మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

భయం భయం భయం

by Rasheed February 28, 2022
written by Rasheed

బతుకుబండి నడకంతా భయాల బాటలోనే
సెలబ్రిటీస్ లలో
అభద్రతా భయం
తల్లిదండ్రులలో
ఓల్డ్ ఏజ్
హౌస్ భయం
ఉద్యోగాలులేక
యువతలో
బతుకు భయం
నిజాయితీపరులకు
లంచం భయం
పేదవాడికి వడ్డీ భయం
ఆటో వాడికి
ఫైనాన్సర్ భయం
తాగుడు వల్ల
భార్యా పిల్లలకు
భయం
ప్రయాణీకుడికి
టిక్కెట్టు ధర
బాదుడు భయం
ఖాళీ జాగా వాడికి
భూ కబ్జాదారుల
భయం
ఓట్ల కోసం
హిందూ ముస్లింల
విభజన భయం
ధర్మ సంసద్ లో
తీవ్రవాద భయం
ప్రభుత్వానికి
ఉచితాల భయం
స్కూల్ ఫీజులవల్ల
పేరెంట్స్ కు భయం
చిన్నారులకు
మొబైల్ ఫోన్ ల
భయం
పార్టీలో
నిజాయితీపరులకు
గెంటివేత భయం
ప్రార్థనాల
యాలలో
నిర్వాహకుల భయం
కరోనా కోర్సుకు చిక్కుతామేమోనని
ప్రపంచ మానవాళికి
భయం
కోవిడ్ షీల్డ్
తీసుకున్నా భయం
Covid 19
తీసుకోకపోయినా
భయం
మారు పేరుతో
వచ్చిన వోవిుక్రోన్తో
భయం
చివరికి దేశ దేశాల ప్రధానరక్షకులకూ
ప్రాణ భయం
మరి సామాన్యుడికి ఇక
ఏది భద్రత సుఖం ?

అందరికీ
ఇక దైవమే అభయం.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పెదవులపై నవ్వు

by కుడికాల వంశీధర్ February 28, 2022
written by కుడికాల వంశీధర్

పెదవులపై నవ్వు
అందం
నవ్వుకి నాలుగక్షరాల పేరు
బ్రహ్మానందం

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం

by Raprolu Sudarshan February 28, 2022
written by Raprolu Sudarshan

తెలుగు సాహిత్యంలో మహిళల జీవితాల్ని చిత్రిస్తూ ప్రత్యేక రచనలు వెలువడ్డాయి. మొదట్లో జగన్మాత, లక్ష్మీ, సరస్వతి మొదలైన స్త్రీ దేవతామూర్తుల ఔన్నత్యం, ఆ తర్వాత సావిత్రి, అరుంధతి, అనసూయ, దమయంతి ఇత్యాది మహిళామతల్లుల పాతివ్రత్య వైవిష్ట్యాన్ని తెలిపేవి గమనిస్తాం. ఆధునిక కాలంలో సామాజిక స్ప ృహతో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, చెలం, కొడవటిగంటి కుటుంగారావు, శ్రీశ్రీ వంటి రచయితలు స్త్రీల జీవితాల్ని తీసుకొని వాళ్ళు పడుతున్న కష్టాల్ని చూపుతూనే కొందరు బైటపడే మార్గాల్ని చూపారు. ఆతర్వాత 1980ల నుంచి మహిళా దృక్కోణం (Feministic)  నుంచి ప్రత్యేక రచనలు ఆరంభమై ఉద్యమ రూపం దాల్చినవి. దీనికి ఓల్గా, కొండేపూడి నిర్మల, జయప్రభ, సావిత్రి, శిలాలోలిత మొదలైన వారిని పేర్కొనవచ్చు. ఇలా మహిళా దృక్కోణం నుంచి నేటికీ వెలువడుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిలో మహాకవి శ్రీశ్రీ రచనల్లో మకుటాయమానమైన ‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం  ఉన్న తీరును విశదీకరించడమే ఈ వ్యాస పరిధి.

తెలుగు సాహిత్యం 1930ల వరకు తనను నడిపిస్తే, అప్పటి నుంచి దానిని తను నడిపినట్లు చెప్పుకున్న మహాకవి శ్రీశ్రీ రచనల్లో అక్కడక్కడ స్త్రీల దృకోణం నుంచి  రచించినట్లు మనం గమనిస్తాం. ‘ఒసే తువ్వాలందుకో’ అనే కథానికలో పురుషాధిక్య సమాజం లో ప్రతీక్షణం స్త్రీ ఎలా నలిగిపోతున్నదో తెలిపే ఇతివృత్తంతో రాశాడు శ్రీశ్రీ.  ‘హేమంతం’ అనే కథానికలో ‘భిక్షువర్షీయసీ’ కవితలోని అవ్వనే యౌవనంలో ఉన్న తీరును ఇతివృత్తంగా చేసుకొని శ్రీశ్రీ రచించాడు. ఇలాగే పురాణ పాత్ర అయిన శూర్పణఖను తీసుకొని ఆమెకు జరిగిన అన్యాయాన్ని కథానికగా ‘శూర్పణఖ మాన సంరక్షణ’ అనే కథానిక రాయడం జరిగింది. నాటక ప్రక్రియలో ఒంటరిబావి, భూతాల కొలిమి మొదలైనవి  స్త్రీ కోణం నుంచి రాసినవే. ఓ సినీ (దేవత) గేయంలో ‘‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి…’’ అంటూ స్త్రీ జాతి ఔన్నత్యాన్ని అక్షరీకరించాడు శ్రీశ్రీ.

‘‘క్రిష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు’’ అని ‘మహాప్రస్థానం’ పీఠికా కర్త చెలం చెప్పిన దానిలో ‘‘అందరి బాధనూ’’   అనడంలో స్త్రీలు కూడా ఉంటారని చెప్పకనే చెప్పినట్లైంది. మహాకవి శ్రీశ్రీ రచనల్లో అత్యధికంగా ప్రజాదరణ పొందిన ‘మహాప్రస్థానం’ కావ్యంలో పతితుల, భ్రష్టుల, బాధాసర్పద్రష్టులైన మహిళలకు ‘పరిపూర్ణపు బ్రదు’కొచ్చేందుకు ప్రస్తావించిన వాటిని పరిశీలిద్దాం.

నలభై కవితలతో 1950లో వెలువడిరది ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి. ఇందులోని చాలా కవితలు 1933 నుంచి 1940 మధ్యలో రాయబడినవి, వివిధ పత్రికల్లో ముద్రితమై ఖ్యాతిని ఆర్జించినవి. ఈ కావ్య శక్తిని, ప్రభావాన్ని చెలం చెబుతూ ‘‘… పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూలనించి  కూలిపోతున్నాయని’’, ఈ కావ్యం    కూల్చుతుందనే ధోరణిలో చెప్పారు. ఇందులో స్త్రీల పట్ల ఉన్న పాత భావనలూ నశిస్తాయని అంతరార్థంగా భావించవచ్చు. సమసమాజాన్ని సాధించడమే ఈ కావ్య లక్ష్యంగా  పేర్కొంటాం. శ్రీశ్రీ కలలుకంటున్న ‘మరోప్రపంచం’లో సమసమాజమే ఉంటుంది. ఆ సమసమాజం కేవలం వర్గ వ్యవస్థకే గాక ‘స్త్రీ, పురుష సమానత్వం’ కూడా   చెప్పుకోవచ్చు. అటువంటి ఈ కావ్యంలోని కవితలను మహిళా దృక్కోణం నుంచి చూసినప్పుడు మూడు  రకాలుగా విభజించవచ్చు. అవి: 1. అచ్చంగా స్త్రీల గురించి రాసినవి, 2.   పార్శ్వంగా తరుణులను పేర్కొన్నవి, 3. లింగం (Gender)) చెప్పకుండా స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా రాసిన కవితలు. ఈ వింగడిరపుతో వివరంగా చూద్దాం.

అచ్చంగా స్త్రీల గురించి రాసిన కవితలు:

మహాప్రస్థానంలోని మంచి కవితల్లో ఒకటి ‘భిక్షువర్షీయసి’. ఇది 13`8`1938 నాడు రాసిన కవిత. ఈ కవితలో బిచ్చగత్తె దీన, హీన స్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు    శ్రీశ్రీ. ఇందులో ఏడు స్టాంజాలు ఉన్నాయి. ‘‘దారిపక్క, చెట్టు కింద / ఆరిన కుంపటి విధాన / కూర్చున్నది ముసల్దకతె / మూలుగుతూ, ముసురుతున్న / ఈగలతో వేగలేక’’ అనే మొదటి స్టాంజాలో కలం కుంచెతో దారిని, పక్కనే ఓ చెట్టును, దాని కింద ఓ   ముదుసలి కూర్చున్నట్టు చిత్రాన్ని రూపుకట్టించాడు. ఇలా కెమెరాతో ఛాయాచిత్రాన్ని బంధించినట్టుగాక, వీడియో కెమెరాతో ఆమె చేష్టలనూ చిత్రించి ఆ ముసలావిడ మూలుగులను వినిపించాడు, తన మీద ముసురుతున్న ఈగలను తోలేంత శక్తిలేకపోయిన      తీరును ‘వేగలేక’ అనే పదంతో కళ్ళకు కట్టాడు శ్రీశ్రీ. ఇంకా ‘‘ఆరిన కుంపటి విధాన  కూర్చున్నది’’ అనడం వల్ల ఒకప్పుడు బాగా మండి, ఆ మంట ఎవరికి ఎలా కావాలో  అలా సహాయపడి, ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో పడి ఉందనే భావాన్ని ప్రదర్శించాడు  కవి.

ఆ బిచ్చగత్తె శరీర సౌష్టవాన్ని చెప్పబూనుకొని ఆమె తలను ప్రతిరోజు స్త్రీలు పొద్దున్నే  వాడే తెల్లటి ముగ్గు బుట్టలా ఉందని, ముదిమి వల్ల శరీరంలో ఏర్పడ్డ ముడతలు, ఆరోగ్యవంతులకు ఉండే శక్తివంతమైన కళ్ళు కాస్త కాంతి విహీనంగా మారడమేగాక ఆమె శరీరంకన్నా శవం నయమనిపించేంత ఘోరంగా ఉందన్నాడు కవి శ్రీశ్రీ. ఆమెకు     వయోభారం వల్ల ఒంట్లోని కీళ్ళు సడలి పోతున్నవి,  అనారోగ్యంతో పడిపోయింది, ఈ పడడం తన ప్రక్కనే ఉన్న జడ పదార్థమైన బండ రాతిలాగ పడి ఉంది, అడుక్కునే శక్తిలేదు, బతకాలనే కోర్కెలేదు, ఎవరూ దిక్కులేని దీనురాలైన ఆమెకు రాబోయే కాలంలో మరిన్ని కష్టాలు రాబోతున్నవని చెప్పడానికి నిత్యం బిచ్చమడుగుకొని బతుకుతున్న ఆమెకు శక్తి కూడా నశించింది, పైపెచ్చు రాబోయేది చలికాలం. ఇలా ఆ బిచ్చగత్తె స్థితిగతుల్ని నాలుగు స్టాంజాల్లో చూపాడు శ్రీశ్రీ. అనంతర మూడు స్టాంజాల్లో ఆమె పట్ల సమాజ  పోకడను, సమాజ బాధ్యతను తెల్పబూనుకొని ‘‘ఆ అవ్వే మరణిస్తే / ఆ పాపం ఎవ్వరి’’దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ / వెళ్ళిపోయింది’’ అలా మనుషులు వెర్రిగాలిలా  మారిపోకూడదు సాటి మనిషి చావుబతుకుల మధ్య ఉంటే అని మన బాధ్యతని గుర్తెరిగేట్టు చేశాడు ఈ కవితలో శ్రీశ్రీ.

ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అవ్వ ప్రక్కనుంచి ఎముక తింటూ, కనీసం    పట్టించుకోకుండా ఓ కుక్క, ఇలాగే తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఓ తొండ. అంటే మన పరిసరాల్లో జీవిస్తున్న అన్య జీవుల్లానే, మన సమాజంలోని సాటి  మనుషులూ కుక్కల్లా, తొండల్లా సాగిపోతున్నారేగానీ పట్టించుకోవడంలేదనే భావాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపాడు శ్రీశ్రీ. అంతలోనే ఆ అవ్వ మీదకు ‘ఎంగిలాకు’ ఎగిరి వచ్చింది, కనీసం ఈ విస్తరికి అతుక్కొని ఉన్న మెతుకులైనా ఆవిడకు ఆందుబాటులోకి వచ్చాయా  అనుకుంటే ‘‘క్రమ్మె చిమ్మచీకట్లు’’ అనడంతో ఆమె ప్రాణాలు గాలిలో కల్సిపోయి ఆ నాటి   రోజుకి, ఆమె శరీరానికి చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని తెల్పడంతో మరణ వార్తను చీకటితో పోల్చి చెప్పినట్లైంది. అంటే వ్యవస్థలో ఓ వ్యక్తి బిచ్చమెత్తుకునే స్థాయికి   దిగజారడం, కనీసం వయోభారం మోస్తున్న వారిపట్లనైనా వ్యవస్థ పట్టించుకోకపోవడాన్ని శ్రీశ్రీ సీరియస్‌గా తీసుకున్నాడనిపిస్తుంది. సమాజంపట్ల బాధ్యతగా ఉండని వారిని ఈ కవితాకరెంటు షాక్‌తో చైతన్య పరచాలనుకున్నాడు మహాకవి.

1936 ప్రాంతంలో రాసిన ‘అద్వైతం’ అనే కవితను రాశాడు శ్రీశ్రీ. ఈ కవిత రాసిన  సుమారు ఇరవై ఏళ్ళకు అంటే 1955లో వినోద పిక్చర్స్‌ వారితో నిర్మితమైన  ‘కన్యాశుల్కం’ చలనచిత్రంలో సగం వరకు పాటగా వాడుకున్నారు. ఈ పాటపై మధురవాణి   పాత్రధారిjైున సావిత్రి హావభావాలను ప్రదర్శిస్తూ అద్భుతంగా నాట్యం చేసింది. ఇక ఈ కవితలోని వైశిష్ట్యానికొస్తే ‘అద్వైతం’ అంటే జీవాత్మా, పరమాత్మ వేరుకావు, ఒకటే అనేది భావం. ఈ పదాన్నే తీసుకొని ప్రేయసీ, ప్రియులిద్దరూ వేరుకాదు ఒకటే అనే అర్థంతో శీర్షికను పెట్టి ప్రేమికుడివైను నుంచి ఈ కవితను అల్లాడు శ్రీశ్రీ. ఇందులో  ఆమెను ‘‘హసనానికి రాణివి నీవై… కుసుమించిన త్వదీయ మోదం… నా భావికి దేవివి నీవై…’’ ఇలా ప్రేయసిని వర్ణిస్తూ  మన ఆనందం సముద్రమైతే, మన అనురాగం    ఆకాశమంత అయితే ‘‘అనురాగపు టంచులు చూస్తాం / ఆనందపు లోతులు తీస్తాం’’      అంటూ ఇప్పటికి 86 సంవత్సరాల క్రితం రాశాడు శ్రీశ్రీ ఈ గేయాన్ని. దీన్ని ఎన్ని సార్లు విన్నా, చదివినా వన్నె తరగని పాట ఇది.

1940లో ‘జగన్నాథుని రథ చక్రాలు’ శీర్షికతో రాసిన కవిత ‘మహాప్రస్థానం’ కావ్యంలో చిట్టచివరిది. ఈ కవిత ‘‘పతితులారా! / భ్రష్టులారా! / బాధా సర్పదష్టులారా!’’ అంటూ ఆరంభమవుతుంది. వీళ్ళందరూ‘‘…శని దేవత రథ చక్రపు / టిరుసులలో పడి నలిగిన’’ బ్రతుకు వాళ్ళుగా చెప్పి, ‘‘సఖుల వలన పరిచ్యుతులు / జనుల వలన తిరస్క ృతులు / సంఘానికి బహిష్క ృతులు’’ అయినటువంటి వారిని గూర్చి ‘‘మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి’’ అని చెబుతూ ‘‘మీ రక్తం కలగి కలగి / మీ నాడులు కదలి కదలి / మీ పేవులు కనలి కనలి / ఏడవకండేడవకండి!’’ అని ఓదారుస్తూ ‘‘మీ కోసం కలం పట్టి’’నానంటూ ‘‘ఆకాశపు దారులంట / అడావుడిగ వెళ్ళిపోయే’’ జగన్నాథుని రథ చక్రాలను ‘‘భూమార్గం పట్టిస్తాను / భూకంపం పుట్టిస్తాను’’ అంటూ బరోసా ఇస్తూ   ‘‘ద్రోహులను తూలగొట్టి / దోషాలను తుడిచి పెట్టి / స్వాతంత్య్రం / సమభావం /    సౌభ్రాత్రం / సౌహార్దం / పునాదులై ఇళ్ళులేచి / జనావళికి శుభంపూచి / శాంతి,      శాంతి, కాంతి, కాంతి / జగమంతా జయిస్తుంది / ఈ స్వప్నం నిజమవుతుంది / ఈ స్వర్గం ఋజువవుతుంది’’ అని నిర్ధారణగా మహాకవి శ్రీశ్రీ ఈ కవిత ద్వారా సుమారు 82 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇలా వనితాలోకంపై ప్రత్యేకంగా కొన్ని కవితల్ని       రాశాడు మహాకవి శ్రీశ్రీ.

పార్శ్వంగా తరుణులను పేర్కొన్న కవితలు:

ప్రత్యేకంగా స్త్రీల గురించి రాసిన కవితలేగాక పార్వ ్శంగా స్త్రీ జన ఉద్ధరణకై రాసిన   కవితలూ ‘మహాప్రస్థానం’లో ఉన్నాయి. అవి బాటసారి, కవితా! ఓ కవితా! మొదలైనవి. వాటిని చూద్దాం.

‘బాటసారి’ కవితలో ‘‘కూటికోసం, కూలి కోసం, / పట్టణంలో బ్రదుకుదామని / తల్లి  మాటలు చెవిని పెట్టక …’’ అని చెబుతూనే, ఆ తల్లిని గూర్చి ఇంకా ‘‘కళ్ళు వాకిట నిలిపిచూచే / పల్లెటూళ్ళో తల్లి ఏమని / పలవరిస్తుందో…?’’ అని తల్లి గూర్చి చెబుతూ ఈ కవితాంతమున ‘‘బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది / పల్లెటూళ్ళో తల్లికేదో / పాడు కలలో పేగు కదిలింది’’ అంటూ ఆ తల్లి కాలిన కడుపును బాధాపూరితంగా తెలిపాడు శ్రీశ్రీ.

‘మహాప్రస్థానం’ కావ్యానికే మకుటాయమానమైంది ‘కవితా! ఓ కవితా!’ అనే కవిత. ఇందులో ‘‘అందని అందానివిగా…’’ అనీÑ ‘‘శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు! విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను!…’’ అనీÑ ‘‘నను కరిగించిన కవన ఘృణీ! / రమణీ! / కవితా! ఓ కవితా!…’’ అంటూÑ ‘‘నన్ను పునీతుని కావించిన కవితా! / లలిత లలిత కరుణా మహితా!…’’ అనడమే గాకÑ చివరిలో ‘‘జననీ! ఓ కవితా! / కవితా! కవితా! ఓ కవితా!…’’ అంటూ ఈ కవితను ముగించాడు శ్రీశ్రీ. ఇందులో ‘కవిత’ను వనితగా తనను కరుణించిన దేవతగా, తల్లిగా భావించాడని గ్రహిస్తాం. ఇంకా ఈకవితలో ‘‘అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని / రుచిర స్వప్నాలను కాంచే / జవరాలి మన:  ప్రపంచపుటావర్తాలు’’ అనీÑ ‘‘కడుపు దహించుకుపోయే / పడుపు కత్తె రాక్షస రతిలో / అర్థ నిమీలిత నేత్రాల…’’ అనీÑ ‘‘నా జనని గర్భంలో / ఆకారం లేకుండా నిద్రిస్తూన్న / నా అహంకారానికి…’’ అంటూ మహిళలను ప్రస్తావించాడు శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ అనే కవితలో. ఈ కవితను చూస్తే స్త్రీల పట్ల శ్రీశ్రీకి అపారమైన గౌరవం ఉన్నట్లు తెలుస్తుంది.

‘నవకవిత’అనే కవితలో ఆధునిక కవిత్వం ఎలా ఉండాలో పలు ఎర్రనివి చెబుతూ ‘‘కలకత్తా కాళిక నాలిక / కావాలోయ్‌ నవ కవనానికి’’ అంటూ కాళికా మాత ఎర్రని నాలుకలా ఆధునిక కవిత్వం ఉండాలని తెలిపాడు శ్రీశ్రీ.

‘అవతారం’ అనే కవితలో ‘‘కనకదుర్గా చండ సింహం / జూలు దులిపీ, /  ఆవులించింది’’ అంటూ జగన్మాత వాహనమూ తిరగబడుతున్నదని చెప్పాడు శ్రీశ్రీ. ఇంకా ఈ కవితను ‘‘పుడమి తల్లికి / పురిటి నొప్పులు / కొత్త సృష్టిని స్ఫురింపించాయి’’ అంటూ వ్యవస్థ మార్పును ‘భూమాత’తో పేర్కొంటూ ముగించాడు కవి. ఇలా కొన్ని కవితలను       పార్శ్వంగా స్త్రీల ప్రస్తావనతో చెప్పాడు కవి.

లింగ (Gender)  దృష్టితోగాక స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే కవితలు:

‘మహాప్రస్థానం’ కావ్యంలో స్త్రీల గురించి రాసిన, స్త్రీల ప్రస్తావన తెచ్చిన కవితలతో    పాటు స్త్రీ, పురుషులిరువురికీ వర్తించే విధంగా కొన్ని కవితల్ని రాశాడు శ్రీశ్రీ. అలాంటి వాటిలో అవతలిగట్టు, సాహసి, పరాజితులు, వ్యత్యాసం, ప్రతిజ్ఞ, చేదుపాట, నీడలు   మొదలైన కవితలు పేర్కొనవచ్చు. మచ్చుకి ఓ కవిత చూద్దాం.

‘‘ఔను నిజం, ఔను నిజం / ఔను నిజం నీ వన్నది! / నీ వన్నది, నీ వన్నది, / నీ వన్నది నిజం, నిజం!’’ అంటూ ఆరంభ మరియు ముగింపు స్టాంజాలుగా ఉన్న ‘చేదుపాట’ అనే కవితలో ‘‘మనదీ ఒక బ్రదుకేనా? /  కుక్కల వలె, నక్కల వలె! / మనదీ ఒక  బ్రదుకేనా? / సందులలో పందుల వలె!’’ అంటూ మన వ్యవస్థలోని ఈ జీవితం పురుషులదా, లేక స్త్రీలదా అని ప్రత్యేకంగా కవి తెల్పలేదు కాబట్టి ఇద్దరిదీ, లేక స్త్రీలదీగా కూడా   భావించనలవిగా ఉంది. ఇలా ‘మహాప్రస్థానం’ లో స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా మరికొన్ని కవితలూ దృగ్గోచరమవుతాయి.

ఈ కావ్యం గూర్చి రావి శాస్త్రి ‘‘… కవితామతల్లి ఆదిశక్తి. ఆ శక్తిని అతను పతితుల భ్రష్టుల బాధాసర్పదష్టుల పక్షాన నిలబెట్టేడు. ఆమె చేతికి ఆయుధాలుగా ఇచ్చేడు తన కవితల్ని. శ్రీశ్రీ మహాకవి ధర్మపక్షాన నిలబడ్డాడు. ఆయన కవిత ధర్మంచేతి బాణం’’ (పుట`114, మహాప్రస్థానం, ముద్రణ: విరసం, జూన్‌ 1999) గా పేర్కొన్నాడు. ఇటువంటి కవితల ‘మహాప్రస్థానం’ కావ్యాన్ని స్త్రీ దృక్కోణం నుంచి పరికిస్తే ‘స్త్రీవాద ఉద్యమ సాహిత్యం’ అనేది తెలుగులో పొడసూపక పూర్వమే వ్యవస్థలో మహిళల స్థితిగతుల్ని  అభివర్ణిస్తూ రాసిన కవితలుగా మనకు దర్శనమిస్తాయి.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అపరిచితుడు…

by Dr. T Radhakrishnamacharyulu February 28, 2022
written by Dr. T Radhakrishnamacharyulu
ముఖం ఎప్పుడూ చూసినట్టు లేదు
మాట మాత్రం
తెలిసిందేనని మనసు చెప్తుంది
కనులకూ మనసుకూ మధ్యన
కొంత తేడా ఉన్నది
అభిప్రాయం భిన్నంగా ఉంది
ఒకవేళ నా చూపు మసకైందేమో
ఒకప్పుడులా చూస్తలేదేమో
మనసు అద్దం అందంగా ముస్తాబై
చురుగ్గా ఉందేమో
జ్ఞాపకాలను తొందరగా పసిగట్టొచ్చు
కానీ మనిషింకా తేరుకోలేదు
గందరగోళ అయోమయంలోంచి
ఆనవాళ్లు  వెతుకులాటలో
సవాళ్ళు ఎదురొచ్చాయి చూపుకు
పరిచితుడే అక్కడుంది
మరి అపరిచితుని ఎలా కనిపించె?
బహుశా మెదడు పొర మందమైందేమో
సున్నిత గుణం శూన్యమైందా
గుర్తుపట్టలేని యవ్వనం వెళ్ళంగనే
కాల మహిమ కాకపోతే
ఏందిది
దశాబ్దాల స్నేహ మాధుర్యం
అపరిచిత రూపంలోకి మారింది
కలిసి తిని తాగిన అన్నపానీయాలు
ఇంకా అరగనేలేదు మొత్తంగా
కడుపులో గొప్పగా మాట్లాడుతున్నై
ఐతే…ఇప్పుడైతే…
అక్కడున్నది అపరిచితుడు కాదు
మరి పరిచితుడేనని
మరిచిన మనిషి ఇదమిత్థంగా
నిజంగా ఏమీ చెప్పలేడు..
రుచి చూసిన జిహ్వ అనుభూతో
అనుభవించిన క్లేశంలోని
 సంతోషాల యాది నదియో
గతం గడిపిన బాటల్లోని
గుండె సడీ సప్పుడో
ఏ మాలిన్యం అంటుకోని
 మనసు పాదరసమో తప్ప…
February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసిజ

by M.Umalaxmi February 28, 2022
written by M.Umalaxmi

ఎన్నో స్మృతులను దాచుకునేది
ఎన్నో రహస్యాలను గుప్తపరుచుకునేది
ఎన్నెన్నో ఆనందాలను గుర్తుచేసేది
మరెన్నో నిగూఢ మధనాలను నిరంతరం చవిచూపేది
ఇంకా ఎన్నో మరెన్నింటినో

తనలో దాచుకొని
నిరంతరం నాకు నన్ను గుర్తు చేసే
నా మనసిజ నా నేస్తం
నాకు మాత్రమే సొంతం
నా మనసిజ
నా దిశా నిర్దేషిణి
నా పూర్ణ స్వరూపిణి
నా మనసిజ

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అతిథిదేవోభవ

by Tirunagari Devaki Devi February 28, 2022
written by Tirunagari Devaki Devi

సుమన శుభలేఖ ఇచ్చిన మరునాటి నుండే వీడియో మెసేజ్ పదే పదే పెళ్ళికి రమ్మంటూ
ఆహ్వానం పలుకుతుంది.శుభలేకే వాళ్ళ ఆర్థిక హోదాను కొంత మోసుకొచ్చింది.ఇక వీడియో మెసేజ్ సంగతి చెప్పఖ్ఖర్లేదు.కాని సుమనలో ఆ ఆర్థిక డాంబికత్వం కనపడినే లేదు.”మనసుకు
తగ్గ పేరే ఆ అమ్మాయిది.” అనుకుంది వైశాలి.
కాలం నిరంతర వాహిని.ఏ అవరోధాలు దానిని ఆపలేవు.ఆ కాల గమనంలో ఎన్నో సంఘటనలు.మరెన్నో మార్పులు. అవి రాజకీయమో..సామాజికమో..భౌగోళికమో..మంచో చెడో ఆపత్తో..విపత్తో… వేటితో కాలానికి సంబంధం లేదు.దాని మానాన అది తన ప్రయాణాన్ని కొన సాగిస్తుంది తన కొలీగ్ సౌమ్య పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశం నుండి ఇంటికి చేరుకునే సరికే ఆరు కావచ్చింది.ఆ రాత్రే వినోద్ కాంప్ ప్రయాణం.రోజువారి పనులతో పాటు ప్రతి ప్రయాణ సన్నాహం తన చేతులమీదుగా జరగాల్సిందే.”ఎంత మొత్తుకున్నా మానవుడిలో మార్పు లేదు. ఏమంటే ఆఫీసు పని ఒత్తిడి పోజు…తనేమొ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండ ఇంటి పట్టునే ఉన్నట్టు.” తనలో తానే ఉడుక్కుంది వైశాలి. ఉడుక్కుని మాత్రం ఏం చేయగలదు పాపం ..మనసుకీ చేతలకూ సంఘర్షణ తప్ప.ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడ వాళ్ళ ఇంటి చాకిరీకి విముక్తి లేదు.మగ వాళ్ళ ప్రయాణసన్నాహాలు భార్యామణుల చేతిమీదుగా జరిగి తీర్చాల్సిందే .తప్పదు సరే. మరి భార్యామణి కాలు బయట పెట్టాలంటే తన ప్రయాణ సన్నాహం తోపాటు ఇంట్లో పిల్లలకే కాదు పతిదేవుడికి అన్నీ అందుబాటులో ఉంచి కాలు కదుపాలి.”ఏవేవో రకరకాలుగా ఆలోచిస్తూ పెద్దగా నిట్టూర్చింది వైశాలి.ఏ నిట్టూర్పులు..సంఘర్షణలు..అలసటలు వినోద్ ప్రయాణాన్ని అడ్డుకోలేదు.టంచనుగా రాత్రి పదకొండు గంటలకు ముంబాయి ట్రేన్ కాచ్ చేసాడు.పనులకు ముక్తాయింపు పలికే సరికి గడియారంలో డేటు వారం మారిపోయినై.బెడ్ రూంలోకి నడచుకుంటూ పోతుండగా గోడమీది కాలెండరు పలకరించింది ఓ తేదీ దగ్గర రైట్ మార్క తో.దాన్ని చూస్తేగాని సుమన పెళ్ళి మరునాడే అని గుర్తు రాలేదు వైశాలికి.ఆ అమ్మాయి కోసం పెళ్ళికి అటెండెన్స్ వేసుకోక తప్పదు. ఇంకా ఏవేవో ఆలోచిస్తూనే బెడ్ పై వాలిపోయింది. ఆలోచనలను ఏవైనా వాటిని అలసట డామినేటు చేయడంతో నిద్రాదేవత ఆమెను ఆవహిం చింది.

                                                                                                      ****************
అదే పనిగా మోగుతూ నిద్రాభంగం కల్గించిన గడియారం నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది వైశాలి ఓ అర గంట తర్వాత లేద్దామని.ఈ సారి ఆమెను పాల బ్బాయి కాలింగ్ బెల్ లేపింది .దానర్థం ఏడైందని.నాలిక్కరుచుకుంటూ లేచింది .వారం రోజులుగా పని మనిషి కూడా రావడం లేదు.అంతా భిన్నత్వంలో ఏకత్వమే.ఆమె పాచిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఈదుకొస్తుంది.భర్త మాత్రం పున్నమ అమాసకన్నట్లు కూలికి పోయి తాగి తందనా లాడుతూ కుటుంబానికి భారంగానే మిగిలిపోయాడు.పైగా వారం రోజుల కింద తాగిన మైకంలో ఓ మోరీలో పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. “మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం.మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం.కానీ మద్యానిది మాత్రం ప్రభుత్వ ఆదాయం వైపే మొగ్గు .ఈ విషయాలన్నీ ఆమె ను ప్రతి రోజూ కలత పెడుతున్నవే. పెళ్ళి 8.45కే అని ఉంది. ఊడ్వడాలు తుడువడాలు పనికి నడుం బిగించి యమ స్పీడుగా పూర్తి చేసి స్నానం వగైరాలు ముగించి గోడ వైపు చూస్తే పది హేను నిమిషాలే ఉంది పెళ్ళి టైం సుమా అన్నట్లు గడియారం హెచ్చరించింది.కాఫీ తో తృప్తి పడ మని ఆత్మారాముడికి నచ్చ చెప్పి ఇంటి నుండి బయట పడింది వైశాలి.వెతుకుతున్న కళ్ళకు ఒక్క ఆటో కనపడి చావలేదు .మరో నాలుగడుగులు ముందుకు వేసింది.ఐనా ఆటోలు కనపడలేదు. కన పడ్డా రద్దీతో.చౌరస్తాలో దొరకవచ్చన్న ఆశతో కాళ్లకు పని చెప్పింది.సడెన్ గా పక్కనే ఓ కారు ఆగ డమే కాదు డోరూ తెరుచు కుంది .
“వైశాలీ ఎచటికోయి నీ పయనం” అంటూ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ వైశాలీ స్నేహితురాలు సరళ పలకరింపు.
“ఓ పాత విద్యార్థిని పెళ్ళికి” కొంచెం ఆరాటంగానే సమాధానమిచ్చింది వైశాలి.
“పెళ్ళెక్కడ?”
“లక్ష్మీ గార్డెన్స్. ఒక్క ఆటో దొరికి చాపడం లేదు.”అంది ఆతృతగా.
“నేనూ అటే. అమ్మ వాళ్ళింటికి.కారెక్కేసెయ్.”సరళ. బతుకు జీవుడా అనుకుంటూ కారెక్కింది వైశాలి
“మాఇంటి దారే మరిచిపోయినట్లున్నవ్?”వైశాలి
“మరిచిపోవడమా పాడా? టైం దొరికితే కదా! డిసెంబరంతా తేజస్వితోనే సరిపోయిం దనుకో. తునున్నన్ని రోజులూ చుట్టపక్కాలు ..తన స్నేహితులు….వంటా వార్పులు..షాపింగులు.. ఒకటా రెండా…సమస్తం నామీద దాడి చేసాయనుకో.ఫ్లైటెక్కే వరకు ఊపిరాడలేదనుకో.” సమా ధానం చెప్పింది సరళ.
“అదీ నిజమే. నాకు తెలియందేముంది. తరుణ్ వచ్చినప్పుడు నా కథ కూడా అంతే. ఏమరికానో ఏమో?పిల్లలు వచ్చే వరకు నిరీక్షణ. వచ్చింతర్వాత అదో ఒత్తిడి.తిరుగుముఖం పట్టిం
తర్వాత అదో రంది.”అంటూ వివరణ ఇచ్చింది వైశాలి
“ఆటో దొరకకపోవడం ఒకందుకు మంచిదే ఐంది కదూ!”అన్నది సరళ
“అదీ నిజమే..కాని ఎందుకు దొరకలేదంటవ్?” తన సందేహాన్ని వెలిబుచ్చ్ంది వైశాలి
” తర్వాత మూడాలు వస్తున్నాయట .రెండునెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవట. అందుకే మంచి రోజంటూ ఇవాళ్ళ్టి ముహూర్తంపై అందరి దాడి.” సరళ
“ఏం ముహూర్తాలో ? ఏం మూడాలో? ఏం జాతకాలో? అన్నీ చూసి చేసినా ఎన్నో దురదృష్టాలు.” వైశాలి
“వాటికిచ్చే విలువను మనుషుల వ్యక్తిత్వాలకివ్వడం లేదు. ప్రపంచమంతా డబ్బు మయం ఐపోయింది.” సరళ
“అది సరేగాని మీ అమ్మదగ్గరినుండి వచ్చేప్పుడు మా యింటికి రాకూడదూ? మా ఆయన కూడా ఇంట్లో లేరు “అడిగింది వైశాలి .
” ఐతే మరీ మంచిది. కొంచెం ఫ్రీగా గడపొచ్చు.కానీ నేనొచ్చేవరకు నాలుగవుతుందేమో?” అంది సరళ
“ఐతే ఏంటట? బహుషా ఒంటిగంటకల్లా నేనింట్లో ఉంటాననుకుంట.”వైశాలి
“ఓకే డన్”అంటూ సరళ చెయ్యి కలిపింది.
వాళ్ళ మాటల్లోనే లక్ష్మీ గార్డెన్ వచ్చేసింది .బైబై చెప్తూ కారు దిగిన వైశాలి కాళ్ళు హాలు వైపుగా సరళ కారు వాళ్ళమ్మ ఉండే కృష్ణ కాలనీ దిశగా కదిలినై.వైశాలి లక్ష్మీగార్డెన్స్ ముఖద్వారం చేరుకుంది.పార్కింగ్ ఏరియా రకరకాల కార్లతో నిండిపోయిఉంది ఓ కార్ల ఎగ్స్ బిషన్ లా. ముహూ ర్తం దగ్గర పడుతుండటంతో కొంచెం ఆరాటంగానే అడుగులు వేసింది.ముఖద్వారానికి ఒకవైపు
వధూవరుల ఫొటోలు..మరో వైపు అమ్మాయి తల్లిదండ్రుల ఫొటోలు ఆహ్వానితులుగా. .అన్నిటినీ మించి పౌరాణిక సినిమాల్లో లాగా ఇద్దరు ద్వారపాలకులు అందమైన కట్టెలను ఇంటూ ఆకారంగా పట్టుకొని .ఇదేదో రాచ మర్యాదలా ఉందనుకొని మరో అడుగు ముందుకు వేసింది.కాని ఆ ఇంటూ ఆకారం భీష్మించుకుంది.పోవడానికి వీల్లేదంది.అది వి ఐ పి లద్వారమని తేల్చి చెప్తూ ఓ ద్వార పాలకుని చెయ్యి రెండో గేటుని సామాన్యుల దారిగా చూపిం చింది.వైశాలికి ఆ తీరు అసౌకర్యం గానే కాదు కొంత అవమానంగా కూడా ఫీలైంది. చేసేదేంలేక లోపలికి నడిచింది. పూలవాసనల గుబాళింపు నాసికారంధ్రాలను అదరగొడ్తుంది.తోరణాలు.. డేరాలు..నడిచే దారంతా ఎప్పటి తివాసీలు.. కళ్ళు జిగేల్మంటున్నైడెకరేషన్ అదిరి పోయింది.అది పోస్ట్ హోదాను అద్దం పడు తుంది.హాలంతా అతిథులతో నిండిపోయింది. సీటు ఖాళీగా ఉన్న దాఖలా కనపడలేదు.వైశాలి తన కళ్ళకు పని చెప్పింది సీటు వెతుకమని. ఈ లోగా ఆపద్బంధవిలా సుమన స్నేహితురాలు
మానస ” నమస్కారం” అంటూ పలకరించి ఓ సీటు చూపించింది. “బ్రతుకు జీవి ” అనుకుంటూ వైశాలి ఆ సీటుకు పాత్రత్వం కల్పించింది.
స్టేజ్ వైపు తిరిగిన వైశాలికి వధూవరుల జిలకర బెల్లం కార్యక్రమం కనిపించింది. సమయానికి చేరుకున్నందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది.అదేదో తను చేరకపోయుంటే ఆ కార్యక్రమానికి సార్థకత ఉండేది కాదేమో అన్నంత ఫీలింగ్ తో.ఆ ఆలోచన రాగానే తనలో తానే నవ్వుకుంది.ఒకసారి హాలంతా కలియ చూసింది.సీతాకోకచిలుకలు వచ్చి వాలాయేమో అన్నంతగా మహిళామణుల చీరా జాకెట్లు..గాగ్రాలు..లంగాలకంత ఓణీలు..ఒక దానిని మించి
మరోకటి.ఒళ్ళంతా తాపడం చేసుకున్నారేమో అనే బ్రమను కల్పించే కళ్ళకు మిరుమిట్లుగొలిపే
నగలు .ఒయ్యారాలు ఒలుకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ యువతరంగిణులు.”ఆ అలంకరణలో
అందం చందం సరే.కాని ఈ ఎండల్లో శరీరం వాటిని ఎట్లా తట్టుకుంటుందో పాపం.”వైశాలి తనలో తానే ప్రశ్నించుకుంది వైశాలి తనలో తాను.ఐనా పీత కష్టాలు పీతవి.కందకు లేని దురద
కత్తికెందుకట అని సమాధానమూ తానే చెప్పుకుంది.
మరోసారి వేదిక వైపు దృష్టిని సారించింది. దానికి దగ్గరగా క్రేన్ వంటిదేదో పైకి ..కిందికి…కుడి…ఎడమలుగా కదులుతూ కనిపించింది.కొంచెం గమనిస్తే అది ఫొటోలు తీస్తుందని అర్థమైంది. వేదిక మీదకు చేరి కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళ ఇబ్బంది కొంత తొలగిపోతుందని తృప్తి పడింది.
తెలిసిన తలకాయలేమైనా కనపడుతాయేమోనని హాలంతా కలియచూసింది.ప్చ్..లాభం లేకపోయింది.కాని ఆ కళ్ళకు హాల్లో ఐదారు చోట్ల ప్రొజెక్టర్లు కనిపించాయి.వాటిలో పెళ్ళి తంతును స్పష్టంగా చూడొచ్చన్నమాట.. “అంటే ఏంటన్నట్లు ” తనకు తానే ఓ ప్రశ్న వేసుకుంది.
“పెళ్ళికంటూ వచ్చి ఆ పెళ్లిని స్పష్టంగా చూడలేక ప్రొజెక్టర్ లో పెళ్ళి చూడట మన్నమాట. ”
అనుకుంటుండగానే ఆ ప్రొజెక్టర్ లలో పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు విభిన్న భంగి మలలో దిగిన రకరకాల ఫొటోలు కనపడుతున్నాయి.బహుషా దాన్నే ఫొటో షూటింగ్ అంటారేమొ . ఈ మధ్య పిల్లలు మాట్లాడుకుంటుంటె విన్నాను.కొత్త నాగరికతలు.. సరికొత్త సంప్రదాయాలు. ఎవరి ఆనందం వాళ్ళది.కాని ఈ డబ్బులున్న వాళ్ళు ఎన్ని తతంగాలైనా చేయొచ్చు. కాని పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు సాధారణ జనం సంగతేంటి?”లక్ష ఆలోచనలు వైశాలి మనస్సులో.
“.వైశాలి ఆలోచనలను భంగం చేస్తూ ధన్ ధన్ మంటూ బాండ్ మోత.ఆ గర్జనకు సమాంతరంగా పెళ్ళి కొడుకు సుమన మెడలో తాళి కడుతున్న దృశ్యం మెరుపులా.కాని వేదిక మెట్ల దగ్గర నల్ల సఫారీలతో బలిష్టమైన కండరాలతో కొందరి ఉనికి దాదాల్లా.
.”ఓహో! వీళ్ళనే బౌన్సర్లు అంటార”ని గుర్తుకొచ్చింది వైశాలికి.
“పెళ్లిలో రౌడీలు లేరే..మరి గొడవ చేసే వాళ్ళెవరు.అంతా అతిథులే కదా!”మళ్ళీ తనలో తనే ప్రశ్నించుకుంది వైశాలి.అమ్మాయి మెడలో మంగళసూత్రం పడిందో లేదో…కనీసం వధూవరులకు వేదిక మీద కుర్చీలను వేయనే లేదు. హాల్లో జనమంతా లేచి బిలబిలమంటూ వేదిక వైపు దండెత్తినంత పని చేసారు.వెంటనే బౌన్సర్లు రంగంలోకి దిగారు.కేవలం పదిమంది చొప్పున మాత్రమే వదలడం మొదలు పెట్టారు. కాని ఆ తతంగం ఓ పదినిమిషాలు కూడా సాగ లేదు. ఆ జన వాహినికి బదులుగా రాజకీయ వాహిని కనపడింది.వచ్చిన రాజకీయ ప్రముఖుడు
యం. యల్. ఏ అని అర్థమైంది. కాని వెనుక ఉన్న జనం..నాయకుల హోదాను చూపించడానికి వచ్చే జనమని జగమెరిగిన సత్యమే. “ఆ నాయకుల వెంట ఉన్నప్పుడు సంఖ్య పక్కన సున్నాలు. వాళ్ళే లేకపోతె కేవలం జీరోలు” తనలో తాను నవ్వుకుంది వైశాలి. బహుషా వాళ్ళు వస్తున్నట్టు సుమన తండ్రికి ముందే సమాచారముందేమొ…వేదిక దిగి వాళ్ళను ఎదుర్కొని వచ్చాడు. మందస్మిత ముఖారవిందాలతో అక్షతాశిస్సులు..కరచాలనాలు..ఆత్మీయ ఆలింగనాలు..ఫొటో దిగటాలు..అన్నీ కళ్ళు మూసి తెరిసే లోపె.ఆ వాహిని సుమ వాళ్ళన్నయ్య అసిస్టెన్స్ లో డైనింగ్
హాలు దిశగా సాగింది.మళ్ళీ జనవాహిని మంద్రంగా…బౌన్సర్ల అదుపాజ్ఞల్లో.
వైశాలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి.బ్రేక్ ఫాస్ట్ చేయనందుకు తనను తానే తిట్టుకుంది.లేచి ఆ లైన్లో కలుద్దామనే అనుకుంది . కానీ చీమ కూడా దూరడానికి వీలు లేదన్నట్లు
ఆ లైను కదులుతుంది.” ఇంటి దారి పడితే…” మరో ఆలోచన.”ఉడికే దాక ఉన్న ఓపిక ఉమ్మొగిలే
దాక ఉండాలి కదా! పైగా సుమన ఫీలౌతుంది. లాభం లేదు. ఉండి తీర్చాల్సిందే . ఓపిక పట్టా ల్సిందే” నిర్ణయానికి వచ్చింది.ఆకలిని జయించడానికా అన్నట్లు తన చూపులను వేదిక వైపు తిప్పింది.దానికి కుడి వైపుగా యువతుల గుంపు దాండియా ఆడుతూ..నవ్వుతూ ..తుళ్ళుతూ..
ఆనంద డోలికల్లో. “సరదాకు అవకాశం కల్పంచిన పెళ్ళి సందడి.” అనుకుంది వైశాలి.ఆమె చూపులు వధూవరులను వెతికాయి.కాని ఆ చూపులకు భంగపాటు ఎదురైంది.ఎందుకిలా జరి గిందనుకుంటూ ఎడమ వైపుగా కదిలిన ఆ చూపులకు చప్పుళ్ళతో ఓపెన్ స్పేస్ వైపు పూజారితో సహా పోతున్నట్లు తెలిసింది.” పగలే వెన్నెలలో అబ్బాయి అమ్మాయికి అరుంధతీ (లేని)నక్షత్ర దర్శనం చేయిస్తాడేమొ.తప్పదు మరి ఈ అమ్మాయీ అరుంధంత పవిత్రంగా.. పతి వ్రతగా ఉంటేనే ఆ వరుడి జన్మ సార్థకం. !”గొణుక్కుంది తనలో తను. ఎంతకీ లైనుకు ముక్తాయింపు
కనపడక పోవడంతో కొందరు క్యూ ను క్విట్ చేసి భోజనాల దారి పట్టారు.దాంతో లైను కొంచెం పలుచ పడ్డది. ఒంటిగంటకా వస్తుంది. ఆకలి ఆగలేనంటుంది. వైశాలి లేచింది.లైన్లో కి చొచ్చుక పోయింది.ఆమె వెనుక మరికొందరాడవాళ్ళు.ఆ తర్వాత చాలామంది అచ్చంగా పరీక్ష హాల్లో విద్యార్థుల్లా. మొత్తానికి వైశాలి ఆడవాళ్ళకో దారి చూపించినామె ఐంది.వెనకాల ఉన్న మగ
మహారాజులు మొదట కొంత బిత్తర పోయినా ఆ తర్వాత తమ ఓపికను పరీక్షించే సత్తా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తూ తమ చేతుల్లో ఉన్న అక్షతలను నిలబడిన చోటినుండే (ఉద్యమ కారులు బస్సులపై రాళ్ళు విసిరినంత స్పీడులో )వధూవరులపైకి విసిరి డైనింగ్ హాల్ దారి పట్టారు.
” పెళ్ళి కి వెళ్ళి రావడాన్ని మొత్తంగా ఐదు అధ్యాయాలుగా విభజించ వచ్చేమొ.వెళ్ళడం
మొదటి అధ్యాయం కాగా..పెళ్ళి తతంగం పూర్తయ్యే వరకు నిరీక్షించి వేదిక చేరుకొని వధూవరు లను కలవడాలు రెండు మూడు అధ్యాయాలు కాగా భోజన కార్యక్రమం నాలుగు తిరిగి వాహనం దొరికి ఇంటికి చేరుకోవడం ఏదో అధ్యాయం.దానితో పెళ్ళి తతంగం సమాప్తమన్న మాట.”అని తీర్మా నించుకున్న వైశాలి ఆరాటంతో కదిలి అక్షతలతో ఆశీర్వదించి సుమన చేతిలో తను తెచ్చిన
గంగు నవల ను కానుకగా ఇచ్చింది .తనను చూసిన సుమన సంతోషానికి అవధులు లేవు.ఉబ్బి తబ్బిబైపోయింది .ఉన్నఫళంగా పాదాభి వందనం చేసింది.ఆ అమ్మాయి ఆనందం చూడగానే అంతసేపు వైశాలి పడ్డ యాతన మటు మాయమైంది. పెళ్ళి కొడుకుతో పాటు తన తల్లితండ్రులకు తన టీచర్ ను సుమన పరిచయం చేసినా అవి మొక్కుబడి పలకరింపులే అయ్యాయి. భోజనం తప్పకుండా చేయమని ఆ అమ్మాయి అభ్యర్థన.తప్పదన్నట్లు వైశాలి డైనింగ్ హాలు వైపు దారి తీసింది.

                                                                                                    ****************

డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతున్న వైశాలికి అక్కడే ఏదో పార్టీషియన్ కనిపించింది.దానిముందూ ధవళ వస్త్రముల వేత్రహస్తులు …వేత్రములను ఇంటూ ఆకారంగా పట్టుకొని.అటువైపు వెళ్లిన వాళ్ళందరిని ఓ ఖద్దరు శాల్తీ జనరల్ డైనింగ్ కు వెళ్ళాల్సిందిగా సూచిస .ఆ సూచన ఓ వృధ్ధదంపతులకూ చేరింది.హాలంతా దోస..పానీ పూరి.. సమోసా చాట్ ..ఐస్ క్రీం..స్వీట్స్ ..ఫ్రూట్స్ వంటి తిను బండారాలతో ముస్తాబై ఉంది .అన్నం..పప్పు ..కూరలు..వంటి కూరలు షరా మామూలే. వైశాలి మనసు భోజనం వైపే మొగ్గు చూపింది .అన్ని చోట్ల ఉన్నట్లు అక్కడా అంతే రద్ది.ఐనా తప్పదు.ఇంట్లో తిండి ఎట్లగూ సిద్ధంగా లేదు.ఇక్కడే
ఇంత ఎంగిలి పడుదామని ముందుకు కదిలింది.ప్లేట్ లో రెండు నాన్ ముక్కలు..ఓ కూర.. పప్పు ..కొంచెం అన్నం పెట్టుకొని పక్కకు జరిగి తినడానికి ఉపక్రమించింది .నాన్ నుండి ఓ చిన్న ముక్క
తీసుకుందామని ప్రయత్నం చేసింది. కాని దాని నుండి ముక్క భీష్మించుకుని చినగను గాక చినగనంది.మొత్తానికి వైశాలి విశ్వప్రయత్నంతో చేతిలోకి ఓ ముక్క చేరింది.కూరను చేర్చి నోట్లో పె
ట్టుకుంది.నోరంతా నూనె మాయమవటమే కాదు ఆ నాన్ ను పళ్ళు నమలలేమని తేల్చి చెప్పు తున్నాయి.తినడానికి మరి కొంత ప్రయత్నం చేసింది . అన్నమైనా తిందామనుకుంటే సరిగా ఉడుకనే లేదు.ఇక లాభం లేదనుకొని ప్లేటును టబ్ లో చేర్చింది.ఆ టబ్ ను చూసి వైశాలి మనసు జాలితో నిండి పోయింది.పాపం దాని నిండా తినకుండా మిగిలిన ఆహార పదార్థాలూ నిండి పోవ
డంతో మా దీనావస్థను చూడండని వేడుకుంటుంటున్నాయి.
చేతులు కడుక్కొని వస్తున్న వైశాలికి ఇందాక కనిపించిన పెద్దవాళ్ళు ప్లేట్ల భారంతో నిలబడక..తినలేక.” డబ్బు దర్పం ఉన్న వాళ్ళకేమొ టేబుల్ ముందు కూర్చొని తినే సౌకర్యవంత మైన ఏర్పాట్లా?ముసలి ముతుక..పిల్లా జెల్లా నానా అగచాట్లు పడాలా? “ఎవరినీ ప్రశ్నించలేక
తనలోతానే గొణుక్కుంది.ఇక ఇంటి దారికై ఎక్సిట్ వైపు పోతుండగా ఆ పెద్దాయన జారి పడబోగా
ఎవరో ఒకాయన గబుక్కున ఆసరా ఇచ్చాడు. లేదంటే పాపం ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుని హాస్పిటల్ కు ఆదాయం పెంచేవాడు.అక్కడంతా నీళ్ళ రొచ్చుందని వైశాలి కళ్ళు గమనించాయి.
“పాపం ముసలాయనచస్తుండే . జర అసొంటిదెవతొ పొయ్యి చేతులు కడుగొచ్చు కదా”
ఓ గొంతు ప్రశ్న.
” సగం తాగిన గిలాసలు సుత ఏడంటె ఆణ్ణే పెట్టవట్టరి.మల్లంత సదివిన మారాజులే.”ఓ పనామె
“కూరనారలు సుత నిలబడ్డకాన్నే ఎయ్యవట్ట్రి. బగ్గ నగలు దిగేసుకొని షోకు షోకు బట్టలేసుకోంగనే సరిపోతాది?”ఇంకో పనామె
వాస్తవాలైన వాళ్ళ మాటలను వింటూ “చదువు వల్ల వివేకం కలిగే రోజులకు కాలం చెల్లి
పోయిందని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడినుంచి నిష్క్రమించింది వైశాలి.

                                                                                                   ****************

వైశాలి ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుందో లేదో మంచానికి తన శరీరాన్ని అప్పచెప్పింది. పెళ్ళి వాతావరణం కారణంగా ఆమె పై ఆకలి ..అలసట…అశాంతి ముప్పేటలా దాడి చేసాయి. కాని ఆ మూడింటిని నిద్రాదేవత జయించింది.నాలుగింటి వరకు ఆమెకు తోడుగా నిలిచి కాలింగ్ బెల్ చప్పుడు తో బై బై చెప్పి వెళ్ళిపోయింది. తలపు తీసిన వైశాలికి సరళ కనపడటంతో నాల్క కరచుకుంది.
“మంచి నిద్రలో ఉన్నట్టున్నవ్? డిస్టర్బ్ చేసానేమొ?”అంది సరళ
“అదేం లేదు.రెండు గంటలు మాంచి నిద్ర పోయాననుకో రా! రా! .”అంటూ డైరెక్ట్ గా వంటింట్లోకి దారి తీసింది.
“కాసేపు ఇక్కడే కూర్చొని ముచ్చట్లాడుదాం. ఎట్లాగూ మీ ఆయన కూడా లేరు కదా! ఇవాళైనా ఆ వంటింటి గొడవను మరిచిపోదాం. పైగా నువ్వేమొ పెళ్ళి భోజనం …నేనేమొ అమ్మ చేతి వంట.” సరళ.
“పెళ్ళి భోజనమా? మరేమన్నానా? “అంటూ తన ఆకలి ఘోషకు కారణాలన్నిటినీ పెళ్ళి
తతంగాలతో పాటు సరళ ముందు కుమ్మరించింది వైశాలి.
“నిజమే వైశాలీ ! ఈ మధ్య కాలంలో పెళ్ళి పిలుపులకు..కల్పించే సౌకర్యాలకు.. ఏమా త్రం పొంతన ఉండటం లేదు..హోదా ప్రదర్శనలకిచ్చే ఇంపార్టెన్స్ ఆతిథ్యానికి లేదు.”
“ఔననుకో. కాని చిన్న సవరణ. రాజకీయ నాయకులకు …డబ్బును మారాజులకు మంచి ఆతిథ్యమే ఇస్తారు.”సరళ
“అదే కదా! నేననేది.వాళ్ళకేమొ ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా …టేబుళ్ళు.. కుర్చీలు.. వడ్డనలు…మర్యాదలు…సమస్తం.మిగిలిన వాళ్ళేమొ ప్లేట్లను అడుక్కునే చిప్పల్లాగ పట్టుకొని
అన్నం పప్పు ..కూరా ..చారంటూ లైన్లో.”బాధతో అంది వైశాలి.
“ఆ లైనైనా సరిగా ఏడ్చి చస్తుందా అంటే అదీ లేదు.నేను వడ్డించుకుని వెనక్కి తిరుగు తున్నానో లేదో ఓ వీర వనిత నా నెత్తి మీదుగా ప్లేటు పెట్టి కూర వేయించుకోవడంలో నా బ్లౌజు ను కూడా పావనం చేసింది.ఆ బ్లౌజిప్పుడు డ్రై క్లీనింగ్ దర్శనం చేసుకోక తప్పదు.”మళ్ళీ చెప్పుకొచ్చింది వైశాలి .
“జనాన్ని పిలిచి అవమానించడమంటే ఇదేనేమొ.”సరళ
“ఈ పెళ్ళిలో అతిథి దేవో భవ..గురు దేవో భవ..రెండు అభాసుపాలైనై. అఫ్ కోర్స్.. ఇందులో సుమన ప్రమేయం లేదనుకో.” సుమనకు మాట రాకూడదన్నట్లు మాట్లాడింది వైశాలి.
“శిష్యురాలంటే ఎంతభిమానమో..నాకూ ఈ అనుభవాలు చాలానే ఉన్నాయి.”నవ్వింది సరళ.
“అందరి అనుభవాలూ అవేనమ్మా! మార్గాన్వేషణ చేస్తే బాగుండు.”వైశాలి
” ఎవరో ఎందుకు .పిల్లి మెడలో గంట కట్టడంలా.మనింటి పెళ్ళిల్లే నాంది .”
” ఓకే డన్ “అంటూ ఇద్దరు చేతులు కలుపుకున్నారు.మాట్లాడుతూనే వైశాలి వెజిటేబుల్ కమ్ టమాటా బాత్ ను ఆరగించి టీ సేవించారు.ఆపై ఎన్నో సామాజికాంశాలూ వాళ్ళ చర్చలలో వచ్చాయి.గోడ గడియారం ఏడైందని హెచ్చరించడంతో “ఇక నాకు సెలవియ్యి తల్లీ”అనుకుంటూ ఉన్నఫళంగా లేచింది సరళ.
“ఇంకాసేపుడ్డొచ్చు కదా!”బతిమాలింపు ధోరణిలో.
“మా మానవుణ్ణి ఎంత సేపు నిరీక్షణలో పెట్టమంటావు.?”
“మనలాగా నిరీక్షణలు తట్టుకునే శక్తి వాళ్ళకెక్కడిదిలే. “అంటూ సరళను సాగనంపింది
వైశాలి.

****************

ఓ సంవత్సర కాలం గడిచింది.యాదృఛ్ఛికమో …ప్రణాళికో…డిసెంబరు నెలలో తరుణ్
తేజస్వి ఇండియాకు వచ్చేసారు.తామిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామంటూ పెళ్ళి ప్రపోజల్ ను తల్లి కతండ్రుల ముందుంచారు.ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కే కారణాలు కన్పించలేదు. ఒప్పేసు కున్నారు కూడా.రెండు కుటుంబాలు కూచుని రిజిస్టర్ మారేజ్ కమ్ రిసెప్షన్ అరేంజ్ చేసు కున్నా రు. అంటే రిసెప్షన్ హాల్లో నే రిజిస్టేషన్ జరిగేట్టు.మొత్తంగా ఆహ్వానితులను రెండు వందలకు పరిమితం చేసుకున్నారు. వేదికకు ఒకవైపు సుమధురగాన లహరిని ఏర్పాటు చేసారు. అతిథు లంతా హాయిగా టేబుళ్ళ ముందు కూచుని హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించగల్గిన వాతావరణం
కల్పించారు.హాలులో “అతిథి దేవో భవ”. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” “భోజనం న పరిత్యక్త
వంటి బానర్లను ఏర్పాటు చేసారు.వచ్చిన వాళ్ళందరిని పేరు పేరునా పలకరించారు.పసందైన విందునిచ్చి వీడ్కోలునిచ్చారు.ఈ బాట పదుగురికి ఆదర్షం మరేమున్నది.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మ

by dillep February 28, 2022
written by dillep

అమ్మ నవ్వితే…
గుత్తులు గుత్తులుగా పూసిన
శిక్కుడు పూల లెక్కుంటది

అమ్మ కోపం చేస్తే…
పడమటేల సూరీడు
సుర సుర కాలినట్టుంటది

అమ్మ ప్రేమ చూపితే…
తేనె జడి వానలో
నిలువునా తడిసినట్టుంటది

అమ్మ యెదకద్దుకుంటే…
ఏండ్ల నాటి భారమంతా
ఒక్కసారిగా తీరినట్టుంటది

అమ్మ నా నెత్తి నిమిరితే…
వెయ్యేనుగుల బలం
ఒంట్లో చేరినట్టుంటది

February 28, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

by Dr. Triveni February 28, 2022
written by Dr. Triveni

‘ఆధునిక రచనల్లో ప్రాచీన సాహిత్యంలో కన్నా స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తిని కోరే మహిళా చైతన్య భావాల వ్యాప్తి, పరిధి ఇటీవలి దశాబ్దాల్లో ఇంకా విస్తరించింది. స్త్రీ వాదోద్యమ ప్రభావం పురుషుల మీద, పురుషుల రచనల మీద పడడం ఆహ్వానించదగింది. స్త్రీవాదులు కోరే సాంఘిక న్యాయాన్ని ఇప్పుడిప్పుడే పురుషులు అర్థం చేసుకుంటున్నారు. అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో జరుగవలసిన అభివృద్ధి చాలా ఉన్నప్పటికీ, కనీసం ప్రథమ దశ ప్రారంభమయింది. భూమయ్య చిత్రించిన ‘జ్వలితకౌసల్య’ ను ఈ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కావ్యనామమే కావ్య వస్తు స్ఫోరకంగా ఉంది. అయితే భూమయ్య కావ్యం స్త్రీవాద కావ్యం అని నేను ముద్ర వెయ్యటం లేదు. ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీవాద పరిచయం ఉపయోగిస్తుందనే నా సూచన’ (పుట.2)

‘జ్వలిత కౌసల్య’ మొదటి ముద్రణ సందర్భంలో ‘లఘుటిప్పణి’ రచిస్తూ ఆచార్య చేకూరి రామారావు ప్రస్తావించిన అంశం ఇది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1999 నాటికే ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించారు. స్త్రీవాద భావజాలం తెలుగు సాహిత్యంలో  ప్రవేశించి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్న కాలమది. స్త్రీవాద పరివ్యాప్తిలోను, ఉద్యమ రూపంలో కార్యరూపం దాల్చడంలోను సాహిత్యం హితోధిక సాయం చేస్తున్న సమయమది. ఆ పరిమిత కాలంలోనే స్త్రీవాదం ప్రపంచ ప్రమాణాల మీద నిలబడుతూ వినూత్న భావజాలాన్ని ప్రకటించింది. స్త్రీలు వెలువరించిన సాహిత్యమే గాక, ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్లు పురుషుల సాహిత్య మనోగతాలపై ప్రభావాన్ని చూపింది. సంప్రదాయక పౌరాణిక పాత్రల్లో గల స్త్రీల అభినివేశాన్ని  సాహిత్యబద్ధం చేస్తూ నూతన ఒరవడిని సృష్టించారు. ఆధునిక సాహిత్య ధోరణులకు అనుగుణంగా సావిత్రి, పురూరవ, సీత, జాబాలి, వరూధిని, ఊర్మిళ, కౌసల్య, కైకేయి, కచదేవయాని, గాంధారి, పూర్ణమ్మ, కన్యక పాత్రల భావైక స్ఫూర్తిని చిత్రించారు. స్త్రీ పౌరుష కాంక్షను, శక్తి సామర్థాలను, మనోఅభిష్టాన్ని, చింతనాత్మక వ్యధను వెలువరించారు. తద్వారా ఆధునిక సమాజానికి ఒక ఉపదేశాత్మక సందేశం అందించారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని స్త్రీవాద కోణం నుండి అవగాహన చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. సహృదయులు అవలోకిస్తారని ఆశిస్తున్నాను. ఆచార్య అనుమాండ్ల భూమయ్య దృక్పథం స్త్రీవాదం గాకపోయినాÑ వస్తు నిర్దేశం దృష్ట్యా ఈ అంశం నిర్ణయాత్మమైందని భావిస్తున్నాను. పూర్తి కథాంశం కౌసల్య గుండెలలో గూడు కట్టుకున్న అగ్నిజ్వాలను విచ్ఛేదం చేయడం. కౌసల్య మనోగతాన్ని ఆవిష్కరించడం. తద్వారా దీర్ఘకాలంగా ఉన్న మనోవ్యధ నుండి ఉపశమనం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే తన సంసారిక జీవితంలో తీరని కోరికలు, బహుభార్యత్వం వల్ల భర్త నుండి పొందిన ప్రేమానురాగాలు, తోటి సవతులతో పడిన అవమానాలు ఒకటేమి సగటు మహిళ పడే ఆవేదన కౌసల్యలో ఆవిష్కృతమవుతుంది. కౌసల్య మనోవేదన స్త్రీవాద లక్షణాలకు అన్వయింపదగినవే.

మరొక అంశం ‘జ్వలిత కౌసల్య’ ఒక విధంగా చేతనాత్మక కావ్యం. అంతర్గత మధనం, భావాల సంఘర్షణ, అనుభవాల సంచయం అన్ని కలిపి మనో విశ్లేషణ సూత్రాల్లోకి కౌసల్య ఇమిడిపోతుంది. మానసిక వ్యధను ప్రత్యక్షంగా ఈ కావ్యంలో చిత్రించారు కవి. ఎంతో కాలంగా మనస్సులో దాచుకున్న ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టడం మనోవైజ్ఞానిక అంశాలకు అనువర్తించవచ్చు. అచేతనంలో దాగి ఉన్న మానసిక సంవేదనను చేతనత్వంలోకి తీసుకొని రావడం ఇందులోని ప్రధానాంశం. దు:ఖప్రోదిని చేధించడానికి కవి ఈ కావ్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు. తనకు కలిగిన అన్యాయాన్ని మరొకరి విషయంలో కలుగకుండా ఉండడంలో కౌసల్య చేసిన ఉపదేశం సత్ప్రవర్తన దిశగా నడుస్తుంది. కథాగమనాన్ని, పాత్రల ప్రవర్తనా శైలిని కవి అత్యంత నేర్పుతో ప్రదర్శించారు.

ఉపదేశాత్మకంగా కావ్యాన్ని వెలువరిచడంలో కవి ప్రధాన శ్రద్ధ వహించారు. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. స్వతంత్ర కథలను తీసుకొని పాత్రలపరంగా ధర్మప్రభోదం విస్తృతం చేశారు రచయితలు. అంతేగాక సంప్రదాయిక పాత కథల ప్రయోగం నేటి సమాజాన్ని సంస్కరించాయి. సందేశాత్మకమైన గాథలు వ్యవస్థ పునరుద్ధరణకు కృషిచేశాయి. సామాజిక ప్రయోజనానికి ప్రాచీన సాహిత్యంలోని గుణాత్మకమైన వస్తు నేపథ్యం కవులకు తోడ్పాటునందించాయి.

‘జ్వలిత కౌసల్య’ కావ్య స్వభావంలో స్త్రీవాద భావవ్యక్తీరణ మనోవైజ్ఞానికి విశ్లేషణ, ఉపదేశాత్మకం వంటి విభిన్నమైన మౌలికాంశాలను గుర్తించవచ్చు. కవి కావ్య నిర్మాణంలో ప్రకృష్టమైన వస్తువును సరళతరం చేశారు. పద్య రచనా సౌగంధంలో మేటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రామాయణ గాథలోని కౌసల్య మనోవేదనను వాల్మీకి రచనాపరంగా నినదించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఆయోధ్య కాండలో 20వ సర్గలో కౌసల్య శ్రీరాముని ఎదుట తన వేదనను వ్యక్తపరిచిన ఘట్టం ఉంది. మొత్తం ఆరు సర్గలలో వ్యక్తపరిచిన ఆవేదన కవి కావ్యానికి ప్రధానాధారంగా నిలిచింది. ఆ ప్రేరణ వల్లనే ఈ కావ్యం రూపొందింది. శ్రీరాముడు ఈ జన్మకు ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని ప్రమాణం చేయడం ఇందులోని ముఖ్యాంశం. కథాంశాన్ని మొత్తం ఎనిమిది ఉప శీర్షికలలో విభజించారు. సంక్లిష్టమైన కథ ఉప శీర్షికలో ఒద్దికగా నిలిపారు భూమయ్య. కైకేయి వరం, జ్వలిత కౌసల్య, అనంత క్రోధం, మాతృ హృదయం, పితృ వాక్యం, పుత్ర వాత్సల్యం, ఏకపత్నీ వ్రతం, మంగళాశాసనం వంటివి ఈ కావ్యానికి ఒక క్రమణికను సూచించాయి. కథా గమనంలో కార్యోన్ముఖతను సాధించడం కవి కవితా ప్రక్రియలో ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యం. 109 పద్యాలు కలిగిన ఈ కావ్యం నాలుగు ముద్రణలు సంతరించుకోవడం విశేషం. చేకూరి రామారావు, బేతవోలు రామబ్రహ్మం, పేర్వారం జగన్నాథం వంటి విమర్శకులు ఈ కావ్య ముద్రణలో ముందు మాటలు రాశారు. అబ్బూరి ఛాయాదేవి, మలయవాసిని, వాసా ప్రభావతి, వెంకమాంబ, గంగప్ప వంటి సాహితీవేత్తలు స్త్రీ సంవేదనా రూపంలో ‘జ్వలిత కౌసల్య’ను పరామర్శించారు.

తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి ఇంటికి వెళ్ళిన శ్రీరాముడికి ఘోర ఉపద్రవం మీద పడుతుంది. పట్టాభిషిక్తం పొందే వేళలో అరణ్యానికి వెళ్ళాలనే కైక అనుజ్ఞను శ్రీరాముడు శిరసావహిస్తాడు. తన తల్లితో నివేదించి అనుమతి పొందడానికి కౌసల్య భవనానికి వచ్చినప్పటి నుండి కథా ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆచార్య అనుమాండ్ల కౌసల్య మనో చింతనను ప్రత్యక్ష పెట్టడానికి ఆరంభ పద్యాన్ని ప్రయోగించారు. తల్లిదండ్రుల సాపేక్ష కైకేయి వరంలో ఉపేక్ష ప్రత్యక్ష కావ్య కథన ధారకు ఉత్కర్షగా నిలిచింది.

తల్లి కొడుకుల ఆప్యాయతా వాత్సల్యాలను అత్యంత మధురంగా భూమయ్య ప్రవేశపెట్టారు.

స్వాగతింప తన కెదురు వచ్చినట్టి

తల్లి పాదమ్ముల మ్రొక్కె ధర్మమూర్తి

రామచంద్రుండు, కౌసల్య రామునెత్తి

శిరము మూర్కొనె కౌగిట జేర్చి                 (పుట.15)

వర్తమాన కాలంలో తెలుగువారింటి వ్యవహార రూపంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రవేశపెట్టారు కవి. కౌసల్య రామచంద్రుల అనుబంధాన్ని చూపించారు. శ్రీరాముడు శిరస్సు వంచి గౌరవ వందనం చేయడం, కౌసల్య శ్రీరాముడిపై పుత్ర వాత్సల్యాన్ని ప్రకటించడం హృదయ మనోహరంగా భూమయ్య రచించారు.

గతంలో తన తండ్రి కైకకు ఇచ్చిన రెండు వరాలను ప్రస్తుతం తీర్చుకుంటున్నట్లు… తల్లితో నివేదిస్తాడు శ్రీరాముడు. ఒకటి భరతుడికి యువరాజ పట్టాభిషేకం, రెండవది పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయడం. ఈ విషయాలు తెలిపి అడవులకు వెళ్ళడానికి తల్లి కౌసల్య అనుమతిని పొందడానికి వచ్చినట్లుగా తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞను పాటించడం ఉత్తమ ధర్మంగా ప్రకటిస్తాడు. ఒక్కసారిగా రాముడి మాటలు విన్న కౌసల్య ‘స్వర్గమున నుండి పడిన దేవత వోలె నేల పడిపోయె’ అని కవి వర్ణిస్తాడు. శాపవశాన అప్పుడప్పుడు దేవ లోకం నుండి దేవ కన్యలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు భూలోకం మీద ఉద్భవించడం చూస్తుంటాం. భూమయ్య ఈ ఉపమానం ప్రయోగించడంలో తన జన్మను కోల్పోయిన స్త్రీ ధైన్యస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కౌసల్య దు:ఖ వారధికి ఇది అనుసంధానింపబడిరది.

స్త్రీలు తమకు కలిగిన శోకానికి, విషాదానికి ప్రకృతిని ప్రమేయం చేయడం గమనిస్తుంటాం. కౌసల్య తన కుమారునికి కలిగిన విపత్తుకు చింతిస్తుంది. ‘ఇదేమి దినము కత్తులే కిరణములుగా కరకు గుండె దాల్చి సూర్యుడిదేలా ఉదయమునందె’ అంటూ తన విధికి, వ్యధకు విలపిస్తుంది. ఒక్కో దినం గడియను బట్టి శుభాలు, అశుభాలుగా పరిగణింపబడుతాయి. కాలం మీద, సూర్య చంద్రుల కాలగమనం మీద జనులకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు  ఉన్నాయి. ప్రకోపాలు కూడా లేకపోలేదు.

‘పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేమో కాని, ఈ మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తడిచె’

అంటూ కౌసల్య తన జీవిత గాధను వినిపిస్తున్న సందర్భంలో ఒక విషయం స్పష్టమవుతుంది. పుట్టింట్లో తానెంత సుఖం పొందిందో తెలియని తనంలోనే కౌసల్య వివాహం జరిగింది. బాల్యంలోనే దశరథ మహారాజుతో పరిణయం జరగడం కూడా ఆమె దు:ఖానికి ఒక హేతువు. బాల్య వివాహాల మీది దుష్ప్రభావాలు రామాయణ కాలం నుండి భారంగా మారాయని ‘జ్వలిత కౌసల్య’ ద్వారా ప్రత్యక్షంగా తెలుస్తుంది. చివరకు అంతపుర స్త్రీలు అయినా వైవాహిక జీవితంలో దు:ఖ సాగరాన్ని ఈదారనడానికి ఈ దృష్టాంతం తార్కాణంగా నిలుస్తుంది. తాను పుట్టి పెరిగి, ఆడి పాడి, ఆనందంగా గడిపిన రోజులు అనుభవంలో లేని పరిస్థితి ఆమెది. ఇక వివాహం అయిన తర్వాత అత్తవారింటిలో ఏనాడు సుఖం పొందినట్లు ఏ ఆనవాలు వ్యక్తపరచలేకపోవడం ఆమె విధిరాతను తలపోస్తాయి. దీనికి రెండు కారణాలను కవి భూమయ్య ప్రస్ఫుటం చేశాడు. ఒకటి కౌసల్య వివాహానంతరం భర్త నుండి సుఖం పొందలేకపోవడం. దీనికి కారణం దశరథుడి బహుభార్యత్వ ప్రాధాన్యం. కైకేయిపై మోజును పెంచుకోవడం. ఆమెకు దాసుడు కావడం. రెండవది సపత్నుల వ్యవహార ధోరణి. కౌసల్య పట్ట మహిషి అయినా ఆమెకు గౌరవాదరణలు దక్కలేకపోవడం. సపత్నుల పరుష వాక్కులు ఆమె హృదయాన్ని గాయపరచడం. అవమానాల జలధి ఉదృతంగా మారి గుండెలో సుళ్ళు తిరగడం.

న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం నా పతి పౌరుషే

అపి ప్రత్యే2పి పశ్యేయ మితి రామాస్థితం మయా                 అయోధ్య : సర్గ : 20 : శ్లో : 38

అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంత్రితా

పరివారేణ కైకేయ్యా సమావాప్యధవా2వరా                         అయోధ్య : సర్గ : 20 : శ్లో : 42

వాల్మీకి రామాయణంలో శ్లోకాలను అనుమాండ్ల భూమయ్య తన ముందు మాటలో ప్రస్తావించారు. భర్త వల్ల సుఖం లేకపోయిన విషయాన్ని వాల్మీకి రామాయణంలో పై శ్లోకాల్లో తెలుపబడిరది. ఈ కావ్యానికి రామాయణ శ్లోకాల్లో కౌసల్య హృదయ తప్త జ్వాలను కవి ప్రవేశపెట్టారు. ఈ శ్లోకాల ఆధారంగానే కరుణ రసాత్మక గాథగా ఈ కావ్యం రూపాంతరం చెందింది.

ఙ వంధ్యత్వం :

కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం కౌసల్య నోట అద్భుతంగా ప్రకటింపజేశారు భూమయ్య. శ్రీరామ చంద్రుడు రాజ్యానికి యువరాజు పట్టాభిషిక్తుడైనప్పుడే తాను సుఖపడే దశ వస్తుందని భావించింది. కౌసల్య తన కడుపు తీపి మేర రామచంద్రుని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ సమయంలో నిప్పులాంటి వార్త ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయటం అనే తండ్రి ఆజ్ఞను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే కొడుకుగా శ్రీరాముడిని కనకుండా ఉండేదానిని అని ఆమె బాధపడుతుంది. కన్నతీపిని కూడా వద్దనుకునే విషమ పరిస్థితి కౌసల్యకు ఎదురవడమనేది మాతృ హృదయం కలవరపడే విషయం.

నాడు నిన్నునే గనకున్న నష్టమేమి

కలిగెడిది? వంధ్యయను పేరొకటి యే తప్ప

సంతులేదన్న ఏకైక చింత తప్ప

వంధ్యకు మరొక్క చింత రవ్వంత లేదు                  (పుట.20)

ఏ ఇల్లాలు అయినా గొడ్రాలుగా ఉండడం అనే విషయాన్ని కలలోనైనా తలంచదు. కాని కౌసల్య తన నోటి ద్వారా ఆ పద్యాన్ని ఉచ్ఛరించడం అత్యంత వేదనాభరితమైంది. కొడుకును కని అడవుల పాలు చేయడం కంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఉత్తమంగా భావించిన కౌసల్య కడుపుకోతను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య పాత్రలో స్త్రీ దు:ఖ హేతువుకు పరాకాష్టగా వంధ్యత్వమనే శబ్దాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

ఙ కడుపుకోత :

కౌసల్య పరి పరివిధాలుగా శ్రీరాముడి మీద ఉన్న తల్లి ప్రేమను వ్యక్తపరిచిన తీరు కవి తన నేర్పుతో ప్రదర్శించాడు. తన దు:ఖానికి అంతం లేదని వాపోతూ, తనకు ఇంత దు:ఖం అనుభవించే శక్తి లేదని తలపోస్తుంది కౌసల్య. తన మీద దయచూపే ఏ దైవం కనిపించడం లేదని దు:ఖిస్తుంది. ఏ దిక్కు చూసినా శూన్యమే కనిపిస్తుందని తన దురదృష్టానికి చింతిస్తుంది.

కౌసల్య బాల్యంలో తన రామచంద్రుడు ఆడిన ఆటలు, అల్లారు ముద్దుగా పెరిగిన జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను కౌసల్య గుర్తుకు తెచ్చుకోవడం కథా సందర్భాన్ని బట్టి ప్రధానమైనది. వెన్నను కొంత తిని అంతకన్నా మన్నును రుచిగా తిన గోరే రాముడిని చూసి కౌసల్య ఆవేదన చెందేదట. తల్లి చేత తిట్లు తింటూ దెబ్బ తగలకుండా తిరిగేవాడట. ఆటలు ఆడి అలిసిపోయి అమ్మ ఒడిలో చేరి పాలు తాగుతూ, తన కోరిక తీరలేదని ఏడ్చే వాడట. ‘అమ్మ పిలిచె రారా! అన్నము తినిపోవవేగ’ అని కౌసల్య ఎంత పిలిచినా ఆట పాటలలో మునిగి పోయేవాడట. ఇటువంటి శ్రీరాముడి అల్లారు ముద్దు చేష్టలను మరకముందే అడవుల పాలు కావడం కౌసల్యకు తీరని దు:ఖాన్ని మిగిలించింది.

` జాలి చూప / గలుగు దైవ మొక్కరు గాని కానరారు / శూన్య గగనమే ఏ వైపు చూడనైన (పుట.21)

` దెబ్బ తగలకుండ తిరిగెడు పని చేష్ట / కనగ నింత నోచుకొననె లేదొ? (పుట.21)

` తలపు తీరుకున్న ఏడ్చు తీయని పసి ఏడ్పు / వినగనింత నోచుకొననొ నేను? (పుట.21)

` ఆడి పాడుచుండు అందాల రాశిని / కనగ వినగ నోచుకొనగ లేదొ? (పుట.21)

విధి తనతో ఆడుతున్న ఆటకు కౌసల్య ఎంతగా వ్యధ చెందిందో ఈ పద్యపాదాల్లో స్పష్టంగా కవి వ్యక్తపరిచాడు.

ఙ సంతాన పరితాపం :

సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు నోచింది కౌసల్య. ఎంతో కాలంగా అవన్ని ‘ఎడారి నలికిన విత్తనములయ్యె’ నని ఒక శిలగా మారిపోయింది. ఎప్పుడైతే శ్రీరాముడు జన్మించాడో, అప్పుడు కౌసల్య పునర్జన్మ ఎత్తినట్లుగా భావించింది. ఒక తల్లిగా సార్థకం కాని స్త్రీ జన్మ ఊహించలేనిది. కౌసల్య సంతానప్రాప్తి కోసం పరితపించిన సన్నివేశాలు కవి సహజంగానే వర్ణించాడు. తాను సంతానం కోరుకుంటే తన ఇంటిలో సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే అవతరించినట్టుగా భావించింది.

పాల సంద్రమే మా ఇంట పరిమళించె

కల్పవృక్షమే నట్టింట కదలి యాడె

సత్య ధర్మమ్ములమృతమై జాలువారె

చలువ పందిళ్ళు వేసెను చందమామ                               (పుట.22)

శ్రీరాముని పుట్టుక సందర్భాన్ని ఆనంద పరవశాన్ని కౌసల్య వదనంలో కవి అద్భుతంగా వర్ణించాడు. బాల్యం నుండి రామచంద్రుని చూచుకోవడమే తపంగా, అలంకరించడమే పూజగా కౌసల్యకు కాలం సాగింది. అంతలోనే యువరాజు పదవికి రాముడు చేరుకోవడం తల్లికి ఆశ్చర్యమే. ఇంతలోనే వనవాస ఆజ్ఞను తట్టుకోలేకపోయింది. ‘నా ఉరమ్ము పగుల ఏడ్చి ఏడ్చి శిలనైతినెపుడొ, ఇప్పుడేడ్చి ఏడ్చి నేనేమౌదు నింక తండ్రి!’ అంటూ రోదిస్తున్న తీరు కవి నైపుణ్యంలో కరుణను చిందించింది.

ఙ భర్త ప్రేమ లేమి :

భర్తవల్ల సుఖం పొందలేకపోవడమనేవి దీర్ఘకాలంగా కౌసల్య తీరని దు:ఖానికి కారణంగా నిలిచింది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డను వనవాసం పంపడం ధర్మమూర్తి అయిన మహారాజుకు తగునా అని నిలదీస్తుంది. శ్రీరామచంద్రుడు అడవులకు పయనమై వెళ్తుండగా ‘జీవముండునే? కూలీన చెట్టునైతి’ అని కౌసల్య రోదిస్తుంది. తన పెండ్లి అయినప్పటి నుండి శుభంగానీ, సుఖంగానీ అంతవరకు తాను చూడలేదంటూ శ్రీరాముడితో మొరపెట్టుకుంటుంది. తన భర్త ఒక రాజు అయి ఉండగా తాను మాత్రం కళ తప్పి ఉన్నానని బాధపడుతుంది. ఈ సందర్భంలో కవి అద్భుత పోలిక వర్ణించారు ‘సూర్యుని ముఖమొక్కింతైన చూడలేని కమలవనమట్లు’ భర్త ప్రేమనే కనలేని బ్రతుకిదేమి!’ అని తలరాతను నిందిస్తుంది.

నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాస దాసీజనమ్ము కలదు

ఎన్ని ఉండి వీనిననుభవింపలేని

భాగ్యహీనను పతిప్రేమబడయలేక                        (పుట. 24)

సగటు స్త్రీ భర్తనుండి ఆశించేవి ప్రేమానురాగాలు మాత్రమే. కౌసల్యకు ఏడువారాల నగలు, చుట్టూ దాసదాసీ జనము ఉండి కూడా భాగ్యవిహీనురాలైన స్థితిని కవి తన కవితా ప్రతిభలో ప్రదర్శించారు.

ఙ సపత్నుల హేళన :

ఏ ఇల్లాలు అయిన ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది కాని సవితి పోరును భరింపగరాదు. కాని కౌసల్యకు అనునిత్యం సవతుల నుండి పరుష వాక్యాలు, దూషణలు ఎదురవుతూనే ఉంటాయి. సపత్నులతో సమానమైన గౌరవాన్ని పొందలేని తన చిన్నతనాన్ని శ్రీరాముడి ముందు విన్నవించుకుంటుంది. రాజుకు పెద్ద భార్య అయి ఉండి, ప్రజల దృష్టిలో మహారాణి అయి ఉండి కూడా సపత్నులతో పడుతున్న హింసను కౌసల్య విడమరిచి చెప్పింది.

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదాం

అహంత్రోప్యే సపత్నీ నామ వరాణాం వరా సతీ                    (అయోధ్య : సర్గ : 20, శ్లో : 39)

సవతులిందరిలో నాకు సాటివచ్చు

వారెవరు లేరు, నా కంటె వయసులోన

చిన్న వారయు వారు నన్నెన్ని మాట

లాడి కష్టపెట్టెదరొనే ననగరాదు                                         (పుట.24)

వాల్మీకి రామాయణంలో కౌసల్య శ్రీరాముడితో తన సపత్నుల వల్ల పడిన పరుష వాక్కుల తీరు స్పష్టంగా చెప్పబడిరది. అనుమాండ్ల భూమయ్య ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తల్లి అనుభవించిన సపత్నుల వల్ల బాధ, తన సీతకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఏకపత్నీ వ్రతుడిగా ప్రతిజ్ఞ చేశాడు. సపత్నుల హేవగింపు వల్ల పొందిన బాధ ఈ కావ్యానికి మూలాధారంగా నిలిచింది. తల్లి హితబోధ ద్వారా శ్రీరాముడిలో సంస్కరణ భావాన్ని పెంపొందింపజేసింది. కౌసల్య తన దు:ఖం రెట్టింపు కావడానికి రెండు కారణాలు గాక మూడిరటిని తెలుపుతుంది. ఒకటి పతి ప్రేమ లేకపోవడం, రెండు సపత్నుల పరుషవచనాలు, మూడవది శ్రీరాముడి వనగమనం.

ఙ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల లేమి :

యువరాజు పదవిని అలంకరించే కొడుకు ఉండగానే దూషణలకు గురవుతున్నానని కౌసల్య వ్యధ చెందుతుంది. ఇక శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని బాధపడుతుంది. తన భర్త తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదని రాముడితో మొరపెట్టుకుంటుంది కౌసల్య.

నేను రాణినే అయి కూడా కాను, మీ జ

నకుడు నను నిగ్రహించి ఇంతయును స్వేచ్ఛ

నీయలేదు, ఆ తల్లి కైకేయి దాస

జనముతో సాటిగానైన సరకుగొనడు                     (పుట.25)

అంటూ దశరథుడు ఎంతగా ఆమెను కట్టుదిట్టం చేసేవాడో తెలుపుతుంది. భార్యలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమనేది పితృస్వామ్య వ్యవస్థలో మొదటిది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అవసరం లేదనే పురుషాధిపత్య సమాజం అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం వాల్మీకి రామాయణంలోనే తెలుస్తుంది. తాను ఒక పట్టమహిషి కూడా. రాజు స్వేచ్ఛ ఇవ్వకపోవడాన్ని ధిక్కరిస్తుంది కౌసల్య. తన భర్త చులకన భావంతో చూడడం వల్ల దాసి జనంలో తన రాణితనం చెలామణి కావడం లేదని బాధ పడుతుంది. ఇప్పటికీ దాసీజనం ఈ రీతికి నడుచుకొంటున్న సందర్భంలో కైక కొడుకు రాజయిన తర్వాత భయంతో తనను చూడడానికి రారేమోనని కౌసల్య సందేహిస్తుంది. ఏకాంతాన్ని ఎలా భరించగలనని శ్రీరాముడితో నివేదిస్తుంది. ‘కాలమింక నా గళమున బడిన కాలనాగొ ఏమొ!’ అని కౌసల్య చిందిస్తుంది.

ఙ కైకేయి పోరు :

కౌసల్య తన సవతులన్నింటిలో కైక సాధింపును తట్టుకోలేకపోతుంది. ఎల్లప్పుడు పరుష వాక్యాలతో దూషించే కైకేయి తన మీద ఎంతటి క్రోదాగ్నిని చల్లుతుందోననే కౌసల్య వాపోతుంది. కైక వ్యక్తిత్వాన్ని కౌసల్య ఆవేదనలో కవి అత్యంత సహజంగా చిత్రించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత కౌసల్యను కైకేయి బ్రతుకనివ్వదనే మాటను కవి ప్రస్తావించడంలో ఆమె ఎంతటి నియంత స్వభావాన్ని కలిగిందో తెలుస్తుంది.

కాల సర్పమట్లు కడు వంకరగ నడుచు

నడత గల కైక కుబుసమ్ము విడిచె Ñ ఇపుడు

విషము చిమ్ముచు నను కాటు వేయునేమొ?

కన్నతండ్రి! నాయన! నిన్నె కాటువేసె.                  (పుట.26)

అంటూ కైకేయిని కాలసర్పంతో పోల్చుతూ కౌసల్య ఆక్రోశిస్తుంది. కాని తన కష్టాలను, బాధలను కౌసల్య తన ఇష్ట సఖులకు కూడా చెప్పుకోలేదట. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య స్వభావాన్ని చిత్రిస్తూ ‘నా ముఖాన మట్టి విసిరినదని నేను / నట్లె కోపించి మట్టిని ఆమె మీద  / విసరలేను. దానిని తీసివేయమేలు’ అని తెలుపుతారు. కౌసల్య వ్యక్తిత్వంలో నీతి, ధర్మం, మంచితనం ప్రదర్శింపజేశారు కవి.

ఙ సవతుల కలత :

కైకేయి మొదలైన సవతులలో ఎదురయ్యే కలతను ఎదలోనే దాచుకొని ఇంతకాలం సగమైపోయిన కౌసల్య ఈ ముసలితనంలో ఇంకా భరింపలేకపోయింది. పట్టమహీషి అయినందు వల్ల సవతులందరూ తనను అధికంగా బాధిస్తున్నట్లుగా కౌసల్య తెలుపుతుంది. మొదటి భార్యను అయిన నేరం వల్ల నేమో తనను మరింత సవతులు అవమానిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఙ మాతృ ప్రేమ :

లక్ష్మణుడు ఆవేశంగా మాట్లాడిన మాటలు న్యాయమనిపించి భావించిన కౌసల్య శ్రీరాముడి వనవాసానికి అనుమతించడు. తండ్రి లాగా తల్లి కూడా పూజ్యురాలని చెబుతూ అడవులకు వెళ్ళకూడదని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తుంది. ఈ సందర్భంలోనే కవి భూమయ్య కౌసల్యలో పుత్రుడిపై ఉన్న ప్రేమను అనేక విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పటి నుండి కౌసల్యకు కలిగిన బాధనెల్లా రాముడు తన చిట్టి వ్రేళ్ళతో తుడిచిన సన్నివేశాలను గుర్తు చేసారు. ఆ వేదనతోనే రాముడు పసితనంలో ఆడిన ఆట వస్తువులే ఆయన అడవులకు వెళ్ళిన తర్వాత ఆమెకు బ్రతుకు వస్తువులవుతాయని సూచించారు.

క్రూర మృగముల నిలయమ్ము, కోయటన్న

పలుకు దిక్కులేని అడవి పదియునాలు

గేండ్లు పగలు గడచిన రేయియె గడవదు

ఇట్లివియె నాకిరువదెన్మిదేండ్లు తండ్రి!                   (పుట.41)

అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కౌసల్య తలచుకొని బాధపడుతుంది. ఆ రాముడి పసితనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాముడికి మెత్తని గుడ్డ ఒత్తుకొని పోయినా బాధపడే తల్లి మనస్సు అడవుల్లో కఱకురాళ్ళ మీద నిద్రించడం దుర్భరమైందని ఆవేదన చెందుతుంది.

కడుపులో ఉండగా రాముడు తన పాదాలతో తన్నుతుండగా కౌసల్య ఆ పాదాలు ఎంత కందిపోయెనో అని కలత చెందిందట. భూమయ్య వర్ణనలో తల్లి ప్రేమకు తార్కాణంగా కౌసల్యనే నిలుస్తుందని చెప్పవచ్చు. కాని అటువంటి పాదాలు రాయిరప్పలు తాకి రక్తం చిందిస్తాయని తలచుకొని బాధపడుతుంది. ‘తండ్రీ! నీ ముద్దు పాదమందారములకు నా యెదను తొడుగుదునయ్య!’ అంటూ కౌసల్య పేర్కొంటుంది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనం ఈ పద్య పాదం. కవి మాతృ స్పర్శకు గొప్ప చమత్కృతి. తనను కూడా అడవులకు తోలుకొని పొమ్మని కౌసల్య ప్రాధేయపడుతుంది. అడవుల్లోని భయానక పరిస్థితులను రాముడికి తెలియజేస్తుంది.

ఙ లక్ష్మణుడి సేవ :

ఈ కావ్యంలో లక్ష్మణుడి మాటలు కౌసల్య దు:ఖానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుత్ర శోకంతో కుమిలిపోతున్న కౌసల్యను చూసి తన తండ్రిపై ఉగ్రరూపమెత్తుతాడు. రాముడు అడవులకు వెళ్ళకూడదని వారిస్తాడు. తన అన్నకోసం ఏమైనా చేస్తానంటాడు   లక్ష్మణుడు. చివరికి తండ్రిని, కైకను, భరతుడిని బంధిస్తానని శపథం చేస్తాడు. రాముడిపై అచంచల భక్తిని ప్రదర్శిస్తాడు. లక్ష్మణుడి ఆక్రోశం కౌసల్య ఆవేదనను కొంత శాంతింపజేసింది. ‘అన్నకు ఆపద సంభవింపనే నగ్నిని దూకెద ముందుగనే’ అన్న లక్ష్మణుడి మాటల్లో అగ్రజుడి పైగల సోదరప్రేమ, సేవాతత్పరత కనిపిస్తుంది. కవి ఈ పాత్ర కల్పనలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ఙ రాముడి ఏకపత్నీ వ్రతం :

‘జ్వలిత కౌసల్య’గా రగిలిపోతున్న తల్లి దు:ఖాన్ని నివారింపజేస్తూ శ్రీరామచంద్రుడు చల్లగా స్వచ్ఛంగా ఏకపత్నీవ్రతం ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి నిరంతర శోకానికి కారణం తండ్రి ప్రేమ లేకపోవడం, తండ్రి బహుభార్యత్వాన్ని స్వీకరించడం అని గ్రహిస్తాడు. తన తల్లి లాగా సీత దు:ఖించకూడదని నిర్ణయించుకొని మాట ఇస్తాడు.

గడిచినట్టి కాలమ్మేదో గడిచిపోయె

తండ్రి తప్పొప్పులివియని తలపలేను

ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు

ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య.                       (పుట. 57)

అన్న శ్రీరాముడి ప్రతిజ్ఞకు కౌసల్య దు:ఖం తొలిగిపోయినట్లుగా కవి కల్పించారు. ‘ఏదో పరిమళామృత పుష్పమింత సాగివచ్చి కౌసల్య శిరస్సుపై విచ్చుకొనియె’ అని వర్ణిస్తారు. కౌసల్య తనకు జరిగిన పరాభవం తిరిగి తీసుకొని రాలేనిది. తన కాలం చెల్లిపోయింది. తన సీతకు ఇటువంటి దుర్గతి పట్టకూడదని కౌసల్య మనోభావం. ఈ ప్రతిజ్ఞతో కవి తన కావ్యానికి సద్గతిని ఏర్పరిచారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య స్త్రీత్వంలో కౌసల్యను చిత్రించి రాముడిని ధర్మ నిరతివైపు పయనింపజేశారు. మూర్తిమత్త్వ నిర్మాణంలో ‘జ్వలిత కౌసల్య’ను అపూర్వ సృష్టిగా నిలువరింపజేశారు. సంప్రదాయ స్త్రీవాద ధోరణికి ప్రతినిధిగా ఈ కావ్యాన్ని చిత్రించారు. సమకాలీన సామాజిక వీక్షణంలో అంతర్భాగంగా పౌరాణిక ఐతిహాసిక పాత్రల మనోగతాన్ని ఆవిష్కరించారు.

 

:: ఆధారగ్రంథాలు ::

  1. కృష్ణకుమారి, నాయని, ఆచార్య, 2013, విమర్శ విద్యా సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  2. ప్రియదర్శిని, కె.,డా॥, (సం) 2015, ప్రతిభాత్రయి, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  3. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2004, అంతర్వీక్షణం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  4. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2011, (నాల్గవ ముద్రణ), జ్వలిత కౌసల్య, మనస్వినీ దేవి ప్రచురణలు,    హైదరాబాద్‌.
  5. రామారావు, చేకూరి, ఆచార్య (సం) 2003, అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

 

 

ఙ ఙ ఙ

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

మచ్చలేని చంద్రుడు డా॥ మచ్చ హరిదాసు

by Ananthaacharaya K.S. February 28, 2022
written by Ananthaacharaya K.S.

మౌనం వారి స్వభావం. ఒద్దికగా నిమ్మళంగా పనిచేసే తత్వం. అధ్యయనం వారికి ఇష్టం. దృష్టికోణం భిన్నంగా కలవారు డా|| మచ్చ హరిదాసు సార్. పద్యసాహిత్యం వారి వారసత్వం. తెలుగు సాహిత్య మెళకువలు గురుప్రసాదం. ఋషి తుల్యులు. విద్యార్థి దశ నుండి ఈనాటి దాకా చదువుకోటం నిత్య ఆనందంతో చేసే పని. అందరికన్నా భిన్నంగా తన కార్యనిర్వాహణ ఉంటుంది. రాసిన ప్రతి పదం, వాక్యం అన్నీ పరిశోధనాత్మక విషయాలే. ఆదియానో బహూన్ గ్రంథాన్, సేవ్య మానో బహూన్ గురూన్, లోకమానో బహూన్ దేశాన్…. అచ్చుగా ఈ శ్లోకం హరిదాసు సార్ కి బాగా అబ్బుతుంది. కొండాపూర్ నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తంజావూర్, వేటపాలెం గ్రంథాలయాల నుండి కరీంనగరు దాకా ప్రతీ ప్రదేశం, నేర్పిన కొత్త అంశాలు తన రచనకు సోపానాలుగా మారినాయి. హరిదాసు సార్ అంటేనే యాత్రా చరిత్ర అనే సమానార్థకంగా మారిపోయి, పరిశోధనలో దూరిపోయి, అక్షరాల మీద ప్రదేశాలను నిలిపిన కళాత్మకత. కావ్య సౌందర్య రసాత్మకత.

విస్తృత అధ్యయనం విమర్శనంగాని వైపుకు దారి తీసింది. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో విమర్శ చాలా తక్కువగా వస్తుందని పెద్దల అభిప్రాయం. కాని వచ్చే విమర్శలు మాత్రం చాలా వరకు లోతైన విమర్శ వస్తున్న క్రమంలో హరిదాసు గారు మొదటి వరుసలో ఉంటారు.

డిగ్రీ కళాశాల ద్వారా జాతీయ సెమినార్లు నిర్వహించటంలో ప్రముఖ పాత్ర వహించినారు. కళాశాల ద్వారా తీసుకొని వచ్చిన సాధారణ పరిశోధకులు తాము పరిశోధన చేసిన అంశాన్ని డాక్టరేట్ పట్టా పొందాక పక్కన ఉంచుతారు. కొందరు మాత్రమే కొనసాగిస్తారు. అందులో హరిదాసు గారు ఒకరు. యాత్రాచరిత్రల సూచి ప్రకటించారు. ఇంకా ఈ వైపు పరిశోధన వీరు చేస్తూనే వున్నారు. తెలుగు సాహిత్యంలో మచ్చలేని చంద్రుడు హరిదాసు గారు.

కె.ఎస్. అనంతాచార్య, కరీంనగర్,

యాత్రా చరిత్రలపై పరిశోధన చేయాలని మీకు ఎందుకు అనిపించింది?

డా|| ఎన్.గోపి (గోపాల్) వేమన మీద పరిశోధన చేస్తున్న రోజులలో ఆయన వెంట సహాయకుడిగా 1977లో మద్రాసుకు వెళ్లాను. అది నా మొట్టమొదటి రైలు ప్రయాణం. కుతూహలంతో ఆ రాత్రంతా మేల్కొని ఉండి దారిలో తటస్థించిన ప్రతి స్టేషన్ పేరును, రెండు స్టేషన్ల మధ్య కాలాన్ని గుర్తు పెట్టుకుంటూ (నోట్ చేసుకుంటూ) వచ్చాను. మద్రాసులో 40 రోజులు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో మా పని. అక్కడి ప్రదేశాలు, ధరపరలు, విశేషాల గురించి ఏ రోజుకారోజు రాత్రి టూకీగా దినచర్య రాసుకునేవాణ్ణి. ఈ విధంగా ప్రదేశాల గురించి దినచర్య రాయటం, రైలు ప్రయాణంలో స్టేషన్ల వివరాలు నోట్ చేసుకోవటం అనేది యాత్రా చరిత్ర రచనలో కొంతవరకు ఒక భాగమేనని నాకు అప్పటివరకు తెలియదు. తర్వాత పిహెచ్.డి. చేయాలనుకొని “కరీంనగర్ గ్రామ నామాలు”, “గ్రంథ పరిష్కరణల పద్ధతులు” – ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకదాని గురించి మీ అభిప్రాయమేమిటని గోపికి అడిగినప్పుడు, ఆయన ఈ రెండింటి పైన పరిశోధనలు జరుగుతున్నాయి. నీవు “తెలుగులో యాత్రా చరిత్రలు” అనే అంశం మీద చేయి, అది నీ స్వభావానికి బాగా నప్పుతుంది అని సలహా ఇచ్చాడు. అదే అప్లై చేసాను, సీటు వచ్చింది. నాకు తోచిన అంశం కాకున్నా, దానిపై ఇష్టం పెంచుకొని, మనసు పెట్టి రాసి, పరిశోధనాంశానికి తగిన న్యాయం చేసాననే భావిస్తున్నాను.

యాత్రలు చేయడం సహజం, ఐతే వీటివల్ల కలిగే ఉపయోగమేమిటి?

యాత్రలవల్ల మనిషికి ప్రాపంచిక జ్ఞానం అలవడుతుంది. కవి పండితులకైతే రచనోత్సాహం కలుగుతుంది. ఇక భక్తులకైతే తీర్థయాత్ర సందర్శనంలో భక్తి భావం పెంపొందంతో పాటు పాపప్రక్షాళన జరిగినట్లు భావిస్తారు. విద్యార్థులకు గ్రంథ పఠనం ద్వారా తెలుసుకొన్న విషయాలకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. నలుగురితో కలిసి దేశాటనం చేయటం వలన సాటి మానవులతో కలిసి ప్రవర్తించే సహన సౌశీల్యం ఏర్పడుతుంది. అహంకారం తొలగిపోయి, హృదయ వైశాల్యం కలుగుతుంది. కలిసి ప్రయాణించడం వల్ల, ఆయా సందర్భాల్లో కలిసి భుజించటం వల్ల తమ భౌతిక స్థాయిని, అధికారాన్ని, సంపన్నతనూ మరచి కలిసి మెలసి జీవించగలుగుతారు. అనేమందితో నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

పరిశోధన, విమర్శ – ఈ రెండింటో మీకు ఏది ఇష్టం?

విమర్శ వ్యాసాలు రాయటానికి ఇల్లు దాటి వెళ్ళాల్సిన పనిలేదు. సాహిత్యాధ్యయనం విస్తృతంగా చేసి వుంటే చాలు. తర్వాత ఏ అంశం గురించి విమర్శ చేస్తున్నామో దానిపై సాధికారికంగా చెప్పగలిగే నైపుణ్యం సపాదిస్తే చాలు. కానీ పరిశోధన అట్లా కాదు. క్షేత్ర పర్యటనతో ఇది ముడివడి ఉంటుంది. నాలుగు పుస్తకాలు ముందు వేసుకొని పనైపోయిందని ముగించటం కంటె, గ్రంథాలయాలు తిరిగి, ఊళ్లు తిరిగి విషయ సేకరణ సంపూర్ణంగా చేసిన తర్వాత కుదురుగా కూర్చొని వ్యాసరచన చేయగలిగితే చేసిన పనికి గుర్తింపు వస్తుంది, పరిశోధకునికి తృప్తి మిగులుతుంది. అందుకని నాకు సాహిత్య విమర్శ, పరిశోధన ఈ రెండూ ఇష్టమే కాని పరిశోధన అంటే మరింత మక్కువ, ఇష్టం.

మీ రచనలు చాలావరకు పరిశోధనాత్మకమైనవే. ఈ నాటి పరిశోధకులకు మీరందించే సందేశం ఏమిటి?

నా రచనల్లో ఎక్కువభాగం, నా కిష్టమైన పరిశోధన గ్రంథాలే అవి :

1) తెలుగులో యాత్రాచరిత్రలు (సిద్ధాంత గ్రంథం)

2) తెలుగులో యాత్రాచరిత్రలు (లఘు గ్రంథం)

3) తథ్యము సుమతీ! (1984), పరివర్ధిత ముద్రణము (2017)

4) యేనుగుల వీరాస్వామి (జీవిత చరిత్ర)

5) తెలుగులో యాత్రాచరిత్ర రచనల సూచి

6) గునుకుల కొండాపురం – పద్మశాలీయులు – బూట్ల వంశం – ఏడుతరాల చరిత్ర.

మొదటి మూడు రచనలు పాఠకులకు తెలిసినవే. ఒకటి పిహెచ్.డి. పట్టాకోసం, రెండు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన లఘు గ్రంథం. ముందు ఏ అవార్డులూ ఆశించకుండా తంజావూరులో తాళపత్ర గ్రంథాల్లో సేకరించిన సుమతి పద్యాలను వెలుగులోకి తేవడం. ఇక నాలుగవది సి.పి.బ్రౌన్ అకాడమీ వారి కోరికలో రాసినది. వీరాస్వామి జీవిత చరిత్ర విశేషాలు సేకరించడానికి మద్రాస్ ఓరియంటర్ లైబ్రరరీ, కన్నెమెరా లైబ్రరీ, వేటపాలెం లైబ్రరీలకు వ్యయప్రయాసలతో వెళ్లి సమాచారం దొరుకక, నా సిద్ధాంత వ్యాసం ఆధారంగా రాసి ఇవ్వటం. ఐదవది : పిహెచ్.డి ఇంటర్వ్యూ కాలం (1987) నాటికి యాత్రా చరిత్ర రచనలు మూడు నాలుగు కంటె ఎక్కువ లేవని తెలియగా, థీసి లో 50 పుస్తకాలు, తర్వాత 300 పుస్తకాల పేర్లు, వాటి వివరాలను సేకరించి ‘తెలుగులో యాత్రా చరిత్ర రచనల సూచి’ అనే పుస్తకాన్ని భావి పరిశోధకుల కోసం కూర్చి పెట్టాను. ఇక చివరిది : గునుకుల కొండాపురం నేను పుట్టిన గ్రామం. అక్కడ బూట్ల వంశం వాళ్లే ఎక్కువ. మా ఒక్కరిదే మచ్చ వంశం. క్రీ.శ. 1850 సం||లో బతుకుదెరువు కోసం వేరే గ్రామం నుంచి వచ్చి స్థిరపడిన బూట్ల రామయ్య మొదలుకొని ఆయన తర్వాత ఇప్పటి ఏడవతరం వ్యక్తి వరకు అందరి వివరాలను వెలికి తీసిన వైనం పొందుపరచబడింది.

పై ప్రతి పుస్తక రచనకు నేను క్షేత్రస్థాయిలో పడ్డ శ్రమను ఈనాటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందనే, ఉండాలనే దృష్టితో వివరంగా తెలుపవలసి వచ్చింది. పరిశోధన చేసేవారు పై పైనా కాకుండా, చిత్తశుద్ధితో పని పైన దృష్టి పెట్టి ప్రత్యేకతను సంతరించుకునేట్టు, సాహితీలోకం గుర్తుంచుకునేటట్టు శ్రమించి, లోచూపుతో విషయ సేకరణ రచన చేయాలని సూచిస్తున్నాను. థీసిస్ అంటే సముద్రంలో మునిగి ముత్యాలు తీయటమే కావాలి. తీసి రాని, ప్రింటు చేయకుండా అలమారుల్లో పెట్టడం కాదు. ధైర్యంగా ముద్రించి, నలుగురి ముందు పెట్టి మంచి చెడ్డలను (విమర్శ) ఆస్వాదించాలి. వారిచ్చే సూచనలను మలి ముద్రణలో – సరియైనవైతే – సవరించుకోవాలి.

చాలా సుమతి పద్యాలు సేకరించి పుస్తకం వేసారు కదా! దీని నేపథ్యం వివరించండి.

వేమన పరిశోధనలో భాగంగా డా|| ఎన్. గోపి నన్ను తన వెంట తంజావూరుకు (1978) తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడి లైబ్రరీలో సుమతి శతకానికి సంబంధించిన తాళపత్ర ప్రతులు, కాగితపు ప్రతులు కనిపించాయి. గోపి వాటిని రాసుకొమ్మన్నాడు. నోట్ బుక్ లోకి యథాతథంగా ఎక్కించాను. 1856లో సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తంజావూరులో పండితుల చేత రాయించిన పద్యాలే ఇవి. అంతకు ముందే 1832లో సుమతి పద్యాలను పండితులచే రాయించి అచ్చుకు సిద్ధం చేయించిన 150 పద్యాలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1973లో ముద్రింపచేసింది. శ్రీ ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక 1938 సంచికలో బొడ్డపాటి లక్ష్మీపతి గారు సేకరించిన 50 పద్యాలు అచ్చు వేయబడ్డాయి. ఈ విధంగా పైన పేర్కొన్న ప్రతులలోని మొత్తం పద్యాలను సరిపోల్చి చూడగా –

కేవలం తంజావూరు ప్రతులలోని పద్యాలు          – 36

లక్ష్మీపతి ప్రతి లోనివి                                        – 21

ఈ రెంటిలో కామన్‌గా కనిపించే పద్యాలు             – 06

పై ప్రతుల్లో వేటిలోను లేకుండా తర్వాతి కాలంలో అచ్చు ప్రతుల్లోకి

ఎక్కిన పద్యాలు                                                 – 03

వెరసి 56 కొత్త పద్యాలు తేలాయి. బ్రౌన్ సేకరించిన (అకాడమీ ప్రతి) 150 పద్యాలు. వీటిని కలుపగా (150-156) మొత్తం సుమతి పద్యాల సంఖ్య ఇప్పటికి 206 అవుతున్నాయి.

గోరుకొయ్యల నానీల ప్రత్యేకత ఏమిటి?

నేను స్వతహాగా కవిని కాను. నాకు 56 సం||ల వయసు వచ్చేదాకా కవిత్వ రచన వైపు చూపు సారించలేదు. నానీల అష్టమ వార్షికోత్సవ సభకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రభావంతో నానీల రచన మొదలు పెట్టాను. మిత్రులతో ముచ్చటిస్తున్న సందర్భంలో పదాల గారడీ, చమత్కారం

చిందించడంలో నేను నేర్పరినని నా మిత్రులు చాలా సందర్భాలలో చెప్తుండేవారు. ఐతే నేను వాటిని అక్షరబద్ధం చేయకపోవటం పెద్దలోటని కూడా అనేవారు. ఈ చమత్కారాలతోటే నానీలు రాయాలన్న తలంపు కలిగింది. రాసాను. దాని పేరే ‘గోరు కొయ్యలు’. ముఖ్యంగా దేశీయత, ప్రాంతీయత ఉట్టిపడే విధంగా ఆయా వ్యక్తుల వైశిష్ట్యాలను చాటే వాక్చిత్రాల నానీలను 16 దాకా ఈ పుస్తకంలో పొందు పరిచాను.

తెలుగులో సాహిత్య విమర్శ ప్రస్తుతం తక్కువగా వస్తున్నదని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?

తెలుగులో సాహిత్య విమర్శ మనమనుకుంటున్నంత తక్కువగా ఏమీ రావటం లేదు. ఫరవా లేదు. సమీక్షల రూపంలో పత్రికలలో, వ్యాససంపుటుల ద్వారా బాగానే రాస్తున్నారు, సాహిత్య విమర్శకులు. కథలు, కవితలు రాస్తున్నంత విరివిగా రావటం లేదన్నతి సత్యమైన విషయమే. ఐతే దీనికి ముఖ్యకారణం ఈ కాలపు రచయితలు ప్రాచీన సాహిత్యం మీద సరియైన దృష్టి పెట్టడం లేదనే. ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద పూర్తిగా పట్టు సాధించాలంటే అన్ని ప్రక్రియలను సాకల్యంగా, సవివరంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం అంతర్వీక్షణంతో చేసినప్పుడే సాహిత్య విమర్శ సుసంపన్నమవుతుంది.

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన గురువర్యులు ఎవరు?

నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో తెలుగు అధ్యాపకులుగా చింతల నారాయణ గారు ఉండేవారు. వారి విద్యాబోధన, విద్యార్థులతో వారు వ్యవహరించే తీరు బాగా ఆకట్టుకునే విధంగా ఉండేది. ముఖ్యంగా నాకు ఛందస్సు గురించి ఎరుక పరిచిన మెలకువలు నాకు బాగా నచ్చాయి. తొందరంగా పట్టువడింది. ఎంతగా అంటే నా సహాధ్యాయుల సందేహాలను తీర్చగలిగేంత. అప్పుడు నా మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. మునుముందు ఎం.ఏ. తెలుగులో పి.జి. చేయాలన్న కోరిక ఆ వయసులోనే బలంగా నాటుకొన్నది. బి.ఏ. పరీక్షల్లో కూడ ద్వితీయ భాషే ఐనా తెలుగులో నేను అందరికంటె ఎక్కువ మార్కులు సాధించాను.

అలాగే ఎం.ఏ. తెలుగులో చేరిన తర్వాత ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు, డా|| పాటిబండ మాధవశర్మ గారు – వీరు విద్యాబోధన చేసిన తీరు అనుపమానం. పిజిలో వీరు నాకు అభిమాన గురువులు. వారి బోధనలో ప్రభావితుడనైన నేను ఎం.ఏ.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనైనాను.

తెలుగు సాహిత్య అధ్యయనం చేయడానికి గల కారణం ఏమిటి?

నేను 8, 9 తరగతులు చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేవాడిని. మా స్కూలుకు, హాస్టల్ కు మధ్య దారిలో లైబ్రరీ ఉండేది. ప్రతిరోజు బడి వదిలిన తర్వాత సాయంకాలం అక్కడికి వెళ్లి సీరియల్ కథలు చదువుతుండేవాణ్ని. ఈ అలవాటు తర్వాతి కాలంలో పద్మనగర్ కు వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యం కాదు గాని నవలలు, కథల పుస్తకాలు చదివేవాణ్ని. ఇంకా మా నాయన ఆశువుగా కవిత్వమల్లడం, దాన్ని నేను కాపీ చేయడం, గురువు గారు చింతల నారాయణ గారు ఛందస్సులోని మెలకువులు నేర్పడం – ఇవన్నీ నాకు సాహిత్యంమ ఈద అభిలాష కలగడానికి కారణాలైనాయి. ఐతే ఈ ఒక్క ఛందస్సు మీద ఆధారపడి ఎం.ఏ. చదవడానికి వచ్చిన నాకు మహాసముద్రమంత సాహిత్యం ఎదుట కనిపించేసరికి ఒక్కసారిగా భయమేసింది. మిత్రుల సాంగత్యంలో, ప్రోత్సాహంతో ఆర్ట్స్ కాలేజి లైబ్రరీలో నిత్యం సాయంకాలం వెళ్ళి సాహిత్య పాఠ్యాంశాల సంబంధిత విషయాలను, ఇతరమైన వాటిని ఆధార గ్రంథాలను, వ్యాసాలను అధ్యయనం చేయడంతో నాకు సాహిత్యం మీద అభిమానం కలిగింది.

గోపి సార్, అనుమాండ్ల భూమయ్య సార్, కిషన్ రావు సార్, మీరు సహాధ్యాయులు కదా! మీ మధ్య ఉండే అనుబంధాన్ని తెల్పండి?

అనుమాండ్ల భూమయ్య, నేను శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కరీంనగర్ లో 1966-67 సం||లో పి.యు.సి.లో సహాధ్యాయులం. తర్వాత ఆయన జగిత్యాల డిగ్రీ కళాశాలలో, నేను కరీంనగర్ లో డిగ్రీ పూర్తి చేసాము. ఎం.ఏ.లో మళ్లీ కలుసుకున్నాము. తంగెడ కిషన్ రావు ‘ఇ’ హాస్టల్ లో, భూమయ్య బయట రూం తీసుకొని ఉంటుండగా, మా ‘ఏ’ హాస్టల్ లోని 45వ నెంబరు రూం ఖాళీ కాగానే, అందులోకి వాళ్ళను రమ్మని చెప్పి, ముగ్గురం ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత భూమయ్య ఫైనలియర్ లో పి.జి. హాస్టల్ కు వెళ్లగా, మా రూంకు అంజరావు వచ్చాడు. కిషన్ రావు, నేను రెండు సంవత్సరాలు ఒకే రూంలో ఉన్నాము. నేను అంతర్ముఖున్ని, అతి తక్కువ మందితో కలిసేవాణ్ని, కిషన్ రావు అట్లా కాదు. అందరితో తొందరగా కలిసి పోయేవాడు. ఎక్కడెక్కడి వార్తలో తెచ్చి నాకు చెప్పేవాడు. ఈ ఇద్దరి స్నేహం నాకు బాగా సంతోషాన్నిచ్చేది. పరిచయాలు కూడా ఎక్కువే అయ్యాయి. మేం ముగ్గురమే కాకుండా హాస్టల్లో మరి ముగ్గురు మా సహాధ్యాయులుండేవారు. మా అందరినీ కలిపి మా క్లాసు వాళ్లు హాస్టల్ బ్యాచ్ అనేవారు. మెస్ కు  వెళ్లినా, తరగతులకు, లైబ్రరీకి వెళ్లినా అందరం గుంపుగా కలిసే వెళ్లేవాళ్లం.

ఇక గోపితో ఉన్న అనుబంధం మరికొంత ప్రత్యేకమైనది. 45 నెంబరు రూముకు రాకముందు

మరో ఇద్దరితో కలిసి వేరే రూములో ఒక వారం రోజులున్నాను. వారు వ్యసనపరులు, జల్సారాయుళ్లు, కనుక నన్ను ఆ రూంలోంచి గెంటివేయడానికి కుట్రలు పన్నుతున్న సంగతి గోపికి తెలిసి నన్ను మరొక రూముకు మార్పించారు. అక్కడినుండి పైన తెల్పిన 45 కు వచ్చాను. అప్పటినుండి గోపితో నా స్నేహం బలపడింది. ఎక్కడికి వెళ్లినా మేమిద్దరం జంటగా వెళ్లేది. ఈ రెండేళ్లలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మా స్నేహం వికసించింది. సెలవులు వస్తే ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆయన సాంగత్యంలో అనేకమంది స్నేహితులు, కుటుంబాలు, అధ్యాపకులు పరిచయమయ్యారు. మా ఫైనలియర్ పరీక్షలు జూన్ లో ఐపోగానే అందరూ తమతమ ఇండ్లళ్లకు వెళ్ళిపోయారు. నేను ఫస్టియర్ పరీక్షలకు ఇంప్రూవ్ మెంటు కట్టి ఉన్నాను. కనుక ఒక్కడ్నే హాస్టల్ లో వేరే రూంలో సర్దుకొని ఉంటూ జూలైలో పరీక్షలు రాసాను. ఆ నెలరోజుల్లో గోపి దాదాపు నాకు రోజుకొక ఉత్తరం రాస్తూ నేను నిరుత్సాహ పడకుండా ఉత్తేజం కలిగించేవాడు. ఆ కారణంగా నేను ఎం.ఏ. మొత్తమ్మీద ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడను కాగలిగాను. మా క్లాసులో 34 మందిలో హాస్టల్ వాళ్లమే నలుగురం (7 గురు ఫస్ట్ క్లాసు) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులమయ్యామంటే మేమెంత కలిసిమెలసి చదువుకునే వాళ్లమే దీన్ని బట్టి తెలుస్తుంది.

రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు కదా! విద్యార్థులతో మీకున్న అనుబంధాన్ని వివరించండి?

నేను 1974-2008 సం||ల మధ్య 34 సంవత్సరాలపాటు జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ & పి.జి కళాశాలల్లో అధ్యాపకునిగా పని చేసాను. అంతకుముందు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అది నా మనస్తత్వానికి సరిపడేది కాదని గ్రహించి, అధ్యాపకునిగానే జీవనం సాగించాలని నిర్ణయించుకొని ఈ వృత్తిలోకి వచ్చాను. జగదేవ్ పూర్ (మెదక్), ములుగు (వరంగల్), హుస్నాబాద్ (కరీంనగర్) లాంటి గ్రామాల్లో అక్కడే కుటుంబంతో ఉండి పని చేస్తున్నప్పుడు విద్యార్థులతో, అలాగే వారి తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడేది. మేము అద్దెకున్న ఇంటి పరిసరాల్లోనే విద్యార్థులున్నందున వారితో బాగా కల్సిపోయేవాడిని. తరగతి గదిలోనే కాకుండా విద్యార్థులు కొందరు ఇంటికి వచ్చి సందేహాలు తీర్చుకుంటూ, కుటుంబ సభ్యుల వలె మెలిగేవారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ కొంతమందితో రాకపోకల మర్యాదలు (శుభకార్యాలు) జరుగుతూనే ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు టౌన్లో ఉండేవి కనుక పిల్లలు కళాశాలలో తప్ప బయట ఎక్కడా కలిసేవారు కాదు. ఐతే నేను తెలుగు అధ్యాపకుణ్ని కనుక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లోను, ఇంకా కళాశాల మేగజైన్ కు కవితలు, వ్యాసాలు అందించే సమయాల్లోను విద్యార్థులు కొందరు నాకు సన్నిహితంగా మెలిగేవారు.

ఎం.ఏ. తెలుగు ఎస్.ఆర్.ఆర్. కాలేజికి వచ్చిన తర్వాత తెలుగు అధ్యాపకునిగా డిగ్రీ విద్యార్థుల

కంటె పిజి విద్యార్థులతో సన్నిహితంగా ఉండవలసి వచ్చేది. దాదాపు 15 సం|| గడుస్తున్నా ఇప్పటికీ వారితో సంబంధం (ఫోన్ లో) కొనసాగుతూనే ఉంది. అనేకమంది విద్యార్థులు తరగతి బైట నా వద్ద సాహిత్యాధ్యయనం చేసి అధ్యాపకులుగా, కవులుగా, ప్రభుత్వోద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రతినిత్యం ఎవరో ఒకరు తమ సందేహాలను నాకు ఫోన్ చేసి తీర్చుకుంటుంటారు. దానికి కారణం! నేనేదో మిగతా అధ్యాపకుల కంటె తెలివైన వాణ్నని కాదు కాని, వారే అంటారు “మీలాగా ఎవరూ సమయమివ్వరు, ఓపికగా, నమ్మకంగా సందేహాలను నివృత్తి చేయరు- అని. నాకు తెలిసినంతవరకు ఏ ఉపాధ్యాయునికీ దక్కని అదృష్టం నాకు దక్కింది ఒక విద్యార్థి ద్వారా. అది : ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన నా పూర్వ విద్యార్థి డా|| పాతూరి రఘురామయ్య నా జీవితాన్ని గురించి మధురాక్కర పద్యాలలో ‘గురువరేణ్య శతకం’గా 120 పద్యాల్లో రాయటం. రెండు ఎండాకాలాలు నేనిచ్చిన కోచింగ్ తో నక్క శ్రీనివాస్ అనే పూర్వ విద్యార్థి ప్రస్తుతం తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మచ్చుకు ఇవి రెండు చాలు విద్యార్థులతో నాకున్న అనుబంధం తెలుపడానికి.

మీ తండ్రిగారు మచ్చ వీరయ్యగారు మంచి పద్యకవి కదా! వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది?

మా నాయన మచ్చ వీరయ్యగారు కష్టజీవి. నీతి, నిజాయితీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వాడు. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు గుంట మగ్గం నేస్తూ జీవికను కొనసాగించాడు. ఒక్కరి సంపాదనపై తల్లి, భార్య, నలుగురు పిల్లలు ఆధారపడి ఉండగా కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలననుభవించాడు. చదవింది మూడవ తరగతే ఐనా ఆశువుగా ఆబాల్యం కవిత్వం చెప్పేవాడు. అదే ఆయనకు ఎట్లా అబ్బిందో తెలియదు. భగవత్సంకల్పం అనుకోవాలి. రామానుజం అయ్యవారి వద్ద రామాయణం చదువుకున్నాడు. శేషప్ప వరకవి నృసింహ శతకం కంఠోపాఠం కాబట్టి మా నాయన రాసిన సీసపద్యాల్లో ఆ పద్యాల మూస ఉంటుంది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి నా చేతిరాత బాగుంటుంది కాబట్టి – తాను మగ్గం నేస్తూ చెప్పిన తత్వాలు, కీర్తనలు నన్ను కాపీ చేయుమనేవాడు.

తర్వాతి కాలంలో రామ శకతం, పుత్ర శకతం, భక్తి తత్త్వ ప్రకాశిక (కీర్తనలు, తత్వాలు, పద్యాలు, లోకం పోకడ, కందార్థ దరువులు) వంటి రచన చేసారు. ఆయన రచనలలో సామాజిక స్పృహతో పాటు, భక్తి సంబంధి సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. బహుశా నేను హైద్రాబాద్ లో ఎం.ఏ. తెలుగులో చేస్తానన్నప్పుడు నిరుత్సాహపడకుండా ఎంత ఇబ్బందైనా సరే శక్తికి మించి నన్ను చదివించడానికి ఒప్పుకొన్నారంటే అది ఆయనకున్న సాహిత్యాభిలాషే కారణమనుకుంటున్నాను. మా నాయన పద్యకవి ఐనప్పటికీ నామీద ఆయన ప్రభావం పడలేదు. నేను పద్యకవినే కాదు. వచన కవిని కాదు.

మీ కుటుంబాన్ని గురించిన వివరాలు తెలపండి?

మాది మొదట బావుపేట (ఆసిఫ్ నగర్). ఎల్ గందల్ సమీపగ్రామం. మా నాయన ఐదేండ్ల వయస్సులో ఉండగానే మా తాతగారు కాలధర్మం చెందగా, ఏ దిక్కులేని మా నాయనమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారిలైన గునుకుల కొండాపురం వచ్చింది. మా అమ్మమ్మకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. అందరూ మా నాయన కంటే చిన్నవారే. పెద్ద కుమార్తె (మా తల్లిగారు)ను మా నాయనకిచ్చి పెండ్లి చేసి ఇంట్లోనే ఉంచుకొని, తనకున్న 50 గుంటల భూమిని అల్లునికి, కొడుక్కు సమానం పంచి ఇచ్చాడు మా తాత. అందుకు ప్రతిగా మా నాయిన మా మేనమామకు, మా ఇద్దరు చిన్నమ్మలకు పెళ్లిళ్లు చేయించి, తర్వాత తాను విడిగా ఇల్లు కట్టుకొన్నాడు. అప్పటికి నేను జన్మించాను (1950). తర్వాత 15 సం|| అదే ఇంట్లో కాపురముండి మా ఊళ్లో 4వ తరగతి వరకే ఉంది కాబట్టి 5-9 తరగతులు చదివించినారు. తదుపరి రీంనగర్ కు మకాం మార్చారు. నేత కార్మికుల కోసం 1960లో పద్మనగర్ లో రేకుల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, అందులో ఒకటి మా నాయనకు కేటాయించబడింది. 1964లో మేము ఇక్కడికి వచ్చాము. నా తర్వాత ముగ్గురు చెల్లెండ్ల పోషణ కొరకు మా నాయన కొన్నాళ్లు మగ్గం నేసి, మరికొంత కాలం (ఎం.ఏ. పూర్తయ్యేవరకు) బర్లనుకొని పాలు అమ్ముతూ జీవనం గడిపాడు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 1976లో ఆయనకు అన్ని పనుల నుండి విశ్రాంతి కల్పించాను. ఐనా ఊరకే ఉండటం ఇష్టంలేక 76వ యేట వాస్తు, జ్యోతిష్యం నేర్చుకొని ప్రజాసేవ చేసేవాడు. పెండ్లికార్యం తప్ప మిగతా శుభాకార్యాలు నిర్వహించేవాడు. పద్మనగర్ లోని రెండు గుడుల నిర్మాణానికి విరాళాలు వసూలు చేయడంలో కీలకపాత్ర వహించాడు. 86వ యేట అనాయాస మరణం ఆయనను వరించింది.

ఇక నా విషయానికి వస్తే నాకు ముగ్గురు కుమారులే. ముగ్గురూ ఉన్నత విద్యనభ్యసించిన వారే. పెద్ద కొడుకు రాజశేఖర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో స్వంత ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. భార్య వసంత లక్ష్మి. ఎమ్మెస్సీ జువాలజీ హోమ్ మేకర్. రెండవ అబ్బాయి చంద్రశేఖర్. బెల్లంపల్లిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. మంచిర్యాలలో స్వంత ఇల్లుంది. ఇద్దరు కొడుకులు. భార్య శిరీష. బియస్సీ, బి.ఎడ్. హోమ్ మేకర్. చిన్న కొడుకు ఇందుశేఖర్ ఆల్ఫోర్స్ లో అడ్మినిస్ట్రేటర్ మాతోటే పద్మనగర్లో ఉంటున్నాడు. ఆయనకు ఒక కూతురు. భార్య భాగ్యలక్ష్మి, ఎం.బి.ఏ., హోమ్ మేకర్. అన్నీ స్థానికమైన సంబంధాలే. నా భార్య భారతి తల్లిగారి ఇల్లు గునుకుల కొండాపురంలో మా ఇంటి ముందే ఉండేది. 1973లో ఎం.ఏ. పరీక్షలకు కొద్దిరోజుల ముందే మా వివాహం మే, 18న జరిగింది.

సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ ప్రకటించింది కదా! దీనిపై మీ అనుభూతి ఏమిటి?

నా సాహిత్య కృషిలో భాగంగా సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు ‘కీర్తి’ పురస్కారం ప్రకటించడం సంతోషదాయకమే. ఐతే నాకు సాహిత్య విమర్శలో కంటే పరిశోధన విషయంలో నేను చేసిన కృషికి ఈ పురస్కారం లభించి వుంటే నేను మరింత ఆనందించేవాడిని.

భవిష్యత్తులో మీరు చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి తెలపండి?

ఇప్పటికి నేను 11 రచనలు చేసాను. చేపట్టబోయే ప్రాజెక్టులేమీ లేవు కాని నాలుగు పుస్తకాలు

“హరిదాసు రచనలు వ్యక్తిత్వం, సాహిత్య విమర్శ గ్రంథం, సమగ్ర సుమతీ శతక పద్యావళి మరియు దేశ విదేశాలలో వింతలు విశేషాలు డి.టి.పి. దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని అచ్చు వేయిస్తాను. ఓపిక, శక్తి ఉంటే నా దగ్గరున్న యాత్రా చరిత్రల వివరాలతో రెండవ భాగం వేయాలని వుంది.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ప్రేమకు బదులుగా….

by Bhavani February 28, 2022
written by Bhavani

హిందీమూలం: డా. విష్ణు సక్సేనా, తెలుగు సేత: డా.సీ.భవానీదేవి

జ్వలన రాత్రులుగానీ

కన్నీటితో తడిసే పగళ్లుగానీ ఉండవు

ప్రేమకు బదులుగా

నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే!

ఎప్పుడైనా గుసగుసలాడితే

ప్రభాత ప్రేమగానమై

స్వతఃస్సిద్ధంగా ప్రవహించసాగింది

శబ్ద గోదావరిలో

ఆహ్లాదస్సర్శను పొందిన దేహం

అసంఖ్యాక గీతాలుగా మారిపోయింది

శరీరమైతే మేలుకొని ఉందిగానీ

మననూ….ఆత్మా… రెండూ నిద్రించాయి

చీకటి వెలుగుల నుండి

మొహం దాచుకుని సంతోషించలేవు

ప్రేమకు బదులుగా

నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే…

ఆహ్లాదస్పర్శను పొందిన దేహం

అసంఖ్యాక గీతాలుగా మారిపోతుంది!

ఒడిలో సేద తీరిన నా తలపై

మెల్లగా నువ్వు నిమురుతున్నప్పుడు

కన్నీళ్లు తుడుచుకుంటాయి

వెక్కిళ్ళు ఆగిపోతాయి

గుండెచప్పుళ్ళు…. శ్వాస నిశ్వాసలు… చూపులు

అన్నీ…. అతి సహజంగా మారిపోతాయి

కానీ… నీ ఒకే ఒక్క మాట

అన్ని భ్రమలనూ తొలగించింది

పువ్వులు పెడమొహం చేయవు

కంటకాలు కొంగుల్ని లాగవు

ప్రేమకు బదులుగా

నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే!

కన్నీళ్ళు తుడుచుకుంటాయి

వెక్కిళ్ళు ఆగిపోతాయి!!

పూల చెవిలో

సీతాకోక చిలుక ఏదో చెప్తోంది

ఇక ఋతువును అర్థం చేసుకో!

అన్నింటితోబాటు వసంతం కూడా వచ్చేసింది

నువ్వు రాతిని తాకితే కూడా

దేవతలూ మారిపోతుఁది

నిన్న రేపటి పొరపాట్లన్నీ….

లోన దాగిన గాయాలన్నీ….

నిన్ను చూడగానే మాయమవుతాయి!

ప్రేమకి బదులుగా

నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే

నువ్వు రాతిని తాకితే కూడా

దేవతలా మారిపోతుంది!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us