారి పట్ల ప్రజలకున్న అభిమానం వ్యక్తమౌతుంది.  రాయసం వెంకట శివుడు గారికి  రాసిన ఇంకో లేఖలో…
“సహాయకుల కొరతయే నన్ను బాధించుచున్నది.నా తదనంతరం వితంతు శరణాలయమెట్లు జరుగునో” అను విచారాన్ని వ్యక్తం చేశారు కందుకూరి. స్త్రీలకు ఉపయోగపడు పుస్తకాలను, మత గ్రంథములను రాయుటకు సంకల్పించడం,స్త్రీ ప్రార్థనా సమాజం బాగా పని చేస్తోందని తెలపడం,స్త్రీ పునర్వివాహ పట్టికను రాసి పంపడం,
భార్యాభర్తలిద్దరూ వితంతు  శరణాలయం
కోసం సేవచేయడమే కాక వితంతువులను పోషించడానికి తగినంత సొమ్ము లేదనే బాధ వ్యక్తం చేశారు. “పర రంధ్రాన్వేషణ సులభకార్యము.గొప్ప ధర్మ సంస్థలు జరుపువారి కష్టములు
కార్య సాధకులకే ఎరుకపడగలవు. దైవ సహాయము నా విద్యుక్తముల నేను నెరవేర్చ ప్రయత్నింతును. ఈశ్వరుడు తోడ్పడక మానడు. చందాలు పోగుచేయుటకు నేను పర్యటనము చేయవలయును ఇతరులను  తప్పు పట్టడం సులభం.సంస్థ నడపడంలో కష్టము నడిపేవారికే తెలుస్తుంది”  అని ధర్మసంస్థలు నడపడంలో గల సాధకబాధకాలను తెలియచేశారు. స్త్రీ సంస్కరణాభిలాష ఎంత  గాఢంగా వుందో
లేఖల ద్వారా విదితమవుతుంది. బాలికల కోసం తను స్థాపించిన పాఠశాల్లో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయినందుకు
ఆనందాన్ని వ్యక్తం చేశారు” అని  కందుకూరి వెంకటరత్నం గారికి  రాసిన లేఖలో పేర్కొన్నారు.
కందుకూరిలో సంఘసేవ,దేశసేవాకాంక్ష ఎంత గాఢంగా ఉందొ దైవభక్తి,ఈశ్వరినిపట్ల విశ్వాసం కూడా అంత తీవ్రంగా ఉందని ఉత్తరాలే నిరూపిస్తాయి.”
 పరిపూర్ణ దయాస్వరూపుడగు సర్వేశ్వరుడు నాకాయుర్దాయము నారోగ్యముననుగ్రహించు” ననీ ఆయన తదనంతరం వితంతశరణాలయం ఎట్లా జరుగుతుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ” అన్నిటి యందును దైవ సహాయమునే నేనాశించుచున్నా” నని,చిరాయువొసంగినందు కీశ్వరునికి కృతజ్ఞతలు” తెలిపాడు.మూడువారాల నుండి కురుపుతో బాధపడుతున్న సమయంలో కురుపు తగ్గితే దైవానుగ్రహం వలన ఆ కురుపు పూర్తిగా నిమ్మళించినది,ఈ కష్టమునోర్చుకొనుటకు దేవుడు నాకు దగిన బలమునొసగి నన్నన్నివిధముల సంరక్షించుచున్నాడని,దైవ సహాయమున నా విద్యుక్తముల నేను నెరవేర్చ ప్రయత్నింతునని,అవసర సమయములందు స్వార్థ పరాయణులైన మిత్రులు నన్ను వీడవచ్చును,కాని సర్వేశ్వరుడు నన్ను వీడడనే నా నమ్మకము” అని నా వృద్ధాప్యములో యిప్పటి నా అసహాయస్థితిలో సర్వేశ్వరుడు నాకు శాంతి నొసంగియున్నాడు.నేనెప్పుడును ఈశ్వరునిపై ఆధారపడియున్నాను.ఈశ్వరపాలితమైన ఈ ప్రపంచమున సత్యమే జయించి తీరును.మన యుద్యమము ధర్మము పైనను సత్యముపైనను ఆధారపడి యున్నది” అంటూనే ఎవరేమన్న లెక్కచేయక మన విద్యుక్తధర్మాన్ని నిర్వహిస్తే అంతా దేవుడే చూసుకుంటాడనే మనస్తత్వం కలవాడు.వ్రాతలను లెక్కచేయడం తెలివితక్కువ.కుక్కలు మనలను చూచి మొరిగితే మొరగనీయండి,మన జీవితాంతం వరకు భూషణ దూషణములు పరిగణించక మన విద్యుక్త ధర్మాన్ని చేద్దామని,కష్టపడి పనిచేస్తే తప్పక ఫలితముంటుందని  సర్వేశ్వరుడే మంచి చెడ్డలు నిర్ణయించగలడనే అభిప్రాయం  తెలుస్తుంది.సర్వేశ్వరుడు నిస్శంశయంగా సహాయం చేస్తాడనడానికి నిదర్శనంగా తన జీవితంలో కూడా ఒక విచిత్ర సంఘటన జరిగింది. వీరేశలింగం గారు స్వీయచరిత్ర రాస్తున్న సమయంలో తనకు బలహీనంగా వుండడం వల్ల బలమిచ్చే ఔషధం కొరకు కలకత్తాకు రాసి మందు తెప్పించుకున్నారు.పెట్టె తెరచి మందు ప్రారంభిద్దామనుకొని సీసా మూత తీయడానికి ప్రయత్నం చేయగా ఆ సీసామూత గట్టిగా బిగించి వుండడం వల్ల తెరవలేక పోయారు.మూత తీయడానికి తగిన సాధనం నొకదాన్ని కొనడానికి సాయంత్రం బజారుకెళ్లాలని ఆలోచిస్తున్న సమయంలో,ఉదయం బల్ల దగ్గర కూర్చుని గ్రంథం వ్రాస్తున్న బల్ల దగ్గరే ఆకస్మికంగా ఒక ధ్వని విని పై నుండి యేదో పడిందనుకున్నాడు.ఎవరో రాయి విసిరితే యే పెంకుముక్కో బట్టలో పడిందనుకుని పైకి చూస్తే విశేషం ఏమీ లేదు.తన బట్ట తఫుముకుని చూస్తే అందులో ఒక కార్క్ వుండడం చూసి ఆశ్చర్యపోయాడు.కిటికీలో ఉన్న సేసాను చూస్తే సీసామూత తెరవబడి ఉంది.ఇది దైవ సంఘటనగా భావించారు.
    ఈ విధంగా దైవంపట్ల దృఢమైన నమ్మకానికిది నిదర్శనం.స్వార్థపరులు,మిత్రులు కూడా వదలిపోవచ్చు కానీ దైవం మాత్రం తననెప్పుడు వీడదనే అచంచల విశ్వాసమున్నవారు.అనేక ఉత్తరాల్లో దైవాన్ని స్మరించడం కనిపిస్తుంది.వీరేశలింగం గారి చిత్తశుద్ధి,సత్యాన్వేషణ,కార్య దీక్ష లేఖల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
   సాహిత్య విషయంగా ఈయన చేసిన కృషి అనన్యసామాన్యమని, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి లేఖలు దోహదం చేస్తాయి.
   1870 సంవత్సరం ఆగస్టు నెల ‘ గోదావరీ విద్యా ప్రబోధికా’ పత్రిక యందు సంధి విషయమై పంతులుగారు ప్రచురించిన అంశాలు అసంగతులుగా తమకు తోచినవని,గుంటూరు గవర్నమెంటు ఆంగ్ల వర్ణాక్యులర్ స్కూల్ సహాయోపాధ్యాయులు.ఎ.వేంకట రంగాచార్యులు నవంబర్ నెల పత్రికలో ప్రకటించారు.దానిపై పంతులుగారు సమాధానాన్ని’ పురుషార్థ ప్రదాయిని’ పత్రికలో లేఖా ముఖంగా వెల్లడించారు.ఈ లేఖలో పంతులుగారు ఎందుకు సమాధానామీయవలసి వచ్చిందో చెప్పుకుంటూ” ఆ వ్రాసిన వ్రాత వరుసను బట్టి చూడగా నవి యొకమూల బారవైచి యూరకుండుటయే తగిన తిరస్కృతి యని పండితులొకవేళ భావించినను సామాన్యముగా బామరుజనులాయన మాటలను బాటుగ గట్టి నే జెప్పినవి తప్పులనుకొందురేమోయని యెంచి ప్రత్యుత్తరమివ్వవలసి వచ్చెను” అని వ్రాసారు.తన గురించి ఎవరేమైనా అనుకోనీయండని అనుకునే స్వభావం కాదని తెలుస్తుంది.పండితులైనా సరే మిడిమిడి జ్ఞానం వున్నవారెవ్వరైనాసరే సమాధానమియ్యవలసిందే.ఎందుకంటే సమాధానమీయకపోతే పామరజనులు తాను చెప్పే అంశంలో నిజంగా తప్పులున్నాయేమో
నని అనుకునే ప్రమాదముంది. వీరేశలింగం మనస్తత్వం స్పష్టమౌతుంది ఈ లేఖలో. సంధి విషయంలో తను చెప్పిన అంశాలు సరియైనవేనని, పూర్వలాక్షణికులు: అప్పకవి,అభినవ దండి ,అధర్వణాచార్యుల లక్షణ గ్రంథాల్లోని సంధి సూత్రాలను పేర్కొంటూ వివరంగా,సలక్ష్యంగా,విపులంగా చర్చించి సమాధానమిచ్చారు.కావ్య ప్రయోగాలను కూడా చూపించడం జరిగింది.
  ఒకనికి దారి జూపబోయి తానే దారి తప్పినట్లు తప్పులు పట్టేవారికి సైతం తప్పు గలిగెను గదా అని తప్పు పట్టడంలో గూడా ఒక అర్థముండాలని” ఇక ముందైన తప్పులు పట్టుటయందు గొంచెము జాగ్రత్తగా నుందురని” వేడుకోలుగా మందలిస్తూ హెచ్చరించారు.తనపై అకారణంగా విమర్శ వస్తే భరించలేని స్వభావం కలవాడిగా,వెంటనే ప్రతి సమాధానం పంపించేదాకా ఆయనకు తృప్తి వుండదని తెలుస్తుంది.
   ఎవరైనా తప్పు చెపితే యే విధంగా విమర్శించేవారో తనది తప్పని తెలిస్తే నిరభ్యంతరంగా ఒప్పుకునే స్వభావం కూడా కలవాడని ‘పురుషార్థ ప్రదాయిని’పత్రికాధిపతికి వ్రాసిన లేఖ ద్వారా తెలుసుకోవచ్చు.సంధి విషయంలోనే వేంకటాచార్యుల గారిని ” భ్రమ ప్రమాదాదులు మనుజ ధర్మములగుటంజేసీ యొకవేళ యొత్తి వ్రాయునపుడు నేనే యట్లు వ్రాసియుండవచ్చును” అని వేడుకుంటూ “నిర్మల దేహమును వదలి వ్రణములకే పరుగులెత్తు మక్షికముల వలె గాక నీరు విడిచి పాలుగొను హంసలంబోలుట పండితులకు సహజము గాన నా తప్పులు మన్నించి యొప్పుల గ్రహింతురని నమ్మెద” నంటారు.పొరబాట్లు జరగడం సహజం.కానీ సమాజంలో చాలామంది తప్పున్నా కూడా ఒప్పుకోరు.కానీ వీరేశలింగం గారి వ్యక్తిత్వం తిరిగి పత్రికాముఖంగానే సమాధానాన్ని ప్రచురించడం ద్వారా హృదయ వైశాల్యాన్ని,నిర్మల హృదయాన్ని అర్థం చేసుకోవచ్చు.
    ‘ఆముద్రితగ్రంథ చింతామణి’ పత్రికాధిపతి పూండ్ల రామకృష్ణయ్య గారికి  వ్రాసిన లేఖ కందుకూరి సంస్కారానికి ప్రతీక.శకుంతల నాటక భాషాంతరీకరణకు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ నాకు తప్పులు లేవను వారు చేసెడి యాక్షేపణలు సయుక్తికములైనచో వందన పూర్వకముగా నందుకొని యింకొక కూర్పునందు సాధ్యమైనచో సంస్కరించుకొనియెదను.యీర్ష్యా ప్రధానములై దూషణముల నిండియున్నచో దిరస్కార భావముననుపేక్షించెదను” అని నిర్మొహమాటంగా వ్రాసారు.
   ఆకాలంలో కూడా పేర్లుమార్చి రాసేవారని,అటువంటి వారిని కనుగొని వారికి తగిన సమాధానం ఇచ్చిన పద్ధతి పూండ్ల కృష్ణయ్య గారికి వ్రాసిన లేఖలో తెల్పబడింది.శకుంతలా నాటకానువాదంలోని పద్యాల విమర్శ ‘ సూర్యాలోక’ మనే పత్రికలో చూసి వెంటనే ప్రత్యుత్తరాన్ని ఆ పత్రికకే రాయక పూండ్ల కృష్ణయ్యకు రాసినట్లు తెలిపారు.అందులో పత్రిక చదవగానే ” నామములు మార్చుకొన్నను వానినన్నింటిని వ్రాసిన వారొక్కరేయనియు,వారిట్టివారనియు,వారు వ్రాసిన యుద్దేశమిట్టిదనియు నాయూహకు దగిలినది,అందుచేత నేను బదులు వ్రాసి తగవులాడుచుండుట యుచితముగాదని” అంటూనే “వారితో సమానుండను గాకపోయినను తప్పులు పట్టుటలోను,పరిహసించుటలోను నాకును గొంత సామర్థ్యము కలదు” పూర్వం లాగా నేను లేను,మారిపోయానని చెప్పి “అట్టి పాడు పనికి బూనుట నా కనర్హమైన పనియని వారిని సవినయులుగా జేయుట కీశ్వరుం బ్రార్థించెద” అంటూ సునిశితంగా రాసాడు.ఆయన స్నేహితులకు రాసిన లేఖల్లో ఆరోగ్య విషయాలు,భార్య మరణం మొదలైన ఎన్నో వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి.
‘రాయసం వేంకటశివుడు’ గారికి రాసిన లేఖలో పలువురి కోరిక మేరకు తన స్వీయచరిత్రమును వ్రాస్తున్నట్లుగా,తన  దినచర్యపుస్తకాలు దగ్గరుంచుకోలేదని తెలిపారు.తన ‘జనానా’పత్రికను తన ముద్రణాలయంలో అచ్చువేస్తున్నట్లు,మీరు సారస్వత పత్రిక నెలకొల్పాలన్న సంకల్పం యోగ్యమైనదేనంటూ” అనేక విషయాలను గురించి స్వతంత్రములు,ఉపయుక్తములగు వ్యాసము ప్రచురించి ప్రాచుర్యముననున్న పత్రికలను మించవలెనని” సూచనలిచ్చి  ‘చింతామణి’ అని పేరు పెట్టాలని సూచించారు.వ్యాసాలు ఉద్బోధకములు,జనరంజకముగా ఉండాలని సూచిస్తూ తన అప్పులన్ని తీర్చివేసి ” ఆంధ్ర వాఙ్మయాభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్షను,ఆశయాన్ని వెలిబుచ్చుట ద్వారా ఆంధ్ర సాహిత్యాభివృద్ధి కోసం వీరేశలింగంగారి తపన తెలుస్తుంది.’ కాళ్లకూరి నరసింహము’ గారికి వ్రాసిన లేఖలో స్త్రీలకుపయోగించు పుస్తకములు,మతపుస్తకములు వ్రాయదలచానని చెప్తూనే ” ఇక నా జీవిత శేషమును సాధ్యమైన యెడల పుస్తకములు వ్రాయుటలోనే గడుపవలెనని యున్నది”అంటూ తన దృక్పథాన్ని తేటతెల్లం చేశారు.
వీరేశలింగం గారు తాను రచించిన కవుల చరిత్ర పునరుద్ధరణ విషయంలో వంగూరి సుబ్బారావు గారి సహాయాన్ని   అర్థించినట్లు సుబ్బారావు గారికి రాసిన లేఖల వల్ల తెలుస్తుంది. “నా కవుల చరిత్రమును
సంస్కరించుటలో మీరు  చేయు వాగ్దానము,చేసిన తోడ్పాటుకును మిగుల కృతజ్ఞుడై ఉన్నాను. నేను వృద్ధుడను వ్యాధి బాధితుడను దుర్బలుడై యున్నాను.
ఇక  దీర్ఘ కాలము బతుకబోను. కాబట్టి శీఘ్రకాలంలోనే నా కవుల చరిత్రమును సరిచేసి పునర్ముద్రణము చేయింప నిశ్చయించుకున్నాను”.అని రాయడం వలన  వృద్ధుడు వ్యాధిగ్రస్తుడు
అయినప్పటికి  కవుల చరిత్ర పునర్ముద్రణ
విషయంలో   కందుకూరి కి గల శ్రద్ధ వ్యక్తమౌతుంది. నిరంతర కృషి  కొనసాగించాడని తెలుస్తుంది.
  కవుల చరిత్రలోని గ్రంథాలను ఏ వ్
భాగంలో చేర్చాలో మార్పుచేర్పులను సరిగ్గా తెలిపి ‘గురుతు పెట్టగలరని’ రాశారు.ప్రథమ భాగంలో చేర్చాల్సిన కవులను  రాసి పంపమనియు, సత్యం తెలుసుకోవడమంటే
ఇష్టమని తప్పులు శత్రువులు  చూపిననూ
కృతజ్ఞతతో  అంగీకరిస్తానని, ఒప్పులు చూపేవారికంటే   తప్పులు చూపేవారే అధికమిత్రులని చెబుతూ కవుల చరిత్రము లోని ప్రమాదములను మీరు
పుస్తకములో వ్రాసి కొన్నట్లు రమణారావు పంతులు చెప్పారని  రాస్తూ నా తప్పులను
దిద్దుకునే అవకాశం  కలుగుతుందని వంగూరి సుబ్బారావు గారికి  రాశారు. కవుల చరిత్ర విషయంలో  వీరేశలింగం గారి కృషి,ఎంత శ్రమ పడ్డారో,మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లు వంగూరి సుబ్బారావు గారికి రాసిన లేఖ వలన తెలుస్తుంది.
1.పండిత సుబ్బరాయశాస్త్రి ఎవరు?
2.సత్యాశ్రయుని శాసనములో నున్న పద్యమేది?
3.నన్నెచోడుడు కానీ
యధర్వణుడు  గానీ
నన్నయ్య కు పూర్వులు కారని నేను
తలచెదను.
4.చిక్కరాజు మొదలైన వారిని గూర్చి ఏ లక్షణ గ్రంథములలో నేమేమి
వ్రాయబడినదో తెలుపుడు.
5.ఫణిభట్టు కాలమును నిర్ణయించుటకాధారము లేమియున్నవి?
నన్నయ తిక్కనలను మాత్రం స్తుతించుట కాల నిర్ణయమునకు చాలదు.రామకృష్ణ కవిగారు ప్రచురించిన
“పరతత్వ రసాయనము నా  యొద్ద లేదు. మీ యొద్ద నున్న నొక్కసారి బంపుడు” అని మద్రాసులో ఉన్న ప్రాచ్య లిఖిత
 బాండాగారానికి వంగూరి సుబ్బారావు గారికి వేరొక జాబులో రాస్తూ ‘నిస్సంక కొమ్మన
దగ్గుపల్లి దుగ్గయ్య పుస్తకాలను. చూడొచ్చు.అల్లసాని పెద్దన గూర్చి నూతన వివరాలను తెలిసికోవచ్చునని, వేరొక లేఖలో ప్రభాకరశాస్త్రి గారును,మానవల్లి రామకృష్ణయ్య గారును,నాకింకను ఏమీ సహాయము చెయలేదని,
చేస్తారో చేయరో తెలియదని  చేయకపోయినను పుస్తకాన్ని సవరించి ముద్రిస్తానని రాస్తూనే
కవుల చరిత్ర విషయంలో  ఎప్పటికప్పుడు సమాచారాన్ని,సమస్యలను రాసేవారు. కాల నిర్ణయ  విషయంలో
తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ లేఖలు రాశారు.
కవి నిర్ణయం చేసే ముందు,కాల నిర్ణయం చేసేముందు తన అభిప్రాయాన్ని తెలుపుతూనే
సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో శ్రమకోర్చి 684 పుటల కవుల చరిత్ర గ్రంథాన్ని ముద్రించి వంగూరి సుబ్బారావు గారికి,పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారికి,కూచి నరసింహం గారికి
పంపించి వారికందరికి “లేఖలను రాసిన వారికెల్లరకును నా పుస్తకములోని గుణములను    శ్లాఘింపవలసిన పని లేదని నేను దిద్దుకోనుటకవకాశము
కలుగుటకయి దోషములను మాత్రమే చూపవలసినదియు,వ్రాసియుంటిని”అని రాస్తూనే మీరు కూడదోషములను చూపాలని సుబ్బారావు గారికి రాయడం వలన వీరేశలింగం గారి హృదయం అవగతమౌతుంది. పది మంది చేత పొగిడించుకోవాలని కాక విమర్శనాత్మక దృష్టితో గ్రంథాన్ని చదవాలన్న సూచన చేసినట్లు తెలుస్తోంది. విమర్శనాత్మక  దృష్టితో
చదివి విమర్శించినప్పుడే
పొరబాట్లను దిద్దుకునే
అవకాశం కలుగుతుంది.నిర్మొహమాట వ్యక్తిత్వం,పొగడ్తలకు తలవంచే మనస్తత్వం కందుకూరిది కాదని తెలుస్తుంది.
    వీరేశలింగం గారు మిత్రులకు,సమకాలికులకు రాసిన లేఖల వల్ల ఆయన వ్యక్తిత్వం,సంఘ సంస్కరణాభిలాష,కృషి,పట్టుదల,స్వీయచరిత్ర రచన,కవులచరిత్ర పునర్ముద్రణ విషయంలో పడ్డ కష్టాలు,సర్వేశ్వరుని పట్ల అచంచల విశ్వాసం,మిత్రులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు,సలహాలు,సూచనలు, ఆయన ఉపన్యాసాల పట్ల ప్రజలకుండే ఆసక్తి,నాటి భాష మొదలైన విషయాలు లేఖల వల్ల తెలుసుకోవచ్చును.
———————–
*డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*
విశ్రాంత సహయాచార్యులు
హస్తినాపురం
హైదరాబాద్
చరవాణి :9490367383
October 24, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అచ్చ తెలుగు ప్రబంధంయయాతి చరిత్ర

by సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి October 24, 2021
written by సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

 

 

 

 

సిహెచ్. లక్ష్మణచక్రవర్తి: పరిచయం

డా|| సిహెచ్. లక్ష్మణచక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సాహిత్య విమర్శక వ్యాస రచయితలలో వీరికి కాలక్రమానుశీలన ప్రక్రియా విమర్శకులుగా మంచి స్థానమున్నది. ఇందుకు వీరు తెలంగాణ నుండి తెలుగు సాహిత్య రంగంలో మహావిమర్శకులుగా లబ్ధప్రతిష్ఠులైన కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న గారల విమర్శన మార్గదర్శనంలో చేసిన కృషి ఎంతో దోహదకారి యైనదని చెప్పవచ్చును.

లక్ష్మణ చక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో ప్రవేశించే కంటే ముందు హైదరాబాదు దోమలగూడలోని సుప్రసిద్ధమైన ఏ.వి.కళాశాలలో 14 సంవత్సరాల కాలం డిగ్రీ, పి.జి. తరగతులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధించినారు. ఆ కాలంలో వీరు ఎంతో శ్రమకోర్చి “ఆధునిక సాహిత్య విమర్శరీతులు” (2005) గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ఈ గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయి విమర్శ గ్రంథాలలో మంచి సంప్రదింపు గ్రంథంగా పేరుపొందింది. ఇదే వరుసలో “ఆధునిక సాహిత్య విమర్శకులు – ప్రస్థానాలు, గ్రంథానికి (2008) కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఈ గమనంలో ప్రత్యేకంగా సంపాదకవర్గంలోని సభ్యులుగా చెప్పుకోదగిన కృషి చేశారు. “తెలుగు సాహిత్య విమర్శ దర్శనం” (2016) విజ్ఞాన సర్వస్వ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణగా వెలువడింది.

ఇక వ్యక్తిగతంగా లక్ష్మణరేఖ (2009), కవిత్వానుసంధానం (2012), ప్రతిబింబం (2014), నవ్య సంప్రదాయ సాహిత్యం (2012) వీరి ప్రత్యేక విమర్శ వ్యాసాల సంపుటాలు. తన గురువులు కోవెల సంపత్కుమారాచార్య (2016) గురించి మంచి మోనోగ్రాఫ్ ను రచించారు. ఉన్నత విద్యలో భాగంగా ఎం.ఫిల్ పట్టా కొరకు “పరమ యోగి విలాసం” (2008) పై పిహెచ్.డి. పట్టా కోసం “ప్రాచీన తెలుగు సంకలనాలు” (2018) పై పరిశోధన చేసినారు.

తెలంగాణలోని ప్రసిద్ధ వైష్ణవ కుటుంబానికి చెందిన లక్ష్మణ చక్రవర్తి చిన్నతనంలోనే సంప్రదాయ విద్యలైన ద్రావిడ ఆగమాలను మద్రాలో చదువుకున్నారు. తన తండ్రిగారి వద్ద పాంచరాత్రాగమం అభ్యసించారు. తమిళంలో విశేష ప్రవేశం ఉన్న డా॥ లక్ష్మణ చక్రవర్తి గారు కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరికపై కావలికోట పేరుతో తమిళ నవల కావల్ కోట్టెను తెలుగులోనికి అనువదించారు.

తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం (2010), కొలకలూరి భాగీరథమ్మ పంచ సాహిత్య విమర్శ పురస్కారం, వరంగల్ “సహృదయ” సాహిత్య విమర్శ పురస్కారం స్వీకరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా 2019 ఏప్రిల్ లో మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ (2016)లో అందుకున్నారు.

శీర్షికను అనుసరించి నిర్దిష్ట క్రమంలో సోపపత్తిక అంశాలతో సాహిత్య వ్యాసాన్ని రూపొందించటంలో లక్ష్మణ చక్రవర్తి శ్రద్ధ మెచ్చుకోదగ్గది. వీరి వ్యాస సారాంశ క్రోడీకరణం ఎన్నదగింది.

తెలంగాణ ప్రబంధాలు : పరిచయ మాలికలో భాగంగా నేను సంకల్పించిన తెలంగాణ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలలో “యయాతి చరిత్రము” అచ్చ తెలుగు ప్రబంధాలలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెలుగు కావ్యము. తెలుగు భాష నన్నయ కాలం నుండి సంస్కృతంతో జతపడి నడుస్తూ మహాకవిత్వ శిల్పాన్ని కైవసం చేసుకున్నా అచ్చ తెలుగుగా అచ్చతెలుగు పలుకుబడి బాసగా తన ఉనికిని ఏమాత్రము కోల్పోలేదు. ప్రొథికి సంస్కృతం-పలుకు నుడికారమునకు తెలుగుదనం తెలుగు భాషకు మెప్పుకొప్పుల నయగారం.

“ప్రబంధం” తెలుగు సాహిత్య ప్రక్రియలలో సుప్రతిష్ఠమైన ఒక ప్రత్యేక ప్రక్రియ. కవితా రామణీయకమునకు వర్ణన, సౌందర్యమునకు పేరెన్నిక పొందిన రమణీయ కమనీయ పద్య శిల్ప రచన తెలుగు ప్రబంధము.

అచ్చతెలుగు భాషలో సైతం వర్ణనా వైదగ్యము పాత్ర చిత్రణ, రస సమున్మీలనాదులెట్లు సమగ్రముగా పరిపోషించబడినవో “యయాతి చరిత్రము”న పొన్నిగంటి తెలగన్న నిరూపించినారు. కనుకనే అచ్చతెలుగు కావ్య ప్రబంధ ప్రక్రియ తదనంతర కాలములో బలముగా నిలదొక్కుకున్నది.

కూచిమంచి తిమ్మకవి వంటి ప్రసిద్ధ కవులు అందిపుచ్చుకున్న ప్రక్రియకు ఆద్యుడైన పొన్నిగంటి తెలుగన్న ధన్యుడు.

నేను కోరిన వెంటనే వ్యాసాన్ని రచించి అందించిన డా|| సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గారి సహృదయతకు ముగ్ధుణ్ణయ్యాను. తొలి ప్రబంధమేది చర్చను “పాలపిట్ట – జూన్”లో సుదీర్ఘవ్యాసంగా ప్రచురించిన లక్ష్మణ చక్రవర్తి విమర్శన పద్ధతి సమకాలీన పండితుల ఆదరాన్ని పొందిన విషయం సాహిత్యవేత్తలకు విదితమే. డా|| లక్ష్మణ చక్రవర్తికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

– గురిజాల రామశేషయ్య

అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)

అచ్చ తెలుగు ప్రబంధంయయాతి చరిత్ర

తెలుగు సాహిత్యంలో ప్రాచీన వాఙ్మయం అంతా పరిణామ దృష్టిని ప్రయోగాత్మక దృష్టిని కలిగి  ఉంది.  ఇది ప్రాచీన సాహిత్యాన్ని గమనించినప్పుడు తెలుస్తుంది . తెలంగాణలో  ఈ దృష్టి ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ వచ్చిన కావ్య ప్రబంధాలు నిరూపించాయి.  ఆ క్రమంలో ప్రబంధ వాఙ్మయంలో అచ్చతెలుగు ప్రయోగాన్ని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు పొన్నగంటి తెలగన. అటువంటి యయాతి చరిత్రను పరిచయం చేయడం ఈ వ్యాస లక్ష్యం.

కవి విశేషాలు.

పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్ర లో అక్బర్ బాద్షా,  మల్కీబ్రాహీం శ్రీరంగ రాయలను పేర్కొన్నాడు.  వీళ్లంతా క్రీ.శ. 1550 మొదలు క్రీ.శ.  1605 మధ్య పరిపాలనను చేసినవారు అందువల్ల యయాతి చరిత్ర ప్రబంధం 1574-  1581  మధ్య రచించినట్లు సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు.  పొన్నగంటి తెలగన మిగతా కవుల కంటే ఎక్కువగా అవతారికలో కృతిపతి వంశ వర్ణన చేశాడు కానీ తన కుల, గోత్రాల  విషయాలను చెప్పుకోలేదు.  ఆశ్వాసాంత గద్యలో మాత్రం ‘ శ్రీ మదనగోపాల మంత్ర వర ప్రసాద లబ్ధ సారస్వత సుకవి జనహిత వచోవైభవ  భావనా మాత్య తనూభవ సౌజన్య వినయ ధుర్య పొనికంటి వంశ్య తెలగనార్య ప్రణీతంబైన ‘ అని చెప్పుకున్న వాక్యాలను  బట్టి బ్రాహ్మణులలో నియోగి వర్గానికి అందులోనూ ఆర్వేల  నియోగులకు సంబంధించిన  వాడని, వైష్ణవ మతానుయాయి అని పరిశోధకులు భావిస్తున్నారు.

క్రీ.శ. 1574- 81లో మధ్య యయాతి చరిత్ర రచించిన తెలగన  జీవించిన కాలాన్ని ఇదమిత్థంగా సాహిత్య చరిత్రకారులు స్పష్టం చేయలేదు. కానీ క్రీ.శ.  1550- 1600 మధ్య జీవించాడని వివరించారు.  ఆయన ఎంతకాలం కచ్చితంగా జీవించి ఉన్నాడన్న అంశం స్పష్టంగా నిర్ణయించినట్లు కనిపించదు.  పరిశోధకులు వైష్ణవ మత అనుయాయిగా ఆయనను చెప్పటానికి మరింగంటి అప్పన్న తో  తెలగనకు ఉన్న సంబంధం కారణంగా భావించవచ్చు.

ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1550 – 1580 కు మంత్రిగా ఉన్న అమీనుఖాను పొట్లచెరువు( నేటి పటాన్ చెరువు) రాజధానిగా అనేక మంచి పనులు చేసాడు.   కృతిపతి  అయిన అమీనుఖాను వంశం కుతుబ్ షాహీ వంశస్థులను  మూడు తరాల నుండి కొలుస్తున్నది. ఆయన పొట్లచెరువును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు పటాన్ చెరువు సమీపంలో అమీన్ పుర అన్న ప్రాంతం ఉంది. అమీనుఖానుకు అంకితం ఇవ్వడం వల్ల తెలగన ఈ ప్రాంతపు వాడేనని రూఢి అవుతున్నది.  యయాతి చరిత్ర లో ‘కూర్మిబ్రోవసత్యచింతామణి పొట్ల చెరువునందు’(1-16 ) అని పేర్కొనడం కూడా కారణమే.

తెలుగు సాహిత్యంలో 15వ శతాబ్దంలోని తెలుగు కవులురచనారీతిలో కొత్త పద్ధతిని అనుసరించారు.  తెలంగాణేతర  ప్రాంత కవులను పక్కకు పెడితే కొంచెం ప్రయోగ దృష్టి ఈ ప్రాంతంలోనూ ఉన్నదని భావించేందుకు యయాతి చరిత్ర వంటి రచనలు ఉదాహరణలుగా నిలుస్తాయి. “ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగరంలో తలదాచుకున్నప్పుడు తెలుగు రాజుల ఆదరాన్ని, తెలుగు వారి వంటకాలను చవిచూసిన వాడు. తెలుగు కవితా  గాన మాధుర్యాన్ని గ్రోలిన వాడు. అంకితాల సంప్రదాయాన్ని తెలుసుకున్నవాడు. సంస్కృత పదబంధాల మిశ్రాంధ్రం కొంత కటువుగా తోచి తేటతెనుగున  కవిత చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఉవ్విళ్ళూరినవాడు” అని ఆరుద్ర  అభిప్రాయపడ్డారు.   అందుకే అచ్చ తెలుగు కావ్యాలు రచనకు ప్రోత్సాహం ఇచ్చి ఉంటాడు తెలుగుదేశపు సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా ప్రోత్సహించారు.  అయితే ఇది భాషా చైతన్య దృష్టితో జరిగిందా లేక ప్రయోగ చైతన్యంతో జరిగిందా అన్నది పరిశీలనాంశమే.

ఛంద: పరంగా ద్విపద కావ్యం, భాషాపరంగా అచ్చతెలుగు కావ్యం కావ్య ప్రక్రియ భేదం కిందికి వస్తాయి.  భాష పరంగా తెలుగు సాహిత్యంలో తెలగనకు ముందే పోతన వంటి వారు సంస్కృతము తెలుగు రెండూ ఇష్టమైన వారికి అనుకూలంగా రచన చేస్తున్నారు.  భాష పరంగా అటు తద్భవము ఇటు దేశ్యము మధ్య నలుగుతూ మిశ్రాంధ్ర భాషలలో కావ్యాలను రచిస్తున్నారు.  పద్యం అభివ్యక్తిలో ప్రౌఢతను పొందింది. అయితే భాషాభిమాన దృష్టితో కాక ప్రయోగ దృష్టితోనే అచ్చ తెలుగు కావ్యాలు వెలువడ్డాయని చెప్పవచ్చు.  కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నాలని పురాణ కథలను పుట్టురత్నాలని, పుట్టు రత్నాలను కల్పనతో  సానబెట్టినవి జాతి  రత్నాలని కథా వస్తువు విషయంలో రామరాజభూషణుడు చెప్పిన మాట.  కళాపూర్ణోదయం, రాఘవపాండవీయం,  ప్రభావతీ ప్రద్యుమ్నము, చరిగొండ ధర్మన్న చిత్ర భారతం, నూతన కవి సూరన ధనాభిరామము వంటివన్నీ ప్రయోగదృష్టితో వెలువడ్డాయి.  రాజుల పోషణలో మిగతా కవుల కంటే భిన్నంగా వ్రాయాలన్న పట్టుదల ప్రయోగ బాహుళ్యానికి  కారణం అయింది.  అచ్చ తెలుగులో అటువంటి ప్రయోగం చేయాలనుకోవటం లో స్వీయ ప్రతిభా పాండిత్య ప్రదర్శన కీర్తి కాంక్ష కారణాలుగా  అచ్చ తెలుగు కావ్యాల పై పరిశోధన చేసిన కె.వి. సుందరా చార్యులు భావిస్తున్నారు.  అయితే మరింగంటి అప్పన ప్రోత్సాహం కూడా అచ్చతెలుగు కావ్యం ప్రయోగానికి  కారణం అయింది.

మున్నెవ్వరు నొడువని యీ

తెన్నిడి కడుమీఱి యచ్చతెనుగుంగబ్బం

బెన్నిక మీఱగ జెప్పిన

నిన్నుం బొగడంగ గలదె నెలతాల్పయినన్ (1- 11).

అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్

హెచ్చనియాడుచుండురదియెన్నుచునేర్పున బొత్తమెల్ల ని

ట్లచ్చతెనుంగునన్నుడువనందుల చందమెఱుంగు వారునిన్

మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో నినున్ (1- 12).   ఒక అచ్చతెలుగు పద్యం కావ్యం లో ఉన్నా మెచ్చుకుంటారు. గొప్ప అంటూ ఉంటారు సాహిత్య సౌందర్యం తెలిసిన వారు ఆశ్చర్య  పడతారని మరింగంటి అప్పన చెప్పటం ఈ కావ్య ప్రక్రియ గౌరవాన్ని చెప్పటంతోబాటు, ప్రక్రియ ప్రయోగాని కారణమయ్యింది.

ఇక్కడ  అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్  హెచ్చనియాడుచుండడం అన్నది

జాగ్రత్తగా గమనించవలసిన వాక్యం.  సంస్కృతం ప్రౌఢ నిర్మిత పద్యంతో, శ్లేష, ద్వర్థి ప్రబంధాలలో అక్కడక్కడ దేశ్య పదాలు కనిపించడాన్ని సహృదయులు ఆదరిస్తున్నారని తెలుస్తుంది. ఈ ఆదరణకు తగిన ఉదాహరణలు  స్పష్టంగా ఏమీ దొరకవు.    కానీ ప్రౌఢ కావ్యాలలో అచ్చతెలుగు పద ప్రయోగాలు పద్యాలు కనిపిస్తాయి.

అచ్చతెలుగు ప్రబంధాన్ని రచించడానికి నాటి కవుల ప్రయోగ దృష్టి, ప్రత్యేకత నిలుపుకోవాలన్న కోరిక కారణాలుగా కనిపిస్తే యయాతి చరిత్ర నే ఎన్నుకొవడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది.  శ్రీనాథుడు నలదమయంతుల కథ ను శృంగారనైషధం గా, పిల్లలమర్రి పినవీరన శకుంతల కథను శృంగార శాకుంతలంగా  అప్పటికే రచించి వాటికి కావ్య ప్రబంధ రూపాలను ఆ కథలకు కల్పించారు.  తపతి సంవరణుల కథను అద్దంకి గంగాధరుడు అందించాడు శకుంతల, దమయంతి, తపతి కథలలో ఒక ఇల్లాలికథే ఉంది.  శకుంతల దమయంతులు తన పాతివ్రత్య ధర్మం ద్వారా తమ వివాహం చేసుకున్న భర్తలను పొందారు.  సంవరణుడు తపస్సు చేసి సూర్యపుత్రిక తపతిని పొందాడు.   యయాతి చరిత్రను కావ్యంగానో, ప్రబంధంగానో మలచిన రచన యయాతి చరిత్ర పూర్వం ఒక్కటి కూడా కనిపించదు (ఎక్కడైనా ఉన్నా అది సాహిత్య చరిత్రలో ప్రసిద్ధంగా లేదు). తెలుగు ప్రబంధాలన్నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రధానంగా చర్చించేవి. ప్రతిపాదించేవి.  ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉన్నా,  వివాహం చేసుకుని ఉన్నా ఇద్దరి పరస్పర అనురాగం వలన కలిగిన సంతానం వల్లనే వారు (అంటే ఆయా పాత్రలు) చతుర్విధ పురుషార్ధాలు పొందినట్లు గమనించవచ్చు.  యయాతి కథలో ఈ సూత్రం ఇమిడి ఉంది. బహుశా తాను ప్రబంధంగా మలచదలచిన ఈ అంశం ఈ కథలో పొన్నగంటి తెలగన గుర్తించి  దీనిని ఎన్నుకున్నాడని భావించవచ్చు.

గార్హస్థ్య ధర్మం సతీ పతుల.  అద్వైత ప్రణయ సిద్ధికి ఫలరూపం కావాలి. కానీ అహంకారాల అనంత సంఘర్షణలకు రణరంగం కారాదు.  ఒకరి లో ఒకరు కరిగి జాలువారుతున్నట్టు ఉండాలి కానీ ఒకరికై ఒకరు  జాగరణ చేస్తున్నట్లు ఉండకూడదు.  దేవయాని గార్హస్థ్య ధర్మం ఉండకూడని విధంగా ఉంది. అందువల్ల  కొడుకులు పుట్టినా ధర్మం క్రమంగా కొడిగట్టడం మొదలయ్యింది. యయాతికి ఆత్మ తృప్తి లేదు. సంసారం వల్ల  ఏ అమృతత్వాన్ని  కోరుకున్నాడో  అది అతనికి లభించలేదు.  అతని గార్హస్థ్య ధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్వలించింది.  క్రమంగా వృద్ధి చెందుతున్న మానసిక గార్హస్థ్య ధర్మం  యయాతి లో పునరుజ్జీవింప చేసిన శక్తి శర్మిష్ఠ .   (ఆంధ్ర మహాభారతం అమృతత్వ సాధనం 141.)

బహుభార్యత్వం ఉన్న నాటి రాజులను దృష్టిలో పెట్టుకొని సమాజం, వ్యవస్థా ధర్మాలు అంగీకరిస్తున్నా గార్హస్థ్య ధర్మ ప్రాధాన్యాన్ని చెప్పడానికి నల దమయంతులు, శకుంతలా దుష్యంతుల కథలు అనుకూలమైనవే అయినా అవి అప్పటికే వ్రాయబడినవి.  అప్పటికి రాయబడని ఉపాఖ్యానాన్ని ఎన్నుకోవాలన్న లక్ష్యంతో యయాతి చరిత్రను  అచ్చతెలుగు ప్రబంధంగా మలచడానికి పొన్నగంటి తెలగన ప్రయత్నం చేశాడనిపిస్తుంది.  మహాభారతంలోని యయాతి కథకు ధార్మికత ధర్మం ప్రధానమైన అంశాలు.  తెలగన ఎన్నుకున్న కథకు శృంగార రసాత్మకమైన కల్పన ప్రధానం. అందుకే దేవయాని శర్మిష్ఠలు యయాతిని  పెండ్లి చేసుకునేంత వరకే కథను చెప్పి ముగించాడు.  శర్మిష్ఠ కు సంతానం కలగటం తో కావ్యాన్ని మంగళాంతంగా ముగించాడు.  నాటి కాలంలోని  శృంగారరస ప్రాధాన్యం ఈ ముగింపుకు కారణమని చెప్పవచ్చు అదిగాక తనకంటే ముందు రచించబడిన ప్రబంధాలు ఇటువంటి నిర్ణయానికి కారణమై ఉంటాయి.

కథా సంగ్రహం.

ప్రథమాశ్వాసం లో ప్రతిష్ఠానపురం వర్ణన , యయాతి  వంశావతరణ,   రాజ్యపాలన, ఆటవికులరాక మహారాజు  వేటకు వెడలి అరణ్యానికి చేరడం అన్నవి ప్రధానాంశాలు.  కృతిపతి వంశ వర్ణనలు పక్కనపెడితే ఇందులో యయాతి వేటకై బయలుదేరి అడవి దగ్గరి పల్లెలో విడిది చేస్తాడు.

ద్వితీయాశ్వాసం లో వేటలో లేడిని వెంబడిస్తూ మంచుమల ప్రాంతంలోని జాబాలి ఆశ్రమానికి ప్రవేశించడం, జాబాలి యయాతికి రామాయణ కథను శ్రీరాముడు జననం వరకు చెబుతాడు.   ఈ కథ ఇక్కడ చెప్పడానికి  కారణం యయాతిని అట్లా ఒంటరిగా రాకూడదనడానికి చెప్పడం కొర కనిపిస్తుంది.  రామజననం ఆ మధ్యలో రావణుడు స్వర్గంపై దండెత్తడం వర్ణించాడు. రావణుడు తన పురాల పై దండయాత్ర చేయడం వలన దేవతలు విష్ణువును దర్శించడానికి వెళ్ళడం ఈ ఆశ్వాసంలో వర్ణించాడు.

తృతీయాశ్వాసంలో శ్రీరాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళినది మొదలుకొని రావణుడిని చంపి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకునేంత వరకు చెప్పాడు.  యయాతి జాబాలి దగ్గర సెలవు తీసుకుని దప్పికతో ఒక బావి దగ్గరికి వెళ్లి బావిలో పడి ఉన్న దేవయానిని చూసి ఆమెను పైకి తీసుకుని వస్తాడు.  బావిలో ఎలా పడ్డావని దేవయానిని అడుగుతాడు. దేవయానిని వెతుకుతూ అక్కడికి వచ్చిన  ఘూర్ణిక యయాతి కి శర్మిష్ఠ కథ చెబుతుంది.  అక్కడ  చెలులంతా జల క్రీడలు ఆడుతుండగా పారు నీటిలో  బట్టలు నగలు కలిసిపోతాయి. శర్మిష్ట అది గుర్తించలేక దేవయాని చీర కట్టుకుంటుంది. వారి మధ్య జరిగిన ఘర్షణలో దేవయానిపై కోపం తెచ్చుకొని ఆమెను బావిలోకి తోసి వెళ్ళిపోతుంది శర్మిష్ఠ.  అప్పుడే అక్కడికి వచ్చిన శుక్రుడు తన బిడ్డ దేవయానిని ఓదార్చి శాంతించమని చెబుతాడు.  ఇంతలో వృషపర్వుడు వచ్చి శుక్రుడిని బతిమాలి శర్మిష్ఠ ను దేవయాని కోరికమేరకు దాసిగా ఇస్తాడు.   ఇక్కడ వృషపర్వుడికి శుక్రుడు కచుని కథను చెబుతాడు. ఈ ఆశ్వాసంలో తెలగన ఘూర్ణికతో శర్మిష్ఠ కథను, శుక్రుడితో కచుని కథను చెప్పించడం ప్రబంధ ఇతివృత్తంలో పఠనాసక్తిని పెంచింది.

వసంత ఋతువు  చెలుల వన విహారంతో    ప్రారంభమైన  చతుర్ధాశ్వాసం లో యయాతి శర్మిష్ఠను చూడటం దేవయానిని పెళ్లి చేసుకోవటం ప్రధానమైన అంశాలు.  వన విహారం చేస్తూ వచ్చి శర్మిష్ఠను చూసిన యయాతి ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు.  దేవయానిని వివాహమాడతాడు వివాహ  వర్ణన విపులంగా చేసి ఈ ఆశ్వాసాల ముగించాడు తెలగన.

చెలికత్తెలు దేవయానిని సింగారించడంతో ప్రారంభమయ్యే పంచమాశ్వాసంలో  యయాతి దేవయానుల  సంభోగ శృంగారం,  దేవయానికి సంతానం కలగడం వర్ణించాడు.  ప్రమదవనంలో యయాతి శర్మిష్ఠను చూసి అక్కడ ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని అంతఃపురానికి తీసుకుని వస్తాడు.  ఆమెకు   ద్రుహ్యుడు, అనువు పూరుడు అనే ముగ్గురు,  దేవయానికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు సంతానంగా కలుగుతారు. వారిని పొంది దేశ పాలన చేస్తున్నాడని ప్రబంధాన్ని ముగించాడు తెలగన.

మహాకావ్యం సర్గ బంధ లక్షణాలు తెలుగు ప్రబంధాలకు అన్వయించే ప్రయత్నం కొందరు చేసినా ‘ ప్రబంధ లక్షణాలు సంస్కృత గ్రంథాలతో అన్వయించేవి కావు. ఆంధ్ర విమర్శకులు రూపొందించినవే’ (అనుశీలన ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం వ్యాసం పుట 173.)    అంటూ తెలుగు ప్రబంధ లక్షణాలు 10 వరకు ఉన్నట్లు తెలుగు విమర్శకులు గుర్తించారని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

  1. అష్టాదశ వర్ణనలకు ప్రాధాన్యం
  2. కథలో వస్త్వైక్యము కానీ ఏకవాక్యత కానీ పాటించ బడాలి.
  3. ప్రబంధ వస్తువు ఏక నాయకశ్రయమై ఉండాలి.  అపూర్వ పాత్రలను పోషించే దిశగా రాణించాలి.
  4. శృంగారరస ప్రాధాన్యం
  5. ప్రబంధాలు అనువాదాలు కారాదు
  6. ప్రబంధాలలో దృశ్యకావ్య మర్యాదలు పాటించాలి
  7. జాతి వార్తా చమత్కారాలు
  8. ప్రబంధ వస్తువులో ప్రతీకాత్మకత
  9. ఆలంకారికమైన శైలి.
  10. ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం.

యయాతి చరిత్ర లో వర్ణనలు దేశీయతను ప్రౌఢతను రెండిటినీ సంతరించుకున్నాయి.  పురాణ వర్ణనలో అట్ట, వప్ర,  తోరణ, ప్రసాద, ధ్వజ, పరిఖ, వేశ్యలను వర్ణించాడు. పుర, ఋతు ప్రయాణ,  శైల, సాగర, ఆశ్రమ, మంత్ర, రణ, విజయ, వనవిహార,  వారికేళి. కన్యాంగ సౌందర్య,  చంద్ర  సూర్యోదయాలు, పరిణయ, సురత, దౌహృద, సుతజన, వేట,  ప్రకృతి వర్ణనలను తెలగన చేశాడు.

ప్రఖ్యాత, ఉత్పాద్య,  మిశ్రమాలుగా ఇతివృత్తాన్ని ఆలంకారికులు విభజించారు. ప్రఖ్యాత కథను ఎన్నుకుని అందంగా తీర్చిదిద్దిన   ఈ యయాతి కథ వస్త్వైక్యంతో కూడింది.  యయాతి కథను పూర్తిగా కాక శర్మిష్ఠకు కలిగిన పుత్రోదయంతో ముగించాడు తెలగన.  అలా మంగళాతంగా ముగించాడు.  కథ పురవర్ణన తో ప్రారంభించి వేట వర్ణనలతో నడచి యయాతి జాబాలి ఆశ్రమానికి చేరుతాడు. తర్వాత దేవయానిని కాపాడటం, తర్వాత వృషపర్వుడి కూతురు   శర్మిష్ఠ, శుక్రుడి కూతురు దేవయాని కథలు తెలుసుకోవటం, శర్మిష్ఠను ఇష్టపడటం,  దేవయానితో వివాహం సంతానం కలగడం, శర్మిష్ఠతో వివాహం సంతానం కలగడం వంటి అంశాలను ఒక వరుసలో చెప్పడంవలన వస్త్వైక్యం, ఏకవాక్యత పాటించినట్లు గుర్తించవచ్చు.  అందులోనూ ప్రబంధ కథను కథలకు పరమార్థం అయినా గృహస్థాశ్రమ ధర్మాన్ని కేంద్రీకరించికొని వస్తువును ఏకవాక్యతతో నిర్వహించాడు.   యయాతి, దేవయాని, శర్మిష్ఠ పాత్రలను కథానుగుణంగా చిత్రించాడు.

అపూర్వ పాత్ర చిత్రణ  అనలేము కానీ పాత్ర స్వభావం చిత్రించడంలో సమకాలీనత కనిపిస్తుంది. పాత్రలను కథాసూత్రానికనుగుణంగా పాత్రల స్వభావాన్ని చిత్రించాడు తెలగన.

శృంగారరస ప్రాధాన్యం ప్రబంధాలలో ఉండే ఒక ప్రధాన లక్షణం . శృంగారరసాభాసమూ, శృంగార రస  ప్రాధాన్యంతో కూడినదే. యయాతి కథను శృంగార రస ప్రాధాన్యంతోనే నిర్వహించాడు.  యయాతి దేవయానుల మధ్య శృంగారంతో పాటు శృంగారాభాసమూ కనిపిస్తుంది.

ప్రబంధాలలోని కథలు సాధారణంగా ఇతిహాస పురాణాల నుండి గ్రహించేవిగా ఉంటాయి.   పురాణాలు ప్రబంధాలు కథలకు బ్లూప్రింట్ వంటివి వాటిని స్వతంత్ర రచనలు నిర్వహించినట్లు నిర్వహించాలి.  యయాతి చరిత్రలో వర్ణనలలో కథానిర్వహణ పాత్రల చిత్రణ దేశీయతలను పాటించి స్వతంత్ర రచనగా నిర్వహించాడు.

నాటకీయతను పాటించడం ప్రబంధాలలో కనిపించే మరో లక్షణం.  పంచ సంధులను పాటిస్తూ రసానునుగుణంగా కథను నిర్వహించడంలో, కొన్ని సన్నివేశాలను రంగాలుగా నిర్వహించడంలో  పాత్రల ఆంగిక వాచిక సాత్త్విక అభినయాలలో ముఖ్యంగా పంచమాశ్వాసంలో నాటకీయతను పాటిస్తూ యయాతి చరిత్ర రచన కొనసాగింది.   మూడవ ఆశ్వాసంలో యయాతి దేవయానిని కాపాడడం కచ దేవయాని కథలు,  శర్మిష్ఠ కథ తెలియడం గర్భసంధి గా కనిపిస్తుంది.

జాతి వార్తా చమత్కారాలు ప్రబంధ కవులు తమ కంటే ముందున్న ఉద్యోగం నుంచి తెచ్చుకున్న  గుణమని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.  జాతి వార్తా చమత్కారం అంటే తాము జీవిస్తున్న కాలంనాటి వాస్తవికతను స్వీకరించడం తమ నేటివిటీని చిత్రించటం.  వాస్తవ ప్రతిబింబము జాతి అయితే వార్త దాని వివరణ.  అది చమత్కృతితో  వ్యక్తీకరించటం జాతి వార్తా చమత్కారం.   ఈ. లక్షణం  యయాతి చరిత్ర లోని  వర్ణనలలో   వివాహ ఆచారాలలో అడుగడుగునా కనిపిస్తుంది ఇందులోని కోట వర్ణన గోల్కొండ కోటను స్పురింప చేస్తే , అమీనుపురము గోల్కొండకు, ప్రతిష్ఠాన పురానికి రూపాంతరముగా కనిపిస్తుంది.   అమీనుఖాన్ పాలన  యయాతి పాలన వర్ణనలలో  చూడవచ్చు.  వివాహ ఆచరణలో ఈ జాతి వార్తా చమత్కారాన్ని స్పష్టంగా యయాతి చరిత్ర లో గమనించవచ్చు.

ప్రతీకాత్మకత ప్రబంధాలలో మరో లక్షణంగా తెలుగు విమర్శకులు భావించారు. యయాతి మూలభారత కథలో  రెండు యవ్వనాలను  అనుభవించిన వాడు.  దేవయానం పితృయానం  రెండింటిలోనూ సంచరించిన వాడు.   తెలగన యయాతి లో ఒక యవ్వనాన్ని అది కూడా పరస్పర   అనురాగ రూపమైన ధర్మబద్ధ శృంగారాన్ని వర్ణించాడు.  ప్రతీకాత్మకంగా ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించాడు. దేవయాని అహంకారానికి శర్మిష్ట  గార్హస్థ్య ధర్మానికి ప్రతీకగా ఈ ప్రబంధంలో కనిపిస్తుంది.

ఆలంకారిక మైన శైలి ప్రబంధ పద్యానికి వన్నె తెచ్చిందని చాలామంది అభిప్రాయం. రాయప్రోలు సుబ్బారావు ప్రబంధ పద్యాన్ని మొగ్గలు నవ్వి పువ్వులగు  పోల్కి అని అభివర్ణించాడు.  సంస్కృత సమాస భూయిష్టమైనదే ఆలంకారిక శైలికి అనుకూలము అన్న భావనను దూరం చేసింది యయాతి చరిత్ర.

సీ.       బలుమించు తలచించు నలిమించు సిరిబొల్చు , మేచాయ విరుల సంపెంగల జేయ

నెలతీరు బలుమారు లలిగేరు నెమ్మోము, చెలగి తమ్ములనుదమ్ములను జేయ

జగడాల బగడాలనగుడాలు గలమోవి,  చెందమ్మి రేకుల జివుడుసేయు

గరముచీకటి గప్పు కప్పు వేనలియొప్పు, తేటుల కొకవింత నీటుసేయ

గీ.         నలువజగముల గలిగిన పొలుపుగరచి, యొంచి వెన్నెల కరువులో నించి యలివ

గా దలంచగ బోలు నీకలికి నవుర    యనగనటవచ్చునద్ధేవయానిగని                4-53,

సీ.       నలచివైచిన జాలనలరు కప్రపుదావి, పొలుపొందు నెమ్మేన బుగులు కొనగ

వేనలి దుఱిమిన విరిసరంబుల సొంపు, లలమి తేటుల నెల్ల నామతింప

దెలివి కట్టాణి ముత్తెముల పేరుల రంగు, కలిమి పాలిండ్ల వెన్నెలలు గాయ

వలపుల చిఱునవ్వు కలయబూజాలుగా, ముద్దుజెక్కుల మీద మొలకలెత్త

గీ.    మోముదామరయింపైన మురువుతోడ, జెలువమగు తియ్యదేనియ చేతనమరు

మరునియాఱవ తూపునాబరగు నట్టి, దేవయాని, గనుంగొని ఠీవి మెఱసి   5-3. ఆలంకారిక శైలికి మంచి ఉదాహరణలు.

కుంతకుని వక్రోక్తి  సిద్ధాంతం ప్రబంధ ప్రస్థానంలో ప్రధానమైనదిగా భావిస్తారు విమర్శకులు.  పొన్నగంటి తెలగన వ్యక్తీకరణలో అచ్చతెలుగు నిలుపుకున్నాడు. వైదగ్ధ్య భంగీ ఫణితిని  భాషాపరంగా ముందు ఎన్నుకున్నాడు. తెలగన ప్రబంధ వక్రతను.  యయాతి చరిత్ర లో అనుసరించాడు.  ఒక రసంలో ఉన్న ఉపాఖ్యానాన్ని దాన్ని మరో రసం లోకి మార్చి నిర్వహించటం ప్రబంధ వక్రతలోని ఒక అంశం.  ఇందులో ఏడు రకాలైన భేదాలను వక్రోక్తికారుడైన కుంతకుడు ప్రతిపాదించాడు. ఒక కావ్యంలో ఎన్నో సన్నివేశాలను కవి రూపొందించవచ్చు కానీ వాటిలో దానికి ప్రాణ భూతంగా చిత్రించి మొత్తం కావ్యానికి అది ప్రాణప్రదంగా ఉండేట్లు చేయటం ప్రకరణ వక్రత.   కచ దేవయాని వృత్తాంతం తెలగన యయాతి చరిత్రలో తరువాత వస్తుంది. ఇది ప్రబంధ పఠనాసక్తిని పెంచటానికి అనుసరించిన వ్యూహం.  దేవయానికి వివాహం చేస్తే కట్టు తప్పిన తనం మొండితనం తొలగిపోతాయని చెప్పే సందర్భంలో ఈ కథను చెప్పాడు.  ఇది తెలగన నిర్వహించిన యయాతి కథకు ఆయువు పట్టు.  ఇది ప్రకరణ వక్రత. యయాతి కథను  శృంగార  రసాత్మకంగా నిర్వహించడం లోనూ ప్రబంధ వక్రత కనిపిస్తుంది.  ప్రబంధ లక్షణాలుగా భావింపబడుతున్నవాటితో సమన్వితమైన అంశాలు యయాతిచరిత్రలో స్పష్టంగా కనిపిస్తాయి.

అచ్చ తెలుగు పద ప్రయోగ వైచిత్రి. 

వివిధ రకాల వైచిత్రులలో  భాషాపరమైన వైచిత్రి కూడా ఒకటి.  నియమ కవిత్వం పేరుతో ఇందులో రసాస్వాదనకు తగిన వైచిత్రి ఉండదనే ఉద్దేశంతో ఈ చిత్ర గర్భ బంధ అచ్చ తెలుగు కావ్యాలకు తగినంత ఆదరణ లభించలేదు.

తెనుగునకు మారు పేళ్ళిడి

పెంచిన వినకూడదనుచు బిరుదులు బేళ్ళున్

మును వేల్పు భాస వెంబడి

నునిచెద గాదనకు డయ్య   యుల్లము లందున్    ( 1-14)   అన్న పద్యం అచ్చతెలుగు ప్రయోగంలో ప్రబంధ నిర్మాణం చేస్తున్న కవికి ఉండవలసిన జాగరూకతను తెలుపుతుంది.  అంతేకాకుండా తత్సమ కావ్యాన్ని అచ్చతెలుగు ప్రబంధంగా అనురణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతుంది.   ఇది ఒకరకంగా అనువాద సూత్రం,  నియమం కూడా.  కావ్యం రసాత్మకం గా నిర్వహించవలసినది అందువల్ల ఎక్కువ మంది కవులు ప్రఖ్యాత వస్తువునే ఎన్నుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలిసిన పాత్ర పాఠకుడిని  కొంతవరకు  కావ్యోన్ముఖుడిని చేస్తుంది. కావ్య గర్భం లోకి ప్రవేశించడానికి అనుకూలమైన స్థితిని నిర్మిస్తుంది.  విభావం ఏర్పడి ఉంటుంది. అందువల్ల పాత్రలను అచ్చ తెలుగులోకి మార్చి పేర్కొనడం అనుకూలమైనది కాదని భావించి ఈ నియమాన్ని ఏర్పరచుకున్నాడు.  కథలో వచ్చే పాత్రలకు మాత్రమే ఈ నియమం పెట్టుకోవటం ఇక్కడ జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం. అందుకు తగిన భాష, జాతీయాలు, సామెతలు, నానుడులు ప్రయోగాల ద్వారా నిర్మించుకున్నాడు.

కావ్యంలో పురాణ ఇతిహాస పాత్రలకు( యయాతి కథకు ప్రత్యక్ష సంబంధం లేనివి)  ప్రయోగించిన పేర్లు అచ్చ తెలుగు భాషకు పదజాలానికి చేర్పు వంటిది.  శబ్దరత్నాకర కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు ఈయనను నాలుగో స్థానంలో కూర్చోబెట్టినా ఇతని రచన ఎన్నో తెలుగు పదాలు నిఘంటువులకు ఆకరంగా నిలిచింది.

లక్ష్మీదేవి    – కలిమి పొలతి, పైడినెలత, తమ్మిపూవింటనెలకొన్నదంట.

కృష్ణుడు       – కఱిదేవర, కణివేల్పు

బ్రహ్మ            – నాలుగుమొగములతడు

పంచముఖ      – ఏనుమోముల మోట

తారాధిపతి       – చుక్కలరాయుడు

సహస్రాక్షుడు    – వేయికన్నుల వేల్పు

విష్ణువు          – నుడుగుల చెలిమామ, కలిమితొయ్యలి గేస్తు

రాక్షసగురు      – తొలి వేల్పుటయగారు

అగ్నిదేవుని భార్య – సెగఱేనిచాన

యముని భార్య   – జముగేస్తురాలు

వరుణుని భార్య –  నీటిరాయనిచిల్క

వాయువు భార్య-  తెమ్మెర కొమ్మ

కుబేరుని భార్య –  ముక్కంటి చెలిలేమ

చంద్రుడు          –  తొగలరేడు

ఆదిశేషుడు      –  చిలువల గమికాడు   వంటివి యయాతిచరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ఇందులో కొన్ని పూర్వపు కవులలో కనిపిస్తే, కొన్ని పొన్నగంటి తెలగన ప్రయోగాల ద్వారానే వెలుగులోకి వచ్చాయి.

కొడుకులకోట (తల్లి), రక్తసంబంధం నెత్తురు పొత్తు (రక్తసంబంధం),  అద్దమరేయి (అర్ధరాత్రి) బయటికెత్తిన దివ్వె (మనసును బయటపెట్టిన దీపం అనడం) వంటి అచ్చతెలుగు పదబంధాలు తెలగన ప్రయోగ వైచిత్రికి ఉదాహరణగా నిలుస్తుంది.

సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి.

October 24, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి – 3

by Krishna Kumari Yagnambhatt October 24, 2021
written by Krishna Kumari Yagnambhatt

అన్నమయ్య తర్వాత ఆతని కుటుంబీకులు పెద తిరుమలాచార్యులు వంటి వాగ్గేయకారులు తమ రచనల ద్వారా ఈ సంప్రదాయాన్ని ముందుకు నడిపించారు. ఈ కాలంలోనే సాహిత్య రంగంలో ప్రబంధాల పంట విరివిగా పండింది. అది క్షేత్రయ్యకు అనుకూలించింది. అందుకే క్షేత్రయ్య కవితలో రకరకాల శబ్దాలంకారాలు కన్పిస్తాయి. పదంలో సన్నివేశ చిత్రీకరణ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రత్యేకత నాటి రసిక జనుల మన్ననలను అందుకొంది.

అన్నమయ్యలో మొగ్గ రూపంలో ఉన్న అభినయ విద్య క్షేత్రయ్యలో సహస్ర దళ పద్మమై వికసించింది. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ తీరుల చతుర్విధ అభినయాలకు క్షేత్రయ్య పదాలు అనుకూలంగా ఉంటాయి. నాట్య శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయని వారు క్షేత్రయ్య పదాల అభినయాన్ని అధ్యయనం చేస్తే చాలు. అన్ని రకాల అభినయాలు పట్టు పడతాయి. క్షేత్రయ్య ప్రతి పదం నృత్య గాన అభినయాలకు నిఘంటువు వంటిది. ఒక్కొక్క పదం ఒక్కొక్క అభినయ వైచిత్రి కల్గి ఉంటుంది. నిజానికి ఈ పదాలను అన్నింటిని గుదిగుచ్చే ఏక సూత్రత లేకపోయినా అంతర్గతమైన కృష్ణ తత్త్వం వలన ఇదొక రస భరిత కావ్యం అనవచ్చును.

అభినయ కళలో శివ తత్త్వం, విష్ణు తత్త్వం అని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ఈ రెండు తత్వాలను ఒకే పదంలో మిళితం చేసి రచించాడు క్షేత్రయ్య. చూడండి ఈ ఉదాహరణ.

‘చక్కని దయ గలదా యిది నీ జాగా చెవంది లింగా

ఇక్కడికి వచ్చినదేమో హెచ్చు కంచి వరదా!

ఇందున్నావాని యీడ వచ్చితి చెవంది లింగా

అందుకేల యెవరిల్లిదీ యవురా కంచి వరదా!

ఎవ్వడో యీ పడకింటిలో నవ్వేది చెవంది లింగా

మువ్వ గోపాలుడు గాక మరెవ్వరు కంచి వరదా!‘

ఇద్దరు దైవతాలని సంభోదిస్తూ చివరన ఆ ఇద్దరినీ మువ్వ గోపాలునితో సమన్వయించాడు. నృత్యం చేసే నర్తకికి అభినయానికి అపారమైన అవకాశం ఉంటుంది ఇటువంటి రచనలలో.

పలుకు పలుకులో తేనె లొలుకే విధంగా రచనలు చేసిన క్షేత్రయ్య పుట్టుక, బాల్యం చాలా వివాదాస్పదమైన విషయం. ‘శూరుల జన్మంబు, సురుల జన్మంబు నేరుల జన్మంబు నెరుగ నగునే’ అన్నట్లు అతని జన్మ చర్చనీయమే. శ్రీ విస్సా అప్పారావు గారి విశేష పరిశోధన వలన క్షేత్రయ్య జన్మ స్థలం కృష్ణా జిల్లాలోని కూచిపూడి దగ్గర గల మువ్వ గ్రామం అని, 16/17 శతాబ్ది మధ్యకాలంలో జీవించాడని తెలుస్తున్నది. పుట్టుక, బాల్యం మాత్రమే కాకుండా ఈతని పేరు కూడా వివాదాస్పదమే. పలు క్షేత్రాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని, అసలు పేరు వరదయ్య అనే వాదం కూడా లేకపోలేదు.

మువ్వ పురీ నిలయా, మువ్వ పురీ విభుడైన, మువ్వ పురీ సామి వంటి అనేక పదాలలో క్షేత్రయ్య మువ్వ ను గ్రామవాచిగానే ఉపయోగించాడు. ఈ గ్రామం లోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయమున్నది. ఈ స్వామినే క్షేత్రయ్య మువ్వ గోపాలుడని సంభోదించాడు. పైగా మువ్వ కు కూతవేటు దూరంలో నాట్యానికి నెలవైన కూచిపూడి గ్రామం ఉంది. ఆ నాట్యం చిన్నప్పుడు చూస్తూ పెరిగే అవకాశం ఇతనికి ఉంది కూడా. కాబట్టి నాయికానాయక భేదాలన్నీ అతి సూక్ష్మమైనవి కూడా ఈతని రచనలలో కన్పిస్తాయి. నేటికీ కూడా కూచిపూడి వారు క్షేత్రయ్య పదాభినయంలో నిపుణులు.

నిజానికి క్షేత్రయ్య పదాలు అత్యంత శృంగార భరితమైనవి. ముందు చెప్పుకున్నట్లు అది క్షీణ ప్రబంధ యుగం. ఆ కాలంలో ఎవరు రచనలు చేసినా అది శృంగార మయంగానే ఉండేది. తంజావూరు పాలకుడైన రఘునాథ రాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల వంటి మహిళా కవయిత్రులు ఉండేవారు. వారు రాసినవన్నీ ఈ కోవకు చెందినవే. అటువంటి కాలంలో ఇంకో రసానికి తావు ఉంటుందా.

తాను ఒక మహా కావ్యం రాయక పోయినా తొలి రచన మాత్రం శ్రీకారంతో మొదలు చేశాడు క్షేత్రయ్య. ఈ తొలి రచనలో అందులోని పదాల పొందిక, భావ లాలిత్యం చూడండి.

‘శ్రీ సుతు బారికి నెనోపలేక నిను వేడితే కోపాలా – మువ్వ గోపాలా

ఏ పొద్దు దానింటిలోనే కాపై యుండిన నీ సరస సల్లాపాలా – మువ్వ గోపాలా

చూపుల నన్యుల దేరి చూడని నాతో చేరి కలాపాలా – మువ్వ గోపాలా ..”

ఈ రచనలో గల పద ప్రయోగం గాని, నడక గాని, తాళం గాని తర్వాతి పదాలలో కన్పించవు. దాదాపుగా ప్రతి పాదంలో మువ్వ గోపాలా అంటూ యమక యుక్త ప్రయోగాలున్నాయి.

దీని తర్వాత రాసిన పదాల నడక గాని, పద ప్రయోగాలు గాని స్వభావ రీత్యా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ పదాలన్నీ దాదాపుగా త్రిపుట తాళం లేదా మిశ్ర చాపులో కన్పిస్తాయి. నిజానికి ఈ తాళాలు నృత్యానికి అనుగుణమైనవి. పైగా ఈ పదాలు అతి విలంబితమైన నడక కలవి.

చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఈతనిని కృష్ణా తీరంలో జరిగే భజనలు, ఆలయ ప్రాంగణాల్లో అన్నమయ్య పదాలు, సిద్ధేంద్రుల వారి కలాపాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు చేస్తున్న కూచిపూడి నర్తకులు చాలా ఆకర్షించారు. బహుశః వీటి ప్రభావం క్షేత్రయ్యలో చిన్ననాడే బీజప్రాయంగా పడింది. క్రమంగా అది బలపడి, ఒక రూపు సంతరించుకొని యౌవన దశలో సంపూర్ణ వాగ్గేయకారత్వానికి దారి చూపింది. అనేక ప్రదేశాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య అని శ్రీ విస్సా అప్పారావు గారి పరిశోధన చెబుతున్నది. దివ్య క్షేత్రాలు దర్శించిన వాడు, క్షేత్రజ్ఞానం కలవాడు క్షేత్రజ్ఞుడు అని పిలువ బడు తాడని వేటూరి ఆనంద మూర్తి గారి అభిప్రాయం.

17 వ శతాబ్దపు సాహిత్య రచనలో అవసరానికి మించిన శృంగారం కన్పిస్తుంది. ఇది కేవలం మన తెలుగు సాహిత్యంలో మాత్రమే కాదు. భారతదేశమంతటా ఇదే పరిస్థితి. ఇవే లక్షణాలు క్షేత్రయ్యలోనూ కన్పిస్తాయి. ఆ నాడు రచన చేసిన స్త్రీ పురుషులందరు మితి మీరిన శృంగారాన్ని వర్ణించారు. ఆది నాటి యుగ లక్షణమనుకుంటే క్షేత్రయ్యలో గొప్ప భక్త కవిగా, వాగ్గేయకారుడుగా దర్శనమిస్తాడు. ఇతను భారత శాస్త్ర నిధి. అభినయ విద్యా విశారదుడు. తేట తెలుగు భాష సౌందర్యాన్ని, మాధుర్యాన్ని ఆసాంతం తెలుసుకొని పలికినవాడు. తనకు తెలిసిన భాషా సౌందర్యాన్ని తనదైన భావ సౌందర్యంతో మేళవించి కమ్మని పదాలను ఆలపించాడు. తనదైన ఒక ప్రత్యేక బాణీ ద్వారా పద కవితా చరిత్రలోనే తనకంటూ ఒక విశేష స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ రీతుల చతుర్విధ అభినయాలని ప్రదర్శించడం కేవలం ఒక్క క్షేత్రయ్య పదాలలో మాత్రమే సాధ్యపడుతుందని స్వానుభవం ద్వారా చెప్పారు శ్రీ నటరాజ రామకృష్ణ గారు.

‘ఆంగికం కావలసిన వారికి ఆంగికం, గానం వినదలచిన వారికి గాన మాధుర్యం, భావ యుక్తంగా పాట వినాలన్న వారికి ఆ తృప్తి, భాష యొక్క, ఆ నాద ధ్వని యొక్క ప్రభావం తరచి తరచి వినాలన్న వారికి సంతృప్తి, పద్యంలోని నాయికా సంపూర్ణ స్వరూపం చూడ గోరిన వారిని ఆ నిరూపణం, సంచార విన్యాసాలు తిలకించ గోరిన వారికి ఆ అనుభూతి, శృంగార రసం లోతులు ఎరుగ దలచిన రసజ్ఞులకు ఆ ఆనందం..’ అంటూ క్షేత్రయ్య సంపూర్ణ స్వరూపాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేశారు రామకృష్ణ గారు.

క్షేత్రయ్య పదాలను కొన్నింటిని తీసుకొని వచ్చే వ్యాసంలో విశ్లేషణ చేసి, అందులోని విశేషాలను తెలుసుకుందాం.

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గార్గి

by ఆచార్య మస‌న‌ October 24, 2021
written by ఆచార్య మస‌న‌

దైవదత్తమైన ప్రతిభ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. అన్నిరంగాల్లో లాగా ఆధ్యాత్మిక రంగంలోను ప్రసిద్ధి గల మహిళా మణులెందరో భారతీయ సమాజంలో కనిపిస్తారు.

వేదమంత్రార్థం తెలిసిన వారిని ద్రష్టలని పిలుస్తారు. అట్టివారిలో ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, పౌలోమి మొదలైనవారి సరసన నిలబడ గల్గిన విదుషీమణి గార్గి, గార్గి అద్భుతమైన చరిత్ర బృహదారణ్యకోపనిషత్తులో చోటు చేసుకున్నది.

గార్గి వాచక్ను మహర్షి కూతురు. తండ్రి పెంపకంలో ఆమె గొప్ప వక్తగా పేరుగాంచింది. విశిష్టమైన వ్యక్తిగా రాణించింది. ఆశ్రమ వాతావరణంలో పెరడగం వల్ల ఆమెలో ఆధ్యాత్మికానురక్తి ద్విగుణీకృతమైంది. తోటి బ్రహ్మచారిణులతో సంభాషించడం వల్ల వాదపటిమను సంతరించుకున్నది. గార్గి వాదబలానికి తలలూపని వారు లేరు. ఆమె సంవాదశైలికి మునిపల్లెలే కాదు, ఆనాటి రాజస్థానాలు కూడా మురిసిపోయాయి.

జనక చక్రవర్తి ఒకసారి ‘దక్షిణ’మనే పేరుగల మహాయాగాన్ని తలపెట్టినాడు. ఆ యాగానికి దేశంలోని నలుమూలల నుంచి వేదపండితులు వచ్చారు. యాగం ఫలవంతమైంది. కాని ఆ మహా చక్రవర్తికి ఇంకా తృప్తి కలగలేదు. వచ్చిన పండితులలో బ్రహ్మవేత్తలెవరో తెలుసుకోవాలనుకున్నాడు. తానే నిర్ణయిస్తే అది రాజుగారి పక్షపాత దృష్టికి నిదర్శనమవుతుంది. అందుకే ఆయన ఒక ఆలోచన చేశాడు.

తన కొలువు కూటానికి సమీపంలో ఒక వెయ్యి ఆవుల్ని తెప్పించి ఉంచాడు. ఆ గోవుల కొమ్ములకు పదేసి బంగారు నాణాల చొప్పున అలంకరింపబడడం చూపరులకు అద్భుతంగా తోచింది.

జనకుడు సభనొక్కసారి తేరిపార జూశాడు. ఆ సభలో ఆసీనులైనవారు సామాన్యులు కారు. వారిలో అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు, విదగ్గుడు, శాకుల్యుడు అందరిని మించి యాజ్ఞవల్క్యుడున్నాడు, విదుషీమణుల్లో గార్గి ఉంది.

రాజు సభాంగణంలో తమ విద్వత్తులో ప్రకాశిస్తున్న పండితులనుద్దేశించి “ఓ పండితులారా! మీరంతా బ్రహ్మజ్ఞులుగా కనిపిస్తున్నారు. ఐతే మీ అందరిలో ఎవరు గొప్పవారో తేల్చే శక్తి నాకు లేదు. కాని మీలో ఎవరు బ్రహ్మవేత్తలో వారికి వెయ్యి గోవులను బహుమానంగా ఇస్తాను. వారీ గోవులను ఏ ఇబ్బంది లేకుండా తమ ఆశ్రమానికి తోలుకొని పోవచ్చు”నని ప్రకటన చేశాడు.

ప్రకటన విననైతే విన్నారుగాని ఆ పండితులెవ్వరూ తాము బ్రహ్మవేత్తలమని చెప్పడానికి ముందుకు రాలేకపోయారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ సభలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుణ్ణి పిలిచి, ఆ వెయ్యి గోవులను తన ఆశ్రమానికి తోలుకొని వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటిదాకా చప్పుడు చేయని పండితులు క్రోధావేశానికి లోనై యాజ్ఞవల్కుణ్ణి తిట్టసాగారు. ఆయన తమకంటె గొప్పవాడా? అని ప్రశ్నించసాగారు.

సభలోని కలకలాన్ని గ్రహించిన జనకుని పురోహితుడు అశ్వలుడనేవాడు సభాసదులనుద్దేశించి శాంతంగా ఉండవలసిందిగా కోరుతూ, యాజ్ఞవల్క్యునితో “మీరు అందరికంటె మించిన పండితులైతే మీకివే వందనాలు! మాకూ గోవుల్ని తోలుకొని పోవాలని ఉంది. కాని మీరాపని మమ్మల్ని కాదని చేశారు. ఐతే మేమడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పినట్లైతే అందుకు మేమేమీ నిరోధించం” అంటూ తాను కొన్ని ప్రశ్నలను సంధించినాడు. యాజ్ఞవల్క్యుడు వాటికి తగిన సమాధానాలిచ్చాడు. ఆ తర్వాత వరుసగా అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు మొదలైన వారు ప్రశ్నలు సంధించారు. కాని యాజ్ఞవల్క్యుడు ధీరోదాత్తంగా వారి ప్రశ్నలనే బాణాలను ఎదుర్కొని ఏమాత్రం గాయపడక సమాధానాలిచ్చాడు. అంతేకాదు, “నేను బ్రహ్మవేత్తను. వెయ్యి గోవులను నా ఆశ్రమానికి తోలుకొని పోవడానికి అనుమతి ఇవ్వండి” అని రాజునుద్దేశించి పలికినాడు. రాజు మౌనంగా ఉన్నాడు కాని, అతని పురోహితుడు అశ్వలుడు అడ్డుపడ్డాడు. అంతకుముందే వాదంలో అశ్వలుడు కూడా ఓడిపోయి ఖంగుతిన్నాడు.

పురుష పుంగవులెవ్వరూ యాజ్ఞవల్యుణ్ణి వాదంలో ఓడించలేకపోయారు. ఇక నారీజనంలో విదుషీమణులెవరైనా ఉంటే తప్పక యాజ్ఞవల్యుణ్ణి గెలిచేవారనే మాటలు వినిపించాయి. క్రమంగా అలా మాట్లాడుతున్న వారి చూపులు ఒక విద్వన్మణి మీద వాలాయి. ఆమె ఎవరో కాదు, గార్గి! తపస్సే స్త్రీరూపం దాల్చినట్లుంది. విద్వత్తే ఆకారం పొందినట్లుంది. సాక్షాత్తు వేదమాత ప్రత్యక్షమైనట్లు గోచరిస్తుంది.

మిన్నకుండడం విద్వాంసుల పని కాదని తెలిసిన గార్గి జనక మహారాజుతో, యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించడానికి అనుమతి కోరింది. అలా కోరడంలోనే ఆమె విద్వత్తుతో పాటు ఎంతటి వినయశీలం కలిగిందో తేటతెల్లమవుతుంది.

‘ఇంత గొప్ప పండితులం మేమే యాజ్ఞవల్యున్ని గెలవలేకపోయాం. ఒక స్త్రీ ప్రశ్నలు అడగడమా?’ అని కొందరు పండితులు గుసగుసలుపోయారు. కాని ధర్మప్రభువైన జనకుడు “ఇది విద్వత్సభ. ప్రతిభ, పాండిత్యం ఒకరి సొత్తు కాదు. అవి ఎవరిలోనైనా ఉండవచ్చు. కనుక యాజ్ఞవల్యున్ని ప్రశ్నించడానికి గార్గిని అనుమతిస్తున్నాను” అని పలుకగానే సమస్త నారీలోకంతో పాటుగా గార్గి తన అంతరంగంలో ఎంతో సంతోషపడింది.

మహర్షిని చూసి “ఓ యాజ్ఞవల్క్యా! కాశీవాసియో, విదేహనగరవాసియో, ఎవరైనా ఒక వీరుడు వాడిగల బాణాలతో శత్రువులను ఎదిరించినట్లే నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలతో గెలవాలనుకుంటున్నాను” అనగా ఆ మహర్షి అందుకు సరే అన్నాడు.

గార్గి అడిగిన మొదటి ప్రశ్న : “దివికి పైనా, భూమికి క్రిందా, మధ్యనున్న అంతరిక్షంలో ఉన్న దానిపేరేమిటి?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “దివికి పైన, భూమికి క్రింద అంతరిక్ష్యంలోను అంతటా ఉన్నది ఆకాశమే”.

గార్గి రెండవ ప్రశ్న : “ఈ ఆకాశం దేనిలో ఓతప్రోతమై (వ్యాపించి) ఉన్నది?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “ఈ ఆకాశం అక్షర పరబ్రహ్మలో వ్యాపించి ఉన్నది. నాశం లేనిది అక్షరబ్రహ్మం. దానివల్లనే సృష్టి స్థితిలయలు వరుసగా జరుగుతున్నాయి. మూడు కాలాలు, మూడు లోకాలు ఆ అక్షరబ్రహ్మ ఆజ్ఞకు లోబడి నడుచుకుంటాయి. ఐదే అక్షరబ్రహ్మం కనిపించదు. కాని అన్నింటినీ చూస్తుంది. అన్నింటిని వింటుంది” అని సృష్టిరహస్యాన్ని విప్పి చెప్పిన యాజ్ఞవల్క్యుని మాటలకు హర్షించిన గార్గి, అతనిని బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడని స్వయంగా ప్రకటించింది, సభ అంతా పులకించి పోయింది.

భారతదేశ చరిత్రలో ఒక మహిళ తన అపారమైన వాదపటిమతో ఒక పురుషుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖింపదగింది, నారీలోకానికి గర్వకారణమైంది.

గార్గి, యాజ్ఞవల్క్యుడు పరస్పరం అభినందించుకున్నారు. జనక మహారాజు ఎంతగానో సంతోషించాడు. గార్గిని అందరి హర్షధ్వానాల మధ్య సన్మానించినాడు. ఆ తర్వాతనే జనకుడు యాజ్ఞవల్యుణ్ణి గురువుగా చేసికొని అతనివల్ల బ్రహ్మోపదేశం పొంది మోక్షార్హత సంపాదించినాడు.

– ఆచార్య మసన చెన్నప్ప.

23.10.2021

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగులో ఉదాహరణ వాఙ్మయం

by Dasharathula Narsaiah October 24, 2021
written by Dasharathula Narsaiah

తెలుగు సాహిత్యంలో ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకూ ఎన్నెన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ద్విపదలు, శతకాలు, రగడలు, ఉదాహరణలు, యక్షగానాలు, పదకవితలు, నవల, కథానిక, నాటకం, నాటిక, ఏకాంకిక – వంటి ప్రక్రియలు సాహిత్యంలో నిలదొక్కుకుని వాటి సత్తాను నిరూపించుకున్నాయి.

ఉదాహరణ ప్రక్రియ కూడా 12వ శతాబ్దంలో ఆవిర్భవించి, ఆధునిక యుగం వరకూ కూడా గౌరవింపబడుతున్నది.

పుట్టుక, స్వరూపం : ‘హృ’ ధాతువుకు ‘ఉత్’ అను ఉపసర్గ చేరగా ఉదాహరణం ఏర్పడింది. దీనికి దృష్టాంతం, నిదర్శనం – నైఘంటికార్థాలు. మార్గ కవిత్వానికి సంకేతంగా నిలిచే వృత్త పద్యాలతోనూ, దేశి కవిత్వానికి సంకేతంగా నిలిచే కళికోత్కళితలతోనూ ఉదాహరణ ప్రక్రియ రూపుదిద్దుకుంది. అంటే, ఉదాహరణ ప్రక్రియ – మార్గ, దేశి కవిత్వాలను కలిపిన అద్భుత సాహిత్య ప్రక్రియగా గుర్తింపు పొందింది.

ఉదాహరణ ప్రక్రియలో – తెలుగులోని విభక్తి ప్రత్యయాలకు ఆశ్రయం లభించింది. సర్వ విభక్తులనూ క్రమంగా ఉదాహరించడం ఈ ఒక్క ప్రక్రియలోనే జరుగుతుంది. సృష్టిలోని జీవాత్మ, పరమాత్మల సంగమం లాగా, భాషలోని ప్రకృతి ప్రత్యయాల సంగమం అనివార్యంగా జరిగే సాహితీ ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ సార్థక్యం చెందింది.

వృత్త పద్యాలతో పాటు, కళికోత్కళితలు కూడా చోటు చేసుకోవడం వల్ల – ఈ ఉదాహరణ ప్రక్రియ సంగీత, సాహిత్యాలను మేళవింపు చేసుకున్న ప్రక్రియలకు ఉదాహరణ ప్రాయంగా నిలిచింది.

సంస్కృత ప్రమేయం లేకుండా తెలుగులో ఆవిర్భవించిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగులో తెలియవచ్చినంతగా, మరే భాషల్లో దీనికి సంబంధించిన సమాచారం తెలియకపోవడం వల్ల తెలుగు సాహిత్యానికే పరిమితమైన వినూత్న రచనా ప్రక్రియగా కూడా ‘ఉదాహరణం’ రూపుదిద్దుకుంది.

నేపథ్యం : ప్రాక్తన మానవుడు ప్రకృతిని ప్రేమించాడు. నిరంతర అన్వేషణాసక్తి – ప్రాక్తన మానవుణ్ణి మిగతా జంతు సముదాయం నుండి వేరు చేసింది. ప్రకృతిని క్రమంగా తాను సాధించిన విజయాలకు మూలంగా భావించాడు. ప్రకృతిలో దైవత్వాన్ని చూసాడు. ఆరాధించడం, పూజించడం అలవాటు చేసుకున్నాడు. రకరకాల స్తోత్ర పాఠాలతో స్తుతించాడు. ఈ స్తోత్ర పాఠాలు మనకు ఋగ్వేదంలో ‘కుంతాప సూక్తములు’ అనే పేరుతో కనిపిస్తాయి. ఈ కుంతాప సూక్తములకే ‘నారాశంసులు’ అని కూడా పేరు.

వేద వాఙ్మయం లోని ‘కుంతాప సూక్తములు’, కాలక్రమంలో లౌకిక వాఙ్మయం లోకి ప్రవేశించాయి.

హరివంశ, విష్ణు పురాణాలలో పృథు చక్రవర్తిని స్తుతించిన సందర్భాలున్నాయి. పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు నిర్వహించే క్రమంలో సూతమాగధులు జన్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి. సూత మాగధులు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఋషులు స్తోత్ర పాఠాలు నిర్వహించారు. ఈ స్తోత్ర పాఠాల పరంపర క్రమంగా లౌకిక సాహిత్యంలోనూ నిలదొక్కుకుంది. ప్రభువుల లోకోత్తర చరిత్రను ప్రచారం చేయడానికి ఈ స్తోత్ర పాఠాలు చదువడం క్రమంగా ఒక అలవాటుగా రూపుదిద్దుకుంది. ఈ స్తోత్ర పాఠాలు భారతాది మహా గ్రంథాలలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయా దేవతలను, మానవులను స్తుతించే సందర్భాలలో ఈ స్తోత్ర పాఠాలు కావ్యాలలో ప్రవేశించాయి. అంతేకాదు, ఈ స్తోత్ర పాఠాలు ప్రత్యేక కావ్యాలుగా అవతరించాయి. అట్లా, అవతరించిన స్తుతి ప్రధానమైన కావ్యమే ఈ ఉదాహరణం అని చెప్పవచ్చు.

కాళిదాసు తన రఘువంశంలో మొదటిసారిగా ఉదాహరణ శబ్దాన్ని ప్రయోగించాడు. రఘు వంశంలోని నాల్గవ సర్గలో ఈ కింది శ్లోకం ఉంది.

“శరైరుత్సవ సంకేతాన్యకృత్వా విరతోత్సవాన్

జయోదాహరణం బాహ్వోర్గాపయా మాస కిన్నరాన్”

రఘువంశ మహారాజు శరత్కాల ఉత్సవ సంకేతాఖ్య గణాలను ఉత్సవ రహితులుగా నిర్వీర్యం చేశాడు అనగా వారిపైన విజయాన్ని సాధించాడు. ఈ విజయానికి సూచకంగా కిన్నెరులు ఉదాహరణాన్ని గానం చేశారట! కిన్నెరులు గానం చేసిన ఈ ఉదాహరణమే లౌకిక సాహిత్యంలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ప్రవేశించి ఉంటుందని పల్వురు భావిస్తున్నారు. రఘువంశంలోని జయోదహరణాన్ని మల్లినాథసూరి ఇట్లా వ్యాఖ్యానించాడు.

“కిన్నెరాన్బాహ్వోః స్వభుజయోర్జయోదాహరణం

జయాఖ్యాపకం క్షుద్ర ప్రబంధ విశేషంగా పయామాస”

మల్లినాథసూరి వ్యాఖ్యను పురస్కరించుకొని ఉదాహరణం అనగా ఒక కావ్య విశేషమనీ, గానానుకూలమైనదనీ తెలుస్తుంది. మల్లినాథసూరి తెలుగులో ఉదాహరణ స్వరూపం తెలిసినవాడు కాబట్టి ‘జయోదాహరణమ్’ అనే పదాన్ని చూడగానే ‘జయోదాహరణమ్ జయాఖ్యాపకమ్ -క్షుద్ర ప్రబంధ విశేషమ్ గాపయామాస’ అని అనగలిగాడు.

కాళిదాసు విక్రమోర్వశీయం నాటకంలో కూడా ‘ఉదాహరణమ్’ అనే పదాన్ని ప్రయోగించాడు.

తుల్యానురాగ పిశునం లలితార్థ బంధం

పత్రే నివేశిత ముదాహరణం ప్రియాయాః

ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాసిన రంగనాథుడు ఉదాహరణ శబ్దానికి ‘ఉక్తి’ అను అర్థాన్ని చెప్పాడు. రంగనాథుని దృష్టిలో ‘ఉదాహరణం’ అనేది కావ్యం కాదు. ‘ జయోక్తి’ గానే ఉదాహరణ శబ్దాన్ని వ్యాఖ్యానించాడు. అంటే, సంస్కృత వాజ్మయంలో అప్పటికీ ఉదాహరణ ప్రక్రియ లేదు కాబట్టి అట్లా వ్యాఖ్యానించాడని చెప్పుకోవలసి ఉంటుంది. దీనిని బట్టి తెలుగులో ఉదాహరణ ప్రక్రియ స్వతంత్ర ప్రక్రియ అని తెలుస్తుంది. తెలుగు కంటె ముందు సంస్కృతంలో ఉదాహరణ ప్రక్రియ లేదని కూడా తెలుస్తుంది. అనగా తెలుగులో వెలువడిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ పేరు దక్కించుకుంది.

ఉదాహరణం లక్షణాలు :

  1. ప్రథమా విభక్తి నుండి మొదలెట్టి, సప్తమీ విభక్తి వరకు అన్ని విభక్తులల్లో వృత్త పద్యాలు చెప్పాలి. ఆ తర్వాత సంబోధనలతో పద్యం చెప్పాలి.
  2. చివరలో సార్వవిభక్తకంగా ఒక పద్యాన్ని, అంకితాంక పద్యాన్ని చెప్పాలి.
  3. ప్రథమాది సప్తవిభక్తుల్లోనూ, సంబోధనలోనూ ప్రతి విభక్తిలోని వృత్త పద్యం కింద రగడ భేదాలైన కళికోత్కళికలు చెప్పాలి.
  4. కళిక ఎన్మిది పాదాలు కలిగి వుంటుంది. అందులో సగం అర్థకళిక. ఇది కూడా ఎన్మిది పాదాలలో ఉంటుంది. దీనికి ఉత్కళిక అని పేరు.
  5. ప్రతి విభక్తిలో వరుసగా ఒక వృత్తపద్యం, దాని కింద ఒక కళిక, ఉత్కళిక మాత్రమే ఉంటాయి. అంతకు మించి పద్యాలు ఉండకూడదు.
  6. కళికలోని ప్రతి పాదం చివర ఆయా విభక్తులకు చెందిన ప్రత్యయాలు ఉండాలి. ఉత్కళికలో మాత్రం చివర రెండు పాదాలలో మాత్రమే విభక్తి ప్రత్యయాలు ఉండాలి.
  7. సంబోధనా విభక్తిలోని కళికోత్కళికలు – అన్ని పాదాలలో సంబోధనాంతాలుగానే ఉండాలి.
  8. సార్వవిభక్తి పద్యంలో అన్ని విభక్తులు చెప్పాలి. ఇది సాధారణంగా మత్తేభంలోగానీ, శార్దూలంలో గానీ వుంటుంది.
  9. ఈ ప్రక్రియ స్తుతి ప్రధానమైనది కాబట్టి గానయోగ్యంగా ఉంటుంది. వృత్త పద్యాలు రాగాంగ ప్రధానాలుగా వుంటే, కళికోత్కళికలు తాళాంగ ప్రధానంగా వుంటాయి. త్రిపుట, జంపె, రూపక తాళాలతో కళికోత్కళికలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఆ తాళాలకు అనుకూలమైన త్రశ్య, చతురస్ర, మిశ్ర జాతులు ఈ కళికోత్కళికలలో ప్రకటింపబడుతాయి.
  10. మహాకావ్యాలలో నాయక గుణవర్ణన ప్రధానమైనట్లుగా, ఉదాహరణల్లో నాయక గుణకీర్తనమే ప్రధానం.
  11. సాధారణంగా ఒక ఉదాహరణ కావ్యంలో కళికోత్కళికలూ, వృత్తాలు – అన్నీ కలిసి 26 పద్యాలుంటాయి.
  12. ఉదాహరణ కావ్యంలోని కళికోత్కళికలు ఒక రకంగా రగడ భేదాలే. ఇవి 9 రకాలుగా చెప్పబడినాయి. అవి –
  13. హయప్రచార రగడ
  14. తురగవల్గన రగడ
  15. విజయమంగళ రగడ
  16. మధురగతి రగడ
  17. హరిగతి రగడ
  18. ద్విరదగతి రగడ
  19. జయభద్ర రగడ
  20. హరిణగతి రగడ
  21. వృషభగతి రగడ

ఈ రగడలు 9 రకాలుగా చెప్పినా అందులో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. అవి. 1. హయప్రచార రగడ, 2. మధురగతి రగడ, 3. ద్విరదగతి రగడ, 4. హరిణగతి రగడ.

హయప్రచార రగడలో మూడు మాత్రల గణాలు, మధురగతి రగడలో నాలుగు మాత్రల గణాలు. ద్విరదగతి రగడలో ఐదు మాత్రల గణాలు, హరిణగతి రగడలో ఏడు మాత్రల గణాలుంటాయి. ఈ నాల్గింటిలోనూ ప్రతి పాదంలో నాలుగు గణాలే ఉంటాయి. ఈ నాలుగు గణాలను రెట్టింపు చేస్తే వరుసగా 1.తురగ వల్గనం, 2.హరిగతి, 3.జయభద్రం, 4. వృషభగతి – రగడలు ఏర్పడుతాయి. తురగవల్గన రగడను రెట్టింపు చేస్తే విజయమంగళ రగడ ఏర్పడుతుంది.

ఉదాహరణ వాఙ్మయ  వికాసం

తెలుగులో ఉదాహరణ ప్రక్రియ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవోదాహరణంతో ప్రారంభమైంది. అయితే, నన్నయ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యాన సందర్భంగా ప్రథమా విభక్త్యంత పద్యాలు కనిపిస్తాయి. ఈ విభక్త్యంత పద్యాలే, తెలుగులో విభక్తులతో కూడిన పద్యాలు రాయడానికి అనగా ఉదాహరణ కావ్యాలు ఆవిర్భవించడానికి మూలకారణమయ్యాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

“దేవ మనుష్య లోకములఁద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫుర

త్పావక తాపి తాఖిల విపక్షులునైన మహానుభావులై

రావత కోటి ఘోర ఫణిరాజులు మాకుఁ బ్రసన్నులయ్యెడున్”

– ఇట్లాగే ‘మాకు ప్రసన్నుడయ్యెడున్’ – అను పాదాంతంతో మరి మూడు పద్యాలున్నాయి.

12వ శతాబ్దంలో, వీర శైవమతాన్ని తెలుగు దేశంలో విస్తృతంగా ప్రచారం చేసిన శివకవులలో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. ఆయన లేఖిని నుండి బసవోదాహరణం రావడం, ఒక రకంగా శైవ మత ప్రచారానికి ఇది ఉపయోగపడి వుంటుందని భావించడంలో తప్పులేదు. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుణ్ణి కలియుగ రుద్రుణిగా సాక్షాత్కరింపజేస్తూ ఈ కింది పద్యం చెప్పాడు.

“వసిగొని యెవ్వడేని బసవాయను నీ సుకృతాక్షర త్రయం

బెసగ పఠించెనేని గిరిజేశుని కాతని వక్ష గహ్వరం

బసదృశ్య గేహమన్న యవి యార్యుల వాక్యములట్ల కావునన్

బసవన (బుణ్యమూర్తిఁ దలపంగదె చిత్తమ పాయ కెప్పుడున్”

బసవా! అను సుకృతాక్షర త్రయాన్ని పఠించినంత మాత్రంచేత పరమేశ్వరుడు ఆ భక్తుని ముఖ గహ్వరంలో నివసిస్తాడని చెప్పడంతో బసవేశ్వరునికి పరమేశ్వరత్వాన్ని – ఆపాదించింది ఈ పద్యం.

భాషాపరంగా బసవోదాహరణాన్ని పరిశీలిస్తే చతుర్థి విభక్తి ప్రత్యయంలో ఇపుడున్న కొఱకు, కై- ప్రత్యయాలు కాకుండా, ‘కునై’ రూపం కనబడుతుంది. ఉదాహరణకు ఈ కింది కళికను గమనిద్దాం!

వెండియును నిర్మల ప-విత్ర గోత్రునకు నై

పండిత స్తవనీయ – పాత్ర గాత్రునకు నై

దురిత భంజన కళా – ధుర్య చరితునకు నై

సరవి నిష్ట వ్రతా – శ్చర్య భరితునకు నై

సవిశేష విమలగుణ – జాలలోలునకు నై

శివయోగ సంధాన – శీల పాలునకు నై

……………………………………….

…………………………………………

ఇట్లా సాగిపోతుంది కళిక.

భాషా చరిత్ర పరిణామ క్రమంలో విభక్తి ప్రత్యయాలు ఎట్లా రూపాంతరం చెందాయో తెలుసు కోడానికి, ఉదాహరణ వాజ్మయ ప్రక్రియ చక్కగా పనికి వస్తుందని ఈ ఉదాహరణ ఋజువు చేస్తుంది.

క్రీ.శ. 1320 ప్రాంతంలో రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదాహరణాన్ని రచించాడు. శ్రీశైలానికి తూర్పు వాకిలిలో కొలువుదీరిన దేవుడు త్రిపురాంతక దేవుడు. ఆయన మీద రాసిన కావ్యమే త్రిపురాంతకోదాహరణం. త్రిపురాంతకోదాహరణంలో కన్నప్ప, సేనమరాజు, నంబి, భల్లహుడు, చిఱుతొండడు వంటి శివభక్తులు ప్రస్తుతింపబడినారు. ఈ కావ్యంలో శివుని ఉతృష్టతను చాటి చెప్పే అర్ధనారీశ్వరత్వం, గంగాధారణం, దక్షాధ్వర ధ్వంసం, కపాల భిక్షాటనం, త్రిపురాసుర సంహరణం మొ|| పౌరాణిక విషయాలు ప్రస్తావించబడినాయి. వీరశైవం కాకుండా శివాద్వైత మార్గమే ఈ ఉదాహరణ కావ్యంలో ప్రతిపాదించబడింది.

మానవల్లి రామకృష్ణ కవి త్రిపురాంతకోదాహరణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా – “దీని శబ్దార్థ మాధుర్యానికి మెచ్చి, ఈ కృతి రత్నం చిన్నదైనప్పటికీ – దీనిని పండితులు కంఠాలంకారంగా స్వీకరిస్తారని” భావించి పరిష్కరించినట్లు వ్యాఖ్యానించాడు.

15వ శతాబ్దంలో సంపూర్ణమైన ఉదాహరణ కావ్యాలు లభించలేదు గాని, ఉదాహరణ కావ్య భేదమైన ‘విద్దళి’ లభించినట్లు నిడుదవోలు వేంకటరావు తెలియబరిచాడు. ఈ కావ్యంలో వృత్త పద్యాలతో పాటు కంద, గీత దేశీయ ఛందస్సులు మిళితమై ఉన్నాయని తెలిపాడు.

16వ శతాబ్దంలో తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణాన్ని రచించాడు. ఆయనకు సమకాలీన కాలంలో చిత్రకవి పెద్దన హనుమదోదాహరణం రచించాడు. పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణంలో సార్వవిభక్తిక పద్యం తర్వాత షష్యంతాలతో కూడిన అంకితాంక పద్యాన్ని రచించాడు. ఇది ఒక విలక్షణత్వంగా నిలిచిందని చెప్పాలి.

ఉత్తర ప్రబంధ యుగంలో ప్రసిద్ధ లాక్షణికుడైన అప్పకవి ఉదాహరణానికి లక్షణాలు చెప్పాడు. దానికి లక్ష్యభూతంగా శ్రీ కృష్ణోదాహరణాన్ని రచించాడు. శ్రీకృష్ణుని లీలావిలాసాలు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ప్రధానేతి వృత్తంగా ఈ కావ్య రచన సాగింది.

దక్షిణాంధ్ర  యుగంలో బాలకవి అనంతయ్య రాసిన శేషార్యోదాహరణం ఒక్కటే పరిపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యం. అంకితాంక పద్యం కందంలో ఉండడం దీని ప్రత్యేకత. కందంలో అంకితాంక పద్యం రాసిన తొలి ఉదాహరణంగా ఈ కావ్యానికి గుర్తింపు లభించింది. అయితే ఈ యుగంలో మరికొన్ని ఉదాహరణ కావ్యాలు లభించాయి. కాని అవి అసంపూర్ణ గ్రంథాలే. ఏనుగు లక్షణ కవి రాసిన విశ్వేశ్వరోదాహరణం, నుదురుపాటి సాంబశివమూర్తి రాసిన రఘునాథీయోదాహరణం – అసంపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యాలే. మచ్చ వేంకటకవి ముఖలింగేశ్వరోదాహరణం కూడా పరిపూర్ణంగా దొరుకలేదు.

పాల్కురికి సోమనాథుని కాలంలో మొదలైన ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆయా కాలాలలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.

ఆధునిక యుగంలో కూడా ఉదాహరణ కావ్యాలు పుంఖానుపుంఖంగా వెలువడుతున్నాయి. ప్రాచీనకాలంలో వెలువడిన ఉదాహరణల కంటె, ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణలే అధికం.

ఆధునిక యుగం – వైవిధ్యభరితం

ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణ కావ్యాలను పరిశీలిస్తే – మనకు వైవిధ్యం అధికంగా గోచరిస్తుంది. సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ఉదాహరణలు వచ్చాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలను ప్రశంసిస్తూ ఉదాహరణ కావ్యాలు వచ్చాయి. ప్రాంతీయ వైవిధ్యాలను తొలగించి విశాల భావాలను ప్రచారం చేయడమే పనిగా ఉదాహరణలు వెలువడ్డాయి. ఇట్లా, వ్యక్తుల పరంగా, సమాజపరంగా, దేశపరంగా వివిధ ఉదాహరణ కావ్యాలు పుట్టుకొచ్చాయి.

ఆధునిక యుగంలో మానవుడు యాంత్రిక జీవితానికి అలవాటు పడినాడు. సాహిత్యానికి అధిక సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదు. చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే కావ్యాలవైపు పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, చాలా తక్కువ పద్యాలలో పూర్తయ్యే కావ్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదాహరణ కావ్యాల మీద ఆసక్తి కనబరచే పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి.

ఆధునిక యుగంలో వెలువడిన ఉదాహరణ కావ్యాలు

  1. నాగేశ్వరోదాహరణం – కీ.శే. మండపాక పార్వతీశ్వర శాస్త్రి                       –        1938
  2. గోపాలోదాహరణం – కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ                   –        1940
  3. వీరేశలింగోదాహరణం – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి                  –        1948
  4. అన్నమార్యోదాహరణం – డా|| తిమ్మావరుల కోదండ రామయ్య                  –        1951
  5. శంకరోదాహరణం – కవి కిశోర శంకరప్రసాద్                                  –        1952
  6. శ్రీమద్రామానుజోదాహరణం – చెలమచర్ల రంగాచార్యులు –        1952
  7. ఆంధ్రలక్ష్మీ వైభవోదాహరణం- చెలమచర్ల రంగాచార్యులు –        1952
  8. విశాలాంద్రోదాహరణం – డా|| దివాకర్ల వేంకటావధాని                            –        1956
  9. వీరభద్రోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  10. విరూపాక్షోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  11. లక్ష్మీనృసింహోదాహరణం- డా. సుప్రసన్న –        1962
  12. సామగాన ప్రియోదాహరణం – శ్రీమతి బుర్రా కమలాదేవి –        1963
  13. వివేకానందోదాహరణం – పాటిలు తిమ్మారెడ్డి                                                               –              1963
  14. వేంకటేశ్వరోదాహరణం – గాజుల వీరయ్య                                          –        1963
  15. రాధాకృష్ణోదాహరణం – వడ్డాది సీతారామాంజనేయ కవి                         –        1965
  16. శ్రీరామోదాహరణం – అత్తిలి వేంకటరమణ                                     –        1966
  17. శ్రీసత్యసాశాయీశ్వరోదాహరణం- ఉప్పాడ రాజారావు – 1966
  18. శ్రీనివాసోదాహరణం – జంధ్యాల పాపయ్యశాస్త్రి                                 –        1969
  19. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – బండి నాగరాజు –        1971
  20. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – వేముగంటి నరసింహాచార్యులు –        1973
  21. జనకోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  22. కుమారోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  23. పరిశుద్దాత్మోదాహరణం – బల్లి పురుషోత్తం –        1973
  24. రామలింగేశ్వరోదాహరణం – శ్రీపాద కృష్ణమూర్తి –        1973
  25. సత్యోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                              –        1980
  26. శారదోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  27. విశ్వనాథోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  28. సురూపోదాహరణం – సాల్వ కృష్ణమూర్తి                                       –        1980
  29. ఉత్ఫుల్లకం (ఉదాహరణ భేదం)- సంపత్కుమార్ –
  30. కొత్త సద్దలి (ఉదాహరణ భేదం)- ఆరుద్ర –
  31. శ్రీరామోదాహరణం – నిడుదవోలు వేంకటరావు                                –
  32. శ్రీ రాఘవోదాహరణం – కొమ్ము సుబ్రహ్మణ్యవర ప్రసాద్                          –        1983
  33. శ్రీ గణేశోదాహరణం – శ్రీ వేముగంటి నరసింహాచార్యులు                       –        1983
  34. శ్రీ రామచంద్రోదాహరణం – డా॥ దాశరథుల బాలయ్య –        1983
  35. యాదగిరి లక్ష్మీనృసింహోదాహరణం – డా|| దాశరథుల బాలయ్య – 1983

– ఇంకా నా దృష్టికి రాని మరిన్ని ఉదాహరణ కావ్యాలు కూడా వెలువడినాయి. వాటిని కూడా సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణ కావ్య భేదాలు :

ఉదాహరణ కావ్యాలకు లక్షణాలు చెప్పిన లాక్షణికులు ఉదాహరణ కావ్యభేదాలను కూడా సూచించారు.

విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో సద్దలి, పద్దలి, విద్దలి, కల్యాణి, ఉత్ఫుల్లకం – అను ఐదు రకాల భేదాలను సూచించాడు.

సద్దలి : సంబోధనా విభక్తి పద్యాల్ని వదలిపెట్టి సప్త విభక్తుల్లో పద్యాలు చెపితే అది సద్దలి.

పద్దలి : సప్త విభక్తుల్లో పద్యాలూ, సంబోధనా విభక్తి పద్యాలు చెపితే అది పద్దలి.

విద్దలి : సంబోధనా విభక్తిని విడిచి విషమ విభక్తుల్లో పద్యాలు చెపితే అది విద్దలి.

కల్యాణి : కేవలం కళికలతో రచించిన కృతికి ‘కల్యాణి’ అని పేరు.

ఉత్ఫుల్లకం : కేవలం ఉత్కళికలతో రచించిన కృతికి ఉత్ఫుల్లకం అని పేరు.

– ఇన్ని భేదాలు చెపుతూనే విన్నకోట పెద్దన ‘ధరనుదాహరణాది భేదములు పెక్కు’ అని కూడా అభిప్రాయపడినాడు. దీంట్లో ఆరుద్ర కొత్త సద్దలి, సంపత్కుమార ఉత్ఫుల్లకం – వంటి ఉదాహరణ కావ్య భేదాలను రచించారు.

మొత్తం మీద ఉదాహరణ కావ్యప్రక్రియ – భిన్న ఇతివృత్తాలతో – అనగా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, సామాజిక, భౌగోళిక, ప్రాంతీయ, దేశీయ గత వైవిధ్యభరిత ఇతివృత్తాలతో – తన అస్తిత్వాన్ని చాటుకుంటూ సాహిత్యంలో తన స్థానాన్ని భద్రపరుచుకుంది.

 

 

డా|| దాశరథుల నర్సయ్య

విశ్రాంత తెలుగు అధ్యాపకులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

గజ్వేల్, సిద్దిపేట జిల్లా

9390919100

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ ఆవశ్యకత

by Bandi Usha October 24, 2021
written by Bandi Usha

“ఆరోగ్యానికి అసలైన ఔషధం ఆసనము.”

శరీరానికి ఆసనము, మనసుకు ధ్యానం ఈ రెండింటి మేళవింపు ప్రాణాయామం. ఇది చేయటమే అసలైన యోగం.

అందుకే పెద్దలన్నారు “సర్వరోగాల నివారణకు సంజీవని యోగా.’’

నేటి మానవుడు అభివృద్ధి పేరుతో అవని నుండి ఆకసం దాకా సునాయాసంగా ప్రయాణం చేయగలుగుతున్నాడు గానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అవని నుండి పాతాళం వైపుకు ప్రయాణిస్తున్నాడు.

దీనికి కారణం మానసిక వత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆర్థికంగా అపరిమితంగా ఎదగాలనుకోవటం, వ్యామోహం, అసంతృప్తి ఇవన్నీ అనారోగ్యానికి కారణం అవుతున్నాయి.

మరి ఒకసారి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందలేమా?

మానవుడు సాధించలేనిది ఏముంది – కొంచెం శ్రద్ధ వహిస్తే తిరిగి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

దాదాపు 80 శాతం రుగ్మతలు మానసికపరమైనవే. ఆహారపు అలవాట్లు, ఆసన మరియు ధ్యానం ద్వారా తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరాన్ని, మనసును ఏకతాటిపై నడిపించే యోగాను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మనం, మన పెద్దవారిని గమనించినట్లయితే వారు అందరూ ఎటువంటి రుగ్మతలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. వారి కన్నా ముందుతరంవారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించారు. కానీ ఈనాడు మనకు అన్ని రుగ్మతలే. డాక్టరుని సంప్రదించకుండా, మందు బిళ్ళ వేసుకోకుండా జీవితం గడవటం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఏమిటి?

కారణం ఎక్కడో వెతకాల్సిన అవసరఁ లేదు. మనమే దీనికి కారణం. మన పెద్దవారు రోజంతా శ్రమించినా, సాధారణ భోజనం చేసేవారు. మనం శారీరక శ్రమను మరచిపోయాము. రుచల పేరుతో అవసరానికి మించి అనవసర పదార్తాలను భుజిస్తున్నాము. దీనితో కొత్త కొత్త రుగ్మతలు వస్తున్నాయి.

ముప్ఫై సంవత్సరాలు దాటక ముందే బి.పి, షుగర్, థైరాయిడ్, నడుము నొప్పి, కడుపు ఉబ్బరం, అధిక బరువు ఇలా అనేక రకాల రుగ్మతలు మనల్ని వేధిస్తున్నాయి. ఇంకా కొంతమందికి పుట్టినప్పటి నుండే రుగ్మతలు.

ఇలా ఎంతకాలం? ఇకనైనా మేల్కొందాం. యోగావలన కలిగే ఫలితాలను తెలుసుకొని ఆచరించి, ముందు తరాలవారికి ఆర్థిక నిధిని కాకుండా ఆరోగ్య నిధులను అందిద్దాము.

యోగా ప్రతిరోజూ చేయటం వలన శరీరంలోని మలినాలు తొలిగిపోయి శుద్ధి జరుగుతుంది.

రోజూ ఆసనాలు వేయటం ద్వారా ఎముకలు దృఢంగా, శక్తివంతంగా తయారవుతాయి.

రోగ నిరోధక శక్తి పెరగటంవలన శరీరం వ్యాధులతో సమర్థవంతంగా పోరాడి ఆరోగ్యవంతులుగా చేస్తుంది.

ఇప్పుడు మనం చేసే పనులు ఎక్కువగా శరీరానికి, మనసుకు సంబంధం లేనివే. జిహ్వ చాపల్యం చంపుకోలేక, అనారోగ్యానికి గురిచేసే అనేక ఆహారపదార్థాలు తింటున్నాము. అంతేకాకుండా వత్తిడిగా ఉన్నా, ఖాళీగా ఉన్నా ఎక్కువగా ఆహారం తింటాము. యోగా చేయటం ద్వారా వత్తిడి దూరమవటమే కాకుండా ఎంత అవసరమో అంతే తింటాము.

క్రమం తప్పకుండా యోగా చేసేవారికి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడటంతో బిపి తగ్గుతుంది. కండరాలను బలోపేతం చేయటం వలన గుండె పని తీరు బావుంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగు అవటంతో చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

ప్రాణాయామాల ద్వారా శ్వాస్రకియ మెరుగుపడి, ఊపిరితిత్తుల పని తీరు బాగుంటుంది.

శారీరకంగా, మానసికంగా దృఢంగా అవటంతో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. బరువు తగ్గుతారు. కంటి సమస్యలు దూరమవుతాయి. కొవ్వు నిల్వలు తగ్గుతాయి. అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, సైనస్, ఎలర్జీలు, సయాటికా, వెరికోసిలం వెయిన్స్, కీళ్ళనొప్పులు, నడుము నొప్పి, మహిళలలో ఋతు సంబంధ సమస్యలు…. ఇలా ఎన్నో సమస్యలు యోగా ద్వారా పరిష్కరించబడతాయి.

ఏకా్రగత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తితోపాటు ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. భావోద్వేగాలు అదుపులో ఉండటం వలన సమస్యలను సానుకూలంగా, ధైర్యంగా ఎదుర్కోగలరు.

మరి ఇంతటి దివ్య ఔషధాన్ని మనందరం బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రతిరోజూ స్వీకరిద్దాము. నిండు నూరేళ్ళు ఆనందంగా, హాయిగా జీవిద్దాం.

బండి ఉష, అరవిందయోగ ట్రస్ట్, ఖమ్మం

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుర్రం జాషువా కాలం నాటి వర్ణ వివక్షత ` సాహిత్యం

by vanaparti padma October 24, 2021
written by vanaparti padma

భారత దేశసామాజిక వ్యవస్థలో వివిధ మతాలు, విభిన్న కులాల వారు జీవిస్తున్నారు.  బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యం, శూద్ర అనే నాలుగు వర్ణాలతో పాటు, పంచమ వర్ణం అనే మరొక వర్ణం అదనంగా స్పష్టించబడిరది.  వీటిల్లో ఉపకులాలున్నాయి.  కులాల్లోని అంతరాల వల్ల అస్పృశ్యత విచ్చలవిడిగా కొనసాగుతుంది.   పంచములకు సమాజంలో అనేక పేర్లు ఉన్నాయి.  అంత్య, అంత్యజ, ఛండాల,  శ్వపచ, మాల, మాదిగ, ఛమార్‌, మోచీ, మాంగ్‌, మహర్‌ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ సభ్య సమాజం సాంఫీుక జీవితం నుండి వెలి వేసారు.

అస్పృశ్యులుగాను, పంచములుగాను పిలువబడుతున్న వీరందరు ఊరికి వెలుపల వెలివాడలు నిర్మించుకొన్నారు.  వీరి ఉనికి, నీడలు సవర్ణ సమాజంపై పడకుండా కట్టుదిట్టం చేశారు.  మరణించిన జంతువులు వాటి తోళ్ళు, కలేబరాలూ, కుక్కలు, గాడిదలు వీరి స్థిర, చరాస్తులు,  అంత్యజులు శుచి శుభ్రంగా ఉండకూడదు.  మంచి దుస్తులు ధరించకూడదు శవాల మీది ప్రేత వస్త్రాలే వీరికి దుస్తులు.  పగిలినమట్టి పాత్రలు ఉపయోగించాలి.  భోజనంలో కాని ఇతర పరిస్థితులలో

నెయ్యి వాడకూడదు.  అస్పృశ్యులు ఆభరణాలుగా ఇనుప నగలే ధరించాలి. దేశ దిమ్మరులై సంచార జీవితం గడపాలి.  శవాలకు కాపలాకాస్తూ కాటి కాపరులై ఉండాలి.  ఊరి పోలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తుండాలి.  సొంత ఆస్తి వుండకూడదు.

బహిష్కరణకు గురైన పంచమ జాతిలో పుట్టినవారే గుర్రం జాషువా కుల దొంతరల సమాజంలో పుట్టకతోనే అస్పృశ్యుడుగా ముద్రపడిరది.  మహాకవి గుర్రం జాషువా 1895 సం॥ సెప్టెంబర్‌ 28వ తేదిన గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించారు.  తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్యలు.  ఈ దపంతులు కులాంతర వివాహం చేసుకున్న క్రైస్తవ, యాదవ కులస్థులు కాబట్టి యాదవులు వీరిని కులం నుండి వెలివేసారు.  మనది పితృసామ్యం వ్యవస్థ కావున తండ్రి కులమే వారి సంతానానికి కూడ వర్తిస్తుంది.  కాబట్టి జాషువా కులం అస్పృశ్యుడిగా  చెప్పబడిరది.  జాషువా బాల్యం నుండి కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు.  కులం, పేదరికం రెండు తన గురువులని చెప్పుకున్నారు.  పేదరికం ఆయనకు వినయాన్ని నేర్పితే, కులం ఆయనని బానిసని చేయక ప్రతిఘటించే శక్తినిచ్చింది.  కుల సమాజం పోవాలని కలం మోధుడై  సమాజం మీద దండెత్తాడు జాషువా.  ఇవన్నీ జాషువా సాహితి వ్యక్తిత్వాన్ని ఒకరకంగా పటిష్టపరిస్తే ఇంత కంటే విశాలమైన భూమిక మరొకటి జాషువా కవిత్వానికి బలం చేకూర్చింది.

19వ శతాబ్ధం నాటికి భారతీయ సామాజిక వ్యవస్థ కుల, మత సంఘర్షణలతో, అస్పృశ్యతా దురాచారంతో, హేతురహితమైన ఆచారాలు భ్రష్టుపట్టిపోయిన సంప్రదాయాలు బలంగా మర్రి ఊడల్లా వ్యాపించాయి.  అ నారోగ్యకరమైన వ్యవస్థను రూపుమాపాలని, సమాజాన్ని ఆవరించిన చీకట్లను పారదోలాలని కొందరు మేథావులు సంస్కరణ ఉద్యమాలు నడిపారు.  ఈ ఉద్యమాలు సమాజంలో నెలకొన్న అనేక దుష్ట సంప్రదాయాలను రూపు మాపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి.  వలస పాలనను అంతమొందించాలని జాతీయోద్యమం పుంజుకుంది.  జాతీయోద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమ ఆశయాలను లక్ష్యాలను చేపట్టింది.  ఆదే సమయంలో రాజకీయోద్యమం, సంస్కరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి.  కాని జాతీయోద్యమ ఉదృతికి తట్టుకోలేక పోయాయి.  జాతీయోద్యమ లక్ష్యం ప్రధానంగా స్వాతంత్య్ర సంపాదన అందుకోసం సమాజంలో గుణాత్మకమైన మార్పులు రావాలని కొందరు మేథావులు భావించారు.  ఆస్తిక, నాస్తిక ఉద్యమాలు చరిత్రలో నిలిచి పోయెలా తగిన పాత్ర పోషించాయి.  మన దేశంలో మహాత్మాగాంధీ నాయకత్వాన, జాతీయోద్యమం బలంగా సాగుతుంది.  మహరాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో పంచముల కులనిర్ములనోద్యమం చేపట్టారు. అంబేద్కర్‌ ఉద్యమాలకు స్పందించిన కవులు వారి వారి మార్గాన్ని ఎంచుకుని కృసి చేయసాగారు.  జాషువా పై ఈ ఉద్యమాల ప్రభావం బలంగా పడిరది.  జాషువా వ్యక్తిగత జీవితం సాహిత్య జీవితం రెండు ఘర్షణ నుండి పుట్టినవే.  ఈ రెండు ఒకదానికొకటి పేన వేసుకపోయి మహకవి జాషువా రూపంలో కన్పిస్తాయి.

జాషువా బాల్యంలో  ఆటస్థలంలో పంచముడిగా సవర్ణుల చేత అవమానింపబడ్డాడు, పాఠశాలలో చదువుకునే రోజులలో గురువులకు కూడా అస్పృశ్యత భేదభావం ఉండేది అంటు ఓ పద్యంలో ఇలా ‘‘మా గురువు గారికి కోపము వచ్చు వేళ / పెంపల రెడునంట రాని తన మడమువచ్చే’’ అని జాషువా చెప్పుకున్నారు.  గ్రామంలో నాటక ప్రదర్శనకు వెళ్ళిన బాల జాషువాకు అక్కడ అస్పృశ్యత ఎదురైంది.  జాషువా కవిగా కళ్ళు తెరిచే నాటికి ప్రతి పల్లె, పట్టణాలలో ఊరు వాడలలో ఆశుకవితా ధారల్లో పండితులు పామరులు మునిగితేలుతున్నారు.  కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు ఆశుకవితతో అవధానాలు చేస్తూ గ్రామగ్రామాల్లో విస్తృతంగా పర్యంటించారు.  ఇలాంటి సాహిత్య వాతావరణం జాషువాలో ‘కవి’ అంశ మొగ్గ తొడిగి సాహిత్య ప్రస్థానం మొదలైంది.

జాషువా హిందూ ధర్మశాస్త్రాలు, ఇతిహసాలు చదువుతుంటే హిందువుల్లో సంచలనం బయలు దేరింది.  ఆశ్యర్యాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారు.  కవిత్వం చెప్పడం మొదలు పెట్టగానే ` ‘‘ప్రధివీ సురులు దక్కనితర జాతులు కైతలల్లరాదు నేరం’’ అ ని సవర్ణులు జాషువాని నిలదీసారు.

జాషువా వ్యక్తిగా, కవిగా, కుల రక్కసి చేతిలో అనేకమైన అవమానాలు, అవహేళన పలుమారులు చవిచూసారు.  అవమానించిన కవులను వ్యక్తులను ‘గవ్వకు సాటిరాని పలుగాకులుగా’ గణించాడు. వీరు అడ్డగిస్తే తనను వరించిన శారద లేచిపోవునా! అని ఘంటమూనెదన్‌ రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద నాంధ్ర వాణికిన్‌’’ అని ఆత్మ విశ్వాస ప్రకటన చేసాడు.  ఈ సామాజిక సాహిత్య నేపథ్యం నుండి చీకటి వెలుగుల నుండి జాషువా కవిత్వాన్ని  దర్శించవచ్చు.  జాతీయోద్యమాల వల్ల, కులనిర్మూలనా పోరాటాల వల్ల, సంస్కరణల వల్ల, క్రైస్తవ మతం వల్లనైతేనేమి విద్య నేర్చుకునే హక్కును, ఆలయ ప్రవేశాన్ని పొందగలిగారు పంచములు.

ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు.   ఊరూరా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తల వారి ఆశీర్వాదాలు పొంది, కావ్యజగత్తులో స్థిరపడ్డారు.  తిరుపతి వేంకటకవుల ప్రోత్సాహంతో ముందుకుసాగి, ఉభయ భాషాప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్య్రానంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంలో తెలుగు ప్రోడ్యూసర్‌గా ఉద్యోగాలు నిర్వహించారు.

ఆరుబయటి ప్రక్కపరుచుకొని, ఒక ప్రక్క వేడిగాడ్పులు, మరోపక్క పిండిఆరబోసినట్లున్న వెన్నెలను అనుభవిస్తూ ‘‘నా జీవితం కూడా ఇలాగే వెన్నెల వడగాడ్పు మిళితమై సాగిపోతుంది, వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు.  కవిగా నిలదొక్కుకోవడానికి పడిన శ్రమ నిలుపుకున్న వ్యక్తిత్వమే జాషువాను గొప్ప కవిగా ప్రకాశింపచేసింది.

జాషువా తెలుగు సాహిత్యంలోని వివిధ సాహితీ ప్రక్రియలని చేపట్టి రచనలు చేశారు.  సోదరునితో కలిసి నేత్రావధానం చేసారు.  పారాణిక నాటకాలు రాసారు.  నవలా ప్రక్రియలో కూడా జాషువాకు ప్రవేశం ఉంది.  జీవిక కోసం పారాణిక, సాంఘిక నాటకాలనేకం రాశారు.  ‘బొబ్బిలి యుద్దం’ వంటి సినిమాలకు ఆశువుపద్యాలల్లి ఇచ్చారు. గేయాలు రాశారు, జానపద కళారూపాలకు గేయాలు సమకూర్చారు జాషువా ఎన్ని ప్రక్రియలు చేపట్టినా తెలుగు సాహితీలోకం ఆయనను ఆధునిక పద్యకవిగా గుర్తించి గౌరవించింది.

జాషువా ప్రధానంగా వస్తు కవి.  అయిన శిల్ప వ్యతిరేకి మాత్రం కాదు.  సంప్రదాయ చంధస్సు స్వీకరించి, సమకాలీన సంఘటనతో నవ్యమైన వస్తువును జోడిరచి కవిత్వం చెప్పారు.  వీరు వర్తమానాన్ని నిశితంగా పరిశీలిస్తూ భూత, భవిష్యత్తు కాలానికి తొంగి చూడగలిగిన ఋషితుల్యుడు.  జాషువా ప్రాచీన కవుల సంస్కృత కవుల కవిత్వాన్ని పుక్కిట పట్టారు అతని కవిత్వంలో కవిత్రయం వారి కవితారీతులు, శ్రీనాథకవి సీస పద్యధార, ప్రబంధ కవుల వర్ణనతో పాటు కాళిదాసు వచోవైభవం చూడవచ్చును,  కథావస్తువు, పాత్రల చిత్రణ, చంధోలంకారాది నియమాలు, రసపోషణ, ఉక్తిచిత్రి, భాషాపదప్రయోగం లాంటివన్ని కావ్య శిల్పానికి అంగాంగాలుగా చెప్పుకోవచ్చు.  అనతంతమైన ఆర్థ్రత, అపారమైన భావుకతతో మానవీయ కవిగా దర్వనమిస్తారు.  ప్రకృతి అందాలను, సూక్ష్మ రహస్యాలను సున్నితంగా కవిత్వ రూపంలో సమాజానికి అందించడం జాషువా కవితా ప్రతిభకు నిదర్శనం.

సీయపద్య రచనకు జాషువా పెట్టింది పేరు.  శ్రీనాథుని త రువాత సీసపద్యాన్ని జాషువానే మధురంగా రాయగలిగాడని విమర్శకులు సైతం పొగిడినారు.  కవితా శిల్పం, నైపుణ్యం, వైభవం సీసపద్య రచనలో ఆటవెలది జోడిరచి చెప్పడంలో జాషువా ప్రతిభా సంపత్తి వెల్లడవుతుంది.

‘‘ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు / పగవాని రుధిరంబు పరిమళింప / మెఱసె నిచ్చోట నాదరుషా కురారంబు / నిఖిల భారతము కన్నీరు నింప / వెలిసె నిచ్చోట పచ్చల బర్హిపీరంబు / షాజాను రాజు నాస్థాన వాటి / పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజోక రోజు / జయ చంద్రు సుతను దోస్సారగరియ’’ ఇలా  సీస పద్యంలో ఆటవెలదినిగాని, తేటగీతిని గాని వాడుకున్న వాటిలో అందంగా, సొగసుగా  నృత్యం చేయించగల  శక్తి సంపన్నుడు.  జాషువా వృత్తాలలో మత్తేభం, శార్థూలం, ఉత్పలమాల,  చంపకమాల, జాతుల్లో ఆటవెలది,  తేటగీతి, కందం, సీసం లాంటివి ఆయన మధురమైన కవితలకు వాహికలుగా నిలిచాయి.

జాషువా గబ్బిలాన్ని చీకటితో పోల్చి చెప్పడం కోసం ఉపమాలంకారం తీసుకున్నాడు.  ‘మక్కు మొగమున్న చీకటి ముద్దవోలె / విహరణముసేయ సాగె గజ్జల మొకండు’ అంటు చెప్పారు.  అర్థాంతరన్యాసాలంకారానికి గాను ‘‘గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప, మస్తమునదాల్పు మొకచిన్ని మంచుతున్క, విసపు మేతరికది సిఫారసుగనుండు, వ్యర్తములుగావు పెద్దలపరిచయములు’’ అంటు పూరించారు.  ఔషధంబు లేని యస్పృశ్యత జాఢ్య / మంద భాగ్యు నన్ను మఱచిపోవు’’ అనే పద్యపాదములు రూపకాలంకారానికి చక్కని ఉదాహరణంగా నిలిచింది.  ప్రకృతిని చూసి పులకించే కవిహృదయం జాషువాది.  అందుకే గరికపోచలో కూడా కవిత్వాన్ని చూడగల్గిన సున్నిత  హృదయంగలవారు.

‘‘తేటయైన తీపినీట దిక్కులదాక / విస్తరించి రుచుల గుస్తరించి / చిల్కసంద్రముంపు సీయుచుగన్నట్టు’’ అనే ఈ పద్యంలో తీయదనాన్ని దాచుకున్న నీటిసరస్సు స్వచ్ఛమైన  తెలుగు భాషలా ఉంటుందని చెప్పడంతో  జాషువాకు తెలుగు భాషపైనున్న అభిమానం తెలుస్తుంది.  జాషువా సాహిత్యంలో సంస్కృతం, ఆంగ్లభాషా పదాలతో పాటు హిందుస్తానీ, ఉర్దూ, పారశీక, హిందీ మిశ్రమపదాలు అనేకం వీరి కవిత్వంలో కల్సిపోయాయి.  తెలుగు పలుకుబడులు, నుడికారాలు, జాతీయాలు జాషువా కవిత్వంలో పలుమార్లు కన్పిస్తాయి.  కవిత్వానికి తెలుగుపలుకుబడులతో గుడికట్టారు జాషువా అంటారు డా॥ సి.నారాయణ రెడ్డి గారు.  30కి పైగా రచనలు చేసి, సాహితీ జగత్తులో తనదైన ముద్రవేసుకున్న మహోన్నతమైన కవి జాషువా.

జాషువా పాండితీవైదుష్యానికి వేయికి పైగా సన్మానాలు జరిగాయి.  ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవి శతావధాని చైళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు జాషువాకు గండె పెండారం తొడిగి సత్కరించారు.  కనకాభిషేకం చేసి పగటి దివిటీలు పట్టి పల్లకిలో ఊరేగించారు.  జాషువాను వర్ణ వివక్షతతో క్షోభపెట్టిన సమాజమే ఆయన పాండిత్యానికి ప్రతిభావ్యుతృత్తులకు తలలు వంచి కవికోకిల, కవిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవి  చక్రవర్తి, విశ్వకవి, కవిసామ్రాట్‌ బిరుదుతో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ   ‘‘క్రీస్తు చరిత్ర’’ కావ్యానికి అవార్డు బహుకరించింది, ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసన మండలి సభ్యునిగా నియమించింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం  ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదాంకితున్ని చేసింది.  రాష్ట్రపతి ‘‘పద్మభూషణ్‌’’ ఇచ్చి సంత్కరించారు.  జాషువా 1971 జులై 24వ తేదిన కీర్తి శేషులైనారు.

 

రచన:

వనపర్తి పద్మావతి,

హన్మకొండ,

సెల్‌ : 9949290567.

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రెండు పండుగలు(బతుకమ్మ, దసరా)

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) October 24, 2021
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

బోణి అంటే స్త్రీ. పూబోణి రూపం మనం సాహిత్యంలో చూస్తాము. బోణి + అమ్మ = బోణెమ్మ. జన వ్యవహారంలో బొడ్డెమ్మ అయింది.

బొడ్డెమ్మ- కన్నెపిల్లల పండుగ

బతుకమ్మపండుగకన్నా ముందు బొడ్డెమ్మ పండుగ వస్తుంది. తొమ్మిది రోజులపాటు కన్నెపిల్లలు మాత్రమే చేసే  పండుగ ఇది. తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగ. తొమ్మిదవ రోజు ‘సద్దుల బతుకమ్మ’. బొడ్డెమ్మ అంటే చిన్న అమ్మాయి అని అర్థం.

పుట్టమన్నుతో ఒక పీట మీద అయిదు అంతస్థులుగా చతుర ప్రాకారంగా చేసి ఒక దానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగెడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్ట నుంచి దానిపై తమలపాకు, పసుపు ముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమే కాదు, ఆడపిల్లల్ని పూజించే పండుగ గౌరవించే పండుగ. తెలంగాణ ప్రాంతమంతా ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల పుట్టందింటే లక్ష్మీదేవి పుట్టింది అంటారు.

సిబ్బి పిండి పూలను అందంగా సాయంత్రానికి అందంగా వేసి పూలముగ్గులలో బొడ్డెమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ లయాత్మకంగా చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్…. నీ బిడ్డ పేరేమికోల్… నీ బిడ్డ నీలగేరుకోల్…. నిచ్చెమల్లె చెట్టేసి కోల్…. నిచ్చమల్ల చెట్టుకు కోల్…. రోజు నీళ్ళు పోసి కోల్…. అనే పాటతోపాటు, బొడ్డెమ్మకు సంబంధించిన ఎన్నో పాటలను పాడుకొని మంచి భర్త రావాలని కోరుకుంటారు.

ఆ విధంగా ఎనిమిది రోజులు బొడ్డెమ్మను కొలిచి ఆఖరి రోజున అందుబాటులో ఉన్న బావిలోగానీ, చెరువులో గానీ జారవిడుస్తారు. తొమ్మదవ రోజున బొడ్డెమ్మపై కలశంలో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి ఆరగిస్తారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీలకు పూల పండుగ. ఆటపాటల పండుగ. ఊరి పరిసరాల్లోనూ ఇంటి పెరడులోనూ పూలను సేకరించి బతుకమ్మను పేర్చడం సంప్రదాయం. బతుకమ్మ పండుగ నాటికి విరబూసిన తంగేడు పూలతో ముఖ్యంగా బతుకమ్మను రూపొందించడం ఆచారం.

ప్రకృతి వివిధ వర్ణశోభితమై అలరిస్తూ ఉంటుంది. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వినూత్న శోభ సంతరించుకునే కాలం శరత్ ఋతువు. శరదృతువులో చామంతి, బంతి, తంగేడు, గునుగుపూలు విరగబూస్తాయి. మగువలు ఈ పూలను సేకరించి అందమైన రూపమిచ్చి ‘బతుకమ్మ’ అని అమ్మవారిని కీర్తిస్తూ పాడే పాటలు తెలంగాణా అంత ప్రతిధ్వనిస్తాయి.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే బతుకమ్మ పండుగను భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు అత్యంత వైభవంగా స్త్రీలు, జానపద సంగీత, నృత్య సమ్మేళనం జరుపుకుంటారు.

ఇలా ఎనిమిది రోజులు ఆడాకా తొమ్మిదవ రోజు అంటే అష్టమి నాడు జరుపుకునే పండుగను “సద్దుల బతుకమ్మ” అంటారు. కంది, పెసర, వేరుసెనగలు పప్పులన్నీ పొడులుచేసి అన్నంతో సద్దులు చేస్తారు.

బ్రతుకు + అమ్మ = బతుకమ్మ అంటే బతికించే అమ్మ లేదా బ్రతికిన అమ్మ బ్రతుకమ్మ అయ్యిందని భావిస్తారు. ఈ బ్రతుకమ్మ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ‘బతుకు అమ్మ’గా మారింది. రంగు రంగుల, రకరకాల పూలతో తయారుచేసే ఈ బతుకమ్మలు లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశంగానూ, ప్రకృతికి ప్రతిరూపంగాను భావిస్తారు.

బతుకమ్మను గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ రాజధానిగా రాజ్యమేలిన కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ జరిగేదని తెలుస్తోంది.

చారిత్రక ఆధారంగా 19వ శతాబ్దం పూర్వార్థం లోను, 20వ శతాబ్ధం ఉత్తరార్థంలోనూ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం జరిగి అంటువ్యాధులు సోకి లక్షలాది మంది చనిపోతుండగా ఉన్న తమ సంతానం మరణించకుండా ఉండాలని కోరుతూ బతుకు అమ్మ, బతుకమ్మ దేవిని ప్రార్థించగా ఆమె కరుణచే బతికినారని అందుకే బతుకమ్మగా పూజించడం సంప్రదాయంగా వచ్చిందని పెద్దలు చెబుతారు.

చోళ దేశపు రాజైన ధర్మాంగతుడికి అనేకమంది కుమారులున్నారు. వారు శ్రతువుల చేతిలో హతులవడంతో తన భార్యతో అడవులకు వెళ్ళిపోయిన శ్రీ లక్ష్మీదేవిని గురించి తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగగా అమ్మా అని పిలిచే సంతాన భాగ్యం కలిగించమనగా తథాస్తు అంది. తనకు కూతురు పుట్టగా బతుకమ్మ అని పేరు పెట్టినట్లుగా భట్టు నరసింహ కవి శ్రీ లక్ష్మీదేవి చందమామ సృష్టి బతుకమ్మాయె చందమామ అంటూ బతుకమ్మ పుట్టుక గురించి వ్రాసిన తొలిపాటగా తెలుస్తోంది.

దసరా దరహాసం

దసరా పండుగను జరుపుకున్నాం. విజయదశమి పండుగను మనం అనాదిగా జరుపుకుంటున్నాం. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులు శ్రీ దేవి నవరాత్రులు శరన్నవరాత్రులుగా భావించి ఆరాధనలు జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో శరదృతువు ప్రారంభమవుతుంది. శరతంకాలపు వెన్నెల స్వచ్ఛమైన శ్వేతవర్ణంలా శరదృతువులో వచ్చే పండుగ కాబట్టి ‘శరన్నవరాత్రులు’గా పరిగణిస్తారు.

భారతీయ సంస్కృతిలో జరుపుకునే పండుగలన్నింటికీ ఒక పరమార్థం ఉంటుంది. హిందువులందరూ సమైక్యంగా అత్యంత వైభవంగా జరుపుకునే పర్వదినాలలో ‘విజయదశమి’, ‘దసరా’ ప్రాముఖ్యత సంతరించుకుంది.

అమ్మవారి ఆలయాల్లో తొమ్మది రోజులపాటు దేవి నవరాత్రులను నిర్వహిస్తూ ప్రతిరోజూ దుర్గాదేవిని వివిధ రూపాలలో శోభాయమానంగా అలంకరించి పూజలు జరుపుకోవడం ‘విజయదశమి’ పర్వదినం విశేషం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రుల పేరిట ‘దసరా’ పండుగ జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

శరన్నవరాత్రుల గురించి వ్యాసభగవానుడు

“శృణురాజస్పవక్ష్మామి నవరాత్రి నవతం శుభమ్ శరత్కాలే విశేషరో కర్తవ్యమే విది పూర్వకమ్” అని వివరించాడు. సర్వప్రాణులకు వసంత ఋతువు, శరదృతువు క్లిష్టమైన కాలాలు, ఇవి జనులందరికీ యన కోరలంటారు. జనులకు దోషాలు కలిగించేవి. జనులకు నాశనం కలిగించేవి. వాటి వలన మనుషులు తమ పరుదులు దాటి చిత్ర ప్రకోపించి ఘోరమైన మనస్సుతో ప్రశాంతతను పొందడానికి, శరత్ కాలంలో శరన్నవరాత్రులు నిర్వహించాలని పురాణాలు చెబుతున్నాయి.

సంస్కృతంలో రోజుని ‘అహోరాత్రం’ అంటారు. ‘అహోరాత్రం’ పదంలో తొలి అక్షరం ‘అ’నీ, చివరి అక్షరం ‘త్ర’నీ తొలగిస్తే ‘హోరా’ అయింది. హోరా అంటే అహోరాత్రం అనే అర్థం. అలాంటి హోరాలు దశ కలిపితే అది ‘దశహోరా’ అయింది.

ఈ ‘దశహోరా’ కాలక్రమంలో ‘దసరా’ అయింది. ‘దసరా’ అంటే దశరాత్రుల పండుగ. ‘విజయ’ అంటే జగన్మాత. ఈ శరన్నవ రాత్రులలో ఆమె ఆరాధన వలన సకల ఐశ్వర్యాలు కల్గుతాయి. ఆమె కరుణ పొందడానికి శరన్నవ రాత్రులు అనువైన కాలం.

‘నవం నూతనం రాత్రం జ్ఞానం యస్మాత్తం నవ రాత్రః అని పండితుల వాక్కు. రాత్రి అనే పదానికి జ్ఞానమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. రాత్రిని తిథిగా స్వీకరించాలి. ‘నవాహోవై సంవత్సర ప్రతిమా’ అనే వాక్యం వలన నవరాత్ర కర్మ సంవత్సర కాలానికి ప్రతిరూపమని తెలుస్తోంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు నవరాత్ర ఆరాధనలు మొదలవుతాయి. ఈ నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వల్ల సమస్త పాపాలు, బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల ద్వారా విదితమవుతుంది.

ఈ నవరాత్రుల పూజ వలన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. భక్తుల రోగ, శోక, సంతాన, భయాలను ఈ దుర్గాదేవి నశింప చేస్తుంది. ఈ నవరాత్రులలో నవదుర్గా రూపాల్లోని మహాలక్ష్మి, మహా సరస్వతీ, మహాకాళికలను ఆరాధించడం వల్ల మహాలక్ష్మి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తే, మహాసరస్వతిగా విద్యాబుద్ధులను అనుగ్రహిస్తుంది. మహాకాళిగా దుర్గగా పూజించడంవల్ల శతృభయం తొలగి విజయం సిద్ధిస్తుంది.

‘ప్రథమా శైలపుత్రీ, ద్వీతీయా బ్రహ్మచారిణీ, తృతీయ చంద్రమంటేతి కుష్మాండేతి చతుర్థకే, పంచమా స్కందమాతేతి, షష్టాకాత్యాయనీ తచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమాసిద్ధి దాత్రీతి నవదుర్గాః ప్రకీర్తతాః”

అని మార్కండేయ పురాణం పేర్కొన్నది. సకల దేవతా శక్తులకు మూలధారిణి, సకల మంత్ర అధిదేవత, ఓంకార స్వరూపిణి, సృష్టిలోని పలు ప్రాణులకు మాతృమూర్తియైన శక్తికి ప్రతిరూపంగా దుర్గాదేవిని ఆరాధించడం అనాదిగా మన ఆచారం.

ఈ ప్రపంచమంతటా ఒక శక్తి నిక్షిప్తమై వుండి, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ శక్తే పరమాత్మ. పరమాత్మే అశక్తి. శివశక్తి నిరాకార అయిన ఆదిపరాశక్తి అవసరార్థం అనేక రూపాలు ధరించి, సత్త్వ రజోస్తమోగుణాలను ఆశ్రయిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి అనే త్రిగుణ శక్తులుంటాయి. సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్ఛాశక్తి వలన ఏర్పడుతుంది. దానికి సంబంధించిన కార్యకలాపమంతా జ్ఞానశక్తి వలన ఏర్పడుతుంది. సంకల్పం కార్యరూపం ధరిస్తే అది క్రియాశక్తి రూపం అవుతుంది. ఈ త్రిశక్తుల ద్వారా ఆదిపరాశక్తి విశ్వసృష్టి చేస్తుంది. ఆదిశక్తి తన మాయా ప్రభావంతో అనేక అద్భుత కార్యాలు చేస్తుంది.

అనంతమైన ఈ విశ్వాన్ని పోషించి, లయం చేస్తుంది. శక్తియే దేవి అని పాశాయేశ ధనుర్బాణాల ధరించిన మహా విద్యయని, దుర్గాదేవియై నిఖిల జగత్తును రక్షించే మహాశక్తిగా వెలసినది. కనుక ఈ నవరాత్రులలో దివ్యతేజస్సుతో ప్రభవించే దుర్గాదేవిని అర్చిస్తే సమస్త రోగాలు తొలగి ఆయురారోగ్యాలు కలిగి, బ్రహ్మత్వసిద్ధి, భుక్తి, ముక్తిపదమవుతుంది. దుర్గాదేవి పూజ వలన అన్నింటా విజయాల్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మకు ప్రణామాలర్పించి, ఆశ్సీస్సులు పొంది విజయదశమి రోజున నూతన కార్యక్రమాలను పారంభిస్తే విజయం కలుగుతుందని, శుభాలు చేకూరుతాయని విశ్వాసం. విజయదశమి పండుగా చారి్రతాత్మకమైన ప్రాశస్త్యాన్ని, విశిష్టతను సంతరించుకున్నది.

“యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై, నమస్తస్యై నమో నమః’ అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండే దేవికి నమస్కరించింది మార్కండేయ పురాణం. శివుడు సైతం శక్తి సంపన్నుడైనప్పుడే ఆయనకు పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది. శక్తి లేకుంటే ఏ ప్రాణి కదలలేదు. దుష్టరాక్షసులను సంహరించడానికి ఆ రాశక్తి పది రూపాల్లో అవతరిస్తూ ఉంటుంది. జగన్మాతను దుర్గభవాని, రుద్రాణి వంటి అనేక నామాలతో భక్తులు కీర్తిస్తుంటారు.

ప్రాచీన కాలంలో ఆర్యులకు అపరాజితాదేవి ప్రధానమైన దేవతగా ఉండేది. ‘అపరాజిత’ అంటే ‘పరాజయం’ పొందినది. వైదిక కాలంలోని ఈ అపరాజితాదేవి క్రమేణా క్ష్రతియుల జయాధిష్టాన దేవత అయింది. క్షత్రియులు దశమినాడు అపరాజితను పూజించటం ఆచారమైంది. నవమినాడుగానీ, దశమినాడుగానీ ఈ అపరాజితను పూజిస్తే విజయం తథ్యమని పురాణ ప్రవచనం.

ఈ రూపాలకే ’నవదుర్గలు’ అని పేరు. దుర్గాదేవి తొలి స్వరూపంలో శైలపుత్రిగా, మలి రోజు బ్రహ్మచారిణి స్వరూపంగా, తృతీయ స్వరూపంగా చంద్ర ఘంటాదేవి, చతుర్థ స్వరూపంగా కుష్మాండాదేవిగా, పంచమ రూపం స్కందమాత, షష్టి స్వరూపం కాత్యాయనిదేవి, సప్తమ రూపం కాళరాత్రీ, అష్టమ రూపంగా మహాగౌరి, దుర్గాదేవి నవమ స్వరూపంలో ప్రసిద్ధి చెందింది.

‘’ఏతస్యా దసరం కించిత్ వ్రతం నాన్తి ధరాతలే

నవరాత్రాభిరం వైశ్య పావనం సుఖదం తథా

ఆనందం మోక్షదం చైవ సుఖ సంతాన వర్థనమ్

శ్రతునాశకరం కామం నవరాత్ర వ్రతం సదా”

అంటూ నవరాత్ర మహిమను పురాణాలు కొనియాడాయి.

అంతా శక్తి మయం, స్త్రీ శక్తిమయం, ఆదిపరాశక్తి పార్వతి అంశతో కరువుకాటకాలను తొలగించి, లక్ష్మీదేవి సిరిసంపదలను చేకూర్చి, దుర్గాదేవి కోరిన కోర్కెలను నెరవేరుస్తుంది. పరాశక్తి త్రిమూర్తులను పోలియున్న సత్వ రజస్తమో గుణములను ప్రతిరూపంగా నిలుస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో, గౌరవంతో కొలవాలి.

ఆశ్వయుజం అంటే న + శ= ఆశ్వ అవుతుంది. శ్వ = అంటే రేపటికి, న = ఉండదని, రేపటికి ఉండదని, అంటే నిత్యం మార్పు చెందే ప్రకృతి అని అశ్వపదానికి అర్థం. ఆశ్వ +యుజం అంటే అశ్వేన యుజ్యతే. ఇది ఆశ్వయుజం అవుతుంది. ప్రకృతిలో కూడినది అని దానికి అర్థం. ప్రకృతిలో కూడి ఉండేది పరమాత్మ.

“ప్రాతర్యా నాణా ప్రథమాయజధమ్

నోరన సామయంతి దేవాయా అజుష్టమ్”

అని ఋగ్వేదంలో ఉన్నది. అంటే సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రానికి సంబంధించిన దేవతను పూజించాలి లేదా సూర్యాస్తమయ సమయంలో తూర్పున ఉదయించే నక్షత్ర దేవతనైనా పూజించాలి. ఖగోళ శాస్త్రరీత్యా పరిశీలించినప్పుడు ఈ శరన్నవరాత్రులలో కన్యారాశి నక్షత్రాలు కనిపిస్తాయి. కన్యరాశి స్త్రీ ఆకృతి. ఆ స్త్రీ రూపమే మనం ఆరాధించే దుర్గామాత. కన్యరాశి తర్వాత కనిపించేది సింహ నక్షత్రం. ఆ ఆకృతే దుర్గాదేవి వాహనం. కనుక సింహాసనం అధిష్టించి భక్తులకు సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది.

“అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే

సకాలో విజయోనామ సర్వకామర్థ సాధకః”

ఆశ్వయుజ దశమి సాయంకాలం నక్షత్రోదయ వేళను విజయకాలం అంటారు. ఆ సమయం సర్వకామ్యార్థ సాధకం అనీ, సాయంకాలం నాటి, నక్షత్రాలు అప్పుడే పొడగట్టే కాలం విజయకాలమని, సకల కార్యసిద్ధి కలిగిస్తుందనీ చింతామి కారుడు ప్రవచించాడు.

చిదగ్ని కుండ సంభూతమైన దేవి తత్త్వములేనిది ప్రపంచంలో ఏదీ లేదు. సమస్త ప్రపంచం శ్రీ దేవి మయం. శ్రీ దేవి మూల ప్రకృతి స్వరూపిణియై సర్వ చరాచర జగత్తులో వ్యాపించి అగోచరంగా ఉంటు, సకల భూతకోటికి సర్వవిధాల ఉపయోగపడుతుంది. దేవి నవరాత్రులలో శక్తి ప్రదాతయైన దుర్గాపూజ ప్రదానం.

ఈ నవరాత్రులలో ఒక్కొక్కనాడు శక్తిని పూజించడం వలన, నవ శక్తులతో, నవదుర్గులతో కూడియుండటం వలన నవరాత్రులయ్యాయని శివుడు పార్వతిదేవితో చెప్పినట్లు శక్తి సంగమ తంత్రం ద్వారా తెలుస్తోంది.

‘శ్రీ’ అంటే ‘ప్రకృతి’, దేవి అంటే ‘ప్రకాశించునది’ అర్థం. కనుక శ్రీదేవి అనగా ప్రకృతిలోని ప్రతి పదార్థంలోనూ గల ‘చిత్’ శక్తి అని అర్థం. చిత్ శక్తి పూజయే శ్రీ దేవి పూజ. సర్వం శక్తిమయం, భక్తే శక్తి మయం. ఆ ఆదిపరాశక్తిని భక్తిభావనలతో నిర్మల హృదయులై ఈ నవరాత్రులలో ఆమె నారాధిస్తే, సర్వ శక్తులనిచ్చి సదా కాపాడుతుంది.

శమీ వృక్షం మహిమాన్వితమైనది కాబట్టి, దసరా నాడు “శమీ శమయతే పాపం / శమీ శ్రతు వినాశినీ/ అర్జునస్య ధనుర్ధారీ! రామస్వ ప్రియదర్శినీ” అనే శ్లోకాన్ని తెల్లని కాగితాలపై వ్రాసి పఠిస్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి, కొమ్మలపై వేసి నమస్కరించి, శమీ పత్రాల్ని తీసికొని ‘బంగారం’గా భావించి, శమీ పత్రాల్ని పెద్దలకు ఇచ్చి పాదాభివందనం చేసి దీవెనలు పొందుతారు.

అశ్వయుజ శుద్ధ దశమి నాడు శమీపూజ జరిగిందని నాటి నుండి నేటివరకు విజయాలకు ప్రతీకగా విజయదశమినాడు శమీ వృక్షాన్ని పూజించడం సంప్రదాయంగా వస్తోంది.

నవ దుర్గల ఆరాధనవల్ల సమస్త పాపాలు, బాధలు తొలగి, దీర్ఘ రోగాల నుంచి విముక్తి కలిగి, సకల సౌఖ్యాలు, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, ఈతిబాధలకు గురికాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, ఆ దుర్గాదేవి ఇహపర సుఖాలను అనుగ్రహించి మానవులకు రక్షగా నిలచి కాపాడుతుందనే పరమార్థతత్త్వం నవరాత్రుల వల్ల అవగతమవుతుంది. సర్వ సిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా! అనే పెద్దల మాటలను గుర్తు చేసుకుంటూ నవరాత్రి విశేషాలను తెలుసుకుందాం.

శమీ శమయతే….

శమీ వృక్షం గొప్ప ఔషధీ వృక్షం. శమీ పాప నాశనీ, అంటే పాపాలతో కూడిన వ్యాధుల్ని నాశనం చేసే గుణం కలది అని అర్థం. అందుకే శమీ వృక్షాన్ని పూజించడంవల్ల పాపాలు శమిస్తాయని, వ్యాధుల నాశనంతోపాటు విజయం కలుగుతుందనే విశ్వాసంతో మన భారతీయ సంప్రదాయంలో (జమ్మి) శమీ పూజ విశిష్టతను సంతరించుకొన్నది. శమీ వృక్షం నూరు సంవత్సరాల జీవితాన్నిస్తుందని, మానవుని మనస్సుపై శమీ ప్రభావం ఉంటుందని ఆధర్వణ వేదంలో, శమీ, సమ్మోహన వశ్య ప్రభావం కలదని దత్తాత్రేయ తంత్రంలో తెల్పబడింది. శమీ వృక్షం రసంతో సర్వలోహాలు భస్మమౌతాయని రస తంత్రాల్లో వివరించబడిన శమీ వ్రతాలు తుమ్మ ఆకులను పోలి దళసరిగా ఉంటాయి. కఫ పైత్యాన్ని, శ్వాస, అతిసారం, కుష్టు, తదితర వ్యాధులను నయం చేసే ప్రభావం కలది.

అందుకే ఆశ్వయుజ శుక్లపక్ష దశమి శ్రవణ నక్షత్రంలో మహిమాన్వితమైన శమీ వృక్షాన్ని పూజించి, ప్రదక్షిణలు చేసి “శమీ శమయతే పాపం! శమీ శతృవినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చెప్పుకొని శమీ పత్రాల్ని ‘బంగారం’గా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం ఆచారంగా వస్తోంది.

“శివ శ్శక్త్యాయుక్తః యది భవతి శక్తిః ప్రభావితం….” ఆ శివుడు శక్తితోనే లోకములను శాసిఁచగల్గుతున్నాడని, అందుకే విజదశమి నాడు ఆయుధ పూజ కూడా విశిష్టంగా చేస్తారు.

సృష్టిలో సర్వమూ శక్తి రూపమే. శరణార్థులందరినీ రక్షించగల శక్తి కలిగిన తల్లి ఆ దుర్గామాతే. “ఐం హ్రీం, క్లీం, చాముండాయైనమః” అనే సవర్ణ మంత్రం లిఖించబడిన తామ్రరేకు యంత్రంపై నారికేళంతో కలశాన్ని స్థాపించి దుర్గాదేవిని మంత్ర పూర్వకంగా ఆవాహన చేసి తొమ్మది రోజులు ఉదయం సాయంత్రం దుర్గా సహస్రనామ, త్రిశతి, సప్తశతి, పఠిస్తూ పూజా విధి నిర్వహించాలి.

తొలి రోజు రక్షశక్తిగా దుర్గ, మలినాడు మంత్రశక్తి మంగళ గౌరిగా, తృతీయమున అన్నపూర్ణాదేవి ప్రాణశక్తిగా, చతుర్థమున కళాశక్తి లలితా త్రిపురసుందరీదేవిగా, మహాలక్ష్మి పంచమిన ఐశ్వర్యశక్తిగా, షష్ఠిన విద్యాశక్తిగా గాయత్రి, సప్తమిన జ్ఞానశక్తిగా సరస్వతీదేవిగా, అష్టమిన ధార్మకి శక్తిగా దుర్గా, సంహారశక్తిగా నవమిన మహిషాసురమర్ధనీ, దశమిరోజున విజయశక్తిగా శ్రీ రాజరాజేశ్వరిదేవిగా మహాదర్శనమిస్తుంది.

సాత్విక, రాజస,తామస అని మూడు విధాలుగా పూజాదికాలు ప్రాచీన సంప్రదాయం, సరస్వతి ఆరాధన సాత్విక అనుష్ఠానానికి మూలం. మహాకాళి ఆరాధన తామసికం, రాజసానికి మహాలక్ష్మీ, ఈ నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరిదేవిని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం.

నవావరణ యంత్రంపై శ్రీ దేవిని ప్రతిష్ఠించి, సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజ ఆచరిస్తారు. దశమినాటితో పూజ సమాప్తి అవుతుంది. ఆ తిథికే “విజయదశమి” అని పేరు.

ఈ నవరాత్రులలో రాత్రిపూజకే అధిక ప్రాధాన్యత. రాత్రివేళ అమ్మను ఆరాధిస్తే సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రోక్తి. ఈ నవరా్రతి వ్రతాన్ని తొమ్మది రోజులపాటు చేసుకోలేని వారు ఏడు రాత్రులు లేదా, ఐదు, మూడు, లేదా ఒక్కరాత్రి ఆచరించవచ్చను.

“త్రిరాత్రం వాపి కర్తవ్యం సప్తమ్యాది యధాక్రమః”

మూడు రాత్రులంటే సప్తమి నుండి, పంచ రాత్రులంటే పంచమి నుండి ఏడు రాత్రులంటే తృతీయ నుండి, ఏకరాత్రి అంటే అష్టమి లేక నవమి నాడు జరుపుకొనవచ్చును.

ఈ నవరాత్రి పూజలు ఆచరించిన తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులు పూర్తి ఉపవాసంతోగాని పూజలు నిర్వహించవచ్చును.

సర్వారిష్ట నివారణకారిణి కావడం చేత తొలి మూడు రోజులు దర్గాపూజ ఆచరించి, అష్టైశ్యర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని ఆవిష్కరించుకొని సద్గుణ భావసంపదను పొందాలి. దుర్గాపూజ ద్వార అరిషడ్వర్గాలను అంతరింపజేసుకొని, తర్వాత మూడురోజులు లక్ష్మీపూజ ద్వారా సుగుణ సంపదను పొంది, చివరి మూడు రోజుల్లో సరస్వతీ పూజ ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మజ్ఞానం, దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడ ఒక్క జగజ్జనని స్వరూపాలే అని గ్రహించాలి.

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“కాలం నది ఒడ్డున”

by Jyothi Muvvala October 24, 2021
written by Jyothi Muvvala
పుస్తకం పేరు : “కాలం నది ఒడ్డున”
కవి :  కళారత్న బిక్కికృష్ణ గారు
సమీక్షకురాలు : జ్యోతి మువ్వల
కాలం అనేది ఒక మహానది. ఎందరో జీవితాలను చూసిన జీవనది. అది ఎవరి కోసం ఆగదు. ఎంతటి ఘనులైన కాలం కాటుకు బలికాక తప్పదు. కాలగర్భంలో కలవక మానదు. మరి కాలం నది ఒడ్డున ఏముంటుంది? జీవితమనే చదరంగంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు కావలి కుండలై నడిపిస్తూ ఉంటాయి. కాలం అనే నది ప్రవాహంలో ఈదుకుంటూ పోవాల్సిందే మరి… అది ఏ తీరాన పడేస్తుందో వేచి చూడాల్సిందే. మృత్యుగాలి వీచిందా కాలం నదిలో దేహాం కొట్టుకు పోవాల్సిందే…
కాలం నది ఒడ్డున అనే పేరులో ఎంత నిగూఢ అర్ధం దాగివుందో… ఈ కవితా సంకలనంలోని కవితలలో కూడా అంతే నిగూఢ అర్థాలను ఇమిడ్చి కవిగారు మనకు అందించారు. కాలం నది ఒడ్డున ఓ పచ్చని చెట్టు వలె పల్లవిస్తూ నిటారుగా తలెత్తుకొని నిలబడాలని పరుల కోసం పుష్పించి ఫలించిన పండై రాలిపోవాలి అంటూ సందేశం ఇచ్చారు బిక్కికృష్ణ గారు.
ఇక కవి గారి గురించి చెప్పుకోవాలి అంటే…ఉక్కు లాంటి మనిషి, నవనీత హృదయుడు, సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు, యువకవులను ప్రోత్సహిస్తూ  ప్రతిభావంతులైన కవులను వెలుగులోకి తెస్తున్న నిస్వార్థ సాహిత్య సేవకులు. కవిత్వం డిక్షన్ సృష్టికర్త,  ఈ దశాబ్దపు మహాకవిగా పేరుగాంచిన గొప్ప విమర్శకులు, సాహితీ సమీక్షకులు. కవిత్వం- డిక్షన్ అనే పుస్తకం ద్వారా కవితా నిర్మాణ పద్ధతులను కవిత్వపు భాషను తెలియజేసినా గొప్ప సహృదయం గలిగిన కవి.

బిక్కి కృష్ణ గారి కవిత్వం కూడా జీవనది లాంటిదే. ఎందరో యువకవులకు కవితా దాహం తీరుస్తుంది.
ఈ కవితా సంకలనంలో ప్రతి కవితా అంతర్వాహినిగా ప్రతి పదం గమనంలో ప్రవహిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కవితలే కాకుండా గజల్, పాటలు కథలు, ఇలా వివిధ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన సవ్యసాచి, బహుముఖప్రజ్ఞాశాలి మన బిక్కికృష్ణ గారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో అందరివారయ్యారు. ప్రతి కవితలో ఆయన వ్యక్తిత్వం ఆలోచనా తీరు ప్రసుపుట్టిస్తాయి. ఈ కాలం నది ఒడ్డున అనే కావ్యం నుంచి కొన్ని కవితలను పరిశీలిద్దాం.
*వాడితో చెప్పండి*…
వాన చినుకుల్ని మనపై చల్లిన ఆకాశంపై
ప్రేమతో మల్లెమొగ్గలను విసరాలని
పంట పొలాలకు నీరందించిన చెరువులపై
గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించాలని”
ఎంత చక్కటి భావం. ఆకాశం మనకు వర్షం అందిస్తే తిరిగి ప్రేమగా మల్లెమొగ్గలను విసిరి నీరందించిన చెరువులపై గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించే రైతు యొక్క సున్నిత మనస్తత్వాన్ని వారి ఔదార్యాన్ని తెలుపుతూ రాసిన కవిత.
 అదే కవితలో…
“పల్లె తల్లి శిగపై పొడుచుకొచ్చిన పొద్దుపొడుపు నేనని
విద్యార్థుల మెదళ్ళలో గూడుకట్టుకున్న అజ్ఞానపు క్యాన్సర్ను
పదునైన అక్షరాలతో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ని నేనని
మొక్కగా చెట్టుగా మహావృక్షంగా జ్ఞానవృక్షంగా బాధల గాధల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ నేనని
కొడవలితో ఆకాశంలో ఉన్న సూర్యుడి గొంతు కోయాలని ప్రయత్నిస్తే
ఒక్క కిరణం దారం చాలు పది మందిలో వాణ్ణి ఉరేసి చంపడానికి” అని ఘాటుగా ముగించారు.
ఆకలితో అలమటించే కరువు ప్రాంతాల్లోని ప్రజల ఆర్తనాదాలను దగ్గరినుంచి చూసిన కవి! వారి జీవన శైలి ఆత్మాభిమానలను కడుపుమంటలను, రైతుల కష్టాలను ఆకలికేకలకు  ఈ కవితని నిలువెత్తు సాక్ష్యంగా మలిచారు. రైతులు ఎంత సున్నిత మనస్కులో అవసరమైతే తిరగబడి పోరాడే వీరులు ఈ రైతు బిడ్డలు… జ్ఞాన వృక్షంగా బాధలా  గాథల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డనని తెలుపుతూ ప్రతి పాదం నేపథ్యంలో తీవ్రమైన భావావేశంతో పదునైన ప్రశ్నలను సంధించారు.
ఈ కవితకు 2014 రజనీ కుందుర్తి అత్యుత్తమ అవార్డు కూడా లభించింది.
*ప్రజలే కళ్ళు… కవితల ఆనవాళ్లు*
చెట్టంత మనిషి ఏమైనట్టు?
ప్రకృతితల్లి ఒడిలో ఎదిగిన చెట్టుకు
చెట్టుతో పాటు దాన్ని తోబుట్టువుల ఎదిగిన మనిషికి
ఎవడి దిష్టి దోషం తగిలిందో కానీ
దారం తెగిన గాలిపటాల్లా
తమ ఆధారాలు, అస్తిత్వాలు కోల్పోయారు.
చెట్టులోని పువ్వులు పెనుగాలికి రాలినట్టు
మనిషిలోని సున్నితత్వాన్ని ఎవరో నలిపేసారు.
మనిషిని చెట్టుతో పోలుస్తూ చెట్టంత మనిషి ఏమైనట్టు? అంటూ అడిగిన ప్రశ్న… మనందరినీ ఆత్మపరిశీలనలోనికి నెట్టేస్తుంది. పువ్వు లాంటి సున్నిత మనస్తత్వాలు గాలికి రాలి పోయినట్టు మనిషిలోని మానవత్వం సున్నితత్వాన్ని కూడా ఎవరో నలిపేసారా? ఎందుకు మీ ఆధారాలను అస్తిత్వాలను కోల్పోయారు అని ప్రశ్నిస్తున్నారు కవిగారు.
*కర్షక కవి రాసిన పొలం కావ్యం*…
చినుకుల పసికూనలని కనలేక నొప్పితో మబ్బుల ఆకాశం తెరచాటున మూలుగుతున్న గర్భవతి
గుడ్డి మేఘాన్ని ప్రసవించేలా చెయ్యమని గాలి మంత్రసాని
చెట్టు పైనుండి గాలిపటంలా ఎగరేసిన బాలుడు నీవు!”
అంటూ రైతు గొప్పతనాన్ని అభివర్ణిస్తూ అవినీతికి అమ్ముడుపోయిన నాయకులు ఉన్నచోట పొలానికే కాదు
దేశానికి కూడా కంచ వేసినా ప్రయోజనం లేదు అంటూ తెలిపిన గొప్ప కవిత ఇది.ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కవి పోలిక వినూత్నంగా అరుదైన పదవిన్యాసం బావాభివ్యక్తి అనుభూతి తనదైన శైలిలో అద్భుతంగా ప్రచలితమౌతున్నాయి.
అదే విధంగా మరో కవితను చూస్తే…
*అక్షరాల చనుబాలు*
“ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఏంటి?
అసలు మనిషి ఎందుకు చచ్చిపోవాలి?
జీవితంలో ఎన్ని సార్లుయినా చచ్చిబతకాలిగాని
నాలుగు కూనలను బతికించడం కోసం
ఇళ్లల్లో దూరి పాల ప్యాకెట్లు ఎత్తుకొచ్చి
కూనల ఆకలి తీరుస్తున్న మా ఇంటి ముందున్న
రౌడీ ఆడ పిల్లిని చూసి ఉంటే….ఆ తల్లి
భర్త చనిపోయాడని భయపడి పాలిచ్చి పెంచిన పిల్లలను
విషమిచ్చి చంపేది కాదు.”
ఈ కవిత చదివినప్పుడు మనసు ఎంతో ఆర్ద్రమైపోయింది. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేయడానికి కవి తీసుకున్న కవితా వస్తువు “పిల్లి”
 తన పిల్లలను పెంచుకోవడం కోసం పిల్లి ఎంత తపన పడుతుందో… అది చూసి ఉంటే నువ్వు నీ బిడ్డలను చంపుకోవమ్మ అని కవి చెప్పిన విధానం అద్భుతంగా ఉంది.
*ఆకాశమే హద్దుగా*…
స్వేచ్ఛగా తిరిగే మరుపేగు దారాలను పుటుక్కున తెంపేసి ఎక్కడ ఏ కలల ప్రపంచంలో వాలిపోతారోనని మా భయం
ఎగసిపడే యవ్వన కెరటాలు మీరు
మీ ప్రేమ సాగరాల పూల పడవలలో విహరిస్తుంటారు.
ఏ సమస్యల సుడిగుండాలలో మునిగిపోతారోనని మా భయం!
మా మా ఎదలపై నిదురించిన ప్రేమపావురాలు మీరు
ఏ కలల కీకారణ్యంలో తప్పిపోయి ఎక్కడ కలవరపడి పోతారోనని మా భయం!”
ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డలు… ప్రేమ అనే వలలో చిక్కుకొని ఆ మాయలో తల్లిదండ్రులను కూడా వదులుకొని పేగు బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోతారేమోనని  ప్రస్తుతం సమాజంలోని జరుగుతున్న తీరుతెన్నులను చూసి తల్లిదండ్రుల భయాన్ని కవిత రూపంలో చక్కగా చిత్రించారు కవిగారు.
*మనసులను శుభ్రపరుద్దాం*…”
“ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది?
కొత్తగా రాసేదేముంది?
వాడు నీ దేశపు కంప్యూటర్లో అవినీతి వైరస్గా చేరిపోయాక
ప్రభుత్వ ఫైళ్ళలో అధికార సంతకం ఫంగస్గా మిగిలిపోయాక
ప్రపంచ బ్యాంకు కలేబరలలో ప్రజల గొర్రెల తలలు అప్పుడే తెగబడ్డాయి
ఇప్పుడు చందమామ స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ కుందేలును దాచిన అవకాశవాదులంతా…
ఎటొచ్చి ఈ భూమిపై ఉన్న వాళ్లకు భుక్తి గడవని వాళ్లకు
భూమి పుత్రులకే బాధల భూకంపాలనీ…”
ఈ కవితలో కవిగారు  సాంకేతిక యుగంలోని నవ్యతను సంకేతిక పరంగా కవితా వస్తువుగా మలచి వ్యంగ్యంగా చెప్పినా వాస్తవాలకు అద్దంపట్టేలా చెప్పారు. ఏ రోజైతే ప్రభుత్వాలు అమ్ముడుపోయాయో  అభివృద్ధి పేరిట దేశాన్ని విదేశాలలో అమ్మేశారో అప్పుడే దేశ సంపద అంతా తరలిపోయింది. అందని చందమామలోని కుందేలుగా పరాయి దేశంలో చేరిపోయింది. చందమామలో కుందేలు ఉందనుకుంటే ఉందని లేదనుకుంటే లేదని కనిపించని నిజాలను స్కామ్ ముసుగులో దోచేసిన ప్రభుత్వాల తీరును ఎండగడుతూ బలైపోయిన రైతులు, సాధారణ ఉద్యోగుల కష్టాలన్నీ వివరించారు.
*గుమ్మడికాయల దొంగ*…
ఈ కవితలో వాడు పైకి మేధావి ముసుగు ధరించి పెద్ద మనిషిగా కనిపిస్తుంటాడు.
కానీ… వాడి మనసుపుటల్లో అసూయ సర్పం ఆకారణ
ద్వేషంతో బుసలు కొడుతూనే ఉంటుంది.
ఏనుగంత వ్యక్తిత్వం ఉన్న వాడు ఎదురుపడితే
కవిత్వపు భాషలో మొరుగుతూంటాడు
పాపం వాడి తప్పేం లేదు శునకానికి జీతమిచ్చి
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రభుత్వాలదే!
నిజాలను మాట్లాడిన వాడు భుజాలు తడుముకుంటాడు
బహుశా గుమ్మడికాయల దొంగలంటే వీడినేమో!”
అంటూ మనిషి నైజాన్ని  బట్టబయలు చేశారు.అభ్యుదయ భావాలతో ప్రజ్వరిల్లుతూ నివురుగప్పిన నిజాలను నిర్భయంగా తన కవితలలో తెలియజేస్తున్నారు.
 కవి గారు రాసిన ప్రతి కవితలో  ఒక సందేశంతో పాటు మనిషి యొక్క చీకటి కోణాలకు తెర తీస్తూ వాస్తవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
*బుల్లితెర భూతం*
“మీ హృదయాల్ని మీ ఇంట్లో మీ టివి భూతం
తన రిమోట్ కంట్రోల్తో ఛానల్ లైజ్ చేసేసింది
రంగుల మార్కెట్లో యాడ్స్ పొయ్యిపై
మీ మెదళ్ళను ఉడకబెట్టుకొని కొంచెం కొంచెం ఆరగిస్తోంది”
అంటూ బాధ్యత కలిగిన పౌరుడిగా సమాజిక స్పృహతో ప్రజలను మేల్కొల్పే కవిత ఇది. అదేవిధంగా కాలగర్భంలో మళ్లీ విత్తనమే మొలకెత్తు… ఆకాశమంత ప్రేమ ఆమె చిరునామా… మగువ మల్లెతీగ etc…ఇలా  అభ్యుదయ కవితలే కాక చక్కటి బావ వ్యక్తిత్వానికి నిదర్శనంగా కవితా వనంలో భావుకత్వపు కుసుమాల పరిమళాలు వెదజల్లుతూ ఆ ఆనంద అనుభూతులలోనికి
పాఠకులను తీసుకువెళ్లి రసజ్ఞుల హృదయాలను కొల్లగొడుతున్నారు. కవితా వస్తువు ఏదైనా ప్రతి వస్తువు కవితగా మలిచి రచనా నైపుణ్యంతో కోటి కాంతులతో నలుదిశలా విస్తరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంకలనంలో ప్రతి కవిత ఒక అద్భుతం. మొత్తం 77 కవితలు కలిగిన ఈ సంకలనం ఒక్కో కవిత ఒక్కో వాస్తవికతకు నిదర్శనంగా నిలిచి కాలం నది ఒడ్డున అనే కావ్యంగా మలచిబడింది అని చెప్పవచ్చును.
ఈ సంకలనానికి పలు ప్రముఖులు తమ అభిప్రాయాలను అందించారు. కలం యోధుడు బిక్కీ కృష్ణ గారు అని నానీల సృష్టికర్త ప్రముఖ కవి ఎన్. గోపి గారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కవిత్వం రాసేటప్పుడు బిక్కి కృష్ణ గారు మూడో మనిషి అవుతారు  తనను తాను చీల్చుకొని లోకాన్ని చీల్చి చూస్తాడు. తన అందాలు, ఆవేదనలు, ఆక్రోశాలు, అనుభవాలు వర్ణనాత్మకంగా బయల్పడతాయి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కే. శివారెడ్డి గారు తెలియజేశారు. ఎగరేసిన మానవతా కవిత పతాక బిక్కీ కృష్ణ గారు ఆయన కవితలకు ముందు మాట అవసరం లేదు అని తేల్చి చెప్పేశారు నగ్నముని గారు.పల్లె సెగపై పొద్దుపొడుపు అని శిఖామణి గారు అభివర్ణించారు. మల్లెల నరసింహమూర్తి గారు, డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు, బి.డి శ్యామల గారు, ఇలా చాలా మంది ప్రముఖులు  బిక్కి కృష్ణ గారి కవిత శైలిని, వ్యక్తిత్వాన్ని  కవితా నిర్మాణంలోని గొప్పతనాన్ని తమ అభిప్రాయాలలో పేర్కొన్నారు. ఈ మహాకవి మరెన్నో సంకలనాలను భవిష్యత్తులో మనకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
–జ్యోతి మువ్వల
బెంగళూరు.
9008083344
October 24, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us