మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

రెండో బిడ్డ..

by Chandu Pendyala February 28, 2022
written by Chandu Pendyala

సంవత్సరానికి
ద్వితీయ సంతానం
ఇంటికి రెండో బిడ్డ
రూపుకు చిన్నది
ఇరువది ఎనిమిది
రోజుల నెల బాల ఇది
నాలుగేళ్ల కోసారి
కొసరు వడ్డిస్తది
లీప్ ఇయర్
తన సార్థక నామధేయం
బరువు బాధ్యత లేదు
పండుగల మోత లేదు
ఉరుకు పరుగు లేదు
ఉరుము మెరుపు రాదు
చలి లేదు వేడి లేదు
చక్కని వాతావరణం
ముడుచుకోదు
మూలకు ఉండదు
ఎండకు ఎండదు
వానకు తడువదు
తెలుగు హేమంత
శిశిర ఋతువుల చుట్టం
ఫాల్ ఫీల్ ఇచ్చే సీజన్
ఫీవర్ రాదు
పవర్ పోదు
పబ్లిసిటీ ఉండదు
ఉద్యోగస్తుడికి ఉపకారి
పనిదినాలు సెలవుదినాలు
సమ వాటా కలిగి వుంటది
పిల్లలకు పరీక్షలుండయి
తల్లిదండ్రులకు ఫీజుల
పరీక్షలుండయి
అందరికి ఫిదా ఇది
ఫికరు లేని ఫిబ్రవరి…

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దేహ దాహం

by kodam Pavankumar February 28, 2022
written by kodam Pavankumar

ఉగ్రవాదం ఓ ఉప్పెన

తీవ్రవాదం తీరొక్క హింస
ఆశ నిరాశల మధ్య కొట్టుకలాడే రక్తదాహం
ఆశ చిగురిస్తూ నిరాశ అంతమవుతుంది
శాంతి వెల్లివిరుస్తూ ఆగ్రహం చప్పున చల్లారుతుంది
ఆకాశంలో ఎగురుతున్న రాబందు రెక్క తెగిపడుతుంది
సముద్రంలో ఈదులాడుతున్న సొరచేప వలకు చిక్కుతుంది
ఆకాంక్షల చుక్కానికి తీరం అందుతుంది
ఆతీయతకు లైట్ హౌజ్ దారి చూపుతుంది
రాతియుగపు పనిముట్లలో మనం ఆనవాళ్లు వెతుక్కుంటాము
ఆరుద్ర పురుగుల్లో పర్యావరణపు ఆచూకిని శోధిస్తుంటాము
వెలుగు మన ముఖం మీదకు ప్రసరిస్తుంటుంది
కళ్లు పెద్దవై చూపును సారిస్తుంది
అనేకానేక సూర్యుళ్లు దారి చూపిస్తుంటాయి
కళ్ల కింద నేల తన్మయత్వంతో ముద్దాడుతుంటుంది
రాలుతున్న నీటిబిందువుల్లా చెట్లపైని
ఆకులు ఒకటొకటి రాలుతూ జీవితాన్ని ఎరుకపరుస్తుంటుంది
దూరంగా ఓ గది మనకోసం ఎదురుచూస్తుంటుంది
సగం తెరచిన తలుపు నుంచి ఆత్మీయహస్తం చాస్తుంది
సమస్త విశ్వంలోకి మనల్ని లాక్కుంటూ
మానవ నాగరికతను మనముందు ఆవిష్కరిస్తుంది
నింగి నేల నీరు విప్పారిన దేహమవుతుంది
ఈ కవిత నా సొంతం. దేనికి అనుకరణ, అనువాదం కాదు. ఇంతవరకు ఏ పత్రికలోనూ. అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితంగానీ, పరిశీలనలోగానీ లేదు.
నాగురించి
జీవితమే కవిత్వమని విశ్వసించే నేను ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో వివిధ హోదాల్లో  రిపోర్టర్ గా పనిచేశాను. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్.360 డిగ్రీస్‘ పేరుతో 59 వ్యాసాలతో కూడిన సంపుటిని వెలువరించాను. ప్రస్తుతం సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్రతో కూడిన శాసనసభ నియోజకవర్గాలతో కూడిన పుస్తకాలను వెలువరించడంలో నిమగ్నమయ్యాను. ఇప్పటికే హైదరాబాద్ లోని ’అంబర్ పేటః ఆకాశానికి పూసిన మందారం‘ పేరిట పస్తకం 2019లో వెలువడింది. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి త్వరలో వెలువడనుంది. అలాగే మరో కవితా సంపుటి రానుంది.
February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వాట్-ఏ-పిటీ!

by కుడికాల వంశీధర్ February 28, 2022
written by కుడికాల వంశీధర్

ఆర్టిపీషియల్ గాలికి అలవాటుపడ్డ దేహాలు
గ్లోబల్ వార్మింగ్ వేడికి
కలుగులోని ఎలుకల్లా
బయటపడతాయి.
‘గో గ్రీన్’  అని
బోదురు కప్పలా అరిచి
సొల్యూషన్ ఏదో దొరికిందనిపించి
పొల్యూషన్ లెవెల్స్ పెంచుకుంటూ
వచ్చిన కార్లలో
తిరిగి బతుకు బావిలోకి వెళ్లిపోయాయి.
*
వైఫైతో వల్లెవాటు వేసుకున్న విశ్వైక జీవాలు
తలుపులు లేని గదికి
తాళం వేసి
ఒంటరిగా గడుపుతాయి.
ఇంటర్‌నెట్ ఇంటరప్షన్‌తో
మరో ప్రపంచం ఉన్నదని తెలుసుకొని
భయకంపితులౌతాయి.
తెలియని ఏకాకితనపు కరతాళ ధ్వనులకు
తాళలేక
ఫ్రీక్అవుట్ అవుతాయి.
*

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పూల దోసిళ్ళు

by Rama Devi Nellutla February 28, 2022
written by Rama Devi Nellutla

నిలబడ్డ నేలా తల మీది ఆకాశం నీది కానప్పుడే
స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది
పీలుస్తున్న గాలీ పలుకుతున్న పదమూ
నీ స్వంతం కానప్పుడే స్వతంత్ర్యం విలువ తెలుస్తుంది
ఏడు దశాబ్దాల క్రితం ఎర్ర కోట మీదే కాదు
ఎన్నో కోట్ల హృదయ మైదానాల్లో ఈ జెండా ఎగిరినపుడు
ఎన్ని దేహాలు రోమాంచితమైనాయో …ఎన్ని రక్త నాళాలు ఉప్పొంగినాయో ….
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని సమర్పణలు ఎన్ని బలిదానాలు ఈ దేశం చూసిందో –
చిన్న మూటల్తో వర్తకానికి వచ్చి మూటలకు మూటలు రత్న రాసులు దోపిడి చేసినవారు
గొంతులు నొక్కి శ్రమను దోచి రాజ్యాలు గెలిచి హక్కులు కబళించి ఆధిపత్యం చెలాయించిన వారు
మూటా ముల్లె సర్దుకుని పోవడానికి ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగాయో …ఎలా మరుస్తాం ?
రాజ్య వారసుడు పోయినా ప్రజా స్వేచ్ఛ కోసం ‘ ప్రాణమిస్తా , ఝాన్సీ నివ్వను ‘ అన్న ప్రధమ స్వాతంత్ర్య పోరాట జ్వాలనీ ,
గుండె అక్కడ కాదురా ఇక్కడ కాల్చమంటూ శత్రువు కెదురు నిల్చిన మన్నెం వీరుడినీ ,
‘ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అన్న భగత్ సింహాన్నీ , ‘ స్వాతంత్ర్యం జన్మహక్కు ‘అన్న బాల గంగాధరుణ్ణీ
‘వందే మాతరం ‘ అంటూ నినదించిన వంగ భూమి పుత్రుడు బంకిం చంద్రుడినీ ..
‘రుధిరమివ్వండి. స్వరాజ్యమిస్తా ‘ నన్న ఆజాద్ ఫవుజ్ సుభాష్ బోస్ నీ ఎలా మర్చిపోతాం ?
‘నా దేశ ప్రజలు నిండా బట్టలు కట్టేదాకా నేనూ చొక్కా తొడగనన్న’ ఒక బక్క పలుచని దేహం
ఆచ్ఛాదన లేని ఛాతీ విరుచుకుని ఎముకలు కొరికే చలిలో రౌండ్ టేబుల్ సమావేశానికి
సత్యాహింసలను ఊతకర్రలుగా మార్చి ‘డూ ఆర్ డై ‘ అంటూ నడిచి వెళ్లడం ఎలా మరుస్తాం ?
ఉప్పు పిడికిలిని ఉక్కు పిడికిలిగా మార్చిన శాంతి మాంత్రికుడు
భరత భూమికి స్వేచ్చనూ ప్రపంచానికి అహింసనూ బహుమతిగా ఇచ్చిన బోసి నవ్వుల తాతనూ
‘ఆరాం హరామ్ హై ‘ అంటూ జాతి నిర్మాణానికి నడుం కట్టిన చాచానూ గుర్తు పెట్టుకోకుంటామా ?
ఎందరు త్యాగ ధనులు , చరిత్ర కెక్కని ఘనులు
కారుణ్యం లేని శత్రువుకు చిక్కి కాలాపానీ కారాగారాల్లో మగ్గారు
తమ రక్తంతో జాతి చరిత్రకు ప్రాణం పోశారు
దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చటం కోసం
దేహం నుంచి చెమట చుక్కల్ని రాల్చినంత సునాయాసంగా ప్రాణాల్ని వదిలారు
సమర యోధులారా అమర వీరులారా
మీ సమాధులపై వెలుగుతున్నది ఆ కొవ్వొత్తులే కాదు మా హృదయ దీపాలు కూడా
మీ కోసం రాలుతున్నవి ఆ చెట్ల పూలగుత్తులే కాదు మా కన్నీటి చుక్కలు కూడా
మీ కోసం మా శాల్యూట్ లూ జోహార్లూ , వీరగంధాలూ పూల దోసిళ్ళు కూడా
ఏడు దశాబ్దాల క్రిందటే కాదు , జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు కూడా !!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బొజ్జ గణపయ్య

by రంగరాజు పద్మజ February 28, 2022
written by రంగరాజు పద్మజ

పార్వతి:–
పద పదరా! ఏకదంతా! మనపొదరింటికి!
మంగళంపాడిరి నీకు – మనుషులందరు
మరు సంవత్సరమునకు- మళ్ళి రమ్మని!

విఘ్నేశ్వరుడు:-
ఇంటికి పోనమ్మా! నేనిక్కడే ఉంటానమ్మా!
ఇంటింటికి కుడుములు తింటానమ్మా !!

పార్వతి:-
కుడుములు లేవుర! కుమారా! ఇడుములుపాపుటేరా!
నడు నడు కైలాసానికి! పద పద రా ఏకదంతా!

విఘ్నేశ్వరుడు:–
నన్ను మంచిరి కోనేరులలో…
కోశము తడిసేను- కోరుదు సెలవులు!!
విరిగెను నా దంతము- చదువుట వ్రాయుట ఏలా?

పార్వతి:-
చరవాణి లోనే చక చక చదువుము చంటీ!
చదువులకే వేలుపను పదవి ఊడును తండ్రీ !
ఇల్లిల్లూ తిరుగు-తినుట మానుము నాన్నా !
అద్దంలో నీ ముద్దు మోము చూడరా కన్నా!
నడక అసలే లేక పెరగెను !నీ బొజ్జ!
బడికి పోయి చదవరా తండ్రి!
చదువురాకున్నా!గానీ సన్నగా అయ్యేవు !

విఘ్నేశ్వరుడు:–

నేను సన్నంగా అయితే! కవులకు కష్టం!
వికటకవులు హాస్యం లేక కటకట బడేరు !

ఓ బొజ్జ వెంకయ్య! నీ బంటు నేనయ్య అను
నా స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ !!

పలుచబొజ్జ గణపయ్య- పాదాలు పట్టే మని;

నేనూ లేఖకుడినే- లేఖకులంటే నాకు ఇష్టమే అమ్మా!
కష్ట పెట్టను కవులను కనికరముతో…
నన్ను నా రీతి గుండగా నిమ్మమ్మా!
కాలు పెట్టను నేను కైలాస మందు !
కుడుములు తింటూ ఉంటానుఇక్కడే!
కర్మ భూమిన నుందు – కరమొప్పగాను !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

 శ్రీమతికి శ్రీనాథుని ప్రే(క్షేమ) లేఖ

ఉ. శ్రీమదసత్యమధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి, మేలు కావలెన్

మేమిట క్షేమమీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమా,

నామది నీదు మోహము క్షణంబును దీరదు, స్నేహబాంధవీ !

శ్రీనాథుని పద్యాలనేకం స్త్రీ అంగాంగ వర్ణనలతో కావ్యాల్లోనూ, చాటువుల్లోనూ ఉన్నాయి. చాటు పద్యాల్లో అధికంగా ఆయన శృంగారాసక్తిని, భోగ లాలసను సూచిస్తాయి. అందుకే ఆయనకు శృంగార శ్రీనాథుడని పేరు. ఆహార, ఆహార్య, విహారాల్లో ఆయన భోగజీవితేచ్ఛ అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన సంచార జీవనం, నానారాజ సందర్శనం, అంకితోత్సవాలు, వాగ్విజయ సభలు, రాజ సన్మానాలు, శృంగార జీవనం చాటువుల నిండా పరచుకొన్నాయి. స్త్రీ శృంగారాన్ని వర్ణించే ఇతర కవులవి కూడా శ్రీనాథునికి అంటగట్టినవి ఉన్నాయి. కాని శ్రీనాథుని రచనలు అతని ఒడుపు, ఎత్తుగడ, పదబంధాలు, సంస్కృత సమాసాలు ఆయన శైలితో మెరుస్తూ అతనివిగానే ఋజువు చేస్తాయి.

పై పద్యం శ్రీనాథుని ఇతర పద్యాలవలె అన్యకాంతా మోహం, పర స్త్రీ సౌందర్య వర్ణనతో గాక, సభ్యవర్ణనతో భార్యను ఉద్దేశించి రాసిన వర్ణన లేదా లేఖగా కనబడుతుంది. చూద్దాం.

శ్రీమత్ = సంపదలతో లేదా సౌభాగ్యముతో కూడినది. ఈ సంబోధన పుణ్య / గౌరవ స్త్రీలకు వేసే విశేషణం. పైగా లేఖా సంప్రదాయంలో తొలిపదం. ఈ ప్రారంభపదమే ‘లేక’ అనడానికి గుర్తు.

అసత్య మధ్యకు సన్నని నడుము కలదని, చిన్ని వయారికి = చిన్న వయసులోనిదని, ముద్దులాడికిన్ = ముద్దుమురిపాలిస్తున్న నూత్న వధువు అని ఇది పెళ్లి అయిన కొత్తలోనే రాసిన పద్యంలా ఉంది. అసత్యమధ్య అంటేనే నడుం పెరగలేదని మధ్యవయస్కు ప్రౌఢ కాదని తెలుస్తోంది. దీంట్లో (ఈ విశేషణాల్లో) సభ్యత వల్ల భార్యకు వేసిన విశేషణాలుగా భావించవచ్చు. మేలు కావలెన్ = ఆశీస్సులందిస్తున్నాడు. తొలిపదం లేఖ ప్రారంభంగా, తొలి వాక్యాంత క్రియ ఆశీస్సుగా లేఖగా ధృవీకరిస్తు లేదూ? ఇది లేఖే అనడానికి ఇంకా కింద చూడండి.

మేమిట క్షేమము = తన క్షేమం తెలుపుతున్నాడు. ‘ఇట’ అంటే తన ఊరి నుండి భార్యను వదిలి బయల్దేరి, చాలా దూరం వచ్చిన ఈ పద్యం రాసిన ఊరికి (ప్రస్తుతం ఉన్నది) వచ్చేవరకు క్షేమంగా ఉన్నానంటున్నాడు. ఇది లేఖ అనడానికి మరీ కింద చూడండి.

మీ శుభవార్తలు = మీరంటే తన భార్య ఒక్కతే ఐతే ఏకవచనం ఉండేది. భార్యతో బాటు శిశువైన తన సంతానమో లేక తన ‘మదేకపుత్ర’ తల్లి లేదా తండ్రి (జీవితులుగా ఉంటే), అంటే కుటుంబం అంతా అని బహువచనం వాడినాడు. వ్రాసి పంపుమీ = ఈ లేఖ తెస్తున్న శిష్యుడు తన వద్దకు తిరిగి వచ్చేటపుడు తిరుగులేఖ ద్వారా రాసి పంపమంటున్నాడు. అయ్యా! ఇప్పటికైనా ఈ పద్యం ఉత్తరం అని ఒప్పుకుంటారుగా!

నీదు మోహము = నీపై అనురాగం, నా మది క్షణంబును దీరదు = ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావని, స్నేహ బాంధవీ! = స్నేహం (అనురాగం)తో బాంధవ్యం (తాళి గట్టిన బంధుత్వం)తో (తాకి కట్టడం బంధనం, బంధనంతో బంధుత్వం కదా లోకంలో) – పై రెంటిలో స్నేహ బాంధవ్యాలు (అనురాగం, భార్యాత్వం) కల్గిన దానా?

ఇది శ్రీనాథుని రచనే అని చెప్పడానికి పై విశేషణాలే సాక్ష్యమిస్తున్నాయి. అసత్యమధ్య, వయారి, ముద్దులాడ, సామజయాన వంటివి ఆయన తరచూ వాడే పదాలే. ప్రతి కవికీ కొన్ని పద బంధాలు పడికట్టుగా ఉంటాయి. శ్రీనాథుడు “దూరటంకాల…” పద్యంలో రావు సింగమహీ పాటని రాచకొండ రాజ్యసభలో ఎటుల మెప్పించెదో అంటూ “సరససద్గుణ నికురుంబ శారదాంబ” అని సంబోధించినాడు. తానే తిరిగి ఫిరంగిపుర శాసనాన్ని రాస్తూ “సరస సద్గుణ నికురంబ సూరమాంబ” అని శాసనకర్తిని (దాత) పేరును అదే పదబంధాలతో సూచించినాడు. “శ్రీనాథో విద్యాధికారీ శ్రీ వీరవేమభూపతేః” అని శాసనాంతంలో తన పేరును తన ‘విద్యాధికారి’ హోదాను సూచించినాడు.

శ్రీనాథుడు భార్యకు లేఖ రాయడానికి వచనం వాడాలి, కాని పద్యం (ఛందస్సు)లో రాస్తాడా? అని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ అడుగడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటనను ఛందోబద్ధం చేసినాడు. ఆఖరుకు తన ఆత్మహత్యను కూడా “అరగుచున్నాడు శ్రీనాథుడమర పురికి”అని పద్యంలో రాసుకున్న జీవకవి. ఆయనవి దొరికినన్ని చాటువులు మరే కవివి దొరకలేదు.

భార్యకు పద్య లేఖ రాయడంలో తప్పేం లేదు. ఆవిడా కవయిత్రి కావచ్చు. లేదా పద్య సౌగంధ్యానికి పరవశించే పడతి కావచ్చు. శ్రీనాథుని శ్రీమతా? మజాకా? తెలుగు కవులు తమ భార్యల గూర్చి వారి వైదుష్యం సంగతి (వారిజ భవుడెరుగు) పేరైనా చెప్పరైరి (ఒక్క కృష్ణరాయని కావ్యాల్లో తప్ప)

-డా. సంగనభట్ల నరసయ్య

9440073124

విశ్రాంత ప్రాంశుపాలుడు, ప్రాచ్య కళాశాల, ధర్మపురి

(ఈ పద్యం డా. కోడూరి ప్రభాకరరెడ్డి సంకలనం “శ్రీనాథుని చాటువులు” నుండి స్వీకరించాను.)

January 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తలుపు చప్పుడు

by Sudharshan Chintapatla January 6, 2022
written by Sudharshan Chintapatla

ఆంగ్లం : కె.సచ్చిదానందన్, తెలుగు : చింతపట్ల సుదర్శన్
మొట్టమొదటి తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది
నేను మీ నాన్నను
తలుపు తెరిచాను
సూర్యుడు లోపలికి వచ్చాడు
ఉదయపు లేత సూర్యకిరణం
రెండవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ ప్రేయసిని
తలుపు తెరిచాను
మల్లెల పరిమళం వెదజల్లుతూ
చల్లని గాలి లోపలికి వచ్చి
నన్ను కౌగలించుకుంది
మూడవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
వర్షం లోపలికి వచ్చి
నన్ను పూర్తిగా తడిపేసింది
మళ్ళీ తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది?
నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
బురద పూసుకున్న మేఘపు ముక్క
లోపలికి వచ్చి కూర్చోమనకుండానే
కుర్చీలో కూర్చుని
పొగలూగుతూ
ఇంద్రధనస్సును సృష్టించింది
అప్పుడొచ్చింది
అయిదవ తలుపు చప్పుడు
ఎవరది విని అడిగాను
నీ మృత్యువును
తలుపు తెరవలేదు
అడిగాను
సుదీర్ఘకాలంగా
ఒంటరిదైన ఈ భూమ్మీద ఉన్నాను
నాకేం బహుమతి ఇస్తావు
నీకు స్వేచ్ఛనిస్తాను
సారవంతమైన మట్టిగా మారుస్తాను
తమలపాకు మొక్కలన్నీ
లిల్లీ పువ్వుల్నీ నీలో పెరగనిస్తావు
నువ్వొక బిందువువై
సముద్రంలో కలుస్తావు
ముత్యానివీ, ఉప్పువీ అవుతావు
నువు మళ్ళీ మళ్ళీ
భూమి ఉన్నంత కాలమూ
మొలకెత్తుతావు
సముద్రం ఉన్నంతవరకూ
అలవై ధ్యానిస్తావు
ఈ మాటలు చివరగా
నన్ను ప్రలోభ పెట్టాయి
తలుపు తెరిచాను
ఇప్పుడు –
మీరు చూస్తున్నది
నా నీడను మాత్రమే

కె.సచ్చిదానందన్ అంతర్జాతీయ కవి. ఆంగ్లంలోనూ మళయాళంలోనూ అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. ఆయన 20 సంపుటాల కవిత్వం 119 ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేరళ సాహిత్య అకాడమీ అవార్డును 5 సార్లు అందుకున్న కవి. తులనాత్మక సాహిత్యంలో కె.కె.బిర్లా ఫౌండేషన్ ఫెలోషిప్ పొందిన సచ్చిదానందన్ కు N.T.R జాతీయ అవార్డు కూడా లభించింది.

January 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఇవీ మన భారతీయ భావం

by మోతుకూరి నరహరి January 5, 2022
written by మోతుకూరి నరహరి

1.”వాన కురిస్తే,మెరుపు మెరిస్తే,/ ఆకసమున హరివిల్లు విరిస్తే,/

అవి మాకే-అని ఆనందించే/ పిల్లల్లారా!” అంటాడు మహాకవి

శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ సంపుటిలోని ‘శైశవగీతి’ కవితలో.

2.అట్లాగే అమాయకులు, ప్రకృతి ప్రేమికులు అయిన మన ప్రాచీనులు ప్రకృతిలోని

వివిధ ఘటనలను,వింతలను చూసి ఆనందాశ్చర్యాలకు లోనై ప్రకృతిశక్తులకు దైవత్వాన్ని,తనకు లేని,తాను కోరుకొనే అనేక శక్తులను వారికి ఆపాదించి,స్తోత్రాలు,సూక్తాలు, పురాణాలు రచించారు.  ఈ క్రమంలోనే సంపదకు అధిదేవతగా లక్ష్మిని,విద్యా విజ్ఞానాలకు అధిదేవతగా సరస్వతిని,దుర్మార్గాలను నిర్మూలించే ‘శక్తి’గా కాళికను (పార్వతిని)తన ఆకారంతోనే రూపొందించుకున్నాడు.  వారికి తాను కల్పించిన, ఊహించిన శక్తులకు అవసరమైనట్టుగా ఎక్కువ తలలను,చేతులను,వివిధ ఆయుధాలనుకూడా వారికి కల్పించాడు.  మన నిష్క్రియా పరత్వానికి విదేశీయుల దండయాత్రలో, పరాయిపాలనో కారణమని సర్దిచెప్పుకోవడం సరికాదు.

2.మన దేశంలో ప్రాచీనకాలంలోనే గార్గి, మైత్రేయి వంటి బ్రహ్మవాదినులు ఉండేవారు-

అని గర్వించడం సరే. కాని అంతటితోనే సరిపెట్టుకోకూడదు కదా! ఆధునికకాలంలో సావిత్రీబాయి

ఫూలేగారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు (ఉపాధ్యాయిని)అయ్యేదాకా

మన సరస్వతీ దేవికి వారసులు లేకపోవడం బాధాకరమేకదా!

3.మనకు వైద్యాధిదేవుడుగా ధన్వంతరి,ప్రాచీనకాలంలోనే గొప్ప వైద్య శాస్త్ర వేత్తలైన చరకుడు,సుశ్రుతుడు ఉన్నా గత శతాబ్దంలో విదేశాలలో ఆధునిక వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన డాక్టర్ ఆనందీబాయి జోషి గారి వరకు మనకు ఆధునిక మహిళావైద్యులు లేరు-అంటే ఆ మధ్యకాలంలో మన సమాజం ఎంత నిద్రావస్థలో, అచేతనంగా ఉందో అర్థం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి,ఆ లోపాలు పునరావృత్తి కాకుండా చూసుకోవాలి. వీరు ఇద్దరు కూడా ఆంగ్లేయుల పాలనాకాలం లోనే తమను తాము నిరూపించుకొన్న వారు కావడం గమనార్హం, ప్రశంసార్హం.

4.మరో ప్రధానమైన అంశం- నిత్యం లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని-వారి అనుగ్రహాన్ని

కోరుతూ -పూజించే మనం మనను కనిపెంచిన తల్లి, జీవితాన్ని పంచుకున్న భార్య,అక్క చెల్లెళ్ళు,కూతుళ్ళ, కోడళ్ళగురించి ఎట్లా ఆలోచిస్తున్నామో,వారిపట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నామోకూడా ఆత్మావలోకనం చేసుకొని,

వాళ్ళను గౌరవించడం,ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యులలోనే, మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఆ ‘ముగ్గురు అమ్మలను” చూసుకోగలగాలి.

5.మహాకవి గురజాడ అప్పారావుగారు చెప్పిన- “మగడు వేల్పన పాతమాటది,

ప్రాణమిత్రుడ నీకు…” అనే పంక్తుల సారాంశాన్ని ఒంటబట్టించుకొని మనం కొత్తమనుషులముగా

రూపాంతరం(మెటా మార్ఫోసిస్/Metamorphosis)చెందాలి. ప్రయత్నపూర్వకంగా భూస్వామ్య,పితృస్వామ్య

భావజాలాన్ని,పురుషాహంకారాన్ని పాము కుబుసంలాగా వదులుకోవాలి.అప్పుడే మన జీవితాలకు సార్థకత.

మన స్తోత్రాలు అర్థవంతం అవుతాయి.

सरास्वती प्राथना

जय जय हे भगवति सुरभारति !

तव चरणौ प्रणमाम: ।।

नादतत्‍वमयि जय वागीश्‍वरि !

शरणं ते गच्‍छाम: ।।1।।

त्‍वमसि शरण्‍या त्रिभुवनधन्‍या

सुरमुनिवन्दितचरणा ।

नवरसमधुरा कवितामुखरा

स्मितरूचिरूचिराभरणा ।।2।।

आसीना भव मानसहंसे

कुन्‍दतुहिनशशिधवले !

हर जडतां कुरू बुद्धिविकासं

सितपंकजरूचिविमले ! ।।3।।

ललितकलामयि ज्ञानविभामयि

वीणापुस्‍तकधारिणि ! ।।

मतिरास्‍तां नो तव पदकमले

अयि कुण्‍ठाविषहारिणि ! ।।4।।

जय जय हे भगवति सुरभा‍रति !

तव चरणौ प्रणमाम: ।।

 

భారతీ వందన గీతం

జయ జయహే భగవతి సురభారతి,

తవ చరణం ప్రణమామహః|

నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి,

శరణం తే గచ్చామః|

త్వమసి శరణ్య త్రిభువన ధన్య,

సురముని వందిత చరణా|

నవ రస మధురా కవితా ముఖరా,

స్మిత రుచి రుచి భరణా|                      ||జయ జయ జయహే||

ఆసినా భవ మానస హంసే,

కుంద తుహిన శశి ధవలే|

హర జడతాం కురు బోధి వికాస్|

సిత పంకజ తను విమలే|                    ||జయ జయ జయహే||

లలిత కళామయి జ్ఞానవిభామయి,

వీణాపుస్తక ధారిణీ|

మతి రాస్తామ్ నౌ తవ పద్ కమలే,

అయికుంఠా విషహరిణీ||                     ||జయ జయ జయహే||

 

పంక్తులవారీగా శ్లోక భావము

1.(భగవతి=పార్వతి,లక్ష్మి, సరస్వతి,పూజ్యురాలైన స్త్రీ).

పూజ్యురాలవైన ఓ సంస్కృత

(సుర/దేవ)భారతీ!

నీకు జయము జయము (కలుగుగాక)!

నీ చరణాలకు ప్రణామం!

2.నాదబ్రహ్మమయివి,భాగేశ్వరివి(ఒక రాగం)(వాక్కులకు

అధిదేవతవు-వాక్ ఈశ్వరివి

=వాగీశ్వరివి) అయిన నీ

పాదాలను నేను శరణు వేడుతున్నాను/చేరుకుంటున్నాను.

3.మూడు లోకాలను ధన్యము

చేయగల,మునులచే,దేవతలచే నమస్కరింపబడే పాదాలు

గల నువ్వే నాకు శరణం/దిక్కు.

4.నవ రసములతో కూడిన,

మధురమైన కవితలను ధ్వనింపజేసే,అందమైన చిరునవ్వును,కాంతిమంతమైన

ఆభరణాలను ధరించిన అమ్మా!నీకు జయము జయము (కలుగుగాక).

5.(నా)మానస హంసపై ఆసీనురాలవైన,మొల్లలు,

మంౘు,చంద్రునివంటి ధావళ్యము గల తల్లీ!

6.శ్వేతకమలం వంటి స్వచ్ఛమైన శరీరం వర్ణంగల

అమ్మా!నా జాడ్యాన్ని (జడతను,మాంద్యాన్ని,మంద

బుద్ధిని)తొలగించి,బుద్ధి

వికాసాన్ని కలిగింౘు.

నీకు జయము జయము (కలుగుగాక).

7.అమ్మా!నీవు లలితకళామయివి(లలిత కళా

స్వరూపిణివి),జ్ఞానకాంతితో

ప్రకాశిస్తున్నదానివి,వీణను,

పుస్తకాన్ని ధరించినదానివి.

8.నీ పాద పద్మాల దగ్గర నా మతిని (బుద్ధిని) సమర్పిస్తున్నాను.నా సోమరి

తనం అనే విషాన్ని తొలగించే

(హరించే)అమ్మా!నీకు జయము, జయము (కలుగుగాక).

 

నాగరలిపిని తెలుగు అక్షరాలలో రాయడంలో అక్షర దోషాలు దొర్లుతాయి.  నాగరలిపి ఆధారంగానే ఈ కింది అర్థ,తాత్పర్యాలు రాశాను. మూల కవితలోని అంత్యప్రాసలను తాత్పర్యంలోనికి తీసుకురాలేము. అవి రావాలంటే మళ్ళీ మనం దానికి కవితారూపాన్ని ఇవ్వవలసిందే.అందుకు చాలా చాలా శ్రమించాలి.

 

January 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్మతనమంటే…..

by కె. వీణారెడ్డి, January 5, 2022
written by కె. వీణారెడ్డి,

కాలింగ్ బెల్ మోతతో తలుపు తీశాడు కార్తీక్. ఎదురుగా మూతికి మాస్క్తో, శానిటైజింగ్ చేతులతో, పక్కనే వుంచిన ఓ రెండు బ్యాగులతో కనిపించాడు కార్తీక్ మిత్రుడు రాఘవ.

“రారా రాఘవా చాన్నాళ్లకు బుద్ధి పుట్టింది నీకు!”

మిత్రుణ్ని ఆహ్వానించాడు.

రాఘవ పళ్ళు తీసుకొచ్చే సమయానికి కార్తిక్ భార్య , వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకుకు తల పై తడిబట్ట వేస్తూ వాడిని బుజ్జగిస్తున్నది .

ఏమైందిరా ? అని రాఘవ అడుగుతుంటే , ఉదయం నుండి బాగా జ్వరంగా ఉన్నదిరా అన్నాడు బాధగా కార్తిక్.

“మొన్న ఊరెళ్లాను కార్తీ…. తోటలో బత్తాయిలు, సంత్రాలు తెంపించాడన్నయ్య. నీకు కొన్ని తెచ్చాను.”

“ఈ కరోనా టైమ్ లో ఇమ్యునిటీ ఫ్రూట్స్…. చాలా థ్యాంక్స్ రా!” అంటూ ఆ పళ్ళ బ్యాగులందుకున్నాడు కార్తీక్.

“అమ్మ కనిపించటం లేదురా కార్తీ?” అటూ ఇటూ కలయ చూస్తూ అడిగాడు రాఘవ.

టి.వి.లో కరోనా న్యూస్ వింటూ “ఈ సెకండ్ వేవ్ ముసలోళ్ళ కన్నా వయసు వాళ్లపైనే దాడి చేయడం బాధాకరం రా!” అన్నాడు కార్తీక్.

“అంటే కార్తీక్… ముసలివాళ్ల ప్రాణాలు విలువైనవి కావంటావా?”

“ఎంతైనా కాటికి కాళ్లు చాచుకున్న ముసలోళ్లకన్నా, బాధ్యత, భవిష్యత్తూ వున్న యువత ప్రాణాలు విలువైనవి కద రాఘవా?”

“కాదనటం లేదు…. కానీ పిల్లలను కనిపెంచి పెద్దచేసి, యువతకు దిశా నిర్దేశం చేయగల జ్ఞానసిద్ధులు వృద్ధులు! వారు మమతల కోవెలలు…. గత వైభవాల జ్ఞాపకాలు కదరా పెద్దలంటే!” అన్నాడు స్పందనా స్వరంతో రాఘవ.

“సర్లేరా…. పద భోం చేద్దాం” అంటూ మిత్రుడి చేయందుకున్నాడు కార్తీక్.

“అమ్మ అగుపించడం లేదురా… నేనొస్తే తను బయటికి రాకుండా వుంటుందా? ఒంట్లోగాని బాగా లేదా?”

అంటూ హాల్ కెదురుగానున్న గదిలోకి వెళ్ళి చూశావా రాఘవ.

“కార్తీ…. అమ్మేదిరా ఏమైందిరా?” ఆదుర్దాగా అడిగాడు మళ్లీ.

“ఏం కాలేదుగానీ…. పద భోం చేద్దాం. వడ్డించు పద్మా!” అంటూ భార్యకు చెబుతూ, మిత్రుడి భుజం తట్టాడు కార్తీక్.

“నో… అమ్మను చూడందే… అమ్మను పలకరించందే అన్నం తినను!” సోఫాలో కూర్చుంటూ పట్టుదలగా అన్నాడు రాఘవ.

ఏం మాట్లాడలదు కార్తీక్.

“చెప్పరా అమ్మెక్కడ?” రెట్టించాడు రాఘవ.

“నాన్నమ్మను నాన్న ఓల్టేజ్ హోమ్ కి పంపించాడు!”

కార్తీక్ కూతురు నాలుగేళ్ళ పాప చెప్పింది. ఉలికిపాటుగా చూశాడు రాఘవ.

“కారణం?” కలవరపాటుగా అడిగాడు కార్తీకు నుద్దేశించి.

“అమ్మ తల తిరుగుడే కారణం!”

“అదేంట్రా? ఎంత మంచిది అమ్మ! అంత తల తిరుగుడు పనులేం చేసిందని?”

“పనులు కావురా… రోగం… తల అటూ ఇటూ ఊగుతూ…. అలా…. ఆర్నెల్లయింది!” అదోలా అన్నాడు కార్తీక్.

“అయితే… అంత మాత్రాన…” బాధ రాఘవ గొంతులో.

“ఒరే రాఘవా… అలా ఎప్పుడూ ఆమె తల అడ్డంగా అటూ ఇటూ ఊగుతూ వుంటే, కాదు… కాదు… అంటున్నట్టుగా నాకు నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటే…. భరించలేకపోయేవాడిని!” అసహనంగా అన్నాడు కార్తీక్.

“ఒరే కార్తీక్…. అమ్మ శారీరక వ్యాధి కూడా నీకు…. భరించలేని మానసిక బాధేనా? ఆమె అనారోగ్యాన్ని, బాధనూ కూడా అర్థం చేసుకోలేక వృద్ధాశ్రమం బాట పట్టించిన ఘనుడవు కదరా…..” బాధగా మిత్రుడివైపు చూశాడు.

“ఒరే కార్తీక్…. నీకో సంగతి చెప్పనా?”

“చెప్పరా!” చిన్నగా అన్నాడు కార్తీక్.

“లేక లేక పుట్టిన నిన్ను, మీ నాన్న చేసిన అతిగారాబం నిన్ను మొండివాడిగా మార్చింది! ఏది చెప్పినా ఔనంటే కాదు… కాదంటే ఔనంటూ ప్రతిదానికి తల అడ్డంగా ఆడించేవాడిని గుర్తుందా? నీ చిన్ననాడే మీ నాన్న పోయాక, నీ నెగెటివ్ సమాధానాల భారమంతా అమ్మపైనే పడిందిరా! అమ్మ ఏం చెప్పినా మొండిగా తలటూ ఇటూ ఆడించి సతాయించే నీతో వేగలేకపోయేది. అయినా అన్నీ భరించింది. అప్పట్లో ఒకే ఊళ్ళో, ఒకే స్కూళ్ళో నీతోపాటు చదువుచున్న, అమ్మలేని నన్నెంతో ఆదరించిన ఈ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడేది. నీ స్నేహాన్ని వీడవద్దని వేడుకునేది!”

“రాఘవా!” చిత్రంగా చూశాడు కార్తీక్.

“ఔనా…. అన్నింటికి అడ్డంగా తలాడించే నీ నెగెటివ్ తత్త్వాన్ని ఒంటరిదైన అమ్మెలా సహించిందో…. నిన్ను చదివించి ఇంతవాణ్నెలా చేసిందో…. అమ్మ మాటకు అడుగడుగునా తల అడ్డంగా ఆడించే నీ నెగెటివ్ థాట్స్ ను తన తల్లి తనపు పాజిటివ్ రెక్కలతో నిన్నెలా కాపాడుకున్నదో….. తన ప్రేమతో నిన్నెలా ఓ మనిషిని చేసిందో…. ఆ మాతృమమతనెలా మరచిపోయావురా?”

“ నీ కొడుకు కు జ్వరం వచ్చినట్లే నీకెన్నిసార్లు వచ్చుంటుందో జ్వరం నీ చిన్నప్పుడు “

కంటి చెమరింతతో రాఘవ కంఠం వణికింది.

“రాఘవా!” కార్తీక్ కళ్ళలో పశ్చత్తాపంతో కూడిన తడి కదలాడింది.

“చెప్పరా కార్తీ…. చిన్న నాటి నుండి నీ మనసుకున్న ఇగోతో, నీ నెగెటివ్ తత్త్వంతో…. ఎన్ని వేలసార్లు తల అడ్డంగా ఆడించేవాడివో…. అయినా ఆ తల్లి ఒడి నీకు ఓ బడిగా, గుడిగా ఎలా మారిందో…. ఎన్నడైనా ఆలోచించావా? అదే…. అదేరా అమ్మతనమంటే!” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవ.

ఆలోచనతో కూడిన ఆవేదనతో తలొంచుకున్నాడు కార్తీక్.

“కార్తీ…. ఆఖరుగా ఒక్క మాటరా…. రోగ్రగస్థురాలైన అమ్మ తల ప్రకంపనలనే భరించలేనివాడివి…. నీకు జన్మనిచ్చిన్నాడు అమ్మ ప్రసవ వేదనలో ఎన్ని వందల కాదు కాదు వేనవేల బాధా ప్రకంపనల బరువును ఆ తల్లి ఎలా భరించి వుంటుందో ఒక్కసారైనా ఊహించలేవా?”

“అమ్మా!” అంటూ అప్రయత్నంగా ఒక ఆర్థ్రతా పూరితమైన బాధా ప్రకంపనలతో కూడిన ఓ పిలుపు వెలువడింది కార్తీక్ నోటి వెంట.

“అమ్మతనమంటే ఏంటో అర్థమైందిరా! ధన్యవాదాలు రాఘవా…. పద… అమ్మను ఆశ్రమం నుండి తీసుకొద్దాం!” ఆగని కన్నీళ్ళతో అన్నాడు కార్తీక్.

  • కె.వీణారెడ్డి
January 5, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తెలివైన రామచిలుక

by ఒద్దిరాజు మురళీధరంరావు January 3, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగాఅనగా చాలా కాలం క్రితం ఒక రాజు వద్ద ఒక అందమైన రామచిలుక ఉండెను. ఆ రామచిలుక తెలివైనది మరియు రాజుతో మాటా్లడుతుఁడేది. రాజుకు ఏదైన తోచనపుడు రామచిలుకను అడిగేవాడు. రామచిలుక తోలూ అని పిలువబడేది. రాజు దరా్బరుకు పోయే ముఁదు ఆ రోజు ఏ విషయం ఎట్లు చేయాలో అడిగేవాడు.

ఒకరోజు తోలూ దర్బారులో కూర్చుంటుండెను. రాజభవన తోటలో ఒకచెటు్టపై రామచిలుకల మంద కనబడెను. తోలూ రాజువైపు లుంగి అనెను. మహారాజా అవి మా జాతివి. నేను పుట్టి పెరిగిన చోటుకు నన్ను ఆహ్వానించేందుకు వచ్చాయి. దయతో నాకు ఒకరోజు శెలవు ఇవ్వండి. నేను నా జన్మభూమికి వెళ్ళి మా తల్లిదండ్రులను మరియు బంధువులను చూచి రాగలను.

“రాజుకు ఆశ్చర్యం అయింది మరియు అతను విచారంలో పడినాడు” తోలూ, నీవు ఒకవేళ అక్కడికి పోతె కొన్ని రోజులు నాకు దినదినం ఎవరు సలహాలు ఇస్తారు, మరియు సహాయపడుతుంటారు. నీవు దూరాన వున్న నీ పుట్టిన స్థలం నుండి త్వరగా రాగలవని ఎట్లు నమ్మగలను అని వాదించాడు.

“రాజా! నేను నమ్మదగిన దానినని నీకు తెలుసు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను త్వరగా రాగలనని వాగ్దానం చేయగలను. నేను ఆలస్యం చేయను. నేను తిరిగి వచ్చేపుడు ఒక విచిత్రమైన పండు తేగలను. ఆ పండు సామాన్యమైన పండు కాదు. ఎవరు దాన్ని తిన్నా వారికి మరణం ఉండదు. వారు సజీవుగా ఉంటారు” తోత అన్నది.

రాజు ఆ పండు తిని చిరంజీవిగా ఉండగలనని తోతా వెళ్ళుటకు అంగీకరించాడు.

తోతా తన స్నేహితులతో ఎగిరిపోయింది. తోతా తండ్రి అక్కడి పక్షులన్నిటికి రాజు. అతను మరియు అతని భార్య కొడుకును చూచి చాలా సంతోషించారు.

అతను గొప్ప విందు ఏర్పాటు చేశాడు. తోతాకు మంచి డిన్నరు దొరికింది. తోతా తన జన్మభూమిలో వారం రోజులు ఉన్నాడు. అప్పుడు అతను తన రాజును జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అతను తన తండ్రితో తను తిరిగి రాజు వద్దకు పోవాలని, రాజు తను వస్తాడని ఎదురు చూస్తుంటాడు.  “నా ప్రియమైన కొడుకా,  నీవు నీ ఆఫీసుకు నమ్మినవాడివని తెలుసు. దయతో వెళ్ళు. మీ రాజును మరి కొన్ని రోజులు సెలవు అడుగు మరియు మరొకసారి మా వద్దకు రా.

“సరె నాన్నా, నేను అట్లే చేస్తా. ఇప్పుడు నీవు నాకు ఒక సహాయం చేయాలి. నేను రాజుకు సజీవంగా ఉండేందుకు ఒక ఫలము తెస్తావన్నాను, మన దేశంలో పండేది.

ఆ పక్షుల రాజు అట్టి విచిత్రమైన ఫలము తోటాకు ఇచ్చినాడు.

ఆ రామచిలుక తను పనిచేసే స్థలానికి తిరిగి వెళ్ళింది మరియు తన యజమానిని కలిసింది.

“ఓహ్! తప్పక! దాన్ని తిన్నవారికి మరణం రాదు, ఎన్నటికి. నా రాజా! మీరు దయతో దీన్ని గ్రహించండి” ఆ రామచిలుక అంది.

అక్కడి మంత్రులు మరియు కౌన్సిలర్లు పండును చూసి ఎల్లపుడు జీవించి ఉండేందుకు దాన్ని తినాలనుకున్నారు.

ఈ మధ్యలో రాజు స్వయంగా అన్నాడు, తోతా ఈ విలువైన పండును వృధా చేయవద్దు. మనం దీన్ని వాడుదాము. దాని నుండి వచ్చే చెట్టుకు ఎక్కువ ఫలాలు వస్తాయి. దానివలన ఎక్కువ ప్రజలకు లాభం కలుగుతుంది”.

రాజు తోట మాలిని పిలిచి ఆ ఫలాని్న నాటి వచ్చే మొక్కను జాగ్రతగా చూడు.

ఆ తోటమాలి ఆ ఫలాన్ని నాటాడు, దాని నుండి మొలకపెరగటం మొదలయింది. కొంతకాలం తరువాత ఆ చెట్టుకు ఫలాలు రావడం మొదలయింది. ఏ ఫలాన్ని తెంపలేదు. ఒకరోజు ఓ ఫలం కింద పడింది. దానిపై నుండి పాము పోయింది. దాన్ని ఆ పాము నాకింది కాబట్టి అది విషతుల్యమైంది. తోటమాలికి ఏమి జరిగింది తెలియదు. దాన్ని మామూలుగా తీసి బుట్టలో పెట్టాడు. తరువాత దాన్ని రాజుగారికి ఇచ్చాడు.

మొదటి ఫలాన్ని చూసి రాజు సంతోషించాడు. అతను తోతాను మరియు ప్రధానమంత్రిని పిలిచాడు. వారు వచ్చారు.

“ఇది మొదటి ఫలము. నన్ను తిననీయండి” రాజు అన్నాడు.

ప్రధానమంత్రి మధ్యలో మాట్లాడాడు. “మహారాజా! దాన్ని తినకండి. సామాన్యంగా మొదటి ఫలాన్ని దేవునికి అర్పిస్తారు”. రాజు అంగీకరించి దాన్ని గుడికి పంపించాడు. పూజార్లు దాన్ని మధ్యకు కోసి రెండు ముక్కలు చేశారు. ఒక ముక్కను దేవునికి అర్పించారు. మిగతా భాగాన్ని వారు తిన్నారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వాస్తవముగా వారు ఎప్పుడు తెలివిలోకి రాలేదు.

రాజుగారికి సమాచారము అందించారు. రాజు చాలా విచారపడి తన మంత్రంతో విచారించారు. ఆ శాశ్వత జీవాన్నిచ్చే పండు తిని వారు మరణించవచ్చు అన్నాడు మంత్రి. వెంటనే రాజు తోతాని పిలిపించాడు. మరియు అడిగాడు. “తోతా, ఇదా నేను నీతో ఆశించినది? నీవు ఎవరి కోసం ఆ పండును తెచ్చావు?”

తోతా అన్నాడు, “ఎందుకు సార్? మీ కోసమే దాన్ని తెచ్చాను”.

“నన్ను చంపుటకు గదా? మిమ్ములందరిని ఇన్నాళ్ళు రక్షించాను. నిన్ను ఉచ్చ స్థితిలో ఉంచాను. దాని కోసం బదులు నాకు మరణ నోటీసు తెచ్చావు”.

అట్లు అని కత్తితో చిలుకను నరికేసాడు.

ఆ చెట్టు చుట్టు కంప పాతియ్యమని ఆజ్ఞ ఇచ్చాడు, మరియు పట్నవాసులను అటువైపు వెళ్ళవద్దని ప్రకటించాడు.

ఒకరోజు ఒక చాకలతను జీవితంతో విసిగి ఆ పండు తిన మరణించాలని నిశ్చయించారు. అతని భార్య కొడుకు అతనితో కొట్లాడుతుండేది. ఓ రాత్రి ఆ  పండును దొంగిలించి తినేశాడు. తన భార్య, కొడుకుకు గూడా ఇచ్చాడు, వారు కూడా మరణించాలని.

కానీ వారి ఆశ్చర్యానికి వారందరు యువకులైనారు. ఆ ముసలి చాకలి తను చాలావరకు వయసులో ఉన్నట్లు గ్రహించారు. ఆ వార్త అగ్నిలాగా నీటిలో వ్యాపించింది. రాజుకు కూడా వార్త అందింది. అతను తోటమాలిని పిలిపించి మొదటి పండు ఎక్కడి నుండి తెచ్చావని అడిగాడు. తోటమాలి ఆ పండును చెట్టుపై నుండి తెంపలేదు. భూమి మీద పడియున్న పండును తెచ్చాను.

అప్పుడు రాజు ఆ పండు పాము వలన విషతుల్యమైనదని గ్రహించాడు.

రాజు రంథి పడినాడు. అతను తన ప్రియమైన తోతా మరణం గురించి జాలిపడినాడు.

“నా తోతా, ఎంత బుద్ధిహీన పనిచేశాను? నీవు నాకు చాలా మంచి మిత్రుడివి. నేను నిన్ను నమ్మలేదు. నీవు నన్ను క్లిష్ట పరిస్థితులలో రక్షించావు. కాని నేను సరీగ విచారించకుండా నిన్ను చంపేశాను. నేను నిన్ను మరల ఎక్కడ చూడగలుగుతా?” ఆ రాజు చాలా దుఃఖించాడు. అతను గుండె బలిగినాడు.

అప్పటి నుండి అతను ఒక శాసనం తీశాడు. ఆ శాసనం “పాలకులు ఎవరిని కూడా బాగా విచారించకుండా శిక్షించవద్దు. దూషుడు అని నిర్ణయమైన తరువాతే శిక్షించాలి”.

మూలం :  Bed time stories the wise Parrot

January 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us