ఒక కథా రచయిత, కథ రాయాలని సంకల్పించినప్పుడు అది సమాజపరంగానో లేదా వ్యక్తిపరంగానో
కావలసిన, రావలసిన మంచి మార్పులకు ప్రతిబింబంగా తన కథ ఉండాలని ప్రయత్నం చేస్తాడు అలా చెయ్యాలి కూడా అప్పుడే ఆ కథకు సార్ధకత
ఉంటుంది. కిరణ్ కుమార్ గారి కథలను పరిశీలించినప్పుడు మనిషిలో ఉన్న మంచిని పైకి తెచ్చే ప్రయత్నంతో పాటు, సమాజంలో జరిగే కొన్ని అరాచకాలను ఖండించడంలో తన కథ ప్రతిబింబంగా ఉండాలి అన్న ధ్యేయం మనకు ప్రస్ఫుటమవుతుంది.
“రాధా అరవిందం”ఈ కథకు పేరు కథలోని పాత్రలతో పెట్టబడింది.
కథలోముఖ్యపాత్రులు మూడు రాధ, అరవింద్, నిషా. అరవింద్ ప్రేమించిన వ్యక్తి రాధ. అరవింద్ పెళ్లి చేసుకున్నా వ్యక్తి నిషా.
మానవ తప్పిదాల పరంగా చూస్తే అరవిందుకు ప్రేమ ఒకచోట,పెళ్లి ఒకచోట.
ఇది వివాహ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం అనవచ్చు.
తత్పలితంగా వచ్చే అనర్థాలు తక్కువేమీ కాదు. వాటిని వివరించేదే ఈ కథ అరవింద్ రాధను ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో ఎవరో చేసిన పనికి రాధను అనుమానించి వద్దనుకొని మరొకరిని వివాహం చేసుకోవడం అరవింద్ చేసిన మానవ తప్పిదం. ఇది మన వివాహ వ్యవస్థలో ఉన్న లోపం.
ప్రేమకు నిర్వచనం నమ్మకం, అంకితం.
తనను తాను మరొకరికి ఆర్పించుకోవాలి. పూర్తిగా నమ్మకంతో తన జీవితంలోకి ఆహ్వానించాలి.
ప్రేమించిన వ్యక్తి పైన అపనమ్మకపు నీడ కూడా పడకూడదు.
కానీ తాత్కాలిక ఇష్టాన్ని ప్రేమ అనే పేరుతో భ్రమించడం నాటి నుండినేటివరకు సమాజంలో జరుగుతున్న ఒక దురదృష్టకర విషయం.
వివాహానంతరం భార్యకు అరవింద్ ఇంట్లో చోటు ఉన్నది గాని మనసులో మాత్రం రాధకే ఓటు.
ఇది అరవింద్ చేసినరెండో తప్పిదం.
ఫలితంగా అరవింద్ రహస్య ప్రేమ నిషా ప్రాణాలకు ముప్పు కరిగించేదాకా వచ్చింది. చివరకు రాధ ప్రాణ త్యాగం చేసి తన ప్రేమకు ప్రాణం పోశానని, అరవింద్ నిషాల దాంపత్యం దానివల్ల బాగుంటుందని ఊహించడం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని క్షీణింప చేసి, ఆత్మహత్యలకు ప్రోత్సహించడం లాగ ఉంది.
రాధ లేనంతా మాత్రాన నిషాలో ఏర్పడ్డ శూన్యత మాసి పోతుందా?
తనదైన చోటును మరొకరు ఇంతకుముందే ఆక్రమించి ఉన్నారన్న భావన నిషాలో నిమిషాల మీద ఎగిరిపోవడానికి ఇది తన ఇష్టం వచ్చినట్టు రాయించుకున్న సినిమా కథకాదు. సినిమాలో ప్రజాకర్షణ కోసం ఉండవచ్చు.
కానీ కథరాసే రచయిత అలా చూపించడు చూపించకూడదు.
ఈ కథా రచయిత కిరణ్ కుమార్ గారు ఈ కథ రాసే ముఖ్యోద్దేశం సోషల్ మీడియా చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టాలి అనుకోవడమే.
కానీ దానితో పాటు మరోకొన్ని జీవిత సత్యాలను తన కథలో ఆవిష్కరింపజేశారు. అవి_ స్త్రీ పురుషులిరువురి కి ప్రేమ పెళ్లి రెండు ఒక్కటే. రెండు కాదు.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకో లేకపోతే పెళ్లి మానుకో. రెండు పడవల మీద ప్రయాణం నాలుగు జీవితాలకు అశాంతి.
నమ్మకానికి మరో పేరు ప్రేమ. అన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య కాదు. రాధా లాంటివారు చేయాల్సిన ఆలోచన ఏవిటంటే, తన మంచితనంతో,
నిషా అనుమానాలను, ఆవేదనను అంతం చేయడం రాధ లాంటి వ్యక్తి చేయాల్సిన మంచి మార్గం,తన నిర్ణయాల ద్వారా,
మాటల ద్వారా అరవింద్కు తన హృదయంలో పూర్వ స్థానం తొలగించి సోదర భావన ఆవిష్కరిస్తే ఆ దాంపత్యం ఆరు పువ్వులు పన్నెండు పండ్లుగా. వర్ధిల్లుతుంది.
రాధ ఆత్మహత్య వల్ల అరవింద్ మనసులోని రాధా చనిపోదు కదా. ఆ భావన నిషాను ప్రతి నిమిషం బాధిస్తూనే ఉన్నప్పుడు
వారి దాంపత్యం రాధ కోరుకున్నట్లు హాయిగా జరుగుతుందా?
కథ చెప్పి విధానాల్లో ఇది ఒక పద్ధతి. కలిగే నష్టాలు కళ్ళ ముందు పెడితే మనిషిమారతాడని, మారాలని ఈ కథ రచయిత, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు ఈ పద్ధతిలో మనకు కథను అందించారు.
దానితోపాటు నేడు జరుగుతున్న సోషల్ మీడియా లోని అకృత్యాలను, అఘాయిత్యాలను ఖండిస్తూ వాటి వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి అని ఈ కథ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ గారు. సెల్లులో అసభ్య శృంగారాలు, స్నేహి తాలు, ఆకృత్యాల వల్ల మంచి జీవితాలు మాడిపోతున్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటికైనా గ్రహించి నిగ్రహించాలి. అని కిరణ్ కుమార్ గారి ఈ కథ గొంతెత్తి చెబుతున్నది.
వ్యక్తి పరంగా, సమాజ పరంగా, వివాహ వ్యవస్థ పరంగా ఈ కథ అందరికీ మేలుకొలుపు. చక్కటి కథ మనకు అందించిన కిరణ్ కుమార్ గారు అభినందనీయులు.















