మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

పొగమంచు భూతలం ( గేయం)

by Krishna Vaddepalli February 28, 2022
written by Krishna Vaddepalli

పొగమంచు తో భూతలం
ఆయెను అతి శీతలం
॥ పొగ..॥
ఉపతరిలపు ద్రోణియో
చలి గాలుల శ్రేణియో
ఉరుమనెంచు ప్రకృతి యో
ఉనికి నెల్ల వణికించెను !…
॥ పొగ..॥
విమల ధవళ వస్త్రంతో
విధిగా అగుపించునట్లు
దేశమెల్ల పొగమంచను
తెలిముసుగుతొ పలకరించె!
॥ పొగ..॥
హేమంతానికి ప్రేమగా
సీమంతం జరుపసాగె
“శిశిర” శిశువునే కనగా
ఋతుచక్రం తిరగ సాగె !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తరాల తరుణి

by Palleru Swamy February 28, 2022
written by Palleru Swamy

కలిసి నడిచే మనం-కాదులే చెరిసగం
పతిదేవుణ్ణి నేను-చరణదాసివి నువ్వు
ఆధిపత్యం నాది : నాదే పైచేయి
ధర్మపత్నివి నీవు- నీవే నీతల కొంత దించు
నిన్ను వీధిలో అమ్మే దృశ్యాల తాలూకు కమురు వాసన
నిన్ను జనారణ్యంలోనెట్టిన వెగటుదనం
జూదంలో ఒడ్డిన పురాణ మై తోస్తున్నది

పాతివ్రత్యం పరమ భూషణమనే పాత కథ విన్న చెవులు
కొత్త చరిత్రలేమి వింటాయి ?

అన్యమైనవో అనన్య సామాన్యమైన వో
నిను ఏం తీరున చూపెడతాయి
వంశాన్ని నిలబెట్టడమె
కదా నీ వంతు-మాంగల్యం తంతు
నటి గా సఖి గా దాసిగా దాదిగా నీకెన్నో రూపాలు
అయినా దూతికగా
నీజాతి తోనే నిను తార్చాలనుకుంటున్న
మాయాప్రపంచం లో నీవు

తననుగని పెంచేటి సామర్థ్యం నీకు
ఎంతున్నా
అబలవే అంటాడు
అపహాస్యం చేస్తాడు

శీల సంస్కారమే
తగునమ్మ నీకసలు అంటాడు తరుణీ అవే నీ నగలని నమ్మిస్తాడు
తన పనులు వికటించే దాకా
నిన్ను గుర్తింపు గుచ్ఛాలలో విరిసే
“ముగ్ధ”వే నీవంటు ముచ్చటగా పిలుస్తాడు

నీవు మరణిస్తే వేరొకతె నాకు సతి నేను చనిపోతేను సతి నీవంటు నీకు “బ్రతుకు చితి ” అనీ తీర్మానిస్తాడు

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక అందమైన కల…

by Butam Mutyalu February 28, 2022
written by Butam Mutyalu

ఒక అందమైన కల…

తుషార స్నాత ప్రభాత వేళ ఆత్మ యొక్క సుగుణం ఇంద్రజాల కిరణంలా శోభిల్లుతోంది

రేయంతా వెన్నెల కాంతులు వెదజల్లే దివిటీ యై నిరీక్షిస్తూ వీక్షిస్తూ కాలుతున్న హృదయం నుండి కరిగి కరిగి సుగంధాలు విడుదల అవుతోంది

మరియు ఆమె శీతల శిశీరంలో అవని దశదిశలా వసంతమై ప్రకాశిస్తూ మరులు గొలుపుతుంది

ఎద సముద్రమంత లోతు గలదై ఆకాశమంత విశాలమైనది ఇది ప్రేమ కు శక్తి కలుగ చేస్తుంది

జీవిత పరమార్ధం గ్రహించటానికి ఇంకేం కావాలి ఆమె ముఖారవిందం నిండు పున్నమి లా విరియగా
ఆమె చెలిమి తరం తరం నిరంతరం ఒక అందమైన కలగా మిగిలే వుంటుంది

ఆమె ప్రేమ అనునిత్యం వెన్నంటి మేల్కొలుపు తుంది

మది ఊయలలూపుతుంది. అదర మధుసేవనంలో మదురసాలను ఒలుకుతుంది…

February 28, 2022 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విద్వత్తు

by డా|| మృదుల నందవరం February 28, 2022
written by డా|| మృదుల నందవరం

ఈ సంచికలో మనం విద్వాంసుల తీరు ఏ విధంగా ఉంటుందో భర్తృహరి నీతి శతకం ద్వారా తెలుసుకుందాం.

శ్లో|| దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే

ప్రీతిః సాధుజనే, నయో నృపజనే, విద్వజ్జనే చార్జవమ్

శౌర్యం శ్రతుజనే, క్షమాగురుజనే, కాన్తాజనే ధృష్టతా

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోకస్థితిః

విద్వత్ పద్ధతిలోని ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు ఎలా అనువదించారో చూద్దాం.

చ. వరకృప భత్యులందు, నిజవర్గమునందనుకూలవృత్తి, కా

పురుషులయందు శాఠ్యము, సుబుదు్ధలయందనురక్తి, దాల్మి

ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబురాజుల

దరిజనులందు శౌర్యము, మృగాక్షులయందు బ్రగల్భభావవీ

వరుసగళా ప్రవీణులగు వారలయందు వసించులోకముల్

సేవకాజనము యందు అపారమైన ప్రేమ, బంధువుల యందు అనుకూలమైన ప్రవర్తనము, దుష్టజనుల యందు కాఠిన్యము, సజ్జనులయందు ఇష్టము, పెద్దలయందు సహనభావము, పండితుల పట్ల గౌరవము, రాజుల విషయంలో నిబద్ధతను, శ్రతువులయందు పరాక్రమము, స్త్రీలయందు నిగ్రహశక్తి – మొదలైన గుణములు ప్రదర్శించే కళల్లో ఎవరు నిపుణులో వారివల్లనే లోకము పురోగమిస్తుందని పై పద్యానికి భావము.

మానవుడు సమాజాన్ని విడిచి దూరంగా మనలేడు. జీవనం సాదదు కూడా. అందువల్ల పరిస్థితులనుబట్టి, వ్యక్తులనుబట్టి తన వ్యవహారశైలిని మలుచుకోవలసి ఉంటుంది. తన సేవకాజనము పట్ల దయాగుము కలిగి వారి అవసరములను గుర్తించవలసి ఉంటుంది. బంధువులను తగిన రీతిలో మన్నిస్తూ మసలుకోవాలి. చెడ్డవారితో కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి వారు దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉంటారు. వయసు మీద పడిన వారితో చాలా సమానంగా, వారికి వలసిన విధంగా మసలుకోవలసి ఉంటుంది. పండితుల యందు గౌరవభావాన్ని కలిగి ఉంటేనే మన సంస్కారభావం వెలికి వస్తుంది. అంతేకాక కొద్దొ గొప్పో మనకూ పాండిత్యం అబ్బుతుంది. రాజుల ఆజ్ఞలను శిరసావహిస్తూ, శ్రతువుల యందు పరాక్రమాన్ని ప్రదర్శించాలి. స్ర్తీలయందు ఇంద్రియ నిగ్రహము (పురుషుల యందు స్త్రీల) పురుషులు కలిగి ఉండాలి. ఇటువంటి నేర్పరితనము ఎవరిలో ఉంటుందో వారివల్లనే దేశాలు (లోకాలు) వృద్ధిలోకి వస్తాయి.

కవి మాటల వలన మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే – ఏ దేశమైనా విద్వత్తు కలిగిన వారివల్లే వృద్ధిలోకి వస్తుంది. చదవు వేరు విద్వత్తు వేరు. చదువు ఉండి, విద్వత్తు ప్రవర్తించలేనివారివల్ల దేశాభివృద్ధి, నాగరికత ఛిన్నాభిన్నమౌతాయి. కాబట్టి సదసతం వివేక చతురత కలిగినవారివల్లే పరిపాలన సుగమమవుతుంది. క్రింది నుండి ఉన్నత వర్గము వరకు ఎవరివట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసినవారే అసలైన విద్వాంసులు. వారితోనే మన సంస్కృతి, మన ప్రగతి ముడిపడి ఉంటుందన్నది వాస్తవం.

గౌతమబుద్ధుడు, స్వామి వివేకానందుని బోధనల్లోనూ అబ్దుల్ కలామ్ గారి ప్రసంగాల్లోనూ పై పద్యం యొక్క భావాలు మనం గుర్తించవచ్చు. సాటివారిపట్ల మిక్కిలిదయ, తమను ఆశ్రయించుకని ఉన్నవారి పట్ల ప్రేమ, దుర్మార్గులపట్ల జాగరూకత, అశక్తులైన పెద్దవారిపట్ల మన చేయూత, గురువులపట్ల గౌరవభావము, బ్మహ్మచర్యము, ఏ సమాజమైతే కలిగి ఉంటుందో, మానవసేవే మాధవసేవగా ఎవరు భావిస్తారో ఆ సమాజమే ముందుకు సాగుతుందని, వారే మహాత్ములుగా కీర్తింపబడతారని, వారు మన దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులని కలామ్ గారు అంటారు. ఆచరించి చూపారు కూడా.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ రుబాయిలలో మరణ తాత్వికత

by Sambaraju Raviprakash February 28, 2022
written by Sambaraju Raviprakash
మరణం ఏ కాలంలోనైనా ఎంతటి ధీరోదాత్తుడినైనా చలింప చేస్తుందనడానికి మన ప్రాచీన సాహిత్యంలో అనేక ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
“సంసారం జనన మరణ రూపమైనది .పూర్వకర్మవశాన జీవుడు శరీరాన్ని ధరించి దానిని విసర్జించే వరకు కర్మ చేస్తూనే ఉంటాడు .ఆ కర్మ ఫలితంగానే అతడు మరో శరీరాన్ని పొందుతాడు. ఇట్లా జీవుని యాత్ర నిరంతరమైంది . చక్రాకార మైంది.”వంటి ఎన్ని మాటలను చదివినా, జీర్ణించుకున్నా తన వరకు వచ్చేసరికి భయపడి పోవడం మనిషి సహజ నైజం. ఋగ్వేదం, భగవద్గీత ,కఠోపనిషత్తు, భారతం ,భాగవతం, రామాయణం, మరియు అనేక ప్రాచీన, ఆధునిక కావ్యాలతో పాటు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో జనన మరణాల గురించి కవులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మానవజాతికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
ప్రసిద్ధ కవి, అనువాదకులు, విమర్శకులు ఏనుగు నరసింహా రెడ్డి రచించిన “తెలంగాణ రుబాయిల”లోని మరణ తాత్వికత నన్ను ఎంతగానో ఆకర్షించింది .
536 రుబాయిల ఈ బృహత్ గ్రంథంలో  మరణాన్ని ఎంతో తాత్వికంగా చెప్పడం కనిపించింది. ఈ రుబాయిల ద్వారా  పుట్టుక ఎంత సహజమో మరణము అంతేనన్న ఎరుకను కవి మనకు కలిగించాడు. ఏనుగు నరసింహారెడ్డి తన రుబాయిలలో మరణాన్ని గానంచేస్తూ మన అందరిలో ధైర్యాన్ని నింపాడు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న నాలుగు క్షణాలలో సాధించవలసిన కార్యాలపై దృష్టి పెట్టమని బోధ చేసాడు. సామాన్యుడైనా, ఎంతటి మనగాడైనా,లేక ప్రతిభావంతుడైనా మరణానికి తలవంచక తప్పదని తెలిపాడు. “బలమే జీవనం- బలహీనతే మరణం” అంటూ వివేకానందునిలా మనలను జాగృత పరిచాడు. గహనమైన మృత్యు అంశాన్ని సులభమైన శైలిలో వ్రాసిన నరసింహారెడ్డి రుబాయిలు అందరము చదవదగినవి.
“పుట్టిన ఊరును వదలి పోతం
పెరిగిన పట్నము వదిలి పోతం
ముందు వెనకాల ముచ్చటేగాని
నడిచిన నేలను వదిలిపోతం”(155)
పై రుబాయిలో మనకు అర్థం కానిది ఏముంది. పుట్టిన చోటనే మనిషి గిట్టాలని లేదు. పెరిగిన చోట తరగడం కూడా ఉంటుంది ఏనాటికైనా నడిచిన చోటు విడిచిన చోటు కాక తప్పదు. కాకపోతే ఒకరి వంతు ఈరోజు అయితే మరొకరి వంతు రేపు. రేపో మాపో దేహం రూపు మాయక తప్పదనే భావన పై రుబాయిలో కనబడుతుంది.
“రాల చెక్కీ పోతడొకడు  బొమ్మ గీసి పోతడొకడు
పుడమి గర్భపు పూలనేరి
కావ్యమల్లీ పోతడొకడు”(178)
పై రుబాయిని చదవగానే నాతో పాటు మీకు కూడా ‘సత్య హరిశ్చంద్ర’నాటకం లోని ‘కాటిసీను’లో ఉన్న “ఇచ్చోటనే” అనే జాషువా ప్రసిద్ధ పద్యం గుర్తుకు రావడం సహజం. శిల్పికి ,చిత్రకారునికి, కవికే కాదు సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు మృత్యువు దృష్టిలో అందరూ సమానులే . అందుకే యముడిని ‘సమవర్తి’ అని అంటారు. శిల్పి, చిత్రకారుడు, కవి తమ శిల్పాల, చిత్రాల, కావ్యాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోతారు. అశాశ్వతమైన దేహం నశించినా శాశ్వతమైన చిరునామాతో వారు లోకంలో నిలిచిపోతారు. అలా నిలవడమే కదా కావాల్సింది.పై రుబాయి నిర్మాణంలో ఏనుగు చూపిన కౌశలం నన్ను ముగ్ధమనోహరున్ని చేసింది.”పుడమి గర్భపు పూలనేరి” అన్న మూడవ వాక్యం 1,2,4 వాక్యాలకు అన్వయం కావడం విశేషం. ‘పోతడొకడు’పద ప్రయోగం ఈ రుబాయిలో అద్భుతంగా కుదిరింది. ‘ఎప్పటికైనా పోయేదే’అనిt మరణం గురించి  సాధారణ జనం మాట్లాడుకునే సంగతి  అందరికీ తెలిసిందే. జనం నాడిని పట్టుకున్న కవి ‘పోతడొకడు’ అని నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇది ఎంతో సహజ సుందరంగా ఇమిడిపోయింది. సీస పద్యంలో జాషువాకున్న సౌలభ్యం రుబాయి ప్రక్రియలో నరసింహారెడ్డికి లేదు. అయినా ప్రక్రియపై పట్టున్న రచయిత కావడం మూలాన తాను అనుకున్న భావాన్ని తక్కువంటే తక్కువ పదాలలో ఇమిడించగలిగాడు. ఒక ప్రక్రియ మరో ప్రక్రియ లోకి మారడం మన సాహిత్యానికి కొత్తేమీకాదు. పురాణాలు కావ్యాలయ్యాయి.కావ్యాలు నాటకాలైనాయి. నాటకాలు కథలైనాయి.కథలు గేయాలైనాయి. ఇక్కడ పద్యం “రుబాయి” రూపం పొందింది. అద్భుత జనాదరణ పొందిన ఒక పద్యం అత్యాధునిక కవి చేతిలో  అంతే జనాదరణ పొందిన   మరో రూపంలోకి మారడం ఇక్కడ గమనార్హం.
“కోరుకొని ఇటకొచ్చినామా? మనకు తెలియదు
కోరినంతనే వెళ్ళగలమా? మనకు తెలియదు
నటన బాగా చేయవోయీ! పాత్రధారి
ఎపుడు వేదిక ఎటుల
దిగుదుమొ మనకు తెలియదు”(8)
జీవన రంగస్థలంలో మనం నటీనటులమే. మనకు ఇచ్చిన పాత్రను సరిగ్గా నిర్వహిస్తే అదే పదివేలు. సంచిత పుణ్య పాపకర్మలు మన తదుపరి జన్మకు కారణం అవుతాయని పెద్దలు చెప్తారు. కోరుకున్న జన్మను పొందుతామా… లేదా అనేది మనకు తెలియదు. పోతన కైవల్య పదాన్ని కోరుకున్నాడు. మరుజన్మ లేకుండా చూడమని చాలామంది భగవంతుని ప్రార్థిస్తారు. “మరణం అంటే పునర్జన్మకు సిద్ధం కావడం ” అని అరవిందులు చెప్పాడు. పై రెండు పరస్పర భిన్న అంశాలు.అయినా అవన్నీ మనకెందుకు?. జన్మించాము. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంది. “రాకపోకలు” మన ఆధీనంలో లేవు.
“మట్టి బొమ్మిది నమ్మ బోకండి  ఓ మనుజులారా! మాయమైపోతుంది చూడండి” అన్న గేయంలోని తాత్వికత మనకు అర్థం కావాలి. ఏ రూపంలో ఏ దిక్కు నుండి ఎప్పుడు ఎక్కడ  మృత్యువు మనలను కబళిస్తుందో  తెలియదు. తెలియని దానికి భయపడుతూ రోజూ చావును తలుచుకుని భీతిల్లడం అవివేకమని పై రుబాయి స్పష్టం చేస్తున్నది.
“కొండకు జ్ఞాపకం లేదు లావా జన్మ
మర్రికీ గుర్తుకు రాదు విత్తన జన్మ
మునుపు ఎక్కడో దాగిందో ఈ అంతరాత్మ
అసలు పసిగట్టలేనిదీ పూర్వజన్మ” (26)
“జన్మించిన వారికి మరణం, మరణించిన వానికి జన్మము తప్పదు. కాబట్టి మరణించిన వారి కోసం దుఃఖించకూడదు” అని భగవద్గీత చెప్తుంది. ఇలా చెప్పడంలో పునర్జన్మ ,పూర్వజన్మ అనే భావన ఉంది. లావా పూర్వజన్మ. కొండ ప్రస్తుత జన్మ. విత్తనం పూర్వ జన్మ. మర్రి ప్రస్తుత జన్మ. వాటికి పూర్వజన్మ జ్ఞానం లేదు .వాటికే కాదు. పూర్వజన్మ జ్ఞానం ప్రకృతిలో ఏ జీవజాలానికి లేదు .ఈ సందర్భంగా అరవిందుల వారి మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. “మరణమన్నది లేనట్లయితే ప్రాణి ఎల్లప్పుడూ ఒక రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ ప్రాణి జీవితం అసమగ్రమవుతుంది. మరణం వల్లనే ప్రాణి జీవితం సమగ్రమవుతుంది”. దీని ప్రకారం లావా కొండ కావడం, విత్తనం మర్రి కావడం సమగ్రం. సమగ్రమైనప్పుడే కదా జన్మ ధన్యం. ప్రాచీన సాహిత్యంలో పూర్వజన్మ వాసనలు కొందరికి ఉన్నట్లు రాశారు. ఈ కలికాలంలో మానవమాత్రులకు అది సాధ్యం కాదు. భూతకాల చింతన విడిచి వర్తమానంలో జీవించడమే మనకు ఇప్పుడు కావాల్సింది. “ఎన్నెన్నో జన్మల బంధం”అన్న పదబంధం ఎంత  ప్రసిద్ధమైందో మీకు తెలుసు కదా! దానిని చదివినప్పుడు పూర్వజన్మ ఏకవచనం కాదని, బహువచనమని తెలుస్తున్నది.
“ఇంటి నిండా బంధువర్గము ఒక్కరాపరు
ఊరినిండా మిత్ర వర్గము ఒక్కరాపరు
ప్రాణ దీపం శిథిలకాయము వీడిపోగా
జగతి నిండా ప్రేమ మూర్తులు ఒక్కరాపరు”
(43)
మనలోని ప్రాణాన్ని జ్యోతి రూపంగా భావిస్తాము. అది ఆత్మ యొక్క రూపం. ప్రాణాన్ని విడవడమంటే ఆత్మ జ్యోతి  దేహాన్ని వీడటమే. పై రుబాయిలోని సౌందర్యమంతా నాలుగో పాదంలో ఉంది.నాలుగో వాక్యం  చదివేసరికి మనం గొప్ప అనుభూతికి లోనవుతాం. ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, ఒక అల్లా ,ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక గురు గోవిందుడు, ఒక శిరిడీసాయి లేక అందరూ ప్రత్యక్షంగా  పక్కనే ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరని అర్థం చేసుకుంటే ఈ రుబాయి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది.ఎంతటి536 కరుణాహృదయుడైనా మరణం విషయంలో నిస్సహాయుడే కదా!.
“ఎన్నో  సందళ్ల నడుమ రోజు జారిపోతుంది
ఏ అలజడి లేకుండా శతాబ్ది దొర్లి పోతుంది
ఊదకుండానే ఆరిపోయే దీపం మనిషి
ఏ సడీ లేకుండా ఊపిరి ఆగిపోతుంది”. (74)
కాలం గడవడం అంటే జీవితం  కూడా గడవడమే కదా! జీవితం వెలుగుతున్న దీపం.ఏదో ఒకనాటికి ఆ దీపం ఆరిపోక తప్పదు.
దీప ప్రమిదలోని తైలం అయిపోయాక దానిని ఎవరు ఊదవలసిన అవసరం లేదు. చమురు నిండుకున్న తర్వాత దీపం ఎంత నిశ్శబ్దంగా ఆగిపోతుందో, జీవశక్తి నశించిన దేహంలోని ఆత్మ జ్యోతి అంతే నిశ్శబ్దంగా దేహాన్ని వీడుతుంది. చుట్టూ ఎంత మంది ఉన్నా  పోయే ప్రాణాన్ని ఆపలేరు.  పై రుబాయి లోని ‘రోజు’,’శతాబ్ది’ కాల వాచకాలు. కాలానిది కరిగిపోయే లక్షణం. పుట్టిన మనిషి కాలంతోపాటు కొంత దూరం నడిచి అస్తమిస్తాడు. కాలాన్ని ఎవరు ఆపలేనట్లుగానే మరణాన్ని ఎవరూ ఆపలేరు. మనిషి చనిపోవడాన్ని “కాలం చేశాడు” అని కూడా అంటారనే విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
“శ్వాస తీసినన్నినాళ్ళు సౌఖ్యంగా ఉండాలి ఊపిరున్నన్నాళ్ళూ ఉత్సాహముండాలి
కాయలన్నీ చెట్టు వీడుననితెలుసు
పండు రాలేదాక పుండు రాకుండాలి”. (31)
పుట్టుక ,చావుల మధ్య క్షణభంగురమైన జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు కవి జవాబులా కనబడుతుంది ఈ రుబాయి. ఇందులోని మూడవ వాక్యం తాత్వికతతో నిండి ఉంది. “పండు రాలేదాకా పుండు రాకుండా ఉండాలి” అన్న కవి ఆకాంక్ష ఆయన స్వీయ వేదనలోంచి పుట్టింది. తెలంగాణ రుబాయిలు రాస్తున్న  సమయంలోనే నరసింహా రెడ్డి గారి బావమరిది క్యాన్సర్ మహమ్మారితో మరణించాడు. క్యాన్సర్ పుండుతో తన బావమరిది తల్లడిల్లి పోయిన నరక క్షణాలను కళ్ళారా చూశాడు కవి. అందుకే శత్రువుకు కూడా
ఇటువంటి బాధ రావద్దని కోరుకున్నాడు.
‘చిలుక ఈ చెట్టు నుండి ఎగిరి పోతుంది'(147), ‘ప్రతి వస్తువు మృత్యు దిశన  పరుగులిడును కాదె'(241), ‘సమయమెళ్ళిపోతుంది ఎలా ఎలా ఆపను’ (87), ‘వికసించిన ప్రతీ మొగ్గ వాడిపోవును ‘(80), ‘ఎట్ల నైనా కాడి ఎత్తేయవచ్చు'(58) మొదలైన  రుబాయిలలో కూడా మరణ తాత్వికత మనకు కనబడుతుంది. “తెలంగాణ రుబాయి”ల లోని వస్తువైవిధ్యంలో మరణ భావన చోటు చేసుకోవడం, తాత్వికంగా అది అభివ్యక్తం కావడం, సులభశైలిలో క్లిష్టమైన భావనలను పాఠకులకు అందించడం కవి రచనా శక్తిని ,పరిశీలనాసక్తిని తెలుపుతున్నవి. అందుకే పాఠకుల విశేష ఆదరణను అవి పొందుతున్నవి.
“జీవమన శరీరమున నేమో వచింతు
విసురు గాలిది ఇటు దూరి వెడలెనటుల”
పాలమూరు ప్రసిద్ధ కవి కీర్తిశేషులు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి గజల్ అనువాదమైన “ముక్త గీతికల”లోని ఒక గజల్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
February 28, 2022 3 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక శీతకాలపు సాయంత్రం

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు February 28, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,

వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది

గుడిసె కప్పు మీద గలగలమనే

ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ

కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ

అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం

 

వంటగదిలో భయంకరమైన చీకటి,

ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…

ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!

మాట నుడివి మౌనాన్ని ఛేదించు

తుఫాను రోదన నీ కనురెప్పల్ని

భారంగా మూసేసిందా?

రాట్నపు మృవైన రొద

నీకోసం జోలపాట పాడిందా?

 

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా

అన్నీ మరచి గానం చెయ్

వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో

ఆలపించే పాటను పాడవా?

 

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,

వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

 

రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్

ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి

తెలుగు సేత: ఎలనాగ

 

***

 

 

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

‘అనువాద కుసుమాలు..’

by Jwalitha February 28, 2022
written by Jwalitha

1930లో జన్మించి తన పద్దెనిమిదవ ఏట కవిత్వం ప్రారంభించి 1993లో నోబుల్ బహుమతిని పొందిన డెరెక్ వాల్కాట్ కవితలు ఈ ఫిబ్రవరి 2022 ‘అనువాద కుసుమాలు..’

మరణశాసనం

మనోవేదనంతా రెండు పద్ధతులతో మెలితిప్పుతోంది

ఒకటి అద్దెగుర్రాలను అనుసందానించిన గద్యం ,

నేను సంపాదించిన నా బహిష్కరణ.

మసకవెన్నెల ప్రకాశంలో సుదీర్ఘ సముద్రతీరాన ప్రయాసతో ప్రయాణం

కమిలి, కాలిన

చర్మాన్ని విడిచి

ఈ సముద్రపు ప్రేమ – అదే స్వీయ ప్రేమ.

మీ మాటలను మార్చుకోవాలంటే.. మీ జీవితాన్ని మార్చుకోక తప్పదు.

పాత తప్పిదాలను సరిదిద్దలేను నేను

అలలు దిగంతాలను అలంకరించి తిరిగి వస్తున్నాయి

సముద్రపు కాకులు అరుస్తున్నాయి ఛాందసపు మాటలతో

ఎగువ రేవులో కుళ్ళిపోతున్న దోనెలు

విషపుముక్కుల పక్షులగుంపులతో ఆ ద్వీపాంతరం నిండిపోయింది..

ఒకప్పుడు దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, ఇప్పుడు, నేను వేరే మార్గం ఎంచుకున్నా, స్థలమే లేదు ఆ దోనెలో

నేను ఎదురు చూశాను కుక్కల వంటి ఉత్తమ మేధావుల

రవ్వంత సహాయం కోసం

నాకు వయసు మీద పడుతుండగా, కాలిన చర్మం

కాగితం వలె నా చేతి నుండి రాలుతుంది,

సన్నని ఉల్లిపొరలా

*పీర్ జింట్ చెప్పే పొడుపు కథల వలె

హృదయంలో ఏమీ లేదు,

చావును గురించి భయం కాదది.

ఎందరో చనిపోయారని నాకు తెలుసు.

వారందరూ సుపరిచితులే, అన్ని పాత్రల్లో ఉన్నారు,

కానీ.. అగ్నిలో వారు ఎలా మరణించారు..,

ఆ దేహాలకు ఇక పై ఏ భయాలుండవు

కొలిమిలా మండే భూమి వలన

ఆ సూర్యుని బట్టీ వంటి బూడిదకుప్ప,

ఈ మేఘావృతమైన, మేఘరహితమైన నెలవంక ప్రకాశంతో

ఈ రేవు మళ్లీ ఖాళీ పేజీలాగా తెల్లగా మారుతుంది

దాని సమానత్వమంతా  అసమాన ఆగ్రహమే.

(*పీర్ జెంట్ నార్వేకి చెందిన కవి, నాటకకర్త)

***

ఆంగ్ల మూలం: డెరెక్ వాల్కాట్ట్ (Derek walcott)

తెలుగు సేత : జ్వలిత

Codicil

Schizophrenie, wrenched by two styles, one a hack’s hired prose, I earn my exile. I trudge this sickle, moonlit beach for miles,

tan, burn

to slough off

this love of ocean that’s self-love.

To change your language you must change your life.

I cannot right old wrongs.

Waves tire of horizon and return.

Gulls screech with rusty tongues

Above the beached, rotting pirogues,

they were a venomous beaked cloud at Charlotteville.

Once I thought love of country was enough, now, even if I chose, there’s no room at the trough.

I watch the best minds root like dogs

for scraps of favour.

I am nearing middle

age, burnt skin

peels from my hand like paper, onion-thin

Peer Gynt’s riddle.

At heart there’s nothing, not the dread

of death. I know many dead.

They’re all familiar, all in character,

even how they died. On fire,

the flesh no longer fears that furnace mouth

of earth,

that kiln or ashpit of the sun

nor this clouding, unclouding sickle moon

whitening this beach again like a blank page.

All its indifference is a different rage.

***

ముగించబోతున్నాం

నేను నీటిపై జీవిస్తున్నాను,

ఒంటరిగా.. భార్యా పిల్లలు లేకుండా..

నేను ఈ స్థితికి రావడానికి చుట్టుముట్టిన ఎన్నో కారణాలు

చుట్టూ బూడిద నీరున్న చిన్న ఇల్లు,

పాత సముద్రపు దిశగా ఎల్లప్పుడూ తెరిచుండే కిటికీలు, అలాంటి వాటిని మనమెప్పుడూ కోరుకోము,

కాని మనంతట మనమే తయారు చేసుకున్నవవి.

మేము బాధపడుతున్నాము..,

సంవత్సరాలు గడుస్తున్నాయి,  సరుకులు దింపుతుంటాం,

కానీ మన అవసరానికి కాదు

సమస్యలలో… ప్రేమ అనేది పాలిన నీటికింద సముద్రగర్భంలో స్థిరపడిన రాయి.

ఇప్పుడు, నాకు ఏమీ అవసరం లేదు

కవిత్వం నుండి నిజమైన అనుభూతి కానీ,

జాలి లేదు, కీర్తి లేదు, చికిత్స లేదు. నిశ్శబ్దంగా భార్య,

మేము బూడిద నీటిని చూస్తూ కూర్చుంటాము,

మరిక అతి మామూలుగా జీవితంలో కొట్టుకు పోతూ చెత్తతో నిండిపోయి శిలల్లా జీవిస్తూ..

నేను అనుభూతిని మరచిపోవాలి,

నా బహుమతిని మరచిపోవాలి,

అది నాకు జీవితంలో అన్నిటి కంటే పెద్ద కష్టం..

***

ఆంగ్ల మూలం: Derek Walcott

తెలుగు సేత: జ్వలిత

Winding Up

I live on the water,

alone. Without wife and children.

I have circled every possibility

to come to this:

a low house by grey water,

with windows always open

to the stale sea. We do not choose such things,

but we are what we have made.

We suffer, the years pass,

we shed freight but not our need

for encumbrances. Love is a stone

that settled on the seabed

under grey water. Now, I require nothing

from poetry but true feeling,

no pity, no fame, no healing. Silent wife,

we can sit watching grey water,

and in a life awash

with mediocrity and trash

live rock-like.

I shall unlearn feeling,

unlearn my gift. That is greater

and harder than what passes there for life.

****

డెరెక్ వాల్కాట్ ఇరవయ్యవ శతాబ్దపు కవి, అతను జనవరి 23, 1930న లెస్సర్ యాంటిల్లెస్‌లోని సెయింట్ లూసియా ద్వీపంలో జన్మించాడు. అతను కవలశిశువుగా జన్మించాడు. అతని తండ్రి, పెయింటింగ్ చేసేవాడు కవిత్వం రాసేవాడు, డెరెక్ మరియు అతని కవల సోదరుడు ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అతడు మరణించాడు.

అందువల్ల, కుటుంబం సభ్యులు  చెప్పిన కథలు తప్ప వాల్‌కాట్‌కు తన తండ్రి గురించి ఏమీ తెలియదు. అతని తల్లి కళలను ఇష్టపడే ఉపాధ్యాయురాలు. ఆమె తన పిల్లలకు కవిత్వం చెబుతుండేది. తన జీవితంలోని ప్రారంభ దశల్లో, వాల్కాట్ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు మరియు కొన్నింటిని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఈ కష్టాలలో కొన్ని ఎంపిక చేయబడినవే అతని కొన్ని కవితలకు ప్రేరణగా మారాయి. ప్రత్యేకించి, వాల్కాట్ యొక్క నానమ్మ అమ్మమ్మ బానిసత్వ యుగంలో జీవించారు.  బానిసత్వం గురించి అతను తన రచనలలో చాలాసార్లు ప్రస్థావించాడు. అతని తల్లి స్థానిక మెథడిస్ట్ చర్చిని నడిపించడంలో నిమగ్నమై ఉంది, అయితే అక్కడి ప్రధానమైన కాథలిక్ సంస్కృతితో కుటుంబం మసకబారినట్లు భావించింది.  అతను రాయబోయే కవిత్వంపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది, అలాగే సాధారణంగా వాల్‌కాట్ విద్యాభ్యాసం సెయింట్ మేరీస్ కళాశాలలో గడిపిన సమయం, అతను వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయం కళాకారుడిగా అతనికి స్ఫూర్తిదాయకంగా నిరూపించబడింది. కళ పట్ల ఉన్న ఈ అభిరుచి అతన్ని థియేటర్, ఆర్ట్ క్రిటిక్‌గా ఉద్యోగం చేయడానికి 1953లో ట్రినిడాడ్‌కు వెళ్లేలా చేసింది. అతని మొదటి ప్రధాన సాహిత్య విజయం 18 సంవత్సరాల వయస్సులో వచ్చింది, అతను తన తల్లి నుండి డబ్బు తీసుకున్నాడు మరియు యంగ్ XII కాంటోస్ (1949) కోసం 25 కవితలు (1948) మరియు ఎపిటాఫ్‌ను స్వయంగా ప్రచురించాడు. సుమారు ఆరు సంవత్సరాలు ట్రినిడాడ్‌లో నివసించిన తర్వాత, వాల్‌కాట్ ట్రినిడాడ్ థియేటర్ వర్క్‌షాప్‌ను స్థాపించాడు.  అతని నాటకాలలో ఎక్కువ భాగాన్ని తయారు చేస్తుంది, దీని తరువాత, వాల్కాట్ తన సమయాన్ని చాలావరకు ప్రయాణాలలో గడిపాడు.

ఆ తర్వాత అతడు ప్రపంచం మరియు కరేబియన్ సాహిత్యానికి ఒక సాంస్కృతికవేత్తగా మారాడు. అతను బోస్టన్ యూనివర్శిటీలో సాహిత్యం యొక్క ప్రొఫెసర్‌గా బోధిస్తూ గడిపాడు. 1992లో అతని సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకోవడమే ఇప్పటి వరకు ఆయన సాధించిన గొప్ప విజయం.

***

ఇష్మెంట్ టు డా 1992లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

కవిత్వం

డెరెక్ వాల్కాట్ రచనలలోని సాధారణ ఇతివృత్తాలు కరేబియన్ సంస్కృతి మరియు చరిత్రపై దృష్టి కేంద్రీకరించబడింది, వలసవాదం యొక్క ప్రభావాలు, భాషతో సంబంధం తెలుస్తోంది. అతను కొన్నిసార్లు ఇంగ్లీష్ నుండి కరేబియన్, పాటోయిస్ నుండి ఫ్రెంచ్ వరకు మిక్స్ భాషలను ఉపయోగించాడు. అదనంగా, వాల్‌కాట్ యొక్క కవిత్వం వివిధ కాలాల ప్రదేశాలలో విస్తరించి ఉంటుంది మరియు కరేబియన్‌లోని సంస్కృతులు మరియు ప్రజల మధ్య సంక్లిష్టమైన సంబంధాలను చూపే సంఘటనలుంటాయి.

“ది సీ ఈజ్ హిస్టరీ” అనే కవితలో వాల్కాట్ నాటి భయానక పరిస్థితులను పరిశోధించడం ద్వారా ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించి కరేబియన్ చరిత్రను వివరించగలిగాడు.

ఈ కాలపు చరిత్ర చాలా వరకు సముద్రంలో బంధించబడిందని, “ఆ గ్రే వాల్ట్‌లో” మరణించిన ఆఫ్రికన్ ప్రజల జీవితాలలో: బానిస ఓడలు  మిడిల్ పాసేజ్ లో మునిగిపోయాయని ఆయన సూచించారు. వాగ్దాన భూమిని వెతుకుతూ బైబిల్ (నిర్గమకాండము)లో యూదుల పారిపోవడానికి బలమైన పోలికలను కూడా తన కవిత్వం లో చెప్పాడు.

***

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జాబులో అడుగుల జాడ

by Cheedella Seetha Lakshmi February 28, 2022
written by Cheedella Seetha Lakshmi

గురజాడ అడుగుజాడ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.లేఖల్లో వెతుకుదాం.

ప్రముఖ కవి,నాటక కర్త,కథా రచయిత,సంఘసంస్కర్త,
వ్యావహారిక భాషా ప్రచారకులు, ముత్యాలసరం అనే పేరుతో కొత్తదైన మాత్రాఛందస్సును సృష్టించి తరువాతి కవులకు మార్గదర్శకుడై తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని గురజాడ- అడుగుజాడ అని కీర్తి గడించి నాది ప్రజల ఉద్యమం అని చాటి చెప్పిన ప్రజానాయకుడు,అభ్యుదయ కవి,ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ వెంకట అప్పారావు పంతులు.

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ అని నినదించి దేశాన్ని ప్రేమించమని చెప్తూ దేశభక్తిని చాటిన గురజాడ 1862వ సంత్సరం సెప్టెంబర్ 21వ తేదీన యెస్ రాయవరం గ్రామం విశాఖపట్టణం జిల్లాలో వెంకటరామదాసు,కౌసల్యమ్మ దంపతులకు జన్మించాడు.

తండ్రి విజయనగరం సంస్థానంలో ఉద్యోగ జీవితం నిర్వహించి కన్నుమూశాక అప్పారావు గారు విజయనగరం వచ్చి వారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుండగా అక్కడ ఎం.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రి చేరదీశారు. 1882లో మెట్రిక్కులేషన్,1884లో ఎఫ్.ఏ.చేసి అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన తర్వాత బి.ఏ చదువుతుండగా సహాధ్యాయి గిడుగు రామమూర్తితో స్నేహం కొనసాగి ప్రాణస్నేహితులయ్యారు. వివిధ ఉద్యోగాల్లో తనదైన ముద్రవేసి,రచనా వ్యాసంగం కొనసాగించి ,అభ్యదయకవిగా సంఘసంస్కరణే ప్రధాన భూమికగా రచనలు చేసిన మహాకవి గురజాడ 1915 వ సంవత్సరంలో తన 53 వ యేట తనువును చాలించినా ఆయన రచనలు మన అందరిని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

అప్పారావు గారికి సమకాలికులు వ్రాసిన లేఖల వల్ల, అప్పారావుగారే స్వయంగా సమకాలికులకు,మిత్రులకు,సన్నిహితులకు వ్రాసిన లేఖల వల్ల వ్యక్తిగత విషయాలు,అభిప్రాయాలు,
వివేచనాశక్తి,విమర్శనా పద్ధతులు,రచనా విశేషాలు నాటి సమాజపరిస్థితులు,ఆయన ఖచ్చితమైన దృక్పథం మొదలైన అనేక విషయాలు తెలుసుకోవచ్చు.పంతులు గారి స్వభావం లేఖల వల్ల విదితమౌతుంది.

పాఠ్యపుస్తక నిర్ణయంలో కానీ, రచనలో వ్యావహారిక భాషను ప్రయోగించడంలోగాని అనేక నూతన సంస్కరణలను చేపట్టాడు గురజాడ.

మిత్రునికి వ్రాసిన లేఖవల్ల గురజాడ ఉద్యోగ జీవితం,సాహిత్యకృషి తెలుస్తుంది.మీ కృషిని గురించి వివరించండి అని మిత్రుడు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాస్తూ “ఎవరి కృషిని వారు చెప్పుకోవడం బాగుండదు.బాగుండని పని మీరు నా చేత చేయిస్తున్నారు” అని సవినయంగా చెప్పుకున్నప్పటికీ ఆయన నిర్వహించిన పాత్ర ఎంత సమగ్రమైనదో తన మాటల్లోనే వ్యక్తం చేశాడు. “సిండికేటు సభ్యులందరికీ నేను తెలుసు. నా కృషి ఏమిటో తెలుసు.నా సాహిత్య కృషి ఎందుకు అడగడం” అని ప్రశ్నిస్తాడు.ఒక వాక్యం వ్రాయనివారు, ఒక పుస్తకం కూడా ప్రచురించని పండితులు మనలో చాలామంది వున్నారు.” సృజనాత్మక శక్తికి పాండిత్యానికి భేదం చాలా ఉంది.ఒక కళాశాలలోనో,పాఠశాలలోనో పండితునిగా వున్నంత మాత్రాన తానొక కవిననుకోవడం ఎవరికీ భావ్యం కాదు” అని అంటూనే ” ప్రతి పండితుడు తానొక వచన రచయితననో,కవిననో భావించడం మన దేశ దౌర్భాగ్యం…. పనికిమాలిన పాండిత్యంతో కవిత్వం మీద విరుచుకుపదుతున్నారు.” అని విమర్శిస్తాడు.నాటి సమాజంలో కొద్దిగా తెలిసినవారైనా సరే పండితుడైనా సరే కవినని చెప్పుకుని తిరిగేవారు.ఏదో కవిత్వం రాసి మిడిసిపాటు పడే వారిని చూసి సహించని గురజాడ పనికిమాలిన పాండిత్యంతో కవిత్వంపై విరుచుకు పడుతున్నారని దెప్పిపొడిచాడు.పండితులపై ఒక విసురు విసిరి నిరసిస్తూనే తన గురించి గొప్పచెప్పడం మంచిది కాదనే చెప్తూ మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నానని తన ఉద్యోగ వివరాలను తెలియపరచాడు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో కొన్ని సంవత్సరాలు ఉపన్యాసకుడుగా పని చేసినప్పుడు అక్కడ విద్యార్థులకు ఇంగ్లీషు,హిస్టరీ,సంస్కృతం బోధించేవాడు.తర్వాత విజయనగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా కొంతకాలం కృషి చేశాడు.విజయనగరంలో ” ప్రకాశిక” అనే పత్రికను నెలకొల్పి సంపాదకునిగా వున్నాడు.
ఈ లేఖలోనే తన సాహిత్యకృషిని కూడా వివరిస్తూ కన్యాశుల్కం,బిల్హణీయం నాటకాలు,నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు మొదలగు గేయాలు,ఆంధ్ర భాషా సాహిత్యంపై కొన్ని వ్యాసాలు,విమర్శలు “ఆంధ్రపత్రిక,కృష్ణాపత్రిక,కేసరి,
శశిలేఖ,ఆంధ్ర ప్రకాశిక ” మొదలగు పత్రికల్లో ప్రచురించినట్లు తెలిపాడు. ఉత్తరాలవల్ల గురజాడ వ్యక్తిత్వం నిర్మొహమాటంగా ,ముక్కుసూటిగా వుండేవాడని తెలుస్తుంది.

విజయనగరం మహారాజా వారి సంస్థానంలో శాసన పరిశోధకునిగా వుండి చేసిన సేవ కొనియాడదగింది.గురజాడ స్వయంగా వ్రాసిన లేఖలో శాసనాల వల్ల భాషా స్థితి,లిపి స్వభావం ,అనేక రాజుల చరిత్ర తెలుస్తుందని,శాసనాలను ప్రకటించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించాడు.భారతదేశంలో భాషా పరిశోధనా రంగం మరుగున పడిపోయిందనే బాధను వ్యక్తం చేశాడు.” ప్రాచీన భాషను మాండలిక భాషను పరిశీలించడం ఎంత ఉపయోగమో తెలుగు రచయితలు గుర్తించడం లేదు.దురదృష్టవశాత్తు ఈ కృషికి సి.పి.బ్రౌన్ మొదటివాడు.ఆఖరివాడు కూడా. తమిళమున అలాగ కాదనుకుంటాను” అని పరిశోధనా రంగంలో,భాషా పరిశోధనలో తెలుగువారి చాతగానితనాన్ని దుయ్యబట్టాడు.సి.పి బ్రౌన్ ను శ్లాఘించాడు.

శాసన పరిశోధనలో కష్టనష్టాలను ,చేసిన శ్రమను,అనుసరించాల్సిన పద్ధతులను లేఖల్లో సూచించాడు.తరువాతి తరం వారికి ఉపయోగపడే రీతిలో భద్రపరచాలని సూచనలిస్తూ పరిశోధనా రంగంలో అభివృద్ధి పొందాలని ఆకాంక్షించాడు. “జయవూరు చరిత్ర” గురించి పరిశోధిస్తూ మహారాజా వారు ఆమోదించినట్లయితే ఒక వ్యాసం రాస్తానని ఆసక్తిని వెలిబుచ్చుతూ ఆయన పరిశీలనలో తేలిన అంశాలను లేఖలో వివరిస్తూ” పల్లవులది భరద్వాజస గోత్రము.వివాహ సంబంధము వలన పల్లవులకు చాళుక్యులకు బాంధవ్యము కల్గినది.ఈ సిద్ధాంతము రాజా వారికి అంగీకారమయితే నేను వ్యాసము వ్రాస్తాను” అని రాజావారి అనుమతి కోరాడు.

మద్రాసు విశ్వవిద్యాలయంలో సిండికేట్ మెంబర్ గా నామినేట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గురజాడకు లేఖ రాస్తూ E.W.మిడిల్ మాస్ట్ ” ఇందులో ఏ రాజకేయ కారణాలు లేవు.కేవలం మీ పాండిత్యాన్ని ప్రతిభను పురస్కరించుకొని నామినేటయ్యారు” అనడం వల్ల ఆనాడు విశ్వవిద్యాలయం కూడా గురజాడ ప్రతిభా పాండిత్యాన్ని గుర్తించి ఉన్నత స్థానం ఇచ్చిన విషయం విదితమౌతుంది. సిండికేట్ మెంబర్ గా,పాఠ్యపుస్తక నిర్ణయాధికారిగా ఉండి గురజాడ చేసిన కృషి,తీసుకున్న నిర్ణయాలు,ఖచ్చితమైన అభిప్రాయాలు,సూచనలు,ఆయన తీసుకొన్న చొరవ,ఉద్యోగనిర్వహణ బాధ్యత,వ్యావహారిక భాషావశ్యకతను గుర్తించి ప్రచారం చేయడం మొదలైనవి మిత్రులు గురజాడకు రాసిన ఉత్తరాల వల్ల తెలుస్తాయి.

పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను పెట్టడానికి ప్రోత్సహించిన వారిని విమర్శించాడు.గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో ” బడిలో వేసినప్పటినుండి చదువు పూర్తయ్యేవరకు కృతక గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను,పాఠ్యపుస్తకాలను చదవడం వల్ల మీరు పడికట్టు రాళ్లవంటి పదాలకు అలవాటు పడిపోయారు అంటూనే ” మీరు వ్రాస్తున్న దోషభూయిష్ట వచన గ్రంథాలను పఠించడం వల్ల యెస్ .యెస్.యల్.సి, ఇంటర్మీడియట్,బి.ఏ., ఎం.ఏ., విద్యార్థులు కూడా దోషభూయిష్టమైన భాషను అలవర్చుకుంటున్నారు.దృతముపై యడాగమాన్ని యథేచ్ఛగా వాడుతున్నారు.విసంధిని పాటించిన వచన గ్రంథాలను చదవడం వల్ల విద్యార్థులకు కావ్యశైలి అబ్బుతుందని మీ ఉద్దేశ్యమా? గ్రాంథిక వ్యాకరణం నేర్చుకోవడానికి అటువంటి పుస్తకాలు చదవాలి కదూ!” అని వ్యంగాస్త్రాన్ని ప్రయోగించారు.” గ్రాంథిక వ్యాకరణ యుక్త పదాలపై,వ్యవహారాల్లో నశించిన శబ్దాలపై రచయితకు మోజు వుంటే పద్యాలలో వాటిని ప్రయోగించి ఆనందించమనండి.కానీ వచనమైన వాడుకభాషలో వ్రాయవద్దా,వ్రాసి తీరాలి” అంటూ విద్యార్థుల పట్ల సానుభూతిని,వ్యవహార భాష పట్ల తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు గురజాడ. ఆనాడే వ్యావహారిక భాషలొనే పాఠ్య గ్రంథాలు,బోధన,పరీక్షాపత్రాలు వ్రాయడానికి అనుకూలంగా స్పందించిన విషయం సెనేట్ మెంబర్ గా తన బాధ్యతను ఎలా చక్కగా నిర్వర్తించాడో ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు.

ఇంకో లేఖలో విద్యార్థుల పక్షపాతిగా కనిపిస్తాడు.సమాధానపత్రాలు దిద్దడంలో పొరపాట్లు పడి దిద్దితే విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశముంటుందన్న అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు చూస్తే గురజాడ నిశితదృష్టి వ్యక్తమౌతుంది.” క్లాసికల్ తెలుగు పత్రాలను దిద్దిన సహాయ పరీక్షకులు శిష్ట వ్యావహారిక పదాలను వ్యాకరణ విరుద్ధప్రయోగాలుగా అపార్థం చేసుకుని,విద్యార్థులకు రావాల్సిన మార్కులను తగ్గించివేశారు” అని, వేదం వెంకటరాయశాస్త్రి గారికి రాసిన లేఖలో వ్రాస్తూ అభ్యర్థనలను ప్రోత్సహించాలన్న దృక్పథం కనిపిస్తుంది.మలయాళంలో ఎం.ఏ.లో కూచున్న అభ్యర్థు లేడుగురు ఉత్తీర్ణులయ్యారు.మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని అంటూ “సర్క్యులేషన్ పద్ధతి” లో అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తే బాగుంటుందని అన్నాడు.” సర్క్యులేషన్ పద్ధతి” అంటే ఒకరు వేసిన మార్కులు తమ అభిప్రాయాలతో పాటు ఇంకొకరికి పంపించి వారి సూచనలు తాము తెలుసుకోవాలి.మాట వరసకి నేను సమావేశానికి రాలేకపోతాను.మీరు, రామయ్యగారు నేను వేసిన మార్కులు మార్చితే బాగుండుననుకుంటారు.నా పరోక్షంలో నాతో సంప్రదించనిదే మార్కులు మార్చకూడదు.నాకు సూచన చేసే అవకాశం ఉండి తీరాలి” అని వివరించాడు.విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ అవాలన్న ఆకాంక్షతో పాటు విద్యార్థుల శ్రేయస్సును ఆశించాడు.ఎం.ఏ.లో ఇద్దరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని,మనం వారిని పాస్ చేయాలని కోరుతూ జయంతి రామయ్య పంతులుకు రాసిన లేఖలో ” రామయ్య గారికి ఇవాళ నేను ఫైనల్ లిస్ట్ పంపిస్తున్నాను.వాళ్ళకి చెరొక మార్కు వేస్తే ప్యాసవుతారు.అది వీరిద్దరి ఇష్టం” అని రాయడం వల్ల విద్యార్థుల పట్ల గురజాడ చూపిన ఔదార్యం,ఆదరభావం వ్యక్తమౌతుంది. జయంతి రామయ్య గారికి రాసిన లేఖలో మలయాళ భాషలో పరీక్షకు వెళ్లిన ఏడుగురు ప్యాసయ్యారని,” ఎం.ఏ.పరీక్షకు ఇది ఆఖరు సంవత్సరం కనక మనం విద్యార్థుల పట్ల సాధువుగా ఉండాలి” అని విద్యార్థులు ఫెయిల్ అవుతున్నందుకు విచారాన్ని వ్యక్రం చేస్తూ ” నేను దిద్దిన టెస్ట్ పేపర్లు మళ్ళా జాగ్రత్తగా చూశాను.కొన్ని మార్కులు కలపాలనిపించింది కలిపాను.కానీ టెక్ట్స్ పేపర్లో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్కమార్కు తక్కువ వచ్చింది. మీరు మీ పేపర్లలో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్క మార్కు తక్కువ వచ్బింది.మీ పేపర్లలో మీరు ఆ మార్కు ఇద్దరికీ అవకాశం ఉంటే కలిపి పుణ్యం కట్టుకోండి….నాతో మీరు,వేదం వేంకటరాయ శాస్త్రి గారు ఏకీభవిస్తే తప్పక మరిద్దరు అభ్యర్థులు ఉత్తీర్ణులౌతారు.అప్పుడు వారి సంఖ్య ఆరు అనడం వల్ల గురజాడకు విద్యార్థులపట్ల ఉన్న సహృదయ భావం అర్థం చేసుకోవచ్చు.విద్యార్థులు గట్టెక్కడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మేలు ఏ విధంగా చేశాడో తెలుసుకోవచ్చు.

పాఠ్యపుస్తకాలను నిర్ణయించడంలో కూడా చొరవ తీసికొని తన అభిప్రాయాలను లేఖా ముఖంగా వ్యక్తం చేశాడు. “ద్రవిడభాషల బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్ రామకృష్ణ పిళ్ళై” కి రాసిన లేఖలో పాఠ్య పుస్తకాల జాబితాను తయారు చేయడానికి తొందరపడి సమావేశాలలో నిర్ణయాలు చేయడం మంచిది కాదని సలహా ఇస్తూ బోర్డు వారు ముఖ్య విషయం గమనించాలని కోరుతూ “మెట్రిక్యులేషన్ పరీక్షకు వేసే పుస్తకాలు ప్రధానంగా ఆధునిక వచనంలో ఉండితీరాలి” అంటూ ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘ ఫిలిప్స్’ రాసిన లేఖలో ఇంటర్మీడియట్లో పాఠ్యపుస్తకాలు నిర్ణయించడంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ “పిల్లలపై మోపలేని భారాన్ని మోపకూడదు.ఒక ప్రాచీన కావ్యం,ఒక ఆధునిక గ్రంథం చెప్తే చాలును…తిక్కన విరాటపర్వ భాగాన్ని సూచించాను…బ్రౌన్ పరిష్కరించిన “వార్స్ ఆఫ్ ది రాజాస్ ” పఠనీయ గ్రంథంగా సూచిస్తూ ..వాస్తవిక జీవితంలో సంబంధం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ.అందులో ఇది ఒకటి. బ్రౌన్ అతి నేర్పుతో ఈ పుస్తకాన్ని పరిష్కరించారు.” అనడం వల్ల విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకున్న వాడుగా కనిపిస్తాడు గురజాడ..’ ఎస్.ఎస్.ఎల్.సి బోర్డు కార్యదర్శి మేడాక్స్ కు వ్రాసిన లేఖలో ” శాస్త్రీయమైన దృక్పథంతో భాషాతత్వాన్ని అవగతం చేసుకునే పండితులు దేశంలో లేరని” వాపోతూ ఇలా తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పారు. “థామ్సన్” గురజాడకు రాసిన లేఖలో “సంసారులు ,విద్యావంతులు మాట్లాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో వచన గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అంటూ గురజాడ వాదాన్ని ఆమోదించారు. పాఠశాలలో విద్యాబోధన పద్ధతులు విధిగా మారాలని ,అప్పుడే విద్యార్థుల స్థాయి పెరుగుతుందని,పాఠ్యపుస్తకాల్లో అశ్లీల శృంగారం ఉండరాదని విశ్వవిద్యాలయం నిర్దేశించిందని,వికృతమైన తెలుగు అపభ్రంశపు సంస్కృతం కలగాపులగం చేసి కొందరు రాసిన పుస్తకాలను విద్యార్థుల నెత్తిమీద మనం రుద్దకూడదు” అంటూ వేదం వేంకటరాయ శాస్త్రికి రాసిన లేఖలో తెలిపాడు.

విద్యార్థులను దృష్జిలో పెట్టుకుని పాఠ్యపుస్తకాల నిర్ణయంలో గురజాడ ఎన్నో సూచనలు,సలహాలను ఇచ్చాడు.స్పష్టమైన అవగాహన కలిగినవాడు.వ్యావహారిక భాషపట్ల ఎక్కువ మొగ్గు చూపాడు .అందరిని ఒప్పించిన ధీశాలి.

విజయనగర సంస్థానంలో కూడా వ్యవహార దక్షునిగా సలహాలనందించి ఖ్యాతి గడించినట్లు ,మంచి పలుకుబడి,గౌరవం ఉన్న వ్యక్తి అనడానికి లేఖలే నిదర్శనం. రాజకుటుంబాల దావా విషయంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచించి సాక్ష్యం చెప్పడం వలన కలెక్టర్ ‘ పౌలర్ దొర’ గురజాడకు స్వయంగా రాసిన ఉత్తరంలో ” సంస్థానానికి అతి నమ్మకంతో మీరు చేసిన సేవ,మేలు మరువరానిది.తంత్రాలకు మీరు ఆమడ దూరం.మీది కేవలం ఋజుమార్గం.మీరు కావించిన సేవకు ప్రతిఫలం అందించే మహద్భాగ్యం నాకు పట్టింది” అని రాయడం వల్ల గురజాడ వ్యక్తిత్వం,ముక్కుసూటిగా పోయే చక్కని శీలసంపన్నుడు అని తెలుస్తుంది.

మహారాణి లలితా కుమారికి గురజాడ పట్ల గౌరవం,వాత్సల్యం,అభిమానం,చిత్తశుద్ధి,ఔదార్యం మొదలైనవి ఉన్నాయని విశాఖపట్నం పెద్దాసుపత్రి సర్జన్ కు ఆమె స్వయంగా రాసిన లేఖ వల్ల తెలుసుకోవచ్చు.అప్పారావు గారి ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆందోళన చెంది ” మా ఆంతరంగిక కార్యదర్శి శ్రీ గురజాడ అప్పారావు గారు కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన ఇప్పుడే విశాఖపట్నం బయలుదేరారు.ఇక్కడకంటే అక్కడ వాతావరణం బాగుంటుందని,తగిన వైద్య చికిత్స లభిస్తుందని ఆశ. పి.టి.శ్రీనివాసయ్యంగారింట దిగుతారు. మీరు వెంటనే అక్కడికొకమారు వెళ్లి వారి శరీరస్థితి జాగ్రత్తగా పరీక్షించి కావాల్సిన ఔషధములు వాడుతూ కంటికి రెప్పవలె కాపాడుతారని నమ్ముతున్నాను.ఆయన ఆరోగ్యము ఎలా వుంటున్నది ఎప్పటికప్పుడు నాకు తెలియ చేస్తూ ‘ బిల్లు’ నాకు పంపండి.బిల్లు ఎంతయినా సరే మీకు నేను చెల్లిస్తాను” అనడం వల్ల రాణిగారికి గురజాడ పట్ల ఉన్న ఆప్యాయత, శ్రద్ధ ,గురజాడకు ఉన్న స్థానం స్పష్టమౌతుంది.

వ్యావహారిక భాష కోసం గురజాడ పడిన తపన, శ్రమ, రచనాపధ్ధతి,
ఆశించిన మార్పు లేఖలద్వారా ద్యోతకమవుతుంది.” జ్ఞానేంద్ర మోహన్ దాస్” లేఖలో గురజాడ ఆశయం ” నిఘంటువులు,పండితుల,వైయాకరణుల సహాయం,అవసరం లేకుండా చదవగానే అందరికీ అర్ధమయ్యే విధంగా,భాషను సంస్కరించవలెనని మీ ఆశయం.
అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము.మన దేశంలో ఋజువర్తనగల మీవంటి ధీశాలురు,భాషా సంస్కరణ సమస్యను తరచి తరచి అవలోకిస్తున్నారు” అని రాయడం వల్ల వ్యావహారిక భాష కోసం గురజాడ తపన గోచరిస్తుంది.

జ్ఞానేంద్ర మోహన్ దాస్ ,జె.వి.యేట్స్ వ్రాసిన లేఖల ద్వారా గురజాడ వ్యావహారిక భాషోద్యమానికి ప్రోత్సాహమిచ్చినట్లు తెలుస్తుంది.”థామన్స్” లేఖలో “సంస్కారులు ,విద్యావంతులు మాటలాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అని అభిప్రాయపడ్డాడు.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వ్రాసిన లేఖలో ” రాబోవు నంచికకు నూతన అభిప్రాయములతో మీరు ఏమైనా సూచనలు కావింపవేడుతున్నాను” అని వ్రాస్తూ ” భాష సజీవమైంది,సంఘం అభివృద్ధి చెందాలంటే భాషాసంస్కరణ కూడా జరగాలి.భాషా వికాసానికి ఏపద్ధతులు అమలు చేయాలో,ఉత్సాహవంతులైన వారిని చర్చలో పాల్గొనేలా చేయాలని ఉంటే మీ వలే క్షుణ్ణంగా నిశితంగా తరచి పరిశీలించే వారు అట్టే మంది లేరని నా అనుమానం” అని వ్రాస్తూనే సిద్ధాంతం కోసం పదప్రయోగం చేయొద్దని,వ్యావహారిక భాష పట్ల పక్షపాత వైఖరిని విడనాడి సహజ శైలిలో రచన చేయమని సూచిస్తూనే విమర్శించాడు,వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు .
గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో తన రచన పట్ల ఎంతో ధీమాను,విశ్వాసాన్ని,ప్రతిభను చాటుకున్నాడు గురజాడ.” తెలుగులో నవ్యరీతులకు,నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే.నా కావ్యకళ నవీనం,కావ్య యితివృత్తాలు భారతీయం.కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను.జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా,కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను.నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి ” అంటూ తన రచనా ప్రణాళికను,రచనా పద్ధతిని చెప్పుకున్నాడు గురజాడ.
ఇంకో ఉత్తరంలో ఆంగ్ల భాషాధిక్యం వల్ల ఇద్దరు మిత్రులు కలిస్తే ఆంగ్ల భాషలో మాట్లాడుకోవడం వల్ల ఇంగ్లీష్ లోనే ఉత్తరాలు వ్రాయడం వల్ల బహుభాషా సంకీర్ణమైన మన రాష్ట్రంలో “వాడుక భాషల సాహిత్యం పెంపొందడం లేదు” అని వాపోతాడు.

ముని సుబ్రహ్మణ్యంకు వ్రాసిన లేఖలో గురజాడ నా ఉద్యమం ప్రజల ఉద్యమం సంస్కృతీ పరుల భావ సంపద నాకు అండగా ఉంది.అసలు విషయాన్ని అర్థం చేసుకోజాలని ఎవరో కొందరు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా వ్యూహాలను పన్నినా లక్ష్యపెట్టక వాడుక భాషోద్యమాన్ని కొనసాగిస్తానని శపథం చేస్తూ గ్రాంథిక భాష వ్రాయడం కూడా ఓక వ్యసనమే” అంటాడు. “లలితమైన,సుందరమైన వాడుక భాషలో గ్రంథరచన కొనసాగించే సంప్రదాయమొకటి తలెత్తాలంటే నీవంటి యువకులు నాకవసరం” అంటూ యువతరాన్ని మేల్కొల్పాడు.వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఎంతో మంది విమర్శలకు సమాధానాలిచ్చాక “ఇన్నాళ్లకు వాళ్ళు నన్ను గౌరవించడం నేర్చుకున్నారనుకుంటాను” అని తన లక్ష్యసాధన పట్ల ఎంతో విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రాచీన “గ్రాంథిక భాషను వ్రాస్తామని దర్పానికి పోతూ వాడుక భాషను కృతకం చేసే రచయితలు నాకవసరం లేదు” అని గంట భజాయించి మరీ చెప్పాడు. కలెక్టర్ పౌలరు దొర వ్రాసిన జాబులో ” అందుకోదలచిన ఆదర్శాలు మీరు అందుకుంటారు.మీ కలలు నిజమౌతాయి” అన్న మాటలు వృధా పోలేదు.గురజాడ ఆశయాలు (సాహిత్య,భాషా విషయాల్లో )మార్పు నెరవేరి నేడు వ్యావహారిక భాషా స్థిరత్వం పొంది గురజాడ కన్న కలలు నిజమయ్యాయి.వాడుక భాషకు పట్టం కట్టడం జరిగింది.

గురజాడ మిత్రులకు ,సన్నిహితులకు వ్రాసిన లేఖలొకయెత్తు. మునిసుబ్రహ్మణ్యం గారికి వ్రాసిన లేఖలొక ఎత్తు. దీనిలో ఆయన హృదయం విప్పి విషయాలన్నింటిని కూలంకషంగా వివరించాడు.” రానున్న తరంలో యువకులు మాకన్నా సాహిత్య కృషి చేయగలరన్న” విశ్వాసాన్ని కనబర్చాడు.

ఇంకో లేఖలో ” కవితా న్యాయం నిన్నమొన్నటిలాగా నేడు లేదు.మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను…..అయినా మానవ సమాజం పట్ల నాకొక మహత్తరమైన బాధ్యత ఉంది.” అంటూనే ” తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు.నిజమైన, ఆరాధించ తగిన ప్రేమ ఏది? ” అని విశ్వప్రేమను చాటాడు.ఇతరులను ప్రేమించడం వల్ల నిరవధికానందం సిద్ధిస్తుందని అంటాడు.మనం ఒకరికి ఇచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను కొని తెస్తుంది”.మానవ ప్రేమ గురించి ఎంతో గొప్పగా వివరించాడు గురజాడ.

భారతదేశంలో సాహిత్య గ్రంథాలు కొనేవాళ్ళు తక్కువ.” పుస్తకాల చెల్లుబడి మందంగా ఉంది.ఒకరు ఒక పుస్తకాన్ని కొంటే దాన్ని ఎరువు తెచ్చుకొని చదివేవాళ్ళు ఇరవై మంది.మనది పేద దేశం” అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తూనే ఒక చురక అంటించాడు.నేటి పరిస్థితి అదే.ఒట్టిగా ఇచ్చినా చదవరు.
గురజాడ తన రచనల ఉద్దేశ్యాన్ని లేఖల్లో వివరించాడు.విజయనగరం మహారాజా వారికి వ్రాసిన జాబులో ” అనేక సంఘటనలతో నిండి ఉన్న ఎంతో గాంభీర్యమూ,వైవిధ్యమూ గల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కాల్పనిక కథలనుంచి రచయితలు ఇతివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్థం కాక నాకు ఆశ్చర్యం వేస్తుంది.ఈ కారణాల వల్ల నేను వాస్తవిక జీవితం నుంచి సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగు వాడుకభాషలో నాటకంగా రూపొందించాను” అంటూ ఆదిభట్ల నారాయణదాసు గారికి రాసిన లేఖలో తన కన్యాశుల్క నాటక గొప్పతనాన్ని చాటుకున్నాడు.
” ఇతివృత్త స్వీకరణలో,నిర్వహణలో,హాస్యరస పోషణలో,పాత్రోన్మీలనంలో తెలుగు సాహిత్యంలో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరువకండి” అంటూ తన రచనా ఔన్నత్యం పట్ల విశ్వాసాన్ని ప్రకటించాడు.
మధురవాణి పాత్రను సమర్థిస్తూ మునిసుబ్రహ్మణ్యం కు వ్రాసిన లేఖలో గురజాడ సానిపిల్లల్లో కూడా మానవత్వం ఉంటుందని,సానుభూతిని ప్రకటిస్తూ ఆ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చి దిద్దిన విషయంలో తీసుకున్న శ్రద్ధ ,సమాజాన్ని అవగాహన చేసుకున్న తీరును మనం కూడా గురజాడ నాటి సమాజ స్థితే కాదు నేటికాలంలో కూడా రచయితలకు ,కవులకు సమాజం పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.సమాజాన్ని చదవాలన్న హితబోధ చేశాడు గురజాడ.

“ఆమె సైతం ఒక మానవవ్యక్తి అనే మాటను విస్మరించకు.ఆమె విచారం,కన్నీళ్లు,సంతోషం,ఆనంద బాష్పాలూ నీ నా సుఖదుఃఖాల వంటివే.మన అనుభూతుల
వలె అని గణుతింపదగినవే,గంభీరమైనవే.వ్యభిచారమే తన వృత్తిగా ” లేబిల్ వేయబడ్డ భోగపడచు సమాజాన్ని మోసగించడం లేదు.ఆమెకు ఉన్న లేబిల్ దృష్ట్యా ఆమె జీవితం సరియైన త్రోవనే సాగుచున్నది.ఆమె ఏ వివాహ బంధనాలను,వైవాహిక సూత్రాలను ఉల్లంఘించడం లేదు” అని సానుభూతిని వ్యక్తం చేస్తూనే స్త్రీ పురుష శారీరక వాంఛలను గురించి,కామ ప్రవృత్తిని గురించి కావ్యేతివృత్తాలలో మార్పు కనిపిస్తున్నప్పటికీ సాహిత్యం కేవలం వీటితోనే ఎందుకు నిండి ఉండాలని ప్రశ్నిస్తాడు.మానవజీవితం కాని,సారస్వతంలో కానీ స్త్రీ పురుష శారీరకానుభవాలు ,వాటి వర్ణనలూ ఉచిత స్థానంలో ఉండాలని సూచించాడు.
” ఉదాత్త గంభీరభావాల అనుభూతులు ,అభివ్యక్తీకరణకు వాడుక భాష అన్ని విధాలా యోగ్యమైనదని చూడడానికి బిల్హణుని కథను నాటకంగా రచిస్తున్నాను.” అంటూ వాడుక భాష వలన ప్రయోజనం ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు.ప్రజలకు అర్థమయ్యేవిధంగా ఉండాలని,అప్పుడు వారి హృదయంలో హత్తుకు పోతుందని,చదవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందని గురజాడ అభిప్రాయం కావచ్చు.ఆర్భాటాలకు,
పటా టోపాలకు చాలా దూరం గురజాడ. వాస్తవికతకు ప్రాధాన్యతనిచ్చాడు.

‘ డామన్ పిథియస్ ‘ గురజాడ రచనను ప్రాచీన సంప్రదాయాలకు కట్టుబడిన పత్రికల వాళ్ళు సైతం ఎంతో మెచ్చుకుంటున్నారని వ్రాశాడు.

గురజాడ రచనలు నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు ఇవన్నీ ఆంధ్రభారతి పత్రికలో ప్రకటితమయ్యాయని తెలిపాడు.
ఆయన సాహిత్యకృషి కూడా మునిసుబ్రహ్మణ్యం కు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. ” నెల్లూరు జిల్లా వ్యావహారిక భాషా వ్యాకరణం నాకు అవసరం.నెల్లూరు జిల్లా వాడుకపదాలు,ముఖ్యంగా క్రియలు,క్రియాభేదాలు,విశిష్యములోని రూపభేదాలు తెలిపే ఒక పట్టికను తయారు చేసి పంపమని” వ్రాశాడు.మహాభారతంలో వ్యాకరణ విరుద్దప్రయోగాలను పంపించమని రాశాడు.
గురజాడ తన 21 వ ఏట ఆంగ్లంలో రాసిన సారంగధర పద్యాలను ” రీన్ అండ్ రయత్” పత్రికలో ప్రకటించగా చూసి చదివిన పత్రికాధిపతి ముఖర్జీ స్వయంగా గురజాడకు వ్రాసిన ఉత్తరం వల్ల యువకుడైన గురజాడలో మార్పువచ్చింది.

గురజాడ రచయితగా ఎదగడానికి,ఆత్మవిశ్వాసం పెరగడానికి యువకునిగా వున్నప్పుడు చక్కని సలహానిస్తూ 14/8/ 1883 సంవత్సరంలో వ్రాసిన ఉత్తరం అత్యంత కీలకమైంది. జలపాతాలను,ప్రవహించే సెలయేళ్ళను వీక్షించండి.మానవరూపంలో అరుదుగా అందంగా గోచరించే దైవాంశమును చూడడం మరువకండి.మీ హృదయాన్ని ఇతరుల హృదయాలను పరిశీలించండి.వాటి బలాన్ని,దౌర్బల్యాన్ని పరీక్షించండి.ఇతరులు సాధించిన గొప్పతనాన్ని తెలుసుకోండి కానీ ఇతరుల మీద ఆధారపడవద్దు.మీ ఆత్మశక్తి మీద మీరు విశ్వాసం ఉంచి అన్ని విధాలా దాని వికాసానికి కృషి చేయండి.”
” నిరంతర పఠనం అవసరం.మీరు అన్యభాషలో వ్రాస్తున్నారు కనుక
ఆ భాషపై సంపూర్ణ అధికారం మీకు సిద్ధించాలి. గొప్పగొప్ప కవులు తమ భావాలను ఎలా అభివ్యక్తి చేశారో ఆకళింపచేసుకోండి.భావవ్యక్తీకరణకు తగినంత శబ్దశక్తిని సాధించేవరకు మీ జీనియస్ కు సరిపడే నూతన మార్గాన్ని అన్వేషించేవరకు మీరు ఇతరులను అనుకరించవల్సిఉంటుంది ”
అంటూ ముఖర్జీ రాసిన మాటలు యువకుడైన గురజాడపై చెరగని ముద్రవేసి బాగా ప్రభావితుడు కావడానికి,యుగకవిగా రాణించడానికి,గురజాడ నూతన దృక్పథానికి తోడ్పడ్డాయని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మహామనీషి కావాలంటే పెద్దల మాటల చద్దిమూటలే మరి. ఆమాటలు గురజాడకే కాదు ఎప్పటి వారికైనా ఆమోదయోగ్యాలే.
ఏ రచయితకైనా శిరోధార్యమే.

కన్యాశుల్కం నాటకం ఆనాటి మహామహుల అభిప్రాయాలు

రెంటాల సుబ్బారావు గారి ఉత్తరంలో ” మీరు ప్రేమికులు.మీరు ప్రేమించడం ఎరుగుదురు.మీ నాటకంలో కొన్నిచోట్ల షాక్ లు వున్నా అవి చురకలు మాత్రమే” అంటారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
” మీ కన్యాశుల్కంలోని గిరీశం గూర్చిన కొంత భాగం ఆడినారు.పొట్ట చెక్కలగునట్లు నవ్వని వారు లేరు.అద్భుతముగా నున్నది.” అని వ్రాసారు.
కలకత్తా నుండి గురుదాస్ బెనర్జీ వ్రాసిన లేఖలో ” కన్యాశుల్క పీఠిక చదివి ఆనందించాను.నాకు తెలుగు భాష వచ్చిఉంటే మీ నాటకాన్ని చదివి ఉత్తేజితుడనై వుందును.నాకు మీ భాష రానందుకు విచారిస్తున్నాను.భావ ప్రేరణాత్మకముగా,ప్రతిభావంతముగా మీరు ఆంగ్లమున రచించిన నాటక పీఠికను చదివి ఆనందించాను.అనేక అమూల్య విషయములు గ్రహించగలిగాను.కన్యలను శుల్కములకు అమ్మజూపే దురాచారాన్ని మీరు ఖండించినందుకు సంతోషం.
ఈ దురాచారాన్ని మనువు సైతం నిరసించాడు.” అని వ్రాయడం వలన ఆనాడు కన్యాశుల్కం సమాజంలో ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు.

విమర్శ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా గురజాడ లేఖల్లో పేర్కొన్నాడు.మునిసుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో ” విమర్శించేటప్పుడు నీ అభిప్రాయాలు నిష్కర్షగా ఉండాలి.మొగమాటం వద్దు.నిష్కర్షగా వ్రాయకపోతే అది పాక్షికమే అవుతుంది.పాక్షికవిమర్శలకు విలువలేదు.నీ అంతట నీవే నిర్ధారించుకుని ముందుకు సాగాలి.మనకు అభిప్రాయ భేదం వస్తే రానీ.కొంప మునిగి పోదు.రచయిత తాను ఏది వ్రాసినా అందుకు ఒక సమర్థన వుందనుకుంటాడు.సబబైనది కానీ దానితో మీకు నిమిత్తం లేదు.
” ఒక కావ్యాన్ని చదివి దానిని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువకట్టే విమర్శకులు మనలో బహు అరుదు.ఇప్పుడు పత్రికలలో వెలువడుతున్న విమర్శలకు
నేనేమీ విలువ ఇవ్వను.నాగరికత,సంస్కారం,విజ్ఞానం గల నీ బోటి వ్యక్తుల అభిప్రాయమంటే నాకు విలువ హెచ్చు” అంటూ విమర్శ గురించి స్పష్టంగా వివరించాడు.
వేదం వేంకటరాయ శాస్త్రి గారి ప్రతారుద్రీయ నాటకాన్ని విమర్శిస్తూ ముని సుబ్రహ్మణ్యంకు రాసిన లేఖలో ” ఈ కాలంలో కొన్ని నాటకాల్లో కవితా ప్రౌఢిమ కల్పనా చాతుర్యము లోపించకపోయినా ప్రస్తుతం తెలుగులో వెలువడుతున్న నాటకాలన్ని ఒట్టి డొల్ల సరుకులు.చివరకు ప్రతాపరుద్రీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా అవి నాటక కథాగమన విస్తరణకు, పాత్రల పెరుగుదలకు ఉపకరించవు.అయితే నాకు బాగా నచ్చిన ఒక లక్షణం మాత్రం ఉంది.మన దేశ చరిత్రలో గుండెలను కదిలించే వృత్తాంతాన్నొకదాన్ని తీసికొని దానిని నాటకంగా మలిచేటప్పుడు ఈ కవి సాహిత్యాత్మక దేశభక్తి పూరిత కాల్పనిక వాతావరణాన్ని సృష్టించుకుని దానిని నేర్పుతో జయప్రదం చేశాడు.కాని నాటకంలో చారిత్రక చిత్రీకరణ మటుకు కేవలం అభూతకల్పన అసంభావిత విషయాలు సారస్వత కట్టుబాట్లను లైసెన్సును అతిక్రమిస్తున్నాయి.” అంటూ తన అభిప్రాయాన్ని ఉన్నదున్నట్లు వ్యక్తం చేశాడు.

గురజాడ నిరంతరం శ్రమ పడడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని జె.ఎ యేట్స్ ( 4/11/1915 ) నాడు రాసిన లేఖలో ” జబ్బుతో మంచాన పడ్డందుకు దుఃఖం వస్తోంది.అతి శీఘ్రంగా కోలుకొని మీరు ఆశిస్తున్నట్లు మీ ఆయుధాన్ని మళ్లీ మీరు చేత బుచ్చుకుంటారు.మీ ఆరోగ్యం ఎలా వున్నదో ఎప్పటికప్పుడు దయవుంచి నాకు తెలుపుతూ ఉండండి.మీ కృషి అనన్య సామాన్యమైనది.” అంటూ బాధను వ్యక్తం చేశాడు.. ఆనాడు కలెక్టర్,రాణిగారు లాంటి గొప్పవాళ్లకు కూడా గురజాడపై గల ప్రేమాభిమానాలు,గౌరవం ఎంత వుందో అందరి హృదయాలను అట్లా చూరగొన్న ఆ మహాకవి నవంబర్ 30 వ తేదీ 1915 సంవత్సరంలో తుదిశ్వాస విడిచాడు.

గురజాడ లేఖలను పరిశీలించినట్లయితే ఆయనొక సమర్థుడు,ఉత్తమఅధ్యాపకుడు,విద్యార్థులను ,సమాజాన్ని ప్రేమించేస్వభావం కలవాడు,నిరంతర కృషి,పట్టుదల,ఋజువర్తన,నిష్కళంకమైన వ్యక్తిత్వం కలవాడుగా కనిపిస్తాడు. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం గురజాడ మనమధ్యలో చిరంజీవిగానే ఉంటాడు. ఇట్లా సాహిత్యంలో గురజాడ లేఖలకు ఒక ప్రత్యేక స్థానముందని చెప్పవచ్చు.

February 28, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి (11,12,13 ప్రకరణములు) సమాప్తం

by రంగరాజు పద్మజ February 28, 2022
written by రంగరాజు పద్మజ

పదకొండవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[  నేడు  తప్పినది;  రేపు తప్పదు.]
శ్లో ॥ ” అస్మిన్ దినేనిష్ఫలతా భవేచ్ఛేత్
శ్వః సమ్యగేవ రచయామి నహిత్యజామి.”
— నవీన తపశ్విని.

భావం :–ఈ రోజున ప్రయత్నించిన కార్యం నిష్ఫలమయినా కానీ ,రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాను కానీ ,దాన్ని వదిలి పెట్టను..మరల మరల..సఫలం అయ్యేదాక ప్రయత్నిస్తూనే  ఉంటాను.
వ్యాఖ్య:–
రుద్రమదేవి నవలలోని ఈ కథాభాగానికి సరిగ్గా సరిపోయే అంశాన్ని ” నవీన తపశ్విని ” నుండి ప్రకరణాంశంగా తీసుకోవడం గ్రంథకర్త ప్రతినాయక లక్షణాలను చక్కగా వ్యక్తీకరిస్తూ… కథాగమనానికి ఎంతగానో తోడ్పడింది.
ఇలా పూర్వ కావ్యాలు, సుభాషితాలు.  హితోపదేశం వంటివి ప్రకరణానికి పేర్లుగా ఉపయోగించడం వల్ల పాఠకులకు ఆ యా విశేషాలు ఏ గ్రంధంలో ఉన్నాయనే ఉత్సుకతతో వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చదువరులను తయారు చేసే నూతన ఒరవడి .
రంగరాజు పద్మజ
కథాభాగం:-
మహాదేవరాజు దేవగిరిలో తన ఉద్యానవనంలో విచిత్ర మంటపంలో  ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి అతని ముఖ కవళికలు రకరకాలుగా మారుతున్ననందు వల్ల అతడు ఒక విషయం కాకుండా, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. కోపం, దుఃఖం మొదలైన ఎన్నో భావాలు అతని ముఖంలో  స్పష్టంగా కనపడుతూ మాయమవుతున్నాయి.
అప్పుడు సాయంకాలమైంది. ఇంకా చీకటి ముసురకున్నా  దీపాలు వెలిగించారు. చల్లటి గాలి వీస్తున్నది. నిర్మలమైన ఆకాశంలో ఎరుపురంగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సంతోషం కలిగించే ఆ సమయం రాజులకు వేడుకగా తిరిగే సమయం. అయినా మహాదేవరాజు ఇంకొక మనుషి లేకుండా ఒంటరిగా ఉండడానికి జరిగిన విఫలతయే  కారణమని తెలుస్తున్నది.
ఈ ఉద్యానవనం మహాదేవరాజు ఇంటి తోట. ఎన్నో రకాలైన పూలతో  ఎప్పుడు చాలా దూరం వరకు  సువాసనలను వ్యాపింపజేస్తూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిగుల మగ్గిన పండ్లున్న  చెట్లతో ఉన్న ఆ ఇంటి తోట ఈ మధ్యన నిండుగా ఉన్న నీటితో ఒక కొలను  ఒడ్డున అందమైన పర్ణశాల  ఉన్నది. దాన్నే ‘విచిత్ర మంటపం’ అని అంటారు. ఈ విచిత్ర మంటపంలోనే మహాదేవరాజు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
మహాదేవరాజు ఆలోచిస్తున్న సమయంలో ఒకతను వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. పది నిమిషాల దాకా రాజు ఏమి మాట్లాడలేదు. తరువాత అతనిని కూర్చోమన్నాడు. వచ్చినతను కూర్చున్నాడు.
అప్పుడు అతనితో ఇలా మాట్లాడాడు.
” ప్రహారేశ్వరా!”  ఏం విశేషాలు?
ప్రహరేశ్వరుడు దేవగిరికి చెందిన వాడు. బ్రాహ్మణుడు కాక ఇతర వర్ణంవాడు. మహాదేవరాజు అతను కలిసి  ఓకే గురుకులంలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నది. చూడడానికి రూపంలోనూ, వయసులోనూ ఇద్దరికీ అంత తేడా ఉండదు. వాళ్లకు చిన్నతనం నుండి ఉన్న వారి అభిప్రాయాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇద్దరి మధ్య ఉన్న చనువు అలా కొనసాగటానికే మహాదేవరాజు దగ్గర ప్రహారీశ్వరుడు  ఉద్యోగం చేయలేదు. మహాదేవరాజన్న మాటలకు అతను ఇలా బదులిచ్చాడు.
“అనుకున్న పనంతా ఇంకో తీరుగా జరిగింది”. అంతా అవమానం పాలే అయింది. అనుకున్నదొకటి జరిగిందొకటి.
రాజు గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఏమైంది? తొందరగా వివరంగా చెప్పు! నా మనసులో మొదలే ఒక అనుమానం వచ్చింది. నీ మాట మరింత భయం కలిగుతుంది. ఆలస్యం చేస్తే మనసులోని బాధ ఎక్కువ అవుతుంది.
” ఏమీ లేదు!  మన ముగ్గురు యోధులు మరణించారు”.
చెప్పవెందుకు?  కొంపముంచారే? ఎలా జరిగింది?
ప్రహరేశ్వరుడు జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్టు చెప్పాడు.  రాజు పదిహేను నిమిషాల దాకా కొయ్యబారిపోయి, ఏమీ మాట్లాడలేదు. తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు.
బాధపడి మనం ఏం చేయగలం? చేయాల్సిన పని చాలా  పకడ్బందీగా చేశాం. కాని దైవాజ్ఞ లేక ఫలించలేదు. అని ప్రహరేశ్వరుడు అన్నాడు.
నిజమే!  చేసేది ఏమీ లేదు! పని సులువుగా అవుతుందనుకున్నాం. ఏ కారణం లేకుండానే మన పేరు బయట పడింది. అయినా అయ్యేది కాక మానదు! అని మహాదేవరాజు అన్నాడు.
ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఒక భటుడు వచ్చి ఒక కాగితం తెచ్చి మహాదేవరాజుకిచ్చి నమస్కరించాడు.
మహాదేవరాజు ఆ ఉత్తరం తీసుకుని నెమ్మదిగా చూస్తున్నాడు. అందులో ఏమి రాసి ఉన్నదో? కానీ, మహాదేవ రాజు పొగలేని నిప్పువలె మండిపడుతున్నాడు. గడ్డం దువ్వుతూ, మీసం మెలివేస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, లోలోపల చదువుకుంటున్నాడు.
కారణమేమిటో తెలియక ప్రహరేశ్వరుడు అలా చూస్తున్నాడు. మహాదేవరాజును ఆ విధంగా చూసి  కారణం ఏమిటని అడిగే అవకాశం ప్రహరేశ్వరునికి ఇవ్వలేదు.
మహాదేవరాజు ఇలా కోపంతో ఊగిపోతూ, తరువాత  చూశావా? ప్రహారేశ్వరా!  ఆడవాళ్లకు కూడా కళ్ళు తలకెక్కాయి. నా దాసీదైన కమలనెంత అవమానించిందో  ఈ రుద్రమ్మ! ” వినాశ కాలే విపరీత బుద్ధి” (  నాశనం అయ్యే సమయానికి వింత బుద్ధి పుట్టింది) అన్నట్టు నన్ను, నా పరివారాన్ని చులకనగా చూడడం ఈ రుద్రమకు పోయేకాలం వచ్చిందేమో? ఈ ఉత్తరం చూడు! అని ఆ ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడికి ఇచ్చాడు.
అంతలోనే”  ప్రహారేశ్వరా” !  ఒకసారి ఆ ఉత్తరాన్ని  పెద్దగా చదువు!  నేను వింటాను.” అని మహాదేవరాజన్నాడు.
ప్రహరేశ్వరుడు ఆ  ఉత్తరాన్ని ఈ విధంగా చదవడం మొదలు పెట్టాడు.
”  నన్నేలుతున్న నా శౌణ దేశాధీశ్వరులైన మహాదేవరాజ రాజ చూడామణి గారి పాదపద్మాల వద్ద పాద దాసైన  కమల రోజూ మూడు కాలాల్లోనూ నా తలతో పాటు  సాష్టాంగ నమస్కారాలెన్నో  చేస్తూ రాసుకునే మనవి…..
అయ్యా!  తమ  ఆజ్ఞ తీసుకొని మురారి దేవుడు గారు, హరిహర దేవుడు గారు, ధర్మ వర్ధనుడు గారు, నేను….
సరే అదంతా వదిలేసి, ఉత్తరంలో ముందున్న  విషయం చదవమన్నాడు మహాదేవ రాజు.
ప్రహరేశ్వరుడు అలాగే ఉత్తరం కొంత భాగం తన లోలోపల చదువుకొని, తరువాత ఇలా పైకి చదవడం మొదలు పెట్టాడు”ప్రహరేశ్వరుడు.
నన్ను తీసుకొనిపోయి సభలో రుద్రమ్మ ముందు నిలబెట్టారు.
ఆ…. అక్కడ నుండి చదవమని అన్నాడు మహాదేవ రాజు.
రుద్రమదేవి ముందు నిలబెట్టారు. రుద్రమదేవి ఎన్నో విషయాలు అడిగి, చివరకు నావైపు చూసి నిన్ను ఎవరు పంపారు? అని అడిగింది. నేను సమాధానమివ్వలేదు.
ఎవరు పంపారన్నది తెలుస్తూనే ఉన్నది. మహాదేవుడు వంకరగా చూశాడు. మంచిది! చదవమన్నాడు మహాదేవ రాజు.
” సభలో ఎవడో మీ పేరు కూడా చెప్పాడు.” అని చదివాడు.
రుద్రమదేవి సభలో  నా పేరు పలికేంత మొనగాడున్నాడా?  సరే !మిగతా ఉత్తరాన్ని చదువు !
” తరువాత రుద్రమదేవి నన్ను చూసి ఇవాళే మా రాజ్యం వదిలి వెళ్ళి పో!  మా భటులు నిన్ను వెంబడిస్తారు.
నీకో రాజ్యం ఉన్నదా?  ఆ రాజ్యం ఎలా దక్కించుకుంటావో నేనూ చూస్తాను.ప్రహారేశ్వరా! చదువు! చివరనున్న ఆ నాలుగు మాటలు ఏమిటో చదువు!
సరే అని ప్రహరేశ్వరుడు చదవడం మొదలు పెట్టాడు.” మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు దక్కవు!”  ఆడదానివైనందున బ్రతికి పోయావు!”
వెంటనే మహాదేవరాజు ఇలా అన్నాడు. ఈ మాటలు విని, నేను తనని ఆడదని, జాలిపడి, విడిచి పెడతాననుకున్నది కావచ్చును…  ఇంత అహంకారమా?
మళ్లీ ప్రహరేశ్వరుడు ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. నీ మహాదేవ రాజు ఆడదై  గాజులు తొడుక్కోవడం వల్ల కావచ్చు! బహిరంగ యుద్ధంలో ఆడదానినైన నన్ను ఎదుర్కోలేక, మోసానికి తలపడ్డాడు….
శత్రువులను తిరస్కరించడం మోసమా? సరే! ఇక బహిరంగ యుద్ధమే చేస్తాను. కాచుకో! అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ చదవడం మొదలు పెట్టాడు… సిగ్గు తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయాలనుకోవద్దని చెప్పు!
సిగ్గు తెచ్చుకోవాలా? నిన్ను సింహాసనం ఎక్కించి నందుకు సిగ్గు తెచ్చుకోవాల్సిందే! మళ్లీ ఇటువంటి పని చేయకుండా..  నేనే ఓరుగల్లు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. అహంకరించకు లెమ్మని  అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ ఉత్తరం ఇలా చదవడం మొదలుపెట్టాడు.
“రాజ్యం దక్కించు కోవాలంటే మాతో స్నేహంగా ఉండమని చెప్పు! ”
ఎలా? ఎలా? నీతో స్నేహం చేయాలా? నీకూ నాకూ మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా?  లేక  నాకు వరసైన దానవా? పరాయి ఆడదానివి!  అందులోను వితంతువువు!  నీతో స్నేహం మాకు ఎలా మంచి జరుగుతుంది? నీతో స్నేహం ఒక యమభటులు మాత్రమే చేస్తారులే! గర్వపడకు! అన్నాడు మహాదేవరాజు.
”  గర్వం, అహంభావం,  వదులుకో”  అని చదివాడు ప్రహరేశ్వరుడు.
”  మంచేదో? చెడేదో తెలియని దానివి. మహా నాకు నీతులు చెప్ప వచ్చావా? అన్నాడు మహాదేవరాజు.
”  మేము చెప్పే మంచి మాటలను మరిచిపోతే, నీకు తెల్లవారితే మా పదునైన బాణాలు చురచురమని తగిలి బుద్ధి చెప్తాయని చెప్పు!  అని చదివాడు.
ఇంతటి పొడుగైన  బాణాలు ఎన్నడు చేయించుకున్నావే?  చురచుర తలగించు కోవాలనే బుద్ధి ఉంటే… అలాగే తగిలించుకుందువు గానిలే!  అన్నాడు మహాదేవరాజు.
”  అని కర్ణకఠోరాలైన మాటలని, ఆనాడే నన్ను భటుల నిచ్చి  వెళ్ళ కొట్టించింది. నేను మన దేశం వచ్చాను. కొద్ది రోజులలో మీ పాదసేవ చేసి, నా దుఃఖాన్ని అంతా చెప్తాను.
ఇట్లు పాద సేవకురాలు
కమల.
కమల ! పాపం ! కమలకు ఎంత అవమానం జరిగిందో కదా! దీనికి ప్రతీకారం మనం తీర్చుకోకుంటే రుద్రమదేవి గర్వం కానీ, దాసి దుఃఖం కానీ తగ్గదు అన్నాడు ప్రహరేశ్వరుడు.
నిజమే! అన్నాడు.
ఆలస్యం చేయకుండా రేపటి కొలువులో పౌరులు,  ఉద్యోగులు, మంత్రులు, సేనాపతులు మొదలైన వారందరిని పిలిపించండి. తగిన పనులు చేసి, ఆలస్యం చేయకుండా ఓరుగల్లు మీద దండెత్తి పోకుంటే మనం చేతగాని వారి వలె అవుతామన్నాడు  మహాదేవరాజు.
తప్పనిసరిగా అలాగే చేద్దాం అన్నాడు ప్రహరే శ్వరుడు .
ఇంటికి వెళుతూ నా మాటగా మంత్రికి చెప్పు రేపు దర్బారుకు అందరూ వచ్చేటట్టు చేయమని.
మంచిది అన్నాడు ప్రహారేశ్వరుడు.
రాత్రి కావడంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా మహాదేవ రాజుకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి ఆ ఉత్తరాన్ని చూస్తున్నాడు. చిట్టచివరకు తెల్లవారుజామున శరీరం మంచం మీద వాల్చాడు.
మహాదేవరాజు  స్థిర చిత్తుడు కాబట్టి ఉలిక్కిపడి లేచి కళ్ళు విప్పి చూశాడు. తెల్లవారి రెండు ఘడియల పొద్దు ఎక్కింది.  తను అజాగ్రత్తగా ఉన్నందుకు విచారించి, పడక విడిచి,  కాలకృత్యాలు తీర్చుకొని కొలువు కూటమికి నడిచి వచ్చాడు.
మంత్రి  ఆజ్ఞ ప్రకారం సభ్యులందరూ ముందే వచ్చి ఎవరి తాహతుకు తగిన ఆసనాలలో వారు కూర్చుని ఉన్నారు. ఇంతలో మహాదేవరాజు సభా మంటపానికి వచ్చాడు. సభలోని వారంతా రాజును చూసి, తమతమ ఆసనాలలో నుండి లేచి నిలబడి రాజుకు నమస్కరించి,రాజుపట్ల తమకున్న ప్రభుభక్తిని చాటుకున్నారు. రాజు సభ్యులందరినీ వారికి తగినట్టుగా మర్యాదతో పలకరిస్తూ వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. సభలోని వారంతా కూర్చున్నారు.
ఎప్పటివలె రోజువారీ కార్యక్రమాల సభ జరుగుతున్నా, ఈరోజు మంత్రి ఆజ్ఞతో సమావేశమైన ఈ సభకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు కానీ కారణం ఎవరికీ తెలియదు. ప్రహరేశ్వరుడికి మాత్రం తెలుసు .అతడు మంత్రికి చెప్పలేదు. తెల్లవారక ముందే కాలకృత్యాలు తీర్చుకొని రాజు గారి ఇంటికి వెళ్లి, రాజు కోసం ఎదురుచూస్తూ, రాజు నిద్ర లేవగానే  రాజుతో కలిసి సభకు వచ్చాడు. కాబట్టి అసలు విషయం తెలియని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో రాజుసభలోని వారందరినీ చూసి, సభ్యులారా! కొన్ని రోజుల కింద ఒకనాడు ఓరుగల్లు మీద దండయాత్ర గురించి సభ జరిగింది. దానికి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అది కలిసి వచ్చింది. రుద్రమదేవికి అహంకారంతో కళ్లు తలకెక్కాయ్. నాకుబుద్ధి చెప్పేంత మొనగత్తె అయింది.
నిన్న మా దాసీదైన కమల నాకు ఒక ఉత్తరం పంపింది. దానిని మీరంతా వినాలి!  అది వింటే మీకు రుద్రమ యొక్క గర్వం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడు చదివి మీ అందరికీ చదివి వినిపిస్తాడు.
” ప్రహారేశ్వరా! ”  నన్ను గొనిపోయి సభలో రుద్రమదేవి ఎదుట”  అక్కడి నుండి ఉత్తరం చదువు అని అన్నాడు.
ప్రహారేశ్వరుడు కమల రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ ఉత్తరం విన్న సభ్యులందరూ” రుద్రమదేవి ఇలా చేయడం తప్పని ముక్త కంఠంతో అన్నారు .
సభలో నుండి ఒకడు లేచి”  రాజచంద్రా!  మీ శౌర్య ప్రతాపాలకు భయపడిన తమ రాజ్యాన్ని దక్కించుకోవాలనే  బలమైన కోరిక ఉండి, తెలుగు వారొక ఆడదానిని  మాళవులు  ఒక పిల్లవాడిని  సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాని వల్ల స్త్రీ హింసకు,  శిశుహింసకు వెనుకంజ వేసే ప్రభువులైన మీరు వారి దేశాల పైకి దాడికి వెళ్లరని, వాళ్ల రాజ్యాలకు ఎటువంటి అంతరాయం, నష్టం రాదనుకొని, అలా చేశారు. అయినా రాజ్యగర్వం కళ్ళకు మంచేదో?చెడేదో? తెలుపనీయక  వాళ్ళమతులు పోగొట్టాయి. కాబట్టి తలచినంత మాత్రాన గుండెల్లో దిగులు పుట్టించే మీకు ద్రోహం చేయాలనుకోవడం  పెద్ద సాహసమే అవుతుంది.తమరు ఇప్పుడు ఇటువంటి మహిళలనీ, శిశువులనీ అనుకుని ఊరుకుంటే మీకు ముప్పు తప్పక కలుగుతుంది.
” దుర్జనం,  కాంచనం, భేరీమ్,దుష్టస్త్రీం,దుష్ట వాహనం, ఇక్షుఖండాన్, తిలాన్, మర్దనం- గుణ మర్దనం”  అని( నీచులను, బంగారాన్ని, నగారాలనే వాయిద్యాలను, చెడు స్త్రీలను, చెడు వాహనాన్ని, చెరుకు గడలను, నువ్వులను మర్దించాలి… వాటి గుణం మారేదాకా)  మర్దించాలని శాస్త్రం తప్పుగా చెప్పలేదు. మత్తెక్కి భూమ్యాకాశాల తేడా తెలియకుండా ఉన్న ఆడదాన్ని నరికినా పాపంలేదు.ఇది ఎన్ని సార్లూ చెప్పినా నిజం ! అని అన్నాడు.
ఇతను  గుజరాత్  దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు .మహాదేవ రాజుకు సంతోషం కలిగించాలని అనుకొని , దేవగిరికి తన కుమారుడుతో పాటు కలిసి వచ్చి, కొంత కాలమైంది. కుమారుడైన వీరధవలుడిని తన సొంత రాజ్యానికి పంపి,తను ప్రతి దినం మహాదేవ రాజ్యసభకు వస్తూ… రాజ కార్యాలలో జోక్యం కలిగించుకొని, రాజుకు నచ్చేటట్లు మాట్లాడు తుంటాడు. రాజుకు కూడా ఇతనంటే కొంచెం ఇష్టమే. లవణ ప్రసాదుడు అలా అని ,తన ఆసనం మీద కూర్చున్నాడు.
లవణ ప్రసాదు గారు అన్న మాటలు మెచ్చుకునే  విధంగా ఉన్నాయి.  మనమిప్పుడు సైన్యసహితంగా ఓరుగల్లుకు వెళ్లి,  పొగరుతో గుడ్డిదైనా రుద్రమను, ఆమె సేనను యుద్ధంలో ఓడించి, రాజ్యాన్ని మనం చేజిక్కించు కోకపోతే మనకు ఆమె ఉత్తరంలో కలిగిన  అవమానం మాసిపోదు. కాబట్టి మనం ఓరుగల్లు పైకి దండెత్తి పోవడానికి ఆలస్యం చేయవద్దని మహాదేవరాజు అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ రావడమే ఆలస్యం, సేనా నాయకుడు తమ సైన్యంతో యుద్ధ సామగ్రితో బయలుదేరడానికి ఆలస్యం చేయరని మంత్రి అయిన భోళేశ్వరుడన్నాడు.
నాతో పాటు సేనానాయకులందరూ యుద్ధానికి ఎదురు చూస్తున్నాం. సైనికులు యుద్ధ పరికరాలతో సిద్ధంగా ఉన్నారు మీ అనుమతి తప్ప కొరత ఏమీ లేనేలేదని సేనాపతులలో ముఖ్యుడైన రామశర్మ అన్నాడు.
మంత్రిగారూ!  మన విధేయులైన వారు, మిగతా వారైన మండలాధ్యక్షులకు ఉత్తరాలు రాసి పంపాలి. వారంతా వస్తే మనకి ఇంకా మంచిది. రుద్రమదేవి చాలా పెద్ద సైన్యం తయారుచేసింది. ఆమె తండ్రి అయిన గణపతిరాజు కూడబెట్టిన సైన్యాన్ని ఈమె రెండింతలు చేసిందన్నా తప్పు లేదు. కాబట్టి మన దగ్గర ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిది. మనకు సహాయం చేసేవారు దేవగిరిలోనే మనతో కలవాలంటే అలా వీలు కాదు. కొంతమంది దేవగిరిలోనూ, కొందరు దారిలో మధ్యన, కొందరు పొలిమేర వరకు, తక్కినవారు ఓరుగల్లు వచ్చి చేరవచ్చును. మనం రాసి పంపే ఉత్తరాలలో ఇలా వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. మన సైన్యం సిద్ధంగా ఉంది కదా? ఇంకా బయలుదేరేందుకు నగారా మోగించేందుకు తగిన ముహూర్తం ఆలోచించాలి. ముహూర్తం అంటే చాలా రోజుల వ్యవధి ఉండకూడదు. జ్యోతిష్యులకు ఈ విషయం చెప్పి పది, పదిహేను రోజులలో మంచి ముహుర్తం నిర్ణయించుకుని వచ్చి నాకు తెలియ చేయాలి. ఆ రోజు మనం బయలుదేరి వెళ్లాలి. ముందుగా రాయబారి కానీ మరెవరినైనా పంపేందుకు నాకు ఇష్టం లేదు. మీరంతా దీనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనతో సమానులయితే ఎటువంటి రాయబారినైనా పంపవచ్చు. కానీ, ఒక ఆడది,  అందునా మనను దూషించిన దాని దగ్గరకు రాయబారం పంపితే సిగ్గుచేటు. మన రాయబారం బాణాలతోనే పంపాలి. నా మాటలు శ్రద్ధగా విని అలా చేయండి! అని మహాదేవ రాజు మంత్రితో అన్నాడు.
చిత్తం! రాజుగారి ఆజ్ఞ! తెల్లారేసరికి మీకు శుభముహూర్తం నిర్ణయించి తెలియజేస్తాను. మిగిలిన సేన మొదలైనవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి చెప్పాడు.
సభలోని వారంతా యుద్ధోత్సాహాన్ని తెలిపారు.
కొంతసేపటికి సభ ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

పన్నెండవ ప్రకరణ

[  యుద్ధ ప్రయత్నం]

శ్లోకం.    ప్రవిష్ట శత్రుసైన్యంహి ప్రాజ్ఞ శత్రురతర్కితః

నిహన్యాదన్తరం లబ్ధ్వాఉలూక ఇవ వాయసాన్

శ్రీమద్రామాయణం- యుద్ధకాండం. సర్గ-17

శ్లో.       వధ్యతా మేషతీవృణె  దణ్డేన సచివైస్సహ

రావణస్య నృశంసస్య భ్రాతాహ్యేష విభీషణః”

శ్రీమద్రామాయణం-యుద్ధకాండం- సర్గ-17

ఈ శ్లోకాలు విభీషణుడు రామ శరణాగతి కోరి తన మంత్రులతో సహా వచ్చినప్పుడు, సుగ్రీవుడు రామునితో అన్నమాటలు.

భావం :– తెలివైన మరియు జ్ఞానం కలిగిన శత్రువు, శత్రుసైన్యంలో ప్రవేశించి, తరువాతి కాలంలో అవకాశం చూసుకుని, రాత్రిపూట చీకటిలో గుడ్లగూబ కాకులను చంపినట్లుగా …

చంపి వేయగలరు. పైగా విభీషణుడు పర హింసా తత్పరుడైన రావణుడికి తమ్ముడు. కనుక ఇతనిని అనుచరులతో సహా తీవ్రమైన దండనతో వధించవలెను.

కథా భాగం:–  క్రీస్తుశకం 1285 వ సంవత్సరంలో రెండు ,మూడు నెలలు గడిచాయి.చలికాలం క్రమంగా పోయి ఎండాకాలం వేడి తగులుతున్నది. పగలు ఎక్కువగా, రాత్రిపూట తక్కువ సమయంగా మారింది. చలి బాధ వల్ల ఎండకు కూర్చోవడం, లేదా చలిమంటల దగ్గర కూర్చుని వేడి కాపులు పెట్టుకోవడం జనాలకు తగ్గింది. శుభకార్యాలు చేయాలనుకునేవారు ఆ పనికి వస్తువులను సేకరించుకోవడం కోసం తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతలలో ఉన్న వారు బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేయాలనుకుని వాటికి కావలసిన వస్తువుల కొరకు భిక్షాటనకు వెళ్లారు. పురోహితులకు,జ్యోతిష్యులకు శుభాకార్యాలు చేయించడం వల్ల, శుభ ముహూర్తాలు నిర్ణయించడం వల్ల తీరిక లేకుండా ఉన్నారు. కొందరు యజమానులు పాత ఇండ్లను కూలగొట్టించి, కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు. శ్రీమంతులు  కొందరు ఎత్తయిన ఇండ్లను చూసి అటువంటి ఇండ్లు తమకు కావాలని, తమ ఇండ్లు అందంగానూ, గట్టిగా ఉన్నా కూడా వాటిని కూల్చేసి, మళ్లీ కొత్తగా కట్టిస్తున్నారు.

ఓరుగల్లు పట్టణంలో రాతి పనులు, మట్టిపనులు ఎక్కువగా జరుగుతున్నవి. అయినా కారణం లేకుండా అవి జరగడం లేదు. కోటగోడలు అక్కడక్కడా కొద్దిగా కూలిపోయాయి. కూలిపోయిన చోట ముందటి కన్నా బలంగా బాగు చేయిస్తున్నారు. పట్టణం చుట్టూ కంప కోట కట్టిస్తున్నారు. కంప కోట అంటే పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు ఉన్న ఇనుప తీగను చిక్కగా, దట్టంగా పట్టణానికి చుట్టూ గుండ్రంగా చుట్టడం. ఎందుకంటే వేగంగా వచ్చిన ఫిరంగి గుండ్లు కంపలో దూరితే అవతలికి గానీ, ఇవతలికి గాని వెళ్లదు. ఈ కంపకోటలో  పెద్ద కందకం తవ్విస్తున్నారు. ఆ కందకంలో తవ్వగా వచ్చిన మట్టితో ప్రహరీని ఆనుకుని లోపలి వైపు మట్టికోట కడుతున్నారు. మట్టి కోటకు లోపలివైపు రాతికోట ఒకటి కడుతున్నారు. ఈ రాతికోట సున్నంతో కానీ, మట్టితో కానీ కట్టకుండా బలమైన రాతితో కడుతున్నారు. ఈ రాతికోట మందంగా ఉండి, అష్ట కోణాకారంలో ఉన్నది. రాతితో కట్టినదైనా వెంట్రుక కూడా పట్టేంత సందు లేకుండా కట్టిన ఆ రాతి పనివాడి పని ఈ నాటికీ సందర్శకులకు కళ్ళ పండుగగా ఉంటుంది. ఈ రాతిప్రాకారం లోపల సున్నంతో, ఇటుకలతో మరొక ప్రాకారం కడుతున్నారు. దాన్ని ఇటుకకోటని, భూమి కోటని పిలుస్తారు.

మొదట శత్రువులు దూరరాని కంపకోట,  దాని తరువాత అగాధమైన కందకము, దాని వెనుక చాలా మందపాటి, చాలా ఎత్తయిన,పగలకొట్టి చొరబడరానిదైన మట్టికోట, తరువాత వంద వేల శతఘ్నుల పేల్చినా  ఏమాత్రం చెడిపోకుండా,  దాడికి లొంగని రాతికోట, దాని పక్కన దానికి ఏ మాత్రం తీసిపోని భూమి కోటలుండి ఏకశిలానగరమని తలిస్తే చాలు గుండె దిగులు పుట్టేలా ఉన్నది.

భూమి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు,  వాటి పక్కనే ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. రాతి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. పుట్ట కోటకు ఎనిమిది దుర్గ ద్వారాలు, 18 చిన్నవాకిళ్లున్నాయి. పనివాళ్ళు కూలి వాళ్ళు రాత్రింబగళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కొంత మంది ఉదయం కొంత మంది రాత్రి వరుసగా అంచలంచలుగా ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అందుకే ఈ కోటలు కందకాలు ఇప్పటికి సిద్ధమైనాయి. అప్పుడు ఇవన్నీ సిద్ధమైనట్టు రుద్రమదేవికి తెలిసింది. రుద్రమదేవి దర్బారులోనికి వచ్చినప్పుడు కట్టడాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, గుఱ్ఱపుస్వారీ చేసేటప్పుడు పురుషుల వలె దుస్తులు ధరిస్తుంది. ఆరోజు సిద్ధమైన కోటలను చూసేందుకు రుద్రమదేవి మగవేషం వేసుకొని, వెంట కొంతమంది తోడురాగా బయలుదేరింది. వాళ్ళంతా వరుసగా ఒక్కొక్క కోటను, వాటికున్న బురుజు ద్వారాలు, చిన్న వాకిళ్ళను, కందకాలను, అన్నింటినీ జాగ్రత్తగా చూపారు. రుద్రమదేవికి చాలా సంతోషం కలిగింది. ఆ కట్టడాలను కట్టిన పనివాళ్లు, కూలి వాళ్లు రుద్రమదేవిని చూసి నమస్కరించారు. పని చేయించేందుకు నియమించిన పెద్దపనివాళ్ళు రుద్రమదేవి గుర్రం వెంట నడుస్తూ ఆయా ప్రదేశాలను, కట్టించే టప్పుడు కలిగిన శ్రమను, చాలా సన్నని స్వరంతో రుద్రమదేవికి చెప్పి చూపిస్తున్నారు. చిన్న వాకిళ్ళలో, బురుజు ద్వారాలలో  అమర్చిన తికమక దర్వాజలను చేతితో ముట్టి, కదిలించి రుద్రమదేవి స్వయంగా పరీక్షించి చాలా బలంగా ఉన్నాయనుకొని సంతృప్తి పడింది.

రుద్రమదేవి అన్ని చోట్ల భద్రంగా పరిశీలించి నగరానికి బయలుదేరింది. పనివాళ్ళు ఆమె వెంట నడిచారు. ఆమె అంతరంగికులు వెంట నడిచారు. కొన్ని ఘడియలలో వారంతా నగరం చేరారు. రుద్రమదేవి రాజదర్బారులోనికి వచ్చి, వజ్రాల సింహాసనం మీద కూర్చున్నది. ఎప్పటివలె సభ్యులంతా వారివారి స్థానాలలో  కూర్చున్నారు. లెక్కలు రాసే వారిని పిలిపించారు. రుద్రమదేవి ఆజ్ఞతో లెక్కలు వ్రాసేవారు, పనివాళ్ళ కూలి, వాళ్ళ జీతాలు మొత్తం లెక్క చేసి ఇచ్చిన డబ్బు తీసేసి , మిగిలిన డబ్బులు లెక్క చెప్పి రుద్రమదేవికి చూపించారు. రుద్రమదేవి కోశాధికారికి ఉత్తరం రాసి పని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బును, మరి కొంత ధనాన్ని తెప్పించి వరుసగా అందరికీ లెక్క చొప్పున పంచి పెట్టింది. తరువాత ఒక్కొక్క పని వానికి వాడు చేసిన పని తెలుసుకొని కొంత బహుమతిని తన చేతితో పంచి, వారందరినీ పంపి వేసింది. పని వాళ్ళంతా చాలా సంతోషంతో దీవిస్తూ, పొగుడుతూ, సంతోషంతో కేకలు వేస్తూ రుద్రమదేవికి నమస్కరించి వెళ్లిపోయారు.

తరువాత రుద్రమ్మ కొలువులో ఉన్న తన సేనా నాయకుల పేర్లు పెట్టి పిలిచింది. వెంటనే వాళ్లంతా తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. అప్పుడు రుద్రమదేవి గంభీరమైన కంఠంతో ఇలా చెప్పటం మొదలు పెట్టింది.

సైన్యాధికారులారా!  ఈనాటికీ మన ఏకశిలా నగరానికి ప్రసిద్ధమైన కోటలుండే భాగ్యం కలిగింది. ఎన్ని కోటలు, ఎన్ని కందకాలున్నా వాటి రక్షణభారం వీర భటులు చేయకుంటే ప్రయోజనం ఉండదు.మనలను ఎదిరించ లేరనుకొని  ఊరికే ఉండటం మంచిది కాదని మా నాయన గారి హితవచనం.

అందుకు మనం పూర్తి శ్రద్ధ కలిగి కోటలను రక్షించడంలో ఏకశిలానగరం అందరికీ ఆదర్శంగా ముందుండాలి. దానికి నేను చెప్పేది ఏమిటంటే కోట గోడకు ఆధారంగా వేసిన కొరడు ( కోటకు అవతలివైపు ఉన్న మట్టి దిమ్మ) మీద రక్షణ బాధ్యత రాజ బంధువులలోని ముఖ్యులైన వీరుల ఆధీనంలోనూ, భూమి కోటలోని రక్షణ బాధ్యత మిగిలిన బంధు వీరుల ఆధీనంలో ఉంచాలి. జన్నిగ దేవసాహిణి తను చెప్పిన మాట వినే సేనలోని వారిని భూమి కోటలోని ఎనిమిది చిన్న వాకిళ్ళకు ఒక్కొక్క వాకిలికి ఐదు వందల మంది చొప్పున,18  చిన్న వాకిళ్ళకు ప్రతి ఒక్కొక్క వాకిలికి 100 మంది  వీరభటుల చొప్పున, బురుజు ఒక్కదానికి 500 మంది వీర భటులను నియమించి, రాతికోటలోని నాలుగు బురుజుల, ఎనిమిది చిన్న వాకిళ్ళను రక్షించాలి.

అంబయ్య దేవ మహారాజు ఆదేశాల ప్రకారం సైనికులను అక్కడ ఉంచి, మట్టి కోటను రక్షించాలి.

గోనగన్నారెడ్డి తన అధికారం కింద ఉన్న సైనికుల నుండి కోటకు రెండు వైపులా నుంచి కోటను రక్షించాలి.

దాదియ సోమయ సాహిణి తన సైన్యం నుండి బూడిద ఒకటికి యాబై మందిని నిలపాలి. రుద్రమ నాయుడు నాగచమూపతి ఇద్దరూ యుద్ధానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయించాలి. మిగిలిన సేనానులు కంప కోటను, కందకాలను కాపలా కాయాలి. మనకు ఇప్పుడు ఎటువైపు నుండి కానీ యుద్ధం జరుగుతుందనే అనుమానం లేదు. కానీ దుర్మార్గుడైన మహాదేవరాజు విషయంలో మాత్రం కొంచెం అనుమానం ఉన్నది. అతని దుష్టస్వభావంతో నిస్సహాయులైన మమ్మల్ని పట్టుకుని తీసుకొని పోవాలి అనుకున్నాడు. హఠాత్తుగా మన మీద దండెత్తి వస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను దండెత్తి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే అంతా భద్రంగా ఉంటుంది.

రుద్రమదేవి చెప్తున్నప్పుడు సేనా నాయకులు తమకు అప్పగించిన పనులను, తమ రక్షణ కిందకు వచ్చిన కోటలను కాగితాల మీద రాసుకున్నారు.  రుద్రమదేవి తాను చెప్పగలిగిన మాటలను చెప్పి ముగించగానే సేనా నాయకులందరూ ఒక్కసారి సింహనాదాలు చేసి తమ చేతులలో ఉన్న బరికత్తులను తళతళమని మెరిసేటట్లు  ఊపారు. తర్వాత సభను ముగించారు.ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. సేనానాయకులు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆయా చోట్లలో సైన్యాన్ని నియమించి, వారు శ్రద్ధగా ఉన్నట్టు గమనించి వచ్చి రాణికి తెలుపుతున్నారు.

కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటివలె ఆ రోజు రాత్రి రుద్రమదేవి సభ తీర్చి ఉన్నది. రాజ దర్బారంతా సభ్యులతో కిక్కిరిసి నిండి ఉంది. రకరకాల విషయాలు చర్చిస్తున్నారు.

ఇంతలో ఒక యువభటుడు గబగబా వచ్చి, రాణీకి మొక్కి, సభలోని వారందరూ, రాణి గారు వినేటట్టుగా బిగ్గరగా ఇలా చెప్పాడు.” శౌణదేశాధీశ్వరుడైన  మహాదేవరాజు గొప్ప సైన్యంతో దేవగిరి నుండి వస్తున్నాడు” మన ప్రాంతానికి ఇంకా నాలుగైదు రోజులలో ఇక్కడికి చేరగలడు. ప్రభువు ఆజ్ఞతో ఇతర దేశాల నుండి వచ్చే రహదారులను మేము కాపలా కాస్తున్నాం. అక్కడి పరిస్థితి చూసి వచ్చిన సంగతి ఇది. తర్వాత ప్రభువులకు ఎలా అనిపిస్తే అలా జరుగుతుంది. మాకు అప్ప చెప్పిన పని చక్కగా చేసుకుని వచ్చాం.”

మంచిది!  నువ్వు వెళ్లిపొమ్మని రుద్రమదేవి అన్నది. గూఢచారి నమస్కరించి వెళ్ళిపోయాడు.  రుద్రమదేవి మంత్రి అయిన శివదేవయ్య వైపు చూసి ఏమో చెప్పబోయి, చెప్పదలుచుకున్న విషయం కాస్త రహస్యంగా ఉంచ తలుచుకొని, సేవకుడిని చూసి, ఓరీ! నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చిన గూఢచారిని పిలుచుకొని రా! అని చెప్పింది. సేవకుడు గబగబా నడిచివెళ్ళి ,వెళ్ళిన గూఢచారిని సభలోనికి పిలుచుకొని వచ్చాడు.

ఓరీ!  మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడని చెప్పావు కదా! అతని సైన్యం ఎంత ఉందో నువ్వు చెప్పగలవా? అని రుద్రమదేవి గూఢచారిని అని అడిగింది.

అయ్యా!  నేను నిజంగా అతని సైన్యం ఎంత ఉందో చెప్పలేను. కానీ ఎంత దూరం చూసిన సైన్యమే కనబడుతున్నది. గుర్రాలను ఏనుగులను ఒకటొకటి లెక్క పెట్ట గలమా? మా పని శత్రుసేన కొంత దూరంగా ఉండగా చెప్పడం వరకే! అదే చేశానని గూఢచారి జవాబిచ్చాడు.

సరే !నువ్వు వెళ్ళి, మీలో ఒకడినిఅక్కడికి పంపి, సైన్యం ఎంత ఉందో సంఖ్య తెలుసుకుని రమ్మని చెప్పు!  అని రాణి అన్నది. గూఢచారి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రితో ఇలా మాట్లాడింది.

చూశారా!  మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడట.పూర్తిగా కుటిల మనసున్న వాడైనాడని అనడానికి సందేహం లేదు.

తల్లీ!  కాల మారినట్లు గుణాలు మారుతాయి! అయినా వాళ్లు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. కారణం లేకుండా మన మీద కోపం పెంచుకుని, మీకు అపకారం చేయదలచి, అందులో విఫలమవడంతో అసూయతో మనసులు నింపుకొని, ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు దండెత్తి రావడానికి అదే కారణం. నాకు ముందే అనుమానం వచ్చి, దేవగిరి తోవకు  గూఢచారులను కాపలా పెట్టాను.

దండెత్తి వస్తే రానివ్వు!  అతనికి ఎన్ని రోజుల నుండి యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నదో?  దానిమీద కాకతీయుల  పదునైన బల్లేల రుచి చూస్తాడు. కానివ్వు! అతని ఉద్ధతి ఎంత ఉందో? దాని ప్రకారం ప్రతీకారం జరగనీ! వెనుకటి వాళ్లు కాకతీయుల అగ్నివంటి ప్రతాపాన్ని చూశారు. కానీ రెండు తరాల నుండి వీరికి ఆ రుచి తెలియదు. ఇతడు కావాలను కోరి వస్తే అతనిని చిన్న పుచ్చడం ఎందుకు? మనం కోటలను మరమ్మతు చేయించడం, కొత్తకోటలు కట్టించడం, వాటి మీద గట్టి కాపలా పెట్టడం మంచి పని అయింది. ఒక్క మహాదేవరాజే కాదు వంద మంది మహాదేవ రాజులొచ్చినా  ఓరుగల్లుకు నష్టం లేదు.

కోటలే కాదు… మీ శౌర్య ప్రతాపాలు…నేనేమి చేయగలను? మరొకడు ఏమి చేయగలడు? రాజులకు ప్రాణం సైన్యం. ఉదారంగా పౌరుషవంతులైన శూరులు రాజ్యాన్ని దక్కించుకుంటే రాజ్యం దక్కుతుంది.

అందుకోసం మన సేవకులంతా సిద్ధంగా ఉన్నారు. కంఠనాళంలో రక్తప్రసారం జరుగుతున్నంతసేపు యుద్ధం చేసి, తమ ప్రభువును గెలిపించడమే వారి పనిగా మన సైనికులు యుద్ధం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.

వీరిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ఒక్క గూఢచారి సభలోనికి వచ్చి, రుద్రమదేవికి నమస్కరించి, అయ్యా! మహాదేవరాజు దండెత్తి వస్తున్న విషయం ఇంతకు ముందే నా తోటి ఉద్యోగులు మీకు తెలిపి ఉన్నారు. నేను సేనా సంఖ్య ఎంత ఉందో తెలుసుకొని వచ్చాను. మహాదేవరాజు సైన్యం మొత్తం మూడు లక్షలు. యుద్ధ సామాగ్రి, వస్తు సామాగ్రి చాలా ఉన్నది. సైన్యం ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పాడు.

మంచిది!  నువ్వు నీ పని మీద వెళ్ళు! అని రుద్రమదేవి అతనిని పంపి…

మంత్రిగారూ!  మన సైన్యం ఎంత ఉంది? మహాదేవ రాజు సైన్యం మూడు లక్షలట!  అని అన్నది.

తల్లీ!  అయితే ఏం? బురుజులపైనా, కందకాలపైనా, చెట్లకొమ్మలపైనా ద్వారాల దగ్గరా, చిన్న తలుపుల దగ్గరా ఉన్న సైన్యం కాకుండా… మిగిలిన సైన్యం రెండు లక్షల డెబై వేలని నిన్న మన సేనా నాయకులు లెక్క ఇచ్చారు. కాపలా కాసే వారి సంఖ్యతో కలిసి మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది. వస్తుసామగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉంది.  మూడు ,నాలుగు సంవత్సరాలు  విరామం లేకుండా యుద్ధం చేసినా తక్కువ పడదు.

మనం ఒక్కసారి సైన్యం చూసి వస్తే బాగుంటుంది కదా! నాగచమూ నాయకులు మన వెంట వస్తారు.

సరే!

రుద్రమదేవి లేచి నిలబడింది. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. రుద్రమదేవి భూమి కోట బురుజు ద్వారం దగ్గరకు నడిచింది. మంత్రి , సేనాధిపతులు వెంట నడిచారు.  తక్కిన సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళారు.

పదమూడవ ప్రకరణ

[ సంధి ]

శ్లో॥       అపనీత శిరఃస్త్రాణాః శేషాస్తుం శరణం యయౌ ;

ప్రణిపాత ప్రతీకారః సంరంభోహి మహాత్మనాం !

— (రఘువంశము)

భావం :– చచ్చిన వారు పోగా బ్రతికి ఉండే వారు  టోపీలు తీసివేసి, ఆ రఘువంశ మహారాజును శరణుజొచ్చారు. మహాత్ములు శత్రువుల గర్వం అణిచివేయడంలోనే దృష్టి ఉంచుతారు. కానీ వారు వినయంగా ఉండే వారిని, ముందటి వలె చంపాలనే కోపం ఉండదు కదా!

వ్యాఖ్య:–  ఈ రఘువంశంలోని శ్లోకం  ప్రకరణ మకుటంగా గ్రంధకర్త తీసుకోవడం, రుద్రమదేవి నవలలోని రుద్రమదేవి- మహాదేవరాజు మధ్య గల సంధిని  సూచిస్తూ, కథార్ధ సూచిగా ఎంతో చక్కగా అమర్చారు.

ఈ శ్లోకాన్ని చదువుతూనే కథలోని మలుపులు తెలుస్తునాయి.ఈ విశేషమైన ప్రక్రియ అరుదుగా కనిపిస్తుంది.

కథాభాగం:–  మహాదేవరాజు సైన్యం ఓరుగల్లు కోటను ముట్టడించింది. ఏనుగులు, గుర్రాలు వీరభటులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. మహాదేవరాజు మూడు లక్షల సైన్యంతో ఓరుగల్లును ముట్టడించి, పదిహేను రోజులు అయింది. ప్రతిరోజు రుద్రమదేవి సైన్యానికి మహాదేవరాజు సైన్యానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. రెండు వైపులా సైన్యంలో సైనికులు  చనిపోతున్నారు.

ఈరోజు పదిహేనవ రోజు యుద్ధం మొదలైంది. రుద్రమదేవి మగవేషంతో ఉత్తమజాతికి చెందిన గుర్రాన్నెక్కి  పౌరుషానికి మారురూపుగా వచ్చిందా? అన్నట్టుగా చూడ శక్యం గానంతగా యుద్ధభూమిలో తిరుగుతూ,  కనపడ్డ శత్రువులందరిని చంపి వేస్తున్నది. రుద్రమదేవి సేనానాయకులలో ముఖ్యులైన రుద్రమ నాయుడు వెలమ సైనికులకు, నాగచమూపతి కమ్మ సేనకు అధికారులై తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వీరవిహారం  చేస్తున్నారు.

జన్నిగదేవ సాహిణి, త్రిపురాంతక మహాదేవ రాజు, అంబయ్య దేవమహారాజు, గోనగన్నారెడ్డి, దాదియ  సోమన సాహిణి మొదలైన సేనానాయకులు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించ లేనంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు.

రుద్రమదేవి అల్లుండ్లైన ఇందులూరి అన్నమ రాజును, చాళుక్య వీరభధ్రుడు రాజును తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ,  యుద్ధభూమిలో తిరుగుతూ, శత్రుసైన్యం గుడారాలను, శత్రువులను కింద మీదలు చేస్తున్నారు. మల్యాల గుండాదీశ్వరుడు మహాదేవరాజుతో యుద్ధం చేస్తున్నాడు. రుద్రమదేవి ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య వయసురీత్యా ముసలివాడైనా యువకునివలె యుద్ధం చేస్తున్నాడు. గుండ ధరాధీశ్వరుని తమ్ములైన మల్లయ్య, బుద్ధయ, కోటయ్య, పిడుగు గుండయలు నాలుగు వైపులా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ప్రసాదాదిత్య నాయకులు మొదలైన సేవక వర్గం తమవెంట ఎవరైనా తోడుగా వస్తున్నారా? లేదా? అని చూడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు.

మహాదేవరాజు మంత్రి అయిన సాధులుడు, సేనాపతులైన భోళేశ్వరడు, రామశర్మ, బిచ్ఛణుడు మొదలైన వారు, కొంకణ దేశపురాజు, ఘూర్జర దేశపు అధినేతైన లవణప్రసాదుడు మొదలైనవారు చెలరేగి యుధ్ధం చేస్తున్నారు. ఇంకా ఎందరో మహాదేవరాజుకు సహాయం కోసం వచ్చిన మాండలికులు వీరవిహారం చేస్తున్నారు. రెండు వైపుల వారు విజయం మాకే కావాలనే కోరికతో గుంపులతో దొమ్మి యుద్ధం  చేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.

మధ్యాహ్నం రెండు జాములయింది. చెట్ల కొమ్మల మీద, బురుజుల మీద ఉన్న ఓరుగల్లు సేన మహాదేవరాజు సైనికుల మీద బాణాల వర్షం కురిపిస్తున్నది.

రుద్రమనాయుడు, నాగ చమూపతి తమ పరివార మైన వెలమ,కమ్మ వారిని వెంట తీసుకొని, దేవగిరి దళాన్ని ఎదుర్కొన్నారు. వారి పరాక్రమం చెప్పలేనంతగా ఉన్నది.

మల్యాల గుండదండధీశ్వరుడు శౌణ దేశాధీశ్వరులిద్దరూ కత్తి యుద్ధం చేస్తున్నారు.వారిద్దరి శరీరాలు రక్తంతో తడిసి, ఎర్రని పూలతో ఉన్న మోదుగ చెట్ల వలె కనపడుతున్నారు. యాదవరాజు పదునైన బల్లేన్ని తీసుకొని గుండ దండాధీశ్వరుని గుర్రాన్ని నరికి వేశాడు. అతడు కొంచెం కూడా తొట్రు పడకుండా పదునైన ఖడ్గం తీసుకొని మహాదేవరాజుపైకి ఉరికి అతనెక్కిన ఏనుగును కొట్టాడు.  తొండం తెగిపోవడంతో ఆ ఏనుగు గీ అంటూ అరుస్తూ నేలమీద కూలిపోతున్న ది. వెంటనే మావటిని తల నరికేసి, నేలమీదికి దుముకుతున్న శౌణదేశపు రాజును చంపాలని, గుండ దండాధీశ్వరుడు కత్తిగిరగిరా తిప్పి విసిరాడు.

మహాదేవరాజు అతని కత్తి వేటునుండి తప్పించుకొని, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దండాధీశ్వరుడు పరిశ అనే ఆయుధాన్ని మహాదేవరాజుపై విసిరాడు. ఆ దెబ్బకతను సొమ్మసిల్లి నేల మీద పడ్డాడు. గుండ దండాధీశ్వరుడు సింహనాదం చేశాడు. దేవగిరి సైనికులు భయపడ్డారు. మహాదేవరాజు వెంటనే తెప్పరిల్లి చీకటిని గిరగిరా తిప్పి దండాధీశ్వరుని పైకి విసిరాడు. ఆ కత్తివేటుకు కంఠానికి తాకినందున అతడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు .

అన్న అలా నేల కూలాగానే తమ్ముళ్లు ఒక్కసారిగా యాదవరాజుపై కలియబడ్డారు. శౌణదేశాధిపతికి సహాయంగా లవణప్రసాదుడు,  మంత్రి అయిన సాధులుడు వచ్చి కలిశారు. రుద్రమదేవి సేనా నాయకులను చుట్టుముట్టినందు వల్ల  వాళ్లు రాజుకు సహాయం చేయలేకపోయారు.

గుండదండాధీశ్వరుని తమ్ముళ్లు ఐదుగురు ఎదురు నిలిచి యుద్ధం చేస్తూ మంత్రిని మూర్ఛ పోగొట్టారు. రుద్రమదేవి యాదవ రాజున్న దగ్గరికి దుర్గాదేవి ప్రత్యక్షమైందా అన్నట్లు భయంకర రూపంతో వస్తూ ఉండగా… తోవలో సేనా నాయకుడైన దాదియ సోమయ సాహిణి వీరమరణం పొందాడనే పిడుగు లాంటి ఆ వార్త విని మళ్లీ వచ్చిన చోటికి వెళ్ళి పోయింది రుద్రమదేవి.

గుండ దండాధీశ్వరుని తమ్ముడు శౌణదేశాధిపతిని  చుట్టుముట్టి, మూర్చ పోయిన అతనిని కోటలోనికి మోసుకొని పోతున్నారు. వెలమ, కమ్మ వీరులు పరాక్రమంతో శత్రువులను మట్టి కరిపిస్తున్నారు. సైన్యం ఉత్సాహంగా, బలంగా ఉన్నది. అయినా ఓరుగల్లు సైన్యం అలిసిపోయింది. కానీ బింకం తగ్గలేదు. ఇంతలో” ” శత్రువులను చుట్టు ముట్టండి!  వీరులకు వీరస్వర్గం కన్నా మించిన మంచి మార్గం లేదు!”  శూరులకు వీర విహారమే ఉత్సాహంగా ఉంటుంది.” పోరాడి పోరాడి విజయం సంపాదించినా, వీరమరణం పొందినా మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది!” యుద్ధభూమిలో భయపడి,పారిపోయి  మీ ఇండ్లకు శరణార్థుల వెడితే మీ భార్యలు మిమ్మల్ని ఆడవారి కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు.” మన పూర్వీకుల పౌరుష చరిత్రలు మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి!”  ధైర్యాన్ని మీ సొంతం చేసుకోండి!”  శత్రువులు పెచ్చుమీరుతున్నట్టున్నారు. వారి పొగరు అణచండి. అని గంభీరంగా అంటూ రుద్రమదేవి అక్కడికి వచ్చింది.

తమ రాణిని  దగ్గరగా చూడగానే  సైన్యంలో కొత్త ఉత్సాహం నిండి, ఏనుగంత బలం కలిగి,” హరహర ” అంటూ ఒక్కసారిగా శత్రువుల మీద పడ్డారు. అప్పటి ఆ యువ సైన్యాన్ని వర్ణించటం , దేనితో  పోల్చాలో  వర్ణించడానికి భాష చాలదు.

కోట బురుజుల మీద, కందకాల మీద, చెట్ల కొమ్మల మీద ఉన్న సైనికులు వచ్చి చేరారు. బురుజుల దగ్గర, చిన్న వాకిళ్ల దగ్గర కాపలా ఉన్న సైన్యంలో సగం సైన్యం వచ్చి, చేయూతనిచ్చింది. కోటలో ఉన్న మూలబలం కూడా కేకలు వేస్తూ వచ్చి చేరింది.

రుద్రమదేవి సైన్యం చాలా పెద్దదై శత్రువులను నరికి వేస్తున్నది. తళతళ మని కత్తులు మెరుస్తున్నాయి. తటతట మని తలలు తెగి కింద పడుతున్నాయి. ఇలా రెండు ఘడియల కాలం యుద్ధం చేసేసరికి వెలమనాయకుల, కమ్మ నాయకుల శౌర్యానికి తట్టుకోలేక అక్కడ ఉన్న శత్రువులు పారిపోయారు. రుద్రమదేవి సైన్యం వెంట పడగా…   శౌణదేశపు సైన్యం అటు ఇటు పారిపోయింది.

అప్పుడు రుద్రమదేవి అక్కడ సైన్యాన్ని పంపి వేసి, ఉత్తర దిక్కున పోరాడుతున్న వీరుల వైపు తన సైన్యంతో వెళ్లి వారితో యుద్ధం చేసింది.

గుండ దండాధీశ్వరుని తమ్ములైదుగురు  రాజును మూసుకొని పోయిన సమాచారం సేనాని అయిన బిచ్ఛణుడు విని, కోపంతో గబగబా వెళ్లి వారితో కలియబడ్డాడు. వాళ్ళు శౌణరాజును విడవకుండా సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైన్యాధిపతి కోపంతో వింటితో బాణాలు ఎక్కుపెట్టి పిడుగు గుండయ్య, విట్టల అయ్యను పడగొట్టాడు. మిగిలిన ముగ్గురు బిచ్చనుడితో యుద్ధం చేస్తున్నారు.

ఇంతలో శౌణరాజు  మూర్ఛ నుండి తేరుకున్నాడు. శౌణరాజు తననెవరో మోసుకొని పోతున్నట్టు తెలుసుకొని, కోపంతో మండిపడుతూ నేలమీదకు దుమికాడు. వెంట ఖడ్గాలు చేతిలో పట్టుకొని, మల్లయ్య, బుద్ధయ, కోటయ్యలపై కలియబడేంతలో బిచ్ఛనుడు ప్రాణాలు విడిచాడు. సేనాని పరిస్థితి చూసి, కోపంతో శౌణరాజు  ఖడ్గాన్ని తీసుకొని, ఆ ముగ్గురు వీరుల మీద పడి చాలా నొప్పించాడు. కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు నిలువలేక పారిపోయారు.

శౌణదేశపు రాజు రుద్రమదేవి దగ్గరకు పోవాలనుకొని తలెత్తి చూశాడు. అప్పుడు అతనికి కలిగిన కలత  అంతా ఇంతా కాదు. తన సైన్యం దెబ్బతిని పారి పోతున్నట్లు, రుద్రమదేవి, ఆమె సైన్యం తన సైన్యాన్ని తరుముతున్నట్లు, అతడు చూశాడు.ఎంత ప్రోత్సహించినా తన సైన్యం యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది అనుకోని, తన సైన్యం చాలా తక్కువ గానూ, రుద్రమదేవి సైన్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఆమె సైన్యంతో ఎదుర్కొంటే ప్రాణాలు దక్కవని, అతడు తెలుసుకున్నాడు.కాలం కలిసి రానప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు. రుద్రమదేవికి ఆమెకు సంబంధించిన వారికి కనిపించకుండా ఒదిగి ఒదిగి ఒక పక్కనుండి పారిపోయాడు.

రుద్రమదేవి శౌణసేనను  కొంతదూరం తరిమివేసి, మళ్లీ యుద్ధభూమికి వచ్చింది.దేవగిరి రాజును పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతడు కనపడక పోవటంతో మరలి వచ్చింది. ఆమె చుట్టూ సేనా నాయకులు, మిగిలిన సైన్యం నిలబడ్డారు. రుద్రమదేవి తన చుట్టూ మూగిన సైనికులను చూసింది. పెద్ద మొత్తంలో చనిపోయిన సైనికుల గురించి బాధ పడింది. సేనానాయకుడైన దాదియ సోమయ సాహిణియొక్క, గుండదండాధీశ్వరుని యొక్క,అతని తమ్ములయొక్క, మరికొందరు ప్రసిద్ధులైన వీరుల మరణం, మంత్రి అయిన శివదేవయ్య చాలా గాయపడడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అప్పుడు ఆమె ఇలా అన్నది.

” ఓ! రాజభక్తి కల సైనికులారా! ఈరోజు మీరు నాకు విజయం కలిగించినా, వీరమరణం పొందిన సైన్యం, సైన్యాధికారులు, వీరులను పోగొట్టుకోవడం నాకు బాధను కలిగించారు. కులదైవంతో సమానమైన ముఖ్యమంత్రి శివదేవయ్య గారు గాయాల పాలవడం చాలా విచారకరం!శౌణదేశపు రాజు మనకు చిక్కకుండా దొంగవలె పారిపోయాడు. అతని పట్టుకోకుండా ఇల్లు చేరవద్దు! నేను సైన్యానికి ఆధిపత్యం వహించి, అధికారిగా ముందుకు నడుస్తాను. మిగిలిన సైనికులు, గాయపడిన వారు నా వెంట  రావాలి!  అని పెద్దగా అన్నది. సైనికులు, సేనాపతులు సరేనన్నారు.

రుద్రమదేవి గాయపడ్డ సైనికుల కొరకు మంత్రిని కోటకు పంపించి,  గాయపడిన వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయించింది. కోట నుండి భోజనం తెప్పించింది. వాళ్లంతా స్నానం చేసి , భోజనం చేసి, యుద్ధానికి సిద్ధమై శౌణదేశపు  సైన్యం వెంటపడి, మహాదేవ రాజును పట్టి తేవాలనే గట్టి పట్టుదలతో నడిచారు.

ముందు దేవగిరి సైన్యం, వెనుక రుద్రమదేవి పరివారం నడుస్తున్నది  ఓరుగల్లు సేన ఉన్న సంగతి శౌణ సైన్యానికి తెలియదు. గెలువలేక పోతిమనే విచారంతో, దేవగిరి రాజు పోయి పోయి రుద్రమదేవి రాజ్యం పొలిమేర దాటి,శౌణదేశపు ప్రాంతంలో ఒకచోట సైన్యాన్ని నిలిపి వేశాడు. అలసట తీరుతుందని, విడిపోయిన సైన్యం వచ్చి కలుస్తుందని రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆనాటి సాయంకాలమే విడిపోయినా కొంత సైన్యం, వస్తు సామాగ్రితో ఉన్న బండ్లు వచ్చి కలిశాయి. మూడు లక్షల సైన్యంతో వెళ్ళిన మహాదేవరాజు పదివేల కన్నా తక్కువ సైన్యంతో తన దేశపు పొలిమేర చేరి నిలిచాడు.

శౌణదేశపు  సైన్యం తెల్లవారిన తర్వాత మేలుకొని చూసేసరికి ఏమున్నది? వారి చుట్టూ ఓరుగల్లు సేన ఉన్నది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎదిరించి యుద్ధం చేయడానికి రుద్రమ సైన్యం ఎక్కువగా ఉన్నది. ఆలస్యంగా ఈ వార్త రాజుకు తెలిసింది విచారంతో మహాదేవరాజు మంత్రులను, ముఖ్యులను పిలిపించి చేయవలసిన పనులు విచారించాడు. వాళ్లు తమ అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవరి అభిప్రాయం అయినా యుద్ధం చేయటానికి సైన్యం సుముఖంగా లేదని…

చివరకు వారంతా సంధి కుదుర్చుకోవడం మంచిదని నిశ్చయించుకున్నారు. దేవరాజు రాయబారం నడిపేందుకు భోళేశ్వర  సైన్యాధిపతి  నియమించి చెప్పవలసిన విషయాలన్నీ అతనికి చెప్పి, రుద్రమదేవి వద్దకు పంపాడు.

భోగేశ్వరుడు ఏ ఆయుధాలు వెంట తీసుకొని పోకుండా. రుద్రమదేవి సైనిక గుడారంలోనికి వచ్చాడు.సైన్యం అతనిని అడ్డగించ లేదు. రాయబారి రుద్రమదేవి గుడారం దగ్గరకు వచ్చి , ద్వారపాలకుడితో తను వచ్చినట్లు లోపలికి తెలియజేశాడు. ద్వారపాలకుడు తిరిగివచ్చి భోళేశ్వరునికి రాణి అనుమతి తెలిపాడు. భోళేశ్వరుడు గుడారం లోనికి వెళ్ళాడు.

రుద్రమదేవి ముఖ్యులతో అంతరంగిక సమావేశమై,భోళేశ్వరుడు  రావడం చూసింది.భోళేశ్వరుడు బ్రాహ్మణుడని తెలుసు కాబట్టి తన సింహాసనం నుండి లేచి నమస్కరించింది. భోళేశ్వరుడు యధావిధిగా బ్రాహ్మణ ఆచారపరంగా ఆశీర్వదించి, రాజు వేషంలో ఉన్న రాణి మీది గౌరవం తెలిపాడు. తరువాత తనకు కేటాయించిన ఆసనం మీద కూర్చున్నాడు.

అప్పుడు రుద్రమదేవి భోళేశ్వరునితో ఈ విధంగా మాట్లాడింది.

”  మీరు ఏ పని మీద వచ్చారు?”

దేవీ! మారాజు  రాయబారం పంపించాడు.

ఏమని?

ప్రస్తుత విషయం గురించి.

ఆ… అర్థమైంది… ముట్టడించడం ఆపివేసి వెళ్లిపొమ్మని కావచ్చును . మా పై పన్నిన కుట్ర…

ఆ విషయాలన్నిటినీ దయతో క్షమించండి!

మంచిది !మేము మూర్ఖపు పట్టుదలతో లేము! సంధిని ఒప్పుకుంటాం!  మాకు తలపెట్టిన కుట్ర క్షమార్పణ సరిపోయింది. ఇంకా రాయబారం మూడు మాటల్లో చెప్పనా? యుద్ధ ఖర్చుల కింద ఐదు కోట్లధనం, యాభై  ఏనుగులు, వంద గుర్రాలు… ఏమంటారు?  మీ రాజు ఒప్పుకుంటాడా?, లేక రాజునడిగి  చెప్తారా?

సంధిని  కుదుర్చుకుని, అపాయం లేకుండా తమ శౌణదేశపు సైన్యాన్ని తమ దేశానికి చేరవేసేందుకు భోళేశ్వరుడు మారుమాట్లాడకుండ ఒప్పుకున్నాడు.రుద్రమదేవి కూడా అంగీకరించింది.

రాయబారి సెలవు తీసుకొని వెళ్ళి,జరిగిన విషయమంతా రాజుకు తెలిపాడు.అతడు సంతోషించి, ఒప్పుకున్న ధనం,మొదలైన వాటిని రుద్రమదేవికి పంపించాడు.

రుద్రమదేవి జయశాసనాలను అక్కడ స్ధాపించి, సైనికులకు యాభై లక్షల హొన్నులను బహుమతిగా ఇచ్చి, దేవగిరిని ముట్టడించాలన్న ఆలోచన మానుకుని ఓరుగల్లు చేరింది.

(సమాప్తం)

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

నిరాతప  (గజళ్ళ కావ్యం)

by Jyothi Muvvala February 28, 2022
written by Jyothi Muvvala
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రచించిన నిరాతప తెలుగు గజళ్ళు పుస్తకం పైన కవర్ పేజి ఎంతో అందంగా ఉంది. దీనంగా చూస్తున్న రెండు కళ్ళ వెనుక దాగిన ఎన్నో అర్థాలు పరమార్థాలు. వెలుగు నీడల సమాహారాలు
అసలు నిరాతప అంటే ఏమిటో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రాసిన తెలుగు గజల్ పుస్తకాన్ని చదివేంతవరకు నాకు తెలియదు. నిరాతప అంటే రాత్రి అని అర్థం. . పక్షాంతాల పక్షాలతో విహరిస్తుంది. నేత్ర వారి నేత్రీ అవుతుంది.అంటు ఈ పుస్తకంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ఎంతో అందమైన డెఫినిషన్ అందించారు. పుస్తకం పేరులోనే ఇంత నీగూడార్థం ఉంటే పుస్తకంలో గజల్స్ ఎంత బావుకతతో అందంగా ఉంటాయో ఊహించవచ్చు. అసలు గజల్ ప్రక్రియ అంటే అది ఒక లిరికల్ పోయెట్రీ. పర్షియాలో పుట్టి ప్రపంచమంతటా పర్యాప్తం చెందిన అద్భుత కవితా గేయపక్రియే ఈ గజల్.
‌ తెలుగులో దాశరధితో ప్రారంభమైన గజల్ రచన సినారె తో పరుగులు తీసింది.నేడు చాలామంది గజల్స్ విరివిగా రాస్తున్నారు.ఈ పుస్తకానికి ముందుమాట రాసిన కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ కోసం ఒక మాట చెప్పారు.గజల్ అంటే ప్రియురాలితో సల్లాపం లేక ప్రియుడితో సల్లాపం కాదు.కవి, కవయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం.(imaginative intensity) గజల్ అంటే ఐదు నుండి 15 షేర్లు వరకు ఉంటే సరిపోదు కాఫియా, రధీప్లు తఖుల్లస్ బాహర్లు మెర్పిస్తే సరికాదు. గజల్ అంటే తాత్వికత, గజిలియెత్, భావుకత కవితాత్మ, అభివ్యక్తి, నవ్యత ఉండాలి. రూపం, భావం, గతి, భావుకత, రసాత్మకత, కళాత్మకత, నాణ్యత రసధ్వని, చమత్కారం ఇత్యాది రూపాభివ్యక్తి సంబంధిత సౌందర్య శిల్పమే గజలియత్. మల్లీశ్వరి లాంటి భావుకత, తాత్వికత ఉన్న కవయిత్రికి మాత్రమే సాధ్యం. అందుకే కవయిత్రిని కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ పగ్లి మల్లీశ్వరి! అని సబోధించారు.
‌ ఈ నిరాతప పుస్తకంలో మొత్తం యాభై గజల్స్ ఉన్నాయి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి తెలుగు భాష మీద ఉన్న పట్టు అపూర్వం. రచయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం ఈ గజళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సంపుటిలో ప్రతి గజల్ దేనికదే అద్భుతంగా ఉన్నాయి. మనసుపెట్టి చదవాలి గాని ప్రతి గజల్ లో అందమైన హృదయం ఆవిష్కరిస్తుంది.
‌ రాత్రిలో వెన్నెల ఉంటుంది. రాత్రిలో నిక్షిప్తమైన వెలుగు అందాన్ని తెలిపే ఈ నిరాతప గజల్ ఒకసారి పరిశీలిద్దాం
“మిణుగురుల ముసి నవ్వుల వన్నెలెన్ని మోసిందో ఈ నిరాతప
వెల్లువౌ వెలుగు విరి విలాసమెంత పూసిందో ఈ నిరాతప”
ఎంత అద్భుతంగా పోల్చారు కవయిత్రి. మిణుగురుల ముసి నవ్వుల వెలుగులే మోసింద అంట ఈ నిరాతప.
ఆ నవ్వుల వెలుగు వెల్లువై విరిసి విలాసంగా పూసింది ఈ రాత్రి…అంటే రాత్రిపూట ఆ మిణుగురుల కాంతి, వాటి నవ్వు ద్వారా వచ్చిందని కవయిత్రి యొక్క భావం.
కలికి కళ్ళనున్నది అరుపో ఎరుపో మైమరుపో తెలియ నీదు
బతుకునెంతగా అష్టా చమ్మాటగా చేసిందో ఈ నిరాతప
ఈ షేర్ని గమనిస్తే కలికి కళ్ళనున్నది… కలికి అంటే స్త్రీ ఆడది అని అర్థం. ఆడదాని కళ్ళల్లో అరుపో, ఎరుపో మైమరపో తెలియ నీదు… అంటే అది కోపమో బాధో లేక ప్రేమతత్వమో తెలియదు. బతుకంతా అష్టాచమ్మాటగా చేసిందో ఈ నిరాతప
జీవితమంతా ఎప్పుడు ఆనందంగా వెలుగుతూనే ఉండదు. చీకటిలో బాధతో కూడా కూడి ఉంటుంది. అందుకే రేయి పగలుకు సంకేతంగా అష్టా చమ్మాటతో పోల్చారు కవయిత్రి.
ఎదురు చూపుల నీడల ఊడల నిట్టూర్పులెంతగా అలి సాయో
ఖేదమోద వాదననే ఖాంతాల తోసిందో ఈ నిరాతప
ఎదురు చూపులు చూసి చూసి మర్రి చెట్టు ఊడల వలె చూపులు ఊడల పెరిగి నిట్టూర్పులే మిగిల్చి అలిసిన మనసును ఈ చీకటి రాత్రి శోకంలో తోసింది.
ఇలా మొత్తం ఈ గజల్ తీసుకుంటే ఏడు షేర్లతో ముగిసింది. అదే విధంగా పూసిందో, చేసిందో,తోసిందో వంటి కాఫియాలతో, ‘ఈ నిరాతప’ అనే రధీఫ్తో అందంగా భావుకతతో మలిచారు.
క్షణాలెన్నో వస్తూ పోతూ అనే గజల్ లో
“క్షణాలెన్నో వస్తూపోతూ మనిషిని తొలిచి సురంగం చేస్తాయి
స్వార్థం నిస్వార్థాంలు మనసును నిలకడ లేని పతంగం చేస్తాయి”
నిజమే జీవితంలో ఆనంద క్షణాలు భారమైన క్షణాలు ఎదను తొలిచి తొలిచి సొరంగం చేస్తాయి.
అంతు చిక్కని ఆ సొరంగంలో ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి.తవ్విన కొద్దీ బయట పడతాయి.
స్వార్థం, నిస్వార్థాంలు నాణెనిక బొమ్మ బొరుసులా మనిషిని నిలకడగా నిలవనియక పతంగం చేస్తాయి.
ఎంత చక్కటి పోలిక. పతంగం ఎలా రెపరెపలాడుతూ ఉంటుందో… మనసు అలాగే ఊగిసలాడుతుంది అని కవయిత్రి చెప్పకనే చెప్పారు.
“రేపేమో తెలియనీక కాల యవనిక ఆలోచనలలో మనిషిని
దారేమో ఎరుగనీక వలను చిక్కుకున్న కురంగం చేస్తాయి”
మనిషి జీవితంలో రేపన్నది ఏమో తెలియక కాలమనే రంగస్థలంపై నటుడిగా ఆలోచనలో మనిషిని పడవేస్తాయి. దిక్కులేక దారి తెలియక వలలో చిక్కుకున్న చాపల చేస్తాయి.
“పకృతి సిరులే మానవ మానస వికాస హేతువై మారి మనిషి
మనసులోన కళానుభూతి నింపి ఆనంద తరంగం చేస్తాయి “
ఇలా ఒకటి కాదు ప్రతి గజల్ మనిషిలోని అంతర్లీనంగా పడుతున్న వేదనను ఆవిష్కరిస్తూ తపోబలంతో భాషలోని క్లారిటీ భావంలోని ప్యూరిటీ హృదయంలోని రసజ్ఞ ప్రతీ షేర్లలోనూ శిల్పీకరించారు.
ఒంటరి మనసంటే ఏమిటో… మబ్బెంత మురిసిన
నీవిచ్చిన ఏకాంతంలోనే…ఇలా ఎన్నో అద్భుతమైన గజల్సు ఈ పుస్తకంలో ఉన్నాయి
 మనుగడ నిచ్చే మట్టి ఈ షేర్ లో….
“నీవు నేను మనం కాలేని మది రాగాల వివాదాల మనసులునొక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే”
“దిశదిశల రుతువుల స్థితులెంతెంత మారినా కానీ
సదా గమనమే మార్చక గమ్యం చేరే సంచారం నేనే “
మనిషి మనుగడకు కారణం మట్టి. మనుషుల్లోనూ మనసులోని అంతరాలు…నువ్వు నేను మనం కాలేని మది రాగాల వివాదాలలో మనసులను ఒక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే కదా!
నాలుగు దిశలలోను నాలుగు రుతువుల లోనూ కాలాలు ఎంత మారినా గమనాన్ని మార్చక గమ్యానికి చేర్చే సంచారం నేనే కదా అంటూ మట్టి స్వగతాన్ని మనకు అందించారు.
మనసు అశ్రువులను అడుగుతోంది ఈ గజల్ లో
“మనసు అశ్రువులను అడుగుతోంది నన్ను ఎందుకు వణికిస్తున్నావు అని
ఆయువు కాలాన్ని అడుగుతోంది నన్నెందుకు తరిగిస్తున్నావు అని”
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ప్రతి గజల్ చాలా బాగుంది. కళారత్న బిక్కికృష్ణ గారన్నట్టు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి గజల్స్ కి సాటి ఆమె గజల్స్ మాత్రమే.
చివరిషేర్లో కవినామముద్ర ఉండాలి దీనీనే *తఖల్లాస్* అంటారు. గజల్ లో ఒకసారి వాడిన పదం మరలా వాడకపోవడమే గజల్ కు సౌందర్యం. ఇందులో కవయిత్రి సఫలీకృతులయ్యారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
 శుద్ధమైన తెలుగు భాషలో పరిశుద్ధమైన ప్రేమ తత్వంతో అద్భుతమైన భావుకతతో అనితరసాధ్యమైన శిల్ప నైపుణ్యంతో అరుదైన తెలుగు భాష పదాలతో చక్కని కాఫీయా, రధీఫ్ లతో కొత్త ప్రయోగాలతో తాత్వికతో పాటు నియమాలు పాటిస్తు చక్కటి గజల్ను మనకందించారు సుప్రసిద్ధ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. అదేవిధంగా ఈ పుస్తకాన్నికి గజల్స్ కి కూచి గారి చిత్రాలు మరింత అందాన్ని చేకూర్చాయి.ఈ నిరాతపలో మనస్సును స్పృశించే భావుకతను పుష్కలంగా జోడించిన మనోహర భావాలు అందుకు తగ్గ అద్భుతమైన చిత్రాలు కన్నుల విందు చేస్తున్నాయి. చదివిన ప్రతి ఒక్కరూ ఆ భావుకత సంద్రంలో తడిసి ముద్దై ఆనందడోలికల్లో మునిగి తేలుతారు. సాహితి పిపాసుల హృదయ స్వాంతన కాగలదు ఈ “నిరాతప “.
February 28, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us